7, ఆగస్టు 2024, బుధవారం

యిర్మీయా 31:31-34 మత్తయి 16:13-23

యిర్మీయా 31:31-34 మత్తయి 16:13-23 (8 ఆగస్టు  2024)

తరువాత యేసు ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చెను. "ప్రజలు మనుష్యకుమారుడు ఎవ్వరని భావించుచున్నారు?" అని తన  శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు "కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు" అనిరి. "మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు?" అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిచ్చెను. "యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోకరాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోకమందును బంధింపబడును; భూలోకమందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోకమందును విప్పబడును." ఇట్లు చెప్పి, తాను  క్రీస్తునని ఎవ్వరితోను చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటినుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలవలన , ప్రధానార్చకులవలన , ధర్మ శాస్త్ర బోధకులవలన పెక్కుబాధలను అనుభవించి, మరణించి మూడవదినమున పునరుత్తానుడగుట అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, "ప్రభూ ! దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక! ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక !" అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో "ఓ సైతాను! నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగానున్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధిచినవే, కాని  దేవునికి సంబంధిచినవికావు" అనెను

క్రిస్తునాధుని ప్రియ మిత్రులారా, ఈనాటి మొదటి పఠనంలో దేవుడు తన ప్రజలతో  ఒక నూతన నిబంధము చేసుకొనడానికి సిద్ధంగా ఉన్నాడని అదే విధంగా ఆ నిబంధన  తాను మన పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తునుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు  చేసుకొనిన నిబంధన వంటిది కాదు అని తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే 'నేను మీ దేవుడనైన ప్రభువును-మీరు నా ప్రజలు' నేను మీ కాపరిని మీరు నా మంద అని ప్రభువు మన పితరులతో నిబంధన చేసుకున్నాడు. మరి ఎందుకు దేవుడు మరల ఒక నూతన నిబంధనము మనతో చేసుకోవాలి అనుకుంటున్నాడు అంటే, మన పితరులు, పూర్వికులు  ప్రభువును ఆయన చేసిన గొప్ప అద్భుతకార్యాలను  తమ కన్నులార చూచి అనుభవించి కూడా ప్రభుని యొక్క నిబంధనను మీరారు. అన్యదైవములను కొలిచి తమ జీవితాలలో అనేక తప్పులు చేసుకుంటూ దేవుణ్ణి విడనాడి పాపము చేస్తూ పాప మార్గములలో ప్రయాణించారు. దేవుని యొక్క ఆజ్ఞలను ధర్మశాస్త్రమును విడనాడారు. తమ నాశనమును తామే కొనితెచ్చుకున్నారు. 

మరి నూతన నిబంధన ఏమిటి అంటే మనము కూడా మన పూర్వికులలాగా, మన పితరుల వలె దేవుణ్ణి దైవ శాస్త్రాన్ని ఆయన చేసిన నిబంధనను మర్చిపోయి జీవిస్తున్నామా?  దేవుడు చెప్పినట్లుగా దైవ ప్రజలలాగా మంచి పనులు చేయలేకపోతున్నాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వలేక పోతున్నాం. అందుకే దేవుడు మనందరితో నూతన నిబంధన చేస్తున్నాడు. అది ఏమిటంటే "నేను నా ధర్మ శాస్త్రాన్ని వారి అంతరంగమున ఉంచుదును. వారి హృదయాలపై లిఖింతును. అల్పులు అధికులెల్లరు నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములను మన్నింతును దానినిక జ్ఞప్తియందు ఉంచుకొనను అని దేవుడు అంటున్నాడు. మరి మనము దేవుని ధర్మ శాస్త్రాన్ని మన హృదయాలలో పదిల పరుచుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ, దైవ ప్రజలుగా జీవించాలి. జీవించడానికి ప్రయత్నించాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఈ విధంగా అడుగుతున్నారు. నేను ఎవరినని మీరు భావించుచున్నారు? అప్పుడు పేతురు యేసు ప్రభువుతో " నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిస్తున్నాడు. ఈ విషయమును పేతురుకు  బయలు పరిచినది, పరలోకమందున్న తండ్రి దేవుడు. ప్రియ మిత్రులారా అదే ప్రశ్న దేవుడు ఈనాడు మనలను అడుగుతున్నాడు. మన సమాధానము ఏమిటి ? యేసు క్రీస్తుని గురించి నీ అనుభవం ఏమిటి? మనం క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నాము ? చాలా మంది పునీతులు క్రీస్తును, ఆయన కార్యములను చూసి కొంతమంది నా తండ్రి అని, కొందరు నా రక్షకుడు అని , కొందరు నా కాపరి అని  ఎన్నో భావాలు చెబుతుంటారు. క్రీస్తుని యెడల నీ భావం ఏమిటి? నీ అనుభవం ఏమిటి? నీ ఉద్దేశ్యం ఏమిటి? నేను నేను నిజంగా క్రీస్తుని అనుభవిస్తున్నానా ? లేదా? ఆత్మా పరిశీలన చేసుకుందాం. దేవున్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన : ప్రభువైన దేవా! మేము మిమ్ము మా ప్రభుడవని గుర్తించుకొని మీ  ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ-మీతో మేము చేసుకొనిన నిబంధమును ఎల్లవేళలా గుర్తించుకొని మీ  ప్రజలలాగా జీవించడానికి, మిమ్ము  తెలుసుకోవడానికి అదేవిధంగా మీ  ధర్మ శాస్త్రాన్ని మా హృదయాలలో పదిల పరుచుకోవడానికి మాకు మీ కృప వరములను దయచేయండి. తద్వారా మేము మిమ్ము తెలుసుకొని, ప్రేమించి సేవించుదుము. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

6, ఆగస్టు 2024, మంగళవారం

యిర్మీయా 31:1-7 మత్తయి 15:21-18

 యిర్మీయా 31:1-7 మత్తయి 15:21-18  (7ఆగస్టు 2024)

యేసు అటనుండి  తూరు , సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్లెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతె ఆయన వద్దకు వచ్చి, "ప్రభూ! దావీదుకుమారా! నాపై దయచూపుము. నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపచుచున్నది" అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్కమాటైనను మాట్లాడలేదు. అపుడు ఆయన శిష్యులు సమీపించి "ఈమె మన  వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు"  అనిరి. "నేను యిస్రాయేలు వంశమున చెదిరిపోయిన గొఱ్ఱెలకొరకు మాత్రమే పంపబడితిని" అని ఆయన సమాధానము ఇచ్చెను. అపుడు ఆమె వచ్చి, ఆయన పాదములపై పడి "ప్రభూ! నాకు సాయపడుము"అని ప్రార్ధించెను. "బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు" అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభూ! కాని తమ యజమానుని భోజనపుబల్ల నుని క్రింద పడిన రొట్టెముక్కలను కుక్క పిల్లలును తినునుగదా!" అని బదులు పలికెను. యేసు ఇది విని "అమ్మా!నీ విశ్వాసము మెచ్చదగినది. ఈ కోరిక నెరవేరునుగాక!" అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. 

ప్రియమైన దైవ ప్రజలారా ఈనాటి పఠనాలలో ప్రభువైన దేవుడు నేను మీ అందరికి దేవుడును, నేను మిమ్ము కరుణింతును. నేను మీకు దర్శనమిచ్చితిని. నేను మిమ్ము శాశ్వతమైన, నిత్యప్రేమతో  ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. మిత్రులారా దేవుడు చెప్పే ఈ మాటలకు మనము ఏమి చేయాలి అంటే మనము మన దేవుడైన ప్రభుని చెంతకు రావాలి. ప్రభువు చెంతకు వచ్చి ఏమి చెయ్యాలి? అంటే దేవుని గొప్ప కార్యములను  ఆయన చేసిన మేలులను గుర్తించి మనలను రక్షించినందుకు ధన్యవాదములు చెల్లించి, స్తుతిగానము చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియవిశ్వాసులారా నీవు నేను మన దేవుణ్ణి మన దేవునిగా అంగీకరిస్తున్నామా? లేదా లోకంలోని వ్యక్తులను , పదవులను డబ్బును సంపదను లేదా మన కోరికలను అనుసరించి దేవుని మర్చి పోతున్నామా? అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము  ప్రార్ధిస్తామో ప్రభువు కరుణామయుడు కనుక మనలను ఖచ్చితముగా కరుణిస్తాడు. మనము పవిత్ర గ్రంధంలో చూస్తే, మమ్ము కరుణించు అడిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కరుణించాడు. ఆయన కరుణకు హద్దులు లేవు. ఓక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లుగా దేవుడు మనలను తన శాశ్వతమైన నిత్యా ప్రేమతో ఎల్లప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. మరి మనము దేవుని శాశ్వత ప్రేమను అర్ధం చేసుకుంటున్నామా! దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నామా? లేదా ఈ లోక సంపదలను ఈ లోక వస్తువులను, ఈ లోక పదవులను ఈ లోక ఆకర్షణలు ప్రేమిస్తున్నామా ఆలోచించండి. 

