9, ఏప్రిల్ 2022, శనివారం

తపస్సుకాల 6 వ ఆదివారం, మ్రాని కొమ్మల ఆదివారం

 మ్రాని కొమ్మల ఆదివారం 

 యోషయా 50: 4-7, పిలిప్పీ 2: 6-11 లూకా 19:28-40, 22:14-23:56 

ఈ రోజు తల్లి శ్రీ సభ  మ్రాని కొమ్మల ఆదివారం కొనియాడుచున్నది. దీనినే  క్రీస్తు పాటుల ఆదివారం అని కూడా పిలుస్తారు. 

ప్రతి ఒక్కరి జీవితంలో సంతోష సమయాలు కొన్ని ఉంటాయి. ఈ మ్రాని కొమ్మల రోజు కూడా  ప్రభువు యొక్క జీవితంలో  ప్రత్యేకమైనది, సంతోష కరమైనది ఎందుకంటే ప్రజలు ఆయన్ను రాజుగా  గుర్తించి హోసన్న పాడారు. 

ప్రతి ఒక్కరి సంతోషాన్ని అనుభవించినట్లే తరచుగా దుః ఖాన్ని కూడా పొందుతుంటాం. విచారం కలిగినట్లే ఆనందం కూడా కలుగుతుంది. 

ఈరోజు మనందరం పవిత్ర వారంలోకి అడుగుపెడుతున్నాం. మన యొక్క రక్షణ సంఘటనలు ధ్యానించుకోబోతున్నాం. 

యేసు ప్రభువు యొక్క రక్షణ ఘట్టాలను ధ్యానించుకోబోతున్నాం. ఆయన యొక్క శిలువ , శ్రమలు, మరణం పునరుత్థానం అధే విధంగా క్రీస్తుతో మన మరణ, పునరుత్థనాలు కూడా ధ్యానించుకోవాలి. 

ఈ పవిత్ర వారం యొక్క ఘట్టాలు మనం శ్రద్దగా ధ్యానిస్తే మనకు దేవునితో ఉన్న సంబంధం పెరుగుతుంది. దేవునిలో ఉన్న విశ్వాసం పెరుగుతుంది. దేవుని పట్ల ప్రేమ పెరుగుతుంది మనలో కూడా హృదయ పరివర్తనం కాలుగుతుంది. 

ప్రభువు నా కోసమే మరణించారు అనే ఆలోచన మన జీవితాలను మార్చుతుంది. 

ఈ మ్రాని కొమ్మల ఆదివారం నాడున రెండు ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

1. ఆయన మహిమ సంఘటన 

2. ఆయన శ్రమల సంఘటన 

మహిమ సంఘటన ఏమనగా ప్రజలు ప్రభువును రాజుగా గుర్తించి ఆయన్ను యెరుషలేముకు ప్రేమతో ఆహ్వానించారు. శ్రమలు సంఘటన ఏమనగా ప్రభువును ద్రోహిగా నిందించి ఆయన్ను శిలువ వేయుటకు పన్నాగం చేయుట. 

ఒకటి సంతోషకరమైనది రెండవది బాధాకరమైనది. మన శరీరంలో రక్తం నీరు ఎలాగైతే కలసి వుంటాయో మన యొక్క జీవితంలో కూడా బాధ , సంతోషం కలసి ఉంటాయి. 

ఈరోజు మ్రానికొమ్మలతో ప్రదక్షణలో  వచ్చే సమయంలో ఒక సువిశేష భాగం చదువుతాం, పూజలో శ్రమల వృత్తాంతం చదువుతాం. 

యేసు ప్రభువు అనేక సార్లు యెరుషలేము వెళ్లారు కానీ అన్ని సార్లు అంత గొప్ప ఆహ్వానం ఇవ్వలేదు. కేవలం ఈరోజు మాత్రమే వారు గుర్తిస్తున్నారు. 

యేసు ప్రభువు పేదవారి పట్ల పోరాడిన విధానం ప్రజల్లో ఒక నమ్మకం కలుగజేసింది. ఇతడు మా కోసం జీవిస్తాడు. ఆధికార బంధముల నుండి మమ్మల్ని  విడిపిస్తాడు అనే ఆలోచన నమ్మకం వారిలో కలిగింది. 

ఈనాటి మొదటి పఠనంలో బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి చదువుకున్నాం. 

యోషయా గ్రంధంలో 40-55 ఆధ్యాయాలలో నాలుగు బాధామయ సేవకుని గీతాలు మనం వింటున్నాం. 

ఈనాటి మొదటి పఠనంలో 3 వ గీతం గురించి చదువుతున్నాం. క్రీస్తు పూర్వం 7 వ శతాబ్దంలో దేవుడు యోషయాను ప్రవక్తగా నియమించారు. 

సోలోమోను రాజు తరువాత యిస్రాయేలు రెండుగా విభజించబడింది. ప్రతి ఒక్క రాజ్యంకు వారివారి ప్రవక్తలు, నాయకులు, మత పెద్దలు ఉండేవారు. 

యోషయా ప్రవక్త యెరుషలేములో పని చేసిన ప్రవక్త. ఆయన అనేక మంది రాజులకు దేవుని యొక్క ప్రవచనాలు తెలిపారు. 

