10, ఆగస్టు 2024, శనివారం
19వ సామాన్య ఆదివారం
యోహాను 12: 24-26
యోహాను 12: 24-26 (10 ఆగస్టు 2024)
నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన:గోధుమగింజ భూమిలోపడి నశించనంతవరకు అది అట్లే ఉండును. కాని అది నశించినయెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించును. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించినయెడల వానిని నాతండ్రి గౌరవించును.
ధ్యానము: ఈరోజు మనము పునీత లారెన్స్ గారి మహోత్సవమును జరుపుంటున్నాము. ఎవరు పునీత లారెన్స్ గారు అంటే యేసు ప్రభువు వలే జీవించడానికి ఆయన నిజ అనుచరునిగా జీవించిన వ్యక్తి. ఆయన 32 సంవత్సరాల వయసులో మరణించాడు. రోమపుర ఆర్చ్ డికనుగా సేవ చేసాడు. యేసు ప్రభువు మరణించిన రెండువందల సంవత్సరాల తరువాత ఈయన జీవించాడు. ఆనాటి రోజులలో తిరుసభకు స్వతంత్రం లేదు, తిరుసభ మొత్తం రహస్యంగా దేవుణ్ణి ఆరాధించారు. క్రైస్తవులను అనేక విధాలుగా హింసించారు. ఎంతో గోరంగా హింసించారు అంటే కొంత మందిని మంటలలో కాల్చారు. కొంతమందిని అడవి మృగాలకు ఆహారంగా ఇచ్చారు. కొంతమందిని నూనెలో కాల్చారు. క్రైస్తవుల మీద హింస వలేరియన్, డైక్లిషియన్లు చక్రవర్తులుగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది. వలేరియన్ చక్రవర్తి మేత్రానులను , గురువులను, డికనులను చంపాలి అని శాసనము చేసాడు. 258వ సంవత్సరంలో సిక్స్టాస్ పోపుగారిని బంధించారు. ఆది చూచిన లారెన్స్ పోపుగారి వెంట వెళుతూ నన్ను వదలి ఎలా వెళతారు తండ్రిగారా అని అడిగితే ఆ పోపుగారు లారెన్స్ తో, కుమారా నేను నిన్ను వదలి పెట్టను, నీకు ఎక్కువ హింసలు రాబోతున్నవి. నీవు ఇంకా ఎక్కువుగా ప్రభువుకు సాక్షమివ్వడానికి వస్తావు అని చెప్పాడు. కనుక లారెన్స్ గారికి వచ్చేటువంటి హింస ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు.
లారెన్స్ రోమాపూరి ఆర్చి డికను, రోమా పూరి తిరుసభ సంపదమొత్తం లారెన్స్ ఆదీనంలో ఉన్నది. లారెన్స్ ఆ సంపదను పేదలకు పంచుతూ ఉండేవాడు. అప్పుడు ఆ సంపదను అక్కడి అధికారులు కావాలని అడిగినప్పుడు లారెన్సు వారిని మూడు రోజులు సమయం అడిగి, ఆ సమయంలో ఆ సంపదను మొత్తాన్ని పేదలకు పంచి ఇచ్చాడు. తరువాత రోములో ఉన్న పేదలను మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇదే తిరుసభ సంపద అని వారి ముందు ఉంచాడు. లారెన్స్ గారికి తనకు ఏమి జరుగుతున్నదో ఖచ్చితముగా తెలుసు. అయినప్పటికి అతనికి ఎదురయ్యే సమస్యలను హింసను పట్టించుకోకుండా, యేసు ప్రభువు నిజమైన అనుచరునిగా ఉండటానికి సిద్ధపడ్డాడు.
ఆది మొత్తం పరిశీలిస్తున్న అధికారి లారెన్స్ గారిని బంధించాడు. ఆయన్ను ఒక మాంసపు ముక్కను నిప్పుల మీద కాల్చినట్లు ఒక ప్రక్క కాల్చగా, నేను ఈ ప్రక్కన కాలిపోయాను, ఇప్పుడు అవతలి ప్రక్కన కాల్చమని అడిగాడు. వారు అటులనే వేరొక ప్రక్కన కాల్చడం జరిగినది. ఎంతటి బాధనైనా తట్టుకోవటానికి పునీత లారెన్స్ గారు సిద్ధపడ్డాడు. తాను పొందే హింస తక్కువ అన్నట్లు హింసించే వారిని ఇంకా ఎక్కువగా హింసించేలా ప్రేరేపించాడు. వారితో పరిహాసం ఆడాడు. అయన దృష్టిలో యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం అనేది ఆయన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. వారు పెట్టె హింసలు చాలా కఠినమైనవి ఐన ప్రభువు సాక్షిగా నిలబడటానికి ఆనందంగా వాటిని భరించాడు అవి ఆయనకు అల్పమైనవిగా కనపడినవి. ప్రభవు మీద అతని ప్రేమ అంత గొప్పది. యేసు ప్రభువు అనుచరునిగా జీవించాడు. అందుకే పునీత లారెన్స్ గారు హాస్య కళాకారులకు పాలక పునీతునిగా ప్రసిద్ధి.
ఈనాటి సువిశేషంలో ప్రభువు తన అనుచరుల లక్షణాల గురించి చెబుతున్నాడు. గోధుమగింజ భూమిలో పడి నశించనంతవరకు అది ఫలించదు. అంటే నేను నా బాహ్య పొరను వదిలించుకొని రావాలి అప్పుడు మాత్రమే నేను పూర్తిగా ఫలించడానికి సిద్దము అవుతాను. ఏమిటి ఈ బాహ్యపొర ఎలా దానిని నేను కోల్పోవాలి? ప్రభువే నాకు అది నేర్పుతున్నారు. ఎలా నన్ను నేను రిక్తుని చేసుకోవాలో చెబుతున్నాడు. నెను ఈ లోక జీవితం నాకోసము కాదు, ఈ లోకంలో నేను కేవలం నాకోసమే జీవించినట్లయితే నా జీవితం ఫలించదు. ఈ జీవితంలో నన్ను నేను ఇతరుల కోసం ఇవ్వాలి. యేసు ప్రభువు వలె జీవించాలి. ఆయన తన ప్రాణమును, తన సమయాన్ని, తన శక్తిని, తన యుక్తిని, తన జీవితాన్ని మన కోసం హెచ్చించాడు. తన ప్రాణమును కూడా కోల్పోయాడు కాని తండ్రి ఆయనకు తన ప్రాణమును ధారపోయుటకు మరల తీసుకొనుటకు అధికారం ఇచ్చాడు.
ఈ లోకములో తన జీవితమే ముఖ్యం, తన ప్రాణమే ముఖ్యం అనుకునే వారు అందరు స్వార్ధంతో జీవించువారే, వారు దేవుని అనుగ్రహములను కోల్పోతున్నారు. యేసు ప్రభువు చెప్పినట్లు జీవిస్తే ఆయనతో పాటు మనము ఉండవచ్చు. యేసు ప్రభువుతో పాటు ఉంటే తండ్రి దేవుడే మనలను గౌరవిస్తారు. యేసు ప్రభువును అనుసరిస్తూ, నన్ను నేను కోల్పోయిన నాకు లాభమే. ఎందుకంటే పరలోకమున నేను నా ప్రాణమును పొందుతాను. మరల ప్రభువుతో కలసి ఉంటాను, ఈ మహాద్భాగ్యం ఏమిచ్చి నేను పొందగలను. కేవలము ఆ ప్రభువును అనుసరించుటం వలన మాత్రమే. అంతే కాదు అప్పుడు తండ్రి దేవుడు నన్ను గౌరవిస్తారు అని ప్రభువు చెబుతున్నారు.
ప్రార్ధన : సకల వర ప్రధాత అయిన ప్రభువా! నేను నా జీవితములో ఉహించలేనటువంటి గొప్ప అనుగ్రహాలు నాకు దయచేసి ఉన్నారు. మీరు వాగ్దానము చేసిన వాటిని పొందుటకు నాకు అర్హత లేదు ప్రభువా కాని , పునీతుల జీవితాలు చూసినప్పుడు నేను కూడా అలా జీవించాలి అనే కోరిక నాలో కూడా పుడుతుంది, వారి వలె మిమ్ములను సంపూర్ణంగా అనుసరించే అనుగ్రహం దయచేయండి. మిమ్ములను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ మీతో ఉండే అనుగ్రహం దయచేయండి. ఆమెన్
8, ఆగస్టు 2024, గురువారం
నహుము 1:15,2:2;3:1-3,6-7 మత్తయి 16:24-28
నహుము 1:15,2:2;3:1-3,6-7 మత్తయి 16:24-28 (9 ఆగస్టు 2024)
"నన్ను అనుసరింపగోరువాడు తననుతాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడు కొనచూచు వాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు, దానిని దక్కించు కొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతియొక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంతవరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను" అని యేసు పలికెను.
క్రిస్తునాధుని యందు ప్రియ స్నేహితులారా ఈనాడు కార్మెల్ సభకు ఎంతో పర్వదినం. కార్మెల్ సభ సభ్యులు ఎంతో సంతోషంగా పునీత ఎడిత్ స్టెయిన్ గారి పండుగను జరుపుకుంటారు.
ఆమె జీవితం: పునీత ఎడిత్ స్టెయిన్ గారు అక్టోబర్ 12 వ తేదీన 1891వ సంవత్సరంలో జన్మించారు. చిన్న వయస్సు నుండి ఎంతో జ్ఞానము కలిగిన వ్యక్తి. ఆమె హెడ్మాన్డ్ హస్రెల్ అనే గొప్ప తత్వవేత్త శిష్యురాలు. ఆమె కూడా త్తత్వవేత్తగా ప్రసిద్ధి చెందినవారు. 1904వ సంవత్సరంలో తనను తాను నాస్తికురాలిగా ప్రకటించుకుంది. కాని కాలక్రమేణా ఆమె గొప్ప జ్ఞానము కలిగిన విద్యార్థిగా , మరియు కళాశాల ఆచార్యరాలుగా గొప్ప మేధాసంపద కలిగిన వ్యక్తిగా మారింది. ఆమె 1921లో అవిలాపుర తెరాసమ్మ గారి జీవిత కథను, ఆత్మకథ పుస్తకం చూసి రాత్రికి రాత్రే ఆ పుస్తకాన్ని చదివి, ఆమె సత్యాన్ని కనుగొన్నది. ఆమె సత్యం కోసం అన్వేషిస్తుంది. తెరెసామ్మ గారి ఆత్మకథ ద్వారా క్రీస్తు ప్రభువు సత్యం అని కనుకొన్నది. ఆమె కార్మెల్ సభకు ఎంతో ఆకర్షితురాలైంది. 1982లో యూదా మతం నుండి కాథోలికురాలిగా మారింది. తదనంతరం ఆమె 1933లో కొలోన్లోని కార్మెల్ మఠంలో చేరింది. కార్మెల్ మఠంలో సిలువ తెరెసా బెనెడిక్తగా పేరును స్వీకరించింది. ఈ పేరుకు అర్ధం తెరెసా సిలువ ద్వారా ఆకర్షించబడింది అని అర్ధం. ఎడిత్ స్టెయిన్ గారు తన గొప్ప రచనల ద్వారా ఎన్నోసత్యాలను ప్రజలకు తెలియజేసినటువంటి వ్యక్తి. క్రీస్తు ప్రభువుని కోసం, క్రీస్తు ప్రభునిపై తనకు ఉన్న ప్రేమకోసం తన విశ్వాసాన్ని వదలక ఎన్నో కష్టాలను బాధలను ఏంతో సంతోషంతో ఎదుర్కొవడానికి, క్రీస్తు కొరకు తన ప్రాణాలను త్యాగం చేసి, సత్యం కొరకు సాక్షిగా నిలబడింది,ఈ గొప్ప పునీతురాలు. ఆమె ఆగస్టు 9, 1942 వ సంవత్సరంలో వేదసాక్క్షి మరణం పొందింది.
ఈనాటి మొదటి పఠనంలో యూదా ప్రజలకు శుభ వర్తమానమును ఈ విధంగా వినిపిస్తున్నాడు. దుష్టులు మీపై మరల దాడి చేయరు. వారు ఆడపొడ కానరాకుండా పోవుదురు. అదేవిధంగా మీకు మునుపు ఉన్న వైభవమును తిరిగి నెలకొల్పుదును. మరి మనము శుభ వర్తమానము వినగలుగుతున్నామా, దేవుడు మనలను రక్షిస్తున్నాడు. మనకు వైభవమును ఇస్తున్నాడు. దానిని మనము నిలుపుకోగలుగుతున్నామా? ఆలోచించండి. మనము దేవునికి దూరంగా వెళ్లిన , ఆయనను బాధపెట్టిన, ఆయన మాత్రం మనలను వదలి పెట్టరు. అదేవిధంగా విశ్వాస పాత్రంగా మనము కూడా జీవించాలి.
