19, అక్టోబర్ 2024, శనివారం

29 వ సామాన్య ఆదివారం


యెషయా 53:10-11, హెబ్రి 4:14-16,మార్కు 10:35-45
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ప్రభువుని అనుసరించేవారు సేవక రూపం కలిగి జీవించాలి అనే అంశమును, అదేవిధంగా అధికారం ఉన్నటువంటి వారు సేవకులు వలె తమ యొక్క అధికారమును సద్వినియోగపరుచుకోవాలని వినయంతో సేవ చేయాలని కూడా  తెలుపుతున్నాయి.
ఈనాటి మొదటి పఠణంలో  బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి తెలుపుచున్నది ఈ యొక్క బాధామయ సేవకుడు మరెవరో కాదు క్రీస్తు ప్రభువే ఆయన అందరి కోసం అనుభవించేటటువంటి శ్రమలను గురించి యెషయా ప్రవక్త తెలియజేశారు. క్రీస్తు ప్రభువు యొక్క మరణము పాప పరిహార బలి అయ్యింది. అందరి యొక్క పాపముల నిమిత్తమై ప్రభువు మరణించారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి కొందరికి సంతోషంగా ఉన్న సమయంలో శ్రమలు వస్తాయి, కొందరికి జీవితం యధావిధిగా సాగించే సమయంలో శ్రమలు వస్తుంటాయి. కొంతమందికి శ్రమలు అప్పుడప్పుడు మరి కొంతమందికి శ్రమలు తరచుగా వస్తాయి. కొంతమంది శ్రమలు తట్టుకొని జీవిస్తే మరి కొంతమంది శ్రమలను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటారు. మరికొందరు విశ్వాసాన్ని కూడా కోల్పోతారు.
కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఇతరులకు మేలు చేయుట కొరకు శ్రమలు అనుభవించవచ్చు. పునీత చిన్న తెరెసమ్మ గారు తన యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో తాను తప్పు చేయనప్పటికీ దానిని అంగీకరించుకొని ఆ యొక్క బాధలను పాపుల యొక్క హృదయ పరివర్తనం కొరకై సమర్పించేవారు. ఈనాటి మొదటి పఠణంలో బాధామయ సేవకుడు ఎటువంటి తప్పిదము చేయనప్పటికీ కేవలము ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై, రక్షణ కొరకై తన యొక్క ప్రాణములను త్యాగం చేశారు. ఈనాటి రెండవ పఠణంలో హెబ్రీలకు రాయబడిన లేఖలో రచయిత యేసు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి తెలుపుచున్నారు. ఆయన మనవలె శోధింపబడినప్పటికీ పాపము చేయనటువంటి ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన చెంతకు చేరి ఆయన కృపను పొందుదుమని తెలుపుచున్నారు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటూ తానే ఒక బలిగా ఇతరుల కొరకు సమర్పించుకున్నారు.
ఈనాటి సువిశేష భాగములు యేసు ప్రభువు యొక్క శిష్యులు యోహాను యాకోబులు, ప్రభువు స్థాపించబోయే రాజ్యంలో అగ్రస్థానాల కొరకై ఆశపడ్డారు ఆయన రాజ్యాన్ని ఇహలోక సంబంధమైన రాజ్యముగా, సిరిసంపదలతో కూడిన రాజ్యముగా, శాంతిభద్రతలతో తులతూగే ఒక గొప్ప రాజ్యంగా భావించారు అట్టి రాజ్యములో వీరికి ముఖ్యమైనటువంటి స్థానములను ఇవ్వమని ప్రభువును అడుగుచున్నారు. యోహాను, యాకోబులకు దేవుడు మొదటి స్థానం పేతురుకు ఇచ్చారు అని తెలుసు తరువాత రెండవ- మూడవ స్థానములను యోహాను యాకోబులకు ఇవ్వమని వారు అధికారం కోసం అడుగుచున్నారు. అనేక సందర్భాలలో యోహానును యాకోబును ఏసుప్రభు తనతో తీసుకుని వెళ్లారు. పేతురు అత్త అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరిని తనతో పాటు తీసుకెళ్లారు, యాయీరు కుమార్తె అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరూ ప్రభువుతో ఉన్నారు, దివ్యరూపధారణ సమయంలో కూడా మీరు ఏసుప్రభు తోనే ఉన్నారు. కాబట్టి వీరు కూడా ప్రభువు మాకు ప్రాముఖ్యతనిచ్చారు అయినప్పటికీ అధికారం కొరకు ఆశించారు.
ఇక్కడ ఏసుప్రభు నిజమైన అధికారమంటే పెత్తనం చెలాయించటం కాదు సేవ చేయటం అని తెలియపరుస్తున్నారు. ఈ సువిశేష భాగములో మనము గ్రహించవలసినటువంటి కొన్ని విషయాలు. 
1. ప్రతి శిష్యుడు/ అధికారి సేవకు రూపం దాల్చాలి. దేవుడిని వెంబడించేటటువంటి సమయములో ఎటువంటి పదవులను ఆశించకుండా కేవలము సేవకుని వలె దేవుడి యొక్క బాధ్యతను నెరవేర్చాలి. 
2. ఇచ్చిన అధికారమును వినయముతో నెరవేర్చాలి. కొన్ని సందర్భాలలో అధికారము వచ్చిన తర్వాత అనేక మందికి గర్వం వస్తూ ఉంటుంది కాబట్టి ప్రభువు చెప్పే అంశం ఏమిటంటే వినయంతో అధికారమును వినియోగించుకోవాలి అని తెలుపుచున్నారు. తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క గొప్పతనము చాటి చెప్పాలి.
3. ప్రతి అధికారంలో త్యాగపూరితమైన ప్రేమ ఉండాలి అనగా ఇతరులకు మేలు చేయు సమయంలో తాను (అధికారంలో ఉన్న వ్యక్తి)ఎన్ని బాధలైనా పొందవలసి వస్తే పొందటానికి సిద్ధముగా ఉండాలి. 
4. ప్రతి సేవకుడిలో/అధికారి వినయం ఉండాలి ఎందుకంటే ఏసుప్రభు నేను ఈ లోకంలో సేవ చేయడానికి వచ్చాను సేవింపబడుటకు రాలేదు అని తెలిపారు. కాబట్టి ఏసుప్రభుని వెంబడించే ప్రతి ఒక్క శిష్యుడు- శిష్యురాలు ఆయన వలె వినియం కలిగి జీవించాలి. 
5. నిస్వార్థ సేవను చేయాలి. ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా ప్రభువు యొక్క సేవ చేయాలి.
6. ఏసుప్రభు వలై నిస్సహాయులను అనాధలను స్వీకరించి వారికి మేలు చేయాలి. 
ప్రతి క్రైస్తవుడు అధికారాన్ని సేవగా భావించి క్రీస్తు వలే కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. సమాజములో జరుగుతున్నటువంటి అన్యాయమును ఎదుర్కొని న్యాయం కొరకు పోరాడాలి. పేదల పట్ల బలహీనుల పట్ల దయా కనికరము కలిగి వారి కొరకు పోరాడటానికి ప్రయత్నించాలి. 

Fr. Bala Yesu OCD

12, అక్టోబర్ 2024, శనివారం

28 వ సామాన్య ఆదివారం


సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11
హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30
ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కలిగి ఉండుట కొరకు దేనినైనా వదులుకుని జీవించాలి అనే అంశమును గురించి తెలుపుచున్నవి. ప్రతి ఒక్కరి యొక్క అనుదిన జీవితంలో రోజు ఈ లోక సంబంధమైనటువంటి విషయములతో ప్రాముఖ్యతను ఇచ్చి జీవిస్తారు. కొందరికి బంగారము అంటే విలువ ఎక్కువ, అందరికీ వెండి అంటే ఇష్టం, మరికొందరికి పదవులు ఇంకొందరికి సుఖ భోగాలు, గౌరవ మర్యాదలు ఇష్టం అందుకని వాటికి ప్రాముఖ్యతను, విలువనిచ్చి అవి కలిగి ఉండుట కొరకు ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో సొలోమోను తన యొక్క జీవితంలో ఏది ముఖ్యమైనది అని తెలుసుకొని దానికి విలువనిచ్చి ఆ యొక్క వరము కొరకు ప్రార్థించాలి. సొలోమోను దైవ భక్తుడిగా, నీతిమంతుడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు, ఆయనయే స్వయంగా తెలుపుతున్నటువంటి మాటలు ఏమిటంటే నేను ప్రార్థించినప్పుడు వివేక వరము నాకు లభించినది. దేవుడిని ప్రార్ధించినది వివేకము కొరకు. జ్ఞానము తాను సంపాదించినట్లయితే ఇంక తన జీవితంలో ఏదీ కూడా అవసరం లేదు అని సొలోమోను గ్రహించాడు కాబట్టి జ్ఞానమును సంపాదించుట కొరకు దేవుని ప్రార్థించారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనం దేనికొరకు ప్రార్థిస్తున్నాము అని మనము ఒకసారి పరిశీలించుకోవాలి. సొలోమోను రాజు ఆయన తన యొక్క వివేకము ద్వారా తెలుసుకున్న సత్యమేమిటంటే ఈ లోక పదవుల కన్నా, సంపదల కన్నా, సింహాసనములకన్నా, రాజు దండనముకన్నా విలువైనది జ్ఞానము అని తెలుసుకున్నారు అందుకని దానిని పొందుట కొరకై దేనినైనా సరే వదులుకొనుటకు సిద్ధపడుతున్నారు. సొలోమోను యొక్క విజ్ఞానము వలన తెలుసుకున్న విషయం ఏమిటంటే ఈ లోక సంపదలు ఏవి కూడా జ్ఞానముతో సరిపోవని తెలిపారు. జ్ఞానముతో పోల్చినప్పుడు బంగారమంతా వట్టి ఇసుక ముద్ద, వెండి అనేది మట్టి పెళ్లతో సమానం. ఆయన తన యొక్క జీవితంలో ఆరోగ్యము కంటే సౌందర్యం కంటే ఎక్కువగా జ్ఞానమునే పొందాలని ఆశించాడు. మన యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ఏది కావాలో అనే అవగాహన లేదు. కొన్ని సందర్భాలలో సంపదలకే ఎక్కువ విలువ ఇస్తాము, కానీ సొలోమోను మాత్రం విజ్ఞానమునకు మొదటి స్థానమును ఇచ్చారు ఎందుకనగా విజ్ఞాన ద్వారా అంతా కూడా సంపాదించవచ్చు. ఆయనకు ఉన్నటువంటి విజ్ఞానమును బట్టి షెభారాణి కూడా ఆయనను చూడటానికి వచ్చారు. ఇంగ్లీష్ లో ఒక సామెత one idea can change your life ఇది ఎలా సాధ్యమంటే మనకు విజ్ఞానం ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే. మనము కూడా విజ్ఞానమును దేవుని యొక్క కృప వలన పొందాలి. విజ్ఞానము కొరకు ప్రార్థించాలి ఈ యొక్క విజ్ఞానముతో మన యొక్క జీవితములో ఏది ఉత్తమమైనదో అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవింప సాగాలి. విజ్ఞానము మనకు నేర్పిస్తుంది మన జీవితంలోను సరి చేస్తూ ఉన్నది కావున సొలోమోను ఏ విధముగానయితే దేవుని యొక్క జ్ఞానమునకు ప్రధాన స్థానమును ఇచ్చి దానిని సర్వస్వంగా భావించి దానిని పొందుట కొరకై దేవుడిని ప్రార్థించి వేడుకున్నాడో అదేవిధంగా మనం కూడా దేవుడిని ప్రార్థించి విజ్ఞానాన్ని పొంది మంచి విశ్వాసులుగా జీవించాలి. 
ఈనాటి రెండవ పఠణంలో దేవుని యొక్క వాక్కు సజీవమైనది చైతన్యవంతమైనది అని తెలుపుచున్నది. ఆయన యొక్క వాక్కు మన జీవితంలో ఉన్నటువంటి చెడును తొలగిస్తుంది మనలో హృదయ పరివర్తన కలుగచేస్తుంది. ఆ విలువైనటువంటి దేవుని యొక్క వాక్కు కొరకు మనము తపించాలి. మన జీవితములను సరిచేసుకోవాలి. 
ఈనాటి సువిశేష పఠణములో ఒక యువకుడు నిత్యజీవితము పొందుటకు నేనేమి చేయాలి అని ప్రభువుని అడుగుతున్నారు. అందుకు తనను, ఏసుప్రభు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని తెలుపుతున్నారు ఆ యువకుడు అవి అన్నియు చిన్ననాటి నుండే పాటిస్తున్నాడని తెలిపారు. అప్పుడు ప్రభువు ఆయనకు తన దగ్గర ఉన్నటువంటి ధనము పేదలకు దానం చేసి ఇవ్వమని తెలిపారు కానీ అతడు దానికి ఇష్టపడలేదు. ఈ యువకుడు యొక్క ఉద్దేశ్యము నిత్య జీవము పొందుట మరి ఆ ఉద్దేశం కొరకు ఎందుకు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ధనమును విడిచిపెట్టలేదు? ఈ యువకుడు ధనమే ముఖ్యమని భావించాడు. ధనము ఉన్న ఎడల తనకు మంచి గౌరవము అదే విధముగా తన భవిష్యత్తు బాగుంటుందని భావించాడు అందుకే ధనానికి ప్రాముఖ్యతను ఇచ్చి దానిని విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. వాస్తవానికి ధనపేక్ష అన్నది సర్వ అనర్ధాలకు మూలం. ఈ యువకుని యొక్క హృదయం ధనాశతో నిండి ఉన్నది కాబట్టి దానిలో దేవునికి స్థానము ఇవ్వలేదు. ధనాపేక్ష అతని పట్టి పీడిస్తుంది. ఈయొక్క ధనం వలనే ఆయన ఉదార స్వభావిగా జీవించి లేకపోయాడు. ఈ యొక్క యువకుడు తన యొక్క జీవితంలో ధనం కన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని భావించినట్లయితే ఆయన మీద ఆధారపడి జీవించేవాడు, ఆయనకు నిత్యజీవం లభించేది కానీ ఈ యొక్క యువకుడు దేవుని కన్నా ధనానికే ప్రాముఖ్యతనిచ్చి జీవించాడు అందుకనే విలువైన నిత్య జీవితాన్ని కోల్పోయాడు. ఈ యువకునికి దేనికి ప్రాముఖ్యత నివ్వాలో, దేనిని కలిగి జీవించాలో తెలుసుకోలేక పోయాడు అందుకే తన జీవితంలో సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఏసుప్రభు తన కొరకు ఎవరైతే సమస్తము విడిచిపెడతారో వారు నూరంతలుగా ఆశీర్వాదం పొందుతారని తెలిపారు (మార్కు 10:28-31). ఈ విషయాన్ని ఆ యువకుడు మరిచిపోయారు. మన యొక్క జీవితంలో దేవునికి విలువ నుంచి జీవించాలి అప్పుడు దేవుడు మనకు సమస్తము కూడా సమకూర్చును.
Fr. Bala Yesu OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...