22, జూన్ 2024, శనివారం

12వ సామాన్య ఆదివారం

12వ సామాన్య ఆదివారం 
యోబు 38:1, 8-11, 2 కొరింతి 5:14-17,  మార్కు 4:35-41
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల జీవితంను ఏ విధముగా ప్రశాంత పరుస్తారు అనే అంశమును తెలుపుచున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు ఉంటూనే ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ విధముగా తన ప్రజలకు తోడుగా ఉండి వారిని బలపరుస్తారు అనే అంశము ఈనాటి పఠణాలలో క్షుణ్ణంగా అర్థమవుచున్నది.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు యోబుకు ఇచ్చిన సమాధానము గురించి తెలపబడినది. యోబు జీవితము మొదటిలో బాగానే ఉన్నది. ఆయన పిల్లాపాపలతో, సిరిసంపదలతో, మంచి పేరుతో సంతోషంగా జీవించాడు కానీ సైతాను తన యొక్క జీవితమును శోధించినప్పుడు యోబు అన్నీ కోల్పోయాడు. ఆయన సంపదలు పోయాయి, తన యొక్క ఇష్టమైన కుటుంబము  దూరమైపోయింది, స్నేహితులు దూరమయ్యారు, తనకు అనారోగ్యం సోకింది ఈ విధముగా అన్ని కోల్పోయిన సందర్భంలో తన జీవితంలో ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకున్నాడు "నా యొక్క దీనస్థితికి కారణం ఏమిటి అన్నది" యోబు దేవుడిని తన యొక్క పరిస్థితికి కారణం ఏమిటి అని పదేపదే అడగగా దేవుడు అతనికి సమాధానమిచ్చారు. యోబుతో యావే దేవుడు సమాధానమిచ్చే సందర్భంలో తన స్థితికి కారణం ఏమిటి అని చెప్పలేదు కానీ దేవుడు ఆయనయే సమస్తమును సృష్టించిన సృష్టికర్త అని, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది అని తెలిపారు. దేవునికి ప్రతి ఒక్కరి గురించి ఒక ప్రణాళిక ఉన్నది కాబట్టి యోబు యొక్క విశ్వాసము స్థిరమైనది అని ఈ లోకమునకు నిరూపించుట కొరకై ఆయన జీవితంలో కష్టాలను దేవుడు అనుమతించారు. అయినప్పటికీ ఆయన కష్టాలు ముగిసిన సందర్భంలో యోబును దేవుడు ఇంకా అధికముగా ఆశీర్వదించి తనను ప్రశాంత పరిచారు. (యోబు 42:10). వాస్తవానికి యోబు యొక్క గ్రంథం బహుశా యూదులు  బానిసత్వంలో ఉండినప్పుడు వ్రాసి ఉండవచ్చు. ఈ గ్రంథంలో మరీ ముఖ్యంగా రచయిత మానవుని యొక్క బాధలకు కారణం ఏమిటి అనేటటువంటి అంశము తెలపాలనుకున్నారు కానీ దానికి తగిన సమాధానము ఇవ్వలేదు. యోబు గ్రంథం తెలిపే ఇంకొక అంశము ఏమిటి అంటే ఈ లోకంలో మంచివారు కష్టాలు అనుభవించవచ్చు, దుర్మార్గులు సంతోషిస్తూ జీవించ ఉండవచ్చు కానీ చివరికి దేవుడు కష్టాలు అనుభవించే మంచి వారిని ఆశీర్వదిస్తారు దుర్మార్గులను శిక్షిస్తారు. యోబు యొక్క జీవితంలో మనము గ్రహించవలసిన అంశము ఏమిటి అంటే మన అందరి జీవితాలలో కష్టాలు, బాధలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అలాంటి సందర్భంలో దేవుని శక్తి మీదే ఆధారపడుతూ విశ్వాసము కోల్పోకుండా ఆయనను నమ్ముకొని ముందుకు సాగాలి. యోబు వలె విశ్వాసములో పటిష్టంగా ఉండాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వారు నూతన సృష్టి అని తెలిపారు. క్రీస్తు నందు ఉన్నవారు పాత జీవితమును ముగించి కొత్త జీవితమును ప్రారంభిస్తారు అనగా వారి కష్టాలు తొలగించబడి సంతోషకరమైన జీవితము జీవిస్తారు అని అర్థం. క్రీస్తు నందు జీవించటం చాలా కష్టం కానీ అలా జీవించిన వారికి దేవుడు సమస్తమును సమకూర్చును. పౌలు గారు క్రీస్తునందు జీవించుట కొరకు అనేక కష్టాలు అనుభవించారు కాబట్టి ఆయన నూతన సృష్టిగా చేయబడ్డారు కాబట్టి మనం కూడా క్రీస్తునందు జీవించటానికి ప్రయత్నం చేయాలి. 
ఈనాటి సువిషేశ పఠణంలో దేవుడు శిష్యుల యొక్క జీవితమును ప్రశాంత పరిచిన విధానము ధ్యానిస్తున్నాము. ఈ సువిశేషం ద్వారా మనం కొన్ని విషయాలు  ధ్యానించాలి. 
1. మన జీవితంలో (Sudden incidents )హఠాత్తుగా జరిగే అంశాలకు ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు. 
శిష్యులు తమ యొక్క ప్రయాణం ప్రారంభించినప్పుడు అంత ప్రశాంతంగానే సాగింది కానీ ఒక్కసారిగా అలలు ప్రారంభమై సముద్రంలో పడవ మునిగేలాగా పరిస్థితి ఏర్పడింది. మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో హార్ట్ ఎటాక్, యాక్సిడెంట్స్, పక్షవాతం అనేవి హఠాత్తుగా వస్తూ ఉంటాయి. అలాంటివారికి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు కాబట్టి మనము పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగాలి. 2020లో కరోనా వైరస్ సడన్గా అన్ని దేశాల్లో వ్యాపించి అనేకమంది జీవితాలను నాశనం చేసింది. శిష్యుల ప్రయాణం కూడా అప్పటివరకు బాగానే సాగింది కానీ ఒక్కసారిగా అంతా అతలాకుతలమైంది. 
2. మన కష్ట సమయాలలో దేవుడు మనతో ఉన్నారా అని మనకు అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్య ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఎందుకు కష్టాలు ఎదురవుతాయి అని చాలామంది భావిస్తూ ఉంటాం. శిష్యుల యొక్క జీవితంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నా వారి యొక్క పడవ మునగటం ప్రారంభించింది అంటే దేవుడు మనకు తోడుగానే ఉన్నప్పటికీ మన జీవితంలో ఆయన కష్టాలను అనుమతిస్తారు అది మరలా మనలను రక్షించుట కొరకే. మన విశ్వాసం బలపరచుట కొరకు.
3. మన యొక్క కష్ట సందర్భాలలో మనము విశ్వాసముతో దేవుని వైపు మరలాలి. శిష్యులు వారి యొక్క పడవ మునిగిపోవుచుండగా ఏసుప్రభు చెంతకు వెళ్లి వారి యొక్క మనవిని తెలిపారు. వాస్తవానికి సువిషేశంలో ఏసుప్రభు నిద్రిస్తున్నారు అని రాయబడి ఉన్నది వాళ్లందరూ భయంతో ఉంటే యేసు ప్రభువు మాత్రం హాయిగా నిద్రిస్తున్నారు అంటే శిష్యులు తన చెంతకు వస్తారా?, రారా?, అని ప్రభువు ఎదురు చూస్తున్నారు. మనం కష్టాలు ఎదుర్కొనేటప్పుడు దేవుని వైపు రావాలి అని మరచిపోకూడదు. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి దూరంగా ఉంటారు. దేవుడు మాకు ఏమీ చేయటం లేదులే ఇంక దేవాలయానికి ఎందుకు వెళ్లాలి అనే ఆలోచనతో జీవిస్తుంటారు.
4. దేవుడు మన కష్టాలను చూసి మనల్ని ఆదుకుంటారు. శిష్యుల యొక్క పరిస్థితి చూసిన ప్రభువు వారిని ఆదుకున్నారు. వారికి తోడుగా నిలబడ్డారు వారి జీవితంలో సంతోషాన్నిచ్చారు.
