యోహాను 10:22-30
యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతకాలము. యేసు దేవాలయమున సోలోమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టు గుమికూడి, "నీవు ఎంత కాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచేదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగ చెప్పుము" అని అడిగిరి. అందుకు యేసు వారితో, "నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముట లేదు. నా తండ్రి పేరిట నేను చేయు క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముట లేదు. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికీ నాశము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరి కంటే గొప్పవాడు. కనుక, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను, నా తండ్రి ఏకమైయున్నాము" అని చెప్పెను.
ఎందుకు యిస్రాయేలు కాపరులు విఫలం అయ్యారు?
"యెరూషలేములో దేవాలయయెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతకాలము. యేసు దేవాలయమున సోలోమోను మంటపమున నడుచుచుండెను." దేవాలయ ప్రతిష్టోత్సవము యిస్రాయేలు పండుగలలో చాలా ముఖ్యమైన పండుగ. అది వారు యేరుషలేము దేవాలయాన్ని మక్కబియుల కాలంలో పునః ప్రతిష్ట చేసిన సమయాన్ని గుర్తు చేస్తూ పండుగ జరుపుకునే సమయం. ఈ సమయాలలో వారు యెహెజ్కేలు గ్రంధంలో యిస్రాయేలు ప్రజలకు దేవుడు తానే కాపరిగా ఉంటాను అనే మాటలను ధ్యానించేవారు, వారి కాపరులు ఎలా కాపరులగా విఫలం చెందారో ధ్యానించేవారు. ఈ సంధర్భంలో జరుగుతున్న సువిశేషం భాగం ఇది. ఎవరు నిజమైన కాపరి. ఎలా కాపరులు విఫలం చెందారు? అంటే యిస్రాయేలు కాపరులు స్వార్ధంతోటి జీవించి వారి బాధ్యతను విస్మరించారు.
సంపూర్ణమైన విశ్వాసం
"యూదులు ఆయన చుట్టు గుమికూడి, "నీవు ఎంత కాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచేదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగ చెప్పుము" అని అడిగిరి." ఇక్కడ కొంతమంది యేసు ప్రభువు దగ్గరకు వచ్చి నీవు క్రీస్తువా? అని అడుగుతున్నారు. ఎందుకు వారు ఆయనను అడుగుతున్నారు అంటే ఆయన వారికి అప్పటికె కాపరి గురించి, యిస్రాయేలు కాపరి గురించి చెప్పాడు. యేసు ప్రభువే వారికి కాపరిగా కావాలని వుంది. ఆయన చేసిన పనులను బట్టి ఆయన వారి కాపరి అయితే వారికి దేవుని నుండి వచ్చే మేలుల గురించి వారికి ఒక అవగాహన ఉంది, కనుక వారు యేసు ప్రభువును నీవు క్రీస్తువా? అని అడుగుతున్నారు. కాని యేసు ప్రభువు అనేక సార్లు తన పనులు తాను క్రీస్తు అని చెబుతున్నాయి అని వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారు మరల ఆయనను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. యేసు ప్రభువు వారిని సంధిగ్ధావస్థలో ఉంచలేదు. పూర్తిగా యేసు ప్రభువుకు చెందిన వారిగా ఉండుటకు వారు నిశ్చయించుకోలేదు అందుకే వారు అలా మాటలాడుతున్నారు. ప్రభువును విశ్వసించిన వారికి ఆయన మీద ఎటువంటి అపనమ్మకం లేదు. ఆయన పనులను మొత్తాన్ని వారు నమ్ముతారు.
ప్రభువు అతీతమైన శక్తి గలవాడు
"అందుకు యేసు వారితో, "నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముట లేదు. నా తండ్రి పేరిట నేను చేయు క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. " యేసు ప్రభువు మరల వారికి ఆయన ఎవరు అనే విషయం తేటతెల్లం చేస్తున్నారు. నేను మీకు ముందే చెప్పితిని అని అంటున్నారు. కాని వారు ఆయన మాటలను నమ్మని విషయాన్ని ఆయన వారికి చెబుతున్నారు. యేసు ప్రభువు ఇక్కడ తాను చేసే పనులు తన గురించి సాక్ష్యం ఇస్తున్నవి అని చెబుతున్నారు. ఇది ఇక్కడ మాత్రమే కాదు యేసు ప్రభువు చేసిన ప్రతి పని కూడా ఆయన ఎవరు ? అని ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి పని కూడా మానవ మాత్రుడు ఎవరు చేయలేనటువంటి పని. ఆయన ప్రతి కార్యం కూడా రక్షణ ఇచ్చే కార్యం. దాని ద్వారం ఆయన దేవుడు అని తెలుస్తుంది. ఇవి అన్ని చూసి కూడా ఆయనను మరలా అదే ప్రశ్న వారు అడుగుతున్నారు. వారు ఆయనను నమ్ముటకు సిద్ధంగా లేరు. వారు ఆయనను ఎందుకు నమ్ముట లేదు అంటే వారు ఆయనకు చెందిన వారు కాదు.
"మీరు నా గొర్రెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముట లేదు. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును." ఆయనకు చెందిన వారు అయితే ఆయన మాటలను విశ్వసించేవారు. ఆయనను వెంబడించేవారు. కాని ఆయనకు చెందిన వారిగా ఉండుటకు వారికి ఇష్టం లేదు. ఆయన అనుచరులుగా ఉండేవారికి, ఆయనను అనుసరించే వారికి ఆయన ఎవరు అని తెలుసు, ఆయన చేసే పనులన్నీ కూడా దేవునికి మాత్రమే సాధ్యం, మానవ మాత్రుడు ఎవరు కూడా ఆయన చేసే పనులని చేయలేరు. ఎందుకు కొంతమంది ఆయనను నమ్ముట లేదు? దీనికి కారణం ఏమిటి అంటే ఆయనను నమ్మని వారు వారి జీవితాలను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు, ఆయనకు పూర్తిగా చెందిన వారిగా ఉండుటకు ఇష్ట పడలేదు. ఎందుకంటే ఆయనకు చెందిన వారిగా ఉండాలి అంటే ఆయన మాటలకు అనుకులమూగ జీవించాలి. ఆయన చెప్పినట్లుగా జీవించుటకు వీరు సిద్ధముగా లేరు కనుక ఆయనను వారు నమ్మక మరలా ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాని యేసు ప్రభువుకు చెందిన వారు ఆయనను ఎప్పుడు వెంబడిస్తూనే వుంటారు.
నిత్యజీవ ప్రదాత ప్రభువు
"నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికీ నాశము చెందవు." యేసు ప్రభువు తనను అనుసరించే వారికి నిత్యజీవము ఇస్తాను అని వాగ్ధానం చేస్తున్నాడు. కనుక వారు ఎల్లకాలము జీవిస్తారు. వారు నాశము చెందక జీవిస్తారు. ఎందుకు వారు నాశము చెందరు, అంటే ఆయనే జీవం, ఈ జీవంతో ఉన్న వారు ఎవరు కూడా నాశము చెందరు. ఈ జీవం మనలను ఎల్లపుడూ జీవించాడానికి మనతో పాటు ఉంటుంది. ఇది అందరికీ కాక ఆయనకు చెందిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇది యేసు ప్రభువు మనకు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. మనం కూడా ఈ జీవం కలిగి ఉండటానికి సిద్దపడుతున్నామా! లేక ఈ లోక విషయాలలోనే సంతృప్తి పడుటకు ఇష్టపడుతున్నామా? ఈ ప్రశ్నలను ప్రతి నిత్యం మనం అడగవవలసిన అవసరము ఉన్నది.
"వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరి కంటే గొప్పవాడు. కనుక, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను, నా తండ్రి ఏకమైయున్నాము" అని చెప్పెను. ఇక్కడ మనం యేసు ప్రభువుని శిష్యులు లేక ఆయన అనుచరులను, ఆయనకు చెందిన వారిని ఎవరు ఆయన నుండి అపహరించలేరు అని అంటున్నారు దానికి కారణం ఏమిటి అంటే ఆయనను వారు అంతగా అనుభవించారు, ఆయనను వారు అంతగా అనుభవ పూర్వకముగా తెలుసుకున్నారు కనుక ఆయన నుండి ఎవరు వారిని వేరు చేయడానికి ప్రయత్నించిన అది కుదరదు, దైవ అనుభవం అంత గొప్పది. పునీత పౌలు మరియు అనేక మంది పునీతులు ఇలా జీవించిన వారే. వారికి క్రీస్తు తప్ప మిగిలినది మొత్తం వ్యర్ధమే. అంతేకాదు యేసు ప్రభువు నుండి తీసుకొనుట అంటే తండ్రి నుండి తీసుకొనుట రెండు కూడా సాధ్యం కాదు. ఇక్కడ యేసు ప్రభువు తండ్రితో తనకు ఉన్న ఐక్యతను, వారు ఇద్దరు ఏకమై ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు.
ప్రార్ధన : ప్రభువా మీరు మా నిజమైన కాపరి అని మేము తెలుసుకుంటున్నాము. కొన్ని సార్లు మా స్వార్ధ బుద్ధితో ఎక్కడ మా జీవితములో మిమ్ములను అనుసరించినట్లయితే మమ్ములను మేము మార్చుకోవాలి ఏమో, అనే ఆలోచనలతో మీ కాపుదలలో ఉండకుండా మీరు ఎవరో తెలియదు అనే విధంగా మేము జీవిస్తున్నాము అటువంటి సమయాలలో మమ్ములను క్షమించండి. మేము మిమ్ములను మా కాపరిగా అంగీకరించి జీవించే విధంగా మమ్ములను దీవించండి. మేము మీ పనుల, ద్వారా, మీ మాటల ద్వారా మీరే రక్షకుడు అని తెలుసుకుంటున్నాము. మమ్ములను మీ అనుచరులుగా, మీ మందలోనివారినిగా చేయండి. మేము మీ నుండి ఎవరిచేత అపహరింపకుండా ఉండేలా కాపాడండి. దాని ద్వారా మేము ఎప్పటికీ నాశము చెందక మీరు చెప్పిన నిత్యం జీవం పొందేలా మరియు మేము ఎప్పుడు మీ స్వరమును విని పాటించే విధంగా మమ్ము దీవించండి. ఆమెన్.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి