29, జూన్ 2024, శనివారం

13వ సామాన్య ఆదివారం

13వ సామాన్య ఆదివారం 
సొలోమోను జ్ఞాన 1: 13-15, 2: 23-24, 2 కొరింతి 8:7, 9,13-15
మార్కు 5:21-43
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవునికి ఈ సృష్టి మీద మరియు మానవుల మీద ఉన్నటువంటి ప్రేమను గురించి తెలుపుచున్నవి.  ఆయన సృష్టిని చేసినప్పుడు కంటికి అంతా బాగుగా ఉండెను.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏ విధముగా సృష్టిని చేసి ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా కాపాడుతున్నారని తెలుపుతుంది. దేవుడు మరణమును సృష్టించలేదు ఆయన సృష్టిని చేసిన సందర్భంలో ఏదీ కూడా తన కంటికి చెడుగా కనిపించలేదు అంతా కూడా బాగానే ఉన్నది. ఆయన ప్రణాళిక ప్రకారము సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా జీవించటానికి, అభివృద్ధి చెందడానికి మరియు మంచిగా ఉండటానికి సృష్టించారు కానీ సైతానే అసూయవలన మానవుడిని ప్రేరేపించి పాపంలోనికి నెట్టివేసి మరణంనకు గురిచేసినది. దేవుడు ఎవరిని నాశనం చేయాలని కోరుకోలేదు కేవలం మానవుడు చేసిన తప్పిదం వలన తనంతట తాను మరణమును కొని తెచ్చుకున్నాడు. ఎవరి నాశనం వలన దేవుడు సంతోషించరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హృదయ పరివర్తనం చెందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం.(యెహెజ్కేలు 18:23)
ఒకవేళ దేవుడే మనము నాశనం అవ్వాలి అని కోరుకున్నట్లయితే మన పాపాలకు ఆయన మనల్ని ఎప్పుడూ శిక్షించి ఉండవు కానీ అలా చేయలేదు. 
ఆయన ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తన యొక్క ప్రవక్తలను పంపి ఉండేవారు కాదు అలాగే తప్పిపోయినటువంటి గొర్రె కొరకు వెదకేటువంటి వారు కాదు మనము మంచిగా జీవించుట నిమిత్తమై దేవుడు మన కొరకు ప్రతినిత్యం కూడా కృషి చేస్తున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు మనందరం కూడా ఉదార స్వభావులై  ఒకరికి ఒకరు సహయం చేసుకుని జీవించాలని తెలుపుతున్నారు ఏసుప్రభువు ఏ విధముగానయితే ఈ లోకంలో తనకు ఉన్నటువంటి మొత్తం కూడా విడిచిపెట్టి మన మధ్యకు ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చి తన అనుగ్రహాలను అందరికీ కూడా పంచి ఇచ్చి ఉన్నారో అదేవిధంగా ధనవంతులైనటువంటి వారు, ఉన్నవారు ఇతరులకు సహాయం చేసి జీవించేటటువంటి   సుగుణం కలిగి ఉండాలి అని పౌలు గారు తెలుపుచున్నారు. ఈనాటి సువిశేష పఠణంలో యేసు ప్రభువు యాయిరు కుమార్తెను బ్రతికించిన విధానము మరియు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీకి స్వస్థత ఇచ్చిన విధానము చదువుకుంటున్నాం. ఈ రెండు సంఘటనలలో ఒకరి వయసు 12 సంవత్సరాలు మరియు 12 సంవత్సరాల అనారోగ్యం . ఇక్కడ వీరిద్దరి యొక్క  అచంచలమైనటువంటి విశ్వాసమును చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో వారి ప్రయత్నం చేసిన తర్వాత నిరాశలో ఉన్న సందర్భంలో దేవుని వైపు తిరుగుతూ కేవలం దేవుని శక్తి మీదే ఆధారపడుతూ యేసు ప్రభువుని ఆశ్రయించారు అందుకే ప్రభువు వారిద్దరి జీవితంలో మేలు చేశారు.
మోషే ధర్మ శాస్త్ర ప్రకారము రక్తస్రావంతో బాధపడే స్త్రీ అశుద్ధురాలుగా పరిగణింపబడుతుంది ఆమె దేవాలయమునకు వెళ్ళుటకు అనర్హురాలు అదేవిధంగా ఇతరులతో కలిసి ఉండటకు అనర్హురాలు. (లేవి 15:25-27) ఆమె తన దగ్గర ఉన్నది మొత్తం కూడా ఖర్చు చేసింది ఏ వైద్యుడు కూడా తనకు స్వస్థత నివ్వలేదు తన యొక్క ప్రయత్నం తాను చేసిన తర్వాత చివరిసారిగా బహుశా యేసు ప్రభువు యొక్క మంచితనమును, స్వస్థతను తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి కనీసం ఆయన యొక్క వస్త్రంను తాకినా స్వస్థత పొందవచ్చు అని భావించినది. ఏసుప్రభు ప్రయాణం చేసే సందర్భంలో చాలా మంది ఆయనను తాకారు కానీ వారెవరు స్వస్థత పొందినట్లు ప్రభువు పలకలేదు కేవలం ఈమెను గురించి మాత్రమే ఏసు ప్రభువు తెలిపారు ఎందుకంటే ఆమె నిజమైనటువంటి విశ్వాసం కలిగి యేసు ప్రభువుని ఆశ్రయించి, ఆయన వస్త్రములు కూడా స్వస్థత ఉందని గట్టిగా నమ్మినది కాబట్టే తన విశ్వాసము ప్రకారంగా యేసుప్రభు అద్భుతం చేశారు.
యాయీరు కూడా ఒక అధికారి  అయినప్పటికీ ఆయన తన యొక్క కుమార్తె అనారోగ్యంతో బాధపడే సమయంలో తనకి మనవి చేయగా ఏసుప్రభువు  అతని విశ్వాసం చూసి  ఆ బిడ్డను స్వస్థతపరచ వచ్చి, ఆమెకు స్వస్థతనిచ్చారు. బాలిక మరణించినప్పటికీ కూడా ప్రభువు ఆమె కు నూతన జీవాన్ని ప్రసాదించారు. దేవుడు ఆమెకు జీవాన్ని ప్రసాదించి నా కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చారు అలాగే రక్తస్రావంతో బాధపడేటటువంటి ఆమెకు ప్రభువు ఆనందాన్నిచ్చారు.
ధ్యానించవలసిన అంశాలు 
1. దేవుడు ఎవరు నాశనం అవ్వాలి అని కోరుకోరు కాబట్టి మనము కూడా నాశనం ణము కోరుకోకూడదు.
2. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. 
3. దేవుని యందు పటిష్ట విశ్వాసం కలిగి ఉండాలి.
4. దేవుని మీద ఆధారపడి జీవించాలి. 
5. మనకు దేవుడు తోడుగా ఉంటారు అని నమ్మకం కలిగి జీవించాలి.
Fr. Bala Yesu OCD

22, జూన్ 2024, శనివారం

12వ సామాన్య ఆదివారం

12వ సామాన్య ఆదివారం 
యోబు 38:1, 8-11, 2 కొరింతి 5:14-17,  మార్కు 4:35-41
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల జీవితంను ఏ విధముగా ప్రశాంత పరుస్తారు అనే అంశమును తెలుపుచున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు ఉంటూనే ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ విధముగా తన ప్రజలకు తోడుగా ఉండి వారిని బలపరుస్తారు అనే అంశము ఈనాటి పఠణాలలో క్షుణ్ణంగా అర్థమవుచున్నది.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు యోబుకు ఇచ్చిన సమాధానము గురించి తెలపబడినది. యోబు జీవితము మొదటిలో బాగానే ఉన్నది. ఆయన పిల్లాపాపలతో, సిరిసంపదలతో, మంచి పేరుతో సంతోషంగా జీవించాడు కానీ సైతాను తన యొక్క జీవితమును శోధించినప్పుడు యోబు అన్నీ కోల్పోయాడు. ఆయన సంపదలు పోయాయి, తన యొక్క ఇష్టమైన కుటుంబము  దూరమైపోయింది, స్నేహితులు దూరమయ్యారు, తనకు అనారోగ్యం సోకింది ఈ విధముగా అన్ని కోల్పోయిన సందర్భంలో తన జీవితంలో ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకున్నాడు "నా యొక్క దీనస్థితికి కారణం ఏమిటి అన్నది" యోబు దేవుడిని తన యొక్క పరిస్థితికి కారణం ఏమిటి అని పదేపదే అడగగా దేవుడు అతనికి సమాధానమిచ్చారు. యోబుతో యావే దేవుడు సమాధానమిచ్చే సందర్భంలో తన స్థితికి కారణం ఏమిటి అని చెప్పలేదు కానీ దేవుడు ఆయనయే సమస్తమును సృష్టించిన సృష్టికర్త అని, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది అని తెలిపారు. దేవునికి ప్రతి ఒక్కరి గురించి ఒక ప్రణాళిక ఉన్నది కాబట్టి యోబు యొక్క విశ్వాసము స్థిరమైనది అని ఈ లోకమునకు నిరూపించుట కొరకై ఆయన జీవితంలో కష్టాలను దేవుడు అనుమతించారు. అయినప్పటికీ ఆయన కష్టాలు ముగిసిన సందర్భంలో యోబును దేవుడు ఇంకా అధికముగా ఆశీర్వదించి తనను ప్రశాంత పరిచారు. (యోబు 42:10). వాస్తవానికి యోబు యొక్క గ్రంథం బహుశా యూదులు  బానిసత్వంలో ఉండినప్పుడు వ్రాసి ఉండవచ్చు. ఈ గ్రంథంలో మరీ ముఖ్యంగా రచయిత మానవుని యొక్క బాధలకు కారణం ఏమిటి అనేటటువంటి అంశము తెలపాలనుకున్నారు కానీ దానికి తగిన సమాధానము ఇవ్వలేదు. యోబు గ్రంథం తెలిపే ఇంకొక అంశము ఏమిటి అంటే ఈ లోకంలో మంచివారు కష్టాలు అనుభవించవచ్చు, దుర్మార్గులు సంతోషిస్తూ జీవించ ఉండవచ్చు కానీ చివరికి దేవుడు కష్టాలు అనుభవించే మంచి వారిని ఆశీర్వదిస్తారు దుర్మార్గులను శిక్షిస్తారు. యోబు యొక్క జీవితంలో మనము గ్రహించవలసిన అంశము ఏమిటి అంటే మన అందరి జీవితాలలో కష్టాలు, బాధలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అలాంటి సందర్భంలో దేవుని శక్తి మీదే ఆధారపడుతూ విశ్వాసము కోల్పోకుండా ఆయనను నమ్ముకొని ముందుకు సాగాలి. యోబు వలె విశ్వాసములో పటిష్టంగా ఉండాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వారు నూతన సృష్టి అని తెలిపారు. క్రీస్తు నందు ఉన్నవారు పాత జీవితమును ముగించి కొత్త జీవితమును ప్రారంభిస్తారు అనగా వారి కష్టాలు తొలగించబడి సంతోషకరమైన జీవితము జీవిస్తారు అని అర్థం. క్రీస్తు నందు జీవించటం చాలా కష్టం కానీ అలా జీవించిన వారికి దేవుడు సమస్తమును సమకూర్చును. పౌలు గారు క్రీస్తునందు జీవించుట కొరకు అనేక కష్టాలు అనుభవించారు కాబట్టి ఆయన నూతన సృష్టిగా చేయబడ్డారు కాబట్టి మనం కూడా క్రీస్తునందు జీవించటానికి ప్రయత్నం చేయాలి. 
ఈనాటి సువిషేశ పఠణంలో దేవుడు శిష్యుల యొక్క జీవితమును ప్రశాంత పరిచిన విధానము ధ్యానిస్తున్నాము. ఈ సువిశేషం ద్వారా మనం కొన్ని విషయాలు  ధ్యానించాలి. 
1. మన జీవితంలో (Sudden incidents )హఠాత్తుగా జరిగే అంశాలకు ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు. 
శిష్యులు తమ యొక్క ప్రయాణం ప్రారంభించినప్పుడు అంత ప్రశాంతంగానే సాగింది కానీ ఒక్కసారిగా అలలు ప్రారంభమై సముద్రంలో పడవ మునిగేలాగా పరిస్థితి ఏర్పడింది. మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో హార్ట్ ఎటాక్, యాక్సిడెంట్స్, పక్షవాతం అనేవి హఠాత్తుగా వస్తూ ఉంటాయి. అలాంటివారికి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు కాబట్టి మనము పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగాలి. 2020లో కరోనా వైరస్ సడన్గా అన్ని దేశాల్లో వ్యాపించి అనేకమంది జీవితాలను నాశనం చేసింది. శిష్యుల ప్రయాణం కూడా అప్పటివరకు బాగానే సాగింది కానీ ఒక్కసారిగా అంతా అతలాకుతలమైంది. 
2. మన కష్ట సమయాలలో దేవుడు మనతో ఉన్నారా అని మనకు అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్య ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఎందుకు కష్టాలు ఎదురవుతాయి అని చాలామంది భావిస్తూ ఉంటాం. శిష్యుల యొక్క జీవితంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నా వారి యొక్క పడవ మునగటం ప్రారంభించింది అంటే దేవుడు మనకు తోడుగానే ఉన్నప్పటికీ మన జీవితంలో ఆయన కష్టాలను అనుమతిస్తారు అది మరలా మనలను రక్షించుట కొరకే. మన విశ్వాసం బలపరచుట కొరకు.
3. మన యొక్క కష్ట సందర్భాలలో మనము విశ్వాసముతో దేవుని వైపు మరలాలి. శిష్యులు వారి యొక్క పడవ మునిగిపోవుచుండగా ఏసుప్రభు చెంతకు వెళ్లి వారి యొక్క మనవిని తెలిపారు. వాస్తవానికి సువిషేశంలో ఏసుప్రభు నిద్రిస్తున్నారు అని రాయబడి ఉన్నది వాళ్లందరూ భయంతో ఉంటే యేసు ప్రభువు మాత్రం హాయిగా నిద్రిస్తున్నారు అంటే శిష్యులు తన చెంతకు వస్తారా?, రారా?, అని ప్రభువు ఎదురు చూస్తున్నారు. మనం కష్టాలు ఎదుర్కొనేటప్పుడు దేవుని వైపు రావాలి అని మరచిపోకూడదు. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి దూరంగా ఉంటారు. దేవుడు మాకు ఏమీ చేయటం లేదులే ఇంక దేవాలయానికి ఎందుకు వెళ్లాలి అనే ఆలోచనతో జీవిస్తుంటారు.
4. దేవుడు మన కష్టాలను చూసి మనల్ని ఆదుకుంటారు. శిష్యుల యొక్క పరిస్థితి చూసిన ప్రభువు వారిని ఆదుకున్నారు. వారికి తోడుగా నిలబడ్డారు వారి జీవితంలో సంతోషాన్నిచ్చారు.
5. మన కష్టాలు కొలది కాలం మాత్రమే. శిష్యుల యొక్క బాధ, భయం కొద్ది కాలం మాత్రమే ఉన్నది అది శాశ్వతంగా లేదు. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు "Pain is never permanent' అని అంటారు అంటే ఏ బాధ కూడా శాశ్వతం కాదు అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది దాని తర్వాత సంతోషం ఉంటుంది. 
6. దేవుడు మన జీవితాలను ప్రశాంత పరుస్తారు. శిష్యులు ఎదుర్కొన్న భయాన్ని దేవుడు ప్రశాంత పరిచారు ఆయన సమస్తమును సృష్టించినటువంటి ప్రభువు కాబట్టి సమస్తము ఆయన అధీనంలో ఉన్నది కావున ఆయన అలలను ప్రశాంత పరిచారు అదే విధముగా శిష్యుల యొక్క భయాన్ని భాదని తొలగించి సంతోషాన్నిచ్చారు. 
దేవుడు మనతో ఉన్నట్లయితే మనకు కష్టాలు ఉన్న బాధలు ఉన్న అన్నిటిని కూడా మనం ఎదుర్కొని ముందుకు సాగగలం కాబట్టి దేవుని చెంతకు వస్తూ ఆయన మీద ఆధారపడుతూ మనము జీవించాలి ఆయనే మన జీవితాలను ప్రశాంతపరచి మన కష్టాలను తొలగించి మనలో సంతోషాన్ని నింపుతారు. 
Fr. Bala Yesu OCD

15, జూన్ 2024, శనివారం

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం 
యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బోధిస్తున్నాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్నటువంటి సమయములో వారి జీవితంలో ఒక నమ్మకమును కలుగ చేస్తున్నారు. దేవుడు ఎత్తైన దేవదారు మీద ఒక కొమ్మను విరిచి దానిని పర్వతం మీద నాటుతారు అని అన్నారు. ఆ యొక్క చెట్టు పెద్దదిగా ఎదిగి గొప్ప దేవదారు వృక్షం అగును అని తెలుపుచున్నారు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితమును ఉద్దేశించి ప్రభువు పలికినటువంటి మాటలు.
ఇశ్రాయేలు ప్రజలు తాము చేసినటువంటి పాపమునకు ఫలితముగా బానిసత్వ జీవితమును జీవింపవలసి వచ్చినది. అన్యదైవములను పూజించినందుకు వారు దేవుని చేత శిక్షింపబడ్డారు. వారి యొక్క బాధలో ఉన్న సమయంలో దేవుడు వారిని మరలా స్వీకరించటానికి సిద్ధపడ్డారు అందుకుగాను ప్రభువు పలుకుచున్నారు నేనే స్వయముగా కొమ్మను నాటుదను అది ఎదుగును అని తెలుపుచున్నారు అనగా యావే ప్రభువు త్వరలో ఇశ్రాయేలు ప్రజలను తమ దేశానికి తీసుకుని వచ్చి మరల వారికి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదిస్తారని ఒక అర్థం ఇంకొక అర్థం ఏమిటంటే రాబోయే కాలంలో ఇజ్రాయేలు ప్రజల నుండి మెస్సయ్య జన్మించి ఆయన సువార్త పరిచర్య ద్వారా అనేకమంది దేవుని యొక్క బిడ్డలగా మార్చబడతారు మరియు దేవుని యొక్క రాజ్యము విస్తరిల్లుతున్నది అని అర్థం. 
మొదటి పఠణము ద్వారా గ్రహించవలసిన అంశములు ఏమిటి అంటే;
1. దేవుడు మనతో ఉంటే మనం అభివృద్ధి చెందుతుంటాము, దీవించబడతాం. ప్రభువు ఏ విధముగానయితే ఇశ్రాయేలు ప్రజలకు భద్రతను కల్పిస్తూ, తోడుగా ఉంటూ వారు అభివృద్ధి చెందే విధంగా ప్రజలును దీవించారు. అలాగే దేవుడు మనతో ఉంటే మనం కూడా దీవించబడతాం.
2. ప్రభువు ఎత్తైన చెట్లను నరుకుతాను అని తెలుపుచున్నారు దీనిని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నట్లయితే ఎవరైతే గర్వంతో ఉంటారో వారిని దేవుడు తమ యొక్క పదవుల నుండి తొలగిస్తారు. అందుకే మరియ తల్లి తన స్తోత్ర గీతములో దేవుడు ఎలాగ గర్వాత్ములను అధికారం నుండి పడగొడతారు తెలుపుతూ దీనులను ఏ విధంగా దీవిస్తారో తెలిపారు. (లూకా 1:51,52)
3. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని తెలుపుతున్నారు ఎందుకనగా పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడునట్లు చేసేది దేవుడు మాత్రమే అనగా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి జీవితాలలో నమ్మకమును దయచేసి దేవుడే అలాగే గర్వముతో , భయము, భక్తి లేకుండా జీవించే వారి యొక్క జీవితాలు సంతోషము లేని జీవితాలుగా మారతాయి. దేవుడు తన ప్రజల జీవితంలో ఏదైనా చేయవచ్చు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
ఈనాటి సువిశేష భాగములో కూడా ఏసుప్రభు పరలోక రాజ్య వ్యాప్తి గురించి రెండు ఉపమానముల ద్వారా తెలియచేయుచున్నారు. ఈ రెండు ఉపమానములలో ఎదుగుదల అనేది గొప్పదిగా ఉంటుంది. ప్రారంభం చిన్నదిగా ఉన్న ముగింపు మాత్రం పెద్దదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదగాలి అది విశ్వాసములో అవ్వొచ్చు, చదువులోనైనా అవ్వొచ్చు, ప్రార్థనలో నైనా అవ్వొచ్చు, సంపదల్లోనైనా అవ్వొచ్చు.  ప్రభువు విత్తు వాడిని ఉదాహరణగా తీసుకొని ఆ విత్తనములు వెదజల్లినప్పుడు ఏ విధంగానైతే ఎవరికీ తెలియకుండా మొలకలు వస్తాయో అదే విధముగా ప్రభువు యొక్క రాజ్యము కూడా ఎవరు ఊహించని విధంగా విస్తరిల్లుతుంది అని తెలిపారు.
రెండవ ఉపమానము ఏసుప్రభు ఆవగింజను ఉదాహరణగా తీసుకొని పరలోక రాజ్యం గురించి తెలుపుచున్నారు. ఆవ గింజ చూడటానికి చిన్నదైనప్పటికీ దాని యొక్క ఎదుగుదల ప్రభావము చాలా గొప్పది. ప్రభువు ఎందుకు ఆవగింజనే ఉదాహరణగా తీసుకున్నారు అని ధ్యానించినట్లయితే ఆవగింజ చిన్నది కానీ ఫలితం పెద్దది అలాగే మన జీవితంలో కూడా వినయముతో ప్రారంభించిన ఏ పని అయినా సరే అది విజయవంతమగుతున్నది  ఎందుకంటే ఆయన దీనులను ఆశీర్వదిస్తారు కాబట్టి.
ఆనాడు దేవుడు ఆదాము అవ్వతో ప్రారంభించిన సృష్టి ఏ విధంగానైతే గొప్పగా విస్తరిల్లినదో అలాగే ఏసుప్రభు 12 మంది శిష్యుల ద్వారా ప్రారంభించిన తన యొక్క పరిచర్య ఈనాడు దేవుని రాజ్యం ఎంతగానో విస్తరిల్లినదో మనం చూస్తున్నాం దీనికి కారణం దేవుడు. శ్రీ సభ దినదినాభివృద్ధి చెందాలి అంటే దేవుని కృప సహకారం ఉండాలి. ఆయన కృప లేనిదే ఏది కూడా సాధ్యం కాదు. 
మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనము దినదినాభివృద్ధి చెందాలి దానికి గాను వినయముతో జీవించాలి.
Fr. Bala Yesu OCD

