15, నవంబర్ 2024, శుక్రవారం

అంత దినములు ఎలా ఉండును

 అంత దినములు ఎలా ఉండును 

లూకా 17: 26-37 

నోవా దినములయందు ఎట్లుండెనో, మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును. జల ప్రళయమునకు  ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమున కూడ జరిగినది. ప్రజలు తినుచు, త్రాగుచు, క్రయవిక్రయములు చేయుచు, సేద్యము చేయుచు, గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కాని లోతు సొదొమనుండి విడిచిపోయిన దినముననే ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపగా అందరు నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును. ఆ నాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందికి దిగిరాకూడదు. పొలములో  ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడకమీద ఉన్న యిద్దరిలో ఒకడు కోనిపోబడును. ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును. మరియొకరు విడిచి పెట్టబడును." "ప్రభూ! ఇది ఎక్కడ జరుగును?" అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరమున్న చోటనే రాబందులు చేరును" అని యేసు చెప్పెను. 

అంతదినములు ఎలా ఉండును? అని ప్రభువు ఈ సువిశేషభాగంలో  చెబుతున్నారు. ఒకసారి నోవా దినములను, లోతు దినములను గుర్తు చేస్తున్నారు. నోవా రోజులలో అందరు తినుచు త్రాగుచు ఉన్నారు.  అందరు వారి వారి రోజు వారి పనులలో నిమగ్నమై ఉండగా ఎటువంటి హెచ్చరిక లేకుండా, హఠాత్తుగా జలప్రళయము వచ్చింది, లోతు కాలంలో ప్రజలు వారి వారి పనులలో ఉన్నారు. ఆసమయంలోనే   ఆకాశం నుండి గంధకము వర్షించినది.  ప్రభువు రోజు ఎప్పడు మనకు ఇష్ఠమైనపుడు, మనం కోరుకున్నప్పుడు  రాదు.

 ప్రభువురోజు ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తుందా? ప్రభువు అనేక రోజులకు ముందుగానే హెచ్చరిస్తారు.  నోవా కాలంలో, మరియు లోతు కాలంలో కూడా  ప్రభువు ప్రజలను హెచ్చరించాడు.  అప్పటినుండి నోవా , లోతు ఆ రోజు కోసం సిద్ధపడ్డారు. నోవా  దేవుని ఆజ్ఞ ప్రకారం ఒక ఓడను తయారు చేసాడు. మిగిలిన ప్రజలు వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు కాని ప్రభువు మాటను పట్టించుకోలేదు.   నోవా మాత్రము వారితో  కలవకుండా తనకు దేవుడు చెప్పినట్లుగా  చేసాడు. జలప్రళయము వచ్చింది నోవా కుటుంబము మాత్రమే రక్షించబడింది. మిగిలిన వారు మాత్రము ప్రాణములను కోల్పోయారు. లోతు కాలములో కూడా ప్రభువు ప్రజలను హెచ్చరించాడు , కాని వారు చేసే పనులలోనే వారు ఆనందం వెదుకుకున్నారు . అందరు వారి వారి పనులలో నిమగ్నం అయిపోయారు.  లోతు కుటుంబము  మిగిలిన వారి వలే కాకుండా జీవించడం జరిగింది.  లోతు కుటుంబం రక్షించబడింది. 

దేవుడు మనలను హెచ్చరించినప్పుడు మనం సిద్ధపడాలి, అలా కాకుండా అంత సవ్యముగా ఉన్నది అనే అపోహలో ఉండి క్షమాపణ పొంది, రక్షించబడే అవకాశం కోల్పోతారు.  నోవా కుటుంబం రక్షించబడింది, కాని లోతు కుటుంబంలో అందరు రక్షించబడలేదు. లోతు భార్య దేవుడు చెప్పినట్లు చేయకుండా ఆ పట్టణమునకు ఏమి జరుగుతుందో చూడాలనుకుంది, వెనకకు తిరుగుతుంది. ఉప్పు స్థంభం వలె మారిపోతుంది. మన కుటుంబంలో దేవుడు ప్రేమించే వ్యక్తి ఉన్నంత మాత్రమున మన కుటుంబం మొత్తం రక్షించబడాలని లేదు. ప్రతి వ్యక్తి కూడా తాను పరివర్తన చెంది మారితే దేవుని అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. వారి కుటుంబంలో మంచి వారు ఉండటం కొంత వరకు మాత్రమే వారికి ఉపయోగపడుతుంది కాని వారి వ్యక్తిగత జీవితం కూడా ప్రభువు ఆజ్ఞలకు లోబడి ఉండాలి. 

ప్రభువుని రాక సమయంలో కూడా ఇలానే జరుగును అని దేవునివాక్కు చెబుతుంది. ఇది ప్రతి ఒక్కరు వారి వారి జీవితములను సరిచూసుకుని జీవించాలి. ఆ రోజు ఎవరు అయితే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు రక్షించబడతారు. ఎవరి జీవితం మరియొకరి జీవితం మీద ఆధారపడి ఉండదు. ఎవరి జీవితమునకు వారే బాధ్యత వహించాలి. ఇది భయపడే రోజు ఏమి కాదు, ప్రతి  నిత్యం సిద్దపడి ఉంటె అది ప్రభువు సాక్షాత్కారం అయ్యేరోజు. సరియైన సిద్ధపాటు లేకపోతే అది భయపడవలసిన రోజే అవుతుంది. 

సిద్ధపాటు 

ప్రభువు రాకడకు ఆయన అనుచరులు ప్రతి నిత్యం సిద్దమై ఉండాలి.  ఎందుకు  ప్రభువు రోజు కోసం ప్రతినిత్యం  అప్రమత్తముగాను, సిద్ధముగాను ఉండాలి అంటే ఆ రోజు ఎలా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందరు వారి వారి పనులలో ఉన్నప్పుడు, అప్రమత్తంగా లేనప్పుడు వస్తుంది. దేవుని ఆజ్ఞలకు ఎవరు అయితే బద్ధులై ఉంటారో వారికి అది ఎప్పుడు వచ్చిన భయ పడవలసింది ఏమి ఉండదు.  ఎందుకంటే వారు ఆ రోజు కోసం సిద్ధంగా ఉన్నారు. జలప్రళయము వచ్చినప్పుడు దేవుని మాట ప్రకారం జీవించిన నోవా కుటుంబం రక్షించబడింది, లోతు రక్షించబడ్డాడు. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే దానికి సిద్దపడటం. 

ప్రార్ధన : రక్షకుడవైన ప్రభువా! మీ రాకడకు నేను ఎప్పుడు సిద్ధముగా ఉండుటకు నోవా,లోతుల వలె మీ ఆజ్ఞలకు ఎప్పుడు బద్ధుడనై జీవించే విధంగా నన్ను మలచమని  వేడుకుంటున్నాను. నా జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకుండా మీ ఆజ్ఞలను నేర్చుకుంటూ, మీ మాటను పాటించుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. నా జీవితమును పవిత్రీకరించుకొనుటకు మీ అనుగ్రహాలు దయచేమని వేడుకుంటున్నాను. ఆమెన్ 


14, నవంబర్ 2024, గురువారం

లూకా 17: 20-25

దేవుని రాజ్యము 

దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది." యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "మీరు మనుష్యకుమారుని కాలములో ఒక దినమునైనను చూడగోరుదురు. కాని  మీరు చూడరు. ఇదిగో! అతడు ఇక్కడ ఉన్నాడు. లేక  అదిగో! అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు. కాని మీరు వెళ్ళవలదు. వారి వెంట పరుగెత్తవలదు. ఏలయన మెరపుమెరసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించునట్లు మనుష్య కుమారుని రాకడ ఉండును. ముందుగా  అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరమువారిచే నిరాకరింపబడవలెను. 

 దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది."పరిసయ్యులు అడిగిన ప్రశ్నలకు యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఇది. పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. లేదా యిస్రాయేలు ఎప్పుడు స్వతంత్ర రాజ్యాంగ అవతరిస్తుంది అని అడుగుతున్నారు.  యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం వారు కోరుకున్నది కాదు. కాని వారికి ఒక నూతన సత్యాన్ని ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. అది ఏమిటిఅంటే దేవుడు రాజ్యం కంటికి కనపడునట్లుగా రాదు. మరియు అది మీలో ఉన్నది అని ప్రభువు చెబుతున్నాడు. ఇది ఎందుకు కంటికి కనపడదు? దేవుని రాజ్యం అనుభవించాలి, అది ప్రభువు వద్ద నుండి క్షమాపణ పొందడం వలన, ఆయన ప్రేమను పొందడం వలన అనుభవిస్తుంటాం. దేవుని రాజ్యం బహ్యమైనది. అది అంతరంగికమైనది. అది మనలో ఉన్నది. నాలో మరియు నీలో ఉన్నది. నాలో ఉన్న ఆ దేవుని రాజ్యమును ఎలా అనుభవించగలం.

యేసు ప్రభువు దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని చెబుతున్నాడు. కాని ఎందుకు మనము దానిని అనుభవించలేకపోతున్నాము? మనము యేసు ప్రభువు క్షమా , ప్రేమ కరుణ అను గుణాలు మనలో లేకపోవడం వలన దేవుని రాజ్యమును అనుభవించలేకపోతున్నాము. యేసు ప్రభువు ప్రజలును దేవుని రాజ్యమునకు సిద్ధపరస్తూ మరు మనస్సు పొందమని, క్షమ, ప్రేమ, కరుణ గుణాలు కలిగిఉండమని చెబుతారు. ఇవి మానవుణ్ణి దేవుని రాజ్యం అనుభవించడానికి అర్హుడని చేస్తాయి. ఈ గుణాలు మనిషిని అంతరంగికంగా మారుస్తుంటాయి. నూతన జీవితం జీవించేలా చేస్తాయి.  దేవుని రాజ్యం అనుభవించేలా చేస్తాయి. ప్రభువు ప్రేమ కరుణ, క్షమ ద్వారా ఆయనను అనుభవించకుండా ఆయన అక్కడ ఉన్నాడు లేక ఇక్కడ  ఉన్నాడు అనే మాటలను నమ్మవద్దు అని ప్రభువు చెబుతున్నారు.

 ఎందుకు దేవుని రాజ్యము ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అని ఎవ్వడు చెప్పజాలడు అని ప్రభువు అంటున్నాడు. మరియు మనుష్య కుమారుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని మనుషులు అంటారు కాని మీరు వెళ్ళవద్దు అని ప్రభువు ఎందుకు చెబుతున్నారు. దేవుని రాజ్యము మనలో ఉంది కనుక దానిని ఇంకా ఎక్కడో వెదకనవసరం లేదు. మనలోనే దానిని పొందవచ్చుకనుక సంఘంలో, కుటుంబంలో మన మనసులో ప్రభువుని గుణాలు పెంపొందినప్పుడు దానిని అనుభవించగలుగుతాం. ప్రభువును, దేవుని రాజ్యమును వేరు చేసి చూడలేము. ప్రభువును పొందినప్పుడు మనము దేవుని రాజ్యమును కూడా పొందుతాము. ప్రభువును పొందటం అంటే సమస్తమును పొందటమే అది దేవుని రాజ్యమునుకూడా.  ప్రభువును చూచుట కొరకు ఎక్కడకు వెళ్లనవసరం లేదు, ఆయన మన మధ్యనే ఎప్పుడు ఉంటాడు. దివ్య సత్ప్రసాదంలో ప్రతిరోజు ఆయనను కలుసుకోవచ్చు. దేవుని వాక్కు ద్వారా  ఆయనను  కలుసుకోవచ్చు, ప్రేమను పంచుకొనుట ద్వారా ఆయనను కలుసుకోవచ్చు. మన ఆత్మలో ఆయనను కలుసుకోవచ్చు. 

ప్రభువును మనం ఆత్మలో ఎలా కలుసుకోవచ్చు? పునీత ఆవిలాపురి తెరెసామ్మ గారు దీని గురించి వివరిస్తూ దేవుడు మన ఆత్మలో ఆసీనుడై ఉన్నాడు. మన అంతరాత్మలోకి మనం ప్రవేశించినట్లయితే అక్కడ ఉన్న ప్రభువును కలుసుకోవచ్చు. కాని మనం ఆత్మలోనికి ప్రవేశించాలంటే చాలా ఓపికతో మరియు సాహసంతో కూడిన ప్రయాణం చేయాలి. మనలోనికి మనము ప్రవేశించే సమయంలో మన నిజరూపం మనకు తెలుస్తుంది కొన్ని సార్లు మనమీద మనకు ఏహ్యభావం కలుగవచ్చు ఎందుకంటే మనలో ఉన్న చెడు మనకు తెలుస్తుంది. వీటన్నిటి  తరువాత మన అంతరాత్మలో ప్రభువును కలుసుకోవచ్చు. కాని ఈ ప్రయాణంలో మనం అనేక ఆటంకాలు పొందవచ్చు. వాటిని అధిగమిస్తేనే ప్రభువును మనం కలుసుకోగలం. ఈ ప్రయాణము ప్రార్థన, వినయముతో పాటు విశ్వాసము,నమ్మిక ప్రేమ అను సుగుణాల ద్వారా కొనసాగించాలి. 

ప్రార్ధన: ప్రభువా! మీరు మా మధ్యలో ఉన్నారు అనే విషయాన్ని అనేకసార్లు మర్చిపోయి మిమ్మును ఎక్కడెక్కడో వెదకడానికి ప్రయత్నిస్తున్నాను. మిమ్మలను కలుసుకొనుటకు మీరు మాకు ఎప్పుడో మార్గమును చెప్పారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుటను చూచి మీరు నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది అని మీరు చెప్పారు. మీ ప్రేమను వ్యక్త పరచడం, మీ కరుణను చూపడం ద్వారం మీ క్షమను పంచడం  ద్వారా మిమ్ములను  కలుసుకోవచ్చు అని తెలుసుకున్నాము అలా జీవించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ప్రభువా మీరు నాలో ఉన్న విషయాన్ని తెలుసుకొని మిమ్ములను కలుసుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ సుగుణాలను అలవరుచుకొని మీ రాజ్యములో పాల్గొనుటకు అర్హులను చేయండి. ఆమెన్ 

యేసు ప్రభువుని వ్యక్త పరచుట- శిష్యుల కర్తవ్యం

  యోహాను 13: 16-20 దాసుడు తన యజమానునికంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుక...