4, మే 2025, ఆదివారం

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29 

మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్లలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుటకు చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలముచెంతకు తిబెరియానుండి కొన్ని పడవలువచ్చెను. అక్కడ యేసుగాని, శిష్యులుగాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు" అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను వేరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు, దేవుడు పంపినవానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది"  అని చెప్పెను. 

ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును అన్వేషించడం మరియు ఎటువంటి పరిస్థితులలో మనం యేసు ప్రభువును అన్వేషిస్తున్నాము , ఎప్పుడు ఆయనను అన్వేశించాలి , శాశ్వతమైనది ఏమిటి అని తెలుసుకొని దాని కోసమై అన్వేషించాలి అని సువిశేషం వివరిస్తుంది. 

దేవుని కోసం వెదకుట 

ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును వెదకుచు అనేక మంది వస్తున్నారు. వారు ఎందుకు యేసు ప్రభువును అన్వేషిస్తున్నారు ఆంటే అంతకు ముందు రోజు ప్రభువు వారి ఆకలిని తీర్చారు. కేవలం ఐదు రొట్టెలతో 5000 మందికి ఆహారమును ఇచ్చాడు. ఇతనిని అనుసరిస్తే మాకు కావలసిన ఆహరం దొరుకుతుంది అని వారు ఆయన కోసం వెతుకుచున్నారు. అంతకు ముందు వారిలో కొంతమంది వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులను చేసాడు. ఇతనిని అనుసరిస్తే మాకు ఎటువంటి అనారోగ్యం ఉండదు అని ఆయన కోసం వెదకుచుండవచ్చు. యేసు ప్రభువు చెప్పే మాటలు ఎలా సాధ్యం అని తెలుసుకొనుటకు, ఆయనను అడుగుటకు వారిలో ఉన్న కొన్ని సందేహాలు తీర్చుకొనుటకు ప్రభువును వెదుకుచుండవచ్చు.  ప్రభువు దేవాలయములో ఉన్న వ్యాపారులను పంపిచివేస్తున్నారు  కనుక అనేక మంది దేవుని ఆలయంలోవెళ్ళుటకు ఆవకాశం ఇచ్చాడు కనుక ఇంకా వారి అవసరాలను చెప్పుకొనుటకు ప్రభువును వెదకుచు ఉండవచ్చు. ఇతను రాజు అయితే మాకు అన్ని సమకూరుతాయి అని ప్రభువును వెదకుచు ఉండవచ్చు.  అందుకే ప్రభువు వారితో అంటున్నారు  "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు" అని అంటే మనం ప్రభువును వెదకవలసినది, అద్భుతాలు చూడాలనో, ఆహారం కోసమో కాదు. ఆయన అంతకంటే చాలా గొప్పవి ఇచ్చేటువంటి ప్రభువు. ప్రభువు తానె జీవ జలము అనే చెబుతున్నాడు. నేను ఇచ్చే జలమును త్రాగితే మరల దప్పిక కలుగదు అని చెబుతున్నాడు. నేను జీవాహారము అని చెబుతున్నాడు. నన్ను భుజించువాడు ఎన్నటిని మరణింపడు అని చెబుతున్నాడు. ప్రభువు మనకు శాశ్వతమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, వాటిని ఎలా పొందాలో అన్వేషించమంటున్నాడు, వాని కోసము పనిచేయమంటున్నాడు. దేవున్ని వెదకడం అంటే నిత్య జీవమును వెదకటం. అందుకే ప్రభువు చెబుతున్నాడు నేనే జీవమును అని. 

శాశ్వతమైనది- అశాశ్వతమైనది

ఇక్కడ యేసు ప్రభువు తనకోసం వచ్చిన వారితో "అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు." అని చెబుతున్నాడు.  యేసు ప్రభువు తన అనుచరులకు ఈలోక విషయములు అశాశ్వతమైనవి అని, శారీరక విషయాలు, అవసరాలు, సంపదలు  అశాశ్వతమైనవి అని చెబుతున్నాడు. అందుకే ఈలోక సంపదలు కాక పరలోక సంపదలు కూడపెట్టుకోమని చెబుతారు. "ఈలోక సంపదలు కూడపెట్టుకొనవలదు. చెదపురుగులు, త్రుప్పు వానిని తినివేయును." "నీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వానిని చెదపురుగులు, త్రుప్పు తినివేయవు." ఈనాటి సువిశేషంలో మాత్రం ప్రభువు మనలను శాశ్వత భోజనముకై శ్రమించమని చెబుతున్నారు. నిజానికి చాలా మంది పేరు ప్రఖ్యాతలు కోసం శ్రమిస్తుంటారు. అవికూడా శాశ్వతం కాదు. అప్పుడు ఏమిటి శాశ్వతమైనవి ఏమిటి అంటే  పరలోక రాజ్యము, నిత్య జీవము ఇవి మనకు శాశ్వతమైనవి. 

శాశ్వతమైనవి అయితే అవి మనకు ఎవరు ఇస్తారు 

యేసు ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారితో ఆయన "మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును." అని చెబుతున్నాడు. ప్రభువు మాత్రమే దానిని ప్రసాదించగలరు. ఎందుకంటే ఆయనకు మాత్రమే అది ప్రసాదించే అధికారం ఉన్నది. శాశ్వతమైనవి దైవికమైనవని వారికి అర్ధం అయ్యింది. కనుక వారు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయాలని అడుగుతున్నారు. అందుకు యేసు ప్రభువు దేవుడు పంపిన వానిని విశ్వసించండి అదే దేవుడు మీ నుండి కోరుకుంటున్నారు అని చెబుతున్నాడు. నిత్య జీవం కావాలంటే లేక శాశ్వతమైన ఆహారం కావాలంటే చేయవలసినది యేసు ప్రభువును విశ్వసించడం. యేసు ప్రభువును విశ్వసించడం అంటే ఆయన చెప్పినట్లు మారుమనస్సు పొంది,  ఆయన ఆజ్ఞలను పాటించడం. అప్పుడు మనం ఆ నిత్య జీవానికి అర్హులము అవుతాము. 

ప్రార్ధన: ప్రభువా!  మా జీవితాలలో అనేక విషయాలలో మీ సహకారం కోసం మిమ్ములను ఆశ్రయిస్తున్నాము. అనేక సార్లు మేము మిమ్ములను మా భౌతిక అవసరములనే కోరుకుంటున్నాము. మేము ఏమి కోరుకోవాలో నేర్పించండి. మీరు చెప్పినట్లుగా శాశ్వతమైన వాటిని వెదకుచు, వాని కొరకు పాటుపడేలా మమ్ము మార్చండి. నిత్య జీవితం మీద ఆశ కలిగి, మిమ్ములను విశ్వసించి, మీ ఆజ్ఞలకు అనుకూలంగా జీవించేలా మమ్ము మార్చండి. ఆమెన్ 


30, ఏప్రిల్ 2025, బుధవారం

దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు?

 దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు? 

యోహాను 3: 16-21 

దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు  ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై  అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన, దేవుని ఏకైక  కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు. ఆ తీర్పు ఏమన, లోకమున వెలుగు అవతరించినది. కాని మనుష్యులు దుష్క్రియలు చేయుచు, వెలుగు కంటె చీకటినే ఎక్కువగ ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు. కాని, సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగ చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును" అని సమాధానమిచ్చెను. 

ఈ వాక్యాలు దేవుడు ఎంతగా ఈ లోకమును ప్రేమించినది, అదేవిధంగా మానవుడు నాశనము చెందకుండా తన కుమారుణ్ణి పంపిన విషయం, ఆ కుమారుణ్ణి విస్వసించుట ద్వారా వారు నిత్యజీవము పొందుతారని, ప్రభువు లోకమునకు వెలుగుగా వచ్చారని దుష్క్రియలు చేసేవారు, ఆ వెలుగు దగ్గరకు వచ్చుటకు ఇష్టపడక అవి బయట పడతాయి చీకటిలోనే ఉన్నాడు. సత్యవర్తనుడు వెలుగును సమీపిస్తున్నాడు. జీవితాన్ని మార్చుకుంటున్నాడు అని తెలియజేస్తున్నాయి.  

దైవ ప్రేమ 

దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని  రక్షించడానికి తన కుమారుడిని ఈలోకానికి పంపాడు. కుమారుడు తన తండ్రి సంకల్పమైన లోక రక్షణము నెరవేర్చడానికి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు.  దేవుని కుమారుడు తన తండ్రి చిత్తాన్ని పూర్తి చేసి అంత సమాప్తం అయినది అని చెప్పాడు. ఆయనను కలుసుకున్న, వినిన , చూసిన ప్రతివాడు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణను సిమియోను  ప్రవక్త వలే చూసారు. ఆయనను విశ్వసించిన వారు రక్షణ పొందుతున్నారు. 

దేవుడు లోకాన్ని ఖండించడానికి  తన కుమారున్ని పంపలేదు 

దేవుడ సృష్టి ఆరంభం నుండి మానవున్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నడు విడనాడలేదు. దేవుడు ఎప్పుడు పాపి మరణించాలని, లేక నాశనం కావాలని కోరుకొనలేదు. ఆయన మానవుణ్ణి సన్మార్గంలో పెట్టదలచి క్రమ పద్దతిలో పెట్టగ దేవుడు శిక్షించినట్లుగా అనుకున్నాడు. దేవున్ని ఒక కఠిన యజమానిగా చూసాడు కాని దేవుని ప్రేమను,  తండ్రి వాత్స్యాల్యాన్ని అర్ధం చేసుకోలేదు.  అనేక సార్లు దేవుడు తన రాయబారులను పంపాడు. కాని మానవుడు దేవుడు పంపిన వారిని లెక్క చేయలేదు. తరువాత తన కుమారుణ్ణి పంపుతున్నారు. ఈ లోకాన్ని నాశనం చేయక తన కుమారుని జీవితం ద్వారా, మనకు ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు, తన మరణం ద్వారా మనకు పాపములను క్షమిస్తున్నారు. తన మీద విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం పొందే అనుగ్రహం ఇస్తున్నాడు. 

విశ్వాసం యొక్క ప్రాముఖ్యత 

రక్షణ యేసు ప్రభువును విశ్వసించడం వలన వస్తుంది. యోహాను ఈ విషయాన్ని తన సువిశేషంలో చాలా సార్లు లిఖించడం జరిగింది. ప్రతి అధ్యాయంలో విశ్వాసం గురించి చెబుతూ, సువిశేష  ఆరంభంలో, మధ్యలో మరియు చివరిలో యేసు ప్రభువును విశ్వసించడం వలన నిత్య జీవం వస్తుంది అని ప్రకటిస్తున్నారు. క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. ప్రభువు కొన్ని సందర్భాలలో ఇది నీవు విశ్వసిస్తున్నావా? అని అడుగుతున్నారు. వారు స్వస్తత పొందిన తరువాత మీ విశ్వాసమే మిమ్ములను స్వస్థపరిచింది అని అంటున్నారు.  ప్రభువుని యందు మనకు విశ్వాసము ఉండటం వలన నిత్యజీవమే కాక ఈ లోకములో అనేక విషయాల్లో విజయాన్ని పొందుతాము.  

వెలుగు- చీకటి  

యేసు ప్రభువు నేనే లోకమునకు వెలుగును అని ప్రకటించాడు. యోహాను సువిశేషంలో మొదటి అధ్యాయంలో ఆయన ఈ లోకమునకు వెలుగాయను అని వింటాము. ప్రభువు దగ్గరకు నీకొదేము చీకటి వేళలో వస్తున్నాడు. అతను చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు.  కాని చీకట్లో ఉన్నవారు వెలుగు దగ్గరకు రావడానికి ఇష్టపడటలేదు. వెలుగు దగ్గరకు వస్తే వారి ఎటువంటి వారు అనేది, లేక వారి జీవితం అందరికి తెలిసిపోతుంది అని భయపడేవారు. కాని ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే వారు చేసిన తప్పులు ఏమి అందరికి తెలుస్తాయి అని భయపడనవసరం లేదు. ప్రభువు దగ్గరకు వచ్చే  సమయంలో ఆ వెలుగులో మనలో వున్న చేడు, మలినం లేక తొలగిపోతుంది. ప్రభువు నీకొదేము వచ్చినపుడు తాను చీకటిలో వచ్చిన, ప్రభువు దగ్గర ఉండటం వలన తనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడు. కాని ఎవరు అయితే చెడు పనులు చేస్తున్నారో, ప్రభువు దగ్గరకు రావడానికి ఇష్టపడటం లేదో వారు చెడునే ప్రేమిస్తున్నారు. వారు మారటానికి ఇష్టపడటం లేదు. వారి పనులు ఎవరికీ తెలియకూడదు అని  వారు వెలుగును సమీపించడం లేదు. ప్రభువు దగ్గరకు రాకపోతే, మనలో ఉన్న ఆ చెడు ఎప్పటికి వెళ్లిపోదు. దాని ద్వారా ప్రభువు మనకు ఇచ్చే ఆ రక్షణ పొందలేము. సత్య వర్తనము కలిగి జీవించడము అనేది చాలా ముఖ్యము. అప్పుడు మనం చేసే పనులు దేవునికి ఇష్టమవుతాయి. 

ప్రార్ధన: ప్రభువా ! మీరు లోకమును ఎంతగానో ప్రేమించి మీ ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకమునకు దానిని రక్షించుటకు పంపారు. ఆయనను విశ్వసించిన వారంతా నిత్యజీవం పొందుటకు మీరు అటుల చేశారు. ప్రభువా మిమ్ములను మీ కుమారుణ్ణి మేము విశ్వసిస్తున్నాము. కొన్ని సార్లు వెలుగైన మీ కుమారుని దగ్గరకు రావడానికి మేము భయబడ్డాము. ఆ వెలుగులో నా పాపము ఎక్కడ బయటపడుతుందో అని సందేహించాము. కాని ప్రభువా! ఆ వెలుగు మా లోని పాపమును దహించివేసి మమ్ములను పరిశుద్దులనుగా చేస్తుంది అని మరిచిపోయాము. అటువంటి సందర్భంలో మమ్ములను క్షమించండి. మేము మీ  దగ్గరకు వచ్చి ఎల్లప్పుడు వద్ద ఉంటూ, మిమ్ము విశ్వసించి మీరు ఏర్పాటు చేసిన రక్షణ పొందేలా మమ్ము దీవించండి .ఆమెన్ 

28, ఏప్రిల్ 2025, సోమవారం

నూతనంగా జన్మించుట

 యోహాను 3: 7-15

నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పిన్నందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. "ఇది ఎటుల సాధ్యమగును?" అని నికోదేము అడిగెను. అందులకు యేసు: "నీవు యిస్రాయేలు బోధకుడవైయుండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన మీరు నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. "మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్తబడవలెను. 

నూతన జీవితం - క్రీస్తు ఎత్తబడటం 

ఈ సువిశేష భాగంలో నూతన జీవితం ఎలా మొదలవుతుంది, దానికి ఏమి చేయాలి అని మరియు ఏవిధంగా క్రీస్తు మోషే కంచు సర్పమును ఎత్తినట్లు ఎత్తబడతాడు అనే విషయాలను మనము చూస్తాము. యేసు ప్రభువు నికోదేముకు ఎలా ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి అని చెబుతున్నాడు. అటులనే ఈ నూతన జీవితం పొందేవాడు నిత్యజీవానికి అర్హుడు అవుతాడు, ప్రభువు అందుకుగాను వారి కొరకై సిలువ మీదకు ఎత్తబడతాడు, ప్రభువుని సిలువ మరణం మానవునికి ఈ నిత్య జీవమును ఇచ్చుటకే అనే విషయం స్పష్టము అవుతుంది. 

ఎందుకు మరల జన్మించాలి ? 

యేసు ప్రభువు  ఈ లోకంలో ఉండగా దేవుని రాజ్యం యొక్క గొప్ప తనాన్ని అందరికి ప్రకటించారు. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఒక వ్యక్తి దేనినైన కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడు కాని ఆ రాజ్యం కావాలనికోరుకుంటాడు. దేవుని రాజ్యం అంటే అంతటి గొప్పది కనుక యేసు ప్రభువు చెప్పిన అనేక ఉపమానాలలో దాని విలువ తెలిసిన  వ్యక్తులు,  ఏమి కోల్పోయిన దానిని పొందుటకు ప్రయత్నిస్తారు. దేవుని  రాజ్యంలో ప్రవేశించడానికి ప్రధానమైన అర్హత నూతన జన్మను పొందాలి అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ఈ నూతన జన్మ ముఖ్యమైనది. మానవుడు తన సొంత బలం ద్వారా ఈ నూతన జన్మను పొందలేడు, జీవించలేడు. దేవుని తోడ్పాటు ఎంతగానో అవసరం ఉంటుంది. ఇది పూర్తిగా హృదయ పరివర్తనతోనే మొదలవుతుంది, అందుకే ప్రభువు తన పరిచర్యలు మొదట హృదయ పరివర్తన పొందాలి అని చెబుతున్నారు. 

ఆత్మతో జన్మించువారు 

ఆత్మతో జన్మించువారిని ప్రభువు గాలితో పోల్చుతున్నారు. గాలి  ఎక్కడ నుండి వస్తుందో, ఎక్కడకు వెళుతుందో మనకు తెలియదు, అటులనే ఆత్మతో జన్మించువారు, లేక నూతన జన్మ పొందిన వారు, మారు మనసు పొందినవారు ఎలా ఉంటారో మనము చూస్తాము. వారి జీవితాల్లో ఉన్న మార్పు, వారి పరివర్తన మనకు కనపడుతునే ఉంటుంది, అంటే మనం ఆత్మను చూడము కానీ వారి జీవితంలో వచ్చే మార్పును బట్టి వారు నూతన జీవితం జీవిస్తున్నారు అని తెలుసుకొనవచ్చు. మగ్దలా మరియ, పౌలు వారి జీవితాలలో వచ్చిన మార్పును, జక్కయ్య జీవితంలో వచ్చిన మార్పును మనం చూసినప్పుడు వారు, హృదయ పరివర్తన చెందారు అని , నూతన జీవితం వారు జీవిస్తున్నారు అని మనము తెలుసుకుంటాము. ఆత్మ ద్వారా జన్మించిన వారి జీవితాలలో కూడా ఈ మార్పును మనం చూడవచ్చు. ఆత్మ ఫలాలు వారి జీవితాల్లో సుష్పష్టంగా కనిపిస్తాయి.  వారు పాపమునకు బానిసలుగా కాక స్వతంత్రంగా జీవిస్తారు. 

