30, ఏప్రిల్ 2022, శనివారం

పాస్క మూడవ ఆదివారం

పాస్క మూడవ ఆదివారం 

అపో 5:27-32 ,40-41, దర్శన 5:11-14, యోహను 21:1-19 

 ఈనాటి దివ్య పఠనాలు  దేవునికి సాక్షిగా జీవించే వారి గురించి బోధిస్తున్నాయి. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానంను విశ్వసించి పిత పుత్ర పవిత్రాత్మ  నామమున జ్ఞాన స్నానం పొందిన వారందరు దేవునికి సాక్షులై జీవించాలని ఈనాటి పఠనాలు తెలియజేస్తున్నాయి. 

ఈనాటి మొదటి పఠనం, అపోస్తులులు యేసు ప్రభువుకు ఎలాగా సాక్షులై జీవించారో తెలుపుతుంది. యేసు ప్రభువుతో పాటు మూడు సంవత్సరాలు జీవించి, ఆయనను తెలుసుకొని ఆయన అప్ప జెప్పిన  బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతూ, ఆయనకు సాక్షులై జీవించారు అపోస్తులులు. 

లూకా గారు, యేసు ప్రభువు యొక్క శిష్యులను  అపోస్తులులు అని  పిలుస్తున్నారు. అంటే పంపబడినవారు అని అర్ధం. దేవునికి సాక్షులుగా ఉండుటకు పంపబడిన వారు అని అర్ధం . ఏసుతో జీవించి ఆయన భోదను చెవులారా ఆలకించి, ఆయన మరణాన్ని కన్నులారా గాంచి, మృతులలో నుండి సజీవునిగా లేచిన, క్రీస్తుని గురించి ప్రకటించకుండా వుండలేక పోయారు. 

దేవునితో కలిసి జీవించినప్పుడు పొందిన అనుభవాన్ని ఇతరులకు తెలియజేయుటకు సిద్దంగా ఉన్నారు. క్రీస్తు పేరిట ప్రసంగించేటప్పుడు, అద్భుతాలు చేసేటప్పుడు అపోస్తులు అనేక హింసలకు గురయ్యారు. 

దేవుని యొక్క సేవ చేసేటప్పుడు అనేక రకాలైన ఆటంకాలు కలుగుతాయి. పూర్వ నిబందన గ్రంధం లో కూడా చూస్తుంటాం, ఏ విధంగా యిస్రాయేలు ప్రజలు ప్రవక్తలను హింసించారో. 

యిర్మియా ప్రవక్తను  కొట్టి బావిలో పడవేశారు. యిర్మియా 20:2,  దానియేలును సింహాపు బోనులో పడవేశారు, దానియేలు 6 వ అధ్యాయం. బాప్తిస్మ యోహనును కూడా శిరచ్ఛేదనం చేశారు. మత్తయి 14:1-12. చాలా మంది ప్రవక్తలు దేవునికి సాక్షులై జీవించేటప్పుడు అనేక రకాలైన హింసలకు గురయ్యారు. శిష్యులుకూడా దేవుని యొక్క పవిత్ర ఆత్మను స్వీకరించిన తరువాత ఆయన గురించి గొప్పగా ప్రకటన చేస్తున్నారు. ఇక ఎదియు వారిని ఆపలేదు. 

అపోస్తులను చెరసాలలో వేయడానికి కారణం కేవలం అసూయాయే. అపో 5:17. క్రీస్తు ప్రభువుకు అనుచరులు పెరిగిపోతున్నారని సద్దుకయ్యులు  భావించారు. అందుకే వారు ఆ విషయమును జీర్ణించుకోలేక పోయారు. 

క్రైస్తవ మతమును , క్రీస్తు అనుచరులను తుద ముట్టించాలను కున్నారు. కానీ వారికి అది సాధ్య పడలేదు. క్రైస్తవత్వం ప్రారంభమైనప్పటి నుండి  క్రీస్తు అనుచరులు అనేక కష్టలు అనుభవించారు, అయిన కానీ క్రైస్తవ మతం అణగిపోలేదు. క్రీస్తు విశ్వాసులు దిన దిన అభివృద్ధి చెందుతున్నారు. 

అధికారులు అపోస్తులులను చెరసాలలో వేసి బందించినప్పటికి దేవుడు వారిని విడిపించారు. ఎందుకంటే  వారు దేవునికి సాక్షులై జీవించారు. దేవునికి విధేయత చూపించారు. 

