23, డిసెంబర్ 2022, శుక్రవారం

 

క్రీస్తు జయంతి పండుగ

యెషయా 9:1-6

తీతు 2:11-14

లూకా 2:1-14

 

క్రీస్తు ప్రభువు యొక్క పుట్టినరోజు ప్రత్యేకమైనది, ఎందుకంటే ఒక రక్షకుడు ఈ భూమి మీదకు కాలు మోపిన గొప్ప రోజు క్రీస్తు జయంతి. ప్రజలకై, ప్రజలతో ఉండుటకై దేవుడు మానవుడైనా వేళ.

ఈ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కలసిమెలసి చేసుకునే ఒక పండుగా ఇది.

అందరికీ ఈస్టర్ పండుగ అంటే గుర్తుంటుందో లేదో కానీ డిసెంబర్ 25 అంటే అందరికీ గుర్తుంటుంది.

అన్ని దేశాలు జరుపుకునే పండుగ ఇది. సాధారణంగా ఎవరిదైన పుట్టినరోజు అంటే ఒక ప్రాంతానికో రాష్ట్రానికో దేశానికో పరిమితమై ఉంటుంది కానీ క్రీస్తు ప్రభువు యొక్క పుట్టినరోజు ఈ ప్రపంచానికి సమస్తమునకు చెందినటువంటిది అందరికోసం రక్షకుడు జన్మించారు. అందరూ జరుపుకుంటారు - లూకా 2: 11.

క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సృష్టిలో దేవుడు మానవుని చేసినప్పుడు తన రూపం ఇచ్చారు, తన శ్వాస నిచ్చారు, తన యొక్క దైవత్వం మానవునికి ఇచ్చారు, పాపం చేయటం ద్వారా మానవుడు దేవునితో ఉన్న స్నేహమును ప్రేమను, బంధంను కోల్పోయారు. తనలో ఉన్న దైవత్వపు లక్షణాలు మానవుడు కోల్పోయాడు, దేవుడు మరల వాటిని మానవునికి తిరిగి ఇవ్వటానికి మనుష్యవతారం ఎత్తుతున్నారు.

ఇది ఒక గొప్ప పరమ రహస్యం, దేవుడు భూమిపై ఉన్న సమస్త మానవాళికి అందజేసిన ఒక గొప్ప వరం. స్వయానా  దేవుడు మనకు బహుకరించిన ఒక గొప్ప కానుక. మనం అడిగితే దేవుడు తన కుమారుడిని ఇవ్వలేదు. మనం అడగకుండానే మన కొరకు ఆదియు అంతమునైన తన కుమారుడిని మనందరి రక్షణార్థం కొరకు దేవుడు ఈ లోకానికి పంపిస్తున్నారు.

ఇది ఒక గొప్ప పర్వదినం ఎందుకంటే పూర్వం దేవుడిని ఎవ్వరూ మన రూపంలో చూడలేదు, సృష్టిలో మొట్టమొదటిసారిగా దేవుడు మనలాగా మారారు, మనలాగా తల్లి ఒడిలో పవళించారు, తల్లిపాలతో పోషింపబడ్డారు, ఎంతో గొప్ప దేవుడైనప్పటికిని తనను తాను సామాన్యునిగా చేసుకున్నారు.

క్రిస్మస్ రాత్రి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతున్న రాత్రి, ఆది తల్లిదండ్రులు పాపం చేసిన తరువాత దేవుడు తన ఏకైక కుమారుని పంపించాలని నిర్ణయించుకున్నారు, అందుకే కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించారు - గలతీ 4:4.

క్రీస్తు జననం దేవుని మానవునికి దగ్గరకు తీసుకొని వచ్చింది. పరలోకంలో ఉండే దేవుడు మనతో ఉండటానికి వేంచేసిన వేళ ఇది.

ఇది ఒక ఆనందంతో కూడిన రాత్రి. దాదాపు ఈ ప్రపంచంలో అనేకమంది నిద్రిస్తున్న అర్ధరాత్రి వేళలో మనం ఈ సమయం దేవునితో గడుపుతున్నాం. మనకై వచ్చిన దేవుని కలుసుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక శాంతి కరమైన రాత్రి ఎందుకంటే శాంతిని ఒసగే రారాజు జన్మిస్తున్నాడు.

ప్రతి ఒక్కరి పుట్టినరోజు మనకు ఎంతో సంతోషం ఇస్తుంది, చరిత్రలో ఆ రోజును ఎప్పుడూ గుర్తుంచుకొని ఉంటాం. దేవుని పుట్టినరోజు ప్రత్యేకం ఎందుకంటే దేవుడు మానవ చరిత్రలోనికి వస్తున్నారు.

ఏసుప్రభు యొక్క పుట్టినరోజు ప్రత్యేకం. చరిత్రలో ఎవరి పుట్టినరోజు గురించి కూడా వేల సంవత్సరాలు ముందుగా ప్రవశింపబడలేదు.

