14, మే 2022, శనివారం

పాస్క కాలపు 5 వ ఆదివారం (2)

 అపో 14:21-27, దర్శన 21:1-5, యోహను 13:31-35 

ఈనాటి దివ్య పఠనాలు నూతనమైన విషయములను గురించి  భోధిస్తున్నాయి. క్రొత్త దివి, క్రొత్త భువి , క్రొత్త ఆజ్ఞ  అనే విషయాలు గురించి తెలియజేస్తున్నాయి. 

క్రొత్త  దనం మనందరిలో ఉండాలి, మన  యొక్క పాత జీవితమను విడిచి పెట్టి దేవునిలో క్రొత్త జీవితం ప్రారంభించాలి. 

ఈనాటి మొదటి పఠనంలో  పౌలు, బర్నబాలు, దెర్బా అను ప్రాంతంలో సువార్త ప్రకటన చేసిన తరువాత అనేక మందిని  నూతనంగా దేవుని శిష్యులుగా చేశారు. సువార్త ప్రకటన కోసం క్రొత్త వారిని ఎన్నుకోంటున్నారు. 

పౌలు గారు అక్కడ ప్రజల విశ్వాస  జీవితములను బలపరుస్తున్నారు. ఈ లోకంలో ఎదురయ్యే కష్టములకు, శారీరక శ్రమలకు, భయపడకుండా దేవుని యందు విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారిని ప్రోత్సహించారు. 

జ్ఞాన స్నానం పొందిన వారు, క్రీస్తు ప్రభువును అంగీకరించినవారు, విశ్వాసంలో  స్థిరంగా ఉండాలని తెలిపారు, అధేవిధంగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలు అనుభవించాలని తెలిపారు. 

ఎందుకు వారి విశ్వాసాన్ని  ప్రోత్సహిస్తున్నారంటే, వారు నూతనంగా ప్రభువును వెంబడిస్తున్నారు, కాబట్టి ఆదిలోనే కష్టాలు వస్తే, విశ్వాసాన్ని విడిచిపెడతారని పౌలుగారు వారిని ప్రోత్సాహిస్తున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. 

శ్రమల ద్వారా క్రీస్తు ప్రభువు తండ్రిని మహిమ పరిచారు. అలాగే ప్రతి ఒక్కరు తమ యొక్క శ్రమల ద్వారా దేవున్ని మహిమ పరచాలని తెలిపారు. మనం పొందే శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. 1 పేతురు4:1. 

జీవమునకు పోయే మార్గం ఇరుకైనది.  మత్తయి 7:14. శ్రమలు అనుభవించుటకు భయపడకూడదు. 1 పేతురు 3:14,  2 కోరింతి 4:17. 

దేవుని వలె జీవించాలనుకునే వారు కష్టాలకు  గురి అగుతారు. 2 తిమోతి 3:12. 

విశ్వాసులు నూతనంగా క్రీస్తును నమ్ముకోంటున్నారు. కాబట్టి ముందుగానే పౌలుగారు వారికి అన్నీ విషయాలు తెలుపుచున్నారు. 

క్రీస్తు విశ్వసించిన  వారిని ఒక సంఘంగా చేసి పెద్దలను నియమించి నూతన సేవకులను, విశ్వాసులను  తయారుచేశారు. 

ఈ మొదటి పఠనం ద్వారా పౌలుగారు మరియు బర్నబాగారు ,చేసిన సువార్త ప్రకటన గురించి  ధ్యానించాలి. ఎంతో కష్టపడి ఒక నూతన దైవ సంఘంను ఏర్పరిచారు. 

వారు నిస్వార్ధంతో, త్యాగంతో ప్రేమతో సువార్త వ్యాప్తికరణ చేశారు. అధే విధంగా మనం కూడా నూతనంగా సువార్తికరణ చేయాలి. 

ఈనాటి రెండవ పఠనంలో రాబోయే క్రొత్త దివి, భువి,స్వర్ణ యుగం గురించి యోహను గారు ఒక దర్శనం చూసారు. 

ఈ దర్శన గ్రంధం వ్రాయబడినది, ప్రత్యేకంగా   హింసలకు గురియైన విశ్వాసుల కోసం, వారికి  ఒక క్రొత్త భువిని, దివిని దేవుడు ఏర్పరుస్తున్నారు అని వారి విశ్వాసాన్ని ప్రోత్సహించుటకు యోహను గారు ఈ విషయాలు వ్రాస్తున్నారు. 

దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన కంటికి అంతయు బాగుగా ఉండెను. ఆది 1:31. 

దేవుడు సృష్టిని చేసినప్పుడు అంతయు శాంతియుతముగా ఉన్నది, ఎటువంటి చీకుచింతలకు చోటు లేదు, దుఃఖానికి తావులేదు. అలాగా  అంతా బాగుగా ఉన్న సృష్టిలో మానవుని యొక్క పాపం వలన  మచ్చ ఏర్పడింది, అనర్ధాలు ఆరంభమైనాయి. 

పాపం చేయడం వలన క్రమ క్రమేణా మానవ జీవితం క్షీణించిపోయినది. మరణం వచ్చింది. సృష్టిలో ఉన్న జంతువులు, ఒక దానిని  ఒకటి చంపుకొనుట ప్రారంభమైనది, మానవుల మధ్య గొడవలు ప్రారంభమైయాయి. అధే విధంగా ఈ లోకంలో అన్యాయం, అక్రమం , వ్యాధులు, హింసలు, బానిసత్వం, బాధలు ఉన్న సమయంలో ప్రజలు ఒక క్రొత్త భువికై , దివికై ఎదురు చూసారు. 

దేవుడు మరలా ఒక నూతన సృష్టిని చేస్తాడని కాలగన్నారు. యిస్రాయేలు ప్రజలు ఈ విషయంను ధృడంగా నమ్మారు , భావించారు. 

ప్రవక్తలు కూడా ఒక క్రొత్త యుగం  గురించి ప్రకటించారు. యోషయా 65:17, ఇదిగో నేను ఒక క్రొత్త ఆకాశమును, భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకం రావు అని ప్రభువు తెలియచేసారు. 

క్రీస్తు ప్రభువు యొక్క రాకతో పాపం తొలగించబడి, ఒక క్రొత్త  భువి, దివి ఏర్పడినది. ఆయన యొక్క మరణ, పునరుత్థానం ద్వారా సైతాను శక్తులు నశించాయి, యేసు ప్రభువు మానవాళికి నూతన జీవంను ప్రసాదించారు. 

యేసు క్రీస్తును విశ్వసించి ఆయనతో ఏకమై మరణించువాడు ఆయనతో శాశ్వత జీవితానికి లేస్తాడు, పునరుత్థానుడైన యేసు క్రీస్తు జీవాన్ని పొందిన మనం, ఈ క్రొత్త దివికి భువికి నూతన యెరుషలేము పట్టణ నిర్మాణానికి కృషి చేయాలి. 2 పేతురు 3:3-22. 

ప్రతి వ్యక్తి కూడా నూతనత్వంను  కలిగి జీవించాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు నూతన ఆజ్ఞ గురించి భోధిస్తున్నారు. 

యేసు ప్రభువు కడసారిగా తన యొక్క శిష్యులతో మాట్లాడిన మాటలు, ప్రభువు కడరాత్రి భోజనం భుజించిన తరువాత  శిష్యులతో విలువైన మాటలు పలికారు. 

ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరుపబడ్డాడు. 

నేను కొంత కాలము మాత్రమే మీతో ఉందును. 

ప్రేమ అనే నూతన ఆజ్ఞను పాటించి జీవించుడు, అనే మూడు మాటలు చాలా విలువైనవి. 

మనుష్య కుమారుడు మహిమ పరుపబడ్డాడు. ఎందుకంటె తండ్రిని సంపూర్ణంగా విధేయించాడు. ఆయన యొక్క  చిత్తంను  నెరవేర్చారు. 

అనేకుల రక్షణ కొరకు సిలువ శ్రమలు అనుభవించబోతున్నాడు. 

మరణించిన తరువాత సిలువ నుండి లేవ నెత్త బడుతారు. అది నిజమైన మహిమ పరపబడటం. ప్రభువు మానవ- దైవ స్వభావంతో తండ్రిని నిత్యం మహిమ పరిచారు. అలాగే కుమారుడిని  తండ్రి ఆయన చేసిన ప్రతి పనిని అంగీకరిస్తూ మహిమ పరిచారు. 

ప్రభువు జీవితం మానవునిగా కొంత కాలం మాత్రమే, అందుకే ఇక మీరు నన్ను చూడజాలరు అని పలికారు. ఆయన శ్రమలు అనుభవించుటకు, రక్షణ కార్యము ముగించుటకును, తండ్రి చెంతకు వెళ్ళుటకు సమయం ఆసన్న మగుచున్నది. కాబట్టి ఇక మీరు నన్ను చూడ జాలరు అని ప్రభువు అంటున్నారు. 

ప్రభువు శిష్యులకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నారు. అది అందరు తమ జీవితంలో అనుసరించాలి. ఇది ఒక ఆజ్ఞ, శాసనం అందరు కూడా తప్పని సరిగా పాటించాలి. 

ఈ ప్రేమ ఆజ్ఞ వాస్తవానికి పాత ఆజ్ఞయే, ఎందుకంటే లెవీ 19:18 లో మీరు పరస్పరం ప్రేమ కలిగి జీవించాలి అని  చెప్పబడింది. 

ఎందుకు  ఇది నూతన ఆజ్ఞ అయిందంటే, క్రీస్తు ప్రభువు అంటున్నారు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరి నొకరు ప్రేమించుకొనుడు. 

మన పట్ల దేవుడు ఎలాంటి ప్రేమ చూపించారు అన్నది మనం ధ్యానించుకోవాలి. 

దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. మన పట్ల ఆయన చూపే ప్రేమ - సంపూర్ణ మైనది, స్నేహ పూర్వకమైనది, కనికరం కలిగినది, పవిత్రమైనది, నిజమైనది, నిస్వార్ధమైనది. 

మనలో దేవుడు చూపించిన ప్రేమ రావాలంటే పాతది పోవాలి. 

క్రొత్తది రావాలి. ఆయన ప్రేమ కేవలం మాటల్లో పలికిన ప్రేమ మాత్రమే కాదు, అది చేతుల్లో చూపించే అంత ప్రేమ. 

ఎవరు చూపించలేనంత ప్రేమ, క్రీస్తు ప్రభువు మనకు చూపించారు. అందులో నూతనత్వం ఉంది. ప్రవక్తలు చూపించలేనటువంటి దైవ ప్రేమ, రాజులు వ్యక్త పరచలేనటువంటి ప్రభుని ప్రేమ, కేవలం క్రీస్తు ప్రభువే చూపించారు. 

పౌలు గారు క్రీస్తు ప్రభువుని ప్రేమ తెలుసుకొన్న వ్యక్తి అందుకే 1 కోరింథీ 13 లో ఆయన ప్రేమకు ఉన్న గొప్ప తనం వివరించారు. 

క్రీస్తు ప్రభుని ప్రేమ విశాలము, ఉన్నతము . ఎఫెసీ 3:18. 

యేసు ప్రభువు ప్రేమలో ఉన్న  నూతనత్వం. 1. ఆయన ప్రేమ సేవతో కూడిన ప్రేమ- ప్రభువు ఈ లోకంలో చేసిన సేవ, ప్రేమతో కుడినసేవ . మత్తయి 20:28. శిష్యుల యొక్క పాదాలు కడిగి తన యొక్క అత్యున్నత ప్రేమ చూపించారు. 

2. ఆయన ప్రేమ క్షమించే ప్రేమ : ఎన్ని పాపాలు చేసినా సరే ఎంత  బాధ పెట్టినా సరే , ఎంతగా హేళన చేసిన, నిందించినా కానీ ప్రభు అందరిని  క్షమించారు. లూకా 23:34. 

దేవుని ప్రేమ ఎంతో క్షమను కలిగి ఉంది. 

స్నేహితులనుకునే అపోస్తులులే మోసం చేసిన సరే, వారిని క్షమించారు. ప్రభువును అర్ధం చేసుకోకపోయిన వారిని క్షమించారు. 

3. ఆయన ప్రేమ అర్ధం చేసుకొనే ప్రేమ - యోహను 21:15. ప్రభువు అందరి యొక్క వ్యక్తిత్వములు అర్ధం చేసుకున్నారు. వివిధ రకాల మనస్తత్వాలు, ఆలోచనలు , ఉన్న శిష్యులను వ్యక్తిగతంగా వారిలో ఉన్న ప్రతికోణం అర్ధం చేసుకొని ప్రేమించారు. 

మనం కొంత మందితో జీవిస్తే తెలుస్తుంది వారి గురించి. యేసు ప్రభువు అనేక రోజులు అనేక నెలలు శిష్యులతో, ప్రజలతో , శత్రువులతో కలసి తిరిగినప్పుడు వారిని వారిలాగా అర్ధం చేసుకొని ప్రేమించారు. 

ప్రతి ఒక్కరి బలహీనతలను , పాపములను ప్రభువు అర్ధం చేసుకొని ప్రేమించారు. 

4. ఆయన ప్రేమ త్యాగ పూరితమైన ప్రేమ -యోహను 15:13. తన యొక్క స్నేహితుల కొరకు ప్రాణాలు సమర్పించారు. ఇతరుల కొరకు జీవితంను త్యాగం చేసిన ప్రేమ స్వరూపి. 

సీలువను మోసారు, ప్రాణమిచ్చారు. తన చెంత ఉన్న ప్రతిదీ  మన కోసం త్యాగం చేశారు. 

5. ఆయన ప్రేమ నిస్వార్ధ ప్రేమ - ఎటువంటి ఫలితం కూడా ఇతరుల నుండి  ఆశించకుండా  ప్రభువు ప్రేమించారు. యోహను 3:16. తన సొంత లాభం పొందటం కోసం , మెప్పు పొందటం కోసం ఎవ్వరిని ప్రేమించలేదు. 

6. ఆయన ప్రేమ ఎల్లలు లేని ప్రేమ - ఎటువంటి హద్దులు లేవు. ఆయన మన యొక్క అందం, ఎత్తు , డబ్బు, మొదలగునవి చూసి ప్రేమించరు, మనల్ని ఎటువంటి తరతమ్యం లేకుండా ప్రేమించారు. 

ప్రేమకు ఉన్న శక్తి ఈ లోకంలో దేనికి లేదు. అందుకే పౌలుగారు ప్రేమ సమస్తమును , భరించును, జయించును అని పలికారు. 1 కోరింథీ 13:7. ప్రేమ బలహీనులను బలవంతులను చేస్తుంది. సామాన్యులను గొప్ప వారిగా, చెడ్డ వారిని మంచి వారిగా చేస్తుంది. 

మనందరం కూడా ప్రేమించుట ద్వారానే యేసు ప్రభువుని శిష్యులం  అవుతున్నాం. కాబట్టి దేవుడు చూపించిన నూతన ప్రేమ మనందరం కలిగి జీవిద్దాం. 

Rev. Fr. Bala Yesu OCD 

7, మే 2022, శనివారం

పాస్క నాలుగవ ఆదివారం

మంచి కాపరి 

ఈనాటి ఆదివారం మంచి కాపరి ఆదివారం అని పిలుస్తారు. యేసు ప్రభువు తాను ఒక మంచి కాపరి అని ఎరుక పరుస్తూ ఒక కాపరిలాగా తన మంద కోసం ఎలాగా శ్రామిస్తారో తెలుపుచున్నారు. 

యేసు ప్రభువు మంచి కాపరిగా సంభోదించుకుంటూ తనకు మరియు ప్రజలకు మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలను గురించి తెలుపుచున్నారు. ఈరోజు క్రీస్తు ప్రభువుని ఒక మంచి కాపరిగా మనం గ్రహిస్తూ, ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు మనం ధ్యానించుకోవాలి. 

పవిత్ర గ్రంధంలో  మనం చాలా మంది కాపరులను చూస్తున్నాం. ఆబేలు గొర్రెల కాపరియే-ఆది 4:2. అబ్రహాము గొర్రెల కాపరియే , ఇస్సాకు, యాకోబులు కూడా గొర్రెల కాపారులే. వీరితో పాటు మోషే ప్రవక్త , దావీదు రాజు సైతం గొర్రెలను కాసినవారే. 1 సమూ 17:36. ఆమోసు ప్రవక్త కూడా గొర్రెల కాపరియే. ఆమోసు 7:14. 

వీరితో పాటు పాత నిబంధన గ్రంధం లో  దేవుడు తనను తాను కాపరిగా , మంచి కాపరిగా సంబోదించుకుంటున్నారు. యెహే34:11-31. 

కాపరులలో మంచి వారున్నారు అధే విధంగా చెడ్డ వారున్నారు. యిర్మియా ప్రవక్త చెడ్డ కాపరులను గురించి తెలుపుచున్నారు. యిర్మియా 23:1-2. 

మనందరం కూడా కుటుంబ కాపరులం, సంఘ కాపరులం, దేశ కాపరులం మనకు దేవుడు నిజమైన కాపరి. ఆయన్ను మనం అనుసరించాలి. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు పౌలుగారికి , బర్నబాసు గారికి అప్పజెప్పిన కాపరి బాధ్యతలను గురించి చదువుకున్నాం. 

వీరిని యేసు ప్రభువు అన్యులకు సువార్తను ప్రకటించుటకు ఎన్నుకొన్నారు. పౌలు యూదులతో సంభాషించిన వేళలో వారు ఆయన్ను అంగీకరించలేదు. అందుకే పౌలు గారు వారితో దేవుని వాక్కు మొదటిగా మీకు చెప్పవలసి ఉండెను,కాని మీరు దానిని తిరస్కరించిరి, మిమ్మల్ని మీరు నిత్య జీవమునకు అయోగ్యులను చేసుకున్నారు అని పలికెను.46 వ వచనం. 

మొదటి ప్రాముఖ్యతను దేవుడు యూదులకే ఇచ్చారు కాని వారు  దానిని తృణీకరించారు. పౌలుగారు మాత్రము ఎవ్వరు తృణీకరించినా సరే, దేవుని యొక్క వాక్కును వెలుగెత్తి చాటారు. అది కాపరి యొక్క లక్షణం. తనను నియమించిన పని కోసం ప్రాణములు సైతం ఇవ్వటం కాపరి యొక్క పని. 

పౌలు గారిని అన్యులకు అపోస్తులుడు అని పిలుస్తారు. apostle of  gentiles. ఆయన అనేక సంవత్సరములుగా అన్యులకు దాచబడిన , తెలియని క్రీస్తు ప్రభువు గురించి ప్రకటించిన వ్యక్తి. 

సువార్త వ్యాప్తి కోసం ఆయన అనేక హింసలకు గురి అయ్యాడు. శ్రమలు అనుభవించారు. అపో 21: 27,30,23:3, 27:41,22:22, 27,42,26:24. 

ఎన్నెన్నో ఆయన తన యొక్క పరిచర్యలో ఎదుర్కొని ముందుకు సాగి తన యొక్క కాపరి యొక్క బాధ్యతలను నెరవేర్చారు. 

పౌలు గారు మరియు బర్నబాసు గారు దేవుని యొక్క స్వరమును ఆలకించారు. 47 వ వచనం. దేవుడు వారిని అన్యులకు వెలుగై ఉండుడు అని చెప్పిన మాటను ఆలకించి ఆయన ప్రకారం నడుచుకున్నారు. 

యేసు ప్రభువు మొదటిగా పౌలును సువార్త పరిచర్యకు ఎన్నుకొన్న సందర్భంలో కూడా దేవుని యొక్క స్వరంను ఆలకించి హృదయ పరివర్తనం చెందుతున్నారు. అపో 9: 4. 

సువార్తను అంగీకరించిన చోట వారు ఆనందంగా వాక్యంను ప్రకటించారు. అంగీకరించని చోట కాలి దూలిని వారికి నిరసనగా దులిపి వేశారు. తమ యొక్క సేవలో వారు ఎల్లప్పుడు దేవుని యొక్క పవిత్రాత్మతో నిండి ఉన్నారు. 

ఒక కాపరిగా పౌలుగారు తన యొక్క బాధ్యతలను అన్నీ సక్రమంగా నెరవేర్చారు. తన మందకోసం క్రీస్తు ప్రభువు వలె ప్రాణాలు సమర్పించారు. 

