4, జూన్ 2022, శనివారం
పెంతుకోస్తు మహోత్సవం(2)
పెంతెకోస్తు మహోత్సవము
పెంతెకోస్తు మహోత్సవము
28, మే 2022, శనివారం
ప్రభువు మోక్షరోహణ పండుగ
అపో. కా 1:1-11, ఎఫెసీ 1: 17-23, లూకా 24:46-53
ఈ రోజు తల్లి శ్రీ సభ యేసు క్రీస్తు ప్రభువు యొక్క మోక్ష రోహణ పండుగ జరుపుకొంటుంది. ప్రభువు పునరుత్థానం అయిన నలభై రోజులు శిష్యులకు దర్శనమిస్తూ , వారి విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ వారిని సువార్త పరిచర్యకు తయారు చేస్తూ, వారు సంపూర్ణంగా దేవుని యొక్క అనుభూతిని పొందిన తరువాత శిష్యులకు పరలోకంలో నివాసం కల్పించుటకు యేసు క్రీస్తు ప్రభువు, తన తండ్రి చెంతకు తిరిగి వెల్లుచున్నారు. యోహను 14:2-3.
యేసు ప్రభువు పూర్వం తాను ఉన్న స్థలమునకు వెల్లుచున్నారు. పరలోకం నుండి దిగివచ్చిన దేవుడు మనకు పరలోక విషయాలను బోధించి మనలను పరలోకం నడిపించుటకు , మనలను పరలోకంకు చేర్చుటకు మార్గం చూపించారు.
తాను వచ్చిన స్థలంకే మరలా తిరిగి వెల్లుచున్నారు. ఆయన పరలోకం వెళ్ళిన సరే లొకాంతము వరకు మనతోనే ఉంటారు. మత్తయి 28:20. దివ్య సత్ప్రసాదంద్వారా, దివ్య సంస్కారముల ద్వారా, ప్రార్ధన ద్వారా, వాక్యం చదవటం, ధ్యానించటం ద్వారా దేవుడు మనతోనే ఎప్పడూ ఉంటారు.
క్రీస్తు ప్రభువు పరలోకంకు వెళ్ళటం ద్వారా దేవుని పనిని ఈ లోకంలో కొనసాగించాలి. దేవుడు మనలను భౌతికంగా విడిచి వెళ్లినందుకు ఒక విధంగా మనం బాధ పడాలి. ఇంకొక విధంగా సంతోషించాలి. ఎందుకంటే త్రీత్వంలో పవిత్రాత్మ దేవున్ని మనకు తోడుగా ఉండుటకు పంపిస్తానన్నారు. పవిత్రాత్మ ఆదరణకర్తగా , ఓదార్చువాడుగా మనకు తోడుగా ఉండటానికి పంపిస్తానన్నారు.
ఈరోజు మనం చదువుకున్న మొదటి పఠనంలో పునీత లూకా గారు యేసు ప్రభువు యొక్క పునరుత్థాన సన్నివేశంను వివరించారు. దానితో పాటు శిష్యులకు పవిత్రాత్మను ఇస్తానని వాగ్ధానం చేశారు.
సువార్తికులలో కేవలం లూకా గారు మాత్రమే ప్రభువు యొక్క మోక్ష రోహణంను చక్కగా వివరించారు. ప్రభువు యొక్క శిష్యులు ఆయనను చూడటం అదే చివరి సారి. వారందరు యేసు ప్రభువును చూస్తుండగా ప్రభువు వారి కనుచూపు మేర నుండి మేఘాల్లో అదృశ్యమయ్యారు.
మొదటి పఠనంలో లూకా గారు యేసు ప్రభువు యొక్క పునరుత్థానం తరువాత ఏ విధంగా శిష్యులతో వున్నారో, ఎలాగా వారిని బలపరిచారో, ఎంత గొప్పగా వారిని తీర్చి దిద్దరో, అలాగే వారికి పవిత్రాత్మ దేవుని ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు గురించి తెలిపారు.
లూకా గారు ఆయన వ్రాసిన సువార్త మరియు అపోస్తులుల కార్యములు తెయొఫీలూ అనే వ్యక్తికి అంకితం చేశారు. లూకా 1:1.
తెయొఫీలూ సమాజంలో మంచి పేరున్న వ్యక్తి కాబట్టియే లూకా గారు ఆయనను ఘనత వహించిన తెయొఫీలు అని సంబోదిస్తున్నాడు.
తెయొఫీలూ అనగా దేవుని చేత ప్రేమించబడిన వాడు అని మరియు దేవుని స్నేహితుడని అర్ధం. ఆయన పాలస్తీనాకు బయట జీవించారు. అందుకే లూకా గారు ఆయనకు ప్రభువు విషయాలు లేఖల ద్వారా తెలియజేస్తున్నారు.
తెయొఫీలూ అను వ్యక్తి దేవునిలో ఎదగాలని కోరుకున్న వ్యక్తి దేవుని గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవున్ని వెంబడించిన వ్యక్తి.
తెయొఫీలుకు దేవుని పట్ల తృష్ణవుంది. ఆయన్ను తెలుసుకోవాలనే దాహంతో ఉన్నారు. రెండు పుస్తకాలు ఆయన కోసమే లూకా గారు వ్రాసారంటే ఆయనకు ఎంత ప్రగాఢమైన కోరిక వుందో మనం తెలుసుకోవాలి. తేయొఫీలూ క్రీస్తు ప్రభువు యొక్క జీవితంకు ఆకర్షింపబడ్డారు.
యేసు ప్రభువు పునరుత్థానం తరువాత శిష్యులకు దర్శన మిస్తూ, శాంతి యుతంగా జీవించుట గురించి బోధించారు. అలాగే దేవుని ముంగిట ఎలా జీవించాలి అనే విషయములను నేర్పించారు.
దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు శిష్యులలో ఒక ఆశను కలిగించారు. మనిషి జీవితంలో కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగితే జీవితం నిలబడుతుంది అని ప్రభువు నేర్పించారు. బ్రతుకు మీద ఆశలు కల్పించారు.
ప్రభువు పరలోకంకు వెళ్ళేంత వరకు సువార్తను ప్రకటించుచునే వున్నారు. తన తండ్రికి సంపూర్ణ, విధేయత చూపుతూ తనకున్నది, మొత్తం కూడా తండ్రిని మహిమ పరుచుటకే అని భావించి ఆయనకు విశ్వాస పాత్రునిగా జీవించారు.
దేవుడు మనకిచ్చిన వరములన్నీ మంచిగా వినియోగించి పరలోకంకు వెళ్ళాలి. పరలోకంలో ప్రవేశించే వరకు మన యొక్క వరాలను మనం దేవున్ని మహిమ పరచడానికే వినియోగించాలి. యోహను 9:4, 1 పేతురు 4:10 .
యేసు ప్రభువు ఈ భూలోకంలో పరిచర్య చేసి తండ్రి చెంతకు తిరిగి వెళ్ళే సమయం వరకు పవిత్రాత్మ దేవుని శక్తి తో పనిచేసి బోధించారు. యేసు ప్రభువు పవిత్రాత్మ మీద ఆధారపడి జీవించారు. తనను తాను సమర్పించుకున్నారు.
క్రీస్తు ప్రభువే పవిత్రాత్మ మీద ఆధారపడి జీవిస్తే మరి మనమెంతగా ఆదారపడి జీవించాలి.
యేసు ప్రభువు ఆజ్ఞలిచ్చి వాటిని పాటించమని తాను ఎన్నుకొన్నవారికి తెలియజేశారు. అనేక మందికి పరలోక విషయములు తెలియజేసినా ప్రభువు యొక్క మనసు , attention శిష్యుల మీదనే ఉంది. ఎందుకంటే ఆయనకు సాక్షులుగా ఉండబోతున్నారు కాబట్టి. ప్రభువు పరిచర్యం మొత్తం కూడా శిష్యుల మీదనే ఆధారపడి ఉంది. శిష్యులె ప్రభువు యొక్క సందేశాన్ని మొదటిసారిగా అందించేవారు. ఆయన పునరుత్థాన వార్తను అదించేవారు శిష్యులే కాబట్టి ప్రభువు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వారు విఫలమైతే ప్రభువు యొక్క పని విఫలమైనట్లే. అందుకే శిష్యుల మీద concentrate చేశారు. వారు విజయం పొందితే, ప్రభువు విజయం పొందినట్లే ఆయన యొక్క పని సంపూర్ణంగా పూర్తి అవుతుంది.
ప్రతి యొక్క క్రైస్తవుడు కూడా ప్రభువు గురించి ప్రకటించాలి. 2 తిమోతి 2:2., మత్తయి 28:19-20 యోహను 20:21.
అపో 1:3 వ వచనంలో ప్రభువు శిష్యులకు పునరుత్థానం అయ్యాక కనిపించారని తెలుపుతుంది. నూతన నిబందన గ్రంధం లో, దాదాపు 10 సార్లు ఆయన దర్శనం గురించి వ్రాయబడింది.
1. మగ్ధలా మరియమ్మకు దర్శనం ఇచ్చారు. యోహను 20:11- 18
2. స్త్రీలకు దర్శనం ఇచ్చారు, ఖాళీ సమాధి గురించి చెప్పుటకు వెళ్తున్న స్త్రీలకు ప్రభువు దర్శనం ఇచ్చారు. మత్తయి 28: 8-10
3. పేతురు గారికి దర్శనం ఇచ్చారు. లూకా 24:34, 1 కోరింథీ 15:5
4. ఎమ్మావు మార్గంలో శిష్యులకు దర్శనం ఇచ్చారు. లూకా 24:13-42
5. శిష్యులకు తోమా గారు లేని సమయంలో ఇచ్చిన దర్శనం. మార్కు 16:14, యోహను 20:19-25.
6. చేపలు పట్టుటకు వెళ్ళిన శిష్యులకు దర్శనం ఇచ్చారు. యోహను 20.
7. ప్రభువు 500 మంది విశ్వాసులకు దర్శనం ఇచ్చారు. 1కోరింథీ 15:6
8. శిష్యులందరు ఉన్నప్పుడు దర్శనం ఇచ్చారు. మత్తయి 28:16-20
9. యకొబుకు దర్శనం ఇచ్చారు. 1 కోరింథీ 15:7
10. ఆయన మోక్ష రోహణమప్పుడు విశ్వాసులకు దర్శనం ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకా కోన్ని బహుశ వ్రాయబడలేదు. యోహను 20:30-31.
మోక్షరోహణ సమయంలో ప్రభువు శిష్యులను, విశ్వాసులను సాక్షులై ఉండమని తెలుపుచున్నారు. 8 వ వచనం. పవిత్రాత్మ పొందిన తరువాత భూదిగంతముల వరకు మనము దేవునికి సాక్షులై ఉండాలని ప్రభువు తెలిపారు. శిష్యులు పవిత్రాత్మ శక్తిని పొందిన తరువాత ఈ లోక ఆశలు ఏమియు వారు కొరలేదు. అధికారం కోసం, పేరు కోసం, ఆశ పడలేదు. కేవలం ఆయనకు సాక్షులై జీవించారు.
శిష్యులు దేవుని విషయాలను అందరితో పంచుకున్నారు, ఈ వచనంలో మీరు అంటే కేవలం శిష్యులు మాత్రమే కాదు. అందరు ప్రతి విశ్వాసి కూడా సాక్షియై జీవించాలి. సువార్తను ప్రకటించాలి.
సాక్షులై జీవించుట అంటే దేవునికొరకు జీవించుట, ప్రాణాలు సైతం సమర్పించుట. సాక్షులు క్రీస్తు ప్రభువు ఆలోచనలు కాదు తెలిపేది ,క్రీస్తు ప్రభువునే.
ఈనాటి రెండవ పఠనంలో దేవుని విశ్వాసులు ప్రభు జ్ఞానమందు ఎదుగుట కొరకు పౌలుగారు ప్రార్ధిస్తున్నారు. దేవుని యొక్క పవిత్రాత్మను పొందుకొని వారు ప్రభువుని తెలుసుకొనుటకు ప్రార్ధిస్తానని చెబుతున్నారు.
విశ్వాసులు దైవ జ్ఞానంను కలిగి జీవించాలి. మనం దేవుని గురించి తెలుసుకోవాలి. ఆ దేవుడు క్రీస్తు ప్రభువే ఆయన తండ్రి యొక్క ప్రియమైన కుమారుడు. అలాగే విశ్వాసులు, తండ్రి దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన సృష్టి కర్త అని గ్రహించి, వారి యొక్క గొప్పతనం ధ్యానించుకొని వారి గురించి జ్ఞానం సంపాదించుకోవాలి.
దేవుడు సజీవుడు, నిజమైన దేవుడు కాబట్టి విశ్వాసులందరు ఆయన జ్ఞానంలో ఎదగాలి. దేవుని జ్ఞానంలో ఏదగాలంటే మూడు విషయాలు మనం కలిగి ఉండాలి.
1. విశ్వాసికి విజ్ఞానము వుండాలి. దేవుని యొక్క ఆత్మ ఉండాలి.
2. విశ్వాసి దేవునితో సంబంధం కలిగి జీవించాలి. దేవుడు ఎవరని గ్రహించి ఆయనతో బంధంను ఏర్పరుచుకోవాలి.
3. విశ్వాసి దేవున యొక్క క్రియలు తెలుసుకొని రోజు రోజుకు ఆయనలో ఎదగాలి . తెలుసుకోవాలి అనే కోరిక ఉండాలి.
రెండవ భాగంలో యేసు క్రీస్తు ప్రభువును తండ్రి లేవనెత్తిన విధానం గురించి పౌలు గారు తెలుపుచున్నారు.
ప్రభువు చూపిన విధేయతను బట్టి సమస్తము ఆయన పాదముల క్రింద వుంచారు. తండ్రి కుమారున్నీ అధికంగా దీవించారు. మనందరం ఆయన శరీరంలో భాగస్తులము కాబట్టి ఆయన్ను గురించి ప్రకటించాలి. మన యొక్క క్రియల ద్వార , మాటల ద్వారా ప్రకటించాలి.
ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు చివరి సారిగా శిష్యులతో మాట్లాడారు. ఆయన పునరుత్థానం తరువాత చివరి రోజు ప్రభువుకు భూలోకంలో . ఇది మోక్ష రోహణంకు ముందు. ప్రతి ఆదివారం విశ్వాస ప్రమాణంలో మనం చెబుతాం. ఆయన పరలోకంకు ఎక్కి తండ్రి కుడి ప్రక్కన కూర్చొని వున్నారని. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన తరువాత ఆయన ప్రణాళికా ప్రకారంగా తండ్రి చెంతకు తిరిగి వెల్లుచున్నారు.
యేసు ప్రభువు 40 రోజుల తరువాత మోక్షంకు ఎత్త బడ్డారు. తండ్రి కుమారున్నీ పునరుత్థానం ద్వారా మహిమ పరిచారు. మరొకసారి మోక్ష రోహణం ద్వారా మహిమ పరచి తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడైయ్యేలా చేశారు.
ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు ప్రభువు యొక్క పట్టాభిషేకం రోజు. ప్రభువుకు పరలోకంలో సన్మానం జరిగిన రోజు. ఆయన యొక్క త్యాగ క్రియలకు, తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చినందుకు పరలోకంలో గొప్ప సన్మానం జరుగుతుంది.
క్రీస్తు భూలోకంలో తనకొసగబడిన కర్తవ్యాన్ని జయ ప్రదంగా ముగించుకొని వస్తున్నాడని పరలోక దూతలు ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు.
పిత దేవుడు , పవిత్రాత్మ దేవుడు కుమారున్ని పరలోకంలోకి ఆహ్వానించి తండ్రి తన కుడి ప్రక్కన సింహాసనములను ఇచ్చారు. ఇది పరలోకంలో ఒక పండుగ దినం, సంతోషకరమైన రోజు. ప్రభువు పరలోకంలోకి ప్రవేశించారు. ప్రభువు వలె మనమందరం కూడా పరలోకంలో ప్రవేశించాలి.
ప్రభువు యొక్క మోక్ష రోహణంకు మరియు క్రీస్తు జయంతికి ఒక దగ్గర సంబంధం వుంది. క్రీస్తు జయంతిలో త్రీత్వంలో వున్న పుత్రుడు, దైవ , మానవ స్వభావంతో ఈ లోకంలో జన్మించారు.
మోక్ష రోహణం ద్వారా పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువు దివ్య శరీరం ద్వారా దైవ స్వభావంతో మరల త్రీత్వంలో కలుస్తున్నారు, పరలోకంలో ప్రవేశిస్తున్నారు.
ఏ శరీరంను అయితే శిష్యులు పునరుత్థానం తరువాత తాకారో అదే దివ్య శరీరంతో ప్రభువు పరలోకానికి వెళ్లారు. క్రీస్తు జననం ద్వారా ప్రభువు భూలోకంలోనికి ప్రవేశించి మానవులకు దగ్గరగా వున్నారు. ఆయన మోక్ష రోహణం ద్వారా మళ్ళీ తండ్రి దగ్గరకు వెళ్లారు.
యేసు ప్రభువు అదే శరీరంతో పరలోకంకు వెళ్లారు. యేసు ప్రభువు మోక్ష రోహణం అయ్యే ముందు ప్రపంచమంతట వెళ్ళి బోధించమని శిష్యులకు చెప్పారు.
సువార్తను ప్రకటిస్తూ ప్రభువు యొక్క ప్రేమకు సాక్షులవ్వాలి. ప్రభు ప్రేమను ప్రపంచమంతట చాటి చెప్పాలి.
ఈ ప్రకటించే బాధ్యత కేవలం గురువులది, కన్యస్త్రీలది మాత్రమే కాదు. అది అందరికి చెందినది. అందరు ప్రకటించాలి. పవిత్రాత్మ దేవుని సహకారంతో మనందరం ప్రేమ వ్యాప్తికై కృషి చేయాలి.
ప్రభువు యొక్క ప్రేమతో పాటు మనందరం విశ్వాసం గురించి , దేవుని దయ గురించి , రక్షణము గురించి, క్షమను గురించి మనం బోధించాలి.
అనుదినం దైవ అనుభూతిని పొందుతూ మనం దేవుని గురించి ప్రకటించాలి.
యేసు ప్రభువు యొక్క మోక్ష రోహణం మనందరం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి.
1. మనం పరలోకంలో ప్రవేశించుటకు దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించాలి.
2. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి.
3. దేవుని యొక్క ప్రేమను పంచి పెట్టాలి.
4. పాపంను జయించి హృదయ పరివర్తనం చెంది జీవించాలి.
5. దేవుని సువార్తను ప్రకటించాలి.
6. దేవుని యొక్క ఆనందంలో పాలు పంచుకొని జీవించాలి.
By Rev . Fr. BalaYesu OCD
21, మే 2022, శనివారం
పాస్క 6 వ ఆదివారం (2)
అపో 15:1-2, 22-29, దర్శన 21:10-14, యోహను 14:23-29
ఈనాటి దివ్య పఠనాలు మరి ముఖ్యంగా మొదటి పఠనం సువిశేష పఠనం శాంతి గురించి బోధిస్తుంది. మనందరం ఐక్యంగా ఒకే ఆలోచనలో, అభిప్రాయంలో వుంటే అక్కడ ఎటువంటి కలహాలు వుండకుండా, శాంతి వుంటుంది, అని ఈ దివ్య పఠనాలు తెలియజేస్తున్నాయి.
మానవ జీవితంలో అనేక సందర్భాలలో కష్టతరమైన, క్లిష్ట సమస్యలకు పరిష్కారం, సమాధానం వెదికేటప్పుడు అభిప్రాయ భేధాలు రావచ్చు, సంఘర్షణలు రావచ్చు, వివాదాలు, విభేధాలు, మనస్పర్ధలు రావచ్చు. అలాంటి సందర్భాలలో మనం శాంతిని నెలకొల్పేందుకు ఒక మంచి మార్గాన్ని, అందరు మెచ్చే మార్గాన్ని ఎన్నుకోవాలి.
ఈనాటి మొదటి పఠనంలో తొలి క్రైస్తవులకు ఎదురైన ఒక సమస్యను గురించి వింటున్నాం.
అప్పుడే విశ్వాసం స్వీకరించిన ఆదిమ క్రైస్తవులకు రక్షణకు సంబంధించిన విభేదాలు వచ్చాయి. రక్షణ పొందాలంటే వాస్తవానికి ఒక వ్యక్తి ఏమి చేయాలి, అనే విషయం గురించి కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సున్నతికి సంభందించినది.
శ్రీ సభ ప్రారంభమైన తొలి 20 సంవత్సరములు, క్రైస్తవులంటే ఎక్కువగా యూద మతం నుండి క్రైస్తవులుగా మారిన వారే. ఆ సమయంలో ఏ అన్యుడైన, క్రైస్తవునిగా మారాలంటే వారు మొదటిగా యూదులుగా మారాలి. యూదుల అన్నీ ఆచారాలు అనుసరించాలి. అందుకే రక్షణ పొందాలంటే సున్నతి అవసరం అని యూదయ నుండి వచ్చిన అన్యులు అన్నారు. క్రైస్తవులుగా మారాలని ఇష్టపడుచున్న అన్యులు కూడా అన్నీ ఆచార విధులను పాటించాలని పట్టుబట్టారు.
అంతియోకు సంఘంలో ఉన్న విశ్వాసులు, క్రీస్తు సంఘంలో సున్నతి లేకుండానే చేరారు. వారు విశ్వసించేదెమిటంటే జ్ఞాన స్నానం , విశ్వాసం ఉంటే చాలు ఎవరైన రక్షణ పొందవచ్చని.
అప్పటి భేధాభిప్రాయం ఏమిటంటే అన్యులను క్రీస్తు సంఘంలో చేర్చుకునేందుకు వారు మొదటిగా యూదులుగా మారటం అవసరమా? లేదా? అనే భేదాభిప్రాయాలు వచ్చాయి.
ఈ భేదాభిప్రాయం ఏలా వుందంటే రెండు జాతులు మధ్య భేదాభిప్రాయం, రెండు సంస్కృతులు మధ్య, రెండు రకాల ఆలోచనల మధ్య భేదాభిప్రాయం మొదలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పౌలు, బర్నబా గార్లు ఎవరైన రక్షణ పొందాలంటే క్రీస్తు నందు విశ్వాసం కలిగి ఆయన్ను అంగీకరిస్తే చాలు, రక్షణ పొందవచ్చు అని తెలిపారు.
ఈలాంటి పెద్ద సమస్యను వారు ఏకాభిప్రాయం ద్వారా విశ్వాసుల మధ్య శాంతిని నెలకొల్పారు. పౌలు , బర్నబాలు ఈ సమస్యను అపోస్తులతో చర్చించి దీనిని సరి చేశారు.
మన కుటుంబాలలో కూడా సమస్యలు భేధాభిప్రాయలు ఉంటే వాటిని కూర్చొని మాట్లాడితే, ఏక ఆలోచన , నిర్ణయం కలిగి ఉంటే సమాధానంతో ఉండవచ్చు.
తొలి క్రైస్తవ సంఘం కూడా యెరుషలేములో మొదటిగా సమావేశాన్ని ఏర్పరిచారు, పవిత్రాత్మ తో నడిపింపబడి సరియైన నిర్ణయం తీసుకున్నారు.
అపోస్తులు తాము తీసుకున్న నిర్ణయం తమ ఒక్కరిదే కాదని స్పష్టం చేశారు. మా చేత నిర్ణయించబడినది అని తెలిపారు.
ఈ నిర్ణయం రెండు కారణాల వల్ల మహిమాన్విత ప్రాముఖ్యతను కలిగి ఉంది.
1. మొదటిగా క్రైస్తవ విశ్వాసాన్ని యూదామతం నుండి విస్పష్టంగా వేరు చేసింది.
2. రక్షణ అనేది మానవుని విశ్వాస జీవితానికి మరియు దేవుని ప్రేమకు చెందినది.
దేవుడు మనల్ని రక్షించేది ఆయన ప్రేమ వలనే ఆయన ప్రేమే మనలను కాపాడుతుంది.
మన విశ్వాస జీవితంలో కూడా మనం ప్రార్ధించాలి, మంచిగా జీవించాలి, సోదర ప్రేమ , దైవ ప్రేమ కలిగి ఉంటే దేవుని ఆజ్ఞలు పాటించి జీవిస్తే మనం రక్షణ పొందవచ్చు.
మన విశ్వాస జీవితంలో ప్రశాంతంగా వుండాలంటే ఒకే అభిప్రాయం ఉంటే అంతా శాంతి యుతంగా , ఆనందంగా వుంటుంది.
మన జీవితంలో దేవుని యొక్క తోడు ఎప్పుడు కూడా ఉండాలి.
ఈనాటి రెండవ పఠనంలో యోహను గారు నూతన యెరుషలేమును దర్శనంలో చూసారు. అది ఎంతో అందంగా, ప్రకాశవంతంగా ఉంది .
ఈ నూతన యెరుషలేము చుట్టూ గోడ కలదు, దానికి 12 ద్వారాలు ఉన్నాయి. ఈ పన్నెండు ద్వారాలు 12 మంది దేవ దూతల ఆధ్వర్యంలో ఉన్నాయి అని తెలిపారు
యోహను గారు చూసిన ఈ దర్శనం శ్రీ సభ గురించియే. ఈ నూతన యెరుషలేము అయిన శ్రీ సభ 12 మంది అపోస్తుల మీద నిర్మించబడింది. ఈ యొక్క శ్రీ సభ బాధ్యతలను మొదటిగా దేవుడు వీరికే అప్పజెప్పారు.
వారు దేవుని యొక్క నామమును వేదజల్లారు. యేసు క్రీస్తువే వారికి ఆదరువు , ఆయనయే వారికి వెలుగుగా, రక్షకునిగా మార్గ చూపరిగా ఉన్నారు.
దేవుని వెలుగును స్వీకరించిన వారు ఎల్లప్పుడు శ్రీ సభను ప్రకాశవంతంగా చేస్తారు.
ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యులను ఆజ్ఞలను పాటించమని తెలుపుచున్నారు.
మొదటిగా ప్రభువు అంటున్నారు. నన్ను ప్రేమించువారు, నా ఆజ్ఞలు పాటిస్తారు అని, వాస్తవానికి మనం ఎవరినైన ప్రేమిస్తే వారు చెప్పిందల్లా పాటిస్తాం, అనుసరిస్తాం. ఉదాహరణకు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడి పట్ల సోదర ప్రేమ కలిగి ఉంటే అతని కోసం ఏదైనా చేస్తాడు.
అదే విధంగా ప్రేయసి ప్రియుడి మధ్య ఉన్న ప్రేమ వలన ఒకరి మాట ఒకరు పాటించుకొని జీవిస్తారు.
మనం కూడా దేవున్ని ప్రేమిస్తే ఆయన్ను బాధ పెట్టము, ఆయన ఆజ్ఞలు పాటిస్తాము. ఆయన యొక్క చిత్తమునే ఈ లోకంలో నెరవేర్చుతాము.
దేవుని యొక్క ప్రేమ ఆజ్ఞలను పాటించుట ద్వారా మనం దేవుని ప్రేమకు సాక్షులవుతున్నాము. దేవుడు మనతో ఉంటారు. తండ్రి దేవుడు మనల్ని ప్రేమిస్తారు, దేవున పేరిట ఏమి అడిగినను దయ చేస్తారు, దేవుడు మనతో నివసిస్తారు.
దేవున్ని ప్రేమించని వారు ఆయన అజ్ఞలను పాటించరు, ఎందుకంటే ఆయన మీద ప్రేమ లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు అందుకే ఆయన ఆజ్ఞలను పాటించుట లేదు.
ఆయన్ను నిజంగా ప్రేమించేవారు ఆయన యొక్క ఆజ్ఞలను శిరసావహిస్తాడు, ఆయన చిత్తానికి తనను తాను లోబరుచుకుంటాడు. ఆయన మాటను పాటిస్తాడు.
దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా ఆయన్ను ప్రేమించుట అసాధ్యం. మనలో చాలా మంది దేవుని సహకారాన్ని అర్ధిస్తున్నమే కానీ ఆయన ఆజ్ఞలను పాటించుట లేదు.
ప్రభువా , ప్రభువా అని పిలిచేవారు పరలోకంలో చేరరు కాని దేవున్ని ప్రేమించి, ఆయన చిత్తాను సారంగా జీవించేవారే ప్రవేశిస్తారు. మత్తయి 7:21.
యేసు క్రీస్తు ప్రభువు వారు శిష్యులకు తోడుగా వుండుటకు ఓదార్పు వాడును పంపిస్తానంటున్నారు. పవిత్రాత్మ దేవుడు అందరికి అన్నీ విషయాలు తెలియ పరుస్తానంటున్నారు.
యేసు క్రీస్తు ప్రభువు వారు శిష్యులకు శాంతిని ఒసగుతున్నారు 27 వ వచనం. ప్రభువు యొక్క శాంతి నీతితోను, సత్యము తోను కూడిన శాంతి. ఈ లోకంలో అందరు శాంతి కోసం చూస్తున్నారు. యేసు ప్రభువు శాంతి ఇస్తానంటున్నారు. ఆయన శాంతి అంటే మనం ఆయన జీవితంను ఆదర్శం చేసుకొని ఎటువంటి ఆశలకు గురికాకుండా అధికారం కోసం ఆశించ కుండా డబ్బు మీద ప్రీతి ఉండకుండా కేవలం దేవుని చిత్తం నెరవేర్చుటయే.
యేసు క్రీస్తు తండ్రి చిత్తమును మాత్రమే నెరవేర్చారు. ఆయన శాంతి యుతంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా అయన జీవితంను ఆదర్శం చేసుకొని శాంతి సమాధానాలతో ఉండాలి.
ఏ విషయంలో కూడా భయ పడకుండా దేవుడే అన్నీ సమకూర్చుతాడు అనే విశ్వాసం కలిగి జీవించాలి.
Rev. Fr. Bala Yesu OCD
20, మే 2022, శుక్రవారం
పాస్క కాల 6 వ ఆదివారం
పాస్క కాల 6 వ ఆదివారం
అపో. కా 15:1-2,22-29 దర్శన 21:10-14,22-23 యోహను 14:23-29
క్రీస్తు
నాధుని యందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ నాడు తల్లి తీరుసభ ఈస్టర్ 6 వ ఆదివారం లోనికి అడుగిడుతుంది.
ఈనాటి మొదటి పఠనం అపోస్తుల కార్యముల నుండి
తీసుకొనబడింది. ఈ పఠనంలో ఒక ముఖ్యమైన
సంఘటనను వివరించడం చూస్తున్నాము. అది ఏమన “రక్షణ”మరియు సున్నతి .
ఈ సున్నతి వలన
యూదులకు మరియు పౌలు , బర్నబాలకు మధ్య ఒక గొప్ప వివాదం చోటుచేసుకుంది. అది ఏమి అంటే
యూదులకు సున్నతి పొందిననే తప్ప రక్షణ లేదు అని పౌలు, బర్నబాలు రక్షణ పొందడానికి
సున్నతితో సంభందం లేదు అని వాదించారు. యూదులు ధర్మ శాస్త్రానికి మరియు మోషే చట్టానికి ఎంతో
ప్రాముఖ్యతను ఇస్తారు. వారు పాటించడాని కంటే ఎదుటివారు పాటించడం మీద ఎక్కువ శ్రద్ధ
చూపిస్తారు, ఉదాహరణకు ఈనాటి వాక్యము మరియు క్రీస్తు ప్రభుని జీవితంలో జరిగిన
సంఘటనలు.
చట్ట ప్రకారము
సున్నతి పొందితేనే రక్షణ మరియు దేవాలయము
లోనికి అనుమతి. యూదులకు అన్యులు దేవాలయమునికి రావడం ఇష్టమే కాని వారు సున్నతి
పొందిన వారై ఉండాలి. సున్నతి పొందటం అంటే యూదుడుగా మారుటయే అని యూదులు
భావించేవారు. పౌలు , బర్నబాలు యూదుల మాటలన్నీ త్రోసివేసి దేవుడు ఒక్కడే, అన్యులకు ,
యూదులకు , గ్రీకులకు అందరకు ఆయనే దేవుడు, ఆయన యందే రక్షణ అని ధృడంగా వాదించారు.
రోమి 3:29... దేవుడు ఒక్క యూదులకే దేవుడా? ఆయన అన్యులకు కూడా దేవుడే, దేవుడు
ఒక్కడే కనుక ఆయన అన్యులకు కూడా దేవుడు. ధర్మ శాస్త్రమనే సంకెళ్లతో యూదులు ఎప్పుడు
బంధించడానికి ప్రయత్నించేవారు. కాని పౌలుగారు చెప్పినట్లు మరణించిన వారి మీద ధర్మ శాస్త్రము వర్తించదు.
