3, జులై 2022, ఆదివారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి సువార్త 9 : 18 - 26

18. ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు అధికారి ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరించి, "నా కొమార్తె ఇపుడే మరణించినది. కాని, నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై నుంచిన ఆమె బ్రతుకును". అని ప్రార్థించెను. 19. అపుడు యేసు లేచి, శిష్యసమేతముగా అతనిని వెంబడించెను. 20. అప్పుడు పండ్రేండేళ్ల నుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్నఒక స్త్రీ వెనుకనుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను. 21. ఏలన, "యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును" అని ఆమె తలంచుచుండెను. 22 . యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, "కుమారీ! ధైర్యము వహింపుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచెను". అని పలుకగా ఆమె ఆక్షణముననే ఆరోగ్య వంతురాలాయెను.

23. పిమ్మట యేసు, ఆ అధికారి ఇంటికి వెళ్లెను. అచట వాద్యములు మ్రోయించువారిని, అలజడిగనున్నజన సమూహమును చూచి, 24. "మీరందరు ఆవలికి పొండు. ఈ బాలిక మరణించలేదు. నిదురించుచున్నది" అని పలికెను. అందులకు వారందరు ఆయనను హేళన చేసిరి. 24. మూగియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్లి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. 26. ఆ వార్త ఆ ప్రాంతము అంతట వ్యాపించెను.

ధ్యానము: "నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరుచును".

క్రీస్తు నాధుని యందు ప్రియ స్నేహితులారా, ఈ నాటి సువిశేష పఠనాన్నిమనము ధ్యానించినట్లయితే, మనము ఒక  స్వస్థతను మరియు ఒక అద్భుతము గురించి మనము చదువుతున్నాము. మొదటిగా పండ్రేండేళ్ల నుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్నఒక స్త్రీ, తన శారీరక రోగమునుడి స్వస్థత పొందుతుంది.

ఈ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే, ఈ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఆమెకు ఉన్నటువంటి ధైర్యాన్ని, లేదా సాహసాన్ని, విశ్వాసాన్ని క్రీస్తు ప్రభువు అభినందిస్తున్నారు. క్రీస్తు నందు విశ్వాసముంచి, భయం భయంగా దేవుని యొక్క వస్త్రాన్ని తాకిన వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. క్రీస్తు ప్రభువు, ఆమె యొక్క విశ్వాసముగల సాహసానికి, మెచ్చి, ఆమెతో "కుమారీ! నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని పలికాడు."

ఈ స్త్రీ, క్రీస్తు ప్రభువు యొక్క అంగీ అంచును, ఒకే ఒక్కసారి,  తాకగానే స్వస్థత కలిగింది.

మరి మనము ప్రతి రోజుకూడా క్రీస్తుని మన హృదయములోకి, మన ఆత్మలోకి  దివ్య సత్ప్రసాద రూపంలో, మనం స్వీకరిస్తున్నాం. మరి ఎన్ని సార్లు మనం స్వస్థత పొందాలి, ఎన్ని రోగాలనుండి మనకు స్వస్థతలు, అద్భుతాలు జరగాలి.  మరి మనది నిజమైన  విశ్వాసమా  లేదా పెద్దలు మనకు నేర్పించినటువంటి ఆచారము మాత్రమేనా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం.

రెండవదిగా, క్రీస్తు ప్రభువుకు మరణము పై ఉన్న ఆధిపత్యాన్ని, లేదా జీవాన్ని ఒసగే శక్తి ఉందని మనము గ్రహించవచ్చు.

