28, జూన్ 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 8: 23-27 

అంతట యేసు పడవ నెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి, పడవను ముంచెత్తు నంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిదురించుచుండెను. అప్పుడు శిష్యులు  ఆయనను మేలుకొలిపి "ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము" అని ప్రార్ధింపగ,  యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ?" అని పలికి , లేచి గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి. 

యేసు ప్రభువు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభువు నిద్రపోతున్నారు. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి , పడవను ముంచెత్తింది.  సముద్రములో అలలు  చెలరేగాయి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరు భయ పడుతున్నారు. ఎందుకు ఈ శిష్యులు అందరు భయపడుతున్నారు. వారు ఏమి  సముద్రం గురించి తెలియని వారు కాదు. వీరిలో ఎక్కువ మంది చేపలు పట్టేవారు. ఈత తెలిసిన వారు. సముద్రం గురించి తెలిసిన వారు. కాని వారు భయ పడుతున్నారు. ఎందుకంటే ఆ అలలు చాలా భయంకరమైనవి. వారు అంతకు ముందు చూడనివి కావచ్చు. ఆ అలల తీవ్రతను బట్టి వారు దానిని ఒక సాధారణమైన తుఫాను కాదు అని  అంచనా వేశారు. అందుకే వారు యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు. సముద్రములో చెలరేగిన ఈ అలలు ఇప్పుడు వారి జీవితములో చెలరేగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వారు ఏమి చేయాలో వారికి తెలియదు. వారు చనిపోతారో, బ్రతుకుతారో తెలియదు. వారు యేసు ప్రభువును చూస్తున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి తమ గురువుకు తాము అనుభవిస్తున్న పరిస్థితిని ఎలా  తెలియచేయాలా  అని వారు ఒక సందిగ్ధ అవస్థలో వారు ఉన్నారు. 

"ఆయనను మేలుకొలిపి,ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము అని" చెబుతున్నారు. ఇక్కడ శిష్యులు చాలా వరకు వారి వాస్తవ పరిస్థితిని అంచనా వేసి యేసు ప్రభువు దగ్గరకు వెళుతున్నారు. వారి జీవితం ముగిస్తుంది అని వారు అనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో వారిని దేవుడు తప్ప ఇంకా ఎవరు కాపాడలేరు. ఎందుకంటే వారికి తుఫాను గురించి బాగా తెలుసు. సముద్రం గురించి తెలుసు. ఎప్పుడు సముద్రం తీవ్ర రూపం దాల్చుతుందో వారికి తెలుసు. ఈ పరిస్థితిలో వారు జీవించడానికి యేసు ప్రభువు తప్ప ఇంకా ఎవరు వారిని కాపాడలేరు. వారు నాశనం చెందకూడదు అనుకున్నారు. వెంటనే వారు ప్రభువు దగ్గరకు వచ్చారు. మమ్ములను రక్షింపుము అని వేడుకుంటున్నారు. ఈ వెడుకోలులో వారి భయం, ప్రాణం మీద ఆశ అన్నీ అరచేతిలో పెట్టుకొని ఏమి అవుతుందో అని ప్రభువు దగ్గరకు వెళ్లారు. వారిని ప్రభువు రక్షిస్తున్నారు.  సముద్రంను ఆయన శాసిస్తున్నాడు. ఆయన మాటను విని సముద్రం శాంతిస్తుంది.   

యేసు వారితో , ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ? అని అంటున్నారు.  యేసు ప్రభువు వారిని అల్ప విశ్వాసులారా అని ఎందుకు అంటున్నారు. యేసు ప్రభువు చేసిన అనేక పనులకు వీరు సాక్షులు, సముద్రాన్ని , దాని అలలను అంచనా వేయగలిగిన వీరు వారితో పాటు ఉన్నటువంటి యేసు ప్రభువు ఎవరు అని వారు గ్రహించలేక పోయారు. ఆయన మనతో ఉన్నంత కాలం మనకు ఎటువంటి అపాయం ఉండదు అని గ్రహించలేకపోయారు. వారు భయ పడుతున్నారు. యేసు ప్రభువు చేసిన అనేక పనులను చూసికూడా వీరు ఆయన యందు విశ్వాసం ఉంచలేక పోయారు. పాత నిబంధనలో దావీదు మహారాజు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు ఏ కొదవయు లేదు అని అంటున్నారు. యేసు ప్రభువు శిష్యులు కూడా అలానే ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉంటే ఇక ఏ కొదవయు ఉండదు అని తెలుసుకోవాలి. అది వీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాడంలో వారు ఇఫలం చెందారు అందుకే యేసు ప్రభువు యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ?" అని  అంటున్నారు. 

అప్పుడు యేసు ప్రభువు లేచి  "గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి." గాలిని , సముద్రమును యేసు ప్రభువు గద్దింపగా సముద్రము శాంతించింది. ఇది యేసు ప్రభువు దైవత్వాన్ని తెలియజేస్తుంది. ఇంతకు ముందు శిష్యులు యేసు ప్రభువు స్వస్థత  ఇవ్వడం చూసారు. అద్భుతాలు చేయడం చూసారు. కాని ఇక్కడ యేసు ప్రభువుకు ప్రకృతి కూడా ఆయన మాట వింటున్నది. ఆయన చెప్పినట్లు చేస్తుంది.  అప్పుడు అది చూసిన వారు ఆశ్చర్యపడుతున్నారు. ఈయన ఎవరు , ఈయనకు ప్రకృతి కూడా మాట వింటున్నది అని వారు అనుకుంటున్నారు. యేసు ప్రభువుతో మన జీవితంలో ఉన్నటువంటి అన్నీ సమస్యలు తీరుతాయి. ఆయనతో మనతో ఉంటే మనకు ఏ కొదవయు ఉండదు. అంతే కాదు ప్రశాంతత మన జీవితంలో ఎల్లప్పుడు ఉంటుంది. 

ప్రార్ధన : ప్రభువా! నా జీవితంలో అనేక సార్లు అనేక కల్లోలాలు వచ్చినవి అటువంటి సమయంలో నేను భయ పడి పోతున్నాను. నాకు నాశనము తప్పదు అని అనుకుంటున్నాను. నిరాశలో జీవిస్తున్నాను. నా జీవితంలో వచ్చే సమస్యలు నన్ను క్రమ్మేస్తున్నాయి. అప్పుడుకూడా నేను భయ పడుతున్నాను. నీవు నాకు తోడుగా ఉన్నావు అని తెలుసుకోలేక పోతున్నాను. నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఏ కొదవయు ఉండదు అని తెలుసుకోలేకపోయాను. అటువంటి సమయంలో నన్ను క్షమించండి. నీవు నాకు తోడుగా ఉన్నవన్న విషయాన్ని నేను ఎల్లప్పుడు గుర్తుంచుకునే విధంగా దీవించండి. నా జీవితంలో వచ్చే అనేక అలలను ఎదుర్కోడానికి కావలసిన శక్తిని దయ చేయండి. మీ యందు పూర్తి విశ్వాసం కలిగి జీవించే వానిగా నన్ను చేయండి. ప్రభువా! నీవు సముద్రమును గద్దింపగా అది శాంతించింది. అటులనే నా జీవితంలో మీ మీద విశ్వాసం సన్నగిళ్ళే ప్రతి విషయాన్ని గద్దించండి.  మీ మీద ఎప్పుడు విశ్వాసం ఉండే వానిగా చేయండి. ఆమెన్ . 

27, జూన్ 2022, సోమవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం,

 మత్తయి 8:18-22 (జూన్ 27,2022)

యేసు తన చుట్టుప్రక్కల నున్న గొప్ప జన సమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని అజ్ఞాపించును. అపుడు ధర్మ శాస్త్ర  బోధకుడొకడు యేసును సమీపించి , "బోధకుడా!  నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను" అనగా  యేసు,  "నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళును కలవు. మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైన చోటు లేదు" ప్రత్యుత్తర మిచ్ఛెను. మరియొక శిష్యుడాయనతో "ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను; అనుమతి దయ చేయుడు" అని కోరగా, యేసు "నీవు నన్ను వెంబడింపుము. మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని పలికెను. 

"నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సంసిద్దుడను", ఈ మాటను ఒక బోధకుడు  యేసు ప్రభువుకు చెబుతున్నారు. ఎందుకు ఇతను యేసు ప్రభువును అనుసరిస్తాను అని అంటున్నాడు అంటే యేసు ప్రభువు చేసిన పనులు ఆయన చూసి ఉండవచ్చు. యేసు ప్రభువు అనేక మంది ఆకలితో ఉన్నవారిని చూశాడు. వారు ఆకలితో ఉన్నారు అని తెలుసుకొని వారి ఆకలిని తీర్చాడు. అంతె కాదు సాతాను చేత పీడింపబడుతున్న వారిని చూశాడు. వారికి సాతాను నుండి విముక్తి ఇచ్చాడు. యేసు ప్రభువు అనారోగ్యంతో ఉన్న వారిని చూశాడు, వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ విధముగా ప్రజల అన్నీ సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ తెలుసుకొని వారికీ కావలసినవి ఇచ్చి వారి సమస్యలును తీసివేస్తున్నాడు. అయితే ఇవి అన్నీ తెలిసిన వ్యక్తి  అయివుండవచ్చు, నేను, నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సిద్ధం అని పలికే ఈ వ్యక్తి. ఒక వేళ ఈయనను అనుసరిస్తే నాకు కూడా ఈయన ఇస్తున్నటువంటివన్నీ నాకు రావచ్చు అని అనుకోని యేసు ప్రభువును అనుసరించడానికి వీరు సిద్దం అయి ఉండవచ్చు. లేక యేసు ప్రభువును అనుసరిస్తే ఆయనకు వస్తున్న ఆధరణ నాకు రావచ్చు అని ఆయనను అనుసరించడానికి సిద్దం అయి ఉండవచ్చు. లేక తాను బోధకుడు కాబట్టి యేసు ప్రభువును అనుసరించడం తనకు ముక్తిని దయ చేస్తుంది అని తెలుసుకొని ఆయనను అనుసరించడానకి సిద్ధం అయి ఉండవచ్చు. 

అయితే యేసు ప్రభువు మాత్రం, "నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళును కలవు. మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైన చోటు లేదు" అని అంటున్నారు. కారణం ఏమి  అయి ఉండవచ్చు అంటే ఆయనను అనుసరించవలసినది, ఆయన ఇతరులకు ఇచ్చినటువంటి అనుగ్రహాలు, వరాలు, లేక  ఆయన ద్వార వచ్చే ఆదరణకొ కాదు. కేవలం ఆయన ఇచ్చే రక్షణ కోసం మాత్రమే కాదు. మరి ఇంకా ఎందుకు అంటే యేసు ప్రభువును అనుసరించవలసినది, ఆయన తరువాత ఆయన జీవితాన్ని, ఆయన పనులను, ఆయన చిత్తాన్ని కొనసాగించడానికి. ఇక్కడ ఆ బోధకుడు నేను నిన్ను అనుసరించడానికి సంసిద్దుడను అని అంటున్నాడు. కాని ఆ బోధకుడు ఇవన్నీ చేయడానికి సిద్ధముగా ఉన్నాడా? లేడా ?అనేది ముఖ్యం. అందుకే యేసు ప్రభువు నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు కాని మనుష్య కుమారునకు మాత్రం తలవాల్చుటకైన చోటు లేదు అంటున్నారు. అంటే ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యుడు ఆయనను అనుసరించుటలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితికి అయిన సిద్దంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఎటువంటి సౌకర్యం లేకుండా కూడా ఆయనను అనుసరించుటకు సిద్ధముగా ఉండాలి అని ప్రభువు తెలుపు చున్నాడు. 

ఈ సమయంలో మరియొకడు వచ్చి "ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను; అనుమతి దయ చేయుడు" అని కోరగా, యేసు "నీవు నన్ను వెంబడింపుము. మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని అంటున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి యేసు ప్రభువుతో తానే వచ్చి చెబుతున్నాడు. నేను నిన్ను అనుసరిస్తాను, కాని దానికి ముందుగా నేను ఇంటి దగ్గరచేయవలసిన పని చేసి వస్తాను అని చెబుతున్నాడు. అంటే నాకు ఎటువంటి ఆటంకం లేనప్పుడు, అంతా అనుకూలముగా ఉన్నప్పుడు నేను నిన్ను అనుసరిస్తాను అని చెబుతున్నాడు. నాకు వ్యతిరేకముగా లేక నాకు కష్టముగా ఉన్న విషయములలో నిన్ను అనుసరించే, అనుసరణలో నాలో లోపం ఉంటుంది అని ముందుగానే తెలియజేస్తున్నట్లున్నది, ఈ శిష్యుని యొక్క అనుసరణ విధానం.