మనము క్రీస్తు శరీరము ద్వారా మరణించితిమి, ఆయన లేవనెత్త బడినట్లు మనము ఆయనలో
సజీవులమయ్యాము, అంటే ధర్మ శాస్త్రముల నుండి విముక్తులమై, వ్రాతపూర్వకమైన ధర్మ
శాస్త్రమును అనుసరించిన పాత పద్ధతిలోకాక,
ఆత్మానుసరమైన క్రొత్త పద్దతిలో
దేవుని సేవించు చున్నాము. రోమి 7:1-6.
విశ్వాసమునకు
తండ్రి అయిన అబ్రహముకూడ ఎటువంటి ధర్మ శాస్త్రమును పొందలేదు, ఎటువంటి సున్నతి
పొందక ముందే దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింప బడ్డాడు. రోమి 4 :10 అబ్రహాము సున్నతి పొందక పూర్వమే విశ్వాసము వలన
దేవునిచే నీతిమంతునిగా అంగీకరింపబడెను. దేవుని బిడ్డలు కావాలంటే, దేవుని రక్షణ
పొందాలంటే విశ్వాసము అవసరము కాని బాహ్యకరమైన సున్నతి కాదు.
రోమి 3:30
విశ్వాసము ద్వారా ఆయన సున్నతి పొందిన వారిని , సున్నతి పొందని వారిని తనకు నీతిమంతులను
చేయును. అంతియోకులో ఈ వివాదము చోటు చేసుకోవడానికి కారణం కొంత మంది యూదులు,
ఎవ్వరైతే అన్యులంటె గిట్టని వారో , వారు ఎప్పుడు, యూదులు దేవునిచే ప్రత్యేకంగా
ఎన్నుకొనబడిన వారు అని, గర్వంతో వుంటూ ఇతరులను అన్యులుగా పరిగణించేవారు.
ఎప్పుడైతే ఈ
కొంత మంది యూదులు, విశ్వాసులుగా మారిన యూదులు, అన్యులు మధ్యకు వచ్చి ఈ యొక్క
మాటలను అన్నారో అప్పుడు యూదులకు మరియు పౌలు, బర్నబాలకు మధ్య వివాదం మొదలైంది.
ఇటువంటి ప్రవర్తనే మన క్రైస్తవత్వం లోనికి వస్తే మనము కూడా యూదా మతం లాగా
వర్గాలుగా మారాల్సి వచ్చేది.
క్రైస్తవత్వం అంటేనే కలయిక , కలసిఉండటం. ఈ కలయిక వలనే
క్రైస్తవత్వం అంటారు. మనమందరం కూడా క్రీస్తులో ఐక్యమవటం, ఆయనలో కలసి ఉండటం. ఎక్కడ
ఇద్దరు ముగ్గురు కలసి ఆయన నామమున ప్రార్థన చేస్తారో ఆయన అక్కడ ఉంటాను అని అన్నాడు.
దివ్య బలి
పూజ, దివ్య సత్ప్రసాదం ఇవన్నీ ఒక్కరి కోసం కాదు, ఒక తెగ కోసం కాదు, ఒక జాతి కోసం
కాదు. జాతి , కుల , ప్రాంతీయ వర్గ భేదాలు లేకుండా అందరు కలసి పాల్గొనే దానినే దివ్య బలిపూజ, అందరు కలసి భుజించే దానినే దివ్య సత్ప్రసాదం, అందుకే క్రైస్తవం, కలసి చేసేది, కలసి ఉండేది, క్రైస్తవత్వం. అందుకే
పౌలు , బర్నబాలు ఈ సమస్యను
అపోస్తులులు, పెద్దలు మరియు క్రీస్తు సంఘంలోని వారి యొద్దకు తీసుకొని
వెళ్ళినప్పుడు వారు ఎంతో చాక చక్యంగా మెలిగిరి.
వారికి వారుగా, వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. వారు పవిత్రాత్మ సహాయాన్ని కోరారు. వారు
పవిత్రాత్మ సహాయము ద్వారా ఎంతో చాక
చక్యముగా ఈ సమస్యను చక్క దిద్దారు. యేసు ప్రభువు చెప్పినట్లు మిమ్ము నడిపించడానికి
మీకు తోడుగా ఒక సహాయకుడిని పంపిస్తాను, ఆయన మీకు అన్నీ విషయాలలో అన్నీ
వేళలా తోడ్పడతాడు అని, ఆ పవిత్రాత్మ వారికి తోడ్పడింది ఈ సమస్యను తీర్చడానికి . యోహను 16:13-14. వారు సమస్యను చక్క దిద్దటమే కాదు, సమస్యను
చక్క దిద్దటములో ఎంతో తెలివిగా మెలిగారు.
వారు రాసిన
లేఖను తిరిగి పౌలు , బర్నబాలకు ఇచ్చి పంపించ కుండా, వారిలో ఇద్దరును ఎన్నుకొని, ఇద్దరికి పౌలు , బర్నబాలతో లేఖను ఇచ్చి పంపిచ్చారు. పౌలు, బర్నబాలు లేఖను
తీసుకొని వెళ్లినట్లయితే ప్రజలు
నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే వీరు
మార్గ మధ్యములో, కూడబలుకుకొని ఒక లేఖను తీసుకొని వచ్చి మనలను నమ్మిస్తున్నారు, అని అపోహ
పడే వారు. కానీ పవిత్రాత్మ ఇద్దరినీ పౌలు
, బర్నబాలతో పంపించి లేఖను చదివించి అంతియోకులో , సిరియాలో, సీలీషియాలో ప్రజల
విశ్వాసాన్ని దృడం చేసింది.
ఈనాటి రెండవ
పఠనంలో యోహను గారికి కలిగిన దర్శనం గురించి వివరిస్తున్నాడు. ఈ యొక్క దర్శనం నూతన యెరుషలేము గురించి మరియు దాని
వైభవము గురించి వివరిస్తుంది. యెరుషలేము
నగరం దాని యొక్క కాంతి, ప్రాకారము, ద్వారములు, గోడలు మరియుదేవుని సన్నిధి
గురించి తెలియజేస్తుంది. ఇటువంటి
దర్శనమును మనము యెహేజ్కెలు గ్రంధంలో కూడా
చూస్తాము. ప్రభువు యొక్క సన్నిధి దర్శనములో యెహెజ్కెల్ ప్రవక్తను యిస్రాయేలు
దేశమునకు తీసుకొనిపోయి ఒక ఉన్నత పర్వతం పై నిలిపి ఆ నగరపు కట్టడములను చూపిస్తాడు ( యెహెజ్కెలు 40:2 )
ఈ యొక్క నగరపు గోడలు మీద యిస్రాయేలు ప్రజలు యోషయా గ్రంధంలో పాటలు పాడటం చూస్తాము. యోషయా 26:1 మాకోక బలమైన పట్టణము కలదు. ప్రభువే దాని ప్రాకారములను, బురుజులను కాపాడును. యోషయా 54:11-12 విలువ గల మణులతో నిన్ను పుననిర్మింతును , నీల మణులతో నీ బురుజులు కట్టుదును, అరుణ కాంతిలీను మణులతో నీ ద్వారములు కట్టుదును, ప్రశస్త రత్నములతో నీ ప్రాకారమును నిర్మింతును.
నగరమునకు 12 ద్వారములు క్రైస్తవ సంఘాన్ని సూచిస్తున్నాయి. ఆ 12 ద్వారములకు 12 గోత్రముల పేర్లు లిఖించ బడినవి, ఇవి క్రైస్తవ సంఘం నడచుకునే , కొనసాగే విధానాన్ని సూచిస్తున్నాయి. ఈ యొక్క నూతన యెరుషలేము ద్వారములు గురించి యెహేజ్కెలు ప్రవక్త తన గ్రంధంలో వివరించాడు. (యెహేజ్కెలు 48:30-35.) తూర్పున ఉన్న ద్వారములు సూర్యుడు ఉదయించే వైపుని తలపిస్తాయి, ఇది ప్రతిరోజు ఉదయము ప్రభుని పవిత్ర నగరం లో వేదకటాన్ని సూచిస్తుంది. ఉత్తరమున ఉన్న ద్వారము చల్లని ప్రదేశమును తలపిస్తాయి, క్రైస్తవత్వంలో క్రైస్తవులు హృదయంలో విశ్వాసాన్ని ధృడపరచుకునే మార్గంగా సూచిస్తున్నాయి. దక్షిణమున ఉన్న ద్వారములు వేడి ప్రదేశములకు తలపిస్తాయి, ఈ ప్రాంతములో గాలులు ప్రశాంతముగా వీచుతాయి. వాతావరణం సున్నితముగా వుంటుంది, ఇది ఎవ్వరైన బావోద్వేగాలతో సిలువ మీద ప్రేమతో వచ్చేవారికి మార్గముగా సూచిస్తుంది.పడమర ఉన్న ద్వారములు సూర్యుడు, అస్తమించే వైపు ఇవి పవిత్ర నగరములోని సాయం కాల సమయమున క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చే వారికి మార్గమును సూచిస్తుంది.
ఈ యొక్క క్రొత్త యెరుషలేము నగరములో ఎన్నో ఉన్నాయి, కానీ యోహను గారికి దేవాలయం మాత్రం కనిపించలేదు. యూదులకు దేవాలయం ఎంతో ప్రాముఖ్యం, ప్రాధాన్యం , ఎంతో పవిత్రత కాని అ క్రొత్త నగరమున దేవాలయం మాత్రం కనిపించలేదు. కాని ఒక గొర్రెపిల్ల మాత్రం కనిపించి దానినే దేవాలయముగా యోహనుగారు భావించారు, యెహెజ్కేలు ప్రవక్త చెప్పినట్లు ప్రభువే ఆ నగరమునకు దేవాలయం (యెహేజ్కేలు 48:35) నగరమునకు ప్రభువు ఇచ్చట ఉన్నాడు అని పేరు పెట్టవలెను.
రాతితో
కట్టబడిన దేవాలయం కాదు మన విశ్వాసాన్ని తెలియజేసేది. మన అంతరంగంలో కట్టబడే
విశ్వాసం అనే దేవాలయం తెలియ జేస్తుంది, క్రైస్తవులు అంటే ఎవరు అని. రాతితో
కట్టబడిన దేవాలయంలో కాదు ప్రభువు వసించేది, నీ హృదయంలో. ప్రభువు సమరియా స్త్రీ తో చెప్పినట్లు పర్వతము మీదనో లేక దేవాలయంలో
కాదు దేవుని ఆరాధించేది, నీ హృదయంలో దేవుని ఆరాధించే దినములు వస్తాయి అని.
పౌలు గారు చెప్పినట్లు మన శరీరం దేవుని ఆలయం, మనముకాదు జీవించేది మనలో క్రీస్తే జీవిస్తున్నాడు అని . బాహ్యంగా కనపడేది కాదు ప్రభువునకు కావలసినది. కానీ నీ యొక్క అంతరంగంలో ఏమున్నది అని ప్రభువు లెక్కిస్తాడు, మొదటి పఠనములో యూదులు బాహ్యమైన సున్నతికి మరియు ధర్మ శాస్త్రమునకు ప్రాధాన్యత ఇచ్చారు కాని వారి అంతరంగమునకు కాదు.
సువిశేష పఠనములో యోహను సువార్తికుడు తండ్రి కుమారుల
బంధాన్ని, కలయికను వర్ణిస్తున్నాడు. తండ్రి కుమారున్నీ ఎంతగా ప్రేమిస్తాడో,
కుమారుడు తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈనాటి సువిశేషంలో చూడవచ్చు. అధె విధంగా
తండ్రి, కుమారులను ప్రేమించే వారిని దేవుడు ఇంకా ఎంతగా ప్రేమిస్తాడో కూడా చూడవచ్చు.
యోహను
సువిశేషమంత గమనిస్తే, సువార్తికుడు అయిన యోహను గారు ప్రభువునకు ప్రియమైన శిష్యుడు,
ఆయన ప్రేమను ఎంతగా పొందాడో , ఈయన ప్రభువుని ఎంతగా ప్రేమించాడో, ఈయన రాసిన సువిశేషం
ద్వారా మనకు అర్ధం అవుతుంది.
యోహను గారికి
అంతా కూడా దేవుని ప్రేమ, ప్రేమ అనేది
అన్నిటికీ మూలాధారం. దేవుడు, ప్రభుని ప్రేమిస్తున్నాడు, ప్రభువు, దేవుని
ప్రేమిస్తున్నాడు, దేవుడు మానవున్ని ప్రేమిస్తున్నాడు, మానవుడు, దేవున్ని ప్రేమిస్తున్నాడు, మానవుడు, మానవుడిని ప్రేమిస్తున్నాడు, సృష్టి అంతయు కూడా ప్రేమ
అనే బంధంతో ముడి పడియుంది. విధేయతకు ములాధారం ప్రేమ, అందుకే దేవుడు ఉత్థానమైన
తరువాత ఆయనను ప్రేమించిన వారికి కనిపించారు, కాని పరిసయ్యులు , ధర్మ శాస్త్ర
భోదకులకు మరియు యూదులకు కాదు. తండ్రి మీద ప్రేమ వలన క్రీస్తు ప్రభువు, సిలువ
మరణాన్ని విధేయతతో స్వీకరించాడు.
ఇది అర్ధం కాని వారు, సిలువ మరణాన్ని అసభ్యకరమైన మరణంగానే చూస్తారు. కాని దానిలోని ప్రేమను కాని త్యాగాన్ని కాని విధేయతను కాని అర్ధం చేసుకోరు. ప్రభువు ఒసగిన రెండు ప్రధాన ఆజ్ఞలను ఈనాటి సువిశేషంలో చూస్తాము. తండ్రి దేవుని ప్రేమించడం , తన పొరుగువారిని ప్రేమించడం. ప్రభువు తండ్రి దేవుని ప్రేమించాడు కాబట్టి విధేయతతో ప్రభువు ఒసగిన కార్యాన్ని నెరవేర్చాడు.తన స్నేహితులు , పొరుగువారు అయిన శిష్యులను ప్రేమించాడు అందుకే వారిని ఒంటరిగా వదలి వేయకుండా వారికి తోడుగా పవిత్రాత్మను ఇస్తున్నాడు.
ఈ పవిత్రాత్మ
మనకు అన్నీ విషయాలను బోధిస్తుంది, ప్రభుని మాటలను తెలియచేస్తుంది. ఆయన మార్గంలో
నడుచుటకు సహాయకునిగా ఉంటుంది. ఎవరైతే ఆయన యందు ప్రేమ కలిగి ఉంటారో, వారికి తన
సమాధానం ఓసగుతాను అని ప్రభువు పలుకుతున్నాడు. ప్రభుని సమాధానం అంటే కొద్ది కాలం
ఉండేది కాదు, చివరివరకు మనతో ఉండేది. ఒక్క కష్టములలో మాత్రము కాదు, అన్నీ విషయాలలో
మనతో ఉండేది. రోమి 5: 6-11 నీతిమంతుని కొరకై, సత్పురుషుని కొరకై , పాపాత్ములమైన మన
కొరకై ఆయన మరణించేను. మన దేవుడు, మనపై తనకు ఉన్న ప్రేమను చూపాడు. అంతే కాదు ఆయన
ద్వార మనం సమాధానం పొందాము.
Br. Lukas OCD
14, మే 2022, శనివారం
పాస్క కాలపు 5 వ ఆదివారం (2)
అపో 14:21-27, దర్శన 21:1-5, యోహను 13:31-35
ఈనాటి దివ్య పఠనాలు నూతనమైన విషయములను గురించి భోధిస్తున్నాయి. క్రొత్త దివి, క్రొత్త భువి , క్రొత్త ఆజ్ఞ అనే విషయాలు గురించి తెలియజేస్తున్నాయి.
క్రొత్త దనం మనందరిలో ఉండాలి, మన యొక్క పాత జీవితమను విడిచి పెట్టి దేవునిలో క్రొత్త జీవితం ప్రారంభించాలి.
ఈనాటి మొదటి పఠనంలో పౌలు, బర్నబాలు, దెర్బా అను ప్రాంతంలో సువార్త ప్రకటన చేసిన తరువాత అనేక మందిని నూతనంగా దేవుని శిష్యులుగా చేశారు. సువార్త ప్రకటన కోసం క్రొత్త వారిని ఎన్నుకోంటున్నారు.
పౌలు గారు అక్కడ ప్రజల విశ్వాస జీవితములను బలపరుస్తున్నారు. ఈ లోకంలో ఎదురయ్యే కష్టములకు, శారీరక శ్రమలకు, భయపడకుండా దేవుని యందు విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారిని ప్రోత్సహించారు.
జ్ఞాన స్నానం పొందిన వారు, క్రీస్తు ప్రభువును అంగీకరించినవారు, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని తెలిపారు, అధేవిధంగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలు అనుభవించాలని తెలిపారు.
ఎందుకు వారి విశ్వాసాన్ని ప్రోత్సహిస్తున్నారంటే, వారు నూతనంగా ప్రభువును వెంబడిస్తున్నారు, కాబట్టి ఆదిలోనే కష్టాలు వస్తే, విశ్వాసాన్ని విడిచిపెడతారని పౌలుగారు వారిని ప్రోత్సాహిస్తున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు.
శ్రమల ద్వారా క్రీస్తు ప్రభువు తండ్రిని మహిమ పరిచారు. అలాగే ప్రతి ఒక్కరు తమ యొక్క శ్రమల ద్వారా దేవున్ని మహిమ పరచాలని తెలిపారు. మనం పొందే శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. 1 పేతురు4:1.
జీవమునకు పోయే మార్గం ఇరుకైనది. మత్తయి 7:14. శ్రమలు అనుభవించుటకు భయపడకూడదు. 1 పేతురు 3:14, 2 కోరింతి 4:17.
దేవుని వలె జీవించాలనుకునే వారు కష్టాలకు గురి అగుతారు. 2 తిమోతి 3:12.
విశ్వాసులు నూతనంగా క్రీస్తును నమ్ముకోంటున్నారు. కాబట్టి ముందుగానే పౌలుగారు వారికి అన్నీ విషయాలు తెలుపుచున్నారు.
క్రీస్తు విశ్వసించిన వారిని ఒక సంఘంగా చేసి పెద్దలను నియమించి నూతన సేవకులను, విశ్వాసులను తయారుచేశారు.
ఈ మొదటి పఠనం ద్వారా పౌలుగారు మరియు బర్నబాగారు ,చేసిన సువార్త ప్రకటన గురించి ధ్యానించాలి. ఎంతో కష్టపడి ఒక నూతన దైవ సంఘంను ఏర్పరిచారు.
వారు నిస్వార్ధంతో, త్యాగంతో ప్రేమతో సువార్త వ్యాప్తికరణ చేశారు. అధే విధంగా మనం కూడా నూతనంగా సువార్తికరణ చేయాలి.
ఈనాటి రెండవ పఠనంలో రాబోయే క్రొత్త దివి, భువి,స్వర్ణ యుగం గురించి యోహను గారు ఒక దర్శనం చూసారు.
ఈ దర్శన గ్రంధం వ్రాయబడినది, ప్రత్యేకంగా హింసలకు గురియైన విశ్వాసుల కోసం, వారికి ఒక క్రొత్త భువిని, దివిని దేవుడు ఏర్పరుస్తున్నారు అని వారి విశ్వాసాన్ని ప్రోత్సహించుటకు యోహను గారు ఈ విషయాలు వ్రాస్తున్నారు.
దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన కంటికి అంతయు బాగుగా ఉండెను. ఆది 1:31.
దేవుడు సృష్టిని చేసినప్పుడు అంతయు శాంతియుతముగా ఉన్నది, ఎటువంటి చీకుచింతలకు చోటు లేదు, దుఃఖానికి తావులేదు. అలాగా అంతా బాగుగా ఉన్న సృష్టిలో మానవుని యొక్క పాపం వలన మచ్చ ఏర్పడింది, అనర్ధాలు ఆరంభమైనాయి.
పాపం చేయడం వలన క్రమ క్రమేణా మానవ జీవితం క్షీణించిపోయినది. మరణం వచ్చింది. సృష్టిలో ఉన్న జంతువులు, ఒక దానిని ఒకటి చంపుకొనుట ప్రారంభమైనది, మానవుల మధ్య గొడవలు ప్రారంభమైయాయి. అధే విధంగా ఈ లోకంలో అన్యాయం, అక్రమం , వ్యాధులు, హింసలు, బానిసత్వం, బాధలు ఉన్న సమయంలో ప్రజలు ఒక క్రొత్త భువికై , దివికై ఎదురు చూసారు.
దేవుడు మరలా ఒక నూతన సృష్టిని చేస్తాడని కాలగన్నారు. యిస్రాయేలు ప్రజలు ఈ విషయంను ధృడంగా నమ్మారు , భావించారు.
ప్రవక్తలు కూడా ఒక క్రొత్త యుగం గురించి ప్రకటించారు. యోషయా 65:17, ఇదిగో నేను ఒక క్రొత్త ఆకాశమును, భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకం రావు అని ప్రభువు తెలియచేసారు.
క్రీస్తు ప్రభువు యొక్క రాకతో పాపం తొలగించబడి, ఒక క్రొత్త భువి, దివి ఏర్పడినది. ఆయన యొక్క మరణ, పునరుత్థానం ద్వారా సైతాను శక్తులు నశించాయి, యేసు ప్రభువు మానవాళికి నూతన జీవంను ప్రసాదించారు.
యేసు క్రీస్తును విశ్వసించి ఆయనతో ఏకమై మరణించువాడు ఆయనతో శాశ్వత జీవితానికి లేస్తాడు, పునరుత్థానుడైన యేసు క్రీస్తు జీవాన్ని పొందిన మనం, ఈ క్రొత్త దివికి భువికి నూతన యెరుషలేము పట్టణ నిర్మాణానికి కృషి చేయాలి. 2 పేతురు 3:3-22.
