2, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం


యెషయా 63:16-17, 64: 1. 3-8
1 కొరింతి 1:3-9
మార్కు 13: 33-37
ఆగమన కాలం మొదటి ఆదివారం తో దైవార్చన కొత్త సంవత్సరము ప్రారంభమగుచున్నది. ప్రభువు యొక్క రాకడ ఎప్పుడు ఏ విధంగా జరుగునో ఎవరికీ తెలియదు కావున ఆయన యొక్క రాకడ కొరకు మనము సంసిద్ధులై జీవించాలి. ఆయన రావటము అనేది సత్యం ఎందుకంటే భూమ్యాకాశములు గతించిన గాని నా మాటలు గతించిపోవు అని ప్రభువు పలికారు ఆయన పలికిన ప్రతి మాట తప్పక నెరవేరును. పోయిన దైవార్చన సంవత్సరములో((Year A) ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకై తయారైన విధముగా మరొకసారి మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకై తయారై ఉండాలి. 
ఈ యొక్క ఆగమన కాలంలో మనం ప్రభువు యొక్క జన్మము కొరకై ఎదురుచూస్తున్నాం. దేవుడు మన మధ్య మరియు మనలో జన్మించాలి అంటే మనందరం కూడా ఆయనకు ఒక నివాస స్థలమును మన మధ్య మరియు మన హృదయములో ఏర్పరచాలి. 
ఈనాటి మొదటి పఠణంలో  యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చేసిన పశ్చాత్తాప ప్రార్థన గురించి తెలుపుచున్నారు. పర్షియా దేశమునకు చెందిన సైరస్ రాజు ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛనిచ్చి యెరుషలేము దేవాలయం పునః నిర్మించుటకు అనుమతి ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైన విధానమును గ్రహించుకొని వారు పశ్చాత్తాపముచెంది మరొకసారి వారి మధ్య దేవుడిని దిగి రమ్మని ప్రార్థన చేస్తున్నాను. యావే దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయనను వారి మధ్యకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో ఒక మహా రాజ్యముగా రూపొందగలదని ఆశపడ్డారు, కానీ వారి యొక్క పాపపు జీవితం వలన దేవునికి దూరమైపోయి సర్వమును కోల్పోయారు. అలాంటి క్లిష్ట పరిస్థితులు యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైన వార్తను దయచేసి చేస్తున్నారు ఏమిటంటే, దేవుడిని నమ్ముకున్న ప్రజలకు ఆయన ఎప్పుడు చేరువులోనే ఉంటారు అని. దేవుని యొక్క గొప్ప లక్షణం , మంచితనము ఏమనగా ఆయన కొరకు ఎదురు చూసే వారికి తప్పనిసరిగా దర్శనం ఇస్తారు. దేవుడు ఎన్నుకున్న ప్రజలు తప్పు చేసినప్పటికీ, అవిధేయత చూపించినప్పటికీ మాత్రము ఎన్నడు వారిని విడిచిపెట్టలేదు వారికి సహాయంగా ఉన్నారు. కేవలము వారి యొక్క హృదయ పరివర్తన కొరకై కొన్ని సందర్భంలో బానిసత్వంను అనుమతించారు అయినా వారికి తోడుగానే ఉన్నారు.
ఈ మొదటి పఠణం  మొదటి భాగములో ప్రజలు దేవుడు తమ్మును విడిచి పెట్టారు అని భావించారు కానీ రెండవ భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన పట్ల ఏ విధముగా ప్రవర్తించారో తెలుపుచున్నారు. తన చెంతకు వచ్చిన వారిని, తనను సేవించే వారిని మరియు తన మీద ఆధారపడి జీవించే వారిని ప్రభువు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు అని తెలుపుచున్నారు. కేవలము ప్రజలే ఆయనను గుర్తించలేకపోయారు అని తెలిపారు. ఆయన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదని ప్రభువు పలికారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుడు మనకు ఒసగిన అనుగ్రహాలు గురించి తెలుపుచున్నారు. ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా మనందరికీ కృపానుగ్రహాలు వసగబడెను. ఇది కేవలము ఆయన మనకు ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం. మనము పాపాత్ములు అయినప్పటికీ కూడా ఆయనయే తన ప్రేమ వలన మనకు అనుగ్రహాలు ఇస్తున్నారు. ప్రభు యొక్క రాకడ కొరకై విశ్వాసముతో ఎదురుచూసే వారికి ఆయన యొక్క అనుగ్రహాలకు కొరత ఉండదు అని కూడా పౌలు గారు తెలుపుచున్నారు. అన్ని విషయములయందు వారిని ప్రభువు సుస్థిరం చేస్తారు.