చరిత్రలో చాలామంది మహనీయులు, పేరు ప్రఖ్యాతలుగాంచిన వారు ఉన్నారు, బుద్ధుడు, గాంధీ, మహమ్మద్... ఇలా చాలామంది ఉన్నారు కానీ వీరెవ్వరు పుట్టుక గురించి ముందుగా చెప్పబడలేదు. కేవలం క్రీస్తు ప్రభువు యొక్క జననం గురించి ముందుగా చెప్పబడింది - యెషయా 7:14, 9:6-7, మీకా 5:2.

ఏసుక్రీస్తు ప్రభువు తన యొక్క పుట్టుకతో మనందరికీ ఎన్నో గొప్ప విషయాలు నేర్పిస్తున్నారు. తాను ఈ లోకంలో జన్మించినది మనలను రక్షించుట కొరకే మనలను పరలోకం చేర్చుట కొరకై.

ఒక పేదవారి కుటుంబం క్రిస్మస్ చేసుకొనే సందర్భంలో ఆ కుటుంబం మీదగా ఒక విమానం పోయే సమయంలో తల్లి తన బిడ్డలతో చెప్తుంది విమానంలో మీ నాన్న ఉన్నారు నాన్నకు టాటా చెప్పమని అక్కడ ఉన్న చిన్నపిల్లవాడు తల్లిని అడుగుచున్నాడు అమ్మ ఆకాశంలో తిరిగే విమానం లోనికి నాన్న ఎలా వెళ్ళగలిగారు అని అప్పుడు ఆ తల్లి తన బిడ్డతో ఈ విధంగా అంటుంది ఆకాశంలో తిరిగి విమానం భూమి మీదకు వచ్చి వారిని ఆకాశంలోనికి తీసుకొని వెళుతుందని చెప్పారు. అది ఏ క్రిస్మస్ సందేశం.

మనందరిని పరలోకం చేర్చుటకు, మనందరికీ తండ్రి ప్రేమను దయను, తెలియచేయుటకు ఏసుప్రభువు ఈ లోకానికి వచ్చారు.

అందరూ ఈ లోకానికి జీవించటానికి వస్తే యేసు ప్రభువు మాత్రము ఈ లోకానికి మరణించటానికి వచ్చారు.

ఏసుప్రభు యొక్క జననం మన అందరి యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉంటుంది.

1. మనందరం మంచి స్థలంలో జన్మించాలనుకుంటే ఆయన మాత్రం పశువుల పాకలో జన్మించారు.

2. సమస్తమును ఒక్క మాటతో చేసిన దేవుడు ఇప్పుడు ఏమీ మాట్లాడని పసి బిడ్డగా  మరియు తల్లి గర్భం మందు జన్మించారు.

3. సూర్యుని వేడిని చేసిన గొప్ప దేవుడు మరియ తల్లి యొక్క ఒడిలో వెచ్చదనంను పొందుతున్నారు.

4. ఎవరైతే సమస్తమును తన కౌగిలిలో ఉంచుకున్నారో వారి ఇప్పుడు మరి తల్లి యొక్క కౌగిలిలో ఉన్నారు (one who embraces everything is now embraced by mother Mary).

5. ఎడారిలో సైతం తన ప్రజలను పోషించిన జీవాహారం ఇప్పుడు మరియ తల్లి యొక్క పాల ద్వారా పోషింపబడుతున్నారు.

6. ఈ ప్రపంచమే మోయచాలని దేవుణ్ణి మరియ తల్లి తన గర్భమందు మోసింది. ఏసుప్రభువు తనను తాను తగ్గించుకొని మరియమ్మగారి గర్భమందు శరీర రక్తములను స్వీకరించారు.

7. సృష్టిని చేసిన దేవుడు సృష్టిలో సమస్తమునకు స్థానం కల్పించిన దేవుని పుట్టికై ఈ లోకంలో ఒక మంచి స్థలం లేకుండను.

8. ఈ లోకంలో ఆయన తనను తాను తగ్గించుకొని జీవిస్తే మనం మాత్రము ఈ ప్రపంచంలో మన యొక్క అధికారమును, కీర్తిని, ప్రతిష్టలను, ఆస్తి ఆస్తులను, చూపించు కోవాలనుకుంటున్నాం.

ప్రభువు యొక్క జననం మన యొక్క ఆలోచనలను చాలా తలక్రిందులుగా చేస్తుంది . మహిమను వైభవమును నిత్యము అనుభవించే దేవుడు సేవలందికొనే దేవుడు ఇప్పుడు సేవింపబడుటలేదు, సేవ చేయటానికి ఈ లోకంలోనికి జన్మించారు.

ఒక విధంగా ఆలోచిస్తే దేవుడు చేసిన విధంగా మనం చేయగలమా? ఇది మనందరికీ ఒక గొప్ప సవాలు.

ఏసుప్రభువు ఈ భూలోకంలోనికి మానవునిగా జన్మించినప్పుడు ఆయన అప్పటి యొక్క విధులు విధానాలు ఆచారాలు సంప్రదాయాలు పాటించాలి, నియమ నిబంధనలు పాటించాలి. విద్య నేర్చుకోవాలి ఇంకొక్క ప్రపంచంలో జీవించాలి.

ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు బోధించిన దేవుడు ఇప్పుడు ఇవన్నీ మన మధ్య పాటించాలంటే ఎంతగా ఏసుప్రభు నేర్చుకోవాలో, ఎంతగా ఆయన సర్దుకొని పోవాలో మనం గమనించాలి.

పాపుల మధ్య జీవించుట విధేయత చూపించుట ఆకలి దప్పులను అనుభవించటం అన్ని పాటించడానికి ఏసుప్రభువు సిద్ధమై ఈ లోకానికి వచ్చారు.

నేడు మనందరం ఏసుప్రభు యొక్క జననం ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన వలే మనం మారాలి.

అనంతరం ఒక్కసారి పశువుల పాక గురించి ధ్యానించుకోవాలి. పశువుల పాకలలో ఏడుగురిని ప్రధానంగా చూస్తున్నాం .ఈరోజు వీరి గురించి ధ్యానించి మనం కూడా వారిలా మారినప్పుడే ఈ ఈ క్రిస్మస్ కు మంచి అర్థం ఉంటుంది.

1. ఏసుప్రభు - బాల యేసు

2. మరియా తల్లి

3. యోసేపు

4. పరలోక దూతలు

5. గొర్రెల కాపరులు

6. జ్ఞానులు

7. నక్షత్రం

1. బాల యేసు - పూర్వము దేవుని మనుష్యవతారమున ఎవరు ఎన్నడూ చూడలేదు - యోహాను ,1:18.

పాపంలో పడే పోయినా మనుషులను తిరిగి రక్షించుటకు తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపిస్తున్నారు.

ఎందరో ప్రవక్తలు చూడాలనుకున్నది, దర్శించాలనుకున్నది, ఎందరో వినాలనుకున్నది, క్రీస్తు ప్రభువు యొక్క జననం లో సాధ్యమైంది.

క్రీస్తు ప్రభువు మనందరిలాగా ఒక కుటుంబంలో జన్మించారు, ఏసుప్రభువుకు ఒక కుటుంబం కావాలి ఆ కుటుంబమే యోసేపు మరియమ్మ గార్ల కుటుంబం. మనలాంటి కుటుంబాన్ని మనలాంటి పరిస్థితులని మనలాంటి సంతోష బాధలని ఏసుప్రభువు ఈ లోకంలో అనుభవించదలిచారు.

ఏసుప్రభు పశువుల పాకలో అద్దాంతరంగా జన్మించలేదు. ఇది దేవుడే స్వయంగా ఎన్నుకున్నటువంటి స్థలం.

ఏసుప్రభువు పుట్టినప్పటినుంచి చివరి వరకు తనకంటూ తాను ఏమీ పెట్టుకోలేదు.ఆయన జన్మించినప్పుడు వేరే వారి పశువుల పాకను అప్పుగా తీసుకున్నారు.

ఆయన పరిచర్య అప్పుడు తలదాచుకొనుటకు స్థలం లేదు.- మత్తయి 8:19-20.

సముద్రంలో  ప్రయాణమునకు పేతురు పడవను తీసుకున్నారు. లూకా 5:1-11.

యెరూషలేము లో  ఇతరుల యొక్క గాడిదను బదులుగా సహాయంగా తీసుకున్నారు. మార్కు 11:1-11.

చివరికి ఆయన మరణించినప్పుడు వేరే వారి యొక్క సమాధిని వినియోగించారు. మత్తయి 27:57-61.

ఏసుప్రభు తనను తాను రక్షించుకొనే శక్తి కలిగిన దేవుడు అయినప్పటికీ ప్రభువు మొత్తము చిన్ననాటి నుండి మరణ పునరుత్థానము వరకు తండ్రి మీదనే ఆధారపడి ఉన్నారు, తండ్రి ప్రేమను మనందరికీ పంచారు, తండ్రికి విజయత చూపారు.

తండ్రి మీద, మన మీద ఉన్న ప్రేమ వలన, ప్రభువు సమస్తమును భరించారు. అందుకే పౌలు గారు దైవ ప్రేమ గురించి తెలిపినప్పుడు ప్రేమ సమస్తమును భరించెను అనే పలికారు. 1 కొరింతి 13:7.

దేవుడు మనతో ఉండటానికి వచ్చారు, మనలను వెదకీ రక్షించడానికి వచ్చారు, మనల్ని క్షమించటానికి, స్వస్థత పరచటానికి, మనలను సంతోషపరచటానికి, ప్రేమించడానికి నడిపించడానికి వచ్చారు, కాబట్టి ప్రభువు యొక్క గొప్ప జీవితంలో అనుసరించాలి.

2. మరియ తల్లి:

దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక గొప్ప మాతృమూర్తి. దేవుడు మరియ తల్లిని తన తల్లిగా ఎన్నుకొన్నారంటే ఆమె ఎంత గొప్ప పవిత్రాత్పురాలు, ఎన్నో సుగుణాలు ఆమెలో ఉన్నాయో అందరూ ధ్యానం  చేసుకోవాలి.

పాత నిబంధన గ్రంథం యొక్క బోధనబట్టి ఒక స్త్రీ వృద్ధాప్యంలో శిశువును కంటే ఆ శిశువు దేవుని పని కోసం పిలువబడ్డ వ్యక్తి అని నమ్మకం. వృద్ధాప్యంలో శిశువుకు జన్మనిస్తే ఆ తల్లి గొప్పది అని అంటారు.

మరియ తల్లి పురుషుని యొక్క ప్రమేయమే లేకుండా పవిత్రాత్మ శక్తితో దేవుని కుమారునికి జన్మనిస్తున్నారంటే ఆమె ఎంత గొప్ప వ్యక్తియో మనం అర్థం చేసుకోవాలి.

దేవుడు మనకి తల్లిని ఎంచుకోమని స్వేచ్ఛ నిస్తే మన యొక్క ఆలోచనలకు తగిన వ్యక్తిని ఎన్నుకుంటాం. మరి దేవుడికి స్వేచ్ఛ ఉన్నప్పుడు ఎలాంటి తల్లిని ఎన్నుకొన్నారో మనందరం గ్రహించాలి.

సృష్టి మోయలేని దేవుణ్ణి మరియ తల్లి తన గర్భమందు మోసింది.

క్రీస్తు జయంతి సందర్భంగా మరియ తల్లి మనకు తెలిపే విషయం ఏమిటంటే దేవుని యందు మనం ఆనందించాలి.

దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యముల గురించి మరియమ్మ గారు సంతోషించారు. మరియ తల్లి నిజమైన ఆనందం దేవుని చిత్తంలో వెతికారు, దేవుని యందు ఆనందం కనుగొన్నారు.

క్రిస్మస్ అంటేనే ఆనందించటం, తన గర్భమందు రక్షకుడు జన్మించారని మరియ తల్లి ఆనందించింది.

సర్వ మానవాళికి దేవుడు జన్మనిచ్చారని ఆనందించింది. ఎఫెసి 5:16.

3.యోసేపు:

దైవ ప్రణాళికను నెరవేర్చుటలో ఒక గొప్ప తండ్రి పునీతుడు- పునీత యోసేపు గారు.

యోసేపు కారు నీతిమంతుడు, అందుకే దేవుడు సైతము తన యొక్క ప్రణాళికలు విడమరచి చెప్పారు. కలలో దేవుడు అంతయు విడమరచి చెప్పారు, ఎందుకంటే మరియమ్మ నిరపరాధి. దేవుని యొక్క ప్రణాళికలు వివరించిన సందర్భంలో యోసేపు గారు దైవ ప్రణాళికలు సంపూర్ణంగా విశ్వసించారు దైవ ప్రణాళికలు నెరవేర్చుట కొరకు సిద్ధంగా ఉన్నారు.

యోసేపు గారు మరియ తల్లి యొక్క గౌరవం వ్యక్తిత్వమును కాపాడారు.

ఈ క్రిస్మస్ సందర్భంగా యోసేపు గారు మనకు తెలియజేసే అంశం ఏమిటంటే నిన్ను నమ్ముకున్న వారి యొక్క చేయి విడవకు మరియమ్మ గారు యోసేపు గారిని నమ్ముకున్నారు. ఎప్పుడైతే దూత యోసేపు గారు దైవ ప్రణాళికను వివరించినదో అప్పుడే దాన్ని అంగీకరిస్తూ మరియమ్మను తన భార్యగా స్వీకరిస్తున్నారు.

మనల్ని నమ్ముకున్న వారి యొక్క చేయి విడవకూడదు. యోసేపు గారువలే దైవ ప్రణాళికకు సహకరిస్తూ జీవించాలి.

మరియమ్మను ఏసుప్రభువు కాపాడిన విధంగా మనం కూడా ఇతరులను కాపాడాలి మరియు ముఖ్యంగా వారి యొక్క గౌరవం కాపాడాలి.

4. పరలోక దూత:

దేవుని యొక్క సమాచారం అందించే వార్తావాహినులు పరలోక దూతలు. రక్షకుడు జన్మించాడు అన్న శుభవార్తను అందజేశారు.

క్రిస్మస్ సందర్భంగా మనం కూడా ఒక దూత వలె మంచి మాటలను ఇతరులకు తెలపాలి.

దూతలు లేకుండా క్రిస్మస్ పండుగ లేదు, దూతల యొక్క ముఖ్యమైన పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించుట కాబట్టి మనకు రక్షకుని ఉచిత బహుమానంగా ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతించాలి ఇది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన బహుమానం.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అంటారు -నువ్వు నేను క్రిస్మస్ యొక్క దూత అని ఎప్పుడైతే దేవుని యొక్క శాంతిని నీతిని ప్రేమను అందిస్తాము అప్పుడు మనం కూడా క్రిస్మస్ దూతలమని.

