12, మార్చి 2022, శనివారం
తపస్సు కాలం 2 వ ఆదివారం
తపస్సు కాల రెండవ ఆదివారము
తపస్సు కాల రెండవ ఆదివారము
ఆది 15 : 5 -12 , 17 -18, ఫిలిపీ త్రీ:17 - 4 :1, లూకా 9 :28 -36.
క్రీస్తునాదునియందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి అని తెలియచేస్తున్నాయి. తల్లి శ్రీ సభ మనలనందరిని కూడా ప్రార్థన శక్తి ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించాలని ఆహ్వానిస్తున్నాయి.
మొదటి పఠనంలో విశ్వాసమున తండ్రి అయిన అబ్రాహామును రెండు విషయాలలో తన మాట మీద గురి ఉంచమని దేవుడు కోరుతున్నాడు.1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు 2) అబ్రాహాము సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని దేవుడు అబ్రాహామును వాగ్దానం చేస్తున్నాడు
1) నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు పలుకుతున్నాడు: దీనికి అబ్రాహాము, ప్రభు నువ్వు నాకు ఏమి ఈయగలవు నేను బిడ్డలు లేని వాడిని, నీవు నాకు సంతానం కలిగించలేదు అంటున్నాడు.ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహాము తనను తాను అనుమానించుకుంటున్నాడు, నేను ముసలివాడను నాకు సంతాన ప్రాప్తి లేదు అని అపనమ్మకం అబ్రాహాము వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అబ్రాహామును దేవుడు కల్దియా దేశం నుండి పిలిచి తనను ఒక గొప్ప మహాజాతిగా తీర్చిదిద్దుతాను, నిన్ను దీవించేవారిని దివిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను, నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దివిస్తాను అని వాగ్దానం చేసిన మాటలను మరచిపోయి కూడా అబ్రహాము దేవుని మీద ఈ విధంగా పలికియున్నాడు.
అప్పుడు దేవుడు అబ్రాహాముతో నీకు పుట్టినవాడే నీకు వారసుడవుతాడు అతడి సంతానం నక్షత్రములవలె అవుతుందని చెప్పినపుడు అబ్రాహాము నమ్మాడు, ఆయన నమ్మకాన్ని బట్టి దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా చేసాడు.
2) దేవుడు అతని సంతతికి భూమిని దారాదత్తం చేస్తానని వాగ్దానం చేయుట:
దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం, అబ్రాహాము దేవుడు తన యొక్క సంతతికి ఇస్తానన్న భూమిని తండ్రి దేవుడు మాట తప్పకుండా ఇస్తాను అని మాటిచ్చి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత, అబ్రాహాము దేవుని యెక్క మాటను విశ్వసముతో నమ్మాడు. విశ్వస ఒప్పందాన్ని 15వ అద్యాయములో చూస్తున్నాము. దేవునిపై నమ్మకము ఉంచితే మనకు కావలిసినదంత దేవుడు మనకు ఇస్తాడని, మొదటి పఠనము మనకు తెలియజేస్తుంది.
3) సువిశేష పఠనము
ఈ యొక్క పఠనంలో క్రీస్తు యొక్క దివ్యరూపం దాల్చడం, క్రీస్తు యొక్క వస్త్రములు తెల్లగా ప్రకాశించడం మరియు ఆయనతో పాటు మరో ఇద్దరు దివ్య వ్యక్తులు మోషే మరియు ఏలీయా కనబడ్డారు అన్న విషయాన్ని తెలియపరచటం మనము చూస్తున్నాము. ఈ యొక్క ముగ్గురు వ్యక్తులుకూడా
1) మోషే: మంచి నాయకుడు పుణ్యాత్ముడు, దేవుని యొక్క ముఖాన్ని ముఖ్య ముఖీగా చూసినవాడు, అంతే కాకుండా దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి వాగ్దాన భూమివైపు నడిపించటం కూడా చూస్తున్నాము.
2) ఏలీయా: ఏలీయా అంటేనే ఒక గొప్ప మహాశక్తి పేరు పొందిన వాడు, దేవునితో సంబాషించిన వ్యక్తి, ఏలీయా, బాలు ప్రవక్తలను మట్టు పెట్టి దేవుని యొక్క కీర్తిని అందరికి పరిచయం చేసినవాడు. ఈయన అనేక అద్భుత కార్యములను, మనము రాజుల రెండవ గ్రంధములో చూస్తున్నాము. ఈయన మరణించకుండానే పరలోకమునకు కొనిపోబడినట్లు మనం రాజుల రెండవ గ్రంధంలో చూస్తున్నాము.
దేవుని ధర్మ శాస్త్ర చట్టాల ప్రతినిధిగా మోషేను, ప్రవచనాల ప్రతినిధిగా ఏలీయాను ఉన్న వారి ముందు క్రీస్తు దివ్యరూపం ధరిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా క్రీస్తు పొందబోయేటటువంటి శ్రమలను , కష్టాలను మరియు బాధలను సిలువ మరణము గురించి క్రీస్తుతో సంభాషించటం చూస్తున్నాము.
వీటినన్నిటిని గ్రహించినటువంటి పేతురు క్రీస్తు దగ్గరకు వచ్చి మనము ఇక్కడ ఉండుట సమంజసము అందుకని మీకు, మోషే మరియు ఏలీయాకు గుడారములను నిర్మిస్తాం అని పేతురు క్రీస్తు ప్రభువుతో పలుకుచున్నాడు. ఇది ఇలా ఉండగా ఆకాశము నుండి తండ్రి దేవుడు ఈయన నా కుమారుడు ఈయనను చూచి నేను ఆనందించుచున్నాను, ఈయనను ఆలకించండి అని దేవుడు మనల్ని ఆదేశిస్తునాడు, అంటే క్రీస్తు చెప్పిన ప్రతిమాటను కూడా పాటిస్తూ, అనుసరిస్తూ, జీవించాలని తండ్రి దేవుడు మననందరికి తెలియజేస్తున్నాడు.
కాబట్టి ప్రియాయమైన క్రైస్తవ విశ్వాసులారా ఈ నాటి పఠనాలు అన్ని కూడా మానవులమైన మనం, ఎటువంటి స్థితిలో ఉన్నాకూడా క్రీస్తు యొక్క మార్గములో పయనిస్తూ, క్రీస్తుయొక్క అనుచరులుగా జీవించాలని మరియు దేవుడు మనందరిని కూడా అయొక్క బాటలో నడపాలని , ఆశీర్వదించాలని ఈ నాటి దివ్యబలి పూజలో పాల్గొందము.
Br.Simon
4, మార్చి 2022, శుక్రవారం
తపస్సుకాలం మొదటి ఆదివారం (2)
తపస్సుకాలం మొదటి ఆదివారం
ద్వితీ 26:4-10, రోమి 10:8-13, లూకా 4:1-13
ఈనాటి దివ్య పఠనాలు విశ్వాస జీవితంలో ఎదురయ్యే శోధనలు గురించి భోధిస్తున్నాయి. ఈనాటి తపస్సు కాల మొదటి వారంలోనే శోధనలు గురించి మాట్లాడుటకు గల కారణమేమంటే శోధనలు అందరి జీవితంలో సర్వ సాధారణం. కేవలం యేసు ప్రభువు యొక్క జీవితంలో మాత్రమే కాదు, శోధనలు వచ్చింది.
సృష్టి ప్రారంభం నుండి దేవునితో కలిసి, దేవుని కొరకు జీవించే దేవుని ప్రజలకు శోధనలు ఎదురయ్యాయి. శోధనలు ఏదురైనప్పుడు సాతాను బంధాలకు లొంగకుండా దైవ శక్తితో, ప్రార్ధనాయుదంతో శోధనలు జయించాలని నేడు ప్రభువు మనకు తెలియజేస్తున్నారు.
ఈ 40 రోజులు పాటు ఎంతో మంది ఉపవాస, ప్రార్ధన ధాన ధర్మల ద్వారా పుణ్యకార్యాలు చేస్తుంటారు. ఆయితే ఇలాంటి మంచి కార్యాలు చేసేటప్పుడు మనలో ఎదురయ్యే శోధనలకు పడిపోకుండా జీవించాలన్నదే దేవుడు మనకు నేర్పించేది.
శోధనలు జయించినప్పుడే మనం యొక్క నిజమైన విశ్వాసం, అనుసరణ ఎలాంటిది అని తెలుస్తుంది. పేతురు గారు తాను వ్రాసిన మొదటి లేఖ 1:7 వచనంలో బంగారం కన్నా విలువైన మీ విశ్వాసం పరీక్షించబడాలి అని తెలుపుచున్నారు.
సైతానుడే మన జీవితంలో శోధనలు పెడతాడు యాకోబు 1:13. మన యొక్క విశ్వాస జీవితంలో సైతానుతో పోరాడాలి మనం చేసే ఉపవాసం, ప్రార్ధన ధాన ధర్మాల ద్వారా సైతాను శక్తిపై విజయం సాధించాలి.
ఈ నలభై రోజుల తపస్సు కాల యాత్ర మనందరిలో దైవ శక్తిని నిపుతుంది. ఏ విధంగానైతే యేసు ప్రభువు సైతాను శక్తిని జయించారో అలాగే 40 రోజులు జీవితం ద్వారా మన యొక్క బలహీనతలను మనం అధిగమించాలి, వ్యాసనాలను విడిచిపెట్టాలి, పుణ్య మార్గంను అనుసరించాలి.
సైతాను యొక్క శోధనలు జయించడానికి మనందరికీ ప్రార్ధన శక్తి అవసరం. శోధన జయింప అను క్షణం ప్రార్ధించమని ప్రభువు పలికారు. మత్తయి 26:41.
ప్రార్ధన వలన మనం దేవునితో ఐక్యమై ఆయన యొక్క సహకారం పొందగలం, ఉపవాసం ద్వారా శారీరక వాంఛలను, ఐహికాకర్షణలను మనం అదుపులో వుంచుకోగలం అదే విధంగా త్యాగ జీవితం ద్వారా మన యొక్క స్వార్ధాన్ని త్యజించి తోటి సోదరులకు సహాయ పడగలం.
ఈనాటి మొదటి పఠనంలో దేవుడు చేసిన మేలులకు ప్రతీ ఫలంగా మొదటి ఫలములను దేవునికి సమర్పించే అంశం గురించి భోధిస్తుంది.
తమ యొక్క పంటలో మొదటి ఫలములు దేవునికి సమార్పించే ముందు దేవునిపట్ల తమకున్న విశ్వాసాన్ని భక్తి, శ్రద్దలతో ప్రకటించాలని మోషే ప్రవక్త యిస్రాయేలియులకు తెలుపుచున్నారు. మోషే ప్రవక్త దేవుని యొక్క గొప్పతనం గురించి అలాగే ఏ విధంగా దేవుడు యిస్రాయేలుణు ప్రేమించి బయటకు తీసుకొని వచ్చారు అనే అంశం గురించి తెలుపుచున్నారు. ప్రభువైన దేవుడు వారి కోసం చేసిన మహాత్కార్యాలు అని వివరిస్తున్నారు.
ఆరాము దేశంలో లాబాను వద్ద అనేక సంవత్సరాలు సేవలు చేయడం వలన యాకోబుకు ఆరామియుడు అనే పేరు వచ్చింది. యాకోబు యొక్క వంశము ఎలాగ వృద్ది చెందినది అని మరొకసారి వివరిస్తున్నారు ప్రవక్త.
యిస్రాయేలుప్రజలు బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెట్టిన్నప్పుడు దేవుడువారిని కాపాడారు. వారిని తన యొక్క ప్రజలుగా స్వీకరించి వారిని నడిపించారు. ఎడారిలో 40 సంవత్సరాల ప్రయాణంలో తోడుగా నీడగా ఉండి పాలు తేనెలు జాలు వారు నేలను బాహుమానంగా ఇచ్చారు. అన్నీ చేసిన దేవునికి ప్రధమ ఫలములు సమర్పించు అని మోషే అంటున్నారు.
దేవునికి సమర్పించే ఆ ప్రధమ ఫలములు వారిపట్ల దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత వెల్లడి చేయుటయే. దేవుడు కేవలం వారిని బానిసత్వం నుండి బయటకు తీసుకొని రావడమే కాదు చేసింది, వారి యొక్క విశ్వాస జీవితంలో ఎదురయ్యే శోధనలలో వారిని బలపరిచారు దేవుడు. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు వారికి చేశారు. అందుకే ప్రధమ పంటను సమర్పించాలి.
మొదటి ఫలమును బలి పీఠము ముందుంచిన సమయంలో యావే దేవుడు చేసిన గోప్ప కార్యాలు అన్నీ ఉచ్ఛరించాలి. ఆ మహత్తర కార్యలేమిటంటే యిస్రాయేలును దేవుని బిడ్డలుగా ఒక ప్రజగా చేసిన మహత్తర కార్యాలు.
1. మెసపటోమియా నుండి కానాను దేశంకు అలాగే ఐగుప్తుకు ప్రయాణం. అబ్రహాము నుండి యిస్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమి చేరుకొను సమయం వరకు.
2. ఐగుప్తు నుండి యిస్రాయేలు స్వేచ్ఛ స్వతంత్రులను చేసిన కార్యం, బానిసత్వం నుండి బయటకు తెచ్చిన కార్యము.
3. యిస్రాయేలుతో సినాయి వద్ద చేసుకున్న ఓడంబడిక
4. దేవుని యొక్క వాగ్దాన భూమినిచ్చుట - పాలు తేనెలు జాలు వారు దేశం
5. దేవుడు వారి పట్ల దయ చూపుతూ తోడుగా ఉండే కార్యం
6. దేవున్ని తండ్రిగా కలిగిన గొప్ప అద్భుతం. యిస్రాయేలుకు దేవుడు మంచి దేశంను కానుకగా ఇచ్చినందుకు దేవుని ఓడంబడికకు బద్దులై వారు ప్రతి సంవత్సరం దేవునికి కృతజ్ఞతలను ప్రధమ ఫలములు సమర్పించుట ద్వారా తెలిపేవారు. వాస్తవానికి యిస్రాయేలు ప్రజలు ఈ విధంగా సమర్పించుట ద్వారా వారు దేవున్ని జ్ఞాపక పరుచుకొంటున్నారు. అలాగే దేవుడు ఎలాగ వారిని అభివృద్ది పరిచారో అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. దేవుడు సమృద్దిగా ఇచ్చిన విధానం గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
ఈ తపస్సు కాలంలో అడుగు పెట్టిన మనము కూడా యిస్రాయేలు ప్రజల జీవితం నుండి నేర్చుకోవాలి.
1. మనం కూడా అంధకారం నుండి వెలుగులోనికి ప్రయాణం చేయాలి. బానిసత్వం నుండి స్వేచ్ఛ లోనికి వెళ్ళాలి. పాపం నుండి పుణ్య మార్గం అనుసరించాలి.
2. దేవునితో కలిసి జీవిస్తామని, దేవునికొరకు అన్నీ సమర్పించి జీవిస్తామని నిర్ణయం తీసుకోవాలి. దేవునితో ఓడంబడిక చేసుకోవాలి.
3. దేవుడిచ్చిన దివ్య సత్ప్రసాదంను స్వీకరిస్తూ దేవున్ని కలిగి జీవించాలి.
4. దేవుడు మన కోసం సిద్దం చేసిన పరలోక రాజ్యంకు అర్హత కలిగి జీవించాలి.
5. దేవుడు చేసిన మేలులకు ఎల్లప్పుడు కృతజ్ఞులై జీవించాలి. చాలా సందర్భాలలో మనం దేవునికి ఆయన చేసిన మేలులకు ప్రధమ ఫలాలను సమర్పించం. దేవునికి ఇవ్వాలనుకునే సమయంలోమనకు శోధనలు వస్తాయి. ఇంత ఖరీదైనది, మెలిమయినది దేవునికి ఇవ్వలా , వద్దా అనే సందేహాలు, శోధనలు వస్తాయి వాటిలో మనం మునిగిపోతాం.
దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఇచ్చుటకు మనం సిద్ధంగా ఉండాలి. చాల మందిలో మనం ఇచ్చేది దేవునికే గా ఏది ఇస్తే ఏముందిలే అని ఆలోచిస్తారు.
1. మనం ప్రధమ సమయం దేవునికి ఇవ్వాలి - ఎందుకంటె దేవుడే మనకు మరొక రోజును సమర్పించారు కాబట్టి ప్రధమ సమయం అంటే ఉదయం లేచిన సమయం.
ప్రధమ ఫలములు - కూరగాయలు , కాయ పండ్లు అధే విధంగా ఏదైతే ప్రధామముగా వస్తుందో దానిని ప్రభువునకు సమర్పించాలి. సమార్పించేముందు దేవుడు చేసిన గొప్ప కార్యాలు గుర్తుకు తెచ్చుకోవాలి.
రెండవ పఠనంలో పునీత పౌలు గారు యూద మాతము క్రైస్తవులుగా మారిన వారికి ఒక విధమైన భోధన చేస్తున్నారు. మళ్ళీ విశ్వాస జీవితంలో యూద మతంలోనికి వెళ్లాలనే శోధన నుండి బయటకు రావాలని పౌలుగారు వారికి భోధన చేస్తున్నారు. మోషే ప్రవక్త ఇచ్చిన శాసనములకు బద్దులై జీవించాలనే శోధన నుండి బయటకు రావాలని పౌలు గారు తెలియ జేస్తున్నారు.
యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పు కుంటే ఆయన మృతులలో నుండి లేచాడని విశ్వసిస్తే నీవు రక్షించ బడుదువు అని అన్నారు.
పాలు గారు మనంతట మనం నీతిమంతులం కాలేము కానీ హృదయములో దేవుని విశ్వసించి జీవిస్తే ఆయన యొక్క కృప ఫలితమున నీతిమంతులము అవుతాము అని తెలుపుచున్నారు.
యేసు క్రీస్తు నందున్న విశ్వాసంను మాటల ద్వారా క్రియాల ద్వారా మరియు మన యొక్క జీవితం ద్వారా వెల్లడించాలి. ఆయనను విశ్వసించే వారు సిగ్గుపడనవసరం లేదు ఎందుకంటే ఆయనయె లోక రక్షకుడు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఎవరు కూడా బాధపడనవసరం లేదు.
దేవుడు ఒక్కడే కాబట్టి ఆయనను అందరు విశ్వసించి జీవించాలి. ప్రభువుకు ప్రార్ధించుట ద్వారా దీవెనలు సమృద్దిగా దొరుకుతాయని పౌలు గారు తెలుపుచున్నారు. యేసు క్రీస్తు నామమున ప్రార్ధించే వారు అందరు రక్షింపబడుతారు.
కావున మన యొక్క విశ్వాస జీవితంలో యేసు ప్రభువు యొక్క పునరుత్థానంను ఆయన దేవుడని అందరు కూడా బహిరంగంగా ఒప్పుకొంటూ మన యొక్క జీవితం ద్వారా దానిని చాటి చెప్పాలి.
మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభువును ప్రకటించాలి. మన యొక్క జీవితం ద్వారా మిగతా వారికి మన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి.
ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు ఎదుర్కొన్న శోధనల గురించి మనం వింటున్నాము. యేసు ప్రభువు తండ్రి యొక్క కార్యమును కొనసాగించుటకు ముందు 40 రోజులు ఏకాంతంగా ఉపవాసం, ప్రార్ధన చేస్తూ ఎడారిలో తండ్రితో గడిపారు. యేసు ప్రభువు యొక్క శోధనలు మూడు విధాలుగా వర్ణించబడ్డాయి.
ఎందుకని మూడు శోధనలనే ప్రత్యేకంగా తెలుపుచున్నారు అంటే ఈ మూడూ శోధనల గురించి పాత నిబంధన గ్రంధంలో వింటున్నాం.
సైతాను యేసు ప్రభువును శోధించినప్పుడు ప్రతిసారీ పాత నిబందన యొక్క వాక్యం ద్వారా సైతాను యేసు ప్రభువును శోధిస్తుంది. ఇది ఎందుకంటే పూర్వ నిబందన గ్రంధంలో యిస్రాయేలు ప్రజలు ఎడారిలో మూడు ముఖ్యమైన శోధనలు గురియయ్యారు ఆ మూడు సందర్భలలో వారు విఫలమైయ్యారు.
ఇవే మూడు శోధనలు నూతన యిస్రాయేలు అయిన యేసు క్రీస్తును కూడా సైతాను పడవేయాలనుకున్నది. తండ్రికి దగ్గరైయె కొద్ది అమనం జీవితంలో సైతానుడు ప్రవేశించి మనలను ఆయన నుండి పడవేయాలనుకుంటాడు. అందుకే శోధిస్తుంటాడు.
ఈ సువిశేషం గమనించినట్లయితే ఇక్కడ చాలా విషయాలు అర్ధమవుతాయి. మొదటిగా యేసు ప్రభువు పవిత్రాత్మ పరిపూర్ణుడాయేను. ఎప్పుడైతే యోర్ధనులో బాప్తిస్మమం పొందారో అప్పుడు మరొక సారి తండ్రి దేవుడు, పవిత్రాత్మ దేవుడు మానవ దైవ స్వభావం కలిగిన క్రీస్తు ప్రభువును బలపరిచారు.
ఆత్మ ప్రేరణ వలన ఏడారికి నడిపింపబడ్డాడు. ఎందుకు ఎడారికి నడిపించబడ్డారు అంటే ఎడారి విశాలవంతమైన స్థలం, నిశబ్దంతో కూడిన స్థలం, దేవునికి యొక్క సాన్నిధ్యం అనుభవించుటకు వీలుగా ఉన్న స్థలం. అందుకే దేవుడు ఎన్నుకొన్నారు. ఏకాంతంగా ఉంటూ ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా తనను తాను దైవ కార్యంకు సిద్ధం చేసుకోవడానికి అక్కడకి వెళ్లారు.
రెండవది యిస్రాయేలు ప్రజలు ఎడారిలో కలిగిన శోధనల్లో పడి పోయారు. వారి యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో శోదనల్లో పడి దేవున్ని విస్మరించారు. అదే ఎడారి ప్రాంతంలో మానవునిగా జన్మించిన క్రీస్తు ప్రభువు శోధనలు జయించుటకు అక్కడకు నడిపించబడ్డారు.
యేసు ప్రభువును సైతాను 40 రోజులు శోధించుచుండెను. పవిత్ర గ్రంధంలో చూసిన వాక్యాలు బట్టి సైతానుడు రెండవ సారి యేసు ప్రభువును తుదముట్టించాలను కుంటున్నాడు. బాల యేసు గా జన్మించినప్పుడు సైతాను హెరోధును శోధించి, ప్రేరేపించి చంపాలనుకున్నాడు. కానీ విలుపడలేదు. ఇప్పుడు మరొకసారి యేసు ప్రభువును తన యొక్క తండ్రి కార్యం నుండి సంపూర్ణంగా వైదొలగే లాగా చేయాలనుకుంది. అందుకే శోధిస్తుంది.
సైతానుడు మనల్ని కూడా ఈ 40 రోజుల్లోనే ఎక్కువగా శోధిస్తాడు. మరీ ముఖ్యంగా దీక్ష తీసుకున్న వారిని ఎందుకంటే వారు దైవ ప్రేరణ వలన దీక్ష తీసుకున్నారు, కాబట్టి వారిని ఆటకం పరుచుటకు సైతానుడు శోధిస్తాడు.
ఎవరినైతే దేవుడు తన యొక్క పనికోసం వినియోగించుకుంటున్నారో వారి జీవితాలను 40 రోజులలో దేవుడు ఎంచుకుంటున్నారు. నోవా యొక్క జీవితం 40 రోజుల వర్షంతో మారింది. మోషే సినాయి పర్వత మీద 40 రోజులు ప్రార్ధనా అనుభవం ద్వారా మారిపోయారు.
ఏలియా దేవుడు ఒసగిన 40 రోజులు రొట్టెద్వారా మారిపోయారు, 40 రోజులు విశ్వాస ప్రార్ధన ద్వారా నినివే పట్టణ వాసులు మారిపోయారు. 40 రోజులు ఉపవాస ప్రార్ధన ద్వారా యేసు ప్రభువు దేవుని శక్తిచే క్రొత్తగా నింపబడుతున్నారు. ఈ 40 రోజుల్లో తండ్రి, పవిత్రాత్మ యేసు ప్రభువును తన పని కోసం సిద్దం చేశారు, క్రొత్తగా చేశారు, బలవంతుణ్ణి చేశారు.
యేసు ప్రభువు యొక్క మొదటి శోధన:
ఆహరం గురించి, శారీరక వాంఛ గురించి - మనం ఎక్కడ బలహీనులమో అక్కడే సైతాను ఎక్కువగా శోధిస్తుంది. యేసు ప్రభువు 40 వది రోజులు ఉపవాసం చేశారు. ఆకలితో ఉన్నారు అందుకే అక్కడ శోధించింది.
పూర్వ వేదంలో ఇశ్రాయేలు ప్రజలు ఆకలికి సంబంధించిన శోధన ఎదురైనప్పుడు మోషేను దూషించి దేవునికి పాపం చేశారు. దేవుడు అప్పుడు వారికి మన్నాను ఒసగుతూ నేర్పించిన పాఠమేమిటంటే కేవలము రొట్టెవలనే కాదు, కానీ దేవుని యొక్క వాక్యం వలన కూడా జీవిస్తారని తెలిపారు. ద్వితీ 8: 3 , నిర్గమ16:2-3 భోజనము గురించి.
శరీరానికి సంభందించిన శోధనలలో మనం చాలా సార్లు పడిపోతాం. మన పంచేంద్రియాల పంచేంద్రియాలు వలన పడిపోయే సమ్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవాలి.
ఈ మొదటి శోధన తన యొక్క దైవత్వంను నిరూపించుటకు సైతాను శోదిస్తున్నాడు. వాస్తవానికి సైతాను యేసుప్రభువు తన యొక్క శక్తులను తన సొంత అవసరాలకు వినియోగించు కుంటాడా లేదా అని శోధించింది. అయితే ప్రభువు శారీరక వాంఛలకు లొంగకుండా తన యొక్క శక్తిని స్వంత లాభం కోసం వాడలేదు. యేసు ప్రభువు ఈ లోక శారీరక సుఖాల వలన సంతృప్తి చెందరు, ఆయన యొక్క నిజమైన ఆనందం తండ్రిని సంతృప్తి పరచటం, తండ్రి యొక్క కార్యం నెరవేర్చుటయే.
రెండవ శోధన- అధికారం గురించి
ఈలోక సామ్రాజ్యాలను చూపించి తనను ఆరాధిస్తే అటువంటి సామ్రాజ్యాలను సైతాను ఇస్తానని యేసుతో అంటున్నారు.యేసుప్రభువు యొక్క సిలువ మార్గాన్ని అడ్డుకోవాలనుకున్నది. మత్తయి16: 22 . ఈలోకంలోనే ఆయన్ను ఉంచి తనకు లోబరుచుకోవాలనుకున్నది సైతాను.
ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఇతర దేవుళ్లను ఆరాధించారు. ఎడారిగుండా వారిని ఆదిపిన ఎవుణ్ణి వారు మరిచిపోయారు. ఒక బంగారు దూడను ఆరాధించారు నిర్గమ 32:16 , విగ్రహ ఆరాధనా చేశారు. ఇక్కడ వీరు విగ్రహ ఆరాధన చేయటం మాత్రమే కాదు దేవునికి చెందవలసిన స్తానం ప్రాముఖ్యత వస్తువులకు ఇస్తున్నారు.
అధికారం కోసం మనం కొన్నిసార్లు ఏదైనా చేస్తాం ఎక్కడికైనా వెళతాం. కానీ యేసు ప్రభువు అందుకు ఒప్పుకోలేదు లోక సంపదలు అన్నింటిని కంటే దేవుడే ముఖ్యమని ఆయన మీదనే జీవించాలని తెలియచేస్తున్నారు. అధికారం కోసం కొన్నిసార్లు ఎవరి కళ్ళైనా మొక్కుతాం ఎంతకైనా దిగజారతాం. కానీ ఇక్కడ ప్రభువు నేర్పించేది ఏమిటంటే, అధికారం కోసం సంపదల కోసం దేవుడిని విడిచిపెట్టకూడదు.
మూడవ శోధన దేవుడ్ని పరీక్షకు గురిచేయుట
యిస్రాయేలు ప్రజలు దేవుడ్ని అనేకసార్లు పరీక్షించారు, ఆయన శక్తిని పరీక్షించారు. యేసు ప్రభువు కింద పడితే ఏమి కాదని, దుఃఖమని సైతాను ఎవుని శక్తిని పరీక్షించింది. యిస్రాయేలు ప్రజలు దేవుడ్ని మస్సా, మెర్రిబ్బాల వద్ద పరీక్షించారు. నిర్గమ17: 1-7, దేవుడు మనతో ఉన్నాడా లేడా అని. యేసుప్రభువు ఎన్నడును దైవ శక్తిని పరీక్షించలేదు ఆయనకు తండ్రి మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది కాబట్టియే దేవుడ్ని పరీక్షించలేదు.
మనయొక్క విశ్వాస జీవితంలో శోధనలు వచిన్నపుడు దేవుడ్ని చాల సార్లు పరీక్షిస్తాం. దేవుడా నీవు నాకు వరం ఇస్తేనే గుడికి వస్తాం అని పరీక్షిస్తాం. పరీక్షలో మంచి మార్కులు వస్తే గుణదలకు వస్తానని పరీక్షిస్తాం. ఇంకా చాల విధాలుగా మనం దేవుడ్ని పరీక్షిస్తాం. అన్నిటి కన్నా కావలసినది దేవుడ్ని పరీక్షించటం కాదు దేవుని మీద ఆధారపడి జీవించుట, ఆయనయందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించుట.
కాబట్టి మనయొక్క విశ్వాస జీవితంలో శోదనలు వచ్చినప్పుడు, దైవశక్తితో ప్రార్థనతో వాటిని జయించుదాం.
-యేసు ప్రభువు వారు అన్ని చోట్ల శోధించబడ్డారు. అయినా కూడా సైతానుకు లొంగలేదు.
పవిత్ర గ్రంథంలో శోధించబడినవారు
-ఆదాము శోధించబడ్డారు, సైతానుకు పడిపోయాడు.
-అబ్రాహాము శోధించబడ్డాడు, సైతానును జయించాడు.
-ఇశ్రాయేలియులు సైతాను మాయలో పడ్డారు.
-దావీదు శోధించబడ్డారు ఆయనకూడా పడిపోయారు కొన్నిసందర్భాలలో.
