15, జూన్ 2024, శనివారం

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం 
యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బోధిస్తున్నాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్నటువంటి సమయములో వారి జీవితంలో ఒక నమ్మకమును కలుగ చేస్తున్నారు. దేవుడు ఎత్తైన దేవదారు మీద ఒక కొమ్మను విరిచి దానిని పర్వతం మీద నాటుతారు అని అన్నారు. ఆ యొక్క చెట్టు పెద్దదిగా ఎదిగి గొప్ప దేవదారు వృక్షం అగును అని తెలుపుచున్నారు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితమును ఉద్దేశించి ప్రభువు పలికినటువంటి మాటలు.
ఇశ్రాయేలు ప్రజలు తాము చేసినటువంటి పాపమునకు ఫలితముగా బానిసత్వ జీవితమును జీవింపవలసి వచ్చినది. అన్యదైవములను పూజించినందుకు వారు దేవుని చేత శిక్షింపబడ్డారు. వారి యొక్క బాధలో ఉన్న సమయంలో దేవుడు వారిని మరలా స్వీకరించటానికి సిద్ధపడ్డారు అందుకుగాను ప్రభువు పలుకుచున్నారు నేనే స్వయముగా కొమ్మను నాటుదను అది ఎదుగును అని తెలుపుచున్నారు అనగా యావే ప్రభువు త్వరలో ఇశ్రాయేలు ప్రజలను తమ దేశానికి తీసుకుని వచ్చి మరల వారికి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదిస్తారని ఒక అర్థం ఇంకొక అర్థం ఏమిటంటే రాబోయే కాలంలో ఇజ్రాయేలు ప్రజల నుండి మెస్సయ్య జన్మించి ఆయన సువార్త పరిచర్య ద్వారా అనేకమంది దేవుని యొక్క బిడ్డలగా మార్చబడతారు మరియు దేవుని యొక్క రాజ్యము విస్తరిల్లుతున్నది అని అర్థం. 
మొదటి పఠణము ద్వారా గ్రహించవలసిన అంశములు ఏమిటి అంటే;
1. దేవుడు మనతో ఉంటే మనం అభివృద్ధి చెందుతుంటాము, దీవించబడతాం. ప్రభువు ఏ విధముగానయితే ఇశ్రాయేలు ప్రజలకు భద్రతను కల్పిస్తూ, తోడుగా ఉంటూ వారు అభివృద్ధి చెందే విధంగా ప్రజలును దీవించారు. అలాగే దేవుడు మనతో ఉంటే మనం కూడా దీవించబడతాం.
2. ప్రభువు ఎత్తైన చెట్లను నరుకుతాను అని తెలుపుచున్నారు దీనిని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నట్లయితే ఎవరైతే గర్వంతో ఉంటారో వారిని దేవుడు తమ యొక్క పదవుల నుండి తొలగిస్తారు. అందుకే మరియ తల్లి తన స్తోత్ర గీతములో దేవుడు ఎలాగ గర్వాత్ములను అధికారం నుండి పడగొడతారు తెలుపుతూ దీనులను ఏ విధంగా దీవిస్తారో తెలిపారు. (లూకా 1:51,52)
3. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని తెలుపుతున్నారు ఎందుకనగా పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడునట్లు చేసేది దేవుడు మాత్రమే అనగా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి జీవితాలలో నమ్మకమును దయచేసి దేవుడే అలాగే గర్వముతో , భయము, భక్తి లేకుండా జీవించే వారి యొక్క జీవితాలు సంతోషము లేని జీవితాలుగా మారతాయి. దేవుడు తన ప్రజల జీవితంలో ఏదైనా చేయవచ్చు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
ఈనాటి సువిశేష భాగములో కూడా ఏసుప్రభు పరలోక రాజ్య వ్యాప్తి గురించి రెండు ఉపమానముల ద్వారా తెలియచేయుచున్నారు. ఈ రెండు ఉపమానములలో ఎదుగుదల అనేది గొప్పదిగా ఉంటుంది. ప్రారంభం చిన్నదిగా ఉన్న ముగింపు మాత్రం పెద్దదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదగాలి అది విశ్వాసములో అవ్వొచ్చు, చదువులోనైనా అవ్వొచ్చు, ప్రార్థనలో నైనా అవ్వొచ్చు, సంపదల్లోనైనా అవ్వొచ్చు.  ప్రభువు విత్తు వాడిని ఉదాహరణగా తీసుకొని ఆ విత్తనములు వెదజల్లినప్పుడు ఏ విధంగానైతే ఎవరికీ తెలియకుండా మొలకలు వస్తాయో అదే విధముగా ప్రభువు యొక్క రాజ్యము కూడా ఎవరు ఊహించని విధంగా విస్తరిల్లుతుంది అని తెలిపారు.
రెండవ ఉపమానము ఏసుప్రభు ఆవగింజను ఉదాహరణగా తీసుకొని పరలోక రాజ్యం గురించి తెలుపుచున్నారు. ఆవ గింజ చూడటానికి చిన్నదైనప్పటికీ దాని యొక్క ఎదుగుదల ప్రభావము చాలా గొప్పది. ప్రభువు ఎందుకు ఆవగింజనే ఉదాహరణగా తీసుకున్నారు అని ధ్యానించినట్లయితే ఆవగింజ చిన్నది కానీ ఫలితం పెద్దది అలాగే మన జీవితంలో కూడా వినయముతో ప్రారంభించిన ఏ పని అయినా సరే అది విజయవంతమగుతున్నది  ఎందుకంటే ఆయన దీనులను ఆశీర్వదిస్తారు కాబట్టి.
ఆనాడు దేవుడు ఆదాము అవ్వతో ప్రారంభించిన సృష్టి ఏ విధంగానైతే గొప్పగా విస్తరిల్లినదో అలాగే ఏసుప్రభు 12 మంది శిష్యుల ద్వారా ప్రారంభించిన తన యొక్క పరిచర్య ఈనాడు దేవుని రాజ్యం ఎంతగానో విస్తరిల్లినదో మనం చూస్తున్నాం దీనికి కారణం దేవుడు. శ్రీ సభ దినదినాభివృద్ధి చెందాలి అంటే దేవుని కృప సహకారం ఉండాలి. ఆయన కృప లేనిదే ఏది కూడా సాధ్యం కాదు. 
మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనము దినదినాభివృద్ధి చెందాలి దానికి గాను వినయముతో జీవించాలి.
Fr. Bala Yesu OCD

8, జూన్ 2024, శనివారం

పదవ సామాన్య ఆదివారం

పదవ సామాన్య ఆదివారం 
ఆది 3:9-15
2 కొరింతి 4:13-5:1
మార్కు 3:20-35
ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠణములు పాపము దాని యొక్క ఫలితము గురించి బోధిస్తున్నాయి. పాపము చేయటం ద్వారా మానవులు దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. పాపము చేయటం ద్వారా దేవునికి దూరమవుతాం అదేవిధంగా మన యొక్క పొరుగు వారికి కూడా దూరం అవుతాం అలాగే వారిని బాధిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో పాపము చేస్తూనే ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో ఈ లోకంలోకి పాపము ప్రవేశించినటువంటి విధానము గురించి ఆదికాండములో వివరించబడినది. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ పాపము చేసి దేవునికి విరుద్ధముగా నడుచుకున్నారు. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించారు. హీబ్రూ భాషలో పాపమును HATTAH అని పిలుస్తారు అనగా చేయవలసిన మంచి చేయకపోవడం. ( Missing the target). ఆదాము అవ్వ దేవుడి ఎడల మంచిగా ప్రవర్తించవలసి ఉండినది కానీ వారు ప్రవర్తించలేదు. దేవునికి వారు విధేయత చూపించాలి కానీ చూపించలేదు అది వారి యొక్క పాపం. పాపం చేయటం ద్వారా ఆదాము అవ్వ దాగుకొని జీవిస్తున్నారు ఆ సందర్భంలో దేవుడు ఆదామును నీవెక్కడ అని ప్రశ్నించారు? ఇది దేవుడు పవిత్ర గ్రంథంలో అడిగిన మొట్టమొదటి ప్రశ్న. దీని యొక్క అర్థం ధ్యానించినట్లయితే -దేవుడు ఆదామును నీవు నాతో ఉన్నటువంటి బంధములో ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తున్నారు.
- నీవు నీ కుటుంబ సభ్యుల బంధములో ఎక్కడున్నావు 
- నీవు నీ పొరుగు వారి యొక్క విషయాలలో ఎక్కడున్నావు 
- నీవు దేవాలయం రాకుండా ఎక్కడున్నావు 
- ప్రార్థించకుండా ఎక్కడున్నావు అని వివిధ కోణాలలో ఈ యొక్క ప్రశ్న గురించి ధ్యానించవచ్చు. నేడు దేవుడు ఇదే ప్రశ్న మనందరిని కూడా అడుగుచున్నారు. నీవు ఎక్కడున్నావు?
పాపములో జీవిస్తున్నటువంటి మనము దేవునితో ఉన్నటువంటి బంధంలో ఎక్కడ జీవిస్తున్నాం. మనం కూడా ఆదాము అవ్వలే పాపం చేసి దేవుని సన్నిధికి రాకుండా జీవిస్తున్నామా?
 దేవుడు ఆదాము అడిగిన రెండవ ప్రశ్న నీవు దిశములతో ఉన్నావు అని ఎవరు చెప్పితిరి? 
ఆదాము సైతాను నాకు ఈ విషయమును తెలియజేశారు అని పలికాడు. ఆదాము సైతాను మాట విన్నాడు కాబట్టి పాపము చేసాడు. సైతాను మనల్ని అనేక సందర్భాలలో మోసం చేస్తూనే ఉంటూ ఉంటుంది. మనం ఎవరి స్వరమును వినాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరికి విధేయత చూపించాలి అనేది మన యొక్క అనుదిన జీవితంలో ఒక పోరాటం లాంటిది కాబట్టి మనం సరియైన నిర్ణయం తీసుకొని దేవుడికి అనుగుణంగా మంచిని ఎన్నుకొని జీవించాలి.
1.పాపము చేయటం ద్వారా - ఆదాము అవ్వలు అవమానానికి గురయ్యారు అందుకనే వారు ఎవరికీ కనబడకుండా దాగుకొని జీవించడానికి సిద్ధమయ్యారు.
2. పాపము చేయడం వలన కొన్నిసార్లు దానిని మనము అంగీకరించము. ఆదాము అవ్వ చేసినటువంటి పాపము కూడా అంగీకరించలేదు. 
3. పాపము మనలను ఇతరులను నిందించేలాగా చేస్తుంది. ఆదాము అవ్వను నిందించాడు, అవ్వ పామును నిందించినది. ఈ విధంగా ప్రతిసారి పాపం చేసిన సందర్భంలో మనము ఎవరినో ఒకరిని నిందిస్తూ ఉంటాం.
4. పాపం చేయడం ద్వారా ఆదాము అవ్వ భయపడుతూ, భయపడుతూ జీవిస్తున్నారు. 
5. పాపము చేయటం ద్వారా స్వేచ్ఛను కోల్పోతున్నారు.
6. పాపము చేయటం ద్వారా దేవునితో ఉన్నా స్నేహం కోల్పోయారు. 
7. పాపము చేయటం ద్వారా పరలోకమును కోల్పోయారు.
 ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యందు విశ్వాసము కలిగి జీవించుట అనే అంశం గురించి తెలుపుచున్నారు. ఈ లోకంలో చిన్న చిన్న కష్టాలు ఎదురైనా సరే దేవుడువసగు ప్రతిఫలము ద్వారా సంతోషముగా జీవిస్తున్నాం అని పౌలు గారు తెలుపుతున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో మార్కు సువార్తికుడు రెండు అంశములను గురించి తెలియజేస్తున్నారు. 
1. ఏసుప్రభు ఎవరి అధికారంతో దయ్యములను పారద్రోలుచున్నారు అని.
2. ప్రభువు యొక్క ఆధ్యాత్మిక తల్లి, సోదరీ సోదరులు ఎవరని. 
ఏసుప్రభు నజరేతు వచ్చినటువంటి సమయంలో అక్కడికొందరి ప్రజలు ఆయనకు మతి చలించినదని భావించారు. ఆయన వారికి ఎంత మంచి చేసినప్పటికీ వారు మాత్రము ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకుని పాపం చేశారు. దానికి ప్రతిఫలంగా ప్రభువు, ఆయన ఎవరి అధికారంతో దయ్యములను వెళ్ళగొట్టుచున్నారని తెలిపారు. 
అదేవిధంగా ప్రభువు యొక్క కుటుంబ సభ్యులో భాగస్తులై జీవించాలి అంటే మనము దేవుని యొక్క చిత్తమును మన యొక్క జీవితంలో నెరవేర్చాలి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. మరియ తల్లి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి దేవునికి విధేయత చూపించినది కాబట్టే ఆమె నిష్కలంక మాతగా జీవించారు. మరియ తల్లి పాపము చేయకుండా సంపూర్ణముగా దేవునితో బంధము కలిగి ఆమె మనందరికీ కూడా ఒక సుమాతృకగా జీవించారు.
ఈనాడు మనందరం కూడా మన యొక్క బలహీనత ద్వారా పాపములో పడకుండా, సైతాను శోధనలకు లొంగకుండ దేవుని చిత్తానికి లోబడి, మంచిని చేస్తూ ఆయనతో బంధము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 
పాపం మనల్ని దేవుడి నుండి దూరం చేస్తుంది కాబట్టి పాపమని విడిచిపెట్టి, పశ్చాతాపపడి దేవునికి దగ్గర జీవించుదాం.
Fr. Bala Yesu OCD

1, జూన్ 2024, శనివారం

పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల పండుగ

పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల పండుగ 

ఈనాడు తల్లి శ్రీ సభ ఏసుక్రీస్తు దివ్య శరీర రక్తముల పండుగను కొనియాడుచున్నది. ఈ పండుగ దేవుని యొక్క నిజమైన సాన్నిద్యం దివ్యసప్రసాదంలో ఉన్నది అని తెలుపుచున్నది. ఈ పండుగ 13వ శతాబ్దంలో జూలియానా అనేటటువంటి భక్తిపరురాలు తనకు కలిగినటువంటి దర్శనం ద్వారా అప్పటి 4 వ ఉర్బన్ పాపుగారు తెలియజేసి ఈ పండుగ అధికార పూర్వకంగా ప్రపంచమంతా జరుపుకోవాలని ప్రకటించారు. ఈ యొక్క పండుగ మూడు విశ్వాస సత్యాలను మనకు నేర్పిస్తుంది. 
1. నిజ దేవుడు నిజమానవుడైన యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు భూమికి దిగి రావటం. మన కొరకు తన శరీర రక్తములను ఆహారముగా ఇచ్చుట. 
2. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో జీవిస్తారు ఈ యొక్క దివ్య సత్ప్రసాదం ద్వార.
3. దేవుని యొక్క సాన్నిద్యాన్ని ప్రతిరోజు దివ్యబలి పూజ ద్వారా అనుభవించుట.
 ఏసుప్రభు మరణించే ముందు మనందరికీ కూడా ఇచ్చినటువంటి రెండు విలువైన కానుకలు ఆయన యొక్క శరీర రక్తములు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండటానికి ఆయన యొక్క శరీర రక్తములను మనకు ఒసగి ఉన్నారు.
 ఈనాడు మనందరం కూడా ప్రత్యేక విధముగా ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటి అంటే దివ్య సత్ప్రసాదం యొక్క గొప్పతనం. దివ్య సత్ప్రసాదం ద్వారా దేవుడు అనేక అద్భుతములు చేసి ఉన్నారు. దివ్యసప్రసాదం శ్రీ సభకు ఉన్నటువంటి ఒక గొప్ప సంపద. ఎక్కడ ఎవరి దేవాలయానికి వెళ్లిన వారికి కేవలం దొరికేది దేవుని యొక్క ప్రసాదం మాత్రమే కానీ కతోలికలకు లభించేది ఏమిటి అంటే సాక్షాత్తు దేవుని యొక్క శరీర రక్తములు. స్వయముగా దేవుడే ప్రజల యొక్క హృదయంలోకి వేంచేస్తారు. చాలామంది పునీతులు దివ్య సత్ప్రసాదం యొక్క ఔన్నత్యం గురించి తెలియజేశారు. పునీత మదర్ తెరిసా గారు నేను ఇంతటి గొప్ప సేవ చేస్తున్నాను అంటే దానికి కారణము దివ్య సత్ప్రసాద నాధుడు నాకు శక్తిని ఇస్తున్నారు అని పలికారు. 
పునీత మరియా జాన్ వియాని గారు దివ్యసప్రసాదం గురించి తెలిపే సందర్భంలో ఈ విధంగా అంటున్నారు దివ్యసప్రసాదం స్వీకరించిన వ్యక్తి ఒక నీటి చలమ దగ్గర ఉండి ఆ నీటిని తనలోకి తీసుకోలేకుండా దాహంతో మరణించినవారి లాంటి వారు.
పునీత సిరిల్ గారు దివ్య సత్ప్రసాదం గురించి ఈ విధంగా అంటున్నారు దివ్య సత్ప్రసాదములో ఉన్న సజీవుడైన యేసును స్వీకరించిన వ్యక్తి సజీవుడుగా మారతాడు. 
పునీత్ అగస్టీను గారు అంటారు, దివ్య సత్ప్రసాదమును స్వీకరించిన వ్యక్తి క్రీస్తు వలే రూపాంతరం చెందుతారు. క్రీస్తు ప్రభువు యొక్క జీవితమే మన జీవితంగా మారుతుంది. పునీత పౌలు గారు పలికిన విధంగా ఇక నేను కాదు జీవించేది నాలో ఉన్న క్రీస్తే జీవిస్తారు (గలతి 2:20) అని అన్నట్టుగా మన జీవితం మారాలి. ఆయన వలే ప్రేమించాలి, ఆయన వలే క్షమించాలి, ఆయన వలె సహాయం చేయాలి ఇంకా ఆయన వలే మంచి లక్షణములు కలిగి జీవించాలి అప్పుడే మనందరం కూడా క్రీస్తు ప్రభువు వలే రూపాంతరం చెందిన వారంగా పిలవబడతాం.
దివ్యసత్రసాదం మనకు బలమును, జీవమును, అనుగ్రహమును దయ చేస్తుంది. దివ్య సత్ప్రసాదములో ఉన్న ఏసుప్రభు మనందరినీ ఆయన యొక్క శరీర రక్తములను భుజించమని తెలిపారు. యోహాను సువార్త 6:53 ఆయన యొక్క శరీర రక్తమును భుజించిన ఎడల మనలో జీవము ఉంటుంది అని తెలియజేశారు. అదేవిధంగా ప్రభువు శరీర రక్తములను స్వీకరించుట ద్వారా మన యందు దేవుడు దేవునియందు మనం ఐక్యమై జీవిస్తాము. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఆకాశము నుండి మన్నాను భుజించిరి కానీ వారు మరణించిరి కానీ ఏసుప్రభు తన యొక్క శరీర రక్తములను వసగుట ద్వారా వాటిని స్వీకరించిన మనము నిత్యము ప్రభువు నందు జీవిస్తాము.
ఇజ్రాయిల్ ప్రజలు మన్నా భుజించారు ఆ మన్నా కొలది కాలం మాత్రమే వారితో ఉన్నది కానీ ఏసుప్రభు ఇచ్చిన శరీర రక్తములు మనతో శాశ్వతంగా ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు మన్నాను భుజించి మరణించింరి కానీ ఆయన శరీర రక్తములు భుజించిన మనం నిత్యము జీవిస్తాము.
దివ్యసప్రసాదము ద్వారా క్రీస్తు తన యొక్క జీవితాన్ని మనందరికీ కూడా త్యాగం చేశారు మరి మనము కూడా మన యొక్క జీవితంలో త్యాగం చేస్తూ ఇతరులకు సంతోషమును దయచేయాలి. 
దివ్య సత్ప్రసాదం దేవుని యొక్క ప్రేమకు గుర్తు కాబట్టి మనము కూడా ప్రేమతో జీవించాలి. 
దివ్యసప్రసాదం ఐక్యతకు గురుతు కాబట్టి మనము కూడా ఐక్యంగా జీవించాలి.
Fr. Bala Yesu OCD

25, మే 2024, శనివారం

త్రియేక దేవుని పండుగ

త్రియేక దేవుని పండుగ 
ద్వితీయో 4:32-34, 39-40
రోమి 8:14-17, మత్తయి28:16-20
ఈనాడు తల్లి శ్రీ సభ త్రియేక దేవుని పండుగను కొన్ని యాడుచున్నది. ప్రతి ఆదివారం కూడా వీరి ముగ్గురి పండుగ ఎందుకనగా, పితదేవుడు ఆదివారం రోజున సృష్టిని ప్రారంభించారు. పుత్రుడైన దేవుడు ఆదివారం రోజున మరణమును గెలిచి పునరుత్థానం అయ్యారు. పవిత్రాత్మ దేవుడు శిష్యుల మీదకు పెంతుకోస్తు ఆదివారం రోజున వేంచేశారు కావున ప్రతి ఆదివారము వీరి ముగ్గు పండుగను జరుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకంగా దైవార్చన ఆదివారం ప్రకారం వీరి యొక్క రక్షణ పాత్రను ప్రత్యేకంగా ధ్యానించమని శ్రీ సభ కోరుచున్నది. 
మనం ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రించే వరకు పితా, పుత్ర పవిత్రాత్మ నామమున ప్రార్థన చేస్తూ ఉంటాము వారి ద్వారానే ఏ కార్యమైనా తలపెడుతుంటాం, వారి ద్వారానే ఏ దివ్య సంస్కారమైనా అందచేయబడుతుంది. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నిటిలో సరిసమానులు, శాశ్వతమైన వారు, ఒకే స్వభావము కలిగి ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఆలోచిస్తే ఇది మానవ ఆలోచనలకు అందనిది సత్యం. పునీత ఆగస్టీను గారు కూడా ఈ యొక్క పరమ రహస్యమును తన యొక్క జ్ఞానముతో అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు కానీ అది సాధ్యపడలేదు. దేవుని పరమ రహస్యం మన యొక్క ఆలోచనల ద్వారా అర్థం చేసుకోవాలి అంటే సాధ్యపడని విషయం అయినప్పటికీ దేవుడే తనను అర్థం చేసుకున్నటకై నూతన నిబంధన గ్రంధంలో ప్రత్యేక విధముగా కొన్ని ఉదాహరణలతో వారు ముగ్గురు  వ్యక్తులు కానీ  ఒకే స్వభావం కలిగిన త్రియేక దేవుడు. సృష్టి ప్రారంభం కాకము నుపే వీరి ముగ్గురు కలిసి ఉన్నారు. 
తండ్రి సృష్టిని చేశారు (ఆది1:3)
ఆదిలో వాక్కుగా ఏసుప్రభువు ఉన్నారు (యోహాను 1:1)
దేవుని యొక్క ఆత్మ నీటిపై తిరుగు చుండెను (ఆది 1:2).
ఒకరు సృష్టిని చేస్తే మరొకరు సృష్టిని రక్షించారు ఇంకొకరు సృష్టిని పవిత్ర పరిచారు. 
- ఏసుప్రభు యొక్క జన్మమునకు ముందు గాబ్రియేలు దూత మరియమాతకు మంగళవార్త చెప్పిన సందర్భంలో పితా,పుత్రా,పవిత్రాత్మ ముగ్గురు ప్రత్యక్షమై ఉన్నారు. తండ్రి దేవుడు గాబ్రియేలు దూతను పంపించారు. పుత్రుడైన యేసు ప్రభువు మరియ తల్లి గర్భమందు శరీర రక్తముల ద్వారా రూపం పొందుకున్నారు. పవిత్రాత్మ మరియు తల్లి మీద వేంచేసి వచ్చారు.
- ఏసుప్రభు జ్ఞాన స్నానం పొందిన తర్వాత ఆకాశము తెలవబడి, తండ్రి పావుర రూపమున ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూర్చి నేను ఆనందిస్తున్నాను అని పలికారు.
- తాబోరు కొండమీద కూడా పితా,పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు ఉన్నారు.
- ఏసుప్రభు యొక్క మోక్షారోహణ సమయంలో కూడా పితా,పుత్రా,పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇవ్వమని కోరారు .
త్రియేక దేవుని పండుగ జరుపుకుంటున్న సందర్భంలో మనం నేర్చుకోవలసిన అంశములు ఏమిటి అంటే 
1. త్రియేక దేవుని వలె మనము ఒకరితో ఒకరము బంధము కలిగి జీవించాలి. 
2. త్రియేక దేవుని వలె ఒకరికి ఒకరు సహకరించుకోవాలి 
3. త్రియేక దేవుని వలె ప్రేమ కలిగి జీవించాలి. 
4. త్రియేక దేవుని వలె కలసి మెలసి జీవించాలి 
5. త్రియేక దేవుని వలె అర్థం చేసుకుని ఉండాలి.
6. త్రియేక దేవుడు ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ వారు ఒకే  దేవుడు అని తెలుపుటకు మనకు కొన్ని ఉదాహరణలు ఉన్నవి. 
1. సూర్యుడు, సూర్యకిరణాలు, వేడి ఈ మూడు కూడా ఒకటే. 
2. నీరు,ఆవిరి, మంచు ఈ మూడు కూడా ఒకదానికి చెందినవే.
3. ఒక ఆపిల్ పండు యొక్క తోలు, కండ, విత్తనం మొత్తం కూడా ఒకటే (ఆపిల్) ఈ యొక్క ఉదాహరణలు మూడు భిన్నమైనవి ఒకటిగా ఉంటుంది.
ఈరోజు మన విశ్వాస సంబంధమైన త్రియేక దేవుని పండుగను కొనియాడుతున్న సందర్భంగా మనందరం కూడా పితా పుత్ర పవిత్రాత్మ వలే కలిసిమెలిసి జీవించుట ప్రయత్నించుదాం 

Fr. Bala Yesu OCD

18, మే 2024, శనివారం

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ 
అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23
ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు పండుగను వివిధ రకాలుగా పిలవవచ్చు శ్రీ సభ ప్రారంభమైన రోజు అని, పవిత్రాత్మ శిష్యులపై వేంచేసిన రోజు అని, క్రీస్తు నాధుడికి సాక్షులుగా జీవించమని కోరినటువంటి రోజు. 
పెంతుకోస్తు అనేటటువంటి పదము గ్రీకు భాష నుండి వచ్చినది గ్రీకు భాషలో దీనిని pentekoste అని అంటారు అనగా 50వ రోజు అని అర్థం.
పవిత్ర గ్రంథములో పవిత్రాత్మను వివిధ రకాల చిహ్నాలతో పోల్చుతారు; అగ్నితో, పావురంతో, గాలితో, నీటితో..
పెంతుకోస్తు యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఈ పండుగ ఒక ప్రధానమైన పండుగ. యూదులకు మూడు ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. మొదటిగా పాస్కా పండుగ, రెండవదిగా పెంతుకోస్తు పండగ, మూడవదిగా గుడారాల పండుగ. ఈ మూడు పండుగలను వారు తప్పనిసరిగా చేసుకునేటటువంటి వారు. యెరుషలేముకు దాదాపు 20 మైళ్ళ దూరం ఉన్నటువంటి ప్రతి మగవారు యెరుషలేముకు వచ్చి ఈ మూడు పండుగలను తప్పనిసరిగా జరుపుకునేవారు.
ఈ మూడు పండుగలు వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగలు. 
పాస్కా పండుగ ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన సందర్భంలో వారి యొక్క విముక్తిగాను, స్వేచ్ఛకుగాను గురుతుగా ఈ పండుగను జరుపుకునేవారు.  ఇజ్రాయిల్ ప్రజలు దేవుడు మోషే ద్వారా సినాయి పర్వతం దగ్గర ఇచ్చిన 10 ఆజ్ఞలకు సూచనగా ఉన్న అంశమును బట్టి పెంతుకోస్తు పండుగ జరుపుకునేవారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యం నుండి బయలుదేరి సీనాయి పర్వతం దగ్గరకు చేరినప్పుడు దాదాపు అది 50వ రోజు, ఆ రోజే దేవుడు వారికి ఈ ఆజ్ఞల పలకను ఇచ్చారు. ఇశ్రాయేలీయులు పెంతుకోస్తు పండుగను సీనాయి సంఘటనను సూచించే పండుగా జరుపుకునేవారు. 
ఇక గుడారాల పండుగ అనేది ఇజ్రాయేలు ప్రజలు పాలస్తీనా దేశం చేరకముందు గుడారాల్లో నివసిస్తూ ఎడారిలో సంచరించిన కాలాన్ని సూచించే పండుగ జరుపుకోవడం ఆరంభించారు.
ఈ మూడు కూడా వ్యవసాయానికి సంబంధించినవి. ఈరోజు పెంతుకోస్తు పండుగ అనగా దేవునికి కృతజ్ఞత తెలిపేది కోతకాలమైన ఏడు వారాల తర్వాత దేవునికి కృతజ్ఞతలు తెలిపేవారు, దేవుడిచ్చిన పంటకు గాను మరియు ఆయన చేసిన అద్భుత కార్యములకు గాను కృతజ్ఞతలు తెలియజేసేవారు. ఈ పండుగ రోజున పండిన గోధుమ పంటను దేవునికి ప్రజలు అర్పించేవారు.మరియ తల్లి గర్భం ధరించే సందర్భంలో పవిత్రాత్మ ఆమెపై వేంచేశారు.
- ఏసుప్రభు జ్ఞాన స్నానం పొందినప్పుడు పవిత్ర ఆత్మ ఆయన మీద వేంచేశారు.
- శిష్యులు ప్రార్థించే సమయంలో వారి మీదకు పవిత్రాత్మ వేంచేసారు.
నూతన నిబంధన గ్రంథంలో పెంతుకోస్తు రోజున శిష్యుల యొక్క జీవితంలో ఒక మహాత్తరమైన కార్యము జరిగింది ఏమిటంటే వారు పవిత్రాత్మను పొందారు. 
పెంతుకోస్తు రోజున జరిగిన కార్యములు.
1. శిష్యుల మీదకు మరియు తల్లి మీదకు అగ్ని నాలుకలు వలే పవిత్రాత్మ  వేంచేశారు.
2. భయంతో ఉన్న శిష్యులు ధైర్యముతో నింపబడ్డారు. 
3. శిష్యులు సువార్త ప్రకటింపగా అన్యులు తమ సొంత భాషల్లో వారిని వినసాగారు. 
4. తొలి క్రైస్తవులు దేవునికి గట్టి సాక్షులుగా తయారయ్యారు.
పవిత్రాత్మ దేవుడు చేయు పనులు 
1. మనం దేవుని యొక్క ఆలయం అని తెలుపుతూ మనలో జీవిస్తారు. (1 కొరింతి 3:16)
2. మనకు ధైర్యం ఇస్తూ, బలపరస్తారు. ( అపో 1:8, 4:8)
3. మనల్ని దివ్య సంస్కారాల ద్వారా పవిత్ర పరుస్తారు. 
4. మనకు బోధిస్తారు 
5. మన యొక్క ప్రార్థన ఆలకిస్తారు 
6. మనకు వరములను దయ చేస్తారు. (1 కొరింతి 12:7, 11)
7. మన తరుపున న్యాయవాదిగా పోరాడుతారు. 
8. మనకు ఫలములను దయచేస్తారు.
9. ప్రార్థించుటకు సహాయం చేస్తారు. (రోమి 8:26-27)
10. మనల్ని నడిపిస్తారు (గలతి 5:16, 25, అపో 8:29, 13:2, 15:7, 9, రోమి 8:14)
11. దేవుని విషయంలుఅర్థం చేసుకొనుటకు సహాయపడతారు. ( అపో 13:2)
12. మనల్ని ప్రేమిస్తారు (రోమి 15:30)
13. మనం సాక్ష్యమిచ్చేలా సహాయపడతారు (యోహాను 15:26).
14. మనల్ని వెదకుతారు ( 1 కొరింతి 2:11)
ఇంకా పవిత్రాత్మ చేయు పనులు అనేకములు ఉన్నవి అయితే ఈరోజు మనం గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటి అంటే పవిత్రాత్మకి అనుగుణంగా జీవించాలి. పవిత్రాత్మ ఏ విధముగా  శిష్యులను నడిపించారో అదేవిధంగా మనలను కూడా నడిపించుట నిమిత్తమై సిద్ధంగా ఉన్నారు కాబట్టి పవిత్రాత్మ స్వరమును ఆలకిస్తూ, నడుచుటకు ప్రయత్నం చేద్దాం.

Fr. Bala Yesu OCD

11, మే 2024, శనివారం

మోక్షరోహణ పండుగ

మోక్షరోహణ పండుగ 
అపో 1:1-11, ఎఫేసీ1:17-23, మత్తయి 28:16-20
ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క మోక్షరోహణ పండుగను కొనియాడుతున్నది. ఏసుప్రభు పునరుత్థానమైన తర్వాత  శిష్యులకు 40 రోజులు దర్శనమిస్తూ, ధైర్యమనిస్తూ, బలపరుస్తూ వారిని సువార్త సేవకై సంసిద్ధం చేసిన తర్వాత పవిత్రాత్మను పంపుట నిమిత్తమై ఆయన మోక్షమునకు వెళుచున్నారు. ప్రభువు ఎక్కడినుండి వచ్చారో మరలా తిరిగి అక్కడికే వెళుచున్నారు. యోహాను 16 :28. మోక్షరోహణం అనేది క్రీస్తు ప్రభువు యొక్క పట్టాభిషేకము అని చెప్పవచ్చు అనగా ఆయన ఈ భూలోకంలో తన తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తూ పరలోకంలో ఉన్న పితదేవుని ఎదుట విజేతగా నిలిచి ఉన్నారు. తండ్రి తన కుమారున్ని సింహాసనం పై కూర్చుండబెట్టి పరలోక భూలోకాలకు రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు. ఆయన భూలోక పరలోకానికి అధిపతి అయినప్పటికీ మోక్షరోహణ పట్టాభిషేకం ఆయన యొక్క విజయమునకు సూచనగా ఉన్నది. ప్రభువు పాపమును, సైతాను జయించి ఉన్నారు కాబట్టి తన కుమారునికి ఇచ్చిన గొప్ప బహుమానం, ఇది ఆయన ప్రేమకు చిహ్నం.
ఈనాటి మొదటి పఠణములో ఏసుప్రభు తన శిష్యులను పవిత్రాత్మను పొందు వరకు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దని ఆజ్ఞాపించారు. అదేవిధంగా పవిత్రాత్మను పొందిన తర్వాత 'మీరు నాకు సాక్షులై ఉండాలి' అని ప్రభువు తెలిపారు (అపో 1:8). ఏసుప్రభు పరలోకమునకు వెళ్ళుచుండగా ఆయనతో పాటు ఇద్దరు దేవదూతలు కూడా వుంటిరి,వారు ఏసుప్రభు మరల తన యొక్క మహిమతో భూలోకమునకు వేంచేస్తారు అని వాగ్దానమిచ్చారు. ఈ మొదటి పఠణము ద్వారా మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే "సహనంతో ఉండటం", "వేచి ఉండటం"దాదాపు మూడు సంవత్సరాలు తన శిష్యులతో పాటు కలసి పరిచర్య చేసి ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన భౌతికంగా వారి నుండి దూరంగా వెళ్లే సమయంలో శిష్యులు భయపడకుండా, అలజడలకు నిరాశ చెందకుండా, కష్టాలలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏసుప్రభువు వారికి భౌతికంగా దూరంగా ఉండే సమయంలో తన శిష్యులను సహనంగా ఉండమని ప్రభువు తెలియచేస్తున్నారు. మన యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో సహనంగా ఉండాలి అప్పుడే మనము ఎక్కువగా దీవించబడతాం. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు సహనము సమస్తమును పొందును అని తెలియచేస్తున్నారు. ఆనాడు శిష్యులు అన్ని సమయాలలో సహనంగా ఉన్నారు కాబట్టే వారు పవిత్రాత్మను పొంది దేవునికి సాక్షులుగా ఉన్నారు.
ఈనాటి రెండవ పఠణములో పునీత పౌలు ఏసుప్రభు మహిమను పొందుటకు గల కారణం గురించి తెలుపుచున్నారు. ఆయన యొక్క త్యాగజీవితం దానికి నిదర్శనం. మనకు కొరకు తండ్రి సమస్తము తన కుమారుని పాదముల కింద ఉంచెను, సమస్తముపై ఆయనకు అధికారము ఉన్నది ఆయనను శ్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను (ఎఫేసి 1: 22). ఒక విధముగా చెప్పాలి అంటే రెండవ పఠణం మనందరం కూడా మోక్షరోహణము అవుతాము అని తెలుపుచున్నది అది ఎప్పుడంటే మనము సంపూర్ణంగా ఈ లోకమును జయించినప్పుడు, అలాగే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినపుడు. క్రీస్తు ప్రభువు మనవలె మానవ స్వభావం కలవారు ఆయన పరలోక మహిమను పొందారు అంటే అది మనం కూడా పొందగలము అని అర్థం. క్రీస్తు ప్రభువు మన మధ్యకు మనలాగ వచ్చి అన్నిటిలో సుమాతృకగా నిలచి మనకు పరలోక దారి చూపారు. ఆయనతో పాటు మనం ఐక్యమై, సజీవులుగా,సత్ప్రవర్తనతో, ఆజ్ఞలు పాటిస్తూ జీవించినట్లయితే తప్పనిసరిగా ఆయన మహిమలో కూడా భాగస్తులు అవుతాము. అలాగే మనము క్రీస్తు బాధల్లో పాలుపంచుకున్నప్పుడు ఆయన మహిమలో కూడా మనము భాగస్తులుకాగలం. (రోమి8:18).
ఈనాటి సువిషేశ భాగములో ఏసుప్రభు మోక్షమునకు వెళ్లేటప్పుడు తన శిష్యులకు ఒక గొప్ప బాధ్యతను ఇస్తున్నారు అది ఏమిటంటే ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించమని తెలుపుచున్నారు, పిత, పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమివ్వమని శిష్యులకు తెలిపారు. ఏసుప్రభు తన శిష్యులను నమ్మి ఉన్నారు కాబట్టి వారికి గొప్ప బాధ్యతను అప్పచెప్పి వెళ్తున్నారు. శిష్యులు ఆయన మరణం అప్పుడు చల్లా చెదిరిపోయినప్పటికీ, ఆయనను మోసం చేసినప్పటికీ మరలా వారికే దర్శనమించి, వారి చేతుల్లోనే సువార్త ప్రకటించే బాధ్యతను, శ్రీ సభను అప్పచెప్పుతున్నారు. ఆయన వారి యెడల నమ్మకముంచారు కాబట్టి అంత బాధ్యతను అప్పచెప్పారు. చాలా సందర్భాలలో దేవుడు మనల్ని నమ్ముతారు కానీ మనము దేవుడిని నమ్మలేం.
ఏసుప్రభు తన తండ్రి చెంతకు తిరిగి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మనతోనే ఉంటాను అని సెలవిచ్చుచున్నారు అనగా ‌ దివ్య సప్రసాదం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, పవిత్ర గ్రంథం ద్వారా, ప్రార్థించుట ద్వారా ఆయన మనతోనే ఉంటారు. 
ప్రభువు యొక్క మోక్షారోహణం మనకు తెలియచేసే అంశములు ఏమిటి అంటే 
1. పవిత్రాత్మను పొందు వరకు వేచి ఉండుట 
2. దేవుని మహిమను పొందాలి అంటే క్రీస్తు ప్రభువు వలే జీవించాలి 
3. దేవుడు అప్పచెప్పిన బాధ్యతలు శిష్యులు నెరవేర్చిన విధంగా మనం కూడా నెరవేర్చాలి. 
4. దేవుడు మనతో ఉన్నాడు అని ధైర్యంతో ముందుకు సాగాలి. 
5. దేవుని యొక్క శుభవార్తను ప్రకటించాలి. 
6. పవిత్ర జీవితం జీవించాలి.

Fr. Bala Yesu OCD

4, మే 2024, శనివారం

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం 
అపో 10:25-26, 34-35,44-48
1యోహను 5:7-10
యోహాను 15:9-17

ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు ఆయన ప్రేమలో ఐక్యమై ఉండుట గురించి తెలియజేస్తున్నాయి. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది ఆయన ప్రేమ స్వరూపుడు కాబట్టి మనలను ప్రతినిత్యం ప్రేమిస్తూనే ఉన్నారు. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుని యొక్క ప్రేమ అన్యులకు ఏ విధంగా అందచేయబడినది అనే అంశమును అపోస్తుల కార్యములు ద్వారా చదువుకుంటున్నాం. అన్యుడైనటువంటి కొర్నేలి ఆయన పేతురు గారిని కలుసుకున్న సందర్భంలో పేతురు దేవుడు ఎటువంటి పక్షపాతం చూపించని వారని, ఆయనకు అందరూ కూడా అంగీకార యోగ్యులే, అందరినీ సమదృష్టితో చూస్తారు అని తెలియజేస్తున్నారు. ఎవరైతే దేవునికి భయపడుచు, సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారు ఏ జాతికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా ప్రభువుకు అంగీకారులే. దేవుని యందు భయభక్తులు చూపుట అంటే ఆయన ఎడల విశ్వాసము కలిగి మంచి మార్గంలో నడుస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి జీవించటమే. దేవుడికి భయపడినప్పుడు మనము పాపము చేయలేము. దేవునికి భయపడుచు మనము పరలోకం గురించి ఆలోచన చేసిన సందర్భంలో మంచి జీవితాన్ని ఈ భూలోకంలో జీవిస్తాం. సత్ప్రవర్తన కలిగి ఉండుట అంటే మానవ యొక్క జీవితంలో ఎటువంటి స్వార్థం లేకుండా, ఎవరినీ మోసం చేయకుండా, సోదర భావంతో, నిర్మలమైన మనసుతో సహాయం చేస్తూ జీవించటం అలాంటి వారందరూ దేవునికి దేవుని ఇష్టమైనవారు. 
దేవుని ఆజ్ఞలను పాటించుచు ధర్మ మార్గంలో జీవించేవాడు ఏ జాతికి చెందిన ఏ వర్గానికి చెందిన దేవుని మిత్రుడే అని తెలిపారు అందుకుగాను దేవుడు కొర్నేలి కుటుంబమును ఎన్నుకొని ఆ కుటుంబ సభ్యులను  తన మిత్రులుగా చేసుకున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో దేవుడు ప్రేమ స్వరూపి అని తెలుపుచున్నారు. ప్రేమ దేవుడు నుండి పుట్టినది కావున మనము కూడా పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి అని తెలుపుచున్నారు. ప్రేమించువాడు దేవుడిని తెలుసుకున్నవాడిగా పరిగణింపబడతాడు (1 యోహాను 4: 7). ప్రేమించకుండా జీవించేవారు ఇంకా దేవుడిని తెలుసుకొనకుండానే ఉన్నారు అని యోహాను గారు తెలుపుచున్నారు. యోహాను గారు దేవుని యొక్క అచంచలమైన ప్రేమను గ్రహించి ఆయన మనము కూడా ప్రేమించే వారిగా జీవించాలని తెలుపుతున్నారు. 
ఎందుకు ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడుచున్నారు, అనగా ప్రేమకు ఉన్న శక్తి ఈ లోకంలో  దేనికి లేదు. ప్రేమ సమస్తమును భరించునని, సహించునని, పౌలు గారు తెలుపుచున్నారు. 1 కొరింతి 13: 4-8). 
మనము దేవునుండి జన్మించిన వారము కాబట్టి పరస్పర ప్రేమ కలిగి జీవించాలి. 
- ప్రేమ వలన యేసు ప్రభువు మన కొరకై సిలువను మోసారు 
- భూలోకానికి మానవ మాత్రుడుగా వచ్చారు
- పాపులతో కలిసి జీవించారు
- శిష్యుల పాదాలకు కడిగారు
- సుంకరులతో - పాపులతో కలిసి భుజించారు 
- అనేక మందిని తాకి స్వస్థ పరిచారు. 
- ముఖం మీద ఉమ్ము వేసినా సరే, ఏమీ అనలేదు ఇది మొత్తం కూడా ప్రేమకు ఉన్నటువంటి శక్తి. 
- ప్రేమ అన్నిటిని అర్థం చేసుకుని జీవించేలా సహాయపడుతుంది.
-యోహాను గారు మనం ప్రేమిస్తేనే దేవుడిని తెలుసుకున్న వారమని అంటున్నారు కాబట్టి ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకోవాలి నేను ప్రేమిస్తున్నాన? నేను దేవుని తెలుసుకున్నాన? ప్రేమించకుండా ఇంకా ద్వేషాలతో, పగలతోనే ఉండేవారు దేవుడిని ఎరుగునటువంటివారే.
ఈనాటి సువిశేష భాగములో కూడా ఏసుప్రభు తన శిష్యులతో తన ప్రేమ యందు నెలకొని ఉండమని, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించమని, నేను తండ్రి ఆజ్ఞలను పాటించినట్లే మీరును నా ఆజ్ఞలు పాటించమని ప్రభువు తెలుపుచున్నారు. 
- ఆయన ప్రేమ ఎలాంటిది? అంటే తన స్నేహితుల కొరకు ప్రాణం నుంచి అంత గొప్ప ప్రేమ ( యోహాను 15:13). ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తన స్నేహితుల కొరకు ఏసుప్రభు శ్రమించిన, ప్రాణాలర్పించిన  విధముగా త్యాగం చేసిన విధంగా ఉండరు. ఏసుప్రభు  వీరు కేవలం శిష్యులే అని వ్యత్యాసం చూపించకుండా వారిని తన స్నేహితులుగా పిలిచారు. పాత నిబంధన గ్రంథంలో మోషే తనను తాను దేవుని సేవకుడిగా పిలుచుకున్నారు (ద్వితి 34:5), యెహోషువ సేవకుడిగా పిలుచుకొనుబడ్డారు (యెహోషువ 24:29), దావీదు రాజు కూడా ప్రభువుని సేవకుడిగా పిలవబడ్డారు (కీర్తన 89:20). వారు దేవుని సేవకులుగా పిలవబడుటకు ఇష్టపడ్డారు అయితే ఇక్కడ ఏసుప్రభు తన శిష్యులను కేవలం సేవకులుగా మాత్రమే కాక స్నేహితులయ్యే గొప్ప అవకాశం దయచేస్తున్నారు. స్నేహితుల అవ్వటం అంటే దేవునికి అతి సన్నిహితంగా జీవించటం. స్నేహితులకు తన స్నేహితుడు మొత్తము కూడా బయలపరుస్తారు, చాలా దగ్గర సంబంధం కలిగి జీవించే విధంగా ఉంటారు కాబట్టి ఏసుప్రభువు మనం కూడా ఆయనకు స్నేహితులయ్యే అవకాశాన్ని దయచేసి ఉన్నారు కాబట్టి ఆయనే ఒక ఆజ్ఞలను పాటించి జీవించాలి.
-  మనలో ప్రేమ ఉన్నప్పుడు బేధాభిప్రాయాలు చూపించు. మనలో ప్రేమ ఉన్నప్పుడు అందరిని సరి సమానులుగా చూస్తూ ఉంటా యేసు ప్రభువు కూడా చేసినది అది. 
- ఆయన మనలను ప్రేమించారు కాబట్టే మన యొక్క పాపాలన్నీ కూడా క్షమిస్తున్నారు. ఎదుటి వారు చేసిన తప్పిదములు క్షమించాలి అంటే మనలో తప్పనిసరిగా ప్రేమ ఉండాలి లేకపోతే క్షమించను మనలో ఉన్న ప్రేమ వలనే ఇతరులను క్షమించ గలుగుతాం. (లూకా 15)
- మనము ఏసుప్రభు ఇచ్చిన ప్రేమ ఆజ్ఞ పాటించిన యెడల ఆయన ప్రేమలో నెలకొని ఉంటాము అప్పుడు మన యొక్క ఆనందము, సంతోషము పరిపూర్ణమగును. అదేవిధంగా దేవుని యొక్క ప్రేమ ఆజ్ఞ పాటించుట ద్వారా మనము దేవునికి స్నేహితులవుతున్నాం.  ఒక మానవునికి ఇంతకన్నా గొప్ప దీవెన మరి ఏది ఉండదు. ఎందుకంటే సామాన్యులమైనటువంటి మనందరిని కూడా ఆయన స్నేహితులుగా ఉండే అవకాశం ప్రభువు కల్పిస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే దేవుడు మనకు దగ్గరవుతారు, దేవుని దీవెనలు పొందుతాం, మన యొక్క ప్రార్థనలు ఆలకించబడతాయి కావున మనం దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ జీవించుదాం.
Fr. Bala Yesu  OCD

27, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా ఐదవ ఆదివారం

పాస్కా ఐదవ ఆదివారం 
అపో9: 26-31, 1 యోహాను 318-24, యోహాను 15:1-8
ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనములు దేవునిలో ఐక్యమై జీవించుట అనే అంశము గురించి బోధిస్తున్నాయి. దేవుడిని తెలుసుకొని, దేవుడిని సేవించి, దేవునిలో ఐక్యమై జీవించుట క్రైస్తవ కతోలిక విశ్వాసము మనకు బోధిస్తుంది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు సౌలును తన యొక్క సువార్త సేవకై ఎన్నుకున్నటువంటి విధానం గురించి వింటున్నాం. దేవునిలో ఐక్యమై జీవించుట నిమిత్తమై ఏసుప్రభు సౌలును ఎన్నుకొని ఆయనకు దర్శనమిచ్చి తన జీవితం మార్చుతున్నారు. సౌలు యొక్క హృదయ పరివర్తనము క్రైస్తవ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ఆయన మార్పు అనేకమందికి ఆదర్శమైనది, అనేకమంది విశ్వాసం పెంచింది. ఆయన ఏసుప్రభుని అనుసరించేటటువంటి వారిని హింసించాడు అదే ఒక వ్యక్తి మరొకసారి ఏసుప్రభు గురించే ప్రసంగించి అనేకమందిని ఏసుప్రభు చెంతకు చేరుస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించవలసినటువంటి సత్యం. ఏ విధముగానయితే తోటలో పనిచేసే తోటమాలి మొక్క ఎదుగుట కొరకై దానిని సరి చేస్తూ దాని యొక్క అభివృద్ధి కొరకై సహకరిస్తూ ఉంటారో అదే విధముగా దేవుడు కూడా సౌలు యొక్క హృదయ కాఠిన్యం జీవితమును సరిచేసి ఆయనను మృదువుగా సువార్త పరిచర్యకుడిగా చేశారు. సౌలు కూడా తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు అదేవిధంగా దేవుడి మీద ఆధారపడి ఉన్నారు. దేవుని పిలుపుకు స్పందించి సౌలు జీవించారు . సౌలు దేవుడిలో ఐక్యమై జీవించుట కొరకై తన యొక్క పాత జీవితంను విడిచిపెట్టారు.
ఈనాటి రెండవ పఠణంలో  మన యొక్క జీవితము కేవలం మాట వలననేకాక క్రియల వలన కూడా ఉండాలి అని యోహాను గారు తెలియచేస్తున్నారు. మనము దేవునికి విధేయులమై ఆయన యొక్క ఆజ్ఞలను పాటించవలెనని తెలియచేస్తున్నారు అప్పుడు దేవుడు మనము ఏది కోరిన సరే దాన్ని వసుగుతారు.
ఈనాటి సువిషేశ పఠణంలో ప్రభువు ద్రాక్షావల్లి తీగలు అనేటటువంటి అంశము ద్వారా మనము ఆయనలో ఐక్యమై జీవిస్తూ ఫలించాలని ప్రభువు తెలియచేస్తున్నారు. ఏసుప్రభు ద్రాక్షావల్లి, తండ్రి వ్యవసాయని తెలుపుచున్నారు అదేవిధంగా మనము ద్రాక్షావల్లి యొక్క తీగలు. ద్రాక్షావల్లిలో భాగస్తులైన తీగలు ఎల్లప్పుడూ కూడా ఫలించాలి అని ప్రభువు తెలుపుతూ ఉన్నారు. ఆ తీగలు ఫలించటానికి వ్యవసాయ కత్తిరిస్తూ వాటిని సరి చేస్తారు. ద్రాక్ష వల్లి ఫలించుట నిమిత్తమై యజమాని కావలసినటువంటి ఎరువులు వేస్తూ తగినటువంటి నీరును సమకూరుస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆశ మొత్తము కూడా ఆ తీగలు ఫలించాలి అనే, దానికోసమే ఆయన కృషి 
 చేస్తారు. ద్రాక్ష తీగలు సరిచేసిన సందర్భంలో ఏ కొమ్మ అయితే తోటమాలికి సహకరిస్తూ ఉంటూ ఉంటుందో ఆ కొమ్మ అధికముగా ఫలిస్తుంది. మనలో ఉన్నటువంటి స్వార్ధ భావాలు, అసూయలు, కోప తాపాలు, కత్తిరించినప్పుడే మనము కూడా ఫలించబడతాము. 
మనము ద్రాక్షావల్లిలో  భాగస్తులైన కొమ్మలైతే ఎందుకు ఫలించుటలేదు మనం ఫలించకపోవడానికి కారణం ఏమిటి?
1. మనలో ఉన్నటువంటి పాపము. 
2. మన యొక్క విధేయత 
3. మనము దేవుని మీద ఆధారపడకపోవడం 
4. మన యొక్క స్వార్థపూరితమైన జీవితం  
5. మన యొక్క హృదయ కాఠిన్యం 
6. దేవుని యొక్క వాక్యమును ఆచరించకపోవడం 
7. మన యొక్క అవిశ్వాసం 
8. క్షమించలేకపోవటం
మనల్ని శుద్ధి చేయుట నిమిత్తమై ప్రభువు తన యొక్క వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి ఆయన యొక్క వాక్కును ఆలకించి మనము జీవించాలి అప్పుడే మన యొక్క జీవితాలు ఫలిస్తాయి అదేవిధంగా ద్రాక్షవల్లి తీగలు ఎల్లప్పుడూ కూడా కలిసి ఉండటం నిమిత్తమై మనము ఈ విధంగా ఉండాలి.

1. ప్రార్థన చేయాలి
2. విధేయత చూపాలి 
3. దేవుని చెంతకు మరలి రావాలి 
4. దేవుని మీద ఆధారపడి జీవించాలి 
5.  దైవ ప్రేమ, సోదర ప్రేమ కలిగి జీవించాలి.
ఇవి అన్నియు మన యొక్క జీవితంలో పాటించినప్పుడు మనం దేవునిలో ఐక్యమై జీవిస్తాము.
ఈనాడు తల్లి శ్రీ సభ మనము దేవుడిలో ఐక్యమయి జీవించమని కోరిన సందర్భంలో మనము ఆ ప్రభువు యొక్క వాక్కు అనుసారముగా జీవించ ప్రయత్నించాలి. సౌలు ఏ విధంగానైతే తన యొక్క జీవితాన్ని కత్తిరించినప్పుడు దేవునికి సహకరించారో అదేవిధంగా మనం కూడా దేవునికి సహకరిస్తూ ఆయనలో ఐక్యమవ్వాలి.
Fr. Bala Yesu OCD

20, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా నాలుగవ ఆదివారం

పాస్కా నాలుగవ ఆదివారం 
అపో 4:8-12, 1 యోహాను 3: 1-2
యోహాను 10:11-18
 ఈ యొక్క ఆదివారమును మంచి కాపరి ఆదివారము అని తల్లి శ్రీ సభ పిలుస్తుంది. పాత నిబంధన గ్రంథంలో యావే దేవుడిని గొర్రెల కాపరిగా పోల్చి చెబుతూ ఉంటారు. దావీదు రాజు ప్రభువును కాపరిగా పిలిచారు కీర్తన (23 :1). అదేవిధంగా ఇంకొక చోట మేము నీ ప్రజలము నీ మందలోని గొర్రెలను అని తెలుపుచున్నారు (కీర్తన 79: 13). దేవుడు తన ప్రజలకు ఒక కాపరిగా ఉంటూ వారిని తన వైపుకు ప్రతినిత్యం నడిపిస్తూ, వారి యొక్క జీవిత యొక్క అభివృద్ధి కొరకు ప్రతినిత్యం కూడా కృషి చేస్తూ, వారిని శత్రువుల నుండి అదేవిధంగా విపత్తుల నుండి కాపాడుచూ వారికి తన యొక్క ప్రేమను చూపిస్తున్నారు. 
ఈనాడు చదువుకున్న పరిశుద్ధ గ్రంథ పఠణములు నుంచి కొన్ని అంశములను ధ్యానం చేద్దాం. మొదటి పఠణంలో పేతురు గారు దేవుని చేత తన మంద కొరకు ఒక కాపరిగా ఎన్ను కనబడిన తర్వాత ఆయన చేసిన అద్భుతం గురించి వింటున్నాం. ఈ యొక్క అద్భుతము యేసు ప్రభువు యొక్క నామములో చేయబడినది అని స్పష్టముగా పేతురు తెలియజేస్తున్నారు. ఆయన సజీవుడుగా వారి మధ్య ఉన్నప్పుడు మాత్రమే కాదు అద్భుతములు చేసేది ఆయన మరణించి- పునరుత్థానమైన తర్వాత కూడా ఏసుప్రభు తన ప్రజల యందు అద్భుతములను చేస్తూ ఉన్నారు అని తెలుపుచున్నారు. ఏసుప్రభు యొక్క నామము శక్తివంతమైనదని, ఆ యొక్క నామములో అనేక అద్భుతములు కలవు అని స్పష్టంగా పేతురు వివరించారు. పేతురు కాపరిగా ఉంటూ కుంటివానికి ప్రభువు స్వస్థతనిచ్చారు. అనేక సంవత్సరాల నుండి కుంటివాడిగా నిర్భాగ్య జీవితం జీవిస్తున్నాడు అతడు. అతని యొక్క జీవితంలో ఆనందం లేదు జీవితము కృంగిపోయినది అట్టివానికి పేతురు సంతోషాన్ని దయచేసి, ఏసుప్రభు యొక్క నామమున స్వస్థత పరుస్తూ తనలో ఆనందము నింపుతున్నారు. పేతురు ఒక కాపరిగా తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను ఆయన నెరవేరుస్తూ దేవుడు యొక్క ప్రేమను అదేవిధంగా సందేశమును ఇతరులకు అందజేశారు. ఇది తనకు అప్పచెప్పినటువంటి బాధ్యత.
ఈనాటి రెండవ పఠణంలో యోహాను గారు దేవుడికి మానవుడు ఎడల ఉన్నటువంటి గొప్ప ప్రేమ గురించి తెలియజేస్తున్నారు. దేవుడు మనలను ప్రేమించి ఉన్నారు కాబట్టే మనము ఆయన యొక్క బిడ్డలుగా ఉంటున్నాం. ఈ లోకము ఆయనను ఎరుగదు కాబట్టి ఈ లోకమునకు దేవుని విలువ అదేవిధంగా మన యొక్క ప్రాధాన్యత తెలియదు. దేవుడు మనమ ఆయనకు సాక్షులుగా ఉండటం వలన ఒక రోజున ఆయనను ముఖాముఖిగా దర్శించే అవకాశంను ప్రభువు మనకు కల్పిస్తారు ఆ రోజున మనము కూడా ఆయన వలె చేయబడతాము అని యోహాను గారు తెలియజేస్తున్నారు. ఇది ఎప్పుడు సాధ్యము అంటే,  కేవలం మనం దేవుడిని ఎరిగి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించి జీవించినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
ఏసుప్రభువు ఈనాటి సువిశేష భాగములో తన్ను తాను మంచి కాపరిగా పోల్చుకొని చెబుతున్నారు. పవిత్ర గ్రంథములో చాలామంది ప్రవక్తలు, భక్తులు కాపరులుగా ఉంటున్నారు. 
- ఆబేలు గొర్రెల కాపరి 
- అబ్రహాము గొర్రెల కాపరి
- మోషే గొర్రెల కాపరి 
- దావీదు గొర్రెల కాపరి 
- ఆమోసు ప్రవక్త కాపరి
- చాలామంది గొర్రెల కాపరులుగా ఉంటున్నారు. ఒక మందకు కాపరి తప్పనిసరిగా అవసరం లేదంటే ఆ గొర్రెలు విచ్చలవిడిగా జీవిస్తాయి.  ఏసుప్రభు మంచి కాపరి కాబట్టి ఆయనలో ఉన్నటువంటి కొన్ని లక్షలములను ధ్యానం చేద్దాం 
1) మంచి కాపరి తన మంద కొరకు ప్రాణములను త్యాగం చేస్తారు. ఏసుప్రభు ఆయన గొర్రెల దొడ్డి వద్ద గేటు (ద్వారము) వద్ద నిలబడి ఉంటాను అని తెలియజేస్తున్నారు (యోహాను 10: 7). ఆయన ద్వారము వద్ద నిలబడుతూ దొంగలు కానీ జంతువులు కానీ తన మంద దగ్గరకు రాకుండా ఆయనే వాటన్నిటిని రక్షిస్తారు. జీతగాండ్రు సొంత వాడు కాదు కాబట్టి ఆపద వచ్చినప్పుడు తన యొక్క మందను విడిచి వెళతారు కానీ మంచి కాపరి ఒక రక్షణ కవచంగా ఉంటూ తానే ఆపద భరిస్తూ ఆయన తనమందను అన్ని రకాల ఆటంకముల నుండి కాపాడుతారు. కేవలం మంచి కాపరి మాత్రమే తన మంద కొరకు ప్రాణాలు సైతం త్యాగం చేస్తారు ఇది ఎవరికి కూడా సాధ్యపడదు ఏసుప్రభు మంచి కాపరి కాబట్టి మన అందరి యొక్క మరణమునకు బదులు ఆయనే మరణించి తన ప్రాణమును త్యాగం చేసి మనకు జీవమును ప్రసాదించారు ఇది ఆయన యొక్క త్యాగానికి గుర్తు.
2). తన మంద గురించి కాపరికి స్పష్టముగా తెలియను. 
ఏసుప్రభుకి ప్రతి ఒక్కరి యొక్క  జీవిత స్థితిగతులు తెలుసు కాబట్టే ఎవరికీ ఏం అవసరమున్నదో దానిని బట్టి వారిని దీవిస్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు, అనారోగ్యాలు, బలహీనతలు తెలుసు కాబట్టి వారిని అర్థం చేసుకొని వారిని దీవించారు. 
3. మంచి కాపరి తన మందను పోషిస్తారు. యెషయా 40:11. మంచి కాపరి తన మందును నడిపించే సమయంలో వారికి కావలసిన పోషణను దయ చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో పై ప్రయాణం చేసే సందర్భంలో వారు ఆకలితో ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆకలని తీర్చారు. ఏసుప్రభువు కూడా తన యొక్క బోధనలను వినటానికి వచ్చినటువంటి వారిని అందరిని కూడా శారీరక మరియు ఆధ్యాత్మిక పోషణను దయ చేశారు. 
4. మంచి కాపరి తన మందను నడిపిస్తారు. (కీర్తన 23: 3)
తానే అన్నిటిలో సుమాతృకగా ఉంటూ తన మందను నడిపిస్తారు. పాత నిబంధన గ్రంథములో యావే దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక మార్గ చూపరిగా ఉంటూ వారిని ఎడారి గుండా నడిపించారు అలాగే ఏసుప్రభు కూడా తనను విశ్వసించే వారందరికీ కూడా పరలోక మార్గమును చూపిస్తూ, వారు వినయములో నడుచుటకు, విధేయతతో జీవించుటకు, క్షమ కలిగి ఉండటకు, ప్రేమ కలిగి ఉండుటకు ఒక మార్గమును తన యొక్క జీవితం ద్వారా చూపించారు, వారిని నడిపించారు. ఏసుప్రభు తన మందను నడిపించేది మంచి వైపుకు మాత్రమే అనగా పరలోకము వైపు మాత్రమే మనము ఆయన మందకు చెందిన వారమైతే ఆయన స్వరమును విని ఆయన మార్గంలో నడవాలి.
5. మంచి కాపరి తన మందను ప్రేమిస్తారు అలాగే తన ముందు పట్ల శ్రద్ధ వహిస్తారు.
మంచి కాపరి తన మందను ప్రేమించారు కాబట్టి ఆ మందను ఆపదల నుండి కాపాడుతారు అలాగే అవి దారి తప్పిన సమయంలో వారిని వెతికి తీసుకొస్తారు మరియు వారి యొక్క ఎదుగుదలకు అవసరమైనది మొత్తం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే మంచి కాపరి తన మందును ప్రేమిస్తూ, శ్రద్ధ వహిస్తారు అని పిలుస్తారు. యేసు ప్రభువు కూడా మనలను ప్రేమించారు అలాగే మన యందు శ్రద్ధ వహించారు కాబట్టి మనకు అనేక సత్యములను తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా చేయవలసినది ప్రేమించాలి, శ్రద్ధ వహించాలి.
6. మంచి కాపరి తన మందను సరి చేస్తారు. ఎప్పుడైతే ఒక గొర్రె యజమానుడి యొక్క మాట వినకుండా ఇష్టం వచ్చిన రీతిలో నడుచుకున్నప్పుడు  కాపరి దానిని సరిచేస్తూ, వాటిలో ఉన్న చెడును కత్తిరించి వాటిని మంచి మార్గంలో నడిపిస్తారు. ఏసుప్రభు ఒక మంచి కాపరిగా ఉంటూ ఆయన అనేక మంది యొక్క జీవితాలను సరి చేస్తూ, ఆయన పరిచర్య చేసే సందర్భంలో ఏది సత్యమో, ఏది అనుసరించాలో తెలియచేస్తూ వారి యొక్క విశ్వాస జీవితాలను సరి చేశారు. 
7. మంచి కాపరి తన గొర్రెలను తన భుజముల మీద వేసుకుంటారు.
8. మంచి కాపరి తన మంద పట్ల కనికరం కలవారు. అవి గాయపడిన సందర్భంలో తానే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తూ వాటి యొక్క గాయములను నయం చేయుట కొరకై ప్రత్యేకంగా కృషి చేస్తారు.
దేవుడు మనలను కూడా మన యొక్క కుటుంబాలకు సంఘాలకు కాపరులుగా ఎన్నుకుంటున్నారు మరి మనము ఆయన వలె లక్షణములను కలిగి జీవించగలుగుతున్నామా ఒక కాపరిగా మనము ప్రేమించగలుగుతున్నామా, పెంచగలుగుతున్నామా, రక్షించగలుగుతున్నామా అని మనము ధ్యానము చేసుకొని మనము కూడా మంచి కాపరి వలె జీవించటానికి ప్రయత్నం చేయాలి. 

Fr. Bala Yesu OCD

13, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా 3 వ ఆదివారం

పాస్కా 3 వ ఆదివారం 
అపో 3:13-15,17-19, 1 యోహాను 2:1-5, లూకా 24:35-48
ఈనాటి దివ్య పఠణములు యేసు ప్రభువు యొక్క పునరుత్థానము నందు విశ్వాసం ఉంచి హృదయ పరివర్తనము చెంది జీవించాలి అని తెలియజేస్తున్నాయి. ఏసుప్రభు పునరుత్థానమై ఇది మూడవ ఆదివారం. ఆయన పునరుత్థానము అయిన తర్వాత  అనేక సందర్భాలలో శిష్యులకు దర్శనమిస్తూ, విశ్వాసులకు దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితమును బలపరుస్తూ ఉన్నారు.
ఈనాటి మొదటి పఠణంలో పేతురు గారు అందరి సమక్షంలో యెరుషలేములో సొలోమోను మండపం వద్ద  ధైర్యంగా చెప్పిన గొప్ప ప్రసంగం గురించి చదువుకున్నాం. పేతురు గారు కుంటివానికి స్వస్థత నిచ్చిన తర్వాత చేసిన బోధన ఈ రోజున విన్నాము.  పేతురు గారు యూదులకు యావే దేవునితో ఉన్నటువంటి గొప్ప సంబంధం గురించి తెలుపుచూ ఆ యొక్క బంధం ఈనాటికి కూడా ఏసుప్రభు ద్వారా కొనసాగించబడు చున్నదని తెలిపారు.  వారికి(యూదులకు) విశ్వాసం ఉన్నప్పటికీ లేనప్పటికీ  ఆయన మాత్రము దేవుని కుమారుడు అని తెలిపారు. ఈ మొదటి పఠణంలో పేతురు యూదులను ఉద్దేశించి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే వారు నీతిమంతుడు, పవిత్రుడైన యేసు ప్రభువును నిరంకుశముగా శిక్షించారు అవమానపాలు చేశారు అలాగే మరణ దండనకు గురి చేశారు. ఆ సందర్భంలో అక్కడున్నటువంటి వారందరు  చేసినటువంటి పాపమును పేతురు గారు తెలుపుతూ, హృదయ పరివర్తనము చెందమని కోరారు. ఈ సందర్భంలో రెండు విషయాలు మనము అర్థం చేసుకోవాలి మొట్టమొదటిగా పాపము నుండి హృదయ పరివర్తనము చెందుట. రెండవదిగా దేవుని చెంతకు మరలిరావడం.
- పేతురు గారు యూదులు చేసినటువంటి పెద్ద తప్పిదమును ఖండించుటకు వెనుకంజ వెయ్యలేదు. ఆనాడు ఏ విధముగానయితే తప్పు చేసినటువంటి దావీదును సరి చేయుటకు నాతాను ప్రవక్త వెనుకంజ వేయలేదో, ఆహాబు చేసిన తప్పును ఖండించుటకు ఏలియా వెనుకంజ వేయలేదో, హేరోదు చేసిన తప్పును సరిదిద్దుటకు బప్తిస్మ యోహాను వెనుకంజ వేయలేదో అదేవిధంగా పేతురు గారు కూడా ధైర్యంతో చేసినటువంటి తప్పును సరిదిద్ధారు. జీవనకర్తను మీరు చంపి ఉన్నారు అని చాలా గట్టిగా  బోధించారు. ప్రభువు యొక్క పునరుత్థాన అనుభూతి మరియు పెంతుకోస్తు అనుభూతి శిష్యులకు బలమును, శక్తిని, మాటలను, అద్భుతములు చేయు శక్తిని దయచేశాయి అందుకనే వారు గొప్పగా పునరుత్థాన సందేశమును అందరికీ తెలియజేస్తూ వారి విశ్వాస జీవితాలను సరి చేస్తున్నారు.
- ప్రజలు(యూదులు )మంచి కోరుకొనుటకు బదులుగా చెడును ఆశించారు అనే అంశము కూడా పేతురు గారు స్పష్టంగా తెలియజేశారు ఎందుకంటే దొంగవాడు, అంతకుడైనటువంటి బరబ్బను విడుదల చేయమని కోరారు కానీ ఎటువంటి తప్పు చేయని నీతిమంతుడైన యేసు ప్రభువుని విడుదల చేయమని ఎవరు కోరలేదు దానికి బదులుగా ఆయనను మరణశిక్షకు గురి చేయమని పలికారు. కొన్ని కొన్ని సందర్భాలలో మన జీవితంలో కూడా మనం కూడా ఇతరులను నాశనం చేయుట కొరకు మన శత్రువులతోనైనా కలవడానికి ప్రయత్నం చేస్తాము. మంచిని ఎన్నుకొనటానికి బదులుగా చెడుని ప్రేమిస్తూ చెడు వైపు వెళ్తాం అది మన జీవితంలో చేసే పెద్ద తప్పు. హేరోదు ఏసుప్రభును చంపుట కొరకు శత్రువైన పిలాతుతో కలిశాడు దానివల్ల పాపం చేశారు. చాలా మంది యూదులు కూడా చేసినది ఇలాంటి తప్పే ఏసుప్రభుకు బదులుగా బరబ్బను విడుదల చేయమని అడిగారు. ఈ విధముగా వారు చేసినటువంటి తప్పులు తెలియజేస్తూ పేతురు గారు వారిని పాపమునుండి హృదయ పరివర్తనము చెందమని కోరారు.
- పాపము నుండి హృదయ పరివర్తనం చెందాలి. హృదయ పరివర్తనం అంటే కేవలం పశ్చాత్తాప పడటం మాత్రమే కాదు పూర్తిగా విడిచి పెట్టడం కూడా. పూర్తిగా మన పాపపు క్రియలు విడిచి పెట్టినప్పుడు మాత్రమే మనము హృదయ పరివర్తన చెందిన విధంగా పరిగణించబడతాం అప్పుడు మాత్రమే మన యొక్క పాపములు క్షమించబడతాయని పేతురు గారు తెలుపుచున్నారు. మరి ఈరోజుల్లో మనందరం కూడా మనల్ని సరిదిద్దునప్పుడు ఎలాంటి హృదయంతో తీసుకోగలుగుతున్నాం. హృదయ పరివర్తనం చెందగలుగుతున్నామా? దేవుని వైపు మరలి వస్తున్నామా? లేక ఇంకా మనము కఠినంగానే పాపంలో జీవిస్తూనే ఉన్నామా? అని మనం ధ్యానం చేసుకోవాలి.
రెండవ పఠణంలో యోహాను గారు పాపము చేయవద్దు అని తెలుపుతున్నారు. మనము ఒకవేళ  బలహీనత వలన పాపము చేసినప్పటికీ మన తరుపున న్యాయవాది ఏసుప్రభు ఉన్నారని తెలిపారు. మనలను శిక్షకు గురి చేయకుండా తండ్రి యొక్క క్షమ పొందుకునేలాగా ఏసుప్రభు చేస్తారని యోహాను గారు తెలిపారు. 
యోహాను గారు మనము దేవుడిని ఎరిగి ఉండాలి అని కూడా తెలుపుచున్నారు అనగా దేవునికి విధేయత చూపుతూ ఆయన యొక్క ఆజ్ఞలను పాటించిన యెడల మనందరం కూడా దేవుడిని ఎరిగినవారంగా పరిగణించబడుతుంటాం. దేవుడిని తెలుసుకున్న వారు ఆయనకు విధేయత చూపుతారు ఎందుకంటే దేవుడిని తెలుసుకున్న వారికి ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత విశాలమైనది, ఎంతో లోతైనది, ఆయన ఎంత కనికరం, త్యాగం ఎంత గొప్పవి అని అర్థం అవుతుంది. వాస్తవానికి దేవుడిని ఎరిగినటువంటి వారు సాధ్యమైన వరకు పాపములో పడిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారు అని యోహాను గారు స్పష్టంగా తెలియజేశారు కావున మనము కూడా దేవుడి యొక్క ఆజ్ఞలను సంపూర్ణంగా పాటిస్తూ పాపములు పడిపోకుండా జీవించాలి. 
ఈనాటి సువిషేశ భాగంలో ఎమ్మావు మార్గములో పునరుత్థాన ప్రభువుని తెలుసుకున్న శిష్యులు మిగతా శిష్యులకు జరిగిన సంఘటనలను తెలియచేసే సందర్భంలో ఏసుప్రభు వారి మధ్య ప్రత్యక్షమై మరొకసారి వారికి ధైర్యం ఇస్తూ తాను 'నేనే' అని తెలియజేశారు. ఏసుప్రభు శిష్యులకు పదే పదే దర్శనము ఎందుకు ఇస్తున్నారు అంటే వారి యొక్క విశ్వాసాన్ని బలపరచుట కొరకు అదే విధంగా వారి ఆయనకు సాక్షులుగా ఉండబోతున్నారు కాబట్టి వారు చూసినది మొత్తం నిజము అని వారు గ్రహించినప్పుడే దానిని ఇతరులకు గట్టిగా తెలియచేయగలరు కావున వారికి దర్శనమిచ్చారు. శిష్యులు ఎప్పుడూ కూడా ఒక మరణించిన వ్యక్తి మరలా శరీరంతో తిరిగి రావటం చూడలేదు కాబట్టి వారు ఏసుప్రభు యొక్క పునరుత్థానం విశ్వసించుట కొంచెం కష్టం అందుకే ప్రభువు వారికి పదేపదే దర్శనం ఇచ్చి వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరిచారు. వారు ఏసుప్రభుకు సాక్షులుగా ఉండబోతున్నారు కాబట్టి వారికి  దర్శనం ఇచ్చారు. ఏసుప్రభు యొక్క పునరుత్థానమునకు మనం కూడా సాక్షులుగా జీవించాలి.
Fr. Bala Yesu OCD

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...