5. గొర్రెల కాపరులు:

క్రీస్తు జననం మొదటిగా గొర్రెల కాపరులకు అందచేయబడింది. బెత్లెహేములో యాజకులు ఉన్నారు పండితులు ఉన్నారు వారిని విడిచి దేవుడు సామాన్యులైన గొర్రెల కాపరులకు ఈ విషయమును తెలిపారు. ఈ సామాన్యులకు ఎందుకు ప్రభువు ఈ గొప్ప వార్తను తెలియజేశారు అంటే:

1. ఏసుప్రభు దావీదు వంశానికి చెందిన వాడు. దావీదు కూడా ఒక కాపరి ఏ కాబట్టి.

2. గొర్రెల కాపరులు వినయంతో ఉండేవారు సమాజంలో ఎటువంటి status లేని వారి, వినుటకు విశ్వసించుటకు అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నవారు కాబట్టి దేవుడు యేసు ప్రభువు జనన వార్తను ముందుగా కాపరులకు తెలిపారు మనం కూడా వినయంతో ఉంటే దేవుని యొక్క పరమ రహస్యాలు మనకు తెలియజేయబడతాయి.

6. జ్ఞానులు:

ఏసుప్రభువును రాజుగా, రక్షకునిగా తమ కన్నా గొప్ప నాయకునిగా గుర్తించి ఆయన కొరకు దూర ప్రాంతముల నుండి ప్రయాణం చేశారు.

తమకోసం ఆకాశం నుండి భూమికి మనుష్యవతారం ఎత్తిన ప్రభువును కలుసుకొనుటకు వారు కష్టపడి ప్రాయసపడి ఇష్టంతో వచ్చారు.

కొన్ని సందర్భాలలో మనం దేవుని కొరకు గుడికి రావడానికి మన ఇంటి నుండి బయటకు రాలేము దేవుడు మాత్రము పరలోకం నుండి భూలోకానికి మన కొరకు వచ్చారు.

జ్ఞానులు మనకు, దేవునికి విలువైనవి సమర్పించుట నేర్పించారు. అదేవిధంగా దేవుని కలుసుకొనుట నేర్పించారు. కాబట్టి మన సమయమును కూడా దేవునికి సమర్పించాలి. ప్రతిరోజు ఆధ్యాత్మికంగా దేవుని కలుసుకొని జీవించాలి.

7. నక్షత్రం:

వెలుగుగా ఉంటూ మార్గం చూపిస్తుంది. దాని ద్వారానే జ్ఞానులు గమ్యం చేరారు.

నక్షత్రం నడిపించెను కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మనం కూడా ఒక నక్షత్రముగా మారాలి నక్షత్రంలా అనేక మందిని దేవుని వైపుకు నడిపించాలి సత్యం వైపుకు నడిపించాలి.

దేవుడు మన కొరకై తన కుమారుడిని ఈ లోకానికి పంపారు కాబట్టి ఆయనను ప్రేమతో స్వీకరించి ఆయన జీవితమును ఆదర్శంగా తీసుకొని దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించూద్దాం.


FR. BALAYESU OCD

 

17, డిసెంబర్ 2022, శనివారం

ఆగమన కాలం - నాలుగవ ఆదివారం

 

ఆగమన కాలం - నాలుగవ ఆదివారం

యెషయా 7:10-14

రోమా 1:1-7

మత్తయి 1:18-25

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క జననం త్వరలోనే జరగబోతుంది అనే అంశం గురించి తెలియజేస్తున్నాయి.

దేవుడు త్వరలోనే రాబోతున్నాడు కాబట్టి ఆయన యొక్క రాక కోసం మనందరం విశ్వాసంతో ఎదురు చూడాలి.

విశ్వాసం అనేది ద్వారం లాంటిది కేవలం విశ్వాసం ద్వారానే దేవుడిని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించగలుగుతాం.

ఈనాటి మొదటి పఠనం లో ఆహాజు రాజు దేవుని మీద విశ్వాసం ఉంచకుండా మానవ శక్తి మీద ఆధారపడి జీవించాడు.

క్రీస్తుపూర్వం 8 వ శతాబ్దం చివర్లో సొలోమోను రాజు తరువాత ఎన్నుకొనబడిన ప్రజలు రెండుగా విభజించబడ్డారు. ఇశ్రాయేలు - యూదాగా రెండు రాజ్యాలుగా విభజించబడ్డాయి.

రెండుగా విభజించబడిన తరువాత ఎన్నుకొనబడిన ప్రజలు దేవుడిని విస్మరించిన సందర్భంలో బానిసత్వంలోకి కొనిపోబడ్డారు.

అప్పటిలో చాలా మంచి మంచి ప్రదేశాలు ఆసీరియా రాజ్యం క్రింద ఉన్నాయి. అప్పుడు సిరియా రాజు మరియు ఉత్తర ప్రాంతపు ఇశ్రాయేలు రాజు కలిసి హోదా రాజ్యంపై దండెత్తి రాపోయారు.

సిరియా రాజు అదే విధంగా ఉత్తర ప్రాంతపు (ఇశ్రాయేలు) రాజులు ఎందుకు యూదా రాజ్యం మీద యుద్ధం చేయాలనుకున్నారంటే అస్సిరియ  రాజు మీద యుద్ధం చేయుటకు సహాయం చేయమని కోరినప్పుడు యూదా రాజు అయిన ఆహాజు, సిరియా రాజు, ఉత్తర దేశం ఇశ్రాయేలు రాజుల మాటను నిరాకరించాడు అందుకే వారు మొదటిగా యూదా  రాజ్యమును ద్వంశం చేయాలని అనుకున్నారు.

ఆహాజును తన యొక్క అధికార పదవి నుండి దించాలని వారు భావించారు. అలాంటి కష్ట సందర్భంలో ఆహాజు రాజు అస్సిరియ రాజు సహాయంను కోరాడు అయితే ఇలాంటి ఒక ఇబ్బందుల సమయంలో దేవుడు తన యొక్క ప్రవక్త యెషయా ను ఆహాజు దగ్గరికి పంపించి అభయమోసగుతున్నరు.

దేవునికి మొరపెట్టుకొని సహాయం అందించిన ఎడల దేవుడు కాపాడతారని యెషయా ఆహాజు రాజుకు తెలిపారు.

దేవుడు పూర్వం దావీదునకు వాగ్దానం చేశారు, "దావీదు యొక్క కుటుంబం కలకాలము రాజ్యపాలనము చేయునని" - 2 సమూ 7:16. ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుడు వారిని అన్ని ఆపదల నుండి కాపాడతారని యెషయా ప్రవక్త తెలిపారు.

ప్రవక్త ఎంత చెప్పినా సరే ఆహాజు రాజు తన యొక్క మాటలను వినలేదు రాబోయే పరిస్థితులను ఊహించి సంధికి వెళ్ళవద్దని ప్రవక్త హెచ్చరించారు. అస్సిరియ యొక్క సహాయం కోరితే తరువాత యూదా ప్రజలు మత బ్రష్టులవుతారని ప్రవక్త తెలిపారు ఎంత హెచ్చరించినా సరే ఆహాజు రాజు మాత్రం తనను తాను కాపాడుకునేందుకు దైవ శక్తిని కాదని మానవ శక్తిని నమ్ముకున్నాడు.

దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన విజయం రాదని అసాధ్యమని తలంచి ప్రవక్త యొక్క మాటలను పెడచెవిన పెట్టారు.

అయినప్పటికీ యెషయా ప్రవక్త దేవుడు నీకు ఒక గుర్తు చూపిస్తారు దానిని బట్టి అయినా దేవుని విశ్వసించు అని తెలిపారు. అయినా కానీ ఆహాజు రాజు ప్రవక్త యొక్క మాటలను తిరస్కరించారు రాజు దేవుని మాటలు తన జీవితంలోకి ఆహ్వానించలేదు.

ఆహాజు రాజు దేవుడిని రుజువు కోరితే పరీక్షించటమే అని ఆహాజు భావించాడు ఎందుకంటే పూర్వం మిస్సా వద్ద ఇశ్రాయేలు ప్రజలు దేవుని శోధించారు - ద్వితి 6:10.

ఈ యొక్క మాటలు ఆహాజు రాజు ఒక నేపంగానే వాడుకున్నాడు ఇది కేవలం ఒక సాకు మాత్రమే ఎందుకంటే ప్రవక్తయే తెలుపుచున్నారు ఒక యువతి గర్భము ధరించి కుమారుని కనును అతను రాజ పాలనము శాశ్వతముగా చేయునని (యెషయా 7:13-14), దేవుడు తనకు సహాయం చేస్తాడు అని స్వయంగా ప్రవక్తయే తెలిపారు.

దావీదు వంశం స్థిరంగా నిలుచును అని పలికారు కానీ ఆహాజు రాజు దేవుని మాటలను ఆలకించలేదు అవిశ్వాసంతో ఉన్నారు.

చాలా సందర్భాలలో మరీ ముఖ్యంగా మనం కష్టాలలో బాధలలో ఉన్నప్పుడు మనం కూడా దైవ శక్తి మీద ఆధారపడకుండా మానవ శక్తి మీద ఆధారపడి జీవిస్తాం.

యూదా ప్రజలు యావే దేవిని యొక్క ఎన్నో గొప్ప కార్యాలు చూశారు అయినప్పటికీ వారి కష్ట సమయంలో అన్నీ మరచిపోయారు అందుకే అంతా అవిశ్వాసులుగా మారారు.

దేవుని పట్ల నమ్మకము ఉంచి ప్రార్థిస్తే ఆయన మీద ఆధారపడి జీవిస్తే తన ప్రజలకు చిరకాలం తోడుగా ఉంటారని ఈ మొదటి పఠనం ద్వారా తెలియజేస్తున్నారు.

ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు ఏసుక్రీస్తు ప్రభువు దావీదు వంశస్తుడని ఆయన మెస్సయ్య అని తెలిపారు.

తన యొక్క కుమారుని యొక్క జననం గురించి ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశారు అని పౌలు గారు పలికారు.

