11, డిసెంబర్ 2021, శనివారం

ఆగమనకాల 3 వ ఆదివారము

ఆగమనకాల 3 వ ఆదివారము

జెఫన్యా 3: 14 – 18

ఫిలిప్పు 4: 4-7

లూకా 3: 10-18

ఈ నాటి దివ్యపఠనాలు దేవుని రాక గురించి సంతోషించుడి అనే అంశము గురించి భోదిస్తున్నాయి. మొదటి పఠనము మరియు రెండవ పఠనము ముఖ్యముగా ప్రభువు నందు ప్రతిఒక్కరు ఆనందించాలి అనే అంశము గురించి ప్రస్తావిస్తున్నాయి. ప్రతి ఒక్కరి హృదయములో దేవుడే శాశ్వత ఆనందం నింపుతారు. ప్రభువు యొక్క అవసరత తెలుసుకుని అయన కోసం తమ జీవితాలను సిద్ధం చేసుకునే వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు. మానవ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే దేవుని మీద నమ్మకం, ప్రేమ ఉంది జీవిస్తే బాధ అయినా ఆనందంగా ఉంటుంది. మనకు ఏ బాధలు ఎదురవకపోతే మనము సంతోషముగా ఉండగలుగుతామని మనము సాధారణంగా అనుకుంటాము. కానీ యేసు ప్రభువు జీవితం చూస్తే వారిలో ఎప్పుడు సంతోషమే ఉంది. పౌలు గారు తనయొక్క సువార్త పరిచర్యలో ఎన్నో రకాల ఎదురుదెబ్బలు తిన్నారు, ఎన్నో నిరాశలకు, హింసలకు, అణిచివేతలకు గురయ్యారు. అన్ని బాధల్లో కూడా ప్రభువులో సంతోషాన్ని అనుభవించారు. ఎందుకంటే అయన ప్రభువులో ఐక్యమై జీవించారు (2 కొరింతి 6:10) మనము దేవుని యందు మాత్రమే నిజమైన ఆత్మీక సంతోషాన్ని పొందగలుగుతాము.

ఈనాటి మొదటి పట్టణములో జెఫన్యా ప్రవక్త యెరూషలేమును మరియు ఇశ్రాయేలును సంతోషించమని భోదిస్తున్నాడు. జెఫన్యా ప్రవక్త యోషీయా రాజు యూదాయాను పరిపాలిస్తున్న సమయములో యెరూషలేములో, యూదాలో దైవసందేశమును ప్రజలకు అందజేశారు. జెఫన్యా ప్రవక్త దేవునికి సంపూర్ణ విధేయుడై దేవుని యందు నిజమైన ఆనందము వెదుకుతూ జీవించినప్పటికీ తన చుట్టుప్రక్కల జీవించే ప్రజలు దేవునికి అవిధేయులై పాపము చేయుటవలన కష్టాలనుభవించారు, బానిసలుగా జీవించారు. జెఫన్యా ప్రవక్త దేవుని యొక్క మాటలు చక్కగా వివరిస్తున్నారు. సీయోను కుమారి ఆనంద నాదము చేయుము, యెరూషలేము నిండు హృదయముతో సంతసింపుము, అను సంతోష వార్తను తెలియజేస్తున్నారు. యావే దేవుడు పునరుద్ధరించిన యెరూషలేమును ఎంతో ఆప్యాయముగా సీయోను కుమారి అని పిలుస్తున్నారు. వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేసే సమయము వస్తుందని వారికీ గుర్తుచేస్తున్నారు. ఎంతో సంతోషముగా హర్షద్వానము చేయుము అని ప్రవక్త తెలుపుచున్నారు. దేవుని ప్రజలయొక్క కష్టకాలం ముగిసింది. ఇక సంతోషకరమైన రోజులు రాబోవుచున్నాయి అని తెలుపుచున్నారు. ఈ మాటలు నిజంగా మన యొక్క హృదయపూర్వక సంతోషమును వెల్లడిచేస్తున్నాయి. మనలో చాల సంతోషము దాగివుంటేనే హర్షద్వానము చేస్తాము. దేవుడు యెరూషలేము ప్రజల్లో గొప్ప సంతోషము నింపుతున్నారు, కాబట్టియే సంతోషించమన్నారు.

ఇశ్రాయేలు ప్రజల యొక్క దండనము, వారి యొక్క శిక్ష ముగిసింది అని ప్రభువు నుడువుచున్నాడు. ఇక శత్రువుల యొక్క బాధ తొలిగిపోయింది అని దేవుడు ప్రవక్త ద్వారా తెలుపుచున్నారు. దేవుడు వారికి ఒక అభయము ఇస్తున్నారు. ఇశ్రాయేలు రాజైన ప్రభువు మీ నడుమనున్నాడు, ఇక ఏ కీడుకు వెరువనక్కరలేదు అని ఒక అభయమిస్తున్నారు. రాజు మనతోవుంటే మన జీవితంలో ఇక కొడవయు ఉండదు. రాజు మనకోసం యుద్ధం చేస్తారు. ఇశ్రాయేలు నిజ దేవుడైన యావే. మరి అయన తోడుగా ఉంటె ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అయన తన ప్రజలను సమపాలనలో చూస్తారు. అయన మనతో ఉంటె మనకు అన్ని నేర్పిస్తారు. మనకు కష్టాలురాకుండా మనలను మంచిగా చూసుకుంటారు. మనకు జీవన శైలి నేర్పిస్తారు. నూతన జీవితం ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయనను అంటిపెట్టుకుని జీవించాలి. ఇశ్రాయేలు ప్రజలయొక్క జీవితంలో ఇంతకన్నా సంతోషకరమైన వార్త ఇంకేం కావాలి. రాజు తోడుగా ఉంటారు అన్న మాట చాలు. దేవుడు మన జీవితాల్లో చేసే ప్రతియొక్క గొప్ప విషయాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. మన ఇష్టానుసారంగా మనము జీవిస్తే కష్టాలపాలవుతాము కానీ దేవుని ప్రకారము జీవిస్తే ఆనందము పొందుతాము. ఒకవేళ కష్టాలు ఎదురువచ్చినా సంతోషముగానే ఉంటాము.

యెషయా ప్రవక్త అంటారు,"నా ఆత్మానందమైన నా ప్రభువు, నా దేవుని యందు నా హృదయము ఆనందంతో నిండి ఉంది"(యెషయా 61:1) ఆయన ప్రభుని ఆత్మతో ఐక్యమైనందువల్లే ఆలా అనగలిగారు. దేవుడు కూడా మన మధ్య ఉంటె ఎప్పుడు కూడా సంతోషమే. 

ఈనాటి రెండవ పఠనంలో పౌలుగారు నిజమైన విశ్వాసి ఎవరియందు ఆనందించాలి అనే అంశము గురించి బోధిస్తున్నారు. మనము అందించాల్సింది దేవునియందు మాత్రమే. ఈ లోక విషయాల యందు కాదు. బంగారము వల్లనో, సంపదల వల్లనో, స్నేహితుల వల్లనో, కాదు మనము అందించాల్సింది. దేవునియందు ఆనందించాలి. 

  • యేసు ప్రభవు జన్మించారని ఆనాడు గొల్లలు ఆయనయందు ఆనందించారు.

  • రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు జన్మించారని ముగ్గురు రాజులు ప్రభువు నందు ఆనందించారు.

  • యేసు ప్రభువు పాపులతో భుజించినప్పుడు వారు క్రీస్తునందు ఆనందించారు 

  • జక్కయ్య నిజమైన స్నేహితుడిని కనుగొన్నానని యేసునందు ఆనందించారు

  • అపోస్తులులు హతసాక్షులవుతూ మేము క్రీస్తు కోసము మరణిస్తున్నామని  ఆనందించారు 

మన ఆనందము ఎక్కడ దాగి ఉంది. దేనిలో ఆనందమును వెదుకుచున్నాము. , ఓపికగా మనము పొరుగువారికి సహాయము చేస్తే దానిలో నిజమైన దేవుని ఆనందము వెదకవచ్చు. ప్రతిఒక్కరు ప్రకటించేది సువార్తే కాబట్టి అందరు ఆనందించాలి.

  • దేవుని సేవచేయుటలో ఆనందించాలి 

  • దేవుని ప్రేమను పంచుటలో ఆనందించాలి

  • దేవుని క్షమను విస్తరించుటలో ఆనందించాలి

  • దేవుని సువార్త ప్రకటించుటలో ఆనందించాలి 

పౌలు గారు ఫిలిప్పు క్రైస్తవులకు కూడా చెప్పే మాటలు కూడా అవే. మన యొక్క ఆనందము దేవునిలో వెదకాలి. ఆనందంగా ఉండాలనుకునే మనిషి యొక్క మానవ దృక్పథం తన ఆత్మ సమ్మతిపై ఆధారపడివుంటుంది. పౌలు గారు దేవునిలో సంతోషము కనుగొన్నారు. అదే విధముగా మనము కూడా జీవించాలి. రెండవదిగా ఈ లేఖలో పౌలు గారు అందరిని సాత్వికంగా ఉండమని చెబుతున్నారు. అందరి పట్ల మృదువుగా జీవించమని చెబుతున్నారు. సాత్వికంగా అంటే సహాయము చేసుకుంటూ, అర్ధం చేసుకుంటూ ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ జీవించడమే. సాత్వికంగా జీవిస్తే మనము మంచి స్నేహితులను సంపాదించుకోవచ్చు. మన యొక్క మాటల్లో, చేతల్లో సాత్వికత ఉంటె మనము చాల మందితో సంబంధము కలిగి జీవించవచ్చు. మూడవదిగా ప్రభువు దగ్గరలోనే ఉన్నారు అని తెలుపుచున్నారు. 

  • ప్రార్ధించే వారికి ప్రభువు దగ్గరలోనే ఉంటారు.

  • ప్రేమించే వారికి ప్రభువు దగ్గరలోనే ఉంటారు.

  • దానం చేసే వారికి ప్రభువు దగ్గరలోనే ఉంటారు.

  • క్షమించే వారికి ప్రభువు దగ్గరలోనే ఉంటారు.

నేటి సువిశేషం భాగంలో బాప్తిస్మ  యోహాను  గారు జన సమూహానికి  చేసిన విలువైన  బోధనలు మనం చదువుకుంటున్నాం ప్రవక్త హృదయం పరివర్తనం  చెంది  జీవించమని గట్టిగా చెప్పిన  సందర్భంలో  ప్రజల దైవ భయం  కలిగి హృదయ పరివర్తనం  చెంది  జీవించాలనికున్నారు దాని  నిమ్మిత్తం మేము ఏమిచేయాలి అని  అడుగుతున్నారు. వాస్తవానికి  ప్రవక్త యొక్క మాటలు  ప్రజలను కొత్త జీవితము  జీవించటానికి  ఆహ్వానిస్తుంది. ప్రతి యొక్క  ప్రవక్త యొక్క  సందేశం కూడా ప్రజలను  దేవునితో  కొత్త జీవిత జీవితానికి ఆహ్వానిస్తుంది  బాప్తిస్మ  యోహాను  గారు  చాలా కఠినమైన మాటలు  వాడుచున్నారు   - లూకా ౩ ; 8 -9  ఈమాటలు వారి హృదయాలను  రగిలించాయి  వారి యొక్క పాపపు జీవితం  వారికీ గుర్తుకు వచ్చింది. వారిలో దైవ  భయం  ఉంది కాబట్టి  దేవుని  శిక్ష  వారిమీదకి రాకుండా ఏమిచేయాలి అనీ అడుగుచున్నారు. వారి జీవితాలు  మార్చుకోవడానికి  సిద్ధంగా   ఉన్నారు   దేవునికి ఇష్టమైన జీవితం  జీవించటానికి వారు సిద్దముగా ఉన్నారు  వారుఅందరుకూడా  యోహాను   యొక్క  బోధనలను  అనుకూలంగా  స్పందించారు. ఆనాడు యోహాను   గారి మాటలు  విన్న  ప్రజలు  అడిగిన విధంగా  మేము ఏమిచేయాలి  అని  అందరుకూడా ప్రశ్నించుకోవాలి  

  • నా విశ్వాస జీవితం  బాగుండుటకు  నేను ఏమిచేయాలి 

  • నా కుటుంబం   సంతోషంగా ఉండుటకు  నేను  ఏమిచేయాలి 

  • నా భర్త సంతోషంగా ఉండుటకు  నేను  ఏమిచేయాలి 

  • నా భార్య సంతోషంగా ఉండుటకు  నేను ఏమిచేయాలి 

  • నా  దేవుడు  నాలోకి  వచ్చుటకు నేను ఏమిచేయాలి 

  • నా స్నేహితులతో  బంధం  కాలిగి జీవించుటకు నేను ఏమిచేయాలి   

  • నాలో హృదయ  పరివర్తనం  కలుగుటకు  నేను ఏమిచేయాలి

ఈ  యొక్క  ఆగమన కాలంలో  బాలయేసు ప్రభు  నాలో  జీవించుటకు  నేను ఏమి చేయాలి. ఏమి చేస్తే  నా   దేవుడు  సంతోషిస్తాడు.  ఏమి చేస్తే   నా   ఆత్మ  రక్షించపడుతుంది.  ఏమి చేస్తే సమాజంలో  నేను మంచిగా  జీవించగలను  అనీ  ధ్యానించుకొని జివితం  సరిచేసుకొని  ఉంటె  మనం మంచిగా జీవించవచ్చు

సువిశేష భాగములో ప్రజలు తమ జీవితంలో దేవుడికి జన్మనివ్వడానికి హృదయపరివర్తన చెందటానికి సిద్ధముగా ఉన్నారు. 

1.  సామాన్య ప్రజలు: రెండు అంగీలున్నవారు ఒకదానిని ఇంకొకరితో పంచుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. అవసరంలో ఉన్న వారికి మన వంతు సహాయము మనము చేయాలి. భోజనము ఉన్న వ్యక్తి లేనివాడితో పంచుకోవాలి, ప్రేమ ఉన్నవారు లేనివారితో పంచుకోవాలి. దేవుడు మనలను అధికముగా దీవించింది వేరే వారికి సహాయము చేస్తూ దైవ ప్రేమను పంచుకోవడానికే. 

2.  సుంకరులు: అన్యాయపు బాటలు వదిలివేసి నీతిమంతమైన జీవితం జీవించాలని కోరుచున్నారు.అందరు బలహీనులే అయినా సరే బలహీన జీవితాలు మార్చుకోవాలి. ఆశవల్ల ఎక్కువ సుంకం వసూలు చేసేవారు సుంకరులు. అది అవినీతితో కూడిన జీవితము కావున దానిని సరిచేసుకోవాలి. సత్యమైన జీవితము జీవించాలి. 

3. రక్షకభటులు: క్రూరముగా ప్రవర్తించకుండా న్యాయముగా ప్రవర్తించమని ప్రభువు యోహాను ద్వారా పలుకుచున్నారు. న్యాయ పాలన చేయాలి, ప్రేమతో కూడిన పాలన చేయాలి అని యోహాను గారు తెలుపుచున్నారు.   

మన విశ్వాస జీవితములో కూడా కొన్ని సవరణలు చేసుకుని జీవించాలి. అప్పుడే అందరు మన వలన సంతోషిస్తారు. ధనము ఉన్న వారు పేద వారితో పంచుకుంటే అది దేవునికి చాల ఆనందకరము. జక్కయ్య వలన దేవుడు ఆనందపడ్డారు. ఉన్నవారు లేని వారితో పంచుకోవాలి. పాపపు అన్యాయపు జీవితము వదిలివేసి నీతివంతమైన జీవితము జీవిస్తే దేవుడు ఆనందిస్తారు. అదే విధముగా మన యొక్క బాధ్యతలను క్రూరముగా కాకుండా ప్రేమతో, వినయముతో చేస్తే దేవుడు మన యందు ఆనందిస్తారు. మనము దేవుని యందు ఆనందించాలి. అంటే మనాలి కొత్తదనం ఉండాలి. దేవునిలో నిజ సంతోషము వెదుకుదాము.

Rev. Fr. Bala Yesu OCD



4, డిసెంబర్ 2021, శనివారం

ఆగమన కాలం రెండవ ఆదివారం (2)

 ఆగమన కాలము 2వ ఆదివారము (2)

బారుకు 5:1-9, పిలిప్పీ 1:4-6,8-11, లూకా 3:1-6 

నేటి దివ్య పఠనాలు దేవుని రాకకు మార్గమును సిద్ధపరచుట గురించి భోదిస్తున్నాయి. మన హృదయములో దేవునికి రాజమార్గమును సిద్ధపరచాలి. మన హృదయములో అయన ప్రయాణము చేయాలంటే మనము మార్గము సిద్దము చేయాలి. గమ్యము చేరుటకు ప్రతి మార్గము ముఖ్యం. దేవుడు మానవ హృదయము అనే గమ్యము చేరాలంటే మనయొక్క జీవిత మార్గము సరిగ్గా ఉండాలి. మన యొక్క జీవిత ప్రయాణములో ఎన్నో రకాలైన మార్గాలు మనము చూస్తున్నాము. ఇరుకైన మార్గము, సులువైన మార్గము, గుంతలతో ఎత్తుపల్లాలతో ఉన్న ఎన్నో మార్గాలను చూస్తుంటాము. అయితే గమ్యమునకు చేరవేసే మార్గము ఎలాంటిది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి. దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించాలన్నా, లేదా దేవుడు మన రాజ్యములోనికి ప్రవేశించాలన్నా నీతిమంతమైన, దైవభయము కలిగిన మార్గమును అనుసరించాలి. ఈనాటి మొదటి పఠనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బబులోనియా నుండి యెరూషలేము వెళ్ళుటకు మార్గము సిద్దము చేస్తున్నారు. యిర్మీయా ప్రవక్త యొక్క స్నేహితుడు, శిష్యుడైన బారూకు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఒక శుభవచనములు తెలియజేస్తున్నారు.

యూదా రాజ్యము పతనమై యూదులంతా బబులోనియాకు బానిసలుగా ఈడ్చుకుని పోబడిన సమయములో అనేక విధాలుగా వారు శ్రమలు అనుభవించారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అనే ఎదురు చూసేవారు. దేవుని యొక్క సీనాయి ఒప్పందమును నిరాకరించినందుకు ఈ దురదృష్ట స్థితి అని భావించేవారు. ఈ సమయములో దేవుడు వారి మనవులను ఆలించి వారికి బారూకు ప్రవక్త ద్వారా ఒక శుభవార్తను తెలియపరుస్తున్నారు. బారూకు 5:1 వ వచనము చాల సంతోషమునిచ్చే వాక్యము.

1.        మనము ధరించే వస్త్రములు మన శరీరమును కప్పి వేస్తాయి. బారూకు ప్రవక్త అంటున్నారు, మీ మనస్సులను కప్పివేసిన విచారమును, మీ హృదయములను కప్పివేసిన చింతలు, బాధలు అన్నింటిని తొలగించండి. దేవుని మీరు మీ స్వంత భూమిలో ఆరాధించే సమయము రాబోతుంది. బానిసత్వములో మ్రగ్గుతున్న ప్రజల యొక్క జీవితాలు ఎప్పుడు కూడా బాధతో, భయముతో, అధైర్యముగా ఉంటాయి. ఎప్పుడు ఏమి జరుగునో తెలియదు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవించాలి. అలా హీనస్థితిలో ఉన్న ఇశ్రాయేలుకు దేవుడు బారూకు ద్వారా తెలిపిన మాటలు, ఇక ఎలాంటి విచార వస్త్రములు ధరించవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడే మీకు సంతోష వస్త్రమును ఇవ్వబోతున్నారు. దైవ భయము అనే శాశ్వత సౌందర్యమును ధరించుము అని అంటున్నారు. మన జీవితములో అందమునకు చాల ప్రాముఖ్యతను ఇస్తుంటాము. ఇక్కడ ప్రవక్త శాశ్వత సౌందర్యమును గురించి మాట్లాడుతున్నారు. దైవ భయం అనే వస్త్రంను ధరించే ముందు మనం స్వార్ధం,పగ ,ద్వేషం , అసూయ అనే వస్త్రాన్ని తీసివేయాలి. అప్పుడే మనం దైవ బీతి అనే వస్త్రాన్ని ధరించగలం. 
2.      దైవ భయము అనే వస్త్రము ధరిస్తే, అలాగే దైవ ప్రేమ కలిగి, విశ్వసనీయత కలిగి ఉంటే వారిలో ఎల్లప్పుడూ కూడా సంతోషమే కలుగుతుందని తెలుపుచున్నారు. ఈ దైవ భయము అనే శాశ్వత సౌందర్యమునకు ప్రాముఖ్యతనిస్తే అది చిరకాలము ఉంటుంది.
 
·         దైవ భయము ఉంటే దేవునికి విధేయులై జీవిస్తారు.
·        దైవ భయము ఉంటే అన్య దైవములను ఆరాధించరు.
·         దైవ భయము ఉంటే ఆజ్ఞలు పాటిస్తారు.
·         దైవ భయము ఉంటే దేవునికి సన్నిహితముగా జీవిస్తారు.
·         దైవ భయము ఉంటే పాపములో పడిపోరు..


            అందుకే ప్రవక్త దైవ భయము అనే శాశ్వత సౌందర్యమును ధరించమని పలుకుచున్నారు. అందం అసలయితే నశించిపోతుంది కానీ, దైవభయము ఉంటె శాశ్వత సౌందర్యము ఉంటుంది అనగా వారిలో కొరత ఉండదు, సంతోషమే ఉంటుంది.

3.       దేవుని యొక్క నీతి వస్త్రమును ధరింపుము అని అంటున్నారు. దేవుని యొక్క పవిత్ర వస్త్రమును ధరింపమని ప్రవక్త తెలియపరుస్తున్నారు. దేవుని నీతి వస్త్రము అంటే అయన యొక్క జీవితమునే మనము ధరించాలి. ఎఫెసీ 6:11 దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించమని పలుకుచున్నారు. అది ఎప్పుడు మనకు తోడుగా ఉండి మనలను అభివృద్ధిపరుస్తుంది.

రెండవ పఠనంలో పౌలుగారు పిలిప్పీయుల పట్ల వ్యక్త పరిచే ఆనందం గురించి వింటున్నాం. ఇక్కడ రెండు విషయాలు మనం అర్ధం చేసుకోవాలి. 

1. పిలిప్పీ క్రైస్తవులు ఎలాగున పౌలు గారికి తన యొక్క  సువార్త  ప్రచారంలో సహాయం చేశారన్న అంశం. 

2. పిలిప్పీ క్రైస్తవుల కోసం చేస్తున్న ప్రార్ధన. 

పిలిప్పీ క్రైస్తవులు  పౌలు గారి యొక్క  సేవకు ధన సహాయం చేస్తూ సువార్త కృషిలో ఆయనకు భాగస్వాములుగా వున్నారు. (1:5).  తన యొక్క దేవుని కార్యంలో పాలు పంచుకొనిన వారికి ఆయన కృతజ్ఞత తెలుపుచున్నారు. వారి పట్ల ప్రేమను, సంతోషమును వ్యక్త పరుస్తున్నారు. అదే విధంగా వారికోసం ప్రార్ధిస్తున్నారు. 

పౌలు గారు చక్కగా అంటున్నారు "మీకు నా హృదయమందు ఎప్పుడు స్తానం ఉందని చెబుతున్నారు. (1:7) 

ఆయనకు ఎంతగానో  వారు సహకరించి ఉంటేనే పౌలు గారు ఇంతటి గొప్ప మాటలు పలుకుచున్నారు. ఆనాటి పిలిప్పీ క్రైస్తవులు పౌలుగారిని ప్రేమించే వారు , గౌరవించేవారు ,ఆదరించేవారు. ఆయన యొక్క కష్ట కాల సమయములో వారు అండగా నిలబడ్డారు. దేవుని రక్షణ కార్యంకు సహకరించినందుకు వారి కోసం ప్రార్ధిస్తున్నారు. మనల్ని ప్రేమించి ,మంచి చేసే వారిని ఎప్పుడు కూడా మనం గుర్తించుకొని వారికి ఎప్పుడు కూడా మన హృదయంలో చోటిస్తాం. పౌలు గారికి మంచి చేసి, సహకరించిన పిలిప్పీ క్రైస్తవులకు తన హృదయంలో చోటిచ్చారు. 

ఈనాటి సువిశేష పఠనంలో బాప్తిస్మ యోహాను గారి యొక్క బోధనలు వింటున్నాం. దేవునియొక్క రాకడకోసం అయన ప్రజలను అయన తయారు చేసే విధానం గురించి వింటున్నాం.

  దేవుడు ఎన్నుకొన్న ప్రవక్త ప్రజలయొక్క జీవితములో దేవునియొక్క వెలుగును నింపుటకు అదేవిధంగా దేవునియొక్క రాకడ కోసం ప్రజలయొక్క హృదయాలను సంసిద్ధం చేస్తున్నారు. దేవుడిని మన హృదయములోకి ఆహ్వానించాలంటే, హృదయ పరివర్తన అవసరం. హృదయ పరివర్తన ద్వారా మన మనస్తత్వం మార్చుకోవాలి. హృదయ పరివర్తనం క్రొత్త జీవితానికి నాంది. మనం హృదయ పరివర్తన చెందితేనే క్రీస్తుతో క్రొత్త జీవితం ప్రారంభించవచ్చు.

     బాప్తిస్మ యోహానుగారు తన ప్రజలకు హృదయ పరివర్తనం చెంది బాప్తిస్మము పొందమని చెబుతున్నారు. ప్రజల జీవితాలు పాపములో వున్నప్పుడు, అవిధేయతతో వున్నప్పుడు, అవిశ్వాసముతో వున్నప్పుడు ప్రవక్త వారిని హృదయ పరివర్తనం చెంది, పాపక్షమాపణ పొందమని ఆహ్వానిస్తున్నారు. ఆయన యొక్క భోధన "ప్రభువు మార్గమును సిద్దము చేయుడు," అయన త్రోవను సరిచేయుడు అని పలికెను.

      దేవునికి మన మార్గం సిద్ధం చేయాలి. అయితే ఇంతకీ దేవుని మార్గం ఏది?

         - దేవునియొక్క మార్గం ప్రేమమార్గం 
        - దేవునియొక్కమార్గం క్షమించేమార్గం.
         - దేవునియొక్క మార్గం కరుణ చూపే మార్గం
        - దేవునియొక్క మార్గం సేవచేసే మార్గం.
        - దేవుని మార్గం రక్షణ మార్గం.


      దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించే సమయములో వారికి ఇవన్నీ చూపించారు. ప్రజలు దేవుని యొక్క విశాలమైన మార్గమును అర్ధం చేసుకోలేదు. దేవునికోసం మన మార్గం సిద్ధం చేయాలంటే అయన ప్రేమను, క్షమను, సేవను మనందరమూ కూడా పాటించాలి. ప్రభు మార్గాన్ని సిద్ధం చేయటమంటే క్రొత్త జీవితాన్ని ధరించటమే. ఇప్పటి వరకు మనం వేళ్ళ స్వార్ధ మార్గం విడిచిపెట్టి దేవుని మార్గమును అనుసరించాలి. ఒకరు తమయొక్క పాపపు స్థితిని తెలుసుకొని జాగ్రత్తగా ఉండటమే రక్షణకు ప్రారంభము . లాతిను భాషలో ఒక సామెత ఈ విధంగా ఉంది, ఒకరు తమ పాపాలను సమర్ధించుకోకుండా, తన పాపాలను అగీకరించినపుడు వారు దేవుని ఎదుట నీతిమంతులు అవుతారు. నాతాను ప్రవక్త దావీదు చేసిన పాపాలు చెప్పినప్పుడు దావీదు మహారాజు అంగీకరించారు.అందుకే దేవుని ఎదుట అంగీకరించబడ్డాడు. తన లోపాలు ఎప్పుడూకూడా గుర్తించుకున్నారు - (కీర్తన:51 :3 ). మనం కూడా దేవుని యొక్క మార్గములో నడిస్తే,తప్పనిసరిగా మనందరిలో దేవుని జీవితం ప్రారంభమవుతుంది.బాప్తిస్మ యోహానుగారు దేవుని మార్గంలో వున్న సవరణ గురించి తెలుపుచున్నారు. ఎలాగ దేవుని మార్గమును మన జీవితములో సిద్ధపరచాలి అన్నది ధ్యానించుకోవాలి.   
సువిశేషములో 5 వ వచనంలో యోహానుగారు అంటున్నారు,
1.    ప్రతి లోయ పూడ్చబడును:
 లోయలు ఎప్పుడు కూడా క్రిందకువుంటాయి. అనగా వినయముతో జీవించే విశ్వాసులను దేవుడు తన యొక్క దీవెనలతో నింపుతాడు. దేవుని కొరకు విశ్వాసముతో ఎదురుచూసే వారందరియొక్క హృదయాలు నింపబడతాయి. మన హృదయములో, జీవితములో వున్నా లోయలు పూడ్చబడాలంటే,మనలో వినయము, విశ్వాసము ఉండాలి. అప్పుడే మనలోకి దేవుని ఆత్మ వస్తుంది.
 2.పర్వతాలు, కొండలు చదును చేయబడాలి:
పర్వతాలు, కొండలు ఎత్తునకు గుర్తు. మన జీవితములో కూడా కొని సార్లు మనం ఎత్తున జీవిస్తాం .
 - అహం అనే ఎత్తున.
 -స్వార్ధం అనే ఎత్తున. '
- క్షమించలేకుండా జీవించే ఎత్తున ఉంటాం.
     మనలో వున్న అహంను అణచి వేయాలి. స్వార్ధమును అణచివేయాలి.అప్పుడే అవి ప్రభువును ఆహ్వానించడానికి ఎంతో సహాయపడతాయి. మనజీవితములో ఉన్నతస్థాయిలో వున్నప్పుడు మనమే గొప్ప అనే భావనలో ఉంటాం కానీ, దేవుడు అన్నీ కూడా సమము ఇయ్యబడును అంటున్నాడు. అప్పుడు ఎటువంటి భేదములు వుండవు.  - పేద- ధనిక భేదములు వుండవు.
               - అన్యులు- యూదులు అని భేదములు వుండవు.
                -పాపి- నీతిమంతుడు అని భేదములు వుండవు.
అందరూ కూడా దేవుని దృష్టిలో సరిసమానులే, అందరూ దేవుని బిడ్డలే అనే భావన మాత్రమే ఉంటుంది.
3. వక్రమార్గములు సక్రము చేయబడును:  
       వక్రమార్గములు అంటే, సొంతలాభాముకోసం అనుసరించే మార్గం. స్వార్ధముతో జీవించే మార్గాలు, దేవుని చిత్తానికి వ్యతిరేఖంగా జీవించే మార్గములు. ఇంకొన విధముగా చెప్పాలంటే, అడ్డదారులు, అవినీతితో కూడిన మార్గాలు విడనాడి సక్రమముగా నీతితో జీవించాలి. మన జీవితములో కూడా చాలా వక్రమార్గాలను వెంబడిస్తున్నాము. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, అలాగే  తల్లి దండ్రులకు తెలియకుండా పిల్లలు వక్రమార్గాలు అనుసరిస్తున్నారు. అవన్నీ కూడా దేవుని రాకడ కోసం సక్రమము చేయబడాలి. సక్రమంగా చేయబడాలి అంటే,దేవుని యొక్క అనుగ్రహముతో వ్యక్తిగతముగా ప్రయత్నించాలి.
 4.  కఱుకుమార్గం నునుపు చేయబడును: 
        ప్రతియొక్కరియొక్క జీవితములో కఱుకు మార్గాలుంటాయి. ద్వేషం అనే కఱుకులు.అసూయ, పగ, కోపం,పాపం,స్వార్ధం అనే కఱుకులు, అసమానతలు,బలహీనతలు ఉంటాయి. వాటిని దేవుని యొక్క సుగుణాలు పాటించుటద్వారా నునుపు చేసుకోవాలి.
ఎవరైతే ప్రవక్తయొక్క మాటలను ఆలకించి దేవునికోసం తన జీవితములో మార్గాలను సిద్ధం చేసుకుంటారో వారిలోకి, వారి హృదయం అనే గమ్యంకు దేవుడు చేరతాడు. బాప్తిస్మ యోహానుగారి భోధన అనేకమంది జీవితాలను దేవునిరాకకోసం సిద్ధం చేసింది. ఈనాడు మనకు  భోధింపబడుచున్న భోధన ద్వారా మన జీవితాలను ఎలా మనం సిద్ధం చేసుకుంటున్నాం.  సిద్ధం చేయుట గురించి పవిత్ర గ్రంధం చాలా సార్లు బోధించింది. ఆమోసు :4 :12, హోషేయ :10:12, యవేలు:2:12-13,మత్తయి :24:44,మార్కు : 13:35.  
      ఈయొక్క ఆగమన కాలములో, దేవుని రాక కోసం మన హృదయాలను ఎలాగ చేసుకుంటున్నాం. చేసుకుంటున్నాం. 
    మంచి కార్యాలు చేస్తున్నామా? ప్రేమను పంచుతున్నామా? క్షమిస్తున్నామా?దేవుని వాక్యం చదివి వాక్యం ధ్యానిస్తున్నామా?
   వ్యక్తిగతముగా మనం ఎలాగ సిద్దపడుచున్నాము అని మనం ధ్యానించుకొని, మన జీవితాలను మార్చుకొని దేవుని రాకడ కోసం మార్గమును సిద్ధం చేద్దాం. 
Rev.Fr. Bala Yesu OCD
 

    


దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...