1, మే 2021, శనివారం

పాస్కా కాల ఐదవ ఆదివారము

 

అపోస్తులుల కార్యములు 9:26-31,

1 యోహాను 3:18-24,

యోహాను 15:1-8

ఐక్యత కలిగి జీవించడం”

నేను మీయందు ఉందును మీరు నా యందు ఉండుడు. ద్రాక్షా వల్లి యందు ఉండని తీగ దానియంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు,” యోహాను 15 : 4.”

ఉపోద్ఘాతం:       

క్రీస్తునాధుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా! ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలు, క్రీస్తుని అంటి పెట్టుకొని, ఐక్యత కలిగి జీవించాలని మనల్ని ఆహ్వానిస్తున్నాయి. మన క్రైస్తవ జీవితం అంటేనే ఐక్యమైనటువంటి జీవితం. మన దేవుడైన త్రిత్వైక సర్వేశరుడు ఐక్యత కలిగినటువంటి దేవుడు. తండ్రి దేవుడు ఈలోకంలో తన ప్రణాలికను నెరవేర్చుటకు ఏ విధముగా తన కుమారుడి మీద ఆధార పడియున్నాడో అదేవిధంగా కుమారుడు తన తండ్రి కార్యాన్ని నెరవేర్చుటకు తండ్రి మీద అంతే ఆధారి పడియున్నాడు అని ఈ నాటి వాక్యంలో ధ్యానిస్తున్నాము. క్రీస్తు పునరుత్తానము తరువాత గడచిన వారాలు కూడా మనకు నిజమయినటువంటి దేవుడు, తండ్రి, కుమారుడు, ఇద్దరు కూడా ఒక్కరే అని క్రీస్తు పలుకుల ద్వారా ఇంతకుముందు పఠనాలలో ధ్యానించి యున్నాము. గడచిన వారం క్రీస్తు ఒక మంచి కాపరిగాను, మరి ఈనాడు క్రీస్తు ఒక నిజమయినటువంటి ద్రాక్షా వల్లిగాను ధ్యానిస్తున్నాము.

నేను ద్రాక్షావల్లిని మీరు రెమ్మలు:

క్రీస్తు ప్రభు నివసించినటువంటి పాలస్తీనా దేశంలో ద్రాక్షా చెట్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. అక్కడ ద్రాక్షా చెట్లు చాలా ఎక్కువగ ఉంటాయి. చాలా మంది ఆ తోటలో పనిచేయుటకు వెళ్తుంటారు. కనుక అక్కడి వారందరికీ ఆ ద్రాక్షావల్లికి {ద్రాక్షా చెట్టుకి}, దాని తీగలకు మధ్య ఉన్న సంబంధం గురించి బాగా తెలుసు. ద్రాక్షావల్లికి ఉన్నటు వంటి తీగలు ఎప్పుడు మంచి ఫలాలన్నిస్తాయి, ఫలించాలంటే ఏమి చెయ్యాలో, ఫలించనటువంటి తీగలను ఏ విధంగా కత్తిరించి పారవేస్తారో, వారికి బాగా తెలుసు. కాబట్టి క్రీస్తు ప్రభు ఈ ఉపమానం ద్వారా తండ్రికి, తనకు తన శిష్యులకు మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు.

తండ్రి దేవునికి, కుమారునికి మరియు మనకు మధ్యగల అనుబంధాన్ని గుర్తిస్తుంది. తండ్రి వ్యవసాయదారుడు లేదా ద్రాక్షా రసం పెంపకందారుడు, యేసు ప్రభు ద్రాక్షా చెట్టు, మనం రెమ్మలం. ఇందులో క్రీస్తు ప్రభు పాత్ర ఏమిటంటే తనయందు ఉన్నటువంటి  రెమ్మలకు జీవాన్ని అందించడం, ఆ ద్రాక్షా తీగలమయిన మనకు జీవం పోయడం. తండ్రి, ద్రాక్షా వల్లి అయిన క్రీస్తుకి శక్తిని ఇవ్వడం మరియు క్రీస్తుని హత్తుకొని ఉన్న రెమ్మలను సరిచేయడం లేదా క్రీస్తు నుండి జీవం పొంది ఫలించు వాటిని అధికంగా ఫలించుటకు వాటిని కత్తిరించి, ఫలించనటువంటి వాటిని తీసిపడేసి కాల్చివేయుట. ఈ ఉపమానం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే క్రీస్తుని అనుసరించువారు ఫలించాలంటే, వారు క్రీస్తు యందు జీవించాలి. క్రీస్తు లేకుండా మన ఆధ్యాత్మిక జీవితం లో ఏది చేయలేము, ఏది పొందలేము అని క్రీస్తే ఈ నాటి సువిశేషంలో చెబుతున్నాడు. ద్రాక్షా వల్లి యందు ఉండని తీగ దానియంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు {యోహాను 15 : 4}.

ఫలభరితమయిన తీగలు:

శిష్యులు క్రీస్తుకి సన్నిహితంగా జీవించడం ద్వారా ఉన్న అనుబంధాన్ని గురించి మరియు ఆ బంధాన్ని అలాగే కొనసాగించాలని ఈ ఉపమానంలో తెలియజేస్తున్నాడు.  తండ్రి కుమారిని మీద, కుమారుడు తండ్రి మీద ఏవిధముగా ఆదారిపడియున్నారో, అదే విధముగా, క్రీస్తు అనుచరులమయిన మనము రక్షణ పొందాలంటే తండ్రితో ఐక్యమవ్వాలంటే నువ్వు, నేను, మనమందరము క్రీస్తులో జీవించాలి, ఆ క్రీస్తుని మన జీవితంలోకి ఆహ్వానించాలి. అప్పుడు ద్రాక్షా వల్లికి ఫలించే తీగలవలె మన జీవితంలో గూడ  క్రీస్తు ఫలాలు పొందుతాము. పునరుత్తానమైనటువంటి క్రీస్తుకి సన్నిహితంగా జీవించిన శిష్యులు ఆధ్యాత్మిక ఫలాలు పొందారు అని మొదటి పఠనములో చదువుతున్నాము. ఆ ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఈ నాటి మొదటి పఠనంలో పునీత పౌలు గారిలో చూస్తున్నాము. పౌలు గారు ఒక పరిసయ్యుడు. క్రైస్తవులను హిసించినటువంటి ఒక మతోన్మాది. అటువంటి వ్యక్తి, పునరుత్తాన క్రీస్తు దర్శనం కలిగిన వెంటనే మంచి ఫలాన్ని ఉత్పత్తి చేసే రెమ్మ వలె మారాడు. క్రీస్తుని తన హృదయంలోకి ఆహ్వానించాడు. ఆ క్షణం నుంచి క్రీస్తులో తన విశ్వాసాన్ని బలపరచుకొని క్రీస్తుని అంటిపెట్టుకుని, క్రీస్తు ఫలాలు పొంది తన జీవితం మొత్తం కూడా క్రీస్తు సువార్తను బోధిస్తూ, క్రీస్తే నిజమయినటువంటి రక్షకుడు అని ఆ క్రీస్తుని అన్యులకి అందిచారు. క్రీస్తు నుంచి ఆధ్యాత్మిక జీవం పొందాడు. అందుకే పౌలు గారు గలతీయులకి రాసిన లేఖ 2  : 4 వచనంలో ఈవిధముగా అంటారు. నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. అంత దగ్గరగ క్రీస్తుని హత్తుకొని జీవించాడు. క్రీస్తులో తన జీవితం ప్రారంభించినప్పుడు తనలో క్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మలినాలన్నింటిని (పగ, కోపం, ద్వేషం, అసూయ మరియు హింస) లన్నింటిని తండ్రి దేవుడు కత్తిరించి, వినయం, ప్రేమ, దయ, కరుణ, త్యాగం అనే ఫలాలతో నింపాడు. క్రీస్తు ఏ విధంగా మన రక్షణ కొరకు మానవరూపందాల్చి ఒక సేవకునివలె జీవించాడో అదే విధంగా పునీత పౌలు గారు తన సువార్త పరిచర్యలో అన్యులకు మరియు అందరికి అన్నివిధాలుగా తనను తాను మలచుకొన్నాడు, 1 కొరింతి 9 : 19 - 23 వచనాలలో చూస్తున్నాము.  అందుకే ప్రభు సువిశేష పఠనములో స్పష్టంగా చెబుతున్నారు. నేను మీయందు ఉందును మీరు నాయందు ఉండుడు. నేను లేకుండా మీరు ఏమియు చేయజాలరు అని {యోహాను 15 : 4}.  శిష్యులు నమ్మలేదు పౌలు పొందిన మార్పును గూర్చి. వారిని చంపివేయడానికి వచ్చారని భయపడిరి. బర్నబా ద్వారా జరిగిన సంఘటన గూర్చి వారికి ఎరుకపరచబడింది. అప్పుడు వారు శాంతి పొంది పౌలు ని ఆహ్వానించిరి. ఎందుకంటే క్రీస్తు తనతో ఉన్నాడు కాబట్టి.

క్రీస్తుతో ఐక్యమవడం ఎలా?

ప్రార్థన చేయడం ద్వారా,  దేవుని వాక్యాన్ని విశ్వాసంతో ఆలకించి పాటించడం ద్వారా క్రీస్తు మనలను బలపరుస్తాడు. ఉదాహరణకు పునీతులు అనునిత్యం ప్రార్ధిస్తూ, దేవునియందు విధేయత కలిగి, దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆచరించారు కాబట్టి వారు దేవునితో ఐక్యమైయున్నారు. చాలా మంది చర్చికి వస్తుంటారు, అన్ని కార్యాలలో పాల్గొంటారు గాని క్రైస్తవ జీవితాన్ని పాటించరు, క్రీస్తుయందు జీవించరు, దేవుని వాక్యాన్ని వింటారు కానీ దానికి అనుగుణంగా జీవించరు. అట్టివారిని తండ్రి దేవుడు ఫలించని రెమ్మలవలె కత్తిరించి అగ్నిలో పారవేయును. ఎందుకంటే వారు క్రీస్తు నుంచి జీవం పొందుతున్నారు కానీ ఆ జీవాన్ని వృధా చేస్తున్నారు. వారి వల్ల ఫలించు వారికి ఇబ్బంది అవుతుందని పారవేయును. ఈనాడు ప్రపంచం అంతా కరోనా వైరస్ కి బయపడి జీవిస్తుంది. ఇటువంటి సమయంలో మనం క్రీస్తుయందు దృఢమయిన విశ్వాసం కలిగి క్రీస్తులో జీవించినట్లయితే తప్పకుండా ప్రభువు  మనందరినీ  దీవిస్తాడు, రక్షిస్తాడు. ఎందుకంటే క్రీస్తు మనతో ఉంటె అన్నియు సాధ్యమే అని  రోమా   8:31 లో చూస్తున్నాము.

క్రీస్తు అనుచరులం,  ప్రియ బిడ్డలమయిన మనం నేటి సమాజంలో ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తుకి అంటి పెట్టుకొని ఫలించే రెమ్మల వలే  ఉన్నామా లేక ఫలితం లేదు అని పారవేయబడినటువంటి రెమ్మల వలె ఉన్నామా అని ధ్యానించాలి. క్రీస్తులో జీవించాలనుకొను వారికి ఏది అడిగిన ఇవ్వబడును అని యేసు ప్రభు ఆహ్వానం పలుకుతున్నారు. రెండవ పఠనంలో పునీత యోహాను గారు అంటున్నారు కేవలం క్రీస్తులో విశ్వాస ముంచి క్రీస్తుతో ఐక్యమై జీవిస్తే తప్ప మనం ఎటువంటి ఆధ్యాత్మిక శక్తిని గాని, ఫలాలు గాని  పొందలేము అని. ఎప్పుడైతే పునీత పౌలు గారి వలె క్రీస్తే సర్వము అని క్రీస్తుని మన జీవితం లోకి ఆహ్వానించి మనం ఆ ప్రభువుని అంటిపెట్టుకొని జీవిస్తామో అప్పుడు దేవుని వరాలు, ఆధ్యాత్మిక ఫలాలు, ప్రేమ, సహనం, దయ, జాలి, త్యాగం కలిగి దేవుని రక్షణ పొందుతాము. కనుక నేను క్రీస్తు అనుచరుడిని, అయన సేవకుడిని అని ఒత్తి మాటలతో చెప్పుకోవడం కాకుండా దేవుని ఆజ్ఞలను, ముఖ్యంగ క్రీస్తు ప్రేమ ద్వారా మన పొరుగువారిని ప్రేమించి, అందరితో ఐక్యమై సహాయ సేవచేస్తూ  మన జీవిత కార్యాల ద్వారా క్రీస్తే నాలో జీవించేది అని అందరికి క్రీస్తుని అందిస్తూ క్రీస్తుని తెలియ చేద్దాం.

ద్రాక్షావల్లికి తీగల వలే క్రీస్తుతో మన అనుబంధాన్ని పెంచుకొని క్రీస్తు బాటలో పయనిద్దాం. అందుకు మన జీవితంలో దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉన్న వాటిని మన జీవితం నుండి పారద్రోలి క్రీస్తు శక్తితో అన్ని శోధనలను జయించి జీవించాలి. మరియు క్రీస్తులో మనము, మనలో క్రీస్తు జీవించుటకు ఆహ్వానించాలి. అందుకు కావలసిన దైవానుగ్రహాలను దయచేయమని ఈనాటి దివ్య బలిపూజలో ప్రార్థిదాం. ఆమెన్

Br. Vijay Thalari. OCD

24, ఏప్రిల్ 2021, శనివారం

నాలుగవ పాస్కా ఆదివారము

 

క్రీస్తు నాథునియందు ప్రియ సహోదరీ సహోదరులారాఈనాడు మనం పాస్కా కాలపు నాలుగవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా కుడా కొనియాడుతున్నాం.  ఈనాడు మూడు దివ్య గ్రంథ పఠనాలు మనకు బోధించేది ఒక్కటే. అది యేసు క్రీస్తు మంచి కాపరిగా ఉంటూమనలను సకల ఆపదలనుండి సంరక్షిస్తున్నాడనిబోధిస్తున్నాయి. 

ముందుగా మనం మొదటి పఠనాన్ని చూస్తే,ఇక్కడ పేతురు గారు పవిత్రాత్మ శక్తిని పొంది, కుంటి వానికి స్వస్థత నిచ్చిన తరువాత, విచారణ సభ ముందు నిలబడి, అక్కడ ఉన్న ప్రజా నాయకులను, పెద్దలను ఉద్దేశించి,యేసు ప్రభువు యొక్క గొప్పతనము గురించి, తన యొక్క శక్తిని గూర్చి, ధైర్యముగా సాక్ష్యమిస్తున్నాడు. ఈనాడు ఈ కుంటి వాడు లేచి నడుస్తున్నాడు, దానికి కారణం యేసుప్రభువు మాత్రమే. ఆయన నామములో శక్తి వుంది. అందుకే ఈనాడు మేము ఆయనకు సాక్ష్యం  ఇస్తున్నాము.కానీ మీరు ఆయనను సిలువపై కొట్టి చంపారు. ఇల్లు కట్టు వారైన మీరు, రక్షకుడైన యేసు క్రీస్తును పనికిరాని రాయి అని  త్రోసివేసారు.కానీ  ఇప్పుడు ఈ లోకంలో  రక్షణ లభించాలి అంటే, యేసు క్రీస్తు తప్ప వేరొక వ్యక్తి లేడు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి  ఇవ్వబడలేదు".

ఒకప్పుడు పేతురు జీవితం మనం చూస్తే,  మూడు సంవత్సరాలు యేసు ప్రభువుతో వుండి కూడా, అతని శక్తిని చూసి కూడా, ప్రభువుని వదిలివేసి పారిపోయాడు, అవిశ్వాసిగా మారాడు,యూదులు అతడిని చంపివేస్తారని భయపడ్డాడు.కానీ యేసుప్రభు పునరుత్తానమైన తరువాత శిష్యుల దగ్గరకు వచ్చి మీకు శాంతి కలుగును గాక! అని చెప్పిన తరువాత వారికి పవిత్రాత్మ శక్తినిచ్చి, వారిని సాక్షులుగా  మారుస్తున్నాడు( యోహా ;20 ; 21 -23 ) . మరి ఈనాడు నువ్వు నేను దేవుని యొక్క రక్షణను పొందాలి అంటే, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలి, అయన యందు విశ్వాసము ఉంచి  ఆయన దగ్గరకు చేరాలి. అప్పుడే మనకు నిజమైన రక్షణ లభిస్తుంది.

రెండవ పఠనము గమనిస్తే, దేవుడు తన బిడ్డలపై చూపు ప్రేమ ఎంతో  మిక్కుటము అని బోధిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమ మూలమునే ఇప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలము అని పిలువబడుచున్నాము.మరి ఇప్పుడు మన పని ఏమిటంటే, యేసయ్యను మనం చూడాలి అంటే, అయన  వలె అవ్వాలి అంటే, అయన యందు మనము నిరీక్షణ కలిగి జీవించాలి.అప్పుడే మనకు, మనజీవితానికి, ఒక అర్ధం ఉంటుంది. ఎందుకంటే అయన ప్రేమ  ఎలాంటిది అంటే, రక్షించే ప్రేమ. జీవాన్నిచ్చే  ప్రేమ. మరణించు ప్రేమ.మరణించి తిరిగి లేచి, నీకు శాశ్వత, నూతన జీవితాన్నిచ్చు ప్రేమ. మరి అలాంటి  ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుందంటే కేవలం మన యేసుక్రీస్తులోనే. కాబట్టి మనమందరం దేవునియొక్క  బిడ్డలుగా మారడానికి ప్రయత్నిద్దాం, ప్రయాస పడుదాం.

                సువిశేష పఠనాన్ని మనం చూస్తే, నేను మంచి కాపరి అని అంటున్నాడు యేసు ప్రభువు. ఎందుకు దేవుడు నేను మంచి కాపరి అని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే,చెదిరిపోయిన గొఱ్ఱెలవలె వున్న మనందరినీ ఒక్కటిగా చేయడానికి. అయితే మంచి కాపరి అంటే, తన మందను ఎప్పుడూ సురక్షితముగా ఉంచుతూ, సక్రమమైన బాటలో నడిపిస్తూ, వాటికి కావలిసిన ఆహారాన్ని సమకూర్చుతూ,తగుజాగ్రత్తలు తీసుకుంటూ,ఒక మంచి నివాస స్థలమును ఏర్పరిచే వాడే మంచి కాపరి.సాధారణంగా మనం చూసే కాపరులు గొర్రెలను మేపడానికి తీసుకెళ్లేటప్పుడు తాను గొర్రెల ముందుగా నడుస్తూ, వాటిని పచ్చిక ప్రదేశాలకు తీసుకొని వెళ్తాడు. మరి యేసు ప్రభువు కుడా అదే చేసాడు. మూడు సంవత్సరములు ఈలోకంలో వుండి, తాను సత్యమైన మార్గములో నడుస్తూ,ఒక స్వచ్ఛమైన గొర్రె పిల్లలా ఈలోకంలో జీవించాడు. యోహా;1 ;29 లో చూస్తే బాప్తిస్మ యోహాను ఇలా అంటున్నాడు, "ఇదిగో! లోకముయొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల." మంచికాపరి తన మందలకొరకు తన ప్రాణం ధారపోయును. యిర్మీ ; 31 ;10 లో, "నేను ఇశ్రాయేలును చెల్లా చెదరు చేసితిని.కానీ వారిని మరల ప్రోగు చేయుదును.కాపరి మందనువలె వారిని కాచి కాపాడుదును" అని అంటున్నాడు.

ఈ లోక కాపరులకు, మంచి కాపరి అయినటువంటి యేసుక్రిస్తుకు మధ్య తేడాను చూస్తే, ఆదాము అవ్వలు ఏ విధంగా దేవునికి అవిధేయులయ్యారో చూస్తున్నాం. ఆది;1;26-27 లో చూస్తే, తండ్రి దేవుడు ఈ లోకాన్నంతటిని సృష్టించిన తరువాత ఈ లోకంలో వున్న ప్రతి ప్రాణి మీద అధికారాన్ని మానవునికి మాత్రమే ఇస్తున్నాడు. కానీ దేవుని వలె కావాలని, అయన జ్ఞానమును పొందాలని,సర్పము చెప్పిన మాటలను నమ్మి దేవునికి విరుద్ధముగా పాపమును ఒడిగట్టుకున్నారు (ఆది;3;2-5). మోషేను ఇశ్రాయేలీయులకు ఎన్నుకొని,కాపరిలేని వ్యక్తులుగా వున్న ఇశ్రాయేలు జన సమూహాన్ని బానిసత్వం నుండి విడిపించడానికి ఐగుప్తు దేశానికి పంపిస్తున్నాడు.కానీ మోషే దేవునియొక్క ఆజ్ఞలను జవదాతాడు. ప్రజలు గొణిగినప్పుడు దేవుని యొక్క పవిత్ర శక్తిని తెలియజేయలేదు (సంఖ్య ; 27;14 ). అందుకుగాను మోషే, అహరోనులవలె దేవుడు ప్రమాణం చేసిన కనాను దేశమున అడుగు పెట్టలేక పోయారు.ఇంకా సంసోను దేవునిచే ఎన్నుకొనబడి, గొప్ప శక్తిని పొంది,ఇశ్రాయేలు నాయకుడుగా చేసాడు. కానీ ఒక స్త్రీ మాటలకు లొంగి, ఆమెతో వ్యబిచారం చేసి పాపము చేసి శక్తిని కోల్పోయి, చివరికి తన ప్రాణాల్ని కోల్పోయి దేవుడిచ్చిన కార్యాన్ని నెరవేర్చలేక పోయాడు. ఇలా ఎంతో మంది జీవితాలలో జరిగింది. సౌలు ధనంమీద, జంతువులమీద ఆశతో దేవుని మాటను దిక్కరించాడు.దాని ఫలితం రాజరికాన్ని కోల్పోయాడు(1 సమూ ;10;1,15;10-11,14-15). దావీదు మహారాజు బెర్షెబా మీద మనసుపడి ఆమెతో వ్యభిచరించి, ఆమె భర్తను చంపి దేవునికి కోపం తెప్పించాడు. ఇలా ఎంతోమంది దేవుడు ఎన్నుకున్నటువంటి కాపరులు పేరు పలుకు బడి కోసం,ధనం కోసం, అధికారం కోసం దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకు న్యాయం చేయలేక పోయారు. జెఫన్యా;11;16 లో ఇలా అంటుంటాడు,"నేను నా మందకు ఒక కాపరిని నియమించితిని, కానీ అతడు నాశనమును గురికానున్న మందను కాపాడడు. తప్పి పోయిన గొర్రెలను వెదకడు,గాయపడినవాటిని నయము చేయడు,చావగా మిగిలిన వానిని మేపడు.పైపెచ్చు, అతడు క్రొవ్విన గొర్రెల మాంసమును తినివేయును.వాని గిట్టలు చీల్చి వేయును".అని అంటున్నాడు. అయితే మన మంచి కాపరి ఐన యేసు ప్రభువు అలాంటి కాపరి కాదు. ఎందుకంటే, మన కాపరి రక్షించు కాపరి.పోషించు కాపరి. మన గాయములకు కట్టుకట్టు కాపరి. అదే విధముగా మన ప్రాణం కోసం తన ప్రాణాన్నైనా పణంగా పెట్టు కాపరి. అలాంటి కాపరి ఈనాడు నీతో నాతో అంటున్నాడు, నేను మంచి కాపరి అని.

అయితే, పు. మత్తయి గారు,నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచూ కాపరి లేని గొర్రెల వలే చెదరి యున్న జనసమూహాన్ని చూసి, ఆ కరుణామయుడి కడుపు తరుగుకొని పోయెను అని అంటున్నారు(మత్త ;9;36). అంటే ఇన్ని రోజులు వారి కష్టాలలో మ్రగ్గిపోయి వున్నారు. సరైన కాపరి లేక అల్లాడి పోయారు. కానీ నాలుగు వందల సంవత్సరాల దాకా ఏ ప్రవక్త యొక్క ప్రవచనాలను వారు వినలేదు.దేవునియొక్క స్వరం వారికి వినిపించ లేదు.కానీ ఇప్పుడు,మలాకీ ప్రవక్త ప్రవచనాల తరువాత యేసు ప్రభువు వారికి భోదిస్తున్నసమయంలో ఎంతోమంది ప్రజలు దేవుని దగ్గరకు తండోప తండాలుగా వస్తున్నారు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తున్నారో వారు స్వస్థతను పొందుతున్నారు. సంతోషముతో నింపబడుతున్నారు. మరి నువ్వు, నేను నిజమైన విశ్వాసంతో దేవునిదగ్గరకు వస్తున్నామా? అని మనం ధ్యానించాలి.మన కాపరి తన ప్రాణాన్ని తన గొర్రెలమైన మనకోసం ధారపోసే  ఒక గొప్ప కాపరి. ఆయన ఇలా అంటున్నాడు, నేనే మంచి కాపరిని. నా మంద కొరకు ప్రాణమును ఇచ్చెదను" (యోహా; 10 ;11 ). మన పాపములను తొలగించడానికినూతన జీవితమును ప్రసాదించడానికి,ఆయన సిలువపై మరణించి,మూడవనాడు తిరిగి లేచి మనకు రక్షణ కల్పిస్తాడు. ఒక జీతగాడు తన జీవితం సాగడానికి,డబ్బును సంపాదించ డానికి, తన కుటుంబాన్ని పోషించ డానికి పనిచేస్తాడు. కానీ,తనకు గానీ, గొర్రెలకు గాని కష్టం వస్తే, బయపడి వెనకకు తిరిగి పారిపోతాడు, తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు.ఇది నిజమైన కాపరి అయినటువంటి యేసయ్యకు,జీతగానికి ఉన్న తేడా.

         మంచి కాపరి లక్షణాలు:1 .మందను మేపేవాడు.2 .రక్షించు వాడు. 3 .నివాసమేర్పరిచేవాడు.

1.      మందను మేపేవాడు:

                  ప్రతి యొక్క కాపరి తన మందకు తగిన ఆహారాన్ని ఇవ్వడానికి మందను ఒక మంచి పచ్చిక పట్టుల దగ్గరకు తీసుకొనివెళ్ళి,అవి సంతృప్తిగా భుజించువరకు వాటితోనే ఉంటాడు ( యిర్మీ;50 ;19 ). అదేవిధంగా మనకాపరి  అయిన యేసయ్య కూడా మనకు తన వాక్కు ద్వారా, పవిత్రాత్మ శక్తి ద్వారా,స్వస్థత ద్వారా, మనలను మేపుతూ,మన శరీరాన్ని, ఆత్మను,నింపుతూ ఉంటాడు.

2.    రక్షించు వాడు:

               దేవుడు ఈ లోకానికి వచ్చినది మనలనందరిని రక్షించడానికే కానీ శిక్షించుటకు కాదు.ఎందుకంటే ఇది రక్షణ ప్రణాళిక.ఈ రక్షణ ప్రణాళికలో అందరూ రక్షణ పొందాలని మనందరి కోసం ఆయన శిక్ష అనుభవించి,మనకు రక్షణ తెచ్చాడు. దేవుడు అంటూ వున్నాడు,"మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించ డానికి వచ్చియున్నాడు"(మత్త;18 ;11 ).

3.     నివాసం ఏర్పరిచే వాడు:

ప్రతియొక్క కాపరి గొర్రెల కొరకు ఒక నివాసాన్ని ఏర్పరచాలి.ఎందుకంటే,వర్షానికి తడిసిపోకుండా,ఇతర జంతువుల బారిన పడకుండా, దొంగల నుంచి కాపాడటానికి,ఒక నివాసాన్ని లేక గుడారాన్నిఏర్పరుస్తారు.అదేవిధంగా, యేసయ్య కూడా మనందరి కోసం ఒక నివాస స్థలాన్ని ఏర్పరిచాడు. యోహా; 14 ;2 లో చూస్తే,"నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు.లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను.నేను మీకొక నివాస స్థలమును సిద్దము చేయబోవుచున్నాను".అని అంటున్నాడు.

        మరి ఈనాడు నీవు మంచి కాపరిలా ఉండాలనుకుంటున్నావా, లేక జీతగాని వలె నీ ప్రాణాన్ని నీవు దక్కించుకొని, స్వార్థంగా జీవించాలనుకుంటున్నావా? ఈ లోకంలో ఎంతోమంది కాపరులు వున్నారు. గురువులుకన్యాస్త్రీలుఉపదేశకులు మాత్రమే కాదు. కానీప్రతియొక్క వ్యక్తి కాపరి యొక్క గుణాన్ని, లక్షణాన్ని పొందాలి.  ప్రతి యొక్క తల్లి, దండ్రులు తమ పిల్లలకు మంచి కాపరులుగా వుంటూ,సక్రమమైన మార్గములో నడిపిస్తుండాలి. బిడ్డలను దీవించాలి.(ఆది;27 ;25-29)ఈసాకు యాకోబును దీవించిన విధముగా వారిని బోధించాలి( ద్వితీ;6 ;7 ;4 ; 9 ).శిక్షణనివ్వాలి (సామె;22;6).అదే విధంగా ప్రతియొక్క ఉపాధ్యాయినీ ఉపాద్యాయుడు చదువుకొనే ప్రతియొక్క వ్యక్తికి కాపరిగా ఉంటూ,వారిని క్రమశిక్షణలో నడిపించాలి. ప్రతియొక్క రాజకీయ నాయకుడు కాపరియే. వారుకూడా ప్రజలను ఏ తారతమ్యం లేకుండా వారికి కావలిసిన సదుపాయాలు అందచేస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, వారికి ఎప్పుడూ చేరువలోనే ఉండాలి. కానీ,వారి అవసరాలకోసం ప్రజలను వాడుకొని, అవసరం తీరాక వారిని పట్టించుకోకుండా,డబ్బుని, హోదాని, పోగుచేసుకొని, ప్రజలను కష్టాలలో విడిచి పెట్టకూడదు.అదేవిధంగా, ప్రతియొక్క వ్యక్తి,ఇతరులకు కాపరిగా మారాలి.అప్పుడే మనలో,మరియు సంఘములో,ఈ లోకంలో మార్పు వస్తుంది.దీని కోసం మనం తపన పడాలి.

మరి  ఈనాడు నువ్వు నేను మన స్వార్ధం కోసం చూడకుండా, ఇంతరులకు సహాయం చేస్తూ, ఒక మంచి కాపరి వలె మన జీవితాన్ని ఇతరుల శ్రేయస్సు కోసం మరణానికయినా  వెనకాడకుండా జీవించడానికి  ఈ దివ్య బాలి పూజలో ఆ దేవాతి దేవునికి  మనసారా ప్రార్దిదాం.

ఆమెన్.

Br. Joseph mario sunil nandigama

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...