2, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం


యెషయా 63:16-17, 64: 1. 3-8
1 కొరింతి 1:3-9
మార్కు 13: 33-37
ఆగమన కాలం మొదటి ఆదివారం తో దైవార్చన కొత్త సంవత్సరము ప్రారంభమగుచున్నది. ప్రభువు యొక్క రాకడ ఎప్పుడు ఏ విధంగా జరుగునో ఎవరికీ తెలియదు కావున ఆయన యొక్క రాకడ కొరకు మనము సంసిద్ధులై జీవించాలి. ఆయన రావటము అనేది సత్యం ఎందుకంటే భూమ్యాకాశములు గతించిన గాని నా మాటలు గతించిపోవు అని ప్రభువు పలికారు ఆయన పలికిన ప్రతి మాట తప్పక నెరవేరును. పోయిన దైవార్చన సంవత్సరములో((Year A) ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకై తయారైన విధముగా మరొకసారి మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకై తయారై ఉండాలి. 
ఈ యొక్క ఆగమన కాలంలో మనం ప్రభువు యొక్క జన్మము కొరకై ఎదురుచూస్తున్నాం. దేవుడు మన మధ్య మరియు మనలో జన్మించాలి అంటే మనందరం కూడా ఆయనకు ఒక నివాస స్థలమును మన మధ్య మరియు మన హృదయములో ఏర్పరచాలి. 
ఈనాటి మొదటి పఠణంలో  యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చేసిన పశ్చాత్తాప ప్రార్థన గురించి తెలుపుచున్నారు. పర్షియా దేశమునకు చెందిన సైరస్ రాజు ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛనిచ్చి యెరుషలేము దేవాలయం పునః నిర్మించుటకు అనుమతి ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైన విధానమును గ్రహించుకొని వారు పశ్చాత్తాపముచెంది మరొకసారి వారి మధ్య దేవుడిని దిగి రమ్మని ప్రార్థన చేస్తున్నాను. యావే దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయనను వారి మధ్యకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో ఒక మహా రాజ్యముగా రూపొందగలదని ఆశపడ్డారు, కానీ వారి యొక్క పాపపు జీవితం వలన దేవునికి దూరమైపోయి సర్వమును కోల్పోయారు. అలాంటి క్లిష్ట పరిస్థితులు యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైన వార్తను దయచేసి చేస్తున్నారు ఏమిటంటే, దేవుడిని నమ్ముకున్న ప్రజలకు ఆయన ఎప్పుడు చేరువులోనే ఉంటారు అని. దేవుని యొక్క గొప్ప లక్షణం , మంచితనము ఏమనగా ఆయన కొరకు ఎదురు చూసే వారికి తప్పనిసరిగా దర్శనం ఇస్తారు. దేవుడు ఎన్నుకున్న ప్రజలు తప్పు చేసినప్పటికీ, అవిధేయత చూపించినప్పటికీ మాత్రము ఎన్నడు వారిని విడిచిపెట్టలేదు వారికి సహాయంగా ఉన్నారు. కేవలము వారి యొక్క హృదయ పరివర్తన కొరకై కొన్ని సందర్భంలో బానిసత్వంను అనుమతించారు అయినా వారికి తోడుగానే ఉన్నారు.
ఈ మొదటి పఠణం  మొదటి భాగములో ప్రజలు దేవుడు తమ్మును విడిచి పెట్టారు అని భావించారు కానీ రెండవ భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన పట్ల ఏ విధముగా ప్రవర్తించారో తెలుపుచున్నారు. తన చెంతకు వచ్చిన వారిని, తనను సేవించే వారిని మరియు తన మీద ఆధారపడి జీవించే వారిని ప్రభువు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు అని తెలుపుచున్నారు. కేవలము ప్రజలే ఆయనను గుర్తించలేకపోయారు అని తెలిపారు. ఆయన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదని ప్రభువు పలికారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుడు మనకు ఒసగిన అనుగ్రహాలు గురించి తెలుపుచున్నారు. ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా మనందరికీ కృపానుగ్రహాలు వసగబడెను. ఇది కేవలము ఆయన మనకు ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం. మనము పాపాత్ములు అయినప్పటికీ కూడా ఆయనయే తన ప్రేమ వలన మనకు అనుగ్రహాలు ఇస్తున్నారు. ప్రభు యొక్క రాకడ కొరకై విశ్వాసముతో ఎదురుచూసే వారికి ఆయన యొక్క అనుగ్రహాలకు కొరత ఉండదు అని కూడా పౌలు గారు తెలుపుచున్నారు. అన్ని విషయములయందు వారిని ప్రభువు సుస్థిరం చేస్తారు.