యేసు ప్రభువు ఎదుట నికోదేము సందేహంను వేలిబుచ్చుట 

యేసు ప్రభువు ఆత్మ వలన జన్మించుటకు గురించి చెప్పిన తరువాత నీకొదేము ఇది ఎలా సాధ్యము అని అడుగుతున్నాడు. ప్రభువు అతనికి అది క్రొత్త విషయము ఏమి కాదు అని తెలియజేస్తూనే, నీవు బోధకుడివి కదా! ఈ విషయం తెలియదా అని అడుగుచున్నాడు. పాత నిబంధనలలో కూడా మనం మారు మనస్సు గురించి వింటాము. మరి ఎందుకు వీరు అవి ఏమి తెలియక ఉన్నారు అంటే వారు ఎప్పుడు ఈ లోక విషయాలు, మరియు స్వార్ధ పూరిత ఆలోచనలతో ఉన్నారు. కానుక అనేక దైవ విషయాలు, దైవ జ్ఞానం గురించి అజ్ఞానములో ఉన్నారు. దైవ జ్ఞానము కోసం మనము ఎంతగానో శ్రమించాలి.  ఆయనను వేదకాలి అటువంటి  వారికి ప్రభువు ఆ జ్ఞానమును ఇస్తారు. 

పరలోక విషయాల గురించి యేసు ప్రభువు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఆయన మాత్రమే పరలోకం నుండి వచ్చినవారు. ఆయనే చెప్పేవి మాత్రమే ప్రామాణికం, అటువంటి వాటి గురించి జ్ఞానము కావాలి అంటే ప్రభువుని మాటలను వినాలి. ప్రభువును విశ్వసించాలి, ప్రభువు చెప్పినట్లు చేయాలి. కాని అనేక సార్లు ప్రభువుని మాటలను మనం పెడచెవిన పెట్టి పరలోక జ్ఞానమును పోగొట్టుకుంటున్నాము. నికోదేముతో ప్రభువు అంటున్నారు మేము చూచిన విషయాలను చెప్పిన మీరు నమ్ముటలేదు అని. అంటే మనం కొన్ని సార్లు ఎంతో కరుడుగట్టిన హృదయాలు కలిగిన వారిగా ఉంటున్నాము. ప్రభువు మాత్రమే పరలోకము నుండి వచ్చినవాడు మరియు తిరిగి పరలోకమునకు వెళ్లినవాడు. ఆయనకు పోయిన చోటుకు వెళ్ళుటకు ఆయనను మాత్రమే అనుసరించాలి. 

యేసు ప్రభువు ఎత్తుబడుట 

పాత నిబంధనలో దేవునికి మాటకు ఎదురుతిరిగిన వారు పాము కాటుకు గురయ్యి మరణిస్తుంటే, మోషే దేవునికి మొరపెట్టగా, వారిని  రక్షించుటకు మోషేతో దేవుడు ఒక కంచు సర్పము తయారు చేసి దానిని చూచిన వారు రక్షించబడ్డారు. అటులనే పాపం చేసిన మానవుని రక్షించడానికి ప్రభువు సిలువ మీద మరణించారు. ఇది ప్రభువును విశ్వసించువారు అందరు నిత్య జీవం పొందుటకు ఆయన సిలువ మీద మరణించారు. మనందరికీ  ఆయన నిత్య జీవాన్ని సాధ్యం చేశారు. 

ప్రార్ధన: ప్రభువా! మీరు నికోదేముతో మరల జన్మించుట యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ప్రభువా మీ మాటలు విని అనేక మంది పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుటకు దేనిని కోల్పోవడానికి అయినా సిద్ధపడ్డారు. నేను కూడా నా జీవితాన్ని మార్చుకొని, నూతన హృదయం కలిగి జీవించి, మిమ్ములను అనుసరించి మీరు నా కోసం మరణించి, నాకు సాధ్యం చేసిన ఆ నిత్యజీవాన్ని పొందే అనుగ్రహం చేయండి. ఆమెన్ 

27, ఏప్రిల్ 2025, ఆదివారం

నీటివలన ఆత్మ వలన నూతన జీవం


యోహాను 3:1-8


పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒకరాత్రి యేసు వద్దకు వచ్చి "బోధకుడా! నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయన, దేవునితోడు లేనియెడల నీవు చేయుచున్న అద్భుత సూచకక్రియలను ఎవడును చేయలేడు" అని పలికెను. యేసు అందుకు అతనితో, "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అని పలికెను అందుకు నికోదేము, "వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింపగలడు? అతడు తల్లిగర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా?" అని అడిగెను. అపుడు యేసు,"ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననేతప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరములముగ జన్మించినది శరీరమును, ఆత్మమూలముగ జన్మించినది ఆత్మయునైయున్నది. నీవు మరల జన్మింపవలయునని  నేను  చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. 

వెలుగు దగ్గరకు వచ్చుట 

  
యేసు ప్రభువు వద్దకు నికోదేము రాత్రి వేళ వస్తున్నాడు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే నికోదేము ఒక పరిసయ్యుడు, మరియు బోధకుడు. ఒక బోధకుడు మరియు పరిసయ్యుడు అయిన వ్యక్తి యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నారు అంటే బోధకులు మరియు పరిసయ్యులు అతనిని తక్కువ చేసి చూడవచ్చు, లేక ప్రభువుతో మాటలాడి ఆయనను అంగీకరిస్తే ఖచ్చితముగా నికోదేము ఇతర వారితో అవమానింప బడవచ్చు. అందుకే కాబోలు నికోదేము ఎవరి కంట పడకుండ రాత్రి వేళ వచ్చి ఆతనికి ప్రభువు చెప్పేదేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలని వచ్చి ఉండవచ్చు. ఇక్కడ రాత్రి వేళ ప్రభువు దగ్గరకు రావడం అంటే చీకటి నుండి వెలుగు దగ్గరకు రావడం. ప్రభువు అనేక సార్లు నేనే వెలుగు అని చెబుతారు. ఇప్పుడు నికోదేము చీకటిని వదలి వెలుగు దగ్గరకు వచ్చి తనలో ఉన్న అంధకారాన్ని మొత్తంను వెలుగుతో నింపుకొనుటకు అవకాశము వచ్చి నందున దానిని పూర్తిగా వినియోగించుకొంటున్నాడు. తనలో ఉన్న ప్రతి అనుమానాన్ని ప్రభువు ముందు వెల్లడిచేస్తున్నాడు. 

ప్రభువు గొప్పతనాన్ని  ఒప్పుకొనుట 


నికోదేము స్వయంగా బోధకుడు కనుక అతనికి దేవుని గురించి దైవ జ్ఞానము గురించి అవగాహన ఉంది. యేసు ప్రభువు మాటలు విన్నప్పుడు అతనిలో ఉన్న దైవ అన్వేషణ, ప్రభువు వద్ద నుండి ఇంకా  దేవుడిని గురించి తెలుసుకోవాలనే కోరిక ఎక్కువ అయ్యింది. ప్రభువు ఎక్కువగా దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నారు. మానవుడు ఏమి హెచ్చించి అయ్యిన ఆ దైవ రాజ్యం పొందాలనే కోరిక ఎక్కువైంది, మరియు తనలో ఉన్న కొన్ని అనుమానాలు కూడా తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చి బోధకుడా నీకు దేవుని నుండి వచ్చిన వాడివని మాకు తెలుసు, లేనిదే ఈ అద్భుత కార్యములు ఎవరు చేయలేరు అని చెబుతున్నారు. ఎందుకంటే ప్రభువు చేచేసిన అద్భుతాలు సాధారణమయినవి కావు.  ఆయన పకృతి మీద, లోకం మీద జీవరాశుల మీద తన ఆధిపత్యాన్నే కాక ఎలా ఒక దానిని సహజ సిద్ద స్వభావాలు కూడా మార్చ గలిగాడో తెలుసుకున్నాడు. కనుకనే ఎవరు దేవుని నుండి రాకపోతే మీలా చేయజాలరు అని ప్రకటిస్తున్నాడు. 


నీటివలన ఆత్మవలన పుట్టుట 


యేసు ప్రభువును నికోదేము నీవు దేవుని నుండి వచ్చావు అని ప్రకటించిన తరువాత ప్రభువు నీకొదేముతో ఏ విధంగా  దేవుణ్ణి చేరవచ్చు, అతనితో ఉండవచ్చు, అతనిని పొందవచ్చు అనే విషయాన్ని ప్రకటిస్తున్నాడు. అది ఎలా అంటే "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అని ప్రభువు పలుకుతున్నాడు. దానికి నీకొదేము మరల జన్మించడము అంటే తల్లి గర్భంలోనికి ప్రవేశించి పుట్టడం ఎలా అని అనుకుంటున్నాడు. దానికి ప్రభువు మనిషి మరల జన్మించడం అంటే నీటి వలన ఆత్మ వలన అని చెబుతున్నాడు. నీరు పరిశుద్దతను సూచిస్తుంది. మనిషి తన మలినాన్ని కడుగుకొనవలెను అని చెబుతుంది. ఇది జ్ఞానస్నానమును సూచిస్తుంది. అందుకే ప్రభువు తన శిష్యులతో మీరు వెళ్లి పిత, పుత్ర, పవిత్రాత్మ పేరిట జ్ఞానస్నానము ఇవ్వమని చెబుతున్నారు. ఆత్మ జీవాన్ని ఇస్తుంది, జీవాన్ని నిలుపుతుంది. దేవుని ఆత్మ మాత్రమే మనకు  నూతన జీవితాన్ని ఎప్పుడు పడిపోకుండా ఉంచుతుంది.  

ఆత్మను గుర్తించగలుగుట 


ఆత్మను ప్రభువు గాలితో  పోల్చుతున్నాడు. గాలిని మనం అనుభవించగలము కాని అది ఎక్కడ నుండి వస్తున్నదో, ఎక్కడకు వెళ్తుందో మనకు తెలియదు అటులనే ఆత్మ నుండి పుట్టినవాని జీవితంలో వచ్చిన మార్పును మనము గుర్తించగలం, ఎందుకంటే వారి జీవితం అంతలా మారిపోతుంది. మనము కూడా ప్రభువు చెబుతున్న ఆ దేవుని రాజ్యంలో చేరుటకు, మరల జన్మించుటకు బాప్తిస్మము పొందియున్నాము. నూతన జీవితము జీవించుటకు ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. 

ప్రార్ధన: ప్రభువా ! మీ వద్దకు రావడం అంటే వెలుగు దగ్గరకు రావడమే, జీవం వద్దకు రావడమే, మీజీవితంలో అనేక అంధకార శక్తులు ఉన్నవి వాటి అన్నింటిని వదలి మీ దగ్గరకు రావడానికి, మరియు మీరు చెబుతున్న ఆ దైవ రాజ్యంలో స్థానము పొందుటకు సహాయం చేయండి. నిజమైన సంపదను తెలుసుకొని, దాని కోసం పాటుపడేలా చేయండి. జ్ఞానస్నానం పొందిన మీ అనుచరులుగా జీవించ శక్తిని దయచేయండి. ఆమెన్ 





26, ఏప్రిల్ 2025, శనివారం

యేసు ప్రభువు దర్శనములు

మార్కు 16: 9-15

ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్తానుడైన యేసు, తాను ఏడూ దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్లి ఆయనతో  ఉండినవారును, దుఃఖసాగరంలో మునిగియున్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందచేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు, ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్లుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు ఇద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై, సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ  నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యముకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు.   

ఈ వచనాలు యేసు ప్రభువు పునరుత్థానము నిద్ధారణము మరియు శిష్యులకు ఓదార్పును తెలియజేస్తూ, వారు చేయవలనసిన కర్తవ్యము గురించి తెలియజేస్తున్నాయి. ఈ దర్శనములు వారిలో ఉన్న అపనమ్మకమును తీసివేయుటకు ఆయన సువార్తను బోధించుటకు వారిని మరల ప్రభువు ప్రోత్సహిస్తున్నాడు. 

మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను

యేసు ప్రభువు మొదటగా ఒక స్త్రీకి దర్శనము ఇస్తున్నాడు. యూదయ సమాజంలో, మరియు యేసు ప్రభువు కాలములో ఒక స్త్రీకి సమాజంలో అంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు. మరియు ఈ మరియమ్మ నుండి ప్రభువు దయ్యములను వదలకొట్టాడు. ప్రభువు మనకు దర్శనము ఇవ్వడడానికి మన గత జీవితం ఏమిటి? మనకు సమాజం ఇచ్చే ప్రాముఖ్యత ఏమిటి? అనేవి ఏమి ప్రభువు పరిశీలించరు. మనకు ప్రభువు మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగిఉంటే చాలు. ఆయన మనము మరచిపోలేని మేలులను మనకు చేస్తారు. అంతేకాక మనలను ప్రత్యేక వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అనేక మందికి ఆదర్శవంతులుగా తయారుచేస్తారు. ఈ మరియమ్మ అనేక బంధనాలనుండి విముక్తి పొందింది. ప్రభువు మాటలకు అణువుగా మనం ఉంటే మన జీవితం కూడా ఎటువంటి లోక శక్తులకు బానిసలు కాకుండా ఎల్లప్పుడు స్వతంత్రులుగా జీవించగలుగుతాం. 

ప్రభువు దర్శనం గురించి నమ్మక పోవుట 

దుఃఖంలో ఉన్న శిష్యులకు ప్రభువు ఓదార్పు ఇవ్వడానికి ఎంతగానో వారికి అనేక పర్యాయాలు కనబడుతున్నప్పటికీ శిష్యులు నమ్మలేదు. వారికి నమ్మకము కలుగక పోవడానికి కారణం పకృతి విరుద్ధంగా ఉన్న మరణం నుండి లేవడం అనేది నమ్మదగినదిగ లేకపోవడం. అంతేకాక ప్రభువే ఇటువంటివి చేశారు. ఆయనే మరణించిన తరువాత ఎవరు అలా చేయగలరు? అనేక ప్రశ్నలు వారిలో ఉన్నవి. వీరిలో ఉన్న ఈ భయాలు మరియు యేసు ప్రభువు చెప్పిన మాటలు నేను మూడవ రోజున తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలు ఆసరాగా తీసుకొని ఎవరైన పుకార్లు పుట్టిస్తున్నారు అనే అనుమానాలు ఇవాన్నీ శిష్యులలో ఉండవచ్చు అందుకే వారు అన్నింటిని నమ్మలేని పరిస్థితుల్లో లేరు. 

 ఇద్దరు శిష్యులకు దర్శనం 

యేసు ప్రభువు గ్రామమునకు వెళుతున్న ఇద్దరు శిష్యులకు దర్శనం ఇస్తున్నారు. లూకా సువిశేషంలో ఎమ్మావు వెళుతున్న ఇద్దరు శిష్యులు అని మనం చదువుతాం. ప్రభువు వారితో మాట్లాడుతున్న సమయంలో వారు ప్రభువును గుర్తించలేకపోయారు. తరువాత రొట్టెను విరిచి ఇస్తున్నప్పుడు వారు ప్రభువును గుర్తించారు. అనేక సార్లు ప్రభువు మనతో ఉన్నప్పుడు మనము ప్రభువును గుర్తించలేపోతున్నాము కారణము కేవలం ప్రభువుకు సంబంధించిన విషయాలలో మనం ప్రేక్షకులుగా మాత్రమే ఉంటున్నాము. ప్రభువుతో వ్యక్తిగతంగా సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఇద్దరు శిష్యులు కూడా ప్రభువు వారికి దర్శనము ఇచ్చిన విషయం గురించి ఇతర శిష్యులకు చెప్పినప్పుడు వారు నమ్మలేదు.  శిష్యులు ఏక్కువ నమ్మనది వారికి స్వయంగా  ప్రభువు ఇచ్చిన దర్శనమును. వారు స్వయనుభవంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రభువు మాత్రము మనకు ఇతరుల సాక్ష్యంను కూడా నమ్మమని చెబుతున్నారు. 

ప్రభువుని సందేశం 

యేసు ప్రభువు పదకొండు మంది శిష్యులకు దర్శనము ఇచ్చి వారి అవిశ్వాసమును ఖండించారు. యేసు ప్రభువు వారి హృదయ కాఠిన్యము, అవిశ్వాసమును  గద్దించారు. హృదయ కాఠిన్యము చాల మందిలో పెరుగుతున్నది. హృదయ కాఠిన్యము పెరిగినప్పుడు మనము దేనికి స్పందించము. ఇతరుల అవసరములలో ఉన్న , కష్టాలలో ఉన్నా నాకు ఎందుకులే? అనే ధోరణిలో ఉంటాము.  క్రీస్తు అనుచరులలో ఉండకూడనిది ఈ హృదయ కాఠిన్యము.  అందుకే దేవుడు యిస్రాయేలుకు వారి రాతి గుండెను తీసి మాంసంతో కూడిన హృదయము వారికి ఇస్తాను అని చెప్పినది. క్రైస్తవుల హృదయం ఎప్పుడు ప్రభువు వలె ఇతరుల జీవితాలు చూసినప్పుడు వారి సమస్యలు , లేక సౌఖ్యాల అనుకూలంగా స్పందించ కలగాలి. ప్రభువు వారితో సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి అని చెబుతున్నాడు. శిష్యులకు ఉన్న ప్రధాన లక్ష్యం సువార్తను ప్రకటించడం. ఎందుకు ఇది ప్రధానమైన లక్ష్యం అంటే ప్రభువు ఇచ్చే రక్షణ అందరికి, కేవలం ఒక జాతి, ప్రాంతం, వర్గమునకు మాత్రమే చెందినది కాదు. ఆ విషయం ఈ శిష్యుల ప్రపంచమంతట తిరిగి అందరికి తెలియజేస్తూ, వారు సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యం ఇతరుల అనుభవాలు మాత్రమే కాక వారు కూడా స్వయంగా ప్రభువును పునరుత్థానం అయిన తరువాత చూసారు, విన్నారు మరియు ఆయన నుండి వారి కర్తవ్యము ఏమిటో తెలుసుకున్నారు. వీరు మాత్రమే కాక ప్రభువును తెలుసుకున్న వారు అందరు ఈ కర్తవ్యము కలిగివున్నారు. వారు అందరు ఆయనను ప్రకటించవలసి బాధ్యత ఉంది. 