దానియేలు యొక్క స్నేహితులు షడ్రకు, మేషకు, అబేద్నెగోను అగ్నికొలిమిలో వేసిన సంధర్భంలో, దేవుడు వారిని కూడా కాపాడారు. దానియేలు 3:92. ఈ ముగ్గురు వ్యక్తులుకూడ దేవునికి సాక్షులై , విధేయులై జీవిస్తున్నారు. రాజు యొక్క విగ్రహాన్ని ఆరాధించుటకు వారు ఒప్పుకోలేదు. కేవలం దేవున్ని  మాత్రమే ఆరాధిస్తాం అని గట్టిగా విశ్వాసానికి సాక్షులై జీవించారు.

ప్రభువు యొక్క సేవ ఎంత ఆపాలని ప్రయత్నిస్తే అంతగా క్రైస్తవులు పెరుగుతున్నారు. అపోస్తులులు ఎన్నో ఇబ్బంధులను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నారు. వారు కష్టాలకు, శిక్షలకు వెనుదీయలేదు,ఎంతో ధైర్యంగా ఉన్నారు. 

వారు సురక్షితంగా పిల్ల పాపలతో ఉండాలని కోరుకోలేదు. దేవుని జీవితం ప్రకటించాలని దేశ దేశాలు తిరిగి సువార్త ప్రకటించారు. 

క్రీస్తు పునరుత్తానం తరువాత అపోస్తులులు దేవుని చిత్తమును మాత్రమే వేదికారు. ఆయన చిత్తం నెరవేర్చుటకు , ప్రాణ త్యాగం చేయుటకు సైతం సిద్ధంగా ఉన్నారు. ప్రభువు సేవలోనే నిజమైన ఆనందం వుందని భావించి ఆయన సేవ చేశారు అపోస్తులులు. 

ఈనాటి రెండవ పఠనంలో యోహాను గారు చూసిన దర్శనం గురించి తెలియచేస్తున్నారు. కోట్ల కోలదిగా  దేవ దూతలు  చంపబడిన సర్వేశ్వరుని గొర్రెపిల్ల యైన యేసు క్రీస్తు ప్రభువును ఉద్దేశించి స్తుతులు పాడుచున్నారు. దేవుడు మాత్రమే స్తుతులకు అర్హుడు, ఆయన యొక్క గొప్పతనం తెలుసుకొని ఆయనను ఆరాధించారు. 

చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది, ఎందుకంటే ఈ గొర్రె పిల్లయైన యేసు క్రీస్తు ప్రభువు బాధమయ సేవకుని వలె తన యొక్క జీవితంను త్యాగం చేశారు. తన రక్తమునుచిందించి ఇతరులను రక్షించెను. తన ప్రేమను మనకు పంచి ఇచ్చారు. మనలను క్షమించి మనకు రక్షణ భాగ్యం కల్పించారు. కాబట్టి ఆయనను ఎక్కువగా తండ్రి దీవించారు. పిలిప్పి 2: 9.

ఈనాటి సువార్త పఠనంలో దేవుడు పేతురు గారికి కాపరి యొక్క బాధ్యతలను అప్పజెప్పుతున్నారు. పేతురు గారు కూడా యేసు ప్రభువుకు సాక్షియై జీవిస్తూ తన యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నారు.

ఈ సువిశేషంలో చాలా విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. 1. మొట్టమొదటగా దేవుడు తప్పిపోయిన వారిని వెదుకుచున్నారు. క్రీస్తు ప్రభువు మరణం తరువాత శిష్యులందరు ఎవరి దారిన వారు పోయారు, భయంతో జీవించారు.  వారందరిని దేవుడు వెదకు చున్నారు. తప్పిపోయిన గొర్రెను వెదికారు, నాణెమును వెదికారు. అలాగే తప్పి పోయిన కుమారుడి కోసం ఎదురు చూశారు. ప్రభువు ఈలోక ప్రాణ భయం వలన బాధ్యతలను నిర్వహించుట మరిచిపోయిన శిష్యులను వెదకుచున్నారు. వారికి బాధ్యతలను అప్పజెప్తున్నారు.

2. యేసు ప్రభువు మనలను పాత జీవితం జీవించుటకు అంగీకరించరు.  పేతురు గారిని దేవుడు తన యొక్క సువార్త పని కోసమై పిలిచారు. మూడు సంవత్సరములు సువార్త పరిచర్య బాగానే చేశారు. కానీ క్రీస్తు  ప్రభువు యొక్క మరణం తరువాత పరిచర్య విడిచిపెట్టి  మళ్ళీ వారి యొక్క పాత పని, చేపలు పట్టుటకు వెల్లుచున్నారు. ప్రభువు దానికి అంగీకరించుటలేదు. 

