1, మే 2021, శనివారం

పాస్కా కాల ఐదవ ఆదివారము

 

అపోస్తులుల కార్యములు 9:26-31,

1 యోహాను 3:18-24,

యోహాను 15:1-8

ఐక్యత కలిగి జీవించడం”

నేను మీయందు ఉందును మీరు నా యందు ఉండుడు. ద్రాక్షా వల్లి యందు ఉండని తీగ దానియంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు,” యోహాను 15 : 4.”

ఉపోద్ఘాతం:       

క్రీస్తునాధుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా! ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలు, క్రీస్తుని అంటి పెట్టుకొని, ఐక్యత కలిగి జీవించాలని మనల్ని ఆహ్వానిస్తున్నాయి. మన క్రైస్తవ జీవితం అంటేనే ఐక్యమైనటువంటి జీవితం. మన దేవుడైన త్రిత్వైక సర్వేశరుడు ఐక్యత కలిగినటువంటి దేవుడు. తండ్రి దేవుడు ఈలోకంలో తన ప్రణాలికను నెరవేర్చుటకు ఏ విధముగా తన కుమారుడి మీద ఆధార పడియున్నాడో అదేవిధంగా కుమారుడు తన తండ్రి కార్యాన్ని నెరవేర్చుటకు తండ్రి మీద అంతే ఆధారి పడియున్నాడు అని ఈ నాటి వాక్యంలో ధ్యానిస్తున్నాము. క్రీస్తు పునరుత్తానము తరువాత గడచిన వారాలు కూడా మనకు నిజమయినటువంటి దేవుడు, తండ్రి, కుమారుడు, ఇద్దరు కూడా ఒక్కరే అని క్రీస్తు పలుకుల ద్వారా ఇంతకుముందు పఠనాలలో ధ్యానించి యున్నాము. గడచిన వారం క్రీస్తు ఒక మంచి కాపరిగాను, మరి ఈనాడు క్రీస్తు ఒక నిజమయినటువంటి ద్రాక్షా వల్లిగాను ధ్యానిస్తున్నాము.

నేను ద్రాక్షావల్లిని మీరు రెమ్మలు:

క్రీస్తు ప్రభు నివసించినటువంటి పాలస్తీనా దేశంలో ద్రాక్షా చెట్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. అక్కడ ద్రాక్షా చెట్లు చాలా ఎక్కువగ ఉంటాయి. చాలా మంది ఆ తోటలో పనిచేయుటకు వెళ్తుంటారు. కనుక అక్కడి వారందరికీ ఆ ద్రాక్షావల్లికి {ద్రాక్షా చెట్టుకి}, దాని తీగలకు మధ్య ఉన్న సంబంధం గురించి బాగా తెలుసు. ద్రాక్షావల్లికి ఉన్నటు వంటి తీగలు ఎప్పుడు మంచి ఫలాలన్నిస్తాయి, ఫలించాలంటే ఏమి చెయ్యాలో, ఫలించనటువంటి తీగలను ఏ విధంగా కత్తిరించి పారవేస్తారో, వారికి బాగా తెలుసు. కాబట్టి క్రీస్తు ప్రభు ఈ ఉపమానం ద్వారా తండ్రికి, తనకు తన శిష్యులకు మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు.

తండ్రి దేవునికి, కుమారునికి మరియు మనకు మధ్యగల అనుబంధాన్ని గుర్తిస్తుంది. తండ్రి వ్యవసాయదారుడు లేదా ద్రాక్షా రసం పెంపకందారుడు, యేసు ప్రభు ద్రాక్షా చెట్టు, మనం రెమ్మలం. ఇందులో క్రీస్తు ప్రభు పాత్ర ఏమిటంటే తనయందు ఉన్నటువంటి  రెమ్మలకు జీవాన్ని అందించడం, ఆ ద్రాక్షా తీగలమయిన మనకు జీవం పోయడం. తండ్రి, ద్రాక్షా వల్లి అయిన క్రీస్తుకి శక్తిని ఇవ్వడం మరియు క్రీస్తుని హత్తుకొని ఉన్న రెమ్మలను సరిచేయడం లేదా క్రీస్తు నుండి జీవం పొంది ఫలించు వాటిని అధికంగా ఫలించుటకు వాటిని కత్తిరించి, ఫలించనటువంటి వాటిని తీసిపడేసి కాల్చివేయుట. ఈ ఉపమానం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే క్రీస్తుని అనుసరించువారు ఫలించాలంటే, వారు క్రీస్తు యందు జీవించాలి. క్రీస్తు లేకుండా మన ఆధ్యాత్మిక జీవితం లో ఏది చేయలేము, ఏది పొందలేము అని క్రీస్తే ఈ నాటి సువిశేషంలో చెబుతున్నాడు. ద్రాక్షా వల్లి యందు ఉండని తీగ దానియంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు {యోహాను 15 : 4}.

ఫలభరితమయిన తీగలు:

శిష్యులు క్రీస్తుకి సన్నిహితంగా జీవించడం ద్వారా ఉన్న అనుబంధాన్ని గురించి మరియు ఆ బంధాన్ని అలాగే కొనసాగించాలని ఈ ఉపమానంలో తెలియజేస్తున్నాడు.  తండ్రి కుమారిని మీద, కుమారుడు తండ్రి మీద ఏవిధముగా ఆదారిపడియున్నారో, అదే విధముగా, క్రీస్తు అనుచరులమయిన మనము రక్షణ పొందాలంటే తండ్రితో ఐక్యమవ్వాలంటే నువ్వు, నేను, మనమందరము క్రీస్తులో జీవించాలి, ఆ క్రీస్తుని మన జీవితంలోకి ఆహ్వానించాలి. అప్పుడు ద్రాక్షా వల్లికి ఫలించే తీగలవలె మన జీవితంలో గూడ  క్రీస్తు ఫలాలు పొందుతాము. పునరుత్తానమైనటువంటి క్రీస్తుకి సన్నిహితంగా జీవించిన శిష్యులు ఆధ్యాత్మిక ఫలాలు పొందారు అని మొదటి పఠనములో చదువుతున్నాము. ఆ ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఈ నాటి మొదటి పఠనంలో పునీత పౌలు గారిలో చూస్తున్నాము. పౌలు గారు ఒక పరిసయ్యుడు. క్రైస్తవులను హిసించినటువంటి ఒక మతోన్మాది. అటువంటి వ్యక్తి, పునరుత్తాన క్రీస్తు దర్శనం కలిగిన వెంటనే మంచి ఫలాన్ని ఉత్పత్తి చేసే రెమ్మ వలె మారాడు. క్రీస్తుని తన హృదయంలోకి ఆహ్వానించాడు. ఆ క్షణం నుంచి క్రీస్తులో తన విశ్వాసాన్ని బలపరచుకొని క్రీస్తుని అంటిపెట్టుకుని, క్రీస్తు ఫలాలు పొంది తన జీవితం మొత్తం కూడా క్రీస్తు సువార్తను బోధిస్తూ, క్రీస్తే నిజమయినటువంటి రక్షకుడు అని ఆ క్రీస్తుని అన్యులకి అందిచారు. క్రీస్తు నుంచి ఆధ్యాత్మిక జీవం పొందాడు. అందుకే పౌలు గారు గలతీయులకి రాసిన లేఖ 2  : 4 వచనంలో ఈవిధముగా అంటారు. నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. అంత దగ్గరగ క్రీస్తుని హత్తుకొని జీవించాడు. క్రీస్తులో తన జీవితం ప్రారంభించినప్పుడు తనలో క్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మలినాలన్నింటిని (పగ, కోపం, ద్వేషం, అసూయ మరియు హింస) లన్నింటిని తండ్రి దేవుడు కత్తిరించి, వినయం, ప్రేమ, దయ, కరుణ, త్యాగం అనే ఫలాలతో నింపాడు. క్రీస్తు ఏ విధంగా మన రక్షణ కొరకు మానవరూపందాల్చి ఒక సేవకునివలె జీవించాడో అదే విధంగా పునీత పౌలు గారు తన సువార్త పరిచర్యలో అన్యులకు మరియు అందరికి అన్నివిధాలుగా తనను తాను మలచుకొన్నాడు, 1 కొరింతి 9 : 19 - 23 వచనాలలో చూస్తున్నాము.  అందుకే ప్రభు సువిశేష పఠనములో స్పష్టంగా చెబుతున్నారు. నేను మీయందు ఉందును మీరు నాయందు ఉండుడు. నేను లేకుండా మీరు ఏమియు చేయజాలరు అని {యోహాను 15 : 4}.  శిష్యులు నమ్మలేదు పౌలు పొందిన మార్పును గూర్చి. వారిని చంపివేయడానికి వచ్చారని భయపడిరి. బర్నబా ద్వారా జరిగిన సంఘటన గూర్చి వారికి ఎరుకపరచబడింది. అప్పుడు వారు శాంతి పొంది పౌలు ని ఆహ్వానించిరి. ఎందుకంటే క్రీస్తు తనతో ఉన్నాడు కాబట్టి.

క్రీస్తుతో ఐక్యమవడం ఎలా?

ప్రార్థన చేయడం ద్వారా,  దేవుని వాక్యాన్ని విశ్వాసంతో ఆలకించి పాటించడం ద్వారా క్రీస్తు మనలను బలపరుస్తాడు. ఉదాహరణకు పునీతులు అనునిత్యం ప్రార్ధిస్తూ, దేవునియందు విధేయత కలిగి, దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆచరించారు కాబట్టి వారు దేవునితో ఐక్యమైయున్నారు. చాలా మంది చర్చికి వస్తుంటారు, అన్ని కార్యాలలో పాల్గొంటారు గాని క్రైస్తవ జీవితాన్ని పాటించరు, క్రీస్తుయందు జీవించరు, దేవుని వాక్యాన్ని వింటారు కానీ దానికి అనుగుణంగా జీవించరు. అట్టివారిని తండ్రి దేవుడు ఫలించని రెమ్మలవలె కత్తిరించి అగ్నిలో పారవేయును. ఎందుకంటే వారు క్రీస్తు నుంచి జీవం పొందుతున్నారు కానీ ఆ జీవాన్ని వృధా చేస్తున్నారు. వారి వల్ల ఫలించు వారికి ఇబ్బంది అవుతుందని పారవేయును. ఈనాడు ప్రపంచం అంతా కరోనా వైరస్ కి బయపడి జీవిస్తుంది. ఇటువంటి సమయంలో మనం క్రీస్తుయందు దృఢమయిన విశ్వాసం కలిగి క్రీస్తులో జీవించినట్లయితే తప్పకుండా ప్రభువు  మనందరినీ  దీవిస్తాడు, రక్షిస్తాడు. ఎందుకంటే క్రీస్తు మనతో ఉంటె అన్నియు సాధ్యమే అని  రోమా   8:31 లో చూస్తున్నాము.

క్రీస్తు అనుచరులం,  ప్రియ బిడ్డలమయిన మనం నేటి సమాజంలో ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తుకి అంటి పెట్టుకొని ఫలించే రెమ్మల వలే  ఉన్నామా లేక ఫలితం లేదు అని పారవేయబడినటువంటి రెమ్మల వలె ఉన్నామా అని ధ్యానించాలి. క్రీస్తులో జీవించాలనుకొను వారికి ఏది అడిగిన ఇవ్వబడును అని యేసు ప్రభు ఆహ్వానం పలుకుతున్నారు. రెండవ పఠనంలో పునీత యోహాను గారు అంటున్నారు కేవలం క్రీస్తులో విశ్వాస ముంచి క్రీస్తుతో ఐక్యమై జీవిస్తే తప్ప మనం ఎటువంటి ఆధ్యాత్మిక శక్తిని గాని, ఫలాలు గాని  పొందలేము అని. ఎప్పుడైతే పునీత పౌలు గారి వలె క్రీస్తే సర్వము అని క్రీస్తుని మన జీవితం లోకి ఆహ్వానించి మనం ఆ ప్రభువుని అంటిపెట్టుకొని జీవిస్తామో అప్పుడు దేవుని వరాలు, ఆధ్యాత్మిక ఫలాలు, ప్రేమ, సహనం, దయ, జాలి, త్యాగం కలిగి దేవుని రక్షణ పొందుతాము. కనుక నేను క్రీస్తు అనుచరుడిని, అయన సేవకుడిని అని ఒత్తి మాటలతో చెప్పుకోవడం కాకుండా దేవుని ఆజ్ఞలను, ముఖ్యంగ క్రీస్తు ప్రేమ ద్వారా మన పొరుగువారిని ప్రేమించి, అందరితో ఐక్యమై సహాయ సేవచేస్తూ  మన జీవిత కార్యాల ద్వారా క్రీస్తే నాలో జీవించేది అని అందరికి క్రీస్తుని అందిస్తూ క్రీస్తుని తెలియ చేద్దాం.

ద్రాక్షావల్లికి తీగల వలే క్రీస్తుతో మన అనుబంధాన్ని పెంచుకొని క్రీస్తు బాటలో పయనిద్దాం. అందుకు మన జీవితంలో దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉన్న వాటిని మన జీవితం నుండి పారద్రోలి క్రీస్తు శక్తితో అన్ని శోధనలను జయించి జీవించాలి. మరియు క్రీస్తులో మనము, మనలో క్రీస్తు జీవించుటకు ఆహ్వానించాలి. అందుకు కావలసిన దైవానుగ్రహాలను దయచేయమని ఈనాటి దివ్య బలిపూజలో ప్రార్థిదాం. ఆమెన్

Br. Vijay Thalari. OCD

24, ఏప్రిల్ 2021, శనివారం

నాలుగవ పాస్కా ఆదివారము

 

క్రీస్తు నాథునియందు ప్రియ సహోదరీ సహోదరులారాఈనాడు మనం పాస్కా కాలపు నాలుగవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా కుడా కొనియాడుతున్నాం.  ఈనాడు మూడు దివ్య గ్రంథ పఠనాలు మనకు బోధించేది ఒక్కటే. అది యేసు క్రీస్తు మంచి కాపరిగా ఉంటూమనలను సకల ఆపదలనుండి సంరక్షిస్తున్నాడనిబోధిస్తున్నాయి. 

ముందుగా మనం మొదటి పఠనాన్ని చూస్తే,ఇక్కడ పేతురు గారు పవిత్రాత్మ శక్తిని పొంది, కుంటి వానికి స్వస్థత నిచ్చిన తరువాత, విచారణ సభ ముందు నిలబడి, అక్కడ ఉన్న ప్రజా నాయకులను, పెద్దలను ఉద్దేశించి,యేసు ప్రభువు యొక్క గొప్పతనము గురించి, తన యొక్క శక్తిని గూర్చి, ధైర్యముగా సాక్ష్యమిస్తున్నాడు. ఈనాడు ఈ కుంటి వాడు లేచి నడుస్తున్నాడు, దానికి కారణం యేసుప్రభువు మాత్రమే. ఆయన నామములో శక్తి వుంది. అందుకే ఈనాడు మేము ఆయనకు సాక్ష్యం  ఇస్తున్నాము.కానీ మీరు ఆయనను సిలువపై కొట్టి చంపారు. ఇల్లు కట్టు వారైన మీరు, రక్షకుడైన యేసు క్రీస్తును పనికిరాని రాయి అని  త్రోసివేసారు.కానీ  ఇప్పుడు ఈ లోకంలో  రక్షణ లభించాలి అంటే, యేసు క్రీస్తు తప్ప వేరొక వ్యక్తి లేడు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి  ఇవ్వబడలేదు".

ఒకప్పుడు పేతురు జీవితం మనం చూస్తే,  మూడు సంవత్సరాలు యేసు ప్రభువుతో వుండి కూడా, అతని శక్తిని చూసి కూడా, ప్రభువుని వదిలివేసి పారిపోయాడు, అవిశ్వాసిగా మారాడు,యూదులు అతడిని చంపివేస్తారని భయపడ్డాడు.కానీ యేసుప్రభు పునరుత్తానమైన తరువాత శిష్యుల దగ్గరకు వచ్చి మీకు శాంతి కలుగును గాక! అని చెప్పిన తరువాత వారికి పవిత్రాత్మ శక్తినిచ్చి, వారిని సాక్షులుగా  మారుస్తున్నాడు( యోహా ;20 ; 21 -23 ) . మరి ఈనాడు నువ్వు నేను దేవుని యొక్క రక్షణను పొందాలి అంటే, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలి, అయన యందు విశ్వాసము ఉంచి  ఆయన దగ్గరకు చేరాలి. అప్పుడే మనకు నిజమైన రక్షణ లభిస్తుంది.

రెండవ పఠనము గమనిస్తే, దేవుడు తన బిడ్డలపై చూపు ప్రేమ ఎంతో  మిక్కుటము అని బోధిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమ మూలమునే ఇప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలము అని పిలువబడుచున్నాము.మరి ఇప్పుడు మన పని ఏమిటంటే, యేసయ్యను మనం చూడాలి అంటే, అయన  వలె అవ్వాలి అంటే, అయన యందు మనము నిరీక్షణ కలిగి జీవించాలి.అప్పుడే మనకు, మనజీవితానికి, ఒక అర్ధం ఉంటుంది. ఎందుకంటే అయన ప్రేమ  ఎలాంటిది అంటే, రక్షించే ప్రేమ. జీవాన్నిచ్చే  ప్రేమ. మరణించు ప్రేమ.మరణించి తిరిగి లేచి, నీకు శాశ్వత, నూతన జీవితాన్నిచ్చు ప్రేమ. మరి అలాంటి  ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుందంటే కేవలం మన యేసుక్రీస్తులోనే. కాబట్టి మనమందరం దేవునియొక్క  బిడ్డలుగా మారడానికి ప్రయత్నిద్దాం, ప్రయాస పడుదాం.

                సువిశేష పఠనాన్ని మనం చూస్తే, నేను మంచి కాపరి అని అంటున్నాడు యేసు ప్రభువు. ఎందుకు దేవుడు నేను మంచి కాపరి అని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే,చెదిరిపోయిన గొఱ్ఱెలవలె వున్న మనందరినీ ఒక్కటిగా చేయడానికి. అయితే మంచి కాపరి అంటే, తన మందను ఎప్పుడూ సురక్షితముగా ఉంచుతూ, సక్రమమైన బాటలో నడిపిస్తూ, వాటికి కావలిసిన ఆహారాన్ని సమకూర్చుతూ,తగుజాగ్రత్తలు తీసుకుంటూ,ఒక మంచి నివాస స్థలమును ఏర్పరిచే వాడే మంచి కాపరి.సాధారణంగా మనం చూసే కాపరులు గొర్రెలను మేపడానికి తీసుకెళ్లేటప్పుడు తాను గొర్రెల ముందుగా నడుస్తూ, వాటిని పచ్చిక ప్రదేశాలకు తీసుకొని వెళ్తాడు. మరి యేసు ప్రభువు కుడా అదే చేసాడు. మూడు సంవత్సరములు ఈలోకంలో వుండి, తాను సత్యమైన మార్గములో నడుస్తూ,ఒక స్వచ్ఛమైన గొర్రె పిల్లలా ఈలోకంలో జీవించాడు. యోహా;1 ;29 లో చూస్తే బాప్తిస్మ యోహాను ఇలా అంటున్నాడు, "ఇదిగో! లోకముయొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల." మంచికాపరి తన మందలకొరకు తన ప్రాణం ధారపోయును. యిర్మీ ; 31 ;10 లో, "నేను ఇశ్రాయేలును చెల్లా చెదరు చేసితిని.కానీ వారిని మరల ప్రోగు చేయుదును.కాపరి మందనువలె వారిని కాచి కాపాడుదును" అని అంటున్నాడు.

ఈ లోక కాపరులకు, మంచి కాపరి అయినటువంటి యేసుక్రిస్తుకు మధ్య తేడాను చూస్తే, ఆదాము అవ్వలు ఏ విధంగా దేవునికి అవిధేయులయ్యారో చూస్తున్నాం. ఆది;1;26-27 లో చూస్తే, తండ్రి దేవుడు ఈ లోకాన్నంతటిని సృష్టించిన తరువాత ఈ లోకంలో వున్న ప్రతి ప్రాణి మీద అధికారాన్ని మానవునికి మాత్రమే ఇస్తున్నాడు. కానీ దేవుని వలె కావాలని, అయన జ్ఞానమును పొందాలని,సర్పము చెప్పిన మాటలను నమ్మి దేవునికి విరుద్ధముగా పాపమును ఒడిగట్టుకున్నారు (ఆది;3;2-5). మోషేను ఇశ్రాయేలీయులకు ఎన్నుకొని,కాపరిలేని వ్యక్తులుగా వున్న ఇశ్రాయేలు జన సమూహాన్ని బానిసత్వం నుండి విడిపించడానికి ఐగుప్తు దేశానికి పంపిస్తున్నాడు.కానీ మోషే దేవునియొక్క ఆజ్ఞలను జవదాతాడు. ప్రజలు గొణిగినప్పుడు దేవుని యొక్క పవిత్ర శక్తిని తెలియజేయలేదు (సంఖ్య ; 27;14 ). అందుకుగాను మోషే, అహరోనులవలె దేవుడు ప్రమాణం చేసిన కనాను దేశమున అడుగు పెట్టలేక పోయారు.ఇంకా సంసోను దేవునిచే ఎన్నుకొనబడి, గొప్ప శక్తిని పొంది,ఇశ్రాయేలు నాయకుడుగా చేసాడు. కానీ ఒక స్త్రీ మాటలకు లొంగి, ఆమెతో వ్యబిచారం చేసి పాపము చేసి శక్తిని కోల్పోయి, చివరికి తన ప్రాణాల్ని కోల్పోయి దేవుడిచ్చిన కార్యాన్ని నెరవేర్చలేక పోయాడు. ఇలా ఎంతో మంది జీవితాలలో జరిగింది. సౌలు ధనంమీద, జంతువులమీద ఆశతో దేవుని మాటను దిక్కరించాడు.దాని ఫలితం రాజరికాన్ని కోల్పోయాడు(1 సమూ ;10;1,15;10-11,14-15). దావీదు మహారాజు బెర్షెబా మీద మనసుపడి ఆమెతో వ్యభిచరించి, ఆమె భర్తను చంపి దేవునికి కోపం తెప్పించాడు. ఇలా ఎంతోమంది దేవుడు ఎన్నుకున్నటువంటి కాపరులు పేరు పలుకు బడి కోసం,ధనం కోసం, అధికారం కోసం దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకు న్యాయం చేయలేక పోయారు. జెఫన్యా;11;16 లో ఇలా అంటుంటాడు,"నేను నా మందకు ఒక కాపరిని నియమించితిని, కానీ అతడు నాశనమును గురికానున్న మందను కాపాడడు. తప్పి పోయిన గొర్రెలను వెదకడు,గాయపడినవాటిని నయము చేయడు,చావగా మిగిలిన వానిని మేపడు.పైపెచ్చు, అతడు క్రొవ్విన గొర్రెల మాంసమును తినివేయును.వాని గిట్టలు చీల్చి వేయును".అని అంటున్నాడు. అయితే మన మంచి కాపరి ఐన యేసు ప్రభువు అలాంటి కాపరి కాదు. ఎందుకంటే, మన కాపరి రక్షించు కాపరి.పోషించు కాపరి. మన గాయములకు కట్టుకట్టు కాపరి. అదే విధముగా మన ప్రాణం కోసం తన ప్రాణాన్నైనా పణంగా పెట్టు కాపరి. అలాంటి కాపరి ఈనాడు నీతో నాతో అంటున్నాడు, నేను మంచి కాపరి అని.

అయితే, పు. మత్తయి గారు,నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచూ కాపరి లేని గొర్రెల వలే చెదరి యున్న జనసమూహాన్ని చూసి, ఆ కరుణామయుడి కడుపు తరుగుకొని పోయెను అని అంటున్నారు(మత్త ;9;36). అంటే ఇన్ని రోజులు వారి కష్టాలలో మ్రగ్గిపోయి వున్నారు. సరైన కాపరి లేక అల్లాడి పోయారు. కానీ నాలుగు వందల సంవత్సరాల దాకా ఏ ప్రవక్త యొక్క ప్రవచనాలను వారు వినలేదు.దేవునియొక్క స్వరం వారికి వినిపించ లేదు.కానీ ఇప్పుడు,మలాకీ ప్రవక్త ప్రవచనాల తరువాత యేసు ప్రభువు వారికి భోదిస్తున్నసమయంలో ఎంతోమంది ప్రజలు దేవుని దగ్గరకు తండోప తండాలుగా వస్తున్నారు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తున్నారో వారు స్వస్థతను పొందుతున్నారు. సంతోషముతో నింపబడుతున్నారు. మరి నువ్వు, నేను నిజమైన విశ్వాసంతో దేవునిదగ్గరకు వస్తున్నామా? అని మనం ధ్యానించాలి.మన కాపరి తన ప్రాణాన్ని తన గొర్రెలమైన మనకోసం ధారపోసే  ఒక గొప్ప కాపరి. ఆయన ఇలా అంటున్నాడు, నేనే మంచి కాపరిని. నా మంద కొరకు ప్రాణమును ఇచ్చెదను" (యోహా; 10 ;11 ). మన పాపములను తొలగించడానికినూతన జీవితమును ప్రసాదించడానికి,ఆయన సిలువపై మరణించి,మూడవనాడు తిరిగి లేచి మనకు రక్షణ కల్పిస్తాడు. ఒక జీతగాడు తన జీవితం సాగడానికి,డబ్బును సంపాదించ డానికి, తన కుటుంబాన్ని పోషించ డానికి పనిచేస్తాడు. కానీ,తనకు గానీ, గొర్రెలకు గాని కష్టం వస్తే, బయపడి వెనకకు తిరిగి పారిపోతాడు, తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు.ఇది నిజమైన కాపరి అయినటువంటి యేసయ్యకు,జీతగానికి ఉన్న తేడా.

         మంచి కాపరి లక్షణాలు:1 .మందను మేపేవాడు.2 .రక్షించు వాడు. 3 .నివాసమేర్పరిచేవాడు.

1.      మందను మేపేవాడు:

                  ప్రతి యొక్క కాపరి తన మందకు తగిన ఆహారాన్ని ఇవ్వడానికి మందను ఒక మంచి పచ్చిక పట్టుల దగ్గరకు తీసుకొనివెళ్ళి,అవి సంతృప్తిగా భుజించువరకు వాటితోనే ఉంటాడు ( యిర్మీ;50 ;19 ). అదేవిధంగా మనకాపరి  అయిన యేసయ్య కూడా మనకు తన వాక్కు ద్వారా, పవిత్రాత్మ శక్తి ద్వారా,స్వస్థత ద్వారా, మనలను మేపుతూ,మన శరీరాన్ని, ఆత్మను,నింపుతూ ఉంటాడు.

2.    రక్షించు వాడు:

               దేవుడు ఈ లోకానికి వచ్చినది మనలనందరిని రక్షించడానికే కానీ శిక్షించుటకు కాదు.ఎందుకంటే ఇది రక్షణ ప్రణాళిక.ఈ రక్షణ ప్రణాళికలో అందరూ రక్షణ పొందాలని మనందరి కోసం ఆయన శిక్ష అనుభవించి,మనకు రక్షణ తెచ్చాడు. దేవుడు అంటూ వున్నాడు,"మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించ డానికి వచ్చియున్నాడు"(మత్త;18 ;11 ).

3.     నివాసం ఏర్పరిచే వాడు:

ప్రతియొక్క కాపరి గొర్రెల కొరకు ఒక నివాసాన్ని ఏర్పరచాలి.ఎందుకంటే,వర్షానికి తడిసిపోకుండా,ఇతర జంతువుల బారిన పడకుండా, దొంగల నుంచి కాపాడటానికి,ఒక నివాసాన్ని లేక గుడారాన్నిఏర్పరుస్తారు.అదేవిధంగా, యేసయ్య కూడా మనందరి కోసం ఒక నివాస స్థలాన్ని ఏర్పరిచాడు. యోహా; 14 ;2 లో చూస్తే,"నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు.లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను.నేను మీకొక నివాస స్థలమును సిద్దము చేయబోవుచున్నాను".అని అంటున్నాడు.

        మరి ఈనాడు నీవు మంచి కాపరిలా ఉండాలనుకుంటున్నావా, లేక జీతగాని వలె నీ ప్రాణాన్ని నీవు దక్కించుకొని, స్వార్థంగా జీవించాలనుకుంటున్నావా? ఈ లోకంలో ఎంతోమంది కాపరులు వున్నారు. గురువులుకన్యాస్త్రీలుఉపదేశకులు మాత్రమే కాదు. కానీప్రతియొక్క వ్యక్తి కాపరి యొక్క గుణాన్ని, లక్షణాన్ని పొందాలి.  ప్రతి యొక్క తల్లి, దండ్రులు తమ పిల్లలకు మంచి కాపరులుగా వుంటూ,సక్రమమైన మార్గములో నడిపిస్తుండాలి. బిడ్డలను దీవించాలి.(ఆది;27 ;25-29)ఈసాకు యాకోబును దీవించిన విధముగా వారిని బోధించాలి( ద్వితీ;6 ;7 ;4 ; 9 ).శిక్షణనివ్వాలి (సామె;22;6).అదే విధంగా ప్రతియొక్క ఉపాధ్యాయినీ ఉపాద్యాయుడు చదువుకొనే ప్రతియొక్క వ్యక్తికి కాపరిగా ఉంటూ,వారిని క్రమశిక్షణలో నడిపించాలి. ప్రతియొక్క రాజకీయ నాయకుడు కాపరియే. వారుకూడా ప్రజలను ఏ తారతమ్యం లేకుండా వారికి కావలిసిన సదుపాయాలు అందచేస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, వారికి ఎప్పుడూ చేరువలోనే ఉండాలి. కానీ,వారి అవసరాలకోసం ప్రజలను వాడుకొని, అవసరం తీరాక వారిని పట్టించుకోకుండా,డబ్బుని, హోదాని, పోగుచేసుకొని, ప్రజలను కష్టాలలో విడిచి పెట్టకూడదు.అదేవిధంగా, ప్రతియొక్క వ్యక్తి,ఇతరులకు కాపరిగా మారాలి.అప్పుడే మనలో,మరియు సంఘములో,ఈ లోకంలో మార్పు వస్తుంది.దీని కోసం మనం తపన పడాలి.

మరి  ఈనాడు నువ్వు నేను మన స్వార్ధం కోసం చూడకుండా, ఇంతరులకు సహాయం చేస్తూ, ఒక మంచి కాపరి వలె మన జీవితాన్ని ఇతరుల శ్రేయస్సు కోసం మరణానికయినా  వెనకాడకుండా జీవించడానికి  ఈ దివ్య బాలి పూజలో ఆ దేవాతి దేవునికి  మనసారా ప్రార్దిదాం.

ఆమెన్.

Br. Joseph mario sunil nandigama

18, ఏప్రిల్ 2021, ఆదివారం

పాస్కాకాల మూడవ ఆదివారము

 పాస్కాకాల మూడవ ఆదివారము

అ.కా. 3: 13-15, 17-19

1 యోహాను 2: 1-5

లూకా 24: 35-48 

మీకు శాంతి కలుగును గాక

క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, ఈనాటి మూడు పఠనములు హృదయపరివర్తన, పాపక్షమాపణ కలిగి పునరుత్తాన క్రీస్తు అనుగ్రహించే శాంతిని  స్వీకరించి, ఈ లోకములో మన జీవిత విధానము ద్వారా శాంతిని స్థాపించి దేవునికి సాక్షులుగా నిలువ ఆహ్వానిస్తున్నాయి. వీటిని మనము మూడు వంశముల రూపేణా ధ్యానిస్తూ అర్ధము చేసుకుందాము.

 1. హృదయపరివర్తన, పాపక్షమాపణ

2. అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చుకొనుట

3. పునరుత్తానుడైన క్రీస్తు ఒసగు శాంతిని స్థాపించుట

 1. హృదయపరివర్తన, పాపక్షమాపణ:

ఈనాటి పఠనాలలో హృదయపరివర్తన, పాపక్షమాపణను ప్రస్తావించుట చూస్తున్నాము. యేసుప్రభువు తన ప్రసంగాన్ని ప్రారంభించింది హృదయపరివర్తన అను అంశము మీదనే (మత్త 4:17) మరియు తన చివరి ప్రసంగము ముగించినది కూడా హృదయపరివర్తన అను అంశము మీదనే (లూకా 24:47). ప్రభువు ఈ లోకానికి రావడానికి కూడా కారణము హృదయపరివర్తనను కలిగించుటకేనని లూకా 5:32 మనము చూస్తున్నాము. పునీత బాప్తిస్మ యోహాను గారు కూడా హృదయ పరివర్తన యొక్క అవసరతను గురించి పలికారు(మత్త 3:2). పునీత పేతురు గారు యూదులకు చెప్పిన తన మొదటి ప్రసంగము, అన్యులతో పలికిన తన చివరి ప్రసంగము కూడా, ఆఖరికి తన చివరి ప్రసంగము కూడా హృదయపరివర్తన అను అంశము మీదనే. పునీత పౌలు గారు కూడా హృదయపరివర్తన అను అంశము మీద ప్రసంగించారు. ఎందుకు హృదయపరివర్తన ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అంటే దేవుని దగ్గరకు తిరిగి రావాలనే ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన మొట్టమొదటి పని: హృదయపరివర్తన (లూకా 15: 11-24). అసలు ఈ హృదయపరివర్తన అంటే ఏమిటి? హృదయపరివర్తన అంటే ఒక ప్రయాణము. ఎక్కడి నుండి ఎక్కడకు ఈ ప్రయాణము అంటే పాపపు జీవితము నుండి దేవుని యొద్దకు ప్రయాణము. క్రీస్తు పునరుత్తాన మహోత్సవము ముగిసిన తరువాత కూడా తల్లి తిరుసభ ఎందుకు ఈ పఠనాల ద్వారా మనలను హృదయపరివర్తన, పాపక్షమాపణ గురించి ధ్యానింపజేస్తుంది అంటే హృదయపరివర్తన కలిగి మన పాప జీవితానికి క్రీస్తుతో పాటు మరణించి మరల క్రీస్తుతో పాటు పునరుత్తానమైనప్పుడు మాత్రమే మనము ఒక నూతన వ్యక్తిగా జన్మింపగలుగుతాము, పునరుత్తానుడైన క్రీస్తు శక్తిని అనుభవింపగలుగుతాము.

2 . అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చుకొనుట:

శిష్యులందరు అవిశ్వాసముతో నిండియున్నారు. క్రీస్తు ప్రభువు మనుష్యకుమారుడు శ్రమలననుభవించి, మరణించి మూడవనాడు పునరుత్తానమవుతాడు అని పలు మార్లు వారితో చెప్పినను వారు దానిని గ్రహించలేకపోయారు. అందుకే  క్రీస్తు ప్రభువు పునరుత్తానాన్ని గ్రహించలేకపోయారు. చివరికి స్వయానా పునరుత్తానుడైన క్రీస్తే వారి ముందు నిలువబడినను గుర్తించలేకపోయారు. ఇదే సంఘటనను ఈనాడు మనము సువిశేష పఠనములో చూస్తున్నాము. తన శిష్యులకు ప్రభువు దర్శనమిస్తున్నారు. ఇది పునరుత్తాన క్రీస్తు మూడవ దర్శనము.