ప్రార్థన : ప్రభువా! మీరు ఈ లోకమున ఉండగా అనేకమందిని   పాపము నుండి సాతాను బంధనముల నుండి  విముక్తిని కలిగించారు. అదేవిధంగా వారిని స్వతంత్రులనుచేశారు. మీరు చూపించిన కరుణకు స్పందిస్తూ,  మంచి జీవితం జీవించిన వారిని మీరు అనాధారం చేయలేదు. మగ్ధలా మరియమ్మకు దర్శనము ఇవ్వడం, శిష్యులకు దర్శనం ఇవ్వడం, ఇవాన్నీ మీరు మమ్ములను  విడిచిపెట్టడం లేదు అని తెలుపుతున్న, మిమ్ములను నమ్మడంలో, విశ్వసించడంలో  అనేకసార్లు విఫలం చెందుతున్నాం. దానికి మాకు ఉన్న అనేక భయాలు కారణం అయ్యివుండవచ్చు. ప్రభువా! మీరు మాతో ఎప్పుడు ఉంటారు అనే విషయాన్ని తెలుసుకొని,  మీరు ప్రసాధించిన రక్షణ అందరికి అని, మీ సువార్తను ప్రకటించే భాద్యత, మాకు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు, మీ సువార్తను ఇతరులకు ప్రకటించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ఆమెన్. 

12, ఏప్రిల్ 2025, శనివారం

మ్రానికొమ్మల ఆదివారము


యెషయా 50:4-7
ఫిలిప్పీ 2:6-11
లూకా 22:14-23:56
             ప్రియ సహోదరి సహోదరులరా ఈ రోజు మనకు ఎంతో ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఈ ఆదివారంతో పాటు మనమందరము పవిత్ర వారంలోనికి ప్రవేశించబోతున్నాము. అదేవిదంగా ఈ యొక్క వారమును మ్రానికొమ్మల ఆదివారంగా కొనియాడుతున్నాము. ఈ నాటి మూడు పఠనలు మనకు సేవకుని యొక్క జీవితం గురించి తెలియజేస్తున్నాయి. మొదటి పఠనములో సేవకునికి ఎన్ని బాధలు వచ్చిన కూడా దేవునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు అని తెలియజేస్తున్నది. రెండొవ పఠనములో ఎన్ని బాధలు వచ్చిన కూడా మనలను మనం తగ్గించుకొని జీవించాలని తెలియజేస్తుంది. చివరిగా సువిశేషములో బాధలను అనుభవించుటకు మనలను మనం సిద్ధం చేసుకోవాలని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే లూకా 22:42 లో మనం చూస్తున్నాము బాధలను అనుభవించుట లేక తొలగించుట దేవుని చిత్తానికి వదిలివేయాలని నేర్పిస్తుంది.
           అసలు బాధలు అంటే ఏమిటి అని మనం గ్రహించినట్లయితే. బైబిల్‌లో బాధలకు సంబంధించిన అనేక వచనాలు ఉన్నాయి, ఇవి మనకు ఓదార్పును, ఆశను, ప్రోత్సాహాన్ని అందిస్తాయి. బాధలు మానవుని జీవితంలో ఒక భాగమని, దేవుడు మనతో ఉంటాడని ఈ వచనాలు మనకు గుర్తుచేస్తాయి.
బాధలకు అర్థం ఏంటి అని మనం గ్రహించినట్లయితే బైబిల్ ప్రకారం, బాధలు అనేక కారణాల వల్ల వస్తాయి. అవి మన పాపాల ఫలితంగా, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, లేదా దేవుని మహిమ కోసం రావచ్చు. బాధలు మనలను దేవునికి దగ్గర చేయడానికి, మన పాత్రను అభివృద్ధి చేయడానికి, ఇతరులను ఓదార్చడానికి ఉపయోగపడతాయి.
     మరి ముఖ్యముగా కార్మెలైట్ సభ పునీతులు బాధల గురించి అనేక విషయాలు చెబుతున్నారు, ముఖ్యంగా బాధలు దేవునితో ఐక్యమయ్యేందుకు, ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు, ఇతరులకు సహాయపడేందుకు ఒక మార్గమని వారు భావించారు. పునీత అవిలాపురి తెరెసమ్మ  గారు  బాధలు దేవుని ప్రేమను అనుభవించడానికి ఒక మార్గమని, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అవకాశమని బోధించింది. పునీత సిలువ యెహాను గారు బాధలు ఆధ్యాత్మిక శుద్ధికి ఒక మార్గమని, దేవునితో ఐక్యమయ్యేందుకు సహాయపడతాయని బోధించాడు. అంతే కాకుండా బాధలు స్వర్గంలో శాశ్వత ఆనందానికి దారితీస్తాయని బోధిస్తున్నారు. పునీత ఎలిజబెత్ ఆఫ్ ది ట్రినిటీ బాధలలో దేవుని సన్నిధిని అనుభవించాలని, ఆయన ప్రేమపై నమ్మకం ఉంచాలని బోధించింది. పునీత చిన్న తెరెసమ్మ గారు అంటున్నారు చిన్న చిన్న బాధలను కూడా దేవునికి అర్పించాలని, వాటి ద్వారా ఆయన ప్రేమను చాటాలని ప్రోత్సహించిచరు. కార్మెలైట్ పునీతులు బాధలను సహనంతో, విశ్వాసంతో ఎదుర్కోవాలని బోధించారు. పునీత ఎడిత్ స్టెయిన్  గారు బాధలలో క్రీస్తును అనుసరించాలని, ఆయన బాధలలో పాల్గొనాలని బోధించింది. 
        ముందుగా మొదటి పఠనములో యెషయా 50:4-7 బాధపడుతున్న సేవకుని గురించి మాట్లాడుతుంది. అతను దేవుని మాటలను వింటాడు, ప్రజలను ఓదార్చడానికి నేర్చుకుంటాడు, బాధలను సహిస్తాడు. బాధలు ఎదురైనప్పుడు దేవునిపై నమ్మకం ఉంచడానికి, ఆయన వాక్యానికి విధేయత చూపడానికి మనలను ప్రోత్సహిస్తాయి.
      రెండొవ పఠనములో ఫిలిప్పీయులు 2:6-11 క్రీస్తు యొక్క  వినయం, త్యాగం గురించి మాట్లాడుతుంది. దేవుని రూపంలో ఉన్నప్పటికీ, ఆయన మనలాంటి మానవునిగా అవతరించాడు. ఆయన తనను తాను తగ్గించుకొని, సిలువ మరణం వరకు విధేయుడయ్యాడు. అందుకు దేవుడు ఆయనను అత్యంత ఉన్నత స్థితికి హెచ్చించాడు, ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది తెలియజేస్తున్నాయి. ఈ వచనాలు మనలో వినయం, త్యాగం, దేవునికి విధేయత కలిగి ఉండాలని బోధిస్తాయి.
లూకా 22:14-23:56 యేసుక్రీస్తు యొక్క చివరి భోజనం, పట్టుబడటం, విచారణ, సిలువ మరణం గురించి చెబుతుంది. యేసు తన శిష్యులతో చివరి భోజనం చేస్తూ, తన త్యాగం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఆయనను పట్టుకొని, విచారించి, సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు బాధలు, మరణం మన పాపాలకు ప్రాయశ్చిత్తం అని తెలియజేస్తున్నాయి. 
           కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనలు బాధలు అనేవి జీవితంలో ఒక భాగమని, కానీ దేవుడు మనతో ఉంటాడని చూపిస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు బాధలు మనకు ఆశను కలిగిస్తాయి, ఎందుకంటే ఆయన మన బాధలను అర్థం చేసుకుంటాడు, మనలను ఓదార్చగలడు. బాధలు అనేవి మన విశ్వాసాన్ని పరీక్షించగలవు, కానీ అవి మనలను దేవునికి దగ్గర చేస్తాయి. బాధల సమయంలో, మనం దేవునిపై నమ్మకం ఉంచాలి, ఆయన వాక్యానికి విధేయత చూపాలి, క్రీస్తు యొక్క ఉదాహరణను అనుసరించాలి.
Fr. Johannes OCD 
  ‌ 

5, ఏప్రిల్ 2025, శనివారం

ఐదవ తపస్సుకాలపు ఆదివారము

ఐదవ తపస్సుకాలపు ఆదివారము 
యెషయా 43:16-21 ఫిలిప్పీయులు 3: 8-14
 యోహాను 8:1-11
క్రీస్తునాధునియందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులరా. మనం ఇప్పుడు తపస్సుకాలపు చివరి రోజులలోకి ప్రవేశిస్తున్నాము, అంటే తపస్సుకాలపు ఐదవ ఆదివారం జరుపుకుంటున్నాము. నేటి మూడు పఠనలు కూడా మనల్ని, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముఖ్యమైన పాఠాలను అందిస్తున్నాయి. మనం క్రీస్తును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి, మరియు ఇతరులను క్షమించాలి. దేవుడు మనకు ఎల్లప్పుడూ కొత్త ఆశను మరియు కొత్త ప్రారంభాలను అందిస్తాడు.
దేవుని దయ మరియు ఆయన క్షమాపణ శక్తిని అనుభవించమని పిలుస్తున్నాయి.
           ఈ నాటి మొదటి పఠనములో యెషయా 43:16-21, యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయులకు దేవుని శక్తివంతమైన కార్యాలను గుర్తుచేస్తాడు, ముఖ్యంగా ఎర్ర సముద్రాన్ని దాటించడం. అయితే, దేవుడు గతంలో చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, వారు దానిని చూడాలని చెబుతున్నాడు. ఆయన అరణ్యంలో మార్గాలను, ఎడారిలో నదులను సృష్టించి, తన ప్రజలకు కొత్త ఆశను ఇస్తాడు. ఈ లేఖనం దేవుడు ఎల్లప్పుడూ కొత్త కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, మనం ఆయనపై విశ్వాసం ఉంచాలని గుర్తుచేస్తుంది.
ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి చూడవచ్చు. అవి ఏమిటంటే * గత కార్యాల స్మరణ: దేవుడు తన ప్రజలకు గతంలో చేసిన అద్భుతాలను గుర్తుచేస్తాడు.
 * క్రొత్త కార్యాలు: దేవుడు గతంలో చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
 * అరణ్యములో మార్గము, ఎడారిలో నదులు: దేవుడు అసాధ్యమైన పరిస్థితులలో కూడా మార్పు తీసుకురాగలడు.
 * దేవుని విశ్వాసం: దేవునిపై విశ్వాసం ఉంచమని ప్రోత్సహిస్తుంది. ఈనాటి మొదటి పఠనము.
          రెండొవ పఠనములో  ఫిలిప్పీయులకు 3:8-14 అపొస్తలుడైన పౌలు  క్రీస్తును తెలుసుకోవడం యొక్క అత్యున్నత విలువను గురించి మాట్లాడుతాడు. గతంలో తనకు విలువైనవిగా భావించినవన్నీ క్రీస్తుతో పోలిస్తే వ్యర్థమైనవిగా భావిస్తాడు.
      అంతే కాకుండా పౌలు తన జీవితంలో క్రీస్తును తెలుసుకోవడం కంటే మరేదీ గొప్పది కాదని ప్రకటిస్తాడు.
   * అతను తన గత విజయాలు, నేపథ్యం, మరియు ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండటం వంటి వాటిని క్రీస్తుతో పోలిస్తే "పెంట"గా పరిగణిస్తాడు.
             క్రీస్తుతో ఐక్యత కోసం ప్రయత్నం: పౌలు క్రీస్తుతో ఐక్యతను సాధించడానికి, ఆయనను పోలి ఉండటానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అతను క్రీస్తు యొక్క నీతిని పొందాలని కోరుకుంటాడు, ఇది ధర్మశాస్త్రం ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా వస్తుంది.
         గతానికి వీడ్కోలు, భవిష్యత్తుపై దృష్టి:  పౌలు తన గత జీవితాన్ని, విజయాలను విడిచిపెట్టి, భవిష్యత్తుపై దృష్టి సారిస్తాడు. అతను గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అని చెబుతాడు, ఇది క్రీస్తులో తన పిలుపు యొక్క బహుమానం కోసం అని రెండొవ పఠనము తెలియజేస్తుంది.
          చివరిగా సువిశేష పఠనములో యోహాను 8:1-11 యేసు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని న్యాయాధిపతుల నుండి రక్షించిన సంఘటనను వివరించబడింది.
 * పరిసయ్యుల మరియు శాస్త్రుల కుట్ర: పరిసయ్యులు మరియు శాస్త్రులు యేసును పరీక్షించడానికి ఒక వ్యభిచారిణిని ఆయన ముందు నిలబెడతారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకు రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించాలని వారు యేసును అడుగుతారు. వారు యేసును ఇరుకున పెట్టాలని చూస్తారు, ఆయన ధర్మశాస్త్రాన్ని సమర్థిస్తే, ఆయన కఠినమైన న్యాయాధిపతిగా కనిపిస్తాడు, లేకపోతే ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది.
 * యేసు యొక్క జ్ఞానం మరియు కరుణ: యేసు నేలపై వ్రాస్తూ, మీలో పాపం లేనివాడు మొదట ఆమెను రాళ్లతో కొట్టవచ్చు అని అంటాడు. ఈ మాటలు విన్న వారందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్లిపోతారు, వారి స్వంత పాపాలను గుర్తుచేసుకుంటారు. యేసు స్త్రీ పట్ల కరుణ చూపిస్తాడు, ఆమెను ఖండించకుండా, "నేను కూడా నిన్ను శిక్షించను; ఇకనుండి పాపం చేయకు" అని చెప్పి ఆమెను పంపివేస్తాడు.
 * దేవుని క్షమాపణ మరియు కొత్త ప్రారంభం: యేసు స్త్రీకి క్షమాపణను అందిస్తాడు మరియు ఆమెకు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇస్తాడు. ఈ సంఘటన దేవుని క్షమాపణ మరియు కరుణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది మనందరం పాపులమేనని, ఇతరులను తీర్పు తీర్చడానికి మనకు హక్కు లేదని గుర్తుచేస్తుంది.
 * యేసు యొక్క బోధన: ఈ సంఘటన ద్వారా, యేసు క్షమాపణ, కరుణ మరియు స్వీయ-పరిశీలన యొక్క ప్రాముఖ్యతను బోధిస్తాడు. ఇతరులను తీర్పు తీర్చడానికి ముందు, మన స్వంత లోపాలను పరిగణించాలని ఆయన మనకు బోధిస్తాడు.
ఈ సంఘటన దేవుని ప్రేమ, క్షమాగుణం మరియు మానవత్వం యొక్క శక్తివంతమైన ఉదాహరణ. ఇది మనకు క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను, దేవుని కరుణను, మరియు కొత్త ప్రారంభాల ఆశను నేర్పుతుంది.
        కాబ్బటి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనములు మన ఆధ్యాత్మిక జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి. దేవుని ప్రేమ, క్షమాగుణం, మరియు కొత్త ఆశ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతాయి.
Fr. Johannes OCD 