ఈనాటి సువిశేష భాగములో యజమానుడు ఎప్పుడు వచ్చునో తెలియదు కాబట్టి ఆయన యొక్క రాకడకై సేవకులను జాగరుకులై ఉండమని ప్రభువు తెలుపుచున్నారు. ఈ సువిశేష భాగములో రెండు అంశములను ప్రధానంగా చూస్తున్న ఒకటి వేచి ఉండటం రెండు జాగరుకులై ఉండటం.
1. వేచి ఉండటం, ఎదురు చూడటం- వేచి ఉండటం, చూడటం అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం.
-తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎదురు చూస్తారు.
-చదువుకునే వారు మంచి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తారు.
- ప్రయాణికులు వాహనముల కొరకు వేచి ఉంటారు.
-సంతానం లేని వారు పిల్లల కొరకు ఎదురు చూస్తారు.
- దేవుడు కూడా మన యొక్క హృదయ పరివర్తన కొరకు ఎదురు చూస్తారు
ఈ విధంగా చాలా సందర్భాలలో అనేక విషయాలలో ఎదురుచూస్తూ ఉంటాం. ఈ సువిశేషంలో యజమానుడు ఎప్పుడు వస్తారు అని సేవకులు ఎదురుచూస్తున్నారు. ఆయన యొక్క రాక ఊహించని సమయంలో జరుగును కావున వారికి ఇచ్చిన పనిని వారు సక్రమంగా చేస్తూ బాధ్యతాయుతముగా మెలగాలి. కాబట్టి దేవుడు మన యొక్క యజమాని కావున మనం ఆయన యొక్క రాకకు ఎదురు చూడాలి. ఈ భూలోకంలో మంచి పనులు చేస్తూ,  మంచి జీవితం జీవిస్తూ దేవుడిచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూడాలి.
2. జాగరుకులై ఉండాలి- అనేక సందర్భాలలో క్రీస్తు ప్రభువు జాగ్రత్త కలిగి ఉండమంటున్నారు.
శిష్యులను సువార్త సేవకై పంపించే సందర్భంలో మిమ్ములను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపిస్తున్నాను జాగ్రత్తగా ఉండమంటున్నారు.
అనేకమంది నా పేరిట వచ్చి నేనే అతనిని చెబుతారు కానీ వారి వెంట మీరు వెళ్ళవద్దు జాగరుకులై ఉండమంటున్నారు.
ఈ లోక విపత్తుల ఎడల జాగరూకులై ఉండమంటున్నారు.
ప్రభు అనేక సందర్భంలో జాగరూకత కలిగి జీవించమంటున్నారు ఎందుకంటే మనము పాపములో పడిపోకూడదని, నశించిపోకూడదని, దేవుని యొక్క మార్గమును విడిచి వెళ్ళకూడదని దేవుని యొక్క కోరిక కాబట్టి ఈ ఆగమన కాలంలో క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకై ఎదురుచూసే సమయములో ఆయన యొక్క జననం ఆధ్యాత్మికంగా మన హృదయం జరగాలంటే మనము కూడా దేవుడు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూడాలి. మనల్ని మనము ఆధ్యాత్మికంగా ఆయనను స్వీకరించుటకు తయారు చేసుకోవాలి. అదేవిధంగా జాగరుకత కలిగి పాపములో పడిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ జీవించాలి.

Fr. Bala Yesu OCD

25, నవంబర్ 2023, శనివారం

34వ సామాన్య ఆదివారం

34వ సామాన్య ఆదివారం
విశ్వవిబుడైన క్రీస్తు రాజు యొక్క మహోత్సవము.
యెహెజ్కేలు 34:11-12, 15-17
1 కొరింతి 15:20-26, 28
మత్తయి 25:31-46

ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు యొక్క మహోత్సవమును కొనియాడుతున్నది, 1925 వ సంవత్సరంలో 11వ భక్తినాధ పాపు గారు  ఈ పండుగను ప్రారంభించియున్నారు. 20వ శతాబ్దంలో యూరప్ దేశములో అధికారుల యొక్క పాలన కఠినంగా ఉండటంవల్ల, అప్పటి అధికారులు ప్రజలకు ప్రాముఖ్యతను వారి యొక్క అధికారంకు ప్రాముఖ్యతనిచ్చి జీవించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు, జాతుల మధ్య వివక్షతను తీసుకుని వచ్చి ఉన్నారు. అదేవిధంగా కొంతమంది యూదులను బంధించి చెరసాలలో వేసి చంపారు. ఈ విధంగా అధికారములు తమ యొక్క స్వార్థం కొరకై అధికారమును వినియోగించుకునే సందర్భంలో 11వ భక్తనాధ పాపు గారు ఆనాటి  అధికారులకు, ప్రజలందరికీ క్రీస్తు ప్రభువు యొక్క అధికారం  ఏ విధంగా ఉన్నది తెలియజేశారు. ఈ విశ్వమంతటికి క్రీస్తు ప్రభువే రాజు అని ప్రకటించి, మన హృదయ పీఠాలపై క్రీస్తు రాజుని ప్రతిష్టించుకోమని అదే విధముగా మన జీవితాలను ఆయన ఆధీనమునకు అప్పగించుమని పాపుగారు ప్రోత్సహించారు. 
పరిశుద్ధ గ్రంథం మరీ ముఖ్యంగా పాత నిబంధన గ్రంథం క్రీస్తు ప్రభువును రాజుగా చూపిస్తుంది,ఆయన రాజ్యపాలన గురించి ప్రవక్తలు ముందుగానే తెలియచేశారు.
యెషయా 9:6-7, యిర్మీయా 23:5, దానియేలు 7:13-14. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో కూడా గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు మరియ తల్లితో 'తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యుగయుగములు యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యముకు అంతమే ఉండదు అని తెలియజేశారు'. పిలాతు కూడా ఏసుప్రభువుతో సంభాషించేటప్పుడు "నీవు యూదుల రాజువా"? అని అడుగారు. నీవే అంటున్నావు కదా అని ఏసుప్రభు తెలిపారు. ఆయన రాజు అని పవిత్ర గ్రంథములో చెప్పబడినది కాబట్టి మనందరం కూడా ఆయన  మన యొక్క రాజు అని గ్రహించి  ఆయన చెప్పిన విధముగా జీవింపసాగాలి.
ఈ లోకంలో ఎంతో మంది రాజుల గురించి మనము చదువు కొని ఉండవచ్చు, విని ఉండవచ్చు. ఏసుప్రభు యొక్క రాజరికం ఈ లోక రాజుల యొక్క పాలనకు భిన్నంగా ఉంటుంది. సిలువయే ఆయన సింహాసనం, ముళ్ళ కిరీటమే ఆయన రాజు కిరీటం, చేతిలోని దండమే తన యొక్క అధికారమునకు గుర్తు. పేద సాధలే తన యొక్క ప్రజలు. పరలోకమే తన రాజ్యం.
 ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలాంటి పాలన చేసి ఉన్నారో మనందరం గ్రహించాలి, ఆయన మరణము తర్వాత కూడా ఒక తీర్పరి అయిన రాజుగా మనలను పరిపాలన చేస్తారు.
క్రీస్తు ప్రభువు ఎలాంటి రాజు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. సేవ భావం కలిగిన రాజు- ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది సేవ చేయుటకే కానీ సేవింపబడుటకు కాదు. ఈ లోకంలో ఉన్న రాజులు ప్రతినిత్యం కూడా ఎదుటి వారి యొక్క సేవలను అందుకునే వారే, వారి యొక్క సుఖభోగాలు పేరు ప్రతిష్టల కొరకు పాలన చేసేవారు కానీ క్రీస్తు ప్రభువు ప్రతినిత్యం ఇతరులకు సేవ చేస్తూ వారి శ్రేయస్సు కొరకు జీవించారు.
2. ఆయన క్షమించే రాజు- ఏసుప్రభు శిలువ మీద వ్రేలాడే సమయములో తండ్రికి ప్రార్థన చేసినది ఏమనగా 'తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు ఎరుగరు కావున వీరిని క్షమించు' అని ప్రార్థన చేశారు. తన ప్రజలు తనకు విరుద్ధముగా చేసినటువంటి పాపములను క్షమించమని క్రీస్తు రాజు తన తండ్రిని ప్రార్థించారు. ఆయన మనందరి పాపములను క్షమించే రాజు.
3. ప్రేమించే రాజు- నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని తెలుపుచు, వారి కొరకు తన ప్రాణమును త్యాగం చేసినటువంటి గొప్ప రాజు క్రీస్తు ప్రభువు. ఆయన ప్రేమ ఎటువంటి భేదము లేనటువంటి ప్రేమ, అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ. అంతటి గొప్పదైన ప్రేమతో తన ప్రజలను పరిపాలించారు ఆయన మనందరిని  నిరతము ప్రేమించే రాజు.
4. నడిపించే రాజు- ఒక గొర్రెల కాపరి తన మందకు ముందుగా ఉండి గొర్రెలను ఏ విధముగా నైతే పచ్చిక బయలు వైపు నడిపిస్తారో అదే విధముగా క్రీస్తు రాజు  తన ప్రజలను పరలోకము వైపు నడిపిస్తారు, మంచి వైపు నడిపిస్తారు. మనము ఆయన స్వరమును విని నడుచుకోవాలి.
5. శాంతిని నెలకొల్పే రాజు-ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది ఎందుకంటే మన అందరి జీవితాలలో శాంతి- సమాధానములు నెలకొల్పుట కొరకై. పాపము చేసిన మానవుడు దేవునికి దూరమైనప్పుడు శాంతి సమాధానము లేకుండా జీవించే సమయంలో మన అందరి కొరకై తన్ను తాను బలిగా సమర్పించుకుని మనలను తండ్రితో సఖ్యపరచి ఉన్నారు దాని ద్వారా ప్రతి ఒక్కరికి శాంతిని దయచేసారు.
6. వినయము కలిగిన రాజు-ఏసుప్రభు తనను తాను రిక్తుని చేసుకొని ఈ లోకంలో మానవునిగా జన్మించి సేవకు రూపం దాల్చి, శిష్యుల యొక్క పాదాలు కడిగి ఎంతో వినయముతో జీవించారు. అయిన పవిత్రుడైనప్పటికీ పాపాత్ములమైన మన మధ్య జీవించారు. ఇది ఆయన యొక్క వినయమునకు గొప్ప నిదర్శనం.
ఈనాడు క్రీస్తు రాజు యొక్క పండుగను జరుపుకునే సందర్భంలో ఆయన ఏ విధముగా జీవించి ఉన్నారో మనందరం కూడా ఆయన రాజ్యమునకు చెందిన వారు అయినట్లయితే ఆయన ఇచ్చే సూచనలు, ఆజ్ఞలు పాటించి జీవించాలి. అప్పుడు మాత్రమే మనందరం పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతాం. క్రీస్తు ప్రభువుని నీ హృదయ రాజుగా అంగీకరిస్తున్నావా? దాని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నావా అని వ్యక్తిగతంగా ఆలోచించి మనందరం కూడా ఆయన వలె జీవించాలి.
Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...