18, ఏప్రిల్ 2021, ఆదివారం

పాస్కాకాల మూడవ ఆదివారము

 పాస్కాకాల మూడవ ఆదివారము

అ.కా. 3: 13-15, 17-19

1 యోహాను 2: 1-5

లూకా 24: 35-48 

మీకు శాంతి కలుగును గాక

క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, ఈనాటి మూడు పఠనములు హృదయపరివర్తన, పాపక్షమాపణ కలిగి పునరుత్తాన క్రీస్తు అనుగ్రహించే శాంతిని  స్వీకరించి, ఈ లోకములో మన జీవిత విధానము ద్వారా శాంతిని స్థాపించి దేవునికి సాక్షులుగా నిలువ ఆహ్వానిస్తున్నాయి. వీటిని మనము మూడు వంశముల రూపేణా ధ్యానిస్తూ అర్ధము చేసుకుందాము.

 1. హృదయపరివర్తన, పాపక్షమాపణ

2. అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చుకొనుట

3. పునరుత్తానుడైన క్రీస్తు ఒసగు శాంతిని స్థాపించుట

 1. హృదయపరివర్తన, పాపక్షమాపణ:

ఈనాటి పఠనాలలో హృదయపరివర్తన, పాపక్షమాపణను ప్రస్తావించుట చూస్తున్నాము. యేసుప్రభువు తన ప్రసంగాన్ని ప్రారంభించింది హృదయపరివర్తన అను అంశము మీదనే (మత్త 4:17) మరియు తన చివరి ప్రసంగము ముగించినది కూడా హృదయపరివర్తన అను అంశము మీదనే (లూకా 24:47). ప్రభువు ఈ లోకానికి రావడానికి కూడా కారణము హృదయపరివర్తనను కలిగించుటకేనని లూకా 5:32 మనము చూస్తున్నాము. పునీత బాప్తిస్మ యోహాను గారు కూడా హృదయ పరివర్తన యొక్క అవసరతను గురించి పలికారు(మత్త 3:2). పునీత పేతురు గారు యూదులకు చెప్పిన తన మొదటి ప్రసంగము, అన్యులతో పలికిన తన చివరి ప్రసంగము కూడా, ఆఖరికి తన చివరి ప్రసంగము కూడా హృదయపరివర్తన అను అంశము మీదనే. పునీత పౌలు గారు కూడా హృదయపరివర్తన అను అంశము మీద ప్రసంగించారు. ఎందుకు హృదయపరివర్తన ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అంటే దేవుని దగ్గరకు తిరిగి రావాలనే ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన మొట్టమొదటి పని: హృదయపరివర్తన (లూకా 15: 11-24). అసలు ఈ హృదయపరివర్తన అంటే ఏమిటి? హృదయపరివర్తన అంటే ఒక ప్రయాణము. ఎక్కడి నుండి ఎక్కడకు ఈ ప్రయాణము అంటే పాపపు జీవితము నుండి దేవుని యొద్దకు ప్రయాణము. క్రీస్తు పునరుత్తాన మహోత్సవము ముగిసిన తరువాత కూడా తల్లి తిరుసభ ఎందుకు ఈ పఠనాల ద్వారా మనలను హృదయపరివర్తన, పాపక్షమాపణ గురించి ధ్యానింపజేస్తుంది అంటే హృదయపరివర్తన కలిగి మన పాప జీవితానికి క్రీస్తుతో పాటు మరణించి మరల క్రీస్తుతో పాటు పునరుత్తానమైనప్పుడు మాత్రమే మనము ఒక నూతన వ్యక్తిగా జన్మింపగలుగుతాము, పునరుత్తానుడైన క్రీస్తు శక్తిని అనుభవింపగలుగుతాము.

2 . అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చుకొనుట:

శిష్యులందరు అవిశ్వాసముతో నిండియున్నారు. క్రీస్తు ప్రభువు మనుష్యకుమారుడు శ్రమలననుభవించి, మరణించి మూడవనాడు పునరుత్తానమవుతాడు అని పలు మార్లు వారితో చెప్పినను వారు దానిని గ్రహించలేకపోయారు. అందుకే  క్రీస్తు ప్రభువు పునరుత్తానాన్ని గ్రహించలేకపోయారు. చివరికి స్వయానా పునరుత్తానుడైన క్రీస్తే వారి ముందు నిలువబడినను గుర్తించలేకపోయారు. ఇదే సంఘటనను ఈనాడు మనము సువిశేష పఠనములో చూస్తున్నాము. తన శిష్యులకు ప్రభువు దర్శనమిస్తున్నారు. ఇది పునరుత్తాన క్రీస్తు మూడవ దర్శనము.

ఈ మూడవ దర్శనములో శిష్యులు భయభ్రాంతులై పునరుత్తాన క్రీస్తును ఒక భూతమును చూచుచున్నట్లు భావించారు (లూకా 24:37). అవిశ్వాసముతో నిండిన వారి హృదయాలు కలవరపడుచున్నవి. వారి మనస్సులు సందేహముతో నిండియున్నవి (లూకా 24:38). అప్పుడు క్రీస్తు తన చేతులను కాళ్ళను చూపుతూ వారిలో అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని నింపారు. వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై పునరుత్తాన క్రీస్తును విశ్వసించిరి (లూకా 24: 39-41). అవిశ్వాసము అనే మహమ్మారి మనలను కూడా పరిపాలిస్తూ దేవుని నుండి దూరంగా తీసుకువెళ్తుంది. విశ్వాసము క్రైస్తవ జీవితానికి పునాది. ఈరోజు మనము విశ్వాసముతో నింపబడివుండాలి. విశ్వాసము అనేది వినుట వలన కలుగుతుంది. క్రీస్తును గూర్చిన వాక్కు వినుట వలన కలుగుతుంది (రోమా 10:17). దేవుని వాక్కు విందాం, క్రీస్తును గూర్చిన సత్యాన్ని తెలుసుకుందాము. అవిశ్వాసులు కాకుండా విశ్వాసులుగా ఉంటూ మన జీవితాల్లో పునరుత్తానాన్ని విశ్వసించుదాం. పునరుత్తాన క్రీస్తును గుర్తించుదాం. 

3 పునరుత్తానుడైన క్రీస్తు ఒసగు శాంతిని స్థాపించుట:

క్రీస్తు ప్రభువు తన శిష్యులకు దర్శనమిస్తూ మీకు శాంతి కలుగునుగాక అనెను.(లూకా 24:36) ఎందుకు శాంతి? వారు అనుసరించిన గురువు మరణించాడు. కావున వారి జీవితాలలో వారు ఆశను కోల్పోయారు. వారి జీవితాలు ఒక గమ్యము లేని, లక్ష్యము లేని జీవితాలుగా మారిపోయాయి. వారి జీవితాలలో శాంతి అనేది ఒక పదముగానే మిగిలిపోతుంది, ఒక అనుభవము కాలేదనుకున్నారు. క్రీస్తు అనే ఒక గురువు కోసము అన్నిటిని విడిచిపెట్టాము కానీ, క్రీస్తు, తన మరణము తర్వాత మమ్ములను విడిపెట్టాడు అని వాపోయారు. కానీ క్రీస్తు మాత్రము మనలను అనాధలుగా విడిచిపెట్టేటటువంటి ఒక వ్యక్తి కాదు. మన నమ్మకాలను వమ్ము చేసేటటువంటి ఒక గురువు కాదు. మన ఆశలను నిరాశపరిచేటటువంటి దేవుడు కాదు. కానీ తన వాగ్దానాలను నిలబెట్టుకున్నటువంటి సత్యస్వరూపుడు. తాను చెప్పిన విధముగా మరణాన్ని గెలిచి మూడవనాడు పునరుత్తానమై తాను క్రీస్తునని నిరూపించుకున్నారు. చిన్నాభిన్నమైన తన శిష్యులకు కనిపించి మీకు శాంతి కలుగునుగాక అంటూ ఆశను నింపుతూ అభయమిస్తున్నారు. ఈ శాంతి మనము ఒకనాడు అవిధేయతతో పోగొట్టుకున్న శాంతి(ఆది 3) కానీ క్రీస్తు ప్రభువు తన మరణ, పునరుత్తానముల ద్వారా ఈ శాంతిని నెలకొల్పారు. ఇదే శాంతిని తన శిష్యులకు ఒసగుతున్నారు. ఈరోజు నీవు నేను ఈ శాంతిని మన జీవిత విధానము ద్వారా స్థాపించాలి. మనము ధ్యానించిన విధముగా పునరుత్తానమునకు రెండు మార్గములు ఉన్నవి. (i)హృదయపరివర్తన, (ii)పాపక్షమాపణ. కాబట్టి హృదయపరివర్తన చెందుదాము. పాప ప్రక్షాళన గావించబడుదాం. మన అవిశ్వాసాన్ని విశ్వాసముగా మలచుకుందాము. అనేక కారణాలతో చిన్నాభిన్నమైన మన జీవితాలలో శాంతి ఒసగమని పునరుత్తాన క్రీస్తును ప్రార్ధిద్దాము. పునరుత్తాన క్రీస్తు ఒసగే శాంతిని స్వీకరించుదాము. ఆ శాంతిని స్థాపిద్దాము.  ఆమెన్

Br. sunil inturi

10, ఏప్రిల్ 2021, శనివారం

పాస్కాకాల రెండవ ఆదివారము

 పాస్కాకాల రెండవ ఆదివారము

(1) అపో. కా 4: 32-35, (2) 1 యోహాను 5: 1-6,  యోహాను 20: 19-31

క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా ఈనాడు మనము పాస్కాకాల రెండవ ఆదివారములోనికి ప్రవేశించియున్నాము. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనముల ద్వారా తల్లి శ్రీసభ మనకు ఉత్తాన క్రీస్తు యొక్క ప్రతక్ష్యరూపము గురించి తెలియజేస్తుంది. చనిపోయిన వారిలో నుండి ఉత్తానము అయిన యేసు, తన శిష్యులకు కనిపించారు. యేసు చనిపోయిన నాటి నుండి 40 రోజుల పాటు తాను స్వయముగా వారికి కనిపించారు. తాను సజీవుడనని వారికి చాలా విధములుగా తెలియజేసారు. యేసు శిష్యులకు కనిపించినది తాను ఎప్పుడూ జీవిస్తున్నాడని శిష్యులకు నిరూపించడానికే మాత్రమే కాదు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడని, అనాధలుగా మనలను విడిచిపెట్టడని తెలియజేయుటకును, శక్తిని ఇచ్చుటకు కూడాను. ఆ రోజులలో దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు అనే విశ్వాసము ఉండేదని యెషయా ప్రవక్త గ్రంథములో ఇమ్మానుయేలు (యెషయా 7:14) అను వాక్యంలో చూస్తున్నాము. మనుష్య జాతితో చేసిన వాగ్దానము ద్వారా దేవుడు తన ప్రజలతో యుగాంతము వరకు వశించునని వారి నమ్మిక. ఆ నమ్మకము యేసు ప్రభువు ఉత్తానములో పూర్తవుతుంది. ప్రభువు ఇప్పుడు తన ప్రజలతో జీవిస్తున్నాడు. దర్శన గ్రంథములో మనము చూస్తున్నాము; సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతో నివసించును. వారే ఆయనకు ఆలయము. వారే అయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును (దర్శన 21:3).

ఈ నాటి సువిశేషములో మనము గమనించినట్లయితే పునరుత్తానము తర్వాత తండ్రి మహిమలో చేరిన క్రీస్తు తన శిష్యులను మర్చిపోలేదు. ఆ రోజు ఆదివారము తన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు(యోహాను). క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా వాగ్దానము నెరవేర్చే దేవుడు తన శిష్యుల వద్దకు వచ్చారు. అయన ఎప్పుడు వారిని వదిలిపెట్టలేదు అని ఈ దర్శనాలు సాక్ష్యమిస్తున్నాయి. యేసు ప్రభువు యొక్క దర్శనాల ప్రత్యేకత ఏమిటంటే వాటిన్నంటిలో ఆయనే ముందుటారు. శిష్యుల యొక్క లోతైన విశ్వాస ఫలముగాని, వారి దృఢ నమ్మకము గాని, నిరీక్షణాల ద్వారా గాని కాదు క్రీస్తు ప్రభువు ముందుకు వచ్చేది. ఆయన తనకు తానుగా వారి యొద్దకు వస్తున్నారు.

 

ఆయన బలపరిచితే తప్ప మనకు ఏమి అర్ధం కాదు. ఆయన క్షమియించిన మాగ్దలా మరియమ్మ మరియు ఎమ్మావు గ్రామమునకు ప్రయాణము చేసిన ఇద్దరు శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఆయన వారితో చెప్పినప్పుడే ఆయనను గుర్తించగలిగారు. శిష్యుల ఎన్నిక సమయములో ప్రభువు పలుకుతున్నారు మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను(యోహాను 15:16). ఈరోజు కూడా ఆయన మన మధ్యకు వస్తున్నారు. తన దర్శనాల ద్వారా తన స్నేహ సంబంధమును మరల మనయందు కలిగిస్తున్నారు. ఆయన దర్శనాలకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అది ఎవరు ముందుగా ఊహింపశక్యము కానిది. ఆయన ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో ఎవరు ఊహించలేదు. ఆయన రాకడ గురించి తెలుసుకుంటే ఒక విషయము అర్థమగుచున్నది. తన శిష్యుల అవసరతలలో పరుగెత్తుకు వచ్చారు క్రీస్తు ప్రభువు. కన్నీరు కార్చిన మాగ్దలా మరియమ్మను ఓదార్చుటకు వచ్చారు. ఎమ్మావు మార్గములో శిష్యుల హృదయాలను ప్రజ్వలింపచేయుటకు వచ్చారు. రాత్రంతయు శ్రమపడి చిన్న చేప కూడా దొరకని శిష్యులకు సమృద్ధిగా ఇచ్చుటకు ఆయన వారి యొద్దకు వచ్చారు. అందుకే ఉత్తాన ప్రభువు దర్శనాలు మనకు ఇచ్చే సందేశమేమిటంటే, మన అవసరతలలో కూడా ఆయన మన సమీపముననే ఉంటారు.

పునరుత్తానము అయిన ప్రభువు అందరికి దర్శనము ఇవ్వలేదు. ఈ భాగ్యము తన స్నేహితులకు, శిష్యులకు మాత్రమే దొరికింది. క్రీస్తు నాధుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పేతురు గారు ఈ విషయాన్ని చాల స్పష్టముగా వివరిస్తున్నారు, అయినను దేవుడు ఆయనను మృతులలోనుండి లేపి మూడవ నాడు మరల మాకు కనబడునట్లు చేసెను, దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కానీ ఆయన ఇతరులకు కనిపింపలేదు(అపో కా 10: 40-41) పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఉత్తానమైన ప్రభువు మొదట సారిగా దర్శనమిచ్చింది తనను ఎక్కువగా ప్రేమించినవారికి, వెదకినవారికి మాత్రమే. ప్రభువు యొక్క దర్శన భాగ్యము పొందాలంటే సహృదయ సంభందం కలిగిఉండాలని ప్రభువును నేర్పిస్తున్నారు. తనను వెదికే వారికి ఈరోజుకు కూడా ప్రభువు తన దర్శనాలను ఇస్తున్నారని మనము వింటున్నాము. ఆయన యొక్క దర్శనాలు, ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉంటాడని స్ఫూరింపచేస్తున్నాయి. ఉత్తాన ప్రభువు మనతో ఉన్నారని మనము గుర్తించలేకపోతున్నాము. ఈనాటి సువిశేషములో మనము గమనించినట్లయితే యూదుల వలన భయము నిమిత్తము గదిలో చేరి తలుపులు వేసుకున్న శిష్యులకు దర్శనమిచ్చినట్లు మనము చూస్తున్నాము. అయితే ఆ శిష్యులు మనలో కొందరి వలె బయటి నుండి అద్భుతముగా దేవుడు లోపలికి వచ్చాడని ఆలోచించారు. కానీ అది కాదు అక్కడ జరిగినది. వారితో పాటు ఆ గదిలో ఉన్నారు క్రీస్తు ప్రభువు. ఆ తర్వాత కూడా ఆయన వారితోనే ఉన్నారు. ఆయన తనకు తానుగ బయలుపరచకముందు కూడా ఆయన వారితో ఉన్నారని వారికి తెలియజేయుటకు ఆయన 40 రోజులు వారి ఎదుటకు వచ్చి ప్రత్యక్షమవడము, నిష్క్రమించడము జరిగింది. ఈ 40 రోజుల అనుభవాలను బట్టి ఆయన ఎల్లపుడు మనతోనే ఉంటున్నాడని మనకు బోధపడుతుంది.

 

క్రీస్తు ప్రభువు ఉత్తానమైనప్పుడు శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఎందుచేతనంటే, బహుశా వారి వారి నిరాశ నిస్పృహలకు మరియు భయాందోళనలకు బందీలై క్రీస్తు ఉత్తాన పరామరహస్యమును, సత్యమును మర్చిపోయారు. ఆ స్థితిలో ఉన్న శిష్యులకు ప్రభువు శాంతి సందేశాన్ని ఇస్తున్నారు. ఉత్తాన క్రీస్తు ఒసగుచున్న శాంతి సమాధానాలు ఈ లోకము ఇచ్చే శాంతి సమాధానాలు కావు. ఆయన మనలో ఉండి మనకు ఒసగేవి ఆంతరంగిక శాంతి సమాధానాలు. క్రీస్తు ప్రభవు తన శిష్యులకు ప్రత్యక్షపరచుకున్న సమయములో వారి ఆలోచనలను తప్పు పట్టలేదు. తనను ఎరుగనని బొంకిన పేతురును, విశ్వసించని తోమాసును విడిచిపెట్టలేదు. కానీ వారికి తన ప్రేమను తెలియజేస్తున్నారు. వారు అయన ప్రియమైన శిష్యులు, స్నేహితులని వారికి ప్రత్యేక భాద్యత ఉందని తెలియజేస్తున్నారు. మనము కూడా ఆ శిష్యుల వలె భయానికి బందీలమై మన యొక్క కర్తవ్యాన్ని మరిచి పోయే అవకాశము ఉంది. భయాందోళనల సమయములో మనము వాటినే తలచుకుంటుంటాము. వాటిలోనే లీనమై మన గమ్యాన్ని మరచిపోతాము. అంతేకాక అశాంతికి, నిరాశ నిస్పృహలకు గురి అవుతాము. కాబట్టి, ఈ సమయములో ఉత్తానుడైన క్రీస్తు ప్రభువు మనకు ఇచ్చే సందేశము మీకు శాంతి కలుగునుగాక. ఇది విరిగిన మనసులకు ఒసగే కానుక. వీటితో పాటు ప్రభువు మనకు నేను మీతో ఎల్లప్పుడూ ఉంటానని మాట ఇస్తున్నారు. ఆ ప్రభువు ఒసగే శాంతి సమాధానాలను స్వీకరించి ఆ ప్రభువుతో కలసి మన జీవితాప్రయాణాన్ని కొనసాగిద్దాము.

ఆమెన్.

Bro. Manoj OCD


పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...