ఏసుక్రీస్తు ప్రభువు మానవునిగా దావీదు వంశస్తులైన యోసేపు, మరియమ్మ గార్లకు జన్మించారు. తన యొక్క మరణం పునరుద్ధానం ద్వారా ఆయన శక్తిమంతుడైన దేవుని కుమారుడని పిలవబడ్డారు.

తన యొక్క లేఖనములో పౌలు గారు తనను తాను అన్యులకు యూదా క్రైస్తవులకు ఎరుకపరచుకొంటున్నారు.

తనను ఎరుకపరుచుకునే సందర్భం నాటికి రోము నగరంలో ఎటువంటి హింసలు ప్రారంభం కాలేదు. చిన్నచిన్నగా విశ్వాసం పెరుగుతుంది ఆయన దేవుని యొక్క అపోస్తులుగా మారిన విషయం బహుశా రోమా నగరంలో అందరికీ తెలియదు కాబట్టి తనను తాను ఏసుక్రీస్తు అపోస్తులుగా తెలియపరచుకుంటున్నారు.

ప్రతి ఒక్క ప్రజ, జాతి రక్షింపబడుటకు దేవుడు తనను సువార్త సేవకై ఎన్నుకొన్నారు అని తెలిపారు. ఏసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచారు కాబట్టి మీరు పరిశుద్ధులుగా జీవించమని పౌలు గారు తెలిపారు.

మనం కూడా దేవుని ప్రజలమే కాబట్టి ఆయనను ఆహ్వానించుటకు మనం విశ్వాసంతో పరిశుద్ధతతోను తాయారు అవ్వాలి.

ఈనాటి సువిశేష పఠనంలో దేవదూత యోసేపు గారికి దేవుని కుమారుని యొక్క పుట్టుక రీతిని వివరించిన విధానం చదువుకుంటున్నం.

యోసేపు గారు దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రతి పలుకును విశ్వసిస్తున్నాడు.

ఈనాటి సువార్త యోసేపు గారి మనసులో ఏర్పడిన ఒక సున్నితమైన సందేహంతో మొదలవుతుంది.

లూకా సువార్తికుడు మరియమ్మ గారి యొక్క వినయమును, విశ్వాసమును తెలుపుతూ క్రీస్తు ప్రభువు యొక్క జననం ను రాశారు.

మత్తయి సువార్తికుడు యోసేపు గారి యొక్క విధేయతను, విశ్వాసమును తెలుపుతూ క్రీస్తు ప్రభువు యొక్క జననం గురించి తెలిపారు. ఎందుకంటే ఏసుక్రీస్తు దావీదు వంశస్థుడు కాబట్టి (మత్తయి 1:1-17).

ఎందుకని ఈనాటి దివ్యగ్రంధ పఠనాలు ఆహాజు రాజును యోసేపు గారిని కలిపి తెలుపుతుంది. ఎందుకంటే వారిద్దరూ కూడా జీవితంలో ఒక కష్ట సమయంలో ఉన్నారు నిర్ణయం తీసుకొనుటలో ఇబ్బంది పడ్డ సమయం అది.

ఒకరు (ఆహాజు) తన యొక్క సొంత ఆలోచనలు, ప్రణాళికలు మరియు మానవ శక్తి మీద ఆధారపడితే ఇంకొకరు (యోసేపు) దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు తెలిపిన ప్రతి ఒక్క విషయమును విశ్వసించారు.

దేవుని పట్ల దృఢమైన విశ్వాసంతో విధేయత కలిగి నడుచుకున్నారు.

ఆహాజు రాజు ఇతరులను ఒప్పించటం కోసం శాంతింప చేయుట కోసం దయ లేకుండా తన కుమారుని బలి చేశాడు -2 రాజులు 16:3.

యోసేపు గారు మాత్రము తన బిడ్డకు ఒక రక్షణ కవచంగా ఉన్నారు. ఆపదల నుండి సమస్యల నుండి కాపాడారు. యోసేపు గారు దేవుని స్వరముకు ప్రాధాన్యతనిచ్చి ఆయన యొక్క మాటలను తన జీవితంలో నెరవేర్చారు.

యూదుల యొక్క వివాహం నిశ్చితార్థం ద్వారా ప్రారంభం అవుతుంది. అది ఇప్పటి కాలంలో కూడా మనం అనుసరిస్తున్నాం.

యూదుల ఆచార ప్రకారం యోసేపు, మరియమ్మలకు నిశ్చితార్థం జరిగింది వారిరువురూ ఇక భార్యాభర్తలతో సమానంగా కలిసి ఉండవచ్చు. ఒక్క శారీరక సంబంధం తప్ప మిగతా అన్ని విషయాలలో ఒకటిగా జీవించవచ్చు.

మరియమ్మ గారు వివాహానికి ముందే పవిత్రాత్మ ప్రేరణతో గర్భవతి అయ్యారు. యోసేపు గారు ఈ విషయమును తెలుసుకొని ఆందోళన పడ్డారు.