ఆయన కాలంలో అస్సిరియులు యిస్రాయేలును నాశనం చేసిన దానిని ఆయన కనులారా చూశాడు. అప్పుడు హేజ్కియా రాజును లొంగిపోవద్దు అని తెలిపాడు. దేవునికి ప్రార్ధించి ముప్పు తొలగించాడు. 

యోషయా ప్రవక్త ఈ సేవకుని యొక్క గీతము వ్రాసేటప్పుడు ఆయన మనస్సులో ఉన్నది ఇద్దరు వ్యక్తులు 

1. యిస్రాయేలు ప్రజలు - ఎన్నుకోబడిన ప్రజలు 

2. మెస్సయ్య 

మెస్సయ్య తాను అందరి కోసం శ్రమలు అనుభవించి మరణిస్తారని ముందుగానే ప్రవక్త ప్రవచించారు. అందుకే అంటారు ప్రవక్తల ప్రవచనాలు నిజమేనని.  

యిస్రాయేలు ప్రజలు కూడా తమ యొక్క జీవితంలో సేవకుల  వలె బానిసత్వంలో అనేక శ్రమలు అనుభవించారు. 

మరి ముఖ్యంగా బాధామయ సేవకుని జీవితం మెస్సయ్యా గురించి ఉద్దేశించబడినది. 

ఈనాటి మొదటి పఠనంలో రెండు భాగాలు ఉన్నాయి. 

1. సేవకునికి అప్పజెప్పిన బాధ్యత 

2. సేవకుని యొక్క త్యాగ జీవితం 

సేవకునికి అప్పజెప్పిన  బాధ్యత ఏమిటంటే ప్రకటించుట , బోధించుట.దేవుని యొక్క రాజ్యం గురించి , దేవుని ప్రేమ గురించి, ఆయన క్షమ గురించి ప్రకటించే శక్తిని దయ చేశారు. ఆయన అలసిపోయిన వారికి ఓదార్పు దయ చేస్తారు. మత్తయి 11:28. 

బాధలలో, కష్టాలలో, నిరాశలో, జీవితంలో అన్ని సమస్యలు పడేవారిని దేవుడు ఈ సేవకుని ద్వారా  ఓదార్చుచున్నారు. 

సహాయం లేనివారికి ఒక సహాయంగా ఉండుటకు ఎన్నుకొన బడినవాడు, ప్రేమ లేని వారికి ప్రేమను పంచుటకు ఎన్నుకొనబడినవాడు, జీవితంలో ఆశలు కోల్పోయినవారికి ధైర్యం ఇచ్చుటకు ఈ సేవకుడు ఓదార్పును దయ చేస్తాడు. 

సేవకుడు తన జీవితంలో  దేవునికి ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చి యున్నారు. హెబ్రీ 10:7, హేబ్రి 5:8 

ఆయన మరణం వరకు తండ్రికి అడ్డు చెప్పలేదు. పిలిప్పీ 2:8 ఆయన మాటను ఎల్లప్పుడు నెరవేర్చారు. తనకు అప్పజెప్పిన పరిచర్య బాధ్యత సక్రమంగా నెరవేర్చాడు ఈ సేవకుడు. 

రెండవ భాగంలో తన యొక్క సేవక బాధ్యతలు నెరవేర్చుటలో ఈ సేవకుడు ఎంతగానో శ్రమలను అనుభవించాడు, నిందలు భరించాడు. 

ఆయనను మోదు వారికి వీపును అప్పగించారు అని 6 వ వచనంలో చెప్పబడింది. అంటే ఎన్ని దెబ్బలైనా భరించడానికి తనను తాను సమర్పించుకున్నారు. ఆయన ఎవరికి ఎదురు చెప్పలేదు. మౌనంగా భరించాడు. 

ఆయన గడ్డపు వెంట్రుకలు లాగేసారు, ఉమ్మి వేశారు, అవమానించారు. ఇవన్నీ కూడా భరించడానికి కష్టం అయినా భరిస్తున్నారు. ఇది కేవలం ప్రేమ వలనే సాధ్యం. ప్రేమ సమస్తమును భరించును. 1 కోరింథీ 13:7. యేసు ప్రభువు జీవితంలో ఇవన్నీ జరిగాయి. ఆయన వస్త్రములు లాగారు. యోహను 19:23. ఆయన మొహం  మీద ఉమ్మి వేశారు. మత్తయి 26:67 . ఆయన్ను కొరడాలతో కొట్టారు. మార్కు 15:15 , యోహను 19:1 

ఇన్ని రకాలైన  అవమానాలు తాను ఎదుర్కొన్నప్పటికి ఆయన క్రుంగిపోలేదు, పారి పోలేదు అన్ని సహనంతో భరించాడు. ఇంత బాధలు పొంది వాటిని భరించాలంటే నిజంగా దైవ శక్తి మనకు అవసరం. 

బాధమయ సేవకుడు  తండ్రి మీద ఉన్న గాఢమైన ప్రేమ  వలన అధే విధంగా తన ప్రజలను కాపాడాలనే ఉద్దేశం వలన ఎంతో బాధను భరించాడు. 

ఒక  క్రోవోత్తి తాను కరుగుతూ ఎలాగైతే ఇతరులకు వెలుగునిస్తుందో అధే విధంగా ఈ సేవకుడు తన జీవితం, ప్రాణం త్యాగం చేస్తూ ఇతరులకు రక్షణనిచ్చాడు. 

రెండవ పఠనంలో పునీత పౌలుగారు యేసు ప్రభువు యొక్క సేవా జీవితం గురించి తెలుపుచున్నారు. 

యేసు ప్రభువు తండ్రి , పవిత్రాత్మతో అన్నింటిలోను సరిసమానం అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని జీవించారు. 

ఈ వాక్యాలలో పౌలుగారు దేవుని యొక్క వినయ జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఎవ్వరు కూడా ఆయన వలె తగ్గించుకొని జీవించలేదు. 

ఆయన దేవుడు అయినా మనిషిగా మన మధ్య జన్మించారు. పరలోకంలో జీవించే దేవుడు భూలోకంలో జీవించుటకు ఇష్టపడ్డారు. పరలోక మహిమను విడిచి పెట్టారు. భూలోక సీలువను మోసారు. పవిత్రమైన  పరలోకంలో జీవించే దేవుడు పాప మలినం శోకిన ప్రజల మధ్యకు వచ్చారు. 

అధికారం కలిగినప్పటికి అణిగిమణిగి వినయంతో జీవించారు. ఆయన దేవుడే అయినప్పటికీ అన్ని విడిచిపెట్టారు మన మధ్యకు వచ్చారు పిలిప్పీ 2:7 

-సేవించబడాల్సిన దేవుడు సేవ చేస్తున్నారు 

-ప్రేమించబడాల్సిన దేవుడు ప్రేమిస్తున్నారు

-ఆరాధించబడాల్సిన  దేవుడు మన మంచికై అన్ని చేస్తున్నారు. 

-మనం ఎవరికోసం , ఎవరి రాక కోసం ఎదురు చూడాలో ఆయనే మన కోసం ఎదురు చూస్తున్నారు. 

-మనం వెదికే దేవుడు మన కోసం వెదుకుచున్నారు. 

ఆయన అన్నింటినీ త్యజించుకొని మన మధ్యకు వచ్చి జీవించారు. యేసు ప్రభువు అంతటి వినయంను చూపుతూ మన మధ్యలో జీవించి తన ప్రాణ త్యాగం చేశారు. ఆయన స్వార్ధం వేదకలేదు. సేవకుని వలె జీవించి అంత దేవుని కొరకు ప్రజల కొరకు చేశారు. 

యేసు ప్రభువు  తండ్రికి మాత్రమే కాదు వినయం చూపినది మానవులకు, అధికారులకు వినయం చూపించారు. తనను హింసించిన వారికి, చంపిన వారికి కూడా ప్రభువు వినయం చూపించారు. 

ఆయనకు అధికారం వుంది, ఆయన సృష్టికర్త అయినా కానీ అంతటి వినయం చూపించారు. యోహను 10:18, రోమి 5:19 , హెబ్రీ 10:9 . 

వినయం వలన ప్రాణ త్యాగం చేశారు, తనను తాను తగ్గించుకొని నిందలు మోసారు. 

తనను తాను తగ్గించుకొని శత్రువుల చేతికి అప్పగింప బడినారు, తనను తాను తగ్గించుకొని అందరి పాపాలు తన మీద వేసుకున్నారు. 

తనను తాను తగ్గించుకొని శిలువ భారం మోసారు, ఘోరమైన శిలువ మీద మరణం అంగీకరించారు. 

ఆయన పాప రహితుడైనప్పటికి మన పాపాల కోసం అన్ని భరించారు, మనల్ని రక్షించారు.2 కోరింథీ 5:12, గలతి 3:13 .1 పేతురు 2:24, 1 పేతురు 3:18 

యేసు ప్రభువు తన్ను  తాను రిక్తుని చేసుకున్నారు కాబట్టి తండ్రి కుమారున్నీ అంతగా సన్మానించారు. చివరి వరకు సంపూర్ణ విధేయతను, వినయంను చూపిన కుమారిడిని తండ్రి మిక్కిలిగా ప్రేమించారు. ఆయనకు సమస్తము ఇచ్చి ఉన్నారు. ఎఫెసీ 1:22, 1 పేతురు 3:22 ,రోమి 14:11. 

మనం ఒకరి ముందు తలవంచటానికి ఇష్టపడం కానీ యేసు ప్రభువు వినయంలో అందరి ముందు తనను తాను తగ్గించుకొని జీవించారు. 

ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు యొక్క  శిలువ శ్రమలు ధ్యానించు కుంటున్నాం. ఈ రోజు ముఖ్యంగా మనందరం ధ్యానించుకోవల్సిన అంశం ఏమిటంటే యేసు ప్రభువు ప్రజలు రాజుగా గుర్తించారు. 

యేసు ప్రభువు చాలా సార్లు యెరుషలేము దేవాలయంకు వెళ్లారు. కానీ ఈ సమయంలోనే ఆయన్ను గొప్పగా ఆహ్వానిస్తున్నారు. 

