4, డిసెంబర్ 2021, శనివారం

ఆగమన కాలం రెండవ ఆదివారం (2)

 ఆగమన కాలము 2వ ఆదివారము (2)

బారుకు 5:1-9, పిలిప్పీ 1:4-6,8-11, లూకా 3:1-6 

నేటి దివ్య పఠనాలు దేవుని రాకకు మార్గమును సిద్ధపరచుట గురించి భోదిస్తున్నాయి. మన హృదయములో దేవునికి రాజమార్గమును సిద్ధపరచాలి. మన హృదయములో అయన ప్రయాణము చేయాలంటే మనము మార్గము సిద్దము చేయాలి. గమ్యము చేరుటకు ప్రతి మార్గము ముఖ్యం. దేవుడు మానవ హృదయము అనే గమ్యము చేరాలంటే మనయొక్క జీవిత మార్గము సరిగ్గా ఉండాలి. మన యొక్క జీవిత ప్రయాణములో ఎన్నో రకాలైన మార్గాలు మనము చూస్తున్నాము. ఇరుకైన మార్గము, సులువైన మార్గము, గుంతలతో ఎత్తుపల్లాలతో ఉన్న ఎన్నో మార్గాలను చూస్తుంటాము. అయితే గమ్యమునకు చేరవేసే మార్గము ఎలాంటిది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి. దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించాలన్నా, లేదా దేవుడు మన రాజ్యములోనికి ప్రవేశించాలన్నా నీతిమంతమైన, దైవభయము కలిగిన మార్గమును అనుసరించాలి. ఈనాటి మొదటి పఠనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బబులోనియా నుండి యెరూషలేము వెళ్ళుటకు మార్గము సిద్దము చేస్తున్నారు. యిర్మీయా ప్రవక్త యొక్క స్నేహితుడు, శిష్యుడైన బారూకు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఒక శుభవచనములు తెలియజేస్తున్నారు.

యూదా రాజ్యము పతనమై యూదులంతా బబులోనియాకు బానిసలుగా ఈడ్చుకుని పోబడిన సమయములో అనేక విధాలుగా వారు శ్రమలు అనుభవించారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అనే ఎదురు చూసేవారు. దేవుని యొక్క సీనాయి ఒప్పందమును నిరాకరించినందుకు ఈ దురదృష్ట స్థితి అని భావించేవారు. ఈ సమయములో దేవుడు వారి మనవులను ఆలించి వారికి బారూకు ప్రవక్త ద్వారా ఒక శుభవార్తను తెలియపరుస్తున్నారు. బారూకు 5:1 వ వచనము చాల సంతోషమునిచ్చే వాక్యము.

1.        మనము ధరించే వస్త్రములు మన శరీరమును కప్పి వేస్తాయి. బారూకు ప్రవక్త అంటున్నారు, మీ మనస్సులను కప్పివేసిన విచారమును, మీ హృదయములను కప్పివేసిన చింతలు, బాధలు అన్నింటిని తొలగించండి. దేవుని మీరు మీ స్వంత భూమిలో ఆరాధించే సమయము రాబోతుంది. బానిసత్వములో మ్రగ్గుతున్న ప్రజల యొక్క జీవితాలు ఎప్పుడు కూడా బాధతో, భయముతో, అధైర్యముగా ఉంటాయి. ఎప్పుడు ఏమి జరుగునో తెలియదు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవించాలి. అలా హీనస్థితిలో ఉన్న ఇశ్రాయేలుకు దేవుడు బారూకు ద్వారా తెలిపిన మాటలు, ఇక ఎలాంటి విచార వస్త్రములు ధరించవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడే మీకు సంతోష వస్త్రమును ఇవ్వబోతున్నారు. దైవ భయము అనే శాశ్వత సౌందర్యమును ధరించుము అని అంటున్నారు. మన జీవితములో అందమునకు చాల ప్రాముఖ్యతను ఇస్తుంటాము. ఇక్కడ ప్రవక్త శాశ్వత సౌందర్యమును గురించి మాట్లాడుతున్నారు. దైవ భయం అనే వస్త్రంను ధరించే ముందు మనం స్వార్ధం,పగ ,ద్వేషం , అసూయ అనే వస్త్రాన్ని తీసివేయాలి. అప్పుడే మనం దైవ బీతి అనే వస్త్రాన్ని ధరించగలం. 
2.      దైవ భయము అనే వస్త్రము ధరిస్తే, అలాగే దైవ ప్రేమ కలిగి, విశ్వసనీయత కలిగి ఉంటే వారిలో ఎల్లప్పుడూ కూడా సంతోషమే కలుగుతుందని తెలుపుచున్నారు. ఈ దైవ భయము అనే శాశ్వత సౌందర్యమునకు ప్రాముఖ్యతనిస్తే అది చిరకాలము ఉంటుంది.
 
·         దైవ భయము ఉంటే దేవునికి విధేయులై జీవిస్తారు.
·        దైవ భయము ఉంటే అన్య దైవములను ఆరాధించరు.
·         దైవ భయము ఉంటే ఆజ్ఞలు పాటిస్తారు.
·         దైవ భయము ఉంటే దేవునికి సన్నిహితముగా జీవిస్తారు.
·         దైవ భయము ఉంటే పాపములో పడిపోరు..


            అందుకే ప్రవక్త దైవ భయము అనే శాశ్వత సౌందర్యమును ధరించమని పలుకుచున్నారు. అందం అసలయితే నశించిపోతుంది కానీ, దైవభయము ఉంటె శాశ్వత సౌందర్యము ఉంటుంది అనగా వారిలో కొరత ఉండదు, సంతోషమే ఉంటుంది.

3.       దేవుని యొక్క నీతి వస్త్రమును ధరింపుము అని అంటున్నారు. దేవుని యొక్క పవిత్ర వస్త్రమును ధరింపమని ప్రవక్త తెలియపరుస్తున్నారు. దేవుని నీతి వస్త్రము అంటే అయన యొక్క జీవితమునే మనము ధరించాలి. ఎఫెసీ 6:11 దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించమని పలుకుచున్నారు. అది ఎప్పుడు మనకు తోడుగా ఉండి మనలను అభివృద్ధిపరుస్తుంది.

రెండవ పఠనంలో పౌలుగారు పిలిప్పీయుల పట్ల వ్యక్త పరిచే ఆనందం గురించి వింటున్నాం. ఇక్కడ రెండు విషయాలు మనం అర్ధం చేసుకోవాలి. 

1. పిలిప్పీ క్రైస్తవులు ఎలాగున పౌలు గారికి తన యొక్క  సువార్త  ప్రచారంలో సహాయం చేశారన్న అంశం. 

2. పిలిప్పీ క్రైస్తవుల కోసం చేస్తున్న ప్రార్ధన. 

పిలిప్పీ క్రైస్తవులు  పౌలు గారి యొక్క  సేవకు ధన సహాయం చేస్తూ సువార్త కృషిలో ఆయనకు భాగస్వాములుగా వున్నారు. (1:5).  తన యొక్క దేవుని కార్యంలో పాలు పంచుకొనిన వారికి ఆయన కృతజ్ఞత తెలుపుచున్నారు. వారి పట్ల ప్రేమను, సంతోషమును వ్యక్త పరుస్తున్నారు. అదే విధంగా వారికోసం ప్రార్ధిస్తున్నారు. 

పౌలు గారు చక్కగా అంటున్నారు "మీకు నా హృదయమందు ఎప్పుడు స్తానం ఉందని చెబుతున్నారు. (1:7) 

ఆయనకు ఎంతగానో  వారు సహకరించి ఉంటేనే పౌలు గారు ఇంతటి గొప్ప మాటలు పలుకుచున్నారు. ఆనాటి పిలిప్పీ క్రైస్తవులు పౌలుగారిని ప్రేమించే వారు , గౌరవించేవారు ,ఆదరించేవారు. ఆయన యొక్క కష్ట కాల సమయములో వారు అండగా నిలబడ్డారు. దేవుని రక్షణ కార్యంకు సహకరించినందుకు వారి కోసం ప్రార్ధిస్తున్నారు. మనల్ని ప్రేమించి ,మంచి చేసే వారిని ఎప్పుడు కూడా మనం గుర్తించుకొని వారికి ఎప్పుడు కూడా మన హృదయంలో చోటిస్తాం. పౌలు గారికి మంచి చేసి, సహకరించిన పిలిప్పీ క్రైస్తవులకు తన హృదయంలో చోటిచ్చారు. 