ఈ వచనంలో మనము రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు, మొదటిగా అధికారికి ఉన్నటువంటి వినయము, విశ్వాసము, రెండవదిగా జనసమూహము యొక్క అవిశ్వాసము. ఇక్కడ అధికారి మోకరించి, క్రీస్తునందు పూర్తి విశ్వాసముంచి, ప్రార్థిస్తున్నారు, కాని జనసమూహము హేళన చేస్తున్నారు, దేవుడిని నమ్ముటలేదు, ఒక పిచ్చివానిగా చూస్తున్నారు. ఎందుకంటే "మరణించిన వారిని నిదురిస్తున్నారు" అంటే ఎవరైనా హేళనచేస్తారు, వెక్కిరిస్తారు, వాస్తవమే. కానీ వారు మాత్రం క్రేస్తుప్రభువు దేవుడన్న సంగతిని గ్రహించుటలేదు.

ఇక్కడ వారు క్రీస్తు ప్రభువుకు, జీవాన్ని ఇచ్చే శక్తి, అధికారం ఉందని గ్రహించలేదు. అందుకు కాబోలు, ఆ జనసమూహము క్రీస్తుని హేళన చేశారు.

కానీ క్రీస్తు ప్రభువు వారి మాటలను హేళనను లెక్క చేయకుండా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మరణించిన ఆ బాలికను జీవంతో లేపుతున్నారు.

ఆ సన్నివేషాన్ని చూసి జనసమూహము  అశ్చర్యంతో నిండిపోయారు, అవును. సహజంగా ఆ జనసమూహము, ఇప్పటి వరకు మరణించిన వారిని జీవముతో లేపటం, వినివుండరు, బహుశా చూసివుండరు కూడా. అందుకే వారు అలా ప్రవర్తించి ఉండవచ్చు. తరువాత వారు, క్రీస్తు చేసినటువంటి ఆ అద్భుతాన్ని ఆ ప్రాంతమంతయు చాటిచెప్పారు.

ఈ రెండు సన్నివేషాల ద్వారా మనందరమూ గ్రహించవలసినది ఏమిటంటే, ఏవిధంగా నైతే, ఆ అధికారి మరియు జబ్బునపడినటువంటి స్త్రీ వలే,  మన జీవితాలలో అద్భుతాలు, స్వస్థతలు జరగాలంటే, మనము కూడా, ధైర్యము వహించి, దేవుని యందు విశ్వాసము ఉంచి, దేవుని చెంత మోకరించి ప్రార్థించాలి, అప్పుడే, దేవుడు, మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మెచ్చుకొని, మన ప్రార్థనలు, విన్నపాలను ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు.

క్రీస్తునాడుని యందు ప్రియ స్నేహితులారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం.

మన జీవితాలు ఏవిధంగా ఉన్నాయి, ఆ అధికారి, మరియు ఆ స్త్రీ వలే, దేవుని యొక్క మనజీవితాలలో చూడాలనుకుంటున్నాయా లేదా, ఒక వేల ఆ జనసమూహము వలే క్రీస్తుని మనము హేళన చేస్తున్నామా?

ప్రార్థన : ఓ దయా సంపన్నుడా! మా జీవితాలు కూడా ఎన్నో సంవత్సరాలుగా, అనేక విధాలైన రోగములనుండి, కోపము, పగ, ద్వేషము, అసూయా, క్రోధము, వ్యామోహము,  దొంగతనము, గర్వము, సోమరితనం, ఇంకా అనేక విధములైన శారీరక, ఆత్మీయక రోగములనుడి నశించి పోతుంది. మాకు మాత్రం, వాటన్నిటినుండి, బయటకు రావాలని ఉంది, స్వస్థతను పొందాలని ఉంది. కానీ నా బలహీనతలే, నా లోని అవిశ్వాసము, అధైర్యము, గర్వము, నన్ను నీదరికి చేరనీయుట లేదు.

మీ యొక్క దయార్ద హృదయము వలన, నాకు విమోచనము కలుగ చేయుము, నాలొఉన్నటువంటి, అస్వస్తతలను తీసివేయుము. మీరు ఒక్క మాట పలికిన, నా శరీరము, నా ఆత్మకూడా స్వస్థత పొందును. కావున, మాకు కూడా, మిమ్ము హేళన చేసిన జనసమూహము వలే కాకుండా, ఆ అధికారి, మరియు ఆ స్త్రీ వలే, ధైర్యమును, విశ్వాసమును కలుగ చేయుము అని ప్రార్థించుచున్నాము. కావున మేముకూడా మీ యొక్క మహిమను చాటి చెప్పే విధంగా మాకు అనుగ్రహము దయచేయుమని ప్రార్థిస్తున్నాము. ఆమెన్.

Br. Subhash

2, జులై 2022, శనివారం

పునీత తోమాసు గారి పండుగ

పునీత తోమాసు గారి పండుగ

ఈ రోజు తల్లి తిరుసభ అపోస్తులుడైన తోమాసుగారి పండుగను కొనియాడుచున్నది. 

పునీత తోమాసుగారు భారత దేశపు పాలక పునీతుడు ఒకవిధంగా చెప్పాలంటే ఈ నాడు మనం క్రైస్తవులుగా వున్నాం అంటే అది పునీత తోమాసుగారి సువార్త సేవా ఫలితమే.

భారత దేశంలో ఉన్న అనేక మందికి విశ్వాసంను ప్రకటించిన వ్యక్తి , భారత విశ్వాసులకు తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే తోమాసుగారు మాత్రం భారత దేశంలో వున్న క్రైస్తవ విశ్వాసులందరికి తండ్రి. 

విశ్వాసుల నమ్మకం ప్రకారం తోమాసుగారు కేరళ రాష్ట్రంలో 7 దేవాలయాలు నిర్మించారు. 

యోహాను సువార్తికుడు తనయొక్క సువార్త చివరి భాగంలో పునీత తోమాసు గారియొక్క అచంచల విశ్వాస జీవితం గురించి తెలిపారు. 

పునీత తోమాసుగారు అందరికి ప్రభువు యొక్క పునరుత్తానంను సందేహించిన వ్యక్తిగానే తెలుసు కాని ఆయన మాత్రమే కాదు మిగతా శిష్యులు కూడా మొదట్లో  ఆయన పునరుత్తానంను  విశ్వసించలేదు. మార్కు 16 : 1 - 8 . 

స్త్రీలు వచ్చి ప్రభువు పునరుత్తానం గురించి వివరించినప్పుడు శిష్యులు తోమాసు గారి వలె నమ్మలేదు. లూకా 24 : 1 -12 .

-తోమసుగారు ప్రభువుయొక్క పునరుత్తానం నమ్మలేదు ఎందుకంటే ఆయనకూడా మిగతా శిష్యుల వలె వ్యక్తిగత అనుభూతి కావలి. అందుకే ప్రభువును చూస్తే కానీ నమ్మను అని అన్నారు. 

తోమాసు గారియొక్క సందేహం గురించి ఒక్క సారి ఆలోచిస్తే ఆయన యొక్క సందేహం చాలా నెగటివ్ గా భావించకూడదు అది పాజిటివ్ గా ఆలోచిస్తే మంచి అర్థం వుంది. పర్షియా సామెత ఒకటి ఉంది "doubt is the key of the knowledge ". సందేహం అనేది జ్ఞానం పొందుటకు దోహద పడుతుంది. 

మనకు సందేహాలు వున్నపుడే తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తెలుసుకొని మనం జ్ఞానం సంపాదించవచ్చు. మన సందేహాలు మనలను జ్ఞానం వైపునకు నడిపిస్తాయి. 

-దేవుడు సందేహించే వారిపట్ల సహనంతో ఉంటున్నారు. జెకర్యా దేవుని వాగ్దానం గురించి సందేహించారు అయినా కానీ దేవుడు ఆయనను సహించారు. 

-ఆదాము అవ్వ సందేహించారు 

అబ్రహాము భార్య సారా సందేహించింది. 

-బాప్తిస్మ యోహాను గారు కూడా నీవు మెస్సయ్యవా లేక మేము ఇంకొకరికొరకు ఎదురు చూడాలా అని సందేహించారు. ఈ సందేహించిన ప్రతి వారి పట్ల దేవుడు సహనంతో వున్నారు. అలాగే యేసు ప్రభువు యొక్క సందేహించిన తోమాసు గారి పట్ల దేవుడు సహనంతో ఉన్నారు. 

వాస్తవానికి మనకు ఉన్న సందేహాలతో మనకున్న విశ్వాసం పోరాడాలి . అప్పుడే విశ్వాసం గెలుస్తుంది. ఇది ఆయనకు ఉన్న సందేహాలు తన యొక్క విశ్వాసంతో పోరాడినప్పుడు చివరికి ఆయన సంపూర్ణ విశ్వాసం కలిగి, దైవ అనుభూతి కలిగి జీవించారు. 

ఇది కొందరికి నెగటివ్ గా అర్థం అయివుండొచ్చు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో సందేహాలు ఉంటునే ఉంటాయి ఇక్కడ తోమాసు గారు బయటపడ్డారు మిగతా వారు బయట పడలేదు అయినప్పటికీ యేసు ప్రభువు ప్రత్యేకంగా ఆయనకోసమే మరొకసారి ప్రత్యక్షమయ్యారు. 

-పునీత గ్రెగొరీ ద గ్రేట్ అంటారు యేసు ప్రభువు తోమాసు గారి యొక్క సందేహామనే గాయంను మాన్పిన విధంగా ప్రభువు మనలో ఉన్న అనేక గాయాలు మాన్పుతారు  అని అన్నారు. మనందరిలో ఉన్న అపనమ్మకం అనే గాయాన్ని ప్రభువు నయం చేస్తారు. యేసుప్రభువు శిష్యులకు దర్శనం ఇచ్చిన సందర్భాలలో తోమాసు గారు by chance (ఒకవేళ ) అక్కడ లేక పోవడం కాదు దేవుడు తనయొక్క దయను చూపుటకు, ఆయన విశ్వాసం బలపరుచుటకు ఈ విధంగా చేశారని గ్రెగొరీ గారు పలికారు. 

తోమాసుగారికి దైవ దర్శనం కలిగిన తరువాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు కూడా ఆయనకు యేసుప్రభువు అంటే గొప్ప నమ్మకం గౌరవం ఉన్నాయి.

ఈ రోజు ప్రత్యేకంగా ఆయనలో వున్న కొన్ని లక్షణాలు గుర్తుకు చేసుకోవాలి. 

1. తోమసుగారు ధైర్య వంతుడు -   తన యొక్క యజమాని, గురువు అయిన క్రీస్తుప్రభువు కొరకు చనిపోయేటంత ధైర్యం కలిగిన వ్యక్తి. లాజరు చనిపోయిన సందర్భంలో బెతానియాకు వెళ్ళేందుకు నిరాకరించిన వేళలో తోమాసుగారు రండి మనంకూడా వెళ్లి ఆయనతో మరణించుదాం అని పలికారు. మిగతా శిష్యులందరు మరణంకు భయపడ్డారు కాని తోమాసు గారు ధైర్యంతో ముందుకు వెళ్లారు. యోహాను 11 : 7 -16 . 

యేసు ప్రభువు మరణించిన తరువాత యూదుల భయముచే ఒక గదిలో దాగుకొని వున్న సమయంలో తోమాసు గారు మాత్రం బయట దైర్యంగా వున్నారు . యోహాను 20 :24 .

-దేవుని సువార్త కొరకు భారత దేశం వచ్చి  అనేక మందిని క్రైస్తవులుగా చేసి చివరికి వేదసాక్షిగా మరణించారు. తనకు వున్న దైర్యం వల్లనే దేవుని కొరకు జీవించి, మరణించారు. 

ప్రభువును తెలుసుకొవాలనే తృష్ణ కలిగిన వ్యక్తి- కడరాత్రి భోజన సమయంలో యేసు ప్రభువు శిష్యుల కొరకు పరలోకంలో నివాస స్థానం సిద్ధం చేయుటకు నేను మీకన్నా ముందుగా వెళతాను అని చెప్పిన సమయంలో తోమాసు గారు నీవు వెళ్లే మార్గము మాకు తెలియదు నీ మార్గము గురించి తెలుపుము అని తోమాసు గారు యేసు ప్రభువును అడిగారు. యోహాను 14 : 6 .

మిగతా శిష్యులవలె దేవుని మార్గము తెలుసనీ నటించక తనకు తెలియదని ప్రభుని అడిగారు. తనయొక్క అజ్ఞానమును ప్రభువు ముంగిట ఉంచి దైవ జ్ఞానము పొందాలనుకున్నారు, తోమాసుగారు. 

దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తి - పునరుతానమైన ప్రభువు యొక్క గాయాలలో వ్రేలుపెట్టి చూడాలని కోరుకున్న తోమాసుగారు ఒక్క సారిగా ప్రభువు దర్శన మిచ్చిన సమయంలో యేసు ప్రభువును సంపూర్ణంగా విశ్వసించారు. అప్పటివరకు కూడా తోమాసు గారికి యేసుప్రభువు గురించి వివిధ రకాల ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన్ను ఈ భోలోక రాజుగా, మెస్సయ్యగా భావించాడు .

ఈ  భూలోకంలో  తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడని, ప్రజలయొక్క కష్టాలు తొలగిస్తారనే ఆలోచనలు కలిగివున్నాడు . కాని ప్రభువు మరణ పునరుత్తానం తరువాత మరీ  ముఖ్యంగా తనకు దర్శనం ఇచ్చిన సందర్భంలో ప్రభువు గాయంలో వ్రేలు పెట్టకుండానే ఆయన్ను చూసి సంతృప్తి చెంది విశ్వసించారు . ఆయన్ను విశ్వసించడం మాత్రమే కాదు తన దేవునిగా గుర్తించారు. అందుకే ఆయన "నాదేవ, నాప్రభువా" అని పలికారు. 

మిగతా శిష్యులవలె కాకుండా యేసయ్యను తన సొంత దేవునిగా అంగీకరించిన వ్యక్తి పునీత తోమాసుగారు. 

పట్టు విడువని వ్యక్తి - పునీత తోమాసుగారు తనయొక్క జీవితంలో పట్టువిడువని వ్యక్తి . ఏదైనా సాధించాలనుకుంటే దానిని తప్పనిసరిగా సాధిస్తారు. ఎందుకంటే మిగతా శిష్యులందరు కూడా మేము పునరుత్తాన ప్రభువును చూశాం అని చెప్పినప్పుడు ఆయన దానిని నమ్మి అలా విడిచి పెట్టలేదు వాస్తవానికి ఇద్దరు చెప్పే సాక్ష్యం బైబులు పరంగా నమ్మవచ్చు కాని ఇక్కడ తోమాసు గారికి ఎంత చెప్పినాసరే ప్రభువును చూడాలనే పట్టు విడువలేదు అందుకే ఆయన పట్టుదలవలన ప్రభువును చూడగలిగారు.  

కొందరికిది  మూర్కత్వముగా  అనిపించవచ్చు  కాని తోమాసు  గారికి  ఇది  ఒక  అనుభవం. ఇతరులకు  దక్కిన  వరం  తనకు  కూడా  దక్కాలనుకున్నారు . 

- యాకోబు  దేవుని  ఆశీర్వాదం  కొరకు  పట్టుదల  కలిగి  అడిగిన  విధంగా ,  ప్రభువుని చూడాలనే కోరికతో వున్నారు. ఆది 32 : 26 . 