ఈ మూడవ దర్శనములో శిష్యులు భయభ్రాంతులై పునరుత్తాన క్రీస్తును ఒక భూతమును చూచుచున్నట్లు భావించారు (లూకా 24:37). అవిశ్వాసముతో నిండిన వారి హృదయాలు కలవరపడుచున్నవి. వారి మనస్సులు సందేహముతో నిండియున్నవి (లూకా 24:38). అప్పుడు క్రీస్తు తన చేతులను కాళ్ళను చూపుతూ వారిలో అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని నింపారు. వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై పునరుత్తాన క్రీస్తును విశ్వసించిరి (లూకా 24: 39-41). అవిశ్వాసము అనే మహమ్మారి మనలను కూడా పరిపాలిస్తూ దేవుని నుండి దూరంగా తీసుకువెళ్తుంది. విశ్వాసము క్రైస్తవ జీవితానికి పునాది. ఈరోజు మనము విశ్వాసముతో నింపబడివుండాలి. విశ్వాసము అనేది వినుట వలన కలుగుతుంది. క్రీస్తును గూర్చిన వాక్కు వినుట వలన కలుగుతుంది (రోమా 10:17). దేవుని వాక్కు విందాం, క్రీస్తును గూర్చిన సత్యాన్ని తెలుసుకుందాము. అవిశ్వాసులు కాకుండా విశ్వాసులుగా ఉంటూ మన జీవితాల్లో పునరుత్తానాన్ని విశ్వసించుదాం. పునరుత్తాన క్రీస్తును గుర్తించుదాం. 

3 పునరుత్తానుడైన క్రీస్తు ఒసగు శాంతిని స్థాపించుట:

క్రీస్తు ప్రభువు తన శిష్యులకు దర్శనమిస్తూ మీకు శాంతి కలుగునుగాక అనెను.(లూకా 24:36) ఎందుకు శాంతి? వారు అనుసరించిన గురువు మరణించాడు. కావున వారి జీవితాలలో వారు ఆశను కోల్పోయారు. వారి జీవితాలు ఒక గమ్యము లేని, లక్ష్యము లేని జీవితాలుగా మారిపోయాయి. వారి జీవితాలలో శాంతి అనేది ఒక పదముగానే మిగిలిపోతుంది, ఒక అనుభవము కాలేదనుకున్నారు. క్రీస్తు అనే ఒక గురువు కోసము అన్నిటిని విడిచిపెట్టాము కానీ, క్రీస్తు, తన మరణము తర్వాత మమ్ములను విడిపెట్టాడు అని వాపోయారు. కానీ క్రీస్తు మాత్రము మనలను అనాధలుగా విడిచిపెట్టేటటువంటి ఒక వ్యక్తి కాదు. మన నమ్మకాలను వమ్ము చేసేటటువంటి ఒక గురువు కాదు. మన ఆశలను నిరాశపరిచేటటువంటి దేవుడు కాదు. కానీ తన వాగ్దానాలను నిలబెట్టుకున్నటువంటి సత్యస్వరూపుడు. తాను చెప్పిన విధముగా మరణాన్ని గెలిచి మూడవనాడు పునరుత్తానమై తాను క్రీస్తునని నిరూపించుకున్నారు. చిన్నాభిన్నమైన తన శిష్యులకు కనిపించి మీకు శాంతి కలుగునుగాక అంటూ ఆశను నింపుతూ అభయమిస్తున్నారు. ఈ శాంతి మనము ఒకనాడు అవిధేయతతో పోగొట్టుకున్న శాంతి(ఆది 3) కానీ క్రీస్తు ప్రభువు తన మరణ, పునరుత్తానముల ద్వారా ఈ శాంతిని నెలకొల్పారు. ఇదే శాంతిని తన శిష్యులకు ఒసగుతున్నారు. ఈరోజు నీవు నేను ఈ శాంతిని మన జీవిత విధానము ద్వారా స్థాపించాలి. మనము ధ్యానించిన విధముగా పునరుత్తానమునకు రెండు మార్గములు ఉన్నవి. (i)హృదయపరివర్తన, (ii)పాపక్షమాపణ. కాబట్టి హృదయపరివర్తన చెందుదాము. పాప ప్రక్షాళన గావించబడుదాం. మన అవిశ్వాసాన్ని విశ్వాసముగా మలచుకుందాము. అనేక కారణాలతో చిన్నాభిన్నమైన మన జీవితాలలో శాంతి ఒసగమని పునరుత్తాన క్రీస్తును ప్రార్ధిద్దాము. పునరుత్తాన క్రీస్తు ఒసగే శాంతిని స్వీకరించుదాము. ఆ శాంతిని స్థాపిద్దాము.  ఆమెన్

Br. sunil inturi

10, ఏప్రిల్ 2021, శనివారం

పాస్కాకాల రెండవ ఆదివారము

 పాస్కాకాల రెండవ ఆదివారము

(1) అపో. కా 4: 32-35, (2) 1 యోహాను 5: 1-6,  యోహాను 20: 19-31

క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా ఈనాడు మనము పాస్కాకాల రెండవ ఆదివారములోనికి ప్రవేశించియున్నాము. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనముల ద్వారా తల్లి శ్రీసభ మనకు ఉత్తాన క్రీస్తు యొక్క ప్రతక్ష్యరూపము గురించి తెలియజేస్తుంది. చనిపోయిన వారిలో నుండి ఉత్తానము అయిన యేసు, తన శిష్యులకు కనిపించారు. యేసు చనిపోయిన నాటి నుండి 40 రోజుల పాటు తాను స్వయముగా వారికి కనిపించారు. తాను సజీవుడనని వారికి చాలా విధములుగా తెలియజేసారు. యేసు శిష్యులకు కనిపించినది తాను ఎప్పుడూ జీవిస్తున్నాడని శిష్యులకు నిరూపించడానికే మాత్రమే కాదు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడని, అనాధలుగా మనలను విడిచిపెట్టడని తెలియజేయుటకును, శక్తిని ఇచ్చుటకు కూడాను. ఆ రోజులలో దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు అనే విశ్వాసము ఉండేదని యెషయా ప్రవక్త గ్రంథములో ఇమ్మానుయేలు (యెషయా 7:14) అను వాక్యంలో చూస్తున్నాము. మనుష్య జాతితో చేసిన వాగ్దానము ద్వారా దేవుడు తన ప్రజలతో యుగాంతము వరకు వశించునని వారి నమ్మిక. ఆ నమ్మకము యేసు ప్రభువు ఉత్తానములో పూర్తవుతుంది. ప్రభువు ఇప్పుడు తన ప్రజలతో జీవిస్తున్నాడు. దర్శన గ్రంథములో మనము చూస్తున్నాము; సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతో నివసించును. వారే ఆయనకు ఆలయము. వారే అయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును (దర్శన 21:3).