ప్రభువు యెరుషలేముకు వెళ్ళిన సమయాలు 

1. యెరుషలేము దేవాలయంను శుభ్రం చేసిన సమయం -యోహను 2:3 

2. యెరుషలేము కోనేటి వద్ద స్వస్థత ఇచ్చినప్పుడు -యోహను 5:1 

3. యెరుషలేములో ఆయన దేవుని కుమారుడని ప్రకటించిన వేళ . యోహను 7:16-17 

4. జీవ జలపు  ఊట అని చెప్పినప్పుడు - యోహను:37-39 

5. లోకానికి వెలుగు అని చెప్పినప్పుడు కూడా ప్రభువు యెరుషలేములో ఉన్నారు.- యోహను 8:12, 9:5 

ఇలాగ చాలా సందర్భాలలో ప్రభువు యెరుషలేములోనే ఉన్నారు. కాని ఇప్పుడు దానికి ప్రత్యేకత ఉంది. ప్రభువు ఈ లోకంలో తండ్రి క్రియలు నెరవేర్చారు, అద్భుతాలు చేశారు, యూదుల విశ్వాసం పెంచడానికి 7 అధ్భుతాలు చేశారు. 

1. నీటిని ద్రాక్షరసంగా మార్చుట . యోహను 2:1-11 

2. ప్రభుత్వ ఉద్యోగి  కుమారునికి స్వస్థత నిచ్చుట.-యోహను 4:46-54 

3. బెత్సయిదా  వద్ద పక్షవాత  రోగికి స్వస్థత నిచ్చుట - యోహను 5:1-15 

4. 5000 మందికి ఆహారం పెట్టుట- యోహను 6:5-14 

5 . నీటి మీద నడుచుట -యోహను 6:16-24 

6. పుట్టు గ్రుడ్డి వానికి చూపును దయచేయుట -యోహను 9:1-7 

7. లాజరును జీవంతో లేపుట - యోహను 11: 1-45 

ఇవన్నీ చేసిన తరువాత ప్రజల యొక్క ఆత్మ విశ్వాసం పెరిగింది. ఆ కాలంలో ప్రభువు బలహీనుల పట్ల, ప్రజల పట్ల పోరాడుతున్నారు. కాబట్టి ఇతడు నిజంగా ప్రజల కోసం వచ్చారని, ప్రజల సమస్యల నుండి కాపాడుతారని నమ్మకం అందుకే ఆయన్ను రాజును చేయాలనుకున్నారు. 

ఆయనయే తమ రాజు అని ఆయన్ను స్తుతించారు. మాకోసం నిలబడే వ్యక్తి అని మాకోసమె పుట్టిన ప్రభువు అని అందరు భావించారు. అందుకే ఆయన తమ యొక్క రాజని గుర్తించారు. ఆ సందర్బంలోనే ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు. 

ప్రజలు యేసు ప్రభువుకు హోసన్న పాడారు. హోసన్న అంటే మమ్ము ఇప్పుడు రక్షించు అని అర్ధం. ఆయన వారిని రక్షిస్తారు అని తెలుసుకున్నారు. పాపముల నుండి రక్షిస్తాడని తెలుసుకొని రక్షించమన్నారు. అధే విధంగా ఈ లోక బంధనముల నుండి, అధికారుల క్రింద నుండి రక్షించమని కోరారు. 

ఆయన ద్వారానే రక్షణ వస్తుందని భావించారు. ఆయన రాజుగా పాలిస్తాడని భావించారు. 

యేసు ప్రభువు యొక్క రాజ్యాధికారం  ఈ లోక అధికారం కన్నా  భిన్నంగా ఉంటుంది. 

ఈ రాజు  రాజ్యాలు గెలిచే రాజుగా రావడం లేదు. ప్రజల యొక్క మనస్సులు గెలిచే రాజుగా వస్తున్నారు. మన రాజు శ్రమలు అనుభవించారు, సుఖ సంతోషాలు విడచి పెట్టారు. ఈరాజు అందరికంటే ముందుగా నిలబడి తన ప్రజల కోసం పోరాడతారు. 

క్రీస్తు రాజు బంగారపు కిరీటము ధరించలేదు ముళ్ళ కిరీటము ధరించారు. అధికారంను దుర్వినియోగం చేసుకోకుండా  వినయంతో ప్రేమతో ఈ రాజు జీవించారు. 

యేసు ప్రభువును  రాజుగా సంభోదించుట వలన పరిసయ్యులు భయ పడ్డారు. ఎందుకంటే రోమా పాలకులకు తెలిస్తే వారు తమ పై యుద్దానికి వస్తారని అనుకొన్నారు. ఎందుకంటే యేసును యూదులు రాజుగా చేసుకున్నారని గ్రహించి రోమియులు యుద్దానికి వస్తారని భయ పడ్డారు అందుకే శిష్యులను గద్దించారు. లూకా 19:39 

దేవదూత పలికిన మాటలు నెరవేరాయి. దేవ దూత మారియమ్మకు  జన్మించిబోయే  శిశువు  దావీదు సింహాసనము అదిష్టిస్తారు అని అన్నారు. అది ఈ రోజు కార్యం ద్వారా జరిగింది. లూకా 19:18 . 

ప్రభువు పేరిట వచ్చే రాజు స్తుతింపబడును గాక అన్న మాటలు దావీదుకు చెందినవి, ఆయన శత్రువులను జయించి యెరుషలేముకు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఇలాగే స్తోత్రగానం చేసేవారు అధేవిధంగా యేసు ప్రభువు యొక్క గొప్పతనం గుర్తించి ప్రజలు ప్రభువును పొగిడారు. 

యేసు ప్రభువు గాడిదను ఎన్నుకొని ప్రజల యొక్క నమ్మకంను పెంచుతున్నారు. అంతకు ముదనే ప్రవచనాలు చెప్పబడ్డాయి. మెస్సయ్యా గాడిద పిల్ల మీద వస్తాడని - జెకార్య 9:9 , జెఫన్యా 3:16-19 . 

యేసు ప్రభువు అడిగిన వెంటనే ఇంటి యజమానుడు కూడా వెంటనే గాడిద ఇచ్చారు. బహుశా ఆయనకు కూడా క్రీస్తు ప్రభువును రాజుగా గుర్తించి ఉండవచ్చు. 

యేసు ప్రభువుకు రాజుకు ఇచ్చిన గౌరవం ఇచ్చారు. 1మక్కా 13:51. 

ప్రభువు స్వయంగా గాడిదను ఎంనుకొంటున్నారు. ఎందుకంటే పూర్వం రాజులు యుద్ధం చేయడానికి వెళ్లేటప్పుడు గుర్రం మీద వెళ్ళేవారు, శాంతిని నెలకొల్పేటప్పుడు గాడిద మీద వెళ్ళేవారు. 

గాడిద  వినమ్రుని, శాంతి పరుని సూచిస్తుంది. యేసు ప్రభువు ప్రపంచానికి శాంతి ప్రధాత, ఆయన ఇహలోక సంబంధమైన రాజు కాక పరలోక సంభందమైన రాజు ఆయన అందరికి రాజు ప్రజలందరి పాపాలు తన మీద మోసుకొని మరణించిన గొప్ప రాజు. 

సోలోమోను తన తండ్రి గాడిద మీద వచ్చారు, సింహాసనం అదిష్టించే రోజు . 1 రాజు 1:38-41. 

గాడిద మీద  వచ్చిన వారు.- న్యాయ 10:4 , 2 సమూ 17:23, 2 సమూ 19:26  

ఈ లోకమును తన తండ్రితో సమాధాన పరుచుటకు ఆయన గాడిద మీద వస్తున్నారు. సఖ్యత ఏర్పరచడానికి . ప్రభువు ప్రజల యొక్క హృదయాలను గెలవడానికి గాడిద పిల్ల మీద వస్తున్నారు, ఎఫెసీ 2:13-18 

గాడిదను ప్రభువు ఎన్నుకొనుటకు కారణాలు 

1. గాడిద బరువు మొస్తుంది - అందరి భారం మొస్తుంది 

2. గాడిద సేవ చేస్తుంది - అందరికి సేవ చేస్తుంది 

3 గాడిద శాంతికి గుర్తు 

4. గాడిద పవిత్రతకు గుర్తు - వస్తువులను జంతువులను దేవునికి సమర్పించుటకు వాడతారు కాబట్టి అవి పవిత్రమైనవి. సంఖ్యా 19:2, ద్వితీ 21:3 , 1 సమూ 6:7  

యేసు ప్రభువు వాడిన గాడిదను ఎవ్వరూ ఎన్నడూ వాడలేదు అది పవిత్రమైనది. మనం దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు మంచి జీవితం జీవించాలి. 

Rev. Fr. Bala Yesu OCD

2, ఏప్రిల్ 2022, శనివారం

తపస్సుకాల 5 వ ఆదివారం

యెషయా 43:16-21, పిలిప్పి 3:8-14, యోహాను 8:1-11
ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు  క్షమించుట  ద్వార దేవుడు ప్రసాదించు క్రొత్త జీవితం గురించి  బోధిస్తున్నాయి. దేవుడిచ్చే గొప్ప అవకాశం వల్ల  దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించాలి. పశ్చాత్తాప పడిన  ప్రతి యొక్క  విశ్వాసిని దేవుడు క్షమించడానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. పాపికి  దేవుడు మరొక అవకాశం దయచేసి క్రొత్త జీవితం జీవించమని తెలియజేస్తారు. 
మన జీవితంలో కూడా ఎదుటి వారు చేసిన తప్పిదములు లెక్క చేయకుండా వారిని క్షమించుకొని జీవించాలి. వారికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. మన యొక్క స్నేహాలు నిలబెట్టుకోటానకి అవకాశం ఇవ్వాలి. ఇతరులు చేసిన తప్పులు క్షమించి మరలా మనతో క్రొత్త జీవితం జీవించడానికి వారికి ఇంకో అవకాశం ఇవ్వాలి. 
దేవుడు మన పట్ల  ఎలాగైతే  క్షమ హృదయాన్ని కలిగి జీవిస్తున్నారో మనం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి అధేవిధంగా దేవుడు మానాకోక అవకాశం  ఇచ్చిన విధంగా వేరేవారికి కూడా అవకాశం ఇవ్వాలి. 
ఈ మూడు పఠనాలు కూడా మారని దేవుని ప్రేమగురించి అలాగే ఆయన యొక్క శాశ్వత ప్రేమ గురించి చక్కగా వివరిస్తున్నాయి. 
మన నిజ జీవితంలో ఎవరైన సంపూర్ణంగా  ప్రేమిస్తే వారిని వారి పాపాలు క్షమించడానికి ఎప్పుడు సిద్దంగానే మనం ఉంటాం. దేవుడు తన ప్రజలను సంపూర్ణంగా ప్రేమించారు, కాబట్టియే వారి అనేక పాపాలు క్షమిస్తున్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు యిస్రాయేలు ప్రజలకు ప్రసాదించే నూతన జీవితం గురించి భోధిస్తున్నారు. 
యిస్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్న సమయంలో యోషయా ప్రవక్త ద్వార పలుకుచున్న సంతోష వాక్కులు వింటున్నాం. బాబిలోనియా బానిసత్వంలో చివరిరోజుల్లో ఉన్న సమయంలో పలికిన ఆనంద మాటలు ఇవి. 