-కననియ స్త్రీ పదే పదే ప్రభువుని పట్టుదలతో ప్రార్థించినవిధంగా . మత్తయి 15 : 21 -28 .

-పౌలు గారివలె సువార్త పరిచర్యలో పట్టుదల కలిగిన వ్యక్తి లాగ పునీత తోమాసుగారు కూడా ప్రభువును తప్పని సరిగా చూడాలనే పట్టుదల కలిగి వున్నారు.

- ఆయన ఎప్పుడు తన పట్టువిడువ లేదు ప్రభువు సువార్త వ్యాప్తి కొరకు మరణించటానికి సైతం సిద్ధంగా ఉన్నారు. ఇతరులు తాను చెప్పిన మాటలగురించి ఏమని అనుకుంటారు అని భావించలేదు ఏది ఏమైనా సరే ఆయన్ను చూడాలి అనే ఆశ ప్రభువును చూసేలా చేసింది.

బలహీనతను ప్రభువు ముంగిట ఒప్పుకున్న వ్యక్తి:

మూసిన తలుపులు మూసినట్లు ఉండగనే ప్రభువు దర్శనం ఇచ్చిన సమయంలో తోమాసుగారు శిష్యులతో కలిసి ఉన్నప్పుడు ప్రభువు మొదటిగా తోమాసు గారితో మాట్లాడుతున్నారు.

-తోమాసు హృదయం తెలిసిన ప్రభువు ఆయన పలికిన ప్రతి మాట తోమాసుతో చెప్పే సమయంలో ప్రభువు ముందు మోకరించి తనయొక్క అపనమ్మకమును ఒప్పుకున్నారు. తన గురువు పట్ల చేసిన తప్పిదాలు ఒప్పుకున్నారు. యేసు ప్రభువుకు సమస్తము తెలుసు అని గ్రహించారు. 1 యోహాను 3 : 20 , యోహాను 2 :25 , దానియేలు 2 :22 , మత్తయి 10 :30 . 

-ప్రభువుపట్ల చేసిన తప్పిదములను గ్రహించి "నా ప్రభువా, నాదేవా" అని చెప్పారు. యేసు క్రీస్తు చెప్పినది మొత్తం నిజం అని తెలుసుకున్నారు, ఆయన సృష్టి కర్త అని గ్రహించారు. (యోహాను 1 :1 -2 ). ప్రభువు తన దైవంగా భావించి తన పాపాలను ఒప్పుకొని ప్రభువును ఆరాధించి తన దైవంగా చేసుకొన్న గొప్ప పునీతుడు తోమాసుగారు. 

-తన బలహీనతను అంగీకరించుట ద్వారా ప్రభువు తనను బలపరుస్తున్నారు. నూతన వ్యక్తిగా చేస్తున్నారు. తనయొక్క శాంతితో నింపుచున్నారు. 

6. క్రీస్తుప్రభువుని ప్రేమించిన వ్యక్తి:

 మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి కొరకు ఏదైనా చేస్తాం.  అది ఎంత కష్టమైన ఇష్టంగా , తేలికగా ఉంటుంది. తోమాసు గారు ప్రభువు పట్ల వున్న ప్రేమను తనయొక్క పరిచర్య ద్వారా చూపించారు . తన కొరకు ప్రాణాలు ఇచ్చుటకు సైతం సిద్ధంగా ఉన్నారు. 

-పునీత తోమాసు గారు మనందరికీ ఆదర్శం, మనకు ఎన్ని సందేహాలున్న వాటన్నింటిని విశ్వాసంతో అధిగమించి ప్రభువుని విశ్వసించి అనుసరించాలి .

Doubting Thomas ను దేవుడు Daring Thomas గా మార్చిన విధంగా దేవుడు మన విశ్వాస జీవితాలనుకూడా బలపరచాలని ప్రార్థించుదాం.

Rev. Fr. Bala Yesu OCD


పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...