2, మార్చి 2024, శనివారం

తపస్సు కాలం మూడవ ఆదివారం

తపస్సు కాలం మూడవ ఆదివారం
నిర్గమ 20:1-17,  1 కొరింతి 1:22-25,  యో‌హాను 2:13-25
ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న ఒడంబడిక గురించి మరియు ఏసుప్రభు యెరూషలేము దేవాలయమును పవిత్ర పరుచుట గురించి బోధిస్తున్నాయి. గత  రెండు వారాలుగా మనము మొదటి పఠణంలో దేవుడు నోవాతో మరియు అబ్రహాముతో ఏర్పరచుకున్న ఒడంబడికను  గురించి ధ్యానించాం. ఈరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకుంటున్న ఒక ఒడంబడికను చదువుకుంటున్నాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేయటమే కాక వారిని వాగ్దాత్మ భూమికి నడిపించాలి నుంచున్నారు మరియు వారిని శత్రువుల బారి నుండి కాపాడాలని నిర్ణయించుకున్నారు ఇది మాత్రమే కాదు ఈ యొక్క ఒడంబడిక ద్వారా యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు  స్వేచ్ఛనిస్తున్నారు,
వారికి రక్షణనిస్తున్నారు,
 ఇతరుల కన్నా వారిని ఇంకా అధికముగా దీవించుటకై తానే ఒక మార్గ చూపరిగా ఉంటానని తెలుపుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకునే ముందు వారికి పది ఆజ్ఞలను ప్రభువు దయచేసి చేస్తున్నారు. ఈ యొక్క ప్రతి ఆజ్ఞలకు విధేయులై జీవించినట్లయితే వారికి తాను దేవుడై ఉండి ఎల్లప్పుడూ కూడా వారిని ఆశీర్వదిస్తాను అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడు ఒక్కసారిగా వారిని ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకొని రావటం ద్వారా ఆయన మీద అపారమైనటువంటి నమ్మకం పెరిగింది అందుకని ఒక మాటతో వారందరూ కూడా మేము దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులై జీవిస్తామని ఏక స్వరముతో పలికారు అప్పుడు దేవుడు మోషే ద్వారా పది ఆజ్ఞలు ఇస్తూ సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకుంటున్నారు. 
ఈ పది ఆజ్ఞలు దేవుడు ఎలాంటి వారు అని తెలియచేస్తున్నాయి అలాగే ఒక విశ్వాసి తోటి వారి పట్ల ఏ విధముగా మెలగాలి అని తెలియచేస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క ఆజ్ఞలు మన యొక్క విశ్వాస జీవితంలో మంచిని అనుసరించుటకు, మంచి జీవితం జీవించుటకు సుచనగా ఉన్నాయి. దేవుడిచ్చిన ఈ యొక్క చట్టం ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే ఎందుకంటే ప్రతి ఒక్క చట్టం ఉన్నది కూడా మన యొక్క అభివృద్ధి కొరకే. మనము ఏవిధంగా జీవించాలో, జీవించ కూడదో, ఏ విధంగా జీవిస్తే సమాజంలో మంచిగా గౌరవింపబడతాము అని చట్టం మనకు తెలియచేస్తుంది. ఈ యొక్క పది ఆజ్ఞల చట్టం మనలను గొప్పవారిగా తీర్చిదిద్దుతుంది. ఈ యొక్క పది ఆజ్ఞలలో రెండు భాగములు ఉన్నది మొదటిది దేవునికి సంబంధించినది. (1-3 ఆజ్ఞలు)
రెండవది తోటి మానవాళికి సంబంధించినది (4-10). ప్రభువు ఎవరైతే తన యొక్క ఆజ్ఞలకు విధేయులై వాటిని పాటిస్తూ జీవిస్తారో వారిని వేయి తరములు వరకు ఆశీర్వదిస్తానని పలుకుచున్నారు (నిర్గమ 20:6). చాలా సందర్భాలలో దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుటలో మనము విఫలం అయిపోతూ ఉంటాం ఎందుకంటే చాలా సార్లు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం ఇవ్వము అలాగే పొరుగువారి ఎడల చూపించవలసిన ప్రేమను చూపించము. ఈ పది ఆజ్ఞలను మనము ఏ ఆజ్ఞ సంపూర్ణంగా మన జీవితంలో పాటించి ఉన్నాము. చాలా సందర్భాలలో మనం దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితంలో పాటించి లేక పోతున్నామా?. పది ఆజ్ఞలు చాలా విలువైనవి, వీటిని పాటించుట ద్వారా మన యొక్క జీవన శైలి మారుతుంది. ఏసుప్రభు ఇచ్చిన నూతన ఆజ్ఞ ఈ పది ఆజ్ఞల యొక్క సారాంశంగా శిష్యులకి ఇచ్చారు. ఒక్కొక్క ఆజ్ఞ మనం ధ్యానించినట్లయితే నిజంగా మనం దేవుడి విషయంలో విశ్వాసపాత్రులుగా ఉంటున్నామా? అలాగే మన యొక్క పొరుగు వారిని కూడా గౌరవించుకొని జీవిస్తూ ఉన్నామా?  అని మనకు అర్థమవుతుంది.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఏసుప్రభు యొక్క సిలువను గురించి తెలియజేస్తున్నారు. ప్రభువు యొక్క శిలువ గురించి ప్రకటించబడాలి. కొందరికి సిలువ అవమానకరంగా ఉండవచ్చు కానీ అదే సిలువ ద్వారా మనందరం కూడా రక్షించబడ్డాం అని పౌలు గారు తెలుపుతున్నారు.
ఈనాటి సువిశేష భాగంలో ఏసుప్రభు యెరూషలేము దేవాలయమును పవిత్ర పరచుట గురించి చదువుకుంటున్నాము. ఎప్పుడైతే ఏసుప్రభు యెరుషలేము దేవాలయంలో జరిగే వ్యాపారాలను ఖండించారు వారందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉంటున్నారు అది మాత్రమే కాక ఈ యొక్క దేవాలయమును పడగొట్టండి దీనిని మూడు రోజుల్లో నిర్మిస్తానని ఏసుప్రభు పలికారు అందుకుగాను అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కోపబడుచున్నారు ఎందుకంటే వాస్తవానికి ప్రతి ఒక్క యూదుడికి మూడు ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యం.
1. భూమి
2. రాజు
3. దేవాలయం 
యూదులకు సొంత భూమి లేదు ఎందుకంటే వారు రోమీయుల చేత పరిపాలింపబడ్డారు అదే విధంగా వారికి సొంత రాజు లేదు ఎందుకంటే రాజ్యాలు విడిపోయాయి కాబట్టి కేవలము వారికి ఉన్నది దేవాలయము మాత్రమే అందరూ కూడా వచ్చి ప్రార్థనలు చేసుకోవడానికి ఉన్న ఏకైక స్థలం దేవాలయం కాబట్టి ఆ స్థలమును కూడా కూల్చివేస్తే ఇక ఏది కూడా వారి సొంతమైనది లేదు కాబట్టి ఆ మాటలకు వారు కోపపడుతున్నారు అందుకే ప్రభువును హింసించాలనుకున్నారు. వాస్తవానికి ఏసుప్రభు యొక్క కోపం మంచిని ఉద్దేశించినది ఎందుకంటే దేవాలయము ప్రార్థించుటకు దేవుడిని ఆరాధించుటకు,స్తుతించుటకు, బలులు సమర్పించుటకు ఏర్పరచబడినది కానీ అక్కడ వ్యాపారం ద్వారా ప్రాముఖ్యత ఇవ్వవలసిన దానికి ఇవ్వకుండా అంతయు కూడా స్వార్థపూరితంగా మారినది అందుకని ఏసుప్రభు వారి యొక్క కపటత్వం చూసి వారిని ఖండిస్తున్నారు. ఏసుప్రభు యొక్క రాకతో మరొక్కసారి యెరుషలేము దేవాలయం తన యొక్క పూర్వ వైభవమును పొందుతుంది. తన రాకతో మరొకసారి ఆ దేవాలయమును పవిత్ర పరిచారు. మనము కూడా దేవుని యొక్క ఆలయము అని పునీత పౌలు గారు అన్నారు కాబట్టి దేవుడు కొలువై ఉండే మన యొక్క హృదయములను శరీరమును ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకొని జీవించాలి మన యొక్క జీవితములను పవిత్రంగా ఉంచుకోవాలి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించాలి.
Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...