10, డిసెంబర్ 2022, శనివారం

ఆగమన కాలం - మూడవ ఆదివారం

 ఆగమన కాలం - మూడవ ఆదివారం

యెషయ 35: 1- 6, 10

యాకోబు 5: 7-10

మత్తయి 11: 2 -11

ఈనాటి ఆదివారమును “Gaudete Sunday” ఆనందించు ఆదివారం అని పిలుస్తారు. ఆగమన కాలం అంటే సంతోషంతో ఎదురు చూడటం, దేవుని రాకడ కొరకు ఆనందంతో ఎదురు చూస్తూ, ఆయన కొరకు మన యొక్క జీవితాలను తయారు చేసుకోవటమే.

ఆగమన కాలం మొదటి ఆదివారం నుండి ఇప్పటివరకు దివ్య గ్రంథ పఠనాలు హృదయ పరివర్తనం గురించి, దేవుని నిరీక్షణ కలిగి ఉండటం గురించి, ప్రభు యొక్క తీర్పు గురించి తెలుపుచున్నాయి.

ఏ విధంగానైతే ఆకలితో అలమటించే వ్యక్తి అన్నం కోసం ఎదురు చూస్తాడో, నిరుద్యోగి ఉద్యోగం కోసం ఎదురు చూస్తాడో, బానిసత్వంలో ఉన్నవారు స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తారో ప్రస్తుతం మనందరం మెస్సయ్య యొక్క రాక కోసం, క్రీస్తు జయంతి కోసం ఎదురుచూస్తున్నాం. మన యొక్క ఎదురుచూపులో ఆనందం దాగి ఉంది.

మొదటి పఠణంలో యెషయ ప్రవక్త రాబోయే మంచి రోజుల గురించి బోధిస్తున్నారు.

క్రీస్తుపూర్వం 587 సంవత్సరంలో బాబిలోని  రాజు యెరూషలేమును యూదులను ద్వంశం చేసి అక్కడ ఉన్న నాయకులను మరియు జనాభాను బానిసత్వంలోనికి తీసుకొని పోయారు.

దేవుడు యూదులను బాబిలోనియాలనుండి రక్షించలేని బలహీనుడు కాదు. కేవలం ఇశ్రాయేలీయులకు వారి యొక్క పాపాలకు ప్రభువు వారిని దాదాపు 50 సంవత్సరాల వరకు శిక్షించారు.

ఈ శిక్ష కేవలం వారికి మంచిని నేర్పుటకు వారి జీవితాలను సన్మార్గం లో నడిపించుటకు ప్రభు ఈ విధంగా అనుమతించారు.

నెబుకద్నెసారు  రాజు యెరూషలేమును ఆక్రమించి దానిని ఎడారిలాగా మార్చాడు. అప్పటివరకు దేవుని నివాస స్థలమైన యెరూషలేమును ధ్వంసం చేశారు. పచ్చని నేలను మారు భూమిగా మార్చాడు. పుణ్యభూమిని పాప మలినం చేశాడు.

వారి యొక్క బానిసత్వం ముగిసిన తరువాత దేవుడు పర్షియా చక్రవర్తి కోరేషును ప్రేరేపించి అప్పటివరకు బాధలు కష్టాలు అనుభవిస్తున్న యూదులను విడిపించి వారిని యెరూషలేము వెళ్ళుటకు స్వేచ్ఛనిచ్చారు.

ఈనాటి మొదటి పఠనం 35:16-10 వచనాలలో ప్రవక్త ప్రజల యొక్క భవిష్యత్తు సంతోషకరంగా ఉండును అని తెలుపుచున్నారు.

రక్షకుడు మెస్సయ్య వారి మధ్యకు వచ్చినప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయో ముందుగానే యెషయ  ప్రవక్త ప్రవసించారు.

యెషయ 35: 1-2 వచనాలలో దేవుడు ప్రకృతిని నూత్నికరించే విధానంను తెలుపుచున్నారు. ప్రభువు ఏ విధంగా ఎడారిని మరు భూమిగా  మార్చబోతున్నారు తెలుపుచున్నారు. ఫలించని ఒక స్థలంలో దేవుడు ఒక కొత్త జీవితం పుట్టిస్తున్నారు.

అప్పటి వరకు ఎడారిలాగా జీవం లేని బ్రతుకుల్లా ఉన్న యిస్రాయేలీయులలో ప్రభువు యొక్క రాక ద్వారా సంతోషం నింపబడిందని పలుకుచున్నారు. ప్రభువు యొక్క రాకతో మోడుబారిన జీవితాలలో కూడా ఒక క్రొత్త చిగురు పుడుతుందని తెలిపారు.

