9, ఏప్రిల్ 2022, శనివారం

తపస్సుకాల 6 వ ఆదివారం, మ్రాని కొమ్మల ఆదివారం

 మ్రాని కొమ్మల ఆదివారం 

 యోషయా 50: 4-7, పిలిప్పీ 2: 6-11 లూకా 19:28-40, 22:14-23:56 

ఈ రోజు తల్లి శ్రీ సభ  మ్రాని కొమ్మల ఆదివారం కొనియాడుచున్నది. దీనినే  క్రీస్తు పాటుల ఆదివారం అని కూడా పిలుస్తారు. 

ప్రతి ఒక్కరి జీవితంలో సంతోష సమయాలు కొన్ని ఉంటాయి. ఈ మ్రాని కొమ్మల రోజు కూడా  ప్రభువు యొక్క జీవితంలో  ప్రత్యేకమైనది, సంతోష కరమైనది ఎందుకంటే ప్రజలు ఆయన్ను రాజుగా  గుర్తించి హోసన్న పాడారు. 

ప్రతి ఒక్కరి సంతోషాన్ని అనుభవించినట్లే తరచుగా దుః ఖాన్ని కూడా పొందుతుంటాం. విచారం కలిగినట్లే ఆనందం కూడా కలుగుతుంది. 

ఈరోజు మనందరం పవిత్ర వారంలోకి అడుగుపెడుతున్నాం. మన యొక్క రక్షణ సంఘటనలు ధ్యానించుకోబోతున్నాం. 

యేసు ప్రభువు యొక్క రక్షణ ఘట్టాలను ధ్యానించుకోబోతున్నాం. ఆయన యొక్క శిలువ , శ్రమలు, మరణం పునరుత్థానం అధే విధంగా క్రీస్తుతో మన మరణ, పునరుత్థనాలు కూడా ధ్యానించుకోవాలి. 

ఈ పవిత్ర వారం యొక్క ఘట్టాలు మనం శ్రద్దగా ధ్యానిస్తే మనకు దేవునితో ఉన్న సంబంధం పెరుగుతుంది. దేవునిలో ఉన్న విశ్వాసం పెరుగుతుంది. దేవుని పట్ల ప్రేమ పెరుగుతుంది మనలో కూడా హృదయ పరివర్తనం కాలుగుతుంది. 

ప్రభువు నా కోసమే మరణించారు అనే ఆలోచన మన జీవితాలను మార్చుతుంది. 

ఈ మ్రాని కొమ్మల ఆదివారం నాడున రెండు ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

1. ఆయన మహిమ సంఘటన 

2. ఆయన శ్రమల సంఘటన 

మహిమ సంఘటన ఏమనగా ప్రజలు ప్రభువును రాజుగా గుర్తించి ఆయన్ను యెరుషలేముకు ప్రేమతో ఆహ్వానించారు. శ్రమలు సంఘటన ఏమనగా ప్రభువును ద్రోహిగా నిందించి ఆయన్ను శిలువ వేయుటకు పన్నాగం చేయుట. 

ఒకటి సంతోషకరమైనది రెండవది బాధాకరమైనది. మన శరీరంలో రక్తం నీరు ఎలాగైతే కలసి వుంటాయో మన యొక్క జీవితంలో కూడా బాధ , సంతోషం కలసి ఉంటాయి. 

ఈరోజు మ్రానికొమ్మలతో ప్రదక్షణలో  వచ్చే సమయంలో ఒక సువిశేష భాగం చదువుతాం, పూజలో శ్రమల వృత్తాంతం చదువుతాం. 

యేసు ప్రభువు అనేక సార్లు యెరుషలేము వెళ్లారు కానీ అన్ని సార్లు అంత గొప్ప ఆహ్వానం ఇవ్వలేదు. కేవలం ఈరోజు మాత్రమే వారు గుర్తిస్తున్నారు. 

యేసు ప్రభువు పేదవారి పట్ల పోరాడిన విధానం ప్రజల్లో ఒక నమ్మకం కలుగజేసింది. ఇతడు మా కోసం జీవిస్తాడు. ఆధికార బంధముల నుండి మమ్మల్ని  విడిపిస్తాడు అనే ఆలోచన నమ్మకం వారిలో కలిగింది. 

ఈనాటి మొదటి పఠనంలో బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి చదువుకున్నాం. 

యోషయా గ్రంధంలో 40-55 ఆధ్యాయాలలో నాలుగు బాధామయ సేవకుని గీతాలు మనం వింటున్నాం. 

ఈనాటి మొదటి పఠనంలో 3 వ గీతం గురించి చదువుతున్నాం. క్రీస్తు పూర్వం 7 వ శతాబ్దంలో దేవుడు యోషయాను ప్రవక్తగా నియమించారు. 

సోలోమోను రాజు తరువాత యిస్రాయేలు రెండుగా విభజించబడింది. ప్రతి ఒక్క రాజ్యంకు వారివారి ప్రవక్తలు, నాయకులు, మత పెద్దలు ఉండేవారు. 

యోషయా ప్రవక్త యెరుషలేములో పని చేసిన ప్రవక్త. ఆయన అనేక మంది రాజులకు దేవుని యొక్క ప్రవచనాలు తెలిపారు. 

ఆయన కాలంలో అస్సిరియులు యిస్రాయేలును నాశనం చేసిన దానిని ఆయన కనులారా చూశాడు. అప్పుడు హేజ్కియా రాజును లొంగిపోవద్దు అని తెలిపాడు. దేవునికి ప్రార్ధించి ముప్పు తొలగించాడు. 

యోషయా ప్రవక్త ఈ సేవకుని యొక్క గీతము వ్రాసేటప్పుడు ఆయన మనస్సులో ఉన్నది ఇద్దరు వ్యక్తులు 

1. యిస్రాయేలు ప్రజలు - ఎన్నుకోబడిన ప్రజలు 

2. మెస్సయ్య 

మెస్సయ్య తాను అందరి కోసం శ్రమలు అనుభవించి మరణిస్తారని ముందుగానే ప్రవక్త ప్రవచించారు. అందుకే అంటారు ప్రవక్తల ప్రవచనాలు నిజమేనని.  

యిస్రాయేలు ప్రజలు కూడా తమ యొక్క జీవితంలో సేవకుల  వలె బానిసత్వంలో అనేక శ్రమలు అనుభవించారు. 

మరి ముఖ్యంగా బాధామయ సేవకుని జీవితం మెస్సయ్యా గురించి ఉద్దేశించబడినది. 

ఈనాటి మొదటి పఠనంలో రెండు భాగాలు ఉన్నాయి. 

1. సేవకునికి అప్పజెప్పిన బాధ్యత 

2. సేవకుని యొక్క త్యాగ జీవితం 

సేవకునికి అప్పజెప్పిన  బాధ్యత ఏమిటంటే ప్రకటించుట , బోధించుట.దేవుని యొక్క రాజ్యం గురించి , దేవుని ప్రేమ గురించి, ఆయన క్షమ గురించి ప్రకటించే శక్తిని దయ చేశారు. ఆయన అలసిపోయిన వారికి ఓదార్పు దయ చేస్తారు. మత్తయి 11:28. 

బాధలలో, కష్టాలలో, నిరాశలో, జీవితంలో అన్ని సమస్యలు పడేవారిని దేవుడు ఈ సేవకుని ద్వారా  ఓదార్చుచున్నారు. 

సహాయం లేనివారికి ఒక సహాయంగా ఉండుటకు ఎన్నుకొన బడినవాడు, ప్రేమ లేని వారికి ప్రేమను పంచుటకు ఎన్నుకొనబడినవాడు, జీవితంలో ఆశలు కోల్పోయినవారికి ధైర్యం ఇచ్చుటకు ఈ సేవకుడు ఓదార్పును దయ చేస్తాడు. 

సేవకుడు తన జీవితంలో  దేవునికి ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చి యున్నారు. హెబ్రీ 10:7, హేబ్రి 5:8 

ఆయన మరణం వరకు తండ్రికి అడ్డు చెప్పలేదు. పిలిప్పీ 2:8 ఆయన మాటను ఎల్లప్పుడు నెరవేర్చారు. తనకు అప్పజెప్పిన పరిచర్య బాధ్యత సక్రమంగా నెరవేర్చాడు ఈ సేవకుడు. 

రెండవ భాగంలో తన యొక్క సేవక బాధ్యతలు నెరవేర్చుటలో ఈ సేవకుడు ఎంతగానో శ్రమలను అనుభవించాడు, నిందలు భరించాడు. 

ఆయనను మోదు వారికి వీపును అప్పగించారు అని 6 వ వచనంలో చెప్పబడింది. అంటే ఎన్ని దెబ్బలైనా భరించడానికి తనను తాను సమర్పించుకున్నారు. ఆయన ఎవరికి ఎదురు చెప్పలేదు. మౌనంగా భరించాడు. 

ఆయన గడ్డపు వెంట్రుకలు లాగేసారు, ఉమ్మి వేశారు, అవమానించారు. ఇవన్నీ కూడా భరించడానికి కష్టం అయినా భరిస్తున్నారు. ఇది కేవలం ప్రేమ వలనే సాధ్యం. ప్రేమ సమస్తమును భరించును. 1 కోరింథీ 13:7. యేసు ప్రభువు జీవితంలో ఇవన్నీ జరిగాయి. ఆయన వస్త్రములు లాగారు. యోహను 19:23. ఆయన మొహం  మీద ఉమ్మి వేశారు. మత్తయి 26:67 . ఆయన్ను కొరడాలతో కొట్టారు. మార్కు 15:15 , యోహను 19:1 

ఇన్ని రకాలైన  అవమానాలు తాను ఎదుర్కొన్నప్పటికి ఆయన క్రుంగిపోలేదు, పారి పోలేదు అన్ని సహనంతో భరించాడు. ఇంత బాధలు పొంది వాటిని భరించాలంటే నిజంగా దైవ శక్తి మనకు అవసరం. 

బాధమయ సేవకుడు  తండ్రి మీద ఉన్న గాఢమైన ప్రేమ  వలన అధే విధంగా తన ప్రజలను కాపాడాలనే ఉద్దేశం వలన ఎంతో బాధను భరించాడు. 

ఒక  క్రోవోత్తి తాను కరుగుతూ ఎలాగైతే ఇతరులకు వెలుగునిస్తుందో అధే విధంగా ఈ సేవకుడు తన జీవితం, ప్రాణం త్యాగం చేస్తూ ఇతరులకు రక్షణనిచ్చాడు. 

రెండవ పఠనంలో పునీత పౌలుగారు యేసు ప్రభువు యొక్క సేవా జీవితం గురించి తెలుపుచున్నారు. 

యేసు ప్రభువు తండ్రి , పవిత్రాత్మతో అన్నింటిలోను సరిసమానం అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని జీవించారు. 

ఈ వాక్యాలలో పౌలుగారు దేవుని యొక్క వినయ జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఎవ్వరు కూడా ఆయన వలె తగ్గించుకొని జీవించలేదు. 

ఆయన దేవుడు అయినా మనిషిగా మన మధ్య జన్మించారు. పరలోకంలో జీవించే దేవుడు భూలోకంలో జీవించుటకు ఇష్టపడ్డారు. పరలోక మహిమను విడిచి పెట్టారు. భూలోక సీలువను మోసారు. పవిత్రమైన  పరలోకంలో జీవించే దేవుడు పాప మలినం శోకిన ప్రజల మధ్యకు వచ్చారు. 

అధికారం కలిగినప్పటికి అణిగిమణిగి వినయంతో జీవించారు. ఆయన దేవుడే అయినప్పటికీ అన్ని విడిచిపెట్టారు మన మధ్యకు వచ్చారు పిలిప్పీ 2:7 

-సేవించబడాల్సిన దేవుడు సేవ చేస్తున్నారు 

-ప్రేమించబడాల్సిన దేవుడు ప్రేమిస్తున్నారు

-ఆరాధించబడాల్సిన  దేవుడు మన మంచికై అన్ని చేస్తున్నారు. 

-మనం ఎవరికోసం , ఎవరి రాక కోసం ఎదురు చూడాలో ఆయనే మన కోసం ఎదురు చూస్తున్నారు. 

-మనం వెదికే దేవుడు మన కోసం వెదుకుచున్నారు. 

ఆయన అన్నింటినీ త్యజించుకొని మన మధ్యకు వచ్చి జీవించారు. యేసు ప్రభువు అంతటి వినయంను చూపుతూ మన మధ్యలో జీవించి తన ప్రాణ త్యాగం చేశారు. ఆయన స్వార్ధం వేదకలేదు. సేవకుని వలె జీవించి అంత దేవుని కొరకు ప్రజల కొరకు చేశారు. 

యేసు ప్రభువు  తండ్రికి మాత్రమే కాదు వినయం చూపినది మానవులకు, అధికారులకు వినయం చూపించారు. తనను హింసించిన వారికి, చంపిన వారికి కూడా ప్రభువు వినయం చూపించారు. 

ఆయనకు అధికారం వుంది, ఆయన సృష్టికర్త అయినా కానీ అంతటి వినయం చూపించారు. యోహను 10:18, రోమి 5:19 , హెబ్రీ 10:9 . 

వినయం వలన ప్రాణ త్యాగం చేశారు, తనను తాను తగ్గించుకొని నిందలు మోసారు. 

తనను తాను తగ్గించుకొని శత్రువుల చేతికి అప్పగింప బడినారు, తనను తాను తగ్గించుకొని అందరి పాపాలు తన మీద వేసుకున్నారు. 

తనను తాను తగ్గించుకొని శిలువ భారం మోసారు, ఘోరమైన శిలువ మీద మరణం అంగీకరించారు. 

ఆయన పాప రహితుడైనప్పటికి మన పాపాల కోసం అన్ని భరించారు, మనల్ని రక్షించారు.2 కోరింథీ 5:12, గలతి 3:13 .1 పేతురు 2:24, 1 పేతురు 3:18 

యేసు ప్రభువు తన్ను  తాను రిక్తుని చేసుకున్నారు కాబట్టి తండ్రి కుమారున్నీ అంతగా సన్మానించారు. చివరి వరకు సంపూర్ణ విధేయతను, వినయంను చూపిన కుమారిడిని తండ్రి మిక్కిలిగా ప్రేమించారు. ఆయనకు సమస్తము ఇచ్చి ఉన్నారు. ఎఫెసీ 1:22, 1 పేతురు 3:22 ,రోమి 14:11. 

మనం ఒకరి ముందు తలవంచటానికి ఇష్టపడం కానీ యేసు ప్రభువు వినయంలో అందరి ముందు తనను తాను తగ్గించుకొని జీవించారు. 

ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు యొక్క  శిలువ శ్రమలు ధ్యానించు కుంటున్నాం. ఈ రోజు ముఖ్యంగా మనందరం ధ్యానించుకోవల్సిన అంశం ఏమిటంటే యేసు ప్రభువు ప్రజలు రాజుగా గుర్తించారు. 

యేసు ప్రభువు చాలా సార్లు యెరుషలేము దేవాలయంకు వెళ్లారు. కానీ ఈ సమయంలోనే ఆయన్ను గొప్పగా ఆహ్వానిస్తున్నారు. 

ప్రభువు యెరుషలేముకు వెళ్ళిన సమయాలు 

1. యెరుషలేము దేవాలయంను శుభ్రం చేసిన సమయం -యోహను 2:3 

2. యెరుషలేము కోనేటి వద్ద స్వస్థత ఇచ్చినప్పుడు -యోహను 5:1 

3. యెరుషలేములో ఆయన దేవుని కుమారుడని ప్రకటించిన వేళ . యోహను 7:16-17 

4. జీవ జలపు  ఊట అని చెప్పినప్పుడు - యోహను:37-39 

5. లోకానికి వెలుగు అని చెప్పినప్పుడు కూడా ప్రభువు యెరుషలేములో ఉన్నారు.- యోహను 8:12, 9:5 

ఇలాగ చాలా సందర్భాలలో ప్రభువు యెరుషలేములోనే ఉన్నారు. కాని ఇప్పుడు దానికి ప్రత్యేకత ఉంది. ప్రభువు ఈ లోకంలో తండ్రి క్రియలు నెరవేర్చారు, అద్భుతాలు చేశారు, యూదుల విశ్వాసం పెంచడానికి 7 అధ్భుతాలు చేశారు. 

1. నీటిని ద్రాక్షరసంగా మార్చుట . యోహను 2:1-11 

2. ప్రభుత్వ ఉద్యోగి  కుమారునికి స్వస్థత నిచ్చుట.-యోహను 4:46-54 

3. బెత్సయిదా  వద్ద పక్షవాత  రోగికి స్వస్థత నిచ్చుట - యోహను 5:1-15 

4. 5000 మందికి ఆహారం పెట్టుట- యోహను 6:5-14 

5 . నీటి మీద నడుచుట -యోహను 6:16-24 

6. పుట్టు గ్రుడ్డి వానికి చూపును దయచేయుట -యోహను 9:1-7 

7. లాజరును జీవంతో లేపుట - యోహను 11: 1-45 

ఇవన్నీ చేసిన తరువాత ప్రజల యొక్క ఆత్మ విశ్వాసం పెరిగింది. ఆ కాలంలో ప్రభువు బలహీనుల పట్ల, ప్రజల పట్ల పోరాడుతున్నారు. కాబట్టి ఇతడు నిజంగా ప్రజల కోసం వచ్చారని, ప్రజల సమస్యల నుండి కాపాడుతారని నమ్మకం అందుకే ఆయన్ను రాజును చేయాలనుకున్నారు. 

ఆయనయే తమ రాజు అని ఆయన్ను స్తుతించారు. మాకోసం నిలబడే వ్యక్తి అని మాకోసమె పుట్టిన ప్రభువు అని అందరు భావించారు. అందుకే ఆయన తమ యొక్క రాజని గుర్తించారు. ఆ సందర్బంలోనే ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు. 

ప్రజలు యేసు ప్రభువుకు హోసన్న పాడారు. హోసన్న అంటే మమ్ము ఇప్పుడు రక్షించు అని అర్ధం. ఆయన వారిని రక్షిస్తారు అని తెలుసుకున్నారు. పాపముల నుండి రక్షిస్తాడని తెలుసుకొని రక్షించమన్నారు. అధే విధంగా ఈ లోక బంధనముల నుండి, అధికారుల క్రింద నుండి రక్షించమని కోరారు. 

ఆయన ద్వారానే రక్షణ వస్తుందని భావించారు. ఆయన రాజుగా పాలిస్తాడని భావించారు. 

యేసు ప్రభువు యొక్క రాజ్యాధికారం  ఈ లోక అధికారం కన్నా  భిన్నంగా ఉంటుంది. 

ఈ రాజు  రాజ్యాలు గెలిచే రాజుగా రావడం లేదు. ప్రజల యొక్క మనస్సులు గెలిచే రాజుగా వస్తున్నారు. మన రాజు శ్రమలు అనుభవించారు, సుఖ సంతోషాలు విడచి పెట్టారు. ఈరాజు అందరికంటే ముందుగా నిలబడి తన ప్రజల కోసం పోరాడతారు. 

క్రీస్తు రాజు బంగారపు కిరీటము ధరించలేదు ముళ్ళ కిరీటము ధరించారు. అధికారంను దుర్వినియోగం చేసుకోకుండా  వినయంతో ప్రేమతో ఈ రాజు జీవించారు. 

యేసు ప్రభువును  రాజుగా సంభోదించుట వలన పరిసయ్యులు భయ పడ్డారు. ఎందుకంటే రోమా పాలకులకు తెలిస్తే వారు తమ పై యుద్దానికి వస్తారని అనుకొన్నారు. ఎందుకంటే యేసును యూదులు రాజుగా చేసుకున్నారని గ్రహించి రోమియులు యుద్దానికి వస్తారని భయ పడ్డారు అందుకే శిష్యులను గద్దించారు. లూకా 19:39 

దేవదూత పలికిన మాటలు నెరవేరాయి. దేవ దూత మారియమ్మకు  జన్మించిబోయే  శిశువు  దావీదు సింహాసనము అదిష్టిస్తారు అని అన్నారు. అది ఈ రోజు కార్యం ద్వారా జరిగింది. లూకా 19:18 . 

ప్రభువు పేరిట వచ్చే రాజు స్తుతింపబడును గాక అన్న మాటలు దావీదుకు చెందినవి, ఆయన శత్రువులను జయించి యెరుషలేముకు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఇలాగే స్తోత్రగానం చేసేవారు అధేవిధంగా యేసు ప్రభువు యొక్క గొప్పతనం గుర్తించి ప్రజలు ప్రభువును పొగిడారు. 

యేసు ప్రభువు గాడిదను ఎన్నుకొని ప్రజల యొక్క నమ్మకంను పెంచుతున్నారు. అంతకు ముదనే ప్రవచనాలు చెప్పబడ్డాయి. మెస్సయ్యా గాడిద పిల్ల మీద వస్తాడని - జెకార్య 9:9 , జెఫన్యా 3:16-19 . 

యేసు ప్రభువు అడిగిన వెంటనే ఇంటి యజమానుడు కూడా వెంటనే గాడిద ఇచ్చారు. బహుశా ఆయనకు కూడా క్రీస్తు ప్రభువును రాజుగా గుర్తించి ఉండవచ్చు. 

యేసు ప్రభువుకు రాజుకు ఇచ్చిన గౌరవం ఇచ్చారు. 1మక్కా 13:51. 

ప్రభువు స్వయంగా గాడిదను ఎంనుకొంటున్నారు. ఎందుకంటే పూర్వం రాజులు యుద్ధం చేయడానికి వెళ్లేటప్పుడు గుర్రం మీద వెళ్ళేవారు, శాంతిని నెలకొల్పేటప్పుడు గాడిద మీద వెళ్ళేవారు. 

గాడిద  వినమ్రుని, శాంతి పరుని సూచిస్తుంది. యేసు ప్రభువు ప్రపంచానికి శాంతి ప్రధాత, ఆయన ఇహలోక సంబంధమైన రాజు కాక పరలోక సంభందమైన రాజు ఆయన అందరికి రాజు ప్రజలందరి పాపాలు తన మీద మోసుకొని మరణించిన గొప్ప రాజు. 

సోలోమోను తన తండ్రి గాడిద మీద వచ్చారు, సింహాసనం అదిష్టించే రోజు . 1 రాజు 1:38-41. 

గాడిద మీద  వచ్చిన వారు.- న్యాయ 10:4 , 2 సమూ 17:23, 2 సమూ 19:26  

ఈ లోకమును తన తండ్రితో సమాధాన పరుచుటకు ఆయన గాడిద మీద వస్తున్నారు. సఖ్యత ఏర్పరచడానికి . ప్రభువు ప్రజల యొక్క హృదయాలను గెలవడానికి గాడిద పిల్ల మీద వస్తున్నారు, ఎఫెసీ 2:13-18 

గాడిదను ప్రభువు ఎన్నుకొనుటకు కారణాలు 

1. గాడిద బరువు మొస్తుంది - అందరి భారం మొస్తుంది 

2. గాడిద సేవ చేస్తుంది - అందరికి సేవ చేస్తుంది 

3 గాడిద శాంతికి గుర్తు 

4. గాడిద పవిత్రతకు గుర్తు - వస్తువులను జంతువులను దేవునికి సమర్పించుటకు వాడతారు కాబట్టి అవి పవిత్రమైనవి. సంఖ్యా 19:2, ద్వితీ 21:3 , 1 సమూ 6:7  

యేసు ప్రభువు వాడిన గాడిదను ఎవ్వరూ ఎన్నడూ వాడలేదు అది పవిత్రమైనది. మనం దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు మంచి జీవితం జీవించాలి. 

Rev. Fr. Bala Yesu OCD

2, ఏప్రిల్ 2022, శనివారం

తపస్సుకాల 5 వ ఆదివారం

యెషయా 43:16-21, పిలిప్పి 3:8-14, యోహాను 8:1-11
ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు  క్షమించుట  ద్వార దేవుడు ప్రసాదించు క్రొత్త జీవితం గురించి  బోధిస్తున్నాయి. దేవుడిచ్చే గొప్ప అవకాశం వల్ల  దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించాలి. పశ్చాత్తాప పడిన  ప్రతి యొక్క  విశ్వాసిని దేవుడు క్షమించడానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. పాపికి  దేవుడు మరొక అవకాశం దయచేసి క్రొత్త జీవితం జీవించమని తెలియజేస్తారు. 
మన జీవితంలో కూడా ఎదుటి వారు చేసిన తప్పిదములు లెక్క చేయకుండా వారిని క్షమించుకొని జీవించాలి. వారికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. మన యొక్క స్నేహాలు నిలబెట్టుకోటానకి అవకాశం ఇవ్వాలి. ఇతరులు చేసిన తప్పులు క్షమించి మరలా మనతో క్రొత్త జీవితం జీవించడానికి వారికి ఇంకో అవకాశం ఇవ్వాలి. 
దేవుడు మన పట్ల  ఎలాగైతే  క్షమ హృదయాన్ని కలిగి జీవిస్తున్నారో మనం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి అధేవిధంగా దేవుడు మానాకోక అవకాశం  ఇచ్చిన విధంగా వేరేవారికి కూడా అవకాశం ఇవ్వాలి. 
ఈ మూడు పఠనాలు కూడా మారని దేవుని ప్రేమగురించి అలాగే ఆయన యొక్క శాశ్వత ప్రేమ గురించి చక్కగా వివరిస్తున్నాయి. 
మన నిజ జీవితంలో ఎవరైన సంపూర్ణంగా  ప్రేమిస్తే వారిని వారి పాపాలు క్షమించడానికి ఎప్పుడు సిద్దంగానే మనం ఉంటాం. దేవుడు తన ప్రజలను సంపూర్ణంగా ప్రేమించారు, కాబట్టియే వారి అనేక పాపాలు క్షమిస్తున్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు యిస్రాయేలు ప్రజలకు ప్రసాదించే నూతన జీవితం గురించి భోధిస్తున్నారు. 
యిస్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్న సమయంలో యోషయా ప్రవక్త ద్వార పలుకుచున్న సంతోష వాక్కులు వింటున్నాం. బాబిలోనియా బానిసత్వంలో చివరిరోజుల్లో ఉన్న సమయంలో పలికిన ఆనంద మాటలు ఇవి. 

బానిసత్వం నుండి మరొకసారి దేవుడు వారిని బయటకు తీసుకొని వస్తారని, యెరుషలేముకు నడిపిస్తారని తెలుపుచున్నారు. యెరుషలేము దేవాలయం పునరుద్ధరిస్తారని యోషయా ద్వారా తెలియచేసారు. 
మొదటి ప్రారంభ వచనాలలోదేవుడు  ఎలాగ వారికి  సముద్ర మార్గం గుండా దారిని చేశారో తెలుపుచున్నారు. అదే విధంగా జలరాశి గుండా, ఎండిన నేల మీద నడిపించారు. నిర్గ 14:22.  14:29. 
తాను ప్రేమించిన ప్రజలకోసం దేవుడు శత్రు సైన్యంతో  పోరాడారు. నిర్గ 1వ అధ్యాయం 11 వ అధ్యాయం వరకు వారికి 10 అరిష్టాల ద్వారా వారితో పోరాడారు. 
తనను నమ్ముకున్న ప్రజల పట్ల దేవుడు చూపించే కరుణ అలాంటిది. దేవుడు అన్ని సమయాలలో వారితో ఉండేవారు. నిర్గ 3:14. అసాధ్యమైన కార్యములు దేవుడు తన ప్రజల కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు. లూకా 1:37. తన ప్రజల మీద ఉన్న ప్రేమ వలన అసాధ్యమైనవి దేవుడు సుసాధ్యం చేస్తారు. 

18 వ వచనంలో  ప్రభువు  అంటున్నారు. మీరు పూర్వ సంగతులను గుర్తుంచు కొనక్కరలేదు అని ప్రభువు చెబుతున్నారు. 
వారి  బలహీనతలు గుర్తించుకొనక్కరలేదు అంటున్నారు. వారు దేవుడిని విస్మరించిన క్షణాలు గుర్తుంచుకొనక్కరలేదు.  వారి పాపాలు గుర్తుంచుకొనక్కరలేదు అంటున్నారు. వారి బానిసత్వ బాధలు గుర్తుంచుకొనక్కరలేదు అని అంటున్నారు. 

పశ్చాత్తాప పడిన ప్రజలకు, క్షమించమని కోరిన ప్రజలకు దేవుడు నూతన కార్యము చేస్తానంటున్నారు. ఆ నూతన కార్యమేమనగా అది క్రొత్త జీవితమే, క్రొత్త బంధమే, క్రొత్త ఒడంబడికయే, క్రొత్త ఆశీర్వాదమే. యోషయా 65:17, 2 కోరింథీ 5:17. అ. పొ 21:15. 

19 వ వచనంలో ప్రభువు  అంటున్నారు, ఎడారిలో బాటలు వేస్తానని, మరు భూమిలో త్రోవ వేయుదును అని అదే విధంగా 20 వ వచనంలో ఎడారి గుండా నీటిని పారించి నేను ఎన్నుకొన్న ప్రజలకు ఇత్తును అని అంటున్నారు. 

ఎడారిలో దారి సరిగా  వుండదు ప్రభువు అలాంటి ప్రదేశంలో  విశాలవంతమైన ప్రాంతంలో దారులు వేస్తానని పలుకుచున్నారు. యోహా 14:6. ఆయన చెంతకు రావటం వల్లన మనం క్రొత్త  బాటలో  ప్రయాణం చేస్తాం - ముగ్గురు జ్ఞానులు  వేరొక మార్గం అనుసరించారు. మత్త 2:12. 

మార్గం, గమ్యం తెలియకుండా జీవించే మన బ్రతుకులకు దేవుడు దారిని చూపిస్తారు మనకు క్రొత్త జీవితం దయ చేస్తారు. 
మరు భూమిలో త్రోవ  వేస్తారని అంటున్నారు అంటే పనికి రాని నేలను కూడా సక్రమంగా వినియోగిస్తారని తెలుపుచున్నారు. 

ఎడారిలో దేవుడు నీటిని ఒసగటమే కాదు, నదులు, పారిస్తాను అని తెలుపుచున్నారు. నిర్గ 17:1-7. యోషయా 35:6-7. 
ప్రజల యొక్క దాహం తీర్చుతానని ప్రభువు పలుకుచున్నారు. దేవుడు తన ప్రజల కోసం ఎంతటి గొప్ప కార్యమైన చేయుటకు సిద్ధంగా ఉన్నారు. 
ఆయన వారి పాపాలు క్షమించుటయే కాదు ఇంకా వారు సంతోషంగా  జీవించుటకు దేవుడు అవకాశంను ఇస్తున్నారు. 
మన యొక్క జీవితంలో ఎదుటి వారి పాపాలు గుర్తించుకొక  అవసరం లేదు వారికి  రెండో ఛాన్సు ఇచ్చి మంచిగా జీవించేలా చేయాలి. 
రెండవ పఠనంలో పౌలుగారి యొక్క జీవితం గురించి తెలుపుచున్నారు. ఆయన జీవితం మొత్తం కూడా దేవుని కృపను పొందడానికే ప్రయత్నం చేశారు. 
తన యొక్క సువార్త పరిచర్యలో అదే విధంగా క్రీస్తును తెలుసుకొన్న జ్ఞానం వలన ఆయన ఏమంటున్నారంటే ఆయన యొక్క జ్ఞానం పొందుటకు నేను సమస్తమున పూర్తి నష్టముగా పరిగణిస్తున్నాను అని పలుకుచున్నారు. 

దైవ జ్ఞానం  వుంటే దేవుడినే కలిగిఉంటాం. ఆయన కొరకు ఇహలోక జ్ఞానం  అంతా విడిచి పెడతాం. ఆయన కొరకు సమస్తం విడిచి పెడతాం. 
క్రీస్తును  పొందటానికి సమస్తము చెత్తగా భావిస్తున్నాను అని తెలుపుచున్నారు. మనకు దేవుని యొక్క విలువ తెలిసినప్పుడు ఆయన్ను కలిగి ఉండటానికి ఏదైనా విడిచిపెడతాం. 

దేవుని కన్నా ఏ  వస్తువు , మనుషులు మిన్న కాదు అని గ్రహిస్తాం. ఆవిలాపురి తెరేసమ్మ గారు అంటారు HE WHO HAS GOD WANTS NOTHING, GOD ALONE SUFFICES అని దేవుడిని కలిగిన వ్యక్తికి ఈ లోకంలో ఏది అవసరం లేదు, ఆ ప్రభువు మాత్రం చాలు అని . 

అధే విధంగా దావీదు ప్రభువే నాకు కాపరి నాకు ఇక ఏ కొదవయు లేదు అని . కీర్తన 23:1 
వారికి దేవుని యొక్క విలువ తెలిసింది కాబట్టియే దేవుని కొరకు మిగతా ఏదైన వ్యర్ధంగా భావించారు. మనకి కూడా దైవ అనుభూతి , దైవ జ్ఞానం ఉంటే దేవుని కోసం మిగతా అనీ చెత్తగా భావిస్తాం. 

పౌలు గారు యొక్క కోరిక 10 వ వచనంలో తెలుస్తుంది దేవునికి సంభందించిన జ్ఞానం పొందాలనుకుంటున్నారు.అపో 22:3 . దైవ జ్ఞానం మనకు మంచి ఏదో, చెడు ఏదో తెలుపుతుంది. మనం కూడా క్రీస్తుకు సంబందించిన జ్ఞానంను సంపాదించుకోవాలి. అది మనకు పవిత్ర గ్రంధంను చదవటం ద్వారా తెలుస్తుంది. 

పౌలు గారు కూడా గమాలియేలు దగ్గర నేర్చుకున్నారు ఆయన పొందిన జ్ఞానం వల్లనే క్రీస్తును ప్రకటించ గలుగుతున్నారు. మనం కూడా దైవ అనుభూతి , దైవ జ్ఞానంకలిగి ఉంటే ఆయన గురించి నలుగురికి చాటి చెప్పవచ్చు. దాని కోసం అనుదినం ప్రయత్నం చేయాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు  వారు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని క్షమించి ఆమెకు మంచి జీవితం జీవించుటకు రెండవ అవకాశం గురించి ధ్యానించుకుంటున్నాం. 

యేసు ప్రభువు ఓలివు పర్వతమునకు వెళ్ళేను. తెల్లవారిన తరువాత  యధావిధిగా దేవాలయంకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆయన భోదనలు వినటానికి ముందుగానే వచ్చేవారు. లూకా 21:37-38. 
ఇక్కడ ఒక విషయం మనం అర్ధం చేసుకోవాలి. యేసు ప్రభువు చాలా సార్లు దేవాలయంకు ప్రార్ధించుటకు వెల్లుచున్నారు, వాక్యం ప్రకటించుటకు వెల్లుచున్నారు. పాపం , పుణ్యం గురించి ప్రజలకు భోధిస్తున్నారు. అది ప్రభువు చేసే మంచి పని. 

సువార్త ప్రకటన చేసే సమయంలో ప్రభువును కొందరు పరీక్షకు గురిచేస్తున్నారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని గురించి ఆయన్ను పరీక్షిస్తున్నారు. 

చాలా సందర్భాలలో తన తప్పులను దాచుకోవడం ఇతరుల తప్పులను వ్రేలెత్తి చూపటం సాధారణంగా మనకు కనిపించే మానవ స్వభావం. 

పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు ఎదుటివారి తప్పులు గురించే  ఆలోచించారు కానీ తమ తప్పులూ ఆలోచించడం లేదు. వారు తమను తాము సమర్ధించుకొనేవారు. లూకా 18:9-14. 

వారి యొక్క పాపపు జీవితం ఎన్నడూ వారికి గుర్తుకురాలేదు. అందుకే వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని శిక్షించాలనుకున్నారు. వాస్తవానికి మోషే ధర్మ శాస్త్రం ప్రకారం  వ్యభిచారం చేసే వారికి మరణ శిక్ష విధించాలి. లెవీ 20:10, ద్వితీ 22:13-24. 
పరిసయ్యులు యేసుప్రభువును పరీక్షకు గురిచేయాలనుకుంటే దేవుడే వారిని పరీక్షకు గురిచేస్తున్నారు. యూదుల ఆచారం ప్రకారం వారిలో అందరికన్నా పెద్ద మనిషిని ఆమె మీద రాయి విసరమన్నారు కాని అక్కడ ఎవరు ఆ పని చేయలేదు.వారిలో కూడా హృదయ పరివర్తన కలుగుతుంది. వారు కూడా పాపాత్ములమే అని గ్రహిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు వెళ్లి పోవుచున్నారు.ఈ యొక్క సంఘటన లో దేవుని యొక్క గొప్ప కనికరం మనకు కనపడుతుంది. దైవ ప్రేమ మానవ దీన స్థితిని కలిసినప్పుడే దేవుని కనికరం పుడుతుంది.ప్రేమ కలిగిన దేవుడు పడిపోయిన పాపి దిన స్థితిని చూసినప్పుడు కనికరం చూపిస్తున్నారు.యేసు ప్రభువు ఆమెలో కలుగబోయే మార్పును చూసారు. అందుకే ఆమె వైపు కరుణతో చూసారు. ఆమె జీవితంను మార్చుకోమని ప్రభువు చెబుతున్నారు.
వ్యభిచారం లో పట్టుపడిన స్త్రీ పాపం యేసు ప్రభువు సమర్ధించలేదు.పాపం చేసిన ఫర్వాలేదు అని చెప్పలేదు.కాని ఆయన యొక్క వైఖరిలో క్రొత్తధనం ఉంది.నేను నిన్ను ఖండించను, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, నీ జీవితంను చక్కబెట్టుకో అని ప్రభువు తనకు అవకాశం ఇస్తున్నారు. ఆమె హృదయ పరివర్తన చెందుటకు, పాపంను విడచి పెట్టుటకు దేవుడు ఆమెకొక అవకాశం ఇచ్చారు.
పరిసయ్యులు ఆమెను శిక్షించాలనుకున్నారు, కాని ప్రభువు ఆమెను రక్షించారు.పరిసయ్యులు ధర్మ శాస్త్ర బోధకులు క్రూరంగా హింసించాలనుకున్నారు. దేవుడు మాత్రం కరుణ చూపించారు. పరిసయ్యులు అధికారాన్ని, నీతిమంతమైన జీవితాన్ని చూపించాలనుకున్నారు, కాని ప్రభువు దైవ ప్రేమ జీవితాన్ని చూపించారు.
ఇప్పటి వరకు చేసిన పాపాలను దేవుడు క్షమించి అవకాశం ఇస్తున్నారు కాబట్టి జీవితం ను బాగు చేసుకోవాలి.
మనం కూడా మన బలహీనతలవల్ల పాపం చేస్తాం. భర్తలు భార్యలను, భార్యలు భర్తలను మోసం చేస్తారు.బిడ్డలు తల్లి తండ్రులను ,తల్లి తండ్రులు బిడ్డలను మోసం చేసి జీవిస్తారు. మనం పాపం చేసి జీవిస్తాం కాబట్టి ఇంకొక అవకాశం ఇచ్చినప్పుడు దానిని సరిగా వినియోగించుకోవాలి.
ఈ సువార్త ద్వారా దేవుడు ఆమె పాపాలను క్షమిస్తూ, ఆమెకు ఒక క్రొత్త జీవితం జీవించుటకు అవకాశం ఇస్తున్నారు, మనం కూడా మన స్నేహితులకు ఒక అవకాశం ఇవ్వాలి.భర్త భార్యకు , భార్య భర్తకు అవకాశం ఇస్తూ , క్షమించుకొని, అంగీకరించుకొని జీవించాలి. 
దేవుని దయ, కనికరం, ప్రేమ చాలా గొప్పవి, ఆయన ఇచ్చిన ప్రతి అవకాశం హృదయ పరివర్తన చెందుటకు, మంచిగా జీవించుటకు వినియోగించుదాం.
ఒకరి పట్ల ఒకరం కనికరం, ప్రేమ, సానుభూతి కలిగి జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD

26, మార్చి 2022, శనివారం

తపస్సు కాల 4 వ ఆదివారం

తపస్సు కాల 4 వ ఆదివారం

యెహోషువ 5: 9, 10-12 , 2వ కొరింతి 5: 17-21 , లూకా 15: 1-3, 11-32.

ఈ నాటి ఆదివారమును తల్లి శ్రీసభ ఆనందించు ఆదివారం అని ప్రకటిస్తుంది.

-రాబోయేటటువంటి పునరుత్తానా రోజులను స్మరించుకొని మనందరం సంతోషంతో ఉండాలని ఈ ఆదివారం యొక్క ఉద్దేశం.

-ఈనాటి మూడు దివ్య పఠనాలు కూడా ఆనందించుటను గురించి బోధిస్తున్నాయి.

-తపస్సుకాలపు నాల్గొవ ఆదివారంలోకి ప్రవేశించాం ఇక కొన్ని రోజులలో ప్రభువు యొక్క సిలువ శ్రమలు, మరణ పునరుత్తానం లో బాగస్తులమై జీవించ బోతున్నాం కాబట్టి మనం ఆనందించాలి. 

-మనకు మేలు జరుగుతుందని ఆనందించాలి, మనం రక్షణ పొందే గడియ ఆసన్నమగుచున్నదని ఆనందించాలి.

-ప్రతి ఒక్కరం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం అందుకోసం రోజు చాల ప్రయత్నం చేస్తుంటాం.

-మనందరం మన యొక్క కుటుంబాలలో ఆనందంగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ శ్రమలు అనుభవించారు.

-మనము ఈ తప్పస్సుకాలములో దేవునితో మరియు తోటి మానవునితో సక్యపడి జీవించాలి అప్పుడు మనలో నిజమైన సంతోషం ఉంటుంది. 

- ఈనాటి మొదటి పఠనంలో ఇశ్రాయేలు ప్రజలు స్వేచ్ఛతో ఆనందంగా చేసుకున్న పండుగను గురించి చదువుతున్నాం. 

-దేవుడు ఇశ్రాయేలుకు స్వేచ్ఛనిచ్చిన పండుగ వారు ఆనందంగా కొనియాడుచున్నారు.

-మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత భూమికి ప్రయాణం చేయసాగారు. ఆయన తరువాత ఇశ్రాయేలును వాగ్దత భూమికి నడిపించింది యెహోషువ ప్రవక్తయే.

-మోషే కేవలం ఇశ్రాయేలీయులను వాగ్దత భూమికి దగ్గరకు మాత్రమే వారిని నడిపించారు, కానాను ప్రాంతంలో ఆయన అడుగు పెట్టలేదు. తన శిష్యుడైన యెహోషువ మాత్రమే ప్రజల తోటి అందు ప్రవేశించారు .

-యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత భూమిలో ప్రవేశించిన ప్రదేశానికి “గిల్గాలు” అనే పేరు వచ్చింది.

-గిల్గాలు అంటే పన్నెండు రాళ్ల వృత్తం అని అర్థం. ఈ పన్నెండు రాళ్లూ యాకుబు యొక్క 12 మంది కుమారులయొక్క జాతులకు చిహ్నం గా ఉన్నవి. యెహోషువ 4 :2 -3 .

-ఈ పన్నెండు రాళ్లతో దేవుని యొక్క బలిపీఠమును నిర్మిస్తున్నారు. ఈ రాళ్లు ఎందుకంటే దేవుడు చేసిన మేలు తలంచు కోవటానికి ఇశ్రాయేలు ప్రజలు దివ్యమందసంతో యోర్దాను నది దాటేటప్పుడు దేవుడి వారికి ఆరిన నేలను చేశారు. నదిలో నడిచి వెళ్ళుటకు దేవుడు మార్గం సిద్ధంచేశారు. ఆయన మేలులు గుర్తుంచుకొనటంకు ఈ బలిపీఠం నిర్మిస్తున్నారు. యెహోషువ 4 :7 .

-ఈ పన్నెండు జాతులలో దేవుడు తన ప్రజలను నియమించెను, వారిని తన బిడ్డలుగా ఎన్నుకొనెను.

వాగ్దత భూమిలో ఇశ్రాయేలు ప్రజలు ఆనందంతో జరుపుకున్న తోలి పాస్కా పండుగ గురించి వింటున్నాం.

-యావే దేవుడు అంటున్నారు " నాటి అపకీర్తిని నేను మీనుండి తొలగించితిని" అని చెపుతున్నారు.

-వారియొక్క అపకీర్తి ఏమిటంటే సున్నతి పొందక పోవడమే యెహోషువ 5: 4 - 5.

-ఐగుప్తు దాటినా తరువాత ఎడారిలో జన్మించిన వారు సున్నతి పొందలేదు. యూదులు దేవుని బిడ్డలుగా ఉండుటకు సున్నతి చాల అవసరం. ఆది 17 : 10 -11 .

-సున్నతి చేయుట ద్వారా వారందరు అబ్రహం సంతతిగా పరిగణించబడతారు. దీనివలన దేవుని యొక్క మన్ననను   పొందుచున్నారు.

-ఈ అపకీర్తి అంటే ప్రజలయొక్క దురాలోచనలు దేవుడు తొలగించారు. ఎప్పుడెప్పుడు ఐగుప్తుకు తిరిగి వెళ్లాలన్న ఆలోచనలను అన్నింటిని దేవుడు తొలగించారు. ఇంకొక విధంగా చెప్పాలంటే అపకీర్తి అంటే బానిసలుగా వున్నవారికి స్వేచ్ఛనిచ్చి గౌరవించటం .

-దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చి వారికి ఒక గుర్తింపునిచ్చారు. దానివలన వారియొక్క అపకీర్తి అంతా తొలగి పోయింది.

-మన జీవితాలలో ఉన్న అపకీర్తిని కూడా దేవుడు తొలగించి మనల్ని రక్షిస్తాడు.

-వాగ్దత భూమిలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఆనందంగా తోలి పంటను రుచి చూశారు.

-అక్కడ మన్నా ఆగిపోయినది. ఎందుకంటే ఇక వాగ్దత భూమిలో పండించే పంట సమృద్ధిగా ఉంటుంది కాబట్టి దేవుడు మన్నాను ఆపివేశారు . దేవుడు వారికి ఎటువంటి కొరత రాకుండా చూస్తారు. 

-ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆనందం చూస్తున్నాం.

-ఈ నాటి రెండవ పఠనంలో మనం క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి అని పలుకుచున్నారు. 

-మనందరం క్రొత్త వాళ్లమైతే చాల సంతోషంగా, మంచిగా ఉంటుంది. మనయొక్క కుటుంబ సభ్యులకు అలాగే దేవునికి ఆనందంగా ఉంటుంది. 

-మనం నిజంగా క్రీస్తునందు జీవిస్తే నూతన సృష్టిగా చేయబడతాం. కొరింతు సంఘంలోని ప్రజలు దేవుణ్ణి నమ్ముకొని జ్ఞాన స్నానం పొందటం ద్వారా ఒక నూతన సృష్టిగా చేయబడుచున్నారు.  మనం దేవుని యందు ఉంటే మన జీవితాలు కూడా మారుతాయి.

-దానికి నిదర్శనం పౌలు గారి జీవితమే. గలతీ 2 : 20  ఇక నాలో జీవించేది నేను కాదు క్రీస్తుయే అని పౌలు గారు పలుకుచున్నారు.

-క్రీస్తునందు ఎవరైనా ఉండాలంటే ఈ లోకంలో వున్న చెడును విడిచిపెట్టి దేవుడిని వెంబడించాలి.

-క్రీస్తునందు ఉండాలంటే మనలో పరిత్యజించుకునే లక్షణం ఉండాలి. ఆయన యందు ఉండటం కోసం ఏదైనా త్యాగం చేసే గుణం మనలో ఉండాలి.

-క్రైస్తవులుగా మనం క్రొత్తవ్యక్తులుగా మారడానికి మన యొక్క సొంత శక్తి ప్రయత్నం కాదు కానీ తండ్రి దేవుడు మనమీద చూపిన దయవలనే అది కారణం. 

-పౌలు గారు తనకు దేవుడు అప్పచెప్పిన పరిచర్యగురించి కూడా తెలుపుచున్నారు. క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మానవులతో ఏర్పరిచిన సఖ్యత గురించి భోదించటమే దేవుడిచ్చిన పని అని తెలుపుచున్నారు. 

-సఖ్య పడి జీవించమని పౌలుగారు పలుకుచున్నారు. 2 కొరింతి 5: 20.

సఖ్య పడితే దేవునికి ఇష్టమే మన పొరుగువారికి ఇష్టమే ఇద్దరుకూడా సంతోషంగా ఉండగలరు.

-మనం సఖ్య పడాలంటే దేవుని యందు ఉండాలి. ఆయన యందు లేకపోతె మన జీవితాలు మారవు. 

-మోషే 40 రోజులు దేవుని యందు ఉన్నారు ఆయన ముఖం ప్రకాశవంతంగా మారింది. 

-పేతురు దేవునియందు ఉన్నారు. ఆయన జీవితం మారిపోయింది .

-జక్కయ్య జీవితం, వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ, వీరి జీవితాలు మారిపోయాయి.

మనం కూడా క్రీస్తునందు జీవిస్తే మనం కూడా మారతాం. కానీ మనం ఎక్కువగా క్రీస్తునందు జీవించము. ఆయన యొక్క సాన్నిధ్యం మనలను మార్చివేస్తుంది. పౌలుగారి యొక్క జీవితమును మార్చివేసింది. 

-క్రీస్తునందు జీవించాలంటే ఇహలోక వాంఛలకు దూరంగా ఉండాలి అప్పుడు దేవునియందు మనం ఉండగలం. 

-ధనికుడైన యువకుడు క్రీస్తులో ఉండకుండా ధనం వెంబడి పోయాడు. యేసు ప్రభువుయొక్క శిష్యులు తనతో ఉన్నారు, కాబట్టి సామాన్యులైన వారి జీవితాలు చాలా మారిపోయాయి.

-క్రీస్తునందు మనం కూడా జీవిస్తే మనం నూతన వారిగా చేయబడతాం. పాతవి నశించి క్రొత్తవి ఏర్పడతాయి. కాబట్టి క్రీస్తునందు జీవిస్తే నూతన జీవితం, నూతన ఆలోచనలు, మాటలు అన్ని ఉంటాయి.

-ఈనాటి సువిశేష పఠనంలో దేవుని యొక్క గొప్ప ఆనందం గురించి వింటున్నాం.

కేవలం తండ్రియొక్క ఆనందం మాత్రమే కాదు ఇక్కడ మనం చూసేది తప్పిపోయిన కుమారుడి ఆనందం కూడా ఎందుకంటే నిరాకరించిన తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి కుమారుణ్ణి ఏమి అనకుండా ఆయన్ను స్వీకరించారు, అందుకు కుమారుడు చాల ఆనందంగా ఉన్నారు. 

-లూకా సువార్త 15 వ అధ్యాయం మొత్తం కూడా తప్పిపోయిన వాటిగురించి భోదిస్తుంది.

-తప్పిపోయిన గొర్రె 

-తప్పిపోయిన నాణెము 

-తప్పిపోయిన కుమారుడు.

-తప్పిపోయిన గొర్రె, నాణెముల ఉపమానములు తప్పిపోయిన కుమారిని ఉపమానంకు ఒక వ్యత్యాసం ఉంది.

-తప్పిపోయిన గొర్రె, మరియు నాణెముల ఉపమానాలతో స్వయంగా దేవుడే, యజమానుడే వాటిని వెదకుచున్నారు కానీ తప్పి పోయిన కుమారుని యొక్క ఉపమానంలో తండ్రి కుమారుని వెదకటం లేదు, కుమారునికి స్వేచ్ఛనిచ్చారు. తనయొక్క స్వేచ్ఛ జీవితంలో కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నారు. మిగతా వాటికన్నా మానవుణ్ణి దేవుడు ఎక్కువగా ప్రేమించారు. అందుకే స్వేచ్ఛనిచ్చి ఎప్పుడు తన చెంతకు పశ్చాత్తాప పడి తిరిగి వస్తాడని ఎదురు చూశారు, తండ్రి. 

-ఈ సువార్త పఠనంలో చాల విషయాలు మనం ధ్యానించుకోవచ్చు దేవుని యొక్క గొప్ప దయా హృదయం మనకు ఇక్కడ అర్థమగుచున్నది దేవుడు మనలను ఎంతగా క్షమిస్తారో తెలుస్తుంది.

తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మూడు ముఖ్యమైన పాత్రలున్నాయి. 

-తండ్రి- అనంత ప్రేమ కలిగిన తండ్రి 

-చిన్నకుమారుడు -తప్పిపోయిన కుమారుడు.

-పెద్దకుమారుడు -నటించే పెద్దకుమారుడు 

-కొన్ని సందర్భాలలో ఈ ముగ్గురు వ్యక్తులు పోలినవారంగా మనందరం ఉంటాం. 

-ఈ ఉపమానం ప్రభువు తెలుపుటకు కారణం ఏమిటంటే పరిసయ్యులు సద్దుకయ్యలు తాము నీతిమంతులమని చెప్పుకొనుచు పశ్చాత్తాప పడకుండా ఇతరులను హీనంగా చూస్తున్నారు కాబట్టి దేవుడు పాపులను సుంకరులను ఎలాగా ఆదరిస్తారో ఈ యొక్క ఉపమానం ద్వారా తెలియచేస్తున్నారు. 

-ఆ నాటి యుద్ధ సమాజంలో అలాగే నేటి ఆధునిక యుగంలో మూడు వర్గాల ప్రజలను సూచిస్తున్నాయి ఈ మూడు పాత్రలు. 

తమ పాపాలకు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చిన పాపాత్ములు -చిన్న కుమారునికి సూచనగా ఉన్నారు. 

-పశ్చాత్తాపంతో తన చెంతకు తిరిగి వచ్చి క్షమించమని కోరినప్పుడు వెంటనే క్షమించి తన చెంత చేర్చుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్న దేవుణ్ణి -తండ్రికి సువార్తలో సూచనగా ఉంది.

-మూడవ పాత్ర దారులు - మేము మాత్రమే నీతిమంతులమని చెప్పుకొనే యూదులు పెద్దకుమారునికి సూచనగా ఉన్నాయి. యూదులు ఎప్పుడు కూడా విమర్షించే వారే దేవుని దయను, ప్రేమను సరిగా అర్థం చేసుకోకుండా ఆయన్ను విమర్షించారు, నిందించారు.

ఈ మూడు పాత్రలను గురించి తెలుసుకుందాం. 

చిన్నకుమారుడు- చిన్న కుమారుణ్ణి మనం తప్పి పోయిన కుమారునిగా పిలుస్తున్నాం. 

చిన్నకుమారుడు తండ్రి నుండి స్వేచ్ఛను కోరుకొని తన తండ్రి సంపదనుండి  తన హక్కుగా రావలసిన మూడవ వంతు వాటాను బలవంతంగా పంచుకొని వెళ్ళాడు.

-తండ్రియొక్క విలువను, ప్రేమను, ఆయన చూపించే ఆ యొక్క ఆదరణను గ్రహించలేకుండా చిన్న కుమారుడు తండ్రితో వున్న భందమును తెంచుకొని తన యొక్క సొంత ఆనందాలు అనుభవించటానికి దూరంగా వెళ్లుచున్నాడు, తండ్రి ప్రేమను తిరస్కరించి వెళ్తున్నాడు. 

-జల్సా చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతూ, తన ఆస్తినంతా పోగొట్టుకొని చివరికి ఒక హీనమైన పని చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎవ్వరుకూడా ఏమి ఇవ్వలేదు అంత దురదృష్టకరమైన స్థితి 15 : 16 .

-తనకు ధనమున్న క్షణంలో ఏమి గుర్తుకు రాలేదు. తన తండ్రి కూడా గుర్తుకు రాలేదు. కానీ అన్ని కోల్పోయిన్నప్పుడు తండ్రి గుర్తుకు వస్తున్నాడు. 

-మనజీవితంలో కూడా చాలా మందికి డబ్బున్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. చిన్న కుమారుని వలే జీవిస్తాం. 

తనయొక్క హీన స్థితిలో కను విప్పు కలిగెను అని 17 వ వచనంలో చెప్పబడింది. 

-ఈ కనువిప్పు మనలో కూడా కలగాలి. నేను ఎలాంటి తప్పు చేశానని కనువిప్పు కలిగింది . కనువిప్పు అంటే చేసిన తప్పు తెలుసుకోవడమే.

-చేసిన తప్పు మనస్సుకు గుర్తుకు వచ్చి చిన్న కుమారుడు పశ్చాత్తాప పడుచున్నాడు. తన తండ్రి యొక్క ప్రేమను గుర్తించుకుంటున్నారు, ఆయన చేసిన పాపలు క్షమించాలని కోరుకుంటానని ఆలోచన చేస్తున్నాడు. 

-మనజీవితంలో తండ్రిని కాదని స్వేచ్ఛగా జీవించాలనుకుంటే మన జీవితాలు కూడా దారుణంగా మారతాయి. చిన్న కుమారుడి జీవితం తండ్రితో వున్నప్పుడు ఒక విధంగా ఉంది తండ్రితో లేనప్పుడు ఇంకొక విధంగా ఉంది. ఆయన ఆకలితో అలమటించారు. తండ్రి దగ్గర అంతా సమృద్ధిగా పొందాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి విలువ తెలుసుకోలేదు. 

-ఈ చిన్న కుమారుడు తానూ పాపం చేశానని గ్రహించి తండ్రి చెంతకు వెళ్లుచున్నాడు.

18 వ వచనంలో "వాడు లేచి " తండ్రి వద్దకు వెళ్లాలనుకున్నాడు మనం నడవాలంటే ముందుగా కూర్చున్న స్థలం నుంచి లేవాలి. 

-మనం ఎక్కడ నుండి లేవాలంటే మన పాపపు స్థితి, వ్యసనాల నుండి లేవాలి. మనయొక్క చెడు గుణాలనుండి లేవాలి . పొరుగు వారితో సఖ్య పడటానికి కూడా లేచి నడవాలి, మనయొక్క దీన స్థితి నుండి లేవాలి అప్పుడు దేవునితో పొరుగు వారితో సక్యపడి మంచి జీవితం జీవించాలి.

చిన్న కుమారునికి తండ్రి మీద ఉన్న నమ్మకం వల్లనే ఆయన చెంతకు తిరిగి రావాలను కున్నాడు. మనం కూడా తిరిగి రావాలి. తిరిగి రావాలంటే 

-దేవునితో కలిసి ఉండటానికి తిరిగి రావాలి

-కుటుంబ సభ్యులతో కలిసి ఉండుటకు తిరిగి రావాలి 

-భార్య, భర్తతో, కలిసి ఉండటానికి తిరిగి రావాలి. 

అందుకే దేవుడు ఇప్పుడైనా తిరిగి రమ్మంటున్నారు. యావేలు 2 : 12 -13 .

-చిన్న కుమారుడు- తప్పిపోయాడు -తన యొక్క సొంత ఆలోచనలవల్ల, జల్సాల వల్ల తప్పిపోయాడు. తండ్రిని అర్థం చేసుకోవడంలో తప్పిపోయాడు -తండ్రిని ప్రేమించుటలో తప్పిపోయాడు, తండ్రని గౌరవించుటలో తప్పిపోయాడు. తనయొక్క బాధ్యతలు నిర్వహించుటలో తప్పిపోయాడు- విధేయత చూపటంలో తప్పిపోయాడు. 

-మనం కూడా చాలా విషయాలలో తప్పిపోతున్నాం;

-ప్రార్థించుటలో తప్పిపోతున్నాం.

-ఈ లోక కోరికలకు తప్పిపోతున్నాం. 

-దేవుని సన్నిధికి రావటంలో తప్పిపోతున్నాం. ఇంకా చాలా విషయాలలో తప్పిపోతున్నాం.

-చిన్న కుమారునిలో వున్నా గొప్ప లక్షణం ఏమిటంటే తండ్రి చెంతకు తిరిగి రావాలనుకోవడం, సఖ్య పడి క్షమించమని అడగటం. మనకు నచ్చిన విధంగా మనం జీవించి పాపము చేసిన సందర్భంలో పాపాలకు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చి క్రొత్త జీవితం జీవించాలి. 

-చిన్నవాని వలే మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితమును సరిచేసుకొని జీవించాలి. మనలో ఎలాంటి మార్పు అవసరమో అని మనకు తెలిస్తే మన జీవితాలు మనం మార్చుకోవచ్చు.

2. తండ్రి - దేవుడు 

-తనను కాదని వెళ్లిపోయిన కుమారున్ని తండ్రి క్షమించాడు ఆదరించాడు. 

-తండ్రియొక్క సహనంకు, ప్రేమకు ఎలాంటి హద్దులు లేవు తన కుమారునికి మేలిమి వస్త్రాలు ఇవ్వమని చెప్పుచున్నారు. 

-తన కూమారుని పట్ల అనంతమైన ప్రేమను దయను చూపిస్తున్నారు ఆయన దయ కుమారుని యొక్క అన్ని పాపాలను మరచి పోతుంది. 

-తండ్రి కూమారునికి స్వేచ్ఛనిచ్చారు, ఆస్తిని పంచిపెట్టారు, కుమారుడు ఏది కావాలన్నా తండ్రి ఇచ్చారు, అది ఆయన యొక్క గొప్పతనం. 

-తండ్రి కుమారుని యొక్క రాక కోసమై, కూమారుని హృదయ పరివర్తన కోసమై ఎంతో ఎదురు చూశారు. తన బిడ్డలయెడల ఆయన ప్రేమ అలాంటిది. 

-తండ్రి ప్రేమ అర్థం చేసుకునే ప్రేమ -దేవుని ప్రేమ క్షమించే ప్రేమ -దేవుని మనస్సు స్వీకరించే మనస్సు.

-కుమారుడు పలికినది ఒకే ఒకమాట "తండ్రి నీకును పరలోకంకు విరుద్ధంగా పాపం చేశాను అన్నాడు. అది కూడా తండ్రి సరిగ్గా విన్నాడో లేదో కానీ కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తనను బిడ్డలాగే స్వీకరించి ఆయన్ను గౌరవించి విందు చేస్తూ ఆనందమును వ్యక్తం చేస్తున్నారు.

-మనం కూడా దేవునివలె మంచి మనస్సు ఉండాలి. క్షమించమని అడిగిన వారిని క్షమించి స్వీకరించాలి.


3. పెద్ద కుమారుడు - ఆయన నటించే కుమారుడు 

వాస్తవానికి ఆయన తండ్రి దగ్గర రోజు గడిపినప్పటికీ తండ్రి హృదయం తెలుసుకోలేక పోయాడు. 

-తమ్ముడు యొక్క రాకను అంగీకరించలేక పోయాడు. ఆయన అనుకోని వుండవచు, మళ్లి   ఆస్తి తీసుకొని పోవటానికి వచ్చాడని. తమ్ముడి పట్ల ఈర్ష జీవిస్తున్నాడు. జీవిస్తున్నాడు.

-పెద్దవానికి తండ్రి పట్లగాని, తమ్ముడి పట్ల గాని నిజమైన ప్రేమలేదు అతడు ఇద్దరినీ నిందించాడు. ఇద్దరి మీద కోపపడుచున్నాడు. కనీసం ఇంటిలోకి రావటానికి కూడా ఇష్టం లేకున్నాడు. 

-పెద్దకుమారుడు తండ్రి దగ్గర ఒకే ఇంటిలో జీవించిన తండ్రి మనస్సుకు దూరంగా ఉన్నాడు.

-పరిసయ్యులు సద్దుకయ్యలు అందరుకూడా దేవుని చేత ఎన్నుకొనబడి ప్రజలని దేవుని ఇష్టమైన బిడ్డలని చెప్పుకునే వారే. వాస్తవానికి వారు దేవుని హృదయానికి దూరంగా జీవించేవారే, ఇతరులను అంగీకరించకుండా జీవించేవారు.

-మన సమాజంలో కూడా ఇలాంటి మూడు పత్రాలు కలిగిన వారిని మనం చూస్తున్నాం. మరి ఈనాడు మనం ఎవరిని పోలి జీవిస్తున్నాం ?

-క్షమించే తండ్రినా?

-చేసిన తప్పులు తెలుసుకొని తిరిగి వచ్చిన చిన్నవాడినా?

-తండ్రిని అర్థం చేసుకోకుండా నిందించే పెద్దవాడినా?

-మనం దేవుని చెంతకు మరలి వస్తే, సఖ్య పడి జీవిస్తే, హృదయం పరివర్తనం చెందితే అందరూ ఆనందిస్తారు.


Rev. Fr. Bala Yesu OCD

తపస్సు కాల 4 వ ఆదివారం (మానవునితో సఖ్యత - హృదయ పరివర్తనం -దేవునితో సఖ్యత)

 

మానవునితో సఖ్యత - హృదయ పరివర్తనం -దేవునితో సఖ్యత
 

మొదటి పఠనం: ఐగుప్తు  అపకీర్తిని దేవుడు మన  నుండి తొలగిస్తాడు . అంటే దాస్యాత్వం నుండి మనలను విమోచించి స్వతంత్రులుగా  జీవించే వారిగా మనందరిని  తీర్చిదిద్దుతాడు.

రెండవ పఠనం  , క్రీస్తునందు జీవిస్తే, క్రీస్తు మనలను తనతో సఖ్యపరచుకొని నూతన సృష్టిగా మనలను మారుస్తాడు

 సువార్త పఠనము , తప్పిపోయిన  కుమారుడి ఉపమానం ద్వారా మన తప్పులను తీసుకొని, తండ్రి చెంతకు తిరిగి రావాలని, ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులకు వారి   మనస్తత్వానికి  స్వస్తి చెప్పాలని, పెద్దకుమారుడిలాగా తండ్రి దగ్గర ఉంటూ, దూరంగా జీవించే జీవితానికి సెలవు చెప్పి, దేవునితో మరియు  తోటి మానవునితో  సఖ్యతగా, సమాధానంగా జీవించాలని విశద పరుస్తుంది

 ఈ విధంగా ఈ నాటి మూడు పఠనాలు తండ్రి దేవుడు   అవధులు లేని ప్రేమకలవాడని, మన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాప పడి పాపం అనే  బానిసత్వం నుండి దేవుని ప్రేమ అనే స్వతంత్ర  జీవితానికి మరలి వచ్చి, నూతన సృష్టిగా మారమని ఈలాగున  దేవునితో, మానవునితో  సఖ్యత  పడమని మనందరిని   ఆహ్వానిస్తున్నాయి  వీటిని మనం మూడు అంశాలా రూపేనా  ధ్యానిస్తూ అర్ధం  చేసుకుందాం.

1. తండ్రి నుండి దూరంగా  వెళ్ళడం

2.మన పాపపు స్థితిని గ్రహించి తండ్రి చెంతకు తిరిగి రావడం

3.నూతన సృష్టి – ఉత్సవం

 ఈనాటి సువార్త పఠణం లో తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో మూడు ముఖ్య పాత్రలను చూస్తున్నాము  1.  తండ్రి 2 .చిన్నకుమారుడు 3 .పెద్దకుమారుడు

 చిన్న కుమారుడు  తన తండ్రితో తనకున్న సంబంధాన్ని తెంచుకోవాలనుకున్నాడు.  అందుకే తనకు రావాల్సిన  ఆస్తిలో  భాగాన్ని పంచిపెట్టామని,  తన తండ్రిని బలవంతం చేసి తన బాగాన్ని నెగ్గాడు . (లూకా 15 :12 )ఈ కుమారుడు తన తండ్రి హద్దులు,  అవధులు  మరియు అంతం లేని ప్రేమను,  చేతులారా ఇక అవసరం లేదుగా అనుకున్నాడు. తను  సత్వహగా జీవితాన్ని జీవించవచ్చు అనుకున్నాడు . దూర దేశంలో దీనికంటే ఇంకా ఎక్కువ ప్రేమ, ఆప్యాయత, భోగావీలాస  జీవితం లభిస్తుందని,  తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూర దేశాలకు వెళ్లి అక్కడ భోగ విలాసాలకు అలవాటుపడి  ఇదే సర్వస్వం  అనుకోని, తన చిల్లర స్నేహితులే ప్రేపంచం  అనుకోని , వాళ్ళు ఎళ్ళకాలం తనతో ఉంటారు అనుకోని, డబ్బు శాశ్వతం అనుకోని భ్రమపడ్డాడు (లూకా 15 ;13 -14 ),అందుకే తన ధనమును విచ్చల విడిగా ఖర్చుపెట్టి సుఖమయ జీవితానికి అలవాటుపడ్డాడు. కానీ కరువు  దాపరించడం వళ్ళ, తన సుఖమయ జీవితానికి, భోగ విలాస జీవితానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. తనతో  జీవితాంతం ఉంటారనుకున్న స్నేహితులు, ఇప్పుటి  దాక తనతో ఉండి, ఈ దరిద్రపు స్థితిని చూసి వదిలేసారు, ఒంటరయ్యాడు. కనీసం తినడానికి తిండి లేదు ,ఉండటానికి ఇల్లులేదు, ఎంచేయాలో అసలు తెలియదు ,చివరికి ఒక యజమానిని  ఆశ్రయించగా, తాను తన పొలంలో పందులను మేపుటకు పంపెను,  తర్వాత చెసేది కూడా ఏమిలేదు, ఎంతో హీనా స్థితికి దిగజారి చివరకు పందులు తిను పొట్టుతో తన పొట్టను నింపుకొని ఆశపడ్డాడు.  కానీ ఎవరు ఏమి ఇవ్వలేదు ,(లూకా 15 ;15 - 16 ),ఇదంతా ఓ తండ్రి ప్రేమమయ తండ్రి నుండి దూరంగా వెళ్ళుట ఫలితమే. ఈ రోజు నీవు నేను తండ్రి ప్రేమ నుండి కరుణ నుండి,తండ్రి సాన్నిధ్యం నుండి దూరంగా వెళ్ళామా?

 2. మన పాపపు స్థితిని గ్రహించి తండ్రి చెంతకు తిరిగి రావడం :

 తప్పిపోయన కుమారుడు ఎంతో హీనా స్థితికి దిగజారుడు,కడుపు నింపుకోవడానికి పందులు తిను పొట్టు మాత్రమే గతి, అన్నపుడు గుర్తుకొచ్చింది తండ్రి ప్రేమ.  అప్పుడు తండ్రి నుండి తాను అనుభవించిన రాజసం, వైభవం, జాగ్రత్త, అనురాగం ఒక్కోక్కటి గుర్తుతెచ్చుకొని, నెమరు  వేసుకుంటూ బోరున ఏడువసాగాడు. ఇక అనుకున్నాడు: నా తండ్రి వద్ద ఎందరో  పనివారికి పుష్టిగా  భోజనం దొరుకుతుంది కాని  ఇక్కడ నేను ఆకలికి మల మల మాడుచున్న.(లూకా 15 ;17 ) ఈలాగున  తన పాపపు స్థితిని గ్రహించాడు. ఇక లాభం లేదు! నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి,తండ్రి నేను పరలోకమునకును ,  నీకును ద్రోహం చేశాను ఇప్పుడు నేను ని కుమారుడను  అని అసలు అనిపించోకోదగను. నీ పని వారిలో ఒక్కరిగా పెట్టుకోనుము అని చెప్పెదనని ,  ఆలోచించుకుంటూ తండ్రి వద్దకు బయలుదేరెను.(లూకా 15 ;19). తన తండ్రి చెంతకు తిరిగి వచ్చెను. తన  తండ్రి  చెంతకు తిరిగి రావాలి అనేది  ఓ గొప్ప అభినందనీయ నిర్ణయం. ఎందుకు అంటే ఈ నిర్ణయం ద్వారా తన తండ్రితో మరల  జీవించాలి అనుకున్నాడు. తన తండ్రి ప్రేమను తనివితీరా అనుభవించాలి అనుకున్నాడు. తన తండ్రి సాన్నిధ్యంతో తండ్రి వద్ద ఉండాలి అనుకున్నాడు.

కాని  పెద్ద కుమారుడు తండ్రి  సాన్నిధ్యంలో ఉన్న కానీ తండ్రికి దూరంగా జీవిస్తున్నాడు ఇది  ఎంతో దుర్లభమైన జీవితం. అటు తండ్రితో,  ఇటు  తమ్ముడితో సఖ్యత లేదు.  స్వార్థం,  నిరాకరణ, అసూయా అనే దుర్గుణాలతో నిండి ఉన్నాడు.  ఇతరుల శ్రేయస్సును, ఎదుగుదలను మరు మనసును, తట్టుకోలేక పోయాడు.

ఈరోజు మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను చిన్న కుమారుడని పోలి ఉన్నానా, పెద్ద కుమారుడని పోలి ఉన్ననా ?,పెద్దకుమారుడి లాగా ఈర్షతో జీవిస్తే , జీవితానికి ఒక అర్ధం ఇవ్వలేం.  జీవితంలో నిజమైన సంతోషాన్ని  పొందలేము,తండ్రి దేవుని ప్రేమను అనుభవించలేం.    కాని  చిన్న కుమారుడిలాగా మన పాపపు స్థితిని గ్రహించి, పశ్చాత్తాపపడి హృదయ పరివర్తనం చెంది, దేవుని వద్దకు తిరిగి వస్తే దేవుని అనుగ్రహాలు, అవధులు లేని ప్రేమని ,కరుణని పొందగలం.

  3 . నూతన సృష్టి ఉత్సవం

 ఎవడైనను క్రీస్తునందున్న  యెడల అతడు నూతన సృష్టి. పాత  జీవితం గతించినది.  క్రొత్త జీవితం ప్రారంభం అవుతుంది.(2 కోరింతి  5 :17 ), అని ఈనాటి రెండో పఠనంలో మనం  మనం చదువుతున్నాం. చిన్న కుమారుడు తన పాపపు స్థితిని గ్రహించి, ఒప్పుకున్నాడు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చి ఇక క్రీస్తునందు ఉండాలి అనుకొన్నాడు, తోటి వారితో దేవునితో సఖ్యత పడ్డాడు. ఒక నూతన సృష్టి గా మారాడు.

 పెద్ద కుమారుడు మాత్రం తండ్రి వద్ద ఉన్నాడు, కాని  తండ్రి నందు ఉండలేకపొయ్యాడు. తన స్వార్ధం,నిరాకరణ మరియు  అసూయా దానికి కారణం. తన జీవిత స్థితిని గ్రహించలేకపొయాడు. తాను తండ్రికి  తగిన కుమారుడు అనుకున్నాడు,  కానీ తండ్రితో సఖ్యతను సంపాదించుకోలేకపొయాడు. ఓ పాతసృష్టిలానే  మిగిలిపోయాడు. ఎంత దురదృష్టకరణం! పెద్ద కుమారుడిలా కాక, మనం మన పాపపు బానిసత్వం నుండి విమొచించబడి దేవుని దగ్గరకు తిరిగి రావాలి.  (యెహోషువ 5 ;9 -12 ), ఒక నుత సృష్టిగా మారాలి. అప్పుడు ఒక  ఉత్సవం జరుగుతుంది. స్వయానా తండ్రి దేవుడే మనలను  ఆహ్వానిస్తాడు .ఏవిధంగా అంటే పరుగున వచ్చి, కౌగలించుకొని  ముద్దు పెట్టుకుంటాడు. అంతటితో ఆగడు, మనకు మేలిమి  వస్త్రములను, వెలికి ఉంగరమును ,కాళ్ళకు చెప్పులను ఇస్తాడు. అంటే ఇక మనం బానిసలం కాదు, స్వతంత్రులమని , తనకు చెందిన వారమని, తన రాజరికంలో వా రమని దానికి  అర్ధం.  క్రోవిన దూడను వాదించి విందు ఏర్పాటు చేస్తాడు (లూకా 15 ;20 -23 ), ఎందుకు అంటే? తప్పిపోయన మనం తిరిగి తండ్రి వద్దకు వచ్చేం . పాతజీవితానికి మరణించిన మనం నూతన జీవితానికి జన్మించం. ఈ తపసు కాల నాలుగవ  ఆదివారం మనమందరం మన పాపపు స్థితిని గ్రహించి, ఒప్పుకొని పశ్చాత్తాప పడి ,దేవుని చెంతకు తిరిగి వద్దాం.  నూతన సృష్టిగా మారుదాం. మన తోటి  వారితో,  దేవునితో, వెల్ల వేళలా  సఖ్యతతో జీవిద్దాం .

 BR. SUNIL INTURI 

 

 

19, మార్చి 2022, శనివారం

తపస్సు కాలం 3 వ ఆదివారం(2)

తపస్సు కాలం 3 వ ఆదివారం

నిర్గమ 3: 1-8, 13-15, 1 : కొరింతి 10: 1-6 , 10-12 , లూకా 13 : 1-9

ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క ఓర్పు, సహనం గురించి తెలుపుచున్నాయి. 

-ప్రజల యొక్క హృదయ పరివర్తనంకై దేవుడు మానవాళి పట్ల ఎంత ఓర్పుగా ఉన్నారో తెలుపుచున్నవి. 

-దేవుడు మానవులను అర్థం చేసుకొని వారియొక్క దీనస్థితికి జాలిపడి వారిపట్ల సహనంతో మెలగుతారు. 

-ఓర్పుగా ఉండటం దేవునియొక్క సహజ లక్షణం. అది దేవుని గొప్ప లక్షణం. తప్పు చేసిన వెంటనే దేవుడు శిక్ష వేయరు. ఎందుకంటే సృష్టి ప్రారంభంలోనే ఆదాము అవ్వ తప్పు చేసిన సరే తన యొక్క మనస్సు బాధపెట్టిన సరే వారే వస్తారని, క్షమించమని అడుగుతారని దేవుడు సహనంతో ఎదురు చూస్తున్నారు. మరియొక సారి వారు రాకపోయే సరికి దేవుడే వారిని వెదకుచు వారిపట్ల సహనంతో ఉంటున్నారు. 

-ఇశ్రాయేలీయులయొక్క మార్పు కోసం కూడా దేవుడు ఎంతో ఆశగా సహనంతో ఉంటున్నారు. అందుకు కాబట్టే ప్రవక్తల తర్వాత ప్రవక్తలను పంపుతున్నారు. 

-దేవుని వలే మనకు కూడా సహనం కావాలి. ఏవిధంగానైతే  రైతు పంట కోసం  ఎలాగ సహనంతో ఉంటారో మనం కూడా మన పొరుగు వారి మార్పుకోసం సహనంతో ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి జీవించాలి.

-పునీత అగస్టీను గారి తల్లి కుమారుడి కోసం భర్త కోసం వారియొక్క మార్పుకోసం ఎన్నో సంవత్సరాలు సహనంగా ఉన్నారు.

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల చూపినటువంటి గొప్ప దయను గురించి చెప్పబడినది. 

-మోషే ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఎన్నుకొంటూ, దేవుడి వరిపట్ల తనయొక్క దయను చూపిస్తున్నారు. 

-మోషే ప్రవక్త ఎప్పుడైతే దేవుని కొండయైన హోరేబు దగ్గరకు వచ్చారో అప్పుడు అతనిని దేవుడు ఎన్నుకొంటున్నారు. 

-దైవ పిలుపు ఎప్పుడు వస్తుందో ఎలాగ వస్తుందో ఎవరికి తెలియదు. 

-దైవ పిలుపునందుకొన్నది ఎందుకంటే దేవుని ప్రజలను నడిపించుటకు. ప్రజల యొక్క జీవితంలో పాపం యొక్క ఆవశ్యకతను తెలిపి, వారు దేవుని వైపు మరల్చే లాగ చేయుటమే దైవ ఇలుపు ఉద్దేశం .

-ఈనాటి మొదటి పతనం ద్వారా దేవుడు చాల విషయాలు మనకు తెలియచేస్తున్నారు. 

1. మనం దేవుని దగ్గరకు వస్తే మన జీవితాలు మారిపోతాయి. మోషే ప్రవక్త దేవుని కొండయైన హోరేబు  వద్దకు వచ్చారు. దేవుడున్న స్థలంకు వచ్చిన్నప్పుడు దేవుడు తనను ఎన్నుకుంటున్నారు, ఆయన ఎన్నిక ప్రత్యేకమైనది. 

-దేవుడు మోషేకు దైవ పిలుపును అందచేస్తున్నారు. మోషే జీవితంలో ఒక గొప్ప మలుపు కలిగేలా దేవుడు చేస్తున్నారు. 

- మోషేను అనేక మందికి నాయకుడిగా చేస్తున్నారు. ఆయన జీవితాన్ని మార్చుతున్నారు. 

-ఆయనకు దేవుడు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. తన ద్వారా ద్వారా బానిసత్వంలో ఉన్న ప్రజలకు స్వేచ్ఛనిస్తానన్నారు. 

- దేవునికి దగ్గరగా వచ్చిన వారి జీవితాలు చాలా మారిపోయాయి. జక్కయ్య యేసయ్యను చూడాలని వచ్చారు అప్పుడు ఆయన జీవితం మార్చబడుతుంది. 

-నతానియేలు దేవుని దగ్గరకు వచ్చారు దైవపీలుపును పొందుకున్నారు.

-మోషే దేవుని యొక్క స్థలం దగ్గరకు వచ్చారు దేవుని పని కోసం ఎన్నుకొనబడినారు. 

- మనం దేవుని దగ్గరకు వస్తే దేవుడు మన దగ్గరికి వస్తారు. యాకోబు 4 :8 . 

-మనం కూడా దేవునిదగ్గరకు రావాలి నిర్మలమైన మనసు కలిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనలను కూడా మార్చుతారు. అదేవిధంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాలను మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. 

2. దేవుడు కనులారా ప్రజలయొక్క బాధలను చూశారు అని నిర్గమ 3 :7 వ వచనంలో చెప్పబడింది. ఈ మాట యొక్క అర్థమేమిటంటే ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపాలకు పశ్చాత్తాప పడ్డారని వారిలో హృదయ పరివర్తనం చోటు చేసుకుందని, వారు దేవుని వైపు మరలినారని అర్థం. ఎన్నో సంవత్సరాలుగా  వారు మారతారని దేవుడు ఎదురుచూసిన సమయం వచ్చినదని కాబట్టియే వారిని విముక్తులను చేయుటకు దేవుడు వారికోసం మోషే ను ఎన్నుకొంటున్నారు. 

-మన జీవితాల నుండి దేవుడు అదేవిధంగా హృదయ పరివర్తనం కోసం ఎదురు చూస్తున్నారు. 

-దయ, కనికరం కలిగిన దేవుడు ప్రజల దగ్గరగా ఉంటూ వారి జీవిత మనుగడను పరిశీలిస్తు వారి మార్పుకోసం ఎంతో ఎదురుచూస్తాడు.  

3. దేవుడు మోషేతో అన్నారు ఇప్పుడు నీవున్న స్థలం పవిత్రమైనది నీ చెప్పులు విప్పుము అంటున్నారు. 

- విడవటం అంటే కేవలం చెప్పులు మాత్రమే కాదు పాపమును కూడా విడిచిపెట్టడం. 

చాలామందికి దేవునియొక్క స్థలం పవిత్రత విలువ తెలియటంలేదు. అందుకే దేవాలయాన్ని ఎలాపడితే అలా వాడుతున్నారు. 

- దేవాలయంలో మొబైల్స్ వాడటం, ఎక్కువగా ముచ్చట్లు పెట్టడం చేస్తుంటారు. ఇవన్నీకూడా మనం తరుచుగా దేవాలయంలో చేస్తుంటాం ఎందుకంటే మనకు నిజంగా దేవునియొక్క పవిత్రత విలువ తెలియటం లేదు. 

4.  మోషే ప్రవక్త దేవుడి పేరు అడుగుచున్నారు.

“నేను ఉన్నవాడను” అని దేవుడు సమాధానం ఇస్తున్నారు.

ఉన్నవాడను అంటే అన్ని సమయాలలో వున్న దేవుడు.

-సృష్టి కాక మునుపే ఉన్నవాడు. 

-సృష్టిని చేసినప్పుడు ఉన్నవాడు. 

-సృష్టిని నడిపిస్తున్నప్పుడు వున్నవాడు. 

-మన సంతోషంలో ఉన్నవాడు. 

-మన భాదలలో ఉన్నవాడు. 

-మన నిరాశలలో, సమస్యలలో ఉన్నవాడు. 

- తన ప్రజలకి ఎప్పుడు దగ్గరగా ఉన్నవాడు, వారిని రక్షించుటకు వున్నవాడు అని భావం. ఆయన నిద్రపోయే వ్యక్తికాదు. 

-యావే దేవుడు తనను తాను వున్నవాడనని సంబోధించుకుంటున్నారు. యేసు క్రీస్తుప్రభుని ఇమ్మానుయేలు అంటున్నారు అనగా దేవుడు మనతో ఉన్నారు అని అర్థం. మత్తయి 1 :22- 23 .

-యేసుప్రభువు అంటున్నారు ఎల్లప్పుడూ మీతో ఉండుటకు మీకు నేనొక ఆదరణ కర్తను పంపిస్తాను అని. యోహను 14: 16-17.

- ఈ మూడు వాక్యాలలో దేవుడు తనను తాను ఉన్నవాడనని సంభోదించుకుంటున్నారు. -

-మన దేవుడు మనతో ఉండేవారు కాబట్టియే వారిని ప్రత్యేకంగా మనం అంటిపెట్టుకొని జీవించాలి. 

-దేవుడు తన పేరు తెలియచేయటం ఒక గొప్ప విశేషం. మనం ఒక వ్యక్తి పేరు చెబితే వారి గురించి మొత్తం తెలుసుకుంటాం. వారియొక్క వ్యక్తిత్వం, స్వభావం అన్నియు. దేవుని పేరు తెలియ చేయటం ద్వార దేవునికి  గొప్ప స్వభావం, ఓర్పు కలిగిన స్వభావం తెలుస్తుంది. 

-యావే దేవుడు మోషేతో "నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, దేవుడను అని చెప్పుచున్నారు. అంటే దేవుడు వీరికి చేసిన వాగ్దానాలను జ్ఞప్తికి ఉంచుకొని వాటిని నెరవేర్చేదేవుడు , ప్రజల మధ్య నివసించే దేవుడని తెలియ చేయుటకు ప్రభువు ఈవిదంగా పలుకుచున్నారు. 

-ఈ నాటి రెండవ పఠనంలో పౌలుగారు కొరింతు ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదాలు మల్లి చేయరాదని హెచ్చరిస్తున్నారు. 

-పౌలుగారు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన మేలులన్నీ వివరిస్తున్నారు. ప్రభువైన యావే దేవుడు 40 సంవత్సరాలు మేఘము క్రింద ఎటువంటి ఇబ్బంది లేకుండా కాచికాపాడారు.

-ఎర్ర సముద్రం దాటుటకు మార్గం సిద్ధం చేశారు, ఎడారిలో వారికీ ఆహారం, నీరు సమృద్ధిగా ఇచ్చారు. 

-దేవుడు వారియొక్క జీవితంలో ఎటువంటి కొరత లేకుండా కంటికి రెప్పలా కాపాడిన కానీ ఇంకా వారిలో కొంతమంది దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. అవిశ్వాసులుగా జీవించారు. వారిలో చాలామంది వాగ్దానా భూమికి చేరలేదు అని పౌలుగారు వివరించారు. 

- ఇశ్రాయేలు ప్రజలు పడిపోయిన విధంగా కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలని పౌలుగారు తెలుపుచున్నారు. 

-మనం జాగ్రత్తగా ఉంటే పడిపోకుండా ఉంటాం. చాల సందర్భాలలో జాగ్రత్తగా చూసుకొని  నడువు అని చెబుతారు ఎందుకంటే మనం జాగ్రత్తగా నడిస్తే గమ్యం చేరతాం. ఎటువంటి ప్రమాదంలో పడిపోకుండా.

-మనయొక్క   ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస జీవితంలో మనం కూడా జాగ్రత్తగా ఉంటే  

 పాపంలో  పడిపోము  దేవుని  అంటిపెట్టుకొని  జీవిస్తాం .

-మనకన్నా ముందుగా జీవించిన వారు మనకు ఎప్పుడు సుమాత్రుకగా ఉంటారు కొంతమంది మంచి ఉదాహరణగా ఉంటారు. కొందరు చెడుకు ఉదాహరణగా ఉంటారు అంటే అలాంటి చెడు జీవితం జీవించకూడదు అనుటకు ఉదాహరణగా ఉంటారు. 

-ఇశ్రాయేలు ప్రజలకు ఉదాహరణగా పౌలుగారు చెప్పినప్పుడు మనందరి జీవితాలను పరిశీలించుకోమంటున్నారు వారి వలె కాకుండా మనం కూడా మంచి విశ్వాసులుగా ఉండుటకు ప్రయత్నయం చేయాలి.   

-దేవుని సొంత ప్రజలమని ఎవ్వరు అధిక విశ్వాసం వ్యక్త పరచకుండా మనల్ని మనం తగ్గించుకొని మన యొక్క జీవితంలో వినయం కలిగి జీవించాలి.

- ఈనాటి సువిశేష పఠనంలో యేసుప్రభువు మనందరి యొక్క హృదయ పరివర్తనం కోసం ఎంత సహనంగా ఉంటున్నారో అర్థమగుచున్నది.

-మన మందరం పాపాత్ములమే అందరుకూడా దేవుని శిక్షకు పాత్రులే కానీ దేవుడు మనందరి హృదయ పరివర్తనం కోసం ఇంకా మనలను సజీవులుగా ఉంచుతున్నారు మనయొక్క మార్పుకై.

-యేసుప్రభువు తానూ సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు చెప్పిన మొదటి ప్రసంగం "కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించమని ప్రభువు ప్రసంగించారు. మార్కు 1 : 15 .

-ప్రస్తుత సమాజంలో చాల మంది హృదయ పరివర్తన కోసం ఎదురుచూస్తుంటారు. 

-ఒక భార్య తన భర్త వ్యసనాలు మానుకొని జీవించాలనుకొంటుంది. 

-ఒక తల్లి తన బిడ్డ చెడు మార్గం విడిచి పెట్టి మంచి మార్గమును అనుసరించాలని కోరుకుంటుంది. 

-అలాగే మనం పని చేసే చోట మన యాజమానుడు మరలనుకుంటాం. 

-తల్లిదండ్రలు మారాలని బిడ్డలు, బిడ్డలు మారాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. 

-మనం పొరుగువారియొక్క హృదయ పరివర్తనంకోసం ఎదురుచూస్తున్నట్లు దేవుడు మనయొక్క హృదయ పరివర్తనం చెందటానికి ఎదురుచూస్తున్నారు.

-మనయొక్క పనుల్లో మార్పు ఉండాలి, ప్రార్థించే విధానంలో మార్పు ఉండాలి, మాట్లాడే విధానంలో మార్పు ఉండాలి, ఇతరులతో జీవించే విధానంలో అన్ని విషయాలలో హృదయ పరివర్తనం అవసరం. హృదయ పరివర్తనం క్రొత్త జీవితానికి నాంది.

హృదయ పరివర్తనం చెందాలంటే రాతిగా వున్న హృదయం మాంసపు ముద్దలాగా మారాలి. యెహెఙ్కేలు 36 :26.

-హృదయ పరివర్తనం చెందనిచో మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. లూకా 13 : 5 .

-దేవునియొక్క ప్రేమ మనపై దిగిరావాలంటే మనలో హృదయ పరివర్తనం చోటుచేసుకోవాలి. 

-యేసుప్రభువు అంటున్నారు హృదయ పరివర్తనం అవసరం లేని 99 గొర్రెల కంటే హృదయ పరివర్తనం అవసరమున్న ఒక్క గొర్రె చాలు అని లూకా 15: 7.

-మనం హృదయ పరివర్తనం చెందుటకు దేవుడు చాల అవకాశాలను ఇస్తుంటారు. మన కన్నా మంచిగా ఉన్నవారు చనిపోయి మనం మాత్రమే బ్రతికి ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి నాకు కూడా మరణం వస్తుంది, నేను ఇలా ఉంటె పరలోకంలో ప్రవేశించను అందుకే నా జీవితం మార్చుకోవాలి అనే ఆలోచన చేయాలి. 

-మన యొక్క పాపపు జీవితం నుండి హృదయ పరివర్తన చెందాలి. 

-మనయొక్క అపద్దపు సాక్ష్యములనుండి, మనయొక్క కపట వేష ధారమునుండి, మనయొక్క అన్యాయపు మార్గాలనుండి, మనయొక్క ఇహలోక వంచాలనుండి మనం హృదయ పరివర్తనం చెందాలి.

-యేసుప్రభువు రెండు ఉదాహరణలను తీసుకుంటున్నారు, పిలాతు గలిలీయులను చంపిన విధానము మరియు సిలోయము బురుజు కూలి మరణించినవారు. 

-పిలాతు గలిలీయ దేశస్తులు బలులు అర్పించేటప్పుడు వారిని హత మార్చాడు. విప్లవం లేవదీసే గలిలీయులను పిలాతు నాశనం చేశారు. చనిపోయిన వారు మిగతా వారికంటే పాపాత్ములు కారు అని తెలుపుచున్నారు. 

-సిలోయము బురుజు కూలి 18 మంది చనిపోయారు అలా మరణించిన వారు మిగతా వారికంటే పాపాత్ములు కారు అని ప్రభువు తెలుపుచున్నారు. 

-ఈ రెండు సంఘటనలు అనుకోకుండా హఠాత్తుగా జరిగినవి. కాబట్టి వారు హృదయ పరివర్తనం చెందారో లేరో తెలియదు కానీ ఇది మన జీవితాలకు ఒక హెచ్చరిక.

- మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మనం మారాలి అని ప్రభువు తెలుపుచున్నారు.

- హృదయ పరివర్తనం అందరికి అవసరమే కాబట్టి దేవుడిచ్చిన తపస్సు కాలంలో హృదయ పరివర్తనం చెంది జీవించాలి. 

-రెండవ సంఘటన అత్తి చెట్టును చూపిస్తూ ప్రభువు మన పట్ల ఎంత సహనంగా ఉంటున్నారో తెలియ చేస్తున్నారు. 

మన జీవితాలు ఫలించటానికి దేవుడు ఎంతో ఓపికగా ఎదురుచూస్తుంటారు. దేవుని అనుగ్రహాలు దొరుకుతున్నాయి అయినా ఇంకా ఫలించుటలేదు. 

-అత్తి చెట్టును ఇశ్రాయేలు ప్రజలకు పోలికగా ఉంది. హోషేయ 9 : 10, మీకా 7 : 1, యిర్మీయా 8 : 13, 24 : 1 -10.

- దేవుడు ఆశించిన విధంగా వారు ప్రతి ఫలించలేదు. దేవుడు వారిని ఐగుప్తు దాస్యం నుండి విమోచించి, శత్రువుల నుండి రక్షించి వారి సొంత భూమినిచ్చారు అయినా కానీ వారు విగ్రహారాధనను పాల్పడి ఆశించిన ఫలములు ఇవ్వలేదు. నిర్గమ 32 : 1 -10 .

 -వాస్తవానికి అత్తి చెట్టు సంవత్సరానికి మూడుసార్లు ఫలముల నివ్వాలి కానీ ఇక్కడ మూడు సంవత్సరములు ఎటువంటి ఫలముల నివ్వలేదు. 

-ఆ చెట్టు ఫలించటానికి యజమానుడు అన్ని సకాలంలో ఇచ్చారు అయినా మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కనీసం మూడవ సంవత్సరం ఎటువంటి ఫలితం నివ్వలేదు. 

-అన్ని చేసినప్పుడు అది ఫలము ఇవ్వక పొతే మనం కూడా నిరాశ చెందుతాం. యజమానుడు మాత్రమే సహనంతో మూడు సంవత్సరములు ఎదురు చూశారు. 

-మూడు సంవత్సరాలు ఎదురు చూడటం అనేది ఎందుకంటే ఇజ్రాయెలీలు బానిసత్వంలోనికి వెళ్ళకముందు మూడు సంవత్సరాలు హృదయ పరివర్తనం చెందమన్నారు.

-బాప్తిస్మ యోహాను మూడు సంవత్సరాలు పరిచర్య, అలాగే యేసుప్రభువు యొక్క మూడు సంవత్సరములు బహిరంగ సువార్త వ్యాప్తి   కూడా హృదయ పరివర్తనకోసమే ప్రభువు ఎదురు చూశారు కాబట్టి మనం ఫలించాలి.

- మనం దేవుని యొక్క వాక్యం ఆలకించి అనుసరించి జీవించి ఫలించే వారిలాగా ఉండాలి దాని కోసం దేవుడు ఎదురుచూస్తున్నారు.

-దేవుని వలె ఒకరిపట్ల ఒకరు సహనం కలిగి జీవించి హృదయ పరివర్తనం చెందుదాం. క్రొత్త జీవితం జీవించుదాం.

  Rev. Fr. Bala Yesu OCD

18, మార్చి 2022, శుక్రవారం

తపస్సు కాల 3 వ ఆదివారం

తపస్సు కాల 3 వ ఆదివారం 

నిర్గ 3:1-8,13-15  1 కోరింథీ 10:1-6, 10-12 లూకా 13:1-9  

క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా !ఈ నాడు మన తల్లి అయిన తిరుసభ తపస్సు కాల మూడవ ఆదివారంలోనికి  ప్రవేశిస్తుంది.  అయితే  ఈనాటి మూడు దివ్య గ్రంధ పఠనాలను  ధ్యానించినట్లయితే ముఖ్యముగా హృదయపరివర్తన గూర్చి భోధిస్తున్నాయి. 

మొదటి పఠనములో  మోషే ప్రవక్తను యిస్రాయేలీయుల  బానిసత్వం నుండి విడిపించుటకై ఎన్నుకుంటున్నాడు. ఇతని ద్వారానే తమ పూర్వులు కొలిచినటువంటి యావే దేవుని గూర్చి  తెలియ చేస్తున్నాడు. 

రెండవ పఠనములో  మనం చూస్తే  ఈలోక  సంబంధమైన  విషయములపై , వస్తువులపై విగ్రహములపై మన మనస్సులను  లగ్నం చేయక,  ఆధ్యాత్మిక శిలయగు యేసు క్రీస్తునందు జాగ్రత్త కలిగి జీవించాలి అని తెలియజేస్తుంది. 

సువిశేష పఠనములో మనం చూస్తే, హృదయ పరివర్తనం గురించి మరియు ఫలభరితమైన జీవితం గురించి భోదిస్తుంది. 

మొదటి పఠనం :- 

ఈనాటి మొదటి పఠనములో ముఖ్యముగా మోషే ప్రవక్త ఎన్నికను మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు మోషేను ఎన్నుకున్నాడంటే, యిస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు బానిసత్వంలో మునిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. వారిని ఎంతో ఘోరంగా చూసెడివారు. వారిని బానిసలుగా ఎంచి ఇటుకలు చేయడానికి ఇల్లు కట్టడానికి ఇలా ఎన్నో రకాలుగా వారిని వాడుకుంటూ చిత్ర హింసలకు గురిచేసెడివారు. నిర్గ 2:23. అటువంటి సమయంలో యిస్రాయేలు ప్రజలు దేవుని సహాయాన్ని అర్ధించారు. అప్పుడు ఆర్తనాదాలు దేవుని చెవిన పడి వారిని రక్షించడానికి ఈ మోషే ప్రవక్తను ఒక పనిముట్టుగా ఉపయోగించుకున్నాడు. 

మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే, నిర్గ 3:1 లో ఇతను తన మామ అయినటువంటి యిత్రో మందలను మేపెడివాడు. తనకంటూ ఏమి లేదు. తన మామ దగ్గర సేవకుడుగా జీవించాడు. తన గొర్రెల నిమిత్తం మోషే హోరెబు కొండకు  వెళ్ళాడు. ఈ హోరెబు  కొండ అంటే దేవుని కొండ అని అర్ధం. దేవుడు నివసించే  ప్రదేశమునకు దేవుని చేత కొండకు నడిపింపబడ్డాడు. ఎప్పుడైతే మోషే  ఆ కొండ దగ్గరికి వచ్చాడో అక్కడ  దేవుని సాక్షాత్కారాన్ని చూసాడు. నిర్గ 3:2.  అక్కడ ఒక పొదనడిమి నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత  అతనికి సాక్షాత్కారించేను. యోష  6:1-2 లో చూస్తే  ప్రభువు ఉన్నతమైన సింహాసనము పై  ఆసీనుడై ఉండెను. అతనికి పై భాగమున జ్వలించుచున్న  సెరాఫీము దేవ దూతలు నిల్చియుండిరి అని చదువుచున్నాం. అదే విధంగా సమువేలు కూడా దేవుని దర్శనములు ఎప్పుడు లభించుచునే ఉండెను. 1 సమూ 3:21. ఇలా ఎంతో మందికి దేవుడు ప్రత్యక్షమవుతూ ఆయన యొక్క మహిమను తెలియ చేస్తున్నాడు. 

ఎందుకు దేవుడు తన పనికి ఎంతో మందిని పిలుస్తున్నాడు? 1. శ్రమలలో ఉన్న వారికి విడుదల కలుగ చేయడానికి.(నిర్గ 3:7-8) 2. పాపములో ఉన్న వారిని దేవుని మార్గంలో నడిపించడానికి (యోనా 3:4-6) 3. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి (నిర్గ 3:14) 

దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమంటే, దేవుని  గూర్చి భోధించాలి. కానీ ఈ సమాజంలో మనం చూస్తే ఎంతో మంది దేవుని మాటలను వినడానికి, దేవుని చెంతకు రావడానికి, ఆయనను గురించి  భోదించదానికి వెనకాడుచున్నారు. మోషే ప్రవక్త జీవితంలో చూస్తే ఆయన దేవుని మాట శిరస్సా వహించి 1. ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో ఉన్నవాడైన దేవుని గురించి తెలియ చేశాడు. 2. ఫరో రాజు దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క ప్రణాళికను అతనికి తెలియజేసి ఎన్నో విపత్తుల తర్వాత ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానాను దేశమునకు తీసుకెళ్ళాడు. 3. దేవుని ఆజ్ఞలను వారికి అందించాడు. 4. వారి గురించి ప్రార్దన చేశాడు. 

ఈనాడు నీవు నేను కూడా క్రైస్తవులుగా పిలవబడుతున్నాం. క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరిస్తున్నవాడు. కాబట్టి మనం కూడా మోషే ప్రవక్తవలే , ఇంకా ఇతర ప్రవక్తల వలె దేవుని మాట శిరస్సా వహించి, దానిని పఠిస్తూ, పాటిస్తూ దానిని ఇతరులకు పంచుదాం. దేవుని యొక్క ప్రేమను ప్రణాళికను తెలియచేద్దాం. 

సువిశేష పఠనం లూకా 13: 1-13 

ఈనాటి  సువిశేష పఠనం ముఖ్యంగా హృదయ పరివర్తన గురించి తెలియచేస్తుంది. దేవుడు ఎలాగా వారిపై జాలి చూపిస్తున్నాడు. తన కరుణను తెలియచేస్తున్నాడని తెలుపుతుంది. అయితే ఈ సువార్త పఠనం లూకా 12 వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. ఎందుకంటే లూకా 12 వ అధ్యాయంలో మొదటి మూడు వచనములలోకపట ప్రవర్తనను గూర్చి జాగరూపులై ఉండాలి అంటున్నాడు. 

4 నుండి 7 వ  వచనములలో  ఎవరికి మనం భయ పడాలి. ఎవరికి భయ పడకూడదని  తెలుపుచున్నాడు. మనం ఎవరికి భయ పడాలి అంటే  మన శరీరమును నాశనం  చేయు వారికి భయపడకూడదు. కానీ మిమ్ము చంపి నరక కూపములో పడవేయగల వానికి భయ పడాలి అని తెలుపుచున్నాడు. 

8 వ వచనం నుండి 12 వ వచనములలో  దేవునికి బహిరంగ సాక్షులుగా మారాలి అని భోదిస్తున్నారు. అట్టి వాడిని దేవదూతల ఎదుట  అంగీకరించును, వారు ఎట్లు మాట్లాడవలయునో పవిత్రాత్మ ద్వారా తెలుపబడును. 

ఇలా జీవించుటద్వారా  ఈ లోక సంబంధమైన విషయములపై , లోకాశలపై చింతించక దేవుని రాజ్యమును, నీతిని వెదుకుతారు అప్పుడు వారికి అన్నియు సమకూర్చబడును అని 13 వ వచనం నుండి 31 వరకు తెలుపుచున్నది. 

మరి ఎందుకు దేవుడు తన రాజ్యమును ఇస్తాడు అంటే ఇది తన ఇష్టం ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము దానిని చేద పురుగులు తినివేయవు. లూకా 12:32-33. 

ఈ రాజ్యం కోసం ప్రతి ఒక్క సేవకుడు  సిద్ధ పాటు కలిగి జీవించాలి. లూకా 12:32. ఎందుకంటే మనుష్య కుమారుడు ఏ గడియాలో వస్తాడో తెలియదు. లూకా 12:40. ఈ సిద్ద పాటు ద్వార ప్రతి ఒక్క సేవకుడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు. లూకా 12:43. అలా జీవించనిచో తన యజమాని చేతిలో కొరడా దెబ్బలతో కఠిన శిక్ష ఉంటుంది. లూకా 12: 47-48. 

అప్పుడు తమ జీవితంలో విభేదాలు ఏర్పాడుతాయి. ఈ విభేదాలు ద్వార  తండ్రి కుమారున్నీ, కుమారుడు తండ్రిని,  తల్లి  కుమార్తెను , కుమార్తె తల్లీని, అత్త కోడలని, కోడలు అత్తని ఎదురిస్తారు. లూకా 12:53. ఇలా జరగకుండా ఒకరినొకరు సఖ్యత కలిగి జీవించినట్లయితే దేవుని శిక్షకు అర్హులు కాక ప్రేమకు పాత్రులవుతారు. 

ఇప్పుడు మనం సువిశేష పఠనం క్లుప్తంగా  పరిశీలిద్దాం. ఈనాటి సువిశేష పఠనం  ఒకే అంశము గురించి చర్చించిన  రెండు భాగాలుగా విభజింపబడింది. 1. ఇతరులను వ్రేలుఎత్తి  చూపడం 2.మనల్ని మనం మార్చుకోవడం. 

1. ఇతరులను వ్రేలెత్తి చూపడం : హృదయ కాఠిన్యం :- మొదటి వచనంలో చూస్తే, కొంత మంది యేసు ప్రభువు దగ్గరికి కొంత మంది వచ్చి గలీలియా విదేశీయలను చంపిన వదంతులను తెలియ చేస్తున్నారు. అప్పుడు యసు , గలిలీయా  సిలోము బురుజు కూలి  ప్రజల మరణం వారికి తెలియ చేస్తూ , హృదయ పరివర్తన  చెందనిచో అందరు అట్లే  నాశన మగుదురు అని చెప్పుచున్నారు. లూకా 13:1-5. 

అయితే ఇక్కడ పిలాతు గలీలియ దేశీయులను ఎందుకు చంపిస్తున్నాడంటే, సలోమోను  కాలంలో పిలాతు ఒక నూతన  జెరుషలేమును నిర్మించాలి అనుకున్నప్పుడు ఆ  ప్రజల దగ్గరకు వెళ్ళి వారు దేవునికి సొమ్ములో కొంత భాగం  పిలాతుకు ఇవ్వాలని వార్తనందించాడు. కానీ ప్రజలు దానికి అంగీకరించలేదు. అటువంటి సమయంలో పిలాతు తన సైనికులను వారి దగ్గరకు మారు వేషంలో పంపించి బలులు అర్పించు సమయంలో వారి మీద పడి చంపించేశాడు. 

అదే విధంగా  శిలోయములో మరణించిన ప్రజల జీవితాలలో చూస్తే  అక్కడ కాల వైపరీత్యం వల్ల అక్కడ నిర్మించినటువంటి బురుజు కూలి మరణిస్తున్నారు. అయితే మరణం  ఎప్పుడు, ఎలాగా , ఎటువంటి సమయంలో సంభవిస్తుందో తెలియదు. కాబట్టి దానికంటే ముందు మనం మార్పుచెందాలి. 

అయితే ఇక్కడ ప్రజల ఏ విధంగానైతే  గలీలియ ప్రజల మరణంను  వ్రేలెత్తి చూపకుండా, దేవుని యొక్క రాకడ కోసం సిద్దపాటు కలిగి జీవించాలి. అప్పుడే మనం  హృదయ పరి వర్తనం చెంది మారు మనస్సు పొందుతాం.  

ఆమోసు 1:3,6,9,11,13 వచనములలో మనం చూస్తే అక్కడ ప్రజలపై జాలి లేకుండా దమాస్కు , గాజా , తూరు ప్రజలు తరచూ పాపం చిసిరి కాన నేను వారిని దండించి తీరుతాను అని దేవుడు పలుకుచున్నారు. వారు ఏమి చేస్తున్నారంటే 

ఆమోదు ప్రజలు గిలాదు గర్భవతుల కడుపులు చీల్చివేశారు. ఆమోసు 1:13 

మోవాబు ప్రజలు ఏదోము రాజు ఎముకలను బుగ్గి అగునట్లు కాల్చి వేశారు. ఆమోసు 2:1-2 

యూదా ప్రజలు దేవుని ఉపదేశములను తృణీకరించారు. ఆజ్ఞలను పాటింపలేదు. ఆమోసు 2:4-5 వారి పితరులు కొలచిన దేవతలను కొలిచి అపమార్గము పట్టారు. 

యిస్రాయేలు ప్రజలు బాకీలు తీర్చలేని సజ్జనులను చెప్పుల జోడు కరీదు కూడా చేయలేని పేదలను బానిసలుగా అమ్మివేశారు. ఆమో 2:6 

ఈ ఆమోను, మోవాబు , యూద  యిస్రాయేలు ప్రజలు ఇతరులను ఎలాగైనా  నాశనం  చేయాలని పూనుకొని ఇంత ఘోర పాపానికి ఒడి గట్టారు. మరి అటువంటి వారి మీదకు నిప్పులు కురిపింతును అని పలుకుచున్నారు. వారి హృదయంలో కాఠిన్యం కారణముగానే వారు ఇంత పాపానికి ఒడి గట్టారు. 

యవేలు 2:12 లో ప్రభువు  ఇట్లనుచున్నాడు. ఇప్పుడైనను  మీరు పూర్ణ హృదయముతో  నా చెంతకు మరలిరండు మీ బట్టలు చించుకొనుట చాలదు. మీ గుండెలను వ్రయ్యలు చేసి కొనుడు అంటున్నాడు. 

కాబట్టి తపస్సు కాలంలో  నీవు నేను దేవుని చెంతకు పూర్ణ హృదయముతో వచ్చి మనం చేసిన పాపములను ఒప్పు కోవాలి అప్పుడే దేవుడు మనలను దీవిస్తాడు. 

ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో కాల విపత్తుల ద్వారా భూకంపము, రోగములు, సునామీ వర్షము , కరొన  ఎంతో మంది మరణిస్తున్నారు. ఇలా మరణించడం వారి తప్పిదముల వల్ల కాదు కానీ ఈ లోక వైపరీత్యాల వల్ల జరుగుతుంది అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇదే మొదటి భాగంలో దేవుడు అనేది. ఆట్లు చంపబడిన గలీలియ వాసులకంటే, శీలోయము బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది  తక్కిన యెరుషలేము నివాసులకంటే ఎక్కువ పాపులని, అపరాధులని ఎంచుచున్నారా?అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఇతరులను నిందించకుండా సిద్దపాటు కలిగి పాశ్చాత్తాపములో దేవుని చెంతకు తిరిగి రావాలి. 

2.  మనల్ని మనం మార్చుకోవాలి :-

ఇక్కడ రెండవ భాగంలో  అంజూరపు చెట్టు గురించి తెలియచేస్తున్నాడు. అయితే ఈ అంజూరపు చెట్టును యూదా ప్రజలకు ఉదాహరణగా తీసుకొనుచున్నాడు యేసు ప్రభువు లూకా 13:6 లో చూస్తే ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించేను అంటున్నాడు. ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును సూచిస్తుంది. దేవుడు ఈ లోకములో ఉన్నటువంటిలో కెల్ల యూదా ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకోంటున్నారు. ఎందుకంటే వారికి సురక్షితమైన జీవితాన్ని ఇవ్వడానికి.  ఈ సురక్షిత జీవితం ద్వార వారు ఎప్పుడు దేవునికి వినయ విధేయత చూపిస్తూ, పండ్లు అను మంచి పనులను వారి నుండి  ఆశించాలనుకున్నాడు. కానీ వారు ఎప్పుడు వారి స్వార్ధం కోసమే జీవిస్తూ, దేవునికి దూరంగా వెళ్ళి పోతున్నారు. ఆది కాండం 2:1 లో ఈ విధంగా ఆకాశం భూమి సమస్త వస్తువులతో సంపూర్ణంగా  రూపొందెను అని తెలుపుచున్నాడు. ఇదంతా సృష్టించిన తరువాత దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోట వేసి అందులో తాను సృజించిన నరుని ఉంచాడు. ఆదికాండం 2:8. వారు సంతోషముగా జీవించుటకు, తినుటకు  తియ్యని పండ్లనిచ్చు చెట్లను ఆ తోటలో పెరుగునట్లు చేశాడు. తరువాత నరుని సంతోషం కోసం స్త్రీని సృష్టించాడు.

 దేవుడైన  యావే వారిని సృష్టించిన తరువాత ఈ నేలపై అన్ని రకాలైన  మృగములను , పక్షులను సృజించి వాటిపై మానవునికి ఆధికారాన్ని కలుగజేశాడు. దేవుడు వారిని ఎంతో ప్రేమించి ముందుగా 1. ఈ లోకాన్ని సృష్టించి,2. సమస్త వస్తువులను రూపొందిచాడు, 3. వారు నివసించుటకు ఏదేను తోటను ఎన్నుకొన్నాడు. 4. ఆ తోటలో నరునికి నివాసం ఏర్పరిచాడు. 4. రుచికరమైన పండ్లనిచ్చాడు. 6. ఆయన సంతోషం కోసం స్త్రీని సృష్టించాడు,7. తరువాత వారికి అన్నింటిమీద ఆధికారం కల్పించాడు. 

దేవుడు ఇన్ని చేసిన కానీ దేవుడు చెప్పిన మాటకు విరుద్దముగా జీవించారు. వారిని తినవద్దని చెప్పిన పండును తిన్నారు. దీని ద్వారా వారిని ఆ తోట నుండి పంపివేస్తున్నాడు. 

మరి ఈనాడు సువిశేష పఠనంలో  దేవుడు అంజూరపు చెట్టు పై తన అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. తన తోట మాలితో ఇదిగో నేను మూడెండ్లనుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చు చున్నాను. కాని నాకు ఏమియు దొరకలేదు అంటున్నాడు. దేవుడు దేవుడు ఎన్నోసార్లు మనం మారుమనస్సు పొందాలని ఎదురుచూశాడు కానీ మనం మాత్రం  మారు మనస్సు పొందకుండా  స్వార్ధపు జీవితాన్ని దూరంగా వేదలిపోతున్నాం. యోష 1: 2 లో చూస్తే " భూమి, ఆకాశములారా! వినుడు, నేను పెంచి పెద్ద చేసిన ప్రజలే నన్ను విడనాడిరి అంటున్నాడు. దేవుడు ఎంతో బాధతో ఆకాశము, పక్షులతో  మాట్లాడుతున్నారు. తనతో ఉండటానికి మానవుణ్ణి సృష్టిస్తే మనం మాత్రం  మన స్వార్ధం కోసం చూసుకుంటున్నాం. 

తరువాత వచనంలో  దీనిని నరికి వేయుడు (లూకా 13:7  )  ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అని అంటున్నాడు. 

అప్పుడు తోటమాలి తన యజమానికి ప్రార్ధన చేస్తున్నాడు. అయ్యా !ఇంకొక యేడు ఓపిక పట్టుడు అంటున్నాడు. పాత నిబందనలో చూసినట్లయితే అబ్రహాము గారు దేవుడు సొదొము, గోమోర్ర ప్రజల పాపం పెరిగిపోయినప్పుడు దానిని నాశనం చేయపునుకొనినప్పుడు అబ్రహాము గారికి దాని గురించి వివరించాడు. ఎందుకంటే, 1. సర్వ శక్తి వంతమైన ఒక మహా జాతి ఇతని వల్ల ఏర్పడుతుంది. 2. భూమండలమందంతట సకల జాతి జనులు దీవెనలు పొందుతారు. 

మరి ఆటువంటి వ్యక్తికి దేవుడు తన ప్రణాళికను తెలియజేస్తున్నాడు. అప్పుడు అబ్రహాము ప్రభువుకి ఆరు సార్లు ప్రార్దన చేయుచున్నాడు. వారికి శిక్ష ఎలాగైనా పడకుండా చూడాలని 50 మంది నుండి 45 కు చేశాడు, 45 నుండి 40 కి చేశాడు, 40 నుండి 30 కి, 30 నుండి 20 కి , 20 నుండి 10 కి చేసి వారిని ఎలాగైనా రక్షించాలని ఎంతో ధైర్యం చేశాడు. కానీ వారి పాపం వలన వారిని అగ్ని దహించి వేసింది. 

ఈనాటి సువిశేష పఠనంలో కూడా ఇలాంటి సన్నివేశాన్ని చూస్తున్నాం. యజమానుడు అనే యావే దేవుడు, తోటమాలి అనే యేసుప్రభువుకు అంజూరపు చెట్టు అనే జనాంగాన్ని యిచ్చియున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు మరిచిపోతూ ఇష్టానుసారంగా జీవిస్తూ హృదయ పరివర్తనం చెందకుండా పశ్చత్తాపపడకుండా దేవుని నుండి దూరమైపోతున్న వారికోసం ప్రార్థన చేస్తున్నాడు లూకా 13:8; అయ్యా ఇంకొక ఏడు ఓపికపట్టుడు నేను దీని చుట్టూ పాదుచేసి, ఎరువు వేసెదను అంటున్నాడు.

పాదుచేయటం అంటే యేసుప్రభువు మూడు సంవత్సరములు తన శ్రమలు, మరణము, మరియు పునరుత్తానముల ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది అని తెలియజేసాడు.

దేవుడంటున్నాడు యెషయా 14:18 నేను మిమల్ని ఆనాధులుగా విడిచిపెట్టను. నేను మీ యొద్దకు వత్తును. మన దేవుడు ఫలభరితముగా ఉన్న మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయనకు ఎప్పుడు అంటుకట్టుకొని జీవించు బిడ్డలుగా మారుస్తాడు.నేను ద్రాక్షావల్లిని మీరు నా కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను వాని యందు ఉందును అతడు అధికముగా ఫలించును యోహాను 15:5.

ఎరువు వేయటం :-    

యేసుప్రభువు తన జీవితం ద్వారా మనకు దృఢతవాన్ని కలుగచేస్తునాడు. ఇది ఎలాంటి ఎరువు అంటే ప్రార్ధన అనే ఎరువు, ఉపవాసం అనే ఎరువు, ధన రుణ అనే ఎరువు, క్షమాపణ అనే ఎరువు, వినయం అనే ఎరువు, విశ్వాసం అనే ఎరువు.

ఇలాంటి ఎరువుల ద్వారా దేవుడు మనలో హృదయ పరివర్తన కలిగించి మనలను ఫలవంతముగా చేస్తుంటాడు. ఇలా ఫలవంతంగా మారిన మనము ఇతరులకు ఆహారముగా మారుతుంటాము. దీని ద్వారా ఇతరులకు మంచికార్యాలు  చేస్తూ దేవునికి సాక్షులుగా జీవిస్తుంటాం. ముందు చూపినట్లుగా కపట ప్రవర్తనను మార్చుకొని జాగరూకులై ఉంటూ ఈలోక సంబంధమైన వ్యక్తులకు, వస్తువులకు భయపడకుండా ఎన్నో శ్రమలు అనుభవించినాకూడా సిద్ధపాటు జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవునికి బహిరంగ సాక్షులుగా జీవిద్దాం. ఆలా జీవించనిచో ఈ అంజూరపు చెట్టును ఏవిధంగానైతే ఫలించకపోతే కొట్టి పారవేస్తారో మన జీవితంకూడా అదేవిధంగా జరుగుతుంది.ఈ నాటి రెండొవ పఠనంలో కూడా పునీత పౌలుగారు అదే బోధిస్తున్నారు.

రెండవ పఠనము :-1 కొరింతు 10 : 1-6 , 10 - 12

మన పూర్వులు మేఘముక్రింద ఉండినపుడు వారు సముద్రమును దాటి సురక్షితముగా అవతలకి చేరారు కానీ  వారు ఎప్పుడైతే దేవునిమీద సణుగుకొని దేవునికి విరుద్ధముగా జీవించారో  విగ్రహములను ఆరాదించారో, వ్యభిచరించారో అప్పుడు 25 వేలు మంది మరణించారు. పాము కాటుతో ఎంతోమంది మరణించారు కాబట్టి ఈ చిట్టచివరి రోజులలో తపస్సు కాల రోజులలో ప్రార్ధన, ఉపవాసం, దాన ధర్మ క్రియలను పాటించు రోజులలో మనం దేవునితో, దేవుని సన్నిధిలో మనం మన నివాసాన్ని దేవునితో ఏర్పరుచుకొని, ఆయనకు వినయ, విధేయతను చూపిస్తూ జాగ్రత్తగా అయన యొక్క రక్షణ ప్రణాలికను మన సాక్షపు జీవితం ద్వారా తెలియజేయాలి అప్పుడే మన జీవితం ఫలవంతమవుతుంది.



బ్రదర్ . జోసెఫ్  మారియో ఓ.సి.డి.

12, మార్చి 2022, శనివారం

తపస్సు కాలం 2 వ ఆదివారం

తపస్సు కాలం 2 వ ఆదివారం

ఆది 15: 5-12, 17-18,  ఫిలిప్పి 3: 17,4: 1 , లూకా 9: 28-36.

-ఈ నాటి దివ్య పఠనాలు మన యొక్క రూపాంతరం గురించి భోదిస్తున్నాయి.
-మనం దేవునితో జీవించే సమయంలో మన యొక్క జీవితాలు కొంచెమైనా మారాలి. ఈ తపస్సు కాలం రెండవ వారంలో తల్లి శ్రీ సభ రూపాంతరం చెందమని కోరుతుంది.
-మన యొక్క ఉపవాస, ప్రార్థన, ధాన ధర్మాలు చేస్తూ మన జీవితాలు మార్చుకొంటూ దేవునికి దగ్గరై జీవించాలి.
-ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా తమ జీవితంలో మార్పును కోరుకుంటారు, కావాలనుకుంటారు.
-మనయొక్క జీవితాలు రూపాంతరం చెందాలంటే మనలో దైవాను గ్రహం ఉండాలి. దైవాను గ్రహం మనలోకి రావాలంటే మనం దేవుడ్ని విశ్వసించాలి. దేవుడ్ని వెంబడించి జీవించాలి. అదే విధంగా పవిత్రాత్మ దేవునికి మనం సహకరించుకొని జీవిస్తే మన జీవితాలు నిజంగా రూపాంతరం చెందుతాయి.

-ఈ నలభై రోజులు ధీక్షాకాలా సమయంలో మనం కూడా ఏదో ఒక విధంగా రూపాంతరం చెందాలి. బహుశా ప్రార్థించుటలోనో, విశ్వసించుటలోనో, చదువుటలోనో, బాధ్యత కలిగి జీవించుటలోనో ఏదో ఒక విధంగా మనం మారాలి.
-గొంగళి పురుగు గూడులో ఉండి కొన్నిరోజుల తరువాత సీతాకోక చిలుక అయినా విధంగా విశ్వాసులుకూడా రూపాంతరం చెందితే దేవుడు ఆనందిస్తారు.

ఈ నాటి మొదటి పఠనంలో దేవుడు అబ్రామును, అబ్రహాముగా మార్చుటను అదేవిధంగా అబ్రహాముతో చేసుకొన్న మొదటి ఒడంబడికను గురించి భోదిస్తుంది.
-దేవుడు ఎప్పుడు కూడా ప్రజలకు చేరువలోనే ఉంటారు. మానవుడు దేవుడ్ని విస్మరించి తప్పు చేసినప్పటికీ మళ్లీ మానవులతో సంబంధం కలిగి ఉండుటకు వారితో ఒడంబడికను చేసుకొంటున్నారు.

-అబ్రహాము కు దేవుడు ప్రత్యక్షమై తనకు సంతానం కలుగుతుందని చెప్పుచున్నారు.
-అబ్రహామునకు వయస్సు మల్లినది ముసలి ప్రాయంలో వున్నారు. అతని భార్య కూడా గొడ్రాలుగ ఉన్నారు. ఎన్నో సంవత్సరములు సంతానం కోసం ఎదురు చూశారు. కానీ ఫలితం దక్కలేదు.
-యావే దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చి నీకు ఆకాశమునందలి నక్షత్రములవలె, సముద్ర తీరమునందలి ఇసుకరేణువులవలె సంతానం కలిగి వృద్ధి చెందుతావు అని వాగ్దానం చేస్తున్నారు.
-ఆయన యొక్క జీవితాన్ని వృద్ధి చెందిస్తానని, వారికి కానాను దేశమును ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు.

-అబ్రహాము వాస్తవానికి అన్యుడు అయినప్పటికీ యావే దేవుని యొక్క మాటలు విశ్వసించారు. ఎటువంటి అనుభవం లేనప్పటికిని, అసంభవంగా ఉన్నప్పటికినీ అబ్రహాము  దేవుడ్ని నమ్ముచున్నారు.  
-అబ్రహాము దేవుని యొక్క మాటలను పూర్తిగా విశ్వసించారు అందుకే ఆయనను విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాం. ఆయన విశ్వాసమును బట్టియే నీటి మంతుడుగా పరిగణించ బడుతున్నారు .
-దేవుడు అబ్రహం తో చేసుకొన్న ఒడంబడిక బలమైనది అని తెలుపుటకు కొన్ని జంతువులను నడిమికి కోస్తున్నారు, వాటిని ప్రక్క ప్రక్కన పెడుతున్నారు. 

-ఆ కాలపు నియమాల ప్రకారం ఒప్పందం చేసుకొనేవారు నరకబడిన జంతువులమధ్య నడుస్తారు. అలా ఎందుకు చేసేవారంటే ఒక వేళా ఎవరైనా ఒప్పందం కు అవిధేయులై, మరిచి పోయి జీవిస్తే వారికి కూడా అలంటి దుస్థితి వస్తుందని వారియొక్క ఆచార నమ్మకం.
-ఇదే సాంగ్యం యొక్క విధానం యిర్మీయా 34: 18 - 19 లో కూడ చదువుతున్నాం.
-దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, ఒడంబడికను బలపరచడానికి ఆ మామాసపు ఖండలు నిప్పుతో కదిల్చారు. ఆ యొక్క నిప్పు దేవుని యొక్క సాన్నిధ్యంకు గుర్తు.
-ఈ మొదటి పఠనంద్వారా అబ్రహాం దేవుడి మీద ఉన్న గొప్ప నమ్మకమును వెల్లడిచేస్తున్నారు. ఆది 15 : 6 .

-ఈ యొక్క ఒడంబడిక ద్వారా దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చుతున్నారు.  పేరు మార్చుట ద్వారా అబ్రహాము దేవునితో ఒక క్రొత్త జీవితమును ప్రారంభిస్తున్నారు.
-అబ్రహాము దేవునియొక్క సాన్నిధ్యమును కనులార అగ్నిరూపంలో చూడగలుగుతున్నాడు. దేవుని యొక్క అనుభూతిని తన జీవితంలో పొందుకుంటున్నారు.

- మన యొక్క విశ్వాస జీవితంలో కూడ మనం దేవుడ్ని విశ్వసించాలి అబ్రహాము వలె దేవునితో క్రొత్త జీవితం ప్రారంభించాలి, దేవునితో చేసుకొన్న ఒడంబడిక ప్రకారం జీవించాలి.
-అబ్రహాము కూడ దేవుని యొక్క కార్యం ఎలాగ జరుగునని ఒక వివరణ అడుగుచున్నారు. అబ్రహాము వలె మరియ తల్లి కూడ దేవుని యొక్క జన్మం గురించి ఎట్లా జరుగును అని అడిగారు. వీరిద్దరియొక్క ఆలోచనలకు తగిన విధంగా దేవుడు వారికి అంతా విశిదీకరిస్తున్నారు. ఇద్దరుకూడా దేవుడ్ని సంపూర్ణంగా నమ్మినవారే.

-ఈనాటి రెండవ పఠనంలో పునీత పౌలు గారు మనందరం పరలోక పౌరులమని గుర్తు చేస్తున్నారు. 
-భూలోక సంభందమైన విషయాల గురించి కాకుండా పరలోక సంభందమైన విషయాలు ఆలోచిస్తూ వాటి ప్రకారం జీవిస్తే మర్త్య శరీరములైన మన శరీరములను దేవుడు దివ్య శరీరం లుగా మార్చుతానని పౌలు గారు బోధిస్తున్నారు.
-మన యొక్క మర్త్య శరీరంలు వాటంతట అవే దివ్య శరీరములుగా మారవు పవిత్రాత్మ శక్తితోనే అది సాధ్యమవుతుంది.
-మన యొక్క శరీరాలు దివ్య శరీరాలుగా మార్చ బడాలంటే మనం శరీరం కు తగిన విధంగా కాకుండా ఆత్మకు తగిన విధంగా నడుచుకోవాలి. శారీరక వాంఛలకు దాసులు కాకూడదు అందుకు మనం పవిత్రాత్మ సహవాసం లో జీవించాలి. 

-జ్ఞానస్నానం ద్వారా మనం పవిత్రతను పొందాము ఇంకా పరిపూర్ణం గా పవిత్రులు కావాలంటే అనుదినం ప్రయత్నిఇంచాలి.
-పౌలు గారు అనేక మార్లు విశ్వాసులకు తెలియ చేస్తున్నారు. శరీరాను సారంగా కాకుండా ఆత్మను సారంగా జీవించమని .రోమి 8 : 5 -13 , గలతి 5 : 16 .

మన యొక్క జీవితంలో ఆత్మను సారంగా జీవిస్తే దేవున్ని సంతృప్తి పరచవచ్చు. పరలోక పౌరులు పరలోక ఆలోచనలు కలిగి జీవించాలి.
-మనం పరలోక పౌరులం అని మరిచి పోతున్నాం. ఈ లోకంలో ఉన్నప్పటికీ మనం దేవుని యొక్క వాకు అనుసారంగా జీవించటానికి ప్రయత్నఇంచాలి. 
-ఇహలోక దేహ వాంఛలకు లోనైనా వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు.
-ఆదాము అవ్వ తమ యొక్క దేహ వాంఛలను తృప్తి పరుచుకొన్నారు (తినవద్దన్న పండు తిన్నారు). పరలోకం గురించి మరిచి పోయారు. దేవుడిని సంతృప్తి పరచలేదు.
-లోభియెక్క ఉపమానంలో లూకా 12 :13 -21. ఈలోకమే శాశ్వతం అని భావించి తన ఆత్మతో తాను మాట్లాడుతూ తినుము త్రాగుము అని చెప్పుకొంటున్నారు. ఈ లోకం కన్నా పరలోకం విలువైనది అని మరిచిపోతున్నాడు. 
 
-మనం కూడ ఈ లోకంలో పేరు ప్రతిష్ఠలకోసం, ఆస్తిపాస్తుల కోసం కొట్టు మిట్టాడుతున్నాం, కానీ పరలోక పౌరులం కాబట్టి పరలోకంలో ప్రవేశించాలంటే పుణ్య కార్యాలు చేయాలనే అంశం మరిచిపోతున్నాం.

-దేవుని బిడ్డలుగా పవిత్రులుగా, పరలోకం పౌరులుగా మారాలంటే యేసు ప్రభువు చూపిన ఆ నీతి మార్గంలో మనందరం నడవాలి.
-మానవ శక్తితో ప్రయత్నిస్తే మనం చాల సార్లు శరీరమునే సంతృప్తి పరుస్తాం. కాబట్టి దేవుని యొక్క శక్తితో నడిచి పరలోకానికి వెళదాం.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువుయొక్క రూపాంతరం చెందుటను మనం చదువుకున్నాం. 
-యేసుప్రభువు యొక్క దివ్య రూప ధారణ వలన తండ్రి దేవుడు యేసుప్రభువు తన యొక్క ప్రియమైన కుమారుడని తెలుపుచున్నారు. ఆయన యొక్క దైవత్వం ప్రకటిస్తున్నారు.
-దివ్య బలిపూజలో గోధుమ అప్పం, ద్రాక్షా రసము యేసుప్రభువు యొక్క శరీర రక్తలుగా రూపాంతరం చెందుతున్నాయి.

-జ్ఞానస్నాన దివ్య సంస్కారం మనల్ని దేవునియొక్క పుత్రులుగా రూపాంతరం చెందిస్తుంది.
-పాప సంకీర్తనం ద్వారా పాపి పవిత్రుడయ్యెలా చేస్తుంది, వ్యక్తి మార్పు చెందుతున్నారు. వారి జీవితం మరి గొప్పవారిగా చేయబడుతున్నారు.
-దేవుడిని కలుసుకున్న సమయాలలో ప్రతి ఒక్కరి జీవితం రూపాంతరం చెందుతుంది.

మోషే జీవితం రూపాంతరం చెందుతుంది.
సౌలు జీవితం
పేతురు యొక్క జీవితం
మగ్దలా మరియమ్మ జీవితం.
-ఇంకా చాలామంది యొక్క జీవితాలు మారుతున్నాయి.

-మన జీవితంలో కూడ యేసు ప్రభువు వలె పర్వత అనుభూతి కావాలి.
-తూర్పు దేశంలో ఆధ్యాత్మికత లో ఒక ప్రత్యేక స్థానం ఉంది.
-దేవునితో గడపటానికి, దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించటానికి అదేవిధంగా దేవునితో ఆత్మీయ అనుభూతిని పొందడానికి ఎత్తైన పర్వతాలు సరైన ప్రాంతం అని కొందరి యొక్క విశ్వాసం, నమ్మిక అందుకే పర్వతాల మీదకు వెళుతుంటారు. 
-దేవుడు ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడని కొందరి యొక్క నమ్మకం. కొన్ని శతాబ్దాలుగా ఈ నమ్మకం కొనసాగుతూనే ఉంది చాల మంది విశ్వాసులు దీనిని అనుసరిస్తున్నారు. కొండను ఎక్కి వెళ్ళటం ద్వారా దేవునికి మరింత దగ్గర అవుతామని కూడ కొంతమంది భావించేవారు. 
-పర్వతం పైన వున్న చల్లని వాతావరణం, గాలి, ప్రశాంతత కూడ దేవుడిని కలుసుకొనుటకు ఉపయోగపడును.

-పవిత్ర గ్రంధంలో కొన్ని సంఘటనలున్నాయి. దేవుడు మనుషులను కొన్న సమ్యలు.
మోరియా పర్వతం వద్ద అబ్రహాము దేవుడిని కలుసుకున్నారు.(ఆది 22 :11 -12 ).
సీనాయి పర్వతం పైన మోషే దేవుడిని కలుసుకున్నారు (నిర్గమ 24 :12 -18).
కార్మెల్ కొండమీద ఏలీయా దేవుడిని కలుసుకున్నారు (1 రాజులు 18: 31 -41).
తాబోరు కొండమీద శిష్యులు దేవుడిని కలుసుకున్నారు.
కల్వరి కొండమీద యేసు ప్రభువు నిజమైన దేవుడని సైనికుడు గ్రహిస్తూ ఆయన్ను కలుసుకున్నారు. 
-యేసు ప్రభువు యొక్క మరణం తరువాత కూడ శిష్యులు పర్వతం వద్దకు వెళ్లారు అని కొందరి నమ్మకం. 

మనం చుసిన అన్ని ఉదాహరణాలలో అందరూ పర్వతం ఎక్కిన తరువాతనే దేవుడు వారిని కలుసుకుంటున్నారు. 
-మనయొక్క విశ్వాస జీవితంలో కూడ 
పవిత్రత అనే పర్వతం ఎక్కాలి.
మంచితనం అనే పర్వతం ఎక్కాలి.
స్వార్థం విడిచి ముందుకు సాగాలి.
ప్రేమని అలవర్చుకుని పర్వతం ఎక్కాలి. 
శోధనలు అనే పర్వతం ఎక్కాలి. 
శ్రమలు అనే పర్వతం ఎక్కాలి.

-ఎప్పుడైతే మనం ఇహలోక కోరికలు, శోధనలు అధిగమించి మంచిగా ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క మాట ప్రకారం ఆయనకు విధేయత చూపుతూ ఆయనయొక్క ఆజ్ఞలు పాటిస్తామో అప్పుడు మనకు దేవుని దర్శనం, అనుభూతి కలుగుతుంది. ప్రయత్నం చేసినవారందరు పర్వతం ఎక్కలేరు కేవలం కష్టపడి, అన్ని ఇబ్బందులను అలసటలను ఎదుర్కొని వెళ్లే వారే  ఎక్కగలరు. 
-పర్వతం ఎక్కే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, కష్టపడాలి, అలిసిపోతాం, అయినా సరే ముందుకు వెళితే దైవ అనుభూతి కలుగుతుంది. మనయొక్క విశ్వాస జీవితంలో కూడ దైవ అనుభూతి కావాలంటే ఆధ్యాత్మికంగా మనం కష్టపడాలి. ఈలోక ఆశలు విడిచి పెట్టడానికి కష్టపడాలి, శోధనలలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి . అప్పుడే మనం దేవుడిని కలుసుకొనగలం.

-యేసు ప్రభువు తాబోరు పర్వతం ఎక్కినది తండ్రిని కలుసుకొనుటకు తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుటకు కావల్సిన శక్తిని, ధైర్యం ను పొందుటకు అలాగే తండ్రి యొక్క సమ్మతి తీసుకొనుటకు ఆయన పర్వతం మీదకు వెళ్లుచున్నారు.

-వ్యక్తిగతంగా తనను తాను సిద్ధం చేసుకొనుటకు, ప్రార్థించుటకు ప్రభువు పర్వతం మీదకు వెళ్లారు.
-తపస్సుకాల మొదటి ఆదివారంలో యేసుప్రభువు మానవ స్వభావంలో ఎదుర్కొన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రెండవ వారంలో యేసుప్రభువు యొక్క దైవత్వంను ధ్యానించుకోవాలి.  ఆయన నిజముగా దేవుని కుమారుడని తెలుసుకోవాలి.

-ప్రభువు శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నారా. ఆయనయే వారు ఊహించే మెస్సయ్య అని ఎరుక పరుచుచున్నారు. యేసు ప్రభువు పేతురు, యోహాను, యాకోబులను ఎందుకు పర్వతంకు తీసుకొని వెళుతున్నారంటే ఇద్దరు లేక ముగ్గురు చెప్పే సాక్ష్యం నిజమవుతుందని. (ద్వితీ 19 : 15 ) అంటే ఒక విషయాన్ని నిరూపించాలంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షులవసరం . అందుకే ప్రభువు ముగ్గురిని తీసుకొని వెళుతున్నారు. ఆయన యొక్క దివ్య రూప ధారణకు వారే సాక్ష్యులు.

-యేసు ప్రభువు ప్రార్థించే సమయంలో రూపాంతరం చెందుతున్నారు. మనయొక్క జీవితాలు కూడ ప్రార్థనలో రూపాంతరం చెందాలి.
-ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆనాటి యూదులు యొక్క నమ్మకం అలాగే పౌలు గారి యొక్క భోదన ఏమిటంటే నీతిమంతులు యొక్క శరీరాలు దివ్య శరీరములుగా మారె అవకాశం ఉందని తెలుపుచున్నారు. (1 కొరింతి 15 :49 , 2 కొరింతి 5 : 1 -10 ).

-నీతిమంతులు దేవుని యొక్క మహిమను పంచుకొంటారు. మోషే 40 రోజులు దేవునితో గడిపిన తరువాత ఆయన మహిమను పంచుకొంటున్నారు. (నిర్గమ 34 )
-మనం కూడ నీతిమంతులుగా జీవించాలి, అదియే దేవుడు మన నుండి కోరుకుంటారు.
-యేసుప్రభువు వస్త్రాలు తెల్లగా వున్నాయి. అవి ఆయన యొక్క పవిత్రతకు గుర్తు కాబట్టి.
-మోషే, ఏలీయాలకు కూడ పర్వతం మీద దేవుని యొక్క అనుభూతి కలిగినది అందుకే వారిద్దరూ అక్కడ దర్శనంలో కనిపించారు. 

-మండుచున్న పొదలో దేవుడు మోషేకు దర్శనం ఇచ్చారు, నిర్గమ 3: 1 -4.
-సీనాయి పర్వతం మీద దేవునితో గడిపారు. దేవునితో ఉన్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది.(నిర్గమ 24 :1 , 34 : 29 ).
-ఏలీయా హోరేబు కొండవద్ద కలుసుకున్నారు (1 రాజు 19: 9 -18).
-మోషే అలాగే ఏలీయాలు ఇద్దరు గొప్ప ప్రవక్తలు ఎందుకంటే మోషే దేవుని వల్ల వారికి ధర్మ శాస్త్రమును ఇచ్చారు. ఏలీయా ప్రవక్తలందరికి నాయకుడు వంటివారు అందుకే యేసు ప్రభువు యొక్క సిలువ శ్రమలు పొందటానికి సరైన సమయం అని తెలియచేయుటకు ఇద్దరు కనబడుచున్నారు.

-ఈ దర్శనంలో తండ్రి దేవుడు ఇతడు నా ప్రియమైన కుమారుడు ఇతడిని ఆలకించండి అని పలుకుచున్నారు.
-ఆయన స్వరమును ఆలకించి జీవిస్తే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఆయన మాటలు వినక పొతే మన జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు.
-పవిత్ర గ్రంధంలో కొంతమంది దేవుని స్వరం విన్నారు. కొందరు వినలేదు, వారికి చివరి ఫలితం ఎలావుంటుందో కూడ మనకు తెలుసు కాబట్టి ఆయన మాటలు వినాలి.

-మనయొక్క జీవితంలో మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం దినమూ రూపాంతరం చెందాలి. ఈ తపస్సు కాలంలో మన జీవితాలు దేవునికి ఇష్టమైన విధంగా మారాలి. 
మనం మన యొక్క పాపపు జీవితం నుండి రూపాంతరం చెందాలి 
స్వార్థంనుండి, నిస్వార్థిగా రూపాంతరం చెందాలి.
లోక వ్యామోహాలనుండి దేవుని వైపుకు రూపాంతరం చెందాలి. 
అధికార వాంఛలనుండి, సేవా భావమునకు రూపాంతరం చెందాలి.
అసూయా, ద్వేషం నుండి ప్రేమించుటకు రూపాంతరం చెందాలి.
ప్రార్థించుటలో, ప్రేమించుటలో రూపాంతరం చెందాలి.
-దేవుని యొక్క అనుగ్రహం తో రూపాంతరం చెంది దేవునికి మనయొక్క తల్లిదండ్రులకు సంతోషమును ఇద్దాం.

REV. FR. BALA YESU OCD

తపస్సు కాల రెండవ ఆదివారము

తపస్సు కాల రెండవ ఆదివారము

ఆది 15 : 5 -12 , 17 -18, ఫిలిపీ త్రీ:17 - 4 :1,  లూకా 9 :28 -36.

క్రీస్తునాదునియందు ప్రియ దేవుని బిడ్డలారా  ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి అని తెలియచేస్తున్నాయి. తల్లి  శ్రీ సభ మనలనందరిని కూడా ప్రార్థన శక్తి ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించాలని   ఆహ్వానిస్తున్నాయి.

మొదటి పఠనంలో  విశ్వాసమున   తండ్రి  అయిన అబ్రాహామును రెండు విషయాలలో తన మాట మీద గురి ఉంచమని దేవుడు కోరుతున్నాడు.1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు 2) అబ్రాహాము సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని దేవుడు అబ్రాహామును వాగ్దానం చేస్తున్నాడు 

1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు:  దీనికి అబ్రాహాము, ప్రభు నువ్వు నాకు ఏమి ఈయగలవు నేను బిడ్డలు లేని వాడిని, నీవు నాకు సంతానం కలిగించలేదు అంటున్నాడు.ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహాము తనను తాను అనుమానించుకుంటున్నాడు, నేను ముసలివాడను నాకు సంతాన ప్రాప్తి లేదు అని అపనమ్మకం అబ్రాహాము వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహామును దేవుడు కల్దియా దేశం నుండి పిలిచి తనను ఒక గొప్ప మహాజాతిగా తీర్చిదిద్దుతాను, నిన్ను దీవించేవారిని దివిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను,  నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దివిస్తాను అని వాగ్దానం చేసిన మాటలను మరచిపోయి కూడా అబ్రహాము దేవుని మీద  ఈ విధంగా పలికియున్నాడు.

 అప్పుడు దేవుడు అబ్రాహాముతో నీకు పుట్టినవాడే నీకు వారసుడవుతాడు అతడి సంతానం నక్షత్రములవలె అవుతుందని చెప్పినపుడు అబ్రాహాము నమ్మాడు, ఆయన  నమ్మకాన్ని బట్టి దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా చేసాడు. 

2) దేవుడు అతని సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని వాగ్దానం చేయుట:

       దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం, అబ్రాహాము దేవుడు తన యొక్క సంతతికి ఇస్తానన్న భూమిని తండ్రి దేవుడు మాట తప్పకుండా ఇస్తాను అని మాటిచ్చి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత, అబ్రాహాము దేవుని యెక్క మాటను విశ్వసముతో నమ్మాడు. విశ్వస ఒప్పందాన్ని 15వ అద్యాయములో చూస్తున్నాము.  దేవునిపై నమ్మకము ఉంచితే మనకు కావలిసినదంత దేవుడు మనకు ఇస్తాడని, మొదటి పఠనము మనకు తెలియజేస్తుంది.


3) సువిశేష పఠనము

   ఈ యొక్క పఠనంలో   క్రీస్తు యొక్క దివ్యరూపం దాల్చడం, క్రీస్తు యొక్క వస్త్రములు తెల్లగా ప్రకాశించడం మరియు ఆయనతో పాటు మరో ఇద్దరు దివ్య వ్యక్తులు మోషే మరియు ఏలీయా కనబడ్డారు అన్న విషయాన్ని  తెలియపరచటం మనము చూస్తున్నాము. ఈ యొక్క  ముగ్గురు వ్యక్తులుకూడా

1) మోషే: మంచి నాయకుడు పుణ్యాత్ముడు, దేవుని యొక్క ముఖాన్ని ముఖ్య ముఖీగా చూసినవాడు, అంతే కాకుండా దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి వాగ్దాన భూమివైపు నడిపించటం కూడా చూస్తున్నాము.

2) ఏలీయా: ఏలీయా అంటేనే ఒక గొప్ప మహాశక్తి పేరు పొందిన వాడు, దేవునితో  సంబాషించిన వ్యక్తి, ఏలీయా, బాలు ప్రవక్తలను మట్టు పెట్టి దేవుని యొక్క   కీర్తిని అందరికి పరిచయం చేసినవాడు. ఈయన అనేక అద్భుత కార్యములను, మనము రాజుల రెండవ గ్రంధములో చూస్తున్నాము. ఈయన  మరణించకుండానే పరలోకమునకు కొనిపోబడినట్లు మనం రాజుల రెండవ గ్రంధంలో చూస్తున్నాము.

దేవుని ధర్మ శాస్త్ర  చట్టాల ప్రతినిధిగా మోషేను, ప్రవచనాల ప్రతినిధిగా ఏలీయాను  ఉన్న వారి ముందు  క్రీస్తు దివ్యరూపం ధరిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా క్రీస్తు పొందబోయేటటువంటి  శ్రమలను , కష్టాలను మరియు బాధలను సిలువ మరణము గురించి క్రీస్తుతో సంభాషించటం చూస్తున్నాము.

 వీటినన్నిటిని గ్రహించినటువంటి పేతురు క్రీస్తు దగ్గరకు వచ్చి మనము ఇక్కడ ఉండుట సమంజసము  అందుకని మీకు, మోషే మరియు ఏలీయాకు గుడారములను నిర్మిస్తాం అని పేతురు క్రీస్తు ప్రభువుతో పలుకుచున్నాడు. ఇది ఇలా ఉండగా ఆకాశము నుండి తండ్రి దేవుడు ఈయన నా కుమారుడు ఈయనను చూచి  నేను ఆనందించుచున్నాను,  ఈయనను ఆలకించండి అని దేవుడు మనల్ని ఆదేశిస్తునాడు, అంటే క్రీస్తు చెప్పిన ప్రతిమాటను కూడా పాటిస్తూ, అనుసరిస్తూ, జీవించాలని తండ్రి దేవుడు మననందరికి తెలియజేస్తున్నాడు.

కాబట్టి ప్రియాయమైన క్రైస్తవ విశ్వాసులారా ఈ నాటి పఠనాలు అన్ని కూడా మానవులమైన మనం, ఎటువంటి స్థితిలో ఉన్నాకూడా క్రీస్తు యొక్క మార్గములో పయనిస్తూ, క్రీస్తుయొక్క అనుచరులుగా జీవించాలని మరియు దేవుడు  మనందరిని కూడా అయొక్క బాటలో నడపాలని , ఆశీర్వదించాలని ఈ నాటి దివ్యబలి పూజలో పాల్గొందము.

Br.Simon


మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...