6, జులై 2024, శనివారం

14 వ సామాన్య ఆదివారం

14 వ సామాన్య ఆదివారం 
యెహెజ్కేలు 2:2-5, 2 కొరింతి 12:7-10, మార్కు 6:1-6
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క పిలుపు గురించి అదే విధముగా ఆ పిలుపులో ఎదురయ్యేటటువంటి తిరస్కరణ గురించి తెలియజేస్తున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో తిరస్కరణ ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనము ధైర్యం కోల్పోకుండా ముందుకు దైవశక్తితో సాగాలి. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను పిలిచిన విధానము  చదువుకుంటున్నాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజల చెంతకు ఒక ప్రవక్తను పంపిస్తున్నారు, ప్రజలు తన మీద తిరుగుబాటు చేసినప్పటికీ,తనకు అవిధేయత చూపించినప్పటికీ ఆయన మాత్రము వారి శ్రేయస్సు కొరకై ప్రవక్తలను పంపుచున్నారు ఇది దేవుని యొక్క గొప్పతనం. మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే ఇతరులు మనకు హాని చేసినప్పటికీ మనము మాత్రము వారికి మేలు చేయుటకే ప్రతినిత్యము ప్రయత్నం చేయాలి ఎందుకనగా దేవుడు సైతము తనకు విరుద్ధముగా నడుచుకున్న వారిని శిక్షింపక వారిని రక్షించుట నిమిత్తమై వారి కొరకు ప్రవక్తలను పంపుచునే ఉన్నారు. రక్షణ చరిత్రలో అనేక సందర్భాలలో ప్రవక్తలను ప్రజలు తిరస్కరిస్తూనే ఉన్నారు. ప్రవక్తలను తిరస్కరించారు అంటే దేవుడిని తిరస్కరించినట్లే ఎందుకనగా ఏసుప్రభువు కూడా సువిశేషములో ఎవరైతే మిమ్ములను ఆహ్వానిస్తారో వారు మమ్మును కూడా ఆహ్వానిస్తారు అని తెలుపుచున్నారు, ఎవరైతే తిరస్కరిస్తారో వారు దేవుడిని కూడా తిరస్కరిస్తారని అర్థం. మత్తయి 10:40. ప్రజలు ఏ విధంగా ఉన్నా సరే దేవుడు మాత్రమే ప్రవక్తను పంపించనున్నారు. వారికి తెలుపుచున్న సత్యము ఏమిటంటే కనీసం వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నారు అని గ్రహిస్తారు అనేటటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడుమున యెహెజ్కేలు ప్రవక్తను పంపిస్తున్నారు.
యెహెజ్కేలు ప్రవక్త, ప్రజల తప్పిదములను వేలెత్తి చూపారు, వాటిని ఖండించారు అలాంటి సందర్భాలలో ప్రజలు తనను ఎదిరించారు తన యొక్క సందేశాన్ని పెడచెవిని పెట్టారు ఎన్నో కష్టాలకు గురి చేశారు అయినప్పటికీ భయపడలేదు, పారిపోలేదు ఎందుకంటే దేవుడు వారికి ముందుగానే భయపడకూడదు అని ధైర్యమని ఇచ్చారు. (యెహె 2:6-7). ప్రజలు ఏలియా, హోషయ, యెషయా, యిర్మియ, యెహెజ్కేలు మరియు మిగతా ప్రవక్తలను తిరస్కరించినప్పటికీ వారు ప్రభువు సందేశమును తెలియజేశారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క కృప గురించి మాట్లాడుచున్నారు ఆయన కష్టములలో, బాధలో ఉన్న సందర్భంలో దేవునికి ప్రార్థింపగా ప్రభువు అతనికి ఇచ్చిన అభయం నా కృప నీకు చాలును. దేవుడు తనకు అన్ని సమయంలో శక్తిని ఒసగుతారు అని అభయమునిస్తున్నారు కాబట్టి పౌలు గారు కూడా క్రీస్తు ప్రభువు కొరకు ఎన్ని అవమానాలైన హింసలైన భరించటానికి సిద్ధంగా ఉన్నాను అని తెలుపుతున్నారు దానికి కారణం దేవుని కృప ఆయనకు ఎప్పుడు ఉంటుంది.
ఈనాటి సువిశేష పఠణములో ఏసుప్రభు నజరేతు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి నిరాదరణ గురించి మార్కు సువార్తికుడు తెలుపుతున్నారు. ప్రభువు మొదటిగా ప్రార్థన మందిరంలో బోధించిన సందర్భంలో అందరు కూడా ఆయన యొక్క జ్ఞానము చూసి ఆశ్చర్యపడుచున్నారు మరలా అదే ప్రజలు ఆయన యొక్క గతం గురించి, కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. చాలా సందర్భాలలో మనం కూడా చూసే అంశం ఇది ఒక వ్యక్తి మంచిగా ప్రసంగం చెబుతున్నారంటే వెంటనే వారు ఆయన యొక్క గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు, తరువాతనే ఆ వాక్యమును పాటించటానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఏసుప్రభు యొక్క జీవితంలో కూడా తన యొక్క సొంత ప్రజలే తనను అర్థం చేసుకోలేదు అందుకే ఏసుప్రభు ఏ ప్రవక్త కూడా తన స్వదేశంలో ఆదరింపబడురు అని తెలుపుచున్నారు వారి యొక్క అవిశ్వాసమును బట్టి అక్కడ కేవలము కొన్ని అద్భుతాలు మాత్రమే ప్రభువు చేశారు. మనము గమనించవలసిన అంశం ఏమిటంటే మన జీవితంలో మనము అంగీకరించబడినా, అంగీకరించక పడకపోయినా ముందుకు వెళ్లాలి మనకు అప్ప చెప్పినటువంటి పనిని నెరవేర్చాలి. ఏసుప్రభును తన ప్రజలే తనను నిరాకరించినప్పుడు కృంగిపోలేదు, పరిచర్య మానుకోలేదు ఆయన ధైర్యంతో ముందుకు సాగి తండ్రి చిత్తమును నెరవేర్చారు అదే విధముగా మనము కూడా తిరస్కరించబడినపుడు దైవ శక్తితో ముందుకు సాగి దేవుని చిత్తమును నెరవేర్చాలి. 