ఈనాటి సువిశేష పఠనంలో బాప్తిస్మ యోహాను గారి యొక్క బోధనలు వింటున్నాం. దేవునియొక్క రాకడకోసం అయన ప్రజలను అయన తయారు చేసే విధానం గురించి వింటున్నాం.

  దేవుడు ఎన్నుకొన్న ప్రవక్త ప్రజలయొక్క జీవితములో దేవునియొక్క వెలుగును నింపుటకు అదేవిధంగా దేవునియొక్క రాకడ కోసం ప్రజలయొక్క హృదయాలను సంసిద్ధం చేస్తున్నారు. దేవుడిని మన హృదయములోకి ఆహ్వానించాలంటే, హృదయ పరివర్తన అవసరం. హృదయ పరివర్తన ద్వారా మన మనస్తత్వం మార్చుకోవాలి. హృదయ పరివర్తనం క్రొత్త జీవితానికి నాంది. మనం హృదయ పరివర్తన చెందితేనే క్రీస్తుతో క్రొత్త జీవితం ప్రారంభించవచ్చు.

     బాప్తిస్మ యోహానుగారు తన ప్రజలకు హృదయ పరివర్తనం చెంది బాప్తిస్మము పొందమని చెబుతున్నారు. ప్రజల జీవితాలు పాపములో వున్నప్పుడు, అవిధేయతతో వున్నప్పుడు, అవిశ్వాసముతో వున్నప్పుడు ప్రవక్త వారిని హృదయ పరివర్తనం చెంది, పాపక్షమాపణ పొందమని ఆహ్వానిస్తున్నారు. ఆయన యొక్క భోధన "ప్రభువు మార్గమును సిద్దము చేయుడు," అయన త్రోవను సరిచేయుడు అని పలికెను.

      దేవునికి మన మార్గం సిద్ధం చేయాలి. అయితే ఇంతకీ దేవుని మార్గం ఏది?

         - దేవునియొక్క మార్గం ప్రేమమార్గం 
        - దేవునియొక్కమార్గం క్షమించేమార్గం.
         - దేవునియొక్క మార్గం కరుణ చూపే మార్గం
        - దేవునియొక్క మార్గం సేవచేసే మార్గం.
        - దేవుని మార్గం రక్షణ మార్గం.


      దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించే సమయములో వారికి ఇవన్నీ చూపించారు. ప్రజలు దేవుని యొక్క విశాలమైన మార్గమును అర్ధం చేసుకోలేదు. దేవునికోసం మన మార్గం సిద్ధం చేయాలంటే అయన ప్రేమను, క్షమను, సేవను మనందరమూ కూడా పాటించాలి. ప్రభు మార్గాన్ని సిద్ధం చేయటమంటే క్రొత్త జీవితాన్ని ధరించటమే. ఇప్పటి వరకు మనం వేళ్ళ స్వార్ధ మార్గం విడిచిపెట్టి దేవుని మార్గమును అనుసరించాలి. ఒకరు తమయొక్క పాపపు స్థితిని తెలుసుకొని జాగ్రత్తగా ఉండటమే రక్షణకు ప్రారంభము . లాతిను భాషలో ఒక సామెత ఈ విధంగా ఉంది, ఒకరు తమ పాపాలను సమర్ధించుకోకుండా, తన పాపాలను అగీకరించినపుడు వారు దేవుని ఎదుట నీతిమంతులు అవుతారు. నాతాను ప్రవక్త దావీదు చేసిన పాపాలు చెప్పినప్పుడు దావీదు మహారాజు అంగీకరించారు.అందుకే దేవుని ఎదుట అంగీకరించబడ్డాడు. తన లోపాలు ఎప్పుడూకూడా గుర్తించుకున్నారు - (కీర్తన:51 :3 ). మనం కూడా దేవుని యొక్క మార్గములో నడిస్తే,తప్పనిసరిగా మనందరిలో దేవుని జీవితం ప్రారంభమవుతుంది.బాప్తిస్మ యోహానుగారు దేవుని మార్గంలో వున్న సవరణ గురించి తెలుపుచున్నారు. ఎలాగ దేవుని మార్గమును మన జీవితములో సిద్ధపరచాలి అన్నది ధ్యానించుకోవాలి.   
సువిశేషములో 5 వ వచనంలో యోహానుగారు అంటున్నారు,
1.    ప్రతి లోయ పూడ్చబడును:
 లోయలు ఎప్పుడు కూడా క్రిందకువుంటాయి. అనగా వినయముతో జీవించే విశ్వాసులను దేవుడు తన యొక్క దీవెనలతో నింపుతాడు. దేవుని కొరకు విశ్వాసముతో ఎదురుచూసే వారందరియొక్క హృదయాలు నింపబడతాయి. మన హృదయములో, జీవితములో వున్నా లోయలు పూడ్చబడాలంటే,మనలో వినయము, విశ్వాసము ఉండాలి. అప్పుడే మనలోకి దేవుని ఆత్మ వస్తుంది.
 2.పర్వతాలు, కొండలు చదును చేయబడాలి:
పర్వతాలు, కొండలు ఎత్తునకు గుర్తు. మన జీవితములో కూడా కొని సార్లు మనం ఎత్తున జీవిస్తాం .
 - అహం అనే ఎత్తున.
 -స్వార్ధం అనే ఎత్తున. '
- క్షమించలేకుండా జీవించే ఎత్తున ఉంటాం.
     మనలో వున్న అహంను అణచి వేయాలి. స్వార్ధమును అణచివేయాలి.అప్పుడే అవి ప్రభువును ఆహ్వానించడానికి ఎంతో సహాయపడతాయి. మనజీవితములో ఉన్నతస్థాయిలో వున్నప్పుడు మనమే గొప్ప అనే భావనలో ఉంటాం కానీ, దేవుడు అన్నీ కూడా సమము ఇయ్యబడును అంటున్నాడు. అప్పుడు ఎటువంటి భేదములు వుండవు.  - పేద- ధనిక భేదములు వుండవు.
               - అన్యులు- యూదులు అని భేదములు వుండవు.
                -పాపి- నీతిమంతుడు అని భేదములు వుండవు.
అందరూ కూడా దేవుని దృష్టిలో సరిసమానులే, అందరూ దేవుని బిడ్డలే అనే భావన మాత్రమే ఉంటుంది.
3. వక్రమార్గములు సక్రము చేయబడును:  
       వక్రమార్గములు అంటే, సొంతలాభాముకోసం అనుసరించే మార్గం. స్వార్ధముతో జీవించే మార్గాలు, దేవుని చిత్తానికి వ్యతిరేఖంగా జీవించే మార్గములు. ఇంకొన విధముగా చెప్పాలంటే, అడ్డదారులు, అవినీతితో కూడిన మార్గాలు విడనాడి సక్రమముగా నీతితో జీవించాలి. మన జీవితములో కూడా చాలా వక్రమార్గాలను వెంబడిస్తున్నాము. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, అలాగే  తల్లి దండ్రులకు తెలియకుండా పిల్లలు వక్రమార్గాలు అనుసరిస్తున్నారు. అవన్నీ కూడా దేవుని రాకడ కోసం సక్రమము చేయబడాలి. సక్రమంగా చేయబడాలి అంటే,దేవుని యొక్క అనుగ్రహముతో వ్యక్తిగతముగా ప్రయత్నించాలి.
 4.  కఱుకుమార్గం నునుపు చేయబడును: 
        ప్రతియొక్కరియొక్క జీవితములో కఱుకు మార్గాలుంటాయి. ద్వేషం అనే కఱుకులు.అసూయ, పగ, కోపం,పాపం,స్వార్ధం అనే కఱుకులు, అసమానతలు,బలహీనతలు ఉంటాయి. వాటిని దేవుని యొక్క సుగుణాలు పాటించుటద్వారా నునుపు చేసుకోవాలి.
ఎవరైతే ప్రవక్తయొక్క మాటలను ఆలకించి దేవునికోసం తన జీవితములో మార్గాలను సిద్ధం చేసుకుంటారో వారిలోకి, వారి హృదయం అనే గమ్యంకు దేవుడు చేరతాడు. బాప్తిస్మ యోహానుగారి భోధన అనేకమంది జీవితాలను దేవునిరాకకోసం సిద్ధం చేసింది. ఈనాడు మనకు  భోధింపబడుచున్న భోధన ద్వారా మన జీవితాలను ఎలా మనం సిద్ధం చేసుకుంటున్నాం.  సిద్ధం చేయుట గురించి పవిత్ర గ్రంధం చాలా సార్లు బోధించింది. ఆమోసు :4 :12, హోషేయ :10:12, యవేలు:2:12-13,మత్తయి :24:44,మార్కు : 13:35.  
      ఈయొక్క ఆగమన కాలములో, దేవుని రాక కోసం మన హృదయాలను ఎలాగ చేసుకుంటున్నాం. చేసుకుంటున్నాం. 
    మంచి కార్యాలు చేస్తున్నామా? ప్రేమను పంచుతున్నామా? క్షమిస్తున్నామా?దేవుని వాక్యం చదివి వాక్యం ధ్యానిస్తున్నామా?
   వ్యక్తిగతముగా మనం ఎలాగ సిద్దపడుచున్నాము అని మనం ధ్యానించుకొని, మన జీవితాలను మార్చుకొని దేవుని రాకడ కోసం మార్గమును సిద్ధం చేద్దాం. 
Rev.Fr. Bala Yesu OCD
 

    


ఆగమన కాలము 2వ ఆదివారము

 
ఆగమన కాలము 2వ ఆదివారము

బారుకు 5:9,

ఫిలిప్పీ 1:4-6,8-11,

లూకా 3:1-6

క్రీస్తు నాధుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి అయిన తిరుసభ ఈరోజు మనలను 2వ ఆగమన కల ఆదివారములోనికి ఆహ్వానిస్తూ, మనలను ఒక్కసారి మనము చేస్తున్న పనులను ఆపి, మనము పయనించే దారి ఎటువైపునకు సాగుతుందో చూసి, దానిని చక్కబరిచి, నూత్నీకరించి మన ప్రయాణాలను కొనసాగించమని కోరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనలను ఆంతరంగీకముగా ప్రయాణము చేయమని అడుగుతుంది.

ఆగమన కాలము అనేది దేవుని రాకను గురించి ఎదురుచూడడమొక్కటే కాదు, మనలను పరిశీలించుకుని, మన తలంపులు,మాటలు, చేతలు, చూపులు ఎటువైపు మరలుతున్నాయో అని గమనించుకుని, వక్రమైన దానిని సక్రమొనర్చుకుని, ముందు మనలను మనము అర్ధము చేసుకుని, అంగీకరించిన యెడల మాత్రమే మన మనసులో దేవునికి మరియు అతని రాజ్యానికి చోటు ఉంటుందని తెలుసుకునే కాలము. ముందు మన గమ్యము మనకు తెలిస్తే, మన ప్రయాణము ఎటువైపునకు సాగాలో మనకు తెలుస్తుంది. గమ్యము తెలియని ప్రయాణము వ్యర్ధము. క్రైస్తవులుగా, క్రీస్తులో భాగస్వామ్యులమైన మనము ఈ ఆగమన కాల 2వ ఆదివారములో మన ప్రయాణాలను ఎడారి వైపునకు మళ్లిద్దాము. ఎడారి అనేది ఒక నిర్జన ప్రదేశము. పూర్వము ఋషులు, సాధువులు ఎడారిని తమ ధ్యానమునకు తగు స్థలమని అక్కడే తమ జీవితాలను గడిపి తమలో ఉన్న దైవీక శక్తిని, మానవ శక్తిని ఐక్యపరిచి ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకుని వాటిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ రోజు మనము మన ప్రయాణాన్ని ఈ ఎడారి వైపునకు మళ్లించి మన ఆంతరంగిక ప్రయాణాన్ని తేజోమయము చేయడానికి సంసిద్ధపడుదాము.

ఈరోజు దివ్య పఠనాలలో బారూకు ప్రవక్త, మరియు లూకా సువార్తికుడు ఈ ఎడారిని గూర్చి ప్రస్తావిస్తున్నారు. మొదటి పఠనము అయిన బారూకు గ్రంధము, యూదులు బబులోనియా దేశమునకు వలసకు పోయిన కాలములో వ్రాయబడినది. ఎంతో ఆడంబరముగా, ఆనందముగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు బబులోనియాకు వలసకు పోవలసివచ్చింది. యూదులు ఇతర దేశ ప్రజల మధ్య పలు భాదలు పొందవలసి వచ్చింది. అయితే ఇదే సమయములో యిర్మీయా ప్రవక్త కార్యదర్శియైన బారూకు ఈ గ్రంధమును వ్రాసి యూదులకు, యూదులకు అనగా ప్రత్యేకించి దేవునిచే ఎన్నుకొనబడినవారికి ధైర్యము చెప్తూ ముందుకు సాగమని ప్రబోధించాడు. "యెరూషలేమూ! నీవు విచార వస్త్రములను తొలగించి దైవ వైభవమనెడు శాశ్వత సొందర్యమును ధరింపుము. నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము. (బారూకు 1:2) ఒక ఆనందకరమైన వార్తతో, ఉత్తేజింపజేసే పలుకులతో బారూకు యూదులకు భోదిస్తున్నాడు. ఈ ప్రవచనాలు, ఊరడింపు మాటలు కావు. ఈ ప్రవచనాలు దేవుని మహిమను వెల్లడి చేసే మాటలు, గత వైభవాన్ని పొందబోతున్నారని ధైర్యపరిచే మాటలు. తమను సృష్టించిన దేవుడు వారితో ఉండబోతున్నారు. గత వైభవమును ఇంకా అధికము చేసి దానిని ప్రపంచ జనులందరకు చూపించాలనే అయన కోరిక. శత్రువులు నడిపించుకొనిపోయిన, యెరూషలేము బిడ్డలను మరల వారు రాజవైభవముతో జనులు మోసుకుని వచ్చుచున్నారు. ఇక్కడ మనము గమనించవలసిన విషయమేమిటంటే యెరూషలేము ప్రజలు బబులోనియాకు ఎడారి గుండా పయనించి, మరల ఎడారి గుండా ప్రయాణము చేస్తారు. వారు ఈ ఉత్తేజకరమైన మాటలను వినగలిగింది ఈ ఎడారి ప్రయాణములోనే.

తన ప్రజలను రక్షించగల దేవుడు ఎందుకు వారిని పరుల ఉచ్చులో చిక్కుకోనిచ్చారు? అనే సందేహము మనలో మెదల వచ్చు. కానీ మనము పరిశీలించి చూస్తే దుఃఖం తరువాత ఆనందము, బాధ తర్వాత సంతోషము, పరాజయము తర్వాత విజయము కచ్చితంగా వస్తాయని మనము అర్థమవుతుంది. కానీ మన దుఃఖ సమయములో మన ఆలోచనలు, చేతలు ఎటువైపునకు పోతున్నాయో గమనించుకోవాలి. మన బాధ సంతోషముగా మారాలంటే మనము ఏమి చేస్తున్నామో, ఏమి చెయ్యాలో మనకు తెలియాలి. పరాజయము పొందిన తర్వాత విజయము సాధించడానికి ఎంత మనోధైర్యము, కృషి, దేవుని యందు గట్టి విశ్వాసము ఉండాలో మనకు అర్ధం కావాలి. మన చేతికి ఏమి ఉచితంగా రాదు. దుఃఖమైనా, ఆనందమైనా మన చేతులలోనే ఉంది. ఎందుకంటే నిన్ను, నన్ను సృజించిన ఆ దేవుడు పూర్తి స్వతంత్రమును మనకు యిచ్చియున్నాడు. మనము చేయవలసినది ఒక్కటే. మనము ఏ మార్గమును ఎంచుకుంటున్నాము? ఏ విధముగా ప్రయాణిస్తున్నాము? మన ప్రయాణములో ఆ దేవునికి ఎంత స్థానము కల్పిస్తున్నాము? ఇవన్నీ మనము పరిశీలించుకోవాలి. ముందుగా మనము ధ్యానించిన విధముగా "గమ్యము లేని ప్రయాణము వ్యర్ధము" మన గమ్యము మనకు తెలిసిన యెడల ప్రయాణములో ఎన్ని బాధలు, అడ్డంకులు వచ్చినా కూడా వాటిని సానుకూలంగా మార్చగల దేవుడు మన దగ్గర ఉన్నాడని జ్ఞాపక పరచుకుంటాము.

