7, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం 
బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గురించి తెలియజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఆగమన కాలంలో రెండవ మరియు మూడవ ఆదివారములో బప్తిస్మ యోహాను సందేశమును వింటుంటాం. దేవుని యొక్క రాకడ కొరకై మనందరం కూడా మన జీవితంలో మార్గమును సిద్ధము చేయాలి. ప్రతి ఒక్కరి ప్రయాణమునకు ఒక మార్గము అనేది తప్పనిసరిగా అవసరం ఎందుకంటే మార్గము లేనిదే ప్రయాణము సక్రమంగా జరగదు, గమ్యమును చేరలేము. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత్మ భూమికి నడిచే సమయములో దేవుడే స్వయముగా వారికి మార్గ సూపరిగా ఉండి వారిని నడిపించారు. మార్గము లేని జీవితము గమ్యము చేరటము కష్టం.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు స్వయంగా తన ప్రజల కొరకు బాబిలోనియా నుండి యెరుషలేమునకు మార్గమును సిద్ధం చేస్తారని తెలుపుతున్నారు కనుక బారుకు ప్రవక్త దుఃఖించే ఇశ్రాయేలు ప్రజలను సంతోషించమని తెలుపుచున్నారు. బారుకు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను దేవుని చెంతకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నారు. వారి యొక్క బానిసత్వం ముగిసిన తర్వాత తిరిగి దేవుని చెంతకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క ఆగమన కాలంలో మనందరం కూడా మన యొక్క పాపపు జీవితమును వదిలి, దేవుని చెంతకు తిరిగి రావాలి అదే ప్రభువు కోరుకుంటున్నారు. ప్రభువు ఇశ్రాయేలు ప్రజల కొరకై తానే స్వయంగా మార్గమును సిద్ధం చేస్తున్నారు లోయలు పుడ్చుతున్నారు. ప్రభువు తన ప్రజలకు ఒక మంచి మార్గమును ఏర్పరిచి వారిని సంతోషంగా ఉండులాగా చేస్తారని బారుకు ప్రవక్త తెలియజేశారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీయులను దేవుని యొక్క రాకడ కొరకై సంసిద్ధత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ప్రార్థించుకొనమని తెలియజేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగములో యోహాను గారు ప్రభువు యొక్క రాకడ కొరకై మార్గమును సిద్ధం చేయుడని  వెలిగెత్తి యోర్థను నది తీరమున ప్రకటించుచుండెను. బప్తిస్మ యోహాను ఈ లోకమునకు వచ్చినదే యేసు ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయుట కొరకు దాని ద్వారా ఏసుప్రభు ఇంకా త్వరగా తండ్రి పరిచర్యను ఈ లోకంలో చేయవచ్చు కాబట్టి.
మన జీవితంలో దేవుని యొక్క రాకడ కొరకు మార్గమును సిద్ధం చేయని యెడల దేవుడు మన ఇంటి గుండా ప్రవేశించరు, మనలోకి ప్రవేశించరు. మన యొక్క జీవితంకు మార్గమును హృదయ పరివర్తన ద్వారా, చెడును విడిచి పెట్టుట ద్వారా ఏర్పరచవచ్చు అప్పుడు దేవుడు మనలోకి ప్రవేశిస్తారు. మార్గమును సిద్ధం చేయుట చాలా కష్టం ఎందుకంటే అడ్డుగా ఉన్నటువంటి ప్రతిది కూడా తొలగించాలి అప్పుడే మార్గము ఏర్పరచగలరు కాబట్టి దేవుని యొక్క రాకడ కొరకు ఏదైతే అడ్డుగా ఉంటుందో మనము దానిని తీసివేయాలి. ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయమని ఎడారిలో ఒక స్వరము వినబడెను అని యెషయా ప్రవక్త తెలియజేశారు. ఎడారి అనునది దేవుడిని కలుసుకునే ఒక స్థలం, మన జీవితాలు మార్చు స్థలం. మనము ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటారు అని తెలిపే ఒక ప్రదేశం. హాగారు ఎడారిలో ఉండగా దేవుడు ఆమెకు తోడుగా ఉన్నారు. ఏలియా నిర్జన ప్రదేశంలో ఉండగా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఎడారి వలె నిరుత్సాహమైనటువంటి సమయములు ఎదురైనప్పుడు మనము దైవ అనుభూతిని పొందగలము. దేవుడు మనకు తోడుగా ఉంటారు.
ప్రతి లోయ పూడ్చబడును అని తెలుపుతున్నారు అనగా మనలో మనలో ఉన్నటువంటి అసమానతలను దేవుడు తన యొక్క వాక్యము ద్వారా దివ్య సంస్కారాలు ద్వారా నింపుతూ సరిసమానం చేస్తారు. అదేవిధంగా పర్వతాలు కొండలు సమము చేయబడాలి అనగా మనలో ఉన్నటువంటి గర్వము, అహము అనేటటువంటి చెడు గుణములను సమానము చేయాలి అనగా వినయము కలిగి జీవించాలి. వక్రమార్గములు సరిచేయాలి అనగా మన యొక్క జీవనశైలిని మార్చుకోవాలి. ప్రభువుకి మన హృదయములో మార్గము సిద్ధము చేయాలంటే మన గర్వమును తగ్గించుకోవాలి, పాపపు జీవితాన్ని విస్మరించాలి. పరిత్యజించుకునే లక్షణము కలిగి ఉండాలి. ఈ యొక్క ఆగమన కాల రెండవ ఆదివారంలో మనందరం కూడా ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటంటే దేవుని కొరకు మనము మన జీవితంలో ఎలాంటి మార్గమును సిద్ధం చేస్తున్నాం?. ఆయన కొరకు అడ్డుగా ఉన్నటువంటి పాపమును తొలగించుకుని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా.? హృదయ పరివర్తనం చెందుతున్నామా లేదా? పాపక్షమాపణను కలిగి ఉంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
Fr. Bala Yesu OCD

30, నవంబర్ 2024, శనివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం 
యిర్మీయా 33:14-16, 1 తెస్స3:12,4:2, లూకా 21:25-28,34-36
ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాలమును ప్రారంభించినది. ఆగమన కాలంతో ఒక కొత్త దైవార్చన సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఈ యొక్క ఆగమన కాలంలో మనము ప్రభువు యొక్క జన్మము కొరకై/రాకడ కొరకై ఎదురుచూస్తూ ఉన్నాం. ఆగమన కాలము ఒక ప్రత్యేకమైన కాలం ఎందుకనగా ఏసుప్రభు యొక్క పుట్టినరోజు కొరకై మనందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క కాలములో మనము మన హృదయములను పవిత్ర పరచుకొని ఆయన కొరకు ఎదురు చూస్తుంటాం. 
ఏసుప్రభు అనేక విధాలుగా మన మధ్యలోనికి వస్తారు. దివ్య సత్ప్రసాదం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము చదవడం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా అనేక విధాలుగా ప్రభువు మన మధ్యకు వస్తూ ఉంటారు. ఈ యొక్క ఆగమన కాలంలో దేవుని యొక్క జన్మం మనందరి యొక్క హృదయములలో ప్రత్యేకంగా జరగాలని మనము ఆధ్యాత్మికంగా తయారవుతాం. 
ఈనాటి దివ్య గ్రంథ పఠణములు కూడా ప్రభువు రాకడ గురించి, నిరీక్షించుట గురించి, విశ్వాసముతో ఉండుటను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త దేవుని యొక్క రాకడను గురించి తెలియజేస్తున్నారు. యూదా ప్రజలు దేవుడిని మరచి, తన యొక్క ఆజ్ఞలను మీరారు. దేవుని యొక్క ప్రజలను నడిపించే రాజులు కూడా దేవుని ప్రవక్త అయినా యిర్మియా మాటలను వినలేదు అందుకే శిక్ష అనుభవించారు. దేవుని యొక్క శిక్ష అనుభవించిన తర్వాత దేవుడు వారికి ఒక సంతోష వార్తను తెలియజేస్తున్నారు. కరుణ గలిగిన దేవుడు వారిని రక్షించుటకు దావీదు వంశము నుండి ఒక రాజును ఎన్నుకుంటానన్నారు. ఆ రాజు నీతి కలిగిన రాజు. ఆయన అందరికీ న్యాయం చేకూర్చే రాజు. ఆయన ప్రజలకు చేసిన ప్రతి ప్రమాణములను నిలబెట్టుకునే రాజు. 
యావే ప్రభువు ప్రజలకు ఒక ఆదరణ కర్త అయినటువంటి రాజును పంపిస్తూ వారికి కావలసిన స్వేచ్ఛను, స్వతంత్రమును దయ చేస్తారని చెప్పారు.