8, జూన్ 2024, శనివారం

పదవ సామాన్య ఆదివారం

పదవ సామాన్య ఆదివారం 
ఆది 3:9-15
2 కొరింతి 4:13-5:1
మార్కు 3:20-35
ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠణములు పాపము దాని యొక్క ఫలితము గురించి బోధిస్తున్నాయి. పాపము చేయటం ద్వారా మానవులు దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. పాపము చేయటం ద్వారా దేవునికి దూరమవుతాం అదేవిధంగా మన యొక్క పొరుగు వారికి కూడా దూరం అవుతాం అలాగే వారిని బాధిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో పాపము చేస్తూనే ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో ఈ లోకంలోకి పాపము ప్రవేశించినటువంటి విధానము గురించి ఆదికాండములో వివరించబడినది. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ పాపము చేసి దేవునికి విరుద్ధముగా నడుచుకున్నారు. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించారు. హీబ్రూ భాషలో పాపమును HATTAH అని పిలుస్తారు అనగా చేయవలసిన మంచి చేయకపోవడం. ( Missing the target). ఆదాము అవ్వ దేవుడి ఎడల మంచిగా ప్రవర్తించవలసి ఉండినది కానీ వారు ప్రవర్తించలేదు. దేవునికి వారు విధేయత చూపించాలి కానీ చూపించలేదు అది వారి యొక్క పాపం. పాపం చేయటం ద్వారా ఆదాము అవ్వ దాగుకొని జీవిస్తున్నారు ఆ సందర్భంలో దేవుడు ఆదామును నీవెక్కడ అని ప్రశ్నించారు? ఇది దేవుడు పవిత్ర గ్రంథంలో అడిగిన మొట్టమొదటి ప్రశ్న. దీని యొక్క అర్థం ధ్యానించినట్లయితే -దేవుడు ఆదామును నీవు నాతో ఉన్నటువంటి బంధములో ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తున్నారు.
- నీవు నీ కుటుంబ సభ్యుల బంధములో ఎక్కడున్నావు 
- నీవు నీ పొరుగు వారి యొక్క విషయాలలో ఎక్కడున్నావు 
- నీవు దేవాలయం రాకుండా ఎక్కడున్నావు 
- ప్రార్థించకుండా ఎక్కడున్నావు అని వివిధ కోణాలలో ఈ యొక్క ప్రశ్న గురించి ధ్యానించవచ్చు. నేడు దేవుడు ఇదే ప్రశ్న మనందరిని కూడా అడుగుచున్నారు. నీవు ఎక్కడున్నావు?
పాపములో జీవిస్తున్నటువంటి మనము దేవునితో ఉన్నటువంటి బంధంలో ఎక్కడ జీవిస్తున్నాం. మనం కూడా ఆదాము అవ్వలే పాపం చేసి దేవుని సన్నిధికి రాకుండా జీవిస్తున్నామా?
 దేవుడు ఆదాము అడిగిన రెండవ ప్రశ్న నీవు దిశములతో ఉన్నావు అని ఎవరు చెప్పితిరి? 
ఆదాము సైతాను నాకు ఈ విషయమును తెలియజేశారు అని పలికాడు. ఆదాము సైతాను మాట విన్నాడు కాబట్టి పాపము చేసాడు. సైతాను మనల్ని అనేక సందర్భాలలో మోసం చేస్తూనే ఉంటూ ఉంటుంది. మనం ఎవరి స్వరమును వినాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరికి విధేయత చూపించాలి అనేది మన యొక్క అనుదిన జీవితంలో ఒక పోరాటం లాంటిది కాబట్టి మనం సరియైన నిర్ణయం తీసుకొని దేవుడికి అనుగుణంగా మంచిని ఎన్నుకొని జీవించాలి.
1.పాపము చేయటం ద్వారా - ఆదాము అవ్వలు అవమానానికి గురయ్యారు అందుకనే వారు ఎవరికీ కనబడకుండా దాగుకొని జీవించడానికి సిద్ధమయ్యారు.
2. పాపము చేయడం వలన కొన్నిసార్లు దానిని మనము అంగీకరించము. ఆదాము అవ్వ చేసినటువంటి పాపము కూడా అంగీకరించలేదు. 
3. పాపము మనలను ఇతరులను నిందించేలాగా చేస్తుంది. ఆదాము అవ్వను నిందించాడు, అవ్వ పామును నిందించినది. ఈ విధంగా ప్రతిసారి పాపం చేసిన సందర్భంలో మనము ఎవరినో ఒకరిని నిందిస్తూ ఉంటాం.
4. పాపం చేయడం ద్వారా ఆదాము అవ్వ భయపడుతూ, భయపడుతూ జీవిస్తున్నారు. 
5. పాపము చేయటం ద్వారా స్వేచ్ఛను కోల్పోతున్నారు.
6. పాపము చేయటం ద్వారా దేవునితో ఉన్నా స్నేహం కోల్పోయారు. 
7. పాపము చేయటం ద్వారా పరలోకమును కోల్పోయారు.
 ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యందు విశ్వాసము కలిగి జీవించుట అనే అంశం గురించి తెలుపుచున్నారు. ఈ లోకంలో చిన్న చిన్న కష్టాలు ఎదురైనా సరే దేవుడువసగు ప్రతిఫలము ద్వారా సంతోషముగా జీవిస్తున్నాం అని పౌలు గారు తెలుపుతున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో మార్కు సువార్తికుడు రెండు అంశములను గురించి తెలియజేస్తున్నారు. 
1. ఏసుప్రభు ఎవరి అధికారంతో దయ్యములను పారద్రోలుచున్నారు అని.
2. ప్రభువు యొక్క ఆధ్యాత్మిక తల్లి, సోదరీ సోదరులు ఎవరని. 
ఏసుప్రభు నజరేతు వచ్చినటువంటి సమయంలో అక్కడికొందరి ప్రజలు ఆయనకు మతి చలించినదని భావించారు. ఆయన వారికి ఎంత మంచి చేసినప్పటికీ వారు మాత్రము ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకుని పాపం చేశారు. దానికి ప్రతిఫలంగా ప్రభువు, ఆయన ఎవరి అధికారంతో దయ్యములను వెళ్ళగొట్టుచున్నారని తెలిపారు. 
అదేవిధంగా ప్రభువు యొక్క కుటుంబ సభ్యులో భాగస్తులై జీవించాలి అంటే మనము దేవుని యొక్క చిత్తమును మన యొక్క జీవితంలో నెరవేర్చాలి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. మరియ తల్లి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి దేవునికి విధేయత చూపించినది కాబట్టే ఆమె నిష్కలంక మాతగా జీవించారు. మరియ తల్లి పాపము చేయకుండా సంపూర్ణముగా దేవునితో బంధము కలిగి ఆమె మనందరికీ కూడా ఒక సుమాతృకగా జీవించారు.
ఈనాడు మనందరం కూడా మన యొక్క బలహీనత ద్వారా పాపములో పడకుండా, సైతాను శోధనలకు లొంగకుండ దేవుని చిత్తానికి లోబడి, మంచిని చేస్తూ ఆయనతో బంధము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 
పాపం మనల్ని దేవుడి నుండి దూరం చేస్తుంది కాబట్టి పాపమని విడిచిపెట్టి, పశ్చాతాపపడి దేవునికి దగ్గర జీవించుదాం.
Fr. Bala Yesu OCD