అలాగే ఈ రోజు సువిశేషమును చూసుకున్నట్లయితే, బాప్తిస్మ యోహాను యొర్దాను నదీ పరిసర ప్రదేశములందంతట సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తనం చెంది, బాప్తిస్మము పొందవలెనని ప్రకటించుచుండెను. యోహాను భోద చేస్తున్నది దేవాలయములో కాదు, పట్టణ ప్రాంతములో కాదు, రాజ భవనాలలో కాదు, కానీ ఎడారి ప్రాంతములో యొర్దాను నదీ ప్రదేశములో. గతకాలములో ఐగుప్తునకు వలసపోయిన ఇశ్రాయేలీయులు ఏ విధముగా తమ దేవుని తెలుసుకున్నారో, ఏ విధముగా వెనకకు తీసుకురాబడ్డారో, ఈ ఎడారి ప్రాంతములో వాళ్లలో జరిగిన ఆంతరంగిక మార్పును మరల, లూకా వ్రాసిన శుభావార్తలో ఈ రోజు మనము వినిన యోహాను బోధనా స్థలము, మరల మనకు ఒక సందేశాన్ని అందిస్తుంది. "ప్రభువు మార్గమును సిద్ధమొనర్పుడు, అయన త్రోవను తీర్చిదిద్దుడు" అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. (లూకా 3:4)

ప్రభువు మార్గమును సిద్ధమొనర్చడానికి, అయన త్రోవను తీర్చిదిద్దడానికి, మనలను మనము సరిచేసుకోవాలని, మారు మనస్సు పొందాలని, దేవుని మార్గాన్ని అవలంబించాలని, బాప్తిస్మము పొందాలని యోహాను ఎడారిలో భోద చేసారు. ప్రవక్తగా యేసును ఈ లోకమునకు యోహాను పరిచయము చేసారు. మార్గమును సిద్ధపరచాలి అంటే ముందు ఆ మార్గము ఎటు వైపునకు దారి తీస్తుందో మనకు తెలిసి ఉండాలి. త్రోవను తీర్చి దిద్దాలి అంటే, ముందుగా ఆ త్రోవ ఎంతమందికి ఉపయోగకరంగా మారుతుందో తెలిసి ఉండాలి. ఇలా తెలిసి ఉండటం ఒక్కటే కాదు, అది ఎలా చెయ్యాలో కూడా ఎరిగి ఉండాలి. ఇవన్నీ చేయడానికి మన బుద్ధి బలము, మన కండ బలము ఒక్కటే కాదు గానీ, దేవుని శక్తి, ఆయన కృప అవసరము. ఈ అధునాతన ప్రపంచములో మనలను మనము తెలుసుకోవాలంటే మనము చేసే పనులను ప్రక్కనపెట్టి, మన కోసము మనము సమయము కేటాయించుకుని, ఈ ఎడారి అనే నిర్జన ప్రదేశములో అడుగుపెట్టి మనసును కేంద్రీకరించినచో, మన గమ్య స్థానము మనకు తెలుస్తుంది. అప్పుడు మనము ఆ దేవుని త్రోవను సిద్దపరిచే సైనికులమవుతాము.

Br. Putti Kiran OCD

27, నవంబర్ 2021, శనివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం

 

ఆగమన కాలం  మొదటి ఆదివారం

యిర్మియా 33:14-16, 1 తెస్స 3:12-4:2 లూకా 21:25-28,34-36

నేడు మనం దైవార్చన క్రొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఆగమన కాలం క్రీస్తు ప్రభువు యొక్క రాకడ  కోసం ఎదురు చూసే కాలం. దేవుని యొక్క జన్మం మనందరి  యొక్క  హృదయాలలో ప్రత్యేకంగా జరగాలని  మనం ఆధ్యాత్మికంగా తయారయ్యే కాలం, ఈ యొక్క ఆగమాన కాలం. ఆగమన కాలం మన జీవితాలను , ఆత్మలను శుద్ది చేసుకునే కాలం. ఈ నాటి దివ్య పఠనాలు మన అనుదిన జీవితంలో ప్రభుని ఆగమనాన్ని గమనించుకొని ఆయన యొక్క రాకడకు సిద్దపడవలసినదిగా తెలియ చేస్తున్నాయి. ఈ యొక్క ఆగమన కాలంలో  దేవుని యొక్క రాకడను గురించి మనం ధ్యానించుకోవాలి. ఆయన యొక్క రాకడ అనేక విధాలుగా ఉంటుంది.

1.     ఆయన యొక్క జన్మ ఒక విధమైన రాకడ (క్రిస్మస్)

2.   ఆయన యొక్క రెండవ రాకడ-పునరుత్తానుడైన క్రీస్తుగా

3.   దివ్య సత్రప్రసాదంలో ఆయన యొక్క రాకడ – ప్రతిసారీ ఈ దివ్య సంస్కారం స్వీకరించినప్పుడు క్రీస్తువు మన లోనికి వేంచేస్తారు.

ఆగమన అంటే వేచియుండే కాలం, క్రీస్తు ప్రభువు కోసం ఎదురు చూసే కాలం.

ఈనాటి మొదటి పఠనంలో యిర్మియా ప్రవక్త రక్షకుడైన ప్రభు యేసు రాకడను గురించి తెలుపుచున్నాడు. . ప్రజలు  దేవుని మరచి , తన ఆజ్ఞలను మీరిన కాలంలో దేవుని యొక్క శిక్షను అనుభవించిన తరువాత దేవుడు వారికి సంతోషకరమైన వార్తా తెలియ చేసారు ప్రవక్త ద్వారా. దేవుని యొక్క ప్రజలను నడిపించే రాజులు కూడ దేవుని ప్రవక్త అయిన యిర్మియా మాటలు  వినలేదు. అందుకే శిక్ష అనుభవించారు. యిస్రాయేలు , యూదా ప్రజలు దేవుడిని విస్మరిస్తూనే ఉన్నప్పటికీ, కరుణ గల దేవుడు వారిని రక్షించడానికి దావీదు వంశం నుండి ఒక రాజును ఎన్నుకొంటానన్నారు.

ఆ రాజు నీతి కలిగిన రాజు, ఆయన అందరి ప్రజలకు న్యాయం చేకూర్చే రాజు. ఆయన ప్రజలకు  చేసిన ప్రతి ప్రమాణమును నిలబెట్టు కొనును. దేవుడు ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చారు. దేవుడు అబ్రహముకు ప్రమాణం చేశారు, తనను ఆశీర్వదిస్తాను అని దానిని నెరవేర్చారు. ఆది 12:1-3.

దేవుడు ఇస్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి కాపాడుతానని ప్రమాణం చేశారు -దానిని నిలబెట్టుకున్నారు. నిర్గమ 3:7-8.

దేవుడు వారిని (తన ప్రజలను) ఆదుకుంటానని  ప్రమాణం చేశారు -యోషయా 43:5-7, దానిని నెరవేర్చారు. దేవుడు రక్షకుని పంపిస్తానని ప్రవక్తల ద్వార తెలియచేసారు, ఆయన క్రీస్తువుగా మన మధ్యలో జన్మించారు.

ఆనాడు యావే దేవుడు ప్రజలకు చేసిన ప్రతి ప్రమాణము క్రీస్తు యొక్క జన్మ ద్వార నెరవేరింది

క్రీస్తు ప్రభువు తన ప్రజలను ఆశీర్వదించారు. ప్రజలకు నేను మీకు తోడుగా ఉంటానని నమ్మకం ఇచ్చారు. మత్తయి 28:20 . వారి పక్షమునా న్యాయం కోసం పోరాడారు. ప్రజలకు నీతిని, న్యాయమును, ధర్మమును తెలియ చేసారు. రక్షకుడు వచ్చేకాలం, యూదా రక్షణం పొందును అని ప్రవక్త తెలుపుచున్నాడు. ఆయన ద్వారానే అందరం రక్షించబడతాం. వాస్తవానికి యిర్మియా ప్రవక్త దేవుని  యొక్క సంతోషకరమైన వార్తను ప్రజలకు  అందిస్తున్నారు. ఎన్నో సంవత్సరములనుండి ఎదురు చూస్తున్న, దావీదు  యొక్క వారస రాజు త్వరలోనే వస్తాడని ఎదురు చూస్తున్నారు. దావీదు వంశం నుండి రాజులు వచ్చారు, కానీ ఎవ్వరూ కూడా దావీదు వలె పరిపాలన చేయలేదు. కాని దేవుడు మరలా తన కుమారున్నీ దావీదు వంశం నుండి జన్మించేలా చేస్తున్నారు.

ఆయన నీతి గల కొమ్మ, ఆయనలో  ఎటువంటి అసత్యం లేదు. అ ధర్మం లేదు, అవినీతి లేదు, పాపం లేదు. ఆయన నిష్కళంకమైన గొర్రె పిల్ల, పరిశుద్ధుడైన దేవుడు , ప్రజలకు ధర్మమును , తండ్రి ప్రేమను తెలియచేసే ప్రియమైన కుమారుడు. దావీదు యిస్రాయేలు ప్రజల యొక్క గొప్ప రాజు, ఆయన వంశం నుండి వచ్చే రాజు కూడా అదే విధంగా పాలించును.

దేవుని రక్షణ దినము రానున్నది , ఆ దినము ప్రజల నుండి భయమును తొలగించును, బానిసత్వంను దూరం చేయును.  ఇదంతా నూతన రాజు ద్వార జరుగును అని ప్రవక్త తెలియ చేసారు, కాబట్టి అందరిని కూడా ఆశతో ఎదురు చూడమని  తెలుపుచున్నారు. ఎదురు చూడటంలో ఆనందం ఉంది, ఎదురు చూడటంలో నమ్మకం ఉంది, అలాగే ఎదురు చూడటంలో ప్రేమ ఉంది, సహనం ఉంది, ఎదురు చూడటంలో ఆశ ఉంది, ఒక విధంగా చెప్పాలంటే యిర్మియా ప్రవక్త ప్రజలకు, ఈ రక్షకుడు వేంచేయుకాలం గురించి ఒక శుభ వార్త  తెలుపుచున్నారు.

ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు తెస్సలోనిక ప్రజలను ప్రోత్సహిస్తూ, ప్రార్థిస్తూ వారి కోసం రాసిన లేఖ గురించి వింటున్నాం.  పౌలు గారు తెస్సలోనిక ప్రజల్లో పరస్పర ప్రేమ ఉంచాలని అదే విధంగా ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండాలని  ప్రార్థనా పూర్వకంగా దేవున్ని  కోరుతున్నారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, స్వచ్ఛమైన నిస్వార్ధ ప్రేమ, చూపించాలని పౌలు గారు తెలుపుచున్నారు. తెస్సలోనియ ప్రజలకు పౌలుగారు, వారి  మధ్య ప్రవర్తించినట్లే అందరు కూడా ఒకరి పట్ల ఒకరు  ప్రవర్తించాలని కోరుకున్నారు. ఎందుకంటే పౌలు గారు తన జీవితం ద్వార దేవున్ని సంతోష పెట్టారు. ఆ సుమాతృకయే ఆనాటి ప్రజలకు అందచేశారు. ఈ వాక్యాలలో మనం గమనించవలసిన  విషయాలేమిటంటే  పౌలుగారు  ఎలాగా,  ఈ ప్రజల నడుమ ప్రవర్తించారు, ఎలాంటి సుమాతృకను  వారికిచ్చారు అను అంశాలు.

పౌలు గారు – 1 . ఎన్ని ఆటంకములు ఎదురైన సువార్తను బోధించారు. 1 తెస్స 2:2

                    2. దేవున్ని సంతోష పెట్టేలా జీవించారు 1 తెస్స 2:4

                    3. ఏమి ఆశించకుండా ప్రేమతో సేవ చేశారు. 1 తెస్స 2:6

                    4. మంచిగా, మృదువుగా అందరితో ప్రవర్తించారు. 1 తెస్స 2:7

                    5. దేవుని ప్రేమ పంచి – పరస్పర  ప్రేమ కలిగి జీవించారు. 1 తెస్స 2:8,9.

                    6. పరిశుద్దముగా జీవించారు, నీతిగా , నిందారహితునిగా జీవించారు. 1 తెస్స 2:10

                   7. ఆయన ఇతర విశ్వాసులను ప్రోత్సహించారు, బాధ్యత కలిగి జీవించారు, దేవునికి ఇష్టానుసారంగా జీవించారు. ఆయన దేవునికి ప్రియమైన జీవితం జీవించి సాక్ష్యం ఇచ్చారు. 1 తెస్స 2:11

                   8. దేవుని యొక్క రాజ్యంకు తగిన విధంగా జీవించారు. 1 తెస్స 2:12.

ఈ యొక్క ఆగమన కాలంలో క్రీస్తు యొక్క రాకడ కోసం ఎదురు చూసే మనం కూడా మన యొక్క  అనుదిన జీవితాలను పౌలు గారి యొక్క సందేశం ద్వార మార్చుకొని జీవిస్తే, క్రీస్తు ప్రభువు యొక్క రాకడ నిజంగా, మన యొక్క హృదయాలలో జరుగుతుంది. దేవుని  సంతోష పెట్టె జీవితం, జీవించమని పౌలు గారు మనకు  తెలియచేస్తున్నారు. దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూసే వారందరు కూడా ప్రేమతో సహనంతో ఎదురు చూడాలని తెలియ చేస్తున్నారు.

ఈనాటి సువిశేష పఠనంలో దేవుడు వచ్చే సమయానికి జాగరుకుత, కలిగి జీవించమని లూకా గారు మనకు తెలుపుచున్నారు. పాత నిబంధన గ్రంధంలో, యిస్రాయేలు ప్రజలు మెస్సయ్యాను స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ప్రవక్తలు ఇచ్చిన సందేశమును బట్టి వారు మెస్సీయ్య యొక్క రాకడ కోసం సంసిద్దులైనారు. అదే విధంగా  క్రీస్తు ప్రభువు తన యొక్క రెండవ రాకడ కోసం ప్రజలను  సంసిద్దులను చేస్తున్నారు.

ఆనాడు యిస్రాయేలు ప్రజలు  మెస్సీయ్య యొక్క రాకడ కోసం తయ్యారైనట్టు ఇప్పుడు  మనం క్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం తయారవ్వాలని. యేసు క్రీస్తు ప్రభువు స్వయంగా జరుగబోయే సంఘటనలు వివరిస్తున్నారు. ఆకాశంలో  సూర్య చంద్రుల యొక్క పరిణామాలు,  సంభవించే ఆటంకాలు అన్నీ కూడా  ఆయన వచ్చేటప్పుడు   జరిగే పరిస్థితులను గురించి ముందుగానే తెలియ చేసారు.

ఎన్ని విపత్తులు ఎదురైన  మనం దేవుని యందు విశ్వాసం  కోల్పోకూడదు, ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. మత్తయి 28:20. నేను సర్వదా మీతో ఉందును, అని ప్రభువు అనేక సార్లు  చెప్పి ఉన్నారు.

ఆయన రాకడ కోసం మనం ఎప్పుడు కూడా సిద్దంగానే  ఉండాలి. అదియే క్రైస్తవ విశ్వాసం. ఆటంకములకు భయపడకుండా ధైర్యముగా ఎదుర్కోవాలి. పాత నిబంధన గ్రంధంలో దానియేలును  సింహాపు బోనులో  పడవేసినప్పుడు ఆయన భయ పడలేదు. పంది మాంసం తినమని చెప్పినప్పుడు ఏడుగురు సోదరులు వారు మరణానికి భయ పడలేదు, వారు ధైర్యంగా మరణంను ఎదుర్కొన్నారు.

యేసు ప్రభువు యొక్క రాకడ జరిగే సమయంలో కూడా  అన్ని శ్రమలు, కష్టాలు ఎదురౌతాయి. అప్పుడు ఎవరైతే  ధైర్యంగా అన్ని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటారో, వారు దేవుని యొక్క రాకడ జరిగిన సమయంలో ఎటువంటి భయాలకి గురికారు. ఎందుకంటే దేవుని మీద వారికి నమ్మకం ఉంది, ఆయన వారిని కాపాడుతారని. ఇలాంటి కష్టాలు అవిశ్వాసులకు మాత్రమే భయంను చేకూరుస్తాయి. ఎంత నష్టం జరిగిన మీ తల వెంట్రుకలు ఒక్కటియు రాలిపోదు అని ప్రభువు తెలియ పరుస్తున్నారు. లూకా  1:18. తలెత్తి చూడటం అంటే ధైర్యంగా ఉండటం, సంతోషముగా, భయపడకుండా ఉండటం. తలెత్తి చూడటం అంటే  విజయంకు గుర్తు , ఎదురుచూపుకు గుర్తు. దేవుని రాకడ కోసం, ఎదురు చూసే వారు కూడా, అలాగే మాకు విజయం తెచ్చే మెస్సీయ్య, వస్తాడని తలెత్తుకొని ఎదురు చూడాలి. ప్రభువు యొక్క దినమునకై వేచి వుండటానికి మనం పిలువబడ్డాం. ఆయన కోసం శ్రద్దతో, ఆసక్తితో  మేలుకువతో వేచి ఉండాలి. కనులు తెరచి అన్నీ విషయాలు పరిశీలించాలి. మనందరం కూడా జాగరూకులై అప్రమత్తంగా ఉండాలి.