మనం ఎప్పుడుకూడా  క్రొత్త జీవితం జీవించాలి. తపస్సు కాల 40 రోజుల మంచి జీవితమే ఇక మీదట  కూడా మనం కొనసాగించాలి. తపస్సుకాలంలో  మంచిగా, పవిత్రులుగా జీవించిన విధంగా ఇక మీదట అదే క్రొత్త జీవితం కొనసాగాలి. 

3. యోహను గారు,క్రీస్తు ప్రభువు  3 వ సారి దర్శనం ఇచ్చారని సువిశేషంలో అన్నారు. వాస్తవానికి ఇది నాలుగవ సారి. 1. మొదట మగ్దల మారియమ్మకు దర్శనం ఇచ్చారు. యోహను 20:11-17. 

2. శిష్యులకు దర్శనం ఇచ్చారు, అప్పుడు తోమస్సు గారు వారితో లేరు. 20:19-23. 

3. తోమస్సు శిష్యులతో ఉన్నప్పుడు 20: 26-29. 

4. ఈనాటి సువిశేషంలో శిష్యులకు ఇచ్చిన దర్శనం , ఇవన్నీ చేయుట ద్వారా ప్రభువు తాను సజీవుడని తెలుపుచున్నారు. శిష్యుల విశ్వాసం బలపరుస్తున్నారు. యేసు ప్రభువు తాను సజీవుడని శిష్యులకు తెలియచేస్తున్నారు. 

4. చేపలు పట్టే అనుభవం ద్వారా  దేవుడు మరొకసారి శిష్యులను సువార్త పరిచర్యకు పిలుస్తున్నారు. లూకా 5: 1-11 లో  మొట్ట మొదటి సారిగా యేసు ప్రభువు చేపలు పట్టే అనుభవం ద్వారా శిష్యులను తన యొక్క సేవకు పిలిచారు. 

ఈ అనుభవం ద్వారా  ప్రభువు  తాను దేవుడని తెలియపరిచారు. శిష్యులు ఆయనను ప్రభువు అని గుర్తించారు. ప్రభువు వారిని మనుష్యులను పట్టువానిగా చేశారు. ఈ అనుభవం వలన శిష్యులు సమస్తమును విడిచిపెట్టి  క్రీస్తును వెంబడించారు, ఆయన సేవ చేశారు. 

శిష్యుల యొక్క విశ్వాసమును దేవుడు అధికం చేయుటకు ఈ అద్భుతం చేస్తున్నారు. 

5. చేపలు పట్టే సమయంలో  ఆ వలలో 153 రకాల చేపలు పడ్డాయి. దీనియొక్క అర్ధం ఏమిటంటే ప్రభువు జీవించే సమయంలో కేవలం 153 రకాల చేపలే ఉండేవి. అని అన్నియు ఆయన వలలోకి వచ్చాయి.  ఆయన పునరుత్థానం తరువాత  అందరిని కూడా దీవిస్తారు, రక్షిస్తారు. 

ఈ 153 రకాల చేపలు వలలో వున్నప్పటికి వల చినగలేదు. ఎందుకంటే అవి కలసి ఉంటున్నాయి, ఐక్యంగా ఉన్నాయి. మనం కూడా అందరం కలిసి మెలిసి ఉండాలి. తిరుసభలో అనేక ప్రాంతాల వారు జాతుల వారు ఉన్నారు, అయినా అందరు ఐక్యంగానే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు. మనం కూడా కలిసి జీవించుటకే దేవుడు మనల్ని పిలిచారు ఆయన బిడ్డలమైన మనం కలసి ఉండాలి. 

6. యేసు ప్రభువు పేతురు గారిని  నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అని మూడు సార్లు అడుగుచున్నారు. మూడు సార్లు ఎందుకని మనం ఆలోచించాలి. పేతురు ప్రభువును మూడు సార్లు నిరాకరించారు. అందుకే మూడు సార్లు అడిగారు. ఇది ఒక వివరణ. 

రెండవది ఏమిటంటే గ్రీకు భాషలో ప్రేమకు మూడు అర్ధాలు ఉన్నాయి. 1. philia - స్నేహితుల మద్య ఉన్న ప్రేమ 2. eros - ప్రేమికుల మధ్య , భార్యభర్తల మధ్య ఉండే ప్రేమ, 3. agape - త్యాగ పూరితమైన ప్రేమ ,ప్రాణాలిచ్చే ప్రేమ. ప్రభువు పేతురు నుండి కోరినది మూడవ ప్రేమ , ఆయన సేవ కోసం  ప్రాణాలిచ్చే ప్రేమ పేతరు నుండి ప్రభువు కోరారు. 

మూడవదిగా పేతురును మూడు సార్లు ఎందుకు అడుగుచున్నారంటే, పేతురు నీవు నన్ను -పూర్ణ హృదయం , పూర్ణ మనస్సుతో , పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావా అని అర్ధం. హృదయం, మనస్సు , ఆత్మతో ప్రేమిస్తే అది సంపూర్ణంగా ఉంటుంది. 

పేతురు పశ్చాత్తాప పడి ఈ మూడు విషయాలకు ఒప్పుకొనుట ద్వారా దేవుడు మళ్ళీ అతన్ని నాయకునిగా ఎన్నుకొంటున్నారు. దేవుని యొక్క గొర్రెలను మేపమంటున్నారు. ఆయన ప్రభువు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతున్నారు. 

ఈనాటి సువిశేషంలో  ప్రభువు రెండు ఉదాహరణలు వాడుచున్నారు. 1. చేపలు పట్టటం 2. గొర్రెలు చూచుకొనుట. 

ప్రతి ఒక్క సువార్త సేవకులు మొదటిగా దేవుని యొక్క వాక్కుచే ప్రజలను పట్టుకోవాలి. తరువాత దేవుని మందను పరలోక మార్గం వైపు నడిపించాలి. 

పేతురు గారు ప్రాణ భయంతో క్రీస్తు ఎవరో తెలియదు అని చెప్పాడు. అయినా ప్రభువు యొక్క పునరుత్థాన అనుభవం ద్వారా  తన జీవితం మార్చుకున్నాడు. ఆయనకు సాక్షిగా జీవించాడు. తాను వేద సాక్షిగా మరణం పొందాడు. క్రీస్తు ప్రభువు యొక్క సేవ చేశాడు. 

దేవుని సేవలో నిజమైన ఆనందం కనుగొన్నారు. ప్రభువుకు విధేయులై జీవించారు. మనం దేవునికి సాక్షులై జీవించాలి. 

Rev. Fr. Bala Yesu OCD


22, ఏప్రిల్ 2022, శుక్రవారం

పాస్క కాలపు రెండవ ఆదివారం

పాస్క కాలపు రెండవ ఆదివారం

 క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ! ఈనాడు మనందరం  కూడా పాస్కకాలపు రెండవ  ఆదివారం లోనికి ప్రవేశించి ఉన్నాం. అయితే ఈనాటి సువిశేష  పఠనం ద్వారా దేవుడు మనకు  5 విషయములను తెలియజేస్తున్నాడు. 

1. పునరుత్థాన యేసు ప్రభువు  శాంతి నొసగుచున్నాడు 

2. పునరుత్థాన యేసు ప్రభువు తనను తాను తెలియ పరుచుకుంటున్నాడు. 

3. తన చిత్తాన్ని శిష్యులకు తెలియ పరుస్తున్నాడు. 

4. పవిత్రత్మశక్తిని వారికి ఇస్తున్నాడు. 

5. దేవునికి సాక్షులుగా జీవించడానికి వారిని ఆహ్వానిస్తున్నాడు. 

1. శాంతినొసగుట 

యేసు ప్రభువు  పునరుత్థానుడైన తరువాత తన శిష్యులు ప్రాణ భయంతో , యూదులు వారిని చంపి వేస్తారేమో అని  తలంచి వారు ఒక ఇంటిలో ప్రవేశించి తలుపులు మూసుకొని జీవించారు. ప్రాణ భయంతో  జీవించారు. ప్రాణ భయంతో  తలుపులు మూసుకొని జీవించిన శిష్యుల జీవితాలలోకు పునరుత్థానుడైన యేసు క్రీస్తు వస్తున్నాడు. వారివద్దకు రావడమే కాదు. వారికి శాంతి నొసగుచున్నాడు. పునరుత్థానుడైన  యేసు క్రీస్తు మనతో ఉన్నడని మనం నిజంగా విశ్వసిస్తే , నీవు ఈలోకంలో జరుగు ఏ విపత్తుకు, నీ జీవితంలో ఏ విషయానికి దిగులు చెందక భయపడక ధైర్యం గా వుంటావు. యోహాను 20:20. లో చూస్తే  ప్రభువుని చూచిన వారు ఆనందించిరి, అని వ్రాయబడినది. కానీ 19 వ వచనంలో చూస్తే యూదుల భయముచే శిష్యులు ఒక చోట  తలుపులు మూసుకొని ఉండిరి. ఇక్కడ యూదులను చూసి భయ పడితే, అక్కడ యేసుని చూసి ఆనందించారు. మత్తయి 10:28 "శరీరమును మాత్రము నాశనము చేయ గలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. శరీరమును, ఆత్మను కూడా నాశనము చేయ గల వానికి భయపడుము." అని చాటుతున్నది.