బానిసత్వం నుండి మరొకసారి దేవుడు వారిని బయటకు తీసుకొని వస్తారని, యెరుషలేముకు నడిపిస్తారని తెలుపుచున్నారు. యెరుషలేము దేవాలయం పునరుద్ధరిస్తారని యోషయా ద్వారా తెలియచేసారు. 
మొదటి ప్రారంభ వచనాలలోదేవుడు  ఎలాగ వారికి  సముద్ర మార్గం గుండా దారిని చేశారో తెలుపుచున్నారు. అదే విధంగా జలరాశి గుండా, ఎండిన నేల మీద నడిపించారు. నిర్గ 14:22.  14:29. 
తాను ప్రేమించిన ప్రజలకోసం దేవుడు శత్రు సైన్యంతో  పోరాడారు. నిర్గ 1వ అధ్యాయం 11 వ అధ్యాయం వరకు వారికి 10 అరిష్టాల ద్వారా వారితో పోరాడారు. 
తనను నమ్ముకున్న ప్రజల పట్ల దేవుడు చూపించే కరుణ అలాంటిది. దేవుడు అన్ని సమయాలలో వారితో ఉండేవారు. నిర్గ 3:14. అసాధ్యమైన కార్యములు దేవుడు తన ప్రజల కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు. లూకా 1:37. తన ప్రజల మీద ఉన్న ప్రేమ వలన అసాధ్యమైనవి దేవుడు సుసాధ్యం చేస్తారు. 

18 వ వచనంలో  ప్రభువు  అంటున్నారు. మీరు పూర్వ సంగతులను గుర్తుంచు కొనక్కరలేదు అని ప్రభువు చెబుతున్నారు. 
వారి  బలహీనతలు గుర్తించుకొనక్కరలేదు అంటున్నారు. వారు దేవుడిని విస్మరించిన క్షణాలు గుర్తుంచుకొనక్కరలేదు.  వారి పాపాలు గుర్తుంచుకొనక్కరలేదు అంటున్నారు. వారి బానిసత్వ బాధలు గుర్తుంచుకొనక్కరలేదు అని అంటున్నారు. 

పశ్చాత్తాప పడిన ప్రజలకు, క్షమించమని కోరిన ప్రజలకు దేవుడు నూతన కార్యము చేస్తానంటున్నారు. ఆ నూతన కార్యమేమనగా అది క్రొత్త జీవితమే, క్రొత్త బంధమే, క్రొత్త ఒడంబడికయే, క్రొత్త ఆశీర్వాదమే. యోషయా 65:17, 2 కోరింథీ 5:17. అ. పొ 21:15. 

19 వ వచనంలో ప్రభువు  అంటున్నారు, ఎడారిలో బాటలు వేస్తానని, మరు భూమిలో త్రోవ వేయుదును అని అదే విధంగా 20 వ వచనంలో ఎడారి గుండా నీటిని పారించి నేను ఎన్నుకొన్న ప్రజలకు ఇత్తును అని అంటున్నారు. 

ఎడారిలో దారి సరిగా  వుండదు ప్రభువు అలాంటి ప్రదేశంలో  విశాలవంతమైన ప్రాంతంలో దారులు వేస్తానని పలుకుచున్నారు. యోహా 14:6. ఆయన చెంతకు రావటం వల్లన మనం క్రొత్త  బాటలో  ప్రయాణం చేస్తాం - ముగ్గురు జ్ఞానులు  వేరొక మార్గం అనుసరించారు. మత్త 2:12. 

మార్గం, గమ్యం తెలియకుండా జీవించే మన బ్రతుకులకు దేవుడు దారిని చూపిస్తారు మనకు క్రొత్త జీవితం దయ చేస్తారు. 
మరు భూమిలో త్రోవ  వేస్తారని అంటున్నారు అంటే పనికి రాని నేలను కూడా సక్రమంగా వినియోగిస్తారని తెలుపుచున్నారు. 

ఎడారిలో దేవుడు నీటిని ఒసగటమే కాదు, నదులు, పారిస్తాను అని తెలుపుచున్నారు. నిర్గ 17:1-7. యోషయా 35:6-7. 
ప్రజల యొక్క దాహం తీర్చుతానని ప్రభువు పలుకుచున్నారు. దేవుడు తన ప్రజల కోసం ఎంతటి గొప్ప కార్యమైన చేయుటకు సిద్ధంగా ఉన్నారు. 
ఆయన వారి పాపాలు క్షమించుటయే కాదు ఇంకా వారు సంతోషంగా  జీవించుటకు దేవుడు అవకాశంను ఇస్తున్నారు. 
మన యొక్క జీవితంలో ఎదుటి వారి పాపాలు గుర్తించుకొక  అవసరం లేదు వారికి  రెండో ఛాన్సు ఇచ్చి మంచిగా జీవించేలా చేయాలి. 
రెండవ పఠనంలో పౌలుగారి యొక్క జీవితం గురించి తెలుపుచున్నారు. ఆయన జీవితం మొత్తం కూడా దేవుని కృపను పొందడానికే ప్రయత్నం చేశారు. 
తన యొక్క సువార్త పరిచర్యలో అదే విధంగా క్రీస్తును తెలుసుకొన్న జ్ఞానం వలన ఆయన ఏమంటున్నారంటే ఆయన యొక్క జ్ఞానం పొందుటకు నేను సమస్తమున పూర్తి నష్టముగా పరిగణిస్తున్నాను అని పలుకుచున్నారు. 

దైవ జ్ఞానం  వుంటే దేవుడినే కలిగిఉంటాం. ఆయన కొరకు ఇహలోక జ్ఞానం  అంతా విడిచి పెడతాం. ఆయన కొరకు సమస్తం విడిచి పెడతాం. 
క్రీస్తును  పొందటానికి సమస్తము చెత్తగా భావిస్తున్నాను అని తెలుపుచున్నారు. మనకు దేవుని యొక్క విలువ తెలిసినప్పుడు ఆయన్ను కలిగి ఉండటానికి ఏదైనా విడిచిపెడతాం. 

దేవుని కన్నా ఏ  వస్తువు , మనుషులు మిన్న కాదు అని గ్రహిస్తాం. ఆవిలాపురి తెరేసమ్మ గారు అంటారు HE WHO HAS GOD WANTS NOTHING, GOD ALONE SUFFICES అని దేవుడిని కలిగిన వ్యక్తికి ఈ లోకంలో ఏది అవసరం లేదు, ఆ ప్రభువు మాత్రం చాలు అని . 

అధే విధంగా దావీదు ప్రభువే నాకు కాపరి నాకు ఇక ఏ కొదవయు లేదు అని . కీర్తన 23:1 
వారికి దేవుని యొక్క విలువ తెలిసింది కాబట్టియే దేవుని కొరకు మిగతా ఏదైన వ్యర్ధంగా భావించారు. మనకి కూడా దైవ అనుభూతి , దైవ జ్ఞానం ఉంటే దేవుని కోసం మిగతా అనీ చెత్తగా భావిస్తాం. 

పౌలు గారు యొక్క కోరిక 10 వ వచనంలో తెలుస్తుంది దేవునికి సంభందించిన జ్ఞానం పొందాలనుకుంటున్నారు.అపో 22:3 . దైవ జ్ఞానం మనకు మంచి ఏదో, చెడు ఏదో తెలుపుతుంది. మనం కూడా క్రీస్తుకు సంబందించిన జ్ఞానంను సంపాదించుకోవాలి. అది మనకు పవిత్ర గ్రంధంను చదవటం ద్వారా తెలుస్తుంది. 

పౌలు గారు కూడా గమాలియేలు దగ్గర నేర్చుకున్నారు ఆయన పొందిన జ్ఞానం వల్లనే క్రీస్తును ప్రకటించ గలుగుతున్నారు. మనం కూడా దైవ అనుభూతి , దైవ జ్ఞానంకలిగి ఉంటే ఆయన గురించి నలుగురికి చాటి చెప్పవచ్చు. దాని కోసం అనుదినం ప్రయత్నం చేయాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు  వారు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని క్షమించి ఆమెకు మంచి జీవితం జీవించుటకు రెండవ అవకాశం గురించి ధ్యానించుకుంటున్నాం. 

యేసు ప్రభువు ఓలివు పర్వతమునకు వెళ్ళేను. తెల్లవారిన తరువాత  యధావిధిగా దేవాలయంకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆయన భోదనలు వినటానికి ముందుగానే వచ్చేవారు. లూకా 21:37-38. 
ఇక్కడ ఒక విషయం మనం అర్ధం చేసుకోవాలి. యేసు ప్రభువు చాలా సార్లు దేవాలయంకు ప్రార్ధించుటకు వెల్లుచున్నారు, వాక్యం ప్రకటించుటకు వెల్లుచున్నారు. పాపం , పుణ్యం గురించి ప్రజలకు భోధిస్తున్నారు. అది ప్రభువు చేసే మంచి పని. 