29, మార్చి 2025, శనివారం

తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం

తపస్సు కాలపు నాలుగోవ ఆదివారం
యెహోషువా 5:9-12
2 కొరింథి 5: 17-21
లూకా 15: 1-3, 11-32
                   క్రీస్తునాధునియందు ప్రియ విశ్వాసిని విశ్వాసులరా, ఈ నాడు మనమందరము కూడా తపస్సు కాలపు నల్గొవా ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము. ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనలను మనం ద్యానించినట్లయితే మూడు పఠనలు కూడా నూతన జీవితం యొక్క సందేశాన్ని మనకు అందజేస్తున్నాయి. 
              అసలు నూతన జీవితం అంటే ఏమిటి అని గ్రహించినట్లయితే పునీత అసిస్సిపురి ఫ్రాన్సిస్ వారు, అవిలాపురి తెరెసమ్మ గారు మరియు సిలవా యోహాను గారు ఈ విధంగా అంటున్నారు నూతన జీవితం అనేది: 
* నూతన జీవితం అనేది క్రీస్తు అడుగు జడలో నడవటం మరియు అయన ఉదాహరణలను అనుసరించడం, 
* నూతన జీవితం అంటే ప్రపంచంలోని భోగభాగ్యలకు దూరంగా ఉండటం మరియు నిరాడంబరమైన జీవితాన్ని గడపటం.
* నూతన జీవితం అంటే దేవుని సృష్టిలో సామరహస్యం జీవించడం మరియు దానిని సంరక్షించడం.
* నూతన జీవితం అంటే ఇతరులను నిస్వార్థంగా ప్రేమించటం మరియు అవసరాలను తీర్చుటకు సిద్ధంగా ఉండటం.
* నూతన జీవితం అంటే మన పాపాల నుండి వైదోలగడం మరియు దేవుని వైపు తిరగడం.
* నూతన జీవితం అంటే దేవునితో నిరంతరం సంభాసించటం మరియు అయన చిత్తని తెలుసుకొవడానికి ప్రయత్నించటం.
* నూతన జీవితం అంటే దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచడం మరియు అయన మార్గదర్శకత్వనికి లోబడి జీవిచడం.
* పునీత సిలువ యోహాను గారికి నూతన జీవితం అంటే మన కోరికలను మరియు అటాచ్మెంట్‌లను అధిగమించడం మరియు దేవునిపై మాత్రమే ఆధారపడటం.
* పునీత అవిలాపురి తెరెసమ్మ మరియు సిలువ యోహాను. వారిద్దరికి కూడా నూతన జీవితం అనేది నిరంతర ఆధ్యాత్మిక ప్రయాణం అని మరియు అది దేవుని ప్రేమలో మరింతగా ఎదగడానికి మనలను పిలుస్తుందని బోధించారు.
                యెహోషువ 5:9-12:
ఈ మొదటి పఠనములో ఇశ్రాయేలీయులు ప్రజలు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన ముఖ్యమైనటువంటి సంఘటన గురించి వివరించబడింది. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు చేయబడని సున్నతి గిల్గాలులో చేయబడుతుంది. దీని అర్థం ఏమిటంటే, వారు ఐగుప్తు బానిసత్వం యొక్క కళంకాన్ని తొలగించుకున్నారు మరియు దేవుని ఎన్నిక చేసుకున్న నూతన ప్రజలుగా కొత్త ప్రారంభాన్ని పొందారు. దీని తర్వాత వారు మొదటిసారిగా ఆ దేశపు పంటను తిన్నారు మరియు అప్పటివరకు వారికి ఆహారంగా ఉన్న మన్నా అక్కడితోటి ఆగిపోయింది. ఈ సంఘటన మన జీవితాలకు ఒక గొప్ప గుణ పాఠాన్ని నేర్పుతుంది. మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపం యొక్క బంధకాల నుండి విడుదల పొందుతాము. బాప్తిస్మం అనేది మన జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని మరియు నూతన జీవితాన్ని ప్రారాంబించటం సూచిస్తుంది. ఇకపై మనం పాత జీవితానికి చెందినవారం కాదు అని క్రీస్తునందు కొత్త సృష్టిగా జీవిస్తాము. దేవుడు మనకు అవసరమైన ప్రతిదాన్ని సరైన సమయంలో అందిస్తాడు. అరణ్యంలో మన్నాను అందించిన దేవుడే, వాగ్దాన భూమిలో పంటను కూడా అందించాడు. అదే విధంగా మనం ఆయనపై నమ్మకం ఉంచితే, మన అవసరాలను ఆయన తప్పకుండా తీరుస్తాడు అని ఈ నాటి మొదటి పఠనములో దేవుడు తెలియజేస్తున్నాడు.
            2 కొరింథీయులు 5:17-21:
ఈ రెండొవ పఠనములో క్రీస్తునందు  ఎవరైతే ఉంటారో వారి యొక్క నూతనత్వాన్ని మరియు దేవునితో సమాధానపడే అవకాశాన్ని గురించి మాట్లాడుతుంది. ఎవరైనా క్రీస్తునందు ఉంటే, వారు నూతన సృష్టి పునీత పౌలు గారు అంటున్నారు. అంటే మనలో ఉన్నటువంటివి పాతవి గతించిపోయి, ఇదిగో కొత్తవి వచ్చాయి ఇదంతా దేవుని ద్వారానే సాధ్యమైంది అంటు,  క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరచుకున్నాడు అని మరియు ఆ సమాధాన పరిచర్యను మనకు అప్పగించాడు. యేసు క్రీస్తు పాపం చేయకపోయినా, మన కొరకు పాపవిమోచకుడిగా చేయబడ్డాడు, తద్వారా మనం దేవుని నీతి బిడ్డలుగా తీర్చిదిద్దాబడ్డము. ఈ మాటలు మనకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తాయి. క్రీస్తునందు మనం కొత్త జీవితాన్ని ప్రారంభించగలము. దేవుడు మనలను తనతో సమాధానపరచుకోవడమే కాకుండా, ఇతరులను కూడా ఆయనతో సమాధానపరచడానికి మనలను రాయబారులుగా నియమించాడు. ఇది మనకు ఇవ్వబడిన గొప్ప నూతన అధ్యాద్మిక బాధ్యత.
                  లూకా 15:1-3, 11-32:
చివరికి సువిశేష పఠనములో యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానం గురించి ఇది దేవుని యొక్క అపారమైన ప్రేమను మరియు క్షమాపణను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తిని తీసుకొని దూర దేశానికి వెళ్లి దుర్వ్యసనాలతో దానిని నాశనం చేసుకుంటాడు. చివరికి దిక్కులేని స్థితిలో తన తండ్రి వద్దకు తిరిగి వస్తాడు. తండ్రి అతన్ని చూసి జాలిపడి పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంటాడు మరియు ఘనంగా విందు ఏర్పాటు చేసి సంతోషిస్తాడు. అయితే పెద్ద కుమారుడు దీనిని చూసి అసూయపడతాడు. ఈ ఉపమానంలో తండ్రి దేవునికి, ఇద్దరు కుమారులు కూడా మానవులకు ప్రాతినిధ్యం వహిస్తారు. చిన్న కుమారుడు పాపంలో పడిపోయిన మరియు దేవునికి దూరమైన వ్యక్తిని సూచిస్తాడు. అతని పశ్చాత్తాపం మరియు తిరిగి రావడం అనేది దేవుని క్షమాపణను పొందడానికి అవసరమైన హృదయ మార్పును తెలియజేస్తుంది. తండ్రి యొక్క నిస్వార్ధమైన ప్రేమ మరియు క్షమాపణను మరియు దేవుని యొక్క కరుణను మరియు ఆయన పాపులను స్వీకరించే విధానాన్ని చూపిస్తుంది. పెద్ద కుమారుడు తమ నీతిని గూర్చి గర్వపడే మరియు ఇతరులను తక్కువగా చూసే వారిని సూచిస్తాడు. దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉంటుందని మరియు మనం ఇతరుల పశ్చాత్తాపం పట్ల సంతోషించాలి అని ఈ ఉపమానం మనకు నేర్పుతుంది. 
           కాబ్బట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ప్రేమగలవాడు మరియు క్షమించేవాడు. ఆయన మనలను పాపం యొక్క బంధకాల నుండి విడిపించడానికి, మనకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి మరియు తనతో సమాధానపరచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనపై విశ్వాసం ఉంచాలి, మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి మరియు ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవాలి అప్పుడే మనం ఒక నూతన సృష్టిగా లేకపోతే నూతన వ్యక్తులుగా పరిగనింపబడతాము. మరి అటువంటి దీవెనలకొరకై మనమందరము ఈ బలి పూజలో ప్రార్దించుకుందాము.

22, మార్చి 2025, శనివారం

తపస్సు కాలపు మూడవ ఆదివారము

తపస్సు కాలపు మూడవ ఆదివారము 

నిర్గమ 3:1-8, 13-15
1కొరింథీ 10:1-6, 10-12
లూకా 13:1-9
క్రీస్తునాధునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము  తపస్సు కాలపు మూడవ ఆదివారంలోనికి ప్రవేశించియున్నాము. ఈ నాటి మూడు దివ్యాగ్రంధ పఠనములు మనకు దేవునితో మన సంబంధం గురించి మరియు ఆయనకు మహిమను తెచ్చే జీవితాలను ఎలా జీవించాలని అనే  ముఖ్యమైన అంశాల గురించి తెలియజేస్తున్నాయి.
           అసలు దేవునితో సంబంధం అంటే ఏమిటి అని మనం గ్రహించినట్లయితే పునీత అవిలాపురి తెరెసమ్మ గారు  ఈ విధంగా అంటున్నారు. 
1. వ్యక్తిగత అనుభవం: ప్రతి ఒక్కరి జీవితములో కూడా దేవునితో ఒక వ్యక్తిగతమైన సబంధం ఉండాలని మరియు మన హృదయాలలో దేవునితో ఒక ప్రత్యేకమైన సంభందం  ఉండాలని ఈ మొదటి మాటలో అంటున్నారు.
2. స్నేహం: ఆమె ప్రార్థన దేవునితో ప్రేమపూర్వకమైన స్నేహం అంటున్నారు.  ఎందుకు ఆమె ఆలా అంటున్నారు అంటే స్నేహితులు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారో, తమ సంతోషాలను మరియు బాధలను పంచుకుంటారో, అదే విధంగానే మనం కూడా దేవునితో మన హృదయాన్ని తెరవాలని ఒక స్నేహితునివలె మనము కూడా ఆయనతో మాట్లాడాలని తెలియజేస్తున్నారు.
3. ఆత్మ పరిశీలన: దేవునితో మన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఆత్మ పరిశీలన చాలా ముఖ్యమైన సాధనమని ఆమె అంటున్నారు. మన బలహీనతలను మరియు మన పాపాలను గుర్తుచేసుకొని వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి ఆమె మనకు తెలియజేస్తున్నారు. 
                          ఈ విధమైనటువంటి సంబంధాన్ని  మనం  జీవిచాలని ఆమె అంటున్నారు. ఈ నాటి పఠనలుకూడా ఇదే విషయాన్ని  మనకు తెలియజేస్తున్నాయి. 
           ముందుగా మొదటి పఠనములో మోషే దేవుని యొక్క పిలుపును అందుకుంటాడు. దేవుడు మండుతున్న పొద రూపంలో మోషేకు ప్రత్యక్షమై, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకుంటానాడు. ఇక్కడ, దేవుడు మోషేతో తనను తాను 'నేను ఉన్నవాడను' అని పరిచయం చేసుకుంటాడు, ఇది ఆయన శాశ్వతత్వాన్ని, స్వయం సమృద్ధిని మరియు విశ్వాసనీయతను తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు తన ప్రజల బాధలను చూసి, వారిని విడిపించడానికి ఒక గొప్ప నిర్ణయాన్ని  తీసుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ దేవుని పిలుపు మరియు ఆయన శక్తిని ఈ సంఘటనద్వారా మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనము గమనించలసింది దేవుని పేరు యొక్క ప్రాముఖ్యత మరియు ఆయనతో మన సంబంధం గురించి ఇది తెలియజేస్తుంది. 
         రెండవ పఠనములో  పౌలు ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణం నుండి నేర్చుకోవలసిన గుణ పాఠాల గురించి కొరింథీయులకు గుర్తుచేస్తున్నాడు మరియు వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని అద్భుతాలను చూసినప్పటికీ, వారు అవిధేయత, విగ్రహారాధన మరియు సణుగుడు ద్వారా పాపం చేశారు అని పౌలు గారు వారి అనుభవాలను మనకు హెచ్చరికగా ఉపయోగిస్తాడు, తద్వారా మనం అదే తప్పులు చేయకుండా ఉంటాము అని దేవునితో సభందం కలిగి జీవిస్తామని అంటున్నారు.
అంతేకాకుండా ఇక్కడ మనం దేవుని విశ్వాసనీయతను అంత తేలికగా తీసుకోకూడదు. మన హృదయాలను పాపం నుండి కాపాడుకోవాలి మరియు దేవునికి విధేయత చూపాలి అని అంటున్నారు. ఎందుకంటే గర్వం అనేది మన పతనానికి దారితీస్తుందని కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయంగా ఆయనతో సంబంధం  కలిగి ఉండాలని అంటున్నారు.
         చివరిగా సువిశేష పఠనములో యేసు పీలాతు చేతిలో చంపబడిన గలిలయుల గురించి మరియు సిలోయము గోపురం కూలి చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘటనలు ఎందుకు క్రీస్తు వారికీ తెలియజేస్తున్నాడంటే పాపులు పశ్చాత్తాపపడకపోతే వారు కూడా నాశనం అవుతారని హెచ్చరికగా ఉపయోగిస్తాడు. యేసు ఒక అంజూరపు చెట్టు ఉపమానాన్ని కూడా చెబుతాన్నాడు, ఇది దేవునిపట్ల మన పశ్చాత్తాపం మరియు ఫలాలను ఉత్పత్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తుంది. మనం మన పాపాలను విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని వైపు తిరగాలుగుతామో. అపుడే దేవుడు మనకు పశ్చాత్తాపపడటానికి అవకాశాలను ఇస్తాడు, కానీ మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మనం దేవునికి ఫలాలను ఇచ్చే విధంగా మనం మారాలని, అంటే మనం ఆయనకు మహిమ తెచ్చే జీవితాలను జీవించాలి తెలియజేస్తున్నాడు.

కాబట్టి  ప్రియా దేవుని బిడ్డలరా ఇక్కడ మనం నేర్చుకోగల కొన్ని సాధారణ గుణాలు మనకు కనిపిస్తాయి. దేవుడు నమ్మదగినవాడు మరియు విశ్వాసనీయుడు. మనం పాపం నుండి పశ్చాత్తాపపడాలి మరియు దేవునికి విధేయత చూపాలి.
 కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ  తపస్సు కాలం మనం పశ్చాత్తాపాన్ని, విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి, దేవునిచే అనుగ్రహించబడిన సమయం కాబట్టి  మన పాపాలను దేవుని ముందు ఉంచుతు పశ్చాత్తాపం పడి దేవునితో సంబంధం  కలిగి జీవించాలని ప్రార్దించుకుందాము.

Fr. Johannes OCD

15, మార్చి 2025, శనివారం

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము
ఆదికాండము 15:5-12, 17-18
ఫిలిప్పీయులు 3:17-4:1
లూకా 9:28-36

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని  దైవ భక్తులారా, ఈ రోజున మనమందరము తపస్సుకాలపు రెండవ  ఆదివారం లోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ నాటి మూడు పఠనలు కూడా మనం దేవుని విశ్వసించాలి, క్రీస్తును అనురించాలి మరియు ఆయన మాట వినాలి అని తెలియజేస్తున్నాయి ఎందుకంటే అలా చేయడం ద్వారా, మనం ఆయన వాగ్దానాలను పొందుతాము మరియు ఆయన మహిమలో పాలుపంచుకుంటాము అని క్లుప్తంగా వివరిస్తున్నాయి.
           మొదటి పఠనములో ఆదికాండము  నుండి చూస్తున్నాము ఇక్కడ అబ్రాహామునకు మరియు దేవునికి మధ్య ఒక ఒప్పందం గురించి తెలియజేస్తుంది. దేవుడు అబ్రామునకు ఆకాశంలోని నక్షత్రాలను చూపించి, అతని సంతానం ఆలాగే ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. దానికి గాను అబ్రాము దేవునిపై విశ్వాసం చూపిస్తున్నాడు, ఇది అతనికి బహు మంచిగా అనిపించింది. మరల కొద్దీ సేపటి తర్వాత అబ్రాము దేవుని వాగ్దానం గురించి అనుమానం వ్యక్తం చేసాడు అది ఏవిధంగానంటే తన సంతానం ఈ భూమిని ఎలా పొందుతుందని  దేవుని అడిగాడు. దానికి గాను దేవుడు అబ్రాహాముతో నీవు దీనిని నమ్ముటకు కొన్ని జంతువులను తెచ్చి, వాటిని రెండుగా కోసి, ఒకదానికొకటి ఎదురుగా అమర్చమని చెప్పాడు. ఈ ఒప్పంద విధిలో భాగంగా, దేవుడు ఒక పొగమంచు పొగ మరియు మంట దీపం రూపంలో జంతువుల మధ్య దీర్ఘంగా నడిచాడు. దానికి గాను ఈ ఒప్పందంలో దేవుడు అబ్రాము సంతానానికి కనాను అను భూమిని ఇస్తానని వాగ్దానం చేసియున్నాడు. అబ్రాము సంతానం నాలుగు వందల సంవత్సరాలు బందీలుగా ఉంటారని, తర్వాత వారు గొప్ప సంపదతో తిరిగి వస్తారని దేవుడు అబ్రాహామునకు ఒక కచ్చితమైనటువంటి మాటను చెప్పాడు. ఇక్కడ ఈ వచనలలో దేవుని విశ్వాసనీయతను మరియు ఆయన వాగ్దానాలను నెరవేర్చే శక్తిని చూపిస్తుంది. అబ్రాహాము దేవునిని విశ్వసించినట్లే, మనం కూడా ఆయనను విశ్వసించాలి మరియు ఆయన వాగ్దానాలపై ఆధారపడి జీవిస్తుండాలి, ఎందుకంటే మనము కూడా అబ్రాహాము వలే దేవునిపై విశ్వాసం ఉంచి జీవిస్తే అయన వలే మనము కూడా దివించబడతాము. కాబట్టి ఆ ఆశీర్వాదలను ఎలా పొందలో అబ్రాహామును ఒక ఉదాహరణగా తీసుకోవాలని మొదటి పఠనము మనకు వివరిస్తుంది.
            తరవాత రెండవ పఠనములో  పౌలు గారు ఫిలిపియులైన క్రైస్తవులకు సరైన మార్గంలో నడవాలని సలహా ఇస్తున్నాడు. అతను తనను  అనుసరించమని చెబుతున్నాడు. ఈ సందర్భంలో  పౌలు ఎందుకు ఆ ప్రజలను ఆవిధంగా అంటున్నాడంటే అతని విశ్వాసం మరియు నిబద్ధతను అనుసరించమని సలహా ఇస్తున్నాడు. అదేసమయంలో, కొందరు ప్రజలు వారి శరీరాన్ని దేవుని దృష్టిలో అపవిత్రం చేస్తున్నారని మరియు వారికీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారని వారి జీవితాలను బట్టి పౌలు ఆవిధంగానైనా వారిని తిరిగి దేవుని చెంతకు తీసుకునిరావాలన్నా ఆలోచనతోటి వారిని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా, వారు ప్రభువులో స్థిరంగా నిలబడాలని కోరుకుంటున్నాడు. ఈ విధంగా, పౌలు ఫిలిప్పీయులకు మంచి మార్గంలో నడవడం మరియు దేవుని వాక్యాన్ని పాటించడం గురించి బోధిస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా అనేక సార్లు మనకిష్టమొచ్చినట్లు జీవిస్తూ ఉంటాము. కాబ్బటి ఈనాటి నుండి మనమందరము చెడు జీవితాన్ని వదలిపెట్టి మంచి మార్గాన్ని ఎంచుకోవడం మరియు దేవుని వాక్యాన్ని పాటించడం గురించి ఆలోచించడం మొదలు పెట్టమని పౌలు గారు మనలను  ఈ రెండవ పఠనము ద్వారా హెచ్చరిస్తున్నాడు.
           చివరిగా సువిశేష పఠనములో  యేసు ప్రభువుని రూపాంతరికరణము గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు మొషే మరియు ఎలియా  కలిసి ఉండగా రూపాంతరం చెందాడు. ఈ సందర్భంలో ఇక్కడ మన ఆలోచన ఏవిధంగా ఉండాలంటే యేసు ప్రభువు యొక్క విశ్వాసం మరియు అయన యొక్క వాక్య పరిచర్య మరియు అయన వచ్చిన పనిని గురించి ఆలోచించామని మనకు సలహా ఇస్తుంది. ఇక్కడ మనం గమనించలసింది ఏమిటంటే, యేసు తన శిష్యులైన పేతురు, యోహను, యకోబులను వెంటబెట్టుకొని పర్వతము మీదికి తీసుకొని వేలతాడు. అక్కడికి వెళ్లిన తరువాత యేసుక్రీస్తు రూపాంతరం చెండుతాడు. అయన ముఖం మారిపోయి, తన వస్త్రాలు ప్రకాశవంతంగా మారుతాయి. మోషే మరియు ఎలియా ప్రవక్తలు  ఆయనతో సంభాసించటం వారి ముగ్గురికి కనిపిస్తారు. అక్కడ వారు ముగ్గురు అయనకు జెరూసలేములో సంభవించే మరణం మరియు పునరుత్థానం గురించి మాట్లాడారు వారు మాట్లాడుకుంటారు. ఇది అంత జరిగిన తరువాత వారు తిరిగి కిందకు వచ్చే సమయములో ఒక మేఘం వారిని కమ్ముకుంటుంది. ఆ మేఘం నుండి ఒక స్వరం వారికీ వినిపిస్తుంది, అది ఏమిటంటే ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఏర్పరచుకొనినవాడు; ఆయన మాట వినుడు అని ఒక శబ్దం వస్తుంది. ఇక్కడ మనం గమనించలసింది.
ఈ సంఘటన యేసు యొక్క దైవత్వాన్ని మరియు ఆయన తండ్రితో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మోషే మరియు ఏలీయా కనిపించడం ద్వారా పాత నిబంధన యేసులో నెరవేరుతుందని చూపిస్తుంది. తండ్రి స్వరం యేసును ఆయన కుమారుడిగా ధృవీకరిస్తుంది మరియు ఆయన మాట వినమని మనకు ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి మనము అయన మాట విని దేవుని ఆశీర్వాదలు పొందాలని మనము ప్రార్థన చేసుకోవాలి మరియు ఆయనను విశ్వాసించాలి.
        కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఈ తపస్సు కలమంతా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము, అంతే కాకుండా మన విశ్వాసాన్ని దేవుని పట్ల ఏంతగా ఉందొ నిరూపించుకొనే ఒక గొప్ప అవకాశము, అందుకని మనం మన విశ్వాసాన్ని దేవుని ముందు వ్యక్తపరుచుచు అయన యడల మన విశ్వాసాన్ని చూపిస్తూ జీవించాలని ఈ దివ్యబలి పూజలో విశ్వాసంతో ప్రార్థించుకుంటు పాల్గొందాము.
Fr. Johannes OCD 

8, మార్చి 2025, శనివారం

తపస్సుకాలపు మొదటి ఆదివారము


ద్వితీయోపదేశకాండము 26:4-10, రోమీయులకు 10:8-13, 
లూకా 4:1-13.

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియా  దేవుని భక్త జనులరా , ఈ రోజున మనమందరము తపస్సుకాలపు మొదటి ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను మనం ద్యానించినట్లయితే, ఈ మూడు పఠనలు కూడా మనకు ముఖ్యమైనటువంటి కొన్ని అవసరమైనటువంటి అంశముల గురించి తెలియజేస్తునాయి. అవి విశ్వాసం, విధేయత మరియు దేవుని యొక్క విశ్వసనీయత యొక్క ప్రాముఖ్యతను గురించి చెబుతున్నాయి. 

                ముందుగా మనము మొదటి పఠనమును గమనించినట్లయితే ఈ యొక్క మొదటి పఠనములో. దేవుని కృపకు గుర్తుగా ఇశ్రాయేలీయుల యొక్క పంట మొదటి ఫలాలను దేవునికి అర్పించేటువంటి ఆచారాన్ని గురించి వివరిస్తుంది.
అంతే కాకుండా దేవుడు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించి, వాగ్దాన భూమికి నడిపించిన విధానాన్ని కూడా మనకు గుర్తుచేస్తుంది.
అంతే కాకుండా దేవుడు తన ప్రజలకు చేసిన మంచి పనులను గుర్తుచేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
మన జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు అనేక విధాలుగా ఎన్నెన్నో చేసిన మేలులను ఈ సమయాన మనము గుర్తుచేసుకొని, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే పాపం అనే జీవితములో మనము అనేక సార్లు దేవునికి వెతిరేకంగా చేసిన కూడా అయన మనలను క్షమించి మరల అయన చెంతకు తీసుకున్నాడు. కాబ్బటి మనము కూడా ఇజ్రాయెల వాలే దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరిగి అయన చెంతకు రావాలని మొదటి పఠనము మనలను ఆహ్వానిస్తుంది.
                 రెండొవ పఠనములో రోమీయులకు 10:8-13లో 
యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించడం మరియు మన జీవితములో విశ్వసించడం ద్వారా రక్షణ పొందవచ్చని మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభువు ప్రభువు అని విశ్వాసిస్తామో అప్పుడే మనము అయన ద్వారా రక్షింపబడతాము(10:9). ఇక్కడ విశ్వాసం యొక్క సార్వత్రిక స్వభావాన్ని నొక్కి వక్కనించి చెబుతుంది, ఇక్కడ యూదుడని గ్రీసుదేశస్థుడని భేదములేదు. అందరూ కూడా ఒకటేనాని ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయునాడని. ఆయనను నమ్మడం ద్వారా ఎవరైనా రక్షణ పొందవచ్చు అని తెలియజేస్తుంది. ఇక్కడ మనము పూర్తిగా గమనించినట్లయితే ఇది మనకు దేవుని ప్రేమను, ఆయన రక్షణ ప్రణాళికను గురించి తెలియజేస్తుంది. కాబ్బటి మనము కూడా అదే విశ్వాసాన్ని దేవుని పట్ల చూపిస్తూ జీవించాలని రెండొవ పఠనము మనకు వివరిస్తుంది.   
                చివరిగా సువిశేష పఠనములో  యేసు ఎడారిలో శోధించబడిన వృత్తాంతాన్ని గురించి వివరిస్తుంది. యేసు సాతాను శోధనలను లేఖనాల ద్వారా జయించాడు. ఇక్కడ విశ్వాసం మరియు దేవుని వాక్యానికి విధేయత గురించి చెబుతుంది. యేసు శోధనలను ఎదుర్కొన్నప్పుడు, ఆయన దేవుని వాక్యంపై ఆధారపడ్డాడు. మనం కూడా అనేక సార్లు అనేక విధాలుగా శోధనలను ఎదుర్కొనేటప్పుడు, దేవుని వాక్యం మనకు ఎంతగానో సహాయం చేస్తుంది. బలహీనలుగా ఉన్నా మనలను దేవుని వాక్యం బలవంతులను చేస్తోంది. కాబ్బటి మనము ముందుగా దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే దేవుడు మనకు కూడా ప్రాముఖ్యతను ఇస్తాడు. 
       కాబట్టి ప్రియా దేవుని బుడ్డలారా మనం దేవునిపై విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యానికి విధేయత చూపాలి మరియు ఆయన చేసిన మేలులను గుర్తుచేసుకోనీ కృతజ్ఞతలు చెల్లించుకుందాము.
Fr. Johannes OCD

1, మార్చి 2025, శనివారం

సామాన్యకాలపు ఎనిమిదవ ఆదివారము

సామాన్యకాలపు ఎనిమిదవ  ఆదివారము
సిరా 27:4-7
1 కొరింథీయులు 15:54-58
లూకా 6:39-44

          క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియా  దేవుని జనులరా , ఈ రోజున మనము సామాన్య కాలపు ఎనిమిదవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనములను మనం చుసినట్లయితే, ఈ మూడు  మనకు ముఖ్యమైనటువంటి మూడు అంశముల గురించి తెలియజేస్తున్నాయి. అవి  మన జీవితానికి చాలా విలువైన విషయాల గురించి నేర్పుతున్నాయి. అవి ఏమిటంటే మన మాటలు, మన చేతలు ద్వారా చేసే పనులు, మన స్వభావం గురించి ఆలోచించి, మంచి జీవితాన్ని గడపమని ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి. ఈ ముఖ్య గుణములు మన జీవితములో ఎంతగానో ఉపయోగపడతాయి. మనలను మంచి మార్గములో ప్రయాణించుటకు ఉపయోగపడతాయి.

ముందుగా మనము మొదటి పఠనము చూసింట్లయితే 
సిరా 27:4-7 వచనలలో  మన మంచి జీవితం అనేది మన మాట్లమీద ఆధారపడివుందని తెలియజేస్తుంది. అది ఏ విధంగానంటే మనుషుల నిజమైన స్వభావం మీద ఆధారపడివుంది. లూకా సువార్తలో మనము చూస్తున్నాము చెట్టును బట్టే పండ్లు కాస్తాయని. చెట్టు పండును బట్టి ఎలా దాని స్వభావము తెలుస్తుందో, అదే విధంగా మనిషి మాటలను బట్టి అతని హృదయం తెలుస్తుంది.
 ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకూడా చాలా విలువైనది. మన జీవితములో కొన్ని సార్లు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటాము. ఏవిధంగానంటే ఎవరినీ తొందరపడి పొగడకూడదు, వారి మాటలు విన్నాకే వారిని అంచనా వేయాలి.
 నిజం జీవితములో మనం మాటల ద్వారానే మన నిజస్వరూపాన్ని బయటపెడతాము. అందుకే మనం మాట్లాడే ప్రతి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని ఈ మొదటి పఠనములో చూస్తున్నాము.
       రెండొవ పఠనము: 
1 కొరింథీయులు 15:54-58:
 ఈ వాక్యాలు మరణంపై విజయం గురించి, శాశ్వత జీవితం గురించి మాట్లాడుతున్నాయి. యేసుక్రీస్తు ద్వారా మరణం అనేది ఓడిపోతుందని, మానవులమైనటువంటి మనకు శాశ్వత విజయం లభిస్తుందని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. మన మానవ జీవితంలో మనము అనేక సార్లు పాపమనే ఉబిలో పడిపోతున్నాము అంటే మనము పాపమానే జీవితములో అనేక సార్లు చనిపోతున్నాము. మరి దీని నుండి మనము బయటకి జీవముతో రావాలంటే యేసు క్రీస్తును దృఢనమ్మకముతో విశ్వాసించాలి ఎందుకంటె క్రీస్తు ద్వారా మనము మరణాన్ని జయించవచ్చు. ఎటువంటి గొప్ప బహుమానము క్రీస్తు ద్వారా  దేవుడు మనకు విజయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మన శ్రమలు ప్రభువులో వ్యర్థం కావు అని, ఎల్లప్పుడూ ప్రభువు పనిలో నిమగ్నమై ఉండాలని అప్పుడే మనము అన్ని జయింపగలమని ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి.
               చివరిగా సువిశేష పఠనము:
లూకా 6:39-44 ఈ వచనాలు ఇతరులను తీర్పు తీర్చడం గురించి, మంచి ఫలాలను ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాయి. ముందుగా గుడ్డివాడు గుడ్డివాడిని నడిపించలేడని, అంటే పాపం అనే జీవితములో జీవించే వాడు ఇతరులకు మంచిని నేర్పించలేడు అని, ముందుగా మన కంటిలోని దూలాన్ని తీసివేయాలని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. మంచి చెట్టు మంచి పండ్లను ఇచ్చినట్లే, చెడ్డ చెట్టు చెడ్డ పండ్లను ఇస్తుందని, వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు అంటున్నారు. మన హృదయం నుండి వచ్చే మాటలు మన స్వభావాన్ని తెలియజేస్తాయనీ. ఇతరులను మనము సరిచేయడానికి ముందు మనల్ని మనం సరిచేసుకోవాలని సువిశేష పఠనము మనకు నేర్పిస్తుంది.
కాబ్బటి మన మాటలు, చేతలు మంచి ఫలాలను ఇవ్వాలనుకుంటే మన స్వభావము అనేది మంచిగా ఉండాలి అప్పుడే మనము ఇతరులను మంచి మార్గములో ప్రయాణించేలా చేయగలుగుతాము. 
           కాబ్బటి ప్రియా దేవుని బిడ్డలరా మన మాటలు, చేతలు, మన స్వభావం ఇవి అన్ని కూడా మనలను మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలని నేర్పిస్తున్నాయి. ఒక క్రైస్తవునిగా నీ జీవితాము ఏ విధంగా ఉందొ తెలుసుకొని జీవించాలని ఈ బలి పూజలో ప్రార్దించుకొందము.
Fr. Johannes OCD

22, ఫిబ్రవరి 2025, శనివారం

సామాన్యకాలపు ఏడవ ఆదివారము


1 సమూయేలు 26:2, 7-8, 12-13, 22-23; 
1 కొరింథీయులు 15:45-49
లూకా 6:27-38
క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ విశ్వసిని విశ్వాసులరా మరియు దేవుని బిడ్డలరా, ఈ దినమున మనమందరము సామాన్య కాలపు ఏడవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము, ఈ నాటి మూడు పఠనములలో మనం చుసినట్లయితే, ఈ మూడు కూడా మనకు ముఖ్యమైన మూడు అంశముల గురించి తెలియజేస్తున్నాయి. అవి ఏమిటంటే మానవుని  వినయం, క్షమాపణ మరియు ఆధ్యాత్మిక పరివర్తన యొక్క ముఖ్యమైన గుణల గురించి నేర్పిస్తున్నాయి.
ముందుగా మొదటి పఠనము చూసినట్లయితే 
1 సమూయేలు 26:2, 7-8, 12-13, 22-23
ఈ వచనలలో  దావీదు రోజు యొక్క వినయమును మనం గమనించ వచ్చు ఎందుకంటే దావీదు ఏవిధంగానైతే దేవుని పట్ల తన వినయమును కనబర్చాడో అదే విధమైనటువంటి వినయం ఈ రోజు దావీదు సౌలు పట్ల చూపిస్తున్నాడు. వినయం అనేది ఒక గొప్ప ముఖ్యమైనుటువంటి లక్షణం. ఇది మనల్ని ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి, వారిని గౌరవించడానికి దోహదపడుతుంది లేదా సహాయపడుతుంది. వినయం గల వ్యక్తి ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు మరియు ఇతరుల నుండి మంచిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇటువంటి వినయమును మనం దావీదులో చూస్తున్నాము. ఎందుకంటే దావీదును సౌలు రాజు వెంబడించే హతమార్చాలి అనుకున్న సమయంలో దావీదు అతనిని ఎదుర్కొంటాడు. దావీదుకు సౌలును చంపడానికి అవకాశం వచ్చినప్పటికి లేదా ఉన్నప్పటికీ, దావీదు సౌలు రాజును విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ మనం గమనించలసింది దావీదు దేవుని అభిషిక్తుని పట్ల అతని వినయాన్ని మరియు భక్తిని చూపిస్తుంది. కొన్ని సార్లు మన స్వంత  నిర్ణయాలను తీసుకోవడానికి బదులుగా, దేవుని యొక్క న్యాయాన్ని విశ్వసించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఇక్కడ చూపిస్తుంది. ఇది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అధికారాన్ని గౌరవించాలని మరియు మనకు కీడు చేసిన వారి పట్ల కూడా వినయం మరియు దయ చూపాలని మనకు నేర్పిస్తుంది. చివరిగా సౌలు రాజు దావీదును అసూయతో వెంబడించాడు. ఒక సందర్భంలో దావీదు సౌలును చంపడానికి అవకాశం వచ్చింది, కానీ దావీదు అలా చేయలేదు. ఎందుకంటే సౌలు దేవునిచే ఎన్నుకోబడిన రాజు అని దావీదుకు తెలుసు. దావీదు దేవుని పట్ల వినయం కలిగి ఉన్నాడు మరియు దేవుని నిర్ణయాలను గౌరవించాడు. మనము దావీదును ఒక ఉదాహరణగా తీసుకుంటూ మన జీవితాలను దేవునికి అనుకుగుణంగా మార్చుకుంటూ వినయంతో జీవించాలని మొదటి పఠనము మనకు నేర్పిస్తుంది.
సువిశేష గ్రంథ పఠనమును మనం ద్యానించినట్లయితే 
లూకా 6:27-38 చుసినట్లయితే యేసు ప్రేమ మరియు క్షమాపణ గురించి తన  బోధనలనలో బోదిస్తున్నాడు. ఏవిధంగానంటే మన శత్రువులను ప్రేమించమని, మనలను ద్వేషించే వారికి మంచి చేయమని మరియు మనలను శపించే వారిని దీవించమని ఆయన మనలను పిలుస్తాడు. యేసు మన శత్రువులను ప్రేమించమని మనకు తెలియజేస్తున్నాడు. సాధారణంగా మానవుని జీవితంలో క్షమించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం, ఎందుకంటే సహజంగా మనకు హాని చేసిన వారిని ప్రేమించడం అంటే మనకు అసలు నచ్చనటువంటి పని మరియు భయంకరమైనటువంటి కష్టం. కానీ ఈనాడు యేసు మనలను అలా చేయమని పిలుస్తున్నాడు, ఎందుకంటే ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి.
మన శత్రువులను ప్రేమించడం అంటే వారిని క్షమించడం మరియు వారికి మంచి చేయడం. వారిని ద్వేషించకుండా, వారి పట్ల దయ చూపించాలి. ఇది చాలా కష్టమైన పని, ఒక్క సారి పేతురు గారు యేసు ప్రభుని ఇలా అడిగినపుడు నా సహోదరుడు నాయడల తప్పు చేసినప్పుడు ఎన్ని పర్యాయములు అతని క్షమించవలయునని  అడిగినప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మనము చూసియున్నాము. దీనికి యేసు ప్రభువు మనకు ఒక గొప్ప ఉదాహరణగా చూపించాడు. ఆయన మన కొరకు సిలువపై మరణింంచాడు లేదా చనిపోయాడు, మనము ఆయనకు మన పాపల ద్వారా శత్రువులుగా ఉన్నప్పుడు కూడా. ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే అలా చేయగలిగాడు. ఈ సమయము నుండి మనము కూడా మన శత్రువులను ప్రేమించాలని యేసు కోరుకుంటున్నాడు. సాధారణముగా ఇది మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవునీ సహాయం మనతో ఉంటే , మనము కచ్చితంగా ఈ క్షమాపణ అనేది నెరవేర్చగలము. ఎందుకంటే 
మన శత్రువులను ప్రేమించడం వలన మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపించగలము. ఇది మన జీవితంలో సంతోషాన్ని మరియు సమాధానాన్ని కూడా కలిగిస్తుంది.
కాబట్టి, మన శత్రువులను ప్రేమించడానికి మనమందరము గట్టిగా ప్రయత్నించుదాం. ఇది కష్టమైన పని, కానీ చాలా విలువైనది. ఎందుకంటే దేవుడు మనలను క్షమించినట్లే మనం ఇతరులను క్షమించాలి.
రెండవ పఠనము 1 కొరింథీయులు 15:45-49 వచనలలో మనము చూస్తున్నాము. ఇక్కడ మన శరీరాల పరివర్తన గురించి మాట్లాడుతుంది. ఇది మన లౌకిక, నాశనకరమైనటువంటి శరీరాన్ని పునరుత్థానంలో మనం పొందే మహిమకరమైన శరీరంతో విరుద్ధంగా ఉంటుంది అని తెలియజేస్తుంది. అది ఏవిధంగానంటే మనము ఇప్పుడు చూద్దాము. మొదటి మనిషి అయినటువంటి ఆదాము జీవముగల ప్రాణిగా చేయబడ్డాడు మరియు తన శరీరమంత మట్టితో చేయబడింది మరియు అది ఆశాశ్వతమైనది. కానీ చివరి  ఆదాము అంటే క్రీస్తు ఆయన ఆత్మను ఇచ్చేవాడు. ఆయన శరీరము మహిమకరమైనది మరియు నాశనమయేటువంటిది కాదు. ఒక మానవునిగా మన ప్రస్తుత శరీరాలు ఆదాము నుండి వచ్చినవి. అవి అశాశ్వతమైనవి మరియు పాపానికి లోబడి ఉండేటువంటివి. కానీ పరలోక సంబంధమైనటువంటి శరీరము మనము క్రీస్తును విశ్వసించినప్పుడు, మనము పరలోక సంబంధమైన శరీరాన్ని పొందుతాము. ఇది మహిమకరమైనది మరియు శాశ్వతమైనది. ఈనాడు మనం మన ప్రస్తుత శరీరం గురించి మనం ఏవిధంగా ఆలోచిస్తున్నాము అని మనలను మనం ఒక్క సారి ద్యానిచుకుంటూ ప్రశ్నించుకుందాము.
కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా ఈనాడు మనమందరము దేవుని పట్ల మరియు మానవుని పట్ల వినయం చూపిస్తూ, క్షమాగుణం కలిగి ఇతరులకు పంచుతూ, క్రీస్తులో భాగమై జీవిస్తూ ఆయనతో ఒకటై ఉండాలని ఈ దివ్యబలిలో ప్రార్థిస్తూ పాల్గొందాము.

 ‌Fr. Johannes OCD

19, ఫిబ్రవరి 2025, బుధవారం

మార్కు 9:41-50

 February 27

సిరా 5:1-8

మార్కు 9:41-50

మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవ్వడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగచెప్పుచున్నాను" అనెను. "నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైన పాపి అగుటకు కారకుడగుటకంటె, అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక్క చేతితో నిత్యజీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాపకారణమైనచో, దానిని నరికి పారవేయుము. రెండుకాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కనులు నీకుపాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. రెండుకన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటకంటె ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉప్పదనము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని అది తన ఉప్పదనమును కోల్పోయిన, తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున, మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు  సమాధానముతో ఉండుడు" అనెను.  

క్రీస్తు సంబంధీకులు : ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు మిమ్ములను క్రీస్తు సంబంధీకులుగా గుర్తించి మీకు ఎవరు చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును పొందును అని అంటున్నారు. ఎవరు ఈ  క్రీస్తు సంబంధికులు అంటే సువిశేష భాగంలో యేసు ప్రభువుని అనుచరులు అని లేక శిష్యులు అని తెలుస్తుంది. ఇది కేవలం అప్పటి శిష్యులు లేక అనుచరులేనా  అంటే కాదు ఎందుకంటే యేసు ప్రభువుకు చెందిన వారు ఎవరో మనము ఈ అధ్యాయములోనే చూస్తాము. అంతకు ముందు ప్రభువు పేరిట ఒకడు దయ్యములను వదలకొడుతున్నప్పుడు శిష్యులు వాడిని వారించిన పిదప ఆయనకు ఆ విషయం చెప్పగా ప్రభువు అతనిని తనకి చెందిన వానిగానే చెబుతున్నాడు. తరువాత కూడా మీరు వెళ్లి లోకమున ఉన్న వారిని నా అనుచరులుగా చేయమని ప్రభువు చెబుతున్నాడు. ఎవరు అయితె ప్రభువు మాట ప్రకారం జీవిస్తారో వారు క్రీస్తు అనుచరులు, వారే క్రీస్తు సంబంధీకులు. అందుకే ప్రభువు నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడె నా సోదరుడు సోదరి, తల్లి అని ప్రకటించారు. ఈరోజు మనం ఆయన సంబంధీకులము కావాలంటే ఆయన మాటలను అనుసరించాలి. ఈ విధంగా జీవించిన క్రీస్తు సంబంధీకులను గౌరవించిన వారికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే వారి ద్వారా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఇది వారి మాటల ద్వారా వారి ప్రేమ పూర్వక జీవితం ద్వారా జరుగుతుంది. 

పాపము చేసిన వారు నరకానికి వెళుతారు, నరకములో ఒక వ్యక్తి  చాలా ఘోరమైన బాధలకు గురవుతాడు.  అది నిత్యము బాధలతో ఉండే స్థితి.  నరకము అనేది దేవున్ని  తిరస్కరించి, ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తు  పశ్చాత్తాప పడకుండా పాపములోనే  మరణించేవారు పొందే స్థితి.  నరకంలోఎల్లప్పుడు బాధ అనే స్థితి మాత్రమే ఉంటుంది. ఊరట కోసం ఎంత ప్రయత్నించిన అది అది వారికి అందదు. అందుకే ప్రభువు ఈ స్థితి మనకు రాకూడదు అని కోరుకుంటున్నారు. అందుకే మనిషిని నరకానికి పాత్రులుగా చేసే ఎటువంటి దానిని కూడా మన దగ్గర ఉండకూడదు అని కోరుకుంటున్నారు. 

ప్రభువు మనలను ఇతరులు పాపము చేయుటకు కారణం కాకూడదు అని చెబుతున్నారు. అటుల అగుటకంటె మనము మరణించుటయే మంచిది అని పలుకుతున్నారు. మనము పాపము చేయుటకంటే  మనము పాపము చేయుటకు మనలో  ఏదైన కారణమైతే  దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండమని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు ఎందుకు ఇలా చెబుతున్నాడు?  ఎందుకంటే నిత్యం జీవం అనేది అత్యంత విలువైనది, ఏమి ఇచ్చిన కాని దానిని కొనలేము.  మంచి జీవితం జీవించే వారికి దేవుడు ఇచ్చే బహుమతి ఇది.  ఏ వ్యక్తి కూడా తన సొంత ప్రతిభ వలన సాధించదగినది కాదు. పాపము చేసిన వారు కూడా పశ్చాత్తాప పడి ప్రభువు ముందు క్షమాపణ అడిగితే వారికి కూడా ప్రభువు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. అది ప్రభువును ముఖాముఖిగా దర్శించు భాగ్యం. ఎల్లప్పుడూ ఆనందముగా ఉండేటువంటి స్థితి.    అందుకే మనలో పాపకారణమైన భాగం ఉంటె దానిని  కోల్పోవడానికి అయిన సిద్దపడి నిత్యజీవం పొందుటకు సాధన చేయమని ప్రభువు చెబుతున్నాడు. 

ప్రార్ధన: ప్రభువా! మీ అనుచరులు ఎల్లప్పుడు మీమ్ములను ఆదర్శంగా తీసుకోవాలని, మీ వలె జీవించాలని కోరుకుంటున్నారు. మీ అనుచరులను గౌరవించిన వారికి తగిన ప్రతిఫలమును పొందుతారు అని చెబుతున్నారు.  మీ అనుచరులుగా మీకు సంబంధికులుగా ఉండుటవలన  మిమ్ము ఇతరులకు మా జీవితాల ద్వారా   చూపించు,వినిపించు అనుగ్రహం ప్రసాదిస్తున్నారు. దీనిని సద్వినియోగ పరచుకొని    చెడుమార్గంలో ప్రయాణించకుండ, మీ మార్గములో ప్రయాణిస్తూ, మాలో ఏదైనా పాపకారణమైనది ఉన్నచో దానిని తీసివేసి, మీ వలె జీవిస్తూ, నిత్యజీవానికి వారసులము అయ్యేలా అనుగ్రహించండి. ఆమెన్. 


16, ఫిబ్రవరి 2025, ఆదివారం

మార్కు 9:38-40

 February 26

సిరా 4:11-19

మార్కు 9:38-40

అంతట యోహాను యేసుతో "బోధకుడా! మనలను అనుసరింపని ఒకడు నీపేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి" అని పలికెను. అందుకు యేసు "మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయన, నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధికానివాడు మన పక్షమున ఉండువాడు. 

యోహాను  యేసుతో, “బోధకుడా, దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తిని మేము చూశాము. అతను మనల్ని అనుసరించడు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాము” అని చెప్పడంతో ప్రారంభమవుతుంది ఈనాటి సువిశేషం. ఆ  వ్యక్తి దయ్యాలను వెళ్ళగొట్టే సామర్థ్యం పట్ల శిష్యులు  అసూయపడుతున్నారా? వారు ఈ రకమైన శక్తిని కలిగి ఉండాలనుకుంటున్నారా?  అనే ప్రశ్నలను అడిగితే ఆ వ్యక్తి వలే వీరుకూడా చేయాలి అని అనుకోని ఉండవచ్చు. యేసు యోహానుతో, “అతన్ని నిరోధించవద్దు. ఎవరైనా నా నామంలో మంచి పని చేస్తే, నా గురించి వారు ఎలా  చెడుగా మాట్లాడరు” అని అంటాడు. తరువాత యేసు ఇలా అంటాడు: “మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడు.”

ఈ రోజు యేసు ప్రభువు  మనకు ఒక ముఖ్యమైన సూచన ఇస్తున్నాడు. మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నాడని ఆయన మనకు చెబుతున్నాడు. సాధారణంగా చాలా మంది మానవులకు ఏ వ్యక్తులు తమను ఆదరిస్తారో తెలుసు. అయితే, ఏ వ్యక్తులు మనతో పోరాడవచ్చు, మనల్ని ఇష్టపడకపోవచ్చు లేదా మనల్ని విస్మరించవచ్చు అని కూడా మనకు తెలుసు.  కాని ఈ రోజులలో మనతో మంచిగా మాటలాడి మనము లేని సమయంలో వ్యతిరేకంగా మాటలాడువారే ఎక్కువ మంది ఉండవచ్చు. 

యేసు ప్రభువును అనుసరించకుండా,  ఆయన నామమున ఒక వ్యక్తి దయ్యములను వెడలగొడుతున్నాడు అంటే ఆ వ్యక్తి యేసు ప్రభువును దేవునిగా , రక్షకునిగా అంగీకరించాడు. మరియు యేసు ప్రభువు మాటలను పాటించి జీవిస్తూ ఉండవచ్చు. ఎదో ఒక సమయంలో ప్రభువు మాటలను విని, ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. ప్రభువు చెప్పినట్లు ఆ వ్యక్తి ప్రార్థన, మరియు ఉపవాసములతో జీవించేవాడు అయివుండవచ్చు ఎందుకంటే ప్రభువే చెబుతున్నాడు ఇటువంటివి కేవలం ప్రార్ధన మరియు ఉపవాసంతోనే సాధ్యమని కనుక ఆ వ్యక్తి ప్రభువుతో ఉండకపోయినా  ప్రభువుని అనుచరుడే. 

 మానవులుగా, మనలో చాలామంది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో దాని గురించి ఎక్కువగా శ్రద్ధ వహించవచ్చు. అయితే, యేసు తన శిష్యులు నిజంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాడు. వారు ఇతరుల పట్ల అసూయపడటం లేదా మరొకరి సామర్థ్యాలు మరియు బహుమతులను కోరుకోవడం ఆయనకు ఇష్టం లేదు. తన శిష్యులు తమ సొంత బహుమతులను మరియు ఇతరుల బహుమతులను కూడా అభినందించాలని యేసు స్పష్టంగా కోరుకుంటున్నాడు.

Br. Pavan OCD

మార్కు 9:30-37

 February 25

సిరా 2:1-11

మార్కు 9:30-37

వారు ఆ స్థలమును వీడి గలిలీయ ప్రాంతమునకు వెళ్లిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికిని తెలియకూడదని ఆయన కోరిక. ఏలయన, "మనుష్యకుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు కాని మరణించిన మూడవదినమున ఆయన పునరుత్తానుడగును" అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కఫర్నామునాకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను "మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి?" అని అడిగెను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించు కొనియుండుటచే వారు ప్రత్యుత్తరమీయలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి, "ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై, అందరకు సేవకుడుగా ఉండవలయును"అని పలికెను. మరియు ఆయన ఒక చిన్నబిడ్డను చేరదీసి వారి మధ్యనుంచి, వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, "ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడగును. నన్ను  స్వీకరించినవాడు నన్నుకాదు , నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు" అనెను. 

యేసు ప్రభువు , పన్నెండు మందిని పిలిచి, మీలో ఎవరైనా మొదటివారిగా  ఉండాలనుకుంటే, అతను చివరివాడిగా మరియు అందరికీ సేవకుడిగా ఉండాలని చెబుతున్నాడు.  అంతకు ముందు  యేసు ప్రభువు   తనకి  అత్యంత  సన్నిహిత శిష్యులను, తీసుకొని ఒక రహస్య ప్రదేశానికి ప్రార్ధించుటకు వెళ్ళాడు, తరువాత  వారు కఫర్నముకు వచ్చారు, యేసు ప్రభువు  వారిని దారిలో దేని గురించి వాదిస్తున్నారని అడిగాడు. ఎవరు గొప్పవారో వారు వాదించుకుంటున్నారని వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు.  అది ప్రభువుకు వారు చెప్పలేక పోయారు. 

 మొదటివారిగా  ఉండాలనుకునే ఎవరైనా చివరివారై ఉండాలి, అందరికీ సేవకుడుగా  కావాలని ప్రభువు  చెప్పాడు. కేవలం అది చెప్పడంతో ఆగిపోకుండా  ఒక చిన్న బిడ్డను తీసుకొని , వారి మధ్య ఉంచి తన పేరు మీద ఒక బిడ్డను స్వాగతించేవాడు తనను స్వాగతిస్తాడని చెబుతున్నాడు. చిన్నవాడిని లేక ఇతరుల మీద ఆధారపడేవారిని ఆహ్వానించడం మనలను దైవ స్వభావం కలిగేలా చేస్తుంది. ప్రపంచం తరచుగా నాయకత్వాన్ని, అధికారంతో, శక్తితో సమానం చేస్తుంది. 

దేవుని రాజ్యంలో, అధికార సమీకరణం తారుమారు అవుతుంది. మనం సేవ చేయడం ద్వారా నాయకత్వం వహిస్తాము, దిగువకు మారడం ద్వారా ఉన్నతంగా వెళ్తాము, అత్యల్పంగా ఉండటం ద్వారా అధికారాన్ని ఉపయోగిస్తాము. స్వార్థపూరిత నాయకత్వానికి అలవాటుపడిన ప్రపంచంలో ఇది అర్ధవంతం కాదు. దేవుడిని ప్రేమించడం మరియు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనే రెండు గొప్ప ఆజ్ఞలు ఉన్న సమాజ మాత్రమే లో, లోక  నియమాలను తిప్పికొట్టకలుగుతుంది. .

మనం ఇతరులకు సేవ చేసినప్పుడు నాయకత్వం వస్తుంది. ప్రజలకు సహాయం చేయడంలో ప్రభావం వస్తుంది.  అది మనం కోరుకునేది కాదు, ఎందుకంటే మనం కోరుకునేది సేవ చేయడమే. సేవ చేయడంలో అవకాశం నాయకత్వం వహించడానికి రావచ్చు.

