24, ఫిబ్రవరి 2024, శనివారం

తపస్సు కాల రెండవ ఆదివారం

తపస్సు కాల రెండవ ఆదివారం
ఆది 22:1-2, 9-18, రోమి 8:31-34
మార్కు 9:2-10
తపస్సు కాలము అనగానే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది క్రీస్తు ప్రభువు మన కొరకు సమర్పించిన కల్వరి బలి. మన మీద ఉన్న ప్రేమ చేత ఏసుప్రభు తన జీవితాన్ని త్యాగం చేసి మనందరికీ కూడా రక్షణను స్వేచ్ఛను ప్రసాదించి ఉన్నారు. ఈనాటి దివ్య గ్రంథములు కూడా మనకు బోధించేటటువంటి అంశములు ఏమిటి అంటే  అబ్రహాము సమర్పించిన బలి విధానము మరియు క్రీస్తు ప్రభువు యొక్క బలి 
అదే విధముగా క్రీస్తు ప్రభువు యొక్క దివ్య రూప ధారణ. ఈ మూడు పఠణములలో మూడు పర్వతముల గురించి తెలియజేయబడ్డవి.
1. మోరియా పర్వతము
2. కల్వరి కొండ
3. తాబోరు పర్వతం
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు అబ్రహామును ఇస్సాకును బలిగా ఇవ్వమన్న వృత్తాంతము చదువుకున్నాం. ఈ మొదటి పఠణంలో మనము గమనించవలసిన అంశములు ఏమిటి అంటే
1. అబ్రహాము యొక్క విశ్వాస జీవితం.
2. అబ్రహాము యొక్క త్యాగం
3. అబ్రహాము యొక్క బాధ
4. దేవుని మీద ఆధారపడటం
5. అబ్రహం యొక్క ధైర్యం 
6. అబ్రహాము యొక్క స్వేచ్ఛ

పవిత్ర గ్రంథములో దేవుడు ఎక్కడ ఎప్పుడు అబ్రహామును మినహా ఎవరిని కూడా మానవుని బలిగా ఇవ్వమని కోరలేదు. మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహామును తన కుమారుడిని బలిగా ఇవ్వమంటున్నారు ఈ వాక్యము చదివిన సందర్భంలో మనందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఎందుకు దేవుడు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని తన కుమారుడిని బలిగా ఇవ్వమంటున్నారు. చాలామందికి ఇది న్యాయమా? అని అనిపించవచ్చు కానీ ఇది కేవలం అబ్రహాము యొక్క విశ్వాస జీవితమును పరీక్షించుట కొరకై ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ఒక శాశ్వతమైనటువంటి ఒడంబడిక చేసుకోబోతున్నారు కాబట్టి ఆయన యొక్క విశ్వాస జీవితం ఇంకా స్థిరముగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం నిమిత్తమై ప్రభువు అబ్రహామును పరీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాస పరీక్షలు అవసరం (యాకోబు 1:12). ఈ మొదటి పఠణ ప్రారంభ వచనము మనకు ఈ అంశం గురించి తెలియజేస్తూ ఉన్నది ఇది కేవలము అబ్రహాము యొక్క విశ్వాస జీవితంను పరీక్షించుట కొరకై దేవుడు తన కుమారుడిని బలిగా ఇవ్వమని అంటున్నారు. వాస్తవానికి అబ్రహం దేవుని యొక్క స్వరమును ఆలకించి వెంటనే దానిని ఆచరణలో పెడుతున్నారు.