ఒక స్త్రీ వివాహం అవ్వకుండా గర్భవతి అయితే వ్యభిచారినిగా పరిగణింపబడుతుంది. ఆమెను మోషే ధర్మ శాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి - ద్వితీ 22:23-34.

యోసేపు గారు నీతిమంతుడు కనుక ఆమెకు కష్టం కలిగించకుండా ఆమెను రహస్యంగా విడనాడాలని నిర్ణయించుకున్నారు. అలా చేయుట ద్వారా యోసేపు గారు క్రీస్తు వలె పాపి పట్ల కనికరం చూపించారు. అంతేకాక తోరా చట్టానికి, ప్రేమ చట్టానికి సమతుల్యతను ప్రదర్శించారు.

ఇది కుటుంబంలో ఒక కలహమే, ఒక బాధయే మరి ముఖ్యంగా యోసేపు గారికి ఎందుకంటే ఎంత గానో ప్రేమించిన వ్యక్తి ఇష్టపడిన వ్యక్తి మరియమ్మ తన ప్రమేయం లేకుండా గర్భం దాల్చుట ఆయన అంగీకరించలేకపోయారు. ఆమె మీద ఉన్న ప్రేమ వలన ఆయన ఆమెను అవమానించలేదు.నిజం తెలియక ముందు సందేహించాడు, నిజం తెలిసిన తరువాత యోసేపు గారు మరియమ్మను తన భార్యగా స్వీకరించారు.

యోసేపు గారు ఒక గొప్ప అంతరంగిక బాధనే అనుభవించి ఉండవచ్చు నిరుత్సాహపడి ఉండవచ్చు మోసగించబడ్డానని భావించి ఉండవచ్చు, అసూయగా ఉండవచ్చు కానీ వాటన్నిటికీ ఆయన చోటు ఇవ్వలేదు.

ఎప్పుడైతే దేవదూత కలలో కనిపించి మరియ తల్లి యొక్క గర్భం గురించి వివరించిన సందర్భంలో వెంటనే దేవుని మాటలను విశ్వసించాడు విధేయత చూపారు.

దాదాపు మత్తయి సువార్తలో 4 సార్లు దేవదూత యోసేపు గారికి ప్రత్యక్షమై దైవ ప్రణాళిక ప్రకారం నడవమని తెలిపారు.

1. మరియమ్మను భార్యగా స్వీకరించమని చెప్పారు - మత్తయి 1: 24.

2. దేవదూత శిశువును మరియమ్మ ఐగుప్తుకు తీసుకొని వెళ్ళమని చెప్పారు - మత్తయి 2:13.

3. దేవదూత యోసేపుతో కుటుంబంను ఇస్రాయేలుకు తిరిగి తీసుకొని వెళ్ళమని చెప్పారు - మత్తయి 2:19.

4. గలీలియా నందు నజరేతు  నివాసమేర్పరుచుకోమని దేవదూత ఏసేపు గారికి తెలిపింది - మత్తయి 2:22.

అన్ని సందర్భాలలో యోసేపు గారు పలుమాటా మాట్లాడక దేవునికి సంపూర్ణ విధేయతను చూపుతూ దేవుని కార్యము నెరవేర్చారు.

ఈనాటి సువిశేష భాగంలో దేవదూత చెప్పిన వెంటనే మరియమ్మ గారిని తన భార్యగా స్వీకరించారు మరియమ్మ గారిని అంతకన్నా ఎక్కువగా ప్రేమించారు ఎందుకంటే ఆమె దేవుని ప్రణాళికను నెరవేరుస్తున్నారు కాబట్టి.

యోసేపు గారు మరియమ్మ గారిని మంచిగా చూసుకున్నారు ఎందుకంటే ప్రేమ సమస్తమును అంగీకరించును, భరించును 1 కొరింతి 13:7, 1 పేతురు 4:8.

యోసేపు గారు నీతిమంతుడు కాబట్టి మరియమ్మ గారిని తన భార్యగా స్వీకరించారు.

యోసేపు గారు ఎటువంటి స్వార్థంతో ఆలోచించకుండా దేవుని చిత్తం నెరవేర్చుటలోనే సంతోషం  వెతికారు. దేవుని యొక్క ప్రతి మాటను విశ్వసించారు, విధేయత చూపించారు.

మరియమ్మ గారు యోసేపు గారు ఇద్దరూ దేవుని వాక్కును తమ జీవితంలోకి ఆహ్వానించారు.

దేవుని యొక్క వాక్కు వారి జీవితంలో బలపరిచింది వారి జీవితంలో దేవుని సంపూర్ణంగా విశ్వసించారు.

వారి జీవితంలో దేవుని కార్యాలు అర్థమైన అర్థం కాకపోయినా వారు విశ్వసించారు దేవుని కొరకు జీవించారు.

మనం కూడా మరియమ్మ, యోసేపు గారు  వలె దేవుని వాక్కు విశ్వసించి, ఆచరించి మన హృదయంలో క్రీస్తు ప్రభువు జన్మించేలా తయారవ్వాలి.

 FR. BALAYESU OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...