రెండవ పఠనంలో యోహను గారు గొర్రె పిల్లను గురించి చూసిన దర్శనంలో  క్రీస్తును మంచి కాపరిగా గుర్తించి ఆయన తన యొక్క ప్రజల కోసం ప్రాణాలు సమర్పించిన గొర్రెపిల్ల అని తెలుపుచున్నారు. 

ఈనాటి రెండవ పఠన ప్రారంభ వచనాలలో క్రీస్తు సేవ కొరకు శ్రమలు అనుభవించే వారి గురించి తెలుపుచున్నారు. యోహను గారు హింసలకు గురి అయిన క్రైస్తవులను ప్రోత్సహించుటకు ఈ యొక్క సత్యమును వివరించారు. 

దేవుని కొరకు ప్రాణాలు అర్పించినవారు ఆయన సన్నీదిలో సేవ చేస్తారు. వారు రక్షణను పొందుకుంటారు. 

గొర్రె పిల్లయె కాపరి యగును, వారి కష్టాలను, బాధలను తొలగించును. ఈ కాపరి  తన యొక్క మందను జీవ జలము వద్దకు తీసుకొనిపోవును. కీర్తన 23. యోషయా 40:11, యెహే 34:23, యిర్మీయా 2:13. 

సువార్త పఠనంలో యేసు ప్రభువు తన గొర్రెలు తన స్వరమును వినును అని చెప్పెను. యోహను సువార్త 10 వ అధ్యాయం మొత్తం కూడా గొర్రెల కాపరి గురించి మరియు గొర్రెల గురించియే. 

కేవలం దేవుడిని మాత్రమే మంచి కాపరి అని పిలుస్తాం. ఎందుకంటే ఆయన గొర్రెలను మేపుతారు, సంరక్షిస్తారు, నేర్పిస్తారు, కాపాడుతారు, వాటికి అవసరమైనవి అన్నీ సమకూర్చుతారు. పాత నిబందన గ్రంధం లో  యావే దేవున్ని మంచి కాపరి అని సంభోదించారు. యెహే 34 వ అధ్యాయం. 

నూతన నిబందన గ్రంధంలో క్రీస్తు ప్రభువును యోహనుగారు మంచి కాపరి అని సంభోదిస్తున్నారు. యోహను 10. 

యేసు ప్రభువు నా గొర్రెలు నా స్వరమున వినును అని తెలుపుచున్నారు.  ఇంతకీ ఎవరు ఆయన గొర్రెలు ? జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క గొర్రె. 

గొర్రె తన యొక్క స్వరమును వినును అని అన్నారు. జ్ఞాన స్నానం పొందిన అందరు ఆయన స్వరమును ఆలకించారు, కేవలం కొందరు మాత్రమే ఆయన స్వరమును ఆలకించుతారు. 

సృష్టి ప్రారంభం నుండి మంచి కాపరి అయిన దేవుడు తన ప్రజలను పిలుస్తూనే ఉన్నారు, భోదిస్తూనే ఉన్నారు. అలాగే వారికి నేర్పిస్తూనే ఉన్నారు. అయితే కొంత మంది మాత్రమే కాపరి స్వరంను ఆలకించారు. 

ఆదాము అవ్వ దేవుని స్వరంను వినలేదు. దాని ఫలితంగా శ్రమలు అనుభవించారు, ఏదేను తోట నుండి బయటకు పంపివేయబడ్డారు. 

సౌలు దేవుని స్వరంను వినలేదు. దాని ఫలితముగా తన యొక్క రాజ్య బాధ్యతలను కోల్పోయాడు. 1 సమూ 13:12-13. 

లోతు భార్య  దేవుని స్వరమును ఆలకించకుండా వెనుకకు చూసింది ఆది 19 :26 . ఆమె ఉప్పు కంబంగా మారిపోయాను. 

నెబుకద్నెసరు దేవుని స్వరం ఆలకించలేదు. దాని ఫలితంగా శిక్షను అనుభవించాడు. దానియేలు 4: 17-37. 

పవిత్ర గ్రంధంలో చాలా మంది ఆయన స్వరమును వినలేదు. దాని ఫలితముగా వరాలు అనేక  కోల్పోయారు. శిక్షను పొందుకున్నారు. 

ప్రభువు యొక్క స్వరము విన్నవారు అధికంగా దీవించబడ్డారు. 

