29, జూన్ 2024, శనివారం

13వ సామాన్య ఆదివారం

13వ సామాన్య ఆదివారం 
సొలోమోను జ్ఞాన 1: 13-15, 2: 23-24, 2 కొరింతి 8:7, 9,13-15
మార్కు 5:21-43
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవునికి ఈ సృష్టి మీద మరియు మానవుల మీద ఉన్నటువంటి ప్రేమను గురించి తెలుపుచున్నవి.  ఆయన సృష్టిని చేసినప్పుడు కంటికి అంతా బాగుగా ఉండెను.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏ విధముగా సృష్టిని చేసి ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా కాపాడుతున్నారని తెలుపుతుంది. దేవుడు మరణమును సృష్టించలేదు ఆయన సృష్టిని చేసిన సందర్భంలో ఏదీ కూడా తన కంటికి చెడుగా కనిపించలేదు అంతా కూడా బాగానే ఉన్నది. ఆయన ప్రణాళిక ప్రకారము సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా జీవించటానికి, అభివృద్ధి చెందడానికి మరియు మంచిగా ఉండటానికి సృష్టించారు కానీ సైతానే అసూయవలన మానవుడిని ప్రేరేపించి పాపంలోనికి నెట్టివేసి మరణంనకు గురిచేసినది. దేవుడు ఎవరిని నాశనం చేయాలని కోరుకోలేదు కేవలం మానవుడు చేసిన తప్పిదం వలన తనంతట తాను మరణమును కొని తెచ్చుకున్నాడు. ఎవరి నాశనం వలన దేవుడు సంతోషించరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హృదయ పరివర్తనం చెందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం.(యెహెజ్కేలు 18:23)
ఒకవేళ దేవుడే మనము నాశనం అవ్వాలి అని కోరుకున్నట్లయితే మన పాపాలకు ఆయన మనల్ని ఎప్పుడూ శిక్షించి ఉండవు కానీ అలా చేయలేదు. 
ఆయన ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తన యొక్క ప్రవక్తలను పంపి ఉండేవారు కాదు అలాగే తప్పిపోయినటువంటి గొర్రె కొరకు వెదకేటువంటి వారు కాదు మనము మంచిగా జీవించుట నిమిత్తమై దేవుడు మన కొరకు ప్రతినిత్యం కూడా కృషి చేస్తున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు మనందరం కూడా ఉదార స్వభావులై  ఒకరికి ఒకరు సహయం చేసుకుని జీవించాలని తెలుపుతున్నారు ఏసుప్రభువు ఏ విధముగానయితే ఈ లోకంలో తనకు ఉన్నటువంటి మొత్తం కూడా విడిచిపెట్టి మన మధ్యకు ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చి తన అనుగ్రహాలను అందరికీ కూడా పంచి ఇచ్చి ఉన్నారో అదేవిధంగా ధనవంతులైనటువంటి వారు, ఉన్నవారు ఇతరులకు సహాయం చేసి జీవించేటటువంటి   సుగుణం కలిగి ఉండాలి అని పౌలు గారు తెలుపుచున్నారు. ఈనాటి సువిశేష పఠణంలో యేసు ప్రభువు యాయిరు కుమార్తెను బ్రతికించిన విధానము మరియు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీకి స్వస్థత ఇచ్చిన విధానము చదువుకుంటున్నాం. ఈ రెండు సంఘటనలలో ఒకరి వయసు 12 సంవత్సరాలు మరియు 12 సంవత్సరాల అనారోగ్యం . ఇక్కడ వీరిద్దరి యొక్క  అచంచలమైనటువంటి విశ్వాసమును చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో వారి ప్రయత్నం చేసిన తర్వాత నిరాశలో ఉన్న సందర్భంలో దేవుని వైపు తిరుగుతూ కేవలం దేవుని శక్తి మీదే ఆధారపడుతూ యేసు ప్రభువుని ఆశ్రయించారు అందుకే ప్రభువు వారిద్దరి జీవితంలో మేలు చేశారు.
మోషే ధర్మ శాస్త్ర ప్రకారము రక్తస్రావంతో బాధపడే స్త్రీ అశుద్ధురాలుగా పరిగణింపబడుతుంది ఆమె దేవాలయమునకు వెళ్ళుటకు అనర్హురాలు అదేవిధంగా ఇతరులతో కలిసి ఉండటకు అనర్హురాలు. (లేవి 15:25-27) ఆమె తన దగ్గర ఉన్నది మొత్తం కూడా ఖర్చు చేసింది ఏ వైద్యుడు కూడా తనకు స్వస్థత నివ్వలేదు తన యొక్క ప్రయత్నం తాను చేసిన తర్వాత చివరిసారిగా బహుశా యేసు ప్రభువు యొక్క మంచితనమును, స్వస్థతను తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి కనీసం ఆయన యొక్క వస్త్రంను తాకినా స్వస్థత పొందవచ్చు అని భావించినది. ఏసుప్రభు ప్రయాణం చేసే సందర్భంలో చాలా మంది ఆయనను తాకారు కానీ వారెవరు స్వస్థత పొందినట్లు ప్రభువు పలకలేదు కేవలం ఈమెను గురించి మాత్రమే ఏసు ప్రభువు తెలిపారు ఎందుకంటే ఆమె నిజమైనటువంటి విశ్వాసం కలిగి యేసు ప్రభువుని ఆశ్రయించి, ఆయన వస్త్రములు కూడా స్వస్థత ఉందని గట్టిగా నమ్మినది కాబట్టే తన విశ్వాసము ప్రకారంగా యేసుప్రభు అద్భుతం చేశారు.
యాయీరు కూడా ఒక అధికారి  అయినప్పటికీ ఆయన తన యొక్క కుమార్తె అనారోగ్యంతో బాధపడే సమయంలో తనకి మనవి చేయగా ఏసుప్రభువు  అతని విశ్వాసం చూసి  ఆ బిడ్డను స్వస్థతపరచ వచ్చి, ఆమెకు స్వస్థతనిచ్చారు. బాలిక మరణించినప్పటికీ కూడా ప్రభువు ఆమె కు నూతన జీవాన్ని ప్రసాదించారు. దేవుడు ఆమెకు జీవాన్ని ప్రసాదించి నా కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చారు అలాగే రక్తస్రావంతో బాధపడేటటువంటి ఆమెకు ప్రభువు ఆనందాన్నిచ్చారు.
ధ్యానించవలసిన అంశాలు 
1. దేవుడు ఎవరు నాశనం అవ్వాలి అని కోరుకోరు కాబట్టి మనము కూడా నాశనం ణము కోరుకోకూడదు.
2. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. 
3. దేవుని యందు పటిష్ట విశ్వాసం కలిగి ఉండాలి.
4. దేవుని మీద ఆధారపడి జీవించాలి. 
5. మనకు దేవుడు తోడుగా ఉంటారు అని నమ్మకం కలిగి జీవించాలి.
Fr. Bala Yesu OCD

22, జూన్ 2024, శనివారం

12వ సామాన్య ఆదివారం

12వ సామాన్య ఆదివారం 
యోబు 38:1, 8-11, 2 కొరింతి 5:14-17,  మార్కు 4:35-41
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల జీవితంను ఏ విధముగా ప్రశాంత పరుస్తారు అనే అంశమును తెలుపుచున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు ఉంటూనే ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ విధముగా తన ప్రజలకు తోడుగా ఉండి వారిని బలపరుస్తారు అనే అంశము ఈనాటి పఠణాలలో క్షుణ్ణంగా అర్థమవుచున్నది.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు యోబుకు ఇచ్చిన సమాధానము గురించి తెలపబడినది. యోబు జీవితము మొదటిలో బాగానే ఉన్నది. ఆయన పిల్లాపాపలతో, సిరిసంపదలతో, మంచి పేరుతో సంతోషంగా జీవించాడు కానీ సైతాను తన యొక్క జీవితమును శోధించినప్పుడు యోబు అన్నీ కోల్పోయాడు. ఆయన సంపదలు పోయాయి, తన యొక్క ఇష్టమైన కుటుంబము  దూరమైపోయింది, స్నేహితులు దూరమయ్యారు, తనకు అనారోగ్యం సోకింది ఈ విధముగా అన్ని కోల్పోయిన సందర్భంలో తన జీవితంలో ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకున్నాడు "నా యొక్క దీనస్థితికి కారణం ఏమిటి అన్నది" యోబు దేవుడిని తన యొక్క పరిస్థితికి కారణం ఏమిటి అని పదేపదే అడగగా దేవుడు అతనికి సమాధానమిచ్చారు. యోబుతో యావే దేవుడు సమాధానమిచ్చే సందర్భంలో తన స్థితికి కారణం ఏమిటి అని చెప్పలేదు కానీ దేవుడు ఆయనయే సమస్తమును సృష్టించిన సృష్టికర్త అని, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది అని తెలిపారు. దేవునికి ప్రతి ఒక్కరి గురించి ఒక ప్రణాళిక ఉన్నది కాబట్టి యోబు యొక్క విశ్వాసము స్థిరమైనది అని ఈ లోకమునకు నిరూపించుట కొరకై ఆయన జీవితంలో కష్టాలను దేవుడు అనుమతించారు. అయినప్పటికీ ఆయన కష్టాలు ముగిసిన సందర్భంలో యోబును దేవుడు ఇంకా అధికముగా ఆశీర్వదించి తనను ప్రశాంత పరిచారు. (యోబు 42:10). వాస్తవానికి యోబు యొక్క గ్రంథం బహుశా యూదులు  బానిసత్వంలో ఉండినప్పుడు వ్రాసి ఉండవచ్చు. ఈ గ్రంథంలో మరీ ముఖ్యంగా రచయిత మానవుని యొక్క బాధలకు కారణం ఏమిటి అనేటటువంటి అంశము తెలపాలనుకున్నారు కానీ దానికి తగిన సమాధానము ఇవ్వలేదు. యోబు గ్రంథం తెలిపే ఇంకొక అంశము ఏమిటి అంటే ఈ లోకంలో మంచివారు కష్టాలు అనుభవించవచ్చు, దుర్మార్గులు సంతోషిస్తూ జీవించ ఉండవచ్చు కానీ చివరికి దేవుడు కష్టాలు అనుభవించే మంచి వారిని ఆశీర్వదిస్తారు దుర్మార్గులను శిక్షిస్తారు. యోబు యొక్క జీవితంలో మనము గ్రహించవలసిన అంశము ఏమిటి అంటే మన అందరి జీవితాలలో కష్టాలు, బాధలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అలాంటి సందర్భంలో దేవుని శక్తి మీదే ఆధారపడుతూ విశ్వాసము కోల్పోకుండా ఆయనను నమ్ముకొని ముందుకు సాగాలి. యోబు వలె విశ్వాసములో పటిష్టంగా ఉండాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వారు నూతన సృష్టి అని తెలిపారు. క్రీస్తు నందు ఉన్నవారు పాత జీవితమును ముగించి కొత్త జీవితమును ప్రారంభిస్తారు అనగా వారి కష్టాలు తొలగించబడి సంతోషకరమైన జీవితము జీవిస్తారు అని అర్థం. క్రీస్తు నందు జీవించటం చాలా కష్టం కానీ అలా జీవించిన వారికి దేవుడు సమస్తమును సమకూర్చును. పౌలు గారు క్రీస్తునందు జీవించుట కొరకు అనేక కష్టాలు అనుభవించారు కాబట్టి ఆయన నూతన సృష్టిగా చేయబడ్డారు కాబట్టి మనం కూడా క్రీస్తునందు జీవించటానికి ప్రయత్నం చేయాలి. 
ఈనాటి సువిషేశ పఠణంలో దేవుడు శిష్యుల యొక్క జీవితమును ప్రశాంత పరిచిన విధానము ధ్యానిస్తున్నాము. ఈ సువిశేషం ద్వారా మనం కొన్ని విషయాలు  ధ్యానించాలి. 
1. మన జీవితంలో (Sudden incidents )హఠాత్తుగా జరిగే అంశాలకు ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు. 
శిష్యులు తమ యొక్క ప్రయాణం ప్రారంభించినప్పుడు అంత ప్రశాంతంగానే సాగింది కానీ ఒక్కసారిగా అలలు ప్రారంభమై సముద్రంలో పడవ మునిగేలాగా పరిస్థితి ఏర్పడింది. మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో హార్ట్ ఎటాక్, యాక్సిడెంట్స్, పక్షవాతం అనేవి హఠాత్తుగా వస్తూ ఉంటాయి. అలాంటివారికి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు కాబట్టి మనము పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగాలి. 2020లో కరోనా వైరస్ సడన్గా అన్ని దేశాల్లో వ్యాపించి అనేకమంది జీవితాలను నాశనం చేసింది. శిష్యుల ప్రయాణం కూడా అప్పటివరకు బాగానే సాగింది కానీ ఒక్కసారిగా అంతా అతలాకుతలమైంది. 
2. మన కష్ట సమయాలలో దేవుడు మనతో ఉన్నారా అని మనకు అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్య ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఎందుకు కష్టాలు ఎదురవుతాయి అని చాలామంది భావిస్తూ ఉంటాం. శిష్యుల యొక్క జీవితంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నా వారి యొక్క పడవ మునగటం ప్రారంభించింది అంటే దేవుడు మనకు తోడుగానే ఉన్నప్పటికీ మన జీవితంలో ఆయన కష్టాలను అనుమతిస్తారు అది మరలా మనలను రక్షించుట కొరకే. మన విశ్వాసం బలపరచుట కొరకు.
3. మన యొక్క కష్ట సందర్భాలలో మనము విశ్వాసముతో దేవుని వైపు మరలాలి. శిష్యులు వారి యొక్క పడవ మునిగిపోవుచుండగా ఏసుప్రభు చెంతకు వెళ్లి వారి యొక్క మనవిని తెలిపారు. వాస్తవానికి సువిషేశంలో ఏసుప్రభు నిద్రిస్తున్నారు అని రాయబడి ఉన్నది వాళ్లందరూ భయంతో ఉంటే యేసు ప్రభువు మాత్రం హాయిగా నిద్రిస్తున్నారు అంటే శిష్యులు తన చెంతకు వస్తారా?, రారా?, అని ప్రభువు ఎదురు చూస్తున్నారు. మనం కష్టాలు ఎదుర్కొనేటప్పుడు దేవుని వైపు రావాలి అని మరచిపోకూడదు. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి దూరంగా ఉంటారు. దేవుడు మాకు ఏమీ చేయటం లేదులే ఇంక దేవాలయానికి ఎందుకు వెళ్లాలి అనే ఆలోచనతో జీవిస్తుంటారు.
4. దేవుడు మన కష్టాలను చూసి మనల్ని ఆదుకుంటారు. శిష్యుల యొక్క పరిస్థితి చూసిన ప్రభువు వారిని ఆదుకున్నారు. వారికి తోడుగా నిలబడ్డారు వారి జీవితంలో సంతోషాన్నిచ్చారు.
5. మన కష్టాలు కొలది కాలం మాత్రమే. శిష్యుల యొక్క బాధ, భయం కొద్ది కాలం మాత్రమే ఉన్నది అది శాశ్వతంగా లేదు. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు "Pain is never permanent' అని అంటారు అంటే ఏ బాధ కూడా శాశ్వతం కాదు అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది దాని తర్వాత సంతోషం ఉంటుంది. 
6. దేవుడు మన జీవితాలను ప్రశాంత పరుస్తారు. శిష్యులు ఎదుర్కొన్న భయాన్ని దేవుడు ప్రశాంత పరిచారు ఆయన సమస్తమును సృష్టించినటువంటి ప్రభువు కాబట్టి సమస్తము ఆయన అధీనంలో ఉన్నది కావున ఆయన అలలను ప్రశాంత పరిచారు అదే విధముగా శిష్యుల యొక్క భయాన్ని భాదని తొలగించి సంతోషాన్నిచ్చారు. 
దేవుడు మనతో ఉన్నట్లయితే మనకు కష్టాలు ఉన్న బాధలు ఉన్న అన్నిటిని కూడా మనం ఎదుర్కొని ముందుకు సాగగలం కాబట్టి దేవుని చెంతకు వస్తూ ఆయన మీద ఆధారపడుతూ మనము జీవించాలి ఆయనే మన జీవితాలను ప్రశాంతపరచి మన కష్టాలను తొలగించి మనలో సంతోషాన్ని నింపుతారు. 
Fr. Bala Yesu OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...