మానవ జీవితంను విందులతో , వినోదములతో  కాకుండా, నీతిమంతమైన జీవితమును జీవించాలి. బాధ్యత లేకుండా సుఖ సంతోషాలతో , శారీరక వాంఛలకు లోనై ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తే దేవున్ని సంతృప్తి పరచలేం. కాబట్టి పరిశుద్దత కలిగి జీవించాలి. విందులు , వినోదాలు మానవుని హృదయాన్ని దేవునికి దూరం చేస్తాయి. త్రాగుడు మనిషిని మారిచిపోయేలా చేస్తుంది. బాధ్యతలు మరిచిపోతారు , దేవున్ని మరిచిపోతారు. వారి యొక్క హృదయాలు మందముగా ఉంటాయి(బాధ్యత లేకుండా జీవించే వారి యొక్క హృదయాలు) ఫరో  రాజుకూడా తన హృదయాన్ని మందముగా చేసుకున్నాడు. అందుకే దేవుని వాక్కును, ప్రవక్తలను లెక్క చేయలేదు. (నిర్గ 7:14,9:7) మన హృదయాలు దేవునికి తెరువబడాలి అవి  ఆయన వాక్కును వినటానికి మృదువుగా ఉండేలా చేసుకోవాలి.

సువిశేష పఠనం ద్వారా  మూడు ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి.

1.     ఎలాంటి జీవితం జీవించాలి- నీతివంతమైన  జీవితం జీవించాలి.

దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి.

దేవుని ఆజ్ఞలు పాటించి జీవించాలి.

దేవుని యొక్క ప్రేమను  పంచుతూ జీవించాలి.

 దేవుని యొక్క చిత్తానుసారం, నడుచుకొని  జీవించాలి.

 ఎప్పుడైతే పవిత్రంగా , జాగ్రత్తగా మన జీవితం జీవిస్తామో అప్పుడు ఆయన్ను మనం స్వీకరించవచ్చు.

2.   మెళకువతో  ఉండుట – అంటే ఎప్పుడు కూడా సిద్దంగా ఉండటం, వేచి ఉండటం, నిద్ర లేకుండా ఉండటం. ఏ సమయంలో  ఏమి జరుగునో  తెలుసుకొని దేనికైనా సిద్దంగా ఉండటమే. మనం మెలకువతో ఉంటే పాపంలో పడిపోము. ప్రతి నిత్యం కూడా మెలకువతో జాగరూకత కలిగి జీవిస్తే ఈ లోక ఆకర్షణలో పడిపోక దేవుని రాకడ కోసం తయారవ్వవచ్చు.

3.   ప్రార్థించుట

మనందరం కూడా అనేక విపత్తుల సమయాలలో ప్రార్థిస్తాం ఎందుకంటే ప్రార్థన ద్వార దేవుడు అద్భుతాలు చేస్తారు. ప్రార్థన చేయని వారు క్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు కారు. ప్రార్థించుట – ప్రార్థించుట ద్వారా దేవుని శక్తిని పొందవచ్చు. ఆయన రాకడ కోసం ప్రార్థించాలి. అను నిత్యం కూడా ఆయన రాకడ కోసం ప్రార్థించాలి. క్రీస్తు ప్రభువు కూడా చాలా సార్లు ప్రార్థించారు.

1.     ఆయన జ్ఞానస్నానమప్పుడు ప్రార్థించారు.

2.   శిష్యులను ఎన్నుకునే ముందు ప్రార్థించారు.

3.   ఉదయాన్నే ప్రార్థించారు.

4.   గెత్సెమనేలో ప్రార్థించారు.

5.    తబోరు కొండ వద్ద ప్రార్థించారు. ఆయన చాలా సందర్బాలలో ప్రార్థించారు. మనం కూడా ప్రార్థించాలి.

 ప్రార్ధన లేకపోతే మనం బలహీనులమవుతాం కాబట్టి ప్రార్థించాలి. యాకోబు  4:2 ఈ యొక్క ఆగమన కాలం మొదటి వారంలో క్రీస్తు రాకడ కోసం సంసిద్దమై జీవించే వేళలో మనందరం పవిత్ర జీవితం జీవిస్తూ ఆయన రాకడ కోసం ఆధ్యాత్మికంగా తయారవుతు ,మెలకువతో జీవిస్తూ పాపంలో పడిపోకుండా దేవున్ని అంటి పెట్టుకొని జీవించుదాం.

Rev. Fr. Bala Yesu OCD

 

20, నవంబర్ 2021, శనివారం

క్రీస్తురాజు మహోత్సవం

 

క్రీస్తురాజు మహోత్సవం


దానియేలు 7:13-14, దర్శన 1:5-8, యోహను 18:33-37 

నేడు తల్లి శ్రీ సభ  క్రీస్తు రాజు మహోత్సవమును కొనియాడుచున్నది. 11 భక్తి నాధ పాపుగారు క్రీస్తు రాజు పండుగను 1925 వ సంవత్సరంలో ప్రతిష్టించారు. 

ఈ లోకంలో  అందరు పాలకులు తమంతట తాము గొప్పవారని భావించే సమయంలో  సార్వ భౌమాధికారం,సామంత పాలనంలో  పడిపోతూ, ఈ ప్రపంచంలో  ప్రజా స్వామ్య వ్యవస్థ, నాస్తికత్వంలో ప్రవేశిస్తున్న సమయంలో  క్రీస్తు ప్రభువు ప్రజలకు నిజమైన రాజు అని ఆనాటి  11 వ భక్తి నాధ పాపుగారు తెలియచేసారు. 

దేవుడే నిజమైన రాజు మానవ మాత్రులు కేవలం ఒక సాధనములే, క్రీస్తు ప్రభువు రాజు ఎందుకంటే దేవుడు కాబట్టి తండ్రితో , పవిత్రాత్మతో కలసి సృష్టిని చేసి పరిపాలిస్తున్న దేవుడు, ఈ లోకం మీద సర్వాధికారం కలిగిన వ్యక్తి. 

సర్వము ఆయన ద్వారా , ఆయన కొరకు సృష్టించబడినది అందుకే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినది. 

మనందరి జీవితాలను రక్షించే  రాజు క్రీస్తు ప్రభువు  ఆయన విలువైన తన రక్తమును ధారపోసి , మనందరిని కాపాడిన రాజు . మనయొక్క జీవితంలో సంతోషం  ఉండుటకు, శాంతి ఉండుటకు తానే తన  జీవం ఇచ్చి మనందరిని  కాపాడారు. ఈ రోజు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభువు యొక్క రాజ్యం  గురించి, ఆ రాజు యొక్క లక్షణాలు ధ్యానించుకుందాం. 

రక్షణ చరిత్రలో దేవుడు మొదటిగా యిస్రాయేలుకు నాయకునిగా మోషేను ఎన్నుకొంటున్నారు. ఆయన తరువాత  యోహోషువాను ఎన్నుకొన్నారు. ఈ విధంగా  దేవుడు కొంతమంది  ప్రవక్తలుగా , న్యాయాదిపతులుగా ఎన్నుకొని యిస్రాయేలు ప్రజలను నడిపించారు. 

కానీ పూర్వ నిబంధన కాలంలోని యిస్రాయేలు ప్రజలకు వారిని పరిపాలించటానికి ఒక రాజు  కావాలని ప్రగాఢ మైన కోరిక కలిగి ఉండేవారు. 

వాస్తవానికి దేవుడే వారి యొక్క రాజు అని మరిచారు. యిస్రాయేలు ప్రజలకు ఎల్లప్పుడు తమతో ఉంటూ , తమ కష్టాలలో పాలుపంచుకొనే రాజు కావాలనుకున్నారు. 

ఒక రాజు  కోసం వారు అహర్నిశలు ప్రార్ధించేవారు. వారి ప్రార్ధన విన్న దేవుడు సౌలును రాజుగా నియమించారు. దేవుడు అతని పాలనతో సంతృప్తి చెందలేదు, అందుకే దేవుడు మరొక రాజును దావీదును ఎన్నుకొన్నారు. దావీదు రాజు ప్రజలకు మేలు చేస్తూ, దేవునికి  విధేయుడై  జీవిస్తూ ఒక మంచి రాజుగా పేరు పొందాడు. యావే దేవుడు ఆయన వలన సంతృప్తి చెందారు.(1 సము 13:14) అ పో 13:22. తరువాత తన కుమారుడు సోలోమోను దేవుని ప్రణాళికకు తగిన విధంగా నడుచుకొలేదు. ఆయన పాలన అనేక మందిని భారంగా మారింది. అన్య దేవుళ్ళను ఆరాధించాడు. నిజమైన యావే దేవున్ని మారిచిపోయాడు. 