ఈనాడు సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువును  ఒక తల్లి తన బిడ్డను రక్షించండి అని వచ్చినప్పుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షించారు. తల్లి తన బిడ్డకై పడిన వేదనను కష్టాన్ని విశ్వాసాన్ని చూసి అద్భుత కార్యం చేసున్నాడు. కననీయ స్త్రీలో ఉన్నా విశ్వాసం మనము కూడా కలిగి ఉండాలి. ఆమె వలే మనము దేవుణ్ణి పిలవాలి. ఆమె దావీదు కుమారా యేసయ్య నన్ను కరుణింపుము అని ప్రార్ధించింది. మరి  మనము ఆ తల్లి వలె మన మన తల్లి దండ్రుల కోసం, బిడ్డల కోసం మన కుటుంబం కోసం మన  సంఘం కోసం ప్రార్ధన చేస్తున్నామా లేదా? కొన్ని సార్లు దేవుడు కుడా  మన వేడుకోలు పట్టించుకోవడం లేదు అని చాలా మంది ప్రార్ధన చేయడం, దేవాలయానికి వెళ్లడం మానివేస్తారు, ఈనాటి సువిశేషం ద్వారా మానమ్  గ్రహించవలసినది ఏమిటంటే మనం విశ్వాసం కోల్పోకుండా నమ్మకంతో, దేవా మమ్ము కరుణించును అని మనం    ప్రార్ధన చేస్తే  దేవుడు  ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యలు మన జీవితంలో తప్పకుండ చేస్తాడు. మరి మనము ఏమి చేయాలంటే  దేవుడ్ని చెంతకు రావాలి, ప్రార్ధించాలి. అలాగే ఆయన చేసిన మేలులకు స్తుతిగానం చెయ్యాలి. 

ప్రార్ధన: ప్రేమమయుడవైన దేవా నీ ప్రేమ శాశ్వతమైనది. నీ కరుణ ఎల్లలు లేనిది. మేము నీ శాశ్వతమైన ప్రేమను తెలుసుకూన్ నీ ప్రేమను అనుభవించి నీ కరుణను పొంది నీ ప్రేమలో జీఇవస్తు నీ దయను పొందుతు, నిన్ను స్తుతిస్తూ ఆరాధించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ . 

ఫా . సురేష్ కొలకలూరి OCD

3, ఆగస్టు 2024, శనివారం

18 వ ఆదివారం

 18 వ ఆదివారం 

నిర్గమ ఖాండం 16:2-4,12-15 ఎఫెసి 4:17,20-24  యోహాను 6: 24-35

అక్కడ యేసుగాని , శిష్యులు గాని లేకుండుటచూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫ ర్నామునకు పోయిరి.  ప్రజలు సరస్సు  ఆవలివైపున యేసును కనుగొని  "బోధకుడా!  మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని  మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత  భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన  తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు  ముద్రను వేసియున్నాడు"  అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది"  అని చెప్పెను. అంతట "నిన్ను   విశ్వసించుటకు మాకు ఎట్టిగురుతు నిచ్చెదవు? ఏ క్రియలు చేసెదవు?" అని వారు మరల ప్రశ్నించిరి. "వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను. అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను" అని వారు ఆయనతో చెప్పిరి. "పరలోకమునుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషేకాదు. కాని, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను"  అని యేసు వారితో అనెను. "అయ్యా ! ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము" అని వారు అడిగిరి. అందుకు యేసు "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు  ఎన్నడును దప్పికగొనడు" 

ఈనాడు దేవుడు మనకు ఇచ్చే సందేశం. 

మొదటి పఠనం : దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరీక్షిస్తున్నాడు. 

రెండవ పఠనంలో మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొని క్రీస్తునందు నూతన  జీవితాన్ని ప్రారంభించండి. 

సువిశేష పఠనం: దేవుడు తనను వెదుకుతూ వచ్చిన ప్రజలకు అశాశ్వతమైన  భోజనముకై శ్రమింపుడు అంటు నేనే జీవము గల ఆహారాన్ని అని  తెలియజేశాడు. 

ప్రియా విశ్వాసులారా మొదటి పఠనములో ఇశ్రాయేలు ప్రజలు మోషే మరియు అహరోనులు మీద నేరము మోపుతున్నారు. ఎందుకు అంటే వారు మోషేతో మేము ఐగుప్తులో చచ్చిన బాగుండేది. అక్కడ మేము మాంసమును , రొట్టెను కడుపారా భుజించితిమి. ఇప్పుడు మేమందరం ఈ ఎడారిలో ఆకలితో మలమల మాడి చంపబడడానికి మీరిద్దరు మమ్ము ఇక్కడకు తీసుకొని వచ్చారా అని దూషించారు. యిస్రాయేలు ప్రజలు, శరీరానికి దాని అవసరాలకు లొంగిపోయి, వారు పొందిన స్వతంత్రాన్ని, బానిసత్వము నుండి  రక్షణను, విడుదలను మర్చిపోయిదైవసేవకులను  దూషించారు. కాని  దేవుడైన యావే నిర్గమ  16:4లో వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై వారిని  ఈ విధంగా పరీక్షింతును అని అంటున్నాడు. ప్రభువు ప్రేమతో వారికి ఆకాశము నుండి మన్నాను మరియు వారు కడుపునిండా భుజించడానికి పూరేడు పిట్టలను దయచేసి, యావేనైన నేను మీ దేవుడనని తెలియజేశాడు. 

దేవునికి అంత తెలుసు. మనకు ఏమికావలెనో,ఎప్పుడు కావలెనో ఏమి ఇవ్వాలో తెలుసు. కాబట్టి  దేవుడు మనలను  పరీక్షిస్తున్నాడని మనకు అనిపిస్తే మనము దేవుని ధర్మములను అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తే చాలు. అంత దేవుడే ఇస్తాడు. కాబట్టి పరీక్షింపబడినప్పుడు గొణుకుతూ, సణుగుతూ , ఎదురు తిరుగుతూ నేరం మోపుతూ కాకుండా దేవుని చిత్తానుసారం,  ఆజ్ఞానుసారం నడుచుకుందాం. 

సువిశేషంలో ప్రజలు క్రీస్తు ప్రభువును వెదుకుతూ వచ్చినప్పుడు, ప్రజలు ఎందుకు వచ్చారో వారి మనస్సులోని ఆలోచనలను తెలుసుకోని, మీరు రొట్టెను తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు.  కాని నా సూచక క్రియలను చూసి కాదు అని ప్రజలకు చెప్పియున్నాడు. దీని ద్వారా మనము ఏమి తెలుసుకోవాలంటే, దేవునికి  మనము ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, మన మనస్సులోని ఆలోచనలు, ఆశలు ఏంటో తెలుసు. దేవుడు   మన ఉద్దేశాలు  ఎలాంటివి, మంచివా?  కాదా? అని ఖచ్చితంగా చెప్పగలడు. 

ఈనాడు ఎంతో  మంది ప్రజలు తమ స్వలాభాల కోసం, స్వష్టతల కోసం  దేవుని  వెదుకుచు వస్తున్నారు, కాని  నిజంగా దేవుణ్ణి నమ్మి రావడంలేదు. దేవునికి తెలుసు .  దేవుని దగ్గర నుండి అది కావాలి, ఇది కావాలి అని అడుగుతున్నారు. దేవా! నాకు నీవు కావాలి అని   ఎంత మంది అడుగుతున్నారు? వరాలు కావాలి, దీవెనలు కావాలి అని దేవుని దగ్గరకు వెళ్లేవారు చాలా మంది ఉన్నారు.  కాని ఆ వారలను దీవెనలను ఇచ్చే వార ప్రధాతను నాకు నీవు కావాలి అని ఎంత మంది అడుగుతున్నాం. 

