25, జూన్ 2022, శనివారం

సామాన్య కాలపు 13 వ ఆదివారము

   సామాన్య కాలపు 13 వ ఆదివారము

 రాజులు 19: 16, 19-21, గలతీ 5: 1, 13-18, లూకా 9: 51-62

స్వేచ్చా  జీవితానికి పిలుపు
క్రీస్తు నాదునియందు ప్రియ స్నేహితులారా! ఈనాడు తల్లి తిరుసభ మనలను అందరినికూడా సామాన్య కాలపు 13 వ ఆదివారములోనికి ఆహ్వానిస్తుంది.  

ఈ నాటి మూడు గ్రంథపఠనాల ద్వారా తల్లి తిరుసభ మనందరినీ స్వతంత్రులుగా జీవించుటకై పిలుపునిస్తుంది”.
ఈ నాటి మూడు పఠణాలను మనం మూడు ప్రశ్నల రూపంలో ధ్యానించవచ్చు.  

1. దేవుడు ఎవరిని పిలుస్తున్నారు లేదా ఎవరిని ఎన్నుకుంటున్నారు?
2. దేవుడు ఎందుకు పిలుస్తున్నారు / ఎందుకు దేవుని ఎన్నిక?

3. దేవుని పిలుపును స్వీకరించిన వారు ఏ లక్షణాలు కలిగి ఉండాలి?
ఈ నాటి మూడు పఠనాలను మనం ధ్యానించినట్లైతే, దైవ సేవకులకు కావలసింది సంపూర్ణ జీవిత సమర్పణ, లేదా ఈ లోకాన్ని పూర్తిగా త్యజించాలనే సారాంశం మనకు అర్థమవుతుంది.

1. దేవుడు ఎవరిని పిలుస్తున్నారు లేదా ఎవరిని ఎన్నుకుంటున్నారు?
దేవుని పిలుపు ఎవరికి, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరు గ్రహించలేరు. దేవుని పిలుపు వివిధ రకాలుగా ఉంటుందని మనము ఎఫెసి 4: 11 -13 వచనాలలో చూస్తున్నాం.

దేవుని పిలుపు గురువులకు, గురుజీవితాన్ని అభ్యసించేవారికి, కన్యాస్త్రీలకు, ఉపదేసులకు, మాత్రమే కాదు. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తులో భాగమైన మనకందరికి కూడా, దేవుని సేవలో భాగము ఉంది, లేదా మనందరమూ పాత్రులము.
దేవుని సేవ చేయుటకు, అందరు అర్హులే. కొందరు ఉపాధ్యాయులుగా, మరికొందరు కుటుంభంలో తల్లిదండ్రులుగా, సంఘపెద్దలుగా, మరికొందరిని దేశ పాలకులుగా, రాష్ట్ర పాలకులుగా, వారి జీవితాలు దేవునిచే నిర్ణయించబడి ఉంటాయి. ఆయా బాధ్యతలకు అనుగుణంగా జీవించడమే మనము చేస్తున్నటువంటి దేవుని సేవ అని మనం గ్రహించాలి.

మొదటి పఠనంలో చూసినట్లయితే
దేవుడు ఏలీయా ప్రవక్త ద్వారా ఎలీషా ప్రవక్తను దైవ సేవకునిగా పిలుస్తున్నారు. ఆబేల్మేహోలా నివాసియగు షాఫాతు కుమారుడు ఈ ఎలీషాఅతనిని ప్రవక్తగ నియమిస్తున్నారు.
మరి ఏలియా ప్రవక్త ఎలీషా దగ్గరకు వచ్చి తన అంగీని తీసి ఎలీషా పై కప్పెను. అంగీ ధరించడం అంటే ఒక సేవకు గుర్తు. ఇలాంటి సన్నివేషాన్ని మనము క్రీస్తు ప్రభువు జీవితంలో కూడా చూస్తున్నాం. యోహాను 13: 4 - 6 వచనాలలో చూస్తే క్రీస్తు ప్రభువు తన నడుముకి తుండు గుడ్డ కట్టుకొని శిష్యుల పాదాలు కడిగి వారికి సేవ చేస్తూ, మీరును ఒకరినొకరు ప్రేమించండి, సేవ చేయండి అని ఆజ్ఞాపిస్తున్నారు.

అలాగే ఈనాటి మొదటి పఠనంలో ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త మీద తన అంగీని కప్పినవెంటనే ఎలీషా ప్రవక్త, తన ఎద్దులను వధించి, అరకని వంట చెరుకుగ వాడి, మాంసమును వండి తన శిష్యులకు వడ్డించి, వారికి సేవచేశాడు. ఏలియా ప్రవక్తను అనుసరించాడు.
 నాటి సువిశేష పఠనంలో మనం శిష్యుల యొక్క లక్షణాలు ఏవిధంగా ఉండాలి అని చూస్తున్నాం.

ఒకడు యేసును వెంబడించుటకు తన వెంట వస్తాను అని అన్నాడు, యేసు చెంత ఏమీలేవు, తాను ఉండుటకు స్థలము కూడ లేదు అని సమాధానం చెప్పగనే, నిరాశ చెంది ఉండవచ్చు.
మరియొకరిని యేసు ప్రభువు పిలిచారు, "నన్ను అనుసరించు" అని అన్నారు. కానీ అతడు తన తండ్రి చనిపోయిన తరువాత, దేహాన్ని సమాధి చేసి వస్తానంటున్నాడు.

మరియొకడు నేను మిమ్ము అనుసరిస్తాను, కానీ ముందు నా కుటుంబంలోని వారికి చెప్పివస్తాను అంటున్నాడు.
వీరి ముగ్గురికి సమాధానముగా, యేసు వారితో "దేవుని రాజ్యాన్ని ప్రకటించండి". అంటే మొదట దేవుని రాజ్యానికి ప్రాముఖ్యతను ఇవ్వండి అంటున్నారు. కుటుంబాలు ఉన్నాయి, లేదా సొంత పనులు ఉన్నాయి, అని వెనుతిరగ కూడదు.

2. దేవుడు ఎందుకు పిలుస్తున్నారు / ఎందుకు దేవుని ఎన్నిక?
దేవుని పిలుపునకు అనుసరించి వెనుతిరగడం "నాగటి మీద చేయిపెట్టి వెనుకకు చూచువాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాదుఅంటున్నారు. బంధాలకు బానిసలు కావద్దు అంటున్నారు.

ఎందు కంటే స్వార్థంతో మన సొంత కుటుంబాలకోసమే మనము జీవించకూడదు. క్రీస్తు ప్రభువు తెలియని ప్రజలు, జీవితాలలో నిరాశకు లోనైన వారు, గ్రుడ్డివారు, కుంటివారు, విధవరాండ్రు, పేదవారు, నిస్సహాయులు, ఈలోకంలో, మన దేశంలో, రాష్ట్రంలో, మన సమాజంలో, చాల మంది ఉన్నారు. వారిని మనకుటుంబంలో ఒకరిగా, చూసుకోవాలి. వారిని ప్రేమించాలి, క్రీస్తు ప్రభువు వారికి నిత్య జీవితాన్ని దయచేస్తాడన్న ఆశ వారికి కలుగ చేయాలి, క్రీస్తు ప్రభువే మనకు సంపూర్ణ జీవాన్ని ఇచ్చే దేవుడు, ఆయనయే నిత్య జీవము అని బోధించాలి. అలాంటి వారి జీవితాలు అభివృద్ధిలోకి తీసుకొనిరావాలి. ఇలాంటివారికి సేవచేయడానికి వెనుకాడవద్దు అని క్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు.
మరి  ఇలాంటి  సేవా  జీవితం  జీవించడం , “ మనిషిగా  పుట్టిన  ప్రతి  ఒక్కరి భాద్యత ”. అందుకే దేవుడు మన అందరిని ఎన్నుకుంటున్నాడు.  మరి  ఈ  రెండు  పఠనాలుకూడా దీని గురించబోధిస్తున్నాయి. మనము  దైవ  సేవకునిగా  జీవించాలంటే ఇలాంటి  లక్షణాలు  కలిగి  జీవించాలి .

3. దేవుని పిలుపును స్వీకరించిన వారు ఏ లక్షణాలు కలిగి ఉండాలి?  
-సేవా భావం కలిగి ఉండటం.

క్రీస్తువలె అందరిని సమానంగా, ఏ వర్గ, కుల, మత బేధాలు లేకుండా ప్రేమించే గుణం.
-చెడును, పాపాన్ని ద్వేషించే గుణం.

-ఇతరులకు చేతనైన సహాయం చేసే గుణం.
-నిజాయితీగా బ్రతికే గుణం.

-సత్యం కోసం జీవించే గుణం.
-కోప పడక, శాంతి, సమాధానాలతో జీవించే గుణం. 

ఇవన్నీ  కలిగిన  వారే  నిజమైన మనుషులుగా , దేవుని  యొక్క  బిడ్డలుగా  పిలువబడతారు.
దేవునికి ప్రియమైన వారీగా పిలుస్తారు. ఇలాంటి వారిదే  దేవుని రాజ్యము అని దివ్య గ్రంథ పఠనాలు  తెలియచేస్తున్నాయి.

దేవుని సేవ చేయాలంటే, మనలను మనము, ప్రజలకు, దేవుని ప్రణాళికకు, పిలుపునకు, సంపూర్ణంగా సమర్పించుకోవాలి .అప్పుడే  మనకు,  పైన  పేర్కొన్న విధంగా  జీవించడం  సాధ్యమవుతుంది.
ఇలా  జీవించినవారు  చాలామందిని   ఉదాహరణలుగా  చెప్పవచ్చు .

-క్రీస్తు ప్రభువే గొప్ప ఉదాహరణ - దేవుని కుమారుడై కూడా మానవాళి కోసం మరణించాడు, ప్రజలతో జీవించాడు.
-మరియ తల్లి.

-పునీత మదర్ థెరెసా.
-అనేకులైన పునీతులుఇంకా పునీత, మరియు సేవా జీవితాలను జీవిస్తున్నవారు, వీరందరి త్యాగ జీవితాన్ని మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 

రెండవ  పఠనంలో  చుస్తే  
              పునీత పౌలుగారు, గలతీయ ప్రజలకు క్రీస్తు ప్రభువు చేసిన గొప్ప త్యాగాన్ని మరియొక సారి వారికి  గుర్తుచేస్తున్నారు , హెచ్చరిస్తున్నారు.
ఏవిధంగా అంటే , క్రీస్తు  తన  మరణము ద్వారా పాపానికి బానిసలమై జీవిస్తున్న మానవాళి అంతటిని తన  బలిద్వారా, తండ్రి చిత్తానుసారము, సిలువలో మరణించి, మనకు స్వేచ్చాజీవితాని ఒసగారు, మనలను  పాపమునుండి , పాపమునే  బానిసత్వమునుండి విముక్తులను  చేసారు .

కాని మనందరమూ,  పాపమూ ద్వారనైతే దేవునికి దూరమయ్యామో, దేవుని రాజ్యానికి దూరమయ్యామో, తిరిగి  అలాంటి  జీవితాన్నే  మనము  జీవిస్తున్నాము .
శారీరక కోరికలు అనే ఆకలి ద్వారా, ఆదాము  అవ్వలు , పాపము  చేసి  పాపానికి బానిసలు అయ్యారో, అలాంటి  జీవితాన్ని, మరల  మనకు  తెలిసి  కూడా  చేస్తున్నాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం .

శరీర   కోరికలకు  బానిసలైన  వారు  దేవుని  రాజ్యానికి  వారసులు  కారు  అని  పవిత్ర  గ్రంధం  చెబుతుంది .
గలతీయులు  5 : 19 -21 .
శరీర కోరికలు; జారత్వము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయా, క్రోధము, స్వార్ధము, కక్షలు, వర్గత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము విందు  వినోదములు, మొదలగునవి .

ఇలాంటి  జీవితాన్ని  జీవించేవారు  దేవుని  రాజ్యానికి వారసులు కార, అంటే  శరీరానుసారము  జీవించే  వారు  దేవునిరాజ్యనికి వారసులు కారు అని అర్థం .
ఒక్కసారి  మనం  ఆత్మ  పరిశీలన  చేసుకుందాం .

ఈనాడు రెండవ పఠనంలో చూస్తున్నాం ; ఏలయన ధర్మశాస్త్రమంతయు కూడా  “ నిన్ను  నీవు  ప్రేమించుకొనినట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము ”. అను  ఒక్క  ఆజ్ఞలో  నెరవేరియున్నది గలతీయులు 5: 14.
మానవునియొక్క  ప్రధాన  ధర్మం  దేవుని  ఆజ్ఞ  పాటించడమే  ఉపదేశకుడు  12: 13 -14 .

నరులు చేసిన పనులు మంచివి కావచ్చును చెడ్డవి కావచ్చును, రహస్యమైనవి కావచ్చును. కానీ వాటి కన్నిటికిని భగవంతుడు తీర్పు తీర్చును.
యోహాను13:34-35 “నేను మీకు నూతన ఆజ్ఞను ఇస్తున్నాను మీరును ఒకరినొకరు ప్రేమింపుడు. నేను  మిమ్ము  ప్రేమించినట్లే  మీరు  ఒకరినొకరు  ప్రేమించుకొనుడు .

మీరు  పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులు అని అందరు తెలుసుకొందురు.
ఉదాహరణకి మనము గమనించినట్లయితే

మనము ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు, ఉదాహరణకి దొంగతనము చేసేటప్పుడు, దేవుడు ఆత్మ ద్వారా ఇది తప్పు చేయవద్దు అని హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ మన శరీరము మాత్రం, మనలను ఆ తప్పు వైపే నడిపిస్తుంది. ఎందుకంటే ఆ పని మన శరీరానికి సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇలాగె మనము ఏ పని చేసిన కూడా రెండు విధాలైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆత్మవైపునుండిమరియు శరీరమునుండి. మనము దేనికి ప్రాధాన్యతనునిస్తామో మన జీవితం కూడా అలానే ఉంటుంది. మనము శరీరానికి ప్రాధాన్యతను ఇస్తే మనము దేవునికి దూరమవుతాము. ఆత్మకు ప్రాముఖ్యతను ఇస్తే దేవునికి
ఆత్మ ఫలాలు: ఆత్మాను సారంగా జీవించటం. గలతి 5: 22

ప్రేమ, ఆనందం, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీటికి వ్యతిరేకంగా ఏ చట్టము లేదు.
ప్రియ స్నేహితులారా మరి మనము ఎలా జీవిస్తున్నాం. మన స్వార్థం కోసం, మన ఇష్టానుసారంగా, పగలతో, ద్వేషాలతో, ఒకరిమీద ఒకరం అసూయా కలిగి, సైతానును, శరీర వాంఛలకు బానిసలవలె జీవిస్తున్నాం.

కాబట్టి మనం దేవుని శిష్యులుగా జీవించాలంటేదైవ రాజ్యంలో ప్రవేశించాలంటే, సైతానుకు దూరంగా, ఈ లోక ఆశలకు దూరంగా, శరీర వాంఛలకు దూరంగా, ఏ వర్గ, కుల, మత భేదాలు లేకుండా జీవించుదాం. క్రీస్తు నేర్పించిన విధంగా ఒకరినొకరు ప్రేమించుకుందాం.

 


 Br. సుభాష్ 

23, జూన్ 2022, గురువారం

యేసు తిరు హృదయ పండుగ

యేసు తిరు హృదయ పండుగ 

యెహెఙ్కేలు 34 :  11- 16, రోమియు 5: 5-11, లూకా 15: 3-7.