 దేవుడిచ్చిన వాగ్దానములను నెరవేరుస్తారు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశారు తనని ఆశీర్వదిస్తానని అది నెరవేర్చారు.(ఆది12:1-3)
ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి కాపాడుతానని వాగ్దానం చేశారు దానిని నెరవేర్చారు (నిర్గమ 3:7-8)
దేవుడు రక్షకుడిని పంపిస్తానని ప్రవక్తల ద్వారా తెలియజేశారు దానిని క్రీస్తు జన్మము ద్వారా నెరవేర్చారు కాబట్టి ప్రభువు ఇచ్చిన వాగ్దానములను తప్పక నెరవేరుస్తారని మనము విశ్వసించాలి.
రక్షకుడు వచ్చే కాలం యూదా రక్షణము పొందును అని ప్రవక్త తెలుపుతున్నారు అనగా క్రీస్తు ప్రభువు ద్వారా అందరూ రక్షించబడతారని అర్థం. ఎన్నో సంవత్సరాల నుండి ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తున్నారు అది క్రీస్తు ప్రభువు ద్వారానే నెరవేరుతుందని యిర్మియా ప్రవక్త తెలియజేశారు. దావీదు రాజు ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప రాజు అదే విధముగా ఆయన వంశము నుండి జన్మింపనున్న రాజు కూడా అదే విధముగా తన ప్రజలను పరిపాలించును. ఆ రాజు ఈ లోకంలో జన్మించిన సందర్భంలో దేవుని యొక్క రక్షణ దినము అనేది రానున్నది, ఆ దినము ప్రజల నుండి భయమును తొలగించును, బానిసత్వమును దూరం చెయ్యను ఇదంతా కేవలం నీతి గల రాజు అయినటువంటి క్రీస్తు ద్వారానే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆయన కొరకు ఆశతో ఎదురు చూడాలని కూడా ప్రవక్త తన ప్రజలకు తెలియజేశారు. వాస్తవానికి ఎదురు చూడటంలో ఆనందం ఉంది, ఎదురు చూడటంలో ఆశ ఉంది, నమ్మకం ఉంది, సహనం, ప్రేమ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యిర్మియా ప్రవక్త ప్రజలకు రక్షకుడు వేంచేయు కాలం గురించి ఒక సంతోష వార్తను తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజల్లో పరస్పరమ ప్రేమ పెంచాలని అదేవిధంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఎల్లప్పుడూ కనబరుచుకొని జీవించాలని తెలియజేశారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా స్వచ్ఛమైన మరియు నిస్వార్ధమైన ప్రేమను చూపించాలని పౌలు గారు తెలియజేశారు. తాను ఏ విధంగానైతే వారి మధ్య మెలిగారో అదే విధముగా ఒకరి ఎడల ఒకరు ప్రవర్తించాలని కోరుకున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు యొక్క రెండవ రాకడ కొరకై మనలను సంసిద్ధమై ఉండమని తెలియచేస్తున్నారు
ప్రకృతిలో జరుగు మార్పులను గురించి ఏసు ప్రభువే స్వయముగా తెలియచేస్తున్నారు. ఎన్ని విపత్తులు ఎదురైనా మనం దేవుని యందు విశ్వాసం కోల్పోకూడదు ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. ప్రభు అనేక సందర్భాలలో నేను మీకు సర్వదా తోడై యుండును అని తెలియజేశారు కాబట్టి ఆయన మనతో అన్నివేళలా ఉంటారని మనం దృఢముగా విశ్వసించాలి. ఆయన యొక్క రాకడ కోసం మనం ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉండాలి అదియే క్రైస్తవ విశ్వాసం. ఆటంకములకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. బాధ్యత లేకుండా సుఖ సంతోషాలతో శారీరకవాంఛలకు లోనై ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తే దేవుని సంతృప్తి పరచలేము కావున పరిశుద్ధత కలిగి జీవించాలి మన యొక్క జీవితములను మనము ప్రభువు యొక్క రాకడ కొరకై తయారు చేసుకోవాలి. ప్రభువు మన కొరకై, మనలో ఉండుట కొరకై వస్తున్నారు కాబట్టి ఆయన కొరకు మన హృదయమును పవిత్ర పరచుకొని ఆయనను మనలో ఆహ్వానించు కోవాలి.
Fr. Bala Yesu OCD

కలవరపడకుడు యేసు మీతో ఉన్నాడు

 యోహాను 14: 1-6  యేసు వారితో "మీ హృదయములను కలవరపడనియకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కల...