6, ఏప్రిల్ 2024, శనివారం

పాస్కా రెండవ ఆదివారం

పాస్కా రెండవ ఆదివారం
క్రీస్తు దివ్య కారుణ్య పండుగ
అపో 4:32-35, 1యోహను 5:1-6, యోహాను 20:19-31
క్రీస్తునాధునియందు ప్రియమైన సహోదరీ సహోదరులారా ఈనాడు తల్లి శ్రీ సభ యేసు దివ్య కారుణ్య పండుగను కొనియాడుచున్నది. ప్రతి సంవత్సరం పాస్కా రెండవ ఆదివారమును దివ్యకారుణ్య ఆదివారంగా పిలుస్తూ ఉంటారు. పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ఈ యొక్క పండుగను ప్రపంచమంతట కొన్ని ఆడాలి అని 2000 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున అధికారికంగా ప్రకటించారు. ఈరోజు ప్రత్యేక విధముగా మనము ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటి అంటే దేవుని యొక్క" దయ". 
పవిత్ర గ్రంథము మొత్తం కూడా దేవుని యొక్క దయ గురించి తెలియజేస్తుంది ఇంకొక విధంగా చెప్పాలి అంటే దేవుని యొక్క ప్రేమ గురించి తెలియజేస్తుంది(దయ, ప్రేమ, కనికరము, జాలి అనేవి ఒకే అర్థాన్నిచ్చే పదాలు). ప్రభు యొక్క దయలేనిదే మనము ఇప్పుడు సజీవులుగా ఉండలేము. ఆయన యొక్క కృప అపారమైనది అని పౌలు గారు తెలియజేస్తున్నారు .ఎఫేసి 2:4. దేవుని యొక్క దయ, కనికరం ఎవరూ కూడా వర్ణించలేరు ఎందుకంటే ఆయన అందరి యొక్క పాపములను క్షమించి వారి మీద దయ చూపుతూ ఉంటారు. పునీత తోమస్ అక్వేనస్ గారు దయ గురించి ఈ విధంగా అంటారు "దైవ ప్రేమ మానవుని యొక్క దీనస్థితిని కలుసుకున్నప్పుడు దేవుని యొక్క దయ జన్మిస్తూ ఉన్నది"అంటే మానవుడు పాపము చేసి ఒక దీనస్థితిలో ఉన్న సమయంలో దేవుడు ప్రేమ చూపించి మనలను ఆదుకుంటారు అది ఆయన యొక్క దయకు నిదర్శనం. ఏసుప్రభు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ యొక్క దీనస్థితిని చూసి నిరాశలో ఉన్న ఆమె చెంతకు వెళ్లి తన యొక్క ప్రేమతో ఆమెను కనికరించి తన పాపములను క్షమించారు. దేవుడు యొక్క దయ చాలా గొప్పది ఎందుకంటే మనందరం పాపము చేసిన సమయములో వెంటనే మనలను శిక్షించకుండా దేవుడు మనలని క్షమిస్తూ, మన మీద దయ చూపుతున్నారు.
పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క దయ గురించి చాలా ఎక్కువగా చెప్పబడింది;
- ఆదాము అవ్వ పాపము చేసిన సమయంలో దేవుడు వారిని మరణ దండనకు గురి చేయక తన యొక్క దయతో క్షమించి ఏదేను తోట నుండి బయటకు పిలిపించి కష్టపడి పని చేసి జీవితం కొనసాగించమని వారికి తెలియజేశారు వారు చేసినటువంటి పాపములను దేవుడు క్షమించారు కాబట్టే వారిని మరణ దండనకు గురి చేయలేదు.
- ఇశ్రాయేలు ప్రజలు దేవుడితో చేసుకున్నటువంటి ఒడంబడికను పాటించుటలో అనేకసార్లు విఫలమయ్యారు అయినా గాని దేవుడు వారిని మరణ దండనకు గురి చేయలేదు. కేవలము వారికి తెలియచేయుట కొరకై వారిని కొన్ని సంవత్సరముల పాటు బానిసత్వములోనికి పంపించారు అయినప్పటికీ వారిని ప్రేమిస్తూనే, వారి మీద దయ చూపుతూనే ఉన్నారు.
- ప్రభువు అనేకమార్లు తన యొక్క ప్రవక్తలను పంపిస్తూ ప్రజల జీవితాలను బాగు చేస్తున్నారు ప్రజల జీవితాలను సరి చేసుకొని, యావే దేవునికి విధేయులై జీవిస్తే దేవుడు దయతో కాపాడతారని ప్రవక్తలు తెలియజేశారు కొన్ని సందర్భాలలో ప్రజలు తమ జీవితాలను మార్చుకొని దేవుడికి ఇష్టకరంగా జీవించారు. ప్రవక్తల యొక్క బోధనలలో ప్రజలకు ప్రతిసారి గుర్తు చేసే విషయం ఏమిటి అంటే దేవుని యొక్క దయ అపారమైనది. (నిర్గమ 34:6-7)
- దేవుడికి ఇష్టమైన దావీదు రాజు తప్పుచేసి దేవుని యొక్క మన్నింపు కోరిన సందర్భంలో దేవుడు అతడిని క్షమించారు 2 సమూయేలు 11:12, 24:10
ఎవరైతే దేవుని యొక్క దయ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని దేవుడు ఎప్పుడూ కూడా కరుణిస్తూనే ఉంటారు ఆ ప్రార్ధించినటువంటి సమయములో వ్యక్తి పశ్చాతాప హృదయముతో ప్రార్థించాలి అప్పుడు మాత్రమే దేవుని యొక్క దయను పొందుతారు. వాస్తవానికి దేవుని యొక్క కనికరము మనలను అంగీకరిస్తుంది,
- ఆయన కనికరము మనలను గౌరవిస్తుంది
- ఆయన కనికరము మనకు సహాయపడుతుంది
- ఆయన కనికరము మనకు సమృద్ధిని ఒసగును
- ఆయన కనికరము మనల్ని క్షమిస్తుంది
- ఆయన కనికరము మనకు సానుభూతి చూపుతుంది.
దేవుని యొక్క దయ గురించి కొన్ని అంశాలను ధ్యానం చేసుకోవాలి.
1. దేవుని దయ మన పాపములను క్షమిస్తూ ఉంది.
ఈనాడు విన్న సువిశేష భాగములో యేసు ప్రభువు తన శిష్యులకు దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ బాధలలో ఉన్నటువంటి వారికి ధైర్యం ఇస్తూ, సంతోషాన్నిస్తూ ఉన్నారు అదే విధముగా వారు ఆయన యొక్క పునరుత్థానమును సంపూర్ణముగా విశ్వసించనటువంటి ఆ యొక్క సందర్భంలో వారి యొక్క పాపములను కూడా ఏసుప్రభు క్షమిస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయ కాఠిన్యమును మన్నిస్తున్నారు. ఏసుప్రభు తోమాస్ మీద కూడా కనికరము చూపిస్తున్నారు ఎందుకంటే మిగతా శిష్యులు దేవుని యొక్క దర్శనము పొందిన తర్వాత ఆ చెప్పిన విషయమును తోమాస్ గారు విశ్వసించకుండా ఇంకా అవిశ్వాసములో ఉన్నటువంటి తోమాస్ యొక్క పాపాలు క్షమిస్తూ ఆయన మీద దేవుడు కనికరము చూపిస్తున్నారు.
2. దేవుని దయ మన పాపాలను మరచిపోయేలాగా చేస్తుంది.
దేవుడు మనం చేసినటువంటి పాపములు అన్ని కూడా మరచిపోయి మనలను మరల అంగీకరించి, దీవిస్తారు. ఏసుప్రభు యొక్క మరణ సమయములో శిష్యులు చాలామంది ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు అయినా దేవుడు వారందరి యొక్క పాపములను, బలహీనతలను మరచిపోయి మరల వారికి పదే పదే దర్శనమిస్తూ వారి యొక్క విశ్వాస జీవితాన్ని బలపరిచారు. ఒకవేళ దేవుడే మన పాపములను మరిచిపోకపోతే మనము ఎంతటి శిక్షను పొందేటి వారమో? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి.
3. దేవుని దయ మనలను శాంతితో నింపుతుంది
ఈనాడు విన్న సువిశేష భాగములో ఏసుప్రభు శిష్యుల యొక్క పాపములను క్షమించుట మాత్రమే కాదు చేసేది వారి హృదయాలలో ఉన్నటువంటి అలజడలను తీసివేసి, ఆందోళన తీసివేసి, భయాన్ని తీసివేసి వారి మీద దయ చూపుచు వారి యొక్క హృదయములను శాంతితో నింపుతున్నారు. దేవుడు మన పాపాలను క్షమించుట ద్వారా కూడా మనందరం ప్రశాంతముగా ఉండగలుగుతున్నాము. ఆయన శాంతి లేనిదే మనలో అశాంతి ఉంటుంది కాబట్టి దేవుడు మన మీద చూపించినటువంటి దయ మనము కూడా ఒకరి పట్ల ఒకరు చూపించాలి.
ఈనాడు విన్నటువంటి మొదటి పఠణంలో కూడా తొలి క్రైస్తవ సంఘం ఏ విధముగా ఒకరి పట్ల ఒకరు దయను కలిగి, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ప్రేమించుకుంటూ, జీవించి ఉన్నారో తెలియజేస్తూ ఉన్నది. రెండవ పఠణంలో దేవుడిని ప్రేమిస్తూ జీవించేవారు కూడా పరస్పర సహాయము కలిగి ప్రేమించుకుని జీవించిన తెలియజేస్తున్నారు. ఈనాడు మనము యేసు దివ్య కారుణ్య పండుగను కొనియాడుతున్న సందర్భముగా మన మీద దేవుడు దయ చూపిన విధంగా మనం కూడా ఒకరి పట్ల ఒకరు దయ కనికరము చూపిస్తూ, ఒకరినొకరు క్షమించుకుంటూ జీవించాలి. దేవుడు మన యొక్క పాపాలు క్షమించిన విధంగా మనం కూడా దయతో ఇతరుల యొక్క పాపాలు క్షమించి వారిని కూడా అర్థం చేసుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

