24, ఫిబ్రవరి 2024, శనివారం

తపస్సు కాల రెండవ ఆదివారం

తపస్సు కాల రెండవ ఆదివారం
ఆది 22:1-2, 9-18, రోమి 8:31-34
మార్కు 9:2-10
తపస్సు కాలము అనగానే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది క్రీస్తు ప్రభువు మన కొరకు సమర్పించిన కల్వరి బలి. మన మీద ఉన్న ప్రేమ చేత ఏసుప్రభు తన జీవితాన్ని త్యాగం చేసి మనందరికీ కూడా రక్షణను స్వేచ్ఛను ప్రసాదించి ఉన్నారు. ఈనాటి దివ్య గ్రంథములు కూడా మనకు బోధించేటటువంటి అంశములు ఏమిటి అంటే  అబ్రహాము సమర్పించిన బలి విధానము మరియు క్రీస్తు ప్రభువు యొక్క బలి 
అదే విధముగా క్రీస్తు ప్రభువు యొక్క దివ్య రూప ధారణ. ఈ మూడు పఠణములలో మూడు పర్వతముల గురించి తెలియజేయబడ్డవి.
1. మోరియా పర్వతము
2. కల్వరి కొండ
3. తాబోరు పర్వతం
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు అబ్రహామును ఇస్సాకును బలిగా ఇవ్వమన్న వృత్తాంతము చదువుకున్నాం. ఈ మొదటి పఠణంలో మనము గమనించవలసిన అంశములు ఏమిటి అంటే
1. అబ్రహాము యొక్క విశ్వాస జీవితం.
2. అబ్రహాము యొక్క త్యాగం
3. అబ్రహాము యొక్క బాధ
4. దేవుని మీద ఆధారపడటం
5. అబ్రహం యొక్క ధైర్యం 
6. అబ్రహాము యొక్క స్వేచ్ఛ

పవిత్ర గ్రంథములో దేవుడు ఎక్కడ ఎప్పుడు అబ్రహామును మినహా ఎవరిని కూడా మానవుని బలిగా ఇవ్వమని కోరలేదు. మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహామును తన కుమారుడిని బలిగా ఇవ్వమంటున్నారు ఈ వాక్యము చదివిన సందర్భంలో మనందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఎందుకు దేవుడు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని తన కుమారుడిని బలిగా ఇవ్వమంటున్నారు. చాలామందికి ఇది న్యాయమా? అని అనిపించవచ్చు కానీ ఇది కేవలం అబ్రహాము యొక్క విశ్వాస జీవితమును పరీక్షించుట కొరకై ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ఒక శాశ్వతమైనటువంటి ఒడంబడిక చేసుకోబోతున్నారు కాబట్టి ఆయన యొక్క విశ్వాస జీవితం ఇంకా స్థిరముగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం నిమిత్తమై ప్రభువు అబ్రహామును పరీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాస పరీక్షలు అవసరం (యాకోబు 1:12). ఈ మొదటి పఠణ ప్రారంభ వచనము మనకు ఈ అంశం గురించి తెలియజేస్తూ ఉన్నది ఇది కేవలము అబ్రహాము యొక్క విశ్వాస జీవితంను పరీక్షించుట కొరకై దేవుడు తన కుమారుడిని బలిగా ఇవ్వమని అంటున్నారు. వాస్తవానికి అబ్రహం దేవుని యొక్క స్వరమును ఆలకించి వెంటనే దానిని ఆచరణలో పెడుతున్నారు.
- దేవుడు అబ్రహాము యొక్క ఏకైక కుమారుడని, తాను ప్రేమించే కుమారుడిని సమర్పించమని సందర్భములో ఆయన దేవుడిని ప్రశ్నించలేదు, దేవుడితో ఎటువంటి వాదనకు దిగలేదు. ఆయన సంపూర్ణంగా దేవుడిని విశ్వసించి ఉన్నారు కాబట్టే మరొక ప్రశ్న ప్రభువుని అడగక వెంటనే దేవుని యొక్క మాట ప్రకారముగా జీవింప సాగారు. అబ్రహాముకు ఇస్సాకు విలువైనవాడు, చాలా ప్రేమను పెంచుకున్నాడు, తండ్రి కుమారుల బంధం బలముగా ఏర్పడిన సమయంలో ప్రభువు తన కుమారుడిని బలిగా సమర్పించమన్నప్పుడు ఆ తండ్రి యొక్క హృదయ వేదన ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి అయినప్పటికీ కేవలము దేవుడు అడిగారు అనేటటువంటి ఉద్దేశ్యంతో దేవుని కొరకు తన సమస్తమును, తన ఆశలు పెట్టుకున్నటువంటి కుమారుడిని కూడా సమర్పించుటకు వెనుకంజ వేయలేదు అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని పిలుస్తుంటారు. ఈ గొప్ప కార్యము ద్వారా దేవుడు అబ్రహాము అతని యొక్క సంతతిని ఇంకా అధికముగా దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు.
-ఈ యొక్క మొదటి పఠణంలో కేవలం అబ్రహాము యొక్క గొప్పతనమును మాత్రమే కాదు మనము ధ్యానించవలసినది మరియు ఇస్సాకు యొక్క ప్రేమ. తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఇస్సాకు ఆయన చేతులను బంధించినప్పటికీ ఎటువైపు పారిపోకుండా తనను తాను తండ్రికి సమర్పించుకున్నాడు ఇది ఆయన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. ఇస్సాకు కావలిస్తే ఆయన తండ్రి నుండి దూరంగా పారిపోవచ్చు కానీ అలా చేయకుండా తండ్రిని గౌరవిస్తూ ఆయన తనను తానే భలిగా అర్పించుట కొరకు సిద్ధమయ్యాడు. ఇస్సాకు బలి ఏసుప్రభు యొక్క కల్వరి బలికి సూచనగా ఉన్నది. ప్రభువు కూడా తనను తాను కల్వరి కొండ మీద మన నిమిత్తం తండ్రి నిమిత్తము సమర్పించుకుని ఉన్నారు.
- మోరియా పర్వతము మీద ఇస్సాకు బలిని దేవుడు మధ్యలో ఆపివేస్తూ ఈసాకుకు బదులుగా గొర్రె పిల్లను బలిగా అంగీకరించారు. 
- రెండవ పఠణములో ఏసుప్రభు తాను కల్వరి మీద సమర్పించిన బలిని గురించి పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. కల్వరి కొండ మన రక్షణను జ్ఞాపకం చేస్తుంది, మనకు పాప క్షమాపణను దయచేసిన పర్వతం రక్షకుడు మనందరి యొక్క నిమిత్తమై మరణించి మనకు స్వేచ్ఛను జీవమును ప్రసాదించి ఉన్నారు కాబట్టి మనం హృదయ పరివర్తనము చెంది ఆయనను విశ్వసిస్తూ ఆయన యొక్క చిత్తానుసారంగా జీవించాలి.
-ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు యొక్క దివ్యరూపధారణ గురించి చదువుకుంటున్నాము.యేసు ప్రభువు యొక్క పరలోక మహిమ భూలోకంలో ఉన్నటువంటి శిష్యులకు తెలియచేయబడిన సందర్భంలో శిష్యులు పరలోకము నుండి తండ్రి స్వరమును ఆలకించారు. ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతనిని ఆలకించండి. ఆలకించటం అనేది చాలా ప్రధానమైన కార్యం దేవుడు గురించి ఎక్కువగా తెలియాలంటే, దేవుడిని ఆరాధించాలన్న మనకు ఆలకించే మనసు ఉండాలి. పునీత పౌలు గారు అంటారు వినుటవలన విశ్వాసము కలుగును అని. కేవలం శ్రద్ధగా వినుట ద్వారానే మనలో విశ్వాసము పెంపొందించబడుతున్నది. వినుట ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అంటే ఏసుప్రభు యొక్క సమయములో మరియు తన తరువాత తన యొక్క శిష్యులు శుభవార్తను ప్రకటించిన సందర్భంలో వారి చేతులలో పవిత్ర గ్రంథము లేదు కేవలం ఏ అంశములు అయితే వారు యేసు ప్రభువు నుండి విన్నారో అదే విధముగా ప్రజలు శిష్యుల నుండి విన్నారో వాటిని విశ్వసించి ఉన్నారు. కాబట్టి మన అందరి యొక్క జీవితంలో మనము దేవుని యొక్క వాక్యమును ఏ విధముగా ఆలకిస్తూ ఉన్నాం. ఆయన వాక్కును మనము ప్రేమతో విన్నప్పుడే దానిని మన జీవితంలో ఆచరించగలం.
మనలో ప్రేమ ఉన్న సందర్భంలోనే ఎదుటి వ్యక్తి యొక్క మాటలను మనము వినగలుగుతూ  ఉంటాము. మన యొక్క రెండు చెవులను ఒకటిగా జత చేస్తే అవి ప్రేమ చిహ్నంగా మారుతాయి. దేవుని యొక్క వాక్యమును ప్రేమతో ఆలకించాలి,విశ్వాసముతో ఆలకించాలి, పూర్ణ హృదయముతో ఆలకించాలి. ఆ వాక్యము నా జీవిత యొక్క అభివృద్ధి కొరకే అనేటట్లుగా ఆలకించాలి. దేవుని యొక్క వాక్కును సహనముతో ఆలకించాలి అప్పుడే మన జీవితములో మార్పు అనేది వస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్కును ఆలకించి జీవించిన వారి యొక్క జీవితములు అభివృద్ధి చెందుతూ ఉన్నవి అదే దేవుని యొక్క వాక్కును నిరాకరించి జీవించిన వారి యొక్క జీవితములు శిక్షకు గురి అవుతూ ఉన్నవి ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఆయన వాక్కును ఆలకించుమని తెలియచేస్తున్నారు మరి ఏమిటి ఆయన యొక్క వాక్కులు?
1. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము
2. నీ శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయుము.
3. నీ తోటి వానితో సఖ్యపడు
4. అన్యాయం చేయకుండా న్యాయముతో జీవింపుము.
5. నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని అనుసరించవలెను.
6. వినయం కలిగి జీవించమని తెలుపుచున్నారు. ఇంకా అనేకమైన వాక్కులు ఉన్నవి.
ఆయన చెప్పిన విధంగా మనము జీవించినట్లయితే. మనందరం కూడా రూపాంతరం చెందుతాం కాబట్టి ఆయన వాక్కు ఆలకించి అని ప్రకారంగా జీవించుదాం.
Fr. Bala Yesu OCD

