4, నవంబర్ 2023, శనివారం

31వ సామాన్య ఆదివారం

31వ సామాన్య ఆదివారం
మలాకీ  1:4-2,8-10
1 తెస్సలోనిక 2:7-9,13
మత్తయి 23:1-12
ఈనాటి దివ్య పఠణములు దేవుని సేవకులైన యాజకుల యొక్క బాధ్యతలను వారు జీవించవలసిన విధానములు గురించి తెలియజేస్తున్నాయి. మనము ఈ లోకంలో వివిధ రకములైనటువంటి నాయకులను చూస్తూ ఉంటాం. మత బోధకులను చూస్తుంటాం. కొంతమంది తాము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి జీవిస్తూ ఉంటారు. చాలామంది ఒకటి చెప్పి ఇంకొకటి అనుసరించేటటువంటి వారు ఉంటారు. ఈరోజు ప్రభువు తన ప్రతినిధులందరికీ కూడా తెలియచేసే అంశము ఏమిటంటే వారి జీవిత విధానము దేవుని యొక్క చిత్తానుసారముగా ఉండాలని. కేవలము ఈ యాజకుల యొక్క జీవితం మాత్రమే కాకుండా ఎవరైతే ఒక ప్రతినిధిగా ఉంటూ ఉన్నారో వారి గురించి కూడా మాట్లాడుతున్నారు. దేవుడు ఇచ్చిన బాధ్యతలు  సరియైనటువంటి రీతిలో నెరవేరుస్తున్నారా? లేదా అని ప్రభువు మనలను సవాలు చేస్తున్నారు. దానితోపాటు దేవుని యొక్క సేవకులు జీవితం నీ స్వార్థ జీవితంగా అదేవిధంగా విశ్వాసము - చేతలు కలిగిన జీవితముగా ఉండాలి అని ప్రభువు తెలుపుచున్నారు.
ఈనాటి మొదటి పఠణంలో బాబిలోనియా బానిసత్వం నుండి తిరిగి వచ్చిన మతాధికారులను అదేవిధంగా యాజకులను ఉద్దేశించి మాట్లాడుచున్నారు. దేవుడు మలాకీ ప్రవక్తను క్రీస్తుపూర్వం 515 వ సంవత్సరంలో ఎన్నుకొని తన రక్షణ సందేశమును అంద చేయుటకు నియమించి ఉన్నారు. దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా ఆనాటి అసత్య బోధకులు, మత నాయకులైన యాజకులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దేవుడు వారి యొక్క స్వార్థపు జీవితమును చూసి వారిని శిక్షిస్తానని తెలుపుతున్నారు. ఎందుకు దేవుడు తాను ఎన్నుకున్నటువంటి వారిని శిక్షిస్తానని చెబుతున్నారంటే ఈ యాజకులు దేవుడి యొక్క పనిని కాకుండా, ఆయన చిత్తమును కాకుండా, తమ ఇష్టానుసారముగా స్వలాభము కోసం జీవించి ఉన్నారు అందుకనే వారిని ప్రభువు శిక్షిస్తానని తెలుపుచున్నారు. మలాకీ ప్రవక్త యొక్క కాలంలో యాజకుల యొక్క కపటత్వమును ఖండిస్తున్నారు. బాబిలోనియా నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలు  ప్రజలు యెరూషలేము దేవాలయమును రెండవసారి పునః నిర్మించి ఉన్నారు అప్పుడు యాజకులు వారి యొక్క విధులను నెరవేర్చుటలో విఫలమయ్యారు. వివిధ రకములైనటువంటి చెడు మార్గములను అవలంబించారు. అదే కాకుండా ప్రజలకు న్యాయం చేయుటకు బదులుగా అన్యాయం చేశారు. వితంతువులను ఆదుకొనుటకు బదులుగా వారిని నిరాకరించారు. ఈ యాజకులు దేవుని సందేశమును బోధించకుండా అలాగే ఆయన చిత్తమును నెరవేర్చకుండా తమ యొక్క సొంత ప్రణాళికలను అదేవిధంగా రాజుల యొక్క ప్రణాళికలను నెరవేర్చారు. అందుకనే వారి యొక్క జీవితములను చూచిన ప్రభువు కోపపడుతూ వారిని శిక్షిస్తానని తెలుపుచున్నారు.
 ఒక విధముగా చెప్పాలంటే వారు దేవుని యొక్క మార్గము నుండి వైదొలిగి జీవించి ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుటలేదు. అందుకనే మలాకీ ద్వారా దేవుడు మరియొకసారి యాజకులను ఖండిస్తున్నారు. వారు దేవునికి సమర్పించేటటువంటి ఆ యొక్క బలి అర్పణలో కూడా వారు మేలైనది దేవునికి సమర్పించకుండా అనారోగ్యంతో ఉన్నటువంటివి దేవునికి సమర్పించేటటువంటివారు. ప్రభువు చాలా బాధపడుతూ పలికినటువంటి మాట ఏమిటంటే "యాజకులు దారి తప్పితిరి" అని తెలుపుచున్నారు అనగా దేవుని యొక్క మార్గములకు వ్యతిరేకంగా జీవించుటకు ఇష్టపడ్డవారు.వాస్తవానికి దేవుడే వారిని ప్రత్యేకంగా ఎన్నుకొని తన యొక్క సేవ చేయుటకు నియమించి ఉన్నారు కానీ వారే దేవునికి విరుద్ధముగా జీవిస్తూ, ప్రజలను కూడా పాపములోనికి నడిపించి ఉన్నారు కాబట్టి ప్రభువు అట్టి వారిపట్ల అసహనమును వ్యక్తపరుస్తున్నారు. ఆనాటి కాలంలో కూడా అసత్య ప్రవక్తలు ఉన్నారు సత్య ప్రవక్తలు ఉన్నారు. దేవుని కొరకు జీవించేవారు ఉన్నారు. దేవుని కొరకు జీవిస్తున్నామని చెప్పుకొని నటించేవారు కూడా ఉన్నారు.ఈ మొదటి పఠణము ద్వారా మనము తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే యాజకుల వలె దేవుడు  మనందరికీ కూడా బాధ్యతలను ఇచ్చి ఉన్నారు కాబట్టి అట్టి బాధ్యతలు మనము ఎలాగ మన జీవితంలో కపటత్వము లేకుండా నెరవేరుస్తున్నాము అని ప్రశ్నించుకోవాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజల యొక్క విశ్వాస జీవితము గురించి తెలియజేస్తున్నారు వారి మధ్య సువార్తను ప్రకటించే సందర్భంలో దేవుని యొక్క సువార్తను వారు అందరు కూడా స్వీకరించి ఉన్నారు ఆ సందేశమును బట్టి వారు తమ జీవితములను మార్చుకున్నారు. వారి జీవితంలో పౌలు గారు అదేవిధంగా మిగతా సేవకులు బోధించిన వాక్యము మానవ సంబంధమైన వాక్యము కాదు దైవ సంబంధమైన వాక్కు అని వారు గ్రహించి ఉన్నారు కాబట్టి దాని ప్రకారముగా వారి జీవితములను సరి చేసుకుంటూ జీవింపసాగారు అందుకుగాను పౌలు గారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పౌలు గారు తెస్సలోనిక ప్రజల మధ్య జీవించే సమయములో ప్రజల మీద ఎటువంటి భారము మోపకుండా వారిని ప్రేమిస్తూ, వారికి సుమాత్రకుగా జీవిస్తూ, వారికి దైవ ప్రణాళికలను సందేశమును అందజేసి ఉన్నారు. మనందరం కూడా తెస్సలోనికా ప్రజల యొక్క జీవితము నుండి నేర్చుకోవలసిన సందేశం ఏమిటి అంటే వారు అపోస్తుల నుండి ప్రకటింపబడిన సత్యము, దేవుని సత్యము, సందేశము అని గ్రహించి దాని ప్రకారముగా జీవింప సాగారు అలాగే మనము కూడా యాజకులు బోధించిన దైవ సందేశము ప్రకారముగా జీవింప సాగాలి.
ఈనాడు మనము చదివిన సువిశేష భాగములో ప్రజలను ధర్మ శాస్త్ర బోధకుల, పరిసయ్యుల  యొక్క కపటత్వము గురించి జాగరుకులై ఉండమని తెలుపుతున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు అనేక సందర్భంలో కేవలం నీతి వాక్యములను బోధించే వారు కానీ ఆచరించే వారు కాదు. పరిసయ్యులో దాదాపు 7 వర్గాలు కలిగినటువంటి లేదా ఏడు మనస్తత్వములు కలిగిన  వ్యక్తులు ఉన్నారు. 
- కొంతమంది మోషే ధర్మ శాస్త్రమును పాటిస్తూ మంచి క్రియలను చేసేటటువంటి వారు. వీరు కేవలము ప్రజల పొగడ్తలకై ఇష్టపడేవారు.
-కొంతమంది కేవలం మాటలు మాత్రమే చెప్పి క్రియలు చేయ కుండా సాకులు చెప్పేవారు.
- కొంతమంది ఇతరుల ఎదుట పుణ్యాత్ములనపించుకొనుటకు నటించేవారు. వారు నడిచేటప్పుడు ఎవరైనా స్త్రీలు కనపడినప్పుడు వారిని చూడకుండా తమ యొక్క శరీరములను గాయపరచుకుంటారు అట్టివారిని ప్రజలు చూసినప్పుడు వారు నిగ్రహ శక్తి కలిగిన వారు, మంచివారు అని అనుకొనుటకు నటించేవారు.
-ఇంకా కొంతమంది వినయాన్ని వ్యక్తపరచుటకు గూని వాని వలె వంగి నడిచేవారు మీరు కూడా ప్రజల యొక్క దృష్టిలో మంచివారు అనిపించుకొనుటక ఇట్లా జీవించేవారు.
-కొంతమంది దేవుని నుండి మెప్పు పొందుటకై సత్కార్యాలు చేయటానికి ఇష్టపడేవారు. వారి యొక్క స్వార్థం కొరకే ఇలాగ జీవించేవారు.
-మరి కొంతమంది దేవుని శిక్షకు భయపడేటటువంటివారు అనగా బయటకు మంచిగా జీవిస్తూ అంతరంగికంగా తాము చేసిన తప్పులకు బాధపడేవారు.
-చివరిగా కొంతమంది పరిసయ్యులు దైవభయం కలిగి దేవుని ప్రేమిస్తూ సేవిస్తూ ఆయనకు విధేయులై జీవించేవారు. పైన చెప్పబడినటువంటి పరిసయ్యుల యొక్క జీవితము దాదాపుగా ఇతరులకు చూపించట కొరకే గానీ వారు తమ జీవితంలో ఒక్క నిజాయితీని గానీ,నిజమైన విశ్వాసమును గాని ప్రకటించుట చాలా అరుదు అందుకే ప్రభువు కేవలం వారి యొక్క బోధనలను పాటించమని చెబుతూ ఉన్నారు వారి యొక్క క్రియలను కాదు ఎందుకంటే చాలా సందర్భాలలో బోధించేవారు ఇతరులకు సుమాత్రుకగ ఉండరు. అది వారి బలహీనత వలన కావచ్చు, వారి యొక్క స్వార్థం వలన కావచ్చు, లేదా వారి యొక్క శోధన వల్ల కావచ్చు కాబట్టి ఈ ధర్మశాస్త్ర బోధకులు గాని పరిసయ్యులు గాని అదే విధముగా యాజకులు గాని బోధించిన ఏ మంచి సందేశమైన మనము స్వీకరించటానికి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. కానీ అనేక సందర్భంలో మనము వారి జీవితాన్ని చూస్తాము కానీ వారి యొక్క మాటలను బోధనలను మన జీవితంలో అనుసరించడానికి ఇష్టపడము కానీ ఈ సువిశేష ప్రారంభంలోనే ప్రభువు వారి జీవితము కాక వారి బోధనలను పాటించమని తెలియజేస్తున్నాను కాబట్టి మనకు మంచిని ప్రకటించినప్పుడు దానిని ఆచరించడానికి సిద్ధపడుతూ జీవించుదాం. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి బాధ్యతను కపటం లేకుండా నీతిగా నిజాయితీగా నిర్వహించుదాం.
Fr. Bala Yesu OCD

28, అక్టోబర్ 2023, శనివారం

30 వ సామాన్య ఆదివారం

30 వ సామాన్య ఆదివారం
 నిర్గమ  22: 20-26, 1 తెస్సలోనిక 1:5-10, మత్తయి 22‌‌:34-40

ఈనాటి దివ్య పఠణములు క్రైస్తవ జీవితంలో అనుసరించవలసిన రెండు ప్రధానమైన ఆజ్ఞల గురించి తెలియజేస్తున్నాయి అవి దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ ఆజ్ఞలను పాటించుట. ఈ రెండు ఆజ్ఞలను పాటించుటయే నిజమైన క్రైస్తవ జీవితం. ఈ రెండు ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ పాటించుట విఫలమైన అది సంపూర్ణమైన క్రైస్తవ జీవితం కాదు. ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు ఇచ్చిన రెండవ ఆజ్ఞ అయిన సోదర ప్రేమను పాటించమని తెలియజేస్తుంది. మొదటి వచనము(22) మనము గమనించినట్లయితే ఈ యావే దేవునికి కాదని అన్యదైవములకు బలులు సమర్పించిన వారిని కఠినంగా శిక్షించాలి అని తెలియజే స్తునారు. వేరే దేవుళ్ళు లేరు అని దీని యొక్క అర్థం వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకుని వచ్చినది యావే దేవుడు కాబట్టి అతనికి మాత్రమే బలులు సమర్పించాలి అని ప్రభువు కోరుచున్నాను. పాత నిబంధన గ్రంథములో అనేక సందర్భంలో ప్రభువు తెలియచేసిన అంశం ఏమిటి అంటే దేవుడు ఒక్కరే, అది కూడా యావే దేవుడు మాత్రమే, ఇక ఏ దేవుడు లేరు అని అర్థం.. రెండవదిగా ప్రభువు పరదేశులకు ఎటువంటి హాని చేయవద్దు అని తెలుపుచున్నారు అంటే యూదులు కాకుండా మిగతా అన్యులకు ఎవరికి కూడా ఎటువంటి అపాయము కానీ అన్యాయం కానీ చేయకుండా వారిని ప్రేమించమని పలుకుతున్నారు. సోదర ప్రేమ అనే అంశము గుర్తు చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఏ విధముగా పరదేశులుగా జీవించి ఉన్నారో అక్కడ వారు దేవుని యొక్క ప్రేమను పొందుకున్న విధముగా అదే ప్రేమను వ్యక్తపరచమని తెలుపుతున్నారు. మూడవదిగా సమాజంలో ఉన్నటువంటి వితంతువులను, అనాధలను ప్రేమించమని తెలుస్తుంది. వితంతువులు,అనాధలు ఎటువంటి బలము లేనటువంటి వారు దేవుడే వారికి అండగా నిలబడుతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా వారి యెడల జాలి, దయ, ప్రేమను చూపిస్తూ మెలగవలసినదిగా ప్రభువు కోరుచున్నారు. ఎవరైతే వితంతువునుగాని పరదేశులు గాని అనాధలను కానీ భాదిస్తూ ఉంటారో వారి యొక్క బాధను చూసిన ప్రభు తప్పక బాధపెట్టే వారిని శిక్షిస్తాను అని తెలియజేస్తున్నాను కాబట్టి
ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత పొరుగువారి యెడల ప్రేమను వ్యక్తపరిచి జీవించుట. ఇంకా ప్రభువు చెప్పే మాట ఏమిటంటే ఏ వ్యక్తికి అయితే మనము అప్పు ఇస్తూ ఉంటామో ఆ వ్యక్తి దగ్గర ఎటువంటి వడ్డీ కూడా తీసుకోవద్దు తెలియజేస్తున్నారు ప్రస్తుత కాలంలో ఎవరు కూడా వడ్డీ లేకుండా ఏ అప్పు ఇవ్వటలేదు. ఎందుకు ప్రభువు ఈ విధంగా చెప్పారు అంటే మనకు ప్రేమ ఉన్న యెడల ఎదుటివారి మీద మనము భారము వేయము. వడ్డీ తీసుకొనుట ఒక విధముగా వారి మీద భారం వేసినట్లే కాబట్టి ప్రభువు వడ్డీని కూడా తీసుకోవద్దని తెలియజేస్తున్నాను. అప్పుడే మనం ఎదుటి వ్యక్తి మీద  ప్రేమను వ్యక్తపరుస్తుంటాం. ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనియ ప్రజల యొక్క విశ్వాస జీవితాన్ని మెచ్చుకుంటున్నారు ఎందుకంటే  మొదటిగా వారు అన్యులైనప్పటికిని, వేరే సాంప్రదాయములు అనుసరించినప్పటికిని దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ప్రభువు యొక్క సువార్తను ప్రేమతో స్వీకరించి, దేవుని యొక్క వాక్యం అనుసారంగా జీవించినందుకు వారి యొక్క విశ్వాసము గొప్పదిగా ఉన్నందుకు పౌలు గారు వారి జీవితమును మెచ్చుకుంటున్నారు. విశ్వాసము కొరకై అనేక బాధలు అనుభవించినప్పటికిని కూడా ప్రభువు నందు విశ్వాసము కోల్పోకుండా జీవించినందుకు పౌలు గారు వారిని మెచ్చుకుంటున్నారు అదేవిధంగా సోదర ప్రేమను కలిగి జీవించమని తెలియజేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగములో పరిసయ్యులు యేసు ప్రభువుని ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడుగుతున్నారు ఇది కేవలము యేసు ప్రభువుని పరీక్షించుట కొరకై వారి ఈ విధంగా అడుగుతున్నారు ఎందుకంటే వాస్తవానికి ఏసుప్రభు సద్దుకయ్యలు నోరు మూయించారని తెలుసుకొని పరిసయ్యులు కూడా ఏసుప్రభుని పరీక్షించాలనుకున్నారు అందుకే ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమి అని అడుగుతున్నారు. ఆ కాలంలో యూదులకు దాదాపు 613 ఆజ్ఞలు ఉండేవి. యావే దేవుడు మోషేకు సీనాయి పర్వతం దగ్గర ఇచ్చిన 10 ఆజ్ఞలు కాలక్రమేనా 613 ఆజ్ఞలుగా చేయబడ్డాయి అందుకనే ప్రజలు ఏ ఆజ్ఞ ముఖ్యమో, ఏ ఆజ్ఞముఖ్యము కాదో తెలుసుకొన లేకపోయారు అందుకు ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుచున్నారు అందుకు ప్రభువు మొట్టమొదటిగా దేవుడిని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి అని తెలుపుచున్నారు. మనము దేవుడిని ప్రేమించిన ఆయన యొక్క ఆజ్ఞలలో పాటిస్తాము, ఆయన యొక్క చిత్తమును నెరవేరుస్తాను అదేవిధంగా ఆయన కొరకు జీవిస్తూ ఉంటాం. ప్రభు ప్రేమించమని తెలుపుచున్నారు ఎందుకంటే ప్రేమకు సమస్తము సాధ్యము కాబట్టి. మనము ప్రేమ కలిగి జీవించినట్లయితే దేవుని కొరకు ఏమి చేయటానికైనా సిద్ధపడి ఉంటాము. ప్రభువు మన నుండి పూర్ణ ప్రేమ కోరుచున్నాను. కొన్ని కొన్ని సందర్భాలలో స్వార్థంగా ఉంటాం. దేవునికి ఇవ్వవలసినది పూర్ణంగా ఇవ్వలేము, చందాలు వేసేటప్పుడు కానీ, దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ మనము పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవునికి సమర్పించు కాబట్టి అది సగం సగం గానే సమర్పించబడుతుంది ఆ యొక్క సగం ప్రేమ మాత్రమే మనము దేవుడి మీద చూపిస్తుంటాం కాబట్టి మనము దేవుడిని నిస్వార్థంతో సంపూర్ణంగా ప్రేమించాలి.
 రెండవ ఆజ్ఞ నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు తలుపుచున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో మొదటి ఆజ్ఞను పాటించుట  చాలా తేలిక ఎందుకంటే దేవుడిని ప్రతి ఒక్కరూ ప్రేమించగలరు. కానీ పొరుగు వారిని ప్రేమించుట మాత్రం కష్టం. దేవుడు కనపడరు కావున ఆయన ప్రేమిస్తారు కానీ కనిపించేటటువంటి తోటి మానవుడిని ప్రేమించుట అసాధ్యం. అనేక సందర్భాలలో ప్రభువు మనకు తెలియచేసిన విషయం ఏమిటంటే మీ శత్రువులను ప్రేమించమని కోరుతున్నారు, హింసించే వారి కొరకు ప్రార్థించమంటున్నారు అదేవిధంగా ఏ వ్యక్తి అయితే దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటారో అట్టి వ్యక్తి తన తోటి వారిని ప్రేమించకపోతే అసత్య వాది అని తెలుపుచున్నారు కాబట్టి మనము దేవుడిని ప్రేమిస్తున్నాము అని ఎప్పుడూ నిరూపిస్తాము అంటే దేవుని యొక్క ప్రేమ తోటి మానవాళి మీద చూపించినప్పుడే మనకు దైవ ప్రేమ ఉన్నది. దేవుడిని ప్రేమించే వారు తప్పనిసరిగా తమ పొరుగు వారిని కూడా ప్రేమించాలి ఎందుకంటే పొరుగు వారిని ప్రేమించుట అనేది దైవ ప్రేమ నుండి జన్మించినది కాబట్టి మనందరం కూడా దైవ మానవ ప్రేమ కలిగి సోదర భావంతో జీవించాలి.

Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...