5. మన కష్టాలు కొలది కాలం మాత్రమే. శిష్యుల యొక్క బాధ, భయం కొద్ది కాలం మాత్రమే ఉన్నది అది శాశ్వతంగా లేదు. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు "Pain is never permanent' అని అంటారు అంటే ఏ బాధ కూడా శాశ్వతం కాదు అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది దాని తర్వాత సంతోషం ఉంటుంది. 
6. దేవుడు మన జీవితాలను ప్రశాంత పరుస్తారు. శిష్యులు ఎదుర్కొన్న భయాన్ని దేవుడు ప్రశాంత పరిచారు ఆయన సమస్తమును సృష్టించినటువంటి ప్రభువు కాబట్టి సమస్తము ఆయన అధీనంలో ఉన్నది కావున ఆయన అలలను ప్రశాంత పరిచారు అదే విధముగా శిష్యుల యొక్క భయాన్ని భాదని తొలగించి సంతోషాన్నిచ్చారు. 
దేవుడు మనతో ఉన్నట్లయితే మనకు కష్టాలు ఉన్న బాధలు ఉన్న అన్నిటిని కూడా మనం ఎదుర్కొని ముందుకు సాగగలం కాబట్టి దేవుని చెంతకు వస్తూ ఆయన మీద ఆధారపడుతూ మనము జీవించాలి ఆయనే మన జీవితాలను ప్రశాంతపరచి మన కష్టాలను తొలగించి మనలో సంతోషాన్ని నింపుతారు. 
Fr. Bala Yesu OCD

15, జూన్ 2024, శనివారం

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం 
యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బోధిస్తున్నాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్నటువంటి సమయములో వారి జీవితంలో ఒక నమ్మకమును కలుగ చేస్తున్నారు. దేవుడు ఎత్తైన దేవదారు మీద ఒక కొమ్మను విరిచి దానిని పర్వతం మీద నాటుతారు అని అన్నారు. ఆ యొక్క చెట్టు పెద్దదిగా ఎదిగి గొప్ప దేవదారు వృక్షం అగును అని తెలుపుచున్నారు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితమును ఉద్దేశించి ప్రభువు పలికినటువంటి మాటలు.
ఇశ్రాయేలు ప్రజలు తాము చేసినటువంటి పాపమునకు ఫలితముగా బానిసత్వ జీవితమును జీవింపవలసి వచ్చినది. అన్యదైవములను పూజించినందుకు వారు దేవుని చేత శిక్షింపబడ్డారు. వారి యొక్క బాధలో ఉన్న సమయంలో దేవుడు వారిని మరలా స్వీకరించటానికి సిద్ధపడ్డారు అందుకుగాను ప్రభువు పలుకుచున్నారు నేనే స్వయముగా కొమ్మను నాటుదను అది ఎదుగును అని తెలుపుచున్నారు అనగా యావే ప్రభువు త్వరలో ఇశ్రాయేలు ప్రజలను తమ దేశానికి తీసుకుని వచ్చి మరల వారికి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదిస్తారని ఒక అర్థం ఇంకొక అర్థం ఏమిటంటే రాబోయే కాలంలో ఇజ్రాయేలు ప్రజల నుండి మెస్సయ్య జన్మించి ఆయన సువార్త పరిచర్య ద్వారా అనేకమంది దేవుని యొక్క బిడ్డలగా మార్చబడతారు మరియు దేవుని యొక్క రాజ్యము విస్తరిల్లుతున్నది అని అర్థం. 
మొదటి పఠణము ద్వారా గ్రహించవలసిన అంశములు ఏమిటి అంటే;
1. దేవుడు మనతో ఉంటే మనం అభివృద్ధి చెందుతుంటాము, దీవించబడతాం. ప్రభువు ఏ విధముగానయితే ఇశ్రాయేలు ప్రజలకు భద్రతను కల్పిస్తూ, తోడుగా ఉంటూ వారు అభివృద్ధి చెందే విధంగా ప్రజలును దీవించారు. అలాగే దేవుడు మనతో ఉంటే మనం కూడా దీవించబడతాం.
2. ప్రభువు ఎత్తైన చెట్లను నరుకుతాను అని తెలుపుచున్నారు దీనిని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నట్లయితే ఎవరైతే గర్వంతో ఉంటారో వారిని దేవుడు తమ యొక్క పదవుల నుండి తొలగిస్తారు. అందుకే మరియ తల్లి తన స్తోత్ర గీతములో దేవుడు ఎలాగ గర్వాత్ములను అధికారం నుండి పడగొడతారు తెలుపుతూ దీనులను ఏ విధంగా దీవిస్తారో తెలిపారు. (లూకా 1:51,52)
3. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని తెలుపుతున్నారు ఎందుకనగా పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడునట్లు చేసేది దేవుడు మాత్రమే అనగా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి జీవితాలలో నమ్మకమును దయచేసి దేవుడే అలాగే గర్వముతో , భయము, భక్తి లేకుండా జీవించే వారి యొక్క జీవితాలు సంతోషము లేని జీవితాలుగా మారతాయి. దేవుడు తన ప్రజల జీవితంలో ఏదైనా చేయవచ్చు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
ఈనాటి సువిశేష భాగములో కూడా ఏసుప్రభు పరలోక రాజ్య వ్యాప్తి గురించి రెండు ఉపమానముల ద్వారా తెలియచేయుచున్నారు. ఈ రెండు ఉపమానములలో ఎదుగుదల అనేది గొప్పదిగా ఉంటుంది. ప్రారంభం చిన్నదిగా ఉన్న ముగింపు మాత్రం పెద్దదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదగాలి అది విశ్వాసములో అవ్వొచ్చు, చదువులోనైనా అవ్వొచ్చు, ప్రార్థనలో నైనా అవ్వొచ్చు, సంపదల్లోనైనా అవ్వొచ్చు.  ప్రభువు విత్తు వాడిని ఉదాహరణగా తీసుకొని ఆ విత్తనములు వెదజల్లినప్పుడు ఏ విధంగానైతే ఎవరికీ తెలియకుండా మొలకలు వస్తాయో అదే విధముగా ప్రభువు యొక్క రాజ్యము కూడా ఎవరు ఊహించని విధంగా విస్తరిల్లుతుంది అని తెలిపారు.
రెండవ ఉపమానము ఏసుప్రభు ఆవగింజను ఉదాహరణగా తీసుకొని పరలోక రాజ్యం గురించి తెలుపుచున్నారు. ఆవ గింజ చూడటానికి చిన్నదైనప్పటికీ దాని యొక్క ఎదుగుదల ప్రభావము చాలా గొప్పది. ప్రభువు ఎందుకు ఆవగింజనే ఉదాహరణగా తీసుకున్నారు అని ధ్యానించినట్లయితే ఆవగింజ చిన్నది కానీ ఫలితం పెద్దది అలాగే మన జీవితంలో కూడా వినయముతో ప్రారంభించిన ఏ పని అయినా సరే అది విజయవంతమగుతున్నది  ఎందుకంటే ఆయన దీనులను ఆశీర్వదిస్తారు కాబట్టి.
ఆనాడు దేవుడు ఆదాము అవ్వతో ప్రారంభించిన సృష్టి ఏ విధంగానైతే గొప్పగా విస్తరిల్లినదో అలాగే ఏసుప్రభు 12 మంది శిష్యుల ద్వారా ప్రారంభించిన తన యొక్క పరిచర్య ఈనాడు దేవుని రాజ్యం ఎంతగానో విస్తరిల్లినదో మనం చూస్తున్నాం దీనికి కారణం దేవుడు. శ్రీ సభ దినదినాభివృద్ధి చెందాలి అంటే దేవుని కృప సహకారం ఉండాలి. ఆయన కృప లేనిదే ఏది కూడా సాధ్యం కాదు. 
మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనము దినదినాభివృద్ధి చెందాలి దానికి గాను వినయముతో జీవించాలి.
Fr. Bala Yesu OCD

ఇరవై తోమ్మిదవ సామాన్య ఆదివారము

ఇరవై తోమ్మిదవ  సామాన్యకాలపు ఆదివారము  యెషయా 53:10-11 హెబ్రీయులకు 4:14-16 మార్కు 10:35-45 క్రీస్తునాధునియందు ప్రియ దేవుని బిడ్డలరా, ఈనాడు మనమ...