సువార్త ప్రకటన చేసే సమయంలో ప్రభువును కొందరు పరీక్షకు గురిచేస్తున్నారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని గురించి ఆయన్ను పరీక్షిస్తున్నారు. 

చాలా సందర్భాలలో తన తప్పులను దాచుకోవడం ఇతరుల తప్పులను వ్రేలెత్తి చూపటం సాధారణంగా మనకు కనిపించే మానవ స్వభావం. 

పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు ఎదుటివారి తప్పులు గురించే  ఆలోచించారు కానీ తమ తప్పులూ ఆలోచించడం లేదు. వారు తమను తాము సమర్ధించుకొనేవారు. లూకా 18:9-14. 

వారి యొక్క పాపపు జీవితం ఎన్నడూ వారికి గుర్తుకురాలేదు. అందుకే వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని శిక్షించాలనుకున్నారు. వాస్తవానికి మోషే ధర్మ శాస్త్రం ప్రకారం  వ్యభిచారం చేసే వారికి మరణ శిక్ష విధించాలి. లెవీ 20:10, ద్వితీ 22:13-24. 
పరిసయ్యులు యేసుప్రభువును పరీక్షకు గురిచేయాలనుకుంటే దేవుడే వారిని పరీక్షకు గురిచేస్తున్నారు. యూదుల ఆచారం ప్రకారం వారిలో అందరికన్నా పెద్ద మనిషిని ఆమె మీద రాయి విసరమన్నారు కాని అక్కడ ఎవరు ఆ పని చేయలేదు.వారిలో కూడా హృదయ పరివర్తన కలుగుతుంది. వారు కూడా పాపాత్ములమే అని గ్రహిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు వెళ్లి పోవుచున్నారు.ఈ యొక్క సంఘటన లో దేవుని యొక్క గొప్ప కనికరం మనకు కనపడుతుంది. దైవ ప్రేమ మానవ దీన స్థితిని కలిసినప్పుడే దేవుని కనికరం పుడుతుంది.ప్రేమ కలిగిన దేవుడు పడిపోయిన పాపి దిన స్థితిని చూసినప్పుడు కనికరం చూపిస్తున్నారు.యేసు ప్రభువు ఆమెలో కలుగబోయే మార్పును చూసారు. అందుకే ఆమె వైపు కరుణతో చూసారు. ఆమె జీవితంను మార్చుకోమని ప్రభువు చెబుతున్నారు.
వ్యభిచారం లో పట్టుపడిన స్త్రీ పాపం యేసు ప్రభువు సమర్ధించలేదు.పాపం చేసిన ఫర్వాలేదు అని చెప్పలేదు.కాని ఆయన యొక్క వైఖరిలో క్రొత్తధనం ఉంది.నేను నిన్ను ఖండించను, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, నీ జీవితంను చక్కబెట్టుకో అని ప్రభువు తనకు అవకాశం ఇస్తున్నారు. ఆమె హృదయ పరివర్తన చెందుటకు, పాపంను విడచి పెట్టుటకు దేవుడు ఆమెకొక అవకాశం ఇచ్చారు.
పరిసయ్యులు ఆమెను శిక్షించాలనుకున్నారు, కాని ప్రభువు ఆమెను రక్షించారు.పరిసయ్యులు ధర్మ శాస్త్ర బోధకులు క్రూరంగా హింసించాలనుకున్నారు. దేవుడు మాత్రం కరుణ చూపించారు. పరిసయ్యులు అధికారాన్ని, నీతిమంతమైన జీవితాన్ని చూపించాలనుకున్నారు, కాని ప్రభువు దైవ ప్రేమ జీవితాన్ని చూపించారు.
ఇప్పటి వరకు చేసిన పాపాలను దేవుడు క్షమించి అవకాశం ఇస్తున్నారు కాబట్టి జీవితం ను బాగు చేసుకోవాలి.
మనం కూడా మన బలహీనతలవల్ల పాపం చేస్తాం. భర్తలు భార్యలను, భార్యలు భర్తలను మోసం చేస్తారు.బిడ్డలు తల్లి తండ్రులను ,తల్లి తండ్రులు బిడ్డలను మోసం చేసి జీవిస్తారు. మనం పాపం చేసి జీవిస్తాం కాబట్టి ఇంకొక అవకాశం ఇచ్చినప్పుడు దానిని సరిగా వినియోగించుకోవాలి.
ఈ సువార్త ద్వారా దేవుడు ఆమె పాపాలను క్షమిస్తూ, ఆమెకు ఒక క్రొత్త జీవితం జీవించుటకు అవకాశం ఇస్తున్నారు, మనం కూడా మన స్నేహితులకు ఒక అవకాశం ఇవ్వాలి.భర్త భార్యకు , భార్య భర్తకు అవకాశం ఇస్తూ , క్షమించుకొని, అంగీకరించుకొని జీవించాలి. 
దేవుని దయ, కనికరం, ప్రేమ చాలా గొప్పవి, ఆయన ఇచ్చిన ప్రతి అవకాశం హృదయ పరివర్తన చెందుటకు, మంచిగా జీవించుటకు వినియోగించుదాం.
ఒకరి పట్ల ఒకరం కనికరం, ప్రేమ, సానుభూతి కలిగి జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...