-సొలొమోను, సంసోను శోధించబడ్డారు వారుకూడా పడిపోయారు.
-యేసు ప్రభువు కూడా శోధించబడినప్పటికిని సైతాను వలలో చిక్కుకొనక అన్ని శోధనలు జయించారు.
-మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు మనం కూడా శోధనలు జయించాలి.
-మనయొక్క శక్తిని మించి మనం శోధించబడం. (1 కొ రింతి 10:13), కాబట్టి దైవ శక్తితో శోధనలు ఎదుర్కొందాం. దేవునికి సాక్షులై జీవించుదాం.
-మనకు వచ్చే శోధనలలో దేవుడి మీద ఆధారపడి జీవిస్తూ మనయొక్క విశ్వాస జీవితమును కొనసాగించుదాం.
-మన జీవితంలో ఒక దాని తరువాత ఒక శోధన వస్తూనే ఉంటుంది. వాటన్నిటిని దైవశక్తితో జయించుదాం.
Rev. Fr. Bala Yesu OCD3, మార్చి 2022, గురువారం
తపస్సు కాల మొదటి ఆదివారం
సాతాను శోధనలు - క్రీస్తును విజయము
క్రీస్తు నాధుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ఈనాడు తల్లి తీరుసభ మనలను అందరిని కూడా తపస్సు కాలపు మొదటి ఆదివారము లోనికి ఆహ్వానిస్తుంది. ఈనాటి పరిశుద్ద పఠనాల ద్వారా మనలను అందరిని కూడా సాతానుకు బానిసలు కాకుండా, దేవుడు ఇచ్చిన స్వేచ్చతో జీవించమని లేదా దేవుని స్వతంత్ర బిడ్డలుగా జీవించమని కోరుతుంది.
ఎందుకంటే ఈ యొక్క పాపము లేదా సాతాను కీడులలో నుండే కదా క్రీస్తు ప్రభువు తన శ్రమలు, మరణ, పునరుత్థానల ద్వారా మనలను స్వేచ్ఛ పరులను చేసెను. క్రీస్తు తన మరణ పునరుత్థానాల ద్వారా సైతాను పై ఆధిపత్యం చూపించలేదా? తన మరణ పునరుత్థానాల ద్వార మనకు రక్షణ తెచ్చెను గదా? మనలకు పాప విమోచనగావించే కదా?
మరి మనము ఆ పాపపు జీవితాన్ని జీవించడం ఎంత మాత్రం సమంజసమో! మనం అందరం ఆత్మ పరిశీలన జేసుకోవాలి. ఈనాటి పరిశుద్ద గ్రంధ పఠనాలలో చూస్తే, శోదనల గురించి వింటున్నాము. మరి ముఖ్యంగా సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువును ఆ సైతాను ఏవిధంగా శోధించిందో చూస్తున్నాం.
యిస్రాయేలు ప్రజలు, ఎడారి ప్రాంతంలో వారికి తినడానికి ఏమి దొరకనటువంటి సంధర్భంలో వారు శారీరక ఆకలితో, దేవున్ని మరియు మోషే ప్రవక్తను నిందిస్తున్నారు.
ఏదైన మేలు జరగనప్పుడు మనం దేవుని నిందించాలనుకోవడం ఒక శోదనే. ఉదా: మనము యొబు జీవితం చూసుకున్నట్లయితే తన భార్య, తన చెంతకు వచ్చి, నీవు సర్వాన్ని కోల్పోయావు, నీవు జీవించడం వ్యర్ధము, కాబట్టి నీ దేవున్ని శపించి నీవు కూడా చచ్చిపో, అన్నప్పుడు యొబు ఆ శోదనకు వెళ్ళి , దేవునితో గొడవ పడతాడు, నీవు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని. నా జీవితం ఎందుకు ఇలా అవుతుందని.
కానీ చివరికి తన తప్పు తెలుసుకుంటాడు, దేవుని క్షమాపణ కోరతాడు. మరి మనం జీవితంలో కూడా యిస్రాయెలు ప్రజల వలె యొబు వలె మనకు మేలు జరగని సందర్భాలలో మనం దేవుడిని నిందిస్తున్నామా? విశ్వాసాన్ని, లేదా నమ్మకాన్ని కోల్పోతున్నమా? ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ఎందుకంటే ఈ సాతాను అవకాశం కోసం పొంచి ఉంటుంది. మనకు ఏమైనా కొదవఅయినప్పుడు , దేవునకు మనం ప్రార్దన చేసిన విననప్పుడు, దేవుడు మనలను విడనాడినట్లు ఉన్నప్పుడు, మనం బాధలలో, కష్టాలలో ఉన్నప్పడు, సాతాను మనలను దేవుడిని నిందించమని శోధిస్తుంది.
సువిశేషం పఠనంలో చూస్తే :- క్రీస్తు ప్రభువుకి సాతాను శోదన మనం చూస్తున్నాం . క్రీస్తు ప్రభువుకి ఈ శోదనలు ఒక్కసారి మాత్రమే వచ్చినవి కావు, అవి అనునిత్యం క్రీస్తు జీవితంలో ఉన్నవే. తాను కన్ను మూసేంత వరకు, అంతా సమాప్తమైనది అనేంత వరకు కూడా శోధింపబడ్డారు.
ఎలా అంటే : - మనుష్య కుమారునిగా, ఒక సాదారణ వ్యక్తిగా మరణించే ముందు తండ్రి దేవుడు తనని వీడనాడాడు లేదా తనని వేరు చేశాడని భావించి ఉండవచ్చు కాబోలు. అందుకే నా దేవా నా దేవా , నన్నేల విడనాడితివి అని బిగ్గరగా ఏడ్చాడు.
కానీ :- క్రీస్తుకు తెలుసు, ఇది తండ్రి చిత్తమే అని , అందుకే తండ్రి ! నా ఆత్మను నీకు సమర్పిస్తున్నాను . అంతా సమాప్తమైనది అని అంటున్నాడు.
ఈరోజు సువిశేషంలో చూస్తే
సాతాను మొదటి ప్రయత్నం :- క్రీస్తు ప్రభువు నలువది దినాలు ఉపవాసమున్నాడు, ఈ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచించి, ఆ సాతాను క్రీస్తుని శారీరక ఆకలి తీర్చడం కోసం శోధిస్తుంది.
ఇక్కడ సాతాను మూర్ఖత్వం కాకపోతే క్రీస్తు 4,000 మందికి 5,000 మందికి ఆకలి తీర్చిన దేవుడు తన ఆకలి తీర్చుకోలేడా ! సాతానును లెక్క చేయలేదు, సాతాను ఓడిపోయింది.
సాతాను రెండవ ప్రయత్నం :- రాజ్యాలన్నీ నీకిస్తాను, ఆధికారాన్ని నీకిస్తాను, నాకు మ్రొక్కు అంటుంది. ఇక్కడ కూడా సాతాను మూర్ఖత్వమే. ఎందుకంటే, సకల సృష్టిని సృజించిన సాక్షాత్తు దేవుని కుమారుడు, ఈ లోకాధిపతి, సర్వ అధికారికి, ఆయన ముందు సాతాను కుప్పిగంతులు. క్రీస్తు ప్రభువు బహుశా నవ్వుకొని ఉండవచ్చు కాబోలు సాతాను యొక్క మూర్ఖత్వాన్ని చూసి అప్పుడు కూడా క్రీస్తు ప్రభువు లొంగలేదు. పైగా సాతానుకి " నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించుము, సేవించుము" అని వ్రాయబడి ఉన్నదని గుర్తు చేస్తాడు.
సాతాను మూడవ ప్రయత్నం :- నీవు ఈ శికరము పై నుండి క్రిందకు దూకు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, దూతలు తమ చేతులలో నిన్ను పట్టుకుంటారు, అని శోధిస్తుంది. ఒక్క మాటతో లోకాన్ని సృష్టించిన దేవుడు, ఒక్క మాటతో లాజరును జీవంతో ఇచ్చిన దేవుడు, ఒక్క మాటతో స్వస్థతలు చేసిన దేవుడు, ఒక్క మాటతో సముద్రాన్ని శాసించిన, అద్భుతాలు, చేసిన క్రీస్తుకు, ఇది ఒక శోధన.
అప్పుడు కూడా క్రీస్తు ప్రభువు సాతానుతో ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెబుతున్నారు. సాతాను మళ్ళీ ఓడిపోయింది. ఇలా క్రీస్తు ప్రభువు సీలువలో మరణించేంత వరకు కూడా శోధిస్తూనే వుంది.
అద్భుతాలు, మహిమలు చేయగల శక్తిగల దేవుడు క్రీస్తు ప్రభువు అయిన కూడా, తాను స్వార్ధంగా ఆలోచించలేదు. తన స్వంత ప్రయోజనాలకు, పేరుకు గాని ఎప్పుడు ఉపయోగించలేదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు, ప్రజల సంతోషం కోసమే తన శక్తులను ఉపయోగించాడు. మరి మనం శక్తి సామర్ధ్యాలు ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం?ఆత్మ పరిశీలన చేసుకోవాలి?
రెండవ పఠనం :- పునీత పౌలుగారు రోమియులకు తెలియ చేస్తున్నారు. మనకు "ప్రభువుఒక్కడే "ఆయనను మన హృదయంతో విశ్వసిస్తే, నీతిమంతులం అవుతాం. నోటితో ప్రభువే నా దేవుడు అని ఉచ్చరిస్తే రక్షింపబడతాం, అని తెలియ చేస్తున్నారు.
క్రీస్తు ప్రభువు చేసింది కూడా అదే. సాతాను వచ్చి నాకు మొక్కుము అన్నప్పుడు క్రీస్తు చెప్పిన మాటలు కూడా ఇవే మనకు దేవుడు ఒక్కడే ఆయనను మాత్రమే సేవిస్తాను అని.
ఈనాడు మనము క్రీస్తువలె జీవిస్తున్నామా ? మనకు దేవుడు ఎవరు ధనమా , పేరు ప్రఖ్యాతలు, అధికారమా, బందువులా, మిత్రులా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. పునీత సిలువ యోహను గారు కూడా ఇటువంటి మాటలనే తన యొక్క జాగ్రత్తలు తెలియ చేస్తారు. ప్రతి మనిషి కూడా మూడు విధాలుగా శోధింపబడుతాడు, వాటిని జాగ్రత్తగా ఎదుర్కోనమని తెలియచేస్తున్నారు.
మొదటిగా : వ్యక్తిగతంగా, ఎదురయ్యే శోధన , ఇది మానసికంగా కావచ్చు, శారీరక సుఖా:ల ద్వార కావచ్చు, లైంగిక శోధన , ఆహార శోధన , నిర్లక్ష్య కావచ్చు.
రెండవదిగా : ఈ లోక సంబందమైన శోధన
-బందువుల ద్వారా , స్నేహితుల ద్వారా కావచ్చు
-సంపదల ద్వారా, ధనము ద్వారా కావచ్చు .
మూడవదిగా : సాతాను శోధన
వక్రబుద్ది జీవతం
- ఆధికారం కోసం
-గొప్పవారు కావాలని, పేరు పొందాలని,
-ఎప్పుడు ఒకరి మీద పెత్తనం చేయాలని ఎంత నీచానికైనా మనిషి దిగజారుతాడు.
ఇలాంటి మూడు సందర్భాలలో మనం దేవున్ని మర్చిపోతాం, దేవునికి దూరంగా జీవిస్తాం, అవే సర్వస్వం అని నమ్మి మోసపోతాం. చివరికి జీవితం నాశనం చేసుకుంటాం. కాబట్టి వీటన్నింటికి జాగ్రత్త కలిగి దేవునియందు విశ్వాసముంచి జీవించమని తెలియచేస్తున్నారు.
కావున మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ శ్రమలు అనునిత్యం ఉంటాయి. ఈ నలువది రోజులు మాత్రమే నేను ఈ విధంగా జీవించాలి అని కాదు. ప్రతి నిత్యం కూడా మనం సాతానును గెలవాలి.
చివరిగా ఏమిటంటే, క్రీస్తు ప్రభువు మనలను బానిసత్వం నుండి స్వతంత్రులను చేయుటకు ఈ లోకానికి వచ్చారు, మనలను విముక్తులను చేశారు. కానీ ఇంకా మనం సాతాను బానిసత్వంలోనే జీవిస్తున్నాం. కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకొని, దేవుని స్వతంత్ర బిడ్డలుగా జీవించుటకు ప్రయత్నిద్దాం. ఆమెన్ .
BR. SUBHASH
26, ఫిబ్రవరి 2022, శనివారం
8 వ సామాన్య ఆదివారం (2)
8 వ సామాన్య ఆదివారం
సీరా 27:4-7, 1 కోరింథీ 15:54-58 లూకా 6:39-45
నేటి దివ్య పఠనాలు మన యొక్క అనుదిన జీవితంలో వినియోగించే మనిషి యొక్క మాటల గురించి తెలియజేస్తుంది.
యేసు ప్రభువు ఏ విధంగానైతే తన యొక్క భూలోక జీవితమంలో మంచి మాటలు మాట్లాడుతూ అనేక మంది జీవితాలలో సంతోషంను నింపుతూ, ప్రేమను పంచుతూ జీవించరో మనం కూడా అలాగే మృదువైన మాటలు మాట్లాడుతూ అందరి జీవితంలో మంచిని పంచాలి.
మన యొక్క మాటతో పాటు మనస్సు కూడా మంచిగ ఉండాలి. దేవుడు మానవునికి మాటనిచ్చింది, ఆయనను స్తుతించడానికి, ఆయనను గురించి ఇతరులకు తెలియజేయడానికి, ఇది దేవుడు ఇచ్చిన గొప్ప వరం.
మన యొక్కమాట ద్వారా తోటి ప్రజలతో స్నేహబంధం ఏర్పరుచుకొని వారితో సమాధానంగా సంతోషంగా ఉండవచ్చు.
మన యొక్క ప్రతి వాక్కు ద్వారా మన భావాలను, ఆలోచనలను వ్యక్త పరచి ఇతరులతో స్నేహ బంధాన్ని కలిగి మన మాటలు జీవించడానికి ఉపయోగపడతాయి
దేవుడిచ్చిన మాటను సద్వినియోగం చేసుకుంటే ఆ జీవితం సుఖంగా ఉంటుంది
మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట విలువైనది మాట్లాడే ప్రతి మాట వెనుకు తీసుకోవలేం, కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.
మాట్లాడే మాటలను దుర్వినియోగం చేసుకుంటే అతని లేక ఆమె జీవితం కష్టాల పాలౌవుతుంది.
మన జీవితంలో శాంతి సమాధానాలు లేకపోవడానికి కారణం మన యొక్కనోటి మాటయే. మన యొక్క సంభాషణలో నోటి మాటలో శుద్ధి , సౌందర్యం లోపించినప్పుడు మన కుటుంబాలలో కలహాలు మొదలవుతాయి.
ఈనాటి మొదటి పఠనంలో సీరా ఎలియజర్ పుత్రుడైన యేసు రచయత మనిషి యొక్క మాట తీరుకు అతడి మనసుకు ఉన్న సంభంధాన్ని తెలియచేస్తునారు.
మనిషి మాట్లాడే ప్రతి మాట బయటకు మనకు వినిపిస్తుంది. కాని అతని లేక ఆమె మనసు మనకు కనిపించదు. అయితే మనిషి మాట్లాడే మాటయే తన యొక్క అంతరంగమును బయటకు వెల్లడిస్తుంది.
సిరాకు 3 ఉపమానాల ద్వారా మనిషి మాటలు, అంతరంగిక భావాల గురించి తెలుపుచున్నారు.
1. జల్లెడ యొక్క ఉపమానం
2. కుమ్మరి పాత్రలు చేసే విధానం
3. పండును బట్టి చెట్టు యొక్క స్వభావం
ఈ మూడు కూడా మన వ్యక్తిగత జీవితంలో రోజు చూసే ఉదాహరణలే. ఇవి మనకు చాలా ముఖ్యమైన విషయాలు నేర్పిస్తాయి.
ఊపిన జల్లెడ - రైతు పంట కోసినప్పుడు మంచి గింజలనుండీ చెడు గింజలను వేరు పరచడానికి రైతు వినియోగించే సాధనమే జల్లెడ.
జల్లెడ పట్టడం ద్వారా మనకు మేలిమి వస్తువులు దొరుకుతాయి. అలాగే మనం మాట్లాడే ప్రతి ఒక్క దానిలో మంచి పదాలు ఉంటాయి, అలాగే చెడ్డవి ఉంటాయి.
జల్లెడ క్రీంద పొట్టు కనబడినట్లు మన యొక్క సంభాషణలో కూడా పోట్టు వంటి లోపాలతో కూడుకున్న పదాలు కనిపిస్తాయి. మన యొక్క మాటల్లో తప్పులు కనపడుతుంటాయి.
రెండవదిగా కుమ్మరి చేసే కుండలు : ఒకవేళ అతను మంచి మట్టిని వాడింది లేనిది వాటిని అవంలో వేసినప్పుడే అర్ధమవుతుంది. మంచి మట్టిని వాడక పోతే, అవి అగ్నిలో వేసినప్పుడే పగిలిపోతాయి. ఆవం లోని అగ్ని కుండ గట్టితనాన్ని పరిశీలించినట్లే ఒక వ్యక్తి యొక్క మాటతీరు , అతని సంభాషణ వలన అతను ఎలాంటివాడో అర్ధం అవుతుంది. మట్టి పాత్రలు విలువ ఆవంలో తెలిసిన విధంగా మనిషి యొక్క విలువ ఆయన మాటలో అర్థం అవుతుంది.
మూడవదిగా చెట్టు యొక్క పండు అది ఎలాగా ఫలములనిస్తుంది అని తెలుపుచున్నారు. చెట్టుకు అన్నీసక్రముగా ఇస్తే మంచి పండ్లనే ఇస్తుంది. అంటే చిన్నప్పటినుండియే చిన్న బిడ్డలకు మంచి విషయాలు నేర్పిస్తే భవిష్యత్తులో మంచి మాటలు ప్రవర్తన కలిగి జీవిస్తారు.
ఈ మొదటి పఠనము ద్వారా దేవుడు మన యొక్క మాటలు మంచిగా ఉండాలని తెలుపుతున్నారు. మానవ జీవితంలో మాట్లాడే ప్రతి ఒక్క మాట విలువైనది. శరీరానికి ఒక దెబ్బ తగిలితే ఆ గాయం తొందర్లోనే మాయం అవుతుంది. కానీ మాట ద్వారా మనసుకు అయిన గాయం మానటం కష్టం.
మనం మాట్లాడే మాటలు మనకు స్నేహితులను చేస్తుంది. అదే మాటల వల్ల మనకు శత్రువులు కూడా తయారవుతారు.
మనం మాట్లాడే మాటలు చాలా సార్లు జీవితాలు నిర్మిస్తాయి, నిలబెడతాయి అవే మాటలు కొన్ని సార్లు జీవితాలను కూల్చుతాయి.
మన యొక్క వాక్కు ద్వారా ఎందరో జీవితాలలో వెలుగు నింపవచ్చు, ప్రేమించవచ్చు. అదే మాట ద్వారా మనం కొందరిని ద్వేషించేవచ్చు.
మాట్లాడిన ప్రతి మాటకి రెండు అర్థాలు ఉంటాయి positive మరియు negative అయితే మనం ఎలాంటి tone ఉపయోగించం అన్నది కూడా ముఖ్యం.
మన యొక్క సంభాషణల ద్వారా ఇతరులలో నమ్మకం కలిగించవచ్చు, ఓదార్పును ఇవ్వవచ్చు, ప్రేరణ కలిగించవచ్చు .
ఒకచిన్న అగ్గిపుల్లతో ఎలాగైతే ఒక పెద్ద అడవిని కాల్చి వేయవచ్చో అలాగే మన యొక్క నాలుకతో మాట్లాడే మాటలు చాలామంది జీవితాలను కూల్చుతాయి. ఇతరులను పాపంలోనికి నెట్టేది కూడా మన యొక్క మాటలే ఎందుకంటే తప్పుగా మాట్లాడుట వలన వేరే వాళ్ళు ప్రేరేపించబడి పాపం చేస్తారు.
కాబట్టి మన యొక్క సంభాషణలో మన మంచిగా ఆలోచనలు చేసి మంచిగా మాట్లాడి జీవిస్తే ఈ లోకంలో శాంతి సమాధానాలు, ప్రేమ, ఆనందం ఉంటుంది. మన మాటలద్వారా ఆశీర్వదించవచ్చును శపించవచ్చును. సృష్టిలో కేవలం మానవులు మాత్రమే మాట్లాడే వారు. మనకు మాత్రమే గొప్ప వరం దేవుడు దయచేశారు. కావున మనం కూడా మాటలనే మాట్లాడాలి.
రెండవ పఠనంలో పౌలు గారు మరియొకసారి యేసుప్రభువు యొక్క పునరుత్తానం గురించి ప్రకటిస్తున్నారు. పౌలు గారు యేసు క్రీస్తు ప్రభువుకు మరణంను జయించగల శక్తి ఉన్నదని తెలుపుచున్నారు, అందువలనే యేసుప్రభువు మరణించిన తరువాత శరీరంతో పునరుత్తానమయ్యారు.
క్రీస్తు ప్రభువునందు జ్ఞానస్నానం పొందిన మన అందరంకూడా పవిత్రాత్మ ద్వారా ఇహలోకంలో దేవుని యొక్క అనుచరులుగా, విశ్వాసులుగా జీవించే మనందరం కూడా పునరుత్తానమవుతామని, దానికి నిదర్శనం యేసు క్రీస్తు పునరుత్తానమే అని పౌలు గారు తెలుపుచున్నారు.
ఈ లోకానికి మరణం పాపం చేయుట వలన వచ్చింది. పాపం చేయుటవల్ల అవిధేయులై, దేవుని చట్టాన్ని సరిగా పాటించలేం, ఇంకా పాపపు జీవితం నే కొనసాగిస్తాం. అయితే పాపంలో ఉన్నవారందరిని రక్షించడానికి ప్రభువు ఈలోకంలో జనిమించారు. ఎటువంటి పాపం చేయకుండా మన కోసం సిలువ శ్రమలు మరణం, పునరుత్తానం ద్వారా మనకు రక్షణ దయచేశారు అని పాలుగారు తెలుపుచున్నారు.
యేసుక్రీస్తుప్రభువు పాపమును జయించారు, మరణమును జయించారు, కాబట్టి మనం ఆయన యందు విశ్వాసముంచి ఆయన కార్యాలు నెరవేర్చాలి, ఆయన సేవ చేయాలని పౌలు గారు తెలుపుచున్నారు.
సువిశేష పఠనంలో యేసు ప్రభువు మనయొక్క జీవితంలో చాల విలువైన విషయాలను బోధిస్తున్నారు.
1. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివానికి మార్గం చూపించగలడా?
2. శిష్యులు గురువు కంటే అధికుడు కాదు
3. పరులను గూర్చి తీర్పు చేయకూడదు
4. అంతరంగిక శుద్ధి కలిగి మంచి మాటలు మాట్లాడుట, బోధించుట.
1. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివాడిని నడిపిస్తే ఏమవుతుందో అందరికి తెలుసు. వారిద్దరూ పడిపోయే అవకాశం ఉంది, దారి తప్పి పోతారు, గమ్యం చేరలేరు. చాల సందర్భాలలో మనం ఎలాంటి వారిని అనుసరిస్తున్నామో అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎవరిని వెంబడించాలో, ఎవరిని మన యొక్క నాయకులుగా అనుసరించాలో వారిపట్ల జాగ్రత్తగ ఉండాలి.
అన్ని తెలిసిన వ్యక్తులు మాత్రమే మనం అనుసరించాలి, మనలను సన్మార్గంలో నడిపించే వారినే వెంబడించాలి. దైవ జ్ఞానం లేని గ్రుడ్డివారిని, దేవుడంటే విశ్వాసం లేని వారిని తల్లిదండ్రులంటే భయభక్తులు లేని వారిని మనం అనుసరిస్తే మన జీవితాలు కూడా అంధకారంలోకి నడిపించబడతాయి.
ప్రతిఒక్కరు మొదటిగా తమ యొక్క జీవితాన్ని పరిశీలించుకుని, ఆ తరువాత ప్రజలను హెచ్చరించమని, నడిపించమని తెలుపుచున్నారు.
పరిసయ్యులు ప్రజలకు నాయకులుగా వ్యవహరించే వారు. అయితే పరిశయ్యులు తమ అంతరంగాన్ని చక్క పరచుకోనంతవరకు వారు గ్రుడ్డి నాయకులే. గ్రుడ్డి నాయకులు వేరే వారికీ దేవుని మార్గం ఎలాగా చూపించగలరు?
యేసు ప్రభువు మనందరియొక్క నాయకుడు ఎందుకంటే ఆయన మాత్రమే మనలను తండ్రి మార్గంలోకి నడిపిస్తారు. ఆయనయే ఈ లోకానికి వెలుగు. మన జీవితాలు మంచిగా ఉంచకుండా, వేరొకని మంచిగా జీవించమని చెప్పుట సరిఅయిన పద్దతి కాదు అని ప్రభువు తెలుపుచున్నారు.మంచి సమాత్రుకగా ఉన్నవారే వేరొకరికి మార్గం చూపించగలరు.
2. శిష్యుడు గురువుకంటే అధికుడు కాదు
శిష్యులు ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికిని ఆయన పొందినది మొత్తం గురువు దగ్గర నుండియే .. కాబట్టి శిష్యుడు గురువు కన్నా అధికుడు కానేరడు. శిష్యుల యొక్క జీవితంలో వెలుగును నింపింది గురువే నేర్పింది గురువే, దరి చూపించింది గురువే, జీవితం జారీచేసింది గురువే కాబట్టి మనం ఎప్పుడు కూడా గురువుకన్నా చిన్నవారమే. మన గురువు దేవుడే ఆయన కన్నా మనం ఎప్పుడు చిన్నవారమే కాబట్టి మన గురువుకు విధేయించాలి, గౌరవించాలి.
3. మన కంటిలో దూలం ఉంచుకొని వేరొక వ్యక్తి కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపిస్తాం.
మనందరికీ గురువింద గింజ తెలుసు పైన ఎర్రగా ఉంటుంది, క్రింద నల్లగా ఉంటుంది. చాలా సందర్భాలలో మనందరం పైకి మంచి వరమని, పవిత్రులమని భావిస్తాం కానీ అది వాస్తవం కాదు. మనం వేరొక వ్యక్తుల మీదనే ఎక్కువ (focus, attention) శ్రద్ధ ఉంచుతాం కానీ మన జీవితాలను మనం పరిశీలించుకోము.
పరిసయ్యులు సామాన్య ప్రజల జీవితాల మీదనెను శ్రద్ధ (focus) పెట్టారు కానీ తమ జీవితాల గురించి మరిచి పోయారు. -ఇతరుల గురించి తీర్పుచేశారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ (యోహాను 8: 3-11) యొక్క సువిశేష భాగంలో అక్కడా అందరూ పాపం చేసినవారే కానీ ఆ స్త్రీ పట్టుబడింది కాబట్టి ఆమెను శిక్షించాలని అనుకున్నారు. మన పాపాలు మనం తెలుసుకోవాలి, శారీరక శుద్ధి మాత్రమే కాదు అంతరంగిక శుద్ధి అవసరం. ఇతరుల గురించి తీర్పు చేయుటకు మనం అర్హులము కాదు. దేవుడు ఒక్కరే సత్యవంతుడు , పవిత్రుడు. మనలో చాలా మంది ఇతరులలో ఉన్న తప్పిదాలే వెదుకుతారు కానీ మంచిని చూడలేరు. మనం ఎవ్వరిని తీర్పు చేయకుండా నిందించకుండా, ప్రేమతో జీవించాలి. దేవుడే మన తీర్పరి.
4. అంతరంగిక శుద్ధి కలిగి జీవించాలి
మనయొక్క అంతరంగ పరిశుద్ధంగా ఉంటే మన మాటలుకూడా పరిశుద్ధంగా మంచిగా ఉంటాయి. మనయొక్క మాటలు అన్ని హృదయంనుండి, మనస్సునుండి వెలువడతాయి. మన హృదయాంతరాళంలో ఏవయినా స్వార్థం, క్రోధం, అసూయా, పగలు, ద్వేషాలు వున్నట్లైతే వాటి ద్వారా మన మాటలు చేతలు, ప్రవర్తన అవినీతి కరంగా ఉంటాయి. అంతరంగ జీవితం కు బాహ్య జీవితం కు సంబంధం ఉన్నది. ఇది కూడా విశ్వాసం చేతలు లాంటిది, రెండూకూడా ముఖ్యమే ఒకటి ఉంటే సరిపోదు.
పరిసయ్యులు బాహ్య జీవితానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. అంతరంగిక జీవితం మర్చిపోయారు. మాటలు, బోధనలు మాత్రమే వున్నాయి కానీ చేతలు లేవు. మంచి జీవితం లేదు. అందుకే ప్రభువు వారిని కపట వేషధారులు అని అంటున్నారు.
ప్రజల యొక్క మెప్పుకోసమే అనేక కార్యాలు చేసేవారు, దేవుణ్ణి స్తుతించారు కానీ వారి యొక్క హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మనం కూడా మంచి జీవితం అనగా అంతరంగికంగా మరియు బాహ్యంగా పవిత్రులై ఉండాలి.
మనందరం కూడా మంచి ఆలోచనలు కలిగి, మంచి మాటలు మాట్లాడుతూ ఒక మంచి విశ్వాసం జీవితం జీవించాలని ప్రభువు తెలుపుచున్నారు. మన సంభాషణలు యేసుక్రీస్తు సంభాషణల వలే మంచిగా పవిత్రంగా ఉండాలి.
Rev. Fr. Bala Yesu OCD
25, ఫిబ్రవరి 2022, శుక్రవారం
8 వ సామాన్య ఆదివారం
మనిషి మాటే - మనస్సు బాట
సీరా 27:4-7, 1 కోరింథీ 15:54-58 లూకా 6:39-45
క్రీస్తునాధుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా , ఈనాడు తల్లి శ్రీ సభ మనలను 8 వ ఆదివారం లోనికి ఆహ్వానిస్తుంది. ఈ నాటి పరిశుద్ద గ్రంధ పఠనములు ద్వారా మనకు ఇచ్చిన సందేశం మనిషి మాట ద్వారా మనస్సును తెలుసుకోవచ్చు అని మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది.
మొదటి పఠనం :- ఈనాటి మొదటి పఠనంలో మనిషి మాటకు -మనిషి మనస్సుకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియ చేస్తుంది. మనిషి మనస్సును మనం చూడలేముం వినలేము కానీ మనిషి మాట మనకు వినిపిస్తుంది. కనుక మనిషి మాటలే మనకు అతని మనస్సును మనకు తెలియ జేస్తాయి. మనిషి మనస్సు, గుణం, శీలం మనిషి మాటల ద్వారం ఏ విధంగా బయటపడతాయో ఈనాటి మొదటి పఠనం మనకు తెలియ జేస్తుంది.
ఊపిన జల్లెడ- కుమ్మరి చేసిన కుండ, చెట్టు కాపు అనే మూడు ఉపమానములు చెబుతూ మనిషి యొక్క హృదయనంతరంగమును తెలుసుకొనుటకు అతని మాటలే అని తెలియజేస్తున్నడు. కనుక ఏ నరున్ని అతన్ని మాట్లాడకముందు స్తుతించరాదు.
1. ఊపిన జల్లేదలో మట్టి పెళ్లలు మిగులునట్లే మనిషి సంభాషణమున దోషములు కనిపించును మనిషి మనస్సులోని దోషములు మాలిన్యాము. స్వార్ధము అతని మాటలలలోనే బయటపడుతాయి.
2. కుమ్మరి చేసిన కుండకు అగ్ని పరీక్ష అవసరం, అగ్నిలో కాల్చబడాలి. అలాగే మనిషికి పరీక్ష అతడి మాటలే.
3. చెట్టు కాపును బట్టి అదెంత బలమైనదో ఊహించవచ్చు అలాగే మాట తీరును బట్టి అతడు మంచి వాడా , చెడ్డ వాడ అని అర్ధం చేసుకోవచ్చు. పండును బట్టి చెట్టు స్వభావమును తెలుసుకుంటారు. పండు మంచిదైతేనే చెట్టు మంచిదని, పండు చెడ్డదైతే చెట్టు మంచిది కాదని ఎలా అనుకుంటామో అలాగే మనిషి మాటలను బట్టి అతను ఎలాంటి వాడు, అతని స్వభావం ఏమిటి అని తెలిసిపోతుంది.
మనిషికి ఉన్న మాట దేవుడిచ్చిన వరం. ఆ వరంతో దేవుడిని స్తుతించడానికి, ఇతరులకు తెలియచేయడానికి ఇతరులతో స్నేహ బంధాలు ఏర్పరుచుకొని వారితో శాంతి, సమాదానంతో జీవించడానికి వినియోగిస్తున్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఇచ్చే వరములను సద్వినియోగం చేసుకుంటే వారి జీవితం దేవునిలో వర్ధిల్లుతుందని, దానిని దుర్వినియోగం చేసుకుంటే జీవితం పాడైపోతుంది.
మనిషికి మాట శుద్ది ఎంతో అవసరం : -
మన హృదయం పవిత్రంగా ఉంటే మన మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి. మన హృదయంలో స్వార్ధము, కోపము, అసూయ,పగ, దురాశ ఉంటే మన మాటలు, చేతలు, ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది.
మన మాటలు మన హృదయాన్ని బహిర్గతం చేస్తాయి. our speach reveals our heart. తల్లి మాటలను బట్టి బిడ్డను ఎంత ప్రేమిస్తుందో అర్ధంచేసుకోవచ్చు. ఇతరులు మాట్లాడే విధానమును బట్టి వారు అభిమానంతో , ప్రేమతో మాట్లాడుతున్నారా? లేదా అని అర్ధం చేసుకోవచ్చు.
మనిషి నీతి న్యాయముతో కూడిన మాటలు ఆనందము, సంతోషముతో కూడిన మాటలు ఓదార్పు,సహనం ,ప్రోత్సాహపు మాటలు, శాంతికరమైన మాటలు, క్షమించమని అడిగేమాటలు దేవుని బిడ్డల నుండి వస్తాయి. మనము కూడా అలాంటి వారికే ప్రాముఖ్యతను ఇచ్చి వారినీ ఇష్ట పడటమే కాదు వారి వలె ఉండటానికి ప్రయత్నించాలి. అబద్దపు మాటలు చాడీలు , గొడవలు పెట్టె మాటలు, బూతు మాటలు ఇతన్నింటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. "ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్ధమైన మాటకు సమాదానం ఇవ్వవలసి ఉన్నది."మత్తయి 12:36 . అదే విధంగా నీ మాటలు బట్టి నీవు దోషివో , నిర్ధోషివో కాగలవు (మత్తయి 12:37). మన మాటలు మనం వ్యక్తిత్వాన్ని, మనస్సును తెలియ చేస్తాయి. గ్రీకు తత్వవేత్త సోక్రటీసు గారు చెప్పిన మూడు ద్వారములు : మనం నోటి మాట మూడు ద్వారములు దాటి బయటకు రావాలి, 1. మనము చెప్పే మాట నిజమేనా, 2. మనము చెప్పే మాట అవసరమేనా మరియు 3. మనము చెప్పే మాట ఉపయోగమేనా. మన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెళువడును(లూకా 6:45).
రెండవ పఠనం :- 1 కోరింథీ 15:54-58
ఈనాటి రెండవ పఠనాన్ని ధ్యానించుకుందాం. ప్రియమైన స్నేహితులారా రెండవ పఠనంలో పునీత పౌలుగారు కోరింథీ ప్రజలతో మాటలాడుతున్న మాటలు మనం శ్రద్దగా పరిశీలిస్తే, ఆయన ఆ ప్రజలకు దేవునితో ఉండటానికిధైర్యాన్ని ఇస్తున్నారు. 1 కోరింథీ 15:58 వ వచనంలో మూడు ముఖ్యమైన మాటలను కోరింతి ప్రజలకు చెపుతూ మనోధైర్యాన్ని, దేవుని యందు ధృడత్వాన్ని వారికి అందిస్తున్నాడు. ఆ మూడు విషయాలను తమ జీవితంలో నెరవేరిస్తే దేవునిలో నిలబడగలవు అంటున్నారు. ఆ మూడు విషయాలు మొదటిది ప్రియతమ సోదరులారా , దేవుని బిడ్డలారా దేవునిలో ధృడముగా, స్థిరముగా నిలబడుడు అని అంటున్నారు. అంటే మనం జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినను భాదలు వచ్చినను ఇబ్బందులకు గురి అయినను దేవుని యెడల అపారమైన ప్రేమ, నమ్మకము , విశ్వాసము కలిగి ఉండమంటున్నారు. భౌతికమైన మన శరీరానికి అమరమైన క్రీస్తుని ధరించి ఆయనతో స్థిరంగా నిలబడమంటున్నారు పౌలుగారు.
రెండవదిగా ప్రభువు కార్యములలో సర్వదా శ్రద్ద చూపుడు. ఈ మాటలకు అర్దం దేవునియొక్క పనులలో సంఘం యొక్క నడిపింపులో , దైవ జనులకు సహాయము చేయుటలో ప్రభువునకు సంభందించిన పనులు చేయుటకు ముందుండి ఆ దేవుని దైవత్వంలో పాలి భాగస్తులై ఉండమంటున్నారు. ఆత్మలను దైవ సన్నదికి నడిపించ ప్రభు సేవలో ప్రభుని కార్యములో సర్వదా శ్రద్ద చూపుచు ఈ లోక వ్యామోహాలకు, ఈలోక విషయాలకు నీ హృదిలో చోటు ఇవ్వక ప్రభువునకు సంభందించిన ప్రతికార్యములో శ్రద్ద చూపాలని పౌలుగారు పలుకుతున్నారు. ఇక , మూడవదిగా ఈ రెండు కార్యములను నీ హృదయ పూర్వకముగా చేసిన యెడల మీరు చేసే ఎట్టి కార్యాలు నిష్ప్రయోజనం కాదని పౌలుగారు పలుకుతున్నారు.
సువిశేషం :- లూకా 6: 39-45
ఈనాటి సువిశేషంలో కూడా మొదటి పఠనంలో చూసిన విధంగా వృక్షములను బట్టి దాని ఫలములుండును. అదే విధముగా ఒక మనుజుని మాటలు ఆయన తలంపులను బయలుపరచుచుండు సిరా 27:6 లో చూస్తున్నాం. సువిశేషంలో ప్రభుని మాటలు "మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఈయజాలదు. లూకా 6:43. పండుని బట్టి ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు. కోరింద పొదలనుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. దుర్జనుడు తన దుశ్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. "ఎలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. లూకా 6:43-45.
మనం మాట్లాడే మాటలు మన హృదయం నుండి వస్తు వుంటాయి. మన అంతరంగం పవిత్రంగా ఉంటే మన మాటలుకూడా మంచిగా ఉంటాయి. మన హృదయంలో స్వార్ధం, క్రోధం, అసూయ , పగ , దురాశలు ఉన్నప్పుడు మన యొక్క మాటలు, చేతలు ప్రవర్తన, నడవడిక అసభ్యంగా ఉంటాయి. అవినీతిగా ఉంటాయి. దురాశలతో నిండిన హృదయం నుండి మంచి మాటలు, చేతలు ఉద్భవించవు. మన ఆంతరంగిక జీవితానికి బహిరంగ ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పరిసయ్యుల బహిరంగ ప్రవర్తనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. వారికి మాటలు , చేతలు చట్ట పరంగా ఉంటే చాలు. ఆంతరంగిక ఉద్దేశాలు, బావాలు ఎలా ఉన్నా పర్వలేదు. యేసు ఈ పరిసయ్యులను ఉద్దేశించి ఈ పఠనములోని వచనాలు పలికారు. వారి యొక్క చెడు డాంబిక ప్రవర్తనను, భక్తి కార్యాలను యేసు ఖండించారు. ప్రజల పొగడ్తలకై ఎన్నో చేశారు కానీ హృదయ పూర్వకంగా దేవుని ఆరాధించలేదు. వారు పెదవులతో దేవుని ఆరాధించేరే కాని వారి హృదయాలు ఆయనకు ఎంతో దూరంగా ఉన్నాయి. వారి కార్యలన్నీ చెట్ల పండ్లు వంటివే. ఎందుకంటే అవి అన్నీ వారి హృదయంతరిక భక్తి హీనత నుండి, అవినీతి నుండి ఉద్భవిస్తాయి. మానవుని యొక్క మాటకు, కార్యనికి విలువను ఇచ్చేది అతని ఉద్దేశం.
మన అంతరంగం పరిశుద్దంగా ఉన్నపుడే మన మాటలు కార్యాలు దేవునికి ప్రీతికరంగా ఉంటాయి. క్రైస్తవులమైన మనము అనేక సార్లు ఆ పరిసయ్యుల వలె ప్రవర్తిస్తుంటాము. మన హృదయం అవినీతిలో,దురాశలతో నిండి ఉన్నప్పుడు పరిసయ్యుల వలె కాక మన హృదయాన్ని పరిశుద్ద పరచుకొని ఇతరులకు మార్గదర్శులం అవ్వాలి. అనగా క్రైస్తవుని హృదయంలో మన హృదయంలో పవిత్రత, నీతి , న్యాయం, ప్రేమ ,శాంతి ,సమాదానం, ఆనందం సహకారం మొదలైనవన్ని నెలకొంటాయి, అప్పుడు మానవుడు పలికే ప్రతిమాట నిజమైన క్రైస్తవ స్వభావాన్ని నిరూపించగలదు.
ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా హృదయ పరిపూర్ణత, పరిశుద్దత నుండే నోటి మాట వస్తుంది. లూకా 6:45. కాబట్టి మన హృదయాన్ని నిరంతరం (శుద్ది) ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడే మన ఆలోచన ,మాట , యుక్తవిధంగా ఉంటాయి. పది మందికి ఉపయోగపడుతాయి.
Br. Manoj
19, ఫిబ్రవరి 2022, శనివారం
7 వ సామాన్య ఆదివారం (2)
7 వ సామాన్య ఆదివారం
1 సామువేలు 26:2,7-9, 12-13,22-23, 1 కోరింథీ 15:45-49, లూకా 6:27-38
నేటి దివ్య పఠనాలు దేవుడిచ్చిన బంగారు సూత్రం గురించి భోదిస్తున్నాయి. ఇతరులు మీకు ఎట్లు చేయాలనుకుంటారో అట్లే పొరుగు వారికి చేయుటయే బంగారు సూత్రం. ఇంకోక విధంగా ఆలోచిస్తే ఆ బంగారు సూత్రం సోదరి సోదరుల పట్ల ప్రేమ కలిగి జీవించుట. అది శత్రువులైన మిత్రులైన సరే మనం ఒకరినొకరు ప్రేమించుకొని జీవించాలని అని ప్రభువు తెలుపుచున్నారు.
నేటి పఠనాలలో ప్రభువు శత్రువులను ప్రేమించి, క్షమించి వారి కోసం ప్రార్ధించాలి అనే అంశములు ఎక్కువగా కనబడుచున్నాయి.
ఈనాటి మొదటి పఠనంలో దావీదు రాజు యొక్క మంచి మనస్సును మనం చూస్తున్నాం. దావీదు మహారాజు దేవున మనస్సు కలిగి తన శత్రువైన సౌలును కాపాడిన విధానమును మొదటి పఠనం ద్వార వింటున్నాము. దేవుడు సౌలు తరువాత దావీదును యిస్రాయేలు రాజుగా అభిషేకించిన తరువాత దావీదు యిస్రాయేలు ప్రజలకు ఎన్నో రకాలైన విజయాలు చేకూర్చారు, ప్రజల్లో సంతోషం నింపారు, వారిని రక్షించారు.
సౌలురాజు కన్నా చక్కగా పాలన చేస్తూ ప్రజల యొక్క ఆధరాభిమానాలు పొందుతున్న దావీదు పట్ల సౌలుకు అసూయ కలిగింది, దానితో ఏ విధంగానైనా దావీదును చంపాలనుకున్నారు. తన యొక్క రాజ్యాధికారం పోతుందని సౌలు రాజు భయ పడ్డాడు. తన యొక్క కుమారులకు సింహాసనం దొరకదని ద్వేషంతో ఉన్నాడు.
అసూయ ద్వేషం వల్ల ఎలాగైనా సరే సౌలు దావీదును హత్తమార్చాలని ఆ పనిలో మూడు వేల మందిని వెంటబెట్టుకొని దావీదు ఉన్న సీపు ఎడారి ప్రాంతమునకు సౌలు ప్రయాణమై పోయాడు. సౌలు దావీదును చంపాలనుకొని వెళితే దేవుడే సౌలును దావిదునకు అప్పజెప్పాడు. ఎందుకంటే దావీదు దేవునికి విధేయించినవాడు. దేవుని చిత్తాను-సారంగా నడుచుకున్న వ్యక్తి. ఒక విధంగా ఆలోచిస్తే దేవుడు దావీదు పక్షమున నిలబడిన వారే. ఎందుకంటే దావీదు సౌలు శిబిరంలోకి ప్రవేశించే సమయానికి అందరు నిద్రమత్తులో ఉన్నారు. దేవుడే వారిని నిద్రించేలా చేసి ఉండవచ్చు. కనీసం ఒక్కరు కూడా మెళకువగా ఉండలేదు.
సౌలుకు దావీదు ఉన్న స్థలం తెలుసు కాని దావీదును చంపడానికి సౌలు వస్తున్నాడని బహుశా దావిదునకు దేవుడే ఎరుక పరచి ఉండవచ్చు. దావిదునకు వచ్చిన అవకాశమును ఆయన వినియోగించుకొనలేదు. తనను చంపాలనుకున్న సౌలును దావీదు రాజు చంపలేదు. ఎందుకంటే దావీదు రాజు సౌలు దేవుని అభిషిక్తుడు అని గ్రహించాడు. 1 సమూ 24:10,కీర్తన 105:15.
స్వయంగా దేవుడే అతన్ని రాజుగా అభిషేకించారని గుర్తించాడు. దేవుని యొక్క ప్రతి రూపం సౌలులో ఉందని తెలుసుకున్నారు. దేవుడే ప్రేమతో ఆయన్ను ఎన్నుకొన్నాడని గ్రహించాడు. దావీదు రాజు మాత్రము ఎప్పుడు కూడా సౌలును గౌరవించి జీవించిన వ్యక్తియే. అయిన కానీ సౌలు, దావీదు చేసిన అన్నీ మేలులు మరచిపోయారు.
దేవుని అభిషిక్తుని తాకకూడదని, ఆయనకు హాని చేయకూడదని దావీదు భావించాడు, వెనుకకు తిరిగి వచ్చాడు. సౌలు పాపి అయినప్పటికిని అసూయ ద్వేషం, పగ కలిగి ఉన్నప్పటికీ బలహీనత ఉన్నప్పటికీ దావీదు ఆయనకు ఎటువంటి ముప్పు కలుగ చేయలేదు. ఆయన్ను తాక లేదు.
మన యొక్క జీవితాలలో ఈ విషయం మరచిపోతాం. అభిషేకించబడిన వారికి వ్యతిరేఖంగా చాలా సంధర్భాలలో ఉంటాం. వారి యొక్క పేరు చెడగొడతారు, వారికి హాని కలుగ చేస్తారు. దావీదు సౌలును దేవుడు అభిషేకించిన విధానం గ్రహించి ఆ అభిషేకంలో ఉన్న పవిత్రత తెలుసుకున్నారు, కాబట్టియే సౌలుకు ఎటువంటి కీడు తల పెట్టలేదు. మనం కూడా ఇది నేర్చుకోవాలి. సౌలుకు దేవుడు ప్రసాదించిన రాజ్యాధికారాన్ని దావీదు ఎప్పుడు గౌరవిస్తూనే జీవించారు. దావీదు సౌలును గౌరవించాడు, తన రాజుగా అంగీకరించాడు,తన యొక్క ప్రభువుగా తనను ప్రేమించి సేవలందించాడు.
సౌలుకు ఎంత ద్వేషం ఉందో దావీదుకు సౌలు పట్ల అంత గౌరవం, ప్రేమ ఉన్నాయి. దావీదు శత్రువుల యెడల చూపిన ప్రేమ సౌలు జీవితం నే మార్చినది. శత్రువులను ప్రేమించుటయే దేవుని యొక్క మనస్సు, దావీదు దేవుని మనస్సు కలిగి జీవించాడు. దావీదు సౌలు వలె పవిత్ర గ్రంధంలో ఇంకొక ఉదాహరణ చూస్తాం. హమాను - మోర్ధకై .
ఇతరులకు కీడు తల పెట్టాలని భావించి తామే ప్రమాదంలో పడిన వ్యక్తులు, మనం చాలా మందిని చూస్తాం. వారిలో సౌలు వలె హమాను కూడా వస్తారు. హమాను యొక్క మనస్తత్వం ఏమిటంటే అందరు నా క్రింద అణగి ఉండాలని, తనకు తలవంచి మిగతవారు జీవించాలి అనే అహం తో జీవించేవాడు. మోర్ధకై మాత్రం దేవుడినే ఆరాధించే వ్యక్తి, దేవునికి మాత్రమే తల వంచి , విధేయించి జీవించే విశ్వాస పాత్రుడు.
మోర్ధకై తనకు తల వంచ లేదని హమాను మోర్ధకై జాతిని నాశనం చేయాలనుకున్నాడు. చివరకి తాను చేయించిన ఉరి కంబానికి తానే వ్రేలాడాడు. తాను ఏ అపాయం అయితే ఇతరులకు తల పెట్టాలనుకున్నాడో దానిలో అతనే పడిపోయాడు. తాను తీసిన గోతిలో తానే పడిపోయాడు. మనం కూడా సాధ్యమైనంత వరకు హాని చేయకుండా మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం.
దావీదు రాజు తనకు అపకారం చేయదలచిన సౌలుకు ఉపకారం చేశాడు. అపకారం చేసిన వారికి అపకారం చేయక ఉపకారం చేయాలి అని స్వయంగా పౌలు గారు తెలుపుచున్నారు. రోమి 12:17-20. అపకారం చేసిన వారికి ఉపకారం చేయటయే దైవ లక్షణం కాబట్టి మనం కూడా అలాంటి దైవ లక్షణం కలిగి జీవించాలి.
రెండవ పఠనంలో పౌలు గారు మొదటి ఆదాము , చివరి ఆదాము మధ్య గల తేడాను వివరిస్తున్నారు. మొదటి ఆదాము ఈ లోకంలో సృష్టించబడిన వ్యక్తి , ఆయన ఈ లోకానికి చెందిన వ్యక్తి అని పౌలు గారు వివరిస్తున్నారు.
కొరింతు సంఘంలో ఉన్న విశ్వాసులకు, శరీరం యొక్క ఉత్తనమునకు సంభందించిన కొన్ని సందేహాలు ఉన్నాయి. యేసు క్రీస్తు వలె తాము కూడా శరీరంతో పునరుత్థానము చెందుతామా?లేదా? అన్నది వారి యొక్క ప్రశ్న.
దానిలో భాగంగానే పౌలు గారు చక్కటి వ్యత్యసాలను ప్రజలకు వివరిస్తున్నారు. మొదటి ఆదాము భౌతిక జీవి, చివరి ఆదాము ఆత్మ సంబంది. ఆయన పరలోకం నుండి వచ్చిన వారు. వీరిద్దరి మధ్య తేడా ఉంది. ఒకరు భూలోక సంబంధులు , రెండవ వ్యక్తి పరలోక సంబంధులు. భువి నుండి పుట్టిన వానిని పోలిన మనము దివి నుండి వచ్చిన వాని పోలీకను పొందగలము. మన జీవితాలు పరలోకం నుండి వచ్చిన దేవుని పోలికను పొందగలవు, మన జీవితాలు మార్చుకున్నప్పుడు.
మన శరీరాలు కూడా పునరుత్థానం అవుతాయి, అందుకే క్రీస్తు ప్రభువు మానవ శరీరమున జన్మించి, శ్రమలు అనుభవించి, మరణించి, పునరుత్థానం అయ్యారు. మనం కూడా చివరి ఆదాము అయిన క్రీస్తు ప్రభువును పోలి జీవించాలి. అలా పోలిక కలిగి జీవిస్తామని దేవుడే స్వయంగా పౌలు గారు ద్వారా పలుకుచున్నారు.
ప్రతి మనిషి కూడా ఆదాము యొక్క మానవ స్వభావంతో, పాపంలో భాగస్తులై జీవించిన విధంగా క్రీస్తు నందు జ్ఞాన స్నానం పొందిన తరువాత ఆయన యొక్క ఆధ్యాత్మిక స్వభావం కలిగి జీవిస్తాం. కాబట్టి మనం కూడా పునరుత్థానం చెందగలం.
మనం జ్ఞాన స్నానం పొందడం ద్వారా క్రీస్తు నందు ఉన్నాము. క్రీస్తు సంబంధులం అయ్యాము . కాబట్టి మనకు పునరుత్థానం నిరీక్షణ ఉంది.
సువిశేష పఠనంలో యేసు ప్రభువు మానవ జీవితంలో కొన్ని కష్ట తరమైన పనులు చేయమంటున్నారు. మానవ ఆలోచనలతో జీవిస్తే అవి కష్టం కానీ దైవ మనస్సు కలిగి జీవిస్తే ఇది సాధ్య పడుతుంది.
సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మాటలు అందరిని ఆశ్చర్యచకితులను చేశాయి. ఇప్పటి వరకు విన్న మాట ఏమిటంటే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది కానీ ఇప్పుడు ప్రభువు శత్రువులను ప్రేమించమని పలుకు చున్నారు. ఈ మాటలు ఏ వ్యక్తియు చెప్పలేదు. ఇంత వరకు మొట్ట మొదటి సారిగా యేసు ప్రభువు చెపుతున్నారు.
పూర్వ వేదంలో పొరుగు వాడు అంటే కేవలం ఒక యూదుడుకి ఇంకొక యూదుడు పొరుడు వాడు. ఒక యూదునకు అన్యుడు పొరుగువాడు కాదు శత్రువే.
యేసు క్రీస్తు ప్రభువు పొరుగు వారు అనే పదంకు క్రొత్త అర్దం ఇస్తున్నారు. మానవులంతా మన పొరుగువారే. మిత్రులు మాత్రమే కాదు శత్రువులు కూడా మన యొక్క పొరుగువారే అని తెలుపుచున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి యేసు క్రీస్తు ప్రభువు
-శత్రువులను ప్రేమించమంటున్నారు
-శపించే వారిని ఆశీర్వదించమంటున్నారు
-ద్వేషించే వారికి మేలు చేయండి అని అంటున్నారు.
-బాధించే వారికోసం ప్రార్ధించమంటున్నారు
- ఒక చెంప మీద కొట్టిన వానికి ఇంకొక చెంప చూపించండి
-పై బట్టను ఎత్తుకొని పోయేవానికి అంగీని కూడా ఇవ్వమన్నారు.
- అడిగిన ప్రతి వానికి ఇవ్వమంటున్నారు
ఇవ్వన్నీ కూడా మానవులుగా సాధ్యమయ్యేనా
-మనల్ని తిరస్కరించిన వారిని ఎలా అంగీకరిస్తాము?
-మనకు కీడు చేసె వారికి ఎలా మేలు చేస్తాం?
- మన నాశనం కోరుకున్నవారిని ఎలా ప్రేమిస్తాం?
-శత్రువుల కోసం ఎలా ప్రార్ధిస్తాం
-మనకు హాని చేసే వారితో ఎలా స్నేహం చేయగలం
ఇవ్వన్నీ కూడా మానవులుగా కష్టతరమైన పనులే. అయినప్పటికీ ఒక క్రైస్తవునిగా మన యొక్క జీవితం భిన్నంగా ఉండాలి.
మానవ స్వభావం ధరించి జీవించే మనకు ఇది అసాధ్యం కాని దేవుని దేవుని స్వభావం ధరించి జీవిస్తే సాధ్యమే. మనకు సన్నిహితులైన బంధు మిత్రులను ప్రేమించినట్లు మన శత్రువులను ప్రేమించలేం. అది అసాధ్యం కాని దేవునిలో ఏకమై జీవించినప్పుడు ఇది సాధ్యం.
-ప్రభువు అంటున్నారు, నేను లేక మీరు ఫలింపజాలరు -యోహను 15:5. ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండవ చెంపను కూడా చూపించట నిజంగా గొప్పతనమే. మన జీవితంలో ఇది చక్కగా పాటిస్తే ఎదుటి వారు మారు మనస్సు పొందుతారు.
మాటకు మాట, దెబ్బకు దెబ్బ సూత్రం పాటిస్తే ఈ లోకంలో మిగిలేది అశాంతియే, గొడవలు మాత్రమే మిగులుతాయి. అందుకే మన జీవితాలు మార్చుకొని దేవుడు చూపిన బాటలో నడవాలి. మన జీవితంలో నిస్వార్ధమైన ప్రేమను మనం పంచాలి. నిస్వార్ధమైన ప్రేమ అంటే ఎవ్వరిని కూడా వేరు చేయకుండా అందరిని ప్రేమించాలి. నిస్వార్ధ ప్రేమను మనం వ్యక్త పరిస్తే, అది నిజంగా మనం దేవుని బిడ్డలమని నిరూపిస్తుంది.
దేవుడు ఎలాగైతే శత్రువుల మీద కూడా వర్షాన్ని ,ఎండను కురుపిస్తూ ప్రేమను పంచుతూ ఉన్నారో అలాగే మనం కూడా దుష్టులకు మేలు చేయాలి. దేవుడు మనలను ప్రేమించిన విధంగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి. మనం పాపం చేసి ఆయనకు శత్రువులైనప్పటికి ఆయన మనలను ప్రేమించారు.
యేసు క్రీస్తు ప్రభువు తన శత్రువులను ద్వేషింపక ప్రేమించారు, క్షమించారు. అలాగే వారి కోసం ప్రార్ధించారు. ఆయన యొక్క గొప్ప ప్రేమతో వారి జీవితమునే మార్చారు. శత్రువులను ప్రేమించుట కష్టమైన పని, అసాధ్యం అనిపిస్తుంది. అయితే ప్రభువు వారికి తన జీవితం ద్వార సుమాతృకను ఇస్తున్నారు.
సువిశేషంలో చెప్పబడిన విషయాలు అన్నీ మానవ స్వభావంతో ఆలోచిస్తే కష్టమే కాని దేవుని వలె జీవిస్తే తప్పని సరిగా సాధ్యం అవుతుంది.
-యేసు క్రీస్తు ప్రభువు శత్రువులను ప్రేమించారు.
-ద్వేషించే వారికి మేలు చేశారు
-బాధించిన వారి కోసం ప్రార్ధించారు
-శపించిన వారి బిడ్డలను దీవించారు.
మానవ జీవితంలో క్రైస్తవ జీవితం, క్రీస్తు అనుచరుడిగా ఉండే వారు భిన్నంగా ఉండాలంటే ఇవ్వన్ని పాటించాలి. మనందరం ఈ లోకం ఆశలు , ఆలోచనలు మించి దైవరాజ్య స్థాపన కోసం, దేవునిలో ఐక్యమై జీవించుటకు కృషి చేస్తే ఇది సాధ్య పడుతుంది.
మనం జీవితంలో దేవునితో అంటుకట్టబడితే మనం మారిపోతాం, దేవుని వలె ప్రేమిస్తాం. అసాధ్యమైనవి సుసాధ్యమవుతాయి. మనం జీవితం ప్రత్యేకంగా ఉండాలంటే ద్వేషాలు, పగలు అసూయలు విడిచిపెట్టి ప్రేమను అలవరుచుకోవాలి. ప్రేమతో జీవిస్తే కష్టమైన పనులు అన్నీ సక్రమంగా చేయవచ్చు.
నేటి పఠనాల ద్వారా దేవుడు మనందరిని ఒక క్రొత్త జీవితమునకు ఆహ్వానిస్తున్నారు. దైవ స్వభావం కలిగి, క్రీస్తులో ఐక్యమై క్రీస్తుకు సాక్షులుగా జీవించుదాం .
Rev. Fr. Bala Yesu OCD
18, ఫిబ్రవరి 2022, శుక్రవారం
7 వ సామాన్య ఆదివారం
7 వ సామాన్య ఆదివారం
12, ఫిబ్రవరి 2022, శనివారం
6 వ సామాన్య ఆదివారం(2)
6 వ సామాన్య ఆదివారం
యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26
నేటి దివ్య పఠనాలు దేవుని నమ్ముకుని జీవించే వారిలో, దేవుడు వారిని దీవించే విధానం గురించి, అదే విధంగా దేవుని మీద ఆధారపడి, దేవునికొరకు జీవించే వారు ఎల్లప్పుడు కూడా ధన్యులె అనే అంశములను గురించి దివ్య పఠనాలు సెలవిస్తున్నాయి.
మానవ జీవితంలో నిజమైన ఆనందం దేవుని మీద ఆధారపడి జీవించే వారికి కలుగుతుంది. వారి జీవితంలో ఒక వేళ సమస్యలు, కష్టములు ఉన్నా కాని దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు తప్పని సరిగా వారి జీవితంలో ఆనందంను ఎల్లప్పుడు ఉంచుతారు. దేవునిలోనే నిజమైన ఆనందం, ఆశీర్వాదం దాగి ఉంది.
ఈనాటి మొదటి పఠనంలో దేవుని యొక్క విజ్ఞాన వాక్కులను యిర్మియా ప్రవక్త ప్రకటిస్తున్నారు. దేవుడు రెండు రకాలైన ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు పలుకుచున్నారు.
1. మానవుల మీద ఆధారపడి జీవించేవారు
2. దేవుని మీద ఆధారపడి జీవించేవారు
ప్రభువే స్వయంగా అంటున్నారు, నరున్నీ నమ్మే వాడు శాపగ్రస్తుడు అని. మనం నరుని శక్తిని నమ్ముకొని జీవిస్తే దేవుడిని విస్మరించినట్లే, ఎందుకంటే దేవుని శక్తి మీద నమ్మకం లేదు కాబట్టియే నరున్నీ నమ్ముకుంటున్నారు. ఇది ఆనాడు యిస్రాయేలు ప్రజల్లో చూశాం, నేడు మనందరి జీవితాలలో కూడా చూస్తున్నాం. యిస్రాయేలు ప్రజలు నిజమైన రాజును (యావే)విస్మరించి వేరొక రాజు కోసం అడిగారు, దాని ప్రతిఫలంగా వారికి నష్టమే జరిగింది.
అదే విధంగా యిస్రాయేలు ప్రజలు చాలా సందర్భాలలో తమ యొక్క రక్షణ కోసం అస్సిరియుల మీద సిరియా సైన్యం మీద ఆధారపడి జీవించేవారు. కొన్నిసార్లు ఐగుప్తు వాసుల మీద ఆధారపడేవారు.
వీటన్నిటిలో యిస్రాయేలు ప్రజల దేవుని బలమును కాక మానవ బలముల మీద ఆధారపడి జీవించారు, అందుకే వారి జీవితంలో అన్ని సమస్యలు. వారి జీవితంలో కష్టలు ఎదురైనప్పుడు దేవుని వైపు మరలి రాక మానవ శక్తి వైపు మొగ్గు చూపారు. దేవుని యొక్క ఒప్పందంను మరచి పోయారు. మానవ మాత్రుల సైనిక బలమును నమ్ముకున్నారు.
యిర్మియా ప్రవక్త రెండు విషయములను అందరిముందు ఉంచుతున్నారు. 1. ఆశీర్వాదమా? 2. శాపమా?
మానవ జీవితంలో నరుల్ని నమ్మటం పాపము కాదు కాని నరుల్ని మాత్రమే నమ్మి వారి మీద ఆధారపడి జీవించుట పాపమే. మనందరం దేవున్ని నమ్ముకొని, దేవుని మీదనే ఆధారపడి జీవిస్తున్నామని భావిస్తాం. కాని మనం దేవుని కన్నా మానవుల మీదనే ఎక్కువగా ఆధారపడి జీవిస్తాం.
బాబిలోనియా రాజు యెరుషలేము మీదకు యుద్దం చేయడానికి వస్తున్నాడని తెలుసుకున్న యూదా రాజు, మతాధికారులు యావే దేవున్ని ఆశ్రయించకుండా, నమ్మకుండా ఐగుప్తు రాజు సహాయం కోరారు. ఈ విషయం దేవుడిని చాలా బాధించింది.
అన్నీ ఇచ్చిన దెవుడ్ని మరచి వేరె వారివైపు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. శూన్యం నుండి సృష్టిని చేసిన దేవుని శక్తిని మరచారు. దేవుడు యిస్రాయేలును ఫరో నుండి బయటకు తీసుకొచ్చిన విధానం మరిచారు.
ఎర్ర సముద్రం గుండా రక్షించిన విధానం మరిచారు.
ఎడారిలో ఒసగిన సమృద్ది ఆహారంను, అధ్బుతములను మరిచారు.
దేవుడు వారికి ఇచ్చిన యుద్ద విజయములను సంరక్షణను మరిచిపోయారు.
ఇవన్నీ మరచిపోయి మానవుల సహాయం కోరారు. పవిత్ర గ్రంధంలో దేవుని శక్తి మీద ఆధారపడి దీవెనలు పొందిన వారిని చాల మందిని చూస్తున్నాం.
దావీదు రాజు దేవుని మీదనే ఆధారపడ్డారు, ఆశ్రయించారు కాబట్టి అనేక విజయాలు సాధించారు. ఎస్తేరు తన ప్రజలను రక్షించుటకు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి తన ద్వారా ఆ ప్రజలను రక్షించారు. యెబు తన యొక్క విశ్వాస జీవితంలో దేవుని మీదనే ఆధారపడ్డారు అందుకే శ్రమలు తరువాత ఆశీర్వాదాలు సమృద్దిగా పొందుకున్నారు. -యొబు 42:12.
యిర్మియా ప్రవక్త తెలియ చేసే విషయం ఏమిటంటే దేవుని మీద ఆధారపడి జీవించుట ద్వారా శాశ్వత ఆనందం దొరుకుతుంది. వారి జీవితంలో అంతయు సమృద్ది దొరుకును అని ప్రవక్త పలుకుచున్నారు. దేవుని మీద ఆధారపడితే దీవెనలు వస్తాయి. అన్నా ఆధారపడినది దీవెనలు పొందింది. శతాధిపతి ఆధారపడ్డారు, యాయిరు ఆధారపడ్డారు, కననీయ స్త్రీ ఆధారపడ్డారు. తన యొక్క దివ్య శక్తి మీద ఆధారపడిన వారందరినీ ప్రభువు దీవించారు. ఆ దీవెనలు ఎలా ఉంటాయి అంటే జీవితం మొత్తం కూడా ఎటువంటి కొదవలేని విధంగా ఉంటాయి.
వారి జీవితం ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలే వుంటుంది. అక్కడ చెట్టుకు కావలసిన నీరు, సమృద్దిగా దొరుకుతుంది. ఆకులు పచ్చగా ఉంటాయి, కాయలు కాస్తాయి అని అంటే ఎప్పుడు కూడా వారు సు:ఖ సంతోషాలతో ఉంటారని దీని అర్ధం. మన జీవితంలో కూడా దేవుని మీదనే ఆధారపడి జీవిస్తే ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎక్కువగానే ఉంటాయి. కీర్తన గ్రంధంలో 1 వ అధ్యాయంలో కూడా దేవుని మీద ఆధారపడిన వారిని గురించి చెప్పబడింది. వారికి సకాలంలో అంతయు ఇవ్వబడును.
రెండవ పఠనంలో పునీత పౌలు గారు మరియొక సారి యేసు ప్రభువు యొక్క పునరుత్థానం గురించి భోదిస్తున్నారు. పౌలుగారు యేసు ప్రభువు యొక్క శరీరం యొక్క పునరుత్థానం యాదార్ధమని ప్రకటిస్తున్నారు,అదియే వారి యొక్క విశ్వాసం అని కూడా ప్రకటిస్తున్నారు. కోరింతులోని కొందరు వ్యక్తులు శరీరం యొక్క పునరుత్థానం లేదని బలంగా నమ్మేవారు అలాంటి అపనమ్మకం ఉన్న వ్యక్తులకు పౌలుగారు చెప్పే విషయం ఏమిటి అంటే యేసు ప్రభువు పునరుత్థానం అవ్వక-పోతే మా విశ్వాసం , మా సాక్ష్యం వ్యర్ధమని ప్రకటిస్తున్నారు.
యేసు ప్రభువు పునరుత్థానం అయి కొందరికి ప్రత్యక్షమయ్యారు 1 కోరింథీ 15:4-7. దేవుడే ప్రత్యేక్షంగా దర్శనం ఇచ్చారు అది చూసిన వ్యక్తులు ఇంకా జీవిస్తూనే ఉన్నారు అని చెప్పిన గాని ఇంకా కోరింతులోని వ్యక్తులు నమ్ముటలేదు.
కొన్ని సార్లు కొంత మందికి ఎంత చెప్పినా సరే వినరు . యేసు ప్రభువు పునరుత్థానం అయిన తరువాత శిష్యులకు దర్శనం ఇచ్చినప్పుడు తోమస్సు గారు అఆ సమయంలో వారితో లేరు అప్పుడు శిష్యులు ప్రభువు వారికి దర్శనం ఇచ్చారు అని ఎన్ని సార్లు చెప్పిన వినలేదు నమ్మలేదు. కోరింతు వారికి కూడా ఇది జరుగుతుంది. సజీవులు సాక్ష్యం ఇచ్చిన కానీ వారిలో ఇంకా అవిశ్వాసం దాగి ఉంది. పౌలు గారు ప్రభువు పునరుత్థానం చెందకపోతే, మన విశ్వాసం వ్యర్ధమని, అపోస్తుల భోదన వ్యర్ధమని , పునీతుల సాక్ష్యం వ్యర్ధమని పలుకుచున్నారు.
సువిశేషంలో యేసు ప్రభువు ధన్యత గురించి, అనర్ధముల గురించి, సంతోషం గురించి విచారము గురించి తెలియచేస్తున్నారు. అలాగే దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని తెలుపుచున్నారు. వాస్తవానికి ప్రభువు ప్రాపంచిక జీవితమును తిరస్కరిస్తున్నారు.దానితో పాటు భౌతిక వాదంను తిరస్కరిస్తున్నారు.
యేసు ప్రభువు మైదానం వద్ద పలికిన ఈ విలువైన మాటలు మత్తయి సువార్తలోని అష్ట భాగ్యాలకు సమానంగా ఉన్నాయి. కాని లూకా సువర్తకుడు అన్నీ ఇక్కడ రాయలేదు. రెండు విషయాలను మాత్రమే ఆయన గట్టిగా చెబుతున్నారు. మొదటిగా పేదవారి గురించి రెండవదిగా ధనికుల గురించి. దేవుని కొరకు శ్రమలు అనుభవించేవారు, స్వార్ధంతో జీవిచ్చే వారి గురించి చెబుతున్నారు. పేదలగు మీరు ధన్యులు దేవ రాజ్యం మీది అని ప్రభువు పలుకుచున్నారు.
పేదవారు అంటే కేవలం ఆర్ధికంగా సంపదలు లేని వారు మాత్రమే కాదు కాని దేవుని యొక్క ఆత్మీయతతో బలహీనంగా ఉన్నవారు, దేవుని అనుభవం లేనివారు , దేవుని యొక్క ఆత్మ తక్కువగా ఉన్నవారు.
నిజానికి ఈలోకంలో సమృద్దిగా అన్నీ ఉన్నాయి అయితే అవి ఎక్కువ శాతం ధనికుల వద్దనే ఉన్నాయి. ప్రభువు వారిని ధనవంతులుగా చేసినది పేదవారిని ఆదుకొనుటకొరకే.
1. పేదలగు మీరు ధన్యులు అంటే దేవుని ఆత్మలో పేదవారు - ఆధ్యాత్మిక పేదరికం దేవుని మీద ఆధారపడి జీవించే వారు దేవుని ముంగిట తన బలహీనతలను, ఆధ్యాత్మిక అవసరతలను గ్రహించుకొని దేవుని వైపు మరలి ఆయన మీద ఆధారపడి జీవించుటయే.
మానవ జీవితంలో ఏ అనుగ్రహమైన దేవుని దగ్గరనుండియే ఇవ్వబడుతుందని గ్రహించుటయే. poor in spirit అని అర్ధం. దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉండే వారికి ధన్యత కలుగుతుంది.
2. ఆకలిగొని యున్న వారు ధన్యులు అని పలుకుచున్నారు. ఇక్కడ ఇది శారీరక ఆకలి మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఆకలి.
దేవుని వాక్కు కోసం ఉన్న ఆధ్యాత్మిక ఆకలి, దేవుని ఆహారం (దివ్య సత్ప్రసాదం ) స్వీకరించాలనే ఆకలి, దేవుని అనుభూతి పొందలనే ఆకలి కలిగిన వ్యక్తులకు వచ్చే ధన్యత గురించి తెలుపుచున్నారు.
యేసు ప్రభువు ఆకలితో ఉన్న ఎందరో ప్రజల యొక్క ఆకలిని తీర్చారు. అలాగే ఆధ్యాత్మిక ఆహారం కోసం ప్రయత్నించే వారికి కూడా దేవుడు సహాయం చేస్తున్నారు. పేదవారు, ఆకలి దప్పలు కలిగిన వారు ఎప్పుడు కూడా ఆధారపడి జీవిస్తారు, ఎదురు చూస్తారు, ప్రయత్నిస్తారు, కష్టపడతారు కాబట్టియే వారికి కావలసిన ఆహారం దొరుకుతుంది. మన యొక్క జీవితంలో కూడా దేవుని మీదనే ఆధారపడి జీవిస్తే మన శారీరక , ఆధ్యాత్మిక ఆకలి తీసివేయబడి మనకు అంతా సమృద్దిగా ఇవ్వబడుతుంది. ధన్యులు అంటే దేవుని మీద ఆధారపడి , దేవుని కొరకు జీవిస్తూ తమ జీవితం ద్వారా దేవున్ని సంతృప్తి పరిచేవారు.
3. శోకించుచున్న మీరు ధన్యులు - ఆనందింతురు. తమ యొక్క పాపపు జీవితంనకు శోకించే వారు తం పాపాలకు హృదయ పరివర్తనం చెందాలని బాధపడే వారు దేవుని కృప వలన సంతోషం ఇచ్చారు. ఈ లోకం లో లాజరు శోకించారు కానీ దేవుడు అతనికి పరలోకంలో సంతోషం ఇచ్చారు. యొబు శోకించాడు అలాగే దేవుడు ఆశీర్వదించి సంతోషం ఇచ్చారు. ఎవ్వరు నిజంగా శోకీస్తారు అంటే దేవుని యొక్క పవిత్రత ముంగిట తమ యొక్క అయోగ్యత గుర్తించిన వారు.
యెరుషలేము దేవాలయంలో సుంకరి రొమ్ము బాదుకొని తన పాపాలకు పశ్చాత్తాప పడి ఏడ్చాడు. ఆయన ప్రార్ధన ఆలకించబడింది. అలాగే ఆయనలో సంతోషం నింపబడింది. మనయొక్క పాపాలకు, వ్యసనాలకు శోకించి మన జీవితాలు దేవున వైపు మరల్చుకుంటే ఆనందంగా జీవించగలుగుతాం.
4. దేవుని కొరకు నిందించబడినప్పుడు ధన్యులు అని పలుకుచున్నారు. క్రీస్తు కొరకు జీవించే వారిలో నిందలు ,హింసలు , అవమానాలు వస్తాయి అని ప్రభువు తెలుపుచున్నారు. దేవునికి సాక్షి పూరితమైన జీవితం జీవించే వారు ఎన్నో శ్రమలు అనుభవించారు అని పరిశుద్ద గ్రంధం తెలుపుచున్నది. ప్రవక్తలు శ్రమలు అనుభవించారు, శిష్యులు హింసలు అనుభవించారు, సేవకులు , పునీతులు కష్టాలు , నిందలు అవమానాలు అనుభవించారు. శ్రమలు అనుభవించిన కాని వారు దేవుని సేవ చేశారు, దేవుని కొరకు జీవించారు.
మనుష్య కుమారుని నిమిత్తము ఎందుకు హింసలు అనుభవిస్తారంటె 1. ఈ ప్రపంచం ఇంకా దేవుని తెలుసుకొనలేదు 2. శ్రమలు అనుభవించె వారు దేవుని లోకంలో జీవించే వారు ఈ లోకంలో ఉన్నప్పటికీని వారు ఈ లోకానికి చెందిన వారు కారు. 3. హింసలు పొందుతారు ఎందుకంటే దేవుని యొక్క సత్యమైన మాటలు ప్రకటించినప్పుడు అవి ప్రజలకు నచ్చనప్పుడు.
దేవుని కొరకు హింసలు పొందినప్పుడు వారికి బహుమానం కలుగుతుంది. 1. గౌరవించ బడుతారు. అ . పో . 5: 41, 2. ఓదార్చబడతారు 2 కోరింథీ 1:5 3. దేవునికి దగ్గరగా ఉంటే దీవెన పొందుతారు (1 పేతు 4:14)4.క్రీస్తుకు గొప్ప సాక్షులు అవుతారు. (2 కోరింథీ1:4-6)
మానవ జీవితంలో మనం దేవుని కొరకు జీవిస్తే దేవుడు తప్పని సరిగా మన కొరకు జీవిస్తారు. ధనికులను గురించి ప్రభువు హెచ్చరిస్తున్నారు, ధనికులు సుఖాలు అనుభవించి పేదవారిని నిరాకరిస్తున్నారు, స్వార్దంతో జీవిస్తున్నారు.
1.ధనికులు తమ మీదనే ఆధారపడుతారు. దేవున్ని కాదని ధనమే ముఖ్యమని జీవించే ధనికులందరికి అనర్ధం అని ప్రభువు తెలుపుచున్నారు. ధనం మనిషిని ఈ లోక ఆశలకు కట్టి వేస్తుంది, ధనమే అన్ని అనర్ధాలకు మూలం.
2.కడుపు నిండిన వారా మీకు అనర్ద, అని పలుకుచున్నారు ప్రభువు అంటే ఇంకా వారికి ఎదియు అవసరం లేదు. నిండిన వారు అంటే ఈ లోక ఆశల్లో , వ్యామోహంలో, ధనంతో, స్వార్ధంతో , కొరికలతో, నిండినవారు అలాంటి వారికి అనర్ధం వారి జీవితంలో దేవున్ని నింపు కోటానికి స్థలం లేదు. లూకా 15:16.
3. నవ్వుచున్న వారులారా అనర్దం - నవ్వు చున్న వారి గురించి చెప్పబడింది. అంటే వారి జీవితంలో సరదాలు ఎక్కువగా ఉంటాయి. parties , celebrations ఎక్కువగా ఉండేవారు అలాంటి వారికి అనర్ధం అని తెలుపుచున్నారు. వారి జీవితంలో పాపాలకు పశ్చాత్తాపం లేదు. అసలు పాపం అనే ఆలోచనే లేదు. దాని వల్ల విందులతో వినోదలతో జీవితాలు గడుపుతున్నారు. అలాంటి వారికి అనర్దం అని పలికారు.
4. ప్రశంసించబడినప్పుడు అనర్ధం అంటున్నారు. ఎందుకంటే ఎదుటి వారికి నచ్చిన విధంగా, చెప్పిన విధంగా మనం జీవిస్తే తప్పని సరిగా ప్రశంసించబడతాం. కానీ అలాంటి జీవితం కాదు మనం జీవించాలిసింది. ప్రశంసల కోసం అన్యాయంను న్యాయం చేయకూడదు. దేవుని కొరకు సత్యమైన జీవితం జీవించాలి. దేవుని మాటలే ప్రకటించాలి. హింసలు వచ్చిన, బాధలు వచ్చిన దేవుని కొరకు జీవిస్తే ఆయనయె వారిని సన్మానిస్తారు.
కాబట్టి దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని దీవెనలు పొందుదాం. మానవ శక్తి మీద కాకుండా, ఈ లోక శక్తి మీద కాకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవునికి సాక్షులై జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD
6 వ సామాన్య ఆదివారం ( ఏవరిని నమ్మాలి )
6 వ సామాన్య ఆదివారం
యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26
క్రీస్తు నాధుని యందు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు తల్లి తిరుసభ 6 వ సామాన్య ఆదివారము లోనికి అడుగిడుతుంది. ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు అన్నీ దేవుని యందు విశ్వాసం గురించి భోదిస్తున్నాయి. ఈనాటి మూడు పఠనాలు మనము గమనించినట్లయితే మనకు ఒక సందేహము కలుగవచ్చు. అది ఏమిటంటే "ఎవరిని నమ్మాలి" అని ఎందుకంటే ఈనాటి మొదటి పఠనాన్ని గమనించినట్లయితే మొదటి పఠనం యిర్మియా గ్రంధము నుంచి తీసుకొనబడింది. యిర్మియా ఒక గొప్ప ప్రవక్త, దేవుని మాట కోసం తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండ దేవుడు ప్రజలను ఏవిధంగా శిక్షింపనున్నాడో , వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనభోతున్నారో తన జీవితం ద్వారా తెలిపిన గొప్ప ప్రవక్త, ప్రజలను దేవుని వైపు నడిపించడానికి తన ప్రాణములను సైతం పణంగా పెట్టిన గొప్ప ప్రవక్త. ఈ యిర్మియా ప్రవక్త రాజకీయంగా విఫలమైయాడు కానీ ఆధ్యాత్మికతలో మాత్రం దేవునికి ఏంతో దగ్గరయ్యాడు. ఈనాటి మొదటి పఠనంలోని మాటలు యిర్మియా ప్రవక్త తానే స్వయంగా ప్రజలను హెచ్చరిస్తూ పలికిన మాటలు. ఎందుకంటే ఈ యూదా ప్రజలను దేవుడు బానిసత్వం నుండి తీసుకొని వచ్చి వారికి కావలసిన వన్ని ఇచ్చి వారికి అక్కున నిలిచాడు.
ఈ యిస్రాయేలు ప్రజలకు ఏ ఆపదవచ్చిన వారికి సమీపమున లేదా సహాయముగా ఉండేది ఎవరు అంటే దేవుడు. దేవుడు వారికి అతి సమీప వ్యక్తి పిలవగానే పలికే వ్యక్తి , వారికి ఏ ఆపద వాటిల్లినా మొదటిగా తలచేది దేవుడినే చివరకు దేవుడు వారితో ఓడంబడిక కూడా చేసుకున్నాడు. మీరు నా ప్రజలు , నేను మీ దేవుడను అని . ఈ ప్రజలకు దేవుడు ఇంత చేసిన తరువాత కూడా ఆపద వచ్చినప్పుడు దేవున్ని కాదని మానవుల సహాయం కొరకై వెళుతున్నారు. అది కూడా వారి శత్రువుల దగ్గరికి బాబిలోనియా రాజు యిస్రాయేలు ప్రజలను బానిసత్వమునకు తీసుకొని వెళ్ళాడు. ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు. ఇప్పుడు బాబిలోనియా రాజు వారి మీదకు దండెత్తి వస్తున్నారని తెలిసి యిస్రాయేలు ప్రజలు ప్రాణముల మీద తీపితో ఈజిప్టు దగ్గరకు సహాయముకై వెళుతున్నారు. శత్రువులైన ఈజిప్టు రాజు నుండి కాపాడిన దేవుడిని మరచి ఈ ప్రజలు మానవుని సహాయము కొరకై పరుగు తీస్తున్నారు.
దేవుడిని కాదని మానవుల మీద ఆధారపడిన వారు లేదా మానవులను నమ్మిన వారి గతి ఏ విధంగా ఉండునో దివ్య గ్రంధం చక్కగా వివరిస్తుంది. ఉదాహరణకు ఏసావు , యకొబును నమ్మితే, యాకోబు తన అన్న అయినటువంటి ఏసావును మోసం చేస్తున్నాడు. పాత నిభందనలోని యేసేపు తన అన్నలను నమ్మితే వారు యేసేపు చావుని కోరారు, సంసొను డెలీలా ను నమ్మితే డెలీలా సంసొనును మోసం చేసింది, ఇలా మనం నిజ జీవితంలో ఎన్నో చూస్తున్నాం, కొన్ని సార్లు అనుభవించే వుంటాం. కానీ దేవుడు మాత్రం వారు ప్రార్ధించిన ప్రతిసారీ, అడిగిన ప్రతిసారీ, మొరపెట్టుకున్న ప్రతిసారీ ఆలకించాడు,ఇచ్చాడు. వారి చెంతనే నిలిచాడు. పగలు మేఘ స్తంభం వలె రాత్రి అగ్ని స్తంభం వలె ఉంది కాపాడాడు. ప్రజలు ఎన్నిసార్లు మోసం చేసిన దేవుడు మాత్రం దయ కలిగే ఉన్నాడు వారి యందు. ఈనాటి పఠనంలో కూడా తన ప్రవక్త అయిన యిర్మియాను పంపి తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. దేవునిపై నమ్మకము ఉంచి విశ్వసించువాడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలే ఎప్పుడు పచ్చగా ఉంటాడు, ఎప్పుడు ఫలిస్తూ ఉంటాడు, మానవులను నమ్మి వారిపై ఆధారపడువాడు మరు భూమిలో ఉండు తుప్పలను పోలి ఉంటాడు అని హెచ్చరిస్తున్నాడు. కానీ యిర్మియా ప్రవక్త మాత్రం దేవుడిని చివరివరకు విడనాడలేదు అందుకే యిర్మియాను ఒక గొప్ప ప్రవక్త గా భావిస్తుంటారు.
ఈనాటి లూకా సువార్తలోని వచనాలు మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాము. రెండు ఒకే విధంగా ఉంటాయి. ఈ వచనాలు సరిగా చదివితే అవి విప్లవాత్మకంగా , సమాజ విలువలను గురించి మాట్లాడినట్టుగా వుంటాయి. మత్తయి సువార్తికుడు ఆధ్యాత్మిక పేదరికం గురించి మాటలాడుతుంటాడు, కానీ లూకా సువార్తికుడు మాత్రం ఆనాటి కాలంలో జరుగుతున్న కలహాలు, హెచ్చుతగ్గులు గురించి మాట్లాడుతుంటాడు. నిజమైన పేదరికం గురించి వారు అనుభవిస్తున్న వాటి గురించి మాట్లాడుతున్నాడు. సువార్తలో ప్రభువు చెప్పినట్లు పేదరికం , ఆకలి, దాహం లాంటివి ఆనాటి కాలంలోని కలహాలు. ఆనాటి కాలం లోనే కాదు ఇప్పటికీ కొనసాగుతున్నావే ఇవి, మానవుడు దేవుని విలువలకంటే ప్రపంచ విలువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే ప్రభువు అంటున్నారు ఆకలికొని ఉన్న వారులారా ఆనందపడుడు అని ధనికులకు శాపగ్రస్తులు అని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వస్తువులకు, విలువులకి ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుని విలువులకు ప్రాధాన్యత ఇవ్వలేడు. హృదయాన్ని దేని మీద అయితే కేంద్రీకృతం చేస్తామో దాని కొరకై పరుగెడుతాము. ప్రపంచ వస్తువుల మీద అయితే వాటి కొరకై పరుగెడతాము కానీ వాటిని ఎప్పటికీ సాధించలేము, దేవుని మీద అయితే మనం సాధించగలం. ఎందుకంటే మనం ఆయన ప్రజలం ఆయన మన దేవుడు. ఎవరైతే దేవుని విలువలకు ప్రాధాన్యత ఇస్తారో అట్టి వారు ఏటి ఒడ్డున నాట బడిన చెట్టు వలె నిరంతరం పచ్చిగా ఫలిస్తుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారులారా ధన్యులు దైవ రాజ్యం అట్టివారిది.
రెండవ పఠనంలో పునీత పౌలుగారు క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమును గురించి పునరుత్థానము నందు విశ్వాసము గురించి ప్రస్తావించుచున్నారు. మొదటి కోరింథీయులు 15 వ అధ్యాయము అర్ధము చేసుకోవడానికి కష్టముగా ఉండేటువంటిది. అందులోని మర్మము అర్ధం కాదు. కొరయిన్థియ ప్రజలు శరీరము యొక్క ఉత్తానమును తీరస్కరిస్తున్నారు. కానీ ప్రభువు యొక్క పునరుత్థానమును కాదు. పౌలు గారు చెప్పేది ఏమిటి అంటే శరీర ఉత్తానమును తీరస్కరిస్తే ప్రభుని పునరుత్థానమును కూడా తీరస్కరించినట్లే. శరీర ఉత్థానమును నమ్మని వాళ్ళు ప్రభుని పునరుత్థానమును ఎలా నమ్ముతారు? ఇలా అపనమ్మకము ద్వారా క్రైస్తవ సత్యాన్ని, నిజాన్ని, సందేశాన్ని కించపరిచినట్లే. ఇప్పటి వరకు భోధించినది వ్యర్ధమైనట్లే ప్రభువు పునరుత్థానము కాకపోతే చేసే బోధన, విశ్వాసం అంతా వ్యర్ధమే.
ఎందుకు పౌలుగారు ప్రభుని పునరుత్థానమునందు విశ్వాసాన్ని ముఖ్యముగా భావిస్తారు, అందులో దాగిన విలువలు, సత్యము ఏమిటి అంటే ప్రభువు అనేక సార్లు తన శిష్యులకు దర్శనమిచ్చారు.
*క్రైస్తవులను హింసించే సౌలుకు సైతం దర్శనమిచ్చ పౌలుగా మార్చారు.
*శిష్యులతో కలసి భుజించాడు, ప్రయాణించాడు ఇలా ఎన్నో జరిగాయి.
*పునరుత్థాన సత్యము యూదులు చేసే అసత్య వాదనకన్నా బలమైనది, నిజమైనది.
* ప్రభుని పునరుత్థానము మంచి చెడు మీద ఎంత బలమైనది అని నిరూపిస్తుంది.
*ప్రభుని పునరుత్థానం ప్రేమ అసహ్యం కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది.
*ప్రభుని పునరుత్థానము బ్రతుకు చావు కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది.
చివరిగా పౌలుగారు చెప్పేది ఏమిట అంటే ఒక వేళ క్రీస్తు ప్రభుని పునరుత్థానం నిజము కాకుంటే , భోదించే సందేశం అబద్ధం అయితే పునరుత్థానంను విశ్వసించి చనిపోయిన వారి చావు, విశ్వాసం వ్యర్ధమే వారి యొక్క విలువలు వ్యర్ధమే.
పునరుత్థానమును జీవితంలో నుంచి తీసివేస్తే మనకు అయిన క్రైస్తవ విశ్వాసాన్ని చెడిపివేసినట్లే. "నేను కాదు జీవించేది నాలో జీవించేది క్రీస్తే" అని పౌలు గారి వలె మనము మన పునరుత్థాన విశ్వాసాన్ని చాటి చెప్పాలి. మనం మనయందును లేక మానవుల యందు కాక దేవుని యందు నమ్మకం ఉంచుదాం. ఆయనయందు విశ్వాసంలో ధృడపడుదాం.
Br. Lukas
సామాన్యకాలపు 5 వ ఆదివారం
సామాన్యకాలపు 5 వ ఆదివారం యెషయా 6:1-6 1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...