సోలోమోను మరణం తరువాత  యిస్రాయెలు ప్రజలు రెండుగా విభజించబడ్డారు. రాజులు కూడా మారారు. తరువాత దేవుడు ప్రవక్తలను ఎన్నుకొని తన ప్రజలను నడిపించారు. 

ఈ విధంగా పూర్వ నిబంధన గ్రంధంలో  దేవుడు రాజులను ఎన్నుకొని తన ప్రజలను నడిపించారు. క్రీస్తు ప్రభువు రాజు అనే భావన ముందుగానే సమూవెలు గ్రంధంలో దానియేలు , యోషయా , యిర్మీయా గ్రంధాల్లో ప్రస్తావించబడింది. యోషయా 9:6-7, యిర్మీయా 23:5-6, దానియేలు 2:44 . నూతన  నిబంధన  గ్రంధంలో  కూడా దేవ దూత మరియమ్మకు  మంగళ వార్తచెప్పే సమయంలో దేవ దూత మరియమ్మ తో దావీదు సింహాసనం ఆయనకు ఇవ్వబడుతుంది అని చెప్పారు. లూకా 1:32 . ఆయన సర్వదా యాకోబు  వంశీయులను పరిపాలించును అని అలాగే  ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని చెప్పారు. 

ముగ్గురు రాజులు బాలయేసును దర్శించుటకు వచ్చిన సమయములో యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ అని అడిగారు. మత్తయి 2:2. ముగ్గురు రాజులు క్రీస్తును రాజుగా గుర్తించారు. 

యేసు ప్రభువు తన యొక్క  శిలువ శ్రమలు అనుభవించే  ముందు యెరుషాలేములోకి  ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయన్ను రాజుగా అంగీకరించి గొప్పగా నినాదాలు చేశారు, ఆయన్ను మెచ్చుకున్నారు. లూకా 19:38. ప్రజలు క్రీస్తు ప్రభువును రాజుగా గుర్తించారు ఎందుకంటే  ఆయన వారికోసం పోరాడారు. వారికి తోడుగా ఉన్నారు. వారి బాధలలో పాలు పంచుకొన్నారు అందుకే ఆయన్ను రాజుగా ప్రజలు గుర్తించారు. 

పిలాతు కూడా యేసు ప్రభువును నీవు యూదుల రాజువా అని ప్రశ్నించారు -యోహను 18:33.  పిలాతు  యేసు ప్రభువు యొక్క సిలువ మీద వ్రాయించిన మాటలు అవే నజరేతుడైన యేసు యూదుల రాజు.  చివరికి ఆయన రెండవ సారి వచ్చే సరికి ఆయన మేఘారూరుడై వస్తారని  చెప్పారు.-మత్తయి 25:18. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువు రాజు అని  తెలియజేసే అంశాలు. యేసు  ప్రభువు కూడా సువార్తను ప్రారంభించిన సమయంలో మొదటిసారిగా పలికిన మాటలు కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది అని. క్రీస్తు ప్రభువు దేవుని రాజ్యంనకు రాజు. దేవుని రాజ్యం అంటే సమస్తము. సాధారణంగా రాజు అంటే ఒక  రాజ్యాన్ని పాలించేవాడు అని అర్ధం ఆ రాజ్యానికి కొన్ని సరిహద్దులు ఉంటాయి.

కొందరు వారసత్వం పరంగా రాజులౌతారు మరికొందరు ప్రజల యొక్క ఆధారభిమానాల వల్ల రాజులౌతారు. యేసు క్రీస్తు ప్రభువు మాత్రము దేవుడు. అదే విధంగా ప్రజలచేత గుర్తించబడ్డ రాజు. ఆయన ఆధికారం కాని, ఆయుధాలు కాని ధరించని రాజు. ప్రజలపై ఆధిపత్యం చెలాయించే రాజు కాదు, వారికి స్వేచ్ఛ నిచ్చే రాజు. ఆయన యొక్క రాజ్యం ఈ లోక సంభధమైనది కాదు, పరలోక సంబంధమైనది

1.      దేవుని రాజ్యం ప్రేమ రాజ్యం. అందరిని కూడా ప్రేమించిన గొప్ప ప్రేమామయుడు. ఆయన రాజ్యంలో కాలహాలకు యుద్దాలకు తావులేదు, అధికార వాంఛలకు తావులేదు, ఆయన కేవలం ప్రేమతో తన రాజ్య పాలన చేశారు. ప్రేమతో ప్రజల వద్దకు వచ్చారు, ప్రేమతో ప్రజల కష్టాలు , బాధలు పంచుకున్నారు. ప్రేమ వలన శిలువ మోసారు,ప్రాణ త్యాగంచేశారు. దైవ ప్రేమను మానవాళికి పంచిన రాజు క్రీస్తు ప్రభువు.

2.   దేవుని రాజ్యం శాంతి రాజ్యం – దేవునికి మానవునికి మధ్య పాపం చేయటం వలన ఏర్పడిన  ఆ అగాధంను క్రీస్తు రాజు భర్తీ చేశారు. తన యొక్క జీవితం ద్వార, మరణ పునరుత్తానం ద్వార సమాధానంను ఏర్పరిచారు. తండ్రికి, ప్రజల మధ్య శాంతిని నెలకొల్పిన రాజు. ప్రజల మధ్య శాంతిని నెలకొల్పిన రాజు.

3.   దేవుని రాజ్యం, సంతోషకరమైన రాజ్యం :- యేసు ప్రభువు ఈ లోకంలోకి సంతోషమును తీసుకొచ్చిన రాజు. ఆయన జన్మం తల్లిదండ్రులకు  సంతోషంను తెచ్చింది, ఆయన జన్మం గొర్రెల కాపరులకు సంతోషం ఇచ్చింది. ఆయన సేవ రోగులకి సంతోషం సంతోషం ఇచ్చింది. ఆయన సిలువ భారం పాపులకు రక్షణ అనే సంతోషం ఇచ్చింది. ఆయన పేదవారికి నేనున్నాను అనే భరోసా నిస్తూ సంతోషం ఇచ్చింది. ఆయన రాజ్యంలో రాజ్యంలో సంతోషమే ఉంటుంది. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. మన బాధలు పంచుకొని , మన కుటుంబంలో ఒక వ్యక్తిగా జీవిస్తూ మనలో సంతోషంను తీసుకొని వచ్చిన రాజు.         సమస్త సృష్టి ప్రాణులపై  క్రీస్తుకు ఆధిపత్యం ఉంది. అయన రాజ్యాధికారం  రెండు రకాలుగా అర్ధం అవుతుంది.

1. ఆయన సహజ సిద్ధంగా అయన హక్కులు కలిగివున్నారు.

2. రక్షకునిగా తన ప్రాణం ఫణంగా పెట్టి సంపాదించుకున్నాడు. రాజు రక్తం ద్వారా మనకు విముక్తి కలిగింది.

- ప్రజలను యేసుగా భావించి, అంగీకరించారు. రోమా రాజ్యంపై దండయాత్ర చేసి వారిని ఓడించి నూతన సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడుఅని వారు తలంచారు.

- అయన మాటల్లో ఆకర్షణ చూసి, అయన ప్రవర్తనలో, ఆయనయొక్క కార్యాలలో, ప్రజలకు ఆ నమ్మకం వచ్చింది. ఆకలితో వున్నా వారికి రొట్టెముక్కలను ఇచ్చి పోషించారు,చేపలతో వారిని సంతృప్తి చేసినపుడు అది గమనించిన ప్రజలు ఆయన్ని రాజునూ చేయాలనుకున్నారు.వారి బానిసత్వ బ్రతుకునుండి కాపాడే రక్షకుడని, వారికోసం పోరాడే రాజాని ప్రజలు విశ్వసించారు. యేసుప్రభువు చేసిన అనేక గొప్ప కార్యాలు  ఆయన్ని రాజుగా అంగీకరించేలా చేసినవి. అయితే అయన రాజ్యం ఈలోకమునకు చెందినది కాదని స్పష్టంగా పిలాతునకు తెలియజేసారు.ఈలోకరాజులు అధికారంతో,అహంతో,స్వార్ధముతో,స్వబుద్ధితో,పాలనా చేసే వారు కానీ క్రీస్తురాజు వారికి భిన్నముగా జీవించారు. అయన ఆల్ఫా,ఒమేగా - అదియు అంతమైన రాజు. 1 . మన రాజు మనల్ని ప్రేమిస్తారు:

           అయన తన ప్రజలందరినీ ఏ తారతమ్యం లేకుండా ప్రేమిస్తారు. పెదాలను, ధనికులను ఒకే దర్శితో ప్రేమించారు.సజ్జనులపై దుర్జనులపై ఒకేవిధంగా వర్షమును ,సూర్యున్ని కుమ్మరిస్తూ ,ప్రేమను చూపుచున్నాడు.అందరిని ప్రేమించారు. క్రీస్తురాజు తన స్నేహితులకు ప్రాణాలర్పించారు (యోహా :15 :13 ). దీనికి మించిన ప్రేమ వేరొకటిలేదు.

     రాజు మాములుగా తన ప్రజలను యుద్ధం చేయడానికి తనకన్నా ముందుగా సైన్యమును పంపిస్తారు. కానీ మన రాజు తానే ముందుండి నడిచారు. రాజు తన సైన్యంకోసం ప్రాణాలు సమర్పించరు కానీ క్రీస్తురాజు తన ప్రాణాలను అందరికోసం అందరికన్నా ముందుండి సమర్పించారు. అయన మనల్ని ప్రేమించారు కావున తనను తాను సమర్పించుకున్నాడు.

   రెండవ పఠనము; దర్శన:1 :5 :

            క్రీస్తు మనల్ని ప్రేమించారు అందుకే మన పాపాల్ని కడిగి వేశారు.ఏ రాజు కూడా క్రీస్తురాజుకన్నా ఉదారస్వభావి కాదు. ఎందుకంటే,అయన మనల్ని తన బిడ్డలుగా స్వీకరించారు. జ్ఞాన స్నానం ద్వారా, అయన మనతో,తన జీవాన్ని పంచుకున్నారు. అయన తన యొక్క శరీర రక్తాలను మనతో దివ్యాసప్రసాదం ద్వారా పంచుకున్నారు.అయన తన యాజకత్వమును మనకు ఇచ్చారు (దర్శ :1 :6 ). దేవుడు మనలను అమితముగా ప్రేమించారు కాబట్టే మనకు సహాయం చేసారు.

 2 . క్రీస్తురాజు నమ్మదగిన/ విశ్వసింపదగిన రాజు :

         రాజు న్యాయం చేస్తాడని చాలామంది వారిని సంప్రదిస్తారు కానీ, కొందరు రాజులు అందరికి న్యాయం చేయరు. అందరూ రాజులు కూడా నమ్మదగిన రాజులు కాదు. వాగ్ధానాలు చేస్తారు కానీ నెరవేర్చరు. క్రీస్తురాజు మాత్రం నమ్మదగిన రాజు.తన మీద నమ్మకం ఉంచి తన చెంతకు వచ్చిన వారికి న్యాయం చేసే రాజు. ప్రజలయొక్క అవసరాలలో తోడుగావుండి,వారు అడిగిన వెంటనే సామ కూలంగా  వారిని సహకరించి దీవెనలు ఇచ్చే రాజు. శతాధిపతి నమ్మకంవుంచి అడిగాడు, అప్పుడు క్రీస్తురాజు తన సేవకుణ్ణి స్వస్థత పరిచాడు. భర్తీమయి నమ్మకంతో అడిగాడు, చూపును పొందాడు.కనానీయ స్త్రీ నమ్మి ఆశ్రయించింది,  ప్రభువు దీవెనలిచ్చారు. అయితే, నమ్మకమును నిలబెట్టుకోవడం కూడా ఒక సత్యమైన వ్యక్తిత్వమునకు గుర్తు.

 ౩.క్రీస్తురాజు అందరిని కూడా గౌరవించే రాజు :

             సాధారణముగా సమాజములో రాజులు పేదవారికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వరు. వారు ధనవంతులతో, పేరుప్రఖ్యాతలు వున్నా వారితో సన్నిహితముగా వుంటారు. కానీ మన క్రీస్తురాజు ప్రతియొక్క వ్యక్తియొక్క వ్యక్తిత్వమును గౌరవిస్తాడు. అయన ధనికులనుమాత్రమే కాదు చేరదీసింది,పేదవారిని,వితంతువులను,అనాథలను అందరినీ కూడా గౌరవించాడు. అయన పేదవాని స్నేహితునిగా పిలవబడ్డాడు. సుంకరులతో, పాపులతో భుజించాడు. అది అయన యొక్క గొప్పతనం.

          4 . క్రీస్తు రాజు మన కుటుంబములోనిరాజు/ మానవ కుటుంబమునకు చెందిన రాజు:

           క్రీస్తు రాజు మనుష్య కుమారుడు. ఈలోకంలోనే మానవ రూపం దాల్చాడు.దానియేలు మనుష్యకుమారునిగూర్చి చెప్పాడు.దాని:7 : 13 . ఇవి క్రీస్తుని ఆదేశించి పలికిన మాటలు. అయన మనలో ఒక్కనిగా మానవ రూపం దాల్చి పేదవానిగా జీవించారు- మత్త:8 : 20 .

  ఈలోగా సంబంధ రాజులు ప్రజలయొక్క భాధలు చాలా తక్కువగా ఎరిగివుంటారు.కానీ క్రీస్తురాజు ప్రజలతో సంచరించారు, ప్రజలనడుమ జీవించారు.తన పరలోక మహిమ విడిచిపెట్టి ఈ లోకములో మానవునిగా జన్మించి,మనలాగే, ఆకలి దప్పులు, బాధలను, సంతోషాలను కలిగి జీవించిన రాజు. హెబ్రీ :4 :15 , మార్కు:10 : 12 , యోహా :4 : 7 .

   క్రీస్తు రాజు ప్రతిఒక్కరినీ కూడా ప్రతిఒక్కరిని క్షుణ్ణముగా అర్ధం చేసుకున్న రాజు. అయన మన కుటుంహానికి చెందిన రాజు అని చెప్పినపుడు మనకి ఆయనకు బంధం ఉందని అర్ధం. మనం ఆయనకు దగ్గరగా వున్నవాళ్ళం, close  relationship వున్న వాళ్ళం. మన కుటుంబములోని రాజు కాబట్టి, మనలను అర్ధం చేసుకొని మనకు కష్టం వచ్చినపుడు ఆ కష్టమును తొలగిస్తారు.

   5 . క్రీస్తు రాజు శక్తి కలిగిన రాజు:

          క్రీస్తు ప్రభువుకు సైన్యం లేనప్పటికీ అయన శక్తి కలిగిన రాజు.

   - ఆయన మాటల్లో శక్తివుంది.

   -ఆయన అంగీలో శక్తివుంది.

   -ఆయన స్పర్శలో శక్తి వుంది.

ఆయన ఈ భూలోక రాజులను పరిపాలించే రాజు (దర్శ :1 :5 ).

ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు (దర్శ :19 : 16 ).

    రోమా చక్రవర్తులు/ రాజులు వారే శక్తివంతులని అనుకున్నారు.వారియొక్క సైనిక బలముతో, అంతా జయించవచ్చు అని అనుకున్నారు.ఆయన/ వారు చెప్పింది, శాసించింది మాత్రమే జరుగుతుంది అని నమ్మరు.కానీ తొలి  క్రైస్తవులను రాజు యొక్క విగ్రహాన్ని ఆరాధించామని చెప్పినపుడు, ఆ క్రై స్తవులు  ఆరాధించలేదు. ఎందుకంటే,క్రీస్తే దేవుడు.ఆయనే నిజమైన ఏకైక రాజు అని వారు గ్రహించారు.

      క్రీస్తుకు సమస్తము ఇవ్వబడినది - మత్త: 28 :18 .

       ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. - లూకా : 1 :౩౩ , దాని :7 : 13 , 14 .

       క్రీస్తురాజు తన యొక్క శక్తినంతటినీ ఇతరుల మేలుకోసం వినియోగించాడు. క్రీస్తు ప్రభువు నిజమైన రాజు. ముళ్లకిరీటం ఆయన యొక్క రాజా కిరీటం.సిలువయే ఆయన సింహాసనము. కాబట్టి మనం క్రీస్తు రాజును మన జీవితాల రాజుగా గుర్తించి, మనలను పాలించేలా సహకరిదాం. ఆయన రాజ్యములో దొరికే శాంతి సమాధానాలకోసం, ప్రేమకోసం జీవిదాం. ఆమెన్.

Rev.Fr. Bala Yesu OCD

     

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం   యెషయా 6:1-6  1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...