ఈ నాటి సువిశేషములో మనము గమనించినట్లయితే పునరుత్తానము తర్వాత తండ్రి మహిమలో చేరిన క్రీస్తు తన శిష్యులను మర్చిపోలేదు. ఆ రోజు ఆదివారము తన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు(యోహాను). క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా వాగ్దానము నెరవేర్చే దేవుడు తన శిష్యుల వద్దకు వచ్చారు. అయన ఎప్పుడు వారిని వదిలిపెట్టలేదు అని ఈ దర్శనాలు సాక్ష్యమిస్తున్నాయి. యేసు ప్రభువు యొక్క దర్శనాల ప్రత్యేకత ఏమిటంటే వాటిన్నంటిలో ఆయనే ముందుటారు. శిష్యుల యొక్క లోతైన విశ్వాస ఫలముగాని, వారి దృఢ నమ్మకము గాని, నిరీక్షణాల ద్వారా గాని కాదు క్రీస్తు ప్రభువు ముందుకు వచ్చేది. ఆయన తనకు తానుగా వారి యొద్దకు వస్తున్నారు.

 

ఆయన బలపరిచితే తప్ప మనకు ఏమి అర్ధం కాదు. ఆయన క్షమియించిన మాగ్దలా మరియమ్మ మరియు ఎమ్మావు గ్రామమునకు ప్రయాణము చేసిన ఇద్దరు శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఆయన వారితో చెప్పినప్పుడే ఆయనను గుర్తించగలిగారు. శిష్యుల ఎన్నిక సమయములో ప్రభువు పలుకుతున్నారు మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను(యోహాను 15:16). ఈరోజు కూడా ఆయన మన మధ్యకు వస్తున్నారు. తన దర్శనాల ద్వారా తన స్నేహ సంబంధమును మరల మనయందు కలిగిస్తున్నారు. ఆయన దర్శనాలకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అది ఎవరు ముందుగా ఊహింపశక్యము కానిది. ఆయన ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో ఎవరు ఊహించలేదు. ఆయన రాకడ గురించి తెలుసుకుంటే ఒక విషయము అర్థమగుచున్నది. తన శిష్యుల అవసరతలలో పరుగెత్తుకు వచ్చారు క్రీస్తు ప్రభువు. కన్నీరు కార్చిన మాగ్దలా మరియమ్మను ఓదార్చుటకు వచ్చారు. ఎమ్మావు మార్గములో శిష్యుల హృదయాలను ప్రజ్వలింపచేయుటకు వచ్చారు. రాత్రంతయు శ్రమపడి చిన్న చేప కూడా దొరకని శిష్యులకు సమృద్ధిగా ఇచ్చుటకు ఆయన వారి యొద్దకు వచ్చారు. అందుకే ఉత్తాన ప్రభువు దర్శనాలు మనకు ఇచ్చే సందేశమేమిటంటే, మన అవసరతలలో కూడా ఆయన మన సమీపముననే ఉంటారు.

పునరుత్తానము అయిన ప్రభువు అందరికి దర్శనము ఇవ్వలేదు. ఈ భాగ్యము తన స్నేహితులకు, శిష్యులకు మాత్రమే దొరికింది. క్రీస్తు నాధుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పేతురు గారు ఈ విషయాన్ని చాల స్పష్టముగా వివరిస్తున్నారు, అయినను దేవుడు ఆయనను మృతులలోనుండి లేపి మూడవ నాడు మరల మాకు కనబడునట్లు చేసెను, దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కానీ ఆయన ఇతరులకు కనిపింపలేదు(అపో కా 10: 40-41) పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఉత్తానమైన ప్రభువు మొదట సారిగా దర్శనమిచ్చింది తనను ఎక్కువగా ప్రేమించినవారికి, వెదకినవారికి మాత్రమే. ప్రభువు యొక్క దర్శన భాగ్యము పొందాలంటే సహృదయ సంభందం కలిగిఉండాలని ప్రభువును నేర్పిస్తున్నారు. తనను వెదికే వారికి ఈరోజుకు కూడా ప్రభువు తన దర్శనాలను ఇస్తున్నారని మనము వింటున్నాము. ఆయన యొక్క దర్శనాలు, ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉంటాడని స్ఫూరింపచేస్తున్నాయి. ఉత్తాన ప్రభువు మనతో ఉన్నారని మనము గుర్తించలేకపోతున్నాము. ఈనాటి సువిశేషములో మనము గమనించినట్లయితే యూదుల వలన భయము నిమిత్తము గదిలో చేరి తలుపులు వేసుకున్న శిష్యులకు దర్శనమిచ్చినట్లు మనము చూస్తున్నాము. అయితే ఆ శిష్యులు మనలో కొందరి వలె బయటి నుండి అద్భుతముగా దేవుడు లోపలికి వచ్చాడని ఆలోచించారు. కానీ అది కాదు అక్కడ జరిగినది. వారితో పాటు ఆ గదిలో ఉన్నారు క్రీస్తు ప్రభువు. ఆ తర్వాత కూడా ఆయన వారితోనే ఉన్నారు. ఆయన తనకు తానుగ బయలుపరచకముందు కూడా ఆయన వారితో ఉన్నారని వారికి తెలియజేయుటకు ఆయన 40 రోజులు వారి ఎదుటకు వచ్చి ప్రత్యక్షమవడము, నిష్క్రమించడము జరిగింది. ఈ 40 రోజుల అనుభవాలను బట్టి ఆయన ఎల్లపుడు మనతోనే ఉంటున్నాడని మనకు బోధపడుతుంది.

 

క్రీస్తు ప్రభువు ఉత్తానమైనప్పుడు శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఎందుచేతనంటే, బహుశా వారి వారి నిరాశ నిస్పృహలకు మరియు భయాందోళనలకు బందీలై క్రీస్తు ఉత్తాన పరామరహస్యమును, సత్యమును మర్చిపోయారు. ఆ స్థితిలో ఉన్న శిష్యులకు ప్రభువు శాంతి సందేశాన్ని ఇస్తున్నారు. ఉత్తాన క్రీస్తు ఒసగుచున్న శాంతి సమాధానాలు ఈ లోకము ఇచ్చే శాంతి సమాధానాలు కావు. ఆయన మనలో ఉండి మనకు ఒసగేవి ఆంతరంగిక శాంతి సమాధానాలు. క్రీస్తు ప్రభవు తన శిష్యులకు ప్రత్యక్షపరచుకున్న సమయములో వారి ఆలోచనలను తప్పు పట్టలేదు. తనను ఎరుగనని బొంకిన పేతురును, విశ్వసించని తోమాసును విడిచిపెట్టలేదు. కానీ వారికి తన ప్రేమను తెలియజేస్తున్నారు. వారు అయన ప్రియమైన శిష్యులు, స్నేహితులని వారికి ప్రత్యేక భాద్యత ఉందని తెలియజేస్తున్నారు. మనము కూడా ఆ శిష్యుల వలె భయానికి బందీలమై మన యొక్క కర్తవ్యాన్ని మరిచి పోయే అవకాశము ఉంది. భయాందోళనల సమయములో మనము వాటినే తలచుకుంటుంటాము. వాటిలోనే లీనమై మన గమ్యాన్ని మరచిపోతాము. అంతేకాక అశాంతికి, నిరాశ నిస్పృహలకు గురి అవుతాము. కాబట్టి, ఈ సమయములో ఉత్తానుడైన క్రీస్తు ప్రభువు మనకు ఇచ్చే సందేశము మీకు శాంతి కలుగునుగాక. ఇది విరిగిన మనసులకు ఒసగే కానుక. వీటితో పాటు ప్రభువు మనకు నేను మీతో ఎల్లప్పుడూ ఉంటానని మాట ఇస్తున్నారు. ఆ ప్రభువు ఒసగే శాంతి సమాధానాలను స్వీకరించి ఆ ప్రభువుతో కలసి మన జీవితాప్రయాణాన్ని కొనసాగిద్దాము.

