23, మార్చి 2024, శనివారం

మ్రాని కొమ్మల ఆదివారం

మ్రాని కొమ్మల ఆదివారం
యెషయా 50:4-7, ఫిలిప్పి 2:6-11, మార్కు 14:1-15,47
ఈనాడు తల్లి శ్రీ సభ మ్రాని కొమ్మల ఆదివారమును కొనియాడుచున్నది. ఏసుప్రభు యెరుషలేము పట్టణము వచ్చుచున్నాడని కొందరు విని ఆయనకు స్వాగతం పలకడానికి ఎదురెళ్ళారు. ఈ యొక్క మ్రాని కొమ్మల రోజు ఏసుప్రభు యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి రోజు ఒక విధముగా చెప్పాలంటే సంతోషకరమైన రోజు ఎందుకంటే ప్రజలు ఆయనను మెస్సయ్యగా గుర్తించి ఆయనకు ఘన స్వాగతం పలికారు. తమ యొక్క హస్తాలతో తాటి ఆకులను ధరించి ఏసు ప్రభువుకి ఎదురు వెళ్లి జయ జయ నినాదాలు తెలిపారు. ప్రజలందరూ ఏసుప్రభువును రాజుగా ఊహించుకుని, ఆయన వారికి స్వేచ్ఛనిస్తారు అని భావించారు. ఏసుప్రభువుకి ప్రజలు అంత ఘన ఆహ్వానం ఎందుకు పలికారంటే ఆయన యొక్క అద్భుత కార్యములు అదేవిధంగా ఆయన చూపించిన ఒక జీవిత నిదర్శనం(పేదవారి కొరకు పోరాడటం) ప్రజల జీవితంలో కొత్త ఆశలను నమ్మకాన్ని కలుగజేసినది. ప్రభువు పేదవారి పక్షమున పోరాడుట వలన అనేకమందిలో ఒక కొత్త నమ్మకం వచ్చినది. ఇతడు నిజముగా ప్రజల కోసం వచ్చారని ప్రజల సమస్యల నుండి కాపాడతారని వారి నమ్మకం అందుకే ఆయన రాజుగా చేయాలని ఆయనకు ఆహ్వానం పలికారు.
ఈనాటి పండుగను ఉద్దేశించి కొన్ని అంశములు ధ్యానం చేసుకోవాలి
1. ప్రవక్తల యొక్క ప్రవచనం నెరవేరినది.
మెస్సయ్య గాడిద పిల్ల మీద వస్తాడు అని ప్రవచనాలు తెలియచేయబడ్డాయి. జెకార్య 9:9. ఏసుప్రభు తన శిష్యులను పంపించి తన కొరకై ఒక ఇంటి యజమాని గాడిదను ఇవ్వమని అడగమని తెలిపారు (మార్కు 14.:13) ఆ యొక్క ఇంటి యజమానుడు కూడా శిష్యులు వచ్చి గాడిదను అడిగిన వెంటనే కట్టి ఉన్నటువంటి గాడిదను శిష్యులకి ఇస్తున్నారు ఎందుకంటే బహుశా ఆయన యేసు ప్రభువు యొక్క గొప్పతనం గురించి విని ఉండవచ్చు అందుకని వేరొక ఒక్క మాట మాట్లాడకుండా ఇది దేవుని కొరకు వినియోగించబడుతున్నది అని సంతోషముగా ఈ యొక్క గాడిదను శిష్యులకి ఇచ్చి పంపించారు.
ప్రభువు గాడిదను ఎన్నుకొనుట ఆయనకు ఇష్టం ఎందుకంటే పూర్వం గుర్రం కన్నా గాడిదలనే ముందుగా ప్రయాణాలకు వినియోగించేవారు( 2 సమూ13:29, 1 రాజులు 1:38). అదేవిధంగా పూర్వం రాజులు యుద్ధం చేయటానికి వెళ్లేటప్పుడు గుర్రం మీద వెళ్లేవారు కానీ ఎవరైతే శాంతిని నెలకొల్పాలనుకున్నారో వారు మాత్రము గాడిద మీద వెళ్లేవారు. ఏసుప్రభు మనలను తండ్రితో సమాధానపరుచుట కొరకే ఈ యొక్క గాడిద పిల్లను ఎన్నుకుంటున్నారు. గాడిదను ఎన్నుకొనుటకు కారణాలు
1. గాడిద శాంతికి గుర్తు
2. గాడిద ఎంత బరువునైనా మోయుటకు గుర్తు
3. గాడిద వినమ్రతకు గుర్తు
4. గాడిద యజమాని చెప్పినది చేయుటకు గుర్తు
5. గాడిద సేవకు గుర్తు
6. గాడిద బాధలు అనుభవించుటకు గుర్తు
పూర్వం చాలా మంది గాడిద మీద ప్రయాణం చేసి ఉన్నారు.
- సొలోమోను కూడా తన తండ్రి గాడిద మీద సింహాసనం అధిష్టించే రోజున వచ్చి ఉన్నారు.
1 రాజులు 1:38-41
