2, నవంబర్ 2024, శనివారం

31 వ సామాన్య ఆదివారం

31 వ సామాన్య ఆదివారం 
ద్వితియోపదేశకాండము 6:2-6, హెబ్రీ 7:23-28 మార్కు 12:28-34
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుట మరియు ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అనే అంశములను తెలుపుచున్నవి. 
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించమని తెలుపుచున్నారు. ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా వారి యొక్క జీవితంలో అనేక రకములైనటువంటి మేలులు కలుగుతాయి అనేటటువంటి అంశమును కూడా ప్రవక్త తెలిపారు. ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించిన యెడల ఇశ్రాయేలు ప్రజలు కలకాలము బ్రతుకుతారు అదే విధముగా ఆయన ఆజ్ఞలు పాటించుట ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో క్షేమములు కలుగును మరియు పాలు తేనెలు ప్రవహించే నేల మీద వారు బహు గొప్పగా వృద్ధి చెందుతారు అదే విధముగా ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా దేవుడు వారిని వేయి తరముల వరకు ఆశీర్వదిస్తారు(నిర్గమ 20:6). ఈ యొక్క ఆజ్ఞలు ప్రేమకు సంబంధించినవి. ప్రభువైన యావేను పూర్ణహృదయముతోనూ, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలెను అని ప్రభువు కోరుకున్నారు. ప్రజల యొక్క మనసులు ఇక వేరే దైవముల మీద ఉండకుండా కేవలము యావే దేవుని మాత్రమే ఆరాధించి ప్రేమించాలి కాబట్టి ప్రభువు ఈ యొక్క ఆజ్ఞను ఇచ్చారు. ప్రేమ ఉండిన యెడల ప్రతి ఒక్కరి జీవితంలో ఏది అయినా పాటించవచ్చు ఎందుకనగా ప్రేమ ఉంటే ఆజ్ఞలను తు:చ తప్పకుండా నెరవేరుస్తారు. మన యొక్క అనుదిన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో యావే దేవుడిని మాత్రమే కాకుండా మిగతా దైవములను కూడా విశ్వసిస్తారు దీనిని ప్రభువు ఖండిస్తూ ఆయన ఒక్కరే నిజమైన దేవుడు అని తెలుపుచూ ఇక వేరే అన్యదైవములను విశ్వసించవద్దని మోషే ప్రవక్త ద్వారా తెలిపారు. యావే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన పది ఆజ్ఞలను రెండుగా విభజించినట్లయితే మొదటి మూడు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి మిగతా ఏడు ఆజ్ఞలు తోటి మానవులకు సంబంధించినవి ఈ రెండిటిని కలిపి పది ఆజ్ఞలు అని పిలుస్తారు ఇందులో దైవము మానవులు ఇద్దరు ఉన్నారు కాబట్టి దైవ - మానవ ప్రేమలు విడదీయునటువంటివి. ఈ రెండు ఎప్పుడూ కలసి ప్రయాణం చేయాలి. రైలు పట్టాలు ఏ విధంగానైతే కలిసి పోతుంటాయి అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రెండు అంశాలు పాటిస్తూ జీవించాలి. ఏ ఒక్కటి తక్కువైనా అది నిజమైన సంపూర్ణ క్రైస్తవ జీవితం కాదు.
ఈనాటి రెండవ పఠణంలో ఏసుప్రభు యొక్క యాజకత్వమును గురించి బోధిస్తూ ఉన్నది. ఆయన ప్రజల పక్షమున మనవి చేయుట కొరకై శాశ్వత జీవియై ఉన్నారు. ఆయన దైవ ప్రేమ మానవ ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టే మన కొరకు తన యొక్క ప్రాణములను సమర్పించారు. ఆయన యొక్క యాజకత్వము గొప్పది. ఎందుకనగా ఎటువంటి పాపము చేయని నిష్కళంక గొర్రెపిల్ల మన కొరకు తన రక్తమును చిందించి తనను తానే దేవునికి మన పాపముల నిమిత్తము సమర్పించుకున్నారు.
ఈనాటి సువిశేష భాగములో ఒక మంచి ధర్మశాస్త్ర బోధకుడు ఏసు ప్రభువుని, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటని అడుగుచున్నారు అందుకుగాను ప్రభువు మొదటిగా దేవుడిని ప్రేమించమని తెలిపి, ఆ ప్రేమను ఇతరులలో వ్యక్తపరచమని కోరారు. ఈ ధర్మశాస్త్ర బోధనకునికి ప్రధాన ఆజ్ఞ తెలుసుకోవాలనిపించింది ఎందుకనగా యూదులు యావే దేవుడిచ్చిన పది ఆజ్ఞలను 613 ఆజ్ఞలుగా మార్చారు అందుకుగాను ప్రజలు ఆచరించడానికి కష్టంగా ఉన్నటువంటి ఇన్ని ఆజ్ఞలలో ఏది ప్రధానమైనదో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు అందుకే యేసు ప్రభువును అడిగారు. ఏసుప్రభు దైవ ప్రేమ మానవ ప్రేమ రెండు వేరు పరపలేనటువంటివి అని తెలిపారు. ఒకే నాణేనికి రెండు ప్రక్కలు ఉన్నట్లే ఒకే ఆజ్ఞకు దైవ ప్రేమ, సోదర ప్రేమ అను రెండు అంశాలున్నాయి. దైవ ప్రేమ లేనిది సోదర ప్రేమ లేదు అలాగే సోదర ప్రేమ లేనిదే దైవ ప్రేమ లేదు. దైవ ప్రేమ నుండి సోదర ప్రేమ ఉద్భవిస్తుంది. మన అందరికీ దేవుడు తండ్రి కాబట్టి మనము ఆయన యొక్క బిడ్డలం కావున మన జీవితంలో దైవ ప్రేమ సోదర ప్రేమ కలిగి జీవించాలి. దేవుని యెడల ప్రేమ కలిగి జీవించటం అందరికీ సాధ్యమైనది ఎందుకనగా ఆయన మీద ఉన్న ప్రేమ వలన దేవాలయానికి వస్తాం, పరిచర్యలు చేస్తాం, దేవాలయ నిమిత్తమై ఎంతైనా ఉదారంగా అందజేస్తాం కానీ మన ప్రేమను మన పొరుగు వారితో పంచుకోలేం. పొరుగు వారిని ప్రేమించుట కొంతమందికి చాలా చాలా కష్టం. దేవుడిని ప్రేమించే వ్యక్తి తన తోటి వారిని ప్రేమించకపోతే అట్టి వ్యక్తి అసత్య వాది అని యోహాను గారి తెలిపారు. (1 యోహాను 4:20-21) కాబట్టి మనం మన యొక్క శత్రువులను ప్రేమించాలి, మిత్రులను ప్రేమించాలి, మన యొక్క నాశనమును కోరు వారిని ప్రేమించాలి. ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను పాటించిన యెడల మనందరి యొక్క జీవితములో ఎంతో సంతోషంగా ఉంటాయి అలాగే ఈ భూలోకమే పరలోకంగా మారుతుంది. మనము ఏ పని చేసినా దానిని ప్రేమతోనే చేయాలి కాబట్టి ప్రేమ అనేది మన యొక్క క్రైస్తవ జీవితానికి పునాది లాగా ఉండాలి తద్వారా మనందరం మంచి క్రైస్తవ విశ్వాస జీవితమును జీవించగలుగుతాం. 
 Fr. Bala Yesu OCD

26, అక్టోబర్ 2024, శనివారం

30వ సామాన్య ఆదివారం

30వ సామాన్య ఆదివారం 
యిర్మియా 31:7-9, హెబ్రీ 5:1-6, మార్కు 10:46-52
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని నమ్ముకుని ఆయన మీద ఆధారపడినటువంటి వారికి చేసేటటువంటి మేలులను తెలియజేస్తున్నాయి. మానవ శక్తి మీద, ఆలోచన మీద కాక సంపూర్ణముగా దేవుడి మీద ఆధారపడితే ప్రభువు వారిని ఆశీర్వదిస్తారు. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నారు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం నుండి 34వ అద్యాయాలను ఓదార్చేపుస్తకమని, ప్రశాంత పరిచే పుస్తకమని అదేవిధంగా ఇశ్రాయేలీయులను తిరిగి తమ వారితో ఐక్యపరిచుటను తెలియచేయు పుస్తకమని అంటారు. ఎందుకనగా ఈ నాలుగు అధ్యాయాలలో ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైనటువంటి మాటలను తెలియజేశారు.యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అస్సిరీయుల బానిసత్వం నుండి వారి యొక్క సొంత భూమికి తీసుకొని వెళతారు అనే సంతోషకరమైన విషయం తెలుపుచున్నారు. ఈ యొక్క అస్సిరీయులు, ఇశ్రాయేలును పూర్తిగా ధ్వంసం చేసి అక్కడివారిని బానిసలుగా కొనిపోయారు. ఇలాంటి ఒక బాధకరమైన సమయంలో యిర్మియా ప్రవక్త దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానము మరువడని, ఆయన దయ కలిగిన దేవుడని, ప్రజల యొక్క పాపములను క్షమించి మరలా వారిని తన చెంతకు చేర్చుకుంటారని ప్రవచించారు. దేవుడు ఎవరిని మరువకుండా, విడిచిపెట్టకుండా, కుంటి వారిని, గ్రుడ్డివారిని ఏ విధముగా గర్భవతులను సైతము అందరిని కూడా సొంత భూమికి తీసుకొనివస్తారని వాగ్దానం చేశారు. ప్రభువు ఇస్రాయేలు ప్రజల పట్ల ఎల్లప్పుడూ విశ్వాసనీయుడుగానే ఉన్నారు ఆయన సీనాయి పర్వతం దగ్గర చేసినటువంటి వాగ్దానమును ఎన్నడూ మరువలేదు. ప్రభువు వారిని విముక్తులను చేసినందుకుగాను ప్రతిఫలముగా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థనలు సమర్పిస్తారన్నారు. అదే విధముగా దేవుడే స్వయముగా తన ప్రజలను నడిపిస్తారని తెలిపారు అలాగే వారు పడిపోకుండా, మార్గము తప్పిపోకుండా ఆయనే ఒక మార్గ చూపరిగా ఉంటూ తమ యొక్క సొంత ప్రాంతమునకు నడిపించారు అని యిర్మియా ప్రవక్త ఆనాటి ప్రజలకు ఈ యొక్క సంతోషకరమైన అంశమును తెలియజేశారు. తండ్రి తన బిడ్డలను చూసుకున్న విధముగా దేవుడు కూడా ఇశ్రాయేలును తన సొంత బిడ్డల వలె కాచి కాపాడుతూ వారి వెన్నంటి ఉంటారని పలికారు. 
ఈనాటి రెండవ పఠణంలో  యాజకత్వమును గురించి తెలుపుచున్నది. ప్రతి యాజకుడి యొక్క యాజకత్వము దేవుడి నుండి వచ్చినదని తెలుపుతూ వారు బలహీనులైనప్పటికీ తమ కొరకు తాము, తన పాపముల కొరకు అదేవిధంగా ఇతరుల యొక్క పాపముల కొరకు బలిని అర్పింపవలెనని తెలిపారు. యాజకత్వము అనే దైవ పిలుపు ప్రభువునుండే స్వయముగా వచ్చినది. దేవుడే ప్రతి ఒక్క యాజకుడిని నియమించారు. తండ్రి కుమారుడను నియమించిన విధముగా మనలను దేవుడు యాజకులుగా నియమిస్తున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు బర్తిమయి అను గుడ్డివానికి దృష్టిని బసగిన అంశమును చదువుకుంటున్నాము. ఈయన యొక్క జీవితంలో మనము గ్రహించవలసినటువంటి కొన్ని అంశములు;
1. గ్రుడ్డివాడు గ్రహించగలిగాడు. బర్తి మయి అనే బిక్షకుడు తనకు చూపు లేకపోయినా యేసు ప్రభువు యొక్క దైవత్వమును గ్రహించగలిగాడు. ఎందరికో కన్నులున్నప్పటికీ వారు ఏసుప్రభు యొక్క కార్యములను చూసి గుర్తించలేకపోయారు కానీ ఈ బర్తిమయి కేవలం యేసు ప్రభువును గూర్చి విని ఆయన గొప్పతనం గ్రహించ గలిగాడు. వినుట వలన విశ్వాసము కలుగును.
2. విశ్వాసము కలిగి దేవుడిని ఆశ్రయించారు. బర్తిమయి ప్రభువు నందు ఆచంచలమైన విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టే ప్రభువు తన చెంతకు వచ్చిన వెంటనే తనకు చూపునివ్వమని విశ్వాసముతో ప్రార్థించాడు. 
3. బర్తిమయి ప్రభువును తనకు ఏది ముఖ్యమో దాని కొరకు మాత్రమే ప్రార్థించారు. ఆయన ప్రభువుని దానం చేయమని అడగలేదు, తన యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని అడగలేదు కానీ తనకు చూడటానికి చూపును ఇవ్వమని కోరాడు. తన యొక్క జీవితంలో చూపు అనేది ముఖ్యము కాబట్టి దాని కొరకే బర్తిమయి ప్రార్థించాడు. బహుశా ఆయన కూడా ప్రభువుని చూడాలని ఆరాటపడి ఉండవచ్చు అందుకే కేవలం చూపు అని మాత్రమే ప్రసాదించమని అడిగాడు.
4. బర్తిమయి పట్టుదల - తన తోటి వారు తనను ఎంత నిశ్శబ్దముగా ఉండాలని ప్రయత్నం చేసిన  బర్తిమయి పట్టుదలతో ఎవరి మాటను పట్టించుకోకుండా ఆయన అనుకున్నది సాధించడానికి గొంతెత్తి మరి ప్రభువుని పిలిచారు. 
5. బర్తిమయి ప్రభువు యొక్క కనికరము కొరకు ప్రార్థించారు. ఆనాటి కాలంలో ఎవరికైనా ఏదైనా లోపం(అనారోగ్యం) ఉంటే దానిని దేవుని శిక్షగా భావించేవారు అందుకే ఒకవేళ ఆయన మీద దేవుని శిక్ష ఉండిన యెడల దానిని తీసివేయమని, కరుణతో క్షమించమని ప్రభువు కరుణ కొరకు వేడుకున్నాడు. 
6. ప్రభువుని అనుసరించుట- బర్తిమయి ఏసుప్రభు తన జీవితంలో చేసిన మేలులు తలంచుకొని ప్రభువుని వెంబడిస్తున్నారు. మేలులు పొంది తిరిగిపోయిన వారి కన్నా, మేలు చేసినటువంటి దేవుడిని వెంబడించినటువంటి గొప్ప వ్యక్తి ఈ బర్తిమయి.
7. ప్రభువు మన చెంతకు వచ్చినప్పుడు ఆయనను మనము భర్తిమయి వలే గుర్తించాలి. అనేక సందర్భాలలో దేవుడు దివ్య బలి పూజ ద్వారా, ప్రార్థన ద్వారా మన చెంతకు వస్తారు ఆయనను మనము గుర్తించి కలుసుకున్నప్పుడు మన యొక్క జీవితంలో భర్తిమయి వలె మేలులు కలుగును.
8. దేవుడి మీద ఆధారపడుట- బర్తిమయి సంపూర్ణముగా దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడ్డాడు కాబట్టి ప్రభువు ఆయన్ను దీవించారు. 
మన యొక్క అనుదిన జీవితంలో కూడా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ, విశ్వాసముతో ప్రార్థిస్తూ, దేవుని యొక్క కరుణ కోరుకుంటూ ఆయన యొక్క దీవెనలు పొందాలి. 
Fr. Bala Yesu OCD.

యేసు ప్రభువుని వ్యక్త పరచుట- శిష్యుల కర్తవ్యం

  యోహాను 13: 16-20 దాసుడు తన యజమానునికంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుక...