27, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా ఐదవ ఆదివారం

పాస్కా ఐదవ ఆదివారం 
అపో9: 26-31, 1 యోహాను 318-24, యోహాను 15:1-8
ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనములు దేవునిలో ఐక్యమై జీవించుట అనే అంశము గురించి బోధిస్తున్నాయి. దేవుడిని తెలుసుకొని, దేవుడిని సేవించి, దేవునిలో ఐక్యమై జీవించుట క్రైస్తవ కతోలిక విశ్వాసము మనకు బోధిస్తుంది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు సౌలును తన యొక్క సువార్త సేవకై ఎన్నుకున్నటువంటి విధానం గురించి వింటున్నాం. దేవునిలో ఐక్యమై జీవించుట నిమిత్తమై ఏసుప్రభు సౌలును ఎన్నుకొని ఆయనకు దర్శనమిచ్చి తన జీవితం మార్చుతున్నారు. సౌలు యొక్క హృదయ పరివర్తనము క్రైస్తవ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ఆయన మార్పు అనేకమందికి ఆదర్శమైనది, అనేకమంది విశ్వాసం పెంచింది. ఆయన ఏసుప్రభుని అనుసరించేటటువంటి వారిని హింసించాడు అదే ఒక వ్యక్తి మరొకసారి ఏసుప్రభు గురించే ప్రసంగించి అనేకమందిని ఏసుప్రభు చెంతకు చేరుస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించవలసినటువంటి సత్యం. ఏ విధముగానయితే తోటలో పనిచేసే తోటమాలి మొక్క ఎదుగుట కొరకై దానిని సరి చేస్తూ దాని యొక్క అభివృద్ధి కొరకై సహకరిస్తూ ఉంటారో అదే విధముగా దేవుడు కూడా సౌలు యొక్క హృదయ కాఠిన్యం జీవితమును సరిచేసి ఆయనను మృదువుగా సువార్త పరిచర్యకుడిగా చేశారు. సౌలు కూడా తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు అదేవిధంగా దేవుడి మీద ఆధారపడి ఉన్నారు. దేవుని పిలుపుకు స్పందించి సౌలు జీవించారు . సౌలు దేవుడిలో ఐక్యమై జీవించుట కొరకై తన యొక్క పాత జీవితంను విడిచిపెట్టారు.
ఈనాటి రెండవ పఠణంలో  మన యొక్క జీవితము కేవలం మాట వలననేకాక క్రియల వలన కూడా ఉండాలి అని యోహాను గారు తెలియచేస్తున్నారు. మనము దేవునికి విధేయులమై ఆయన యొక్క ఆజ్ఞలను పాటించవలెనని తెలియచేస్తున్నారు అప్పుడు దేవుడు మనము ఏది కోరిన సరే దాన్ని వసుగుతారు.
ఈనాటి సువిషేశ పఠణంలో ప్రభువు ద్రాక్షావల్లి తీగలు అనేటటువంటి అంశము ద్వారా మనము ఆయనలో ఐక్యమై జీవిస్తూ ఫలించాలని ప్రభువు తెలియచేస్తున్నారు. ఏసుప్రభు ద్రాక్షావల్లి, తండ్రి వ్యవసాయని తెలుపుచున్నారు అదేవిధంగా మనము ద్రాక్షావల్లి యొక్క తీగలు. ద్రాక్షావల్లిలో భాగస్తులైన తీగలు ఎల్లప్పుడూ కూడా ఫలించాలి అని ప్రభువు తెలుపుతూ ఉన్నారు. ఆ తీగలు ఫలించటానికి వ్యవసాయ కత్తిరిస్తూ వాటిని సరి చేస్తారు. ద్రాక్ష వల్లి ఫలించుట నిమిత్తమై యజమాని కావలసినటువంటి ఎరువులు వేస్తూ తగినటువంటి నీరును సమకూరుస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆశ మొత్తము కూడా ఆ తీగలు ఫలించాలి అనే, దానికోసమే ఆయన కృషి 
 చేస్తారు. ద్రాక్ష తీగలు సరిచేసిన సందర్భంలో ఏ కొమ్మ అయితే తోటమాలికి సహకరిస్తూ ఉంటూ ఉంటుందో ఆ కొమ్మ అధికముగా ఫలిస్తుంది. మనలో ఉన్నటువంటి స్వార్ధ భావాలు, అసూయలు, కోప తాపాలు, కత్తిరించినప్పుడే మనము కూడా ఫలించబడతాము. 
మనము ద్రాక్షావల్లిలో  భాగస్తులైన కొమ్మలైతే ఎందుకు ఫలించుటలేదు మనం ఫలించకపోవడానికి కారణం ఏమిటి?
1. మనలో ఉన్నటువంటి పాపము. 
2. మన యొక్క విధేయత 
3. మనము దేవుని మీద ఆధారపడకపోవడం 
4. మన యొక్క స్వార్థపూరితమైన జీవితం  
5. మన యొక్క హృదయ కాఠిన్యం 
6. దేవుని యొక్క వాక్యమును ఆచరించకపోవడం 
7. మన యొక్క అవిశ్వాసం 
8. క్షమించలేకపోవటం
మనల్ని శుద్ధి చేయుట నిమిత్తమై ప్రభువు తన యొక్క వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి ఆయన యొక్క వాక్కును ఆలకించి మనము జీవించాలి అప్పుడే మన యొక్క జీవితాలు ఫలిస్తాయి అదేవిధంగా ద్రాక్షవల్లి తీగలు ఎల్లప్పుడూ కూడా కలిసి ఉండటం నిమిత్తమై మనము ఈ విధంగా ఉండాలి.

1. ప్రార్థన చేయాలి
2. విధేయత చూపాలి 
3. దేవుని చెంతకు మరలి రావాలి 
4. దేవుని మీద ఆధారపడి జీవించాలి 
5.  దైవ ప్రేమ, సోదర ప్రేమ కలిగి జీవించాలి.
ఇవి అన్నియు మన యొక్క జీవితంలో పాటించినప్పుడు మనం దేవునిలో ఐక్యమై జీవిస్తాము.
ఈనాడు తల్లి శ్రీ సభ మనము దేవుడిలో ఐక్యమయి జీవించమని కోరిన సందర్భంలో మనము ఆ ప్రభువు యొక్క వాక్కు అనుసారముగా జీవించ ప్రయత్నించాలి. సౌలు ఏ విధంగానైతే తన యొక్క జీవితాన్ని కత్తిరించినప్పుడు దేవునికి సహకరించారో అదేవిధంగా మనం కూడా దేవునికి సహకరిస్తూ ఆయనలో ఐక్యమవ్వాలి.
Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...