21, సెప్టెంబర్ 2024, శనివారం

25వ సామాన్య ఆదివారం

25వ సామాన్య ఆదివారం 
సొలోమోను జ్ఞాన గ్రంధం 2:12,17-20, యాకోబు 3:16-4:3, మార్కు 9:30-37

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మానవుని యొక్క అత్యాశ, అసూయ, స్వార్థం మరియు దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరు అనేటటువంటి అంశములను గురించి బోధిస్తున్నారు. చాలా సందర్భాలలో వ్యక్తులు కీర్తి ప్రతిష్టల కొరకై ప్రాకులాడుచుంటారు, ధనాశ కలిగి జీవిస్తుంటారు. స్వార్థానికి, స్వలాభానికి ప్రాముఖ్యతనిస్తూ అనేక రకాలైన అక్రమ మార్గాలను అనుసరిస్తుంటారు. మానవుల యొక్క అత్యాశ ప్రమాదకరమైనది దాని వలన చాలామంది ప్రాణాలను, బంధువులను, స్నేహితులను కోల్పోతూ జీవిస్తుంటారు.
ఈనాటి మొదటి పఠణంలో నీతిమంతుడు అనుభవించేటటువంటి బాధలను గురించి తెలియచేయబడినది. కొందరు వ్యక్తులు (చెడును ప్రేమించేటటువంటివారు) ఒక నీతిమంతుని యొక్క పీడను వదిలించుకోవడానికి, ఆయన కొరకై ఉచ్చులు పన్నుచున్నారు. ఎందుకనగా ఆయన వారితప్పిదములను వేలెత్తి చూపారు. వారు ధర్మశాస్త్రమును, పూర్వుల సాంప్రదాయమును పాటించట్లేదని తెలిపాడు  అందుకే ఏ విధంగానైనా ఆయన్ను నాశనం చేయాలనుకున్నారు. ఇది ప్రతి ఒక్కరిలో జరిగేటటువంటి సంఘటన ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇతరులను సరి చేయుటకు ప్రయత్నిస్తూ ఉంటామో, వారి అధర్మాన్ని ఖండిస్తామో అప్పుడు వారు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. 
ఇర్మియ ప్రవక్త ఇశ్రాయేలీయులకు దేవుని హెచ్చరికలు తెలియజేసినప్పుడు అప్పటి ప్రజలు ఇర్మియా ప్రవక్తను ఎలాగైనా తుద ముట్టించాలని భావించారు. బప్తిస్మ యోహాను, హేరోదు రాజు, హెరోదియాలను హెచ్చరించినప్పుడు వారికి అది నచ్చలేదు అందుకని హెరోదియా, బప్తిస్మ యోహాను యొక్క తలను బహుమతిగా కోరింది. మనం కూడా ఎవరినైనా సరిచేయాలి అని భావించి ఇతరులకు వారి తప్పిదములు తెలియచేసిన అందరూ దానిని సహృదయంతో తీసుకోరు దానికి ప్రతిఫలంగా మనకి వ్యతిరేకంగా ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో కూడా కొంతమంది వ్యక్తులు నీతిమంతుని యొక్క జీవితము నచ్చక అతడిని శిక్షించాలని భావించారు. దేవుడు అతడిని కాపాడతారా? లేదా? అని కూడా ఎదురుచూస్తున్నారు. నిజమైన సేవకుడు ఈ నీతిమంతుడు. అతడు అధర్మాన్ని ఖండిస్తూ ప్రజలకు న్యాయాన్ని చేకూరుస్తూ వారి సేవకై అనేక విధాలుగా పాటుపడ్డాడు. 
మనం కూడా ఈ సేవకుని వలె మంచి జరిగినా,లేదా చెడు జరిగిన ఎదుటివారి యొక్క ఆ ధర్మాన్ని ఖండించుటకు సిద్ధంగా ఉండాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత యాకోబు గారు స్వార్ధమును, అసూయలను విడిచివేయాలని తెలుపుచున్నారు. స్వార్థము, అసూయలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సర్వ విధముల నీచ కార్యములు జరుగును అని తెలిపారు. అసూయవలనే కయినూ తన యొక్క సోదరుడిని చంపేశాడు. స్వార్థం వలననే సౌలు దేవుడి మాటను పెడచెవిన పెట్టాడు. మనందరం దివ్యమైన వివేకముతో నింపబడినప్పుడు శాంతితో- సమాధానముతో కనికర హృదయముతో జీవించుతాం. ఎటువంటి పక్షపాతమును చూపించము.
ఈనాటి సువిశేష భాగములో శిష్యులు తమలో తాము ఎవరు గొప్పవారు అని వాదించు కొంటున్నారు. ఏసుప్రభు శత్రువులను జయించి యూదా ప్రజలకు స్వాతంత్రాన్ని సంపాదించి,శాంతి సంపదలతో తలతూగే ఒక రాజ్యమును భూలోకంలో స్థాపించబోతున్నారు కాబట్టి ఆయన యొక్క రాజ్యములో ఈ పనిని ఇద్దరు శిష్యులు ఎవరు ప్రథమ స్థానాన్ని అధిష్టించి అధికారాన్ని చలాయించవచ్చని దాని కొరకు శిష్యులు ఒకరిని ఒకరు వాదించుకుంటున్నారు. పేతురు నేనే గొప్పవాడని భావించి ఉండవచ్చు ఎందుకంటే ఏసుప్రభు ఆయన మీద తన సంఘమును నిర్మిస్తానన్నారు కాబట్టి. యోహాను కూడా గొప్పవాడని భావించి ఉండవచ్చు ఎందుకంటే ఏసుప్రభు శిష్యులలో మిక్కిలిగా ప్రేమింపబడినటువంటి వ్యక్తి. 
ఫిలిప్పు కూడా గొప్పవాడని భావించి ఉండవచ్చు ఎందుకంటే నిర్జన ప్రదేశంలో అద్భుతం చేయుటకు ప్రభువు ఫిలిప్పుని మొదట అడిగారు కాబట్టి.
యూదా ఇస్కారియాతో గొప్పవాడని భావించి ఉండొచ్చు ఎందుకంటే ఆయన దగ్గరే ధనము ఉన్నది కాబట్టి. 
ఈ విధముగా శిష్యులలో ఒకరితో ఒకరు తమలో తాము ఎవరు గొప్పవారని వాదించు కొనుచుండగా ప్రభువు గొప్పవాడు కాదల్చినవాడు అందరిలో చివరివాడై, సేవకుడిగా ఉండాలి అని తెలుపుచున్నారు. ప్రభు ఈ విధంగా అంటున్నారు" నేను మీ వద్దకు సేవకునిగానే వచ్చి ఉన్నాను" (లూకా 22:26-27). తన శిష్యులు కూడా తన వలే సేవకు రూపం దాల్చాలని ప్రభువు భావించారు. ఎవడు మొదటి వాడు కావాలనుకుంటున్నాడో వాడు అందరిలో చివరివాడై అందరికీ సేవకుడిగా ఉండాలి అని అన్నారు (మార్కు 9:35). మనం సేవకులుగా మారాలంటే ముందుగా మనలో ఉన్న స్వార్ధాన్ని-గర్వాన్ని చంపుకోవాలి. వినయము అనే సుగుణమును మనలో అలవర్చుకొని జీవించాలి అందుకనే ఏసుప్రభు గొప్పవాడు కాదల్చినవాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడిగా మారాలని పలుకుచు ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి, ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరు స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని అనెను.
చిన్న బిడ్డను స్వీకరించుట అనగా ఆ చిన్న బిడ్డలలో ఉన్నటువంటి లక్షణములను మనము కలిగి జీవించుట. చిన్న బిడ్డలకు అధికార వ్యామోహం ఉండదు. వారికి సమాజంలో పలుకుబడి ఉండదు. పేరు ప్రఖ్యాతులకు ఎక్కువ ఆసక్తి చూపరు. వారు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో కలిసిమెలిసి కల్మషం లేని వ్యక్తులుగా జీవిస్తారు అదేవిధంగా వారు ప్రతినిత్యం సహాయం కొరకు వేరే వారి మీద ఆధారపడి ఉంటారు. చిన్న బిడ్డలకు ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు వారిని అంతగా పట్టించుకోరు. ఈ చిన్న బిడ్డల వలె శిష్యులు ఎటువంటి అధికార ఆశావ్యామోహం లేకుండా తమ్ము తాము తగ్గించుకొని అందరికీ సేవ చేయాలి అన్నది ప్రభువు యొక్క కోరిక. ధనం ఉంటే గొప్పవారు కారు, పేరు ప్రఖ్యాతలు ఉంటే గొప్పవారు కారు కానీ దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరంటే ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో, వినయము కలిగి జీవిస్తారో, సేవా దృక్పథంతో జీవిస్తారో వారి. క్రీస్తు ప్రభువు ఈ లోకంలో మనందరికీ ఒక సుమాతృకను చూపించారు ఆయన గొప్పవాడైనప్పటికిని, సేవకుని వలె మన మధ్య  వినయంతో అందరితో కలిసి మెలిసి జీవించారు. మనం కూడా మనలో స్వార్థం విడిచి ఏసుప్రభు వలే ఇతరులకు సహాయం చేస్తూ ప్రేమను పంచుతూ జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనందరం ఎటువంటి అత్యాశకు గురికాకుండా ఉండాలి. దేవుని దృష్టిలో గొప్ప వారిగా జీవించటానికి ప్రతినిత్యము వినయము, సేవ, ప్రేమ కలిగి జీవించడానికి ప్రయత్నించాలి
Fr. Bala Yesu OCD