 మనం జీవితంలో కూడా ఇది పాటించినట్లయితే  ఈలోకంలో ఎవరికి భయపడకుండా దేవుని శాంతిలో మనం జీవించగలుగుతాము. 

2. తనను తాను తెలియపరుచుకొనుట 

ఇక్కడ యేసు క్రీస్తు యొక్క కర్తవ్యం గూర్చి తెలుపబడుతుంది. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తన స్వార్ధం కోసం కాదు. మరి ఎందుకు  పంపబడ్డాడు అంటే అందరిని ప్రేమించి,  వారికి రక్షణ ఇవ్వడానకి. యోహను 3:17. దేవుడు తన కుమారుని ఈ లోకమునకు రక్షించడానికి పంపేనె కానీ దానిని ఖండించడానికి పంపలేదు. మరి ఈనాడు యేసు ప్రభువు కూడా తన శిష్యులను కూడా అదే చేయమనుచున్నాడు. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. యోహను 20:21. ఎందుకు దేవుడు తన శిష్యులను తన పనిని, కర్తవ్యాన్ని నెరవేర్చడానికి పంపుచున్నడంటే, యోహను 14:34 లో మనం చూస్తాము, ప్రభువు చెప్పేది ఏమిటంటే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరి నొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. యోహను 6:57 . జీవము గల తండ్రి నన్ను పంపేను. 

3. తన చిత్తాన్ని వారికి తెలియ పరుస్తున్నాడు. యోహను 20:21 

యేసు చిత్తము ఏమిటంటే 1. ఒకరి నొకరు ప్రేమించుకోవాలి. యోహను 14:34 

2. ఒకరినొకరు క్షమించుకోవాలి యోహను 8:10 

3. ఒకరినొకరు రక్షించుకోవాలి లూకా 19:10 

4. ఒకరికొకరు ప్రార్ధన చేసుకోవాలి. లూకా 6:12 . నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. యోహను 20: 2 

4. పవిత్రత్మ శక్తిని వారికంధిచుట 

యోహను 14:18 నేను మిమ్ము అనాధులుగా విడిచి పెట్టను. నేను మీ ముద్దు వత్తును. ఈనాటి సువిశేషంలో దేవుడు తన  వాగ్ధానాన్ని తెలియపరుస్తున్నాడు. 

రెండవ పఠనంలో కూడా చూస్తే పవిత్రత్మ పొందిన శిష్యులు గొప్ప గొప్ప ప్రార్ధనలు చేస్తున్నారు. పేతురు నడుచుచున్నప్పుడు అతని అంగీని నీడన పడిన చాలు అని విశ్వసించిన ప్రజలు ఎప్పుడైతే శిష్యులు ఈలోక relationship ను తృణీకరిస్తున్నారో వారు   పవిత్రత్మ శక్తి ద్వార ఎన్ని అద్భుతాలు చేశారు. 

ఈ శక్తి ద్వార ఎంతో మంది విశ్వాసులు స్వస్థతను పొందుతున్నారు. నూతన విశ్వాసులుగా మారుచున్నారు. యోహను 20: 24. 

5. దేవునికి సాక్షులుగా వుండటానికి వారందరికీ ఆహ్వానిస్తున్నాడు. 

ఎలా మనం సాక్షులుగా మారుతం అంటే , మనల్ని మనం పూర్తిగా సమర్పించుకొనుటచే దేవునికి సాక్షులలుగా జీవించడానికి అలా చేశారు. ఎవరి పాపములైన  మీరు క్షమిస్తే వారి పాపములు క్షమించబడతాయి. మనం ఎప్పుడైతే ఇతరుల పాపములను క్షమిస్తామో అప్పుడు మనం దేవుని యొక్క సాక్షులుగా జీవిస్తాం. 

కాబట్టి ఈనాడు నీవు నేను ఈ లోకంలో ఉన్న వస్తువులకు , వ్యక్తులకు ,ఇబ్బందులకు బయపడకుండా దేవునికి భయ పడాలి. ఆయన పిలుపుని పొందిన మనం ఆయనను అనుసరించు వారీగా జీవించాలి. ఆ దేవాతి దేవుడినికి  ఒక గొప్ప సాక్షిగా మారి దేవుని ప్రేమను నీవు నేను అందరికి అందేలా చేయాలి. 

Br. Joseph mario 

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...