యిస్రాయేలీయులు తిరిగి రావడంతో యెరూషలేము జీవంతో నింపబడినది. నిర్జీవంగా ఉన్నటువంటి ఒక ప్రదేశమును దేవుడు మార్చబోతున్నారు. ఎడారిలో అంతయు ఎండిపోవును, బ్రతుకుట కష్టము కానీ అలాంటి స్థలమును దేవుడు మార్చుతున్నారు.

లెబానోను, కార్మెల్, షారోను స్థలములను దేవుడు సారవంతం చేస్తున్నారు. అక్కడ దేవుడు సమృద్ధిని దాచేస్తారు అని ప్రవక్త తెలిపారు.

మరుభూమి ప్రమోదం చెంది పుష్పించును గాక అని ప్రవక్త తెలిపారు. పవిత్ర గ్రంధంలో మరుభూమికి వివిధ రకాలైన అర్ధాలున్నాయి.

- మరుభూమి (wildernesss or desert) యిస్రాయేలీయుల వలసకు గుర్తు, ప్రజల యొక్క               స్వేచ్ఛకు గుర్తు - ఆది 16: 12, నిర్గమ 3: 13

- ఎడారి ప్రాణాంతకమైంది - ద్వితి 8: 15

- మరుభూమి అపాయం కలిగినది - నిర్గమ 14: 3

- నీరు కొరతగా ఉండే ప్రదేశం (నిర్గమ 15: 17) ఎటువంటి పంటలేని స్థలం.

- విస్తారమైనది - ద్వితి 1: 19

- దేవుడి మీద నమ్మకముంచుట నేర్పిన స్థలం

దేవుడు యిస్రాయేలీయులను 40 సంవత్సరములు నడిపించి పోషించిన స్థలం, అసాధ్యమైన కార్యాలను ప్రభువు సుసాధ్యం చేసిన స్థలం.

ప్రభువు వచ్చే సమయంలో ఒక క్రొత్త మార్పు ఉంటుంది అని తెలుపుచున్నారు. మార్పులు ఏమిటంటే:

1. ఎడారి సంతషించును

2. మరుభూమి పుష్పిస్తుంది

3. జాజిపూలు పూస్తాయి

4. అలసిపోయిన హస్తాలు బలపరచబడతాయి

5. వణికే మోకాళ్ళు సత్తువతో నిలబడతాయి

6. గ్రుడ్డి, కుంటి వారు దేవుని స్వస్థత పొందుతారు.

ఇవన్నీ కూడా మెస్సయా కాలంలో జరిగే మార్పులు. ప్రభువు వచ్చే సమయంలో అంత సంతోషమే.

యెషయా ప్రవక్త ప్రజలను మూడు ఉద్దేశాలను బట్టి ఆనందించుమని తెలుపుచున్నారు.

1. యిస్రాయేలీయులు బానిసత్వం నుండి తిరిగి రావటమును బట్టి ఆనందించాలి.

2. గ్రుడ్డివారు, చెవిటివారు, మూగ కుంటివారు ప్రతి ఒక్కరు స్వస్థత పొందుతారు కాబట్టి సంతోషించాలి.

3. కష్టాలు, భాధలు తొలగిపోతాయి కాబట్టి సంతోషించాలి.

ఈనాటి మొదటి పఠనంలో ఆనందం అనే పదంను చాలా సార్లు చూస్తున్నాం. దేవుడు మనందరం కూడా సంతోషంగా ఉండుట  కోరారు. అందుకనే మనం పాపం చేసినప్పటికీ మనల్ని వెదకి రక్షిస్తున్నారు. మనందరం ఆనందంగా ఉండాలి, ప్రభువును బట్టి ఆనందించాలి - ఫిలిప్పి 4: 4

ఈనాటి రెండవ పఠనంలో యాకోబు గారు ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండమని పలుకుచున్నారు.

ఏవిధంగానైతే ఒక రైతు పొలం వేసిన తరువాత తన యొక్క పంటకోసం ఎదురు చూస్తుంటారో అలాగే మన ప్రభువు కొరకు మనం కూడా ఎదురు చూడాలి అని తెలుపుచున్నారు.

యాకోబు గారు విశ్వాసులను సహనంతో ఉండమని తెలిపారు. ఎందుకంటే అప్పటి ధనవంతులు, అధికారులు సామాన్యమైన ప్రజలను హింసించే సందర్భంలో భాధలు పెట్టె సమయంలో అన్ని సహనంతో భరించమని వారికి తెలియజేసారుఒక రైతును ఉదాహరణగా తీసుకుంటున్నారు ఎందుకంటే రైతు పొలం వేసిన వెంటనే త్వరగా  పంటను ఆశించడు, ఆయన సహనముతో ఎదురు చూస్తాడు. ఆయన ప్రతిరోజు పని చేస్తాడు. కొన్నిసార్లు అంతా పంట రాకపోయినా సరే, మొక్కలు ఎదగకపోయినా సరే ఆయన విడిచిపెట్టడు. అదేవిధంగా క్రైస్తవులు ప్రభువు కొరకు కూడా అదే విధంగా వేచి ఉండాలి.

మన యొక్క బాధలలో, కష్టాలలో ప్రభువును విశ్వసంతో, విడిచి పెట్టకుండా జీవించాలి.  

మన యొక్క అనుదిన జీవితంలో ఎంత సహనంగా ఉంటే అంత సంతోషంగా జీవించగలుగుతాం. సహనంగా ఉండుట ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందవచ్చు, అబ్రహాము తన యొక్క సహనం వలన ఆశీర్వదించబడ్డారు - హెబ్రీ 6:12, హెబ్రీ 6:15.

- సహనం మనలను రక్షించును.

- మన యొక్క సహనము వలనే మనం పరలోకంలో ప్రవేశిస్తాం అని పౌలు గారు పలికారు-  రోమీ 2:7.

- యోబు తన యొక్క సహనం వలన ఆశీర్వాదాలు పొందారు, అదే విధంగా క్రైస్తవులమైన మనం కూడా సహనంతో ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి.

- పునీత అవిలాపురి తెరెజమ్మ అంటారు సహనం సమస్తమును భరించును కాబట్టి సహనంతో జీవించి పరలోక రాజ్యమును పొందుదాం.

ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నిందలు ఎదురు కావచ్చు, హింసలు ఎదురు కావచ్చు భయపడవచ్చు, ఇవన్నీ ఎదురైనప్పటికిని మనం ఓర్పు కలిగి ఉండాలి.

ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులకు బాధపడినా కానీ బిడ్డకు జన్మనిస్తుందని సహనంతో సంతోషంగా ఉంటుంది.

మనం కూడా సహనంతో జీవించి ప్రభువు కొరకు మన జీవితాలను సంసిద్ధం చేసుకుందాం.

ఈనాటి సువిశేష పఠనం లో  బాప్తిస్మ యోహాను గారు తన యొక్క శిష్యులను యేసు ప్రభువు వద్దకు పంపించి తాను మెస్సయ్యనా లేక మేము ఇంకొకరి కోసం ఎదురు చూడాలా అని అడుగుచున్నారు.

బాప్తిస్మయోహాను ఏసుప్రభువు చేసే కార్యముల గురించి విన్నారు.అందుకనే తాను మరణించే ముందు ఎటువంటి సందేహం లేకుండా మరణించాలని అనుకున్నాడు.

ఎందుకని బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభువు గురించి సందేహిస్తున్నారు?

ఆయనయే స్వయంగా ఏసుప్రభు అని సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించే ప్రభువు అని పలికారు- యోహాను 1:29.

బాప్తిస్మ యోహాను గారే మెస్సయ్య గురించి ఆయన పవిత్రాత్మతో అగ్నితో ఇచ్చే బాప్తీస్మం గురించి బోధించారు. ఆయన మెస్సయ్యను ఈ ప్రశ్న అడుగుటకు చాలా కారణాలు ఉన్నాయి.

1. బాప్తిస్మ యోహాను గారు మెస్సయ్య గురించి ప్రవక్తల బోధనల ద్వారా చాలా విన్నారు. మెస్సయ్య వచ్చే సమయంలో ఆయన ఫలించని చెట్లను నరికి పారవేస్తాడని భావించాడు కానీ ప్రభువు దానికి భిన్నంగా క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు-  మత్తయి 3:10.

2. క్రీస్తు ప్రభువు పాపులతో సుంకరులతో కలిసి భుజిస్తున్నారు. లూకా 15:1-2, మత్తయి 11:19.

3. ఏసుప్రభు యొక్క పరిచర్య ఆయన గురించి బోధించినది రెండూ కూడా ఒకదానితో ఒకటి సరితూగుటలేదు అందుకే సందేహిస్తున్నారు.