ఈనాటి సువిశేష భాగములో యజమానుడు ఎప్పుడు వచ్చునో తెలియదు కాబట్టి ఆయన యొక్క రాకడకై సేవకులను జాగరుకులై ఉండమని ప్రభువు తెలుపుచున్నారు. ఈ సువిశేష భాగములో రెండు అంశములను ప్రధానంగా చూస్తున్న ఒకటి వేచి ఉండటం రెండు జాగరుకులై ఉండటం.
1. వేచి ఉండటం, ఎదురు చూడటం- వేచి ఉండటం, చూడటం అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం.
-తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎదురు చూస్తారు.
-చదువుకునే వారు మంచి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తారు.
- ప్రయాణికులు వాహనముల కొరకు వేచి ఉంటారు.
-సంతానం లేని వారు పిల్లల కొరకు ఎదురు చూస్తారు.
- దేవుడు కూడా మన యొక్క హృదయ పరివర్తన కొరకు ఎదురు చూస్తారు
ఈ విధంగా చాలా సందర్భాలలో అనేక విషయాలలో ఎదురుచూస్తూ ఉంటాం. ఈ సువిశేషంలో యజమానుడు ఎప్పుడు వస్తారు అని సేవకులు ఎదురుచూస్తున్నారు. ఆయన యొక్క రాక ఊహించని సమయంలో జరుగును కావున వారికి ఇచ్చిన పనిని వారు సక్రమంగా చేస్తూ బాధ్యతాయుతముగా మెలగాలి. కాబట్టి దేవుడు మన యొక్క యజమాని కావున మనం ఆయన యొక్క రాకకు ఎదురు చూడాలి. ఈ భూలోకంలో మంచి పనులు చేస్తూ,  మంచి జీవితం జీవిస్తూ దేవుడిచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూడాలి.
2. జాగరుకులై ఉండాలి- అనేక సందర్భాలలో క్రీస్తు ప్రభువు జాగ్రత్త కలిగి ఉండమంటున్నారు.
శిష్యులను సువార్త సేవకై పంపించే సందర్భంలో మిమ్ములను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపిస్తున్నాను జాగ్రత్తగా ఉండమంటున్నారు.
అనేకమంది నా పేరిట వచ్చి నేనే అతనిని చెబుతారు కానీ వారి వెంట మీరు వెళ్ళవద్దు జాగరుకులై ఉండమంటున్నారు.
ఈ లోక విపత్తుల ఎడల జాగరూకులై ఉండమంటున్నారు.
ప్రభు అనేక సందర్భంలో జాగరూకత కలిగి జీవించమంటున్నారు ఎందుకంటే మనము పాపములో పడిపోకూడదని, నశించిపోకూడదని, దేవుని యొక్క మార్గమును విడిచి వెళ్ళకూడదని దేవుని యొక్క కోరిక కాబట్టి ఈ ఆగమన కాలంలో క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకై ఎదురుచూసే సమయములో ఆయన యొక్క జననం ఆధ్యాత్మికంగా మన హృదయం జరగాలంటే మనము కూడా దేవుడు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూడాలి. మనల్ని మనము ఆధ్యాత్మికంగా ఆయనను స్వీకరించుటకు తయారు చేసుకోవాలి. అదేవిధంగా జాగరుకత కలిగి పాపములో పడిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ జీవించాలి.

Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...