11 వ సామాన్య ఆదివారం
నిర్గమ 19:2-6
రోమి 5:6-11
మత్తయి 9:36-10:8
క్రీస్తు కారుణ్యం - శిష్యులను పిలుచుట - దైవ రాజ్య వ్యాప్తి
ఈనాడు తల్లి శ్రీ సభ 11వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి మూడు పఠనాలు దేవుని కారుణ్యం, ప్రేమ వ్యాప్తి అంశాలపై ప్రస్తావిస్తున్నాయి.
మొదటి పఠనం: దేవుడు మోషేతో ఇశ్రాయేలు నా నిబంధనలు శ్రద్ధగా పాటించినచో వారు నా వారగుదురు అని నుడువుచున్నారు.
భక్తి కీర్తన: మనము దేవుని ప్రజలము
రెండవ పఠనం: మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం మరణించి మనలను దేవునితో సఖ్యపరిచెను.
సువార్త పఠనం: క్రీస్తు ప్రభువు పన్నిద్దరిని దైవ రాజ్య వ్యాప్తికి పంపుట.
వీటిని మూడు అంశాల రూపేనా ధ్యానిస్తూ అర్థం చేసుకొని మన జీవితాలలో అవలంబింపటానికి ప్రయత్నిద్దాం.
1. క్రీస్తు కారుణ్యం:
గ్రీకు భాషలో కారుణ్యం అనే పదం ఎంతో లోతైన భావం కలిగిన పదం, దీనిని మనం మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో చూస్తున్నాము. ఏసు రద్దుచేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచును (మత్తయి 14: 14), యేసు కనికరించి వారి నేత్రములను తాకేను వెంటనే వారు దృష్టిని పొంది ప్రభువును వెంబడించిరి (20:34), ఏసు జాలిపడి చేయిచాచి వానిని తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుము అనెను (మార్కు 1:41), నాయిను లో వితంతువు కుమారుని చూచి యేసు కనికరించి ఏడవ వద్దమ్మా అని చెప్పి ఆ కుమారునికి జీవాన్ని ప్రసాదించెను (లూకా 7: 13,14). ఇవి యేసు జాలిపడిన, కనికరం చూపిన కొన్ని సన్నివేశాలు.
ఈనాటి సువార్త పఠనం లో కూడా నిస్సహాయులైన బాధలతో కాపరిలేని గొర్రెల వలె చెదిరియున్న జన సమూహమును చూచి జాలితో ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను (మత్తయి 9:36) ఈ సందర్భంలోనే ప్రభువు తన శిష్యులతో పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించడానికి కావలసిన కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను మత్తయి (9:37,38) పంట దానికై అది కోసుకోలేదు కానీ కొయ్యడానికి దానిని సంరక్షించడానికి ఎవరైనా కోతగాండ్రు కావాలి అదేవిధంగా గొర్రెలు చెదిరి ఉన్నప్పుడు వాటిని తిరిగి క్రమశిక్షణగా మందలోకి చేర్చడానికి కాపరి అవసరం. ఈనాటి ప్రస్తుత సమాజంలో కాపరులేని సంఘాలు ఎన్నో మరెన్నో. కాపరియున్నసరి అయిన కాపరి కాదు అందుకే ప్రభువు పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రులను పంపమని మనవి చెయ్యా మనందరిని ఆహ్వానిస్తున్నాడు దానిని మాత్రమే శిష్యులను పిలిచి అపోస్తులగా సువార్త వ్యాప్తి కోసం పంపుతున్నాడు.
2. శిష్యులను పిలుచుట:
దేవుడు ఎవరిని, ఎక్కడ, ఎలా, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, కొంతమందిని పౌలు గారిని పిలిచినట్లు, ఇంకా కొంతమందిని అగస్తీయును గారిని పిలిచినట్లు, మరి కొంతమందిని అస్సిపుర ఫ్రాన్సిస్ గారిని పిలిచినట్లు తన సేవకు పిలవచ్చు, పిలుపు దేవుని నుండి పిలవబడేది.
మార్కు సువార్త లో ప్రాతఃకాలమన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తుల అని పేరు పెట్టెను. (లూకా 6:13).
అని ఈనాటి సువిశేషంలో యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచాడని శిష్యుల పిలుపు గురించి ఈ మూడు సువార్తల్లో ధ్యానిస్తున్నాము. పిలవబడిన వారు ఎవరి చేత పిలవబడ్డారు, ఎందుకు పిలవబడ్డారు, పిలుపు ఉద్దేశం ఏమిటో గ్రహించాలి. మార్కు సువార్తలో చాలా చక్కగా రాయబడి ఉంది. పిలవబడినది :
1. తనతో ఉండటానికి
2. సువార్త ప్రకటనకు పంపడానికి (మార్కు 3:14)
తనతో ఉండుట అనేది పిలవబడిన వారు మొట్టమొదటిగా ప్రధమముగా చేయవలసిన పని తనతో ఉంటూ తన ఆజ్ఞలను నియమాలను పాటించాలి. ఈనాటి మొదటి పఠనం లో కూడా దేవుడు మోషేతో ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచమని కోరేది కూడా అదే తన నియమములను పాటిస్తే దేవుని సొంత ప్రజలు రక్షించబడతారు.
తనతో ఉండుట ద్వారా తన ఆజ్ఞలు విధేయించి పాటించుట చాలా సులభం అవుతుంది, తనతో ఉండుట ద్వారా అపర క్రీస్తులా మారగలము, సువార్తను ప్రభావంతంగా శక్తితో అనుగ్రహంతో ప్రకటించగలము అందరిని క్రీస్తు వశం చేయగలం.
3. దైవ రాజ్య వ్యాప్తి:
క్రీస్తు ప్రభువు శిష్యులను పిలుచుటకు కారణం తనతో ఉండుటకు, అటుపిమ్మట దైవ రాజ్య వ్యాప్తికి, దైవరాజ్య వ్యాప్తి అంటే క్రీస్తు ప్రారంభించిన రక్షణ కార్యాన్ని కొనసాగించడమే పునీత పౌలు గారు దైవ రాజ్యాన్ని ఈ విధంగా నిర్వహిస్తారు. దేవుని రాజ్యం అనగా తినుట, త్రాగుట కాదు పవిత్రాత్మ ఒసగు నీతి, శాంతి సమాధానములే (రోమి 14:17).
సువార్త పరిచర్య ద్వారా అపోస్తులలు పవిత్రాత్మ ఒసగు శాంతి, సంతోషములు, నీతి ఇవ్వగలగాలి ఈ లోకంలోనే పరలోక రాజ్యాన్ని స్థాపించగలగాలి, ప్రకటించగలగాలి (మత్తయి 10:8), క్రీస్తు ప్రభువు చాలా చక్కగా ఏ విధంగా నీతి శాంతి సమాధానములు వ్యాపింప చేయగలరు తన శిష్యులకు చెబుతున్నారు.
i. వ్యాధిగ్రస్తులు ను స్వస్థపరచుట ద్వారా
ii. మరణించిన వారిని జీవముతో లేపుట ద్వారా
iii. కుష్ఠ రోగులను శుద్దులను గావించుట ద్వారా
iv. దయ్యం లను వెడల గొట్టుట ద్వారా (మత్తయి 10:8)
ఇవన్నీ చేయటానికి ప్రభువు వారికి అధికారాన్ని ఇస్తున్నారు (మత్తయి 10:1)
దీని ద్వారా కేవలం భౌతిక శుద్ధినే కాదు, అంతరంగిక శుద్ధిని కూడా పొందగలరు, ఈ ప్రేషిత కార్యం బలహీనులకు బలాన్ని, శక్తిహీనులకు శక్తిని బాధలలో అనారోగ్యాలతో, కష్టాలతో, నష్టాలతో ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్లకు సమాజంలో చిన్నచూపు చూడబడే వారికి దేవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని వసగుతారు, తన శిలువ మరణం పునరుద్ధానం ద్వారా. (రోమి 5:6-11) ఇదే మనం ఈనాటి రెండో పఠనం లో చూస్తున్నాము దైవరాజ్య వ్యాప్తి కేవలం గురువులకు, కన్య స్త్రీలకు, దైవాంకితులకు, ఉపదేషులకు మాత్రమే పరిమితం కాదు. వారి బాధ్యత మాత్రమే కాదు. మన అందరి బాధ్యత. మన ఆలోచనల ద్వారా మన కార్యాల ద్వారా మన పరిధిలో మనము సువార్త ప్రకటన చేయగలగాలి సువార్త ప్రకటన అంటే విధులలో బోధించడం, ప్రసంగించడం మాత్రమే కాదు, కుటుంబ జీవితంలో ఒక మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి తండ్రిగా మంచి పిల్లలుగా జీవించి మీ జీవిత విధానం ద్వారా ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండి మీరే ఒక సువార్తికుడిగా మారడం కూడా సువార్త ప్రకటన అవుతుంది, క్రీస్తు ప్రభువు వలే ఇతరుల కష్టాలను, బాధలను, ఇబ్బందులను చూచి చలించగలగాలి, జాలి పడాలి, జాలిపడటం మాత్రమే కాదు మనతో మనకు తోచినంత సహాయం చేయగలగాలి, ఈరోజు నీవు నేను ఈ ప్రేషిత కార్యానికే పిలవబడ్డాం. మన పిలుపునకు తగ్గట్టు జీవించడం సువార్త ప్రకటనకు మన వంతు సహకరిద్దాం. ఈ లోకంలోనేదైవారాజ్య నిర్మాణానికి మన జీవిత విధానం ద్వారా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ కృషి చేద్దాం. ఆమెన్.
DN. SUNIL INTURI OCD
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి