1, జులై 2022, శుక్రవారం

14 వ సామాన్య ఆదివారం (2)

 14 వ సామాన్య ఆదివారం 

యెషయా  66: 10-14, గలతి 6: 14-18, లూకా  10: 1-12, 17-20

ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క సువార్తను ప్రకటించుట గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క సువార్తను ప్రకటించుట ద్వారా దైవ రాజ్య స్థాపన జరుగుతుంది, దేవుని యొక్క శాంతి నెలకొల్పబడుతుంది. 

దేవుడు సువార్త సేవకులను ఎన్నుకొన్నది ప్రజల యొక్క జీవితంలో దేవుని యొక్క శాంతిని నెలకొల్పుటకు, వారిని పరలోకం చేర్చుటకు, ప్రజల మీద దేవుని ఆశీర్వాదాలను క్రుమ్మరించుటకు, ప్రభువు సువార్త సేవకులను ఎన్నుకొన్నారు. 

దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే వారు సువార్తను అనగా మంచి వార్తను, సంతోష వార్తను, ప్రకటించేప్పుడు ఆనందంగానే ఉండాలి. మనందరం  జ్ఞానస్నానం పొందిన వారు సువార్త సేవకు అర్హులే. మన యొక్క మాటల ద్వారా, జీవితం ద్వారా ప్రభువును ప్రకటించాలి. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ఒక సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నారు. 

బాబిలోనియా బానిసత్వం నుండి యిస్రాయేలు ప్రజలు విముక్తులవుతారని, అధే  విధంగా వారు యెరుషలేముకు తిరిగి వచ్చినప్పుడు శాంతితో , సంతోషముతో ఉంటారని తెలియజేశారు. యిస్రాయేలు ప్రజలు 50 సంవత్సరాల తరువాత క్రీస్తు పూర్వం 587-537 కాలంలో యెరుషలేముకు తిరిగి వచ్చారు. 

అప్పుడే బాబిలోనియా బానిసత్వం నుండి తిరిగి వచ్చిన యిస్రాయేలు ప్రజలను దేవుడు పసికందుతో పోల్చుతున్నాడు. 

తిరిగి వచ్చిన ప్రజలు తమ సొంత ప్రాంతమును మరియు దేవుని నివాస నగరమైన యెరుషలేమును చూసి నిరుత్సహపడ్డారు. శిధిలమైన తమ దేశాన్ని అలాగే కూలిపోయిన తమ యొక్క దేవాలయంను చూసినవారు బాధపడ్డారు. అలాంటి ఒక బాధకరమైన స్థితిలో ఉన్న వారికి దేవుడు సంరక్షణను, ఆనందంను  కలుగజేస్తారని పలుకుచున్నారు. 

ఒక తల్లి -బిడ్డల యొక్క ఉదాహరణతో దేవుడు తన ప్రజల పట్ల ఏ విధంగా మేలుగుతారని ప్రవక్త తెలుపుచున్నారు. ఈ ఉదాహరణలో యావే దేవుడును   యెరుషలేముతో పోల్చబడటం జరిగినది . చంటి బిడ్డను యిస్రాయేలుతో  పోల్చారు. 

11 వ వచనంలో యెరుషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు అని పలుకుచున్నారు. అనగా బిడ్డలైన యిస్రాయేలు ప్రజలందరు కూడా దేవుని ద్వారా పోషించబడతారు. దేవుడు వారికి బలమును ఒసాగుతారు. దేవుడు వారి యొక్క ఎదుగుదలకు కారణం అవుతారని తెలుపుచున్నారు. 

యిస్రాయేలు ప్రజలు పుష్కలమైన దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొని ఆనందింతురు. అని తెలుపుచున్నారు. 

12 వ వచనంలో దేవుడు, తిరిగి వచ్చిన యిస్రాయేలీయుల యొక్క అభివృద్దికి తోడ్పడుతానని తెలుపుచున్నారు.  వారి యొక్క సంపదలు  పొంగి పొరలినట్లు, వారి యొక్క ఖ్యాతి పేరుగునట్లు  చేస్తానని ప్రభువు  నుడువుచున్నారు. 

యావే దేవుడు తన యొక్క  అమితమైన ప్రేమను, అనురాగంను  యిస్రాయేలు ప్రజలకు  అందజేస్తారు. 

యిస్రాయేలు ప్రజలను చంటి బిడ్డలవలె తన చేతులలోనికి తీసుకొని ముద్దాడతారు. తన ఒడిలో ఒళలాడించేదరు.  యావే దేవుడు యెరుషలేముపై తన శాంతిని ప్రవహింపజేస్తారు, ప్రజలను  ఆనందోత్సాహములతో నింపుతారు. 

ఒక తల్లి తన కుమారుని ఓదార్చిన విధంగా దేవుడు కూడా యిస్రాయేలు ప్రజలను ఓదార్చుతారు. దేవుడు వారిని అదరిస్తారు. ఆదుకుంటారు. ఏ సమయంలోనైనా దేవుడు వారికి సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటారని తెలుపుచున్నారు. 

యావే దేవుడు మరియు యిస్రాయేలు ప్రజల బంధం చాలా గొప్పది. చాలా సన్నిహితమైనది ఎందుకంటే దేవుడు స్వయంగా వారిని తన బిడ్డలుగా చేసుకున్నారు. తన సంరక్షణను కల్పిస్తానన్నారు. వారిని పోషిస్తానన్నారు, అధేవిధంగా వారిని ఆదుకుంటానని మరియు వారికి సంతోషంను, శాంతిని కలుగజేస్తానని ప్రభువు తెలుపుచున్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడి సేవకుడైన  యోషయా  ప్రవక్త తనకు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా  నెరవేర్చారు. అంటే ప్రజలకు సందేశంను (యావే దేవుని సందేశం) అందజేయుట. ఒక ఎన్నుకొనబడిన ప్రవక్త చేయవలసిన పనిని యోషయా ప్రవక్త చేశారు. దేవుని ప్రజలకు దేవునికి మధ్య ఉన్న తల్లి బిడ్డల బంధం గురించి తెలిపారు. 

ఈనాటి రెండవ పఠనంలో  పౌలు గారు  గలతీయులకు రాసిన చివరి మాటల గురించి చదువుకుంటున్నాం. 

పౌలు గారు దేవుని చేత తన యొక్క సువార్త -సేవకై ఎన్నుకొనబడిన తరువాత ఆయన సేవలో ఉన్న సిలువ పరమార్ధం గ్రహించి తాను సిలువ యందే ఆనందిస్తున్నా,  అని అన్నారు. 

యేసు ప్రభువు సిలువ మరణం ద్వారా ఈ లోకాన్ని జయించారు, ఈ లోక వ్యామోహలన్నింటిని త్యజించి మనకు రక్షణము ప్రసాదించారు. 

ఆయన సిలువను మోసి తండ్రికి సంపూర్ణ విధేయత చూపించారు. మనయందు ఉన్నటువంటి అపారమైన ప్రేమవలనే క్రీస్తు ప్రభువు సిలువ మీద మరణం పొందారు. 

-సిలువలో రక్షణ ఉందని 

-సిలువలో ప్రేమ ఉందని 

-సిలువలో విజయం ఉందని 

-సిలువలో స్వస్థత ఉందని తెలుసుకున్న పౌలుగారే  సిలువ యందు నేను గొప్పలు చెప్పుకొనుచున్నాను అని పలికారు. 

పౌలుగారు గలతీయుల ప్రాంతం విడిచిపెట్టి  వచ్చినప్పుడు కొంతమంది యూదయ  క్రైస్తవులు యెరుషలేము నుండి గలతీయ ప్రాంతంకు వచ్చి అందరు యేసు ప్రభువు వలె సున్నతి పొందాలి అనే ఒక ఆసత్య ప్రచారం లేక బోధన చేశారు.  ఎందుకంటే యేసు ప్రభువు కూడా సున్నతి పొందారు కాబట్టి మీరు కూడా సున్నతి పొందాలని ప్రకటించారు. దానికి సమాధానంగా వారి యొక్క అసత్య బోధనలను ఖండిస్తూ  పౌలుగారు, యేసు క్రీస్తును విశ్వసించి ఆయన యందు జ్ఞాన స్నానం పొందిన  ప్రతి ఒక్క వ్యక్తి  నూతన సృష్టియే అని తెలిపారు. 

ఒక విధంగా విశ్వాస పరంగా సందిగ్ధతలో ఉన్న గలతీయులకు పౌలు చక్కని భోదన చేశారు. యేసు క్రీస్తునందు జ్ఞాన స్నానం పొందేవారు, దేవుని యొక్క పవిత్రాత్మను పొంది నూతన సృష్టిగా రూపాంతరం చెందుతున్నారని, దేవుని బిడ్డలుగా తయారవుచున్నారని పౌలుగారు తెలిపారు. 

దేవునికి చెందిన వారిగా ఉండాలంటే కేవలం సున్నతి కాదు అవసరం. ఆయన యందు సంపూర్ణ విశ్వాసం అని పౌలుగారు తెలిపారు, అందుకే నేను సిలువ యందు గొప్పలు చెప్పుకుంటున్నాను అని అన్నారు.  పౌలుగారు పరిసయ్యుల వంశమునకు చెందిన వ్యక్తియైన సున్నతి కలిగిన వ్యక్తి అయినప్పటికి  జ్ఞాన స్నాన విలువను తెలుసుకొని విశ్వాస పాత్రుడిగా జీవించారు. 

ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన యొక్క సువార్త సేవకు శిష్యులను పంపించే  విధానం చదువుకుంటున్నాం. 

సువార్త సేవకు  పంపించే ముందు యేసు ప్రభువు శిష్యులకు  కోన్ని సూచనలు వారు చేయబోయే పరిచర్య గురించి ఇస్తున్నారు. 