30, మార్చి 2024, శనివారం

క్రీస్తు పునరుత్థాన సందేశం

క్రీస్తు పునరుత్థాన సందేశం

ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థాన పండుగను కొని ఆడుచున్నది. ఒక్కసారి ఊహించండి మీ యొక్క డబ్బు మొత్తం కూడా స్టాక్ మార్కెట్లో, బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి మీరు లాభాల కోసం ఎదురు చూసినప్పుడు నీకు ఎదురు దెబ్బ తగిలి, నష్టం వచ్చిందనుకోండి మన పరిస్థితి ఏమిటి? మీరు ఎంతగానో ఊహించి ఉండవచ్చు లాభాలు వస్తాయని, అభివృద్ధి చెందుతారని,  పేరు ప్రతిష్టలు పెరిగితాయని కానీ అవి ఏమీ జరగకుండా ఆశలు అడి ఆశలైనపుడు మనం ఏవిధంగా తట్టుకోగలం. నష్టాలు వచ్చినా లాభాలు తర్వాత వస్తాయని మనం అనుకుంటామా లేక కృంగిపోతామా అది ఒక ప్రశ్నార్ధకం. ఏసుప్రభు యొక్క శిష్యులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఒక్కసారిగా అవన్నీ కూలిపోయాయి.  మ్రాని కొమ్మల ఆదివారం రోజున ఆయనను మెస్సయ్యగా, స్వేచ్ఛ నిచ్చే వానిగా, ప్రజలను రక్షించే వానిగా వారు గుర్తించి, ప్రభువును యెరుషలేము వీధుల్లో గొప్పగా గౌరవిస్తూ ఆహ్వానించుకుంటూ వచ్చారు కానీ పవిత్ర శుక్రవారం రోజున ఆయన వారి యొక్క ఆశలకు భిన్నంగా సిలువ మీద నిస్సహాయం స్థితిలో మరణించుట చూసి శిష్యుల యొక్క ఆశలు అంతా కూడా ఆవిరైపోయాయి. 
వాస్తవానికి మరణంతో జీవితం అంతం అవటం లేదు అలాగే మరణంతో జీవితం నాశనంమగుట లేదు. మరణం తర్వాత జీవితం ఉందని క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం తెలియజేస్తుంది. అదే శాశ్వత జీవితం. ఆయన మరణంతో అంధకారంగా మారిన భూమి క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ద్వారా ప్రకాశిస్తుంది. ఏసుప్రభు మరణమును జయిస్తున్నారు. ఏసుప్రభు యొక్క పునరుత్థానం మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది ఎందుకంటే ఆయన పునరుత్థానం అవ్వనిదే మన యొక్క విశ్వాసం వ్యర్థం అని అపోస్తులు పలుకుతున్నారు. ప్రభువు యొక్క పునరుత్థానము ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు.
1. ఖాళీ సమాధి. 
ఈ భూలోకంలో చాలా మంది మరణించారు కానీ వారిలో ఎవరి సమాధి కూడా ఖాళీగా లేదు. మతాలను స్థాపించిన వారు ఉన్నారు,సమాజంలో పేరు ఉన్నవారు ఉన్నారు, అద్భుతాలు చేసిన వారున్నారు, కానీ వారి యొక్క సమాధి ఏది కూడా ఖాళీగా లేదు కేవలం క్రీస్తు ప్రభువు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. 
ఈ యొక్క ఖాళీ సమాధిని చూసినప్పుడు మనము నేర్చుకోవలసిన అంశం ఏమిటి అంటే ఆ సమాధి ఖాళీగా ఉన్న విధంగా మన హృదయాలు దేవుని కొరకు ఖాళీగా ఉన్నాయా లేదా ఇంకా మన హృదయాలను పాపమును, ద్వేషమును, కోపములను, కక్షులను ఉంచుకొని మన యొక్క హృదయాలను నింపుకుంటున్నామా. ప్రభువు యొక్క పునరుత్థానం మనందరినీ తనతో నింపుకొనమని తెలియజేస్తూ ఉన్నది.
2. దేవుడిని వెదకే వారికి ప్రభువు చేరువులోనే ఉంటా రు. 
మగ్ధల మరియమ్మ ఏసుప్రభువును వెతుకుతూ సమాధి దగ్గరకు చేరుకున్నది కాబట్టే ఆమెకు దేవుడు మొదటిగా దర్శనం ఇస్తున్నారు. ఆమె ఎంతగా దేవుడు ఎడల భక్తి, విశ్వాసము, ప్రేమ కలిగి ఉంటే అంతగా తెల్లగా తెల్లవారకముందే, తొలికోడి కోయకముందే పరిగెత్తుతూ ప్రభువు సమాధి వద్దకు వెళుతుంది ఆమె యొక్క నిస్వార్ధమైనటువంటి  వెతుకుటలో ప్రభు ఆమెకు దర్శనం ఇస్తున్నారు. ఎవరైతే దేవుని వెతుకుతూ వస్తూ ఉంటారు వారికి దేవుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. మరి మనం దేవుని వెతుకుచున్నామా, దేవుని సమీపిస్తున్నా మా? శిష్యులు కూడా ఏసుప్రభు కొరకు వెతుకుచున్నారు కాబట్టి వారికి కూడా దర్శనము ఇవ్వబడింది.
3. నూతన జీవం
పునరుత్థానం శిష్యుల యొక్క జీవితమును మార్చినది, మరీ ముఖ్యంగా పేతురు యొక్క జీవితమును మార్చినది ఎందుకనగా అప్పటివరకు కూడా భయంగా ఉన్నటువంటి పేతురు ఒక్కసారిగా ఏసుప్రభువు పునరుత్థానమయ్యారు అని తెలుసుకున్న తర్వాత వెంటనే ఆయన్ను కలుసుకొనుటకై పరిగెత్తుతూ వెళ్ళాడు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. క్రీస్తు ప్రభువును ఏ విధంగానైనా చూడాలనుకున్నాడు అందుకని తెల్లవారుజామున సమాధి వద్దకు పరిగెడుతూ వస్తున్నారు.
4. నీవు కోల్పోయిన వ్యక్తి దగ్గరకు వెళ్ళటం
శిష్యులు, మగ్ధల మరియమ్మ వారి కోల్పోయినటువంటి గురువు దగ్గరకు వెళుతున్నారు. ఈ యొక్క తపస్సు కాలం ముగిసిన తర్వాత పునరుత్థానంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో మనము కూడా మన యొక్క మాటల వలన చాలా మందిని కోల్పోయివుంటాం కాబట్టి వారి దగ్గరికి వెళ్లి మనము వారితో సఖ్యపడాలి, కలిసిపోవాలి వారితో ఉండాలి.
5. సాక్షిగా ఉండుట
శిష్యులు మరియు మరదలా మరియ ఏసుప్రభు చూసిన తర్వాత ఆయన గురించి సాక్ష్యం చెబుతున్నారు జరిగిన విషయంలో మిగతా వ్యక్తులతో పంచుతున్నారు వారు ఏదైతే కనులారా చూశారో, తమ యొక్క జీవితంలో అనుభవించారు దానిని ఇతరులకు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం కూడా క్రీస్తు ప్రేమను తెలియజేయాలి.
ప్రభువు పునరుత్థానం, మనలో శాంతి సమాధానము తీసుకురావాలి అలాగే కృంగిపోయిన తర్వాత నిరాశ పడకుండా ముందుకు ఒక ఆశతో నమ్మకంతో వెళ్లడం నేర్చుకోవాలి.
Fr. Bala Yesu OCD