క్రీస్తు ప్రభువు అంటున్నాడు, అశాశ్వతమైం దానికై శ్రమింపవలదు. మిత్రులారారా !  ఈనాటి సమాజంలో ఎంతో మంది అశాశ్వతమైన ఈలోక  వస్తువులు, ఈలోక,  వ్యామోహం ఈలోక  సంపదల కోసం శ్రమిస్తున్నారు. ఈ లోకం శాశ్వతంకాదు. మనము ఎల్లకాలం ఈలోకంలో ఉండము. ఈ అశాశ్వ తమైన వాటి కొరకు మనం పడే శ్రమ వృధా! కాని  క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత  భోజనముకై శ్రమింపుడు అని అంటున్నాడు. మనము ఏ రకమైన  పనులు చేయాలి ఈ నిత్య జీవమును పొందాలంటే యోహాను 6: 35 వచనములో చెబుతున్నాడు. "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎప్పటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. దీని అర్ధం ఏమిటంటే మనము దేవుని యొద్దకు రావాలి, దేవుని విశ్వసించాలి. అపుడు మనకు జీవం లభిస్తుంది. 

రెండవ పఠనంలో: మనము వింటున్నాం మన పాత స్వభావమును విడిచి, మీ మనస్తత్వమును నుత్నికరించుకొనుడు. అన్యుల వలె  ఆలోచనలు గలవారిగా మీరు ప్రవర్తించకండి. మీరు సత్యమైన నీతిని మరియు పరిశుద్దతను కలిగి క్రొత్త స్వభావమును ధరింపుము. దేవుని పోలికలా  జీవించండి అని పౌలుగారు తెలుయజేస్తున్నారు. మొదటి పఠనములో యిస్రాయేలు ప్రజలు తమ పాత స్వభావమును మార్చుకోవాలి. వారు దేవుని విధులను పాటించాలని సువిశేషంలో జనులు శాశ్వతమైన వాటికొరకు శ్రమించాలని చెబుతూ మనము నీతితో పరిశుద్ధతతో క్రొత్త స్వభావమును ధరించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. 

ప్రార్ధన: పరిశుద్దుడైన తండ్రి మా జీవితాలు  పరీక్షలకు గురైనప్పుడు మాకు ఓర్పును, శనమును దయచేయండి. మీ గొప్ప కార్యాలు మాయందు జరిగింపుము/ మేము మీ యొద్దకు వచ్చుటకు, మిమ్ము విశ్వసించుటకు జీవం పొందుటకు కావలసిన నీతిని పరిశుద్దతను మాకు దయచేయండి, మా పాట పాపపు  స్వభావమును మార్చుకొని నీ పోలిక  క్రొత్త స్వభావమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

18వ సామాన్య ఆదివారం

18వ సామాన్య ఆదివారం 
నిర్గమ 16:2-4,12-15, ఎఫేసీ 4:17,20-24, యోహాను 6:24-35

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల కొరకై ఏర్పరచినటువంటి పరలోక విందు గురించి తెలుపుచున్నవి.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎడారిలో మన్నాను, పూరేడు పిట్టలను ఇచ్చిన విధానము చదువుకుంటున్నాం. ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత భూమికి ప్రయాణమైనప్పుడు ఎడారిలో ఆకలిగొనిన సందర్భంలో వారు మోషే ప్రవక్తకు విరుద్ధముగా దేవునికి విరుద్ధముగా నడుచుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆకలి బాధకు తట్టుకోలేక ఐగుప్తులో వారు భుజించిన మాంసాహార భోజనాన్ని మరియు రొట్టెలను తలచుకొని అచటనే ఉండి దేవుని చేతిలో చనిపోయిన బాగుండేది అని గొణగసాగిరి. అందుకుగాను దేవుడు వారికి స్వయముగా పరలోక దూతలు భుజించే భోజనము ఒసగి ఉన్నారు. ఈ యొక్క మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు.
1. ఎడారిలో మన్నా అనేది ఒక విశ్వాస పరీక్ష ఎందుకనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కావలసినది మొత్తం కూడా ఒక్కసారి సమర్పించవచ్చు కానీ అలాగా చేయలేదు. ఏనాటికి మన్నా ఆనాటికే ప్రభువు ఇచ్చారు అనగా వారు దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి యందు విశ్వాసము కలిగి జీవించాలి అనే ఉద్దేశ్యం కొరకు. అదేవిధంగా ఎవరికి ఎంత కావాలో అంతే దేవుడు ఉండేలాగా చేస్తున్నారు
2. దేవుని యొక్క ఉదార స్వభావము. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధముగా మాట్లాడినప్పటికీ ప్రభువు వారి యొక్క మాటలను పట్టించుకోకుండా ఇంకా సమయం వేచి ఉండకుండా వెంటనే సహాయము చేస్తూ వారి యొక్క ఆకలిని సంతృప్తి పరుస్తున్నారు. ఎదుటివారు చేసిన తప్పిదమును గుర్తించకుండా వారి యొక్క ఆకలిని తీర్చుట చాలా గొప్పది.
3. ఫిర్యాదు చేయటం. ఇది సర్వసాధారణంగా చాలామంది యొక్క జీవితంలో చూస్తూ ఉంటా. ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, మార్తమ్మ మరియమ్మ మీద ఫిర్యాదు చేస్తున్నారు అలాగే యోహాను శిష్యులు యేసు ప్రభువు యొక్క శిష్యులు ఉపవాసము ఉండటం లేదని ఫిర్యాదు చేస్తున్నారు ఈ విధంగా చాలామంది దేవునికి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు కానీ అది మంచిదా లేక చెడా అని కొంతమంది మాత్రమే గ్రహిస్తారు. మన జీవితంలో ఏదైనా కొరతగా అనిపిస్తే వెంటనే మనము దేవునికి ఫిర్యాదు చేయటానికి ముందుంటాం కానీ ఆయనను అర్థం చేసుకునటానికి ప్రయత్నం చేయము.
4. ఇశ్రాయేలీయుల యొక్క అప నమ్మకం. దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా కాపాడిన విషయం మరచితిరి, ఫరో సైన్యమును నాశనము చేసిన విధానం మరిచితిరి అలాగే దేవుడు వారిని ఆదుకుంటారు అనే విషయంలో కూడా మరచి జీవించారు అందుకే ప్రభువు వారి విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి ఆకాశము నుండి అద్భుత రీతిగా ఈ యొక్క పరలోక భోజనమును ప్రసాదిస్తున్నారు.
5. దేవుడు మనలను పోషిస్తాడు అనే నమ్మకం లేక ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు గొణుగుతూ అపనమ్మకంతో జీవిస్తుంటాం. ఈ యొక్క శారీరక సంబంధమైన ఆకలి దప్పులను గురించే ఆలోచిస్తుంటాము గాని దేవుని వైపు మన యొక్క దృష్టి మరల్చి ఆయనపై నమ్మకంతో మన కష్టాలను ఆయన చేతులలో ఉంచడానికి వెనుకంజ వేస్తాం. మన యొక్క భౌతిక భోజనమునకు ఆరాటపడతాం కానీ ఆధ్యాత్మిక భోజనం గురించి చింతించం మన గమ్యాన్ని మరచిపోయి భౌతిక చింతలకే ప్రాధాన్యతనిస్తాం.
  ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు పాత స్వభావమును విడిచి కొత్త స్వభావమును కలిగి జీవించమని తెలుపుచున్నారు. మన యొక్క పాత స్వభావమును విడిచి పెట్టకపోతే మనలో నూతనత్వము ఉండదు.  గోధుమ గింజ భూమిలో పడి నశించకపోతే అది అట్లే ఉండును కానీ నశించిన దానియందు ఒక కొత్త జీవము ఉద్భవించును అలాగే మనలో పాపము ఉన్నంత కాలము మనము క్రీస్తునకు జన్మించలేం మన యొక్క పాపమునకు మరణించిన సందర్భంలో క్రీస్తు ప్రభువు మనకు జన్మించిన వారముగా ఉంటాము. దివ్య సత్ప్రసాద స్వీకరణ ద్వారా క్రీస్తు ప్రభువు మనలోనికి వేంచేసి మన యొక్క జీవితములను నూతన పరచున్నారు. పునీత పౌలు గారు తన యొక్క పాత స్వభావమును విడిచిపెట్టి క్రీస్తు ప్రభువును వెంబడించారు.
ఈనాటి సువిషేశ పఠణంలో ఏసుప్రభు 'నేనే జీవాహారము' అని పలుకుచున్నారు. ఏసుప్రభు 5000 మందికి ఆహారమును వసగిన తర్వాత ఆయన కఫర్నామునకు వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు ప్రభువును వెంబడించారు ఆ సందర్భంలో అడిగినా ప్రశ్న" ప్రభువా, మీరు ఎప్పుడూ ఇక్కడికి వచ్చితిరి? " ఈ ప్రశ్న వారు ఏసుప్రభు యొక్క బోధనలు వినటానికి అడగలేదు కేవలము వారు పోషింపబడ్డారు కాబట్టి ఏసుప్రభు దగ్గరికి వస్తే మరల వారి యొక్క శారీరక ఆకలి తీరిపోతుంది అనే ఉద్దేశంతో ప్రభువుని ప్రశ్న అడిగారు దానికి గాను ప్రభువు శాశ్వతమైన భోజనము కొరకు శ్రమింపుడు పలికారు. 
ప్రజలు తమ యొక్క పొట్టలను నింపిన రొట్టెలను గురించి  ఆలోచిస్తున్నారు కానీ ఆ పొట్టల నింపినటువంటి దేవుడిని మాత్రము తలంచలేదు. రొట్టెలను రొట్టెలగానే స్వీకరించారు కానీ అవి దేవుని యొక్క వరము అని విశ్వసించలేకపోయారు.
ఏసుప్రభు తానే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము అని తెలుపుచూ ఈ యొక్క ఆహారమును భుజించిన అతడు ఎన్నటికీ ఆకలిగొనడు అని ప్రభువు తెలుపుచున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా దేవుడు మన కొరకై ప్రసాదించిన దివ్య సత్ప్రసాదం మనము ఎప్పుడు స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు ఈ యొక్క మన్నాను భుజించి వాగ్దాత భూమికి చేరుకున్నారు. మనము కూడా ఏసుప్రభు మన కొరకై వసగిన తన యొక్క దివ్య శరీర రక్తములను భుజించి మన జీవితములను మార్చుకొని పరలోక రాజ్యములో ప్రవేశించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దివ్యసప్రసాదము పట్ల ప్రేమను గౌరవమును అలవర్చుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

2, ఆగస్టు 2024, శుక్రవారం

యిర్మీయా 26:11-16,24 మత్తయి 14:1-12

యిర్మీయా 26:11-16,24 మత్తయి 14:1-12 (3 ఆగస్టు 2024)

ఆ కాలమున గలిలీయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, "ఇతడు స్నాపకుడగు యోహానే. అతడే మృతులనుండి లేచియున్నాడు. కావున, అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి" అని తన కోలువుకాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలయన, "ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు" అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు ఒసగెదను అని అతడు ప్రమాణ పూర్వకముగా వాగ్దానము చేసెను. అపుడు ఆమె తల్లి ప్రోత్సాహమువలన "స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము" అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని, తన ప్రమాణముల కారణముగ, అతిధుల కారణముగ ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్చేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతట యోహాను శిష్యులు వచ్చి అతని భౌతికదేహమును తీసుకొనిపోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్లి ఆ విషయమును తెలియజేసిరి. 

ప్రియమైన దైవ ప్రజలారా! ఈనాడు మొదటి పఠనంలో మనము యిర్మీయా ప్రవక్తను చూసి, ఆయన చెప్పిన దైవ సందేశాన్ని విని భయంతో, కోపంతో, అసూయతో, గర్వంతో యిర్మీయా ప్రవక్తను చంపివేయాలని యాజకులు ప్రవక్తలు, నాయకులను ప్రజలను రెచ్చగొట్టడం చూస్తున్నాము. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త చాలా కఠినమైన సందేశాన్ని వారికి వినిపించారు. ఆ సందేశం ఏమిటంటే వారు వారి మార్గములను, క్రియలను మార్చుకొని దేవునికి విధేయులు కాకపోతే నాశనము చేయబడుదురు. వారి దేవాలయం నాశనము చేయబడుతుంది. పదే  పదే ఆయన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త వారిని, మీరు మీ మార్గాలను, మీ పాపపు పనులను మీ గర్వాన్ని వదలిపెట్టి మారు మనసు పొంది దేవునికి విధేయతతో జీవిస్తే మిమ్మి అయన రక్షిస్తాడు, మీ శిక్షను తొలగిస్తాడు అని బోధిస్తున్నాడు. ఈ సంగతులెల్ల మీకు తెలియజేయుటకు ప్రభువు నన్ను పంపాడు అని చెబుతున్నాడు. ఇది విని నాయకులు, ప్రజలు తమ యొక్క నాయకులు ప్రవక్తలతో యిర్మీయాకు మరణ శిక్ష  విధించుట తగదు. ఎందుకు అనగా అతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడేను అంటున్నారు. 

సువిశేష పఠనంలో మనము స్నాపకుడగు యోహాను గారి శిరచ్చేదనము గురించి వింటున్నాం. యోహాను గారు దైవ సందేశాన్ని భయపడకుండా ధైర్యంతో భోదించినందుకు తన ప్రాణమును కోల్పోయాడు. హేరోదురాజు యేసు ప్రభువుని పేరు ప్రఖ్యాతులను విని ఖచ్చితముగా యోహానే మృతలనుండి లేచి, ఇన్ని అద్భుతశక్తులు కలిగిఉన్నాడు అని తన సేవకులతో చెబుతున్నాడు. యోహాను గారు రాజైన హేరోదుతో నీ సోదరుడగు ఫిలిప్పు భార్యను నీవు ఉంచుకొనుట ధర్మముకాదు అని అధర్మాన్ని ఖండించి, హెచ్చరించాడు. అందువలన హేరోదు యోహానును చంపుటకు నిర్ణయం తీసుకున్నాడు, కాని  భయ పడ్డాడు ఎందుకంటే యోహాను నిజమైన దేవుని ప్రవక్త అని హేరోదు అర్ధం చేసుకున్నాడు. యోహానును చరసాలలో బంధించారు. హేరోదియ కూడా యోహాను పట్ల కోపం, ఈర్ష్య ద్వేషంతో యోహానును చంపాలని చూసింది. ఆమె కూతరు హేరోదు రాజును నాట్యంద్వారా మెప్పించి,సంతోష పెట్టినందుకు నీము ఏమి కావాలో కోరుకో అని ప్రమాణం చెయ్యగా తన తల్లి మాట మీదగా స్నాపకుడగు యోహాను తనను ఒక పళ్లెంలో ఇవ్వమని అడిగింది. 

హేరోదు తన ప్రమాణము కారణంగా, అతిధుల ముందు మాటను ఇచ్చి ఉండటంవలన ఆమె కోర్కెను తీర్చాడు. దేవుని సత్య సువార్తను ధైర్యంగా బోధించి సత్యంకోసం  తన రక్తాన్ని కార్చిన స్నాపకుడగు యోహాను వారి వలె, మనము అధర్మాన్ని ఎదిరించి తప్పును తప్పు అని చెప్పగలమా! ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం భయంతో ఉంటె సత్యానికి, సత్య సువార్తకు సాక్షులుగా ఉండలేం. కనుక యిర్మీయా ప్రవక్త వలె స్నాపకుడగు యోహాను వలె మనము కూడా దేవుని వాక్కుని విని, పాటించి ధైర్యంగా ఏ భయం , ఆందోళన లేకుండా నిజమైన సత్య సువార్తను బోధించుదాం. సత్యానికి సాక్షులుగా నిలబడదాం. సత్యం ధర్మం కొరకు మన ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఉందాం. దేవుడు తన   సత్య సువార్తను మన హృదయాలలో నింపి మనలను నడిపించులాగున  ప్రార్ధించుదాం. 

ప్రార్ధన: సత్య స్వరూపుడైన తండ్రి, మమ్ము మీ సత్య వాక్కుతో నింపుము.మేము అన్ని వేళలలో సత్యానికి సాక్షులుగా జీవిస్తూ సత్య సువార్త బోధిస్తూ, ప్రజలను మీ సత్యపు వెలుగు లోనికి నడిపించడానికి మాకు శక్తిని, బలమును, ధైర్యమును దయచేయుము. తద్వారా ఎన్నో ఆత్మలను రక్షించుటలో మా వంతు బాధ్యతను నెరవేర్చుటకు మీ అనుగ్రహం  దయ చేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యిర్మీయా 26:1-9 మత్తయి 13: 54-58

యిర్మీయా 26:1-9  మత్తయి 13: 54-58    2 ఆగస్టు 2024

యేసు తన పట్టణమును చేరెను. అచట ప్రార్ధనామందిరములో ఉపదేశించుచుండగా, ప్రజలు ఆశ్చర్యచకితులై, "ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచటినుండి  లభించినవి?" అని అనుకొనిరి. "ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు  , యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులుకారా? ఇతని సోదరీమణులు అందరు మన మధ్యనలేరా? అటులయిన ఇవి అన్నియు యితడు ఎట్లు పొందెను?" అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో  "ప్రవక్త  స్వదేశమందును, స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు" అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసమువలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. 

