14, నవంబర్ 2024, గురువారం

లూకా 17: 20-25

దేవుని రాజ్యము 

దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది." యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "మీరు మనుష్యకుమారుని కాలములో ఒక దినమునైనను చూడగోరుదురు. కాని  మీరు చూడరు. ఇదిగో! అతడు ఇక్కడ ఉన్నాడు. లేక  అదిగో! అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు. కాని మీరు వెళ్ళవలదు. వారి వెంట పరుగెత్తవలదు. ఏలయన మెరపుమెరసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించునట్లు మనుష్య కుమారుని రాకడ ఉండును. ముందుగా  అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరమువారిచే నిరాకరింపబడవలెను. 

 దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది."పరిసయ్యులు అడిగిన ప్రశ్నలకు యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఇది. పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. లేదా యిస్రాయేలు ఎప్పుడు స్వతంత్ర రాజ్యాంగ అవతరిస్తుంది అని అడుగుతున్నారు.  యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం వారు కోరుకున్నది కాదు. కాని వారికి ఒక నూతన సత్యాన్ని ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. అది ఏమిటిఅంటే దేవుడు రాజ్యం కంటికి కనపడునట్లుగా రాదు. మరియు అది మీలో ఉన్నది అని ప్రభువు చెబుతున్నాడు. ఇది ఎందుకు కంటికి కనపడదు? దేవుని రాజ్యం అనుభవించాలి, అది ప్రభువు వద్ద నుండి క్షమాపణ పొందడం వలన, ఆయన ప్రేమను పొందడం వలన అనుభవిస్తుంటాం. దేవుని రాజ్యం బహ్యమైనది. అది అంతరంగికమైనది. అది మనలో ఉన్నది. నాలో మరియు నీలో ఉన్నది. నాలో ఉన్న ఆ దేవుని రాజ్యమును ఎలా అనుభవించగలం.

యేసు ప్రభువు దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని చెబుతున్నాడు. కాని ఎందుకు మనము దానిని అనుభవించలేకపోతున్నాము? మనము యేసు ప్రభువు క్షమా , ప్రేమ కరుణ అను గుణాలు మనలో లేకపోవడం వలన దేవుని రాజ్యమును అనుభవించలేకపోతున్నాము. యేసు ప్రభువు ప్రజలును దేవుని రాజ్యమునకు సిద్ధపరస్తూ మరు మనస్సు పొందమని, క్షమ, ప్రేమ, కరుణ గుణాలు కలిగిఉండమని చెబుతారు. ఇవి మానవుణ్ణి దేవుని రాజ్యం అనుభవించడానికి అర్హుడని చేస్తాయి. ఈ గుణాలు మనిషిని అంతరంగికంగా మారుస్తుంటాయి. నూతన జీవితం జీవించేలా చేస్తాయి.  దేవుని రాజ్యం అనుభవించేలా చేస్తాయి. ప్రభువు ప్రేమ కరుణ, క్షమ ద్వారా ఆయనను అనుభవించకుండా ఆయన అక్కడ ఉన్నాడు లేక ఇక్కడ  ఉన్నాడు అనే మాటలను నమ్మవద్దు అని ప్రభువు చెబుతున్నారు.

 ఎందుకు దేవుని రాజ్యము ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అని ఎవ్వడు చెప్పజాలడు అని ప్రభువు అంటున్నాడు. మరియు మనుష్య కుమారుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని మనుషులు అంటారు కాని మీరు వెళ్ళవద్దు అని ప్రభువు ఎందుకు చెబుతున్నారు. దేవుని రాజ్యము మనలో ఉంది కనుక దానిని ఇంకా ఎక్కడో వెదకనవసరం లేదు. మనలోనే దానిని పొందవచ్చుకనుక సంఘంలో, కుటుంబంలో మన మనసులో ప్రభువుని గుణాలు పెంపొందినప్పుడు దానిని అనుభవించగలుగుతాం. ప్రభువును, దేవుని రాజ్యమును వేరు చేసి చూడలేము. ప్రభువును పొందినప్పుడు మనము దేవుని రాజ్యమును కూడా పొందుతాము. ప్రభువును పొందటం అంటే సమస్తమును పొందటమే అది దేవుని రాజ్యమునుకూడా.  ప్రభువును చూచుట కొరకు ఎక్కడకు వెళ్లనవసరం లేదు, ఆయన మన మధ్యనే ఎప్పుడు ఉంటాడు. దివ్య సత్ప్రసాదంలో ప్రతిరోజు ఆయనను కలుసుకోవచ్చు. దేవుని వాక్కు ద్వారా  ఆయనను  కలుసుకోవచ్చు, ప్రేమను పంచుకొనుట ద్వారా ఆయనను కలుసుకోవచ్చు. మన ఆత్మలో ఆయనను కలుసుకోవచ్చు. 

ప్రభువును మనం ఆత్మలో ఎలా కలుసుకోవచ్చు? పునీత ఆవిలాపురి తెరెసామ్మ గారు దీని గురించి వివరిస్తూ దేవుడు మన ఆత్మలో ఆసీనుడై ఉన్నాడు. మన అంతరాత్మలోకి మనం ప్రవేశించినట్లయితే అక్కడ ఉన్న ప్రభువును కలుసుకోవచ్చు. కాని మనం ఆత్మలోనికి ప్రవేశించాలంటే చాలా ఓపికతో మరియు సాహసంతో కూడిన ప్రయాణం చేయాలి. మనలోనికి మనము ప్రవేశించే సమయంలో మన నిజరూపం మనకు తెలుస్తుంది కొన్ని సార్లు మనమీద మనకు ఏహ్యభావం కలుగవచ్చు ఎందుకంటే మనలో ఉన్న చెడు మనకు తెలుస్తుంది. వీటన్నిటి  తరువాత మన అంతరాత్మలో ప్రభువును కలుసుకోవచ్చు. కాని ఈ ప్రయాణంలో మనం అనేక ఆటంకాలు పొందవచ్చు. వాటిని అధిగమిస్తేనే ప్రభువును మనం కలుసుకోగలం. ఈ ప్రయాణము ప్రార్థన, వినయముతో పాటు విశ్వాసము,నమ్మిక ప్రేమ అను సుగుణాల ద్వారా కొనసాగించాలి. 

ప్రార్ధన: ప్రభువా! మీరు మా మధ్యలో ఉన్నారు అనే విషయాన్ని అనేకసార్లు మర్చిపోయి మిమ్మును ఎక్కడెక్కడో వెదకడానికి ప్రయత్నిస్తున్నాను. మిమ్మలను కలుసుకొనుటకు మీరు మాకు ఎప్పుడో మార్గమును చెప్పారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుటను చూచి మీరు నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది అని మీరు చెప్పారు. మీ ప్రేమను వ్యక్త పరచడం, మీ కరుణను చూపడం ద్వారం మీ క్షమను పంచడం  ద్వారా మిమ్ములను  కలుసుకోవచ్చు అని తెలుసుకున్నాము అలా జీవించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ప్రభువా మీరు నాలో ఉన్న విషయాన్ని తెలుసుకొని మిమ్ములను కలుసుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ సుగుణాలను అలవరుచుకొని మీ రాజ్యములో పాల్గొనుటకు అర్హులను చేయండి. ఆమెన్ 

13, నవంబర్ 2024, బుధవారం

లూకా 17:11-19

 సమరియుని కృతజ్ఞత 

యేసు సమరియా, గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి,  గొంతెత్తి, " ఓ  యేసు ప్రభువా! మమ్ము కనికరింపుము" అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి "మీరు వెళ్లి యాజకులకు కనిపింపుడు" అని చెప్పెను. వారు మార్గ మధ్యముననే  శుద్ధిపొందిరి. అపుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి, ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగివచ్చి, యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరియుడు. అపుడు యేసు "పదిమంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని  స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా?" అనెను. పిదప యేసు అతనితో "నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది. లేచి వెళ్లుము" అనెను. 

ఈ సువిశేష భాగంలో  కృతజ్ఞత, విశ్వాసం మరియు దేవుని కృపను గురించి చూస్తున్నాము. పది మంది కుష్టురోగులు అద్భుతమైన స్వస్థతను అనుభవిస్తున్నారు.    వారిలో ఒకరు మాత్రమే కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వస్తున్నారు. దేవుని యొక్క అనుగ్రహాలు  అనేక విషయాలలో పొందుతూనే ఉంటాము. కాని దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడములో మాత్రము విఫలం అవుతుంటాము. దేవుని దగ్గరకు వచ్చి  కృతజ్ఞత తెలియజేయుటము,  ఒక వ్యక్తిని  దేవునికి దగ్గర చేస్తుంది. దేవునితో సఖ్యత ఏర్పాటు చేస్తుంది. మరియు దేవునితో అనుభంధమును ఏర్పరచి మనలను ఆయనకు ఇష్టులను చేస్తుంది. 

విశ్వాసం మరియు విధేయత

పది మంది కుష్టు రోగులు యేసు ప్రభువునకు ఎదురయ్యారు, దూరంగానే ఉండి, ప్రభువా మమ్ము కరుణింపుము అని వేడుకుంటున్నారు. ప్రభువు  కరుణ మీద వారికి ఎంతో విశ్వాసం ఉన్నది. ఆయనకు తమ సమస్య తెలిపితే వారికి స్వస్థత దయచేస్తాడు అని వారు నమ్మారు.   యేసు ప్రభువు వారిని వెళ్లి  యాజకులకు తమను తాము చూపించుకోమని చెప్పినప్పుడు వారు వెళ్లిపోతున్నారు. యాజకుడు మాత్రమే  కుష్టు రోగంతో బాధ పడేవారిని స్వస్థత పొందిన తరువాత వారు స్వస్థులైన విషయాన్నీ ధ్రువీకరించగలరు. అందుకే యేసు ప్రభువు వారిని పోయి యాజకుడిని కలవమని చెబుతున్నారు. యేసు ప్రభువు ఇతర సమయాలలో వలె వారిని తాకలేదు. వెళ్లి యాజకుడిని కలవమని చెప్పాడు. వీరు మమ్ములను తాకమని అడుగలేదు. ప్రభువు మాటకు విధేయించి వెళుతున్నారు. ప్రభువు చెప్పినట్లు చేయగానే వారు మార్గ మద్యంలో ఉండగానే వారు స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ గమనించవలసినది,  ప్రభువు పొమ్మని చెప్పినవెంటనే వారికి  స్వస్థత కలుగలేదు, అయినప్పటికీ ప్రభువు చెప్పగానే వారు యాజకుని కలువడడానికి వెళుతున్నారు. ప్రభువు మాట  మీద వారికి ఉన్న నమ్మకం తెలియజేస్తుంది. ప్రభువు మాటను విధేయించడం ద్వారా వారు స్వస్థత పొందుతున్నారు. ప్రభువు మాటను మారు మాటాడకుండా   విధేయించిన తీరు ప్రభువు మాటకు వారు ఇచ్చిన గౌరవం మరియు ఆతని మీద ప్రగాఢమైన నమ్మకం తెలియజేస్తుంది.  వారి విధేయతకు తగినట్లే మార్గ మధ్యములోనే వారు స్వస్థత పొందుతున్నారు. 

సమరియుని ప్రత్యేకత 

అందరు స్వస్థత పొందుతున్నారు. కాని తనలో వస్తున్నా మార్పును గమనించగలిగినది ఒక సమరియుడు మాత్రమే. కృతజ్ఞత కలిగిన వారు ప్రభువు ద్వారా తమ జీవితంలో జరిగిన ప్రతి మార్పును గమనించగలుగుతాడు. కృతజ్ఞతచెల్లిస్తాడు. దేవుని అంతులేని అనుగ్రహాలకు పాత్రుడవుతాడు. యేసు ప్రభువునకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చిన వ్యక్తి కేవలం ఒక సమరియుడు మాత్రమే.యూదులు సమరియులతో ఏ పొత్తు ఉండకూడదు అనుకుంటారు. సమరియులు దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు అని వారిని దూరం పెట్టారు. వారిని విదేశీయులుగానే భావించేవారు. కాని దేవుడు అందరికి తన దయను కరుణను చూపిస్తూనే ఉంటాడు. మానవునిలా ఒకరిని దూరం పెట్టేవాడు కాదు ప్రభువు.  ప్రభువులోని ఈ గుణం మనం అనేక సార్లు చూస్తాము. సమరియును కృతజ్ఞత ప్రభువు తనకు చేసిన మేలును గుర్తు చేస్తుంది. అంతేకాక సమాజం తనను చూసిన విధంగా కాకుండా దేవుడు తనను నూతన సృష్టిగా చూస్తున్నాడు అన్న విషయం తనకు తెలుస్తుంది.  

యేసు ప్రభువు ఆ సమరియునితో పది మంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ? అని అడుగుతున్నాడు? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని అనుగ్రహాలు పొందుతాము కాని కృతజ్ఞత తెలుపుటకు మాత్రము  వెళ్లము. కృతజ్ఞత తెలుపడం అంటే  దేవున్ని స్తుతించటం. మన కృతజ్ఞత దేవుని మహిమను, కీర్తిని  వెల్లడి చేస్తుంది. అంతేకాక ఈ కృతజ్ఞత ఇతరులు ప్రభువును తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది. మనం దేవునికి చెల్లించే కృతజ్ఞత దేవుడు చేసిన మేలుకు సాక్ష్యంగా ఉంటుంది. 

 ప్రార్థన

కరుణామయుడైన ప్రభువా! మీ కరుణ అనంతం. ఎవరు మీ వద్దకు వచ్చి మిమ్ము కరుణించమని అడిగిన వారిని కరుణించారు. వారి జీవితాలలో లేమిని తీసివేసి వారికి కావలసిన వాటిని ఇచ్చి వారిని  సమృద్ధిగలవారీగా, బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా చేశారు. అనేకసార్లు నా జీవితంలో కూడా సాంఘికంగా, ఆర్ధికంగా, నైతికంగా బలహీనంగా ఉన్న సమయాలలో సమాజం కుష్టువానిని బయట పెట్టినట్లు, నన్నును బయట పెట్టిన నీవు కరుణచూపించావు. నన్ను హత్తుకొనుటకు సంకోసించలేదు. నేను నీకు చెందినవాడినని ధృవీకరించావు.  అయినప్పటికీ  మీరు చేసిన మేలును గుర్తించకుండ ఉన్నాను. ప్రభువా! మీ మేలును గుర్తించకుండా,  మీకు కృతజ్ఞత తెలప కుండా ఉన్న సందర్భాలలో నన్ను క్షమించండి. మీరు చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకొని, కృతజ్ఞత తెలియజేస్తూ, మీకు కీర్తిని,  మహిమను కలిగిస్తూ , మీ మేలులకు సాక్షులుగా జీవించేలా చేయండి. ఆమెన్. 

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం మొదటి పఠనము     సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29 రెండవ పఠనము      హెబ్రి 12 : 18-19-,22-24 సువార్త పఠనము      లూకా ...