23, మార్చి 2024, శనివారం

మ్రాని కొమ్మల ఆదివారం

మ్రాని కొమ్మల ఆదివారం
యెషయా 50:4-7, ఫిలిప్పి 2:6-11, మార్కు 14:1-15,47
ఈనాడు తల్లి శ్రీ సభ మ్రాని కొమ్మల ఆదివారమును కొనియాడుచున్నది. ఏసుప్రభు యెరుషలేము పట్టణము వచ్చుచున్నాడని కొందరు విని ఆయనకు స్వాగతం పలకడానికి ఎదురెళ్ళారు. ఈ యొక్క మ్రాని కొమ్మల రోజు ఏసుప్రభు యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి రోజు ఒక విధముగా చెప్పాలంటే సంతోషకరమైన రోజు ఎందుకంటే ప్రజలు ఆయనను మెస్సయ్యగా గుర్తించి ఆయనకు ఘన స్వాగతం పలికారు. తమ యొక్క హస్తాలతో తాటి ఆకులను ధరించి ఏసు ప్రభువుకి ఎదురు వెళ్లి జయ జయ నినాదాలు తెలిపారు. ప్రజలందరూ ఏసుప్రభువును రాజుగా ఊహించుకుని, ఆయన వారికి స్వేచ్ఛనిస్తారు అని భావించారు. ఏసుప్రభువుకి ప్రజలు అంత ఘన ఆహ్వానం ఎందుకు పలికారంటే ఆయన యొక్క అద్భుత కార్యములు అదేవిధంగా ఆయన చూపించిన ఒక జీవిత నిదర్శనం(పేదవారి కొరకు పోరాడటం) ప్రజల జీవితంలో కొత్త ఆశలను నమ్మకాన్ని కలుగజేసినది. ప్రభువు పేదవారి పక్షమున పోరాడుట వలన అనేకమందిలో ఒక కొత్త నమ్మకం వచ్చినది. ఇతడు నిజముగా ప్రజల కోసం వచ్చారని ప్రజల సమస్యల నుండి కాపాడతారని వారి నమ్మకం అందుకే ఆయన రాజుగా చేయాలని ఆయనకు ఆహ్వానం పలికారు.
ఈనాటి పండుగను ఉద్దేశించి కొన్ని అంశములు ధ్యానం చేసుకోవాలి
1. ప్రవక్తల యొక్క ప్రవచనం నెరవేరినది.
మెస్సయ్య గాడిద పిల్ల మీద వస్తాడు అని ప్రవచనాలు తెలియచేయబడ్డాయి. జెకార్య 9:9. ఏసుప్రభు తన శిష్యులను పంపించి తన కొరకై ఒక ఇంటి యజమాని గాడిదను ఇవ్వమని అడగమని తెలిపారు (మార్కు 14.:13) ఆ యొక్క ఇంటి యజమానుడు కూడా శిష్యులు వచ్చి గాడిదను అడిగిన వెంటనే కట్టి ఉన్నటువంటి గాడిదను శిష్యులకి ఇస్తున్నారు ఎందుకంటే బహుశా ఆయన యేసు ప్రభువు యొక్క గొప్పతనం గురించి విని ఉండవచ్చు అందుకని వేరొక ఒక్క మాట మాట్లాడకుండా ఇది దేవుని కొరకు వినియోగించబడుతున్నది అని సంతోషముగా ఈ యొక్క గాడిదను శిష్యులకి ఇచ్చి పంపించారు.
ప్రభువు గాడిదను ఎన్నుకొనుట ఆయనకు ఇష్టం ఎందుకంటే పూర్వం గుర్రం కన్నా గాడిదలనే ముందుగా ప్రయాణాలకు వినియోగించేవారు( 2 సమూ13:29, 1 రాజులు 1:38). అదేవిధంగా పూర్వం రాజులు యుద్ధం చేయటానికి వెళ్లేటప్పుడు గుర్రం మీద వెళ్లేవారు కానీ ఎవరైతే శాంతిని నెలకొల్పాలనుకున్నారో వారు మాత్రము గాడిద మీద వెళ్లేవారు. ఏసుప్రభు మనలను తండ్రితో సమాధానపరుచుట కొరకే ఈ యొక్క గాడిద పిల్లను ఎన్నుకుంటున్నారు. గాడిదను ఎన్నుకొనుటకు కారణాలు
1. గాడిద శాంతికి గుర్తు
2. గాడిద ఎంత బరువునైనా మోయుటకు గుర్తు
3. గాడిద వినమ్రతకు గుర్తు
4. గాడిద యజమాని చెప్పినది చేయుటకు గుర్తు
5. గాడిద సేవకు గుర్తు
6. గాడిద బాధలు అనుభవించుటకు గుర్తు
పూర్వం చాలా మంది గాడిద మీద ప్రయాణం చేసి ఉన్నారు.
- సొలోమోను కూడా తన తండ్రి గాడిద మీద సింహాసనం అధిష్టించే రోజున వచ్చి ఉన్నారు.
1 రాజులు 1:38-41
- సౌలు కుమారుడు కూడా గాడిద మీదే వచ్చి ఉన్నారు 2 సమూ19:26
- ఏసుప్రభు తీసుకురమ్మన్న గాడిదను ఎవ్వరు ఎన్నడను వాడలేదు మొట్టమొదటిగా యేసు ప్రభువు మాత్రమే వాడుతున్నారు.
- ఏసుప్రభు ఈ యొక్క గాడిద పిల్లను విడుదల చేస్తున్నారు అప్పటివరకు కూడా అది కట్టి వేయబడినది అటు తరువాత ప్రభువు తన యొక్క ప్రమేయంతో విడుదల చేస్తున్నారు అదియే మన యొక్క జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది పాపమునకు, వ్యసనములకు కట్టి వేయబడుచున్న మనలను దేవుడు తన యొక్క కుమారుడు యొక్క మరణము ద్వారా విముక్తులను చేస్తున్నారు కాబట్టి మనము దేవుని ప్రేమను గుర్తించి మారుమనస్సు పొందాలి.
2. హోసన్న అనగా-Save us now (ఇప్పుడు మమ్ము రక్షించు ప్రభు అని అర్థం) ఎలాంటి సందర్భంలో మనము ఇతరులను రక్షించమని అడుగుతాం?. మనలని మనము రక్షించుకోలేని సందర్భంలో అలాగే ఆపదలో చిక్కుకున్న సమయంలో మన యొక్క శక్తి సామర్థ్యం వలన సాధ్యము కాని విషయం తలంచుకున్నప్పుడు ఇతరుల యొక్క సహాయం కోరుతూ రక్షించమని అడుగుతూ ఉంటాం. ఏసుప్రభువు కాలంలో కూడా ప్రజలు ప్రార్ధించినది ఇదియే. ఇప్పటివరకు కూడా స్వేచ్ఛ లేకుండా బ్రతుకుచున్నటువంటి మమ్ములను రక్షించమని ప్రార్థిస్తున్నారు. వాస్తవానికి దేవునికి రక్షించమని ప్రార్థించిన ప్రతి వ్యక్తిని రక్షిస్తున్నారు.
- ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం లో ఉన్నప్పుడు మమ్ము రక్షించమని ప్రార్థించారు దేవుడు వారిని రక్షించారు. నిర్గమ 3:7
- ఇశ్రాయేలు ప్రజలు పాము కాటుకు గురైనప్పుడు రక్షించమని ప్రార్థించారు సంఖ్యా 21:7
- ఎస్తేరు తన ప్రజలను ఆపదనుండి రక్షించమని దేవునికి ప్రార్థించింది (ఎస్తేరు 4)
- భర్తిమయి అనే గుడ్డివాడు రక్షించమని ప్రార్థించారు. లూకా 18:38
- సిలువ మీద ఏసుప్రభు పక్కన ఉన్న దొంగ కూడా రక్షించమని ప్రార్థించారు. (లూకా 23:42)
ఇంకా చాలా సందర్భాలలో ప్రజలు రక్షించమని కోరినప్పుడు ప్రభువు తన ప్రజలను రక్షిస్తున్నారు. ఆయన యొక్క మరణము ద్వారా మనందరం కూడా రక్షించబడుతున్నాం.
3. ప్రభువు ముందు ఉండుట.
కేవలము మ్రాని కొమ్మల ఆదివారం రోజున యాజకుడు అందరికన్నా ముందుగా ప్రయాణమై పోవుతుంటారు. ఇది ఎందుకంటే దేవుడే మనకు ముందుండి అన్ని విషయాలలో నడుస్తారు. ఏసుప్రభు మనము అనుభవించేటటువంటి శ్రమలకు బదులుగా ఆయనే ముందుండి మన కొరకు అన్ని బాధలు పొందటానికి సిద్ధపడ్డారు. నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం యావే దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాత్రి అగ్నిస్తంభముగా పగలు మేఘస్తంభంగా వారి ముందుండి నడిచారు. మనము అనుభవించవలసిన శ్రమలు మరణం నిందలు అవమానాలు అన్నీ కూడా ఏసుప్రభు మన కొరకై అనుభవించారు కాబట్టి ఈరోజు మనము ఆ ప్రభువు యొక్క ప్రేమను తెలుసుకొని మన జీవితంలను మార్చుకొనుటకు ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమ గొప్పది ఆ ప్రేమను అర్థం చేసుకొని మనం జీవించాలి.
Fr. Bala Yesu OCD

16, మార్చి 2024, శనివారం

తపస్సు కాలం ఐదవ ఆదివారం

తపస్సు కాలం ఐదవ ఆదివారం
యిర్మియ 31:31-34 హెబ్రీ 5:7-9, యోహాను 12:20-33

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు తన ప్రజలతో ఏర్పరచుకున్న నూతన ఒడంబడికను గురించి అదేవిధంగా ప్రభువు పొందబోవు మరణము గురించి తెలియజేస్తున్నాయి. ఏసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానమునకు దగ్గరవుతున్న వేళలో శ్రీ సభ మనమందరం ఆయన యొక్క మరణము, పునరుత్థానము గురించి ధ్యానించమని తెలుపుచున్నది.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యిర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలతో ఏర్పరుచుకుంటున్న ఒక నూతన ఒడంబడిన గురించి తెలుపుచున్నారు. యిర్మియ ప్రవక్త క్రీస్తుపూర్వం 650 - 580  సంవత్సర మధ్యకాలంలో జీవించారు. ఆయన యొక్క పరిచర్య మొత్తం కూడా యెరూషలేములో జరిగినది. యిర్మియ ప్రవక్త ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడిని విస్మరించిన సందర్భంలో యూదుల మధ్య జీవించారు. యూదయ రాజ్యాన్ని అంధకారం ఆవరించినటువంటి సమయం అది. ప్రజలు పాపమునే ప్రేమించి దేవుడికి దూరమైన సందర్భంలో దేవుడు వారిని బాబిలోనియా  బానిసత్వమునకు పంపగా అక్కడ వారు జీవమును కోల్పోయిన విధముగా ఉన్న సమయంలో వారి బాధను చూసి దేవుడు, నూతన ఒడంబడిక ఏర్పరచుకుంటాన‌ని  తెలుపుచున్నారు. వాస్తవానికి ఎందుకు ఈ నూతన వడంబడిక? అని ధ్యానించినట్లయితే మనకు అర్థమయ్యే అంశము ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మొదటి ఒడంబడిక నెరవేర్చుటలో విఫలమయ్యారు 2రాజలు దిన 36:14-16,21. అందుకే దేవుడు వారికి ఇంకొక అవకాశంను దయచేసి ఉన్నారు. ఇది ఆయన యొక్క మంచితనమునకు నిదర్శనం. పడిపోయినటువంటి తన ప్రజలు మరలా లేచి తనను అనుసరించాలి అన్నది ప్రభువు యొక్క కోరిక. అందుకని ఇంకొక ఒడంబడిక ద్వారా వారికి కొత్త జీవితం ఇస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కరి మార్పుకై అవకాశాన్ని ఇస్తూనే ఉంటూ ఉంటారు అందుకే ఆయన తన యొక్క సేవకులను పదేపదే వారి హృదయ పరివర్తనముకై పంపిస్తూ ఉంటారు. 
ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క మాట ప్రకారంగా జీవించలేదు కాబట్టే ఆయన వారికి ఇంకొక అవకాశాన్ని దయచేసి ఒక నూతన క్షమించే ఒడంబడికను వారితో ఏర్పరచుకుంటున్నారు. పాత బడంబడిక రాతి పలక మీద దేవుని చట్టం రాయబడినట్లైతే, నూతన బడంబడిక ప్రతి ఒక్కరి యొక్క హృదయము మీద వ్రాయబడుతున్నది. రాతి పలక మీద రాసిన దేవుని చట్టం పగిలిపోవచ్చు, చెరిగిపోవచ్చు కానీ మానవుని యొక్క హృదయము మీద రాసినటువంటి దేవుని యొక్క చట్టము ఎన్నడూ మారదు, ఎవరూ కూడా దానిని ఎవరూ కూడా దానిని మన నుండి తీసివేయలేరు. ఇంతకుముందు  దేవుని చట్టం మనకు బయటగా ఉన్నది కానీ ఇప్పుడు మాత్రం దేవుని చట్టం మన హృదయాంతరంగంలోనే ఉన్నది ఆ చట్టం మనందరిని కూడా ప్రతినిత్యం ఎలా జీవించాలో? ఏమి చేయాలో ? అని ప్రేరేపిస్తూ ఉన్నది కావున ఇంకా ఎన్నడు మనము తప్పు చేయకుండా జీవిస్తాం. యిర్మియా ప్రవక్త యొక్క నూతన ఒడంబడిక  దేవుడు ఒక కొత్త జీవితానికి సూచనగా ఉన్నది అలాగే ఈ నూతన ఒడంబడిక యెహెజ్కేలు( 16:26-27)గ్రంథములో ఉన్న నూతన హృదయమును సూచిస్తున్నది దేవుడు మానవులలో ఉన్నటువంటి కఠిన హృదయమును తీసివేసి మాంసపు ముద్ద కలిగిన హృదయాన్ని దయచేస్తానని అంటున్నారు అనగా ప్రతి ఒక్కరికి కొత్త జీవితాన్ని దయచేస్తానంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో ఏసుప్రభు ఏ విధంగా తండ్రికి విధేయత చూపించి ఉన్నారో తెలియచేయబడినది. ఆయన తండ్రితో అన్నిటిలో సరిసమానమైనప్పటికీ కూడా ఆయన చిత్తమును ఈ భూలోకములో ఎంత కష్టమైనా నెరవేర్చి ఉన్నారు.
ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు మనము జీవించాలి(పవిత్రముగా దేవునితో) అంటే మరణించాలి అని (పాపానికి)  చెబుతున్నారు. కొందరు గ్రీకులు యేసు ప్రభువుని చూడటానికి వచ్చిన సందర్భంలో ఫిలిప్పుతో ఏసుప్రభు ని చూడాలి అని అడిగిన వేళ ఫిలిప్పు అంద్రెయ్యతో వారు ప్రభువుని చూడాలని తెలిపాడు. ప్రభువు దానికి గాను మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది అని తెలిపారు అదేవిధంగా ఏసుప్రభు ఈ విధంగా అంటున్నారు మనిషి కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అందరూ ఆయన వద్దకు ఆకర్షితులవుతారని అన్నారు. ఆయన మరణించక ముందే జ్ఞానానికి ప్రసిద్ధిగాంచినటువంటి గ్రీకు దేశస్తులే ఆయన యొక్క గొప్పతనమును చూడాలని ఏసుప్రభు చెంతకు వస్తున్నారు బహుశా వారు యూదా మతమును అనుచరించుటకు హృదయ పరివర్తనము చెందినటువంటివారై ఉండవచ్చు లేదా ఏసుప్రభు యొక్క గొప్పతనం విని ఆయనను చూడాలని అనుకుని ఉండవచ్చు. ఇది చాలా గొప్పదైన విషయం జ్ఞానులు సైతం దేవుడిని గుర్తించి ఆయన దగ్గరకు రావడం. ఈ యొక్క సందర్భంలో ఏసుప్రభు గోధుమ గింజ భూమిలో పడి నశించనంతవరకు అది అట్లే ఉండును కానీ నశిస్తే దాని నుండి కొత్త జీవము పుట్టును అని తెలిపారు. ఇక్కడ విత్తనము నశించితేనే తప్ప కొత్త జీవితం రావటం లేదు అదే విధంగా విత్తనము తనను తాను త్యాగం చేసుకుని మొక్కకు జన్మనిస్తుంది, ఉప్పు కూడా తనను తాను కరిగిపోతూ ఇతరులకు రుచిని అందజేస్తూ ఉన్నది అలాగే కొవ్వొత్తి కూడా  తాను కరిగిపోతూ ఇతరులకు వెలుగునిస్తుంది. 
వాస్తవానికి మనందరం కూడా నశించాలి. నశించుట అంటే మన యొక్క పాత జీవితానికి, 
- పాపపు జీవితానికి,
- స్వార్థానికి
- కోపానికి
- అసూయలకు
- సుఖ భోగాలకు
- ఈ లోక సంబంధమైన వాంఛలకు
- చెడు వ్యసనాలకు మనము మరణించినట్లయితే అప్పుడే మనలో కొత్త జీవితం కలుగుతుంది.
అదేవిధంగా ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు మన అందరిని కూడా ఆయనకు సాక్షులుగా ఉండమని తెలుపుచున్నారు. తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునుకై కాపాడుకొనును, నన్ను సేవింప గోరువాడు నన్ను వెంబడింపవలెను అని క్రీస్తు ప్రభువు తెలియచేశారు అనగా మన యొక్క జీవితం క్రీస్తు జీవితం వలే త్యాగ పూరితమైన జీవితంలా ఉండాలి.

Fr. Bala Yesu OCD

9, మార్చి 2024, శనివారం

తపస్సుకాలం నాలుగవ ఆదివారం

తపస్సుకాలం నాలుగవ ఆదివారం
2 రాజుల దినచర్య 36:14 -16, 19-23, ఎఫేసి 2:4-10, యోహాను 3:14-21
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క దయార్ధ హృదయము గురించి తెలియజేయుచున్నవి. దేవుడు రక్షణను అందరికీ దయచేసి ఉన్నారు, తన యొక్క కుమారుడు యొక్క మరణ, పునరుత్థానము ద్వారా అయితే మన యొక్క రక్షణ నిమిత్తమై ప్రతినిత్యం మనందరం కూడా కృషి చేయాలి. ప్రభువు మనందరికీ కూడా రక్షణ ఉచితముగా ఇచ్చి ఉన్నారు అనే సత్యం తెలుసుకొని మనము కూడా ఆయనకు విశ్వాసపాత్రులుగా జీవించాలి. ఈ తపస్సు కాల నాలుగు ఆదివారాన్ని Gaudate Sunday అని పిలుస్తారు అనగా ఆనందించు ఆదివారము అని అర్థం. ప్రభువు యొక్క పునరుత్థానము దగ్గరలో ఉన్నది కాబట్టి మనందరం సంతోషించాలి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుని యొక్క దయ గురించి తెలుపుచున్నారు అదేవిధంగా దేవుని యొక్క సహనం గురించి తెలుపుతున్నారు. రాజుల దినచర్య రెండవ గ్రంథము ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి రాజు సౌలు రాజు దగ్గర నుండి (1030 B.C), యూదా ప్రజలు బాబిలోనియా (550) బానిసత్వము గురించి తెలుపుచున్నది. మొదటి రాజు దగ్గర నుండి బానిసత్వం వరకు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా వారికి తోడై దీవించి వారి నడిపించారని తెలుపుచున్నది అదే విధముగా బానిసత్వం అనేది వారి యొక్క పాపము జీవితమునకు శిక్షగా దేవుడు వారికి ఇస్తున్నారు. యూదులు ఇతర ప్రజల నుండి ఆ గౌరవప్రదమైన ఆచారాలు నేర్చుకున్నారు. ఈరోజు విన్న ఈ భాగంలో ఏ విధముగా ఇస్రాయేలు ప్రజలు దేవుని నివాస మైనటువంటి యెరుషలేము దేవాలయమును, సొంత భూమిని కోల్పోయినటువంటి అంశమును చదువుకుంటున్నాము. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవాలయమునకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేదు ప్రభువు యొక్క పవిత్ర మందిరమును అమంగళము చేశారు. ఇది వారి యొక్క పాపపు జీవితమునకు, గర్వమునకు నిదర్శనం. దేవుడిని కాదని అన్య దైవముల వెంట వెళుతూ వారు ఈ యొక్క పాపపు క్రియలకు పాల్పడ్డారు. వారు ఎంత పాపం చేసినప్పటికీ దేవుడు మాత్రము వారి యొక్క హృదయ పరివర్తన నిమిత్తమై ప్రవక్త తర్వాత ప్రవక్తలను పంపుచున్నారు ఇది ఆయన యొక్క దయార్ధ హృదయమునకు నిదర్శనముగా ఉంటుంది ఆయన వారు మారాలనుకున్నారు కాబట్టి వారి కొరకు ప్రవక్తను పంపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రజలు హృదయ పరివర్తనం చెందనప్పుడు వారిని శిక్షిస్తున్నారు, చెందినప్పుడు వారిని దీవిస్తున్నారు. ఈ యొక్క శిక్ష సరిదిద్దుటకే కానీ నాశనం చేయటానికి కాదు. ఆయన శిక్షలో ప్రేమ ఉంది ఆయన కోపములో అనురాగం ఉంది ఆయని యొక్క ప్రేమ, కరుణతో కూడుకున్నటువంటి ప్రేమ. ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి పారశీక దేశ రాజు అయిన సైరస్ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విముక్తులను చేస్తున్నారు వారు మరొకసారి సొంత భూమికి వెళ్లి, సొంత దేవాలయమునకు దేవాలయమును తిరిగి నిర్మించుటకు అవకాశము దయ చేస్తున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో కూడా దేవుని యొక్క కృప అపారమైనది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆయన మన పట్ల చూపిన ప్రేమ అమితమైనది అని తెలుపుతున్నారు. కేవలము దేవుని యొక్క కృప వలన ద్వారానే మనందరం కూడా రక్షించబడుతిమి. మనందరం కూడా క్రీస్తు ప్రభువుతో ఐక్యమై జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యములో, మనము ప్రభువుతో పాటు కూర్చుండ చేస్తారు. పౌలు గారు ఇదంతా కూడా దేవుడు మానవునికి ఉచితంగా ఇచ్చినటువంటి బహుమానం కాబట్టి ఆయన ఇచ్చిన వరమును మనము ఎప్పుడూ కూడా సద్వినియోగపరచుకుని జీవించాలని పలికారు.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు నికోదేముతో సంభాషించిన అంశము గురించి తెలుపుచున్నది. నికోదేము ఒక ధనవంతుడు, పరిసయ్యుడు. ఆయనకు ఏసుప్రభు నందు విశ్వాసము ఉన్నది అందుకు కాబట్టే పరలోక సంబంధమైనటువంటి అంశములను గురించి చర్చించారు. నికోదేము ఏసుప్రభు తో సంభాషించేటప్పుడు ప్రభువు రక్షణము గురించి తెలియజేస్తున్నారు.
మోషే ప్రవక్త ఎడారిలో ఏ విధముగానైతే సర్పము నెత్తి ఉన్నారో ఆ సర్పమును చూసినటువంటి వారందరూ కూడా రక్షించబడితిరి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4-9 వచనాలలో చదువుకునేది ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజలు మోషే ప్రవక్తకు దేవునికి విరుద్ధముగా మాట్లాడిన సందర్భంలో దేవుడు వారిని పాము కాటు ద్వారా శిక్షిస్తున్నారు. వారిని రక్షించుట నిమిత్తమై మరొకసారి దేవుడు మోషేను కంచు సర్పము చేయమని తెలుపుచున్నారు. ఈ యొక్క కంచు సర్ఫము వైపు ఎవరైతే పశ్చాతాపముతో చూస్తారో వారందరూ కూడా రక్షించబడుతారు అని ప్రభువు తెలుపుతున్నారు, వారు పశ్చాతాపంతో చూసిన విధముగానే రక్షింపబడ్డారు. అదే విధముగా ఏసుప్రభువు కూడా ఎత్తబడిన సందర్భములో మనందరం కూడా ఆయన యొక్క సిలువను చూసి పశ్చాతాపబడినప్పుడు మనము కూడా రక్షించబడతాము. ఆ సిలువ నాథుడు మనందరి యొక్క రక్షణకు కారణం అవుతారు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమవలన బారమైనటువంటి ఆ శిలువను మోసుకుని వెళ్లారు. ఆయన మనలను రక్షించుటకే వచ్చారు కానీ ఖండించుటకు రాలేదు కాబట్టి మనము కూడా ఆ యొక్క సిలువను చూస్తూ హృదయ పరివర్తనం చెందుతూ జీవించాలి. ఏసుప్రభును విశ్వసించేవారు ఖండింపబడరు కానీ ఎవరైతే విశ్వసింపరు వారు ఖండించబడి ఉన్నారు అని తెలుపుతున్నారు. ప్రభువు యొక్క శిలువను చూస్తూ ఆయన విశ్వసిస్తే ఆయన మన మీద చెప్పిన కరుణను ప్రేమను దయను మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క అనుదిన జీవితాల్లో కూడా ఇవి పాటించేలాగా మనం మారాలి అలాగే దేవుడు యొక్క వెలుగును మనందరం కూడా కలిగి ఆ వెలుగును ఇతరులకు పంచాలి.
Fr. Bala Yesu OCD

2, మార్చి 2024, శనివారం

తపస్సు కాలం మూడవ ఆదివారం

తపస్సు కాలం మూడవ ఆదివారం
నిర్గమ 20:1-17,  1 కొరింతి 1:22-25,  యో‌హాను 2:13-25
ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న ఒడంబడిక గురించి మరియు ఏసుప్రభు యెరూషలేము దేవాలయమును పవిత్ర పరుచుట గురించి బోధిస్తున్నాయి. గత  రెండు వారాలుగా మనము మొదటి పఠణంలో దేవుడు నోవాతో మరియు అబ్రహాముతో ఏర్పరచుకున్న ఒడంబడికను  గురించి ధ్యానించాం. ఈరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకుంటున్న ఒక ఒడంబడికను చదువుకుంటున్నాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేయటమే కాక వారిని వాగ్దాత్మ భూమికి నడిపించాలి నుంచున్నారు మరియు వారిని శత్రువుల బారి నుండి కాపాడాలని నిర్ణయించుకున్నారు ఇది మాత్రమే కాదు ఈ యొక్క ఒడంబడిక ద్వారా యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు  స్వేచ్ఛనిస్తున్నారు,
వారికి రక్షణనిస్తున్నారు,
 ఇతరుల కన్నా వారిని ఇంకా అధికముగా దీవించుటకై తానే ఒక మార్గ చూపరిగా ఉంటానని తెలుపుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకునే ముందు వారికి పది ఆజ్ఞలను ప్రభువు దయచేసి చేస్తున్నారు. ఈ యొక్క ప్రతి ఆజ్ఞలకు విధేయులై జీవించినట్లయితే వారికి తాను దేవుడై ఉండి ఎల్లప్పుడూ కూడా వారిని ఆశీర్వదిస్తాను అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడు ఒక్కసారిగా వారిని ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకొని రావటం ద్వారా ఆయన మీద అపారమైనటువంటి నమ్మకం పెరిగింది అందుకని ఒక మాటతో వారందరూ కూడా మేము దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులై జీవిస్తామని ఏక స్వరముతో పలికారు అప్పుడు దేవుడు మోషే ద్వారా పది ఆజ్ఞలు ఇస్తూ సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకుంటున్నారు. 
ఈ పది ఆజ్ఞలు దేవుడు ఎలాంటి వారు అని తెలియచేస్తున్నాయి అలాగే ఒక విశ్వాసి తోటి వారి పట్ల ఏ విధముగా మెలగాలి అని తెలియచేస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క ఆజ్ఞలు మన యొక్క విశ్వాస జీవితంలో మంచిని అనుసరించుటకు, మంచి జీవితం జీవించుటకు సుచనగా ఉన్నాయి. దేవుడిచ్చిన ఈ యొక్క చట్టం ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే ఎందుకంటే ప్రతి ఒక్క చట్టం ఉన్నది కూడా మన యొక్క అభివృద్ధి కొరకే. మనము ఏవిధంగా జీవించాలో, జీవించ కూడదో, ఏ విధంగా జీవిస్తే సమాజంలో మంచిగా గౌరవింపబడతాము అని చట్టం మనకు తెలియచేస్తుంది. ఈ యొక్క పది ఆజ్ఞల చట్టం మనలను గొప్పవారిగా తీర్చిదిద్దుతుంది. ఈ యొక్క పది ఆజ్ఞలలో రెండు భాగములు ఉన్నది మొదటిది దేవునికి సంబంధించినది. (1-3 ఆజ్ఞలు)
రెండవది తోటి మానవాళికి సంబంధించినది (4-10). ప్రభువు ఎవరైతే తన యొక్క ఆజ్ఞలకు విధేయులై వాటిని పాటిస్తూ జీవిస్తారో వారిని వేయి తరములు వరకు ఆశీర్వదిస్తానని పలుకుచున్నారు (నిర్గమ 20:6). చాలా సందర్భాలలో దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుటలో మనము విఫలం అయిపోతూ ఉంటాం ఎందుకంటే చాలా సార్లు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం ఇవ్వము అలాగే పొరుగువారి ఎడల చూపించవలసిన ప్రేమను చూపించము. ఈ పది ఆజ్ఞలను మనము ఏ ఆజ్ఞ సంపూర్ణంగా మన జీవితంలో పాటించి ఉన్నాము. చాలా సందర్భాలలో మనం దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితంలో పాటించి లేక పోతున్నామా?. పది ఆజ్ఞలు చాలా విలువైనవి, వీటిని పాటించుట ద్వారా మన యొక్క జీవన శైలి మారుతుంది. ఏసుప్రభు ఇచ్చిన నూతన ఆజ్ఞ ఈ పది ఆజ్ఞల యొక్క సారాంశంగా శిష్యులకి ఇచ్చారు. ఒక్కొక్క ఆజ్ఞ మనం ధ్యానించినట్లయితే నిజంగా మనం దేవుడి విషయంలో విశ్వాసపాత్రులుగా ఉంటున్నామా? అలాగే మన యొక్క పొరుగు వారిని కూడా గౌరవించుకొని జీవిస్తూ ఉన్నామా?  అని మనకు అర్థమవుతుంది.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఏసుప్రభు యొక్క సిలువను గురించి తెలియజేస్తున్నారు. ప్రభువు యొక్క శిలువ గురించి ప్రకటించబడాలి. కొందరికి సిలువ అవమానకరంగా ఉండవచ్చు కానీ అదే సిలువ ద్వారా మనందరం కూడా రక్షించబడ్డాం అని పౌలు గారు తెలుపుతున్నారు.
ఈనాటి సువిశేష భాగంలో ఏసుప్రభు యెరూషలేము దేవాలయమును పవిత్ర పరచుట గురించి చదువుకుంటున్నాము. ఎప్పుడైతే ఏసుప్రభు యెరుషలేము దేవాలయంలో జరిగే వ్యాపారాలను ఖండించారు వారందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉంటున్నారు అది మాత్రమే కాక ఈ యొక్క దేవాలయమును పడగొట్టండి దీనిని మూడు రోజుల్లో నిర్మిస్తానని ఏసుప్రభు పలికారు అందుకుగాను అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కోపబడుచున్నారు ఎందుకంటే వాస్తవానికి ప్రతి ఒక్క యూదుడికి మూడు ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యం.
1. భూమి
2. రాజు
3. దేవాలయం 
యూదులకు సొంత భూమి లేదు ఎందుకంటే వారు రోమీయుల చేత పరిపాలింపబడ్డారు అదే విధంగా వారికి సొంత రాజు లేదు ఎందుకంటే రాజ్యాలు విడిపోయాయి కాబట్టి కేవలము వారికి ఉన్నది దేవాలయము మాత్రమే అందరూ కూడా వచ్చి ప్రార్థనలు చేసుకోవడానికి ఉన్న ఏకైక స్థలం దేవాలయం కాబట్టి ఆ స్థలమును కూడా కూల్చివేస్తే ఇక ఏది కూడా వారి సొంతమైనది లేదు కాబట్టి ఆ మాటలకు వారు కోపపడుతున్నారు అందుకే ప్రభువును హింసించాలనుకున్నారు. వాస్తవానికి ఏసుప్రభు యొక్క కోపం మంచిని ఉద్దేశించినది ఎందుకంటే దేవాలయము ప్రార్థించుటకు దేవుడిని ఆరాధించుటకు,స్తుతించుటకు, బలులు సమర్పించుటకు ఏర్పరచబడినది కానీ అక్కడ వ్యాపారం ద్వారా ప్రాముఖ్యత ఇవ్వవలసిన దానికి ఇవ్వకుండా అంతయు కూడా స్వార్థపూరితంగా మారినది అందుకని ఏసుప్రభు వారి యొక్క కపటత్వం చూసి వారిని ఖండిస్తున్నారు. ఏసుప్రభు యొక్క రాకతో మరొక్కసారి యెరుషలేము దేవాలయం తన యొక్క పూర్వ వైభవమును పొందుతుంది. తన రాకతో మరొకసారి ఆ దేవాలయమును పవిత్ర పరిచారు. మనము కూడా దేవుని యొక్క ఆలయము అని పునీత పౌలు గారు అన్నారు కాబట్టి దేవుడు కొలువై ఉండే మన యొక్క హృదయములను శరీరమును ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకొని జీవించాలి మన యొక్క జీవితములను పవిత్రంగా ఉంచుకోవాలి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించాలి.
Fr. Bala Yesu OCD

24, ఫిబ్రవరి 2024, శనివారం

తపస్సు కాల రెండవ ఆదివారం

తపస్సు కాల రెండవ ఆదివారం
ఆది 22:1-2, 9-18, రోమి 8:31-34
మార్కు 9:2-10
తపస్సు కాలము అనగానే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది క్రీస్తు ప్రభువు మన కొరకు సమర్పించిన కల్వరి బలి. మన మీద ఉన్న ప్రేమ చేత ఏసుప్రభు తన జీవితాన్ని త్యాగం చేసి మనందరికీ కూడా రక్షణను స్వేచ్ఛను ప్రసాదించి ఉన్నారు. ఈనాటి దివ్య గ్రంథములు కూడా మనకు బోధించేటటువంటి అంశములు ఏమిటి అంటే  అబ్రహాము సమర్పించిన బలి విధానము మరియు క్రీస్తు ప్రభువు యొక్క బలి 
అదే విధముగా క్రీస్తు ప్రభువు యొక్క దివ్య రూప ధారణ. ఈ మూడు పఠణములలో మూడు పర్వతముల గురించి తెలియజేయబడ్డవి.
1. మోరియా పర్వతము
2. కల్వరి కొండ
3. తాబోరు పర్వతం
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు అబ్రహామును ఇస్సాకును బలిగా ఇవ్వమన్న వృత్తాంతము చదువుకున్నాం. ఈ మొదటి పఠణంలో మనము గమనించవలసిన అంశములు ఏమిటి అంటే
1. అబ్రహాము యొక్క విశ్వాస జీవితం.
2. అబ్రహాము యొక్క త్యాగం
3. అబ్రహాము యొక్క బాధ
4. దేవుని మీద ఆధారపడటం
5. అబ్రహం యొక్క ధైర్యం 
6. అబ్రహాము యొక్క స్వేచ్ఛ

పవిత్ర గ్రంథములో దేవుడు ఎక్కడ ఎప్పుడు అబ్రహామును మినహా ఎవరిని కూడా మానవుని బలిగా ఇవ్వమని కోరలేదు. మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహామును తన కుమారుడిని బలిగా ఇవ్వమంటున్నారు ఈ వాక్యము చదివిన సందర్భంలో మనందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఎందుకు దేవుడు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని తన కుమారుడిని బలిగా ఇవ్వమంటున్నారు. చాలామందికి ఇది న్యాయమా? అని అనిపించవచ్చు కానీ ఇది కేవలం అబ్రహాము యొక్క విశ్వాస జీవితమును పరీక్షించుట కొరకై ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ఒక శాశ్వతమైనటువంటి ఒడంబడిక చేసుకోబోతున్నారు కాబట్టి ఆయన యొక్క విశ్వాస జీవితం ఇంకా స్థిరముగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం నిమిత్తమై ప్రభువు అబ్రహామును పరీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాస పరీక్షలు అవసరం (యాకోబు 1:12). ఈ మొదటి పఠణ ప్రారంభ వచనము మనకు ఈ అంశం గురించి తెలియజేస్తూ ఉన్నది ఇది కేవలము అబ్రహాము యొక్క విశ్వాస జీవితంను పరీక్షించుట కొరకై దేవుడు తన కుమారుడిని బలిగా ఇవ్వమని అంటున్నారు. వాస్తవానికి అబ్రహం దేవుని యొక్క స్వరమును ఆలకించి వెంటనే దానిని ఆచరణలో పెడుతున్నారు.
- దేవుడు అబ్రహాము యొక్క ఏకైక కుమారుడని, తాను ప్రేమించే కుమారుడిని సమర్పించమని సందర్భములో ఆయన దేవుడిని ప్రశ్నించలేదు, దేవుడితో ఎటువంటి వాదనకు దిగలేదు. ఆయన సంపూర్ణంగా దేవుడిని విశ్వసించి ఉన్నారు కాబట్టే మరొక ప్రశ్న ప్రభువుని అడగక వెంటనే దేవుని యొక్క మాట ప్రకారముగా జీవింప సాగారు. అబ్రహాముకు ఇస్సాకు విలువైనవాడు, చాలా ప్రేమను పెంచుకున్నాడు, తండ్రి కుమారుల బంధం బలముగా ఏర్పడిన సమయంలో ప్రభువు తన కుమారుడిని బలిగా సమర్పించమన్నప్పుడు ఆ తండ్రి యొక్క హృదయ వేదన ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి అయినప్పటికీ కేవలము దేవుడు అడిగారు అనేటటువంటి ఉద్దేశ్యంతో దేవుని కొరకు తన సమస్తమును, తన ఆశలు పెట్టుకున్నటువంటి కుమారుడిని కూడా సమర్పించుటకు వెనుకంజ వేయలేదు అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని పిలుస్తుంటారు. ఈ గొప్ప కార్యము ద్వారా దేవుడు అబ్రహాము అతని యొక్క సంతతిని ఇంకా అధికముగా దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు.
-ఈ యొక్క మొదటి పఠణంలో కేవలం అబ్రహాము యొక్క గొప్పతనమును మాత్రమే కాదు మనము ధ్యానించవలసినది మరియు ఇస్సాకు యొక్క ప్రేమ. తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఇస్సాకు ఆయన చేతులను బంధించినప్పటికీ ఎటువైపు పారిపోకుండా తనను తాను తండ్రికి సమర్పించుకున్నాడు ఇది ఆయన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. ఇస్సాకు కావలిస్తే ఆయన తండ్రి నుండి దూరంగా పారిపోవచ్చు కానీ అలా చేయకుండా తండ్రిని గౌరవిస్తూ ఆయన తనను తానే భలిగా అర్పించుట కొరకు సిద్ధమయ్యాడు. ఇస్సాకు బలి ఏసుప్రభు యొక్క కల్వరి బలికి సూచనగా ఉన్నది. ప్రభువు కూడా తనను తాను కల్వరి కొండ మీద మన నిమిత్తం తండ్రి నిమిత్తము సమర్పించుకుని ఉన్నారు.
- మోరియా పర్వతము మీద ఇస్సాకు బలిని దేవుడు మధ్యలో ఆపివేస్తూ ఈసాకుకు బదులుగా గొర్రె పిల్లను బలిగా అంగీకరించారు. 
- రెండవ పఠణములో ఏసుప్రభు తాను కల్వరి మీద సమర్పించిన బలిని గురించి పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. కల్వరి కొండ మన రక్షణను జ్ఞాపకం చేస్తుంది, మనకు పాప క్షమాపణను దయచేసిన పర్వతం రక్షకుడు మనందరి యొక్క నిమిత్తమై మరణించి మనకు స్వేచ్ఛను జీవమును ప్రసాదించి ఉన్నారు కాబట్టి మనం హృదయ పరివర్తనము చెంది ఆయనను విశ్వసిస్తూ ఆయన యొక్క చిత్తానుసారంగా జీవించాలి.
-ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు యొక్క దివ్యరూపధారణ గురించి చదువుకుంటున్నాము.యేసు ప్రభువు యొక్క పరలోక మహిమ భూలోకంలో ఉన్నటువంటి శిష్యులకు తెలియచేయబడిన సందర్భంలో శిష్యులు పరలోకము నుండి తండ్రి స్వరమును ఆలకించారు. ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతనిని ఆలకించండి. ఆలకించటం అనేది చాలా ప్రధానమైన కార్యం దేవుడు గురించి ఎక్కువగా తెలియాలంటే, దేవుడిని ఆరాధించాలన్న మనకు ఆలకించే మనసు ఉండాలి. పునీత పౌలు గారు అంటారు వినుటవలన విశ్వాసము కలుగును అని. కేవలం శ్రద్ధగా వినుట ద్వారానే మనలో విశ్వాసము పెంపొందించబడుతున్నది. వినుట ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అంటే ఏసుప్రభు యొక్క సమయములో మరియు తన తరువాత తన యొక్క శిష్యులు శుభవార్తను ప్రకటించిన సందర్భంలో వారి చేతులలో పవిత్ర గ్రంథము లేదు కేవలం ఏ అంశములు అయితే వారు యేసు ప్రభువు నుండి విన్నారో అదే విధముగా ప్రజలు శిష్యుల నుండి విన్నారో వాటిని విశ్వసించి ఉన్నారు. కాబట్టి మన అందరి యొక్క జీవితంలో మనము దేవుని యొక్క వాక్యమును ఏ విధముగా ఆలకిస్తూ ఉన్నాం. ఆయన వాక్కును మనము ప్రేమతో విన్నప్పుడే దానిని మన జీవితంలో ఆచరించగలం.
మనలో ప్రేమ ఉన్న సందర్భంలోనే ఎదుటి వ్యక్తి యొక్క మాటలను మనము వినగలుగుతూ  ఉంటాము. మన యొక్క రెండు చెవులను ఒకటిగా జత చేస్తే అవి ప్రేమ చిహ్నంగా మారుతాయి. దేవుని యొక్క వాక్యమును ప్రేమతో ఆలకించాలి,విశ్వాసముతో ఆలకించాలి, పూర్ణ హృదయముతో ఆలకించాలి. ఆ వాక్యము నా జీవిత యొక్క అభివృద్ధి కొరకే అనేటట్లుగా ఆలకించాలి. దేవుని యొక్క వాక్కును సహనముతో ఆలకించాలి అప్పుడే మన జీవితములో మార్పు అనేది వస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్కును ఆలకించి జీవించిన వారి యొక్క జీవితములు అభివృద్ధి చెందుతూ ఉన్నవి అదే దేవుని యొక్క వాక్కును నిరాకరించి జీవించిన వారి యొక్క జీవితములు శిక్షకు గురి అవుతూ ఉన్నవి ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఆయన వాక్కును ఆలకించుమని తెలియచేస్తున్నారు మరి ఏమిటి ఆయన యొక్క వాక్కులు?
1. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము
2. నీ శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయుము.
3. నీ తోటి వానితో సఖ్యపడు
4. అన్యాయం చేయకుండా న్యాయముతో జీవింపుము.
5. నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని అనుసరించవలెను.
6. వినయం కలిగి జీవించమని తెలుపుచున్నారు. ఇంకా అనేకమైన వాక్కులు ఉన్నవి.
ఆయన చెప్పిన విధంగా మనము జీవించినట్లయితే. మనందరం కూడా రూపాంతరం చెందుతాం కాబట్టి ఆయన వాక్కు ఆలకించి అని ప్రకారంగా జీవించుదాం.
Fr. Bala Yesu OCD

17, ఫిబ్రవరి 2024, శనివారం

తపస్సు కాల మొదటి ఆదివారం

తపస్సు కాల మొదటి ఆదివారం
ఆది 9:8-15, 1పేతురు 3:18-22, మార్కు1:12-15
ఈ తపస్సు కాల మొదటి ఆదివారం మనందరికీ, దేవుడు నోవాతో ఏర్పరచుకున్న ఒడంబడికను గురించి మరియు ఏసుప్రభు ఎడారిలో శోధింపబడుటను తెలుపుచున్నది.
ఈనాటి మొదటి పఠణములో దేవుడు నోవాతో ఏర్పరచుకున్న ఒడంబడిక గురించి తెలుపుతూ ఉన్నది. ఈ తపస్సు కాల మొదటి మూడు ఆదివారాలు దేవుడు మానవులతో ఏర్పరచుకున్న మూడు ఒడంబడికలను గురించి తెలుపుచున్నవి. దేవుడు మొదటిగా నోవాతో, రెండవదిగా అబ్రహాముతో,  మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడికను ఏర్పరచుకున్నారు. ఈనాటి మొదటి పఠణములో దేవుడు నీటి ద్వారా నోవాను రక్షించిన విధానమును తెలుసుకుంటున్నాము. 
1. భూమి మీద ఉన్న ప్రజలు పరమదృష్టిలై పాపములో జీవించారు. దేవునితో సంబంధం లేకుండా పాపమును ప్రేమిస్తూ, విచ్చలవిడిగా జీవించటం ప్రారంభించారు. (ఆది 6:5-12) దేవున్ని ధిక్కరిస్తూ వచ్చారు, కాల క్రమేనా ప్రపంచంలో పాపము ఎక్కువైనది, ఈసందర్భంలో దేవుడు మరియొకసారి నోవా కుటుంబం ద్వారా ఈ సృష్టిని నూత్నీకరించారు.
 దేవుడు సృష్టిని మొత్తము నాశనము చేయలేదు ఎందుకంటే నోవా కుటుంబం మరియు దేవుడు నోవాతో తన ఓడలోకి చేర్చబడిన జంతువులు పక్షులు కూడా ఆ జలప్రళయం నుండి రక్షించబడినవి. భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు మరియొకసారి దేవునితో కొత్త జీవితం జీవించుటకు నోవా కుటుంబం రక్షిస్తున్నారు. ఈ జలప్రళయము దేవుడు శిక్షగా వచ్చినది ఏదో ఒక్కసారి తప్పు చేసినందుకు కాదు కానీ వారు ప్రతిసారి కూడా చెడు పనులు చేయాలని ఆశతో ఉన్నారు. దేవుడంటే విశ్వాసము, భయము లేకుండా జీవించే సందర్భంలో పరిపూర్ణంగా వారు దేవుని మార్గము నుండి వైదొలిగినప్పుడు మాత్రమే దేవుడు వారిని శిక్షించారు.
2.ప్రభువు వారి పాపములను శిక్షించినప్పటికీ వారి యెడల దయ, కనికరము కలవారని మనం గుర్తించాలి. వాస్తవానికి ఏ వ్యక్తియు పాపములో మరణించుట దేవునికి ఇష్టము లేదు.(2 పేతురు 3:9) కాబట్టి దేవుడు వారి యొక్క హృదయ పరివర్తనం కోసం ఎంతగా ప్రయత్నించి ఉండి ఉంటారని మనము ఆలోచించాలి. దేవుడు అప్పటినుండి ఇప్పటివరకు కూడా ఏదియు మొత్తము(completely) నాశనం చేయలేదు. ఎందుకంటే ఆయన నోవాతో చేసుకున్నటువంటి ఒడంబడిక అటువంటిది. నోవా ఒడంబడిక ద్వారా దేవుడు ఈ భూమిని, భూమి మీద ఉన్న ప్రాణికోటిని రక్షిస్తారు దానిని ఇక ఎన్నటికీ నాశనం చేయరని తెలుపుచున్నారు
3.చరిత్రలో చాలా సందర్భాలలో అంటూ వ్యాధులు వచ్చాయని మనము చదువుకున్నాం 2020లో కూడా కరోనా వచ్చింది కానీ ఆ సమయములో ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోలేదు కొంతమంది తమ యొక్క ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఏ వ్యాధులు వచ్చినా గాని అది ఈ ప్రపంచం అంతంమెందించే లాగా ఉండుటలేదు. కొంత నష్టం మాత్రమే జరుగుతుంది. అది కేవలము దేవుడు నోవా కు ఇచ్చిన వాగ్దానమునకు నిదర్శనం.
దేవుడు ఏ విధంగానైతే జల ప్రళయం నుండి నోవా కుటుంబమును జంతువులను రక్షించి ఉన్నారు అదే విధముగా మనందరినీ కూడా జ్ఞాన స్నానం అనే నీటి ద్వారా రక్షిస్తున్నారు. ఈరోజు దేవుడు మనల్ని మన కుటుంబమును ఒక నూతన సృష్టిగా చేయబోతున్నారు కాబట్టి మనము ఆయనకు విధేయులై నోవావలే విశ్వాస పాత్రులుగా జీవించాలి. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పేతురు గారు ఏసుప్రభు తన యొక్క సిలువ శ్రమల, మరణ, పునరుత్థానము  ద్వారా మనలను రక్షించినారు అని తెలుపుచున్నారు. దేవుడు జ్ఞాన స్నానంతో ప్రతి ఒక్కరితో ఒడంబడికను ఏసుప్రభు ద్వారా చేశారు. జ్ఞాన స్నానము మనలను జన్మ పాపము నుండి కాక మనము క్రీస్తునందు జన్మించేలాగా చేస్తూ ఉన్నది. జ్ఞాన స్నానము మనందరినీ రక్షిస్తూ ఉన్నది.
ఈనాటి సువిశేష భాగములో యేసు ప్రభువు  పొందిన శోధనల గురించి తెలియజేయబడుతున్నది. ఇక్కడ ఐదు అంశాలు మనము గుర్తుపెట్టుకోవాలి
1. పవిత్ర ఆత్మ యేసు ప్రభువుని ఎడారికి తీసుకొని పోయారు.
2. 40 రోజులు ఎడారిలో ఉంటూ  ఉపవాసం చేశారు.
3. ఆయన  మృగముల మధ్య నలభై రోజులు ఉన్నారు
4. సైతాను ఏసుప్రభువును శోధించినది.
5. దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు.
ఈ ఐదు అంశాలలో ముఖ్యమైనవి; ఏసుప్రభు శోధింపబడుట మరియు శోధనలను జయించుట.
ప్రతి ఒక్కరి జీవితంలో శోధనలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే సైతాను యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే మనం దేవుడిని మరిచిపోయేలాగా చేయడం అలాగే దేవునికి అవిధేయత చూపించేలాగా చేయుట అందుకనే ప్రతిసారి కూడా మనలను శోధిస్తూ ఉన్నది. ఏసుప్రభువును కూడా ఎడారిలో శోధించినది ఎందుకంటే ఆయన కూడా తండ్రి చిత్తమును విడిచి పెట్టేసి తన స్వార్థం కోసం జీవిస్తాడేమో అని సైతాను శోధించినది మరియు ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో శోధించినప్పుడు వారు ఏ విధంగానైతే మానవ బలహీనత వలన పడిపోయారో అదే విధముగా ఏసుప్రభువు కూడా మానవ దైవ స్వభావములో ఉన్నప్పుడు పడిపోతాడు అనే ఉద్దేశంతో సైతాను ప్రభువును శోధించినది. మార్కు సువార్తికుడు ఏ విధమైనటువంటి శోధనలు ఏసుప్రభుకి కలిగాయి అని స్పష్టముగా తెలియ చెప్పలేదు కానీ ఆయన శోధించబడ్డారు అని తెలిపారు. మత్తయి మరియు లూకా సువార్తికులు యేసు ప్రభువుని సైతాను మూడు అంశములమీద శోధించినది అని తెలుపుచున్నారు. మార్కు సువార్తలో ఏసుప్రభు శోధించబడ్డారు అని మాత్రమే తెలిపారు ఎందుకంటే శోధనలు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి అది ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి భిన్నముగా ఉంటాయి అని తెలియజేయుటకే ఏ విధమైన శోధన అని మార్కు సువార్తికుడు చెప్పలేదు. కాబట్టి మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మనము దేవుని యొక్క శక్తితో ముందుకు సాగి శోధనలను జయించాలి అప్పుడే మనకు దేవుడు తన యొక్క అనుగ్రహాలను ఒసుగుతారు. చాలా సందర్భాలలో సైతాను మనలను శోధించినప్పుడు మనము పడిపోతాము సైతాను వివిధ రకాలుగా మనలను శోధిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ సమయంలో ఎవరిని ఎక్కడ శోధించాలో సైతాన్ కి బాగా తెలుసు కాబట్టి మనము ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏసుప్రభు ఏ విధంగానైతే ప్రార్ధన జీవితము ద్వారా శోధనలు జయించారో మనము కూడా దేవుని శక్తితో శోధనలు జయించాలి. శోధనలు జయించినప్పుడు దేవుడు మనతో ఒక ఒడంబడికను ఏర్పరచుకుంటారు అలాగే మనలను ఆశీర్వదిస్తాను. ఈ ఒడంబడిక ద్వారా దేవుడు మనలను నూతన సృష్టిగా చేస్తున్నారు. కాబట్టి శోధనలను జయించుటకు దేవుని యొక్క సహాయం కోరుతూ ప్రార్థిద్దాం.
Fr. Bala Yesu OCD

3, ఫిబ్రవరి 2024, శనివారం

సామాన్య కాలం 5వ ఆదివారం


యోబు 7:1-4, 6-7
1కొరింతి 9:16-19
మార్కు 1: 29-39
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మానవ జీవితంలో కష్టాలు, బాధలు ఎదురైన సమయంలో జీవితంలో ఆశలు కోల్పోకుండా ధైర్యంతో ముందుకు సాగాలి అదేవిధంగా దేవునియందు నమ్మకముంచాలి అని తెలుపుచున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సర్వసాధారణం కావున మనకే ఎందుకు కష్టాలు వచ్చాయి అనే ఆలోచనలతో జీవించకుండా ఏసుప్రభువు వలె కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. 
చాలా సందర్భాల్లో మనందరం ప్రతిసారి మనము అనుభవించిన కష్ట,బాధ,శ్రమల గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ వాటన్నిటికన్నా ప్రతి కష్టము తరువాత దేవుని ఆశీర్వాదం ఉంటుంది అని గ్రహించాలి.
ఈనాటి మొదటి పఠణము యోబు గ్రంథము నుండి చదవబడినది. యోబు గ్రంథం ఆనాటి కొంతమంది యొక్క ఆలోచనలను సరి చేసే విధంగా వ్రాయబడినది. అప్పటి కొందరి ఆలోచన ఏమిటి అంటే దేవుడు మంచివారిని దీవిస్తారని, పాపులను క్షమిస్తారని అభిప్రాయం. ఆ అభిప్రాయమున ఖండిస్తూ యోబు గ్రంథములో దేవుడు అందరూ ఎడల ఒకే విధముగా మెలుగుతారు అని తెలుపుచున్నారు. వాస్తవానికి మంచివారే ఎక్కువగా కష్టాలు అనుభవిస్తారు అని ప్రభువు యోబు గ్రంథం ద్వారా తెలుపుతున్నారు. 
యోబు నీతిమంతుడుగా జీవిస్తూ, ఆస్తి ఐశ్వర్యములను కలిగి ఉన్న సమయంలో సైతాను దేవునితో సంభాషించినప్పుడు యోబు మిమ్మల్ని (యావే దేవుని) ఆరాధించేది కేవలం మీరిచ్చిన సంపదలవలనే అని ప్రభువుతో తెలిపినప్పుడు ప్రభువుక సంపదలు ఉన్నా లేకపోయినా నా ఎడల యోబు విశ్వాసపాత్రుడుగా ఉంటారు అని తెలిపినప్పుడు సైతాను యోబును పరీక్షించుటకు సిద్ధమైంది దానికి ప్రభువు కూడా సమ్మతించారు. 
ప్రతి ఒక్కరి విశ్వాసము కూడా పరీక్షించబడాలి అప్పుడే నిజమైన విశ్వాసము అనేది బయటకు వస్తుంది.1 పేతురు 1:7
ఈనాటి మొదటి పఠణం ద్వారా మనము కొన్ని అంశాలు నేర్చుకోవాలి
1. మంచివారికి కష్టాలు వస్తాయి. చాలా సందర్భాలలో మన యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి చెడ్డవారికి కష్టాలు మంచివారికి ఆశీర్వాదాలు దొరుకుతాయని అందరి అభిప్రాయం కానీ మనం సమాజంలో చూసేది ఏమిటంటే మంచివారు కష్టాలను అనుభవిస్తారు, చెడువారి సంతోషంగా ఉంటాయి. మనము పవిత్ర గ్రంథములో చూసుకున్నట్లయితే ఎవరైతే దేవునికి దగ్గరగా ఉండి జీవించారో వారే ఎక్కువ కష్టాలు అనుభవించారు. పవిత్ర గ్రంధములో అబ్రహాము,
ఏసేపు, ఇర్మియా ప్రవక్త, మరియమ్మ- యేసేపు, పౌలు గారు  అదేవిధంగా అపోస్తులు, ఇంకా అనేకులు కష్టాలు అనుభవించారు వీరందరూ దేవుడికి దగ్గరగా ఉన్నప్పటికీ, మంచి జీవితం జీవించినప్పటికిని కష్టాలు అనుభవించారు. వీటి యొక్క అర్థం ఏమిటి అంటే మంచి వారికి కష్టాలు వస్తునే ఉంటాయి అది ఎందుకంటే వారు ఇంకా వారి విశ్వాస జీవితంలో దేవునికి దగ్గర అయి ఉండాలి అని మరియు వారి విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండుటకై. మనము కష్టాలు అనుభవిస్తున్నామంటే మనల్ని దేవుడు బాగా గుర్తుపెట్టుకుంటున్నారని అర్థం. ఏ వ్యక్తిని కూడా తన యొక్క శక్తిని మించి సైతాను శోధింపడు.
1కొరింతి 10:13
2, యోబు తన కష్టములలో ఆయన స్థిరముగా, ధైర్యంగా ఉన్నారు. తన జీవితంలో అన్నీ ఉన్నవి ఆస్తిపాస్తులు, స్నేహితులు, కుటుంబము, పిల్లలు అందరు కూడా ఉన్నారు కానీ సైతాను శోధన వలన ఆయన అన్నీ కోల్పోయాడు చివరికి తన యొక్క జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేనటువంటి ఒక పరిస్థితి ఎదురయింది ఆయన శరీరమంతా వ్రణములతో నిండి ఉన్నది. ఆయన శారీరకంగా మానసికంగా కృంగిపోయాడు. పనివాడు ఏ విధముగానయితే బ్రతుకుట కోసం కష్టపడి పనిచేస్తుంటాడో తాను కూడా బ్రతుకుట కొరకు శ్రమలు అనుభవిస్తున్నాను అని తెలుపుతున్నారు.  అన్ని కష్టాలనుభవించినప్పటికీ  కూడా తన జీవితాన్ని తాను నాశనం చేసుకోవాలని కోరుకోలేదు ఆయన అన్ని పరిస్థితులను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నాడు. యోబు యొక్క స్థిరత్వం మనందరం కూడా కలిగి ఉండాలి ఆయనకన్నా మనకి ఎక్కువ కష్టాలు ఏమి వచ్చి ఉండవు కాబట్టి అన్నిటినీ ధైర్యముగా ఎదుర్కోవాలి. యోబు నిరాశలో దేవుని యొక్క సమాధానము కొరకు, ఆశీర్వాదం కొరకు ఎదురుచూస్తూ ఆయన్ని నమ్ముకుని ఉన్నాడు.

