11, ఫిబ్రవరి 2023, శనివారం

 

సామాన్య ఆరవ ఆదివారం

సిరాకు 15:15-20

1  కొరింతి 2:6-10

మత్తయి 5:17-37


ఈనాటి దివ్య పఠనాలు మానవులు తమ యొక్క జీవితంలో స్వేచ్ఛ వలన ఎంపిక చేసుకునే విషయాల గురించి బోధిస్తున్నాయి.

మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చారు, తన యొక్క స్వేచ్ఛలో ఏది మంచిదో, ఏది చెడో  తెలుసుకొని సరియైనది ఎంచుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే జీవితంలో ప్రధానమైన అంశం ''ఎంపిక చేసుకోవటం'' ఏది ఎన్నుకోవాలో అనే అంశాల గురించి చెప్పుతూ ఉన్నవి.

చాలా సందర్భాలలో స్వేచ్ఛనిచ్చినప్పుడు, దానిని చాలా మంది దుర్వినియోగం చేసుకుంటారు, దాని ప్రతిఫలంగా బాధను అనుభవించవలసి వస్తుంది.

ఈనాటి మొదటి పఠనం లో  రచయిత 'మనిషి స్వేచ్ఛ జీవి' అనే తెలియజేస్తున్నారు.

ప్రతి ఒక్కరి జీవితంలో తాము అనుదినం తీసుకునే నిర్ణయాలు ఎంతో ప్రధానమైనవి.

మనకు దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛలో ఎటువంటి సరియైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అనే అంశం గురించి ఈనాడు సిరాకు గ్రంథ రచయిత మనకు తెలియజేస్తున్నారు.

ఈ మొదటి పఠన ప్రారంభ వచనంలో ఈ విధంగా అంటున్నారు, నీవు కోరుకుందు వేని ప్రభువు ఆజ్ఞలు పాటింపవచ్చును, అతనిని అనుసరింపవలెనో  లేదో నిర్ణయించునది నీవే సిరాకు 15:15 అని అంటున్నారు.

దేవుడు మనిషికే తన స్వేచ్ఛలో నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చారు, ఎంపిక చేసుకునే అనుమతి ఇచ్చారు. దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛలో రోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఎన్నో విషయాలను ఎంచుకుంటా 

- ఎక్కడ చదవాలో ఎన్నుకుంటాం.

- ఎవరిని వివాహం చేసుకోవాలో దానిని ఎంచుకుంటాం.

ఎలాంటి వ్యాపారం చేయాలో 

- ఎలాంటి ఉద్యోగం చేయాలో,

ఎవరిని అనుసరించాలో

ఎలాంటి జీవితం జీవించాలో

- ఎవరిని స్నేహితులుగా ఎంచుకోవాలో, ఎలాంటి దుస్తులు, ఎలాంటి మొబైల్స్, వస్తువులు కావాలో అనేవి మనం ఎంపిక చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంది.

మనకు ఇవ్వబడిన స్వేచ్ఛలో, మనం తీసుకునే నిర్ణయాలు సరి అయినవి అయితే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, అదేవిధంగా మనం తీసుకునే నిర్ణయాలు చెడ్డవి తప్పిడివి అయితే అవి మనకు కీడు కలుగుతుంది.

మనం ఇవ్వబడిన స్వేచ్ఛలో తీసుకునే నిర్ణయం మనం ఎంచుకునే విషయాలు మన జీవితాలను మన యొక్క భవిష్యత్తును ఎంతో ప్రభావితం చేస్తాయి.

పవిత్ర గ్రంథంలో ఉన్న ఆదాము, అవ్వ తమకు ఇవ్వబడిన స్వేచ్ఛలో సరియైన నిర్ణయం ఎంపిక తీసుకోలేకపోయారు.

దేవుడివారికి ఏదెను  తోటలో స్వేచ్ఛనిచ్చారు కానీ వారు తమకు ఇవ్వబడిన స్వేచ్ఛలో వక్ర  మార్గమును, దేవునికి ఇష్టం లేని మార్గం ఎంచుకున్నారు, దాని ప్రతిఫలంగా వారి జీవితంలో దేవుడితో ఉన్న స్నేహ సంబంధం కోల్పోయారు, వారు ఎంచుకున్న విధానం బట్టి వారు శిక్షను అనుభవించారు, పాపం చేశారు అప్పటివరకు దేవునితో నడిచిన వారు దేవునికి మొఖం కూడా చూపించలేక దాక్కున్నారు, వారి జీవితం కష్టాల పాలయింది.

ఒకవేళ సైతాను వారిని ప్రేరేపించినప్పుడు సరియైన మార్గం ఎంచుకుంటే ఈరోజు మన యొక్క జీవిత విధానం ఇంకొక విధంగా ఉండేది,  అందుకనే రచయిత తెలిపే విషయం ఏమిటంటే దేవుడే మనకు స్వేచ్చనిస్తున్నారు, ఆయన యొక్క ఆజ్ఞలు పాటించాలో లేక పాటించవద్దు అని, కాబట్టి మనం ఎలాంటి ఎంపికను చేసుకుంటున్నాం.

స్వేచ్ఛ జీవులమైన మనం దేవుని యొక్క మార్గమును ఎంచుకోవాలి, దేవుని యొక్క మార్గమును ఎంచుకొని ఆయన యొక్క ధర్మ శాస్త్రాను సారం జీవించాలి.

కీర్తన 119:1-2 దేవుని యొక్క ఆజ్ఞలు పాటించువారు ధన్యులు అని తెలుపుచున్నారు, ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే వచ్చే ప్రతిఫలం గురించి తెలుపుచున్నాయి. ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించి జీవిస్తే మనందరం కూడా ఒక పుణ్య జీవితం జీవించవచ్చు ఈ భూలోకం పరలోకం గా మారుతుంది.

16వ వచనంలో రచయిత అంటున్నారు, ప్రభువు నిప్పును నేలను కూడా మీ ముందు ఉంచెను అని.

నిప్పు దేవుని యొక్క సాన్నిధ్యమునకు గుర్తు, అలాగే నిప్పు కూడా దేవుని యొక్క శిక్షకు గుర్తు, ఈ సందర్భంలో నిప్పు దేవిని యొక్క శిక్షను సూచిస్తుంది. నీరు దేవుని యొక్క బహుమానం ఆశీర్వాదానికి గుర్తు కాబట్టి ప్రభువు యొక్క ఆజ్ఞలు పాటించేవారు దేవుని యొక్క మంచి బహుమానం పొందుతారు.

దేవుని యొక్క విజ్ఞానము అనంతమైనది, ఆయన అన్నింటినీ పరిశీలించెను. మానవులు చేసే ప్రతి కార్యము దేవుడు పరిశీలిస్తారు, ఆనాటి ప్రజల్లో వివిధ రకాలైన భిన్న ఆలోచనలు ఉండేవి ఎందుకంటే అప్పటి గ్రీసు దేశపు సంప్రదాయం ప్రభావం (helenistic culture) ఎక్కువగా ఉండేది, వారు నమ్మిన అంశం ఏమిటంటే దేవుడి కేవలం బయట కార్యాలే చూస్తారు, అంతరంగికంగా చూడరు అని నమ్మేవారు, అలాగే దేవుడు మానవుల్ని పాపం చేయడానికి ఆజ్ఞాపిస్తారు, అనే తప్పుడు ఆలోచనలు ఉండేవి అవి అన్నింటినీ కూడా రచయిత సరి చేస్తున్నారు.

దేవుడు మానవుల యొక్క బాహ్య అంతరంగీకా కార్యాలు ఆలోచనలు అనే పరిశీలిస్తారు. అదేవిధంగా దేవుడు ఎవరిని కూడా పాపం చేయమని ఆజ్ఞాపించడు అని తెలిపారు, దేవుని పట్ల భయభక్తులు చూపే వారిని ఆయన ఆశీర్వదిస్తారు కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలో దేవుడిచ్చిన స్వేచ్ఛలో ఎలాంటి మార్గం ఎంచుకుంటున్నాం ఎలాంటి నిర్ణయాలు ఎంపికలు చేసుకుంటున్నాం అని ధ్యానం చేసుకోవాలి.

మనం మంచిని ఎంచుకుంటే దేవుని బహుమానం వస్తుంది, చెడును ఎన్నుకుంటే శిక్ష వస్తుంది, కాబట్టి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. మనం బహుమానం పొందాలన్నదే దేవుని యొక్క కోరిక ద్వితీయో 11:26-28 కాబట్టి సరియైన మార్గం ను ఎంచుకొని దేవుని దీవెనలు పొందుదాం.

దేవుడు ఎవరిని ఒత్తిడి చేయరు, ఆయన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చారు, అందుకే తప్పిపోయిన కుమారుడు ఇల్లు వదిలి వెళ్లాలి అన్నప్పుడు స్వేచ్ఛనిచ్చారు కాబట్టి మనం ఎలాంటి మార్గం, నిర్ణయాలు, ఎంపికలు చేసుకుంటున్నాం అనే అంశం ధ్యానించాలి.

మనం చేసుకొనే ఎంపిక మనల్ని దేవునికి దగ్గరగా చేర్చుతుందా లేక దూరం చేస్తుందా? మంచినీ ఎంచుకుంటే సంతోషం ను పొందుతాం. 

ఈనాటి రెండవ పట్టణంలో పౌలు గారు ఈ లోక సంబంధమైన జ్ఞానం కు, అదే విధంగా దైవ జ్ఞానం కు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి తెలుపుచున్నారు.

పౌలు గారు మనందరం కూడా దైవ జ్ఞానంను అలవర్చుకొని జీవించాలి అని తెలుపుచున్నారు, మనం దేవుని యొక్క ఆత్మను పొందిన తరువాత దైవ జ్ఞానం మనల్ని దేవుని వైపుకు నడిపిస్తుంది దేవుని స్తుతించేలా చేస్తుంది.

ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన లోక పాలకులు చాలా సందర్భాలలో హాని చేస్తారు, అందుకే దేవుని యొక్క జ్ఞానం కలిగి జీవించాలి, అప్పుడు మన జీవితాలు అభివృద్ధి చెందుతాయి అని పౌలు గారు తెలిపారు.

దైవ జ్ఞానం పొందాలంటే దేవుని యొక్క ఆత్మ యొక్క సహకారం కావాలి.

ఈనాటి సువిశేష పట్టణంలో ఏసుప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగం గురించి చదువుకున్నాం.

ఏసుప్రభు అష్ట భాగ్యాలను బోధించిన ప్రతి కాలంలో చట్టపరమైన ఆరువ దేశాల గురించి తెలియజేశారు యూదులకు దేవుడిచ్చిన చట్టం గురించి వివిధ రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి.

యూదుల ధర్మ శాస్త్రం కు నాలుగు రకాలైన అర్థాలు ఉన్నాయి:

1. ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క పది ఆజ్ఞలు.

2. పవిత్ర గ్రంథంలో ఉన్న మొదటి ఐదు గ్రంథాలు.

3. పాత నిబంధన గ్రంథం దీనినే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము అని పిలిచేవారు.

4. ధర్మశాస్త్ర బోధకుల చట్టం వీటన్నిటికీ కూడా ధర్మశాస్త్రము అనే నామం వర్తిస్తుంది.

ఏసుక్రీస్తు ప్రభువు తన యొక్క పరిచర్య జీవితంలో మూడవ దానిని సంపూర్ణంగా నెరవేర్చారు. నాలుగవ దానిని ప్రభువు రద్దు చేశారు. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకుల చట్టం అనేక నియమాలతో కట్టడాలతో కూడుకొని ఉన్నది.

అనేక రకాలైన కట్టడాలను నిబంధనలను పాటించాలని ప్రజలపై భారం మోపారు, లెక్కకు మిక్కుటం లేని కట్టడాలతో జీవితాన్ని దుర్భారం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే తోటి సోదరుడి కంటే ధర్మశాస్త్ర బోధకులు నియమ నిబంధనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జీవించారు.

ధర్మశాస్త్రము తూ;చా తప్పకుండా పాటిస్తే పరిపూర్ణత సాధించినట్లే అని, అపోహ కలిగి జీవించేవారు అందుకే ధర్మశాస్త్రముకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, ఏసుప్రభు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చుట కొరకే, ధర్మశాస్త్రము యొక్క పరమార్థం ను యేసు ప్రభువు సంపూర్ణంగా వివరిస్తున్నారు, ఒక దేవుని యొక్క ఏకైక కుమారునిగా యేసు ప్రభువు తండ్రిని గురించి తండ్రి ప్రేమ గురించి పవిత్రాత్మ సహాయం గురించి దైవ ప్రణాళికల గురించి తెలియజేశారు.

ఏసుప్రభువు రాకముందు ఈ యొక్క ధర్మ శాస్త్ర కేవలం ఒక నియమంక మాటగా మాత్రమే ఉండేది కానీ తరువాత ఏసుప్రభువు యొక్క రాకతో ధర్మశాస్త్రంకు జీవం పరిపూర్ణత వచ్చినది ఏసు ప్రభువు దైవ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చారు.

ఏసుప్రభు రాకముందు ధర్మశాస్త్రం నేర్పిన విషయం ఏమిటంటే కేవలం నియమం పాటిస్తే చాలు జీవితం ధన్యమవుతుంది అని, కానీ క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రం కేవలం నామకార్థం కు పాటించడం కు బదులుగా ఒక మంచి నిజాయితీ కలిగిన జీవితం ధర్మశాస్త్రం పాటించుట ద్వారా రావాలి అని తెలిపారు.

అప్పటి యూదుల మాటలు క్రియలు భిన్నంగా ఉండేవి అందుకే ఏసుప్రభు ధర్మశాస్త్రం పాటించే వారికి విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలని తెలిపారు.

ధర్మ శాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాన్ని ఏసుప్రభువు ప్రేమతో తన యొక్క మరణ పునరుద్ధానం ద్వారా నెరవేర్చారు.

ప్రభువు మన నుండి కోరుకునేది ఒక మంచి జీవితం, ధర్మశాస్త్ర బోధకుల కంటే నీతి వంతమైన జీవితం జీవించాలి, చాలా సందర్భాలలో మన నియమా నిబంధనలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం, కానీ మనుషులను మరిచిపోతాం, ధర్మశాస్త్రం పాటించేవారు తప్పనిసరిగా సోదర ప్రేమ దైవ మనస్తత్వం కలిగి జీవించాలి.

ధర్మ శాస్త్రం ఇవ్వబడినది మనిషి దేవుని ప్రణాళికలు తెలుసుకొంటూ పవిత్ర జీవితం జీవిస్తూ దేవుని యొక్క మార్గమును పుణ్యక్రియలను అనుసరించాలన్న ఉద్దేశం కొరకే మనం మంచిగా జీవిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం.

ఏసుప్రభు నరహత్య చేయరాదు అదే  విధంగా సోదరుడిని వ్యర్థుడా అనేవాడు నరకాగ్నిలోనికి పంపబడతాడు అని తెలుపుచున్నారు, అలాగే మన సోదరుల మీద కోపబడితే తీర్పుకు గురి అవుతాం అని తెలిపారు.

మానవ జీవితంలో కోపపడటం సహజం, కానీ ఆ కోపం మనిషిని పాపంలోనికి నడిపించకూడదు అనే ఏసుప్రభువు తెలుపుచున్నారు.

మన పొరుగు వారిని చంపకున్నంత మాత్రాన సరిపోదు, అతనిని ద్వేషించకూడదు, చులకనగా చూడకూడదు, తగువులాడకూడదు, వారికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి. సోదర ప్రేమ ఉంటే సమస్తము సాధ్యమవుతుంది, యేసుప్రభు కోప పడ్డారు, ఆయన యొక్క కోపం మంచి కొరకే మనం కూడా కోపబడే సందర్భంలో మంచి ఆశించే కోప పడాలి.

ప్రస్తుత కాలంలో మనం చాలామందిని శరీరకంగా చంపకపోయినా, మన యొక్క మాటలు, క్రియల  ద్వారా మానసికంగా చంపుతూనే ఉంటాం అలాంటివి మానుకోవాలి.

సోదరులతో మనస్పార్ధాలు ఉన్నప్పుడు మనం వెళ్లి సంఖ్య పడాలి. సంఖ్య  పడుటయే దేవుడు కోరుకునేది, అదే విధంగా ఏసు ప్రభువు వ్యభిచారించవద్దు అని పలికారు, ఒట్టు పెట్టుకోకూడదు అని తెలిపారు. మన యొక్క జీవితంలో శరీరకంగా అనేకసార్లు శోధించబడతాం. ఆ శోధనలో కొంతమంది పడిపోతుంటారు, మన యొక్క కార్యాలే కాకుండా మన యొక్క తలంపులు కూడా చాలా ముఖ్యం కాబట్టి మన ముఖ్యంగా మన యొక్క చూపులను, తలంపులను, హృదయం  పవిత్రంగా ఉంచుకోవాలి.

ఈనాటి సువిశేశం  లో  యేసు ప్రభువు చెప్పిన ప్రతి అంశంలో మనిషి యొక్క స్వేచ్ఛ గురించి చెప్పబడింది, తన స్వేచ్ఛలో దేవుడు మార్గాలను ప్రణాళికలను ఎంచుకుంటున్నారా? లేక వేరొక మార్గమును ఎంచుకుంటున్నారా అన్నది అందరూ ధ్యానించుకొని జీవించాలి.

దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛ మంచిని ఎంపిక చేసుకుని దేవుని సంతోషపరిచే జీవితం జీవించుదాం . ఈ నాటి దివ్య పఠనాలు మనకు ఒక సవాలు లాంటివి, ఎందుకంటే మన స్వేచ్ఛలో మనం ఎంత మాత్రం మంచినీ ఎంచుకుంటున్నాం ఎంత మాత్రం దేవుని సంతోషపెట్టే జీవితం జీవిస్తున్నాం మన యొక్క సరియైన ఎంపికలు ద్వారా దేవునికి దగ్గరవుతున్నామా అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి.


FR. BALAYESU OCD

4, ఫిబ్రవరి 2023, శనివారం

 

ఐదోవ సామాన్య ఆదివారం

యెషయా 58:7-10

1 కొరింతి 2:1-5

మత్తయి 5:13-16

ఈనాటి దివ్య పఠనాలు  క్రైస్తవ జీవితం అనేది ఇతరులకు సహాయం చేసే జీవితం లాగా ఉండాలి అని బోధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా క్రీస్తు ప్రభువు శిష్యులుగా ఉండేవారు సహాయం చేస్తూ జీవించాలి. సృష్టి ప్రారంభం నుండి ఒకరికొకరు సహాయం చేసుకొని జీవించాలన్నది దైవ ప్రణాళిక. ఆదాముకు సహాయం చేయుటకు దేవుడు ఏవమ్మను సృష్టించి తనకు తోడుగా చేశారు.

ప్రభువును విశ్వసించే విశ్వాసులు తమ యొక్క అనుదిన జీవితంలో స్వార్థంతో జీవించకుండా తమకు ఉన్నదానితో నలుగురికి సహాయం చేస్తూ సోదర ప్రేమను వ్యక్తపరుస్తూ జీవించాలి.

మన యొక్క బోధన విశ్వాస జీవితం, కేవలం మాటల్లోనే కాకుండా చేతుల్లో చూపించాలి. అనగా విశ్వాసం మన యొక్క క్రియల ద్వారా నిరూపించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినది, ఉన్నతులను చేసినది, ఆ యొక్క సిరి సంపదలతో ఇతరులకు సహాయం చేయుట కోసమే.

ఈనాటి మొదటి పఠనంలో  యెషయా ప్రవక్త ఉపవాసం యొక్క ప్రతిఫలం ఏవిధంగా ఉండాలి అని తెలియజేశారు, దేవుడు కోరుకునే ఉపవాసం ఏవిధంగా ఉండాలో యెషయా  ప్రవక్త తెలిపారు.

ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా ప్రవాసం ముగించుకొని తిరిగి వచ్చినప్పుడు యేరుషలేము నగరాన్ని పునర్నిర్మించుకున్నారు, అయితే వారి యొక్క నిర్మాణం చాలా ఆలస్యంగా జరిగింది అదేవిధంగా ఎందుకు దాదాపు 50 సంవత్సరాల ప్రవాసం జీవితంలోకి దేవుడు వారిని పంపించారు అని ఇశ్రాయేలీయులు ఆలోచించుకునే సందర్భంలో యెషయా ప్రవక్త ఈ విధంగా తెలుపుతున్నారు. దేవుడు ఇచ్చిన అనుగ్రహాలు ఇతరులతో పంచుకోకపోవటమే మీయొక్క దృష్టితికి కారణం అని తెలిపారు. అదే విధంగా తమను తన సొంత బిడ్డలుగా ఎన్నుకొని, దేవుని యెడల విశ్వాసనీయతను చూపనందుకు తమ జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోవటమే ఎంతటి కఠినమైన స్థితికి కారణం అని తెలిపారు.

ఈనాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త దేవుడు కోరే ఉపవాసం గురించి తెలుపుచున్నారు. ఎన్ని రోజులు ఉపవాసం చేశారన్నది కాకుండా ఏ విధంగా, ఎలాంటి హృదయంతో ఉపవాసం చేసాము అన్నది ముఖ్యము.

వాస్తవానికి ఈనాటి మొదటి పఠనం మనందరికీ ఒక సవాలు లాంటిది, ఎందుకంటే మనకు ఉన్నది ఇతరులతో పంచుకోవటం చాలామందికి కష్టం, ఉపవాసం చేసే సందర్భంలో మొట్టమొదటిగా దేవుడు చేయమని కోరిన పని ఏమిటంటే ఎవరైతే ఆకలితో ఉన్నారో  వారికి ఆహారం సగమని ప్రభువు తెలిపారు. మనం ఏదైతే మిగిల్చామో, త్యాగం చేసామో అది ఇతరులకు మేలు చేసేలా ఉండాలి అని దేవుడు తెలియజేశారు.

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం ఒక పెద్ద వరం వారు దీవించబడతారు, సారెఫేతులో ఉన్న వితంతువు ఆకలితో ఉన్న ఏలియా ప్రవక్తకు ఆహారం ఒసగి ఉన్నారు. ఆమెను, ఆమె బిడ్డ దీవించబడ్డారు.

యావే దేవుడు కూడా ఆకలితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను, పూరేడు పిట్టలు, సగి ఆకలి తీర్చారు. మన విశ్వాస జీవితంలో కూడా ఉపవాసం చేసేటప్పుడు పొరుగువారికి ఆహారం ఒసగాలి.

రెండవదిగా ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమివండి  అని ప్రభువు తెలుపుచున్నారు. అనాధలు, అభాగ్యులు, పేదవారికి ఆశ్రయం ఇవ్వమని తెలుపుచున్నారు. ప్రస్తుత కాలంలో మనం ఆశ్రయం ఇవ్వల్సింది వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులకు ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులను విడిచి పెడుతున్నారు కాబట్టి మొదటిగా వారికి ఆశ్రయం ఇవ్వాలి.

మూడవదిగా వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వమని తెలుపుచున్నారు. వస్త్రాలు మన యొక్క గౌరవానికి గుర్తు కాబట్టి మన యొక్క జీవితం ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా ఇతరులకు గౌరవం ఇచ్చి జీవించాలి.

నాల్గవదిగా అవసరాలలో ఉన్న బంధువులు సహాయం అడిగినప్పుడు నిరాకరించవద్దని పలుకుచున్నారు. దేవుడు మనకు అనేక రకాలైన దీవెనలు సగినది ఇతరులతో పంచుకోవడానికి క్రైస్తవ జీవితంలో ఒకరికొకరు సహాయం చేసుకుని జీవించాలి. ఈ విధంగా మనం ఉపవాసం చేసి ఇతరులకు సహాయం చేసి జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం.

యెషయా ప్రవక్త తెలియజేసే విషయం ఏమిటంటే మన మిత్రులకు సహాయం చేసి జీవిస్తే అవి ఆశీర్వాదాలుగా మారతాయి, సహాయం చేసినప్పుడు దేవుని కృప ప్రాతక్కాలమున సూర్యుని వలే మనపై ప్రకాశించును, మన యొక్క గాయాలు మార్పబడతాయి, మన యొక్క ప్రార్థనలు ఆలకించబడతాయి, మన యొక్క ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇస్తారు, కాబట్టి ఇతరులకు సహాయం చేస్తూ మంచి క్రైస్తవ జీవితం జీవించుదాం.

ఈనాటి రెండవ పఠనం లో పునీత  పౌలు గారు దైవ శక్తితో చేసిన సువార్త ప్రకటన గురించి తెలుపుచున్నారు. మానవ శక్తుల మీద, జ్ఞానం మీద కాకుండా దైవ శక్తి మీద ఆధారపడి దైవ పరిచర్య చేశారు.

పునీత  పౌలు గారు ఏథెన్స్  లో సువార్త పరిచర్య  చేసేటప్పుడు ఆయనకు మానవ జ్ఞానం తెలివితేటలు అంతగా సహకరించలేదని అందుకే మానవ సహాయం మీద కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడ్డాను అని  తెలియజేశారు. ఏథెన్స్ లో ఉన్న మేధావులందరికీ గొప్పగా ఉపన్యసించాడు అయినప్పటికీ అవి వృధా అయ్యాయి అని. క్రీస్తు ప్రభువే లోకా రక్షకుడని నిజమైన దేవుడని మేధావులకు తెలియజేయడంలో తన యొక్క మానవ ప్రయత్నం విఫలం అయిందని తెలిపాడు.

పౌలు గారు అక్కడ ఉన్న వారు  దేవుని శక్తి మీద ఆధారపడుతూ క్రీస్తు ప్రభువు యొక్క శిలువ, మరణ, పునరుద్ధానముల గురించి తెలియజేసినప్పుడు ఏ విధంగా క్రీస్తు ప్రభువు తన యొక్క జీవితంను అనేక మంది యొక్క రక్షణార్థం త్యాగం చేశారు తెలుసుకొని అప్పటి మేధావులు ఏసుప్రభువును విశ్వసించారు.

పౌలు గారు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు యొక్క శ్రమలు బోధించారో  క్రీస్తు ప్రభువు యొక్క జీవితంలో ఎవరు ఊహించని సంఘటన (ఆయన సిలువ మరణం) జరిగిందని తెలిపారో అక్కడ ఉన్న అన్యులు యూదా  మతం నుండి మారిన క్రైస్తవులు ప్రభువును విశ్వసిస్తూ, తమ జీవితాలను మార్చుకున్నారు. క్రీస్తు ప్రభువు ఇతరుల యొక్క రక్షణార్థమై అనేక శ్రమలు అనుభవించారు, తన జీవితం త్యాగం చేశారు, తన ప్రేమను పంచారు, తాను  ఇతరులకు సహాయం చేశారు, మనం కూడా ప్రభువు వారి ఇతరులకు సహాయం చేస్తూ జీవించాలని పౌలు గారు తెలిపారు.

ఈనాటి సువిశేష  పఠనం లో యేసు ప్రభువు క్రైస్తవ జీవితంలో ఉప్పుతోను, వెలుగుతోను పోల్చి చెబుతున్నారు.

ఉప్పు, వెలుగు రెండు ప్రతి ఒక్కరి జీవితంలో విలువైనవి అవసరమైనవి.

ఉప్పును, వెలుగును రెండు కూడా తమ కోసం జీవించేవి కావు అవి ఇతరుల కోసం మాత్రమే జీవిస్తాయి.

పవిత్ర గ్రంథంలో ఉప్పు గురించి వివిధ రకాలుగా చెప్పబడింది.

1. ఉప్పును ఒప్పందం కు గుర్తుగా వాడారు - లేవి 3:13

2. స్వస్థత పరచటానికి పరిశుభ్రపరచటానికి ఉప్పును వాడారు - 2 రాజు 2:20-21.

3. రుచిని ఒసగటానికి ఉప్పును వినియోగిస్తారు - యోబు 6:6.

4. నశించి పోకుండా ఉప్పు కాపాడుతుంది - లూకా 14:34-35.

5. ఉప్పు సమాధానంకు గుర్తు - మార్కు 9:50.

6. ఉప్పు దీవెనలకు సాక్ష్యం - కొలోస్సి 4:6.

దేవుడు క్రైస్తవుల జీవితం ఉప్పు వలె వెలుగు వలె ఉంటాయి అని తెలుపుచున్నారు. మనం పరస్పరం ఒకరికొకరు సహాయం చేస్తూ జీవించాలి.

మనందరిని ఉప్పు వలే జీవించమని కోరుచున్నారు ఉప్పులో ఉన్న మంచి లక్షణాలు మనం అలవర్చుకోవాలి.

1. ఉప్పు సంరక్షిస్తుంది:

పాతకాలంలో మనకి ఫ్రిజ్లు ఏమీ లేవు అయితే పండ్లు, వస్తువులు, మాంసం కుళ్ళిపోకుండా వాటిని  చాలా కాలం వరకు కాపాడుతుంది.

క్రైస్తవులైన మనందరం కూడా మన పొరుగువారు పాడవకుండా కాపాడాలి, వారిని అవినీతి నుండి అక్రమముల నుండి చెడు మార్గాల నుండి వ్యసనాల నుండి కాపాడాలి.

2. ఉప్పును శుభ్రపరచడానికి వాడతారు:

చాలా సందర్భాలలో మనం ఉప్పును పరిశుభ్రపరచటానికి వినియోగిస్తాం. మరీ ముఖ్యంగా చేపలను ఉప్పుతో కడిగి పరిశుభ్రపరుస్తాం అదేవిధంగా క్రైస్తవులందరూ ఈ సమాజంలో ఉన్న చెడును అక్రమాలను శుభ్రపరచాలి, పాప మాలిన్యమును శుభ్రపరచాలి. చెడును శుభ్రపరచాలి. ఎలీషా ప్రవక్త ఉప్పుతో నీటిని శుభ్రం చేశారు - 2 రాజు 2:19:22.

3. ఉప్పు రుచిని అందజేస్తుంది :

అన్నీ తినే పదార్థాలలో ఉప్పు రుచిని అందజేస్తుంది అన్ని సమపాలల్లో ఉన్న లేకపోయినా అన్ని వేసినా వేయకపోయినా కానీ ఉప్పును మాత్రం కూరల్లో  వెయ్యాలి అందుకే ఉప్పు అంటుంది 'అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని'.

మనం కూడా ఇతరులకు రుచిని అందజేయాలి. రుచి అనే ప్రేమ, సంతోషం, సమాధానం అందజేయాలి.

4. ప్పుకు కలిసిపోయే గుణం ఉంది - 

అన్నిటిలో కూడా కరిగిపోయి కలిసిపోతుంది అదే విధంగా మనం కూడా అందరితో కలిసి పోవాలి అవసరంలో ఉన్న వారిని చూసి కరిగిపోవాలి వారికి సహాయం చేయాలి.

5. ఉప్పు త్యాగం చేస్తుంది: 

తనను తాను కరిగించుకుంటూ ఉప్పు ఇతరులకు రుచిని అందజేస్తుంది, సహాయపడుతుంది ఏసుప్రభు తన జీవితంలో త్యాగం చేస్తూ మనకు రక్షణను ప్రసాదించారు. మనం కూడా మన జీవితాలను త్యాగం చేసుకుంటూ ఇతరులకు సంతోషం ఇవ్వాలి.

6. ఉప్పు స్నేహ ఒప్పందానికి గుర్తు: 

పూర్వం రెండు జాతుల మధ్య స్నేహ ఒప్పందం ఏర్పరచుకున్న సమయంలో వారు ఉప్పుతినే వారు రొట్టెను తినేవారు - సంఖ్య 18:19, 2 రాజు దిన 13:5.

క్రైస్తవ జీవితం కూడా ఇతరులతో స్నేహ సంబంధం కలిగి ఉండమని కోరుతుంది.

7. ఉప్పు విశ్వాసానికి గుర్తు:

అప్పుడప్పుడు అంటాం నేను నీ ఉప్పు తిన్నాను కాబట్టి నిన్ను మోసం చేయను అని.  కాబట్టి మనం కూడా విశ్వాసంను కలిగి జీవించాలి దేవునికి విశ్వాస పాత్రులై జీవించాలి.

దేవుడి మనకు ఇచ్చిన ఏ వరం కూడా కోల్పోకూడదు. ప్రభువు అన్నారు ఉప్పు గొప్పదనం కోల్పోతే అది భారవేయబడి త్రొక్క పడుతుందని దేవుడిచ్చిన వరాలు సరిగా వినియోగించుకోకపోతే మన నుండి ఒప్పందంను దేవుడు తీసి వేసుకుంటారు. 

ఉదా: సౌలు రాజు -ఆయనను అభిషేకించారు కానీ ఆయన దానిని సరిగా వినియోగించుకోలేదు. దేవుడు మన జీవితంలో ఇతరుల కొరకు సహాయం చేయుటకు ఇచ్చారు కాబట్టి సహాయం చేస్తూ జీవించుదాం.

అదేవిధంగా ప్రభువు మనల్ని వెలుగుతో పోల్చుతున్నారు. వెలుగు అంతటా ప్రకాశిస్తుంది, నిర్మలమైనది - ఎఫేసి 5:8-9 వెలుగు కూడా ఇతరుల కొరకు జీవిస్తుంది.

ఉప్పు వెలుగు నిర్మలంగా ఉన్నట్లు మన జీవితం కూడా పవిత్రంగా ఉండాలి. ఈ వెలుగులో ఉన్న లక్షణాలు మనలో కూడా ఉండాలి.

1. వెలుగు దారి చూపుతుంది - 

మనం కూడా ఇతరులకు దారి చూపాలి విశాఖపట్నంలో ఉన్న లైట్ హౌస్ మిగతా షిప్స్ అన్నింటికీ దారి చూపి, గమ్యం చేర్చిన విధంగా మనం కూడా దారి చూపుతూ గమ్యం చేర్చాలి.

2. వెలుగు అంధకారంను తొలగిస్తుంది - యోహాను 3:13-20 మనం కూడా ఈ సమాజంలో ఉన్న పాపం అనే అంధకారం తొలగించాలి.

3. వెలుగు హెచ్చరిస్తుంది - మన సిగ్నల్ లైట్స్ మనల్ని హెచ్చరిస్తాయి అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు దారి తప్పిపోతున్న విశ్వాసులను హెచ్చరించి సన్మార్గంలో నడిపించాలి.

4. వెలుగు కాపాడుతుంది - రోమి 13:12 మనం కూడా కాపాడాలి.

5. వెలుగు ప్రకాశింప చేస్తుంది - యోహాను 12:35 వెలుగు వలె మనం కూడా ఇతరుల జీవితంలో ప్రకాశింప చేయాలి క్రైస్తవ జీవితం అనేది ఉప్పు వెలుగు వలె ఇతరులకు సహాయం చేస్తూ జీవించమని ప్రభువు కోరుచున్నారు.


FR. BALAYESU OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...