22, ఆగస్టు 2024, గురువారం

యెహెఙ్కేలు 36:23-28 మత్తయి 22:1-14

 యెహెఙ్కేలు 36:23-28 మత్తయి 22:1-14

యేసు ప్రజలకు మరల ఉపమానరీతిగా ప్రసంగింప ఆరంభించెను. "పరలోక రాజ్యము ఇట్లున్నది : ఓక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని  విందుకు బయలుదేరిరండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను కాని, వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో! నా విందు సిద్దపరుపబడినది. ఎద్దులను, క్రొవ్విన దూడలును వధింపబడినవి. అంతయు సిద్ధముగా ఉన్నది. కనుక విందుకు రెండు అని మరియొకమారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కాని పిలువబడినవారు దానిని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన  పొలమునకు, మరి యొకడు తన వ్యాపారమునకు వెళ్లెను. తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టిచంపిరి. అపుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హత మార్చి వారి పట్టణమును తగులబెట్టించెను. అంతట, తన  సేవకులను పిలిచి నా విందు సిద్ధముగా ఉన్నది. కాని , నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులుకారు. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి, కనపడిన వారినందరిని పిలుచుకొనిరండు అని పంపెను. ఆ సేవకులు పురవీధుల లోనికి వెళ్లి మంచి , చేడు  తేడా లేక తమ కంటపడిన వారినందరను తీసికొనివచ్చిరి. ఆ కళ్యాణమండపము అతిథులతో నిండెను. అతిధులను చూచుటకు రాజు లోనికి వెళ్లి, వివాహవస్త్రము లేని వానిని ఒకనిని చూచి మిత్రమా! వివాహవస్త్రములేకయే నీవిచటికి ఎట్లు వచ్చితివి? అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించియుండెను. అపుడు ఆ రాజు తన సేవకులతో ఇతనిని కాలు సేతులు కట్టి వెలుపల నున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు విలపించుచు పండ్లు  కోరుకుకొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు కాని , ఎన్నుకొనబడినవారు కొందరే."

క్రిస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా! ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇలా అంటున్నాడు. మీరు మీ పాప జీవితముల ద్వారా అనేక జాతుల మధ్య నా మహానామమునకు అపకీర్తి తెచ్చిరి. కాబట్టి నా నామము పవిత్రమైనది అని అన్య జాతులకు తెలియజేస్తాను అని ప్రభువు  తెలియజేస్తున్నాడు. నేను పవిత్రుడను అని జనులు తెలుసుకుంటారు. అది మీ ద్వారానే అని ప్రభువు అంటున్నాడు. పవిత్ర జలమును చల్లి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను. కాబట్టి ప్రియ విశ్వాసులారా దేవుని పవిత్ర జలంతో మన పాపములను మాలిన్యములను దేవుడు శుద్ధి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపాల ద్వారా మనం పవిత్రమైన దేవుని మహా నామమును అపవిత్రం చేస్తున్నాం. దేవుడు మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. మన తండ్రి పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనందరిలో పరిశుద్ధాత్మను అనగా తన ఆత్మను మనలో ఉంచుతాడు. 

దేవుడు అంటున్నాడు, మీ నుండి రాతి గుండెను  తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. మనలో చాలా మంది రాతి గుండెను కలిగి ఉన్నాం. మనలో చాలా మందికి దైవ ప్రేమ లేదు, సోదర ప్రేమలేదు, స్వార్ధం, గర్వం, అసూయ అనేవి ఎక్కువైపోతున్నవి. మనుషుల మధ్య బంధాలు కూడా తగ్గిపోతున్నాయి. అందుకే దేవుడంటున్నాడు. మీలో నా ఆత్మను  ఉంచి నాఆజ్ఞలను పాటించునట్లు  చేయుదును. ఏమిటి దేవుని ఆజ్ఞలు అంటే అవి  దైవ ప్రేమ సోదర ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి. నీ దేవుణ్ణి ప్రేమించు నీ పొరుగు వానిని ప్రేమించు ఇవే దేవుని ఆజ్ఞల సారాంశం. ప్రియ విశ్వాసులారా మనందరం దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మతో నింపబడి పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నించుదాం. అప్పుడు మనము దేవుని ప్రజలం అవుతాము. ఆయన మన ప్రభువు అవుతాడు. 

ఈనాటి సువిశేష పఠనములో యేసు క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యము ఇలా ఉన్నది. అని ఉపమానాల  ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు. సిద్ధపరచిన పెండ్లి విందుకు రండి అని ఆహ్వానిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా దేవుడు పరలోక రాజ్యపు విందునకు మనందరిని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ఎన్నుకొని ఆహ్వానిస్తున్న, వారు మాత్రం ఆ విందుకు రావడం లేదు. దేవుడు తన సేవకులను పంపి మనందరిని ఆహ్వానిస్తున్నాడు. అనేక సార్లు  దేవుడు తన సేవకులను పంపినప్పటికీ చాల మంది ఆ ఆహ్వానాన్ని అర్ధం చేసుకోలేక ఆ విందుకు రాలేకపోతున్నారు.  అదేవిధంగా దేవుడు తన సేవకులను ఈనాడు మనందరి దగ్గరకు పంపిస్తున్నాడు. మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఎంతమందిమి సిద్ధంగా ఉన్నాము,  ఆ పరలోక రాజ్యపు విందులో పాల్గొనడానికి ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

పిలువబడినవారు ఆహ్వానాన్ని లక్ష్య పెట్టకుండా, అంటే లెక్క చేయకుండా ఉన్నారు. మరి ఈనాడు నీవు నేను మనందరం దేవుని ఆహ్వానాన్ని స్వీకరించుచున్నామా లేదా ఆలోచించండి. లేదా అయోగ్యులుగా మారిపోతున్నామా? నీకు నాకు వివాహ వస్త్రము లేకపోతే దేవుడు నిన్ను నన్ను చీకటిలోకి త్రోసివేస్తాడు.  ఏమిటి  వివాహ వస్త్రం అంటే అది మన సిద్ధపాటు, మరియు  పవిత్రత.  మన జీవితాలలో, మన విశ్వాసపు ప్రయాణంలో ఈ విధమైన సిద్ధపాటు, అవిత్రత లేకపోతే మనం కూడా  చీకటిలోనికి త్రోసివేయబడతాం. కాబట్టి విశ్వాసులారా ధ్యానించండి, ఆలోచించండి మనం ఎలా ఉన్నాం. కేవలం పిలువబడిన వారిలా ఉన్నామా లేదా ఎన్నుకొనబడిన వారిలా ఉన్నామా ? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: పవిత్రుడవైన దేవా, నా పాప జీవితము ద్వారా నీ పవిత్ర నామమును అపవిత్రం చేసి నీకు ద్రోహము చేసి ఉన్నాము. మమ్ము క్షమించండి. ప్రభువా మాలో ఉన్న రాతి గుండెను తొలగించండి. మీ  ఆత్మతో  మమ్ము నింపండి మాంసపు గుండెను నాకు ప్రసాదించండి. మాకు పవిత్రతను, పవిత్ర జీవితమును జీవించే భాగ్యము మాకు దయచేయండి. మేము ఎన్నుకొనబడిన వారిగా ఉండే భాగ్యం మాకు ప్రసాదించండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

21, ఆగస్టు 2024, బుధవారం

యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

 యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

"పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది: ఒక  యజమానుడు తన ద్రాక్షతోటలో పని  చేయుటకు పని వారలకై ప్రాతః కాలమున  బయలు దేరెను. అతడు రోజునకు ఒక దీనారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి  ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్లి అంగడి వీధిలో పని కొరకు వేచియున్న కొందరిని చూచి,'మీరు నా తోటకు వెళ్లి పని చేయుడు. న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చెదను' అనెను. వారు అటులనే వెళ్లిరి. తిరిగి పండ్రెండు గంటలకు మరల మధ్యాహ్నం మూడుగంటలకు ఆ యజమానుడు అట్లే మరి కొందరు పని వారిని పంపెను. రమారమి  సాయంకాలము ఐదుగంటల సమయమున వెళ్లి, సంత వీధిలో ఇంకను నిలిచియున్నవారిని చూచి , మీరు  ఏల రోజంతయు పని పాటులు లేక ఇచట నిలిచియున్నారు? అని ప్రశ్నించెను. మమ్మెవరు కూలికి  పిలువలేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతట ఆ  యజమానుడు  అటులైన మీరు కూడ నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్లుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పని చేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి, తొలుత వచ్చిన వారి వరకు వారివారి కూలినిమ్ము అనెను. అటులనే సాయంత్రం అయిదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలకొక దీనారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించినవారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కాని, వారుకూడ తలకొక దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకొని, యజమానునితో 'పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును, చిట్ట చివర ఒక గంట మాత్రమే పనిలో వంగినవారికిని, సమానముగా కూలి నిచ్చితివేమి'? అని గొణుగుచు పలికిరి. అంతట యజమానుడు వారిలో నొకనిని చూచి, మిత్రమా!  నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు ఒక దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసికొనిపొమ్ము. నీకు ఇచ్చినంత కడపటివానికిని ఇచ్చుట నా యిష్టము. నా ధనమును నా యిచ్ఛవచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక  నా ఉదారత నీ కంటగింపుగానున్నదా?'అని పలికెను. ఇట్లే  మొదటివారు కడపటి వారగుదురు. కడపటివారు మొదటివారగుదురురు" అని యేసు పలికెను. 

క్రీస్తు నాధుని యందు  ప్రియమైన విశ్వాసులారా ఈనాటి మొదట పఠనంలో దేవుడు తన ప్రవక్తను పంపుతూ యిస్రాయేలు కాపరులను ఖండిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజులను ఖండించు అని తన ప్రవక్తను పంపిస్తున్నాడు. మీకు అనర్ధము తప్పదు అని  వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవుడు వారిని అంటే కాపరులను, రాజులను ఖండిస్తున్నాడు అంటే  కాపరులు మందను వెదకటం లేదు. అంతే కాకుండా వారు తమ కడుపు నింపుకొనుచున్నారే గాని  మందను మేపటం లేదు.  గొర్రెలను పట్టించుకొనుట లేదు. అందుకు దేవుడు అంటున్నాడు నేను మీ నుండి గొఱ్ఱెలను కాపాడుదును. నేనే నా మందను వెదకెదను. వానిని గూర్చి జాగ్రత్త పడెదను అని  తన ప్రవక్తల ద్వారా  తెలియజేస్తున్నాడు. 

ప్రియ విశ్వాసులారా ఇక్కడ కాపరులు అంటే దైవ సేవ చేస్తున్న గురువులు, దైవాంకితులు దేవుని చేత ఎన్నుకోనబడి దైవసేవ చేసేవారు అదే విధంగా గొర్రెలు అంటే ప్రజలు దేవుడు గురువులను కాపరులుగా తన మందయినా ప్రజలను మంచి మార్గములో నడిపించమని ఎన్నుకొంటే వారు మాత్రం వారు తమ కడుపు మాత్రమే నింపుకుంటున్నారు. అదే దేవుని ఆవేదన. దైవ ప్రజలను మేపుట లేదు . దేవుని ప్రజలు పాపపు మార్గంలో పడి కొట్టుమిట్టాడుతుంటే వారిని చూసి కూడా పట్టించుకోవడం లేదు. వారు అనేక సమస్యలతో , ఇబ్బందులతో, కష్టాలతో కన్నీళ్లతో గాయపడి ఉన్నప్పుడు వారికి దేవుని వాక్కుతో కట్టు కట్టడం లేదు. ప్రక్కకు తప్పుకొనిన వారు అంటే చేదు అలవాటుల వలన, చేడు క్రియలను, చేడు ఆలోచనల ద్వారా విశ్వాసులు అవిశ్వాసులుగా మారి ప్రక్కకు తప్పుకొని పోతున్నారు. అది చూసి కూడా కాపరులు వారిని తిరిగి మందలోనికి నడిపించలేక పోతున్నారు.  అంతేకాకుండా వారి పట్ల కఠినముగా ప్రవర్తించుచున్నారు. 

ఇదే ఈనాటి సమాజంలోకూడా  జరుగుతుంది. కాపరులు తమ కడుపునింపుకుంటున్నారు. తమకు అప్పగించబడిన విశ్వాసులను అస్సలు పట్టించుకోవండ లేదు.    వారిని కని పెట్టుకొని ఉండటం లేదు. వారు తాము మంచి మార్గంలో నడువకుండా మంచి మార్గంలో నడిచే విశ్వాసులను తమ మాటల ద్వారా అసత్యపు బోధల ద్వారా చెల్లా చెదురు చేస్తున్నారు. ఎవరైన చేడు మార్గంలో పోతుంటే వారిని సన్మార్గంలో నడిపించలేకపోతున్నారు. వారి గాయాలను మాన్పకుండా వారు తమ విశ్వాసులను  అనేక విధములుగా గాయ పరుస్తున్నారు. విశ్వాసుల పట్ల మృదువుగా ప్రవర్తించడం లేదు. ఇది  నిజమా ? కాదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ఈనాటి సువిశేష పఠనములో మనం దేవుని యొక్క ఉదారతను తెలుసుకుంటున్నాం. దేవుడు పరలోక రాజ్యంను ద్రాక్షతోట, కూలీల పోలికలతో వివరించాడు. అనేక సమయాలలో అనేక మందిని  దేవుడు తన తోటకు పని నిమిత్తము పంపుతున్నారు. దేవుడు మనందరిని తన రాజ్య విస్తరణకు  పనివారిగా ఎన్నుకుంటున్నారు.   అందరి పట్ల ఉదారత, సమానత్వాన్ని దేవుడు చూపిస్తున్నారు. దేవునికి అందరు అర్హులే. కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు అంటే  అర్ధం ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు మనలను దీవించి యోగ్యులును  చేస్తాడు, మనం చివరి వారిగా ఉన్న మనలను మొదటి వారీగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనం దేవుని   రాజ్యాల విస్తారణకై  శ్రమించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని దయను పొందుటకు  సిద్ధంగా  ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: దేవా మమ్ము అందరిని ఒక  కాపరులుగా  ఎన్నుకున్నావు. తండ్రిగా, తల్లిగా , బిడ్డగా విశ్వాసిగా మేము కూడా కాపరులుగా జీవించడానికి శక్తిని దయ చేయండి. మాకు అప్పగించిన , మా బిడ్డలను మా కుటుంబాలను , సంఘస్తులను మంచి మార్గంలో నడిపించడానికి శక్తిని దయ చేయండి.  మమ్ము మంచి కాపరులుగా మార్చండి. నీవలె ఉదారత కలిగి అందరిని ప్రేమించి జీవించే భాగ్యం దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...