1, జూన్ 2024, శనివారం

పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల పండుగ

పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల పండుగ 

ఈనాడు తల్లి శ్రీ సభ ఏసుక్రీస్తు దివ్య శరీర రక్తముల పండుగను కొనియాడుచున్నది. ఈ పండుగ దేవుని యొక్క నిజమైన సాన్నిద్యం దివ్యసప్రసాదంలో ఉన్నది అని తెలుపుచున్నది. ఈ పండుగ 13వ శతాబ్దంలో జూలియానా అనేటటువంటి భక్తిపరురాలు తనకు కలిగినటువంటి దర్శనం ద్వారా అప్పటి 4 వ ఉర్బన్ పాపుగారు తెలియజేసి ఈ పండుగ అధికార పూర్వకంగా ప్రపంచమంతా జరుపుకోవాలని ప్రకటించారు. ఈ యొక్క పండుగ మూడు విశ్వాస సత్యాలను మనకు నేర్పిస్తుంది. 
1. నిజ దేవుడు నిజమానవుడైన యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు భూమికి దిగి రావటం. మన కొరకు తన శరీర రక్తములను ఆహారముగా ఇచ్చుట. 
2. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో జీవిస్తారు ఈ యొక్క దివ్య సత్ప్రసాదం ద్వార.
3. దేవుని యొక్క సాన్నిద్యాన్ని ప్రతిరోజు దివ్యబలి పూజ ద్వారా అనుభవించుట.
 ఏసుప్రభు మరణించే ముందు మనందరికీ కూడా ఇచ్చినటువంటి రెండు విలువైన కానుకలు ఆయన యొక్క శరీర రక్తములు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండటానికి ఆయన యొక్క శరీర రక్తములను మనకు ఒసగి ఉన్నారు.
 ఈనాడు మనందరం కూడా ప్రత్యేక విధముగా ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటి అంటే దివ్య సత్ప్రసాదం యొక్క గొప్పతనం. దివ్య సత్ప్రసాదం ద్వారా దేవుడు అనేక అద్భుతములు చేసి ఉన్నారు. దివ్యసప్రసాదం శ్రీ సభకు ఉన్నటువంటి ఒక గొప్ప సంపద. ఎక్కడ ఎవరి దేవాలయానికి వెళ్లిన వారికి కేవలం దొరికేది దేవుని యొక్క ప్రసాదం మాత్రమే కానీ కతోలికలకు లభించేది ఏమిటి అంటే సాక్షాత్తు దేవుని యొక్క శరీర రక్తములు. స్వయముగా దేవుడే ప్రజల యొక్క హృదయంలోకి వేంచేస్తారు. చాలామంది పునీతులు దివ్య సత్ప్రసాదం యొక్క ఔన్నత్యం గురించి తెలియజేశారు. పునీత మదర్ తెరిసా గారు నేను ఇంతటి గొప్ప సేవ చేస్తున్నాను అంటే దానికి కారణము దివ్య సత్ప్రసాద నాధుడు నాకు శక్తిని ఇస్తున్నారు అని పలికారు. 
పునీత మరియా జాన్ వియాని గారు దివ్యసప్రసాదం గురించి తెలిపే సందర్భంలో ఈ విధంగా అంటున్నారు దివ్యసప్రసాదం స్వీకరించిన వ్యక్తి ఒక నీటి చలమ దగ్గర ఉండి ఆ నీటిని తనలోకి తీసుకోలేకుండా దాహంతో మరణించినవారి లాంటి వారు.
పునీత సిరిల్ గారు దివ్య సత్ప్రసాదం గురించి ఈ విధంగా అంటున్నారు దివ్య సత్ప్రసాదములో ఉన్న సజీవుడైన యేసును స్వీకరించిన వ్యక్తి సజీవుడుగా మారతాడు. 
పునీత్ అగస్టీను గారు అంటారు, దివ్య సత్ప్రసాదమును స్వీకరించిన వ్యక్తి క్రీస్తు వలే రూపాంతరం చెందుతారు. క్రీస్తు ప్రభువు యొక్క జీవితమే మన జీవితంగా మారుతుంది. పునీత పౌలు గారు పలికిన విధంగా ఇక నేను కాదు జీవించేది నాలో ఉన్న క్రీస్తే జీవిస్తారు (గలతి 2:20) అని అన్నట్టుగా మన జీవితం మారాలి. ఆయన వలే ప్రేమించాలి, ఆయన వలే క్షమించాలి, ఆయన వలె సహాయం చేయాలి ఇంకా ఆయన వలే మంచి లక్షణములు కలిగి జీవించాలి అప్పుడే మనందరం కూడా క్రీస్తు ప్రభువు వలే రూపాంతరం చెందిన వారంగా పిలవబడతాం.
దివ్యసత్రసాదం మనకు బలమును, జీవమును, అనుగ్రహమును దయ చేస్తుంది. దివ్య సత్ప్రసాదములో ఉన్న ఏసుప్రభు మనందరినీ ఆయన యొక్క శరీర రక్తములను భుజించమని తెలిపారు. యోహాను సువార్త 6:53 ఆయన యొక్క శరీర రక్తమును భుజించిన ఎడల మనలో జీవము ఉంటుంది అని తెలియజేశారు. అదేవిధంగా ప్రభువు శరీర రక్తములను స్వీకరించుట ద్వారా మన యందు దేవుడు దేవునియందు మనం ఐక్యమై జీవిస్తాము. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఆకాశము నుండి మన్నాను భుజించిరి కానీ వారు మరణించిరి కానీ ఏసుప్రభు తన యొక్క శరీర రక్తములను వసగుట ద్వారా వాటిని స్వీకరించిన మనము నిత్యము ప్రభువు నందు జీవిస్తాము.
ఇజ్రాయిల్ ప్రజలు మన్నా భుజించారు ఆ మన్నా కొలది కాలం మాత్రమే వారితో ఉన్నది కానీ ఏసుప్రభు ఇచ్చిన శరీర రక్తములు మనతో శాశ్వతంగా ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు మన్నాను భుజించి మరణించింరి కానీ ఆయన శరీర రక్తములు భుజించిన మనం నిత్యము జీవిస్తాము.
దివ్యసప్రసాదము ద్వారా క్రీస్తు తన యొక్క జీవితాన్ని మనందరికీ కూడా త్యాగం చేశారు మరి మనము కూడా మన యొక్క జీవితంలో త్యాగం చేస్తూ ఇతరులకు సంతోషమును దయచేయాలి. 
దివ్య సత్ప్రసాదం దేవుని యొక్క ప్రేమకు గుర్తు కాబట్టి మనము కూడా ప్రేమతో జీవించాలి. 
దివ్యసప్రసాదం ఐక్యతకు గురుతు కాబట్టి మనము కూడా ఐక్యంగా జీవించాలి.
Fr. Bala Yesu OCD

17వ సామాన్య ఆదివారం

2 రాజుల 4: 42-44, ఎఫేసి 4:1-6, యోహాను 6:1-15 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల యొక్క ఆకలిని సంతృప్తి పరచు విధానం గురించి తెలుపుచున్...