Br. Pavan OCD

మార్కు 9:14-29

 February 24

సిరా 1:1-10

మార్కు 9:14-29

వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మ శాస్త్ర బోధకులు క్కో శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగనే ప్రజలు ముగ్గుల ఆశ్చర్యపడి, పరుగునవచ్చి ఆయనకు నమస్కరించిరి. "వారితో ఏ విషయమునుగూర్చి తర్కించుచున్నారు?" అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములో ఒకడు "బోధకుడా!మూగ దయ్యము పట్టిన నా కుమారుని తమయొద్దకు తీసుకొనివచ్చితిని. భూతము వీనిని ఆవేశించినపుడెల్ల నేలపై  పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కోరుకుచు, కొయ్యబారిపోవును.  ఈ దయ్యమును పారద్రోలమీ శిష్యులను కోరితిని. అది వారికి సాధ్యపడలేదు" అని విన్నవించెను. యేసు వారితో "మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంత కాలము మీ మధ్యనుందును? ఎంతవరకు  మిమ్ము సహింతును? ఆ బాలుని ఇటకు తీసుకొని రండు" అనగా, వారు అట్లే వానిని తీసికొని వచ్చిరి. యేసును చూచినవెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి, అటుఇటు దొర్లించి, నురుగులు క్రక్కించెను. "ఈ  దుర్బరావస్థ ఎంత కాలము నుండి?" అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. "పసితననము నుండి" అని అతడు బదులు   చెప్పి, "అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్లలోను, నిప్పులలోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయముచేయుడు" అని ప్రార్ధించెను. అందుకు యేసు "సాధ్యమగునేని' అనుచున్నావా! విస్వసించు వానికి అంతయు సాధ్యమే" అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి "నేను  నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము  లేకుండునట్లు తోడ్పడుము" అని ఎలుగెత్తి పలికెను.  అంతట జనులు గుమికూడి తనయొద్దకు పరుగెత్తుకొనివచ్చుట  చూచి యేసు "మూగ చెవిటి దయ్యమా! ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడును వీనిని ఆవహింపకుము" అని శాసించెను. అప్పడు ఆ  భూతము ఆర్భటించుచు, బాలుని విలవిలలాడించి వెళ్లిపోయెను. బాలుడు పీనుగువలె  పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెననిరి. కాని, యేసు వాని చేతినిపట్టి లేవనెత్తగా వాడులేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్లిన పిదప శిష్యులు  ఏకాంతముగ ఆయనతో "ఈ దయ్యమును పారద్రోల మాకు ఏల సాధ్యపడలేదు?" అని ప్రశ్నించిరి. అందుకు ఆయన   వారితో, "ప్రార్ధనవలనతప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు" అని చెప్పెను. 

శిష్యులు  మూర్ఛరోగిని ‘ స్వస్థపరచలేక’ దుష్టాత్మను వెళ్లగొట్టలేకపోవుటను  చూసినప్పుడు, వారు తమ వైఫల్యానికి కారణాన్ని గురువును అడిగారు. ఆయన వారికి ‘సాతానుపై  శక్తి మరియు అధికారం, మరియు అన్ని వ్యాధులను నయం చేయడానికి శక్తిని ’ ఇచ్చాడు. వారు తరచుగా ఆ శక్తిని ఉపయోగించారు మరియు  వారికి సాతాను ఎలా లోబడి ఉన్నాడో సంతోషంగా చెప్పారు. అయినప్పటికీ, ఆయన కొండపై ఉన్నప్పుడు, వారు పూర్తిగా విఫలమయ్యారు. 

దేవుని చిత్తం లేకుండా విముక్తి ప్రసాదించడం, అయన అనుగ్రహం లేకుండా ఏదైనా సాధించడం సాధ్యం కాదు. క్రీస్తు ఆజ్ఞ మేరకు దుష్టాత్మ వెళ్ళిపోయింది.  మేమెందుకు చేయలేకపోయాము?’ అనే వారిప్రశ్న,  వారు కూడా ఆ దుష్టాత్మను వెళ్ళగకొట్టాలని   ప్రయత్నించారని స్పష్టంగా తెలుస్తుంది; వారి ప్రయత్నాలు ఫలించలేదు , ప్రజల ముందు వారి అశక్తి నిరూపితమైంది. దానికి వారు సిగ్గుపడ్డారు. 

విశ్వాసం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత వ్యాయామం, ఇక్కడ మన ఆత్మ దేవుని ఆత్మకు పరిపూర్ణంగా స్వీకరించడంలో తనను తాను సమర్పించుకుంటుంది మరియు  అత్యున్నత కార్యాచరణకు బలపడుతుంది. ఈ విశ్వాసం పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిపై ఆధారపడి ఉంటుంది; ఇది బలంగా మరియు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మన జీవితంలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించినప్పుడు మాత్రమే, దాని శక్తివంతమైన పనులను చేయడానికి విశ్వాసమునకు  శక్తి ఉంటుంది. 

అందుకే యేసుప్రభువు సాతాను ఉపవాసం మరియు ప్రార్థన ద్వారా మాత్రమే పారద్రోలబడుతుంది.  ఈ దుష్టాత్మలో ఉన్న మొండి పట్టుదలను , ప్రతిఘటనను అధిగమించగల విశ్వాసం, దేవునితో  సన్నిహిత సహవాసంలో ఉండి మరియు లోకం దాని క్రియల నుండి సాధించవచ్చు.  విశ్వాసం పెరగడానికి మరియు బలంగా ఉండటానికి ప్రార్థన జీవితం అవసరం.  ప్రార్థన ఉపవాసం విశ్వాసాన్ని పెంచుతాయి. 

విశ్వాసం పెరుగుదల కోసం ప్రార్థన జీవితం అవసరం. ఆధ్యాత్మిక జీవితంలోని అన్ని విభిన్న భాగాలలో, దేవునితో ఎంత దగ్గర సంబంధం కలిగి ఉంటామో అంత పవిత్రత కలిగి ఉంటాము. భగవంతుడిని ఆరాధించడంలో, ఆయన కోసం వేచి ఉండటంలో, దేవుడు తనను తాను మనకు వెల్లడించడానికి సిద్ధపడేది మన విశ్వాసం ప్రకారముగానే తెలుసుకుంటాము. దాని దేవుడిని తెలుసుకునే మరియు విశ్వసించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.

Br. Pavan OCD

మార్కు 10:1-12

 February 28

సిరాకు 6:5-17

మార్కు 10:1-12

యేసు ఆ స్థలమును వీడి యొర్దాను నదికి ఆవాలనున్న యూదయా ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను  చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్ధము పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, "భార్యను పరిత్యజించుట భర్తకు తగునా?" అని ప్రశ్నించిరి. అందుకు యేసు "మోషే మీకేమి ఆదేశించెను?" అని తిరిగి ప్రశ్నించెను. "విడాకుల పత్రమును వ్రాసియిచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను?" అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు "మీ హృదయకాఠిన్యమునుబట్టి  మోషే ఇట్లు ఆదేశించెను. కాని, సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు. ఈ హేతువువలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏకశరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులుకాక, ఏక శరీరులైయున్నారు. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరుపరాదు" అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి  శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అపుడు ఆయన వారితో "తన భార్యను పరిత్యజించి, వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి, వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది" అని పలికెను.   

అన్ని వివాహాలు స్వర్గంలో జరగవు. కొన్ని బలవంతపు వివాహాలు మరియు మరికొన్ని ప్రేమలేని వివాహాలు. ఒక వివాహిత జంట రాత్రింబవళ్ళు ఒకరితో ఒకరు గొడవపడటం లేదా మూడవ వ్యక్తి లేదా నాల్గవ వ్యక్తితో, ఒకరి దాంపత్య జీవిత  సంబంధంలో నిరంతరం ముల్లుగా మారడం ఊహించుకోండి. కొన్ని కుటుంబాలు   ఎంత దురదృష్టకర జీవితాన్ని గడుపుతాయి! కాబట్టి క్రైస్తవ సమాజంలో  కూడా విడాకుల ప్రశ్న ప్రతిసారీ తలెత్తుతుంది. విరిగిన కుటుంబం యొక్క తక్షణ పరిణామం దాని సభ్యుల విచ్ఛిన్నమైన సంబంధం.విడాకుల తర్వాత కూడా మనం సంతోషకరమైన ముఖాలను చూడగలిగినప్పటికీ, విభజన యొక్క గాయం  ముఖ్యంగా విరిగిన కుటుంబం యొక్క మొదటి బాధితులైన పిల్లలలో కొనసాగుతుంది. 

కుటుంబంలో విచ్ఛిన్నం దేవునితో మన విచ్ఛిన్నమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజల హృదయ కాఠిన్యం కారణంగా మోషే విడాకులను అనుమతించాడని యేసు ప్రభువు  వివరించాడు. చాలా మంది ప్రవక్తల మాట మరియు యేసుప్రభువు  మాట వినకుండా  అదే హృదయ కాఠిన్యం కలిగి జీవిస్తుంటారు. ఈ రోజుల్లో ప్రజలు, ప్రేమ మరియు పశ్చాత్తాపం యొక్క సువార్త సందేశాన్ని వినకపోవడానికి ఇది కారణం ఈ హృదయ కాఠిన్యమే కావచ్చు. బహుశా భార్యాభర్తలు  ఒకరినొకరు వినడం నేర్చుకుంటే, ముఖ్యంగా దేవుని మాట వినడం నేర్చుకుంటే, విడాకుల సమస్యకూడా చర్చించబడకపోవచ్చు. వారు ఒకే శరీరంగా ఉండటం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుని, వారి ఏకత్వాన్ని కొనసాగిస్తే, మానవాళి మొత్తం దేవుడు అందరికీ ఒకే తండ్రిగా ఉన్న నిజమైన కుటుంబంగా ఉంటుంది. ప్రతి కుటుంబం మనుగడ మరియు ఆనందం కోసం మనం ప్రార్థిస్తూ ఉండటం క్రైస్తవుల కర్తవ్యం. 

Br. Pavan OCD

15, ఫిబ్రవరి 2025, శనివారం

లూకా 6: 27-38

 February 23

మొదటి సమూయేలు 26: 2, 7-9, 12-13, 22-23

మొదటి కొరింథీయులు 15: 45-49

లూకా 6: 27-38

"కాని, మీతో నేను చెప్పునది ఏమన: మీ శత్రువును ప్రేమింపుడు. మిమ్ము ద్వేషించువారికి మేలు చేయుడు. మిమ్ము శపించువారిని ఆశీర్వదింపుడు. మిమ్ము బాధించువారికై ప్రార్ధింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టినవానికి రెండవ చెంపను కూడా చూపుము. నీ పై బట్టను ఎత్తుకొనిపోవు వానిని  నీ అంగీనికూడా తీసికొనిపోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొనిపోవు వానిని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలెనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించినవారిని మాత్రమే మీరు ప్రేమించినచో యిందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటుల చేయుటలేదా? తిరిగి ఈయగల వారికే ఋణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులును అటుల  పాపులకు ఇచ్చుటలేదా? కనుక, మీరు మీ శత్రువులను ప్రేమింపుడు. వారికి మేలు చేయుడు. అప్పు ఇచ్చి తిరిగిపొందవలెనని ఆశపడకుడు. అపుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలయన, ఆయన కృతజ్ఞతలేని  వారికిని, దుష్టులకును మేలుచేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై యుండుడు. "పరులను గూర్చి మీరు తీర్పుచేయకుడు. మిమ్మును గూర్చియు తీర్పుచేయబడదు. పరులను ఖండింపకుడు. అపుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు. మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు ఒసగుడు. మీకును ఒసగబడును, కుదించి, అదిమి, పొర్లిపోవు నిండుకొలమానముతో ఒసగబడును. మీరు ఏ  కోలతతో కొలుతురో, ఆ కొలతతోనే మీకును కొలవబడును" అని యేసు పలికెను. 

నేటి సువార్తలో యేసు ప్రభువు  మనల్ని “ఉన్నతమైన” ప్రేమకు పిలుస్తున్నాడు. ఆధ్యాత్మిక మినిమలిజాన్ని ఆచరించకుండా లేదా అనుసరించకుండా ఉండమని యేసు మనల్ని కోరుతున్నాడు, అంటే, అవసరమైన వాటిలో కనీసాన్ని మాత్రమే చేయాలని చూడటం లేదా “తగినంత మంచి” పద్ధతి ద్వారా జీవితాన్ని గడపడం - క్విడ్ ప్రో కో దానిని తగ్గించదు. యేసు ప్రభువుని  యొక్క “ఉన్నతమైన ప్రేమ” నిజంగా ఫ్రాన్సిస్ “భక్తి” భావన గుండెలో ఉంది. ఆయన ఇలా వ్రాశాడు: “నిజమైన, సజీవ భక్తి దేవుని ప్రేమను సూచిస్తుంది, కాబట్టి ఇది దేవుని నిజమైన ప్రేమ. అయినప్పటికీ అది ఎల్లప్పుడూ అలాంటి ప్రేమ కాదు. దైవిక ప్రేమ ఆత్మను అలంకరిస్తుంది కాబట్టి, దానిని కృప అంటారు, ఇది దేవుని దైవిక మహిమకు మనల్ని సంతోషపరుస్తుంది. మంచి చేయడానికి అది మనల్ని బలపరుస్తుంది కాబట్టి, దానిని దాతృత్వం అంటారు. అది పరిపూర్ణతకు చేరుకున్నప్పుడు, అది మనల్ని మంచి చేయడమే కాకుండా జాగ్రత్తగా, తరచుగా మరియు వెంటనే మంచిని చేయమని  చేస్తుంది.

దేవా, ఈ ఉన్నత ప్రేమను జీవించడానికి మాకు సహాయం చేయండి. జీవితంలో వచ్చే కొన్ని సమస్యలు, బాధలు కష్టాల నుండి తప్పించుకోవడానికి లేదా “పారిపోవడానికి” ప్రయత్నించకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి; నిజంగా జీవించడం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి.

ప్రతిఫలం ఏమీ ఆశించకుండా మంచి చేయడం. మన శత్రువుల పట్ల  ప్రేమ కలిగి ఉండటం ఎప్పుడూ ఆదరణ పొందిన ఆజ్ఞ కాదు.  కానీ యేసు ఇలా చెప్పినప్పుడు చాలా ఖచ్చితముగా చెప్పాడు. అందుకే ఆయన అనుచరులు దానిని చాలా స్పష్టంగా ఆచరించారు. తొలి క్రైస్తవులు  యేసు ప్రభువు చెప్పినట్లుగా జీవించారు. శిష్యులు వారు పొందిన శ్రమలకు ప్రతీకారం తీసుకోలేదు.  శిష్యుల హింసలన్నింటిలోనూ  ప్రతీకారం తీర్చుకున్నారని లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించారని మనకు ఏవైనా ఆధారాలు ఉన్నాయా? నాకు ఏమీ తెలియదు.. శత్రువుల పట్ల ప్రేమను బోధించినప్పుడు యేసు తన దైవిక మూలాల్లోకి లోతుగా చేరుకున్నాడు. ఇది విమోచన యొక్క అంతర్గత తర్కానికి విజ్ఞప్తి చేస్తుంది. దేవుడు పాపాన్ని క్షమించినట్లే, మనం కూడా క్షమించాలి.

సువార్త యొక్క తర్కం చాలా సులభం, ద్వేషం ద్వేషాన్ని పుట్టిస్తుంది, క్షమాపణ క్షమాపణను పుట్టిస్తుంది మరియు ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది; చూడటం సులభం, కానీ జీవించడం కష్టం. మనం ఎక్కడ ప్రారంభించాలి? మీరు ఏమి చేయగలరు? మీకు నచ్చని లేదా బాధపెట్టిన లేదా మీరు పోరాడిన వ్యక్తి కోసం ప్రార్థించడం ఒక సాధారణ ప్రారంభం. మీరు రాజీపడటానికి ప్రయత్నించడానికి ధైర్యం, విశ్వాసం కనుగొనవచ్చు. కోపం మరియు ద్వేషం అలసిపోయేవి మరియు చీకటిగా ఉంటాయి. యుద్ధం అలసిపోయేది. ప్రేమ శక్తినిస్తుంది మరియు ఉత్సాహపరుస్తుంది మరియు ప్రకాశవంతంగా ఉంటుంది. క్రీస్తు క్షమించే స్వభావాన్ని మనం కూడా అలవరచుకుందాం. 

Br. Pavan OCD

14, ఫిబ్రవరి 2025, శుక్రవారం

మత్తయి 16: 13-19

 February 22

మొదటి పేతురు 5: 1-4

మత్తయి 16: 13-19

వారు ఇద్దరు తిరిగివచ్చి తక్కినవారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై,  సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యమునకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచమందంతట తిరిగి, సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపనివానికి దండన విధింపబడును. విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు. నా నామమున దయ్యములను వెళ్లగొట్టెదరు. అన్యభాషలను మాట్లాడెదరు. పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములనుంచిన  వారు ఆరోగ్యవంతులు అగుదురు." ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని  కుడిప్రక్కన కూర్చుండెను. 

తన మొదటి లేఖలో, పునీత  పేతురు విశ్వాసులను చూసుకోవడానికి బాధ్యత వహించే వారికి ఒక మతసంబంధమైన లేఖ ద్వారా తన అధికారాన్ని ఎలా ఉపయోగించాడో మనకు చెబుతాడు. ఈ భాగంలో పేతురు తాను క్రీస్తు బాధలకు సాక్షిగా ఉన్నానని మాట్లాడుతుంటాడు - తాను ప్రభువుతో ఉన్నానని మరియు మానవ క్రీస్తును తెలుసుకున్నానని తన పాఠకులకు గుర్తు చేస్తున్నాడు.

ప్రభువు తమకు అప్పగించిన వారికి నిజమైన కాపరులుగా ఉండాలని మరియు సువార్తకు సజీవ సాక్షులుగా పరిపూర్ణ ఉదాహరణలుగా ఉండాలని పెద్దలందరినీ ఆయన ఎలా వేడుకుంటున్నాడో కూడా ఈ లేఖ మనకు చెబుతుంది. క్రీస్తు తర్వాత పేతురు మందకు ప్రధాన కాపరిగా ఉన్నందున, నేటి కీర్తన ప్రభువు నిజమైన కాపరి అని మనకు గుర్తు చేస్తుంది.

 పునీత  మత్తయి సువార్త భాగం పేతురుకు  క్రీస్తుపై గొప్ప విశ్వాస ప్రకటన తర్వాత క్రీస్తు  సంఘానికి  నాయకుడిగా నియమించబడ్డాడని చూపిస్తుంది. అతను కొత్తగా వచ్చిన సమూహానికి నాయకుడిగా ఉన్నప్పటికీ, అతను సంఘ  ఐక్యతకు శక్తివంతమైన చిహ్నంగా కూడా ఉన్నాడు, ఇది నేటి వరకు కొనసాగుతోంది.

పునీత పేతురు  అపోస్తులిక పరంపరను  మరియు పునీత పేతురు రోము మొదటి పీఠాధిపతిగా   క్రైస్తవ సంఘ నాయకునిగా తెలుపుతుంది ఈనాటి దైవార్చన. . పునీత పేతురు  అసలు పేరు సైమన్. అతనిని  శిష్యులలో  మరియు యేసు పన్నెండు మంది అపొస్తలులలో ఒకరిగా ఉండమని పిలిచినప్పుడు కఫర్నములో జాలరిగా నివసిస్తున్నాడు . యేసు ప్రభువు  పేతురుకు అపొస్తలులలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. క్రీస్తు రూపాంతరం మరియు గెత్సేమనే తోటలో వేదన వంటి ప్రత్యేక సందర్భాలలో క్రీస్తుతో ఉన్న ముగ్గురిలో అతను ఒకడు. పునరుత్థానం తర్వాత మొదటి రోజున క్రీస్తు కనిపించిన ఏకైక అపొస్తలుడు ఆయన.

పేతురు తరచుగా అపొస్తలుల తరపున మాట్లాడేవాడు.మనం  తిరుసభలో , సంఘంలో “పేతురు స్థానాన్ని ”  ప్రత్యేకమైనదిగా జరుపుకుంటున్నప్పుడు, దేవుని రాజ్య పనిని కొనసాగించడంలో యేసు మనలో ప్రతి ఒక్కరికీ ఒక కుర్చీని - ఒక స్థలాన్ని, ఒక పాత్రను - సిద్ధం చేశాడని మర్చిపోకూడదు. . పేతురులాగే, నేడు మన స్థానాన్ని తీసుకునే ధైర్యం మనకు ఉందా? అని ఆలోచిస్తూ , దేవుడు మనకు ఏర్పరచే స్థానాన్ని ఎల్లపుడు కాపాడుకొనుటకు ప్రయత్నించుదాం. 

Br. Pavan OCD

మార్కు 8: 34 – 9:1

 February 21

ఆదికాండము 11: 1-9

మార్కు 8: 34 – 9:1

అంతట యేసు జనసమూహములను, శిష్యులను చేరబిలిచి, "నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని, తన సిలువను మోసికొని, నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొనచూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి, తన ఆత్మను కోల్పోయిన, వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఈయగలడు? నన్ను గూర్చి నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచారతరములో సిగ్గుపడువానిని గూర్చి, మనుష్య కుమారుడు కూడ దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును" అని పలికెను. మరియు ఆయన వారితో, "దేవునిరాజ్యము శక్తి సహితముగ సిద్దించుట చూచువరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగాఆ  చెప్పుచున్నాను" అని పలికెను. 

ఆదికాండము పుస్తకాన్ని చదివినప్పుడు, ప్రజలు ఒడంబడిక నుండి ఎలా దూరమయ్యారో మరియు వారి గర్వంతో స్వర్గం వరకు చేరుకునే గోపురాన్ని నిర్మించడం ద్వారా దేవుని వలె శక్తివంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని మనం చూస్తాము. వారి అహంకారంతో, దేవుడు ఆ గోపురాన్ని నాశనం చేస్తాడు మరియు ప్రజలు ఒకరి భాష ఒకరు   అర్థం చేసుకోలేని విధంగా వారికి వివిధ భాషలను ఇవ్వడం ద్వారా వారిని గందరగోళానికి గురిచేస్తాడు. 

వాస్తవానికి మనం పరలోకంలో మన స్థానాన్ని పొందేందుకు కృషి చేస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించడం వ్యర్థమని యేసు సువార్తలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసును నిజాయితీగా మరియు నిశ్చయమైన హృదయంతో అనుసరించేవారు మాత్రమే రాజ్యంలోకి మరియు వారి నిజమైన వారసత్వంలోకి ప్రవేశిస్తారు.

భవనాన్ని నిర్మించడం ఒక విషయం, కానీ దానిని నిర్వహించడం మరొక విషయం. వివేకవంతమైన నిర్మాణకులు/యజమానులు తాము నిర్మించే దాని  నిర్మాణం కోసం వనరులను కేటాయించడమే కాకుండా, భవనం యొక్క నిరంతర నిర్వహణ కోసం వనరులను కూడా కేటాయించారు. ప్రధాన నిర్మాణకర్త అయిన దేవుడు - మనలో ప్రతి ఒక్కరినీ తన స్వరూపంలో మరియు పోలికలో నిర్మించాడు. మనం వస్తువులను నిర్మించడం ద్వారా - ముఖ్యంగా సంబంధాలను - నిర్మించడం ద్వారా దేవుని నిర్మాణాన్ని జరుపుకుందాం, దీని ముఖ్య లక్షణాలు వినయం మరియు దాతృత్వం. అలా చేయడం ద్వారా, మనం మనకే కాదు, దేవునికే మహిమ తెచ్చుకుందాం! . 

Br. Pavan OCD

మార్కు 8: 27-33

 February 20

ఆదికాండము 9: 1-13

మార్కు 8: 27-33

యేసు శిష్యులతో కైసరయా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్లుచు, మార్గ మధ్యమున "ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు?" అని వారిని అడిగెను. అందుకువారు, "కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలీయా అనియు, లేదా మరియొక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు" అనిరి. అప్పుడు యేసు "మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు? అని వారిని ప్రశ్నింపగా, పేతురు, "నీవు క్రీస్తువు" అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు "మనుష్యకుమారుడు అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, చంపబడి, మూడవదినమున ఉత్తానమగుట అగత్యము" అని ఉపదేశించి, వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసికొనిపోయి, "అటుల పలుకరాదు" అని వారింపసాగెను. యేసు శిష్యులవైపు తిరిగి పేతురును చూచి, "సైతానూ!నీవు నా వెనుకకు పొమ్ము   నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవికావు" అనెను

ఆదికాండము మొదటి పఠనంలో దేవుడు నోవతో ఒక నిబంధన చేస్తాడు మరియు ఆదాము హవ్వలతో  నిబంధనను రూపొందించడంలో ఆయన ఉపయోగించిన పదాలను ఇక్కడ ఉపయోగిస్తాడు. ఆ నిబంధనను గుర్తుచేసేందుకు ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచుతాడు, అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే ప్రభువుతూ సఖ్యత కలిగి ఉంటారు. పునీత  మార్కు సువార్తలో, క్రీస్తు శిష్యులతో  తాను తీవ్రంగా హింసించబడతానని  చెబుతున్నాడు, అపుడు ప్రభువును  యెరూషలేముకు వెళ్లకుండా నిరోధించడానికి పేతురు ప్రయత్నిస్తున్నాడు,  అది ప్రభువును బాధపెడుతుంది. అందుకు కొన్ని క్షణాల ముందు నీవు క్రీస్తువు; అనే మాటలతో పేతురు తన విశ్వాసాన్ని గొప్పగా ప్రకటించినప్పటికీ, క్రీస్తు సాధించిపెట్టె రక్షణ అయన పొందే శ్రమల మరణ పునరుత్తనాల ద్వారా వస్తుందనే విషయాన్ని మాత్రము జీర్ణించుకోలేకపోతున్నాడు పేతురు.    ప్రభువు వాటిని అధిగమించి  జయిస్తాడు అని అర్ధం చేసుకోలేకపోయాడు పేతురు.  క్రీస్తుతో చేసుకొనే రక్షణ నిబంధన శాశ్వత నిబంధన. 

పునీత  పేతురు చేసినట్లుగా మనం ఆయనపై విశ్వాసం ఉంచాలని మరియు ప్రతిరోజూ ఆయన “నీవు క్రీస్తు” అని గుర్తుంచుకొని జీవించుటకు  పిలువబడ్డాము. యేసు పేతురును “రాయి” అని పిలిచి ఉండవచ్చు, కానీ రక్షకుడికి పేతురు అనే రాయికి  పగుళ్లు ఉన్నాయని తెలుసు. పేతురును అప్పుడప్పుడు  ప్రభువు మార్గమునుకు భిన్నముగా ప్రవర్తిస్తున్నాడు అని తెలుసు. అయితే, పేతురు ఎంత అసంపూర్ణుడైనా, దేవుడు రాజ్యం యొక్క తాళాలను అతనికి అప్పగించాడు, ఎందుకంటే ఆయనను ప్రభువు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చుతాడు.  మనం ఎంత అసంపూర్ణులమైన, మనకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తున్నాడు మనలను సంపూర్ణులను చేయుటకు ప్రభువు ఇలా చేస్తుంటాడు. వాటిని అవకాశముగా మార్చుకొని ప్రభువు వలే పరిపూర్ణమైన వ్యక్తులుగా మారుటకు ప్రయతించుదాం. 

Br. Pavan OCD

8, ఫిబ్రవరి 2025, శనివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం 

యెషయా 6:1-6
 1కొరింథీయన్స్ 15:3-8,11
లూకా 5:1-11

క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా సామాన్య కాలపు ఐదవ  ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ నాటి మూడు దివ్యాగ్రంధ పఠనలను ధ్యానించినట్లయితే, ఈ మూడు పఠనలు కూడా మనకు విశ్వాసం, దైవ పిలుపు మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయి.  దేవుని పరిశుద్ధతను గుర్తించి, మన పాపాలను ఒప్పుకొని, ఆయన పిలుపుకు ప్రతిస్పందించాలి.  క్రీస్తు పునరుత్థానంపై మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.  యేసును విశ్వసించి, ఆయన పిలుపుకు విధేయత చూపాలి అని బోదిస్తున్నాయి.

ముందుగా మొదటి పఠనము యెషయా గ్రంధములో చుసినట్లయితే, దేవుని పరిశుద్ధత మరియు పిలుపు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక్కడ మనము వినె,  దర్శనం క్రీ.పూ. 740 ప్రాంతంలో, ఉజ్జియా రాజు మరణించిన సంవత్సరంలో సంభవించింది. ఉజ్జియా మరణం యూదా రాజ్యానికి ఒక అస్థిరమైన సమయం.  ఈ సమయంలో యెషయాకు కలిగిన దివ్య దర్శనం ప్రజలకు దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధతను గుర్తుచేసి, వారికి ధైర్యాన్ని, నమ్మకాన్ని అందించింది.  రాజకీయ అస్థిరత, సామాజిక అన్యాయం ప్రబలంగా ఉన్న సమయంలో, దేవుని సర్వాధిపత్యం, పరిశుద్ధతను చాటి చెప్పడం ఎంతో ముఖ్యం. యెషయా ప్రవక్తకు కలిగిన దర్శనం మరియు దేవుని యొక్క పరిశుద్ధతను, మహిమను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది.  అది ఏవిధంగానంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే సెరాఫీయుల గానం దేవుని సర్వోన్నతత్వాన్ని చాటి చెబుతుంది.  

ఈ దర్శనం యెషయాను తన పాపపు స్థితిని గుర్తించేలా చేస్తుంది.  నేను అపవిత్రమైన పెదవులు గల వ్యక్తిని అని అతను  దేవుని ముందు విలపిస్తాడు.  ఎందుకంటే దేవుని పరిశుద్ధత ముందు మన పాపపు స్థితిని గుర్తించడం మనకు చాలా ముఖ్యం. మన పాపపు స్థితిని దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు క్షమాపణ మరియు శుద్ధీకరణను అందిస్తాడు.  కాల్చిన బొగ్గుతో యెషయా పెదవులను తాకడం ద్వారా అతని పాపం పరిహరించబడుతుంది.  ఆ తరువాత అతనికి దేవుని పిలుపు అనేది వస్తుంది: నేను ఎవరిని పంపాలి?  అని దేవుడు అన్నపుడు యెషయా వెంటనే నేను ఇక్కడ ఉన్నాను; నన్ను పంపండి అని సమాధానం ఇస్తాడు.  ఇక్కడ మనకు రెండు విషయాలు కనిపిస్తాయి:  మొదటిది, దేవుని పిలుపుకు సిద్ధంగా ఉండాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి.  రెండవది, దేవుని పిలుపుకు వెంటనే స్పందించాలి. 

చివరిగా ఈ మొదటి పఠనములో దేవుని పరిశుద్ధతను, మన పాపపు స్థితిని, దేవుని పిలుపును మనకు గుర్తు చేస్తుంది. యెషయా వలె, మనము కూడా దేవుని పరిశుద్ధతను గుర్తించి, మన పాపాలను ఒప్పుకొని, ఆయన పిలుపుకు స్పందించాలి.  ఎందుకంటే దేవుని పిలుపుకు సిద్ధంగా ఉండాలంటే, మనల్ని మనం మొదటిగా శుద్ధి చేసుకోవాలి. దాని ద్వారా యెషయాను దేవుడు తన సేవకునిగా, ప్రతినిధిగా మార్చుతున్నారు. 

రెండొవ పఠనము యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే యేసు క్రీస్తు మన పాపముల కొరకు మృతిపొంది, సమాధి చేయబడి, మూడవ దినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు వందల సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను. తరువాత  పౌలుకు కూడా కనబడెను. పౌలు, ఇతర అపొస్తలలు ప్రకటించేది ఒకటే అది క్రీస్తు జీవితం గురించి. కొరింథీయ ప్రజలు కూడా ఆవిధంగానే క్రీస్తును విశ్వసించాలని పౌలు అంటున్నాడు. క్షమాపణ మరియు రక్షణ ఒక భ్రమ అయితే, వారి విశ్వాసం వారిని రక్షించదు.క్రీస్తు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి పునాది అని, అది లేకపోతే మన విశ్వాసం వ్యర్థమని పౌలు గారు కొరింథీయ ప్రజలకు నొక్కి చెబుతున్నాడు. క్రీస్తు పునరుత్థానం మన విశ్వాసానికి కేంద్ర బిందువు. మన పాపములు క్షమించబడ్డాయని, మనకు నిత్యజీవం ఉందని ఈ పునరుత్థానం ద్వారానే మనకు తెలుస్తుంది అని రెండొవ పఠనము తెలియజేస్తుంది. 

చివరిగా సువిశేష పఠనములో యేసు గెన్నెసరెతు సరస్సు దగ్గర నిలబడి ఉండగా, జనులు దేవుని వాక్యాన్ని వినడానికి ఆయనను చుట్టుముట్టారు. ఆయన ఒడ్డున ఉన్న రెండు పడవలను చూశాడు; జాలరులు వాటినుండి వెళ్ళిపోయి తమ వలలు కడుగుతున్నారు. యేసు సీమోను యొక్క పడవ ఎక్కి, ఒడ్డు నుండి కొంచెం దూరంగా వెళ్లమని అతనిని అడిగాడు. అప్పుడు ఆయన పడవలో కూర్చుని ప్రజలకు బోధించాడు.

బోధించడం ముగించిన తరువాత, యేసు సీమోనుతో లోతుకు వెళ్లి చేపలు పట్టడానికి నీ వలలు వేయి అన్నాడు. సీమోను జవాబిస్తూ, గురువా, మేము రాత్రంతా కష్టపడి పనిచేసినా ఏమీ దొరకలేదు, కానీ మీరు చెప్పినందున నేను వలలు వేస్తాను అన్నాడు. వారు అలా చేసినప్పుడు, వారు చాలా చేపలు పట్టారు, వారి వలలు చిరిగిపోవడం ప్రారంభించాయి. వారు సహాయం కోసం ఇతర పడవలో ఉన్న తమ తోటి వారిని కూడా సహాయం చేయమనీ పిలిచారు. వారు వచ్చి రెండు పడవలు నిండేలా చేపలు పట్టారు.
       సీమోను పేతురు అది చూసి, యేసు పాదాల దగ్గర పడి ప్రభువా నన్ను విడిచి వెళ్లు, నేను పాపాత్ముడను అన్నాడు. యేసు సీమోనుతో, భయపడకు; ఇప్పటి నుండి మీరు మనుష్యులను పట్టుకుంటారు అన్నాడు. వారు పడవలను ఒడ్డుకు చేర్చి, ప్రతిదీ విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. లూకా 5 లో, క్రీస్తు జనసమూహానికి బోధించాడు మరియు సీమోను పేతురు మరియు అతని తోటి జాలరికి చేపల అద్భుతాన్ని ఇచ్చాడు. క్రీస్తు తన వాక్యము మరియు పరిచర్య ద్వారా దేవుని కొరకు గెలిచిన విశ్వాసుల యొక్క గొప్ప సమూహమును  క్రీస్తు అనుచరులుగా చేయడం  ఈ గొప్ప చేపలు సూచనగా ఉన్నాయి. లూకాలో, ఈ మత్స్యకారులను శిష్యరికానికి   పిలుపు 1) యేసు బోధ నుండి నేర్చుకోవడం మరియు 2) దేవుని చర్యలను చూడటం మధ్యలో వస్తుంది.
        కాబ్బటి ప్రియా దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనలు కూడా మనకు దేవుని పట్ల విశ్వాసం, విధేయత, దేవుని పిలుపు గురించి ముఖ్యమైన పాఠాలను బోధిస్తాయి. వీటిని ధ్యానించడం ద్వారా మన విశ్వాసాన్ని బలపరచుకోవచ్చు.

Fr. Johannes OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...