Fr. Bala Yesu OCD

29, జూన్ 2024, శనివారం

13వ సామాన్య ఆదివారం

13వ సామాన్య ఆదివారం 
సొలోమోను జ్ఞాన 1: 13-15, 2: 23-24, 2 కొరింతి 8:7, 9,13-15
మార్కు 5:21-43
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవునికి ఈ సృష్టి మీద మరియు మానవుల మీద ఉన్నటువంటి ప్రేమను గురించి తెలుపుచున్నవి.  ఆయన సృష్టిని చేసినప్పుడు కంటికి అంతా బాగుగా ఉండెను.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏ విధముగా సృష్టిని చేసి ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా కాపాడుతున్నారని తెలుపుతుంది. దేవుడు మరణమును సృష్టించలేదు ఆయన సృష్టిని చేసిన సందర్భంలో ఏదీ కూడా తన కంటికి చెడుగా కనిపించలేదు అంతా కూడా బాగానే ఉన్నది. ఆయన ప్రణాళిక ప్రకారము సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా జీవించటానికి, అభివృద్ధి చెందడానికి మరియు మంచిగా ఉండటానికి సృష్టించారు కానీ సైతానే అసూయవలన మానవుడిని ప్రేరేపించి పాపంలోనికి నెట్టివేసి మరణంనకు గురిచేసినది. దేవుడు ఎవరిని నాశనం చేయాలని కోరుకోలేదు కేవలం మానవుడు చేసిన తప్పిదం వలన తనంతట తాను మరణమును కొని తెచ్చుకున్నాడు. ఎవరి నాశనం వలన దేవుడు సంతోషించరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హృదయ పరివర్తనం చెందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం.(యెహెజ్కేలు 18:23)
ఒకవేళ దేవుడే మనము నాశనం అవ్వాలి అని కోరుకున్నట్లయితే మన పాపాలకు ఆయన మనల్ని ఎప్పుడూ శిక్షించి ఉండవు కానీ అలా చేయలేదు. 
ఆయన ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తన యొక్క ప్రవక్తలను పంపి ఉండేవారు కాదు అలాగే తప్పిపోయినటువంటి గొర్రె కొరకు వెదకేటువంటి వారు కాదు మనము మంచిగా జీవించుట నిమిత్తమై దేవుడు మన కొరకు ప్రతినిత్యం కూడా కృషి చేస్తున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు మనందరం కూడా ఉదార స్వభావులై  ఒకరికి ఒకరు సహయం చేసుకుని జీవించాలని తెలుపుతున్నారు ఏసుప్రభువు ఏ విధముగానయితే ఈ లోకంలో తనకు ఉన్నటువంటి మొత్తం కూడా విడిచిపెట్టి మన మధ్యకు ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చి తన అనుగ్రహాలను అందరికీ కూడా పంచి ఇచ్చి ఉన్నారో అదేవిధంగా ధనవంతులైనటువంటి వారు, ఉన్నవారు ఇతరులకు సహాయం చేసి జీవించేటటువంటి   సుగుణం కలిగి ఉండాలి అని పౌలు గారు తెలుపుచున్నారు. ఈనాటి సువిశేష పఠణంలో యేసు ప్రభువు యాయిరు కుమార్తెను బ్రతికించిన విధానము మరియు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీకి స్వస్థత ఇచ్చిన విధానము చదువుకుంటున్నాం. ఈ రెండు సంఘటనలలో ఒకరి వయసు 12 సంవత్సరాలు మరియు 12 సంవత్సరాల అనారోగ్యం . ఇక్కడ వీరిద్దరి యొక్క  అచంచలమైనటువంటి విశ్వాసమును చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో వారి ప్రయత్నం చేసిన తర్వాత నిరాశలో ఉన్న సందర్భంలో దేవుని వైపు తిరుగుతూ కేవలం దేవుని శక్తి మీదే ఆధారపడుతూ యేసు ప్రభువుని ఆశ్రయించారు అందుకే ప్రభువు వారిద్దరి జీవితంలో మేలు చేశారు.
మోషే ధర్మ శాస్త్ర ప్రకారము రక్తస్రావంతో బాధపడే స్త్రీ అశుద్ధురాలుగా పరిగణింపబడుతుంది ఆమె దేవాలయమునకు వెళ్ళుటకు అనర్హురాలు అదేవిధంగా ఇతరులతో కలిసి ఉండటకు అనర్హురాలు. (లేవి 15:25-27) ఆమె తన దగ్గర ఉన్నది మొత్తం కూడా ఖర్చు చేసింది ఏ వైద్యుడు కూడా తనకు స్వస్థత నివ్వలేదు తన యొక్క ప్రయత్నం తాను చేసిన తర్వాత చివరిసారిగా బహుశా యేసు ప్రభువు యొక్క మంచితనమును, స్వస్థతను తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి కనీసం ఆయన యొక్క వస్త్రంను తాకినా స్వస్థత పొందవచ్చు అని భావించినది. ఏసుప్రభు ప్రయాణం చేసే సందర్భంలో చాలా మంది ఆయనను తాకారు కానీ వారెవరు స్వస్థత పొందినట్లు ప్రభువు పలకలేదు కేవలం ఈమెను గురించి మాత్రమే ఏసు ప్రభువు తెలిపారు ఎందుకంటే ఆమె నిజమైనటువంటి విశ్వాసం కలిగి యేసు ప్రభువుని ఆశ్రయించి, ఆయన వస్త్రములు కూడా స్వస్థత ఉందని గట్టిగా నమ్మినది కాబట్టే తన విశ్వాసము ప్రకారంగా యేసుప్రభు అద్భుతం చేశారు.
యాయీరు కూడా ఒక అధికారి  అయినప్పటికీ ఆయన తన యొక్క కుమార్తె అనారోగ్యంతో బాధపడే సమయంలో తనకి మనవి చేయగా ఏసుప్రభువు  అతని విశ్వాసం చూసి  ఆ బిడ్డను స్వస్థతపరచ వచ్చి, ఆమెకు స్వస్థతనిచ్చారు. బాలిక మరణించినప్పటికీ కూడా ప్రభువు ఆమె కు నూతన జీవాన్ని ప్రసాదించారు. దేవుడు ఆమెకు జీవాన్ని ప్రసాదించి నా కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చారు అలాగే రక్తస్రావంతో బాధపడేటటువంటి ఆమెకు ప్రభువు ఆనందాన్నిచ్చారు.
ధ్యానించవలసిన అంశాలు 
1. దేవుడు ఎవరు నాశనం అవ్వాలి అని కోరుకోరు కాబట్టి మనము కూడా నాశనం ణము కోరుకోకూడదు.
2. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. 
3. దేవుని యందు పటిష్ట విశ్వాసం కలిగి ఉండాలి.
4. దేవుని మీద ఆధారపడి జీవించాలి. 
5. మనకు దేవుడు తోడుగా ఉంటారు అని నమ్మకం కలిగి జీవించాలి.
Fr. Bala Yesu OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...