17, ఫిబ్రవరి 2024, శనివారం

తపస్సు కాల మొదటి ఆదివారం

తపస్సు కాల మొదటి ఆదివారం
ఆది 9:8-15, 1పేతురు 3:18-22, మార్కు1:12-15
ఈ తపస్సు కాల మొదటి ఆదివారం మనందరికీ, దేవుడు నోవాతో ఏర్పరచుకున్న ఒడంబడికను గురించి మరియు ఏసుప్రభు ఎడారిలో శోధింపబడుటను తెలుపుచున్నది.
ఈనాటి మొదటి పఠణములో దేవుడు నోవాతో ఏర్పరచుకున్న ఒడంబడిక గురించి తెలుపుతూ ఉన్నది. ఈ తపస్సు కాల మొదటి మూడు ఆదివారాలు దేవుడు మానవులతో ఏర్పరచుకున్న మూడు ఒడంబడికలను గురించి తెలుపుచున్నవి. దేవుడు మొదటిగా నోవాతో, రెండవదిగా అబ్రహాముతో,  మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడికను ఏర్పరచుకున్నారు. ఈనాటి మొదటి పఠణములో దేవుడు నీటి ద్వారా నోవాను రక్షించిన విధానమును తెలుసుకుంటున్నాము. 
1. భూమి మీద ఉన్న ప్రజలు పరమదృష్టిలై పాపములో జీవించారు. దేవునితో సంబంధం లేకుండా పాపమును ప్రేమిస్తూ, విచ్చలవిడిగా జీవించటం ప్రారంభించారు. (ఆది 6:5-12) దేవున్ని ధిక్కరిస్తూ వచ్చారు, కాల క్రమేనా ప్రపంచంలో పాపము ఎక్కువైనది, ఈసందర్భంలో దేవుడు మరియొకసారి నోవా కుటుంబం ద్వారా ఈ సృష్టిని నూత్నీకరించారు.
 దేవుడు సృష్టిని మొత్తము నాశనము చేయలేదు ఎందుకంటే నోవా కుటుంబం మరియు దేవుడు నోవాతో తన ఓడలోకి చేర్చబడిన జంతువులు పక్షులు కూడా ఆ జలప్రళయం నుండి రక్షించబడినవి. భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు మరియొకసారి దేవునితో కొత్త జీవితం జీవించుటకు నోవా కుటుంబం రక్షిస్తున్నారు. ఈ జలప్రళయము దేవుడు శిక్షగా వచ్చినది ఏదో ఒక్కసారి తప్పు చేసినందుకు కాదు కానీ వారు ప్రతిసారి కూడా చెడు పనులు చేయాలని ఆశతో ఉన్నారు. దేవుడంటే విశ్వాసము, భయము లేకుండా జీవించే సందర్భంలో పరిపూర్ణంగా వారు దేవుని మార్గము నుండి వైదొలిగినప్పుడు మాత్రమే దేవుడు వారిని శిక్షించారు.
2.ప్రభువు వారి పాపములను శిక్షించినప్పటికీ వారి యెడల దయ, కనికరము కలవారని మనం గుర్తించాలి. వాస్తవానికి ఏ వ్యక్తియు పాపములో మరణించుట దేవునికి ఇష్టము లేదు.(2 పేతురు 3:9) కాబట్టి దేవుడు వారి యొక్క హృదయ పరివర్తనం కోసం ఎంతగా ప్రయత్నించి ఉండి ఉంటారని మనము ఆలోచించాలి. దేవుడు అప్పటినుండి ఇప్పటివరకు కూడా ఏదియు మొత్తము(completely) నాశనం చేయలేదు. ఎందుకంటే ఆయన నోవాతో చేసుకున్నటువంటి ఒడంబడిక అటువంటిది. నోవా ఒడంబడిక ద్వారా దేవుడు ఈ భూమిని, భూమి మీద ఉన్న ప్రాణికోటిని రక్షిస్తారు దానిని ఇక ఎన్నటికీ నాశనం చేయరని తెలుపుచున్నారు
3.చరిత్రలో చాలా సందర్భాలలో అంటూ వ్యాధులు వచ్చాయని మనము చదువుకున్నాం 2020లో కూడా కరోనా వచ్చింది కానీ ఆ సమయములో ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోలేదు కొంతమంది తమ యొక్క ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఏ వ్యాధులు వచ్చినా గాని అది ఈ ప్రపంచం అంతంమెందించే లాగా ఉండుటలేదు. కొంత నష్టం మాత్రమే జరుగుతుంది. అది కేవలము దేవుడు నోవా కు ఇచ్చిన వాగ్దానమునకు నిదర్శనం.
దేవుడు ఏ విధంగానైతే జల ప్రళయం నుండి నోవా కుటుంబమును జంతువులను రక్షించి ఉన్నారు అదే విధముగా మనందరినీ కూడా జ్ఞాన స్నానం అనే నీటి ద్వారా రక్షిస్తున్నారు. ఈరోజు దేవుడు మనల్ని మన కుటుంబమును ఒక నూతన సృష్టిగా చేయబోతున్నారు కాబట్టి మనము ఆయనకు విధేయులై నోవావలే విశ్వాస పాత్రులుగా జీవించాలి. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పేతురు గారు ఏసుప్రభు తన యొక్క సిలువ శ్రమల, మరణ, పునరుత్థానము  ద్వారా మనలను రక్షించినారు అని తెలుపుచున్నారు. దేవుడు జ్ఞాన స్నానంతో ప్రతి ఒక్కరితో ఒడంబడికను ఏసుప్రభు ద్వారా చేశారు. జ్ఞాన స్నానము మనలను జన్మ పాపము నుండి కాక మనము క్రీస్తునందు జన్మించేలాగా చేస్తూ ఉన్నది. జ్ఞాన స్నానము మనందరినీ రక్షిస్తూ ఉన్నది.
ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు  పొందిన శోధనల గురించి తెలియజేయబడుతున్నది. ఇక్కడ ఐదు అంశాలు మనము గుర్తుపెట్టుకోవాలి
1. పవిత్ర ఆత్మ యేసు ప్రభువుని ఎడారికి తీసుకొని పోయారు.
2. 40 రోజులు ఎడారిలో ఉంటూ  ఉపవాసం చేశారు.
3. ఆయన  మృగముల మధ్య నలభై రోజులు ఉన్నారు
4. సైతాను ఏసుప్రభువును శోధించినది.
5. దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు.
ఈ ఐదు అంశాలలో ముఖ్యమైనవి; ఏసుప్రభు శోధింపబడుట మరియు శోధనలను జయించుట.
ప్రతి ఒక్కరి జీవితంలో శోధనలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే సైతాను యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే మనం దేవుడిని మరిచిపోయేలాగా చేయడం అలాగే దేవునికి అవిధేయత చూపించేలాగా చేయుట అందుకనే ప్రతిసారి కూడా మనలను శోధిస్తూ ఉన్నది. ఏసుప్రభువును కూడా ఎడారిలో శోధించినది ఎందుకంటే ఆయన కూడా తండ్రి చిత్తమును విడిచి పెట్టేసి తన స్వార్థం కోసం జీవిస్తాడేమో అని సైతాను శోధించినది మరియు ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో శోధించినప్పుడు వారు ఏ విధంగానైతే మానవ బలహీనత వలన పడిపోయారో అదే విధముగా ఏసుప్రభువు కూడా మానవ దైవ స్వభావములో ఉన్నప్పుడు పడిపోతాడు అనే ఉద్దేశంతో సైతాను ప్రభువును శోధించినది. మార్కు సువార్తికుడు ఏ విధమైనటువంటి శోధనలు ఏసుప్రభుకి కలిగాయి అని స్పష్టముగా తెలియ చెప్పలేదు కానీ ఆయన శోధించబడ్డారు అని తెలిపారు. మత్తయి మరియు లూకా సువార్తికులు యేసు ప్రభువుని సైతాను మూడు అంశములమీద శోధించినది అని తెలుపుచున్నారు. మార్కు సువార్తలో ఏసుప్రభు శోధించబడ్డారు అని మాత్రమే తెలిపారు ఎందుకంటే శోధనలు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి అది ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి భిన్నముగా ఉంటాయి అని తెలియజేయుటకే ఏ విధమైన శోధన అని మార్కు సువార్తికుడు చెప్పలేదు. కాబట్టి మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మనము దేవుని యొక్క శక్తితో ముందుకు సాగి శోధనలను జయించాలి అప్పుడే మనకు దేవుడు తన యొక్క అనుగ్రహాలను ఒసుగుతారు. చాలా సందర్భాలలో సైతాను మనలను శోధించినప్పుడు మనము పడిపోతాము సైతాను వివిధ రకాలుగా మనలను శోధిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ సమయంలో ఎవరిని ఎక్కడ శోధించాలో సైతాన్ కి బాగా తెలుసు కాబట్టి మనము ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏసుప్రభు ఏ విధంగానైతే ప్రార్ధన జీవితము ద్వారా శోధనలు జయించారో మనము కూడా దేవుని శక్తితో శోధనలు జయించాలి. శోధనలు జయించినప్పుడు దేవుడు మనతో ఒక ఒడంబడికను ఏర్పరచుకుంటారు అలాగే మనలను ఆశీర్వదిస్తాను. ఈ ఒడంబడిక ద్వారా దేవుడు మనలను నూతన సృష్టిగా చేస్తున్నారు. కాబట్టి శోధనలను జయించుటకు దేవుని యొక్క సహాయం కోరుతూ ప్రార్థిద్దాం.
Fr. Bala Yesu OCD

3, ఫిబ్రవరి 2024, శనివారం

సామాన్య కాలం 5వ ఆదివారం


యోబు 7:1-4, 6-7
1కొరింతి 9:16-19
మార్కు 1: 29-39
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మానవ జీవితంలో కష్టాలు, బాధలు ఎదురైన సమయంలో జీవితంలో ఆశలు కోల్పోకుండా ధైర్యంతో ముందుకు సాగాలి అదేవిధంగా దేవునియందు నమ్మకముంచాలి అని తెలుపుచున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సర్వసాధారణం కావున మనకే ఎందుకు కష్టాలు వచ్చాయి అనే ఆలోచనలతో జీవించకుండా ఏసుప్రభువు వలె కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. 
చాలా సందర్భాల్లో మనందరం ప్రతిసారి మనము అనుభవించిన కష్ట,బాధ,శ్రమల గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ వాటన్నిటికన్నా ప్రతి కష్టము తరువాత దేవుని ఆశీర్వాదం ఉంటుంది అని గ్రహించాలి.
ఈనాటి మొదటి పఠణము యోబు గ్రంథము నుండి చదవబడినది. యోబు గ్రంథం ఆనాటి కొంతమంది యొక్క ఆలోచనలను సరి చేసే విధంగా వ్రాయబడినది. అప్పటి కొందరి ఆలోచన ఏమిటి అంటే దేవుడు మంచివారిని దీవిస్తారని, పాపులను క్షమిస్తారని అభిప్రాయం. ఆ అభిప్రాయమున ఖండిస్తూ యోబు గ్రంథములో దేవుడు అందరూ ఎడల ఒకే విధముగా మెలుగుతారు అని తెలుపుచున్నారు. వాస్తవానికి మంచివారే ఎక్కువగా కష్టాలు అనుభవిస్తారు అని ప్రభువు యోబు గ్రంథం ద్వారా తెలుపుతున్నారు. 
యోబు నీతిమంతుడుగా జీవిస్తూ, ఆస్తి ఐశ్వర్యములను కలిగి ఉన్న సమయంలో సైతాను దేవునితో సంభాషించినప్పుడు యోబు మిమ్మల్ని (యావే దేవుని) ఆరాధించేది కేవలం మీరిచ్చిన సంపదలవలనే అని ప్రభువుతో తెలిపినప్పుడు ప్రభువుక సంపదలు ఉన్నా లేకపోయినా నా ఎడల యోబు విశ్వాసపాత్రుడుగా ఉంటారు అని తెలిపినప్పుడు సైతాను యోబును పరీక్షించుటకు సిద్ధమైంది దానికి ప్రభువు కూడా సమ్మతించారు. 
ప్రతి ఒక్కరి విశ్వాసము కూడా పరీక్షించబడాలి అప్పుడే నిజమైన విశ్వాసము అనేది బయటకు వస్తుంది.1 పేతురు 1:7
ఈనాటి మొదటి పఠణం ద్వారా మనము కొన్ని అంశాలు నేర్చుకోవాలి
1. మంచివారికి కష్టాలు వస్తాయి. చాలా సందర్భాలలో మన యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి చెడ్డవారికి కష్టాలు మంచివారికి ఆశీర్వాదాలు దొరుకుతాయని అందరి అభిప్రాయం కానీ మనం సమాజంలో చూసేది ఏమిటంటే మంచివారు కష్టాలను అనుభవిస్తారు, చెడువారి సంతోషంగా ఉంటాయి. మనము పవిత్ర గ్రంథములో చూసుకున్నట్లయితే ఎవరైతే దేవునికి దగ్గరగా ఉండి జీవించారో వారే ఎక్కువ కష్టాలు అనుభవించారు. పవిత్ర గ్రంధములో అబ్రహాము,
ఏసేపు, ఇర్మియా ప్రవక్త, మరియమ్మ- యేసేపు, పౌలు గారు  అదేవిధంగా అపోస్తులు, ఇంకా అనేకులు కష్టాలు అనుభవించారు వీరందరూ దేవుడికి దగ్గరగా ఉన్నప్పటికీ, మంచి జీవితం జీవించినప్పటికిని కష్టాలు అనుభవించారు. వీటి యొక్క అర్థం ఏమిటి అంటే మంచి వారికి కష్టాలు వస్తునే ఉంటాయి అది ఎందుకంటే వారు ఇంకా వారి విశ్వాస జీవితంలో దేవునికి దగ్గర అయి ఉండాలి అని మరియు వారి విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండుటకై. మనము కష్టాలు అనుభవిస్తున్నామంటే మనల్ని దేవుడు బాగా గుర్తుపెట్టుకుంటున్నారని అర్థం. ఏ వ్యక్తిని కూడా తన యొక్క శక్తిని మించి సైతాను శోధింపడు.
1కొరింతి 10:13
2, యోబు తన కష్టములలో ఆయన స్థిరముగా, ధైర్యంగా ఉన్నారు. తన జీవితంలో అన్నీ ఉన్నవి ఆస్తిపాస్తులు, స్నేహితులు, కుటుంబము, పిల్లలు అందరు కూడా ఉన్నారు కానీ సైతాను శోధన వలన ఆయన అన్నీ కోల్పోయాడు చివరికి తన యొక్క జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేనటువంటి ఒక పరిస్థితి ఎదురయింది ఆయన శరీరమంతా వ్రణములతో నిండి ఉన్నది. ఆయన శారీరకంగా మానసికంగా కృంగిపోయాడు. పనివాడు ఏ విధముగానయితే బ్రతుకుట కోసం కష్టపడి పనిచేస్తుంటాడో తాను కూడా బ్రతుకుట కొరకు శ్రమలు అనుభవిస్తున్నాను అని తెలుపుతున్నారు.  అన్ని కష్టాలనుభవించినప్పటికీ  కూడా తన జీవితాన్ని తాను నాశనం చేసుకోవాలని కోరుకోలేదు ఆయన అన్ని పరిస్థితులను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నాడు. యోబు యొక్క స్థిరత్వం మనందరం కూడా కలిగి ఉండాలి ఆయనకన్నా మనకి ఎక్కువ కష్టాలు ఏమి వచ్చి ఉండవు కాబట్టి అన్నిటినీ ధైర్యముగా ఎదుర్కోవాలి. యోబు నిరాశలో దేవుని యొక్క సమాధానము కొరకు, ఆశీర్వాదం కొరకు ఎదురుచూస్తూ ఆయన్ని నమ్ముకుని ఉన్నాడు.