ఈ రోజు తల్లి తిరుసభ యేసు ప్రభునియొక్క తిరు హృదయ పండుగను కొనియాడుచున్నది యేసు ప్రభువు మనలను ఎంతగ ప్రేమించారో ఆ ప్రేమకు మనం తిరిగి ఎలాంటి సమాధానం ఇస్తున్నాం. అని ధ్యానించాలి. ఈ రోజు మనందరం ప్రత్యేకంగా దేవునియొక్క హృదయం ఎలాంటిది అని తెలుసుకోవాలి. చాల సందర్భాలలో మనం ఇతరులను చూసినప్పుడు ఆయన/ ఆమె హృదయం మంచిదికాదు కఠినమైనది అని చెబుతుంటారు. అలాగే కొంతమంది ఆమె / ఆయన హృదయం చాలా మంచిది అని తెలుపుతారు.  ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనాలు దేవుని హృదయం గురించి తెలుపుచున్నాయి. మన హృదయం ఎలాంటిది అని మన యొక్క క్రియలు తెలియచేస్తాయి. తత్వ వేత్త అయినా అరిస్టాటిల్ గారు హృదయ మనేది మానవ శరీరం కు కేంద్రం అని , అన్ని భావనలు పుట్టుటకు ప్రధాన స్థలం అని తెలిపారు. ( heart is the center of all our emotions)

గుండెను  జీవితంతో  కూడా  పోల్చి చెప్పవచ్చు ఎందుకంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనిషి బ్రతుకు ఆగిపోతుంది. 

దేవుని యొక్క హృదయం ఎలాంటి అన్నది  యేసు ప్రభువు తప్ప మిగతా ఏ వ్యక్తులు వివరించలేదు. క్రీస్తు ప్రభువే ఈ లోకంలో జనియించి  తరువాత తన యొక్క సువార్త పరిచర్య ద్వారా తండ్రియొక్క హృదయం ఎలాంటిది అని వివరించారు. 

ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే (ప్రేమికులరోజు) ప్రేమలో ఉన్న వారు వారి ప్రేమను వ్యక్త పరుచుటకు హృదయం బొమ్మగీసి దానికి మధ్యలో బాణం గుర్తు పెట్టి అటు ఇటు వారి పేర్లు వ్రాస్తుంటారు. ఎందుకంటే హృదయం ప్రేమకు గుర్తుగా ఉంది కాబట్టి తన ప్రేమ ఈ విధంగా వ్యక్త పరుచుట కోసం.

హృదయం  ప్రేమకు  గురుతు  అదేవిధంగా వ్యక్తిత్వ కేంద్రానికి కూడా గురుతుగా ఉంటుంది. 

-యేసు ప్రభువు యొక్క హృదయం ఆయన యొక్క గొప్ప ప్రేమకు మరియు ఆయన యొక్క మానవత్వంకు ఒక చిహ్నంగా ఉంటుంది. 

యేసుప్రభువు యొక్క తీరు హృదయాన్ని సంఘానికి పరిచయం చేసినటువంటి భక్తులు పునీత యోహానుగారు : ఆయన ప్రభువు సిలువ మీద మరణించేటప్పుడు సిలువ క్రియందనే ఉన్నారు. క్రీస్తు ప్రక్కన ఈటెచే పొడవ బడడాన్ని కళ్లారా చూశాడు. (యోహాను 19 : 33-37) ఆయన హృదయం దగ్గర ఉన్న ప్రక్కటెముక దగ్గర సైనికులు గాయంచేసినప్పుడు రక్తం నీరు స్రవించాయి అని పవిత్ర గ్రంధం తెలుపుతుంది. వాటి నుండియే శ్రీసభ ఏర్పడినది అని కొందరి విశ్వాసం. 

-తెరువబడిన క్రీస్తు హృదయం మనకు రక్షణ నిది అని ధన్య క్రిసోస్టమ్ అన్నారు. అదేవిధంగా ప్రభువు హృదయం యొక్క విశిష్టతను తెలుసుకున్న పునీత బొనవెంచర్ “నీ హృదయంలోనికి రావడానికి మాకు మార్గం ఏర్పాటు చేయడానికే  మీ ప్రక్కను తెరిపించావు అని అన్నారు . ఈలోక వ్యామోహాల నుండి వైదొలగి నీ హృదయంలో నివాసం ఉండుటకు ఒక వరమివ్వమని” ప్రార్థించారు. మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క హృదయంనుండి జనిమించిన వారమని పునీత జస్టిన్ గారు అన్నారు. క్రీస్తు సంఘం ప్రభుని హృదయం నుండి పుట్టింది . ఆయన యొక్క శరీర రక్తాలతో పోషించబడుతుంది.

క్రీస్తు ప్రభువు హృదయం తండ్రి దేవుని హృదయం లాంటిదే, ఎందుకంటే క్రీస్తు ప్రభువు కనిపించని తండ్రి దేవుని ప్రతిరూపమే  కొలొస్సి 1: 15.

యేసు ప్రభువు కూడా అన్నారు నన్ను చుస్తే నాతండ్రిని చూసినట్లే అని యోహాను 14: 9. అంటే నా ప్రేమను వ్యక్తిత్వమును చుస్తే మీకు దేవుని (తండ్రి ) గురించి తెలుస్తోంది అని అర్థం. 

క్రీస్తు హృదయం దేవునికి మనపైన ఉన్న ప్రేమకు నిదర్శనం. యావే దేవుని ప్రేమను పరిశుద్ధ గ్రంధం చక్కగా వివరించింది.

ఆయన ప్రేమ తల్లిని మించిన ప్రేమను మరివి చేయి విడువని ప్రేమ -యెషయా 49:15. 

యేసుప్రభువు ఈ లోకంలోకి వచ్చి తండ్రి యొక్క అనంతమైన ప్రేమను చూపించారు.

ఈ నాటి మొదటి పఠనంలో కూడా మంచి కాపరి జీవితం ద్వారా తాను ఎలాంటి హృదయం కలిగి ఉన్నారో తెలుపుచున్నారు? పాత నిభందన గ్రంధంలో అనేక సార్లు దేవుడు ఇశ్రాయేలును శిక్షించారని చదువుతాం కానీ నూతన నిభందన గ్రంధంలో అలాగే ప్రవక్తల గ్రంధంలో క్షుణ్ణంగా చదివితే దైవ ప్రేమ ఎలాంటిదో అర్థమగుచున్నది. దేవునియొక్క హృదయం గురించి యెహెఙ్కేలు ప్రవక్త దేవుని హృదయం ఎలాంటిదో తెలుసుకొని ఆయన్ను మంచి కాపరిగా సంభోదిస్తున్నారు. తండ్రిని, కుమారుణ్ణి మంచికాపరిగా పవిత్ర గ్రంధం పిలుస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన హృదయం ఎలాంటిదో ధ్యానించుదాం. తండ్రి, కుమారుల హృదయం ఒక్కటే. 

1. యేసు ప్రభువు హృదయం పరితపించే హృదయం- ఈ లోకంలో పాపంలో తప్పి పోయిన వారందరిని రక్షించాలని - పరితపించే హృదయం కలిగినటువంటి వారు యేసు ప్రభువు -లూకా19:10. విశ్వాసంలో తప్పిపోయిన వారిని రక్షించాలని పరితపించే హృదయం. భాద్యతలు నెరవేర్చుటలో విఫలమైన వారిని బలపరిచే హృదయం కలిగిన వారు యేసు ప్రభువు.

- ప్రభువు యొక్క ఆలోచన, ద్యాస ఎల్లప్పుడూ మన గురించియే అందుకే ఆయన హృదయం మన కోసం పరితపిస్తుంది.

2.  యేసు క్రీస్తు హృదయం జాలి కలిగిన హృదయం. ప్రభువు రోగులను, భాదపడు వారిని చూసినప్పుడు ఆయన యొక్క హృదయం కరిగి పోయింది. - కాపరి లేని గొర్రెల వలె ఉన్న జన సమూహమును చూసి ఆయన హృదయము తరుగుకొని పోయింది. మత్తయి 9: 36. 

-మూడు రోజులు తన చెంత ఉండి, తన బోధనలను ఆలకించిన ప్రజల యొక్క ముఖములను చుసిన దేవుడు జాలితో ఉన్నారు. మత్తయి : 15 : 32 .

-లాజరు సమాధి వద్ద మార్తమ్మను చూసి జాలితో ఉన్నారు. యోహాను 11 : 33 -36 .

-నాయీను వితంతువు యొక్క పరిస్థితి చూసి ప్రభువు జాలితో వున్నారు. లూకా 7 : 13 .

క్రీస్తు ప్రభువుని హృదయం జాలితో నిండినది ఆయన వారిపట్ల జాలి చూపడం మాత్రమే కాదు చేసింది,  వారి యొక్క భాదలలో, ఆకలితో, అనారోగ్య స్థితిలో పాలు పంచుకొని వారికి తన యొక్క దీవెనలు ఇచ్చారు. 

గాయ పడిన వారి గాయాలు మాన్పాలనే జాలి కలిగి తానే స్వయంగా ప్రజల శారీరక మానసిక, ఆధ్యాత్మిక గాయాలను జాలితో మాన్పారు.

3. యేసు హృదయం రక్షించే హృదయం - ఆయన ఈ లోకంలోకి ప్రవేశించినది మనలను రక్షించుటకే గాని శిక్షించుటకు కాదు. యోహాను 3 : 17. 

ఆయన చేసిన ప్రతియొక్క భోదన మనం పాపమును విడిచిపెట్టి మంచిని, సత్యమును తెలుసుకొని జీవితాలను సరిచేసుకొని మన యొక్క ఆత్మలను రక్షించుకోవాలన్నదే. 

-మన రక్షణ కొరకే తాను ప్రాణ త్యాగం చేశారు. మన రక్షణ కొరకే పరలోక మహిమను వీడి భూలోకంలోకి ప్రవేశించి మన మధ్య ఒకరిగా జీవించారు. 

4. యేసు హృదయం ప్రేమించే హృదయం - యేసు ప్రభువు మనందరిని ఎంతగానో ప్రేమించారు ఆయన ప్రేమవలనే ఈ లోకంలో మానవునిగా జనిమించారు. యోహాను 3 : 16. ఆయన ప్రేమ స్వరూపి, మొదట ఆయనయే మనల్ని ప్రేమించారు. 1 యోహాను 16, 19.

ఆయన మనందరిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు. యిర్మీయా 31 :3 . ఈలోకంలో ఎవ్వరుకూడా ఆయన వలె ప్రేమను చూపలేరు. 

-ప్రేమ వలనే శిలువను మోశారు.

-ప్రేమ వలనే విధేయత చూపారు. 

-ప్రేమ వలనే ప్రజలలో ఒకరిగా తగ్గించుకొని మెలిగారు. 

-ప్రేమవలనే తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరేవేర్చరు. 

యేసు ప్రభుని ప్రేమ అర్థం చేసుకున్న పౌలు ఆయన ప్రేమ విశాలమైనది, దీర్గమైనది, గాఢమైనది అని పలికారు- ఎఫెసీ 3 : 15 .

5. యేసు హృదయం ఏదైనా సరే ఇచ్చే హృదయం - ఉదార హృదయం.

- మనకు జీవమిచ్చారు- యోహాను- 10: 10.

-స్వస్థత నిచ్చారు- లూకా – 17: 12-19.

-క్షమను ఇచ్చారు -మార్కు -2: 1- 12.

-ఆశీర్వాదం ఇచ్చారు - మార్కు -10: 13-16.

-తన స్నేహం ఇచ్చారు - యోహాను -15: 12- 15.

తన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి కూడా యేసు ప్రభువు తన ప్రజలతో పంచుకున్నారు. 

ఆయనది ఉదార హృదయం.  తనకోసం ఏమి దాచుకోలేదు . సమస్తము ఇచ్చివేశారు. ప్రాణం సైతం.

6. యేసు ప్రభువు హృదయం దయ కలిగిన హృదయం - వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ   యొక్క పరిస్థితి చుసిన ప్రభువు ఆమె పట్ల జాలి కలిగి ఆమె పాపాలను క్షమియించారు. యోహాను 8 : 1 - 11 .

తప్పి పోయిన కుమారుడి పట్ల కూడా దేవుడు దయను చూపిస్తున్నారు. యోహాను 15: 11-32.

యేసు ప్రభువు దయార్ద హృదయం కలిగినవారు అందుకే చివరికి మరణించే ముందుకూడా ప్రజల మీద దయను చూపమని తండ్రిని ప్రార్థించారు. లూకా 23: 34.

పవిత్ర గ్రంధం ముఖ్యంగా పాత నిభందన గ్రంధం దేవుని యొక్క దయార్ద హృదయం గురించి తెలుపుతుంది. 

ద్వితియో -7: 9.

కీర్తన- 86: 15.

కీర్తన-145: 8-9.

మీకా -7: 18-19.

7. యేసుని హృదయం సేవా భావం కలిగిన హృదయం. ఈ లోకంలో యేసు ప్రభువు సేవకుని వలె సేవ చేశారు. లూకా 22: 24-27.

-ఆయన దేవుడైనప్పటికిని సేవకునివలె శిష్యుల యొక్క పాదాలు కడిగారు. యోహాను 13: 1-20.

ప్రభువు నిస్వార్థంతో, ప్రేమతో, కరుణతో ఈ లోకంలో సేవ చేశారు. 

యేసు తిరుహృదయం దర్శనం పునీత మార్గరీత గారికి కలిగింది. ఆ దర్శనంలో ఆమె ప్రభువు యొక్క హృదయాన్ని మండే హృదయంగా చూశారు, హృదయం చుట్టూ ముండ్ల కిరీటం ఉన్నట్లుగా, కంటి కిరణాలు ఉన్నట్లుగా కనిపించాయి. హృదయం మీద సిలువ ఉన్నట్లు దర్శనం కలిగింది. 

-మండుచున్న హృదయం ప్రేమకు చిహ్నం. యేసుని హృదయం మానవుల పట్ల వున్నా ప్రేమాగ్నిచే మండిపోతుంది అని అర్థం. 

-ముండ్ల కిరీటం - మనయొక్క పాపపు జీవితానికి గుర్తు మనల్ని ప్రేమించిన దేవుణ్ణి మనయొక్క పాపపు జీవితం ద్వారా మనం రోజు భాదపెడుతున్నాం. ముళ్ళు  మనకు నొప్పి కలిగించిన విధంగా మన యొక్క పాపపు జీవితం కూడా దేవుని భాదిస్తుంది.

మనయొక్క స్వార్థం, లోభం, దొంగతనం, చెడుతనము, అన్నీకూడా దేవుణ్ణి బాదిస్తునే వున్నాయి. ఈ చేదు గుణాలన్నీ ఆ ముళ్ల కిరీటంలో ఉన్న ముళ్ళు వంటివి.

-సిలువ - మన యొక్క రక్షణకు గుర్తు సిలువను మోసి మన కోసమే ప్రభువు మరణించారు. సిలువ ద్వారా తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చారు. సిలువలో విజయం ఉంది, ప్రేమ ఉంది, రక్షణ ఉంది.

- కాంతి కిరణాలూ- దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాలు గుర్తు తన యొక్క కాంతి కిరణాలచే మనలని దేవుడు పవిత్ర పరుస్తున్నారు. 

మనందరం ప్రభువు యొక్క హృదయం గురించి ధ్యానించే సమయంలో మన హృదయము కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. 

ఎందుకంటే హృదయమునుండే అన్ని జనిమిస్తాయి. మంచి అయినా, చెడు అయినా. సామెతలు 4: 23, మత్తయి 15: 19, మార్కు 7: 21.

మనము కఠిన హృదయంలా  కాకుండా ప్రేమించే వారిగా జీవించాలి. యెహెఙ్కేలు 36: 26.

ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు తన యొక్క హృదయం తో మనలను ఎంతగా ప్రేమించారో  తెలుసుకొని తిరిగి ఆయనను తగిన విధంగా ప్రేమించాలి. ఆయన్ను తగిన విధంగా ప్రేమించాలంటే ఆయన ప్రేమ తెలుసుకోవాలి. 

-ఆయన ప్రేమను బైబులు చదవటం ద్వారా తెలుసుకోవచ్చు- 1తిమోతి 3: 16.

- ఆయన ప్రేమను ప్రార్తించుట ద్వారా తెలుసుకోవచ్చును. నిర్గమ 3: 14.

ఆయన ప్రేమను తెలుసుకోవాలనుంటే ఆయన సన్నిదికి రావాలి. యాకోబు 4: 8.

దేవుని యొక్క హృదయమును తెలుసుకొని ఆయన హృదయం వలే మనం కూడా మంచిని  అలవరుచుకొని దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి.

Rev. Fr. Bala Yesu OCD

18, జూన్ 2022, శనివారం

యేసు క్రీస్తు దివ్య శరీర రక్తాల మహోత్సవం

దివ్య సత్ప్రసాద మహోత్సవము(4)

దివ్య సత్ప్రసాద మహోత్సవము

ఆది 14 : 18 - 20 , 1 కొరింతి 11 : 23 -26 , లూకా 9 : 11 -17

ద్వితియో 8 : 2 -3 , 14 - 16 , 1 కొరింతి 10 : 16 - 17 , యోహాను 6: 51 -58 .

నేడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క పరమ పవిత్ర శరీర రక్తముల పండుగను కొనియాడుచున్నది. 

దైవార్చన సంవత్సరంలో దివ్య సత్ప్రసాదం యొక్క గొప్ప తనం గురించి రెండు ప్రత్యేకమైన రోజులలో ధ్యానించుకుంటాం. 

1. పవిత్ర గురువారం రోజున 

2. ప్రభువు పునరుతనమైన 9 వారాల తర్వాత.

దివ్య సత్ప్రసాదం అనేది క్రీస్తుప్రభువు శ్రీసభకు ఇచ్చిన గొప్ప సంపదం. దాని వలననే శ్రీ సభ జీవించుచున్నది . పరిశుద్ధ 16 వ బెనెడిక్ట్ పాపు గారు అంటారు దివ్య సత్ప్రసాదం లేనిది శ్రీ సభ ఉనికి లేదు అని.

దివ్య సత్ప్రసాదం అనేది ప్రభువు యొక్క అమూల్యమైన వరం. ఆయన కడరాత్రి భోజనమున దివ్యసత్ప్రసాదమును స్థాపించారు.

కేవలం కథోలిక సంఘంలో వున్న విశ్వాసులకు దేవుడిని తమలోకి స్వీకరించే అదృష్టం కలుగుతుంది. ఏ దేవాలయము కు  వెళ్లిన కేవలం దేవుడికి అర్పించిన ప్రసాదం తీసుకుంటారు. కానీ కథోలిక శ్రీ సభ లో దేవుడిని దివ్యసత్ప్రసాదంలో తమ యొక్క హృదయంలోకి ఆహ్వానించుకుంటారు.

పాస్కా పండుగ దినముల తరువాత ఎందుకు ఈ పండుగను కొనియాడుతారంటే ప్రభువు శిష్యులతో "నేను లోకాంతము వరకు సదా మీతో ఉందును అని వాగ్దానం చేశారు. మత్తయి 28 : 20 . ఈ విధంగా ఆయన దివ్య సత్ప్రసాదంలో దాగి వున్నారు.

దేవుడు మనతో చిరకాలము ఉండుటకు దివ్యసత్ప్రసాదంను స్థాపించారు.

దివ్య సత్ప్రసాదం కథోలిక విశ్వాస సంప్రదాయంలో గుండెకాయ వంటిది . మానవుల యొక్క జీవితంలో హృదయం అనేది కేంద్రం . హృదయం లేనిది మనిషి జీవించలేడు. అలాగే దివ్యసత్ప్రసాదం లేనిదే కథోలిక విశ్వాసం లేదు.

ప్రభువు యొక్క శరీరము నిజమైన ఆహారము ఆయన యొక్క రక్తము నిజమైన పానము. 

కడరాత్రి భోజనమున దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని చెప్పి ఆయన మన కోసమే తన శరీరమును రక్తమును ఇచ్చి వున్నారు.

శ్రీసభ ఈ పండుగను స్థాపించటానికి 4 కారణాలు వున్నాయి.

1 దివ్యసత్ప్రసాదంలో క్రీస్తు ప్రభువు నిజంగా ప్రత్యక్షమై వున్నారని తెలుపుటకు. 

2 దివ్య సత్ప్రసాదంలో దాగివున్న క్రీస్తు ప్రభువుకు చెందిన అవమానాలకు పరిహారం చెల్లించుటకు. 

3 దివ్యసత్ప్రసాదం ద్వారా మనం పొందే మేలులకు కృతజ్ఞతా తెలుపుటకు.

4 తరుచుగా అందరం దివ్యసత్ప్ర సాదం స్వీకరించి దేవునితో ఐక్యమై జీవించుట కొరకు స్థాపించబడినది.

దివ్య సత్ప్రసాదంలో చాలా శక్తి దాగి వున్నది . దివ్య సత్ప్రసాదమే మనలను దేవునితో ఐక్యపరుస్తుంది.

ఈ నాటి మొదటి పఠనంలో షాలేము రాజు అయిన మేల్కేసెదెకు సమర్పించిన రొట్టె , ద్రాక్షారసము గురించి చెప్పబడినది. 

అబ్రహాము శత్రు సైన్యములను జయించి బంధింపబడి ఉన్న లోతును విడిపించుకొని వచ్చే సమయంలో మేల్కేసెదెకు రాజు అబ్రహామును కలుసుకొనుటకు వస్తారు.

మేల్కేసెదెకు ఒక రాజు మాత్రమే కాదు ఆయన దేవుని యొక్క పూజారికూడా (ఆది 14 : 18 ) అంటే దేవునికి బలులు సమర్పించే యాజకుడు.

మేల్కేసెదెకు యాజకత్వమునకు పుట్టుపూర్వోత్తరాలు లేవు అయినా కానీ ఆయన దేవుని యొక్క యాజకుడు. అని పవిత్ర గ్రంధం తెలుపుతుంది. పవిత్ర గ్రంథంలో వున్న మొదటి యాజకుడు. కీర్తన 110 :4 .

ఒక దేవుని యొక్క యాజకుడిగా మేల్కేసెదెకు అలసిపోయిన అబ్రహాముకు రొట్టెను, ద్రాక్షారసమును ఇచ్చి బలపరుస్తున్నాడు.

మేల్కేసెదెకు అబ్రహామును యావే దేవునిపేరిట దీవిస్తున్నారు. ఆయన సమర్పించిన రొట్టె, ద్రాక్షారసము బలి అర్పణకు సూచనగా ఉంది. రొట్టెను, ద్రాక్ష రసమును సమర్పించుట పూర్వ నిభందన కాలంలో అత్యంత ప్రధానమైన సాంప్రదాయంగా మారింది.

-యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వం మేల్కేసెదెకు యాజకత్వ వారసత్వంను కలిగి వున్నదని హెబ్రీయులకు వ్రాసిన లేఖలో తెలిపారు. హెబ్రి  7 , 8 అధ్యాయాలు . క్రీస్తు ప్రభువు లేవీయుల గోత్రమునకు చెందినవారు కారు. అయినా కానీ ఆయన నిత్యుడగు యాజకుడు; ఆయన తన శరీర రక్తములనే  రొట్టెగా, ద్రాక్షా రసముగా సమర్పించారు.

మేల్కేసెదెకు దేవునియొక్క ఆత్మ ప్రేరణ చేతనే రొట్టె, ద్రాక్షరసాలను ప్రభువుకు సమర్పించారు. 

వాస్తవానికి ఆనాటి అన్యజాతీయులు జంతువుల మాంసంతోను, రక్తంతోను తమ దేవదూతలకు , దేవుళ్ళకు బలులు సమర్పించాలి. కానీ మేల్కేసెదెకు  దానికి భిన్నముగా కేవలం రొట్టె, ద్రాక్ష రసాలు సమర్పించారు. ఎందుకంటే అవి క్రీస్తు ప్రభువు యొక్క రక్షణ బలికి సుమాత్రుకగా ఉన్నాయి.

మేల్కేసెదెకు  రొట్టె ద్రాక్ష రసములను ఇవ్వుట మాత్రమే కాదు అబ్రహామును దీవిస్తున్నారు. 

ఈనాటి రెండవ పఠనంలో క్రీస్తు ప్రభువు, వారు అర్పించిన బలి గురించి పౌలు గారు కొరింతు ప్రజలకు వివరిస్తున్నారు.

ప్రభువు యొక్క అపోస్తులులు తన మరణ, పునరుత్తానం తరువాత రొట్టె విరుచుటలో ప్రతిదినము సమావేశమయ్యేవారు. ఈ యొక్క సంప్రదాయంను అందరు పాటించే వారు ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు అన్నారు దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని.

మనందరం రొట్టెను , ద్రాక్షణారసమును పానము చేయునప్పుడు దేవునియొక్క రక్షణమును జ్ఞాపకం చేసుకోవాలి ఆయనయొక్క త్యాగం, ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి.

యావే దేవుడు ఆనాడు మన్నాను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ఈనాడు క్రీస్తు ప్రభువు తనను తాను బలిగా సమర్పించుకొని తన శరీర రక్తాలు మనకు ఒసగి వున్నారు.

దేవునికి మనం కృతఙ్ఞతలు తెలపాలి.

దివ్య సత్ప్రసాదం స్వీకరించిన మనందరం అన్యోన్యంగా జీవించాలి ఎందుకంటే అందరిలో క్రీస్తు ప్రభువు వున్నారు. అనేక మంది కలిసి ఒకే పిండితో, నీతితో చేసిన రొట్టెను పంచుకొనుట ద్వారా మనందరం క్రీస్తు నందు ఒకే ప్రజగా ఉంటున్నాం.

మనం ఏ ప్రాంతమునకు వెళ్లిన, భాషకు, జాతులకు, చెందిన వారమైన సరే దివ్యసత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఒకే ఒక ప్రజగా మారాలి. ఎటువంటి పేద, ధనిక, భేదాభి ప్రాయాలు లేకుండా కలసి జీవించాలి.

రొట్టెను చేసేది అన్ని గోధుమలు కలిపి ఒక ముద్దగా చేసి రొట్టెగా మార్చుతారు. అలాగే ద్రాక్ష రసము కూడా చాలా కాయలు కలిపి నలగ గొట్టినప్పుడే మంచి ద్రాక్ష రసము వస్తుంది. కాబట్టి అనేక గోధుమల కలయిక వల్ల ఏర్పడిన రొట్టెలాగా అలాగే అనేక ద్రాక్ష పళ్ళ కలయిక వల్ల ఏర్పడు ద్రాక్ష రసములాగా మనందరం కలసి మెలసి ఐక్యంగా జీవించాలి.

పౌలు గారు ప్రభువుయొక్క భోజనము గురించి ఎందుకు వివరించారంటే ఆనాటి కొరింతు సంఘంలో ఐక్యత అంతగా లేదు అందుకే ప్రభువు భోజనము ఏవిధంగానైతే అందరిని ఐక్యపరిచినదో అలాగే  ప్రతి కొరింతు విశ్వాసి ఐక్యత కలిగి జీవించాలి.

ఈ నాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు 5000 మందికి ఆహారం ఇచ్చిన అద్భుతంను చదువుకుంటున్నాం.

ప్రభువు అయిదు రొట్టెలు, రెండు చేపలు ద్వారా అక్కడవున్న వారందరిని సంతృప్తి పరిచారు. ప్రభువు కేవలం వారికి ఆధ్యాత్మిక ఆహారం మాత్రమే కాదు ఇచ్చింది శారీరక ఆకలిని కూడా వారు తీసివేశారు.

యోహాను సువార్త 6 : 35 వచనాలలో ప్రభువు "నేనే జీవాహారము" అని పలికారు. జీవాహారము అనే మాటకు రెండు అర్థాలున్నాయి. 

1. దేవుని వాక్కు - జీవాహారం మన యొక్క ఆత్మలకు జీవము నిచ్చే వాక్కు మనల్ని బలపరిచే వాక్కు. కీర్తన 119 : 50 . పాతనిభందన గ్రంధంలో దేవుని వాక్కు ఆహారంతో పోల్చబడినది యెషయా 55 వ అధ్యాయం .

2. దేవుని యొక్క దివ్య శరీర రక్తములు - యోహాను 6 వ అధ్యాయం 

దివ్యసత్ప్రసాదం  మనయొక్క జీవాహారం కాబట్టి మనం యోగ్యారీతిగా స్వీకరించాలి.

ప్రభువు సువిశేషంలో 5000 మందికి ఆహారం ఒసగిన సంఘటన పాత నిబంధన గ్రంధంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను ఇచ్చిన సంఘటన అదేవిధంగా ఎలీషా ప్రవక్త అతిధులకు  రొట్టెను ఇచ్చిన విధానం అన్ని కూడా యేసు ప్రభువు స్థాపించే దివ్యసత్ప్రసాదంకు సూచనగా వున్నాయి.

నిర్గమ 16 : 4 - 36 (మన్నా),, 2 రాజు  4 : 42 – (ఎలీషా అద్భుతం)

యేసు ప్రభువు 5000 మందికి ఆహారం ఒసగిన సంఘటన నలుగురు సువార్తికులు వ్రాశారు.

దివ్యసత్ప్రసాదం దేవుడు మనకు ఒసగిన గొప్ప వరం కాబట్టి దానిని ఎలాగా మనం స్వీకరిస్తున్నాం?

దివ్య సత్ప్రసాదం స్వీకరించుట అంటే-

ఆయనను  మనలోకి ఇంకించుకోవడం  అంటే ఆయన జీవితం వలే మన జీవితం మారాలి . గలతి 2 : 20 .

- ఆయన రూపంను పొందాలి 

-ఆయన వలే మనం తయారవ్వాలి.

-ఐక్యమై జీవించుట 

దేవుడు మనతో ఉండాలని మనకు దగ్గరగా ఉండాలని, మనలో ఉండాలని దివ్య సత్ప్రసాద రూపంలో దాగి వున్నారు కాబట్టి ఆయనను స్వీకరించుటకై మనం ఎలాగా తయారగుచున్నాం.

-దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తే మనందరిలో అనేక ప్రయోజనాలు వున్నాయి. 

-స్వీకరించిన వారు జీవాన్ని కలిగి వుంటారు- యోహాను 6: 53 

-ఆయన పునరుత్థాన జీవితం పంచుకుంటారు- యోహాను 6: 54 

-ప్రభువులో సహజీవనం ఏర్పడుతుంది -యోహాను 6: 56, గలతి 2 :20  

-దేవుని మూలమున జీవిస్తాం - యోహాను 6: 57 

-దేవుడు మనయందు ఉంటారు - యోహాను 6: 56

మనందరం యేసు ప్రభువుయొక్క దివ్య శరీర రక్తములు స్వీకరించినప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. 

- దేవుడు ఒసగె ఆహారం మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. ఈ ఆహారం భుజించియే ఏలియా నలభై రోజులు నడిచారు. 1 రాజు 19: 8.

- ఈ ఆహారం భుజించియే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో నడిపించబడ్డారు. నిర్గమ 16 : 35 .

-దేవుడు మనకై ఏర్పరిచిన ఈ యొక్క దివ్య సత్ప్రసాదం పట్ల గౌరవం, ప్రేమ, భక్తి కలిగి మారుమనస్సు పొంది ప్రభువుని మనలోకి స్వీకరిద్దాం.

మన ఇంటికి ఎవరైనా అతిధి వస్తే వారిని మంచిగా స్వీకరిస్తాం, అదే ఇంటికి గొప్ప వారు వస్తే ఇంకా బాగా స్వీకరిస్తాం. మరి దివ్య సత్ప్రసాదం ద్వారా దేవుడు మనలోకి  వచ్చేటప్పుడు మనం ఎలాగా స్వీకరిస్తున్నాం. ఆయన మానవ మాత్రులకన్నా గొప్పవాడు. మనల్ని రక్షించిన దేవుడు. ఆయన్ను స్వీకరించుటకు పవిత్రత కావాలి. మనం పాపమును విడిచిపెట్టి, మారుమనస్సు పొంది దేవుడిని మనలోకి ఆహ్వానించాలి.

Rev. Fr. BalaYesu OCD 

క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము(3)

క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము

ఆది 14:18-20
1 కొరింతి 11: 23-26
లూకా  9: 11-17

 క్రీస్తు నాధుని యందు ప్రియ సహోదరి సహోదరులారా! ఈనాడు తల్లి శ్రీసభ 'దివ్యసత్ప్రసాద మహోత్సవం లేదా క్రీస్తు శరీర రక్తముల మహోత్సవాన్ని  కొనియాడుచున్నది. దివ్యసత్ప్రసాదం యేసుక్రీస్తు ప్రభువు మానవాళికి అనుగ్రహించిన ఒక గొప్ప వరం. ఎందుకనగా, దివ్యసత్ప్రసాదం రూపంలో ఆయన ఎల్లప్పుడూ మనతో వాసం చేస్తున్నారు, మనలోకి వేంచేస్తున్నారు.  ఏడు దివ్య సంస్కారాలలో  దివ్య సత్ప్రసాదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది . 

దివ్య సత్ప్రసాదం  ద్వారా ప్రతి దివ్య సంస్కారము సంపూర్ణమవుతున్నది. అటువంటి క్రిస్తునాధుని శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడే గొప్ప ఆశీర్వాదం ఈనాడు తల్లి శ్రీసభ మనందరికీ ఒసగుచున్నది.
ఈ పండుగను శ్రీసభ ప్రారంభం నుండి జరుపుకునేవారము కాదు. ఈ పండుగ  13 వ శతాబ్దంలో ప్రారంభమైనది.

పండుగ ప్రారంభం: బెల్జియం దేశం లియోజపురం నివాసియైన జులియాన  అనే కన్యాస్త్రికి తరచుగా ఒక దృశ్యం కనిపిస్తూ ఉండేది. ఆ దృశ్యంలో ఆమె ధగధగమెరుస్తున్న చంద్రుని, దానిలో ఒక మచ్చను చూస్తుండేది.  అది ఒక అద్భుతమని తెలుసుకున్న ఆమె దానిగురించి ఇతరులకు చెప్పడానికి భయపడేది. ఎందుకనగా ఆ దృశ్యం భావమేమిటో ఆమెకు తెలియదు కాబట్టి దాని గురించి ఇతరులకు ఎలా చెప్పాలో ఆమెకు తెలిసేది కాదు. ఆ దృశ్యం భావం తెలియజేయమని ఉపవాసాలతో దేవునికి దీర్ఘ ప్రార్ధనలు చేసేవారు. తన ప్రార్ధనలు ఆలకించిన యేసు ప్రభువు ఆ దృశ్యం భావాన్ని ఆమెకు అర్ధమయ్యేలా చేశారు. అలా ఆమె ఆ దృశ్యం భావాన్ని గ్రహించగలిగింది. ఆ దృశ్యం భావమేమనగా చంద్రుడు శ్రీసభ కాగా, దివ్య సత్ప్రసాద గౌరవార్ధం ప్రత్యేక ఉత్సవం లేని కొరతే ఆ చంద్రునిలో మచ్చ. 

ఆ ఉత్సవం ఏర్పాటు చేయ తోడ్పడాల్సిందిగా తనను ప్రభువు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఆమె గ్రహించింది. తాను ఒక సాధారణ కన్యాస్త్రి కనుక ఆ ఉత్సవం ఎలా ఏర్పాటు చేయించాలో తనకు అర్ధమయ్యేది కాదు. ఇలా తనలో తాను సతమతమవుతుండగా శ్రీసభ పెద్దలను ఆశ్రయించమని దేవుడు ఆమెకు ప్రేరేపణ కలిపించాడు. ముందుగా ఆమె ఈ దృశ్యం గురించి కొంతమంది భక్తులకు, ముఖ్యమైన గురువులకు తెలియజేశారు. వారందరు లియోజపురం పీఠాధిపతిని కలిసి విషయం తెలియజేసి, తమ మేత్రాసనంలో దివ్య సత్ప్రసాద ఉత్సవం ఏర్పాటు చేయాల్సిందిగా పీఠాధిపతిని అభ్యర్ధించారు. తత్ఫలితంగా రోబర్టో పీఠాధిపతులు 1246 సంవత్సరంలో తమ గురువులకు అధికార పూర్వకమైన ఉత్తరువులు పంపి ఈ ఉత్సవాన్ని స్థాపించాలని ఆదేశించారు. అలా ఆ మేత్రాసనంలో ఆ ఉత్సవం ప్రారంభమైనందున ప్రజలు ఉత్సవం ద్వారా దివ్య సత్ప్రసాదం ప్రాముఖ్యతను గ్రహించారు. అది చూసిన ఇతర పీఠాధిపతులు తమ  మేత్రాసనాల్లో కూడా ఈ  పండుగను ప్రారంభించారు.  తరువాత ఈ ఉత్సవం మెల్లగా మెల్లగా ఇతర దేశాలకు విస్తరించింది. చివరికి 1264 సంవత్సరంలో మూడవ ఉర్బను పోపుగారు ఈ ఉత్సవాన్ని శ్రీసభ అంతటా జరపాలని ఆదేశించారు. అలా ఈ  ఉత్సవం క్రైస్తవులలో యేసుక్రీస్తు దివ్య శరీర రక్తల పట్ల గౌరవం, భక్తిని పెంపొందించింది.

ఈ  విధంగా ఆనాడు ఈ  ఉత్సవం ఒక్క మేత్రాసనంలో మొదలై ఈనాడు ప్రపంచమందంతటా క్రైస్తవులు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా జర్మనీ దేశస్థులు ఈ  ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుంటారు.  

పరిశుద్ధ గ్రంధంలో మొదటి మూడు సువిశేషములలో యేసుప్రభువు కడరా భోజనం రోజున దివ్య సత్ప్రసాదాన్ని  స్థాపిస్తూ తన శరీర రక్తములను మనకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. "యేసు రొట్టెనందుకొని, ఆశీర్వదించి, త్రుంచి శిష్యులకు ఇచ్చుచు 'మీరందరు దీనిని తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము' అనెను. తరువాత పాత్రమునందుకొని, కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చుచు, 'దీనిని మీరు పానము చేయుడు. ఇది అనేకుల పాపపరిహారమై చిందబడనున్న నా రక్తము. దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు' అనెను" (మత్తయి 26: 26-29, మార్కు 14: 22-25,  లూకా  22: 17-20) అని మనం పవిత్రగ్రంథంలో యేసుప్రభువు పలికిన మాటలను వింటున్నాం.  ఈనాడు ఆ యేసుక్రీస్తుని శరీర రక్తములను ఏ విధంగా స్వీకరిస్తున్నాం? యోగ్యముగా స్వీకరిస్తున్నామా లేక అయోగ్యముగా స్వీకరిస్తున్నామా ? యోగ్యముగా స్వీకరించడమంటే మన స్వీకరించబోయేది కేవలం అప్పద్రాక్ష రసములు కాదు నిజమైన ప్రభుని శరీర రక్తములనే మనం స్వీకరిస్తున్నాం అని నిండు విశ్వాసం కలిగియుండి, అలా స్వీకరించుటకు కావలసిన పరిశుద్ధతను కలిగియుండడమే. 

ఈరోజు అటువంటి నిండు విశ్వాసంతో, గొప్ప పరిశుద్ధతతో ఆ ప్రభుని మనం స్వీకరిస్తున్నామా? 

ఎందుకు విశ్వాసం, పరిశుద్ధత కలిగియుండాలి? 

     "విశ్వాసంపై ఆధారపడనిది ఏదైనా పాపమే" (రోమా 14 : 23 ) అని పునీత పౌలు గారు అంటున్నారు. అనగా ప్రభుని శరీర రక్తములను విశ్వాసంతో స్వీకరించకపోతే అది పాపమే అంటున్నారు పౌలుగారు. అదేవిధంగా "పరిశుద్ధ జీవితమును గడుపుటకై ప్రయత్నించండి. ఏలయన, అది లేకుండా ఎవరును ప్రభువును చేరలేరు" (హెబ్రీ 12 : 14 ) అని  హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ మనకు తెలియజేస్తుంది.  అనగా పరిశుద్ధత అనేది ప్రభువుని చేరడానికి మనకు  ఉన్న ఒక ముఖ్యమైన మార్గమని పవిత్రగ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా! ప్రభుని స్వీకరించాలి అంటే విశ్వాసం, పరిశుద్ధత అనేవి మనకు చాలు ముఖ్యం.

 యోగ్యతతో ప్రభువుని శరీర రక్తాలను స్వీకరిస్తే:

యేసుక్రీస్తు ప్రభువుని మనం నిండు విశ్వాసంతో, సంపూర్ణ పరిశుద్ధతో స్వీకరిస్తే ఈనాడు ప్రభువు మనకు మూడు గొప్ప అనుగ్రహాలను దయచేస్తున్నారు. 

1. నిత్య జీవం, అంతిమ దినమున లేపబడతాము:

ఈనాటి సమాజంలో నిత్యజీవము లేదా శాశ్వత జీవం అనగానే అనేకమంది ఈలోక సంబంధమైన వస్తువులలో వెతుకుతూ ఉంటారు. ఏదైనా సరే క్షణాల్లో వచ్చేయాలి అనుకుంటాం.  కానీ ఈనాడు ప్రభువు మనకు జీవాన్ని పొందడానికి ఉన్న అసలైన మార్గాన్ని తెలియజేస్తున్నారు.  "నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును" (యోహాను 6 : 54 ) అని ప్రభువు సెలవిస్తున్నారు. ఆయన శరీర రక్తములను యోగ్యముగా స్వీకరించుట వలన మనం నిత్య జీవాన్ని పొందడమే కాకుండా అంతిమ దినమున ఆయన చేత లేపబడతాము. ఆయన శరీర రక్తముల ద్వారా నిత్యజీవాన్ని పొందే గొప్ప అనుగ్రహం కథోలిక విశ్వాసులమైన మనకు దయచేయడం మన అదృష్టంగా భావించాలి.

2. ప్రభువు మనయందు, మనం ప్రభుని యందు ఉంటాము:

ప్రభువు తన శరీర రక్తముల ద్వారా మనకు ఇస్తున్న మరొక గొప్ప వరం మన ప్రభునియందును, ప్రభువు మనయందును జీవిస్తారు. "నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వాని యందును ఉందును" (యోహాను 6 : 56 ) అని ప్రభువు పలుకుచున్నారు. పరిశుద్ధుడు, కరుణామయుడైన ఆ ప్రభువు మనలోనూ, మన కుటుంబములలోను, మన సంఘములోను జీవించాలన్నా, మనం ప్రభుని తిరుహృదయములోను, క్రీస్తు సంఘములో నిజమైన క్రైస్తవ బిడ్డలుగా జీవించాలన్నా ఆ ప్రభువుని యొక్క శరీర రక్తములు మనకు ఆ అనుగ్రహాన్ని దయచేస్తాయి. కనుక యోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తూ ఆ ప్రభుని మన హృదయాలలోనికి, మన కుటుంబాలలోని, మన సంఘాలలోనికి ఆహ్వానించుదాం.

3. ప్రభువుని మూలమున ఎల్లప్పుడూ, నిరంతరం జీవిస్తాము:

ప్రభువు తన శరీర రక్తముల ద్వారా మనకు అనుగ్రహిస్తున్న మరొక గొప్ప వరం ఆయన మూలమున జీవించడం. మనం అనేకమార్లు మనకు వున్నా ధనాన్ని, ఆస్తిపాస్తులను, కండబలాన్ని, సమాజంలో మనకున్న పలుకుబడిని చూసుకొని విర్రవీగుతుండవచ్చు. వీటి మూలమున మనం సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు, ఇంకేమి అవసరం లేదు అనుకుంటుంటాం కానీ ప్రభువు ఇవన్నీ అశాశ్వతమైనవని మనకు తెలియజేస్తున్నారు. "పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. నన్ను భుజించువాడు నా మూలమున జీవించును, నన్ను భుజించువాడు ఎల్లప్పుడును, నిరంతరము జీవించును" (యోహాను 6 : 51 , 57 - 58 ) అని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. కనుక మన జీవితం ఈలోక  సంపదలు, ఈలోక వస్తువుల మూలమున కాకుండా జీవమునిచ్చు ఆ యేసుక్రీస్తుని మూలమున జీవించాలి. ఆ విధముగా జీవించాలి అంటే ఆయన శరీర రక్తములను మనం యోగ్యముగా స్వీకరించాలి.

ఒకవేళ అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే ఏమౌతుంది?

విశ్వాసంతో, పరిశుద్ధతో ప్రభువుని స్వీకరిస్తే ఆయన అనుగ్రహాలు పొందినట్లే, అవిశ్వాసంతో, అపరిశుద్ధతతో ప్రభువుని స్వీకరిస్తే మనం జీవితంలో ఏం జరుగుతుంది?

1. పాపం చేసినట్లే:

విశ్వాసము, పరిశుద్ధ లేకుండా ఎవరైనా అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే మనం పాపం చేయుచున్నట్లే అని పవిత్రగ్రంథం తెలియజేస్తుంది. "అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను ఎవడైనా తినినను, లేక ఆయన పాత్రనుండి త్రాగినను అతడు ప్రభుని శరీరమునకు, రక్తమునకు వ్యతిరేకముగా పాపం చేయుచున్నాడు" (1 కొరింతి 11 : 27 ) అని పునీత పౌలు గారు చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తున్నారు. కనుక ప్రభుని శరీర రక్తములను స్వీకరించు ప్రతిసారి ప్రతిఒక్కరు వారు యోగ్యముగా ఆయనను స్వీకరిస్తున్నారు లేదా అని ఆత్మ పరిశీలన చేసుకొని ఆయనను స్వీకరించాలి.

2. తీర్పునకు గురియవుతాము:

అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే, స్వీకరించేది ప్రభుని నిజమైన శరీర రక్తములు అని గుర్తింపనిచో తీర్పుకు గురియవుతామని పునీత పౌలు గారు సెలవిస్తున్నారు. "ఎవడైనను రొట్టెను తినుచు, పాత్రనుండి త్రాగుచు అది ప్రభుని  శరీర రక్తములని గుర్తింపనిచో, అతడు తినుటవలనను, త్రాగుటవలనను తీర్పునకు గురియగును" (1 కొరింతి 11:29 ) అని పరిశుద్ధగ్రంధం పలుకుచున్నది. కనుక మనము స్వీకరించేవి యేసుక్రీస్తుని నిజమైనటువంటి శరీర రక్తములు అని గుర్తించి, యోగ్యముగా స్వీకరించినట్లైతే  రానున్న తీర్పునుండి మనము తప్పించుకోగలము. 

మనం ఎల్లప్పుడూ ప్రభువు సువిశేషంలో పలికిన మాటలను గుర్తుంచుకోవాలి. "నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు" (యోహాను 6 : 35 ).కనుక ఎల్లప్పుడూ పరిశుద్ధతతో ప్రభుని శరీర రక్తములయందు నిండు విశ్వాసం కలిగి   యోగ్యముగా ప్రభువుని స్వీకరించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రభువుని యోగ్యముగా స్వీకరించడంతో క్రైస్తవుల పని అయిపోవడం లేదు. ప్రభుని యోగ్యముగా స్వీకరించిన పిమ్మట ఆయన మనకు ఒక కర్తవ్యాన్ని, భాధ్యతను ఇస్తున్నారు. "ఈ రొట్టెను భుజించునప్పుడెల్ల, ఈ పాత్రనుండి పానము చేయునప్పుడెల్ల ప్రభువు వచ్చు వరుకు ఆయన మరణమును ప్రకటించాలి" (1 కొరింతి 11:26 ). ప్రభువుని స్వీకరించిన పిమ్మట ఆయన మరల వచ్చువరకు ఆయన మరణమును ప్రపంచ నలుమూలల ప్రకటించడం ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత. 

కనుక క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా! ప్రభుని ఎల్లప్పుడూ నిండు విశ్వాసంతో, సంపూర్ణ పరిశుద్ధతో యోగ్యముగా స్వీకరించి ఆ ప్రభువు ఒసగే గొప్ప వరములను పొందే అనుగ్రహమును దయచేయమని ఈనాటి దివ్యబలి పూజలో ఆ  క్రిస్తునాధుని వేడుకుందాము.

 By Br. Joseph Kampally OCD

మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...