ఈనాడు ప్రభువు తన వాక్కును యిర్మీయా ప్రవక్తకు, నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వినిపింపుము. వాటిలో ఒక్క మాటకూడా వదలిపెట్టవలదు అని  వినిపించాడు.  ప్రియా మిత్రులారా దేవుడు ప్రవక్తలను ఎన్నుకొని , తన వాక్కును వినిపించి, తనను ఆరాధించే ప్రజలకు తన సందేశాన్ని ఒక్క మాటకూడా వదలి  పెట్టకుండా చెప్పడానికి మన మధ్యకుపంపిస్తున్నాడు. ఎందుకు దేవుడు తన ప్రవక్తలను పంపిస్తున్నాడు అంటే, దేవుని వాక్కును సందేశాన్ని విని పాపులమైన మనము  మన దుష్ట మార్గము నుండి మంచి మార్గములోనికి రావాలని, మన బ్రతుకులు మార్చుకొవాలని, మనము  మనం పాపలు నుండి చేదు వ్యసనాల నుండి మారకపోతే  దేవుని ప్రేమకు దగ్గరగా రాకపోతే మనం నాశనమునకు గురిచేయబడుతాం. మారుమనస్సు పొందితే రక్షణ లేకపోతే నాశనము. మరి మనము మన మనస్సును మార్చుకోవాలంటే ఏమి చేయాలి.

యిర్మీయా 26:4 వ వచనంలో దేవుడు "మీరు నేనిచ్చిన ధర్మ శాస్త్రమును పాటించి నాకు విధేయులు కావాలి"  అని చెబుతున్నాడు. మరి మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా? ఆజ్ఞలు అన్ని దైవ ప్రేమ, సోదర ప్రేమపై ఆధారపడియున్నవి. మరి మనము దేవుని మరియు మన తోటి వారిని ప్రేమించగలుగుతున్నామా? అదేవిధంగా దేవునికి నిజంగా విధేయులమై ఉంటున్నామా? మనం ఎవరికీ విధేయత చూపిస్తున్నాం? దేవుని వాక్కులుకు విధేయత చుపిస్తున్నామా? ఒకవేళ దేవుని వాక్కు కు విధేయత చూపించకపోతే మనము మన నాశనమును  కోని తెచ్చుకుంటాము. దేవుడు యిస్రాయేలు ప్రజలతో , మీరు నా సేవకులగు ప్రవక్తల  పలుకులు వినలేదని అంటున్నాడు.  మరి ఈనాడు మనం దేవుని సేవకులగు ప్రవక్తలు,   గురువులు పెద్దల మాటలను వింటున్నామా  లేదా ఆలోచించండి. ఒక ప్రవక్తగా, దైవ సేవకునిగా, దేవుని వాక్కును భయపడకుండా, భాధలకు దూరంగా వెళ్లకుండా  ధైర్యంగా ప్రకటించాలి. యిర్మీయా ప్రవక్త వలె ఉండాలి.   ఆయన దేవుని వాక్కును, సందేశాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు ఆయనను నింధించారు. ఆయనపై అరిచారు. కాని  ఆయన దేవుని వాక్కును, సువార్త పరి చర్యను ఆపివేయలేదు. 

ఈనాటి సువిశేషంలో తన పట్టణ ప్రజలే క్రీస్తు ప్రభువునుతృణీకరించారని వింటున్నాం. ఆయనను చిన్న చూపు చూచి, ఆయన బోధనలు విని ఆశ్చర్యపోయి, క్రీస్తు ప్రభువునికి ఇంతటి  జ్ఞానం ఎట్లు వచ్చినదని,  ఆయనను ఔన్నత్యాన్ని ఒప్పుకోలేక,  ఆయన బోధనలను తృణీకరించారు. క్రీస్తు ప్రభువు, తన శిష్యులమైన  మనకు  తెలియజేసేది ఏమిటంటే మనవారే కొన్ని  సార్లు మనలను తృణీకరిస్తారు , మన మాటలను అంగీకరించరు, మన మాటలపై అవిశ్వాసం వ్యక్తపరుస్తారు, భయపడకండి, నా సందేశాన్ని అందరికి తెలియజేయండి. కొన్నిసార్లు అగౌరవంగా మాట్లాడుతారు. కాని  మీరు సువార్త ప్రకటనను కొనసాగించండి అని తెలియజేస్తున్నాడు. 

ప్రార్థన : 
ప్రేమమయుడైన  దేవా! నీవు మమ్ము రక్షించువాడవు. మేము నీ వాక్కును విని, ఆరాధిస్తూ, నీ ఆజ్ఞలను పాటించి జీవించే భాగ్యం  నాకు దయజేయండి. తద్వారా మేము మా దృష్టమార్గములను విడిచిపెట్టి, నీ ప్రేమా ,  సువార్తను  ప్రకటించే భాగ్యం మాకు దయచేయండి. మమ్ము ఎవరు తృణీకరించిన బాధపడకుండ,  నీ సత్య మార్గములో నడిచే శక్తిని ఇవ్వండి.   ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

31, జులై 2024, బుధవారం

మత్తయి 13: 47-53

 మత్తయి 13: 47-53 (1.ఆగస్టు 2024)

"ఇంకను పరలోకరాజ్యము సముద్రములో వేయబడి, అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినపుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి, పనికి రాని వానిని పారవేయుదురు. అటులనే అంత్యకాలమందును జరుగును; దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతులనుండి వేరుపరచి అగ్ని గుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు, పండ్లు కోరుకుకొందురు." వీనినన్నింటిని మీరు గ్రహించితిరా?" అని యేసు అడిగెను. "అవును" అని వారు సమాధానమిచ్చిరి. అయన "పరలోక రాజ్యమునకు శిక్షణ  పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన, పురాతనవస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు" అనెను. 

ఈరోజు దేవుని వాక్యం మొదటి పఠనమును  మనము చూస్తే,  దేవుడు యిర్మీయా ప్రవక్తను ఓక  కుమ్మరి వాని ఇంటికి తన యొక్క సందేశాన్ని వినిపించమని పంపిస్తున్నాడు,  అయితే ఆ ప్రవక్త  వెళ్లి ఆ కుమ్మని సారెమీద పని చెయ్యడం చూసాడు. దేవుడు ఎన్నో  సార్లు తన ప్రవక్తలను, శిష్యులను కూడా మన  దగ్గరకు పంపిస్తునాడు. మన  గ్రామాలకు, కుటుంబాలకు, సంఘాలకు పంపించుచున్నాడు. ఎందుకు అనగా మనయొక్క జీవిత విధానాలను చూచి, మన  వ్యాధి బాధలను చూచి మనలకు సువార్తను అంటే, దేవుని సందేశాన్ని అందించమని తన ప్రవక్తలను పంపుచున్నాడు. 

ఆనాడు యిర్మీయా ప్రవక్త కుమ్మరివాని  ఇంటి దగ్గర కుమ్మరి చేసే పనిని చూచి ఉన్నాడు. మనము ఈనాడు ఏ పనులు చేస్తున్నాము. దానిని బట్టి దేవుడు తన సందెశాన్ని మనకు అందిస్తాడు. కుమ్మరి,  సరిగా తయారుకాని కుండను ఏ విధంగానైతే వేరొక పాత్రగా చేసాడో అదే విధంగా  దేవుడు కూడా మన జీవిత విధానం బట్టి, మన జీవితాన్ని రూపుదిద్దుతాడు. పాడైపోయిన కుండా మరల ఏ విధంగా అందమైన పాత్రగా మార్చుబడుతుందో, దేవుడు పాడైపోయినా మన జీవితాలను కూడా అందమైన పాత్రగా మార్చగలడు. మన జీవితం ఏ విధంగా ఉన్న, మన బలహీనతలు ఏమైనా  దేవుడు వాటిని తొలగించి  మనలను   మరల సుందరంగా అందంగా మార్చుతాడు, మార్చగలడు.  ఓ! యిస్రాయేలు ప్రజలారా మీరు ఎలాంటి వారంటే కుమ్మరి చేతిలో మట్టివలె మీరును నా చేతిలో ఇమిడిపోయేదరు అంటున్నారు.  కాబట్టి మనము అర్ధం చేసుకోవలసినది మనము దేవుని చేతిలో మట్టి వంటి వారము, మన  జివితాలు దేవుని చేతిలో ఉంచితే మన జీవితాలను, కుటుంబాలను సంఘాలను దేవుడు ఎంతో అందంగా మార్చివేస్తారు. 

మన జీవితాలు ఎవరి చేతులో ఉన్నాయి? మనము ఏ విధంగా ఉన్నాము? ఆలోచించాలి. ప్రస్తుత కాలంలో మనము మన జీవితాలను వేరే వారి చేతులలో పెడుతున్నాము. మన జీవితాలను నాశనము చేసుకుంటున్నాము. పదే పదే పాపములో పడిపోయి, పాపపు పనులు చేస్తున్నాము. కాబట్టి దేవుడు మనతో ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచెనో నేనును మిమ్మునట్లు మలవకూడదా? అంటున్నాడు. మరి మన సమాధానం ఏమిటి ఈ ప్రశ్నకు ? ఆత్మ పరిశీలన చేసుకుందాం.  మనము దేవునికి మనలను మార్చడానికి అవకాశం ఇస్తున్నామా? పునీత అగస్టిను వారు నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ అనుమతి లేకుండా నిన్ను రక్షించాడు అని అంటున్నాడు. మరి మనము దేవుని చిత్తమునకు అనుమతిస్తున్నామా? 

సువిశేష పఠనంలో పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి అన్నివిధములైన చేపలను పట్టు వలను పోలియున్నది అని క్రీస్తు ప్రభువు బోధిస్తున్నారు. అపుడు మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వాటిని పారవేయుదురు. మనం ఇక్కడ గమనించవలసినది ఏమిటి అంటే  దూతలు అంత్యకాలంలో మంచి చేపలు అంటే మంచి పనులు చేస్తూ, పరిశుద్ధంగా జీవించేవారు, బుట్ట అంటే పరలోకరాజ్యము. పనికిరాని చేపలు అంటే దుష్టులు చెడు పనులు చేయువారు. వీరు నరకంలో పారవేయబడి శిక్ష అనుభవిస్తారు. కాబట్టి పరలోకంలో చేరాలి అంటే మనము మన పాప క్రియలను విడిచి పశ్చాతాపంతో ప్రభువును ఆశ్రయించాలి, ప్రార్ధించాలి. అపుడు దేవుని రాజ్యంలో చేర్చబడుతాం. 

ప్రార్ధన: ప్రభువైన దేవా మేము మమ్ము తగ్గించుకొని ప్రతినిత్యం మా జీవితం విధానాలను మార్చుకుంటూ మీ  సందేశాన్ని, ప్రణాలికను అర్ధంచేసుకుంటూ మా జీవితాలను అందంగా, పరిశుద్ధంగా మార్చుకొని మంచి వారిగా ఉంటూ మంచి పనులను చేస్తూ పరలోక రాజ్యం పొందేబాగ్యం మాకు దయ చేయండి. ఆమెన్

ఫా. సురేష్ కొలకలూరి  

27, జులై 2024, శనివారం

17వ సామాన్య ఆదివారం


2 రాజుల 4: 42-44, ఎఫేసి 4:1-6, యోహాను 6:1-15
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల యొక్క ఆకలిని సంతృప్తి పరచు విధానం గురించి తెలుపుచున్నవి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వారి యెడల దేవుడు తన యొక్క కనికర హృదయమును ప్రదర్శిస్తూ వారి యొక్క శారీరిక ఆకలిని సంతృప్తి పరుస్తున్నారు. 
ఈనాటి మొదటి పఠణములో ఎలీషా ప్రవక్త దేవుని అనుగ్రహము ద్వారా చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమును చదువుకుంటున్నాం. ఎలీషా ప్రవక్త క్రీస్తుపూర్వం తొమ్మిదవ శతాబ్దంలో దేవుని సందేశమును ప్రకటించారు.  ఆయన ప్రవచించే సందర్భంలో కరువు సంభవించినది. ఒకరోజు బాల్షాలిషా నుండి ఒక భక్తుడు ఏలీషా ప్రవక్తకు కానుకగా 20 రొట్టెలను, ధాన్యాన్ని సమర్పించారు. ఎలీషా ప్రవక్త ఈ యొక్క రొట్టెలను తన చెంతకు వచ్చిన ప్రవక్తలకు పంచి పెట్టమని చెప్పారు కానీ వారి సంఖ్య అధికముగా ఉండుటవలన ఇవి సరిపడమని భావించి సేవకుడు 100 మందికి ఇవి ఏ పాటివి అని ప్రశ్నించారు. వాస్తవానికి ఎలీషా ప్రవక్త దేవునియందు నమ్మకం ఉంచి అవి సరిపోతాయి అని శిష్యుడికి తెలుపుచున్నారు. ఎలీషా ప్రవక్త తనకు ఇవ్వబడినది, ఇతరులకు పంచి ఇచ్చి ఉన్నారు కాబట్టి దేవుడు ఆయన యొక్క మంచితనము మరియు విశ్వాసమును బట్టి అద్భుతం చేశారు. 
ఈ యొక్క మొదటి పఠణము ద్వారా మనము గ్రహించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే 
1. ఎలీషా ప్రవక్త యొక్క ఉదారత. ఏమియు ఆశించకుండా ఇతరులకు మేలు చేయాలని కోరుకున్నాడు.
2. ఎలీషా ప్రవక్త యొక్క విశ్వాసం. శూన్యము నుండి సృష్టిని చేసిన దేవుడు 20 రొట్టెలను 100 మందికి సమకూరుస్తారు అని ఎలీషా విశ్వసించారు. ఎడారిలో మన్నాను ఇచ్చిన దేవుడు అవి మిగులు లాగిన చేశారు అలాగే ఈ రొట్టెలు కూడా ఇంకా మిగులుతాయి అని చెప్పారు.
3. ఆకలిని సంతృప్తి పరచాలి అనే కోరిక ఎలీషా ప్రవక్తకు ఉన్నది. ఇతరుల యొక్క ఆకలి గుర్తించి వారికి ఆహారము ఇచ్చారు.
4. సేవకుని యొక్క విధేయత. యజమానుడి యొక్క మాటను నమ్మి ఆయనకు సంపూర్ణంగా విధేయత చూపారు.
ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరినీ కూడా దేవుడు, మన కొరకు ఏర్పరిచినటువంటి అంతస్తుకు తగిన విధంగా జీవించమని తెలుపుచున్నారు దానిలో భాగంగా మనము సాధువులు గను, సాత్వికులుగను, సహనశీలురులుగా ఉంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రేమను పంచుకోవాలి అని పౌలు గారు కోరారు.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు 5000 మందికి(స్త్రీలను, చిన్న బిడ్డలను లెక్కించకుండా) ఆహారమును ఒసగిన విధానము చదువుకుంటున్నాము. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారు సంతృప్తిగా పోషింపబడతారు అని కూడా ప్రభువు తెలుపుతున్నారు అయితే ఈ యొక్క సువిశేష భాగములో ఏసుప్రభు అద్భుతం చేయుటకు కారణము ఒక బాలుడు తన వద్ద ఉన్నటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను ఇతరుల కొరకై సమర్పించిన విధానం.  ఈ యొక్క సువిశేష భాగములో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు; 
1. ఏసుప్రభు యొక్క కనికర హృదయం. ఆయన తన ప్రజల మీద జాలి కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆకలిని సంతృప్తి పరచాలని భావించారు.
2. బాలుని యొక్క త్యాగ గుణం. తన దగ్గర ఉన్నది కొంచెమైనప్పటికీ కూడా, అదియు తన కొరకు తెచ్చుకున్నటువంటి ఆహారమైనప్పటికీ ఆయన  త్యాగం చేసి ఇతరుల కొరకు శిష్యులకిస్తున్నారు. 
3. బాలుడు యొక్క ఉదార స్వభావం. ఈ యొక్క బాలుడు సంతోషముగా ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై తన వంతు, తన దగ్గర ఉన్నటువంటి భాగమును సమర్పిస్తున్నారు. 
ఒకరోజు కలకత్తాపురి మదర్ తెరెసా గారు తన జీవిత సంఘటన తెలుపుచున్నారు అది ఏమనగా; మదర్ థెరీసా గారు ఒక పేద కుటుంబమును సందర్శించి వారికి ఒక బియ్యం బస్తాను ఇచ్చారు. వారు దాదాపుగా ఒక వారం రోజుల పాటు భోజనం చేయడం లేదని గ్రహించి వారి యొక్క దీనస్థితిని గుర్తించి మదర్ తెరెసా వారికి సహాయం చేశారు. ఆ సహాయము పొందినటువంటి కుటుంబము ఆ బస్తా బియ్యంలో సగం బియ్యమును తీసుకొని వేరే వారికి ఇంకొక సగం బస్తా బియ్యమును ఇచ్చారు. ఎందుకు నువ్వు ఈ విధంగా చేసావు అని  అడిగినప్పుడు ఆ యొక్క తల్లి చెప్పిన మాట, మేము కేవలం వారం రోజుల నుండి పస్తులు ఉంటున్నాం కానీ మా కన్నా ఎక్కువగా మా యొక్క పొరుగువారు పస్తులు ఉంటున్నారు అదేవిధంగా వారి కుటుంబంలో కూడా పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్లకి కూడా ఆహారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో మాకు ఉన్న సగం ఇచ్చాను అని తెలుపుచున్నది. ఈ యొక్క సంఘటన ద్వారా మదర్ తెరెసా గారు ఉన్నదాంట్లో ఇతరులకు దానం చేస్తే దానిలో నిజమైన సంతోషం ఉందని  గ్రహించింది. ఈ యొక్క బాలుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు రెండు చేపలను ఇతరుల యొక్క సంతోషం కొరకై ఉదారంగా ఇచ్చారు. 
4. ఐదు రొట్టెలు రెండు చేపలు తిరు సభలో ఉన్న ఏడు దివ్య సంస్కారాలకి ప్రతిరూపం. ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఆనాటి ప్రజల యొక్క ఆకలిని సంతృప్తి పరచిన విధముగా ఈ యొక్క ఏడు దివ్య సంస్కారాలు ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరుస్తుంది. వాటిని స్వీకరించటానికి మనము సిద్ధముగా ఉండాలి.
ఈ యొక్క పరిశుద్ధ గ్రంధం పట్టణముల ద్వారా మనం కూడా మన జీవితంలో ఇతరులను యొక్క ఆకలి బాధను చూసి వారికి ఆహారమును ఇవ్వాలి. ఎంత ఇచ్చాము అన్నది ప్రభువు చూడరు కానీ వారికి మంచి చేశామా అన్నది ప్రభువు చూస్తారు కాబట్టి మన అందరిలో కూడా త్యాగం చేసేటటువంటి గుణం, కనికరం కలిగిన హృదయం, ఉదారంగా ఇచ్చే మనసు ఎప్పుడూ ఉండాలి అప్పుడే మనం కూడా ఇంకా అధికముగా దీవించబడతాం. మనం చేసే మనిషి వలన ఇతరులు సంతోషము ను పొందుతారు కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి వరములను ఇతరులతో పంచుకుంటూ సోదర ప్రేమ కలిగి జీవించటానికి ప్రయత్నించుదాం. 
Fr. Bala Yesu OCD