ఈ సువిశేష భాగంలో మొదటిసారిగా యేసు ప్రభువు 72 మందిని సువార్త పరిచర్యకు నియమించి, వారిని ఇద్దరిద్దరిని చొప్పున, తనకు ముందుగా పంపారని సువార్తికుడు తెలియజేశారు. మత్తయి, మార్కు, సువార్తికులు కేవలం 12 మంది శిష్యుల యొక్క పరిచర్యను గురించి తెలిపితే, లూకా గారు మాత్రము 12 మంది శిష్యులతో పాటు 72 మంది శిష్యుల  పరిచర్యను కూడా వివరిస్తున్నారు. 

70 అనే సంఖ్య యిస్రాయేలు ప్రజల జీవితంలో గుర్తుండిపోయే సంఖ్య ఎందుకంటే , యకొబు యిస్రాయేలు నుండి ఐగుప్తుకు క్రొత్త జీవితం జీవించడానికి వెళ్లేటప్పుడు 70 మందిని తన వంశస్తులను తీసుకొని వెళ్లారు. వారితో ఒక నూతన రాజ్యం స్థాపించుటకు యాకోబుగారు వెళ్లారు. ఆది 46. 

నోవా కాలంలో కూడా 70 దేశములు /రాజ్యముల గురించి తెలుప బడింది. ఆది 10 వ ఆధ్యాయం. మోషే ప్రవక్త దేవుని ప్రజలను నడిపించుటకు 70 మందిని ఎన్నుకుంటున్నారు. వారు దేవుని మహిమను చూస్తున్నారు. నిర్గమ 24:1,9. 

70 మంది యిస్రాయేలు యొక్క నాయకులు /పెద్దలు . సంఖ్యా 11:16 

ఏలీము వద్ద 70 ఖర్జూరపు వృక్షములు వున్నాయి. నిర్గమ 15:17. 

యూదుల యొక్క sanhedrin సభయమండలి 70 మందితో కూడినది. వారే నడిపించేవారు, నిర్ణయాలు తీసుకునేవారు. 

యూదుల యొక్క నమ్మకం ఏమిటంటే అప్పట్లో  కేవలం 70   దేశాలు మాత్రమే ఉన్నాయి అన్నది. 

యేసు ప్రభువుకు అనేక మంది శిష్యులున్నప్పటికి కేవలం ఈ 70/72 మంది మాత్రమే ప్రభువును చాలా దగ్గరగా అనుసరించారు. 

ఇద్దరిద్దరిని పంపిస్తున్నారు ఎందుకంటే, ఇద్దరి సాక్ష్యం ఒక విషయం ఆమోదించుటనికి సహాయ పడుతుంది. ద్వితీయో 19:15, మత్తయి 18:16 , ద్వితీయో 17:6 

అధే విధంగా ఇద్దరు వ్యక్తులు పరస్పరం సహకరించుకొనుటకు, పరస్పరంప్రోత్సాహించుటకును, తోడుగా ఉండుటకు దేవుడు వారిని ఇద్దరిద్దరి చొప్పున పంపిస్తున్నారు. 

ప్రభువు వారిని పంపించింది ఎందుకంటే తన కొరకు మార్గమును సిద్ధం చేయుటకు, తన రాజ్య స్థాపన కొరకు అదే విధంగా దైవ ప్రేమను అందచేసి ప్రజల యొక్క హృదయంలో  శాంతిని నెలకొల్పుటకు  ప్రభువు  వారిని పంపిస్తున్నారు. 

మనల్ని కూడా దేవుడు సువార్త పరిచర్యకు జ్ఞాన స్నానం ద్వారా ఎన్నుకొంటున్నారు. 

ప్రభువు సేవ చేయుట కొరకు పని వారి కోసం ప్రార్ధించమని పలుకుచున్నారు. పంట విస్తారము కాని పనివారు లేరు కాబట్టి పని వారి కోసం ప్రార్ధించమని ప్రభువు పలికారు. విశ్వాసుల సంఖ్య అధికమే కాని సువార్త సేవ చేసే వారి సంఖ్యయే  తక్కువ కాబట్టి వారి కొరకు ప్రార్ధించమని ప్రభువు అంటున్నారు. 

ఈ 72 మంది యొక్క పని మానవుల ప్రణాళికా కాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడే వారి ద్వారా పని చేస్తారు. 

ప్రభువు శిష్యులను పంపించె ముందు వారికి గొప్ప గొప్ప వాగ్ధానాలు చేయలేదు వారి జీవితంలో కష్టాలు ఉంటాయని తెలిపారు అందుకే ప్రభువు నేను మిమ్ము తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలవలె  పంపిస్తున్నారు అని పలికారు. లూకా 10:3. 

వాస్తవానికి తోడేళ్లకు గొర్రె పిల్లలకు  ఎటువంటి బంధం లేదు. తోడేళ్ళు గొర్రెలను చంపుకొని తింటాయి, హింసిస్తాయి, గాయ పరుస్తాయి. అధే విధంగా తోడేళ్ల మనస్తత్వం కలిగిన వ్యక్తులు కూడా వుంటారని  ప్రభువు తెలిపారు. అంగీకారం  మరియు తిరస్కారం అన్నీ చోట్ల  ఉంటాయి అని ప్రభువు తెలిపారు. 

సువార్తకు పంపబడిన వారు  కూడా గొర్రె పిల్ల మనస్సు కలిగిఉండాలి. వినమ్రత, హాని చేయకుండుట,  యుద్దం చేయకుండుట (non - combative) లక్షణాలు కలిగి జీవించాలి. అపో 20:28-31 , యోహను 15:20 , యోహను 16:1-4, పిలిప్పీ 1:29, 2 తిమోతి  3:12. 

దేవుని కొరకు ఎన్ని కష్టాలు   అయినా అనుభవించుటకు సిద్ధంగా ఉండాలి దైవ సేవకులు. 

సువార్త సేవకు బయలు -దేరేటప్పుడు వారితో ఏమి తీసుకొని  పోరాదని ప్రభువు తెలుపుచున్నారు. ఎందుకంటే వారు సంపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడి జీవించాలి. వారి అనుదిన జీవితంకు సైతం అవసరమైన వస్తువులను  సైతం ప్రభువు పరిత్యజించమని కోరుచున్నారు. దేవుడే వారికి అన్నియు సమకూర్చుతారు. వారి యొక్క ఆలోచనలు ధనం గురించి , అధికారం గురించి మిగతా ఈ లోక విషయాలు గురించి ఉన్నట్లయితే వారు ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశ్యమును మరచి పోతారని ప్రభువు వారిని ఏమి తీసుకొని పోరాదని పలికారు. మొదటిగా దేవుని రాజ్యం వేదకితే అన్నీ ప్రభువే సమకూర్చుతారు. మత్తయి 6:33 . పిలిప్పీ 4:11-13, కీర్తన 37:3,5. సామెతలు 3:5 . 

దేవుని సేవకులు,  ప్రభువు యొక్క శాంతిని ప్రకటించాలి ఆహ్వానించే వారు ఉన్నట్లయితే వారి యొక్క ముఖ్య ఆహ్వానం మన్నించి, ప్రభువు యొక్క రాజ్యం గురించి ప్రకటించమన్నారు. ఆహ్వానించే వారు లేకపోతే పాద దూలిని వదలి అక్కడ నుండి వెళ్ళమని ప్రభువు పలుకు చున్నారు . 

దేవుని చేత పంపబడిన వారు ఆయన యొక్క రాజ్యం గురించి ప్రకటించాలి. అదియే వారి యొక్క ప్రధమ  బాధ్యత. వారి యొక్క పరిచర్య సేవ జీవితంలో ఎల్లప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. 

-దేవుని నుండి అంతా ప్రారంభించాలి 

- దేవుని మీద ఆధారపడి జీవించాలి 

-దేవునికొరకు హింసలు అనుభవించుటకు సిద్దంగా ఉండాలి. 

-దేవుడే వారి జీవితంకు కేంద్రం  కాబట్టి ఆయన కొరకు సమస్తము త్యజించాలి. 

-దైవ ప్రేమను పంచాలి, నిస్వార్ధ సేవ చేయాలి

- రోగులను స్వస్త పరచాలి , దేవుని శాంతిని ప్రకటించాలి. 

-దేవుని  ఉద్దేశం నెరవేర్చుట మరచి పోరాదు 

మనందరం కూడా  దేవుని కొరకు జీవించి దేవుని రాజ్య స్థాపన కోసం కృషి చేద్దాం, దేవుని సాక్షులై జీవించుదాం. 

Rev. Fr. Bala Yesu OCD

సామాన్య 14వ ఆదివారం

సామాన్య    14వ ఆదివారం

యెషయా  66: 10-14
గలతి 6: 14-18
లూకా  10: 1-12, 17-20

ప్రచారకులను పంపుట - సువార్త వ్యాప్తి - దైవ రాజ్య స్థాపన


ఈనాడు తల్లి తిరుసభ 14వ సామాన్య ఆదివారమును కొనియాడుచున్నది. ఈనాటి పఠనాలను మూడు అంశాల రూపేనా అర్ధం చేసుకుందాం. 
1  ప్రచారకులను పంపుట
2  సువార్త వ్యాప్తి
3 దైవ రాజ్య స్థాపన  
వీటిని విపులంగా ధ్యానిద్దాం.

1.  ప్రచారకులను పంపుట

ఈనాటి సువార్త పఠనంలో డెబ్బది ఇద్దరు శిష్యులను ప్రభువు పంపుచున్నారు (లూకా 10 : 19 ). “70”  సంఖ్య  పవిత్రగ్రంథంలో చిహ్నాపూర్వకమైన సంఖ్య . పూర్వ నిబన్ధనలో మోషే ఇశ్రాయేలు ప్రజలను యెడారికి నడిపించుకుని రావడంలో నాయకత్వం వహిస్తూ ఆ బాధ్యతా భారంతో అలసిసొలసి పోయినప్పుడు యావే ప్రభువు మోషే సహాయకులుగా డెబ్బది మందిని నియమిస్తారు (సంఖ్యా 11 : 16 - 17 ). ఇంకా పవిత్రగ్రంథంలో  ఎన్నో  చోట్ల  డెబ్భై  సంఖ్య  యొక్క  ప్రాముఖ్యతను చూస్తున్నాం. 

ఈరోజు కూడా ప్రభువు డెబ్బది రెండు  మందిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణకునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను (లూకా 10 : 1 ). ఇద్దిరిద్దరిని పంపేది కేవలం ఒకరికి ఒకరు సహాయంగా ఉండడానికి మాత్రమే కాక ఇద్దరి సాక్షానికి చట్టరీత్య ఎంతో విలువ ఉంటుందని కూడా పంపుచున్నారు. ఇంకా ప్రభువు వారితో పంట విస్తారము కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్ధింపుడు అనెను (లూకా 1 : 2 ). అంటే ప్రార్ధన ద్వారా దేవునితో కొనసాగింపు అనుబంధాన్ని మరియు నిర్మిత అవినాభావ సంబంధాన్ని  కలిగి యుండి, పరిచర్యలో వచ్చే కొరతలు ప్రభువుకు తెలియజేసి, ఆ కొరత తీరుటలో మధ్యవర్తిత్వాన్ని వర్తిస్తు, వారి ప్రేషిత కార్యాన్ని కొనసాగించాలని అర్ధము. వీరు తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లలవలె పంపబడుచున్నారు.

ఎందుకు ? ఎందుకంటే వీరు సువార్త పరిచర్య  స్వీకరించేటటువంటి  ప్రజలు మరియు వీరు తిరిగేటటువంటి ప్రదేశాలు వీరికి పూర్తిగా అనుకూలంగా మద్దతుగా ఉండకపోవచ్చు.  ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి.  ఎన్నో ఇబ్బందులను అధిగమించాలి. ఎన్నో సమస్యలతో పోరాడాలి.  వీటన్నిటిలో గొర్రెపిల్లవలె ఉండి తోడేళ్లపై విజయాన్ని సాధించాలి. 

ఆ తరుణంలో వీరు పరిపూర్ణ పరిత్యాగాన్ని, పేదరికాన్ని పాటిస్తూ ప్రజల ధాతృత్వంపైన ఆధారపడివుండాలి. జాలెనైనను, జోలెనైనను, పాదరక్షలనైనను కొనిపోరాదు. మార్గమధ్యమున ఎవరిని కుశల ప్రశ్నలు అడగరాదు (10 : 14 ) అని ప్రభువు సెలవిస్తున్నారు.  వారికి అప్పగించిన భాధ్యతపై వారి మనసులను కేంద్రికరించి హృదయాలను లగ్నము చేసి శ్రద్ధ వహించి ఈ బాధ్యత నెరవేర్పునకు కృషి చేస్తూ  ముందుకు సాగాలి.  

2.  సువార్త వ్యాప్తి

ఈ డెబ్బది ఇద్దరు పంపబడటానికి ముఖ్య కారణం: సువార్త వ్యాప్తి. సువార్త అనేది స్థంబించినటువంటి ఒక వస్తువుగా ఉండకూడదు. సువార్త అన్ని వేళల అన్ని ప్రదేశాలలో అందరికి వ్యాపించబడాలి. సువార్త వ్యాపించబడాలి అంటే నువ్వు నేను సువార్త సైనికులుగా మారాలి . సువార్త వ్యాపింపచేయాలి అనే తపన కలిగిన వారందరు ఈనాటి రెండవ పఠనంలో (గలతి 6 : 14 - 18 ) చూస్తున్న విధంగా పౌలు గారితో కలిసి “నేను మరి ఇతరములైన దేనియందుగాక మన ప్రభువగు యేసు క్రీస్తు సిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును.  ఏలయన ఆయన సిలువ మూలముననే నాకు ఈలోకము, నేను ఈలోకమునకు సిలువ వేయబడితిమి” అని చెప్పగలగాలి. ప్రభువే స్వయంగా చెప్తున్నారు "నన్ను అనుసరింపగోరు వాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను" (మత్తయి 16 : 24 ).

పునీతులు కూడా చెప్తుంటారు శిలువే మా  సంపద అని. అవును ఎప్పుడైతే సిలువ మన సంపద అవుతుందో సిలువ వేయబడిన క్రీస్తు మన సర్వసం అవుతారు. అప్పుడు సువార్త వ్యాప్తిలో ఎదురయ్యే ప్రతి సవాలును, ప్రతి కష్టాన్ని నష్టాన్ని , ప్రతి అడ్డంకిని, ఇబ్బందిని తణుకు బెణుకు లేకుండా ఎంతో ధైర్యంతో ఎదుర్కొని అధిగమించి ముందుకు సాగగలుగుతాము  . మన బోధనలో క్రీస్తుప్రభుని భాధలు, సిలువ మరణము, పునరుత్తనము, మహిమ ప్రధాన అంశాలు కావలి. మన జీవితాలనుండి సిలువను వేరుచేయలేమను సత్యాన్ని ప్రతిక్షణం గ్రహించాలి మరియు   మన జీవితంలో జీవించాలి.  

క్రీస్తుప్రభుని జీవితంలో మరణం తధ్యం, ఆ మరణం కూడా సిలువ మరణమే. క్రైస్తవులుగా క్రీస్తువలె సిలువను హత్తుకొని జీవించాలి. పేతురుగారివలె క్రీస్తు కావలి, సిలువ వద్దు అనే భావంతో ఉండవచ్చు కానీ  తరువాత పేతురుగారికి అర్ధమైంది సిలువలేకుండా క్రీస్తు లేరు అని.

   పేతురుగారు నేను బోధించేది మీరు సిలువ వేసిన క్రీస్తును అని ధైర్యంతో భోధించగలిగారు. పునీత పౌలు గారు పలుకుతున్నవిధంగా ఎవరైతే క్రీస్తునందు, క్రీస్తుమరణంలో మరణిస్తారో వారు క్రీస్తుతో పాటు పునరుత్తానమౌతారు (రోమా  6 : 4 ).  అతడు నూతన సృష్టి ( గలతి 6 : 15 ). తమ తమ జీవితములలో సిలువ సూత్రమును పాటించువారికి సమాధానము, కనికరము తోడుగా ఉంటుంది (గలతి 6 : 16 ). సువార్త వ్యాప్తికై ఎంతగానో ప్రయాణించి శ్రమించిన పౌలుగారు సైతము యేసుక్రీస్తు సిలువనందు మాత్రమే గొప్పలు చెప్పుకొందును (గలతి 6 : 14 ) అని నొక్కి వక్కాణించుచున్నారు. సువార్త వ్యాప్తికై శ్రమిస్తున్న ప్రతి ఒక్కరినోట ఇదే మంత్రంగా మారాలి. ఇదే వారి చెవులలో మారు మ్రోగాలి. తద్వారా శిలువే మన సంపద కావలి. 

 దైవ రాజ్య స్థాపన 

పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 14 : 18లో దైవరాజ్యము అంటే ఏమిటో నిర్వచిస్తున్నారు. "దైవరాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ ఒసగు నీతి, శాంతి, సమాధానములే". దైవరాజ్య స్థాపన అంటే దేవుడు మనకు అనుగ్రహించిన నీతి, సంతోషములను మరి ముఖ్యంగా శాంతిని ఇతరులతో  పంచుకొని, ఈలోకమును ఒక పరలోకముగా మార్చడమే. ఈనాటి మొదటి పఠనములో (యెషయా 66 : 10 - 14 ) యావే ప్రభువు యెరూషలేము ప్రజలకు ఒక శుభసందేశాన్ని ఇస్తున్నారు "మీరు యెరూషలేముతో కలిసి ఆనందించి సంతసింపుడు....... మీరు యెరూషలేము తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు పాలిండ్లనుండి స్తన్యము గ్రోలి  సంతృప్తి చెందుదురు". యావే ప్రభువు మరల తన నివాసాన్ని ప్రజల మధ్య అనగా దేవాలయంలో ఏర్పరచుకున్నప్పుడు ఆ  పట్టణము ఆయన శాంతితో నిండిపోతుంది. ఆ ప్రజల మధ్య దేవుని శాంతి సంపదలు ఒక నది వలె ప్రవహిస్తాయి. ప్రజలు దేవుని అనుగ్రహముతో దీవెనలతో హాయిగా కాలం గడుపుతూ అభివృద్ధి చెందుతారు. యెషయా ప్రవక్త ప్రవచనం ప్రకారం యేసు ఈ లోకంలో శాంతి నెలకొల్పడానికి వచ్చారు. అందుకే సువార్త పఠనంలో ప్రభువు తన శిష్యులను శాంతిని అందించడానికి పంపుతున్నారు. "మీరు ఏ ఇంట ప్రవేశించిన ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలుకుడు" ( లూకా 10 : 5 ). 

సమాధానమును  దేవుడు ఒక్కడే  ఇవ్వగలడు. ఇది దేవుని అనుగ్రహవరం. ఈలోక మానవులు ఇవ్వగలిగే శాంతి సమాధానములు క్షణికమే. దేవుడు అనుగ్రహించే శాంతి శాశ్వతం. ఈ శాంతిని పొందాలంటే దానిని స్వీకరించాలి. దానిని స్వీకరించాలంటే దేవుడు పంపిన వారిని ఆహ్వానించాలి. వారిని ఆహ్వానించడం అంటే స్వయంగా దేవుని ఆహ్వానించడమే. అప్పుడు దేవుడే స్వయంగా సమాధానమును మనకు అనుగ్రహిస్తారు. ఒకవేళ మనం దేవుడు పంపిన వారిని ఆహ్వానింపనియెడల దేవుని తిరస్కరించినట్లే. అందుకే ప్రభువు తన శిష్యులతో "మీరు ప్రవేశించిన పట్టణప్రజలు మిమ్ము ఆహ్వానింపనియెడల ఆ పట్టన వీధులలోకి వెళ్లి మీ కాళ్లకు అంటిన దుమ్మును వారికి విరుద్ధంగా అచ్చటనే దులిపివేయుడు. ఇంకా వారికి దేవుని రాజ్యము సమీపించినదని గ్రహించమని గుర్తుచేయుడు అని చెప్పెను" ( లూకా 10 : 10 - 12 ).  