- దేవుడు అబ్రహాము యొక్క ఏకైక కుమారుడని, తాను ప్రేమించే కుమారుడిని సమర్పించమని సందర్భములో ఆయన దేవుడిని ప్రశ్నించలేదు, దేవుడితో ఎటువంటి వాదనకు దిగలేదు. ఆయన సంపూర్ణంగా దేవుడిని విశ్వసించి ఉన్నారు కాబట్టే మరొక ప్రశ్న ప్రభువుని అడగక వెంటనే దేవుని యొక్క మాట ప్రకారముగా జీవింప సాగారు. అబ్రహాముకు ఇస్సాకు విలువైనవాడు, చాలా ప్రేమను పెంచుకున్నాడు, తండ్రి కుమారుల బంధం బలముగా ఏర్పడిన సమయంలో ప్రభువు తన కుమారుడిని బలిగా సమర్పించమన్నప్పుడు ఆ తండ్రి యొక్క హృదయ వేదన ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి అయినప్పటికీ కేవలము దేవుడు అడిగారు అనేటటువంటి ఉద్దేశ్యంతో దేవుని కొరకు తన సమస్తమును, తన ఆశలు పెట్టుకున్నటువంటి కుమారుడిని కూడా సమర్పించుటకు వెనుకంజ వేయలేదు అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని పిలుస్తుంటారు. ఈ గొప్ప కార్యము ద్వారా దేవుడు అబ్రహాము అతని యొక్క సంతతిని ఇంకా అధికముగా దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు.
-ఈ యొక్క మొదటి పఠణంలో కేవలం అబ్రహాము యొక్క గొప్పతనమును మాత్రమే కాదు మనము ధ్యానించవలసినది మరియు ఇస్సాకు యొక్క ప్రేమ. తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఇస్సాకు ఆయన చేతులను బంధించినప్పటికీ ఎటువైపు పారిపోకుండా తనను తాను తండ్రికి సమర్పించుకున్నాడు ఇది ఆయన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. ఇస్సాకు కావలిస్తే ఆయన తండ్రి నుండి దూరంగా పారిపోవచ్చు కానీ అలా చేయకుండా తండ్రిని గౌరవిస్తూ ఆయన తనను తానే భలిగా అర్పించుట కొరకు సిద్ధమయ్యాడు. ఇస్సాకు బలి ఏసుప్రభు యొక్క కల్వరి బలికి సూచనగా ఉన్నది. ప్రభువు కూడా తనను తాను కల్వరి కొండ మీద మన నిమిత్తం తండ్రి నిమిత్తము సమర్పించుకుని ఉన్నారు.
- మోరియా పర్వతము మీద ఇస్సాకు బలిని దేవుడు మధ్యలో ఆపివేస్తూ ఈసాకుకు బదులుగా గొర్రె పిల్లను బలిగా అంగీకరించారు. 
- రెండవ పఠణములో ఏసుప్రభు తాను కల్వరి మీద సమర్పించిన బలిని గురించి పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. కల్వరి కొండ మన రక్షణను జ్ఞాపకం చేస్తుంది, మనకు పాప క్షమాపణను దయచేసిన పర్వతం రక్షకుడు మనందరి యొక్క నిమిత్తమై మరణించి మనకు స్వేచ్ఛను జీవమును ప్రసాదించి ఉన్నారు కాబట్టి మనం హృదయ పరివర్తనము చెంది ఆయనను విశ్వసిస్తూ ఆయన యొక్క చిత్తానుసారంగా జీవించాలి.
-ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు యొక్క దివ్యరూపధారణ గురించి చదువుకుంటున్నాము.యేసు ప్రభువు యొక్క పరలోక మహిమ భూలోకంలో ఉన్నటువంటి శిష్యులకు తెలియచేయబడిన సందర్భంలో శిష్యులు పరలోకము నుండి తండ్రి స్వరమును ఆలకించారు. ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతనిని ఆలకించండి. ఆలకించటం అనేది చాలా ప్రధానమైన కార్యం దేవుడు గురించి ఎక్కువగా తెలియాలంటే, దేవుడిని ఆరాధించాలన్న మనకు ఆలకించే మనసు ఉండాలి. పునీత పౌలు గారు అంటారు వినుటవలన విశ్వాసము కలుగును అని. కేవలం శ్రద్ధగా వినుట ద్వారానే మనలో విశ్వాసము పెంపొందించబడుతున్నది. వినుట ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అంటే ఏసుప్రభు యొక్క సమయములో మరియు తన తరువాత తన యొక్క శిష్యులు శుభవార్తను ప్రకటించిన సందర్భంలో వారి చేతులలో పవిత్ర గ్రంథము లేదు కేవలం ఏ అంశములు అయితే వారు యేసు ప్రభువు నుండి విన్నారో అదే విధముగా ప్రజలు శిష్యుల నుండి విన్నారో వాటిని విశ్వసించి ఉన్నారు. కాబట్టి మన అందరి యొక్క జీవితంలో మనము దేవుని యొక్క వాక్యమును ఏ విధముగా ఆలకిస్తూ ఉన్నాం. ఆయన వాక్కును మనము ప్రేమతో విన్నప్పుడే దానిని మన జీవితంలో ఆచరించగలం.
మనలో ప్రేమ ఉన్న సందర్భంలోనే ఎదుటి వ్యక్తి యొక్క మాటలను మనము వినగలుగుతూ  ఉంటాము. మన యొక్క రెండు చెవులను ఒకటిగా జత చేస్తే అవి ప్రేమ చిహ్నంగా మారుతాయి. దేవుని యొక్క వాక్యమును ప్రేమతో ఆలకించాలి,విశ్వాసముతో ఆలకించాలి, పూర్ణ హృదయముతో ఆలకించాలి. ఆ వాక్యము నా జీవిత యొక్క అభివృద్ధి కొరకే అనేటట్లుగా ఆలకించాలి. దేవుని యొక్క వాక్కును సహనముతో ఆలకించాలి అప్పుడే మన జీవితములో మార్పు అనేది వస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్కును ఆలకించి జీవించిన వారి యొక్క జీవితములు అభివృద్ధి చెందుతూ ఉన్నవి అదే దేవుని యొక్క వాక్కును నిరాకరించి జీవించిన వారి యొక్క జీవితములు శిక్షకు గురి అవుతూ ఉన్నవి ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఆయన వాక్కును ఆలకించుమని తెలియచేస్తున్నారు మరి ఏమిటి ఆయన యొక్క వాక్కులు?
1. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము
2. నీ శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయుము.
3. నీ తోటి వానితో సఖ్యపడు
4. అన్యాయం చేయకుండా న్యాయముతో జీవింపుము.
5. నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని అనుసరించవలెను.
6. వినయం కలిగి జీవించమని తెలుపుచున్నారు. ఇంకా అనేకమైన వాక్కులు ఉన్నవి.
ఆయన చెప్పిన విధంగా మనము జీవించినట్లయితే. మనందరం కూడా రూపాంతరం చెందుతాం కాబట్టి ఆయన వాక్కు ఆలకించి అని ప్రకారంగా జీవించుదాం.
Fr. Bala Yesu OCD

17, ఫిబ్రవరి 2024, శనివారం

తపస్సు కాల మొదటి ఆదివారం

తపస్సు కాల మొదటి ఆదివారం
ఆది 9:8-15, 1పేతురు 3:18-22, మార్కు1:12-15
ఈ తపస్సు కాల మొదటి ఆదివారం మనందరికీ, దేవుడు నోవాతో ఏర్పరచుకున్న ఒడంబడికను గురించి మరియు ఏసుప్రభు ఎడారిలో శోధింపబడుటను తెలుపుచున్నది.
ఈనాటి మొదటి పఠణములో దేవుడు నోవాతో ఏర్పరచుకున్న ఒడంబడిక గురించి తెలుపుతూ ఉన్నది. ఈ తపస్సు కాల మొదటి మూడు ఆదివారాలు దేవుడు మానవులతో ఏర్పరచుకున్న మూడు ఒడంబడికలను గురించి తెలుపుచున్నవి. దేవుడు మొదటిగా నోవాతో, రెండవదిగా అబ్రహాముతో,  మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడికను ఏర్పరచుకున్నారు. ఈనాటి మొదటి పఠణములో దేవుడు నీటి ద్వారా నోవాను రక్షించిన విధానమును తెలుసుకుంటున్నాము. 
1. భూమి మీద ఉన్న ప్రజలు పరమదృష్టిలై పాపములో జీవించారు. దేవునితో సంబంధం లేకుండా పాపమును ప్రేమిస్తూ, విచ్చలవిడిగా జీవించటం ప్రారంభించారు. (ఆది 6:5-12) దేవున్ని ధిక్కరిస్తూ వచ్చారు, కాల క్రమేనా ప్రపంచంలో పాపము ఎక్కువైనది, ఈసందర్భంలో దేవుడు మరియొకసారి నోవా కుటుంబం ద్వారా ఈ సృష్టిని నూత్నీకరించారు.
 దేవుడు సృష్టిని మొత్తము నాశనము చేయలేదు ఎందుకంటే నోవా కుటుంబం మరియు దేవుడు నోవాతో తన ఓడలోకి చేర్చబడిన జంతువులు పక్షులు కూడా ఆ జలప్రళయం నుండి రక్షించబడినవి. భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు మరియొకసారి దేవునితో కొత్త జీవితం జీవించుటకు నోవా కుటుంబం రక్షిస్తున్నారు. ఈ జలప్రళయము దేవుడు శిక్షగా వచ్చినది ఏదో ఒక్కసారి తప్పు చేసినందుకు కాదు కానీ వారు ప్రతిసారి కూడా చెడు పనులు చేయాలని ఆశతో ఉన్నారు. దేవుడంటే విశ్వాసము, భయము లేకుండా జీవించే సందర్భంలో పరిపూర్ణంగా వారు దేవుని మార్గము నుండి వైదొలిగినప్పుడు మాత్రమే దేవుడు వారిని శిక్షించారు.
2.ప్రభువు వారి పాపములను శిక్షించినప్పటికీ వారి యెడల దయ, కనికరము కలవారని మనం గుర్తించాలి. వాస్తవానికి ఏ వ్యక్తియు పాపములో మరణించుట దేవునికి ఇష్టము లేదు.(2 పేతురు 3:9) కాబట్టి దేవుడు వారి యొక్క హృదయ పరివర్తనం కోసం ఎంతగా ప్రయత్నించి ఉండి ఉంటారని మనము ఆలోచించాలి. దేవుడు అప్పటినుండి ఇప్పటివరకు కూడా ఏదియు మొత్తము(completely) నాశనం చేయలేదు. ఎందుకంటే ఆయన నోవాతో చేసుకున్నటువంటి ఒడంబడిక అటువంటిది. నోవా ఒడంబడిక ద్వారా దేవుడు ఈ భూమిని, భూమి మీద ఉన్న ప్రాణికోటిని రక్షిస్తారు దానిని ఇక ఎన్నటికీ నాశనం చేయరని తెలుపుచున్నారు
3.చరిత్రలో చాలా సందర్భాలలో అంటూ వ్యాధులు వచ్చాయని మనము చదువుకున్నాం 2020లో కూడా కరోనా వచ్చింది కానీ ఆ సమయములో ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోలేదు కొంతమంది తమ యొక్క ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఏ వ్యాధులు వచ్చినా గాని అది ఈ ప్రపంచం అంతంమెందించే లాగా ఉండుటలేదు. కొంత నష్టం మాత్రమే జరుగుతుంది. అది కేవలము దేవుడు నోవా కు ఇచ్చిన వాగ్దానమునకు నిదర్శనం.
దేవుడు ఏ విధంగానైతే జల ప్రళయం నుండి నోవా కుటుంబమును జంతువులను రక్షించి ఉన్నారు అదే విధముగా మనందరినీ కూడా జ్ఞాన స్నానం అనే నీటి ద్వారా రక్షిస్తున్నారు. ఈరోజు దేవుడు మనల్ని మన కుటుంబమును ఒక నూతన సృష్టిగా చేయబోతున్నారు కాబట్టి మనము ఆయనకు విధేయులై నోవావలే విశ్వాస పాత్రులుగా జీవించాలి. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పేతురు గారు ఏసుప్రభు తన యొక్క సిలువ శ్రమల, మరణ, పునరుత్థానము  ద్వారా మనలను రక్షించినారు అని తెలుపుచున్నారు. దేవుడు జ్ఞాన స్నానంతో ప్రతి ఒక్కరితో ఒడంబడికను ఏసుప్రభు ద్వారా చేశారు. జ్ఞాన స్నానము మనలను జన్మ పాపము నుండి కాక మనము క్రీస్తునందు జన్మించేలాగా చేస్తూ ఉన్నది. జ్ఞాన స్నానము మనందరినీ రక్షిస్తూ ఉన్నది.
ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు  పొందిన శోధనల గురించి తెలియజేయబడుతున్నది. ఇక్కడ ఐదు అంశాలు మనము గుర్తుపెట్టుకోవాలి
1. పవిత్ర ఆత్మ యేసు ప్రభువుని ఎడారికి తీసుకొని పోయారు.
2. 40 రోజులు ఎడారిలో ఉంటూ  ఉపవాసం చేశారు.
3. ఆయన  మృగముల మధ్య నలభై రోజులు ఉన్నారు
4. సైతాను ఏసుప్రభువును శోధించినది.
5. దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు.
ఈ ఐదు అంశాలలో ముఖ్యమైనవి; ఏసుప్రభు శోధింపబడుట మరియు శోధనలను జయించుట.
ప్రతి ఒక్కరి జీవితంలో శోధనలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే సైతాను యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే మనం దేవుడిని మరిచిపోయేలాగా చేయడం అలాగే దేవునికి అవిధేయత చూపించేలాగా చేయుట అందుకనే ప్రతిసారి కూడా మనలను శోధిస్తూ ఉన్నది. ఏసుప్రభువును కూడా ఎడారిలో శోధించినది ఎందుకంటే ఆయన కూడా తండ్రి చిత్తమును విడిచి పెట్టేసి తన స్వార్థం కోసం జీవిస్తాడేమో అని సైతాను శోధించినది మరియు ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో శోధించినప్పుడు వారు ఏ విధంగానైతే మానవ బలహీనత వలన పడిపోయారో అదే విధముగా ఏసుప్రభువు కూడా మానవ దైవ స్వభావములో ఉన్నప్పుడు పడిపోతాడు అనే ఉద్దేశంతో సైతాను ప్రభువును శోధించినది. మార్కు సువార్తికుడు ఏ విధమైనటువంటి శోధనలు ఏసుప్రభుకి కలిగాయి అని స్పష్టముగా తెలియ చెప్పలేదు కానీ ఆయన శోధించబడ్డారు అని తెలిపారు. మత్తయి మరియు లూకా సువార్తికులు యేసు ప్రభువుని సైతాను మూడు అంశములమీద శోధించినది అని తెలుపుచున్నారు. మార్కు సువార్తలో ఏసుప్రభు శోధించబడ్డారు అని మాత్రమే తెలిపారు ఎందుకంటే శోధనలు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి అది ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి భిన్నముగా ఉంటాయి అని తెలియజేయుటకే ఏ విధమైన శోధన అని మార్కు సువార్తికుడు చెప్పలేదు. కాబట్టి మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మనము దేవుని యొక్క శక్తితో ముందుకు సాగి శోధనలను జయించాలి అప్పుడే మనకు దేవుడు తన యొక్క అనుగ్రహాలను ఒసుగుతారు. చాలా సందర్భాలలో సైతాను మనలను శోధించినప్పుడు మనము పడిపోతాము సైతాను వివిధ రకాలుగా మనలను శోధిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ సమయంలో ఎవరిని ఎక్కడ శోధించాలో సైతాన్ కి బాగా తెలుసు కాబట్టి మనము ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏసుప్రభు ఏ విధంగానైతే ప్రార్ధన జీవితము ద్వారా శోధనలు జయించారో మనము కూడా దేవుని శక్తితో శోధనలు జయించాలి. శోధనలు జయించినప్పుడు దేవుడు మనతో ఒక ఒడంబడికను ఏర్పరచుకుంటారు అలాగే మనలను ఆశీర్వదిస్తాను. ఈ ఒడంబడిక ద్వారా దేవుడు మనలను నూతన సృష్టిగా చేస్తున్నారు. కాబట్టి శోధనలను జయించుటకు దేవుని యొక్క సహాయం కోరుతూ ప్రార్థిద్దాం.
Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...