ప్రతి వ్యక్తి కూడా నూతనత్వంను కలిగి జీవించాలి.
ఈనాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు నూతన ఆజ్ఞ గురించి భోధిస్తున్నారు.
యేసు ప్రభువు కడసారిగా తన యొక్క శిష్యులతో మాట్లాడిన మాటలు, ప్రభువు కడరాత్రి భోజనం భుజించిన తరువాత శిష్యులతో విలువైన మాటలు పలికారు.
ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరుపబడ్డాడు.
నేను కొంత కాలము మాత్రమే మీతో ఉందును.
ప్రేమ అనే నూతన ఆజ్ఞను పాటించి జీవించుడు, అనే మూడు మాటలు చాలా విలువైనవి.
మనుష్య కుమారుడు మహిమ పరుపబడ్డాడు. ఎందుకంటె తండ్రిని సంపూర్ణంగా విధేయించాడు. ఆయన యొక్క చిత్తంను నెరవేర్చారు.
అనేకుల రక్షణ కొరకు సిలువ శ్రమలు అనుభవించబోతున్నాడు.
మరణించిన తరువాత సిలువ నుండి లేవ నెత్త బడుతారు. అది నిజమైన మహిమ పరపబడటం. ప్రభువు మానవ- దైవ స్వభావంతో తండ్రిని నిత్యం మహిమ పరిచారు. అలాగే కుమారుడిని తండ్రి ఆయన చేసిన ప్రతి పనిని అంగీకరిస్తూ మహిమ పరిచారు.
ప్రభువు జీవితం మానవునిగా కొంత కాలం మాత్రమే, అందుకే ఇక మీరు నన్ను చూడజాలరు అని పలికారు. ఆయన శ్రమలు అనుభవించుటకు, రక్షణ కార్యము ముగించుటకును, తండ్రి చెంతకు వెళ్ళుటకు సమయం ఆసన్న మగుచున్నది. కాబట్టి ఇక మీరు నన్ను చూడ జాలరు అని ప్రభువు అంటున్నారు.
ప్రభువు శిష్యులకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నారు. అది అందరు తమ జీవితంలో అనుసరించాలి. ఇది ఒక ఆజ్ఞ, శాసనం అందరు కూడా తప్పని సరిగా పాటించాలి.
ఈ ప్రేమ ఆజ్ఞ వాస్తవానికి పాత ఆజ్ఞయే, ఎందుకంటే లెవీ 19:18 లో మీరు పరస్పరం ప్రేమ కలిగి జీవించాలి అని చెప్పబడింది.
ఎందుకు ఇది నూతన ఆజ్ఞ అయిందంటే, క్రీస్తు ప్రభువు అంటున్నారు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరి నొకరు ప్రేమించుకొనుడు.
మన పట్ల దేవుడు ఎలాంటి ప్రేమ చూపించారు అన్నది మనం ధ్యానించుకోవాలి.
దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. మన పట్ల ఆయన చూపే ప్రేమ - సంపూర్ణ మైనది, స్నేహ పూర్వకమైనది, కనికరం కలిగినది, పవిత్రమైనది, నిజమైనది, నిస్వార్ధమైనది.
మనలో దేవుడు చూపించిన ప్రేమ రావాలంటే పాతది పోవాలి.
క్రొత్తది రావాలి. ఆయన ప్రేమ కేవలం మాటల్లో పలికిన ప్రేమ మాత్రమే కాదు, అది చేతుల్లో చూపించే అంత ప్రేమ.
ఎవరు చూపించలేనంత ప్రేమ, క్రీస్తు ప్రభువు మనకు చూపించారు. అందులో నూతనత్వం ఉంది. ప్రవక్తలు చూపించలేనటువంటి దైవ ప్రేమ, రాజులు వ్యక్త పరచలేనటువంటి ప్రభుని ప్రేమ, కేవలం క్రీస్తు ప్రభువే చూపించారు.
పౌలు గారు క్రీస్తు ప్రభువుని ప్రేమ తెలుసుకొన్న వ్యక్తి అందుకే 1 కోరింథీ 13 లో ఆయన ప్రేమకు ఉన్న గొప్ప తనం వివరించారు.
క్రీస్తు ప్రభుని ప్రేమ విశాలము, ఉన్నతము . ఎఫెసీ 3:18.
యేసు ప్రభువు ప్రేమలో ఉన్న నూతనత్వం. 1. ఆయన ప్రేమ సేవతో కూడిన ప్రేమ- ప్రభువు ఈ లోకంలో చేసిన సేవ, ప్రేమతో కుడినసేవ . మత్తయి 20:28. శిష్యుల యొక్క పాదాలు కడిగి తన యొక్క అత్యున్నత ప్రేమ చూపించారు.
2. ఆయన ప్రేమ క్షమించే ప్రేమ : ఎన్ని పాపాలు చేసినా సరే ఎంత బాధ పెట్టినా సరే , ఎంతగా హేళన చేసిన, నిందించినా కానీ ప్రభు అందరిని క్షమించారు. లూకా 23:34.
దేవుని ప్రేమ ఎంతో క్షమను కలిగి ఉంది.
స్నేహితులనుకునే అపోస్తులులే మోసం చేసిన సరే, వారిని క్షమించారు. ప్రభువును అర్ధం చేసుకోకపోయిన వారిని క్షమించారు.
3. ఆయన ప్రేమ అర్ధం చేసుకొనే ప్రేమ - యోహను 21:15. ప్రభువు అందరి యొక్క వ్యక్తిత్వములు అర్ధం చేసుకున్నారు. వివిధ రకాల మనస్తత్వాలు, ఆలోచనలు , ఉన్న శిష్యులను వ్యక్తిగతంగా వారిలో ఉన్న ప్రతికోణం అర్ధం చేసుకొని ప్రేమించారు.
మనం కొంత మందితో జీవిస్తే తెలుస్తుంది వారి గురించి. యేసు ప్రభువు అనేక రోజులు అనేక నెలలు శిష్యులతో, ప్రజలతో , శత్రువులతో కలసి తిరిగినప్పుడు వారిని వారిలాగా అర్ధం చేసుకొని ప్రేమించారు.
ప్రతి ఒక్కరి బలహీనతలను , పాపములను ప్రభువు అర్ధం చేసుకొని ప్రేమించారు.
4. ఆయన ప్రేమ త్యాగ పూరితమైన ప్రేమ -యోహను 15:13. తన యొక్క స్నేహితుల కొరకు ప్రాణాలు సమర్పించారు. ఇతరుల కొరకు జీవితంను త్యాగం చేసిన ప్రేమ స్వరూపి.
సీలువను మోసారు, ప్రాణమిచ్చారు. తన చెంత ఉన్న ప్రతిదీ మన కోసం త్యాగం చేశారు.
5. ఆయన ప్రేమ నిస్వార్ధ ప్రేమ - ఎటువంటి ఫలితం కూడా ఇతరుల నుండి ఆశించకుండా ప్రభువు ప్రేమించారు. యోహను 3:16. తన సొంత లాభం పొందటం కోసం , మెప్పు పొందటం కోసం ఎవ్వరిని ప్రేమించలేదు.
6. ఆయన ప్రేమ ఎల్లలు లేని ప్రేమ - ఎటువంటి హద్దులు లేవు. ఆయన మన యొక్క అందం, ఎత్తు , డబ్బు, మొదలగునవి చూసి ప్రేమించరు, మనల్ని ఎటువంటి తరతమ్యం లేకుండా ప్రేమించారు.
ప్రేమకు ఉన్న శక్తి ఈ లోకంలో దేనికి లేదు. అందుకే పౌలుగారు ప్రేమ సమస్తమును , భరించును, జయించును అని పలికారు. 1 కోరింథీ 13:7. ప్రేమ బలహీనులను బలవంతులను చేస్తుంది. సామాన్యులను గొప్ప వారిగా, చెడ్డ వారిని మంచి వారిగా చేస్తుంది.
మనందరం కూడా ప్రేమించుట ద్వారానే యేసు ప్రభువుని శిష్యులం అవుతున్నాం. కాబట్టి దేవుడు చూపించిన నూతన ప్రేమ మనందరం కలిగి జీవిద్దాం.
Rev. Fr. Bala Yesu OCD
7, మే 2022, శనివారం
పాస్క నాలుగవ ఆదివారం
మంచి కాపరి
ఈనాటి ఆదివారం మంచి కాపరి ఆదివారం అని పిలుస్తారు. యేసు ప్రభువు తాను ఒక మంచి కాపరి అని ఎరుక పరుస్తూ ఒక కాపరిలాగా తన మంద కోసం ఎలాగా శ్రామిస్తారో తెలుపుచున్నారు.
యేసు ప్రభువు మంచి కాపరిగా సంభోదించుకుంటూ తనకు మరియు ప్రజలకు మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలను గురించి తెలుపుచున్నారు. ఈరోజు క్రీస్తు ప్రభువుని ఒక మంచి కాపరిగా మనం గ్రహిస్తూ, ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు మనం ధ్యానించుకోవాలి.
పవిత్ర గ్రంధంలో మనం చాలా మంది కాపరులను చూస్తున్నాం. ఆబేలు గొర్రెల కాపరియే-ఆది 4:2. అబ్రహాము గొర్రెల కాపరియే , ఇస్సాకు, యాకోబులు కూడా గొర్రెల కాపారులే. వీరితో పాటు మోషే ప్రవక్త , దావీదు రాజు సైతం గొర్రెలను కాసినవారే. 1 సమూ 17:36. ఆమోసు ప్రవక్త కూడా గొర్రెల కాపరియే. ఆమోసు 7:14.
వీరితో పాటు పాత నిబంధన గ్రంధం లో దేవుడు తనను తాను కాపరిగా , మంచి కాపరిగా సంబోదించుకుంటున్నారు. యెహే34:11-31.
కాపరులలో మంచి వారున్నారు అధే విధంగా చెడ్డ వారున్నారు. యిర్మియా ప్రవక్త చెడ్డ కాపరులను గురించి తెలుపుచున్నారు. యిర్మియా 23:1-2.
మనందరం కూడా కుటుంబ కాపరులం, సంఘ కాపరులం, దేశ కాపరులం మనకు దేవుడు నిజమైన కాపరి. ఆయన్ను మనం అనుసరించాలి.
ఈనాటి మొదటి పఠనంలో దేవుడు పౌలుగారికి , బర్నబాసు గారికి అప్పజెప్పిన కాపరి బాధ్యతలను గురించి చదువుకున్నాం.
వీరిని యేసు ప్రభువు అన్యులకు సువార్తను ప్రకటించుటకు ఎన్నుకొన్నారు. పౌలు యూదులతో సంభాషించిన వేళలో వారు ఆయన్ను అంగీకరించలేదు. అందుకే పౌలు గారు వారితో దేవుని వాక్కు మొదటిగా మీకు చెప్పవలసి ఉండెను,కాని మీరు దానిని తిరస్కరించిరి, మిమ్మల్ని మీరు నిత్య జీవమునకు అయోగ్యులను చేసుకున్నారు అని పలికెను.46 వ వచనం.