ఆమెన్.

Bro. Manoj OCD


3, ఏప్రిల్ 2021, శనివారం

యేసు పునరుత్తాన మహోత్సవము

 నేడు యేసువు పునరుత్తానుడైనాడు  

క్రీస్తు నాధునియందు ప్రియ దేవుని సోదరులారా ఈనాడు మనము యేసు క్రీస్తుని యొక్క పునరుత్తాన పండుగను కొనియాడుచున్నాము. సిలువ శ్రమలను అనుభవించి, సిలువ మీద మరణించి, సమాధి చేయబడి ఈనాడు సజీవుడై లేచాడు.  నేనె జీవమును అని పలికిన ప్రభువు, మరణాన్ని సైతం జయించి జీవముతో లేచాడు. క్రైస్తవుల యొక్క విశ్వాసం అంత ప్రభుని యొక్క పునరుత్తానం మీదనే ఆధారపడి ఉంది. ప్రభుని పునరుత్తానం క్రైస్తవుల జీవితంలో ఒక ముఖ్యమైన మూలరాయి. పునరుత్తానం లేనిదే క్రైస్తవత్వం లేదు, పునరుత్తానమును నమ్మని వాడు క్రైస్తవుడే కాడు. అందుకే పునీత పౌలు గారు అంటున్నారు ; క్రీస్తు ప్రభువు సజీవులు కాకపోయి ఉంటె నేను బోధించే బోధన అంత వ్యర్థమే.  ప్రభువు మరణించారు అనేది ఎంత సత్యమో మూడవనాడు సజీవులుగా లేచారు అనేది కూడా అంతే సత్యము. క్రైస్తవులకు, క్రైస్తవత్వానికి, క్రైస్తవ విశ్వాసానికి మూలం ఈ పునరుత్తానం. ప్రభువు పునరుత్తానం కాకపోయి ఉంటె ఈనాడు క్రైస్తవత్వం ఉండేదికాదు.

 ఈనాడు క్రైస్తవ మతం మరియు మనము ఇలా ఉన్నాము అంటే మూలం పునరుత్తానమే, పునరుత్తాన విశ్వాసమే. ఇంకా ఎంతో మంది ప్రభువు పునరుత్తానములో సందిగ్ధంగా ఉన్నారు ఎన్నో ప్రశ్నలు, సందేహాలతో, అవిశ్వాసముతో ఉన్నారు. మనము చరిత్రను పరిశిలించినట్లైతే మొదటిగా సమాధి ఎదుట ఏర్పరిచిన పెద్దరాయి అనగా సమాధిని మూయుటకు ఉపయోగించిన పెద్దరాయి పెద్ద గొలుసులతో కట్టబడి ఉంది. సమాధిని కాపలా కాయుటకు సైనికులు ఉన్నారు. కానీ ప్రభుని శరీరము దొంగలించబడినది అని సైనికులు మరియు యూదా పెద్దలు అంటున్నారు. రోమా సైనికుల ఆచార ప్రకారం సైనికులు విధులలో ఉన్నపుడు మెలకువతో, జాగ్రత్తతో కాపలా కాయవలయును. ఏ చిన్న తప్పు జరిగిన విధులలో ఉన్న సైనికుడు దానికి సమాధానం చెప్పాలి. కాపలా కాయుచున్నపుడు కునుకు తీసిన, విధిలో ఉండక పోయిన, ఆజాగ్రత్తతో ఉన్న వారికీ శిక్ష విధిస్తారు. ఆ శిక్ష మరణ దండన. గొలుసు తీసినప్పుడు, రాయి తొలిగించినపుడు శబ్దానికి ఎంత నిదురలో ఉన్న మెళుకువలోకి వస్తారు. మాగ్దలా మరియమ్మ తెల్లవారు జామున సమాధి యొద్దకు వెళ్ళినపుడు అక్కడ ఎవ్వరు కనిపించలేదు సైనికులతో సహా. సైనికులు నిదురలో ఉండగా ప్రభువు భౌతిక దేహాన్ని శిష్యులు వచ్చి తీసికొని వెళ్లారు అని కాపలా ఉన్న సైనికులు సాక్ష్యం ఇచ్చారు. సైనికులు నిదురలో ఉండగా ప్రభువు భౌతికదేహాన్ని తీసుకొని వెళ్ళినది శిష్యులేనని సైనికులకు ఎలా తెలుసు, బండరాయిని తొలిగించినపుడు గొలుసులను తీసినప్పుడు మేలుకొని సైనికులు ప్రభువు భౌతికదేహమును శిష్యులు తీసుకొని వెళ్లారని ఎలా తెలుసు. ఆయన ఇక్కడ లేదు తాను చెప్పినట్లుగానే పునరుతానుడైనాడు అని దేవదూత సాక్ష్యం ఇస్తున్నారు.మరీ ముఖ్యముగా ఆయన పలుమారులు శిష్యులకు దర్శనమిస్తున్నారు. ఇవన్నీ చూసి, విని కూడా మనము ఇంకా వెలిగించి కుంచం క్రింద ఉంచిన దీపము వలె ఉన్నాము. ఇంటనున్న వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీప స్తంభము పైనే ఉంచెదము గాని గంప క్రింద ఉంచారు గదా! 

పునీత పౌలు గారు అన్నవిధముగా ఉష్ణ కాలమున వేగుచుక్క మీ హృదయములను నింపువరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. పాపము అనే అంధకారమున ఉన్న మనము ఉష్ణకాల వేగుచుక్క హృదయములను వెలుతురుతో నింపునట్లు మనము ప్రభువు యొక్క పునరుత్తాన వెలుతురుతో నింపబడి గంప క్రింద ఉంచిన దీపము వలే కాక దీప స్తంభము పైన ఉంచిన దీపము వలె అందరికి వెలుగునిద్దాం. పౌలు గారి వలె అందరికి ప్రభువు వెలుగును పంచుదాం ఆయన పునరుత్తానములో పాలుపంచుకుందాం. ఈ పునరుత్తానము మనలను పాపములను నుంచే కాక అన్నింటినుంచి కూడా విముక్తులను, స్వతంత్రులను చేస్తుంది. ఈ పునరుత్తానము ద్వారా ప్రభువు మనకు నూతన జీవితాన్ని ఇస్తున్నారు. పొందిన జీవితము ద్వారా ప్రభుని పునరుత్తాన వెలుగులో జీవించుటకు ప్రయత్నిద్దాం.

Br. Lukas

The Feast of Epiphany

The Feast of Epiphany  క్రీస్తు సాక్షాత్కార పండుగ యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12 ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడ...