4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

5 వ సామాన్య ఆదివారం (మూడవ సంవత్సరం )

 దైవ పిలుపు- దైవ పిలుపునకు మన స్పందన -దైవ పిలుపు ఉద్దేశం 

యోషయా 6:1-8,     1 కోరింథీ 15:1-11             లూకా 5:1-11 

ఈనాడు  తల్లి తిరుసభ 5 వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి మూడు పఠనాలు దైవ పిలుపు  గురించి ప్రస్తావిస్తున్నాయి. వీటిని వివరంగా మూడు అంశాల రూపేనా ధ్యానిస్తూ, అర్థం చేసుకొని మన జీవితాలకు అపాదించుకుందాం. 

1. దైవ పిలుపు 

2. దైవ పిలుపునకు మన స్పందన 

3. దైవ పిలుపు ఉద్దేశం 

1 . దైవ పిలుపు -

 దైవ పిలుపు  చాలా పవిత్రమైనది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క  విధంగా పిలుస్తుంటారు. దేవుని యొక్క పిలుపు మరియు ఎన్నిక మానవ మేధస్సుకు అతీతంగా వుంటుంది. దేవుడు సామాన్యులను నిరాక్షరాసులను , అయోగ్యులను , మానవ దృష్టిలో  దేనికి పనికిరారు అన్నటువంటి అతి సాధారణమైన వ్యక్తులను పిలిచి, ఎన్నుకొని, వారిని తనకు తగిన వారీగా మలిచి ,అభిషేకించి తన ప్రేషిత కార్యాన్ని వారి ద్వారా నెరవేరుస్తారు. దేవుడు అల్పులను పిలిచి అత్యదికులను చేస్తారు.  బలహీనులను పిలిచి బలవంతులను చేస్తారు. అయోగ్యులను పిలిచి యోగ్యులనుగా చేస్తారు. 

మనము పవిత్ర గ్రంధంలో  ఎంతో మందిని పిలవడం ,మరెంతో మందిని ఎన్నుకోవడం చూస్తున్నాం. ముఖ్యముగా ఈనాటి మొదటి పఠనంలో అతి సామాన్యమైన యోషయాను పిలిచి ప్రవక్తగా మలుస్తున్నారు.(యోషయా 6:8). రెండవ పఠనంలో సౌలును పౌలుగా అంటే హింసకుడిని , సువార్త సేవకై పిలిచిన దేవుడు తన సువార్త వ్యాప్తికై ఒక సాధనముగా వాడటం చూస్తున్నాం.(1 కోరింథీ 15:10-11), మరియు చేపలు పట్టువాడైన సీమోనును ప్రేరేపించి పిలిచి మనుషులు పట్టువానిగా మలచడం చూస్తున్నాం.(లూకా 5:1-11). 

 ఈరోజు అత్యల్పులమైన,  అతి సామాన్యులమైన , అయోగ్యులమైన మనందరిని ప్రభువు పేరు పెట్టి పిలుస్తున్నారు. కొందరిని తన సువార్త సేవకై  మరి కొందరిని కుటుంబ జీవితానికి పిలుస్తున్నారు. పిలువబడిన వారు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. కానీ మనం ప్రభువు పిలుపునకు స్పందిస్తున్నామా ? సరిగా స్పందిస్తే ఈ పిలుపు మన జీవితాలను మలచకలదు,  మన జీవితాలను మార్చ కలదు. మన జీవిత ఉద్దేశాలను కార్యసాధనకు చేర్చకలదు. 

2 . దైవ పిలుపునకు మన స్పందన 

దేవుడు మనలను పిలవడం ఒకెత్తయితే దానికి స్పందించడం మరొక ఎత్తు . దైవ  పిలుపునకు స్పందించడం అంటే కేవలం కాళ్ళ నడక ద్వారా దేవుని అనుసరించడం కాదు. కానీ పిలుపునకు అనుగుణంగా  మన జీవిత మార్పు ద్వారా  దేవుని అనుసరించడం. మనం దేని నుండి దేనికి పిలవబడ్డాం అని గ్రహించాలి. ఎవరి చేత పిలవబడ్డాం, అని తెలుసుకోవాలి మరియు దానికి అనుగుణంగా  స్పందించాలి. అంటే 

1. మన పాపపు స్తితిని గ్రహించాలి: -నేను హా !చేడితిని కదా ! నా నోటి నుండి వెలువడునవన్నియు  అపవిత్రమైన మాటలే.  అపవిత్రమైన మాటలు పల్కు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. అని యోషయా ప్రవక్త తన పాపపు స్థితిని గ్రహించాడు. (యోషయా 6:5). ఏలయన అపోస్తులందరిలో  నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడని  పిలువబడుటకు నేను అయోగ్యుడను" అని పౌలు తన జీవిత స్థితిని  గ్రహించాడు. (1 కోరింథీ 15:9).  ప్రభూ ! నేను పాపాత్ముడను నన్ను విడిచి పొండు అని పేతురు గారు కూడా తన పాప స్థితిని గ్రహించారు.(లూకా 5:8). ఈనాడు నీవు నేను కూడా మన పాపపు స్థితిని గ్రహించాలి.

 2. పాపాన్ని విడిచి పెట్టాలి :- పాపాపు స్థితిని గ్రహించడమే కాదు . పాపాన్ని పరి పూర్తిగా విడిచిపెట్టాలి. మన జీవితాన్ని పవిత్రీకరించమని దేవుని అర్థించాలి. మనము పాప కార్యముల నుండి వైదొలగి నూత్న హృదయమును,నూతన మనస్సును పొందాలి. ఎవడు చనిపోవుట వలన  ప్రభువునకు సంతోషం కలగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభు వాక్కు. యోహేజ్కేలు 18:31-32. 

3. మనలని మనం దేవుని చిత్తానికి అప్పగించాలి:-  దౌర్జన్యమునకు సాధనముగా మీ శరీరములందు ఏ అవయములను పాపమునకు అర్పింపకుడు. అంతేగాక , మృత్యువు నుండి జీవమునకు కొనిరాబడినవారుగా మిమ్ము మీరు దేవునికి  అర్పించుకొనుడు. మీ శరీరమునందలి అవయములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకొనుడు. (రోమి 6:13). దేవుని  పిలుపునందుకున్న మనమందరము దేవునికి మనలను మనం సంపూర్ణముగా అప్పగించుకోవాలి. అంటే దేవుని చిత్తమే మన చిత్తం కావాలి. దేవుని చిత్తానుసారంగా ఆలోచించాలి, మాట్లాడాలి, కార్యాలు చేయాలి. ఈ విధంగా దేవుని పిలుపునకు  స్పందిస్తే దేవుని అనుగ్రహాలను పొందగలము, ఆ అనుగ్రహాలకు సాధనాలుగా మారగలము. 

3. దేవుని పిలుపు  యొక్క ఉద్దేశము

  దేవుడు  తన ప్రజలను ఓ గొప్ప ఉద్దేశంతో పిలిచి వారిని పవిత్రులుగా , నిర్దోషులుగా  చేస్తారు. (ఏపేసి 1:4) పవిత్రులుగా , నిర్దోషులుగా మలచబడినవారు, దైవ పిలుపు ఉద్దేశమైన సువార్త వ్యాప్తిద్వారా ఇతరులను పవిత్రులుగా, నిర్దోషులుగా  తయారుచేయాలి. ఈ ప్రేషిత కార్యం కొరకై మనము ప్రభుని సొంత ప్రజలుగా ఎన్నుకోబడతాము. (ద్వీతి14:2 ), అదే యోషయా  ప్రవక్త (6:8) , పౌలు గారు (1 కోరింథీ 15:10) మరియు పెతురు (లూకా 5:10 ) వీరి జీవితాలలో జరగడం   ఈనాటి పఠనాలలోమనం చూస్తున్నాం . 

దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క జీవిత శైలికి పిలిచియున్నారు. కొంతమందిని సువార్త  వ్యాప్తికై , మరి కొంత మందిని భర్తలుగా, భార్యలుగా , పిల్లలుగా మరియు ఇతర జీవిత శైలికి పిలిచారు. ప్రతి ఒక్కరు వారి జీవిత అంతస్తుకు తగిన విధంగా జీవించాలి. ఆ విధంగా జీవించాలంటే మనకు కావల్సిన మొట్ట మొదటి  ఆయుధం విశ్వాసం. విశ్వాసం లేకపోతే దైవ పిలుపు యొక్క ఉద్దేశం నెరవేర్చలేము. పునీత పౌలుగారు ఈనాటి రెండవ పఠనములో చాలా చక్కగా చెప్తున్నారు. "మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప ,నేను మీకు భోదిం చిన విధంగా మీరు దానిని గట్టిగా అంటి పెట్టుకొని ఉంటిరేని , మీరు రక్షింపబడుదురు." (1 కోరింథీ 15:2). పేతురు గారు ప్రభువు మాట యందు విశ్వాసించాడు, వల చినుగునన్ని చేపలు పట్టగలిగాడు. లూకా 5:6 . మనము కూడా విశ్వసించాలి, ప్రభువునకు ప్రార్ధించాలి. తద్వారా మన విశ్వాసాన్ని  బలపరచుకోవాలి. మన జీవితాలలో ప్రభువు కార్యాలను చవి చూడాలి. 

రెండవది ప్రేమ. యోహను 3:16 . 15:12. ప్రభువు కాపరికి అప్పగించిన తన మందను , కుటుంబ పెద్ద సభ్యులను ఎటువంటి పక్షపాతం లేకుండా అందరిని సమానంగా  ప్రేమించాలి. ప్రేమ అనే ఆయుధం ద్వార పరలోకాన్ని భూలోకంలోనే సృజించవచ్చు. ఎప్పుడైతే కాపరులు తమ స్వార్ధనికి ,ఆనందాలకు, ఇహలోక జీవిత శ్రేయస్సుకు, వస్తువులకు మరణించి, తన ఆలోచనలను, శక్తిని మాటలను మరియు కార్యాలను  దైవ చిత్తానికి  దైవ రాజ్య  వ్యాప్తి ఉపయోగార్దం జన్మిస్తారో. అప్పుడు  ప్రేమ ద్వార ఇహలోక  జీవియతం పరలోక జీవితంగా మారుతుంది. 

మూడవ ఆయుధం ఓర్పు , సహనం. ఈ సద్గుణాలు ఉన్నటువంటి వారు ఎటువంటి బేరుకు లేకుండా  దేవునితో నడవగలరు. సంఘంలో  కుటుంబంలో  ప్రజలందరు ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క  తీరుతో  ప్రవర్తిస్తుంటారు. కానీ దైవ పిలుపు స్వీకరించిన మనం  ఓర్పు సహనం కలిగి అందరిని ఒక తాటిపై  నడిపించగలగాలి. ఇది దేవునితో మనం ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు లేనప్పుడు పేతురుగారు ఒక్క చేపనైన పట్టలేక పొయ్యాడు. కాని దేవుడు తనతో ఉన్నప్పుడు వల చినిగే చేపలను పట్టగలిగాడు. (లూకా 5:5,6 ), దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలలో కూడా ఎటువంటి కొరతలు ఉండవు. అన్నీ సమృద్దిగా ఒసగపడుతాయి. 

ఏ విధంగా దైవ పిలుపు అందుకున్న కుటుంబ అంతస్తుకు చెందినవారు సువార్తను భోధించగలరు ? దివ్య వాక్కు  వినడం, పఠించడం, పాటించడం ద్వారా. దైవ వాక్కు మన జీవితాలకు  ఆధ్యాత్మిక  భోజనం. భోజనం భుజింపకపోతే ఏ విధంగా  భౌతిక ఆరోగ్యాన్ని కోల్పోతాము. అధేవిధంగా ఆధ్యాత్మిక భోజనం  అయినటువంటి దేవుని వాక్యం పఠించక,వినక, పాటించక పోయిన ఆధ్యాత్మిక అనుగ్రహాలను కోల్పోతాము. కాబట్టి దేవుని వాక్యం చదువుదాం , విందాం, ఆచరిదాం. తద్వారా  దైవ పిలుపును గ్రహించి , ఆ పిలుపునకు సరిగ్గా స్పందించి, ఆ పిలుపును జీవిస్తూ ముందుకు సాగుదాం. ఆమెన్ 

 Br. Sunil Inturi  OCD

   


29, జనవరి 2022, శనివారం

4 వ సామాన్య ఆదివారము

 4 వ సామాన్య ఆదివారము

యిర్మీయా 1 : 4-5, 17-19., 1కొరింతి 12: 31-13: 13., లూకా 4: 21-30.

-నేటి దివ్య పఠనాలు సువార్త వ్యాప్తిలో దేవుని అనుసరణలో ఎదురయ్యే తిరస్కరణలను దైర్యంగా ఎదుర్కోవాలి అని తెలుపుతుంది. 
- మన జీవితంలో ఎన్ని తిరస్కరణలు వచ్చినా గాని దేవుని మీద నమ్మకం ఉంచి, దైవ సేవ ప్రేమతో చేయాలనీ ఈ పఠనాలు భోదిస్తున్నాయి.
-చాలా సందర్భాలలో విశ్వాసానికి  సంభందించిన  తిరస్కరణలు, హింసలు ఎదురవుతాయి అయితే వాటన్నింటిని ఎదుర్కొని విశ్వాస సాక్ష్యం మిగతా వారికీ ఇవ్వాలి.
-ఈ నాటి మొదటి పఠనంలో దేవుడు యిర్మియా ప్రవక్తను తన యొక్క సేవకి ఎన్నుకొని ఆయన్ను బలపరిచిన విధానం తెలుసుకుంటున్నాం.
-దేవునిసేవలో ఎదురయ్యే కష్టాలను ముందుగానే ప్రవక్తకు తెలుపుచున్నారు.
-దేవుడు యిర్మీయాను పిలిచి తన ప్రవక్తగా నియమించారు. యిర్మియా తన తల్లి గర్భమున రూపొందకమునుపే దేవుడు తన్ను ఎన్నుకున్నారు అని పలుకుచున్నారు.
-ఆయన ఈ లోకంలో ఇంకా పుట్టక మునుపే అభిషేకించారు, అని తెలుపుచున్నారు. ఆయన్ను ఎన్నుకొన్నది ఒక ప్రవక్తగా జాతులకు తోడుగా ఉండుటకు.
-ప్రవక్త అంటే దేవుని స్వరం. దేవుడు పలకమన్న మాటనే పలుకుతూ దేవునికి మానవునికి మధ్యవర్తిగా నిలబడే దైవ సేవకుడే ప్రవక్త.
-దేవుడు యిర్మియాను పిలిచి, ఎన్నుకొని ఆయన్ను పవిత్ర పరచుచున్నారు. పవిత్ర పరచినది ఎందుకంటే, నిస్వార్థ సేవ చేయుటకు.
-పవిత్ర పరచినది దేవునితో వ్యక్తిగత సన్నిహిత సంబంధం కలిగి జీవించడానికి.
-పవిత్ర పరచినది దేవుణ్ణి సేవించుటకు, ఆయన మాటలను, వినుటకు, ఆయనలో ఐక్యమై జీవించుటకు దేవుడు యిర్మియాను ఎన్నుకొన్నారు, పవిత్ర పరిచారు.
-మనందరినీ దేవుడు జ్ఞాన స్నానం ద్వారా పవిత్ర పరుస్తున్నారు. అయితే మనం ఆయనలో ఐక్యమై జీవిస్తున్నామా, దేవునితో బంధం కలిగి పాపం, విడిచి దైవ చిత్తాన్ని నెరవేర్చుతున్నామా?
-యిర్మియా ప్రవక్త జీవితంలో దేవుడు ఆయన్ను జాతులకు ప్రవక్తగా ఉండుటకు అభిషేకిస్తున్నారు. కేవలం తన సొంత ప్రజల కోసం మాత్రమే కాదు అన్ని జాతుల వారికోసం అని ప్రభువు సుస్పష్టంగా తెలియచేస్తున్నారు.
-యిర్మియా మాత్రమే కాదు అన్య జాతులు వద్దకు పంపబడినవారు ఏలీయా, ఎలీషా, యోనా, లాంటి వారు కూడా అన్య జాతి జనులకు సేవలందించారు. 
-దేవుడు తన యొక్క ప్రవక్తను పరిచర్యకు ముందుగానే ఎదుర్కొన బోయే సమస్యలకు, హింసలకు, తిరస్కరణలకు, సిద్ధంచేస్తున్నారు.
-ప్రవక్తను పిలిచినప్పుడు వారి జీవితం పులపాన్పువలె సంతోషంగా ఉంటుందని వాగ్దానం చేయలేదు, వారి జీవితంలో కష్టాలు ఉంటాయి అని తెలిపారు.
-కష్టాలు, నిందలు, భాదలు, ఎదురైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను అనే అభయం ఇస్తున్నారు.