20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

25 వ సామాన్య ఆదివారము

25 వ సామాన్య ఆదివారము 

సొలొమోను జ్ఞాన గ్రంధము 2:17-20, 
యాకోబు 3:16-18, 4:1-3
మార్కు 9:30-37

క్రీస్తునాధుని యందు ప్రియ సహోదరీ సహోదరులారా ఈనాటి మూడు పఠణాలను గ్రహించినట్లయితే మూడు పఠణాలు కూడా మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బోధనలు లేదా అంశాలను ఇస్తున్నాయి.  అదేమిటంటే ధర్మంతో నిలబడటం నిజమైనటువంటి జ్ఞానాన్ని మరియు శాంతిని సూచించటం, అంతే కాకుండా దేవుని సేవ చేయడంలో నిజమైన గొప్పతనం ఏమిటో మనకందరికి కూడా క్లుప్తంగా వివరిస్తున్నాయి.
 ముందుగా మొదటి పఠణాని మనం గ్రహించినట్లయితే సొలోమోను జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము 17 నుండి 20 వచనాలనలలో ధర్మాత్మునిపై లేదా పుణ్యాత్ములపై దుర్మార్గులు చేసేటువంటి కుట్రలు మరియు వారి వంకర బుద్ధులను చూపిస్తున్నాయి. వారు నిజమైన ధర్మాన్ని ద్వేషించటమే కాకుండా, ధర్మాన్ని పాటించే వారిని కూడా ఎగతాళి చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని దూషించడమే కాకుండా దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచే వారందరిని కూడా వారు అవమాన పరుస్తున్నారు. ఇక్కడ ధర్మంతో కూడిన వ్యక్తిని మరియు అతని యొక్క నిజాయితీని కూడా పరీక్షించాలని పన్నాగం పొందుతున్నారు.
అంతేకాకుండా వారు మంచిగా జీవించే వ్యక్తులను,  వారి విశ్వాసాన్ని, వారికి దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మంచివారిని నాశనం చేయాలని, దేవుని దూషించాలని చూస్తుంటారో వారందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడని మరియు మంచివాని పట్ల దేవుని దయ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, దేవునికి దగ్గరగా నివసించే వారికి ఎప్పుడు కష్టాలు, బాధలు మరియు అవమానాలు వస్తూనే ఉంటాయి. అటువంటి సమయాలలో మంచివారు దేవునికి దగ్గరగా జీవించినట్లయితే కచ్చితంగా దేవుని చేత దీవించబడతాడు అని మొదటి పఠనం మనకు అందరికీ కూడా తెలియజేస్తుంది. మరి రెండవ పఠనని చూసినట్లయితే యాకోబు రాసినటువంటి లేక మూడవ అధ్యయం ముఖ్యంగా 16 వ వచనంలో చూస్తున్నాము. ఎక్కడైతే ఈర్ష మరియు స్వార్థం ఉంటుందో అక్కడ ఎప్పుడూ అల్లకల్లోలం ఉంటుంది.  అంతేకాకుండా చెడు పనులు,  చెడు వ్యసనాలు  ఉంటాయి, కానీ యాకోబు గారు ఏమి చెబుతున్నారంటే మనకు ఉండవలసినటువంటి మంచి జ్ఞానాన్ని గురించి వివరిస్తున్నాడు. దేవుని నుండి వచ్చే జ్ఞానం ఎంతో స్వచ్ఛమైనది ఎందుకంటే అది శాంతిని మరియు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇది క్రైస్తవుల మైనటువంటి మనకందరికీ కూడా ఒక గొప్ప గుణపాటాన్ని నేర్పిస్తుంది. ఎందుకంటే నిజమైన జ్ఞానం అనేది స్వార్థం, ఈర్ష మరియు అసంతృప్తితో కూడింది కాదు, కానీ జ్ఞానం అనేది ఎప్పుడు ఇతరుల మేలు కోరుకునేది. అంతేకాకుండా, ఎప్పుడు ఒకరికి మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు అని పునిత యాకోబు గారు మనకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చివరిగా విశేష పఠణని గమనించినట్లయితే, ఏసుప్రభు శిష్యుల మధ్య వచ్చినటువంటి గొప్పతనం యొక్క చర్చల గురించి తెలియజేస్తుంది. గొప్పతనం అంటే మన గురించి మనం గొప్పలు చెప్పుకోవటం కాదు,  కానీ నేటి సమాజంలో మనం చూస్తూనము. మనం ఏదైనా ఒక చిన్న మంచి పని చేస్తే దాని పదిమంది దగ్గర గొప్పలు చెప్పుకుంటమో, అదేవిధంగా ఈనాడు శిష్యులు కూడా వారిలో వారు నేను గొప్పవాడిని నేను గొప్ప వాడిని అని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, వారి మాటలను ఆలకించినటువంటి క్రీస్తు ప్రభువు వారితో ఈ విధంగా అంటున్నారు. ఒక చిన్న పిల్లవాని ఉదాహరణగా తీసుకొని అంటున్నాడు, మీలో ఎవరైనా గొప్పవాడు కాదల్చిన  వాడు ముందుగా సేవకుని వలే జీవించాలని, ఎప్పుడైతే నీవు సేవకుని వాలే జీవిస్తావో అప్పుడే నీవు గొప్పవాడిగా పరిగణింప పడతావని క్రీస్తు ప్రభు అంటున్నారు. ఎందుకు ఏసుప్రభువు ఈ విధంగా అంటున్నారు అంటే గొప్పతనం అనేది ఏమిటంటే కేవలం సేవ చేయటం. మరి ఈ సేవ చేయాలంటే మనలను మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే అలా మనలని మనం తగ్గించుకొని జీవించగలుగుతామో అప్పుడే మనం దేవుని చేత ఆశీర్వదించబడి గొప్పవాడిగా పరిగణింపబడతామని క్రీస్తు ప్రభువు సువిశేష పఠనంలో సెలవిస్తున్నాడు. 
కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా మన జీవితాలలో కూడా అనేకసార్లు తప్పుడు మార్గాలలో ప్రయాణించి, తప్పుడు ఆలోచనలతో జీవించి, నేనే గొప్పవాని అని బ్రతుకుతుంటాము, అటువంటి వారందరికీ కూడా ఈనాటి మూడు పఠణాలు ఒక గొప్ప గుణపాటాని నేర్పిస్తున్నాయి. కాబట్టి ఇప్పటినుండి దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని, ఎప్పుడు మంచినే ఎంచుకుంటూ ఉండాలని ఈ దివ్య బలి పూజలో భక్తి విశ్వాసాలతోటి ప్రార్థించుకుందాం.  ఆమెన్.

ఫా. జ్వాహాన్నెస్ OCD

జీవవాక్కు

 యోహాను 6: 60-69  ఆయన శిష్యులలో అనేకులు ఇవివినినప్పుడు "ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు?" అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గుర...