మొదటి ప్రాముఖ్యతను దేవుడు యూదులకే ఇచ్చారు కాని వారు దానిని తృణీకరించారు. పౌలుగారు మాత్రము ఎవ్వరు తృణీకరించినా సరే, దేవుని యొక్క వాక్కును వెలుగెత్తి చాటారు. అది కాపరి యొక్క లక్షణం. తనను నియమించిన పని కోసం ప్రాణములు సైతం ఇవ్వటం కాపరి యొక్క పని.
పౌలు గారిని అన్యులకు అపోస్తులుడు అని పిలుస్తారు. apostle of gentiles. ఆయన అనేక సంవత్సరములుగా అన్యులకు దాచబడిన , తెలియని క్రీస్తు ప్రభువు గురించి ప్రకటించిన వ్యక్తి.
సువార్త వ్యాప్తి కోసం ఆయన అనేక హింసలకు గురి అయ్యాడు. శ్రమలు అనుభవించారు. అపో 21: 27,30,23:3, 27:41,22:22, 27,42,26:24.
ఎన్నెన్నో ఆయన తన యొక్క పరిచర్యలో ఎదుర్కొని ముందుకు సాగి తన యొక్క కాపరి యొక్క బాధ్యతలను నెరవేర్చారు.
పౌలు గారు మరియు బర్నబాసు గారు దేవుని యొక్క స్వరమును ఆలకించారు. 47 వ వచనం. దేవుడు వారిని అన్యులకు వెలుగై ఉండుడు అని చెప్పిన మాటను ఆలకించి ఆయన ప్రకారం నడుచుకున్నారు.
యేసు ప్రభువు మొదటిగా పౌలును సువార్త పరిచర్యకు ఎన్నుకొన్న సందర్భంలో కూడా దేవుని యొక్క స్వరంను ఆలకించి హృదయ పరివర్తనం చెందుతున్నారు. అపో 9: 4.
సువార్తను అంగీకరించిన చోట వారు ఆనందంగా వాక్యంను ప్రకటించారు. అంగీకరించని చోట కాలి దూలిని వారికి నిరసనగా దులిపి వేశారు. తమ యొక్క సేవలో వారు ఎల్లప్పుడు దేవుని యొక్క పవిత్రాత్మతో నిండి ఉన్నారు.
ఒక కాపరిగా పౌలుగారు తన యొక్క బాధ్యతలను అన్నీ సక్రమంగా నెరవేర్చారు. తన మందకోసం క్రీస్తు ప్రభువు వలె ప్రాణాలు సమర్పించారు.
రెండవ పఠనంలో యోహను గారు గొర్రె పిల్లను గురించి చూసిన దర్శనంలో క్రీస్తును మంచి కాపరిగా గుర్తించి ఆయన తన యొక్క ప్రజల కోసం ప్రాణాలు సమర్పించిన గొర్రెపిల్ల అని తెలుపుచున్నారు.
ఈనాటి రెండవ పఠన ప్రారంభ వచనాలలో క్రీస్తు సేవ కొరకు శ్రమలు అనుభవించే వారి గురించి తెలుపుచున్నారు. యోహను గారు హింసలకు గురి అయిన క్రైస్తవులను ప్రోత్సహించుటకు ఈ యొక్క సత్యమును వివరించారు.
దేవుని కొరకు ప్రాణాలు అర్పించినవారు ఆయన సన్నీదిలో సేవ చేస్తారు. వారు రక్షణను పొందుకుంటారు.
గొర్రె పిల్లయె కాపరి యగును, వారి కష్టాలను, బాధలను తొలగించును. ఈ కాపరి తన యొక్క మందను జీవ జలము వద్దకు తీసుకొనిపోవును. కీర్తన 23. యోషయా 40:11, యెహే 34:23, యిర్మీయా 2:13.
సువార్త పఠనంలో యేసు ప్రభువు తన గొర్రెలు తన స్వరమును వినును అని చెప్పెను. యోహను సువార్త 10 వ అధ్యాయం మొత్తం కూడా గొర్రెల కాపరి గురించి మరియు గొర్రెల గురించియే.
కేవలం దేవుడిని మాత్రమే మంచి కాపరి అని పిలుస్తాం. ఎందుకంటే ఆయన గొర్రెలను మేపుతారు, సంరక్షిస్తారు, నేర్పిస్తారు, కాపాడుతారు, వాటికి అవసరమైనవి అన్నీ సమకూర్చుతారు. పాత నిబందన గ్రంధం లో యావే దేవున్ని మంచి కాపరి అని సంభోదించారు. యెహే 34 వ అధ్యాయం.
నూతన నిబందన గ్రంధంలో క్రీస్తు ప్రభువును యోహనుగారు మంచి కాపరి అని సంభోదిస్తున్నారు. యోహను 10.
యేసు ప్రభువు నా గొర్రెలు నా స్వరమున వినును అని తెలుపుచున్నారు. ఇంతకీ ఎవరు ఆయన గొర్రెలు ? జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క గొర్రె.
గొర్రె తన యొక్క స్వరమును వినును అని అన్నారు. జ్ఞాన స్నానం పొందిన అందరు ఆయన స్వరమును ఆలకించారు, కేవలం కొందరు మాత్రమే ఆయన స్వరమును ఆలకించుతారు.
సృష్టి ప్రారంభం నుండి మంచి కాపరి అయిన దేవుడు తన ప్రజలను పిలుస్తూనే ఉన్నారు, భోదిస్తూనే ఉన్నారు. అలాగే వారికి నేర్పిస్తూనే ఉన్నారు. అయితే కొంత మంది మాత్రమే కాపరి స్వరంను ఆలకించారు.
ఆదాము అవ్వ దేవుని స్వరంను వినలేదు. దాని ఫలితంగా శ్రమలు అనుభవించారు, ఏదేను తోట నుండి బయటకు పంపివేయబడ్డారు.
సౌలు దేవుని స్వరంను వినలేదు. దాని ఫలితముగా తన యొక్క రాజ్య బాధ్యతలను కోల్పోయాడు. 1 సమూ 13:12-13.
లోతు భార్య దేవుని స్వరమును ఆలకించకుండా వెనుకకు చూసింది ఆది 19 :26 . ఆమె ఉప్పు కంబంగా మారిపోయాను.
నెబుకద్నెసరు దేవుని స్వరం ఆలకించలేదు. దాని ఫలితంగా శిక్షను అనుభవించాడు. దానియేలు 4: 17-37.
పవిత్ర గ్రంధంలో చాలా మంది ఆయన స్వరమును వినలేదు. దాని ఫలితముగా వరాలు అనేక కోల్పోయారు. శిక్షను పొందుకున్నారు.
ప్రభువు యొక్క స్వరము విన్నవారు అధికంగా దీవించబడ్డారు.
అబ్రహామును దేవుడు దీవించారు ఎందుకంటే విన్నాడు కాబట్టి . మోషేను దీవించారు ఎందుకంటే ఆయన స్వరంను ఆలకించారు. ఏలియాను దీవించారు అలాగే మరియమ్మ గారిని ఎన్నుకొన్నారు తన తల్లిగా ఎందుకంటే ప్రభుని స్వరంను విన్నారు కాబట్టి.
కాపరి పిలిచినప్పుడు కేవలం తన మందే పలుకుతుంది. జవాబిస్తుంది. అందరి స్వరాన్ని అవి ఆలకించావు , అనుసరించవు ఎవరు పిలిస్తే వారి వెంట పోవు.
గొర్రెలు తమ కాపరి స్వరం విని, అతనితో ఉండి ప్రమాదాల బారి నుండి సంరక్షణ పొందునట్లు మనం కూడా కాపరియైన దేవుని స్వరం విని నడుచుకుంటే మన జీవితాలు సంతోష దాయకంగా ఉంటాయి.
కాని మనం దేవుని యొక్క స్వరంను అలకించకుండా పెడ చెవిన పెడతాం. యిస్రాయేలు ప్రజలు కూడా అనేక సార్లు దేవుని యొక్క ప్రవక్తల మాటలను పెడచెవిన పెట్టి శిక్షింప బడ్డారు.
దేవుని స్వరం అంటే కేవలం మానవునిగా ఆయన నోటినుండి వెలువడిన మాటల శబ్దం మాత్రమే కాదు. ఆయన గురించి తెలిపే స్వరం అనగా ఆయన జీవిత మార్గం , జీవితం, భోధనం, సందేశం , మరణం, పునరుత్థానం తెలిపేది.
నిజంగా మనం జీవితంలో దేవుని స్వరం కాని ,పెద్దలు స్వరం కాని విని అనుసరిస్తే అందరం బాగుంటాం .
రెండవదిగా ప్రభువుకు తన యొక్క మందలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలుసు. మనకు ఆయన తెలిసిఉండకపోవచ్చు. కాని ఆయనకు మాత్రం మనం బాగా తెలుసు. మన యొక్క పేరును దేవుడు తన యొక్క అరచేతిలో చెక్కుకున్నారు. యోషయా 49: 16. మనందరం ఆయనకు బాగా గుర్తున్నవారమే.
మంచి కాపరి ఈ గొర్రెలను అన్నింటిని సక్రమంగా చూసుకుంటారు.
1. గొర్రెలకు కాపరి నిత్యజీవితం ప్రసాదిస్తారు. యోహను 10:10
2. గొర్రెలు నాశనం కాకుండా వాటిని భద్రంగా చూసుకుంటారు. వాటి యొక్క ఎదుగుదలకై అనునిత్యం కృషి చేస్తాడు కాపరి. యోహను 3:16.
3. కాపరి కనుసన్నలలోనే గొర్రెలు ఉంటాయి. ఎవరు వాటిని ఆయన చేతి నుండి తీసుకొనలేరు. యోహను 6: 37-39.
4. ఈ గొర్రెలకు రెండు రకాలైన భద్రత కలుగుతుంది ఒకటి కాపరి దగ్గర నుండి రెండవది యాజమానుడి దగ్గర నుండి. ఇద్దరు దేవుడే కాబట్టి మనకి రెండు రకాలైన రక్షణ దొరుకుతుంది. మన జీవితానికి యజమానుడు దేవుడే, ఆయనే మనల్ని సృష్టించారు, నడిపిస్తున్నారు.
5. గొర్రెలు ఎప్పుడు కూడా కలసి జీవిస్తాయి. ఒక దాని వెనుక ఒకటి వెళతాయి అవన్నీ ఎప్పుడు ఒక మందలాగే ఉంటాయి.
మన దేవుడు మంచి కాపరి మనం ఆయన స్వరం విని నడుచుకుంటె మనకు అంతా మేలే కలుగుతుంది.
ఈరోజు ప్రతి కాపరి కోసం ప్రార్ధించాలి, మనందరికి ఇచ్చిన కాపరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుదాం.
Rev. Fr. Bala Yesu OCD
3, మే 2022, మంగళవారం
పాస్కా కాలపు నాల్గవ ఆదివారం
పాస్కా కాలపు నాల్గవ ఆదివారం
అపోస్తుల 13: 14, 43-52, దర్శన 7: 9, 14-17 , యోహాను 10: 27-30.