- సౌలు కుమారుడు కూడా గాడిద మీదే వచ్చి ఉన్నారు 2 సమూ19:26
- ఏసుప్రభు తీసుకురమ్మన్న గాడిదను ఎవ్వరు ఎన్నడను వాడలేదు మొట్టమొదటిగా యేసు ప్రభువు మాత్రమే వాడుతున్నారు.
- ఏసుప్రభు ఈ యొక్క గాడిద పిల్లను విడుదల చేస్తున్నారు అప్పటివరకు కూడా అది కట్టి వేయబడినది అటు తరువాత ప్రభువు తన యొక్క ప్రమేయంతో విడుదల చేస్తున్నారు అదియే మన యొక్క జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది పాపమునకు, వ్యసనములకు కట్టి వేయబడుచున్న మనలను దేవుడు తన యొక్క కుమారుడు యొక్క మరణము ద్వారా విముక్తులను చేస్తున్నారు కాబట్టి మనము దేవుని ప్రేమను గుర్తించి మారుమనస్సు పొందాలి.
2. హోసన్న అనగా-Save us now (ఇప్పుడు మమ్ము రక్షించు ప్రభు అని అర్థం) ఎలాంటి సందర్భంలో మనము ఇతరులను రక్షించమని అడుగుతాం?. మనలని మనము రక్షించుకోలేని సందర్భంలో అలాగే ఆపదలో చిక్కుకున్న సమయంలో మన యొక్క శక్తి సామర్థ్యం వలన సాధ్యము కాని విషయం తలంచుకున్నప్పుడు ఇతరుల యొక్క సహాయం కోరుతూ రక్షించమని అడుగుతూ ఉంటాం. ఏసుప్రభువు కాలంలో కూడా ప్రజలు ప్రార్ధించినది ఇదియే. ఇప్పటివరకు కూడా స్వేచ్ఛ లేకుండా బ్రతుకుచున్నటువంటి మమ్ములను రక్షించమని ప్రార్థిస్తున్నారు. వాస్తవానికి దేవునికి రక్షించమని ప్రార్థించిన ప్రతి వ్యక్తిని రక్షిస్తున్నారు.
- ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం లో ఉన్నప్పుడు మమ్ము రక్షించమని ప్రార్థించారు దేవుడు వారిని రక్షించారు. నిర్గమ 3:7
- ఇశ్రాయేలు ప్రజలు పాము కాటుకు గురైనప్పుడు రక్షించమని ప్రార్థించారు సంఖ్యా 21:7
- ఎస్తేరు తన ప్రజలను ఆపదనుండి రక్షించమని దేవునికి ప్రార్థించింది (ఎస్తేరు 4)
- భర్తిమయి అనే గుడ్డివాడు రక్షించమని ప్రార్థించారు. లూకా 18:38
- సిలువ మీద ఏసుప్రభు పక్కన ఉన్న దొంగ కూడా రక్షించమని ప్రార్థించారు. (లూకా 23:42)
ఇంకా చాలా సందర్భాలలో ప్రజలు రక్షించమని కోరినప్పుడు ప్రభువు తన ప్రజలను రక్షిస్తున్నారు. ఆయన యొక్క మరణము ద్వారా మనందరం కూడా రక్షించబడుతున్నాం.
3. ప్రభువు ముందు ఉండుట.
కేవలము మ్రాని కొమ్మల ఆదివారం రోజున యాజకుడు అందరికన్నా ముందుగా ప్రయాణమై పోవుతుంటారు. ఇది ఎందుకంటే దేవుడే మనకు ముందుండి అన్ని విషయాలలో నడుస్తారు. ఏసుప్రభు మనము అనుభవించేటటువంటి శ్రమలకు బదులుగా ఆయనే ముందుండి మన కొరకు అన్ని బాధలు పొందటానికి సిద్ధపడ్డారు. నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం యావే దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాత్రి అగ్నిస్తంభముగా పగలు మేఘస్తంభంగా వారి ముందుండి నడిచారు. మనము అనుభవించవలసిన శ్రమలు మరణం నిందలు అవమానాలు అన్నీ కూడా ఏసుప్రభు మన కొరకై అనుభవించారు కాబట్టి ఈరోజు మనము ఆ ప్రభువు యొక్క ప్రేమను తెలుసుకొని మన జీవితంలను మార్చుకొనుటకు ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమ గొప్పది ఆ ప్రేమను అర్థం చేసుకొని మనం జీవించాలి.
Fr. Bala Yesu OCD

16, మార్చి 2024, శనివారం

తపస్సు కాలం ఐదవ ఆదివారం

తపస్సు కాలం ఐదవ ఆదివారం
యిర్మియ 31:31-34 హెబ్రీ 5:7-9, యోహాను 12:20-33

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు తన ప్రజలతో ఏర్పరచుకున్న నూతన ఒడంబడికను గురించి అదేవిధంగా ప్రభువు పొందబోవు మరణము గురించి తెలియజేస్తున్నాయి. ఏసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానమునకు దగ్గరవుతున్న వేళలో శ్రీ సభ మనమందరం ఆయన యొక్క మరణము, పునరుత్థానము గురించి ధ్యానించమని తెలుపుచున్నది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యిర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలతో ఏర్పరుచుకుంటున్న ఒక నూతన ఒడంబడిన గురించి తెలుపుచున్నారు. యిర్మియ ప్రవక్త క్రీస్తుపూర్వం 650 - 580  సంవత్సర మధ్యకాలంలో జీవించారు. ఆయన యొక్క పరిచర్య మొత్తం కూడా యెరూషలేములో జరిగినది. యిర్మియ ప్రవక్త ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడిని విస్మరించిన సందర్భంలో యూదుల మధ్య జీవించారు. యూదయ రాజ్యాన్ని అంధకారం ఆవరించినటువంటి సమయం అది. ప్రజలు పాపమునే ప్రేమించి దేవుడికి దూరమైన సందర్భంలో దేవుడు వారిని బాబిలోనియా  బానిసత్వమునకు పంపగా అక్కడ వారు జీవమును కోల్పోయిన విధముగా ఉన్న సమయంలో వారి బాధను చూసి దేవుడు, నూతన ఒడంబడిక ఏర్పరచుకుంటాన‌ని  తెలుపుచున్నారు. వాస్తవానికి ఎందుకు ఈ నూతన వడంబడిక? అని ధ్యానించినట్లయితే మనకు అర్థమయ్యే అంశము ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మొదటి ఒడంబడిక నెరవేర్చుటలో విఫలమయ్యారు 2రాజలు దిన 36:14-16,21. అందుకే దేవుడు వారికి ఇంకొక అవకాశంను దయచేసి ఉన్నారు. ఇది ఆయన యొక్క మంచితనమునకు నిదర్శనం. పడిపోయినటువంటి తన ప్రజలు మరలా లేచి తనను అనుసరించాలి అన్నది ప్రభువు యొక్క కోరిక. అందుకని ఇంకొక ఒడంబడిక ద్వారా వారికి కొత్త జీవితం ఇస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కరి మార్పుకై అవకాశాన్ని ఇస్తూనే ఉంటూ ఉంటారు అందుకే ఆయన తన యొక్క సేవకులను పదేపదే వారి హృదయ పరివర్తనముకై పంపిస్తూ ఉంటారు. 
ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క మాట ప్రకారంగా జీవించలేదు కాబట్టే ఆయన వారికి ఇంకొక అవకాశాన్ని దయచేసి ఒక నూతన క్షమించే ఒడంబడికను వారితో ఏర్పరచుకుంటున్నారు. పాత బడంబడిక రాతి పలక మీద దేవుని చట్టం రాయబడినట్లైతే, నూతన బడంబడిక ప్రతి ఒక్కరి యొక్క హృదయము మీద వ్రాయబడుతున్నది. రాతి పలక మీద రాసిన దేవుని చట్టం పగిలిపోవచ్చు, చెరిగిపోవచ్చు కానీ మానవుని యొక్క హృదయము మీద రాసినటువంటి దేవుని యొక్క చట్టము ఎన్నడూ మారదు, ఎవరూ కూడా దానిని ఎవరూ కూడా దానిని మన నుండి తీసివేయలేరు. ఇంతకుముందు  దేవుని చట్టం మనకు బయటగా ఉన్నది కానీ ఇప్పుడు మాత్రం దేవుని చట్టం మన హృదయాంతరంగంలోనే ఉన్నది ఆ చట్టం మనందరిని కూడా ప్రతినిత్యం ఎలా జీవించాలో? ఏమి చేయాలో ? అని ప్రేరేపిస్తూ ఉన్నది కావున ఇంకా ఎన్నడు మనము తప్పు చేయకుండా జీవిస్తాం. యిర్మియా ప్రవక్త యొక్క నూతన ఒడంబడిక  దేవుడు ఒక కొత్త జీవితానికి సూచనగా ఉన్నది అలాగే ఈ నూతన ఒడంబడిక యెహెజ్కేలు( 16:26-27)గ్రంథములో ఉన్న నూతన హృదయమును సూచిస్తున్నది దేవుడు మానవులలో ఉన్నటువంటి కఠిన హృదయమును తీసివేసి మాంసపు ముద్ద కలిగిన హృదయాన్ని దయచేస్తానని అంటున్నారు అనగా ప్రతి ఒక్కరికి కొత్త జీవితాన్ని దయచేస్తానంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో ఏసుప్రభు ఏ విధంగా తండ్రికి విధేయత చూపించి ఉన్నారో తెలియచేయబడినది. ఆయన తండ్రితో అన్నిటిలో సరిసమానమైనప్పటికీ కూడా ఆయన చిత్తమును ఈ భూలోకములో ఎంత కష్టమైనా నెరవేర్చి ఉన్నారు.
ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు మనము జీవించాలి(పవిత్రముగా దేవునితో) అంటే మరణించాలి అని (పాపానికి)  చెబుతున్నారు. కొందరు గ్రీకులు యేసు ప్రభువుని చూడటానికి వచ్చిన సందర్భంలో ఫిలిప్పుతో ఏసుప్రభు ని చూడాలి అని అడిగిన వేళ ఫిలిప్పు అంద్రెయ్యతో వారు ప్రభువుని చూడాలని తెలిపాడు. ప్రభువు దానికి గాను మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది అని తెలిపారు అదేవిధంగా ఏసుప్రభు ఈ విధంగా అంటున్నారు మనిషి కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అందరూ ఆయన వద్దకు ఆకర్షితులవుతారని అన్నారు. ఆయన మరణించక ముందే జ్ఞానానికి ప్రసిద్ధిగాంచినటువంటి గ్రీకు దేశస్తులే ఆయన యొక్క గొప్పతనమును చూడాలని ఏసుప్రభు చెంతకు వస్తున్నారు బహుశా వారు యూదా మతమును అనుచరించుటకు హృదయ పరివర్తనము చెందినటువంటివారై ఉండవచ్చు లేదా ఏసుప్రభు యొక్క గొప్పతనం విని ఆయనను చూడాలని అనుకుని ఉండవచ్చు. ఇది చాలా గొప్పదైన విషయం జ్ఞానులు సైతం దేవుడిని గుర్తించి ఆయన దగ్గరకు రావడం. ఈ యొక్క సందర్భంలో ఏసుప్రభు గోధుమ గింజ భూమిలో పడి నశించనంతవరకు అది అట్లే ఉండును కానీ నశిస్తే దాని నుండి కొత్త జీవము పుట్టును అని తెలిపారు. ఇక్కడ విత్తనము నశించితేనే తప్ప కొత్త జీవితం రావటం లేదు అదే విధంగా విత్తనము తనను తాను త్యాగం చేసుకుని మొక్కకు జన్మనిస్తుంది, ఉప్పు కూడా తనను తాను కరిగిపోతూ ఇతరులకు రుచిని అందజేస్తూ ఉన్నది అలాగే కొవ్వొత్తి కూడా  తాను కరిగిపోతూ ఇతరులకు వెలుగునిస్తుంది. 
వాస్తవానికి మనందరం కూడా నశించాలి. నశించుట అంటే మన యొక్క పాత జీవితానికి, 
- పాపపు జీవితానికి,
- స్వార్థానికి
- కోపానికి
- అసూయలకు
- సుఖ భోగాలకు
- ఈ లోక సంబంధమైన వాంఛలకు
- చెడు వ్యసనాలకు మనము మరణించినట్లయితే అప్పుడే మనలో కొత్త జీవితం కలుగుతుంది.
అదేవిధంగా ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు మన అందరిని కూడా ఆయనకు సాక్షులుగా ఉండమని తెలుపుచున్నారు. తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునుకై కాపాడుకొనును, నన్ను సేవింప గోరువాడు నన్ను వెంబడింపవలెను అని క్రీస్తు ప్రభువు తెలియచేశారు అనగా మన యొక్క జీవితం క్రీస్తు జీవితం వలే త్యాగ పూరితమైన జీవితంలా ఉండాలి.

Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...