ఇక్కడ యేసు ప్రభువును అపోస్తులులు ఎలా అనుసరించారు అనే  విషయం మనం గమనించాలి. ఎందుకంటే మత్తయిని యేసు ప్రభువు పిలిచినప్పుడు ఆయన తన సుంకపు పెట్టెను వదలి, రెండవ ఆలోచన లేకుండా యేసు ప్రభువును అనుసరిస్తున్నాడు. యకొబు యోహనులు తమ తండ్రిని పడవలోనే వదలి పెట్టి ప్రభువును అనుసరిస్తున్నారు. కాని ఇక్కడ మాత్రము ఈ వ్యక్తి  అందుకు సిద్ధంగా లేడు, ఎందుకంటే తాను తన తండ్రి మరణించిన తరువాత, తనను సమాధి చేసి తీరికగా యేసు ప్రభువును అనుసరించాలి అని అనుకుంటున్నాడు. యేసు ప్రభువును, నేను అనుసరించ వలసినది నాకు ఎటువంటి బాధ్యతలు లేని సమయంలో కాదు. నాకు అన్నీ బాధ్యతలు ఉన్న సమయంలో కూడా మనం ఆయనను అనుసరించాలి. ఇక్కడ యేసు ప్రభువు ఆ వ్యక్తితో, "మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని అంటున్నాడు. 

ఎందుకంటె, ఈ వ్యక్తి తండ్రి ఇంకా చనిపోలేదు, కాని ఇతను తన తండ్రి జీవించినంత కాలం తనతో ఉండి, అతడు చనిపోయిన తరువాత తాను చేయవలసిన పనులు చేసి వస్తాను అని అంటున్నాడు. దాని గురించి యేసు ప్రభువు , నీవు ముందుగా నన్ను అనుసరించు , మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము, అని అంటున్నారు. యేసు ప్రభువు ఒక వ్యక్తి చనిపోతే ప్రవర్తించే తీరు చాలా కారుణ్యంతో ఉంటుంది. లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు పెడుతున్నారు. పేద విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు తనను బ్రతికిస్తున్నాడు. కాని ఈ వ్యక్తి మాత్రం యేసు ప్రభువును అనుసరించడానికి తనకు అనుకూల వాతావరణం కోసం చూస్తున్నారు. యేసు ప్రభువు ఆయనను అనుసరించుటకు తగిన సమయం అంటూ ఏమీలేదు. ఆయన పిలుపు అందుకున్నప్పుడు మారుమాట్లాడక అనుసరించటమే ఉత్తమం. 

ప్రార్ధన : ప్రభువా ! నేను అనేక సార్లు మిమ్ములను అనుసరించాలి అని అనుకున్నాను ప్రభువా. అది కేవలం నీవు నాకు ఆరోగ్యం  ఇస్తావు అని,  ఉద్యొగం ఇస్తావు అని, మంచి పేరు ఇస్తావు అని మరియు నాకు వున్న సమస్యలు తీరుస్తావు అని మాత్రమే నిన్ను అనుసరించాలి అని అనుకున్నాను, నిన్ను ఎందుకు అనుసరించాలి అని మాత్రము పూర్తిగా అర్ధం చేసుకోలేదు ప్రభువా. అటువంటి సమయాలలో నన్ను క్షమించండి. నా ద్వారా మీ జీవితాన్ని కొనసాగించడానికి నేను మిమ్ములను అనుసరించే వానిగా నన్ను మార్చండి ప్రభువా. ప్రభువా నేను మిమ్ము అనుసరించడానికి అనేక అవకాశాలు వచ్చిన కాని నాకు తగిన సమయం కాదు అని, నాకు వేరె బాధ్యతలు ఉన్నవి అని, మిమ్ములను అనేక సార్లు విస్మరించాను ప్రభువా, అటువంటి సమయాలలో నన్ను క్షమించి, నేను వెల్లప్పుడు మిమ్ములను అనుసరిస్తూ, మిమ్ములను నా ద్వారా ఇతరులకు అందించే విధంగా నన్ను మార్చండి. ఆమెన్. 



పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...