30, జూన్ 2022, గురువారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం, మత్తయి 9: 1-8

మత్తయి 9: 1-8 

అంతట యేసు పడవనెక్కి, సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను. అపుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని , కొందరు ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. వారి విశ్వాసమును గమనించి, ఆ రోగితో "కుమారా! ధైర్యము వహింపుము . నీ పాపములు పరిహరింపబడినవి" అని యేసు పలికెను. అపుడు ధర్మ శాస్త్ర బోధకులు కొందరు, "ఇతడు దైవ దూషణము చేయుచున్నాడు"అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు , "మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనుటయా? లేక నీవు లేచి నడువమనుటయా? ఈ రెండింటి లోను ఏది సులభతరము ? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు  అధికారము కలదని మీకిపుడే తెలియును" అని పలికి,  ఆ రోగితో "నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి  పొమ్ము" అనెను. అతడు వెంటనే లేచి తన  యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి. 

యేసు ప్రభువు పడవ నెక్కి సరస్సు దాటిన తరువాత అక్కడ ఆ పట్టణములో కొంత మంది పడకపై పడియున్న పక్ష వాత రోగిని తీసుకొని వచ్చారు. అప్పుడు యేసు ప్రభువు కుమారా ధైర్యం వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని అంటున్నారు. యేసు ప్రభువు మాటలాడిన ఈ మాటలు అక్కడ ఉన్నవారికి దైవ దూషణ అని అంటున్నారు. అయితే ఆ పక్ష వాత రోగికి యేసు ప్రభువు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నీ పాపములు పరిహరింపబడినవి అని అంటున్నారు. పాపము చేయడం అంటే అతను పాపమునకు బానిసగా ఉన్నాడు. కాని ఇప్పుడు ఆయన పాపము నుండి విముక్తి పొందబోవుతున్నాడు. అతను ఒక స్వతంత్రుడు అవుతున్నాడు. ఇక నుండి ఆయన బానిసగా ఉండడు. కనుక యేసు ప్రభువు ఆ వ్యక్తికి భయ పడ వలదు అని అంటున్నాడు. తన రోగంతోనే కాదు తన సమాజం పట్ల కూడా ఆయనకు భయం ఉంది. అందరు ఆయనను పాపిగా పరిగణిస్తున్నారు. మరియు ఆ విధంగా చూస్తున్నారు. యేసు ప్రభువు మాత్రం ఆయన పాపములను పరిహరిస్తాను అని చెబుతున్నారు. 

యేసు ప్రభువు ఈ మాటలు మాట్లాడినది ఆ పక్షవాత రోగిని తీసుకొని వచ్చిన వారి విశ్వాసంను చూసి ఈ మాటలు అంటున్నారు. ఎందుకు వీరి విశ్వాసం చూసి యేసు ప్రభువు మాటలాడుతున్నారు అంటే, వీరు వారి కోసం కాక అవసరంలో, అనారోగ్యంలో ఉన్న ఒక వ్యక్తిని, యేసు ప్రభువు స్వస్థత పరుస్తాడు అని యేసు ప్రభువు దగ్గరకు వారు ఆయనను తీసుకొని వచ్చారు. వీరు తమ కోసం కాక వేరె వారి కోసం , వారి కష్టాలు తీర్చడం కోసం చేసిన మంచి పనిని చూసి మరియు యేసు ప్రభువు యందు వారికి గల విశ్వాసం చూసి ఆయనను స్వస్థత పరుస్తున్నారు. విశ్వాసం అంటె ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్న కూడా నా దేవుడు నన్ను అవమానమునకు గురికానివ్వడు అనే నమ్మకం ఇక్కడ వారి సొంతం. విశ్వాసం మనకు మాత్రమే ఉపయోగపడేది కాదు. అది అందరికి ఉపయోగ పడుతుంది. ఇతరుల శ్రేయస్సు కూడా విశ్వాసం కాంక్షిస్తుంది. ఇక్కడ జరుగుతుంది ఇదియే. దీని ద్వారా లబ్ది పొందిన ఆ వ్యక్తి కూడా ప్రభువును విశ్వసిస్తాడు. మన విశ్వాసం ఇతరులకు ఈ విధంగా ఉపయోగ పడాలి. 

ఆ మాటలు వింటున్న ధర్మ శాస్త్ర బోధకులు యేసు ప్రభువు దైవ దూషణ చేస్తున్నాడు అని అంటున్నారు. ఇక్కడ దైవ దూషణ అని ధర్మ శాస్త్ర బోధకులు అనడానికి కారణం ఏమిటి అంటే యేసు ప్రభువు నీ పాపములు పరిహరింపబడినవి అని చెప్పడం.  వారికి దేవుడు మాత్రమే పాపములను పరిహరింపగలడు. దేవుడు తప్ప ఎవరు మన పాపములను ఎవరు క్షమించలేరు, అటువంటిది యేసు ప్రభువు నీ పాపములు క్షమించబడినవి అంటున్నారు. కనుక వీరు యేసు ప్రభువు తనను తాను దేవునికి సమానముగా చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ఆయన దేవుడు అని వారు గమనించలేక పోయారు. అంతేకాదు ఆయన గురించి వారు తప్పుగా అనుకుంటున్నారు. అందుకే యేసు ప్రభువు పక్ష వాత రోగిని లేచి నడువమని చెబుతున్నారు, దాని ద్వారా వారికి ఆయనకు ఉన్నటువంటి శక్తిని ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. 

"ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు  అధికారము కలదని మీకిపుడే తెలియును అని పలికి,  ఆ రోగితో నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి  పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన  యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి."  ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే  యేసు ప్రభువు తనకు ఉన్నటు వంటి శక్తిని చూపుతున్నాడు. అంతేకాదు తాను దేవుడను అనే విషయం తేటతెల్లం చేస్తున్నారు. ధర్మ శాస్త్ర బోధకులకు   మానవుడు చేయలేని పనిని ఇక్కడ యేసు ప్రభువు చేయడం ద్వారా ఈయన దేవుడు అని తెలుసుకోవాలి కాని వారు ఆ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయారు. కాని యేసు ప్రభువు మాటను పాటిస్తున్న ఆ పక్షవాత రోగి తన రోగం నుండి విముక్తి పొందుతున్నాడు. యేసు ప్రభువుని నమ్మి జీవించినప్పుడు మన సమస్యల నుండి విముక్తి పొందుతారు. 

ప్రార్ధన : ప్రభువా! మా  జీవితంలో అనేక సార్లు మేము మీ మాటలను నమ్మడంలో , మీ మీద విశ్వాసం ఉంచడంలో విఫలం చెందుతున్నాము. దాని వలన మేము మా బాధల నుండి విముక్తి పొందలేక పోతున్నాము. మీ మాటను ఎల్లప్పుడు పాటిస్తూ మా సమస్యల నుండి మేము విముక్తి పొందే వారిగా మమ్ములను మార్చండి. బాధల్లో, కష్టాలలో ఉన్నవారికి  మేము కూడా మా వంతు సాయం చేస్తూ వారికి వారి సమస్యల నుండి విముక్తి పొందేందుకు మేము చేయగలిగె సాయం చేయు వారిగా మమ్ము దీవించండి.  మేము మీ శక్తిని తెలుసుకొని ఎల్లప్పుడు మిమ్ములను మీ మీద విశ్వాసం ఉంచి జీవించే వారిగా మమ్ము మార్చండి. ప్రభువా అనేక సార్లు మీ మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేదు అటువంటి సమయాలలో మమ్ము క్షమించండి. పక్షవాత రోగి పాపములను క్షమించిన విధముగా మా పాపములను క్షమించండి. అతనికి ఇచ్చిన విముక్తిని మాకును దయచెయ్యండి. ఆమెన్. 

28, జూన్ 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 8: 23-27 

అంతట యేసు పడవ నెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి, పడవను ముంచెత్తు నంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిదురించుచుండెను. అప్పుడు శిష్యులు  ఆయనను మేలుకొలిపి "ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము" అని ప్రార్ధింపగ,  యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ?" అని పలికి , లేచి గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి. 

యేసు ప్రభువు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభువు నిద్రపోతున్నారు. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి , పడవను ముంచెత్తింది.  సముద్రములో అలలు  చెలరేగాయి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరు భయ పడుతున్నారు. ఎందుకు ఈ శిష్యులు అందరు భయపడుతున్నారు. వారు ఏమి  సముద్రం గురించి తెలియని వారు కాదు. వీరిలో ఎక్కువ మంది చేపలు పట్టేవారు. ఈత తెలిసిన వారు. సముద్రం గురించి తెలిసిన వారు. కాని వారు భయ పడుతున్నారు. ఎందుకంటే ఆ అలలు చాలా భయంకరమైనవి. వారు అంతకు ముందు చూడనివి కావచ్చు. ఆ అలల తీవ్రతను బట్టి వారు దానిని ఒక సాధారణమైన తుఫాను కాదు అని  అంచనా వేశారు. అందుకే వారు యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు. సముద్రములో చెలరేగిన ఈ అలలు ఇప్పుడు వారి జీవితములో చెలరేగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వారు ఏమి చేయాలో వారికి తెలియదు. వారు చనిపోతారో, బ్రతుకుతారో తెలియదు. వారు యేసు ప్రభువును చూస్తున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి తమ గురువుకు తాము అనుభవిస్తున్న పరిస్థితిని ఎలా  తెలియచేయాలా  అని వారు ఒక సందిగ్ధ అవస్థలో వారు ఉన్నారు. 

"ఆయనను మేలుకొలిపి,ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము అని" చెబుతున్నారు. ఇక్కడ శిష్యులు చాలా వరకు వారి వాస్తవ పరిస్థితిని అంచనా వేసి యేసు ప్రభువు దగ్గరకు వెళుతున్నారు. వారి జీవితం ముగిస్తుంది అని వారు అనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో వారిని దేవుడు తప్ప ఇంకా ఎవరు కాపాడలేరు. ఎందుకంటే వారికి తుఫాను గురించి బాగా తెలుసు. సముద్రం గురించి తెలుసు. ఎప్పుడు సముద్రం తీవ్ర రూపం దాల్చుతుందో వారికి తెలుసు. ఈ పరిస్థితిలో వారు జీవించడానికి యేసు ప్రభువు తప్ప ఇంకా ఎవరు వారిని కాపాడలేరు. వారు నాశనం చెందకూడదు అనుకున్నారు. వెంటనే వారు ప్రభువు దగ్గరకు వచ్చారు. మమ్ములను రక్షింపుము అని వేడుకుంటున్నారు. ఈ వెడుకోలులో వారి భయం, ప్రాణం మీద ఆశ అన్నీ అరచేతిలో పెట్టుకొని ఏమి అవుతుందో అని ప్రభువు దగ్గరకు వెళ్లారు. వారిని ప్రభువు రక్షిస్తున్నారు.  సముద్రంను ఆయన శాసిస్తున్నాడు. ఆయన మాటను విని సముద్రం శాంతిస్తుంది.   

యేసు వారితో , ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ? అని అంటున్నారు.  యేసు ప్రభువు వారిని అల్ప విశ్వాసులారా అని ఎందుకు అంటున్నారు. యేసు ప్రభువు చేసిన అనేక పనులకు వీరు సాక్షులు, సముద్రాన్ని , దాని అలలను అంచనా వేయగలిగిన వీరు వారితో పాటు ఉన్నటువంటి యేసు ప్రభువు ఎవరు అని వారు గ్రహించలేక పోయారు. ఆయన మనతో ఉన్నంత కాలం మనకు ఎటువంటి అపాయం ఉండదు అని గ్రహించలేకపోయారు. వారు భయ పడుతున్నారు. యేసు ప్రభువు చేసిన అనేక పనులను చూసికూడా వీరు ఆయన యందు విశ్వాసం ఉంచలేక పోయారు. పాత నిబంధనలో దావీదు మహారాజు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు ఏ కొదవయు లేదు అని అంటున్నారు. యేసు ప్రభువు శిష్యులు కూడా అలానే ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉంటే ఇక ఏ కొదవయు ఉండదు అని తెలుసుకోవాలి. అది వీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాడంలో వారు ఇఫలం చెందారు అందుకే యేసు ప్రభువు యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ?" అని  అంటున్నారు. 

అప్పుడు యేసు ప్రభువు లేచి  "గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి." గాలిని , సముద్రమును యేసు ప్రభువు గద్దింపగా సముద్రము శాంతించింది. ఇది యేసు ప్రభువు దైవత్వాన్ని తెలియజేస్తుంది. ఇంతకు ముందు శిష్యులు యేసు ప్రభువు స్వస్థత  ఇవ్వడం చూసారు. అద్భుతాలు చేయడం చూసారు. కాని ఇక్కడ యేసు ప్రభువుకు ప్రకృతి కూడా ఆయన మాట వింటున్నది. ఆయన చెప్పినట్లు చేస్తుంది.  అప్పుడు అది చూసిన వారు ఆశ్చర్యపడుతున్నారు. ఈయన ఎవరు , ఈయనకు ప్రకృతి కూడా మాట వింటున్నది అని వారు అనుకుంటున్నారు. యేసు ప్రభువుతో మన జీవితంలో ఉన్నటువంటి అన్నీ సమస్యలు తీరుతాయి. ఆయనతో మనతో ఉంటే మనకు ఏ కొదవయు ఉండదు. అంతే కాదు ప్రశాంతత మన జీవితంలో ఎల్లప్పుడు ఉంటుంది. 

ప్రార్ధన : ప్రభువా! నా జీవితంలో అనేక సార్లు అనేక కల్లోలాలు వచ్చినవి అటువంటి సమయంలో నేను భయ పడి పోతున్నాను. నాకు నాశనము తప్పదు అని అనుకుంటున్నాను. నిరాశలో జీవిస్తున్నాను. నా జీవితంలో వచ్చే సమస్యలు నన్ను క్రమ్మేస్తున్నాయి. అప్పుడుకూడా నేను భయ పడుతున్నాను. నీవు నాకు తోడుగా ఉన్నావు అని తెలుసుకోలేక పోతున్నాను. నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఏ కొదవయు ఉండదు అని తెలుసుకోలేకపోయాను. అటువంటి సమయంలో నన్ను క్షమించండి. నీవు నాకు తోడుగా ఉన్నవన్న విషయాన్ని నేను ఎల్లప్పుడు గుర్తుంచుకునే విధంగా దీవించండి. నా జీవితంలో వచ్చే అనేక అలలను ఎదుర్కోడానికి కావలసిన శక్తిని దయ చేయండి. మీ యందు పూర్తి విశ్వాసం కలిగి జీవించే వానిగా నన్ను చేయండి. ప్రభువా! నీవు సముద్రమును గద్దింపగా అది శాంతించింది. అటులనే నా జీవితంలో మీ మీద విశ్వాసం సన్నగిళ్ళే ప్రతి విషయాన్ని గద్దించండి.  మీ మీద ఎప్పుడు విశ్వాసం ఉండే వానిగా చేయండి. ఆమెన్ . 

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...