క్రీస్తు నాదునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈ నాడు తల్లి తిరుసభ మనలందరిని పాస్కా కాలపు నాల్గవ ఆదివారం లోనికి ఆహ్వానిస్తుంది.
ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలద్వారా, మనలందరికీ కూడా క్రీస్తు భగవానుడే మనకు నిత్య జీవితమును ప్రసాదించువాడు, ఆయనే మనకు మార్గచుపరి, వెలుగు మరియు సత్యమును అయియున్నాడు, క్రీస్తు ప్రభువే మంచి కాపరి, అని మనకు భోదిస్తుంది.
మనకు నిత్యజీవితం కావాలంటే, దేవుని సన్నిధి చేరుకోవాలంటే, క్రీస్తు ప్రభువు ఒక ద్వారమై ఉన్నారు, ఆయన జీవిత అనుసరణ ద్వారానే మనము నిత్య జీవితాన్ని పొందుకుంటాం అని తిరుసభ మనకు తెలియపరుస్తుంది.
ఏ విధంగా అంటే ?
మొదటి పఠనం: పునీత పౌలు, బర్నబాసుల వేదప్రచారం. పునరుత్తానా క్రీస్తు గురించి , ప్రజలకొరకై ప్రాణాన్ని దారపోసినటువంటి క్రీస్తు గురించి, ఆ మంచి కాపరి గురించి, బోధిస్తున్నారు.
వీరిద్దరూ పిసిదియా లోని అంతియోకు నగరంలో క్రీస్తు ప్రభువు పేరిట " దేవుని కృపలో జీవించమని" వేద ప్రచారం చేస్తున్నారు. వారి బోధనకు యూదులు మరియు యూదా మతాన్ని స్వీకరించిన వారందరు కూడా విశ్వసిస్తున్నారు. ఇది చేసినటువంటి అన్యులు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. అందువలన యూదా ప్రజలు అసూయా చెంది. పౌలు, బర్నబాసులను తిరస్కరిస్తున్నారు, వారి ప్రదేశములనుండి తరిమివేస్తున్నారు.
వారుదేవుని కుమారుని విశ్వసించలేదు, అందువలననే వారు నిత్య జీవితానికి అభాగ్యులయ్యారు, దేవుని నుండి దూరమయ్యారు.
ఇలాంటి సన్నివేశాన్ని మనం సువిశేష పఠనంలో కూడా చూస్తున్నాం.
ఈ నాటి సువిశేషంలో క్రీస్తుప్రభుని యూదా ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే, ముందుగా మనము ఈ అధ్యాయానికి ముందు అధ్యాయాలలో చూస్తున్నాం, క్రీస్తు ప్రభువు తన్ను తాను దేవుని కుమారుడని, తానే పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారమని, తానే సత్యమును, మార్గమును, లోకమత్యము వరకు వెలుగై వున్నాను అని బోధించటం మనం చూస్తున్నాం.
క్రీస్తు ప్రభువు తాను దేవుని కుమారుడని బోధించుట :
“నేను మాత్రమే తండ్రి చెంతనుండి వచ్చినది, నన్ను పంపినవాడు నాతండ్రియే, నన్ను ప్రేమించువాడిని, నా తండ్రి ప్రేమించును. నన్ను నిరాకరించువాడు నా తండ్రిని నిరాకరిస్తున్నారు. నా ద్వారా తప్ప మరెవ్వరును తండ్రిని చేరుకోలేరు”. (యోహాను 8 : 39 - 59 ). అని బోధిస్తున్నారు.
“నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను అనుసరించు వాడు నాశనము చెందక నిత్య జీవమును పొందును”. యోహాను 11 : 25 - 27 మరియు 9 : 5 వచనం.
“జీవాహారమును నేనే నన్ను స్వీకరించువాడు నిత్య జీవమును పొందును”. యోహాను 6 : 25 - 71 మనము చూస్తే, క్రీస్తు ప్రభువే సత్యం, జీవం, మార్గం, వెలుగు, అనే సారాంశమే మనకు అర్థమవుతుంది.
యూదులు యేసుప్రభువుని, నీవు మా తండ్రియగు అబ్రహముకంటె గొప్పవాడివా? అని యేసుని ప్రశ్నించినప్పుడు. యేసు ప్రభు సమాధానము....నేను అబ్రాహాము కంటే ముందు నుండి వున్నాను...ఈ, మాటలు విన్నటువంటి యూదులు యేసుప్రభుని, ఇతనికి దెయ్యము పట్టినది, అని నిందిస్తున్నారు తిరస్కరిస్తున్నారు. ఈ విధంగా బోధించడం ఒక దైవ దూషణగా భావించి రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు.
(యోహాను 10: 32 - 33). క్రీస్తు ప్రభువు నిజముగా దేవుని కుమారుడు అయితే దేవుని నుండి ఒక గుర్తును చూపించమని అడుగుతారు.
కానీ క్రీస్తుప్రభువు మాత్రం ఎలాంటి గర్వానికి పోలేదు, తాను నిజముగా దేవుని కుమారుడైన కూడా, తాను నిరూపించు కోనవసరంలేదు. అందుకు ఆయన నేను చేస్తున్నటువంటి క్రియలే, దానికి సూచనలు అని సమాధానమిచ్చారు. యోహాను 10 : 24 - 25 .
క్రీస్తు చేసిన క్రియలగురించి మనందరికీ తెలుసు. గ్రుడ్డివారికి చూపునిచ్చాడు “నేనే వెలుగును , లోకాత్యము వరకు నేనే వెలుగు” అని బోధించాడు. యోహాను 9:5. ఆకలికొన్న వారికి ఆకలి తీర్చారు. ఇలా చాల అద్భుతాలు క్రీస్తు ప్రభువు చేసారు.
ఈవిధంగా యూదులు యేసు క్రీస్తుని అసూయ చేత తిరస్కరించారు. మొదటి పఠనంలో యూదులు ప్రభువు సేవకులైనటువంటి పౌలుగారిని , బర్నబాసు గారిని కూడా అసూయా చేత తిరస్కరించారు.
ఎందుకంటే ప్రజలందరూ క్రీస్తుని అనుసరిస్తున్నారు, క్రీస్తు గొప్పవారు అవుతున్నారన్న దురుద్దేశం, అసూయ.
ఈ యూదా ప్రజలు దేవుడు వారికే సొంతం, దేవాది దేవుడు వారికి మాత్రమే దేవుడు, అనుకున్నారు, గర్వంతో పొంగిపోయారు. వారి జీవితాలు లోక సంబంధమైనవి, కపట ఆచారాలు, కపట జీవితాలు, దేవాలయాలలో, మరియు వీధులలో నమస్కారాలకోసం, ప్రజల మెప్పు పొందడం కోసం, మేము యూదులము అని చెప్పుకుంటున్నారు తప్ప. నిజమైన దేవుని బిడ్డలాగా, దేవుని ప్రజలవలె జీవించలేదు. దేవుని ప్రేమిస్తున్నాము, మా దేవుడు , మాదేవుడు అని ఎప్పుడు చెప్పే వాళ్లే, కానీ తోటి మానవుని మాత్రం, ద్వేషించేవాళ్ళు, దూరం చేసేవాళ్ళు. అందువలననే క్రీస్తుప్రభువు వారిని అంటుంటారు,.. మీరు “మేము దేవుడి ప్రేమిస్తున్నాము, అని చెప్తారే తప్ప, ఆయన ఆజ్ఞలను ఎప్పుడు పాటించలేదు”, అందువలననే మీకు దక్కవలసినవి అన్యులకు దక్కినవి, అని అంటుంటారు.
మీరు దేవుని కుమారుని విశ్వసించలేదు, స్వీకరించలేదు, అందువలననే మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేక పోయారు. కానీ అన్యులు విశ్వసించారు, క్రీస్తుని స్వీకరించారు, ఆయనను అనుసరించారు, అలాంటి వారే దేవుని రాజ్యానికి వారసులు అయ్యారు, దేవుని సాన్నిధ్యాన్ని సంపాదించుకున్నారు.
ఈనాడు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం. క్రీస్తు ప్రభువుని, విశ్వసిస్తున్నామా ? క్రీస్తు వాక్యాన్ని లేదా దేవుని వాక్యాన్ని భోదిస్తున్నటువంటి దేవ సేవకులను నిందిస్తూ తిరస్కరిస్తున్నామా?.
రెండవ పఠనం మనం ధ్యానించినట్లయితే. పునీత యోహాను గారు తనకు వచ్చినటువంటి దర్శనంలో, పరలోక రాజ్యం లేదా దేవుని సాన్నిధ్యం యొక్క గొప్ప తనాన్ని ఈ యొక్క రెండవ పఠనంలో వివరిస్తున్నారు.
గొప్ప జన సమూహము తెల్లని దుస్తులు ధరించి, దేవాది దేవుని, పాటలద్వారా, కీర్తనలద్వారా స్తుతిస్తూ, సంతోషంగా వున్నారు అని తెలియ చేస్తున్నారు. ఎవరు వారంతా ? అంటే వారు ఈ భూలోకంలో వున్నంతకాలం పరలోక భాగ్యం కోసం జీవించినవారు, సత్యం కోసం హింసలు పొంది, మరిణించినవారు, క్రీస్తు కోసమై జీవించినవారు, వారికి, ఇక ఎలాంటి భాదలు , భయమును, మరణమును, ఉండవు. వారిని దేవుని సాన్నిధ్యము నుండి , దేవుని రక్షణము నుండి ఎవరును వేరుచేయలేరు. అని తెలియ చేస్తున్నారు.
కావున క్రీస్తునాదునియందు ప్రియులగు సహోదరి సహోదరులారా మనమందరము ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు ఏవిధంగా కొనసాగుతున్నాయి ? క్రీస్తుని విశ్వసించి అనుసరించి, క్రీస్తు ప్రభువుకు సంభందించిన వారివలె, ఆయన స్వరమును ఆలకించే వారిగా ఉన్నాయా? లేదా, కపట యూదులవలె గర్వంతో, అసూయతో, దేవునికి, లేదా ఆ పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా, దూరంగా జీవిస్తున్నామా?
ఎందుకంటే ఈనాటి సువిశేషంలో యోహాను 10 :27 -30 వచనాలలో చూస్తున్నాం. క్రీసు మంచికాపరి, ఆయనను ప్రేమించువారు, ఆయన స్వరమును వినును, ఆయన వాక్కును పాటించును, ఆయన వారిని ప్రేమించును, వారియందు జీవించును అని.
కాబట్టి క్రీస్తు ప్రభువు మనయందు జీవించాలన్న మనం క్రీస్తు చెంతకు చేరాలన్న, ఆ పరలోక భాగ్యాన్ని పొందుకోవాలన్న క్రీస్తు ప్రజలవలె జీవించాలి.
కాబట్టి మనందరం క్రీస్తు ప్రజలవలె , దేవుడిని, మరియు మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ, పరలోక భాగ్యాన్ని ఆ నిత్య జీవితాన్ని పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆమెన్..
- బ్రదర్. సుభాష్ ఓ.సి.డి
మార్కు 6 : 14 – 29
February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...