4. బాప్తిస్మ యోహాను గారు మెస్సయ్య రోమీయుల సామ్రాజ్యమును పడద్రోసి ఇశ్రాయేలు రాజ్యమును సైన్యమును స్థాపిస్తాడని ఆశించాడు- మత్తయి 1:18.

5. ఇశ్రాయేలులను స్వేచ్ఛ స్వతంత్రులను చేస్తాడని భావించాడు తనను చెరసాల నుండి విముక్తి గావిస్తాడని ఆశించి ఉండవచ్చు , అది కూడా జరగలేదు.

6. కొంతమంది ప్రభువు యొక్క తగ్గించుకొని జీవితంను చూసి ఆయన యొక్క జీవితమును చూసి విశ్వాసం కోల్పోయి ఇతడు నిజంగా మెస్సయేనా లేక ఇంకొక మెస్సయ్య వస్తాడా అని ఎదురు చూశారు.

ఏసుప్రభు బాప్తిస్మ యోహానుకు తన మాటల ద్వారా సమాధానం ఇవ్వకుండా తన యొక్క క్రియలే తాను మెసయ్యానని నిరూపిస్తున్నాయని తెలిపారు.

ప్రభువు యొక్క సువార్త పరిచర్య ద్వారా అనేకులు ఆయన్ను మెస్సయ్యగా గుర్తించారు. అనేకమంది ప్రజలు ఏసుప్రభువును గొప్ప వానిగా స్వీకరించారు ఆయన చేసిన అద్భుతముల ద్వారా- లూకా 7:21- 23.

అనేకమంది ప్రభువును బోధకునిగా అంగీకరించారు పేతురు గారు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవని పలికారు .మత్తయి 16:16.

- ఏసుప్రభు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడని పేతురు విశ్వాసాన్ని ప్రకటించారు. యోహాను 6-68.

- ఏసుప్రభువు అంతయు అధికార పూర్వకంగా బోధించారని విశ్వసించారు. మత్తయి 7:28-29.

ఏసుప్రభు మెస్సయ్య చేసే క్రియలన్నీ తన పరిచర్యలో ఆయన చేశారు.

1. గ్రుడ్డివారికి చూపునిచ్చారు. కొందరికి శారీరక చూపును, కొందరికి ఆధ్యాత్మిక చూపును దయచేశారు.

2. కుంటివారికి నడకను దయచేశారు.

3. కృష్ట రోగులను స్వస్థపరిచారు.

4. చెవిటి వారికి వినికిడిని దయచేశారు.

5. చనిపోయిన వారికి జీవం ఇచ్చారు శారీరకంగా, ఆధ్యాత్మికంగా మరణించిన వారికి తన యొక్క వాక్కు ద్వారా స్పర్శ ద్వారా స్వస్థతనిచ్చారు.

6. పేదలకు సువార్తను ప్రకటించారు. ఎవరినైతే సమాజం తృణీకరించిందో దేవుడు వారి పక్షమున నిలబడ్డారు. ఏసుప్రభువు ప్రవక్తల బోధనలు అన్నియు నెరవేర్చారు -మత్తయి 11: 5 లూకా 3: 23-28.

ఏసుప్రభు యోహాను శిష్యులకు తన యొక్క కార్యాల ద్వారా తానే మెస్సయ్య అని తెలియజేశారు.

శిశువులు వెళ్లిన తరువాత ఏసుప్రభువు బాప్తిస్మ యోహాను యొక్క గొప్పతనం గురించి ప్రకటించారు. ఆయన దేవుని యొక్క దూత అని గొప్ప ప్రవక్త అని మెస్సయ్యను  గుర్తించిన పవిత్రుడని  క్రమశిక్షణ కలిగిన బోధకుడు అని   దేవుని మార్గమును సిద్ధము చేయువాడని యేసు ప్రభువు బాప్తిస్మయోహాను గారి గురించి తెలిపారు.

బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభు చేసే కార్యాలు గురించి విని ఆనందించారు.

మన యొక్క విశ్వాస జీవితం మనందరం వినిన వెంటనే సందేహించకుండా దానిని పరిశీలించి తెలుసుకొని ఏదైనా ఒక విషయమును నమ్మాలి. సందేహాలకు తావు ఇవ్వకుండా మంచిగా జీవించుదాం .

ఈ దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనందరం కూడా ప్రభువు తొందరలో వస్తున్నారు కాబట్టి సంతోషంతో ఎదురు చూడమని తెలుపుచున్నాయి.


BY. FR. BALAYESU OCD

 

3, డిసెంబర్ 2022, శనివారం

 

ఆగమన కాలం రెండవ ఆదివారం

         యెషయా 11: 1-10

                                                రోమా 15: 4-9

                                                       మత్తయి 3: 1-12

ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు దేవుని యొక్క రాకడ, ఆయన జన్మం మనలో జరగాలంటే మనలో హృదయ పరివర్తన ఉండాలి అనే అంశం గురించి తెలియజేస్తున్నాయి.

 ఎవరి హృదయాలు అయితే పరిశుద్ధంగా ఉంటాయో అక్కడ ప్రభువు జన్మిస్తారు.  దేవుని జన్మం కోసం మన ఒక్క ఆలోచనలు, మనస్తత్వాలు, హృదయాలు  నూత్నీకరించాలి.

యొక్క ఆగమన కాలంలో మన యొక్క జీవితాలను మనం నూత్నీకరించుకోవాలి. దేవుని యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం.

సృష్టి ప్రారంభం  నుండి దేవుడు మానవులను రక్షించాలని ఆశించారు.   పాపం చేయటం వలన మనిషి దేవునికి దూరమయ్యాడు. తన యొక్క ఆధ్యాత్మిక జీవితం క్షిణించినది అందుకే ప్రభుక్కు మానవ జాతిని రక్షించాలని ప్రవక్తలను పంపుచున్నారు. వారి యొక్క జీవితములను నూత్నీకరించమని తెలుపుచున్నారు.

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు విధంగా తాను ఎన్నుకొన్న ప్రజలను తన యొక్క కుమారుని ద్వారా నూత్నీకరిస్తారో యెషయా ప్రవక్త తెలుపుచున్నారు.

యెషయా ప్రవక్త ఈషాయి మొద్దునుండి ఒక పిలక పుట్టును అని తెలుపుచున్నారు. యొక్క మాటలు యేసుప్రభువు యొక్క జీవితంకు వర్తిస్తాయి.  ఈషాయి / జెస్సే దావీదు తండ్రి.  దావీదు వంశం మెస్సయ్యా జన్మిస్తాడని అర్ధం - దర్శన 22: 16, యిర్మీయా 23: 5. యెషయా ప్రవక్త దేవుడు దావీదుకు చేసిన వాగ్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ పలికిన మాటలివి (2 సమూ 7: 16).

దావీదు వంశమున జన్మించబోయే శిశువు రాజ్యమును పరిపాలించును అని, దావీదు యొక్క రాజ్యమును రాబోయే మెస్సయ్యా శాశ్వతముగా పరిపాలించును అని యెషయా ప్రవక్త ప్రవచించారు - యెషయా 9: 7.

దేవుని యొక్క ఆత్మ అతని మీద నిలుచును, ప్రభుని ఆత్మ రాజ్యపాలన చేయుటకు దావీదు వంశమున జన్మించు రాజుకు శక్తిని ఒసగును, కావలసిన వరములను దయచేయును (మత్తయి 3:16 - 17).

మెస్సయ్యా వచ్చినటువంటి కాలంలో దేవుడు తన ప్రజలను క్రొత్తవారిగా నూత్నీకరిస్తారు. ఆయన తన ప్రజలను న్యాయముగా తీర్పు చేస్తాడు. ఎటువంటి తారతమ్యములు, భేదాభిప్రాయాలు లేకుండా వారికి తీర్పు చేస్తారు.

ఇతరులవలే కాకుండా ప్రభువు మనయొక్క హృదయాలను పరిశీలించి తీర్పు చేస్తారు 1 సమూ 16: 17.

లోక న్యాయాధిపతులు కేవలం చూసిన దానిని బట్టి, వినిన దానిని బట్టి తీర్పు చేస్తారు కానీ ఈషాయి మొద్దునుండి పుట్టిన పిలక మెస్సయ్యా తన ప్రజలను న్యాయముగా తీర్పు చేస్తారు.

పేదలను, అవసరంలో ఉన్నవారిని అనాధారం చేయడు. ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిన గౌరవమును ఇస్తారు. ఈలోక పాలకులవలె కాకుండా మెస్సయ్యా వచ్చినప్పుడు పేదలను ఆదుకొని వారికి తగిన విధంగా మేలు చేస్తారు.

ఎవరైతే దేవుని ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తారో వారు శిక్షించబడతారు. యెషయా ప్రవక్త యిస్రాయేలు ప్రజల్లో ఒక క్రొత్త నమ్మకమును తీసుకొని రావటానికి ప్రజలకు రెండవ దావీదు మెస్సయ్యా గురించి బోధిస్తున్నారు.

యెషయా ప్రవక్త పలికినటువంటి మాటల్లో మెస్సయ్యా  తన యొక్క రాజ్య పరిపాలన చేసే సమయంలో కొన్ని క్రొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయి, అవి ఏమిటంటే తోడేళ్ళు గొర్రె పిల్లలతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లలతో కలిసి నిద్రిస్తాయి. అదేవిధంగా కొదమ సింహం లేగ దూడలు కలిసి మేస్తాయి మరియు ఆవు ఎలుగుబంటి కలిసి మేతమేస్తాయి. వచనాలలో మనం అర్ధం చేసుకోవలసిన అంశమేమిటంటే మెస్సయ్యా యొక్క రాకతో క్రూర మృగాలు సైతం మిగతా సాదు జంతువులతో కలిసి మెలసి అన్యోన్యంగా జీవిస్తాయి. దేవుడు సృష్టిని చేసినప్పుడు మొదట్లో విధంగానైతే అన్ని జంతువులు కలిసి మెలసి జీవించాయో మరల అదే విధంగా ఉంటాయి అని ప్రవక్త తెలియజేస్తున్నారు.

మనిషి చేయనంతవరకు అన్ని జంతువులు శాంతియుతంగా జీవించాయి. మరలా మెస్సయ్యా వచ్చే సమయంలో అన్ని జంతువులు కలిసి ఉంటాయి, వాటి మధ్య శాంతి ఉంటుంది అని తెలిపారు.  అన్నింటి మధ్య శాంతి నెలకొల్పేది కేవలం యావేను గూర్చిన జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే (యెషయా 11: 9, యిర్మీయా 31: 34, హబక్కుకు 2:14).

దేవున్ని కేవలం మనస్సు ద్వారా తెలుసుకొనుట కాక ఆయన్ను హృదయ పూర్వకంగా స్వీకరిస్తే, దేవుని ఆజ్ఞాను ఆజ్ఞానుసారంగా జీవిస్తే ఇది సాధ్యం ని ప్రవక్త పలుకుచున్నారు.

దైవ జ్ఞానమంటే మానసిక పరిజ్ఞానం మాత్రమే కాదు, దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడం, విశ్వాసంతో ఆయన్ను వెంబడించుట.

మెస్సయ్యా తన ప్రజలకు చేరువలో వున్నంతవరకు ప్రజలలో శాంతి సమాధానాలు వుంటాయి. యిస్రాయేలు, యూదా రాజ్యాలు కలిసి మరలా యెరూషలేములో యావే దేవున్ని విశ్వసించి ఆరాధిస్తారు.

ఈషాయి వంశము నుండి పుట్టిన శిశువు వలన అందరు కూడా ఆశీర్వదిచబడతారు అని (ఆది 12: 3), కేవలం ఎన్నుకొనబడిన ప్రజలు మాత్రమే కాకుండా అందరు కూడా, అన్ని దేశాలు కూడా ప్రభువుకు ఆకర్షితులవుతారు.

మొదటి పఠనం ద్వారా మనం గ్రహించవలసిన అంశం ఏమిటంటే దేవునికి స్పందించి జీవిస్తే మనలో నూతనత్వం ఉంటుంది, అదే విధంగా దేవుని యొక్క కుమారుడును, ఈషాయి మొద్దునుండి జన్మించిన శిశువు రాక ద్వారా మనలో నూతనత్వం వస్తుంది.

ఈనాటి రెండవ పఠనంలోపునీత పౌలు గారు వివిధ రకాల వర్గాలు సఖ్యపడి, అందరూ కలిసి దేవున్ని ఏక కంఠంతో, హృదయంలో స్తుతించమని పలుకుచున్నారు. పౌలు గారు రోమీయులకు కొన్ని విశ్వాస సూచనలు తెలుపుచున్నారు. ఎవరైతే దేవుని రాక కోసం ఎదురు చూస్తున్నారో వారు ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా జీవించాలి. ఒకరిని ఒకరు అంగీకరించుకొని, సహాయం చేసుకొని జీవించాలి.

క్రొత్తగా క్రైస్తవత్వంలోకి మారిన రోమీయ విశ్వసులకు పౌలు గారు మిగతా యూదా క్రైస్తవులను కలసిమెలసి జీవించమని పలికారు. అన్యులు అదేవిధంగా యూదా క్రైస్తవులు కలిసి జీవిస్తే వారి మధ్య శాంతి సమాధానం నెలకొనివుంటుంది. దేవుడు విధంగానైతే అందరిని అంగీకరించి జీవించారో మీరు కూడా ఎటువంటి భేదాలు లేకుండా పరస్పర అంగీకారం కలిగి జీవించమని కోరారు.

ఈనాటి సువిశేష పఠనంలో బాప్తిస్మ యోహాను గారు చేసిన భోధన గురించి వింటున్నాం.

దేవుని యొక్క రాకడ కోసం ప్రజల యొక్క హృదయాలను శుద్ధి చేసుకొని ప్రభువును స్వీకరించమని యోహాను గారు పలికారు.

బాప్తిస్మ యోహాను నూతన నిబంధన గ్రంధంలో మొదటి ప్రవక్త మరియు పూర్వ నిబంధనలో చివరి ప్రవక్తా. యిస్రాయేలు ప్రజల యొక్క చరిత్రలో మలాకీ ప్రవక్త  తరువాత దాదాపు 400  సంవత్సరాలు దేవుడు ప్రవక్తను తన ప్రజల చెంతకు పంపలేదు.

బాప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభువు మార్గం సిద్ధం చేసిన ప్రవక్త. ఆయన యొక్క బోధన్ అందరిని ఉద్దేశించినది.  క్రీస్తు ప్రభువు యొక్క రాకతో దేవుని రాజ్యము సమీపించింది అని అందుకు హృదయ పరివర్తనం చెందమని పలికారు.

పవిత్ర గ్రంధంలో హృదయ పరివర్తనం గురించి అనేక సార్లు చెప్పబడినది ఎందుకంటే పశ్చాత్తాపము, హృదయ పరివర్తనం లేనిదే దేవుడిని మన హృదయంలోకి ఆహ్వానించలేము (లూకా 13 : 3 , అపో 3 : 38 , 3 : 19 , 2 రాజుల దిన 7 : 14 , యెషయా 55 : 7 , యెహెఙ్కేలు 18 : 21 ).

ప్రభువుకు ప్రతి ఒక్కరూ మార్గం సిద్ధం చేయాలి. దేవుడు మన జీవితం గుండా నడిచిపోవాలంటే మార్గం సిద్ధం చేసుకోవాలి. 

ప్రతి మార్గం మనలను గమ్యం చేరుటకు సహాయపడుతుంది. అదే విధంగా దేవుని కొరకు సిద్ధం చేసే మార్గం మనం పరలోకం చేరుటకు సహాయపడుతుంది (యెషయా 40: 3, ఆమోసు 4:12, హోషయా 10: 12, యావేలు 2: 12 -13).

మన యొక్క దారిలో ఏదైనా ఆటంకంగా ఉంటే ప్రయాణం సాగదు అన్నింటిని తొలగించుకోవాలి, అలాగే దేవుడు కూడా నీ/నా జీవితం గుండా వెళ్లాలంటే మనలో వున్నా ఆటంకాలు అన్నీ తొలగించుకోవాలి అందుకే హృదయ పరివర్తనం అవసరం.

బాప్తిస్మ యోహాను యొక్క భోధన ఫలిచింది అందుకనే అనేకమంది బాప్తిస్మము పొందుటకు యోహాను గారి దగ్గరికి వచ్చారు.  అక్కడవున్న వారు తాము పాపాత్ములమని గ్రహించారు. దేవుని రాక కొరకు పవిత్రంగా వుండాలని భావించారు.

యోహాను గారి సందేశం విన్న వారందరు కూడా సందేశానుసారంగా నడుచుకున్నారు, అందుకనే తమ తమ పాపాలు ఒప్పుకున్నారు. మరి మనం ఎంతమంది సందేశాన్ని అంగీకరించి జీవిస్తున్నాం. ఎంతమంది పాప సంకీర్తనం చేస్తున్నాం? ఎంతమంది హృదయ పరివర్తనం చెందుతున్నాం? ప్రతి ఒక్కరు కూడా ధ్యానించుకొని జీవించాలి. దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటే ప్రభువు సమాన పాపాలు ఒప్పుకుంటారు (అపో 5: 31, 13: 38, కీర్తన 103: 3, యిర్మీయా 31: 34).

పశ్చాత్తాపానికి పాప సంకీర్తనం అవసరం అప్పుడే మనలో నూతనత్వం ఉంటుంది (1 యోహాను 1:9, ఎజ్రా 10:11, కీర్తన 32:5, సామె2 8:13, యిర్మీయా 3: 13).

పరిసయ్యులను, సద్దూకయ్యులను యేసు ప్రభువు సర్ప సంతానమా అని సంభోదిచారు ఎందుకంటే య్యేహాను గారి యొక్క భోధనాల్లో బున్న దోషాలను మాత్రమే వారు వెదుకుటకు అక్కడికి వచ్చారే కానీ ఆయన యొక్క సందేశం విని హృదయ పరివర్తనం చెందుటకు కాదు. అందుకే వారిని ఉద్దేశించి యెహాను గారు మాటలు పలికారు.

పరిసయ్యులు, సద్దూకయ్యులు దేవుని యొక్క తీర్పు వేరే వారికే కానీ తమకు కాదని భావించారు. వారిలో హృదయ పరివర్తనం బాహ్యంగానే ఉంది కానీ అంతరంగికంగా లేదు. తామే నీతిమంతులు మిగతా వారు పాపాత్ములు అనే ఆలోచనలతో ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి యోహాను గారు రూఢిగా మాట్లాడారు.

యెహాను గారి సందేశం నాలుగు ప్రధాన అంశాలు బోధిస్తుంది:

1. మనం కేవలం నామ మాత్రపు బాప్తిస్మము తీసుకున్న క్రైస్తవులుగా కాకుండా మంచి జీవితం, విశ్వాస జీవితం జీవించాలి (యోహాను 3: 36, ఎఫేసి 5: 5 -6, కీర్తన 2: 12). ఎన్ని సార్లు బాప్తిస్మము పొందాం అన్నది కాదు ముఖ్యం (కొంతమంది ఇతర దేవాలయాలకు వెళ్ళినప్పుడు బాప్తిస్మము తీసుకున్నా మళ్ళీ తీసుకుంటారు) మనం ఎంత మంచి జీవితం జీవించాం అన్నది ముఖ్యం.

2. పాపంకు పశ్చాత్తాప పది హృద పరివర్తనం చెందుడి అని చెప్పారు. బాహ్యంగా చూపించే పశ్చాత్తాపము కాదు ఆంతరంగిక పశ్చాత్తాపం ముఖ్యం. పశ్చాత్తాపం మనలో నూతనత్వం తీసుకు వస్తుంది.

3. మన యొక్క పూర్వీకుల చరిత్ర చూసి గర్వించక దేవుడు చెప్పిన పనులను ఆచరించాలి. పరిసయ్యులు, సద్దూకయ్యులు మేము అబ్రాహాము సంతతి వరం అని గర్వంతో హృదయ పరివర్తనం లేకుండా వున్నారు. మనం కూడా పుట్టు క్రైస్తవులము అనే గర్వంతో వుండి పాప సంకీర్తనం చేయటం లేదు, గుడికి రావటం లేదు.

మనం వ్యక్తిగతంగా దేవునికి జవాబు ఇవ్వాలి, ఎవరి జీవితానికి వారే బాధ్యులు, పూర్వికులతో ఏమి సంబంధం లేదు. మనలో ఉన్న పాపాలను మొదటిగా కడిగివేయాలి (యిర్మీయా 4: 14, రోమా 4: 4 -5, గలతి 3: 10 - 12).

4. దేవుని తీర్పు - మంచిగా జీవించని వారందరు కూడా దేవుని శిక్షకు పాత్రులగుతారు. తీర్పు అనేది అందరికి కేవలం కొద్ది మందికే కాదు కాబట్టి మనం జీవితాలను సరిచేసుకుంటూ జీవించాలి. దేవుడు మనందరినీ మంచిగా సృష్టించారు కాబట్టి మనం మంచి జీవితం జీవించాలి.

దివ్య గ్రంథ పఠనాలు మనలో నూతనత్వం గురించి బోధిస్తున్నాయి. కాబట్టి బాప్తిస్మ యోహాను గారి సందేశం అందరికి ఒక హెచ్చరిక, ఒక నూతన జీవితం జీవించుటకు ఒక దైవ పిలుపు. దానిని స్వీకరించి జీవితాలు మార్చుకొని దేవున్ని మన హృదయాలలోకి ఆహ్వానించుదాం.

 

 FR. BALAYESU OCD

 

 

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...