అబ్రహామును  దేవుడు దీవించారు ఎందుకంటే విన్నాడు కాబట్టి . మోషేను దీవించారు ఎందుకంటే ఆయన స్వరంను ఆలకించారు. ఏలియాను దీవించారు అలాగే మరియమ్మ గారిని ఎన్నుకొన్నారు తన తల్లిగా ఎందుకంటే ప్రభుని స్వరంను విన్నారు  కాబట్టి. 

కాపరి పిలిచినప్పుడు కేవలం  తన మందే పలుకుతుంది. జవాబిస్తుంది. అందరి స్వరాన్ని అవి ఆలకించావు , అనుసరించవు ఎవరు పిలిస్తే వారి వెంట పోవు. 

గొర్రెలు తమ కాపరి స్వరం విని, అతనితో ఉండి ప్రమాదాల బారి నుండి సంరక్షణ పొందునట్లు మనం కూడా కాపరియైన దేవుని స్వరం విని నడుచుకుంటే మన జీవితాలు సంతోష దాయకంగా ఉంటాయి. 

కాని మనం దేవుని యొక్క స్వరంను అలకించకుండా పెడ చెవిన  పెడతాం. యిస్రాయేలు ప్రజలు కూడా అనేక సార్లు  దేవుని యొక్క ప్రవక్తల మాటలను  పెడచెవిన పెట్టి శిక్షింప బడ్డారు. 

దేవుని స్వరం అంటే కేవలం మానవునిగా ఆయన  నోటినుండి వెలువడిన మాటల శబ్దం మాత్రమే కాదు. ఆయన గురించి తెలిపే స్వరం అనగా ఆయన జీవిత మార్గం , జీవితం, భోధనం, సందేశం , మరణం, పునరుత్థానం తెలిపేది. 

నిజంగా మనం జీవితంలో దేవుని స్వరం కాని ,పెద్దలు స్వరం కాని విని అనుసరిస్తే అందరం బాగుంటాం . 

రెండవదిగా ప్రభువుకు తన యొక్క మందలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలుసు. మనకు ఆయన తెలిసిఉండకపోవచ్చు. కాని ఆయనకు మాత్రం మనం బాగా తెలుసు. మన యొక్క పేరును దేవుడు  తన యొక్క అరచేతిలో చెక్కుకున్నారు. యోషయా 49: 16. మనందరం ఆయనకు బాగా గుర్తున్నవారమే. 

మంచి కాపరి ఈ గొర్రెలను అన్నింటిని సక్రమంగా చూసుకుంటారు. 

1. గొర్రెలకు కాపరి నిత్యజీవితం ప్రసాదిస్తారు. యోహను 10:10 

2. గొర్రెలు నాశనం కాకుండా వాటిని భద్రంగా చూసుకుంటారు. వాటి యొక్క ఎదుగుదలకై అనునిత్యం కృషి చేస్తాడు కాపరి.  యోహను 3:16. 

3. కాపరి కనుసన్నలలోనే గొర్రెలు ఉంటాయి. ఎవరు  వాటిని ఆయన చేతి నుండి తీసుకొనలేరు. యోహను 6: 37-39. 

4. ఈ గొర్రెలకు రెండు రకాలైన భద్రత కలుగుతుంది ఒకటి కాపరి దగ్గర నుండి రెండవది యాజమానుడి దగ్గర నుండి.  ఇద్దరు దేవుడే కాబట్టి మనకి రెండు రకాలైన రక్షణ దొరుకుతుంది. మన జీవితానికి యజమానుడు దేవుడే, ఆయనే మనల్ని సృష్టించారు, నడిపిస్తున్నారు. 

5. గొర్రెలు ఎప్పుడు కూడా కలసి జీవిస్తాయి. ఒక దాని వెనుక ఒకటి వెళతాయి అవన్నీ ఎప్పుడు ఒక మందలాగే ఉంటాయి. 

మన దేవుడు మంచి కాపరి మనం ఆయన స్వరం విని నడుచుకుంటె మనకు అంతా మేలే కలుగుతుంది. 

ఈరోజు ప్రతి కాపరి కోసం ప్రార్ధించాలి, మనందరికి ఇచ్చిన కాపరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుదాం. 

Rev. Fr. Bala Yesu OCD 

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...