-ప్రవక్తతో అంటున్నారు 1: 7   నీవు నడుము కట్టుకొని నిలబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వారితో చెప్పుము, నీవు వారికి భయపడ వలదని తెలుపుచున్నారు.
-ప్రవక్త లేదా దేవుని సేవకులు మాట్లాడే ప్రతి యొక్క మాట దేవుని యొక్క సందేశమే, దేవుడు తెలియచేయ మన్న మాటలే గురువులు, ప్రవక్తలు తెలుపుతారు.
-దేవునియొక్క సత్యమైన మాటలు మాట్లాడితే చాలామందికి నచ్చదు. ఎందుకంటే వారు మార్పు అంగీకరించలేరు. కాబట్టి వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజల్లో మనం ఇలాంటి స్వభావాలు చూస్తున్నాం.
-ఇశ్రాయేలు ప్రజల్ని దేవునిలో ఐక్య పరచటానికి ప్రవక్త ప్రయత్నిస్తున్నారు అలాగే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో శుద్ధీకరణ కోసం కృషి చేస్తున్నారు, వారి పాపపు జీవితం విడిచి పెట్టి, నీతిమంతమైన జీవితం జీవించాలని, దేవునికి విధేయులై జీవించాలన్న సత్యమైన దేవుని మాటలు ప్రజలతో పలికినప్పుడు అవి చాల మందికి నచ్చలేదు, ఎందుకంటే వారు మార్పును అంగీకరించలేక పోయారు అలాగే వారికి నచ్చిన సొంత జీవితం జీవించాలనుకున్నారు. అందుకే ప్రవక్తలను తిరస్కరిస్తున్నారు.
-ప్రభువు అంటున్నారు “నా మాటలు పలుకుటకు, నా సేవ చేయుటకు సిద్ధంగా ఉండుమని తెలుపుచున్నారు. నిజంగా మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే ఎటువంటి ఇబ్బందులకు భయపడనవసరంలేదు” .
-దేవుడే అంటున్నారు 'బయపడనవసరం లేదు '. స్వార్థ పరులైన ఇశ్రాయేలు రాజకీయ,మత నాయకులు అనేక ఆటంకాలు పరిచర్యకు  కలిపిస్తారు, అలాంటి తరుణంలో నిర్భయంగా ముందుకు సాగమని దేవుడు అభయం ఇస్తున్నారు.
- దేవుడు తనకు తోడుగా ఉంటానని తెలుపుచున్నారు. యెషయా 41 : 10 
- ఎవరు ఎదురించినా సరే దేవుడు తోడుగా ఉంటాననే అభయం ఇస్తున్నారు.
-వారికి తోడుగా ఉండే విధానంలో దేవుడు మూడు ప్రతీకలను ఉదాహరిస్తున్నారు;
1. సురక్షిత నగరం.
2. ఇనుప స్తంభం 
3. ఇత్తడి తలుపు.
1. సురక్షిత నగరం- భద్రతకు గుర్తు. ఎంతమంది శత్రువులు దాడి చేసినా సరే చెక్కు చెదరకుండా, పడిపోకుండా, దృడంగా నిలబడుతుంది. 
2.ఇనుప స్తంభం - బలానికి, మహా శక్తికి గుర్తు. దేవుని యొక్క అభిషేకం ద్వారా మహాశక్తి ప్రతిఒక్కరిలో దాగి ఉంది, కాబట్టి ఆ శక్తి తో ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని దైర్యంగా ఉండుమని తెలుపుతుంది.
3. ఇత్తడి తలుపు- భాదలు, అవమానాలు తట్టుకొని నిలబడే ఒక ఆయుధం, సాధనం.
-యిర్మియా తో దేవునియొక్క సంరక్షణ గురించి ప్రభువు తెలుపుచున్నారు. ఆయన ఒక రక్షణ కవచంగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నారు.
- చాలా సందర్భాలలో దైవ సేవ చేసేటప్పుడు మనం భయ పడుతూ ఉంటాం. కొంతమంది ప్రవక్తలు కూడా ఉదాహరణగా మనకు నిలుస్తారు. 
మోషే, యిర్మియా, యోనా, ఏలీయా. 
-మోషే ప్రవక్త నత్తివాడినని   సాకులు చెబుతూ తప్పించుకోవాలని అనుకున్నాడు. 
-యిర్మియా - చిన్నవాడినని భయపడ్డాడు. 
-యోనా - అన్యులు అంగీకరిస్తారా లేదా అని భయ పడ్డాడు. 
-ఏలీయా - ఎసెబేలు రాణికి భయ పడ్డారు.
- వారిజీవితంలో ఎదురవ్వబోయే పరిణామాలకు ప్రవక్తలని భయపడ్డారు. దానికి తోడుగా ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక మంది ప్రవక్తలను నిరాకరించింది కాబట్టి వారు భయ పడ్డారు. 
- హోషేయా 9: 7, యిర్మియా 2: 30 
-2 వ రాజుల దిన 36: 16, ఆమోసు 2: 12 
-లూకా 13: 34, మత్తయి 23: 37, హెబ్రీ 11: 32, 1 థెస్స 2; 15 
-ప్రవక్తలు తమ జీవితంలో దేవుని కొరకు మాత్రమే పనిచేసారు. వారు అధికారులకు భయపడలేదు, మత పెద్దలకు, నాయకులకు, భయపడలేదు ఎందుకంటే వారు దేవునికి సంపూర్ణ, విధేయత చూపించారు. దేవుని చిత్తం నెరవేర్చారు, సొంత స్వార్థం చిత్తం చూసుకోలేదు. 
-మనం కూడా గుర్తించు కోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని సేవ చేసినప్పుడు అంగీకారం మరియు తిరస్కారం అనేవి సర్వ సాధారణ అనుభవాలు అయితే తిరస్కరింప బడినప్పుడు క్రుంగి పోనవసరంలేదు ఎందుకంటే యేసేపు అన్నల చేత తిరస్కరించబడ్డారు, అయినా దేవుడు తన పక్షాన వున్నారు, ఆయన మాత్రం దైర్యంగా వున్నాడు, అభివృద్ధిలో ముందుకు సాగరు. ఆది ఖా: 37 .
-యేసు ప్రభువు నిరాకరించబడ్డారు, యోహాను 15: 18, మార్కు 3: 21 
ప్రభువు మాత్రం తండ్రి చిత్తం నెరవేర్చారు. 
- యిర్మియాను నిరాకరించారు అయినా దైవ సేవ చేశారు. నిరాకరించిన సరే దైవ వాక్కు తనను నిశబ్దంగా ఉంచుటలేదు, ఆయన దేవుని మాటలు దైర్యంగా ప్రకటిస్తున్నారు. 
-మన జీవితంలో తిరస్కరించ బడినప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటారని తెలుసుకొని దేవుడ్ని నమ్ముకొని ముందుకు సాగిపోవాలి.
- రెండవ పఠనంలో పౌలు గారు దైవ వారములు పొందిన విశ్వాసులు ప్రేమతో కూడిన జీవితం జీవించాలని తెలుపుచున్నారు.
-కొరింతు క్రైస్తవ సంగంలో ప్రేమ అనే వరము కొరవడింది. దేవుని యొక్క వారములు పొందినవారు వేవుణ్ణి, పొరుగు వారిని ప్రేమిస్తూ జీవించాలని పౌలు గారు పలుకుచున్నారు .
-పౌలు గారు తనయొక్క సువార్త పరిచర్య మొత్తం కూడా ప్రేమతో చేశారు.
-దేవుణ్ణి ప్రేమించారు కాబట్టే ఆయన సందేశమును ప్రజలకు ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు, హింసలు , ఎదురైనా  ఆయన మాత్రమూ దైవ సేవ చేశారు.
- ప్రేమకు ఏదైనా సాధించే బలం ఉంది అలాగే ఎంత శ్రమైన భరించే ఓర్పుకు, ప్రేమ ఉంది.
-దేవుని యొక్క కుమారుని యొక్క జీవితంలో మనకు అర్ధమయ్యే విషయం అదే. ఆయన ప్రేమతోనే మన కోసం ఈ లోకంలో జన్మిమ్చారు. 
-ప్రేమవలనే సుంకరులతో, పాపులతో కలిసి భోజనం చేశారు.
-ప్రేమవలనే అన్ని ప్రాంతాలవారికి సువార్త ప్రకటించారు.
-ప్రేమతో అద్భుతాలు చేశారు.
-ప్రేమ వల్లనే ఆయన్ను నిరాకరించిన కానీ మళ్ళీ వారిని అంగీకరించారు.
-ప్రేమ వల్లనే మోసం చేసినా క్షమించరు
-ప్రేమ వల్లనే తన జీవితం త్యాగం చేశారు
-ప్రేమ వల్లనే మనలను రక్షించారు
-ఆయన ప్రేమను గుర్తించిన పౌలు గారు ఈ విధంగా దేవుని యొక్క ప్రేమ జీవితం గురించి తెలుపుచున్నారు. 
- దేవుడు ప్రేమ స్వరూపి అని యోహాను గారు కూడా వ్రాశారు. 1 వ యోహాను 
-దేవుడు తన వారిని శాశ్వత మైన ప్రేమతో ప్రేమించారు. యిర్మియా 31 : 3  కాబట్టియే తిరస్కరించిన సమయాలలో క్రుంగి పోకుండా దైర్యంగా తన యొక్క పరిచర్యను కొనసాగించారు.
-ప్రేమలో స్వార్థం ఉండదు 
-ప్రేమ ఎదుటి వారి మేలు కోరుకుంటుంది. 
-ప్రేమకు ఎలాంటి చెడుగుణములు లేవు.
-దేవుడు మనలను ప్రేమించిన విధంగానే మనం ఒకరినొకరు ప్రేమించుకొని దైవ సేవ చేద్దాం. దేవుని ప్రేమను పంచుకుందాం.
-నేటి సువార్త పఠనంలో యేసు ప్రభువును తన సొంత ప్రజలే నిరాకరించిన విధానం మనం చూస్తున్నాం.
-సువిశేష భాగంలో రెండు విషయాలు మనం గుర్తించాలి. 
- ప్రజల యొక్క ఆశ్చర్యం 
-సొంత వారి యొక్క నిరాకరణ 
1. ఎప్పుడైతే యేసుప్రభువు యెషయా ప్రవక్త  గ్రంధం ను చదివి లేఖనము నెరవేరింది అని పలికారో అపుడు వారందరు ఆశ్చర్య పడుతున్నారు. 
-ఆయన మాటల్లో నూతనత్వం వున్నదని గ్రహించారు. ఆయన యొక్క భోధన యధార్థమైనదని గ్రహించారు. 
-ఆశ్చర్య పోయినతరువాత ఆయన యొక్క కుటుంభంతో ఆయన్ను పోల్చుతున్నారు. అయన యేసేపు కుమారుడు కాదా అని వారి ఆశ్చర్యం, ద్వేషంగా మారిపోతుంది ఇక్కడ.
-చాలా సందర్భాలలో మనంకూడా కొంతమందిని పోల్చుతారు.
-సమాజంలో పేరు ప్రతిష్టలున్న వారి అబ్బాయి కన్నా ఒక  పేద వానికి  వున్నత ఉద్యోగం వస్తే ఇదెలా అని ఆలోచిస్తూ వ్యత్యాసాలు చూసుకుంటారు.
-వారి అభిప్రాయమేమిటంటే వారికన్నా మిగతా వారందరు తక్కువ వారే, లేని వారే అనే భావన. ఇక్కడ యూదులు కూడా చేసినది అదే, ఆయన్ను (యేసు ప్రభువును) తన తండ్రితో పోల్చుతున్నారు. ఈ పేదవాని కుమారుడు ఎలాగా ఇలా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తున్నారు .
-ఆయన బోధనలు అంగీకరించుటకు బదులుగా ప్రశ్నించుకొంటున్నారు.
