3, ఫిబ్రవరి 2024, శనివారం

సామాన్య కాలం 5వ ఆదివారం


యోబు 7:1-4, 6-7
1కొరింతి 9:16-19
మార్కు 1: 29-39
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మానవ జీవితంలో కష్టాలు, బాధలు ఎదురైన సమయంలో జీవితంలో ఆశలు కోల్పోకుండా ధైర్యంతో ముందుకు సాగాలి అదేవిధంగా దేవునియందు నమ్మకముంచాలి అని తెలుపుచున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సర్వసాధారణం కావున మనకే ఎందుకు కష్టాలు వచ్చాయి అనే ఆలోచనలతో జీవించకుండా ఏసుప్రభువు వలె కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. 
చాలా సందర్భాల్లో మనందరం ప్రతిసారి మనము అనుభవించిన కష్ట,బాధ,శ్రమల గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ వాటన్నిటికన్నా ప్రతి కష్టము తరువాత దేవుని ఆశీర్వాదం ఉంటుంది అని గ్రహించాలి.
ఈనాటి మొదటి పఠణము యోబు గ్రంథము నుండి చదవబడినది. యోబు గ్రంథం ఆనాటి కొంతమంది యొక్క ఆలోచనలను సరి చేసే విధంగా వ్రాయబడినది. అప్పటి కొందరి ఆలోచన ఏమిటి అంటే దేవుడు మంచివారిని దీవిస్తారని, పాపులను క్షమిస్తారని అభిప్రాయం. ఆ అభిప్రాయమున ఖండిస్తూ యోబు గ్రంథములో దేవుడు అందరూ ఎడల ఒకే విధముగా మెలుగుతారు అని తెలుపుచున్నారు. వాస్తవానికి మంచివారే ఎక్కువగా కష్టాలు అనుభవిస్తారు అని ప్రభువు యోబు గ్రంథం ద్వారా తెలుపుతున్నారు. 
యోబు నీతిమంతుడుగా జీవిస్తూ, ఆస్తి ఐశ్వర్యములను కలిగి ఉన్న సమయంలో సైతాను దేవునితో సంభాషించినప్పుడు యోబు మిమ్మల్ని (యావే దేవుని) ఆరాధించేది కేవలం మీరిచ్చిన సంపదలవలనే అని ప్రభువుతో తెలిపినప్పుడు ప్రభువుక సంపదలు ఉన్నా లేకపోయినా నా ఎడల యోబు విశ్వాసపాత్రుడుగా ఉంటారు అని తెలిపినప్పుడు సైతాను యోబును పరీక్షించుటకు సిద్ధమైంది దానికి ప్రభువు కూడా సమ్మతించారు. 
ప్రతి ఒక్కరి విశ్వాసము కూడా పరీక్షించబడాలి అప్పుడే నిజమైన విశ్వాసము అనేది బయటకు వస్తుంది.1 పేతురు 1:7
ఈనాటి మొదటి పఠణం ద్వారా మనము కొన్ని అంశాలు నేర్చుకోవాలి
1. మంచివారికి కష్టాలు వస్తాయి. చాలా సందర్భాలలో మన యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి చెడ్డవారికి కష్టాలు మంచివారికి ఆశీర్వాదాలు దొరుకుతాయని అందరి అభిప్రాయం కానీ మనం సమాజంలో చూసేది ఏమిటంటే మంచివారు కష్టాలను అనుభవిస్తారు, చెడువారి సంతోషంగా ఉంటాయి. మనము పవిత్ర గ్రంథములో చూసుకున్నట్లయితే ఎవరైతే దేవునికి దగ్గరగా ఉండి జీవించారో వారే ఎక్కువ కష్టాలు అనుభవించారు. పవిత్ర గ్రంధములో అబ్రహాము,
ఏసేపు, ఇర్మియా ప్రవక్త, మరియమ్మ- యేసేపు, పౌలు గారు  అదేవిధంగా అపోస్తులు, ఇంకా అనేకులు కష్టాలు అనుభవించారు వీరందరూ దేవుడికి దగ్గరగా ఉన్నప్పటికీ, మంచి జీవితం జీవించినప్పటికిని కష్టాలు అనుభవించారు. వీటి యొక్క అర్థం ఏమిటి అంటే మంచి వారికి కష్టాలు వస్తునే ఉంటాయి అది ఎందుకంటే వారు ఇంకా వారి విశ్వాస జీవితంలో దేవునికి దగ్గర అయి ఉండాలి అని మరియు వారి విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండుటకై. మనము కష్టాలు అనుభవిస్తున్నామంటే మనల్ని దేవుడు బాగా గుర్తుపెట్టుకుంటున్నారని అర్థం. ఏ వ్యక్తిని కూడా తన యొక్క శక్తిని మించి సైతాను శోధింపడు.
1కొరింతి 10:13
2, యోబు తన కష్టములలో ఆయన స్థిరముగా, ధైర్యంగా ఉన్నారు. తన జీవితంలో అన్నీ ఉన్నవి ఆస్తిపాస్తులు, స్నేహితులు, కుటుంబము, పిల్లలు అందరు కూడా ఉన్నారు కానీ సైతాను శోధన వలన ఆయన అన్నీ కోల్పోయాడు చివరికి తన యొక్క జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేనటువంటి ఒక పరిస్థితి ఎదురయింది ఆయన శరీరమంతా వ్రణములతో నిండి ఉన్నది. ఆయన శారీరకంగా మానసికంగా కృంగిపోయాడు. పనివాడు ఏ విధముగానయితే బ్రతుకుట కోసం కష్టపడి పనిచేస్తుంటాడో తాను కూడా బ్రతుకుట కొరకు శ్రమలు అనుభవిస్తున్నాను అని తెలుపుతున్నారు.  అన్ని కష్టాలనుభవించినప్పటికీ  కూడా తన జీవితాన్ని తాను నాశనం చేసుకోవాలని కోరుకోలేదు ఆయన అన్ని పరిస్థితులను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నాడు. యోబు యొక్క స్థిరత్వం మనందరం కూడా కలిగి ఉండాలి ఆయనకన్నా మనకి ఎక్కువ కష్టాలు ఏమి వచ్చి ఉండవు కాబట్టి అన్నిటినీ ధైర్యముగా ఎదుర్కోవాలి. యోబు నిరాశలో దేవుని యొక్క సమాధానము కొరకు, ఆశీర్వాదం కొరకు ఎదురుచూస్తూ ఆయన్ని నమ్ముకుని ఉన్నాడు.

3. యోబు తన కష్ట జీవితంలో దేవుడి వైపు మరలుతున్నాడు. ఎవరైతే తనని ఉన్నత స్థితికి చేర్చారు ఆయన వైపే మరొకసారి యోబు తిరుగుచున్నాడు. ఆయన ఎన్నడూ దేవుడిని విడిచిపెట్టలేదు. మనము మాత్రం మన కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి కూడా రాము ఆయనకి ప్రార్థన కూడా చేయము.
4. మన సొంత వారే మనల్ని అర్థం చేసుకోకపోవడం. యోబు యొక్క స్నేహితులు తాను ఉన్నటువంటి స్థితిలో తనను ఓదార్చుటకు బదులుగా ఆయన యొక్క తప్పిదమును వేలెత్తి చూపుచున్నారు. ఆయన దేవుని పాపం చేసాడు కాబట్టే ఇంతటి శిక్ష వచ్చినది అని వారందరూ కూడా తలంచారు. కొన్ని కొన్ని సందర్భాలలో మన స్నేహితులే, సొంతవారే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు కానీ దేవుడు ఎల్లప్పుడూ మనల్ని అర్థం చేసుకుంటాడు.
యోబు తన విశ్వాస జీవితంలో దేవుడిని నమ్ముకొని ఆయన మీద ఆధారపడ్డారు కాబట్టి  ఆయనను ఇంకా అధికముగా ఆశీర్వదించారు కాబట్టి మానవ జీవితం కష్టాలతో వున్నప్పటికిని మనం దేవుడిని అంటిపెట్టుకొని ఉంటే దేవుడు మనలని చివరికి ఆశీర్వదిస్తూనే ఉంటారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తాను అందరి కొరకై సేవకుడిగా చేయబడ్డారు అని తెలుపుచున్నారు. దేవుడు తనకు అప్పచెప్పినటువంటి సువార్త ప్రకటన గురించి పౌలు తెలుపుచున్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించుట కొరకై ఆయన అందరి కొరకు అందరివాడే సువార్త సేవ చేసి ఉన్నారు. 
ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు తన యొక్క ముఖ్యమైనటువంటి పరిచర్య గురించి తెలుపుతున్నారు. ప్రభువు ఈ లోకంలో రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు అదేవిధంగా తండ్రి  యొక్క సువార్త ప్రకటించుటకు వచ్చి ఉన్నారని తెలిపారు. ఏసుప్రభు తాను ఈ లోకమునకు వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చుటలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో దేవుడు మనకు ఒసిగినటువంటి పనిని నెరవేర్చుటలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండాలి.
ఈనాటి పఠణముల ద్వారా మనము గ్రహించవలసిన అంశము ఏమిటి అంటే మన విశ్వాస జీవితం లో ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ ధైర్యంతో మనం ముందుకు సాగాలి. దేవుడిని అంటిపెట్టుకొని జీవించాలి అదేవిధంగా మన యొక్క పనిని సక్రమంగా నెరవేర్చాలి.
Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...