దేవుడు పంపిన వారిని ఆహ్వానింపకపోవడం తేటతెల్లముగా దేవుని పరిత్యజించడం మరియు దేవుని తీర్పును సూచిస్తుంది.  ఈ డెబ్బది ఇద్దరు ప్రభువు వారికి అప్పగించిన పనిని పూర్తిచేసిన తర్వాత వారి అసాధారణ శక్తులను, అనుగ్రహాలను దేవుని సువార్త సైనికులుగా ఉండి వాటిని ఉపయోగించమని క్రీస్తు వారికి అధికారాన్ని ఇస్తున్నారు. 

 దేవుని రాజ్యాన్ని  నా అనుదిన ఆలోచనలు, మాటలు మరియు కార్యాలద్వారా స్థాపిస్తున్నానా? అని  నువ్వు  నేను ఆత్మపరిశీలన చేసుకోవాలి.  దేవుని రాజ్యస్థాపన కేవలం గురువుల బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత. ఆ రాజ్య స్థాపనకు చిహ్నం శాంతి. మన వ్యక్తిగత కుటుంబ మరియు సంఘ జీవితంలో దేవుని శాంతిని అనుభవించ గలుగుతున్నామా? శాంతి అనేది మన నిజ జీవితంలో ఒక పరిస్థితి. ఎవరు సృజిస్తారు ఈ పరిస్థితిని అంటే మానవులమైన మనము. దేవుడు మనకు తన శాంతిని అనుగ్రహించారు. కానీ ఆ శాంతిని మనలో నెలకొల్పుకొని జీవించడమే మానవులమైన మన బాధ్యత.  ఈ శాంతి అనే  పరిస్థితిని మన వ్యక్తిగత , కుటుంబ, మరియు సంఘ జీవితంలో సృజించుకుందాం. క్రీస్తు సైనికులుగా ఉండి సువార్తను వ్యాపింపచేద్దాం. దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం. శాంతియుతంగా జీవించుదాం. ఆమెన్.

Br. Sunil Inturi OCD

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 9:9-13 

తరువాత యేసు అటనుండి వెల్లుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో "నన్ను అనుసరింపుము"  అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు  కూర్చుండినపుడు సుంకరులును, పాపులును  అనేకులు వచ్చి ఆయనతోను, ఆయన శిష్యులతోను పంక్తియందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు "మీ బోధకుడు ఇట్లు సుంకరులతో, పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు,  "వ్యాధిగ్రస్తులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా!నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు అను  లేఖనమునందలి  అర్ధమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు" అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్ఛెను. 

మత్తయి అను సుంకరిని యేసు ప్రభువు పిలుస్తున్నారు, యేసు ప్రభువు పిలుపుకు మత్తయి వెంటనే స్పందిస్తున్నారు. నాకు వేరె పని ఉంది అని కాని , లేక ఇంటి వద్ద చెప్పి వస్తాను అని కాని ఏమి చెప్పలేదు. యేసు ప్రభువు అడిగిన వెంటనే యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. యేసు ప్రభువుని  శిష్యుడు కావాలి అంటే ఇది ప్రధానమైన లక్ష్యం.  యేసు ప్రభువుని శిష్యుడు ఎప్పుడు విధేయుడగా , సంసిద్ధుడుగా ఉండాలి. విధేయత  మరియు సంసిద్ధత రెండు మనం మత్తయిలో చూస్తున్నాము. విధేయత యేసు ప్రభువు అప్పజెప్పిన పని చేయడానికి మరియు మన కర్తవ్యం మీదనే దృష్టి మరల్చకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సంసిద్దత మనలను ఎప్పడూ కర్తవ్య నిర్వహణ చేయడానికి, వెనుకడుగు వేయకుండా వుండటానికి ఉపయోగపడుతుంది.  యేసు ప్రభువును అనుసరించే వారు ఎల్లప్పుడు ఈ విధానంగానే ఉండాలి. అడిగిన వెంటనే మారు మాటలేకుండా ప్రభువును అనుసరించడానికి సిద్దపడటమే క్రీస్తు నిజమైన శిష్యుడు చేస్తాడు. 

"మీ బోధకుడు ఇట్లు సుంకరులతో , పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి.  నీతి మంతుడైన పరగణించపడుతున్న ఒక వ్యక్తి ఎందుకు పాపులు, సుంకరులతో కలసి భుజించుచున్నాడు అని వారు యేసు ప్రభువును అడుగుతున్నారు. ఎందుకు యేసు ప్రభువు సుంకరులు, పాపులతో భుజించడానికి కారణం ఆయన వారి కోసం వచ్చారు. సుంకరులు , పాపులు దేవునికి దూరంగా ఉన్నారు. వీరు చేసిన పనుల ద్వారా వారు దేవునికి దూరంగా ఉన్నారు. కాని దేవుడు వీరికి కరుణ చూపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. దేవుడు వీరి దగ్గరకు వస్తున్నారు. వారిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికి వస్తున్నారు. వీరు పాపములో ఉన్న దేవునికి దూరంగా ఉన్న వీరిని మరల తండ్రి దగ్గరకు పోవుటకు అర్హులుగా చేయడానికి వీరితో కలసి భుజిస్తున్నారు. వీరితో కలసి భుజించడం వల్ల యేసు ప్రభువు వారిని తనతో కలసి ఉండటానికి వారి పాత జీవితం వదలి వేయడానికి ఆహ్వానం ఇస్తున్నాడు.  . 

ఇది పరిసయ్యులు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువును అపార్ధం చేసుకొని వారు శిష్యులను ప్రశ్నిస్తున్నారు.    పరిసయ్యులు బహిరంగంగా దేవుని ఆజ్ఞలును దిక్కరించిన వారితో  ఎప్పుడు కూడా భుజించరు. కాని యేసు ప్రభువు వారితో కలసి భుజిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు   హ్ోషయ ప్రవక్త మాటలను గుర్తుచేస్తున్నారు. "నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు"  హ్ోషయ ప్రవక్త  6:6 .  దేవునికి కావలసినది కారుణ్యము , బలులు కాదు. ఎవరికి ఈ కారుణ్యము మనం చూపించాలి అంటే అది ఎవరు అయితే పాపం చేసి దేవునికి దూరముగా ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే ఆకలితో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే అనారోగ్యంతో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే  అవసరంలో ఉన్నారో వారికి కరుణ చూపించాలి.  యేసు ప్రభువు చూపించిన కరుణ ఇటువంటి వారికి. వీరికి నిజానికి సమాజంలో ఒక స్థానం లేదు, యేసు ప్రభువు వీరితో ఉండటం వలన వీరికి సమాజంలో ఒక స్థానం ఇస్తున్నాడు. సమాజం వీరికి విలువ ఇచ్చే విధంగా చేస్తున్నారు. 

ప్రార్ధన : ప్రభువా! అనేక సార్లు మీరు నన్ను పిలిచిన కాని నేను మీ మాట వినక, నన్ను ఎందుకు దేవుడు పిలుస్తాడు అని అనుకున్నాను. మీరు మత్తయిని  పిలిచినట్లుగా మీచేత పిలువబడడానికి మీరు నా పవిత్రతని చూడరని, నేను అపవిత్రంగా ఉన్న నన్ను పిలుచుటకు వెనుకాడని మీ ప్రేమకు కృతజ్ఞతలు. మత్తయిని పిలిచినట్లుగానే నన్నును మంచి జీవితానికి పిలువండి. మత్తయి వలె నేను కూడా మీరు పిలిచిన వెంటనే మారు మాటలాడకుండా నేను మిమ్ము అనుసరించే విధంగా చేయండి. ప్రభువా మీరు వచ్చినది నన్ను పిలువడానికని , నాకు మీ ప్రేమను అందించడానికని, నా పాపములు క్షమించడానికని తెలుసుకొని వీటిని మీ నుండి వాటిని పొందుటకు నన్ను సిద్దపర్చండి. ప్రభువా మీరు  ఈ లోకానికి వచ్చినది నా కోసం అని తెలుసుకొని నేను మీ దగ్గరకు రావడానికి నన్ను సిద్దపరచండి. మిమ్ము ఎప్పటికీ కోల్పోకుండ నన్ను దీవించండి. ఆమెన్. 

30, జూన్ 2022, గురువారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం, మత్తయి 9: 1-8

మత్తయి 9: 1-8 

అంతట యేసు పడవనెక్కి, సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను. అపుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని , కొందరు ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. వారి విశ్వాసమును గమనించి, ఆ రోగితో "కుమారా! ధైర్యము వహింపుము . నీ పాపములు పరిహరింపబడినవి" అని యేసు పలికెను. అపుడు ధర్మ శాస్త్ర బోధకులు కొందరు, "ఇతడు దైవ దూషణము చేయుచున్నాడు"అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు , "మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనుటయా? లేక నీవు లేచి నడువమనుటయా? ఈ రెండింటి లోను ఏది సులభతరము ? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు  అధికారము కలదని మీకిపుడే తెలియును" అని పలికి,  ఆ రోగితో "నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి  పొమ్ము" అనెను. అతడు వెంటనే లేచి తన  యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి. 

యేసు ప్రభువు పడవ నెక్కి సరస్సు దాటిన తరువాత అక్కడ ఆ పట్టణములో కొంత మంది పడకపై పడియున్న పక్ష వాత రోగిని తీసుకొని వచ్చారు. అప్పుడు యేసు ప్రభువు కుమారా ధైర్యం వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని అంటున్నారు. యేసు ప్రభువు మాటలాడిన ఈ మాటలు అక్కడ ఉన్నవారికి దైవ దూషణ అని అంటున్నారు. అయితే ఆ పక్ష వాత రోగికి యేసు ప్రభువు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నీ పాపములు పరిహరింపబడినవి అని అంటున్నారు. పాపము చేయడం అంటే అతను పాపమునకు బానిసగా ఉన్నాడు. కాని ఇప్పుడు ఆయన పాపము నుండి విముక్తి పొందబోవుతున్నాడు. అతను ఒక స్వతంత్రుడు అవుతున్నాడు. ఇక నుండి ఆయన బానిసగా ఉండడు. కనుక యేసు ప్రభువు ఆ వ్యక్తికి భయ పడ వలదు అని అంటున్నాడు. తన రోగంతోనే కాదు తన సమాజం పట్ల కూడా ఆయనకు భయం ఉంది. అందరు ఆయనను పాపిగా పరిగణిస్తున్నారు. మరియు ఆ విధంగా చూస్తున్నారు. యేసు ప్రభువు మాత్రం ఆయన పాపములను పరిహరిస్తాను అని చెబుతున్నారు. 

యేసు ప్రభువు ఈ మాటలు మాట్లాడినది ఆ పక్షవాత రోగిని తీసుకొని వచ్చిన వారి విశ్వాసంను చూసి ఈ మాటలు అంటున్నారు. ఎందుకు వీరి విశ్వాసం చూసి యేసు ప్రభువు మాటలాడుతున్నారు అంటే, వీరు వారి కోసం కాక అవసరంలో, అనారోగ్యంలో ఉన్న ఒక వ్యక్తిని, యేసు ప్రభువు స్వస్థత పరుస్తాడు అని యేసు ప్రభువు దగ్గరకు వారు ఆయనను తీసుకొని వచ్చారు. వీరు తమ కోసం కాక వేరె వారి కోసం , వారి కష్టాలు తీర్చడం కోసం చేసిన మంచి పనిని చూసి మరియు యేసు ప్రభువు యందు వారికి గల విశ్వాసం చూసి ఆయనను స్వస్థత పరుస్తున్నారు. విశ్వాసం అంటె ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్న కూడా నా దేవుడు నన్ను అవమానమునకు గురికానివ్వడు అనే నమ్మకం ఇక్కడ వారి సొంతం. విశ్వాసం మనకు మాత్రమే ఉపయోగపడేది కాదు. అది అందరికి ఉపయోగ పడుతుంది. ఇతరుల శ్రేయస్సు కూడా విశ్వాసం కాంక్షిస్తుంది. ఇక్కడ జరుగుతుంది ఇదియే. దీని ద్వారా లబ్ది పొందిన ఆ వ్యక్తి కూడా ప్రభువును విశ్వసిస్తాడు. మన విశ్వాసం ఇతరులకు ఈ విధంగా ఉపయోగ పడాలి. 

ఆ మాటలు వింటున్న ధర్మ శాస్త్ర బోధకులు యేసు ప్రభువు దైవ దూషణ చేస్తున్నాడు అని అంటున్నారు. ఇక్కడ దైవ దూషణ అని ధర్మ శాస్త్ర బోధకులు అనడానికి కారణం ఏమిటి అంటే యేసు ప్రభువు నీ పాపములు పరిహరింపబడినవి అని చెప్పడం.  వారికి దేవుడు మాత్రమే పాపములను పరిహరింపగలడు. దేవుడు తప్ప ఎవరు మన పాపములను ఎవరు క్షమించలేరు, అటువంటిది యేసు ప్రభువు నీ పాపములు క్షమించబడినవి అంటున్నారు. కనుక వీరు యేసు ప్రభువు తనను తాను దేవునికి సమానముగా చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ఆయన దేవుడు అని వారు గమనించలేక పోయారు. అంతేకాదు ఆయన గురించి వారు తప్పుగా అనుకుంటున్నారు. అందుకే యేసు ప్రభువు పక్ష వాత రోగిని లేచి నడువమని చెబుతున్నారు, దాని ద్వారా వారికి ఆయనకు ఉన్నటువంటి శక్తిని ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. 

"ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు  అధికారము కలదని మీకిపుడే తెలియును అని పలికి,  ఆ రోగితో నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి  పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన  యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి."  ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే  యేసు ప్రభువు తనకు ఉన్నటు వంటి శక్తిని చూపుతున్నాడు. అంతేకాదు తాను దేవుడను అనే విషయం తేటతెల్లం చేస్తున్నారు. ధర్మ శాస్త్ర బోధకులకు   మానవుడు చేయలేని పనిని ఇక్కడ యేసు ప్రభువు చేయడం ద్వారా ఈయన దేవుడు అని తెలుసుకోవాలి కాని వారు ఆ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయారు. కాని యేసు ప్రభువు మాటను పాటిస్తున్న ఆ పక్షవాత రోగి తన రోగం నుండి విముక్తి పొందుతున్నాడు. యేసు ప్రభువుని నమ్మి జీవించినప్పుడు మన సమస్యల నుండి విముక్తి పొందుతారు. 

ప్రార్ధన : ప్రభువా! మా  జీవితంలో అనేక సార్లు మేము మీ మాటలను నమ్మడంలో , మీ మీద విశ్వాసం ఉంచడంలో విఫలం చెందుతున్నాము. దాని వలన మేము మా బాధల నుండి విముక్తి పొందలేక పోతున్నాము. మీ మాటను ఎల్లప్పుడు పాటిస్తూ మా సమస్యల నుండి మేము విముక్తి పొందే వారిగా మమ్ములను మార్చండి. బాధల్లో, కష్టాలలో ఉన్నవారికి  మేము కూడా మా వంతు సాయం చేస్తూ వారికి వారి సమస్యల నుండి విముక్తి పొందేందుకు మేము చేయగలిగె సాయం చేయు వారిగా మమ్ము దీవించండి.  మేము మీ శక్తిని తెలుసుకొని ఎల్లప్పుడు మిమ్ములను మీ మీద విశ్వాసం ఉంచి జీవించే వారిగా మమ్ము మార్చండి. ప్రభువా అనేక సార్లు మీ మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేదు అటువంటి సమయాలలో మమ్ము క్షమించండి. పక్షవాత రోగి పాపములను క్షమించిన విధముగా మా పాపములను క్షమించండి. అతనికి ఇచ్చిన విముక్తిని మాకును దయచెయ్యండి. ఆమెన్. 

28, జూన్ 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 8: 23-27 

అంతట యేసు పడవ నెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి, పడవను ముంచెత్తు నంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిదురించుచుండెను. అప్పుడు శిష్యులు  ఆయనను మేలుకొలిపి "ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము" అని ప్రార్ధింపగ,  యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ?" అని పలికి , లేచి గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి. 

యేసు ప్రభువు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభువు నిద్రపోతున్నారు. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి , పడవను ముంచెత్తింది.  సముద్రములో అలలు  చెలరేగాయి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరు భయ పడుతున్నారు. ఎందుకు ఈ శిష్యులు అందరు భయపడుతున్నారు. వారు ఏమి  సముద్రం గురించి తెలియని వారు కాదు. వీరిలో ఎక్కువ మంది చేపలు పట్టేవారు. ఈత తెలిసిన వారు. సముద్రం గురించి తెలిసిన వారు. కాని వారు భయ పడుతున్నారు. ఎందుకంటే ఆ అలలు చాలా భయంకరమైనవి. వారు అంతకు ముందు చూడనివి కావచ్చు. ఆ అలల తీవ్రతను బట్టి వారు దానిని ఒక సాధారణమైన తుఫాను కాదు అని  అంచనా వేశారు. అందుకే వారు యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు. సముద్రములో చెలరేగిన ఈ అలలు ఇప్పుడు వారి జీవితములో చెలరేగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వారు ఏమి చేయాలో వారికి తెలియదు. వారు చనిపోతారో, బ్రతుకుతారో తెలియదు. వారు యేసు ప్రభువును చూస్తున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి తమ గురువుకు తాము అనుభవిస్తున్న పరిస్థితిని ఎలా  తెలియచేయాలా  అని వారు ఒక సందిగ్ధ అవస్థలో వారు ఉన్నారు. 

"ఆయనను మేలుకొలిపి,ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము అని" చెబుతున్నారు. ఇక్కడ శిష్యులు చాలా వరకు వారి వాస్తవ పరిస్థితిని అంచనా వేసి యేసు ప్రభువు దగ్గరకు వెళుతున్నారు. వారి జీవితం ముగిస్తుంది అని వారు అనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో వారిని దేవుడు తప్ప ఇంకా ఎవరు కాపాడలేరు. ఎందుకంటే వారికి తుఫాను గురించి బాగా తెలుసు. సముద్రం గురించి తెలుసు. ఎప్పుడు సముద్రం తీవ్ర రూపం దాల్చుతుందో వారికి తెలుసు. ఈ పరిస్థితిలో వారు జీవించడానికి యేసు ప్రభువు తప్ప ఇంకా ఎవరు వారిని కాపాడలేరు. వారు నాశనం చెందకూడదు అనుకున్నారు. వెంటనే వారు ప్రభువు దగ్గరకు వచ్చారు. మమ్ములను రక్షింపుము అని వేడుకుంటున్నారు. ఈ వెడుకోలులో వారి భయం, ప్రాణం మీద ఆశ అన్నీ అరచేతిలో పెట్టుకొని ఏమి అవుతుందో అని ప్రభువు దగ్గరకు వెళ్లారు. వారిని ప్రభువు రక్షిస్తున్నారు.  సముద్రంను ఆయన శాసిస్తున్నాడు. ఆయన మాటను విని సముద్రం శాంతిస్తుంది.   

యేసు వారితో , ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ? అని అంటున్నారు.  యేసు ప్రభువు వారిని అల్ప విశ్వాసులారా అని ఎందుకు అంటున్నారు. యేసు ప్రభువు చేసిన అనేక పనులకు వీరు సాక్షులు, సముద్రాన్ని , దాని అలలను అంచనా వేయగలిగిన వీరు వారితో పాటు ఉన్నటువంటి యేసు ప్రభువు ఎవరు అని వారు గ్రహించలేక పోయారు. ఆయన మనతో ఉన్నంత కాలం మనకు ఎటువంటి అపాయం ఉండదు అని గ్రహించలేకపోయారు. వారు భయ పడుతున్నారు. యేసు ప్రభువు చేసిన అనేక పనులను చూసికూడా వీరు ఆయన యందు విశ్వాసం ఉంచలేక పోయారు. పాత నిబంధనలో దావీదు మహారాజు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు ఏ కొదవయు లేదు అని అంటున్నారు. యేసు ప్రభువు శిష్యులు కూడా అలానే ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉంటే ఇక ఏ కొదవయు ఉండదు అని తెలుసుకోవాలి. అది వీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాడంలో వారు ఇఫలం చెందారు అందుకే యేసు ప్రభువు యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ?" అని  అంటున్నారు. 

అప్పుడు యేసు ప్రభువు లేచి  "గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి." గాలిని , సముద్రమును యేసు ప్రభువు గద్దింపగా సముద్రము శాంతించింది. ఇది యేసు ప్రభువు దైవత్వాన్ని తెలియజేస్తుంది. ఇంతకు ముందు శిష్యులు యేసు ప్రభువు స్వస్థత  ఇవ్వడం చూసారు. అద్భుతాలు చేయడం చూసారు. కాని ఇక్కడ యేసు ప్రభువుకు ప్రకృతి కూడా ఆయన మాట వింటున్నది. ఆయన చెప్పినట్లు చేస్తుంది.  అప్పుడు అది చూసిన వారు ఆశ్చర్యపడుతున్నారు. ఈయన ఎవరు , ఈయనకు ప్రకృతి కూడా మాట వింటున్నది అని వారు అనుకుంటున్నారు. యేసు ప్రభువుతో మన జీవితంలో ఉన్నటువంటి అన్నీ సమస్యలు తీరుతాయి. ఆయనతో మనతో ఉంటే మనకు ఏ కొదవయు ఉండదు. అంతే కాదు ప్రశాంతత మన జీవితంలో ఎల్లప్పుడు ఉంటుంది. 

ప్రార్ధన : ప్రభువా! నా జీవితంలో అనేక సార్లు అనేక కల్లోలాలు వచ్చినవి అటువంటి సమయంలో నేను భయ పడి పోతున్నాను. నాకు నాశనము తప్పదు అని అనుకుంటున్నాను. నిరాశలో జీవిస్తున్నాను. నా జీవితంలో వచ్చే సమస్యలు నన్ను క్రమ్మేస్తున్నాయి. అప్పుడుకూడా నేను భయ పడుతున్నాను. నీవు నాకు తోడుగా ఉన్నావు అని తెలుసుకోలేక పోతున్నాను. నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఏ కొదవయు ఉండదు అని తెలుసుకోలేకపోయాను. అటువంటి సమయంలో నన్ను క్షమించండి. నీవు నాకు తోడుగా ఉన్నవన్న విషయాన్ని నేను ఎల్లప్పుడు గుర్తుంచుకునే విధంగా దీవించండి. నా జీవితంలో వచ్చే అనేక అలలను ఎదుర్కోడానికి కావలసిన శక్తిని దయ చేయండి. మీ యందు పూర్తి విశ్వాసం కలిగి జీవించే వానిగా నన్ను చేయండి. ప్రభువా! నీవు సముద్రమును గద్దింపగా అది శాంతించింది. అటులనే నా జీవితంలో మీ మీద విశ్వాసం సన్నగిళ్ళే ప్రతి విషయాన్ని గద్దించండి.  మీ మీద ఎప్పుడు విశ్వాసం ఉండే వానిగా చేయండి. ఆమెన్ . 

27, జూన్ 2022, సోమవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం,

 మత్తయి 8:18-22 (జూన్ 27,2022)

యేసు తన చుట్టుప్రక్కల నున్న గొప్ప జన సమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని అజ్ఞాపించును. అపుడు ధర్మ శాస్త్ర  బోధకుడొకడు యేసును సమీపించి , "బోధకుడా!  నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను" అనగా  యేసు,  "నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళును కలవు. మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైన చోటు లేదు" ప్రత్యుత్తర మిచ్ఛెను. మరియొక శిష్యుడాయనతో "ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను; అనుమతి దయ చేయుడు" అని కోరగా, యేసు "నీవు నన్ను వెంబడింపుము. మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని పలికెను. 

"నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సంసిద్దుడను", ఈ మాటను ఒక బోధకుడు  యేసు ప్రభువుకు చెబుతున్నారు. ఎందుకు ఇతను యేసు ప్రభువును అనుసరిస్తాను అని అంటున్నాడు అంటే యేసు ప్రభువు చేసిన పనులు ఆయన చూసి ఉండవచ్చు. యేసు ప్రభువు అనేక మంది ఆకలితో ఉన్నవారిని చూశాడు. వారు ఆకలితో ఉన్నారు అని తెలుసుకొని వారి ఆకలిని తీర్చాడు. అంతె కాదు సాతాను చేత పీడింపబడుతున్న వారిని చూశాడు. వారికి సాతాను నుండి విముక్తి ఇచ్చాడు. యేసు ప్రభువు అనారోగ్యంతో ఉన్న వారిని చూశాడు, వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ విధముగా ప్రజల అన్నీ సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ తెలుసుకొని వారికీ కావలసినవి ఇచ్చి వారి సమస్యలును తీసివేస్తున్నాడు. అయితే ఇవి అన్నీ తెలిసిన వ్యక్తి  అయివుండవచ్చు, నేను, నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సిద్ధం అని పలికే ఈ వ్యక్తి. ఒక వేళ ఈయనను అనుసరిస్తే నాకు కూడా ఈయన ఇస్తున్నటువంటివన్నీ నాకు రావచ్చు అని అనుకోని యేసు ప్రభువును అనుసరించడానికి వీరు సిద్దం అయి ఉండవచ్చు. లేక యేసు ప్రభువును అనుసరిస్తే ఆయనకు వస్తున్న ఆధరణ నాకు రావచ్చు అని ఆయనను అనుసరించడానికి సిద్దం అయి ఉండవచ్చు. లేక తాను బోధకుడు కాబట్టి యేసు ప్రభువును అనుసరించడం తనకు ముక్తిని దయ చేస్తుంది అని తెలుసుకొని ఆయనను అనుసరించడానకి సిద్ధం అయి ఉండవచ్చు. 

అయితే యేసు ప్రభువు మాత్రం, "నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళును కలవు. మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైన చోటు లేదు" అని అంటున్నారు. కారణం ఏమి  అయి ఉండవచ్చు అంటే ఆయనను అనుసరించవలసినది, ఆయన ఇతరులకు ఇచ్చినటువంటి అనుగ్రహాలు, వరాలు, లేక  ఆయన ద్వార వచ్చే ఆదరణకొ కాదు. కేవలం ఆయన ఇచ్చే రక్షణ కోసం మాత్రమే కాదు. మరి ఇంకా ఎందుకు అంటే యేసు ప్రభువును అనుసరించవలసినది, ఆయన తరువాత ఆయన జీవితాన్ని, ఆయన పనులను, ఆయన చిత్తాన్ని కొనసాగించడానికి. ఇక్కడ ఆ బోధకుడు నేను నిన్ను అనుసరించడానికి సంసిద్దుడను అని అంటున్నాడు. కాని ఆ బోధకుడు ఇవన్నీ చేయడానికి సిద్ధముగా ఉన్నాడా? లేడా ?అనేది ముఖ్యం. అందుకే యేసు ప్రభువు నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు కాని మనుష్య కుమారునకు మాత్రం తలవాల్చుటకైన చోటు లేదు అంటున్నారు. అంటే ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యుడు ఆయనను అనుసరించుటలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితికి అయిన సిద్దంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఎటువంటి సౌకర్యం లేకుండా కూడా ఆయనను అనుసరించుటకు సిద్ధముగా ఉండాలి అని ప్రభువు తెలుపు చున్నాడు. 

ఈ సమయంలో మరియొకడు వచ్చి "ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను; అనుమతి దయ చేయుడు" అని కోరగా, యేసు "నీవు నన్ను వెంబడింపుము. మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని అంటున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి యేసు ప్రభువుతో తానే వచ్చి చెబుతున్నాడు. నేను నిన్ను అనుసరిస్తాను, కాని దానికి ముందుగా నేను ఇంటి దగ్గరచేయవలసిన పని చేసి వస్తాను అని చెబుతున్నాడు. అంటే నాకు ఎటువంటి ఆటంకం లేనప్పుడు, అంతా అనుకూలముగా ఉన్నప్పుడు నేను నిన్ను అనుసరిస్తాను అని చెబుతున్నాడు. నాకు వ్యతిరేకముగా లేక నాకు కష్టముగా ఉన్న విషయములలో నిన్ను అనుసరించే, అనుసరణలో నాలో లోపం ఉంటుంది అని ముందుగానే తెలియజేస్తున్నట్లున్నది, ఈ శిష్యుని యొక్క అనుసరణ విధానం.

ఇక్కడ యేసు ప్రభువును అపోస్తులులు ఎలా అనుసరించారు అనే  విషయం మనం గమనించాలి. ఎందుకంటే మత్తయిని యేసు ప్రభువు పిలిచినప్పుడు ఆయన తన సుంకపు పెట్టెను వదలి, రెండవ ఆలోచన లేకుండా యేసు ప్రభువును అనుసరిస్తున్నాడు. యకొబు యోహనులు తమ తండ్రిని పడవలోనే వదలి పెట్టి ప్రభువును అనుసరిస్తున్నారు. కాని ఇక్కడ మాత్రము ఈ వ్యక్తి  అందుకు సిద్ధంగా లేడు, ఎందుకంటే తాను తన తండ్రి మరణించిన తరువాత, తనను సమాధి చేసి తీరికగా యేసు ప్రభువును అనుసరించాలి అని అనుకుంటున్నాడు. యేసు ప్రభువును, నేను అనుసరించ వలసినది నాకు ఎటువంటి బాధ్యతలు లేని సమయంలో కాదు. నాకు అన్నీ బాధ్యతలు ఉన్న సమయంలో కూడా మనం ఆయనను అనుసరించాలి. ఇక్కడ యేసు ప్రభువు ఆ వ్యక్తితో, "మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని అంటున్నాడు. 

ఎందుకంటె, ఈ వ్యక్తి తండ్రి ఇంకా చనిపోలేదు, కాని ఇతను తన తండ్రి జీవించినంత కాలం తనతో ఉండి, అతడు చనిపోయిన తరువాత తాను చేయవలసిన పనులు చేసి వస్తాను అని అంటున్నాడు. దాని గురించి యేసు ప్రభువు , నీవు ముందుగా నన్ను అనుసరించు , మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము, అని అంటున్నారు. యేసు ప్రభువు ఒక వ్యక్తి చనిపోతే ప్రవర్తించే తీరు చాలా కారుణ్యంతో ఉంటుంది. లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు పెడుతున్నారు. పేద విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు తనను బ్రతికిస్తున్నాడు. కాని ఈ వ్యక్తి మాత్రం యేసు ప్రభువును అనుసరించడానికి తనకు అనుకూల వాతావరణం కోసం చూస్తున్నారు. యేసు ప్రభువు ఆయనను అనుసరించుటకు తగిన సమయం అంటూ ఏమీలేదు. ఆయన పిలుపు అందుకున్నప్పుడు మారుమాట్లాడక అనుసరించటమే ఉత్తమం. 

ప్రార్ధన : ప్రభువా ! నేను అనేక సార్లు మిమ్ములను అనుసరించాలి అని అనుకున్నాను ప్రభువా. అది కేవలం నీవు నాకు ఆరోగ్యం  ఇస్తావు అని,  ఉద్యొగం ఇస్తావు అని, మంచి పేరు ఇస్తావు అని మరియు నాకు వున్న సమస్యలు తీరుస్తావు అని మాత్రమే నిన్ను అనుసరించాలి అని అనుకున్నాను, నిన్ను ఎందుకు అనుసరించాలి అని మాత్రము పూర్తిగా అర్ధం చేసుకోలేదు ప్రభువా. అటువంటి సమయాలలో నన్ను క్షమించండి. నా ద్వారా మీ జీవితాన్ని కొనసాగించడానికి నేను మిమ్ములను అనుసరించే వానిగా నన్ను మార్చండి ప్రభువా. ప్రభువా నేను మిమ్ము అనుసరించడానికి అనేక అవకాశాలు వచ్చిన కాని నాకు తగిన సమయం కాదు అని, నాకు వేరె బాధ్యతలు ఉన్నవి అని, మిమ్ములను అనేక సార్లు విస్మరించాను ప్రభువా, అటువంటి సమయాలలో నన్ను క్షమించి, నేను వెల్లప్పుడు మిమ్ములను అనుసరిస్తూ, మిమ్ములను నా ద్వారా ఇతరులకు అందించే విధంగా నన్ను మార్చండి. ఆమెన్. 



25, జూన్ 2022, శనివారం

సామాన్య కాలపు 13 వ ఆదివారము

   సామాన్య కాలపు 13 వ ఆదివారము

 రాజులు 19: 16, 19-21, గలతీ 5: 1, 13-18, లూకా 9: 51-62

స్వేచ్చా  జీవితానికి పిలుపు
క్రీస్తు నాదునియందు ప్రియ స్నేహితులారా! ఈనాడు తల్లి తిరుసభ మనలను అందరినికూడా సామాన్య కాలపు 13 వ ఆదివారములోనికి ఆహ్వానిస్తుంది.  

ఈ నాటి మూడు గ్రంథపఠనాల ద్వారా తల్లి తిరుసభ మనందరినీ స్వతంత్రులుగా జీవించుటకై పిలుపునిస్తుంది”.
ఈ నాటి మూడు పఠణాలను మనం మూడు ప్రశ్నల రూపంలో ధ్యానించవచ్చు.  

1. దేవుడు ఎవరిని పిలుస్తున్నారు లేదా ఎవరిని ఎన్నుకుంటున్నారు?
2. దేవుడు ఎందుకు పిలుస్తున్నారు / ఎందుకు దేవుని ఎన్నిక?

3. దేవుని పిలుపును స్వీకరించిన వారు ఏ లక్షణాలు కలిగి ఉండాలి?
ఈ నాటి మూడు పఠనాలను మనం ధ్యానించినట్లైతే, దైవ సేవకులకు కావలసింది సంపూర్ణ జీవిత సమర్పణ, లేదా ఈ లోకాన్ని పూర్తిగా త్యజించాలనే సారాంశం మనకు అర్థమవుతుంది.

1. దేవుడు ఎవరిని పిలుస్తున్నారు లేదా ఎవరిని ఎన్నుకుంటున్నారు?
దేవుని పిలుపు ఎవరికి, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరు గ్రహించలేరు. దేవుని పిలుపు వివిధ రకాలుగా ఉంటుందని మనము ఎఫెసి 4: 11 -13 వచనాలలో చూస్తున్నాం.

దేవుని పిలుపు గురువులకు, గురుజీవితాన్ని అభ్యసించేవారికి, కన్యాస్త్రీలకు, ఉపదేసులకు, మాత్రమే కాదు. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తులో భాగమైన మనకందరికి కూడా, దేవుని సేవలో భాగము ఉంది, లేదా మనందరమూ పాత్రులము.
దేవుని సేవ చేయుటకు, అందరు అర్హులే. కొందరు ఉపాధ్యాయులుగా, మరికొందరు కుటుంభంలో తల్లిదండ్రులుగా, సంఘపెద్దలుగా, మరికొందరిని దేశ పాలకులుగా, రాష్ట్ర పాలకులుగా, వారి జీవితాలు దేవునిచే నిర్ణయించబడి ఉంటాయి. ఆయా బాధ్యతలకు అనుగుణంగా జీవించడమే మనము చేస్తున్నటువంటి దేవుని సేవ అని మనం గ్రహించాలి.

మొదటి పఠనంలో చూసినట్లయితే
దేవుడు ఏలీయా ప్రవక్త ద్వారా ఎలీషా ప్రవక్తను దైవ సేవకునిగా పిలుస్తున్నారు. ఆబేల్మేహోలా నివాసియగు షాఫాతు కుమారుడు ఈ ఎలీషాఅతనిని ప్రవక్తగ నియమిస్తున్నారు.
మరి ఏలియా ప్రవక్త ఎలీషా దగ్గరకు వచ్చి తన అంగీని తీసి ఎలీషా పై కప్పెను. అంగీ ధరించడం అంటే ఒక సేవకు గుర్తు. ఇలాంటి సన్నివేషాన్ని మనము క్రీస్తు ప్రభువు జీవితంలో కూడా చూస్తున్నాం. యోహాను 13: 4 - 6 వచనాలలో చూస్తే క్రీస్తు ప్రభువు తన నడుముకి తుండు గుడ్డ కట్టుకొని శిష్యుల పాదాలు కడిగి వారికి సేవ చేస్తూ, మీరును ఒకరినొకరు ప్రేమించండి, సేవ చేయండి అని ఆజ్ఞాపిస్తున్నారు.

అలాగే ఈనాటి మొదటి పఠనంలో ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త మీద తన అంగీని కప్పినవెంటనే ఎలీషా ప్రవక్త, తన ఎద్దులను వధించి, అరకని వంట చెరుకుగ వాడి, మాంసమును వండి తన శిష్యులకు వడ్డించి, వారికి సేవచేశాడు. ఏలియా ప్రవక్తను అనుసరించాడు.
 నాటి సువిశేష పఠనంలో మనం శిష్యుల యొక్క లక్షణాలు ఏవిధంగా ఉండాలి అని చూస్తున్నాం.

ఒకడు యేసును వెంబడించుటకు తన వెంట వస్తాను అని అన్నాడు, యేసు చెంత ఏమీలేవు, తాను ఉండుటకు స్థలము కూడ లేదు అని సమాధానం చెప్పగనే, నిరాశ చెంది ఉండవచ్చు.
మరియొకరిని యేసు ప్రభువు పిలిచారు, "నన్ను అనుసరించు" అని అన్నారు. కానీ అతడు తన తండ్రి చనిపోయిన తరువాత, దేహాన్ని సమాధి చేసి వస్తానంటున్నాడు.

మరియొకడు నేను మిమ్ము అనుసరిస్తాను, కానీ ముందు నా కుటుంబంలోని వారికి చెప్పివస్తాను అంటున్నాడు.
వీరి ముగ్గురికి సమాధానముగా, యేసు వారితో "దేవుని రాజ్యాన్ని ప్రకటించండి". అంటే మొదట దేవుని రాజ్యానికి ప్రాముఖ్యతను ఇవ్వండి అంటున్నారు. కుటుంబాలు ఉన్నాయి, లేదా సొంత పనులు ఉన్నాయి, అని వెనుతిరగ కూడదు.

2. దేవుడు ఎందుకు పిలుస్తున్నారు / ఎందుకు దేవుని ఎన్నిక?
దేవుని పిలుపునకు అనుసరించి వెనుతిరగడం "నాగటి మీద చేయిపెట్టి వెనుకకు చూచువాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాదుఅంటున్నారు. బంధాలకు బానిసలు కావద్దు అంటున్నారు.

ఎందు కంటే స్వార్థంతో మన సొంత కుటుంబాలకోసమే మనము జీవించకూడదు. క్రీస్తు ప్రభువు తెలియని ప్రజలు, జీవితాలలో నిరాశకు లోనైన వారు, గ్రుడ్డివారు, కుంటివారు, విధవరాండ్రు, పేదవారు, నిస్సహాయులు, ఈలోకంలో, మన దేశంలో, రాష్ట్రంలో, మన సమాజంలో, చాల మంది ఉన్నారు. వారిని మనకుటుంబంలో ఒకరిగా, చూసుకోవాలి. వారిని ప్రేమించాలి, క్రీస్తు ప్రభువు వారికి నిత్య జీవితాన్ని దయచేస్తాడన్న ఆశ వారికి కలుగ చేయాలి, క్రీస్తు ప్రభువే మనకు సంపూర్ణ జీవాన్ని ఇచ్చే దేవుడు, ఆయనయే నిత్య జీవము అని బోధించాలి. అలాంటి వారి జీవితాలు అభివృద్ధిలోకి తీసుకొనిరావాలి. ఇలాంటివారికి సేవచేయడానికి వెనుకాడవద్దు అని క్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు.
మరి  ఇలాంటి  సేవా  జీవితం  జీవించడం , “ మనిషిగా  పుట్టిన  ప్రతి  ఒక్కరి భాద్యత ”. అందుకే దేవుడు మన అందరిని ఎన్నుకుంటున్నాడు.  మరి  ఈ  రెండు  పఠనాలుకూడా దీని గురించబోధిస్తున్నాయి. మనము  దైవ  సేవకునిగా  జీవించాలంటే ఇలాంటి  లక్షణాలు  కలిగి  జీవించాలి .

3. దేవుని పిలుపును స్వీకరించిన వారు ఏ లక్షణాలు కలిగి ఉండాలి?  
-సేవా భావం కలిగి ఉండటం.

క్రీస్తువలె అందరిని సమానంగా, ఏ వర్గ, కుల, మత బేధాలు లేకుండా ప్రేమించే గుణం.
-చెడును, పాపాన్ని ద్వేషించే గుణం.

-ఇతరులకు చేతనైన సహాయం చేసే గుణం.
-నిజాయితీగా బ్రతికే గుణం.

-సత్యం కోసం జీవించే గుణం.
-కోప పడక, శాంతి, సమాధానాలతో జీవించే గుణం. 

ఇవన్నీ  కలిగిన  వారే  నిజమైన మనుషులుగా , దేవుని  యొక్క  బిడ్డలుగా  పిలువబడతారు.
దేవునికి ప్రియమైన వారీగా పిలుస్తారు. ఇలాంటి వారిదే  దేవుని రాజ్యము అని దివ్య గ్రంథ పఠనాలు  తెలియచేస్తున్నాయి.

దేవుని సేవ చేయాలంటే, మనలను మనము, ప్రజలకు, దేవుని ప్రణాళికకు, పిలుపునకు, సంపూర్ణంగా సమర్పించుకోవాలి .అప్పుడే  మనకు,  పైన  పేర్కొన్న విధంగా  జీవించడం  సాధ్యమవుతుంది.
ఇలా  జీవించినవారు  చాలామందిని   ఉదాహరణలుగా  చెప్పవచ్చు .

-క్రీస్తు ప్రభువే గొప్ప ఉదాహరణ - దేవుని కుమారుడై కూడా మానవాళి కోసం మరణించాడు, ప్రజలతో జీవించాడు.
-మరియ తల్లి.

-పునీత మదర్ థెరెసా.
-అనేకులైన పునీతులుఇంకా పునీత, మరియు సేవా జీవితాలను జీవిస్తున్నవారు, వీరందరి త్యాగ జీవితాన్ని మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 

రెండవ  పఠనంలో  చుస్తే  
              పునీత పౌలుగారు, గలతీయ ప్రజలకు క్రీస్తు ప్రభువు చేసిన గొప్ప త్యాగాన్ని మరియొక సారి వారికి  గుర్తుచేస్తున్నారు , హెచ్చరిస్తున్నారు.
ఏవిధంగా అంటే , క్రీస్తు  తన  మరణము ద్వారా పాపానికి బానిసలమై జీవిస్తున్న మానవాళి అంతటిని తన  బలిద్వారా, తండ్రి చిత్తానుసారము, సిలువలో మరణించి, మనకు స్వేచ్చాజీవితాని ఒసగారు, మనలను  పాపమునుండి , పాపమునే  బానిసత్వమునుండి విముక్తులను  చేసారు .

కాని మనందరమూ,  పాపమూ ద్వారనైతే దేవునికి దూరమయ్యామో, దేవుని రాజ్యానికి దూరమయ్యామో, తిరిగి  అలాంటి  జీవితాన్నే  మనము  జీవిస్తున్నాము .
శారీరక కోరికలు అనే ఆకలి ద్వారా, ఆదాము  అవ్వలు , పాపము  చేసి  పాపానికి బానిసలు అయ్యారో, అలాంటి  జీవితాన్ని, మరల  మనకు  తెలిసి  కూడా  చేస్తున్నాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం .

శరీర   కోరికలకు  బానిసలైన  వారు  దేవుని  రాజ్యానికి  వారసులు  కారు  అని  పవిత్ర  గ్రంధం  చెబుతుంది .
గలతీయులు  5 : 19 -21 .
శరీర కోరికలు; జారత్వము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయా, క్రోధము, స్వార్ధము, కక్షలు, వర్గత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము విందు  వినోదములు, మొదలగునవి .

ఇలాంటి  జీవితాన్ని  జీవించేవారు  దేవుని  రాజ్యానికి వారసులు కార, అంటే  శరీరానుసారము  జీవించే  వారు  దేవునిరాజ్యనికి వారసులు కారు అని అర్థం .
ఒక్కసారి  మనం  ఆత్మ  పరిశీలన  చేసుకుందాం .

ఈనాడు రెండవ పఠనంలో చూస్తున్నాం ; ఏలయన ధర్మశాస్త్రమంతయు కూడా  “ నిన్ను  నీవు  ప్రేమించుకొనినట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము ”. అను  ఒక్క  ఆజ్ఞలో  నెరవేరియున్నది గలతీయులు 5: 14.
మానవునియొక్క  ప్రధాన  ధర్మం  దేవుని  ఆజ్ఞ  పాటించడమే  ఉపదేశకుడు  12: 13 -14 .

నరులు చేసిన పనులు మంచివి కావచ్చును చెడ్డవి కావచ్చును, రహస్యమైనవి కావచ్చును. కానీ వాటి కన్నిటికిని భగవంతుడు తీర్పు తీర్చును.
యోహాను13:34-35 “నేను మీకు నూతన ఆజ్ఞను ఇస్తున్నాను మీరును ఒకరినొకరు ప్రేమింపుడు. నేను  మిమ్ము  ప్రేమించినట్లే  మీరు  ఒకరినొకరు  ప్రేమించుకొనుడు .

మీరు  పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులు అని అందరు తెలుసుకొందురు.
ఉదాహరణకి మనము గమనించినట్లయితే

మనము ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు, ఉదాహరణకి దొంగతనము చేసేటప్పుడు, దేవుడు ఆత్మ ద్వారా ఇది తప్పు చేయవద్దు అని హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ మన శరీరము మాత్రం, మనలను ఆ తప్పు వైపే నడిపిస్తుంది. ఎందుకంటే ఆ పని మన శరీరానికి సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇలాగె మనము ఏ పని చేసిన కూడా రెండు విధాలైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆత్మవైపునుండిమరియు శరీరమునుండి. మనము దేనికి ప్రాధాన్యతనునిస్తామో మన జీవితం కూడా అలానే ఉంటుంది. మనము శరీరానికి ప్రాధాన్యతను ఇస్తే మనము దేవునికి దూరమవుతాము. ఆత్మకు ప్రాముఖ్యతను ఇస్తే దేవునికి
ఆత్మ ఫలాలు: ఆత్మాను సారంగా జీవించటం. గలతి 5: 22

ప్రేమ, ఆనందం, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీటికి వ్యతిరేకంగా ఏ చట్టము లేదు.
ప్రియ స్నేహితులారా మరి మనము ఎలా జీవిస్తున్నాం. మన స్వార్థం కోసం, మన ఇష్టానుసారంగా, పగలతో, ద్వేషాలతో, ఒకరిమీద ఒకరం అసూయా కలిగి, సైతానును, శరీర వాంఛలకు బానిసలవలె జీవిస్తున్నాం.

కాబట్టి మనం దేవుని శిష్యులుగా జీవించాలంటేదైవ రాజ్యంలో ప్రవేశించాలంటే, సైతానుకు దూరంగా, ఈ లోక ఆశలకు దూరంగా, శరీర వాంఛలకు దూరంగా, ఏ వర్గ, కుల, మత భేదాలు లేకుండా జీవించుదాం. క్రీస్తు నేర్పించిన విధంగా ఒకరినొకరు ప్రేమించుకుందాం.

 


 Br. సుభాష్ 

మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...