-సొంత వారు ఎప్పుడు తమ సొంత ప్రవక్తల గొప్పతనం అంగీకరించలేరు, ఎందుకంటే మన మధ్యలో పుట్టి, పెరిగిన వ్యక్తి, వారికన్నా ఎక్కువగా మంచి చేస్తుంటే, భోదిస్తుంటే ఎవరు కూడా అంగీకరించలేరు. వారిలో ఎక్కువ అసూయా ఉంటుంది.
- ప్రజలు ఎందుకు నిరాకరించారంటే 
1. తన బోధనల ద్వారా వారికి కోపం తెప్పించారు, మరీ ముఖ్యంగా వారి విశ్వాసం అన్యుల కన్నా చిన్నది అని చెప్పారు. 
2. వారి మధ్య అద్భుతాలు చేయుటకు నిరాకరించారు.
3.నాయకులను, మత పెద్దలను ప్రతి నిత్య కపట ప్రవక్తలని సంబోధించినందులకు 
4. తానే మెస్సయ్య అని చెప్పుకున్నందుకు
5. అసూయా వల్ల ప్రభువును నిరాకరించారు చంపాలనుకున్నారు.
6. ఆయన (క్రీస్తు) ప్రజలు అనుకున్న విధంగా నడవలేదు.
7. ప్రజలకు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడలేదు అందుకే వారు కోప పడ్డారు, నిరాకరించారు. 
-దానికి ప్రతి ఫలంగా దేవుడు వారి విశ్వాస జీవితాలను పరీక్షించుటకు రెండు ఉదాహరణలు ఇస్తున్నారు.
1. ఏలీయా - సెరాఫథ్ వితంతువు- 1 రాజు 17: 7 - 24 
2. ఎలిశా - నామాను కుష్టి రోగి (సిరియా) 2 రాజు 7: 3 -10 
ఏలీయా ప్రవక్త సెరాఫత్ లో వున్న వితంతువద్దకు వెళ్లారు. అక్కడ ఆమె ప్రవక్త మాటలను  విశ్వసించింది.
- ఆయన మాటప్రకారం నడుచుకొన్నది.
- నామాను కూడా అన్యుడే అయినప్పటికీ ప్రవక్త మతాల మీద విశ్వాసం ఉంచి విధేయత చూపారు కాబట్టియే స్వస్థత పొందారు. 
-వితంతువు, నామాను, ఇద్దరు కూడా ప్రవక్తలను అంగీకరించారు వారిద్దరిలో ప్రవక్తలో దైవ శక్తి దాగి ఉందని గ్రహించారు. అందుకే వారి మాటలను ఆలకించి వినయంతో వారు చెప్పినది చేసారు. అందువల్ల అద్భుతాలు పొందారు.
-ప్రభువు ప్రేమ అందరికి ఇవ్వబడుతుంది దానిని స్వీకరించకపోతే అది మన లోపమే.
-యూదులకు మొదటి ప్రాముఖ్యత నిచ్చారు కానీ వారు తృణీకరించారు. మనం కూడా అలాగే చేస్తున్నామా?
-అసూయా ఉంటే ఎవరియొక్క గొప్పతనం, మంచితనం, మనం అంగీకరించలేము. ప్రేమ ఉంటే ఎవరినైనా అంగీకరిస్తాం, భరిస్తాం. కాబట్టి మన జీవితంలో అంగీకారం , తిరస్కారం ఉంటూనే ఉంటాయి . కాబట్టి మనం ప్రేమతో అని తెలుసుకొని ప్రవక్తలను యేసుప్రభువును  ఉదాహరణ గా తీసుకొని ముందుకు సాగాలి. వారు నిరాకరించబడిన కానీ గమ్యం మరువలేదు, సువార్త  సేవ ఆపలేదు , క్రుంగి పోయి వెనుకంజ వేయలేదు. దైవ ప్రేమతో సోదరుల మంచికోసం ఎన్ని తిరస్కరణలైన ఎదుర్కోగలిగారు. మనం కూడా ప్రేమ ఉంటె ఎంత కష్టమైన ఇష్టంగా ఏదైనా సాధించవచ్చు.
-దేవుడు అందరిని సువార్త వ్యాప్తి కోసం పిలుస్తున్నారు కాబట్టి ప్రభువు యొక్క వాక్యం అనుసారం జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...