3. యోబు తన కష్ట జీవితంలో దేవుడి వైపు మరలుతున్నాడు. ఎవరైతే తనని ఉన్నత స్థితికి చేర్చారు ఆయన వైపే మరొకసారి యోబు తిరుగుచున్నాడు. ఆయన ఎన్నడూ దేవుడిని విడిచిపెట్టలేదు. మనము మాత్రం మన కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి కూడా రాము ఆయనకి ప్రార్థన కూడా చేయము.
4. మన సొంత వారే మనల్ని అర్థం చేసుకోకపోవడం. యోబు యొక్క స్నేహితులు తాను ఉన్నటువంటి స్థితిలో తనను ఓదార్చుటకు బదులుగా ఆయన యొక్క తప్పిదమును వేలెత్తి చూపుచున్నారు. ఆయన దేవుని పాపం చేసాడు కాబట్టే ఇంతటి శిక్ష వచ్చినది అని వారందరూ కూడా తలంచారు. కొన్ని కొన్ని సందర్భాలలో మన స్నేహితులే, సొంతవారే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు కానీ దేవుడు ఎల్లప్పుడూ మనల్ని అర్థం చేసుకుంటాడు.
యోబు తన విశ్వాస జీవితంలో దేవుడిని నమ్ముకొని ఆయన మీద ఆధారపడ్డారు కాబట్టి  ఆయనను ఇంకా అధికముగా ఆశీర్వదించారు కాబట్టి మానవ జీవితం కష్టాలతో వున్నప్పటికిని మనం దేవుడిని అంటిపెట్టుకొని ఉంటే దేవుడు మనలని చివరికి ఆశీర్వదిస్తూనే ఉంటారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తాను అందరి కొరకై సేవకుడిగా చేయబడ్డారు అని తెలుపుచున్నారు. దేవుడు తనకు అప్పచెప్పినటువంటి సువార్త ప్రకటన గురించి పౌలు తెలుపుచున్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించుట కొరకై ఆయన అందరి కొరకు అందరివాడే సువార్త సేవ చేసి ఉన్నారు. 
ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు తన యొక్క ముఖ్యమైనటువంటి పరిచర్య గురించి తెలుపుతున్నారు. ప్రభువు ఈ లోకంలో రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు అదేవిధంగా తండ్రి  యొక్క సువార్త ప్రకటించుటకు వచ్చి ఉన్నారని తెలిపారు. ఏసుప్రభు తాను ఈ లోకమునకు వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చుటలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో దేవుడు మనకు ఒసిగినటువంటి పనిని నెరవేర్చుటలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండాలి.
ఈనాటి పఠణముల ద్వారా మనము గ్రహించవలసిన అంశము ఏమిటి అంటే మన విశ్వాస జీవితం లో ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ ధైర్యంతో మనం ముందుకు సాగాలి. దేవుడిని అంటిపెట్టుకొని జీవించాలి అదేవిధంగా మన యొక్క పనిని సక్రమంగా నెరవేర్చాలి.
Fr. Bala Yesu OCD

27, జనవరి 2024, శనివారం

4వ సామాన్య ఆదివారం


ద్వితీయో 18:15-20
1కొరింతి 7:32-35
మార్కు1:21-28
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క సేవకుల యొక్క అధికారం వారి యొక్క బాధ్యతల గురించి తెలియజేస్తున్నాయి. సేవకులు యొక్క అధికారము అంతయు కూడా దేవుని దగ్గర నుండి వచ్చినది. వారిని ఎన్నుకునే సందర్భంలోనే దేవుడు వారికి సంపూర్ణ అధికారం ఇస్తున్నారు.
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త ఆయన మరణము గురించి తెలియజేసినప్పుడు  వారు మేము ఒక గొప్ప నాయకుడిని కోల్పోతున్నాము అనేటటువంటి భయములో ఉన్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలకు ఊరటనిచ్చుటకు  ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసేటటువంటి మాట ఏమిటంటే తనలాంటి ప్రవక్తని ప్రజల మధ్యకు దేవుడు పంపిస్తానని తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా మనందరం కూడా ఎవరు ప్రవక్త అని తెలుచుకోవాలి. 
ప్రవక్త అనగా దేవుని స్వరము, దేవుని మార్గములను బోధించేవాడు, దేవునికి మానవునికి మధ్య వారధిగా నిలబడే వ్యక్తి , పరలోక సత్యమును బోధించే వ్యక్తి, అన్యాయమును ఎదిరించే వ్యక్తి, అందుకనే ఈనాటి మొదటి పఠణంలో ప్రభువు ఇస్రాయేలు ప్రజలకు మోషే ప్రవక్త వంటి వాడిని పంపిస్తామంటున్నారు. మరి మోషే ఎలాంటి ప్రవక్త? ఆయన కూడా ప్రజల నుండి వచ్చినవాడే, ఆయన కూడా బలహీనుడే ,అయినప్పటికీ  దేవునికి అతి సమీపమున జీవించి ఉన్నారు. మోషే ప్రవక్త దేవుని యొక్క పిలుపుని అందుకున్న తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను నడిపించుటకు ఆయన ఒక నాయకుడిగా అదే విధముగా ఒక మార్గం చూపరీగా నిలిచి ఉన్నారు దేవుని యొక్క పరమ రహస్యములను ప్రజలకు బోధిస్తూ జీవించారు. అలాగే ప్రతి ఒక్క ప్రవక్త కూడా మోషే ప్రవక్త వలే మార్గ చూపరిగా ఉంటూ ప్రజలను దేవుని వైపు నడిపించాలి. ఆయన తన జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన రెండు ప్రధానమైన అంశములు ఏమిటి అంటే తాను ఎల్లప్పుడూ దేవుడికి దగ్గర అయి ఉండాలి అదేవిధంగా తాను దేవుడి యొక్క మాటను మాత్రమే బోధించాలి. తన సొంత ప్రణాళికలు కానీ తన సొంత ఆలోచన గానీ తెలియజేయకూడదు కేవలము దేవుడు చెప్పవలసినది మాత్రమే మనము తెలియజేయాలి అది ప్రవక్త యొక్క ముఖ్యమైన బాధ్యత. అలా వారు చేయకపోతే దేవుని యొక్క శిక్ష కూడా వస్తుంది.
మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు కూడా తెలియజేసే అంశము ఏమిటి అంటే వారు ఆ ప్రవక్త యొక్క మాటను వినాలి.
 ఆ ప్రవక్త యొక్క మాట సంపూర్ణంగా దేవుని యొక్క మాట కాబట్టి దానిని తమ యొక్క జీవితములో ఆచరించి జీవించాలి అది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత మరి ఈనాడు ఎంతమంది దేవుని సేవకులు యొక్క మాటను వారి హెచ్చరికలను ఆలకించి విధేయత చూపుతున్నామా?
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు సమర్పణ జీవితం గురించి తెలియజేస్తున్నారు. వివాహ జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలు వారికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ లేనందున దేవునికి తముతాము పూర్తిగా సమర్పించుకోలేరు కానీ ఎవరైతే పౌలు గారి వలే సమస్తమును కూడా దేవునికి త్యాగం చేసి జీవిస్తున్నారో వారందరూ  తమయొక్క జీవితమును తాము దేవునికి సమర్పించుకొని జీవిస్తారు.
ఈనాటి సువిశేష  పఠణంలో ఏసుప్రభు యొక్క అధికారం గురించి తెలియజేయబడుతుంది ఆయన బోధన అధికారంతో కూడుకున్నటువంటిది. ఏసుప్రభువు యొక్క బోధనలో ఎటువంటి సందేహాలు లేవు ఆయన సమస్తము మీద అధికారం కలిగినటువంటి దేవుడు కాబట్టి తన తండ్రి చిత్తమును సంపూర్ణంగా ఎరిగి ఎటువంటి భయము లేకుండా ఒక మధ్యవర్తిగా తన తండ్రి సందేశములను ప్రజలకు తెలియజేశారు. ఏసుప్రభు యొక్క అధికారము తన తండ్రి నుండి వచ్చినది సృష్టికి పూర్వం నుండి తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారుడు ఈ యొక్క అధికారం ను కలిగి ఉన్నారు ఆయన అధికారము మంచి కొరకు మాత్రమే ఆయన అధికారము సేవ కొరకు మాత్రమే ఆయన అధికారం వినయముతో కూడుకున్నది కాబట్టి ఈరోజు మనము కూడా ధ్యానించవలసిన అంశం ఏమిటి అంటే దేవుడు మనకు ఇచ్చిన అధికారం ఒక యజమానుడిగా నాయకుడిగా ఇచ్చిన అధికారమును మనము సద్వినియోగపరచుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...