3. యోబు తన కష్ట జీవితంలో దేవుడి వైపు మరలుతున్నాడు. ఎవరైతే తనని ఉన్నత స్థితికి చేర్చారు ఆయన వైపే మరొకసారి యోబు తిరుగుచున్నాడు. ఆయన ఎన్నడూ దేవుడిని విడిచిపెట్టలేదు. మనము మాత్రం మన కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి కూడా రాము ఆయనకి ప్రార్థన కూడా చేయము.
4. మన సొంత వారే మనల్ని అర్థం చేసుకోకపోవడం. యోబు యొక్క స్నేహితులు తాను ఉన్నటువంటి స్థితిలో తనను ఓదార్చుటకు బదులుగా ఆయన యొక్క తప్పిదమును వేలెత్తి చూపుచున్నారు. ఆయన దేవుని పాపం చేసాడు కాబట్టే ఇంతటి శిక్ష వచ్చినది అని వారందరూ కూడా తలంచారు. కొన్ని కొన్ని సందర్భాలలో మన స్నేహితులే, సొంతవారే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు కానీ దేవుడు ఎల్లప్పుడూ మనల్ని అర్థం చేసుకుంటాడు.
యోబు తన విశ్వాస జీవితంలో దేవుడిని నమ్ముకొని ఆయన మీద ఆధారపడ్డారు కాబట్టి  ఆయనను ఇంకా అధికముగా ఆశీర్వదించారు కాబట్టి మానవ జీవితం కష్టాలతో వున్నప్పటికిని మనం దేవుడిని అంటిపెట్టుకొని ఉంటే దేవుడు మనలని చివరికి ఆశీర్వదిస్తూనే ఉంటారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తాను అందరి కొరకై సేవకుడిగా చేయబడ్డారు అని తెలుపుచున్నారు. దేవుడు తనకు అప్పచెప్పినటువంటి సువార్త ప్రకటన గురించి పౌలు తెలుపుచున్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించుట కొరకై ఆయన అందరి కొరకు అందరివాడే సువార్త సేవ చేసి ఉన్నారు. 
ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు తన యొక్క ముఖ్యమైనటువంటి పరిచర్య గురించి తెలుపుతున్నారు. ప్రభువు ఈ లోకంలో రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు అదేవిధంగా తండ్రి  యొక్క సువార్త ప్రకటించుటకు వచ్చి ఉన్నారని తెలిపారు. ఏసుప్రభు తాను ఈ లోకమునకు వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చుటలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో దేవుడు మనకు ఒసిగినటువంటి పనిని నెరవేర్చుటలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండాలి.
ఈనాటి పఠణముల ద్వారా మనము గ్రహించవలసిన అంశము ఏమిటి అంటే మన విశ్వాస జీవితం లో ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ ధైర్యంతో మనం ముందుకు సాగాలి. దేవుడిని అంటిపెట్టుకొని జీవించాలి అదేవిధంగా మన యొక్క పనిని సక్రమంగా నెరవేర్చాలి.
Fr. Bala Yesu OCD

27, జనవరి 2024, శనివారం

4వ సామాన్య ఆదివారం


ద్వితీయో 18:15-20
1కొరింతి 7:32-35
మార్కు1:21-28
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క సేవకుల యొక్క అధికారం వారి యొక్క బాధ్యతల గురించి తెలియజేస్తున్నాయి. సేవకులు యొక్క అధికారము అంతయు కూడా దేవుని దగ్గర నుండి వచ్చినది. వారిని ఎన్నుకునే సందర్భంలోనే దేవుడు వారికి సంపూర్ణ అధికారం ఇస్తున్నారు.
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త ఆయన మరణము గురించి తెలియజేసినప్పుడు  వారు మేము ఒక గొప్ప నాయకుడిని కోల్పోతున్నాము అనేటటువంటి భయములో ఉన్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలకు ఊరటనిచ్చుటకు  ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసేటటువంటి మాట ఏమిటంటే తనలాంటి ప్రవక్తని ప్రజల మధ్యకు దేవుడు పంపిస్తానని తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా మనందరం కూడా ఎవరు ప్రవక్త అని తెలుచుకోవాలి. 
ప్రవక్త అనగా దేవుని స్వరము, దేవుని మార్గములను బోధించేవాడు, దేవునికి మానవునికి మధ్య వారధిగా నిలబడే వ్యక్తి , పరలోక సత్యమును బోధించే వ్యక్తి, అన్యాయమును ఎదిరించే వ్యక్తి, అందుకనే ఈనాటి మొదటి పఠణంలో ప్రభువు ఇస్రాయేలు ప్రజలకు మోషే ప్రవక్త వంటి వాడిని పంపిస్తామంటున్నారు. మరి మోషే ఎలాంటి ప్రవక్త? ఆయన కూడా ప్రజల నుండి వచ్చినవాడే, ఆయన కూడా బలహీనుడే ,అయినప్పటికీ  దేవునికి అతి సమీపమున జీవించి ఉన్నారు. మోషే ప్రవక్త దేవుని యొక్క పిలుపుని అందుకున్న తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను నడిపించుటకు ఆయన ఒక నాయకుడిగా అదే విధముగా ఒక మార్గం చూపరీగా నిలిచి ఉన్నారు దేవుని యొక్క పరమ రహస్యములను ప్రజలకు బోధిస్తూ జీవించారు. అలాగే ప్రతి ఒక్క ప్రవక్త కూడా మోషే ప్రవక్త వలే మార్గ చూపరిగా ఉంటూ ప్రజలను దేవుని వైపు నడిపించాలి. ఆయన తన జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన రెండు ప్రధానమైన అంశములు ఏమిటి అంటే తాను ఎల్లప్పుడూ దేవుడికి దగ్గర అయి ఉండాలి అదేవిధంగా తాను దేవుడి యొక్క మాటను మాత్రమే బోధించాలి. తన సొంత ప్రణాళికలు కానీ తన సొంత ఆలోచన గానీ తెలియజేయకూడదు కేవలము దేవుడు చెప్పవలసినది మాత్రమే మనము తెలియజేయాలి అది ప్రవక్త యొక్క ముఖ్యమైన బాధ్యత. అలా వారు చేయకపోతే దేవుని యొక్క శిక్ష కూడా వస్తుంది.
మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు కూడా తెలియజేసే అంశము ఏమిటి అంటే వారు ఆ ప్రవక్త యొక్క మాటను వినాలి.
 ఆ ప్రవక్త యొక్క మాట సంపూర్ణంగా దేవుని యొక్క మాట కాబట్టి దానిని తమ యొక్క జీవితములో ఆచరించి జీవించాలి అది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత మరి ఈనాడు ఎంతమంది దేవుని సేవకులు యొక్క మాటను వారి హెచ్చరికలను ఆలకించి విధేయత చూపుతున్నామా?
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు సమర్పణ జీవితం గురించి తెలియజేస్తున్నారు. వివాహ జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలు వారికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ లేనందున దేవునికి తముతాము పూర్తిగా సమర్పించుకోలేరు కానీ ఎవరైతే పౌలు గారి వలే సమస్తమును కూడా దేవునికి త్యాగం చేసి జీవిస్తున్నారో వారందరూ  తమయొక్క జీవితమును తాము దేవునికి సమర్పించుకొని జీవిస్తారు.
ఈనాటి సువిశేష  పఠణంలో ఏసుప్రభు యొక్క అధికారం గురించి తెలియజేయబడుతుంది ఆయన బోధన అధికారంతో కూడుకున్నటువంటిది. ఏసుప్రభువు యొక్క బోధనలో ఎటువంటి సందేహాలు లేవు ఆయన సమస్తము మీద అధికారం కలిగినటువంటి దేవుడు కాబట్టి తన తండ్రి చిత్తమును సంపూర్ణంగా ఎరిగి ఎటువంటి భయము లేకుండా ఒక మధ్యవర్తిగా తన తండ్రి సందేశములను ప్రజలకు తెలియజేశారు. ఏసుప్రభు యొక్క అధికారము తన తండ్రి నుండి వచ్చినది సృష్టికి పూర్వం నుండి తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారుడు ఈ యొక్క అధికారం ను కలిగి ఉన్నారు ఆయన అధికారము మంచి కొరకు మాత్రమే ఆయన అధికారము సేవ కొరకు మాత్రమే ఆయన అధికారం వినయముతో కూడుకున్నది కాబట్టి ఈరోజు మనము కూడా ధ్యానించవలసిన అంశం ఏమిటి అంటే దేవుడు మనకు ఇచ్చిన అధికారం ఒక యజమానుడిగా నాయకుడిగా ఇచ్చిన అధికారమును మనము సద్వినియోగపరచుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

20, జనవరి 2024, శనివారం

మూడవ సామాన్య ఆదివారం

మూడవ సామాన్య ఆదివారం
యోనా 3:1-5
1కొరింతి 7:29-31
మార్కు 1:14-21
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణములు ప్రభు యొక్క రాకడ కొరకై హృదయ పరివర్తనం చెంది జీవించాలి అనే అంశము గురించి బోధిస్తున్నాయి. హృదయ పరివర్తనం మరియు పాపమునకు పశ్చాత్తాప పడటం ఒక కొత్త జీవితం నాంది పలుకుతుంది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యోనా ప్రవక్తను నినెవే పట్టణమునకు హృదయ పరివర్తనం బోధించుటకు పంపిన విధానమును చదువుకుంటున్నాం. దేవుని యొక్క పిలుపును మొదటిగా స్వీకరించినప్పుడు యోనా ప్రవక్త నీనెవే వెళ్ళుటకు నిరాకరించారు ఎందుకంటే నినెవే వాసులు ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా జీవించి అనేక సందర్భంలో యుద్ధంలో ఆధిపత్యమును సాధించారు. అందుకనే యోనా నినెవే పట్టణవాసులు నాశనమైతే బాగుండు అని భావించి ఆయన తర్షీషునకు ప్రయాణం ప్రారంభించాడు కానీ తన ప్రయాణం గమ్యమునకు చేరలేదు మార్గమధ్యంలోని దేవుడు ఆయనను పంపవలసిన గమ్యమునకు పంపిస్తున్నారు. యోనా ప్రవక్త నినెవే పట్టణము చేరి అక్కడ ప్రభువు యొక్క హృదయ పరివర్తన సందేశమును ప్రకటించగానే రాజు దగ్గర నుండి చిన్నపిల్లల వరకు కూడా దేవుని యొక్క సందేశము శ్రద్ధగా ఆలకించి, స్వీకరించి వారు హృదయ పరివర్తన మనకు చేయవలసిన ప్రతి పనిని కూడా చేస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటి అంటే వారు అన్యులు అయినప్పటికీ కేవలం ఒకే ఒక దైవ సందేశమును ఆలకించగానే హృదయ పరివర్తనము చెందటానికి సిద్ధపడుతున్నారు మరి మనము దేవుని  యొక్క వాక్యము విన్న సందర్భంలో హృదయ పరివర్తనము చెందటానికి సిద్ధపడుచున్నాము. నినెవే వాసులు మరణము వస్తుంది అని విన్న వెంటనే గోనె దాల్చి, బూడిద పూసుకొని ఉపవాసం చేసి ఉన్నారు. మనం మరణము గురించి కూడా ధ్యానించినట్లయితే ప్రతి ఒక్కరు హృదయ పరివర్తనం చెంది జీవిస్తారు.
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు గారు ఇక సమయము లేదు అని తెలుపుచున్నారు కావున హృదయ పరివర్తనము చెంది చెడు మార్గములను విడిచి పుణ్యమార్గములను అలవర్చుకోవాలి. ఈ లోక సంబంధమైన వాంఛలతో కానీ ఆశలతో కానీ జీవించకుండా దేవుని కొరకు జీవించమని తెలుపుచున్నాను. దేవుని కొరకు జీవించాలి అంటే ఇప్పుడు మనము నడుస్తున్న చెడు మార్గము కానీ పాపపు మార్గము కానీ విడిచి పెట్టాలి అప్పుడే మనలో కొత్త జీవితం పుడుతుంది.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తన మొదటి సువార్త పరిచర్య  హృదయ పరివర్తనము అనే అంశము ద్వారా ప్రారంభించి ఉన్నారు. కాలము సంపూర్ణమైనది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించండి అని క్రీస్తు ప్రభువు పరిచర్య ప్రారంభించారు. హృదయ పరివర్తనం అనగా ఒక యు టర్న్ (U- Turn)తీసుకోవటమే ఎందుకంటే మనము మిస్సయినటువంటి మార్గమును మనము మరల అనుసరించటం.
 పాపము చేసిన సందర్భంలో దేవుని యొక్క మార్గమును విడిచి మన సొంత మార్గంలో ప్రయాణం చేస్తాం కాబట్టి ఈ యూటర్న్ అనేది మరొకసారి దేవుని యొక్క మార్గమును అనుసరించుటయే. హృదయ పరివర్తన ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం లేనియెడల మనందరం మన యొక్క జీవితమును యధావిధిగా కొనసాగిస్తూ ఉంటాం అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే కాలము సంపూర్ణమైనది. కాలము సంపూర్ణమైనది అనగా దేవుని యొక్క కాలము ప్రారంభమైనది కాబట్టి దానికి అనుగుణంగా మనము హృదయ పరివర్తనం చెందాలి.
హృదయ పరివర్తనము మన యొక్క వ్యసనములు నుండి, పాపపు జీవితము నుండి, మూడు నమ్మకముల నుండి ఇంకా చెడు సుగుణముల నుండి హృదయ పరివర్తనం చెందాలి. హృదయ పరివర్తన ప్రతి ఒక్కరు కోరుకునే అంశం కొన్నిసార్లు దేవుడు ప్రజల హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు, కొన్నిసార్లు బిడ్డలు తల్లిదండ్రులు హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు మరి కొన్నిసార్లు భర్త భార్య హృదయ పరివర్తనం చెందాలనుకుంటారు అలాగే భార్య భర్త హృదయపరివర్తనం చెందాలనుకుంటారు ఈ విధంగా చాలామంది ఒకరి పట్ల ఒకరు  హృదయ పరివర్తనం కోరుకుంటారు కాబట్టి మనం హృదయ పరివర్తనం చెంది జీవించాలి.
Fr. Bala Yesu OCD

6, జనవరి 2024, శనివారం

క్రీస్తు సాక్షాత్కార పండుగ

క్రీస్తు సాక్షాత్కార పండుగ
యెషయా 60:1-6,ఎఫేసి 3:2-3, మత్తయి 2:1-12
ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుచున్నది. సాక్షాత్కారం అనగా క్రీస్తు ప్రభువు తనను తాను ఇతరులకు ఎరుకపరుచుట. తండ్రి దేవుడు తన కుమారుడిని ఈ లోకమునకు అంతట ఎరుకపరిచారు. ఆయన యొక్క పుట్టుక ద్వారా దేవుడు మొదటగా ఏసుప్రభువును తన తల్లిదండ్రులకు తరువాత గొల్లలకు ఎరుకుపరిచారు అటు తరువాత ముగ్గురు జ్ఞానులకు తన కుమారుడిని బయలుపరిచారు. క్రీస్తు సాక్షాత్కారము ద్వారా మానవలోకంలో దైవ సాక్షాత్కారం జరిగింది. దేవుడికి మానవునికి మధ్య ఉన్న తెర తొలగిపోయి దేవుడు మానవుడు ఒకటిగా కలిసి ఉన్నారు, ముఖాముఖిగా ఒకరినొకరు చూడగలుగుతున్నారు.
ఈ పండుగను మూడు విధాలుగా పిలుస్తారు
1. ముగ్గురు రాజుల పండుగని
2. విశ్వాసుల పండుగని
3. అన్యుల క్రిస్మస్ పండుగని
ఈ ముగ్గురు జ్ఞానులు అన్యులైనప్పటికీ వారు క్రీస్తు రాజును దర్శించడానికి మరియు ఆరాధించటానికి దూర ప్రాంతముల నుండి సుదీర్ఘమైన ప్రయాణం చేసి కష్టమైనా ఇష్టముగా మార్చుకొని వారు దివ్య బాల యేసును సందర్శించారు. ఈ జ్ఞానులు క్రీస్తు ప్రభువు చెంతకు చేరుటకు ఎటువంటి పవిత్ర గ్రంథమును చదవలేదు కేవలం ఒక నక్షత్రమును ఆధారముగా చేసుకొని వారి యొక్క ప్రయాణమును ప్రారంభించి రక్షకుడిని చేరుకున్నారు. ఈ ముగ్గురు జ్ఞానులు ఎవరనగా? కాస్పర్, మెల్కియోర్, బల్తజార్.
కాస్పర్ అనేటటువంటి జ్ఞాని అరేబియా దేశం నుంచి తన ప్రయాణం ప్రారంభించి దేవునికి సాంబ్రాణి సమర్పించారు. ఈ సాంబ్రాణి యాజకత్వమునకు గుర్తు ఏసుప్రభు నిత్య యాజకుడని గుర్తించి ఆయన అందరికీ రక్షణనిచ్చుటకై తన్ను తానే బలిగా సమర్పించుకుంటారని మరియు మన కొరకై తండ్రిని సంతోష పరుచుటకు ఒక యాజకునిలా ధూపము వేస్తూ మనలను ఆశీర్వదిస్తారు.
మిల్కియోర్ అనే జ్ఞాని ఏసుప్రభుకు బంగారమును సమర్పించారు. ఈ బంగారం యేసు ప్రభు యొక్క రాజరికమునకు గురుతుగా ఉన్నది. ఆయన మన అందరి యొక్క హృదయములను పరిపాలించే రాజు అందుకే ఆయనకు బంగారం కానుకగా సమర్పించారు
బల్తజార్ అనే జ్ఞాని పరిమళ ద్రవ్యమును యేసు ప్రభుకి సమర్పించారు అది ఆయన మరణమును సూచిస్తుంది. ఆయన మరణించిన తరువాత తన యొక్క శరీరమును మంచిగా ఉంచుటకు ఈ యొక్క పరిమళ ద్రవ్యమును సమర్పించారు. ముక్కు రంధ్రంలో పరిమళ ద్రవ్యమును ఉంచినట్లయితే ఆ యొక్క శరీరం చాలా కాలం నిలుస్తుంది.
ఈనాడు ఈ ముగ్గురు జ్ఞానుల పండుగను జరుపుకునే సందర్భంలో వారి జీవితము నుండి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి
- 1. ఏసుప్రభువును చూడాలన్న కోరిక. వీరి ప్రయాణం చీకటిలో జరిగినప్పటికీ వారు ఏసుప్రభుని చూడాలి అనేటటువంటి గాఢమైన కోరికను కలిగి ఉన్నారు కాబట్టి ఆయనను సందర్శించి ఉన్నారు. మనలో కూడా దేవుడు ఎడల ఒక గాఢమైన కోరిక ఉండాలి అది ఏమిటి అంటే ఆయనను చూడాలి, ప్రార్థించాలి, ఆయన సన్నిధికి రావాలి అని కోరిక మనలను నడిపించాలి.
2. వెదకుట- ఏసుప్రభు కోసం వెతుకుతూ ఉన్నారు చివరికి ఆయనను కనుగొన్నారు కాబట్టి మనలో కూడా వెదికే సుగుణం ఉండాలి.
3. పాత మార్గమును విడిచి కొత్త మార్గమును అనుసరించాలి. ఈ జ్ఞానులు కూడా చేసినది అదే.
4. దేవుడిని ఆరాధించారు. అన్యులైనప్పటికీ వారు ఏసుప్రభుని విశ్వసించి ఆయన రక్షకుడని గ్రహించి వారు ఎంత పెద్ద జ్ఞానులైనప్పటికీ కూడా ఆయన ముందు సాష్టాంగ పడి ప్రభువుని ఆరాధించారు.
5. విధేయత చూపుట. దేవుని యొక్క దూత వారికి ఆదేశించిన విధముగా వారు దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి వారి యొక్క ప్రయాణమును కొనసాగించారు.
6. దేవునికి కానుకలు సమర్పించారు. ఈ ముగ్గురు జ్ఞానులు ఏసుప్రభువుకు విలువైన కానుకలను సమర్పించారు అలాగే మనము కూడా దేవునికి విలువైన కానుకలు సమర్పించాలి.
ఈనాడు ఈ ముగ్గురు జ్ఞానుల పండుగను కొనియాడే  సందర్భంలో మనము వీరిలో ఉన్న లక్షణములను కలిగి జీవించాలి.
Fr. Bala Yesu OCD

30, డిసెంబర్ 2023, శనివారం

తిరు కుటుంబ ఉత్సవము

తిరు కుటుంబ ఉత్సవము
సిరాకు 3:2-6,12-14
కొలోస్సీ 3:12-21
మత్తయి 2:13-15,19-23

ఈనాడు తల్లి శ్రీ సభ తిరు కుటుంబ పండుగ జరుపుకుంటుంది. ఈ పండుగను 15వ బెనెడిక్ట్ పాపుగారు 1921 వ సంవత్సరంలో ప్రారంభించి ఉన్నారు. క్రిస్మస్ పండుగ జరుపుకున్న సందర్భంలో అదే విధముగా ఒక సంవత్సర చివరి ఆదివారమును ముగించుకొని ఇంకొక కొత్త సంవత్సరములోనికి అడుగుపెట్టేముందు మనము తిరు కుటుంబ పండుగను కొనియాడాలని శ్రీ సభ నిర్ణయించుకున్నది ఎందుకనగా తిరుగు కుటుంబమువలె మన కుటుంబం కూడా ఉండాలి కాబట్టి.
తిరు అనగా పవిత్రమైన కుటుంబం అని ఆదర్శవంతమైన కుటుంబం అని అర్థం. యేసు, మరియమ్మ తల్లి మరియు యేసేపు గార్ల కుటుంబమును తిరు కుటుంబ అని పిలుస్తారు. వీరి కుటుంబం ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబములకు ఒక నిదర్శనం అని చెప్పవచ్చు.
ఈ పండుగను జరుపుకునే సమయంలో మన కుటుంబాలు తిరు కుటుంబము వలె దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నదా అని పరిశీలన చేసుకోవాలి. 
పాత నిబంధన గ్రంథములో మనము కొన్ని కుటుంబాలను చూస్తున్నాం దేవునికి అతిసమీపముగా జీవించిన కుటుంబాలు ఉదాహరణకు నోవా,అబ్రహాము, ఈ సాకు, యాకోబుల కుటుంబములు ఇంకా మిగతా కొన్ని కుటుంబములు కూడా ఉన్నాయి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు బిడ్డల యొక్క కర్తవ్యం గురించి తెలియజేస్తున్నారు. బిడ్డలు తమ తల్లిదండ్రులకు ఎల్లవేళలా విధేయులై జీవిస్తూ వారిని ప్రేమిస్తూ మంచిగా చూసుకోవాలి అని తెలుపుచున్నారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మరువక వారి యెడల ఒక కుమారుడిగా, కుమార్తెగా  చేయవలసినటువంటివి(బాధ్యతలు నెరవేర్చుట) అన్నియు చేసి వారి యొక్క దీవెనలు పొందాలి అని ప్రభువు, వాక్యం ద్వారా తెలుపుచున్నారు.
ప్రస్తుత కాలంలో చాలామంది సమాజంలో తమ తల్లిదండ్రులను చూసుకోవటం లేదు, వారిని అనాధలుగా విడిచిపెడుతున్నారు. అదేవిధంగా కొంతమందైతే వారిని అనాధ ఆశ్రమంలో ఉంచుతున్నారు ఇంకా కొంతమంది తల్లిదండ్రులను వాటా వేసుకుని మూడు నెలలు నా దగ్గర మూడు నెలలు అన్న దగ్గర జీవించు తెలుపుతున్నారు కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకనగా మన తల్లిదండ్రులు లేనిదే ఈ లోకంలో మనం లేము వారే మనల్ని ప్రేమించారు మనకి కావలసినది ఇచ్చారు మన యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు కాబట్టి వారి జీవితమును ఎన్నడూ కూడా మరువకుండా వారిని ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఒక మంచి బిడ్డగా ప్రతి ఒక్కరూ జీవించాలి. ఈనాటి రెండవ పఠణంలో పౌలు గారు మనందరం కూడా వినయము, దయా, కనికరము, ప్రేమ, కలిగి ఒకరి ఎడల ఒకరు సంతోషముతో జీవించాలి అని తెలుపుచున్నారు. ప్రతి కుటుంబంలో సంతోషము, ప్రేమ అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబములు ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాయి.
ఈనాటి సువిశేష భాగములో ఏసేపు గారు మరియ తల్లి, బాల యేసును తీసుకొని ఐగుప్తునకు వెళుచున్నారు అదేవిధంగా హేరోదు రాజు మరణము తర్వాత శిశువును తీసుకొని ఇశ్రాయేలునకు తిరిగి తీసుకుని రావటమును చదువుకుంటున్నాము. తిరు కుటుంబ పండుగను కొనియాడే సందర్భంలో వీరి యొక్క జీవితములు ఏ విధముగా ఉంటున్నాయి అని మనము ధ్యానించుకోవాలి. వీరు ముగ్గురు కూడా దేవునికి (తండ్రికి, పవిత్రాత్మ కు)సహకరించి దేవుని యొక్క చిత్తమును తమ జీవితంలో నెరవేర్చిన మంచి కుటుంబం. ఒక విధముగా చెప్పుకోవాలంటే తీరు కుటుంబము;
1. దేవునిని విదేయించిన కుటుంబము
2. దేవునికి సహాయం చేసిన కుటుంబము.
3. ప్రేమించే కుటుంబము
4. ప్రార్థించే కుటుంబము
5. త్యాగము చేసిన కుటుంబం
6. దేవుడిని కేంద్రంగా కలిగిన కుటుంబం
7. విశ్వాసము ఉన్న కుటుంబం
కావున ఏ విధముగానయితే తిరు కుటుంబము దేవునికి విధేయత చూపుతూ, దేవుని చిత్తమును ప్రేమిస్తూ, దేవుని కొరకు జీవించి ఉన్నారో అదే విధముగా మన కుటుంబాలు కూడా ఉండాలి.
మన కుటుంబాలు ఏ విధముగా ఉండాలో అని మనమే ఒక నిర్ణయం చేయాలి దానికి తగిన విధముగా ఒక మంచి కుటుంబమును నిర్మించుకోవాలి ఎందుకంటే కుటుంబంలోనే బిడ్డలు అన్నీ నేర్చుకుంటారు కావున తల్లిదండ్రులు బిడ్డలకు సుమాత్రుకగా ఉండుటకు ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు, బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి. బిడ్డలు తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తూ, ప్రేమిస్తూ జీవించాలి. భార్యా భర్తలిద్దరూ కలిసి మెలిసి అర్థం చేసుకుంటూ ప్రేమతో జీవించాలి. ఇదే ప్రభువు మనకు ఈనాడు ఈ పండుగ ద్వారా నేర్పించే అంశం కావున మన కుటుంబములను చక్కదిద్దుకొని దేవునికి ఇష్టకరమైన కుటుంబం గా జీవించుటకు ప్రయత్నం చేద్దాం.
Fr. Bala Yesu OCD

23, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం నాలుగవ ఆదివారం

ఆగమన కాలం నాలుగవ ఆదివారం
2 సమూయేలు  7:1-5,8-12,14,16, రోమి 16: 25-27
లూకా 1:26-38

ఈనాటి దివ్య గ్రంథ పఠనములు ఏసుప్రభు యొక్క మొదటి రాకడను(మనిషావతారం) గురించి తెలియజేస్తున్నది. క్రీస్తు జన్మదినమునకు అతి చేరువలో ఉన్నటువంటి సమయంలో ఈనాటి పరిశుద్ధ గ్రంథ వచనములు ప్రభువు యొక్క రాక కొరకు మన జీవితములను తయారు చేసుకుని సిద్ధగావుండాలి. ఈనాటి మొదటి పఠణంలో దేవుడు దావీదు రాజుకు చేసిన వాగ్దానము గురించి చదువుకుంటున్నాము. దావీదు రాజు దేవుడు తన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యములు తలచుకొని అదే విధముగా ఆయనను శత్రువుల బారి నుండి కాపాడినటువంటి గొప్ప దేవునికి నివాసము ఉండుటకు  యెరూషలేములో  ఒక దేవాలయమును   నిర్మించాలని భావించి ఉన్నారు కానీ దేవుడు మాత్రము దావీదు కాకుండా ఆయన వంశస్థుడు తనకు దేవాలయమును నిర్మిస్తారని తెలుపుచున్నారు. ప్రభువు దావీదుకు తన వలె ఇశ్రాయేలు ప్రజలను శాంతియుతంగా పరిపాలించుటకు ఒక రాజును పంపిస్తానని తెలుపుతున్నారు. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకారముగ ప్రభువు ప్రజలను శాంతియుతంగా పాలించుటకు సొలోమోను ఎన్నుకున్నారు అయితే సొలోమోను దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి దేవునికి దూరమై జీవించి అయితే ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి దావీదు యొక్క రాజ్యం కలకాలం నిలుచును కాబట్టి ఆయన యొక్క రాజ్యము కలకాలము ఉండుట కొరకై దేవుడు తన యొక్క కుమారుడిని ఈ లోకానికి పంపిస్తున్నారు. దావీదు విషయంలో దేవుడు మొదటగా చొరవ తీసుకుని ఆయన ఉన్నతమైన స్థితికి ఎన్నుకుంటున్నారు దేవుడికి దగ్గరగా జీవించారు కాబట్టే ఆయన యొక్క రాజ్యము వారసత్వం కలకాలం ఉండుటకై ప్రజల కొరకు మెస్సయ్యను దావీదు వంశం నుండి జన్మించేలా చేస్తున్నారు
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు గారు దాచబడిన దేవుని యొక్క పరమ రహస్యం ప్రజలకు తెలియచేయబడినది అని తెలుపుచున్నారు మన యొక్క రక్షణ.
 ఇంకొక విధముగా చెప్పుకోవాలి అంటే దాచబడిన దేవుని యొక్క పరమ రహస్యం అనగా దేవుని యొక్క రూపము అనేక సంవత్సరాలుగా దాచబడినది ఎందుకంటే దేవుడిని ఎన్నడు ఎవరు కనులారా చూడలేదు కానీ మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ముఖము ప్రజలందరికీ కూడా తెలియజేయబడినది. ఇంకొక విధముగా చెప్పుకోవాలి అంటే దేవుని యొక్క పరమ రహస్యము ఎన్నో సంవత్సరాలుగా అన్యుల నుండి దాచబడినది కానీ పౌలు గారి యొక్క సువార్త పరిచర్య ద్వారా అది వారికి తెలియజేయబడినది. మనందరి జీవితంలో ఏది అయినా కొత్తది మనకు తెలిసిన యెడల దానిని మనం సంతోషిస్తాము అదేవిధంగా దేవుని యొక్క పరమ రహస్యం మనకు తెలియజేయబడిన సందర్భంలో మనము కూడా సంతోషించాలి. ఈనాటి సువిశేష భాగములో మరియ తల్లికి మంగళవార్తను గాబ్రియేలు దూత తెలియచేయుటను వింటున్నాము మరియ తల్లి దేవుని యొక్క సందేశం మొత్తము కూడా ఆలకించి ఆలకించినటువంటి వాక్యమును విశ్వసించినది. మరియ తల్లి యొక్క విశ్వాస జీవితము చాలా గొప్పది ఎందుకంటే ప్రవక్తల యొక్క ప్రవచనములను సంపూర్ణముగా విశ్వసించినది ఇదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును ఆయన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించును అన్నటువంటి వాక్యము మరియ తల్లి సంపూర్ణంగా విశ్వసించి ఉన్నది కాబట్టి దేవునికి జన్మనివ్వటకు ఆ తల్లి సిద్ధంగాన్నది అదే విధముగా ఆమె తన జీవితమును దేవుని కొరకు సంసిద్ధం చేసుకున్నది దేవుడిని వాక్కు రూపంలో తనలోకి స్వీకరించాలి అని ఆధ్యాత్మికంగా తాను తయారయ్యారు అందుకే మరియ తల్లి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని పలుకుతూ ఉన్నారు. శూన్యము నుండి సృష్టిని చేసినటువంటి దేవుడు, సముద్రం నుండి దారిని చేసిన దేవుడు, ఎడారి గుండా గమ్యమును మార్గం సిద్ధం చేసిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అందుకని మరియతల్లి దేవుని యొక్క వాక్కు జీవము పొందుకుంటుంది అని సంపూర్ణంగా విశ్వసించినది. ఈరోజు మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క జననము మన హృదయములో జరగాలి అని మనందరం ఎదురు చూస్తున్న అయితే ఈ నాలుగు వారాల ఆగమన కాల యొక్క సిద్ధపాటు మన జీవితంలో దేవుని యొక్క రాకకు మార్గమును సిద్ధము చేసిన విధంగా ఉంటూ ఉన్నదా? అన్నది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే క్రిస్మస్ ద్వారా దేవుడు మనకు దగ్గరవుతున్నారు కాబట్టి ఆయన రాక కొరకు మనం మార్గం సిద్ధం చేయాలి.
Fr. Bala Yesu OCD

16, డిసెంబర్ 2023, శనివారం

ఆగమన కాలం మూడవ ఆదివారం

ఆగమన కాలం మూడవ ఆదివారం
యెషయా 61:1-2, 10-11
1తెస్సలోని 5:16-24
యోహాను 1:6-8,19-28
ఈనాటి ఆదివారమును లతీన్ భాషలో "గౌదేతే "ఆదివారం అని పిలుస్తారు అనగా 'ఆనందించు' ఆదివారము అని అర్థం. దివ్య బాల యేసు యొక్క రాక అతి చేరువులోవున్నది, మన యొక్క రక్షణ కూడా అతి సమీపంలో ఉన్నది కాబట్టి ఆయన యొక్క రాక కొరకై మనందరం కూడా ఆనందంతో సంసిద్ధత కలిగి ఎదురు చూస్తున్నాం. ప్రభువు నందు ఎల్లప్పుడూ సంతోషించాలి మనం.
ఈనాటి దివ్య గ్రంథ పఠనంలు కూడా దేవుని యొక్క రాక కొరకై త్వరపడి చేయవలసిన ఆధ్యాత్మిక పనులు చేసి సిద్ధంగా ఉండాలి అనే అంశము గురించి బోధిస్తున్నాయి. మొదటి పఠనంలో దేవుడు యెషయా ప్రవక్తను అభిషేకించిన విధానమును వింటున్నాం.  బాబిలోనియా బానిసత్వంలో జీవిస్తున్నటువంటి యూదులకు దేవుడు సంతోషకరమైన వార్తను అందచేస్తున్నారు అది ఏమిటంటే  "పేదలకు సువార్తను బోధించటానికి, హృదయ వేదననొందిన వారిని దృఢపరుచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును తన యొక్క సేవకుడిని ఎన్నుకుంటున్నాను అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఈ మాటలను ఒక్కొక్కటి మనము ధ్యానం చేసుకోవాలి ఎందుకనగా మాటలు కేవలం యెషయా ప్రవక్తకు సంబంధించినవి మాత్రమే కాదు అవి బాధామయ సేవకుడైన ఏసుప్రభుకు సంబంధించిన వచనములు. మెస్సయ్య తన యొక్క భూలోక జీవితంలో చేసినది ఈ పనియే.
పేదలు అనగా లేనివారు- ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సాన్నిధ్యం లేకుండ జీవిస్తున్నారో వారికి దేవుడిని అందజేయుట. పేదవారు దేవునియందు నిండు నమ్మకం ఉంచి ఆయనపై పూర్తిగా ఆధారపడి జీవించేవారు. దేవుడే వారి యొక్క ఐశ్వర్యం. ప్రవక్త దేవుడి మీద ఆధారపడి జీవించే వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు అని తెలిపారు.
హృదయ వేదననొందిన వారిని దృఢపరుచుటకు దేవుడు ప్రవక్తను అభిషేకిస్తున్నారు అంటే బానిసత్వములో బాధలు అనుభవిస్తూ, నిరాశలో, నిస్పృహలో అన్ని కోల్పోయాము అని బాధలో ఉన్న వారిని బలపరచడానికి ప్రవక్త అభిషేకమును పొందుచున్నారు.
చెరలో ఉన్నవారికి అదే విధముగా బంధింపబడిన  వారికి విముక్తిని కలుగ చేయుటకు అభిషేకమును దయచేస్తున్నారు. ప్రవక్త యొక్క ప్రధానమైన బాధ్యత ఏమిటంటే ఎవరైతే ఈ లోక సంబంధమైన కోరికలలో, పాపములో చిక్కుకుని పోయి ఉన్నారో వారిని విడుదల చేయుటకు అభిషేకమును పొందుతున్నారు. అలాగే శిక్షించేటటువంటి వారిని ఓదార్చుటకు ప్రవక్త నియమింపబడుతున్నారు. ఈ మొదటి పఠనం ద్వారా మనము గ్రహించవలసిన అంశం ఏమిటంటే దేవుడు ప్రజలకు సంతోషమును దయ చేయుటకు వారి మార్గములను సరి చేయుటకు వారికి తాను ఎప్పుడూ తోడుగా ఉన్నారు అని తెలియచేయుటకు ప్రవక్తలను ఎన్నుకొని వారిని తన యొక్క సాధనములుగా ప్రజల మధ్య ఉంచుతున్నారు.
ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు తెస్సలోనిక ప్రజలను సర్వదా సంతోషించమని, ప్రార్థించమని మరియు దేవునికి కృతజ్ఞత తెలియజేయమని తెలుపుచున్నారు. ప్రభువు యొక్క రాకడ జరుగును కావున ఆ అంశం మీద ఎల్లప్పుడూ సంతోషించమని తెలుపుతూ ఉన్నారు. అలాగే దేవునికి ప్రార్ధన చేస్తూ ప్రభువు పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞులై జీవించమని తెలుపుతున్నారు. పౌలు గారు ఈ లోకంలో అంతయు పరీక్షించి కేవలం మనిషిని మాత్రమే అనుసరించమని తెలుపుచున్నారు ఎందుకనగా మంచిని చేసినట్లయితే మనము ఎప్పుడు కూడా సంతోషంతోనే జీవిస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మనుసారంగా మనము జీవించాలని పౌలు గారు తెలుపుతున్నారు.
ఈనాటి సువిశేష  భాగములో బప్తిస్మ యోహాను గారు గురించి చెప్పబడినది బప్తిస్మ యోహాను గారు ఈ లోకంలో క్రీస్తునకు సాక్షమిచ్చుటకు వచ్చి ఉన్నారు. అలాగే క్రీస్తు  కొరకు ప్రజలలో మార్గమును సిద్ధం చేయుటకు వచ్చి ఉన్నారు. ఆయన సువార్త పరిచర్య చేసే సమయంలో అనేకమంది ప్రజలలో యోహాను గారే మెస్సయ్య లేదా ఇంకా వేరే ఒకరి కొరకు ఎదురు చూడాలా అనే సందేహాలు చాలా ఉన్నాయి దానికిగాను యెరుషలేములో ఉన్న యూదులు కొందరు యాజకులను, లేవీయులను యోహాను గారి దగ్గరికి పంపిస్తున్నారు, ఆయన ఎవరు అని తెలుసుకొనుటకు. యోహాను గారు తాను క్రీస్తుని కాదని ఒప్పుకొనుటకు ఎటువంటి నిరాకరణ చేయలేదు. ఆయన ఆ సందర్భంలో నేనే క్రీస్తు అని చెప్పినట్లయితే అనేకమంది ఆయనను నమ్మి ఉండి ఉండవచ్చు కానీ యోహాను గారు, నేను ఆయనను కాదు కేవలము ఆయన కొరకు మార్గమును సిద్ధం చేయుట కొరకై పంపబడిన వాడిని పలికారు మరియు నేను ఆయన పాదరక్షలను విప్పుటకైన యోగ్యుడను కాను అని తనను తాను తగ్గించుకొని క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చారు. బప్తిస్మ  యోహాను గారు ఏసుప్రభుకు సాక్ష్యం ఇచ్చుటలో సంతోషంగా ఉన్నారు.ఈయనలో అంత వినయము ఉన్నది కాబట్టే దేవుడు అతని జీవితమును దీవించారు అందుకే ఏసుప్రభు ఈ భూలోకంలో బప్తిస్మ యోహాను గారు గొప్పవారు అని తెలుపుతున్నారు.
ఈనాటి పరిశుద్ధ వాక్యం మనం దేవుడి యందు సంతోషించాలి అనే అంశమును తెలుపుతూ ఉన్నారు కాబట్టి మనం కూడా మంచిని చేస్తూ, మంచిగా జీవిస్తూ, ప్రభు రాకడ కొరకై మన జీవితంను సిద్ధపరచుకుంటూ ఆయన వస్తాడు అనేటటువంటి ఆశతో, ఆనందంతో, ఎదురుచూసి రక్షకుని మన ఇంటికి ఆహ్వానించుదాం.
Fr. Bala Yesu OCD

13, డిసెంబర్ 2023, బుధవారం

దైవ వాక్కు ధ్యానము : మత్తయి 11:11-15

దైవ వాక్కు ధ్యానము : మత్తయి 11:11-15:  మత్తయి  11:11-15 "మానవులందరిలో స్నాపకుడగు  యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ...

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం   యెషయా 6:1-6  1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...