11, ఆగస్టు 2024, ఆదివారం

19వ సామాన్య ఆదివారం

 19వ సామాన్య ఆదివారం 

రాజుల మొదటి గ్రంథం 19:4-8, ఎఫెసీ 4:30-52 యోహాను 6:41-51

ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో ఏలియా ప్రవక్త గురించి   వింటున్నాము. ఏలీయా ప్రవక్త బాలు ప్రవక్తలందరిని చంపినా తరువాత యేసెబేలు రాణి ఏలియాతో నేను నిన్ను చంపిస్తాను అని చెప్పగానే ఆయన దేవుణ్ణి కలుసుకొవడానికీ, తన ప్రయాణము ప్రారంభించి మార్గంలో  దేవునితో  ప్రభూ ఈ బాధ ఇక చాలు! నా ప్రాణమును తీసుకొనుము  అని మోర పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏలియాను ఆదరించి, ఆకలిని తీర్చిన తరువాత , ఆ శక్తితో  తన ప్రయాణం  నలువది రోజులు నడిచి దేవుని కొండయైన హోరేబు చేరుకున్నాడు. 

ప్రియా విశ్వాసులారా దేవుని వాక్కు ప్రజలకు అందించి ఆత్మబలంతో ఎన్నో గొప్ప కార్యాలు చేసి రోషంతో దేవుని కొరకు జీవించి యావే దేవుడే నిజమైన దేవుడని నిరూపించి, ఎంతో మంది బాలు ప్రవక్తలను చంపి కార్మెల్ కొండపై దేవుని ఘనతను చాటించిన ఏలీయా ప్రవక్త, యేసెబేలు రాణి చంపిస్తుందేమో అని భయపడ్డాడు. మన జీవితాల్లో కూడా మనం ఎన్నో గొప్ప కార్యాలను దేవుడిచ్చే శక్తితో చేస్తూ ఉంటాం. కాని ఎలియా వలె మనం కూడా ఏమైనా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, ప్రభూ  ఇక చాలు నా ప్రాణమును తీసుకొనుము అని అంటూవుంటాం. ప్రియ విశ్వాసులారా మనము దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు నిలబడితే దేవుడు ఎల్లా వేళల మన పక్షమున ఖచ్చితముగా ఉంటూ, మనలను ఆదరిస్తూ, మన ఆకలిని తీర్చుతాడు. మనలను నడిపిస్తుంటాడు. మరి ఈ గొప్ప ప్రేమను దేవుని నడిపింపును అర్ధం చేసుకొనగలుగుతున్నామా లేదా ఆలోచించండి. 

రెండవ పఠనములో వింటున్నాం. మనము దేవుని ప్రియమైన బిడ్డలం కనుక దేవుని పోలి జీవించాలి అని వాక్యంలో స్పష్టంగా చెబుతున్నారు దేవుడు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. కాబట్టి క్రీస్తు వలె మనం ప్రేమతో నడుచుకోవాలి అని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు అని తెలియజేస్తుంది. వైరము, మోహము, క్రోధము అనే వాటిని వదలి పెట్టాలి అరుపులుగాని,  అవమానముగాని  ఏ విధమైన ద్వేషభావముగాని,  అసలు మనలో మన కుటుంబాలలోగాని మన మనసులలోగాని ఉండకూడదు. కాని ప్రియా మిత్రులారా ఈలోక  జీవితంలో ప్రేమకు బదులుగా గొడవలు, ప్రతి విషయానికి అరుపులు, కేకలు, అల్లరులు అవమానాలు ఎక్కువై పోతున్నాయి. వీటన్నిటికీ కారణం స్వార్ధం, గర్వం, అసూయ, ఓర్వలేని తనం, అందుకే వాక్యం సెలవిస్తుంది. ఏ విధమైన ద్వేషభావమైన మనలో అసలు ఉండకూడదు.   ఈ లోకంలో స్వార్ధం, నటన, మోసం ఎక్కువగానే కనపడుతుంది, ఈ లోకంలో ఎక్కడ చూసిన స్వార్ధ బుద్దితో ఉన్నవారే ఎక్కువ ఉన్నారు. అన్ని నాకే, అంత నాకే, అన్ని నేనే అనే స్వార్ధం అదేవిధంగా నటన అన్నిటిలో,, అన్ని రంగాలలో అన్ని విధులలో ఎంతో మంది నటిస్తూ నటన జీవితం జీవిస్తున్నారు. అదేవిధంగా ఎక్కువమంది  ప్రజలు ఇతరులను  అవమానిస్తున్నారు, లేదా అవమానింపబడుతున్నారు. 

ప్రియమిత్రులారా ఆలోచించండి మనం ఏవరిని అవమానించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు.  క్రీస్తుని బిడ్డలుగా, యేసు క్రీస్తుని విశ్వాసులుగా మనము ఎలా ఉండాలి అంటే పరస్పరము దయను, మృదుత్వమును మరియు క్షమాగుణమును కలిగి ఉండాలి. మన పరలోకపు తండ్రి దయామయుడు. మృదుత్వంకలిగి క్షమించి ప్రేమించే ప్రేమ మయుడు. కాబట్టి మనము పరస్పరం ప్రేమ కలిగి ఉండటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించుదాం. 

సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు అంటున్నారు. "పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అది విని  యూదులు గొణగసాగారు. ఈ యూదులు క్రీస్తు ప్రభువును తృణీకరించారు. క్రీస్తును కేవలం ఒక మానవునిగా మాత్రమే వారు చూస్తున్నారు. కాని దేవుని కుమారుడుగా అంగీకరించలేకపోతున్నారు. ఆయనపై నిందలు వేస్తూ వ్యతిరేకిస్తున్నారు. ఆయనను గురించి ప్రశ్నించుకుంటూ గొణుగుతున్నారు. ప్రియ విశ్వాసులారా మనలో చాలామంది యూదుల వలె అపనమ్మకంతో క్రీస్తుని నిజ దేవుడు కాదని అనుమానిస్తుంటాము. కొన్ని సార్లు మనము కూడా గొణుగుకుంటూ దేవుణ్ణి పరీక్షిస్తుంటాం. దేవునిపై మనము కూడా నిందలు వేస్తూ వ్యతిరేకిస్తుంటాము.   

ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ఎలా ఉన్నాము అందుకే క్రీస్తు ప్రభువు అంటున్నాడు. తనను పంపిన  తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. మిత్రులారా మనము దేని ద్వారా లేక ఎవరి ద్వారా ఆకర్షింప బడుతున్నాము, ఆలోచించండి. అనేక విధాలుగా మనము ఆకర్షింపబడుతున్నాం. మరి మనము దేవుని ద్వారా ఆకర్షింపబడుతున్నామా! దేవుని వాక్యానికి ఆకర్షింపబడుతున్నామా! ఆలోచించండి. అదేవిధంగా క్రీస్తు ప్రభువు నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందును అని అంటున్నాడు. మనము నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలి అంటే ఆయనను విశ్వసించాలి. ఒక గొప్ప విశ్వాసిగా విశ్వాస జీవితం జీవించాలి. అదే విధంగా క్రీస్తు ప్రభువు అంటున్నాడు ఈలోకము అనగా మనం జీవించుటకు ఆయన ఇచ్చు ఆహారము తన దేహము. అంటే ఎవరైనా క్రీస్తు శరీర రక్తాలను, దివ్యసత్ప్రసాదమును విశ్వాసంతో  స్వీకరిస్తారో, వారు నిరతము జీవిస్తారు. మరి మనము నిజమైం విశ్వాసంతో క్రీస్తుని శరీర రక్తాలను స్వీకరిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: జీవము గల దేవా, మాకు నీ జీవమును నీ శక్తిని ఇచ్చి నడిపింపుము. ఆనాడు ఏలియా ప్రవక్తను పోషించి, బలపరచి, నడిపించినావు. మమ్ము కూడా అదే విధముగా నడిపించుము. మేము మాలోని చేడు గుణములు విడనాడి నిన్ను పోలి నీ బిడ్డలుగా జీవించే అనుగ్రహం మాకు దయచేయుము. అదేవిధంగా మీ విశ్వాసులుగా పరస్పరం దయను,మృదుత్వమును మరియు క్షమించే గుణములను కలిగి జీవిస్తూ, పరలోకం నుండి దిగివచ్చిన జీవముగల ఆహారం  నీవే అని గుర్తించి, విశ్వసించి, నీ శరీర రక్తాలను విశ్వాసంతో స్వీకరించి నిత్య జీవం పొందే భాగ్యం దయచేయండి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

10, ఆగస్టు 2024, శనివారం

19వ సామాన్య ఆదివారం

19వ సామాన్య ఆదివారం 
1 రాజులు 19:4-8, ఎఫేసీ 4:30-5:2, యోహాను 6:41-51

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మరొకసారి దేవుని యొక్క దివ్య భోజనము గురించి బోధిస్తున్నాయి. గత మూడు వారముగా తల్లి శ్రీ సభ  దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నది. 

ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను రొట్టెతోను మరియు నీటితోనూ పోషించిన విధానం చదువుకుంటున్నాము. ఏలియా ప్రవక్త కార్మెల్ కొండపై 450 మంది బాలు ప్రవక్తలతో సవాలు చేసిన తర్వాత నిజమైనటువంటి దేవుని యొక్క సాన్నిధ్యం రుజువు చేసి ఆ 450 మంది బాలు ప్రవక్తలను హతమార్చారు దాని తరువాత ఆహాబు రాజు యొక్క భార్య అయిన యెసెబేలు రాణి తన సైనికులను పంపించి ఏలియాను ఏ విధముగానైనా సరే చంపాలని చూసింది. ఏలియా ప్రవక్త తాను ఈ వార్తను గ్రహించి తన యొక్క ప్రాణములను దక్కించుకొనుట నిమిత్తమై దూరముగా పారిపోవుచున్నారు. 
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకున్నట్లయితే ఏలీయా ప్రవక్త 450 మంది ప్రవక్తలను చంపిన సమయంలో భయపడలేదు కానీ ఒక రాణి యొక్క మూర్ఖత్వము గ్రహించి ఆయన పారిపోతున్నారు. కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఎందుకని ఏలియా పారిపోతున్నారు? తన దేవుడి మీద నమ్మకం లేఖనా, లేదా ఇంకేమైనా కారణమా? ఎంతో ధైర్యంగా ఉన్న ఏలియా ఎందుకు ఒక్కసారిగా బలహీనపడుచున్నాడు? 
ఏలియా ప్రవక్త ఒక్కసారిగా తన యొక్క ప్రాణం మీదకు వచ్చినప్పుడు భయపడుచున్నారు. తన యొక్క కష్ట సమయంలో దేవుని యొక్క స్వరమును గుర్తించలేకపోయారు, దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఆయన నిరాశలో ఉంటున్నారు అందుకని ప్రాణభయం మీద ఉన్న ఒక ఆశ వలన దూరంగా ప్రయాణమై పోతున్నారు. మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే;
1. ఏలియా ప్రవక్త యొక్క భయం. తన బలహీనత ద్వారా భయపడ్డారు కానీ ప్రభువు అతనికి దర్శనమిచ్చి, ధైర్యం నుంచి ముందుకు నడిపారు. ఏసుప్రభు మరణం తరువాత కూడా శిష్యులు భయపడిన సమయంలో ఏసుప్రభు పునరుత్థానమైన  తరువాత దర్శనం ఇచ్చి బలపరిచారు (యోహాను 20:19)
2. దేవుడు ఏలియాను విశ్రాంతి తీసుకోమని చెప్పుట. ఆయన దేవుని కార్యము ముగించే అలసట చింది ఉన్నారు కాబట్టి దేవుడు ఏలియాను కొద్దిపాటి సమయము విశ్రాంతి తీసుకోమని తెలుపుచున్నారు.  ఏసుప్రభు యొక్క శిష్యులు కూడా పరిచర్య చేసి అలసిపోయిన సందర్భంలో ఏసుప్రభు వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మని పలికారు (మార్కు 6:31). ప్రభువు మన యొక్క ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకొని మనము సంతోషముగా ఉండుట నిమిత్తమై మనకు సహాయపడతారు.
3. దేవుడు పరిగెత్తే వారి వెనకాల వెళతారు. ఏలియా ప్రవక్త దూరంగా వెళ్లేటటువంటి సమయంలో దేవుడు అతడిని విడిచిపెట్టలేదు. తన యొక్క బలహీన సమయాలలో తోడుగా ఉన్నారు. తాను పరిగెత్తే సమయంలో తన వెనకాలే వస్తున్నారు. యోనా ప్రవక్త కూడా దేవునికి దూరంగా వెళ్లే సమయంలో దేవుడు అతని వెంట వస్తున్నారు. (యోనా 1:3, 2:10)
4. ప్రభువు ఇచ్చిన ఆహారము ద్వారా ఏలీయా ప్రవక్త 40 రోజుల పాటు శక్తిని పొందుకొని తన యొక్క గమ్యమును చేరుకున్నారు. ప్రభువు ప్రసాదించే ఆహారము మన అందరి యొక్క బలహీనతను తొలగించి మనకు బలమును ఒసగుతుంది.
5. దేవుడు మనల్ని ఎన్నటికీ మరువరు. మనము ఉన్నటువంటి అపాయములో ప్రభువు మనకు చేరువలోనే ఉంటారు. దేవుని యొక్క కనుల నుండి మనము దూరముగా వెళ్లలేము ఆయన మనలను పరిశీలిస్తూనే ఉంటారు. ఏలియా ప్రవక్త కూడా తాను ఉన్నటువంటి పరిస్థితిలో అతనిని విడిచి పెట్టకుండా తన చెంతకు వచ్చి తనను ఆదుకుంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పవిత్రాత్మను విచారణమున ఉంచరాదని పౌలు గారు తెలుపుతున్నారు. పవిత్ర ఆత్మ మనలను బలపరచి ఈ లోకంలో ఎన్ని శోధనలను ఎదుర్కొనటానికి సహాయపడతారు. దేవుడు ఒసగిన ఆత్మ ద్వారా మనందరం కూడా దేవునికి చెందిన వారముగా మరియు దేవుడు మన యొక్క యజమానిగా ఉంటారు కాబట్టి మనము మన యొక్క జీవితములో ఒకరి ఎడల ఒకరు దయను చూపించుకునే విధంగా, అందరితో మంచిగా మాట్లాడుతూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ దేవుడిని పోలిన వ్యక్తులుగా జీవించమని పౌలు గారు తెలుపుచున్నారు. దేవుని పోలిన వ్యక్తులుగా అనగా దేవుని యొక్క వాక్యమును మన జీవితంలో ఆచరించి పాటించి జీవించటం.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తానే జీవాహారము అని ప్రజలకు తెలిపిన విధానము చదువుకుంటున్నాం. ఏసుప్రభు తాను జీవాహారము అని పలికిన సందర్భంలో చాలామంది ఆయన ఈ లోక సంబంధమైన ఆహారం ఇస్తారు అని భావించారు కానీ ఆయన ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారమును గురించి తెలిపారన్న సత్యమును గ్రహించలేకపోయారు. ప్రభువు ఏ విధంగా మనకు జీవాహారము అవుతారు అంటే;
1. ఆయన యొక్క వాక్కును వినుట ద్వారా, విశ్వసించుట ద్వారా, ఆచరించుట ద్వారా మనకు జీవాహారముగా మారతారు. 
2. ప్రభువు యొక్క శరీర రక్తములను స్వీకరించుట ద్వారా ప్రభువు మనకు జీవాహారమవుతారు. ఆయన దివ్య శరీర రక్తములు మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి. 
3. ప్రార్థించుట ద్వారా. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనలో ఉన్నటువంటి కొరతను తొలగించి మనలను తన యొక్క సాన్నిద్యంతో నింపుతారు. 
4. దేవుని మీద మనసును హృదయమును లగ్నము చేసి ఆయన కొరకు జీవించినట్లయితే ప్రభువు మన యొక్క జీవాహారము అవుతారు. 
ఈ విధముగా ప్రభువును మన హృదయంలోనికి స్వీకరించినట్లయితే ఇక మనకి ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకలి ఉండదు ఎందుకనగా దేవుడే మనలను తనతో నింపుతారు. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చి మనకు ఆహారమైన క్రీస్తు ప్రభువును స్వీకరించటానికి మనము ప్రతినిత్యం కూడా సిద్ధముగా ఉండాలి. 
Fr. Bala Yesu OCD

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం మొదటి పఠనము     సిరాకు : 3 :17 -18 ,20 ,28 ,29 రెండవ పఠనము      హెబ్రి 12 : 18-19-,22-24 సువార్త పఠనము      లూకా ...