20, జులై 2024, శనివారం

16వ సామాన్య ఆదివారం


యిర్మియా 23:1-6, ఎఫేసి 2:1-6, మార్కు 6:30-34

ఈనాటి పరిశుద్ధ గ్రంథము పఠణములు దేవుడు మంచి కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చి వారిని కాపాడుతుంటారు అని అంశమును తెలుపుచున్నవి. దేవునికి ప్రజలకు ఉన్నటువంటి బంధము ఏ విధంగా ఉన్నదంటే కాపరికి మందకు ఉన్నటువంటి బంధం ఇవి రెండూ కూడా ఎప్పుడు కలసి ఉంటాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త యొక్క మాటలను చదువుకుంటున్నాము. యిర్మియా ప్రవక్త క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో యూదా రాజధాని అయినటువంటి యెరుషలేములో పరిచర్యను చేశారు. ఆయన అనేక మంది రాజులను, ప్రజలను, నాయకులను దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించమని తెలిపారు. దేవుని యొక్క దృష్టిలో ఏది  ఉత్తమం దానిని ప్రకటించారు. యిర్మియ సత్యమును ప్రకటించుటవలన అనేక బాధలను అనుభవించవలసి వచ్చింది. యిర్మియా ప్రవక్త సెద్కియా కాలంలో ప్రవచించారు. ఆయన ఒక బలహీనమైన రాజు, నిలకడత్వం లేని వ్యక్తి. ప్రవక్త యొక్క సందేశాన్ని ఆలకిస్తాడు కానీ దానిని ఆచరణలో ఉంచడు. అప్పుడు యూదా రాజ్యం బాబిలోనియా చక్రవర్తికి లోబడుతుంది. యిర్మియా ప్రవక్త రాజును బాబిలోని రాజుకు లోబడి జీవించమని తెలిపినప్పుడు దానిని ఆచరించలేదు దానికి బదులుగా రాజభవనంలో ఉన్న కొంతమంది సలహాదారులు ఐగుప్తు సహాయం రాజు సహాయం కోరమని తెలియజేశారు కానీ యుద్ధం చేసిన తర్వాత యూదా ప్రజలు ఓడిపోయారు దానికి గాను బాబిలోనికి బానిసత్వానికి వెళ్లారు. 
నాయకులు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉండేవారు కాబట్టి ప్రభువే స్వయముగా తన గొర్రెలను ప్రోగు చేసి వారి కొరకు కాపరులను నియమిస్తాను అని తెలుపుచున్నారు. దేవుడే స్వయముగా ఒక కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చుతారు అనేటటువంటి అంశమును కూడా తెలుపుచున్నారు (కీర్తన 23). ఆయన యొక్క శ్రద్ధ వలన తన మంద పోషించబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. తన మందను ఎన్నడూ విడిచి పెట్టినటువంటి కాపరులను కూడా నియమిస్తానని తెలుపుచున్నారు. యావే ప్రభువు తనకు ఉన్నటువంటి ప్రేమ వలన ప్రజల కొరకు మంచి కాపరులను నియమిస్తానని తెలుపుచున్నాను.
దేవుడు ఎవరికి అయితే తమమందనం చూసుకొనమని బాధ్యతను అప్పగించి ఉన్నారో వారు సరిగా వ్యవహరించకపోతే దేవుడు వారిని శాపగ్రస్తులుగా చేస్తుంటారు అని పలికారు. దేవుడు నమ్మి బాధ్యతను అప్పగించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానిని సక్రమంగా నెరవేర్చాలి. తండ్రికి కుటుంబ బాధ్యతను అప్పగించారు, గురువుకు విచారణ బాధ్యతను అప్పగించారు, ఉపాధ్యాయునికి పిల్లల బాధ్యతను అప్పగించారు, వైద్యులకు రోగుల బాధ్యతను అప్పగించారు, రాజకీయ నాయకులకు దేశ ప్రజల బాధ్యతను అప్పగించారు ఈ విధముగా చాలా విధములైనటువంటి బాధ్యతలు దేవుడు ఇచ్చి ఉన్నారు కాబట్టి వానిని మనము సక్రమముగా ప్రజల యొక్క, ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై వినియోగించాలి. 
అందరి కొరకై దేవుడు దావీదు వంశము నుండి మంచి కాపరి అయినటువంటి ఏసుప్రభువును, మనలను పరిపాలించు నిమిత్తము పంపిస్తారు అని కూడా యిర్మియా ప్రవక్త ద్వారా తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుడు ఉత్తమ కాపరిగా ఉంటూ యూదులను అన్యులను ఐక్యము చేశారు అని తెలిపారు. ఏసుప్రభు యూదులను మరియు అన్యులను సఖ్యపరచి వారిని ఒకటిగా చేశారు. ఏసుప్రభు నందు విశ్వాసము ఉంచినటువంటి వారందరూ కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఒకే ప్రజగా జీవిస్తారు అని తెలిపారు  (గలతి 3:28-29). క్రైస్తవులుగా మారిన యూదులు ఏసుప్రభువును మెస్సయ్యగా గుర్తించి అంగీకరించారు, అదే విధముగా అప్పటివరకు అన్య దైవములను పూజించిన అన్యులు కూడా యేసు ప్రభువును రక్షకునిగా గుర్తించి విశ్వసించి ఆయనను వెంబడించారు.
ఈనాటి సువిశేష భాగంలో ఏసుప్రభు యొక్క శిష్యులు పరిచర్యను ముగించుకొని తిరిగి వచ్చినటువంటి సంఘటనను చూస్తున్నాం. శిష్యులు యేసు ప్రభువు యొక్క నామమున అనేక రకములైన అద్భుతములు చేసి దయ్యములను వెళ్లగొట్టి రోగులను స్వస్థపరచి తిరిగి వచ్చారు వారి యొక్క స్థితిని చూసినటువంటి ప్రభువు వారికి కొద్దిపాటి విశ్రాంతి కావాలి అని భావించారు. అందుకే ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని భావించారు కానీ అదే సందర్భంలో ప్రజలు అనేకమంది ప్రభువు కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు. 
ఇక్కడ గమనించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే 
1. ఏసుప్రభువుకు తన శిష్యులు మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ.  ( వారి యొక్క శారీరక బలహీనతను అర్థం చేసుకున్నారు)
2. ప్రతి ఒక్కరి జీవితంలో కొద్ది సమయం విశ్రాంతి (A time of introspection) తీసుకోవాలి ఎందుకంటే ఆ విశ్రాంతి సమయంలో మనం ఎలాగ జీవించాము అని ఆత్మ పరిశీలన చేసుకొనుట కొరకై.
3. ప్రభువు తన యొక్క ప్రజల యొక్క అవసరతను గుర్తించి వారికి బోధించారు. 
4. దేవుని యొక్క వాక్కు కొరకై ప్రజలకు ఉన్నటువంటి గొప్ప తపన. 
5. దేవుని కొరకై తపించేవారు ఎప్పుడు దేవుని విషయంలో ముందే ఉంటారు. ప్రజలు ఏసుప్రభువు చూడటానికి వారి కంటే ముందుగా కాలినడక మీదనే వచ్చారు.
6. ఏసుప్రభు యొక్క సహనము మనము అర్థం చేసుకోవాలి అలసిపోయినప్పటికీ ప్రజల యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారికి ఇవ్వవలసిన సమయం దేవుడు వారికి ఇస్తున్నారు. 
7. ప్రభువు కాపరి వలె తన మందమీద కనికరమును చూపించారు మనం కూడా అదే విధంగా జీవించాలి.
ఈ యొక్క పరిశుద్ధ పఠణముల ద్వారా దేవుడు మనందరిని కూడా కాపరులుగా ఉంచుతూ మనకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమముగా నెరవేర్చమని తెలుపుచున్నారు. 
యిర్మియా తన బాధ్యతను నెరవేర్చిన విధంగా, పౌలు తన బాధ్యతను నెరవేర్చిన విధంగా మరియు శిష్యులు తమకు ఇచ్చిన పనిని సక్రమంగా చేసిన విధంగా మనకి కూడా దేవుడు ఇచ్చిన ప్రతి బాధ్యతను కాపరి వలె మంచి చేస్తూ మంద కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలి. 
Fr. Bala Yesu OCD

13, జులై 2024, శనివారం

15వ సామాన్య ఆదివారం


ఆమోసు 7:12-15, ఎఫేసి 1:3-14, మార్కు 6:7-13
ఈనాటి పరిశుద్ధ గ్రంధం పఠణములు, దేవుని పిలుపు- మానవ స్పందన గురించి తెలుపుచున్నాయి. ప్రతి పఠణం కూడా దైవ పిలుపును విశ్వాసముతో స్వీకరించి ప్రభువు యొక్క సేవ చేయాలి అనే అంశమును తెలియజేస్తున్నాయి.
మొదటి పఠణంలో యావే దేవుడు ఆమోసు ప్రవక్తను  ఉత్తర ఇస్రాయేలు ప్రజలు చెంతకు పంపించిన విధానము చదువుకుంటున్నాము.  
యావే ప్రభువు క్షీణించే ప్రజల మధ్యకు ప్రవక్తను  పంపారు. ఆమోసు ప్రవక్త సామాజిక న్యాయం కొరకు పోరాడిన వ్యక్తి. గొర్రెల మందను కాసుకునేటటువంటి వ్యక్తిని దేవుడే స్వయముగా పరిచర్యకు పిలిచారు అని తెలిపారు. ఆమోస్ ప్రవక్త తాను భుక్తి కోసం పనిచేయటం లేదు కేవలము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే నిస్వార్థముగా పనిచేస్తున్నాను అని తెలిపారు. క్రీస్తుపూర్వం ఎనిమిదివ శతాబ్దంలో పాలస్తీనా దేశం లో ఉత్తర రాజ్యంలో జేరోబవాము రాజు ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్నారు. ఈ రాజు యొక్క పరిపాలన కాలంలో మత విలువలు అడుగంటిపోయాయి, అవినీతి పెరిగింది, ధనికులు అన్యాయంగా పేదవారిని దోచుకొనుట సాధారణమైంది. ఒక ప్రక్కన ధనికులు సుఖసంతోషాలతో జీవిస్తుంటే, పేదవారు మాత్రము ఆకలి బాధతో అలమటించేవారు. రాజు సైతం దేవుడిని మరచి అన్య దైవములను కొలవటం ప్రారంభించారు ఇట్టి సందర్భంలో ప్రభువు ఆమోస్ను ప్రజల యొక్క శ్రేయస్సు కొరకై, వారి జీవిత విధాన మార్పు కొరకై పంపిస్తున్నారు. ప్రవక్త ప్రజల యొక్క తప్పిదములను వారి అవినీతిని పండించారు, విగ్రహారాధనను రూపుమాపారు. యావే దేవుని యొక్క మాట విననట్లయితే బానిసత్వం లోనికి వెళ్ళవలసి ఉన్నది అని ప్రవక్త గట్టిగా ఉపదేశించారు, వాస్తవానికి అది జరిగినది కూడా. బేతేలు క్షేత్రం వద్ద పలికిన ఈ మాటలు అ అచ్చటి అర్చకుడైన అమాస్య ప్రవక్తకు నచ్చలేదు అందుకే ఆమోసుతో, నీవు నీ ప్రాంతమునకు వెళ్లి ప్రవచనములు పలుకుతూ భోజనమును సంపాదించుకోమని హేళనగా మాట్లాడారు, ఇకమీదట బేతేలులో ప్రవచించవద్దు అని కూడా హెచ్చరించారు కానీ ఆమోస్ మాత్రము ధైర్యముగా దేవుడు తనకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చారు.
ఆ రోజుల్లో కొందరు ప్రవక్తలు కేవలం పొట్టకూటిపై ప్రవక్తలగా చలామణి అయ్యేవారు రాజు యొక్క మెప్పు కొరకు పని చేసేవారు. రాజు ఏది చెబితే అదే దైవ చిత్తము గా బోధించారు రాజును మెప్పించుట కొరకు చెడును కూడా మంచిగానే బోధించేవారు ఇలాంటి ఒక పరిస్థితుల్లోనే దేవుడు అమోస్ ప్రవక్తను ఎన్నుకొని సత్యమును బోధించుటకు పంపించారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క పిలుపుని గురించి తెలుపుచూ ఆయన మనలను సృష్టికి పూర్వమే పవిత్రులుగా ఉండుటకు నిర్దోషులుగా ఉండుటకు ఎన్నుకున్నారు అని తెలిపారు. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహాలను వసగి ఉన్నారు. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులము కావించబడ్డాము, మన పాపాలు క్షమించబడ్డాయి. 
ఈనాటి సువిశేష భాగములు యేసు ప్రభువు తన యొక్క అపోస్తులను సువార్త సేవకై పంపించిన విధానము చదువుకుంటున్నాము. ఆమోసు ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజల‌ వద్దకు పంపిన విధంగా, పౌలు గారిని అన్యుల వద్దకు పంపిన విధంగా, ఏసుప్రభు తన శిష్యులను కూడా దైవ సందేశ నిమిత్తమై వివిధ ప్రాంతాలకు ఇద్దరు చొప్పున పంపిస్తున్నారు. ఈ యొక్క సువిశేషంలో ధ్యానించవలసిన ప్రధానమైన అంశములు; 
1. అందరూ రక్షింపబడాలి అన్నది ప్రభువు యొక్క ఉద్దేశం. 
2. దేవుని యొక్క సందేశము ప్రతి ఒక్కరికి ప్రకటింపబడాలి అందుకే ప్రభు తన శిష్యులను పంపిస్తున్నారు.
3. శిష్యులు ప్రజలలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, దయ్యములను పారద్రోలి వారికి మేలు చేయాలి. 
4. అపోస్తులను ప్రతినిత్యము ఏసుప్రభు మీదే ఆధారపడి జీవించాలి. 
5. దేవుని పనిలో కొన్నిసార్లు తిరస్కరణలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి. 
6. అపోస్తులు హృదయ పరివర్తనను ప్రకటించి అనేక మందికి స్వస్థత చేకూర్చారు.
7. దేవుడు ఎల్లప్పుడూ తాను ఎన్నుకున్న వారికి తోడుగానే ఉంటారు అనే విషయం మనం ప్రభువు వెల్లడిస్తున్నారు ఎందుకనగా ప్రజల జీవితంలో అద్భుతాలు జరగటానికి దేవుడు వారికి తోడుగా ఉన్నారు అనేటటువంటి ఒక కారణం. 
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఏ విధముగానయితే దేవుని యొక్క సందేశము కొరకై పిలవబడిన వారి గురించి మరియు వారి యొక్క సేవ జీవితం గురించి తెలియచేయబడినదో మనము కూడా దేవుని చేత జ్ఞాన స్నానం ద్వారా ఎన్నుకొనబడినటువంటివారం కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమను పంచాలి ఆయన సేవ చేయాలి. 
Fr. Bala Yesu OCD.

The Feast of Epiphany

The Feast of Epiphany  క్రీస్తు సాక్షాత్కార పండుగ యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12 ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడ...