29, ఏప్రిల్ 2023, శనివారం

పాస్కా 4 వ ఆదివారం

 పాస్కా 4 వ ఆదివారం

అపో 2:14,36-41

1 పేతురు 2:20-25

యోహాను 10:1-10

పాస్కా నాల్గవ ఆదివారంను మంచి కాపరి ఆదివారం అని పిలుస్తారు. ఈనాటి దివ్య పఠనాలు కూడా కాపరి యొక్క బాధ్యతలను గురించి తెలుపుచున్నాయి.

తల్లి శ్రీ సభ మనందరినీ మంచి కాపరులుగా ఉండుటకు పిలుస్తుంది, కాపరి తన మందతో ఏ విధంగానైతే సన్నిహిత సంబంధం కలిగి జీవిస్తుంటాడో అదే విధంగా మనం కూడా కాపరి అయిన దేవునితో ఒక మంచి మందగా కలిసి జీవించాలి.

ప్రజల యొక్క నాయకుడు గొర్రెల కాపరి వంటి వాడు, అతడు/ఆమె తన మందను సన్మార్గంలో నడిపించాలి.

ఈనాటి మొదటి పఠనం లో  పెంతుకోస్తు పండుగ రోజున అపోస్తులు చేసిన బోధనల గురించి వింటున్నాం, యూదయ ప్రజలను ఉద్దేశించి శిష్యులు యేసు ప్రభువును గురించి తెలిపారు, పేతురు గారు మరియు మిగతా శిష్యులు ప్రజల సమూహంలో నిలబడి ధైర్యంగా యేసు ప్రభువును గురించి ప్రకటిస్తున్నారు.

మొదటి పఠనం లో మనం రెండు ప్రధానమైన అంశాలు గ్రహించాలి:

1. హృదయ పరివర్తనం

2. బప్తీస్మమును స్వీకరించుట

ఏసుప్రభును అన్యాయంగా సిలువ మరణంకు గురిచేసారని కానీ యేసుని దేవుడు క్రీస్తుగా రక్షకునిగా నియమించారు అని బోధించారు.

అపోస్తుల యొక్క బోధన వినగానే అందరూ చేసిన తప్పిదమునకు పశ్చాత్తాప పడ్డారు, వారు యేసు ప్రభువు విషయంలో ఎంత తప్పిదనం చేశారో గుర్తించారు, అందుకని శిష్యులను ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుచున్నారు. అందుకే పేతురు గారు హృదయ పరివర్తనం చెంది పాప పరిహారం కై యేసు క్రీస్తు నామమున జ్ఞాన స్నానం పొందమని తెలిపారు.

- నాతాను దావీదు తప్పు చేసిన తీరును చెప్పిన విధంగా యూదులు చేసిన తప్పు పేతురు తెలిపారు.

- పేతురు గారు యూదులును జ్ఞాన స్నానం పొంది దేవుని మందలో చేరమని తెలుపుచున్నారు. యూదులు దేవుని యొక్క స్వరం ఆలకించి అనుసరించారు కాబట్టి వెంటనే హృదయ పరివర్తనం చెందుటకు ఇష్టపడ్డారు.

బాప్తిస్మము  విశ్వాసులకు ఒక క్రొత్త గుర్తింపును ప్రసాదిస్తుంది. బాప్తీస్మం కొత్త జీవితంను ప్రసాదిస్తుంది, మనలో ఉన్న పాపమును తొలగించి మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తుంది.

పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం పొందినప్పుడు మనం పాపము నుండి శుద్ధి చేయబడుతున్నాం.

పెంతుకోస్తు తరువాత శిష్యుల యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే యేసు ప్రభువు యొక్క మరణం పునరుత్థానం గురించి ప్రకటించుటయే.

దేవుని యొక్క ఆత్మను పొందిన తర్వాత వారు ధైర్యంతో నింపబడిన కాపరులుగా తయారవుతున్నారు అందుకనే మరణంకు హింసలకు భయపడటం లేదు.

శిష్యులకు అప్పచెప్పిన బాధ్యతలను వారు సక్రమంగా నెరవేరుస్తున్నారు. దేవుడు మనల్ని కూడా కాపరులుగా ఎన్నుకున్నారు మరి మనం ఏ విధంగా మన బాధ్యతలను నెరవేర్చుతున్నాము.

ఈనాటి రెండవ పఠనం లో  ఒక క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉండాలో తెలుపుచున్నారు, హింసలను ఏ విధంగా భరించాలో తెలుపుచున్నారు.

చాలా సందర్భాలలో మనం తప్పు చేయకపోతే శిక్షను అనుభవించుటకు సిద్ధంగా ఉండము, కానీ దేవుని మందమైన  మనం తప్పు చేయకపోయినా శిక్షను అనుభవించినట్లయితే దానిని ఓర్పుతో సహించమని పేతురు గారు తెలుపుచున్నారు.

వాస్తవానికి ఇది చాలా కష్టం కానీ మన కాపరి అయిన యేసు ప్రభువు ఆయన ఎటువంటి తప్పిదము చేయలేదు ఎల్లప్పుడూ ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే జీవించారు, ప్రజలకు బోధించారు, మేలు చేశారు, అద్భుతాలు చేశారు, మరణించిన వారికి జీవం ఇచ్చారు, అనారోగ్యాలతో స్వస్థత ఇచ్చారు, ఎంత మేలు చేసినప్పటికీని ఆయనను అన్యాయంగా సిలువ వేశారు.

ఆయన ఎట్టి పాపమూ చేయలేదు. ఎన్నడును అసత్యపు మాటలు పలకలేదు. ఆయనను శపించిన వారిని శపించలేదు అయినా కానీ ప్రభువును ఘోరమైన సిలువ మరణంకు గురి చేశారు, కాబట్టి అన్యాయంగా శిక్షణ పొందితే దానిని ఓర్పుతో భరించమని ప్రభువు తన యొక్క జీవితం ద్వారా తెలిపారని పేతురు గారు బోధించారు.

పేతురు గారు పలుకుచున్నారు అన్యాయంగా శిక్షను పొందిన వారు ఓర్పుతో భరిస్తే వారు ఆశీర్వదించబడతారు అని తెలిపారు.

- యోసేపు అన్యాయంగా శిక్షించబడ్డాడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు - ఆది 37,39

- దానియేలును అన్యాయంగా సింహపు బోనులో వేశారు దేవుని చేత రక్షించబడ్డారు.

- మోషే ప్రవక్తను కూడా అన్యాయంగా నిందించారు కానీ దేవుడు గొప్పవానిగా దీవించారు - నిర్గమ 5-21,14:11

- సమూయేలు ప్రవక్తను కూడా వద్దన్నారు - 1 సము 8:5

అయినా దేవుడు తన్ను దావీదును అభిషేకించే ప్రవక్తగా ఎన్నుకున్నారు.

కొన్ని కొన్ని సందర్భాలలో మనం పని చేసే చోట జీవించే చోట ప్రయాణం చేసే చోట అన్యాయంగా మనల్ని మాటలు అంటుంటారు అయినా మనం వాటిని ప్రేమతో సహించాలి.

- ఏసుప్రభు అన్నారు నిన్ను ఒక్క చెంప మీద కొట్టిన వానికి  రెండవ చంపను కూడా చూపించమని ఇది క్రైస్తవ జీవితం.

క్రీస్తు ప్రభువు ఈ లోకానికి మంచి నాయకుడిగా, ఒక మంచి సామృత్తికను  ఇచ్చారు, కాబట్టి మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలి ఆయన వలే తప్పు చేయకపోయినా శిక్షను అనుభవించుటకు సిద్ధంగా ఉండాలి.

మనల్ని మనం సమర్థించుకొనకుండా దేవుని కొరకు అన్నియును సహనంతో భరించాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. తొలి క్రైస్తవ సంఘం అన్యాయంగా అనేక హింసలకు గురి అయినది వాటిని అన్నింటి వారు ఎంతో సహనంతో భరించారు. కావున దేవుని యొక్క శ్రమలలో భాగస్తులైనంతవరకు సంతోషిస్తూ ప్రభువు కొరకు అన్యాయంగా శిక్షించబడినప్పటికీ ధైర్యంతో ముందుకు సాగిపోదాం.

ఈనాటి సువిశేష పఠనం లో  యేసు ప్రభువు గొర్రెల కాపరి అని అదేవిధంగా గొర్రెలు పోవు ద్వారము కూడా యేసు ప్రభువు అని తెలుపుచున్నారు.

పవిత్ర గ్రంథంలో దేవుడిని వివిధ రకాల రూపాల్లో పోలికలతో చెప్పబడ్డారు.

- ప్రభువును కరుణామయుడని

- ప్రేమాస్వరూపియని

- సత్య స్వరూపి అని

-మంచి కాపరి అని వివిధ రకాల పోలికలతో నామాలతో వ్యక్తిగత అనుభవమును బట్టి పోల్చి చెప్పబడ్డారు.

మంచి కాపరి అనేటువంటి మాటను పాత నిబంధన గ్రంథ రచయితలు అలాగే నూతన నిబంధన గ్రంథ రచయితలు ఇద్దరును ప్రభువు యొక్క జీవితంలో ఉద్దేశించి వినియోగించారు.

- సృష్టి ప్రారంభం నుండి దేవుడు కాపరిగా ఉంటూ తన ప్రజలను నడిపించారు అందుకే దావీదు రాజు అన్నారు ప్రభువే నాకు కాపరి ఇక నాకు ఏ కుదువ ఇవ్వు లేదు - కీర్తన 23:1.

పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు యావే  దేవుడు గొర్రెల కాపరి అనే ప్రవక్తలు బోధించారు.

ఏఎస్కేలు ప్రవక్త 34వ అధ్యాయంలో యావే దేవుడు ఎలాంటి కాపరియో తెలుపుచున్నారు - యేహెస్కెలు 34:15-16.

దావీదు రాజు కీర్తనల గ్రంథంలో యావే  దేవుడు మంచి కాపరి అని తెలుపుచున్నారు - కీర్తన 77:20,79:13,97:7,95:7

యావే దేవుడు తన ప్రజలను ముందుకు నడిపించిన మంచి కాపరి ఆమోసు  ప్రవక్త జకరయ్య ప్రవక్త మరియు యెషయా  ప్రవక్తలు కూడా యావే  దేవుని మంచి కాపరి అని సంభోదించారు - యెషయా 40:11,49:9-10

యావే  దేవుడు తన మందను మేపే బాధ్యతలను తన యొక్క సేవకులకు అప్పచెప్పారు.

మోషే అహరోను ద్వారా యావే దేవుడు తన మందను నడిపించారు - కీర్తన 72:21

యెహోషువా ప్రవక్త ద్వారా తన మందను ముందుకు నడిపించాడు. తరువాత న్యాయాధిపతులను, నాయకులను, రాజులను ఎన్నుకొని వారిని ఇస్రాయేలు ప్రజలకు కాపరులుగా చేశారు. అయితే అందరూ కాపరులు సత్యంతో, నీతిగా పనిచేయలేదు, కొందరు కాపరులు తమ స్వార్థం కోసం జీవించారు. అందుకే యావే దేవుని తన కుమారుడైన క్రీస్తు ప్రభువు మనకు మంచి కాపరిగా ఈ లోకానికి అందజేశారు.

- ఏసుప్రభు మంచి కాపరి - 10:12.

పాలస్తీన దేశంలో కాపరి అంటే నిస్వార్థ సేవకు ప్రేమకు త్యాగం కు నిజాయితీకి ఒక మంచి ఉదాహరణ.

ఏసుప్రభు తన యొక్క సువార్త పరిచర్యలో అనేకసార్లు గొర్రెల మందలను గురించి గొర్రెల కాపరుల గురించి తెలిపారు.

ఆయన కాపరిలేని గొర్రెల మందలా ఉన్న వారిని చూసి జాలితో చలించిపోయారు -  మార్కు  6:35.

తప్పిపోయిన గొర్రెలను వెతికారు - లూకా 15:3-7.

సువార్త సేవకు శిష్యులను పంపించేముందు యేసు ప్రభువు శిష్యులతో నేను మిమ్ము తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలే పంపిస్తున్నాను అని పలికారు - మత్తయి 7:15

- ఏసుప్రభును మంచి కాపరి  అని పిలుస్తున్నాము ఎందుకంటే : 

1. ఆయన తన మందను పచ్చిక బయళ్ల వద్దకు నడిపించారు, వారిని పరలోకము వైపుకు నడిపించారు ప్రజలను సంతృప్తి పరిచారు.

2. గొర్రెల కొరకు తన యొక్క ప్రాణం నువ్వు త్యాగం చేశారు.

3. దెబ్బ తగిలిన ప్రతి గొర్రెను మంచిగా చూసుకొని, వాటికి అందజేయవలసిన ప్రేమను అందజేశారు.

4. ఏసుప్రభువు గొర్రెలకు ముందుగా నడిచారు అన్నింటిలో వారికి ముందుగా వెళ్లారు.

5. తప్పిపోయిన గొర్రెల కొరకు వెతికారు.

6. తన మందను క్రమశిక్షణలో నడిపించారు.

7. ఆయన సానుభూతి కలిగిన కాపరి.

8. ఆయన ప్రేమించే కాపరి తన మందను ఎప్పుడూ ప్రేమించారు.

9. తన మంద యొక్క శ్రేయస్సు కొరకు పనిచేసే కాపరి.

10. తన యొక్క మందను క్షుణ్ణంగా తెలుసుకున్న మంచి కాపరి తనకు తన మందకు చాలా దగ్గర బంధం ఉంది.

- ఏసుప్రభు తనను తాను గొర్రెలు పోవు ద్వారము అని పిలుస్తున్నారు.

- ద్వారము మనం లోపలికి ప్రవేశించుటకు సహాయపడుతుంది, మనం కూడా పరలోకం రాజ్యం లోపలికి ప్రవేశించాలంటే అది కేవలం ఏసుక్రీస్తు ద్వారానే సాధ్యం.

- దేవుని దరి చేరాలంటే ఆయన ద్వారా మనం ప్రవేశం పొందాలి ఆయన దేవునికి మనకు మధ్యవర్తి - ఎఫెసి 2:18

- మనం ఆయన మందలోని బాగాస్తులైన వారితో ఆయన యొక్క స్వరమును ఆలకించి ఆయన్ను వెంబడిస్తాం.

మొదటి పఠనం లో  యూదులు అపోస్తుల యొక్క స్వరమును ఆలకించి మంచి మార్గంలో నడుచుకున్నారు, మనం కూడా దేవుని యొక్క స్వరమును ఆలకించి జీవిస్తే తప్పనిసరిగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం.

ఈరోజు మనం కాపురుల కొరకు ప్రార్థించాలి, అభిషేకించబడ్డవారు కాపరులే, దేశ నాయకులు కాపరులే, తల్లిదండ్రులు కాపరులే, ఉపాధ్యాయులు కాపరులే, ప్రతి ఒక్కరూ కాపరులే, కాబట్టి మనకు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి.


FR. BALAYESU OCD

22, ఏప్రిల్ 2023, శనివారం

3వ పాస్కా ఆదివారం

 

3 పాస్కా ఆదివారం

. పో.  2: 14, 22-28

1 పేతురు 1: 17-21

లూకా 24: 13-35

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుడు తనను విశ్వసించే ప్రజలకు ఎప్పుడు చేరువలోనే ఉంటారు అని తెలుపుచున్నాయి. మన జీవితంలో మనం ఎట్టి పరిస్థితులకు లోనైనాకానీ పునరుత్తాన దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. దేవుడి గురించి ఎవ్వరైతే తాపత్రయ పడుతుంటారో, వెదకుతుంటారో, ఆయన సాన్నిధ్యంతో జీవించాలని భావిస్తారో వారికి ప్రభువు అతి సమీపంలోనే ఉంటారు అనే విషయం గురించి మనకు ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.

ఈనాటి మొదటి పఠనంలో పేతురు గారు చేసిన మొదటి పునరుత్తాన భోధన గురించి వింటున్నాం. అపొస్తలులు యేసు ప్రభువు యొక్క పునరుత్తానం తరువాత అదే విధంగా దేవుని యొక్క పవిత్రాత్మను పొందిన తరువాత సువార్త ప్రకటన చేయుట మనం వింటున్నాం.  పవిత్రాత్మను పొందిన తరువాత వారిలో భయం పోయినది అందుకనే వారు బహిరంగంగా సువార్తను అధికారుల మధ్య సమూహాల మధ్య బోధించారు.

వారు బోధించిన అంశం ఏమిటంటే యేసు ప్రభువును అన్యాయంగా సిలువ మరణంకు గురిచేశారు అయినా కానీ దేవుడు మాత్రం తన కుమారున్నివిడిచి పెట్టలేదు ఆయన్ను మరణమును గెలిచేలా చేశారు.  యేసు ప్రభువు తన యొక్క అద్భుతాలు ద్వారా, మహాత్కారాల ద్వారా తన యొక్క బోధనల ద్వారా తానే యేసయ్య అని తెలిపారు. అయినప్పటికిని అది గ్రహించక ఆయన్ను మీరు సిలువ శిక్షకు గురి చేశారు, ఆయన మరణంకు కారణం అయ్యారు అని తెలిపారు.

యేసు ప్రభువును తన తండ్రి ఎన్నడును విడిచిపెట్టలేదు అని పేతురు గట్టిగా  ప్రకటించారు. తండ్రి తన కుమారున్ని ఎన్నడూ విడిచిపెట్టరు. ఎందుకంటే ప్రభువు అంటున్నారు "తల్లి మరచినా నేను నిన్ను మరువను అని" యెషయా 49 : 15 . మనల్ని మరచిపోని దేవుడు మరి తన కుమారున్నిఏ విధంగా మరువగలడు, మరవడు. సత్యమును గ్రహించిన అపోస్తులు ప్రభువు యొక్క పునరుత్తానం గురించి గట్టిగా ప్రకటించారు.

నాటి మొదటి పఠనంలో పేతురు గారు దేవుడు అందరిని తన ప్రజలుగా స్వీకరిస్తున్నారు అని తెలుపుచున్నారు. మొదటిగా యూదులను మార్చి, తరువాత అన్యులకు సువార్త ప్రకటన చేసి వారిని  తన బిడ్డలుగా స్వీకరిస్తారు అని ప్రభువు పలుకుచున్నారు.  యూదులు యొక్క విశ్వాసాన్ని బలపరచుటకు, వారిని యేసు ప్రభువు వైపు తిప్పుటకు పేతుటకు పేతురు గారు వారిని తన యొక్క పరిచర్య ద్వారా బోధించిన విధానం తెలుసుకుంటున్నాం.

ఈనాటి రెండవ పఠనంలో పేతురు గారు మనందరినీ దేవుడి యందు భయభక్తులు  కలిగి జీవించమని కోరుచున్నారు. పేతురు గారు ఆనాటి యూదులను అదే విధంగా హృదయ పరివర్తనం చెందిన అన్యులను దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి  భయభక్తులతో జీవించమని కోరుచున్నారు.

ప్రభువు యొక్క మరణం అనేది దైవ ప్రణాళిక అని పేతురుగారు పలికారు.  ప్రభువు యొక్క రక్తం చేత మనం పాప విముక్తులముగా చేయబడ్డాం. నిష్కళంక గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మనం పవిత్ర పరచబడ్డాం, స్వతంత్రులముగా చేయబడ్డాం. కావున ఆయన యందు ఎల్లప్పుడూ, విశ్వాసం ఉంచి మంచిగా  జీవించమని పేతురు గారు  పలుకుచున్నారు.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు ఎమ్మావు మార్గంలో శిష్యులకు ఇచ్చిన దర్శనం గురించి వింటున్నాం. ఇద్దరు శిష్యులు యేసు ప్రభువు యొక్క మరణం తరువాత యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామంకు వెళ్లే సమయంలో దేవుడు వారితో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గ్రహించాలి.

1. దేవుడు నీ బాధలో  నీకు తోడుగా వుంటారు. ఇద్దరి శిష్యులు ప్రభువు యొక్క మరణమును తట్టుకోలేకపోయారు, నిరాశలో వున్నారు, రాజును  కోల్పోయాము అనే బాధలో వున్నారు. ఆయన్ను గొప్ప నాయకుడిగా, రాజుగా భావించారు. రోమా చక్రవర్తుల నుండి స్వేచ్ఛను దయచేసి వ్యక్తిగా భావించారు అయితే వారి యొక్క ఆలోచనలకు బిన్నంగా ఆయన మరణించారు. అలాంటి తట్టుకోలేనటువంటి స్థితిలో వున్న వారికి ప్రభువు దర్శనం ఇస్తున్నారు.

-   శిష్యులు యేసు ప్రభువు యిస్రాయేలు ప్రజలను ఉద్ధరిస్తాడని, తన రాజ్యాన్ని స్థాపించి ప్రజలకు శాంతి సమాధానాలు సిరిసంపదలు దయ చేస్తాడని వారు ఎంతగానో ఎదురుచూశారు. అయితే అదేమి జరగలేదు. యేసు మరణంతో శిష్యుల యొక్క ఆశలు వమ్ము అయ్యాయి.

-  అంతా కోల్పోయాము, అంతా అయిపోయింది అని జీవచ్ఛవాలుగా ఎమ్మావు గ్రామానికి వెళ్లుచున్న శిష్యులను ప్రభువు కలుసుకుంటున్నారు.

-   దేవుడు తనను వెంబడించే వారిని విడిచిపెట్టరు. శిష్యులు ఎమ్మావు గ్రామముకు వెళ్లే దారిలో వారి యొక్క సంభాషణ యేసు ప్రభువు గురించియే అందుకే ప్రభువు అంటారు "ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడివుంటారో అక్కడ నేనుంటానని" - మత్తయి 18 : 20 .

- మార్గమధ్యన వారి సంభాషణ అంత దేవుని గురించియే అందుకే వారి మధ్యకు దేవుడు వస్తున్నారు.

- వారు అంతగా  దేవుడి గురించి సంభాషిస్తున్నారంటే ఎంతగా ఆయన్ను miss  అయ్యామని వారు భావిస్తున్నారో మనం అర్ధం చేసుకోవాలి.

- మన జీవితాలలో మన భాదల్లో వున్నప్పుడు దేవుడు మనకు కూడా తోడుగా వుంటారు అది మన యొక్క తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు లేదా ఇతరుల ద్వారా కావచ్చు దేవుడు మనల్ని ఎన్నడు విడిచిపెట్టారు.

2. మన దేవుడు ప్రయాణించే దేవుడు: పూర్వ నిబంధన గ్రంధంలో యావే దేవుడు యిస్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విముక్తులను చేసి, వారితో పాటు ఎడారి గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసే సందర్భంలో ఆయన మహిమను, స్వభావమును వెల్లడిచేశారు. ఆయన యొక్క సాన్నిధ్యమును అనుభవించేలా చేశారు.

- అదే విధంగా ఈనాటి సువిశేషంలో యేసు ప్రభవు కూడా శిష్యులతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో వారికి అనేక విషయాలు తెలుపుచున్నారు.

- ప్రభువు తన ప్రజలతో నడుస్తూ తన యొక్క  గొప్పతనమును వెల్లడించుకుంటున్నారు.

-  సృష్టి  ప్రారంభంలో దేవుడు ఆదాము, అవ్వతో నడిచారు. దేవుడు నోవాతో నడిచారు, ఏనోకుతో నడిచారు. ప్రభువు వారితో నడిచే సందర్భంలో అది సామాన్యమైన నడకకాదు అది. యొక్క నడక వారిని బలపరిచే నడక, నేర్పించే నడక, ధైర్యం నింపే నడక కావున మన కూడా గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుడు కూడా మనతో పాటు నడుస్తుంటారు. ఆయన సర్వమును గుర్తించి ఆయన మాట ప్రకారం మనం జీవించాలి.

3. మన దేవుడు మన యొక్క అవసరతలను పట్టించుకునే దేవుడు.

-   ఆయనకు ప్రతి ఒక్కరి అవసరతలు తెలుసు అందుకే వారిని ఆదుకుంటారు.

-  గ్రుడ్డివారిని అవసరతలు తెలుసు

-  పక్షవాత రోగి అవసరం తెలుసు

-  అనారోగ్యుల అవసరాలు తెలుసు

-  విశ్వాసులు అవసరాలు తెలుసు

అందుకే వారిని ఆదుకుంటారు. అదే విధంగా ఇద్దరి శిష్యుల అవసరం కూడా తెలుసు అందుకే వారిని ఆదుకుంటారు.

4. మన దేవుడు ఐక్య పరిచే దేవుడు: ఇద్దరి శిష్యులను మిగతా శిష్యులతో దేవుడు ఐక్యపరుస్తున్నారు.

- ప్రభువును రొట్టె విరుచుట యందు గుర్తించిన శిష్యులు వెంటనే మిగతా శిష్యుల వద్దకు పరుగెత్తుకొని వెళ్లారు.

- యేసు ప్రభువు మరణంతో మనల్ని తండ్రితో ఐక్య పరిచారు.

- ప్రభువు తొలి సంఘస్థులను ఐక్య పరుస్తున్నారు. అలాగే దేవుడు వివాహం ద్వారా స్త్రీ పురుషులను ఐక్యం చేస్తున్నారు.

5. మన దేవుడు కనువిప్పు కలుగచేసే దేవుడు.

- ఇద్దరి శిష్యులు మొదట్లో యేసు ప్రభువును గుర్తించలేదు కానీ ఆయన స్థాపించిన దివ్య సత్ప్రసాదస్థాపన రోజున చేసిన కార్యమును శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. వారి కనువిప్పుకు కారణం అయ్యారు.

- తప్పిపోయిన కుమారుడి కనువిప్పు అయ్యేలా చేశారు.  యొక్క రోజున దేవుడు అన్ని సమయాలలో మనకు తోడుగా ఉంటారని గుర్తించి ఆయన్ను విశ్వసించాలి.

 Fr. Balayesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...