26, ఫిబ్రవరి 2022, శనివారం

8 వ సామాన్య ఆదివారం (2)

8 వ సామాన్య ఆదివారం 

 సీరా 27:4-7, 1 కోరింథీ 15:54-58 లూకా 6:39-45 

నేటి దివ్య పఠనాలు మన యొక్క అనుదిన జీవితంలో వినియోగించే మనిషి యొక్క మాటల గురించి తెలియజేస్తుంది. 

యేసు ప్రభువు ఏ విధంగానైతే తన యొక్క భూలోక జీవితమంలో మంచి మాటలు  మాట్లాడుతూ అనేక మంది జీవితాలలో సంతోషంను నింపుతూ,   ప్రేమను పంచుతూ  జీవించరో మనం కూడా అలాగే మృదువైన  మాటలు మాట్లాడుతూ అందరి జీవితంలో మంచిని పంచాలి. 

మన యొక్క మాటతో పాటు మనస్సు కూడా మంచిగ ఉండాలి. దేవుడు మానవునికి మాటనిచ్చింది, ఆయనను స్తుతించడానికి, ఆయనను గురించి ఇతరులకు తెలియజేయడానికి, ఇది దేవుడు ఇచ్చిన గొప్ప వరం.

 మన యొక్కమాట ద్వారా తోటి ప్రజలతో స్నేహబంధం ఏర్పరుచుకొని వారితో సమాధానంగా  సంతోషంగా ఉండవచ్చు. 

 మన యొక్క ప్రతి వాక్కు ద్వారా మన భావాలను, ఆలోచనలను వ్యక్త పరచి  ఇతరులతో  స్నేహ బంధాన్ని కలిగి మన మాటలు  జీవించడానికి ఉపయోగపడతాయి

 దేవుడిచ్చిన మాటను  సద్వినియోగం చేసుకుంటే ఆ  జీవితం సుఖంగా ఉంటుంది 

మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట విలువైనది మాట్లాడే ప్రతి మాట వెనుకు  తీసుకోవలేం, కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.

మాట్లాడే మాటలను  దుర్వినియోగం చేసుకుంటే అతని లేక ఆమె జీవితం కష్టాల పాలౌవుతుంది. 

మన జీవితంలో శాంతి సమాధానాలు లేకపోవడానికి కారణం మన యొక్కనోటి మాటయే. మన యొక్క సంభాషణలో  నోటి మాటలో శుద్ధి , సౌందర్యం లోపించినప్పుడు మన కుటుంబాలలో   కలహాలు మొదలవుతాయి. 

ఈనాటి మొదటి పఠనంలో సీరా ఎలియజర్ పుత్రుడైన యేసు రచయత మనిషి యొక్క  మాట తీరుకు అతడి మనసుకు ఉన్న సంభంధాన్ని తెలియచేస్తునారు. 

మనిషి మాట్లాడే ప్రతి మాట బయటకు మనకు  వినిపిస్తుంది. కాని అతని లేక ఆమె మనసు  మనకు కనిపించదు.  అయితే మనిషి మాట్లాడే మాటయే తన యొక్క అంతరంగమును  బయటకు వెల్లడిస్తుంది. 

సిరాకు  3 ఉపమానాల  ద్వారా మనిషి మాటలు, అంతరంగిక భావాల గురించి తెలుపుచున్నారు. 

1. జల్లెడ యొక్క ఉపమానం

2. కుమ్మరి పాత్రలు చేసే విధానం 

3. పండును బట్టి చెట్టు యొక్క స్వభావం 

  ఈ మూడు కూడా మన వ్యక్తిగత జీవితంలో రోజు చూసే ఉదాహరణలే.  ఇవి మనకు చాలా ముఖ్యమైన విషయాలు  నేర్పిస్తాయి. 

ఊపిన జల్లెడ - రైతు పంట కోసినప్పుడు మంచి గింజలనుండీ చెడు గింజలను వేరు పరచడానికి  రైతు వినియోగించే సాధనమే జల్లెడ. 

జల్లెడ పట్టడం ద్వారా మనకు మేలిమి  వస్తువులు దొరుకుతాయి.  అలాగే మనం మాట్లాడే ప్రతి  ఒక్క దానిలో  మంచి పదాలు  ఉంటాయి, అలాగే చెడ్డవి ఉంటాయి.

జల్లెడ క్రీంద పొట్టు కనబడినట్లు మన యొక్క సంభాషణలో కూడా  పోట్టు వంటి లోపాలతో కూడుకున్న పదాలు కనిపిస్తాయి. మన యొక్క మాటల్లో తప్పులు కనపడుతుంటాయి. 

   రెండవదిగా కుమ్మరి చేసే కుండలు : ఒకవేళ అతను మంచి మట్టిని వాడింది  లేనిది  వాటిని అవంలో వేసినప్పుడే అర్ధమవుతుంది. మంచి మట్టిని వాడక పోతే, అవి అగ్నిలో వేసినప్పుడే పగిలిపోతాయి. ఆవం లోని అగ్ని కుండ గట్టితనాన్ని పరిశీలించినట్లే ఒక వ్యక్తి యొక్క మాటతీరు , అతని సంభాషణ వలన అతను ఎలాంటివాడో అర్ధం అవుతుంది.  మట్టి పాత్రలు విలువ ఆవంలో తెలిసిన విధంగా మనిషి యొక్క విలువ ఆయన మాటలో  అర్థం అవుతుంది. 

 మూడవదిగా చెట్టు యొక్క పండు అది ఎలాగా ఫలములనిస్తుంది అని తెలుపుచున్నారు. చెట్టుకు అన్నీసక్రముగా ఇస్తే మంచి పండ్లనే ఇస్తుంది.  అంటే చిన్నప్పటినుండియే చిన్న బిడ్డలకు  మంచి విషయాలు నేర్పిస్తే  భవిష్యత్తులో మంచి మాటలు ప్రవర్తన కలిగి జీవిస్తారు. 

ఈ మొదటి పఠనము ద్వారా దేవుడు మన యొక్క మాటలు మంచిగా ఉండాలని తెలుపుతున్నారు. మానవ జీవితంలో మాట్లాడే ప్రతి ఒక్క మాట విలువైనది. శరీరానికి  ఒక దెబ్బ తగిలితే ఆ గాయం తొందర్లోనే మాయం అవుతుంది. కానీ మాట ద్వారా మనసుకు అయిన గాయం మానటం కష్టం. 

మనం మాట్లాడే మాటలు మనకు  స్నేహితులను చేస్తుంది.  అదే మాటల వల్ల  మనకు శత్రువులు  కూడా తయారవుతారు. 

మనం మాట్లాడే మాటలు చాలా సార్లు జీవితాలు నిర్మిస్తాయి, నిలబెడతాయి  అవే మాటలు కొన్ని సార్లు జీవితాలను కూల్చుతాయి. 

 మన యొక్క వాక్కు ద్వారా ఎందరో జీవితాలలో  వెలుగు నింపవచ్చు,  ప్రేమించవచ్చు.  అదే మాట ద్వారా మనం కొందరిని ద్వేషించేవచ్చు. 

మాట్లాడిన ప్రతి మాటకి రెండు అర్థాలు ఉంటాయి positive మరియు negative  అయితే మనం ఎలాంటి tone  ఉపయోగించం  అన్నది కూడా ముఖ్యం. 

మన యొక్క సంభాషణల  ద్వారా ఇతరులలో నమ్మకం కలిగించవచ్చు, ఓదార్పును ఇవ్వవచ్చు, ప్రేరణ కలిగించవచ్చు . 

ఒకచిన్న అగ్గిపుల్లతో ఎలాగైతే ఒక పెద్ద అడవిని కాల్చి వేయవచ్చో అలాగే  మన యొక్క నాలుకతో మాట్లాడే మాటలు చాలామంది  జీవితాలను  కూల్చుతాయి.  ఇతరులను పాపంలోనికి నెట్టేది  కూడా మన యొక్క మాటలే ఎందుకంటే తప్పుగా మాట్లాడుట  వలన వేరే వాళ్ళు ప్రేరేపించబడి పాపం చేస్తారు. 

కాబట్టి మన యొక్క సంభాషణలో  మన మంచిగా ఆలోచనలు   చేసి మంచిగా మాట్లాడి జీవిస్తే ఈ లోకంలో శాంతి సమాధానాలు, ప్రేమ, ఆనందం ఉంటుంది. మన మాటలద్వారా ఆశీర్వదించవచ్చును శపించవచ్చును. సృష్టిలో కేవలం మానవులు మాత్రమే మాట్లాడే వారు. మనకు మాత్రమే గొప్ప వరం దేవుడు దయచేశారు. కావున మనం కూడా మాటలనే మాట్లాడాలి.

రెండవ పఠనంలో పౌలు గారు మరియొకసారి యేసుప్రభువు యొక్క పునరుత్తానం గురించి ప్రకటిస్తున్నారు. పౌలు గారు యేసు క్రీస్తు ప్రభువుకు మరణంను జయించగల శక్తి ఉన్నదని తెలుపుచున్నారు, అందువలనే యేసుప్రభువు మరణించిన తరువాత శరీరంతో పునరుత్తానమయ్యారు.

క్రీస్తు ప్రభువునందు జ్ఞానస్నానం పొందిన మన అందరంకూడా పవిత్రాత్మ ద్వారా ఇహలోకంలో దేవుని యొక్క అనుచరులుగా, విశ్వాసులుగా జీవించే మనందరం కూడా పునరుత్తానమవుతామని, దానికి నిదర్శనం యేసు క్రీస్తు పునరుత్తానమే అని పౌలు గారు తెలుపుచున్నారు.

ఈ లోకానికి మరణం పాపం చేయుట వలన వచ్చింది. పాపం చేయుటవల్ల అవిధేయులై, దేవుని చట్టాన్ని సరిగా పాటించలేం, ఇంకా పాపపు జీవితం నే కొనసాగిస్తాం. అయితే పాపంలో ఉన్నవారందరిని రక్షించడానికి ప్రభువు ఈలోకంలో జనిమించారు. ఎటువంటి పాపం చేయకుండా మన కోసం సిలువ శ్రమలు మరణం, పునరుత్తానం ద్వారా మనకు రక్షణ దయచేశారు అని పాలుగారు తెలుపుచున్నారు.

యేసుక్రీస్తుప్రభువు పాపమును జయించారు, మరణమును జయించారు, కాబట్టి మనం ఆయన యందు విశ్వాసముంచి ఆయన కార్యాలు నెరవేర్చాలి, ఆయన సేవ చేయాలని పౌలు గారు తెలుపుచున్నారు.

సువిశేష పఠనంలో యేసు ప్రభువు మనయొక్క జీవితంలో చాల విలువైన విషయాలను బోధిస్తున్నారు.

1. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివానికి మార్గం చూపించగలడా?

2. శిష్యులు గురువు కంటే అధికుడు కాదు

3. పరులను గూర్చి తీర్పు చేయకూడదు

4. అంతరంగిక శుద్ధి కలిగి మంచి మాటలు మాట్లాడుట, బోధించుట.


1. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివాడిని నడిపిస్తే ఏమవుతుందో అందరికి తెలుసు. వారిద్దరూ పడిపోయే అవకాశం ఉంది, దారి తప్పి పోతారు, గమ్యం చేరలేరు. చాల సందర్భాలలో మనం ఎలాంటి వారిని అనుసరిస్తున్నామో అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎవరిని వెంబడించాలో, ఎవరిని మన యొక్క నాయకులుగా అనుసరించాలో వారిపట్ల జాగ్రత్తగ ఉండాలి.

అన్ని తెలిసిన వ్యక్తులు మాత్రమే మనం అనుసరించాలి, మనలను సన్మార్గంలో నడిపించే వారినే వెంబడించాలి. దైవ జ్ఞానం లేని గ్రుడ్డివారిని, దేవుడంటే విశ్వాసం లేని వారిని తల్లిదండ్రులంటే భయభక్తులు లేని వారిని మనం అనుసరిస్తే మన జీవితాలు కూడా అంధకారంలోకి నడిపించబడతాయి.

ప్రతిఒక్కరు మొదటిగా తమ యొక్క జీవితాన్ని పరిశీలించుకుని, ఆ తరువాత ప్రజలను హెచ్చరించమని, నడిపించమని తెలుపుచున్నారు.

పరిసయ్యులు ప్రజలకు నాయకులుగా వ్యవహరించే వారు. అయితే పరిశయ్యులు తమ అంతరంగాన్ని చక్క పరచుకోనంతవరకు వారు గ్రుడ్డి నాయకులే. గ్రుడ్డి నాయకులు వేరే వారికీ దేవుని మార్గం ఎలాగా చూపించగలరు?

యేసు ప్రభువు మనందరియొక్క నాయకుడు ఎందుకంటే ఆయన మాత్రమే మనలను తండ్రి మార్గంలోకి నడిపిస్తారు. ఆయనయే ఈ లోకానికి వెలుగు. మన జీవితాలు మంచిగా ఉంచకుండా, వేరొకని మంచిగా జీవించమని చెప్పుట సరిఅయిన పద్దతి కాదు అని ప్రభువు తెలుపుచున్నారు.మంచి సమాత్రుకగా ఉన్నవారే వేరొకరికి మార్గం చూపించగలరు.

2. శిష్యుడు గురువుకంటే అధికుడు కాదు

 శిష్యులు ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికిని ఆయన పొందినది మొత్తం గురువు దగ్గర నుండియే .. కాబట్టి శిష్యుడు గురువు కన్నా అధికుడు కానేరడు. శిష్యుల యొక్క జీవితంలో వెలుగును నింపింది గురువే నేర్పింది గురువే, దరి చూపించింది గురువే, జీవితం జారీచేసింది గురువే కాబట్టి మనం ఎప్పుడు కూడా గురువుకన్నా చిన్నవారమే. మన గురువు దేవుడే ఆయన కన్నా మనం ఎప్పుడు చిన్నవారమే కాబట్టి మన గురువుకు విధేయించాలి, గౌరవించాలి.

3. మన కంటిలో దూలం ఉంచుకొని వేరొక వ్యక్తి కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపిస్తాం.

మనందరికీ గురువింద గింజ తెలుసు పైన ఎర్రగా ఉంటుంది, క్రింద నల్లగా ఉంటుంది. చాలా సందర్భాలలో మనందరం పైకి మంచి వరమని, పవిత్రులమని భావిస్తాం కానీ అది వాస్తవం కాదు. మనం వేరొక వ్యక్తుల మీదనే ఎక్కువ (focus, attention) శ్రద్ధ ఉంచుతాం కానీ మన జీవితాలను మనం పరిశీలించుకోము.

పరిసయ్యులు సామాన్య ప్రజల జీవితాల మీదనెను శ్రద్ధ (focus) పెట్టారు కానీ తమ జీవితాల గురించి మరిచి పోయారు. -ఇతరుల గురించి తీర్పుచేశారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ (యోహాను 8: 3-11) యొక్క సువిశేష భాగంలో అక్కడా అందరూ పాపం చేసినవారే కానీ ఆ స్త్రీ పట్టుబడింది కాబట్టి ఆమెను శిక్షించాలని అనుకున్నారు. మన పాపాలు మనం తెలుసుకోవాలి, శారీరక శుద్ధి మాత్రమే కాదు అంతరంగిక శుద్ధి అవసరం. ఇతరుల గురించి తీర్పు చేయుటకు మనం అర్హులము కాదు. దేవుడు ఒక్కరే సత్యవంతుడు , పవిత్రుడు. మనలో చాలా మంది ఇతరులలో ఉన్న తప్పిదాలే వెదుకుతారు కానీ మంచిని చూడలేరు. మనం ఎవ్వరిని తీర్పు చేయకుండా నిందించకుండా, ప్రేమతో జీవించాలి. దేవుడే మన తీర్పరి.

4. అంతరంగిక శుద్ధి కలిగి జీవించాలి

మనయొక్క అంతరంగ పరిశుద్ధంగా ఉంటే మన మాటలుకూడా పరిశుద్ధంగా మంచిగా ఉంటాయి. మనయొక్క మాటలు అన్ని హృదయంనుండి, మనస్సునుండి వెలువడతాయి. మన హృదయాంతరాళంలో ఏవయినా స్వార్థం, క్రోధం, అసూయా, పగలు, ద్వేషాలు వున్నట్లైతే వాటి ద్వారా మన మాటలు చేతలు, ప్రవర్తన అవినీతి కరంగా ఉంటాయి. అంతరంగ జీవితం కు బాహ్య జీవితం కు సంబంధం ఉన్నది. ఇది కూడా విశ్వాసం చేతలు లాంటిది, రెండూకూడా ముఖ్యమే ఒకటి ఉంటే సరిపోదు.

పరిసయ్యులు బాహ్య జీవితానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. అంతరంగిక జీవితం మర్చిపోయారు. మాటలు, బోధనలు మాత్రమే వున్నాయి కానీ చేతలు లేవు. మంచి జీవితం లేదు. అందుకే ప్రభువు వారిని కపట వేషధారులు అని అంటున్నారు.

ప్రజల యొక్క మెప్పుకోసమే అనేక కార్యాలు చేసేవారు, దేవుణ్ణి స్తుతించారు కానీ వారి యొక్క హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మనం కూడా మంచి జీవితం అనగా అంతరంగికంగా మరియు బాహ్యంగా పవిత్రులై ఉండాలి.

మనందరం కూడా మంచి ఆలోచనలు కలిగి, మంచి మాటలు మాట్లాడుతూ ఒక మంచి విశ్వాసం జీవితం జీవించాలని ప్రభువు తెలుపుచున్నారు. మన సంభాషణలు యేసుక్రీస్తు సంభాషణల వలే మంచిగా పవిత్రంగా ఉండాలి.

Rev. Fr. Bala Yesu OCD

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

8 వ సామాన్య ఆదివారం

 మనిషి మాటే  - మనస్సు బాట 

సీరా 27:4-7, 1 కోరింథీ 15:54-58 లూకా 6:39-45 

క్రీస్తునాధుని యందు  ప్రియమైన దేవుని బిడ్డలారా , ఈనాడు తల్లి శ్రీ సభ  మనలను 8 వ ఆదివారం లోనికి ఆహ్వానిస్తుంది. ఈ నాటి పరిశుద్ద గ్రంధ పఠనములు ద్వారా మనకు ఇచ్చిన సందేశం మనిషి మాట ద్వారా మనస్సును తెలుసుకోవచ్చు అని మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. 

మొదటి పఠనం :- ఈనాటి మొదటి పఠనంలో మనిషి మాటకు -మనిషి మనస్సుకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియ చేస్తుంది. మనిషి మనస్సును మనం చూడలేముం వినలేము కానీ మనిషి మాట మనకు వినిపిస్తుంది. కనుక మనిషి మాటలే మనకు అతని మనస్సును మనకు తెలియ జేస్తాయి. మనిషి మనస్సు, గుణం, శీలం మనిషి మాటల ద్వారం ఏ విధంగా బయటపడతాయో ఈనాటి మొదటి పఠనం మనకు తెలియ జేస్తుంది. 

ఊపిన జల్లెడ- కుమ్మరి చేసిన కుండ, చెట్టు కాపు అనే మూడు ఉపమానములు చెబుతూ మనిషి యొక్క  హృదయనంతరంగమును తెలుసుకొనుటకు అతని మాటలే అని తెలియజేస్తున్నడు. కనుక ఏ నరున్ని అతన్ని మాట్లాడకముందు స్తుతించరాదు. 

1. ఊపిన జల్లేదలో మట్టి పెళ్లలు మిగులునట్లే మనిషి సంభాషణమున దోషములు కనిపించును మనిషి మనస్సులోని దోషములు  మాలిన్యాము. స్వార్ధము అతని మాటలలలోనే బయటపడుతాయి. 

2. కుమ్మరి చేసిన కుండకు అగ్ని పరీక్ష అవసరం, అగ్నిలో కాల్చబడాలి. అలాగే మనిషికి పరీక్ష అతడి మాటలే. 

3. చెట్టు కాపును బట్టి అదెంత  బలమైనదో ఊహించవచ్చు అలాగే మాట తీరును బట్టి అతడు మంచి వాడా , చెడ్డ వాడ అని అర్ధం చేసుకోవచ్చు. పండును బట్టి చెట్టు స్వభావమును తెలుసుకుంటారు. పండు మంచిదైతేనే చెట్టు మంచిదని, పండు చెడ్డదైతే చెట్టు మంచిది కాదని ఎలా అనుకుంటామో అలాగే మనిషి మాటలను బట్టి అతను ఎలాంటి వాడు, అతని స్వభావం ఏమిటి అని తెలిసిపోతుంది. 

మనిషికి ఉన్న మాట దేవుడిచ్చిన వరం. ఆ వరంతో దేవుడిని స్తుతించడానికి, ఇతరులకు తెలియచేయడానికి ఇతరులతో స్నేహ బంధాలు ఏర్పరుచుకొని వారితో శాంతి, సమాదానంతో జీవించడానికి వినియోగిస్తున్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఇచ్చే వరములను సద్వినియోగం చేసుకుంటే వారి జీవితం దేవునిలో వర్ధిల్లుతుందని, దానిని దుర్వినియోగం చేసుకుంటే జీవితం పాడైపోతుంది. 

మనిషికి మాట శుద్ది ఎంతో అవసరం : - 

మన హృదయం పవిత్రంగా ఉంటే మన మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి. మన హృదయంలో  స్వార్ధము, కోపము, అసూయ,పగ, దురాశ ఉంటే మన మాటలు, చేతలు, ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. 

మన మాటలు మన హృదయాన్ని బహిర్గతం చేస్తాయి. our speach reveals our heart. తల్లి మాటలను బట్టి బిడ్డను ఎంత ప్రేమిస్తుందో అర్ధంచేసుకోవచ్చు.  ఇతరులు మాట్లాడే విధానమును బట్టి వారు అభిమానంతో , ప్రేమతో మాట్లాడుతున్నారా? లేదా అని అర్ధం చేసుకోవచ్చు. 

మనిషి నీతి న్యాయముతో కూడిన మాటలు ఆనందము, సంతోషముతో కూడిన మాటలు ఓదార్పు,సహనం ,ప్రోత్సాహపు మాటలు, శాంతికరమైన మాటలు, క్షమించమని అడిగేమాటలు దేవుని బిడ్డల నుండి వస్తాయి. మనము కూడా అలాంటి  వారికే ప్రాముఖ్యతను  ఇచ్చి వారినీ ఇష్ట పడటమే కాదు వారి వలె ఉండటానికి ప్రయత్నించాలి. అబద్దపు మాటలు చాడీలు , గొడవలు పెట్టె మాటలు, బూతు మాటలు ఇతన్నింటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. "ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్ధమైన మాటకు సమాదానం ఇవ్వవలసి ఉన్నది."మత్తయి 12:36 . అదే విధంగా నీ మాటలు బట్టి నీవు దోషివో , నిర్ధోషివో కాగలవు (మత్తయి 12:37). మన మాటలు మనం వ్యక్తిత్వాన్ని, మనస్సును తెలియ చేస్తాయి. గ్రీకు తత్వవేత్త సోక్రటీసు గారు చెప్పిన మూడు ద్వారములు : మనం నోటి మాట మూడు ద్వారములు దాటి బయటకు రావాలి, 1. మనము చెప్పే మాట నిజమేనా, 2. మనము చెప్పే మాట అవసరమేనా  మరియు 3. మనము చెప్పే మాట ఉపయోగమేనా. మన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెళువడును(లూకా 6:45). 

రెండవ పఠనం :-  1 కోరింథీ 15:54-58 

ఈనాటి రెండవ పఠనాన్ని  ధ్యానించుకుందాం. ప్రియమైన  స్నేహితులారా  రెండవ పఠనంలో పునీత పౌలుగారు కోరింథీ  ప్రజలతో మాటలాడుతున్న  మాటలు  మనం శ్రద్దగా పరిశీలిస్తే, ఆయన ఆ ప్రజలకు దేవునితో ఉండటానికిధైర్యాన్ని ఇస్తున్నారు. 1 కోరింథీ 15:58 వ వచనంలో మూడు ముఖ్యమైన మాటలను కోరింతి ప్రజలకు చెపుతూ మనోధైర్యాన్ని, దేవుని యందు ధృడత్వాన్ని వారికి అందిస్తున్నాడు. ఆ మూడు విషయాలను తమ జీవితంలో నెరవేరిస్తే  దేవునిలో నిలబడగలవు అంటున్నారు. ఆ మూడు విషయాలు  మొదటిది ప్రియతమ సోదరులారా , దేవుని బిడ్డలారా దేవునిలో ధృడముగా, స్థిరముగా నిలబడుడు అని అంటున్నారు. అంటే మనం జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినను భాదలు వచ్చినను ఇబ్బందులకు గురి అయినను దేవుని  యెడల అపారమైన ప్రేమ, నమ్మకము , విశ్వాసము కలిగి ఉండమంటున్నారు. భౌతికమైన మన శరీరానికి అమరమైన క్రీస్తుని ధరించి ఆయనతో స్థిరంగా నిలబడమంటున్నారు పౌలుగారు. 

రెండవదిగా ప్రభువు కార్యములలో సర్వదా శ్రద్ద చూపుడు. ఈ మాటలకు అర్దం దేవునియొక్క పనులలో సంఘం యొక్క నడిపింపులో , దైవ జనులకు సహాయము చేయుటలో ప్రభువునకు సంభందించిన పనులు చేయుటకు ముందుండి ఆ దేవుని దైవత్వంలో పాలి భాగస్తులై ఉండమంటున్నారు. ఆత్మలను దైవ సన్నదికి నడిపించ ప్రభు సేవలో ప్రభుని కార్యములో సర్వదా శ్రద్ద చూపుచు ఈ లోక వ్యామోహాలకు, ఈలోక  విషయాలకు నీ హృదిలో చోటు ఇవ్వక ప్రభువునకు సంభందించిన ప్రతికార్యములో శ్రద్ద చూపాలని పౌలుగారు పలుకుతున్నారు. ఇక , మూడవదిగా ఈ రెండు కార్యములను నీ హృదయ పూర్వకముగా చేసిన యెడల మీరు చేసే ఎట్టి కార్యాలు నిష్ప్రయోజనం కాదని పౌలుగారు పలుకుతున్నారు. 

సువిశేషం :- లూకా 6: 39-45 

ఈనాటి సువిశేషంలో కూడా మొదటి పఠనంలో చూసిన విధంగా వృక్షములను బట్టి దాని ఫలములుండును. అదే విధముగా ఒక మనుజుని మాటలు ఆయన తలంపులను బయలుపరచుచుండు సిరా 27:6 లో చూస్తున్నాం. సువిశేషంలో ప్రభుని మాటలు  "మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఈయజాలదు. లూకా 6:43. పండుని బట్టి ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు. కోరింద పొదలనుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. దుర్జనుడు తన దుశ్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును.  "ఎలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. లూకా 6:43-45. 

మనం మాట్లాడే మాటలు మన హృదయం నుండి వస్తు వుంటాయి. మన అంతరంగం పవిత్రంగా ఉంటే మన మాటలుకూడా మంచిగా ఉంటాయి. మన హృదయంలో స్వార్ధం, క్రోధం, అసూయ , పగ , దురాశలు  ఉన్నప్పుడు మన యొక్క మాటలు, చేతలు ప్రవర్తన, నడవడిక అసభ్యంగా ఉంటాయి. అవినీతిగా ఉంటాయి. దురాశలతో నిండిన హృదయం నుండి మంచి మాటలు, చేతలు ఉద్భవించవు. మన ఆంతరంగిక జీవితానికి బహిరంగ ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పరిసయ్యుల బహిరంగ ప్రవర్తనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. వారికి మాటలు , చేతలు చట్ట పరంగా ఉంటే చాలు. ఆంతరంగిక ఉద్దేశాలు, బావాలు ఎలా ఉన్నా పర్వలేదు. యేసు ఈ పరిసయ్యులను ఉద్దేశించి ఈ పఠనములోని వచనాలు పలికారు. వారి యొక్క చెడు డాంబిక ప్రవర్తనను, భక్తి  కార్యాలను యేసు ఖండించారు. ప్రజల పొగడ్తలకై ఎన్నో చేశారు కానీ హృదయ పూర్వకంగా దేవుని ఆరాధించలేదు. వారు పెదవులతో దేవుని ఆరాధించేరే కాని వారి హృదయాలు ఆయనకు ఎంతో దూరంగా ఉన్నాయి. వారి కార్యలన్నీ చెట్ల పండ్లు వంటివే. ఎందుకంటే అవి అన్నీ వారి హృదయంతరిక భక్తి హీనత నుండి, అవినీతి నుండి ఉద్భవిస్తాయి. మానవుని యొక్క మాటకు, కార్యనికి  విలువను ఇచ్చేది అతని ఉద్దేశం. 

మన అంతరంగం పరిశుద్దంగా ఉన్నపుడే మన మాటలు కార్యాలు దేవునికి ప్రీతికరంగా ఉంటాయి. క్రైస్తవులమైన మనము అనేక సార్లు ఆ పరిసయ్యుల వలె ప్రవర్తిస్తుంటాము. మన హృదయం అవినీతిలో,దురాశలతో నిండి ఉన్నప్పుడు పరిసయ్యుల వలె కాక మన హృదయాన్ని పరిశుద్ద పరచుకొని ఇతరులకు మార్గదర్శులం అవ్వాలి. అనగా క్రైస్తవుని హృదయంలో మన హృదయంలో పవిత్రత, నీతి , న్యాయం, ప్రేమ ,శాంతి ,సమాదానం, ఆనందం సహకారం  మొదలైనవన్ని నెలకొంటాయి, అప్పుడు మానవుడు పలికే ప్రతిమాట నిజమైన క్రైస్తవ స్వభావాన్ని నిరూపించగలదు. 

ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా హృదయ పరిపూర్ణత, పరిశుద్దత నుండే నోటి మాట వస్తుంది. లూకా 6:45. కాబట్టి మన హృదయాన్ని నిరంతరం (శుద్ది) ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడే మన ఆలోచన ,మాట , యుక్తవిధంగా ఉంటాయి. పది మందికి ఉపయోగపడుతాయి. 

Br. Manoj 

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...