ఈనాడు సువిశేషం "పునీత ఎడిత్ స్టెయిన్ గారి జీవితంలో అక్షరాల నెరవేరింది. అదేమిటంటే క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు "నన్నుఅనుసరించగోరువాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను." పునీత ఎడిత్ స్టెయిన్ గారు క్రీస్తును తెలుసుకొని తనను తాను పరిత్యజించుకొన్నది. తన జీవితంలో వచ్చే శ్రమలను బాధలను కష్టాలను ఇబ్బందులను మోస్తూ సిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభువును అనుసరించింది. క్రీస్తు ప్రభువుని అడుగుజాడలలో నడిచి ఆయన సాక్షిగా మారింది. క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా నా నిమిత్తము ఎవరైతే తమ ప్రాణాలను ధారా పోస్తారో వారు తమ ప్రాణాలను దక్కించుకొందురు అని అన్న మాటను నెరవేర్చింది. ఈలోకం మొత్తం పంపాదించి తమను కోల్పోతే లాభము ఏమిటి అనే సత్యాన్ని తెలుసుకొని తనను తాను దేవునికిసమర్పించుకుంది. వారి వారి పనులను బట్టి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడని మనము విన్నాం. ఆమె చేసిన గొప్ప పని ఏమిటంటే తాను సత్యాన్ని తెలుసుకొని సత్యస్వరూపుడైన క్రీస్తుని అనుసరించింది. అంతేకాక క్రీస్తుని కొరకు తన ప్రాణమును దారపోసింది. ప్రభువు చెప్పినట్లుగా ఆమె క్రియలను బట్టి ఆమె విశ్వాసాన్నిబట్టి ఆమె తిరుసభలో ఒక గొప్ప పునీతురాలుగా మారింది. మరి మనము నిజంగా దేవుణ్ణి అనుసరిస్తున్నామా!మనల్ని మనము పరిత్యజించు కొంటున్నామా? మన సిలువలు అనే బాధలు కష్టాలను ఎత్తుకొని క్రీస్తుని వెంబడిస్తున్నామా, ఈ కాలంలో చాలా మంది క్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నారు. కాని తమను తాము ప్రరిత్యాజించుకోలేక పోతున్నారు. కేవలం నామ మాత్రంగా అనుసరిస్తున్నారు. ఆలోచించండి, మనము ఎలా ఉన్నాం? లోక సంపదలతో మన ఆత్మను కోల్పోతున్నాము. కాబట్టి ప్రియాబిడ్డలారా పునీత ఎడిత్ స్టెయిన్ గారి వలె జీవిస్తూ ఆమె వలె గొప్ప కార్యాలు చేస్తూ క్రీస్తు ప్రభుని నిజమైన అనుచరులుగా జీవించుదాం.
ప్రార్ధన : ఓ ప్రభువా మీరు మాకు ఎన్నోసార్లు నీతి మార్గంలో నడవమని పిలుపు ఇస్తున్నారు. కొన్ని సార్లు మమ్ము మేము పరిత్యజించుకోలేక పోతున్నాం. మా సిలువను మోయలేక పోతున్నాం. మా సిలువలు అనే బాధలతో నిన్ను అనుసరించలేక పోతున్నాం. కాని తండ్రి! భయంతో , దురాలోచనలతో లోక సంపదలతో పడి మా ఆత్మలు కోల్పోతున్నాము. ప్రభువా మంచి క్రియలద్వారా విశ్వాసంతో మిమ్ము అనుసరించి మీ రాజ్యంలో చేరే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
7, ఆగస్టు 2024, బుధవారం
యిర్మీయా 31:31-34 మత్తయి 16:13-23
యిర్మీయా 31:31-34 మత్తయి 16:13-23 (8 ఆగస్టు 2024)
తరువాత యేసు ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చెను. "ప్రజలు మనుష్యకుమారుడు ఎవ్వరని భావించుచున్నారు?" అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు "కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు" అనిరి. "మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు?" అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిచ్చెను. "యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోకరాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోకమందును బంధింపబడును; భూలోకమందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోకమందును విప్పబడును." ఇట్లు చెప్పి, తాను క్రీస్తునని ఎవ్వరితోను చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటినుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలవలన , ప్రధానార్చకులవలన , ధర్మ శాస్త్ర బోధకులవలన పెక్కుబాధలను అనుభవించి, మరణించి మూడవదినమున పునరుత్తానుడగుట అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, "ప్రభూ ! దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక! ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక !" అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో "ఓ సైతాను! నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగానున్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధిచినవే, కాని దేవునికి సంబంధిచినవికావు" అనెను.
క్రిస్తునాధుని ప్రియ మిత్రులారా, ఈనాటి మొదటి పఠనంలో దేవుడు తన ప్రజలతో ఒక నూతన నిబంధము చేసుకొనడానికి సిద్ధంగా ఉన్నాడని అదే విధంగా ఆ నిబంధన తాను మన పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తునుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు చేసుకొనిన నిబంధన వంటిది కాదు అని తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే 'నేను మీ దేవుడనైన ప్రభువును-మీరు నా ప్రజలు' నేను మీ కాపరిని మీరు నా మంద అని ప్రభువు మన పితరులతో నిబంధన చేసుకున్నాడు. మరి ఎందుకు దేవుడు మరల ఒక నూతన నిబంధనము మనతో చేసుకోవాలి అనుకుంటున్నాడు అంటే, మన పితరులు, పూర్వికులు ప్రభువును ఆయన చేసిన గొప్ప అద్భుతకార్యాలను తమ కన్నులార చూచి అనుభవించి కూడా ప్రభుని యొక్క నిబంధనను మీరారు. అన్యదైవములను కొలిచి తమ జీవితాలలో అనేక తప్పులు చేసుకుంటూ దేవుణ్ణి విడనాడి పాపము చేస్తూ పాప మార్గములలో ప్రయాణించారు. దేవుని యొక్క ఆజ్ఞలను ధర్మశాస్త్రమును విడనాడారు. తమ నాశనమును తామే కొనితెచ్చుకున్నారు.
మరి నూతన నిబంధన ఏమిటి అంటే మనము కూడా మన పూర్వికులలాగా, మన పితరుల వలె దేవుణ్ణి దైవ శాస్త్రాన్ని ఆయన చేసిన నిబంధనను మర్చిపోయి జీవిస్తున్నామా? దేవుడు చెప్పినట్లుగా దైవ ప్రజలలాగా మంచి పనులు చేయలేకపోతున్నాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వలేక పోతున్నాం. అందుకే దేవుడు మనందరితో నూతన నిబంధన చేస్తున్నాడు. అది ఏమిటంటే "నేను నా ధర్మ శాస్త్రాన్ని వారి అంతరంగమున ఉంచుదును. వారి హృదయాలపై లిఖింతును. అల్పులు అధికులెల్లరు నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములను మన్నింతును దానినిక జ్ఞప్తియందు ఉంచుకొనను అని దేవుడు అంటున్నాడు. మరి మనము దేవుని ధర్మ శాస్త్రాన్ని మన హృదయాలలో పదిల పరుచుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ, దైవ ప్రజలుగా జీవించాలి. జీవించడానికి ప్రయత్నించాలి.
ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఈ విధంగా అడుగుతున్నారు. నేను ఎవరినని మీరు భావించుచున్నారు? అప్పుడు పేతురు యేసు ప్రభువుతో " నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిస్తున్నాడు. ఈ విషయమును పేతురుకు బయలు పరిచినది, పరలోకమందున్న తండ్రి దేవుడు. ప్రియ మిత్రులారా అదే ప్రశ్న దేవుడు ఈనాడు మనలను అడుగుతున్నాడు. మన సమాధానము ఏమిటి ? యేసు క్రీస్తుని గురించి నీ అనుభవం ఏమిటి? మనం క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నాము ? చాలా మంది పునీతులు క్రీస్తును, ఆయన కార్యములను చూసి కొంతమంది నా తండ్రి అని, కొందరు నా రక్షకుడు అని , కొందరు నా కాపరి అని ఎన్నో భావాలు చెబుతుంటారు. క్రీస్తుని యెడల నీ భావం ఏమిటి? నీ అనుభవం ఏమిటి? నీ ఉద్దేశ్యం ఏమిటి? నేను నేను నిజంగా క్రీస్తుని అనుభవిస్తున్నానా ? లేదా? ఆత్మా పరిశీలన చేసుకుందాం. దేవున్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం.
ప్రార్ధన : ప్రభువైన దేవా! మేము మిమ్ము మా ప్రభుడవని గుర్తించుకొని మీ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ-మీతో మేము చేసుకొనిన నిబంధమును ఎల్లవేళలా గుర్తించుకొని మీ ప్రజలలాగా జీవించడానికి, మిమ్ము తెలుసుకోవడానికి అదేవిధంగా మీ ధర్మ శాస్త్రాన్ని మా హృదయాలలో పదిల పరుచుకోవడానికి మాకు మీ కృప వరములను దయచేయండి. తద్వారా మేము మిమ్ము తెలుసుకొని, ప్రేమించి సేవించుదుము. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
6, ఆగస్టు 2024, మంగళవారం
యిర్మీయా 31:1-7 మత్తయి 15:21-18
యిర్మీయా 31:1-7 మత్తయి 15:21-18 (7ఆగస్టు 2024)
యేసు అటనుండి తూరు , సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్లెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతె ఆయన వద్దకు వచ్చి, "ప్రభూ! దావీదుకుమారా! నాపై దయచూపుము. నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపచుచున్నది" అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్కమాటైనను మాట్లాడలేదు. అపుడు ఆయన శిష్యులు సమీపించి "ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు" అనిరి. "నేను యిస్రాయేలు వంశమున చెదిరిపోయిన గొఱ్ఱెలకొరకు మాత్రమే పంపబడితిని" అని ఆయన సమాధానము ఇచ్చెను. అపుడు ఆమె వచ్చి, ఆయన పాదములపై పడి "ప్రభూ! నాకు సాయపడుము"అని ప్రార్ధించెను. "బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు" అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభూ! కాని తమ యజమానుని భోజనపుబల్ల నుని క్రింద పడిన రొట్టెముక్కలను కుక్క పిల్లలును తినునుగదా!" అని బదులు పలికెను. యేసు ఇది విని "అమ్మా!నీ విశ్వాసము మెచ్చదగినది. ఈ కోరిక నెరవేరునుగాక!" అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను.
ప్రియమైన దైవ ప్రజలారా ఈనాటి పఠనాలలో ప్రభువైన దేవుడు నేను మీ అందరికి దేవుడును, నేను మిమ్ము కరుణింతును. నేను మీకు దర్శనమిచ్చితిని. నేను మిమ్ము శాశ్వతమైన, నిత్యప్రేమతో ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. మిత్రులారా దేవుడు చెప్పే ఈ మాటలకు మనము ఏమి చేయాలి అంటే మనము మన దేవుడైన ప్రభుని చెంతకు రావాలి. ప్రభువు చెంతకు వచ్చి ఏమి చెయ్యాలి? అంటే దేవుని గొప్ప కార్యములను ఆయన చేసిన మేలులను గుర్తించి మనలను రక్షించినందుకు ధన్యవాదములు చెల్లించి, స్తుతిగానము చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియవిశ్వాసులారా నీవు నేను మన దేవుణ్ణి మన దేవునిగా అంగీకరిస్తున్నామా? లేదా లోకంలోని వ్యక్తులను , పదవులను డబ్బును సంపదను లేదా మన కోరికలను అనుసరించి దేవుని మర్చి పోతున్నామా? అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ప్రార్ధిస్తామో ప్రభువు కరుణామయుడు కనుక మనలను ఖచ్చితముగా కరుణిస్తాడు. మనము పవిత్ర గ్రంధంలో చూస్తే, మమ్ము కరుణించు అడిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కరుణించాడు. ఆయన కరుణకు హద్దులు లేవు. ఓక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లుగా దేవుడు మనలను తన శాశ్వతమైన నిత్యా ప్రేమతో ఎల్లప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. మరి మనము దేవుని శాశ్వత ప్రేమను అర్ధం చేసుకుంటున్నామా! దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నామా? లేదా ఈ లోక సంపదలను ఈ లోక వస్తువులను, ఈ లోక పదవులను ఈ లోక ఆకర్షణలు ప్రేమిస్తున్నామా ఆలోచించండి.
ఈనాడు సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువును ఒక తల్లి తన బిడ్డను రక్షించండి అని వచ్చినప్పుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షించారు. తల్లి తన బిడ్డకై పడిన వేదనను కష్టాన్ని విశ్వాసాన్ని చూసి అద్భుత కార్యం చేసున్నాడు. కననీయ స్త్రీలో ఉన్నా విశ్వాసం మనము కూడా కలిగి ఉండాలి. ఆమె వలే మనము దేవుణ్ణి పిలవాలి. ఆమె దావీదు కుమారా యేసయ్య నన్ను కరుణింపుము అని ప్రార్ధించింది. మరి మనము ఆ తల్లి వలె మన మన తల్లి దండ్రుల కోసం, బిడ్డల కోసం మన కుటుంబం కోసం మన సంఘం కోసం ప్రార్ధన చేస్తున్నామా లేదా? కొన్ని సార్లు దేవుడు కుడా మన వేడుకోలు పట్టించుకోవడం లేదు అని చాలా మంది ప్రార్ధన చేయడం, దేవాలయానికి వెళ్లడం మానివేస్తారు, ఈనాటి సువిశేషం ద్వారా మానమ్ గ్రహించవలసినది ఏమిటంటే మనం విశ్వాసం కోల్పోకుండా నమ్మకంతో, దేవా మమ్ము కరుణించును అని మనం ప్రార్ధన చేస్తే దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యలు మన జీవితంలో తప్పకుండ చేస్తాడు. మరి మనము ఏమి చేయాలంటే దేవుడ్ని చెంతకు రావాలి, ప్రార్ధించాలి. అలాగే ఆయన చేసిన మేలులకు స్తుతిగానం చెయ్యాలి.
ప్రార్ధన: ప్రేమమయుడవైన దేవా నీ ప్రేమ శాశ్వతమైనది. నీ కరుణ ఎల్లలు లేనిది. మేము నీ శాశ్వతమైన ప్రేమను తెలుసుకూన్ నీ ప్రేమను అనుభవించి నీ కరుణను పొంది నీ ప్రేమలో జీఇవస్తు నీ దయను పొందుతు, నిన్ను స్తుతిస్తూ ఆరాధించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ .
ఫా . సురేష్ కొలకలూరి OCD
3, ఆగస్టు 2024, శనివారం
18 వ ఆదివారం
18 వ ఆదివారం
నిర్గమ ఖాండం 16:2-4,12-15 ఎఫెసి 4:17,20-24 యోహాను 6: 24-35
అక్కడ యేసుగాని , శిష్యులు గాని లేకుండుటచూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫ ర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు" అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది" అని చెప్పెను. అంతట "నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టిగురుతు నిచ్చెదవు? ఏ క్రియలు చేసెదవు?" అని వారు మరల ప్రశ్నించిరి. "వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను. అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను" అని వారు ఆయనతో చెప్పిరి. "పరలోకమునుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషేకాదు. కాని, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని యేసు వారితో అనెను. "అయ్యా ! ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము" అని వారు అడిగిరి. అందుకు యేసు "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు"
ఈనాడు దేవుడు మనకు ఇచ్చే సందేశం.
మొదటి పఠనం : దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరీక్షిస్తున్నాడు.
రెండవ పఠనంలో మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొని క్రీస్తునందు నూతన జీవితాన్ని ప్రారంభించండి.
సువిశేష పఠనం: దేవుడు తనను వెదుకుతూ వచ్చిన ప్రజలకు అశాశ్వతమైన భోజనముకై శ్రమింపుడు అంటు నేనే జీవము గల ఆహారాన్ని అని తెలియజేశాడు.
ప్రియా విశ్వాసులారా మొదటి పఠనములో ఇశ్రాయేలు ప్రజలు మోషే మరియు అహరోనులు మీద నేరము మోపుతున్నారు. ఎందుకు అంటే వారు మోషేతో మేము ఐగుప్తులో చచ్చిన బాగుండేది. అక్కడ మేము మాంసమును , రొట్టెను కడుపారా భుజించితిమి. ఇప్పుడు మేమందరం ఈ ఎడారిలో ఆకలితో మలమల మాడి చంపబడడానికి మీరిద్దరు మమ్ము ఇక్కడకు తీసుకొని వచ్చారా అని దూషించారు. యిస్రాయేలు ప్రజలు, శరీరానికి దాని అవసరాలకు లొంగిపోయి, వారు పొందిన స్వతంత్రాన్ని, బానిసత్వము నుండి రక్షణను, విడుదలను మర్చిపోయిదైవసేవకులను దూషించారు. కాని దేవుడైన యావే నిర్గమ 16:4లో వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై వారిని ఈ విధంగా పరీక్షింతును అని అంటున్నాడు. ప్రభువు ప్రేమతో వారికి ఆకాశము నుండి మన్నాను మరియు వారు కడుపునిండా భుజించడానికి పూరేడు పిట్టలను దయచేసి, యావేనైన నేను మీ దేవుడనని తెలియజేశాడు.
దేవునికి అంత తెలుసు. మనకు ఏమికావలెనో,ఎప్పుడు కావలెనో ఏమి ఇవ్వాలో తెలుసు. కాబట్టి దేవుడు మనలను పరీక్షిస్తున్నాడని మనకు అనిపిస్తే మనము దేవుని ధర్మములను అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తే చాలు. అంత దేవుడే ఇస్తాడు. కాబట్టి పరీక్షింపబడినప్పుడు గొణుకుతూ, సణుగుతూ , ఎదురు తిరుగుతూ నేరం మోపుతూ కాకుండా దేవుని చిత్తానుసారం, ఆజ్ఞానుసారం నడుచుకుందాం.
సువిశేషంలో ప్రజలు క్రీస్తు ప్రభువును వెదుకుతూ వచ్చినప్పుడు, ప్రజలు ఎందుకు వచ్చారో వారి మనస్సులోని ఆలోచనలను తెలుసుకోని, మీరు రొట్టెను తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు. కాని నా సూచక క్రియలను చూసి కాదు అని ప్రజలకు చెప్పియున్నాడు. దీని ద్వారా మనము ఏమి తెలుసుకోవాలంటే, దేవునికి మనము ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, మన మనస్సులోని ఆలోచనలు, ఆశలు ఏంటో తెలుసు. దేవుడు మన ఉద్దేశాలు ఎలాంటివి, మంచివా? కాదా? అని ఖచ్చితంగా చెప్పగలడు.
ఈనాడు ఎంతో మంది ప్రజలు తమ స్వలాభాల కోసం, స్వష్టతల కోసం దేవుని వెదుకుచు వస్తున్నారు, కాని నిజంగా దేవుణ్ణి నమ్మి రావడంలేదు. దేవునికి తెలుసు . దేవుని దగ్గర నుండి అది కావాలి, ఇది కావాలి అని అడుగుతున్నారు. దేవా! నాకు నీవు కావాలి అని ఎంత మంది అడుగుతున్నారు? వరాలు కావాలి, దీవెనలు కావాలి అని దేవుని దగ్గరకు వెళ్లేవారు చాలా మంది ఉన్నారు. కాని ఆ వారలను దీవెనలను ఇచ్చే వార ప్రధాతను నాకు నీవు కావాలి అని ఎంత మంది అడుగుతున్నాం.
క్రీస్తు ప్రభువు అంటున్నాడు, అశాశ్వతమైం దానికై శ్రమింపవలదు. మిత్రులారారా ! ఈనాటి సమాజంలో ఎంతో మంది అశాశ్వతమైన ఈలోక వస్తువులు, ఈలోక, వ్యామోహం ఈలోక సంపదల కోసం శ్రమిస్తున్నారు. ఈ లోకం శాశ్వతంకాదు. మనము ఎల్లకాలం ఈలోకంలో ఉండము. ఈ అశాశ్వ తమైన వాటి కొరకు మనం పడే శ్రమ వృధా! కాని క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు అని అంటున్నాడు. మనము ఏ రకమైన పనులు చేయాలి ఈ నిత్య జీవమును పొందాలంటే యోహాను 6: 35 వచనములో చెబుతున్నాడు. "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎప్పటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. దీని అర్ధం ఏమిటంటే మనము దేవుని యొద్దకు రావాలి, దేవుని విశ్వసించాలి. అపుడు మనకు జీవం లభిస్తుంది.
రెండవ పఠనంలో: మనము వింటున్నాం మన పాత స్వభావమును విడిచి, మీ మనస్తత్వమును నుత్నికరించుకొనుడు. అన్యుల వలె ఆలోచనలు గలవారిగా మీరు ప్రవర్తించకండి. మీరు సత్యమైన నీతిని మరియు పరిశుద్దతను కలిగి క్రొత్త స్వభావమును ధరింపుము. దేవుని పోలికలా జీవించండి అని పౌలుగారు తెలుయజేస్తున్నారు. మొదటి పఠనములో యిస్రాయేలు ప్రజలు తమ పాత స్వభావమును మార్చుకోవాలి. వారు దేవుని విధులను పాటించాలని సువిశేషంలో జనులు శాశ్వతమైన వాటికొరకు శ్రమించాలని చెబుతూ మనము నీతితో పరిశుద్ధతతో క్రొత్త స్వభావమును ధరించాలని దేవుడు తెలియజేస్తున్నాడు.
ప్రార్ధన: పరిశుద్దుడైన తండ్రి మా జీవితాలు పరీక్షలకు గురైనప్పుడు మాకు ఓర్పును, శనమును దయచేయండి. మీ గొప్ప కార్యాలు మాయందు జరిగింపుము/ మేము మీ యొద్దకు వచ్చుటకు, మిమ్ము విశ్వసించుటకు జీవం పొందుటకు కావలసిన నీతిని పరిశుద్దతను మాకు దయచేయండి, మా పాట పాపపు స్వభావమును మార్చుకొని నీ పోలిక క్రొత్త స్వభావమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.
ఫా. సురేష్ కొలకలూరి OCD
18వ సామాన్య ఆదివారం
2, ఆగస్టు 2024, శుక్రవారం
యిర్మీయా 26:11-16,24 మత్తయి 14:1-12
యిర్మీయా 26:11-16,24 మత్తయి 14:1-12 (3 ఆగస్టు 2024)
ఆ కాలమున గలిలీయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, "ఇతడు స్నాపకుడగు యోహానే. అతడే మృతులనుండి లేచియున్నాడు. కావున, అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి" అని తన కోలువుకాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలయన, "ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు" అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు ఒసగెదను అని అతడు ప్రమాణ పూర్వకముగా వాగ్దానము చేసెను. అపుడు ఆమె తల్లి ప్రోత్సాహమువలన "స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము" అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని, తన ప్రమాణముల కారణముగ, అతిధుల కారణముగ ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్చేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతట యోహాను శిష్యులు వచ్చి అతని భౌతికదేహమును తీసుకొనిపోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్లి ఆ విషయమును తెలియజేసిరి.
ప్రియమైన దైవ ప్రజలారా! ఈనాడు మొదటి పఠనంలో మనము యిర్మీయా ప్రవక్తను చూసి, ఆయన చెప్పిన దైవ సందేశాన్ని విని భయంతో, కోపంతో, అసూయతో, గర్వంతో యిర్మీయా ప్రవక్తను చంపివేయాలని యాజకులు ప్రవక్తలు, నాయకులను ప్రజలను రెచ్చగొట్టడం చూస్తున్నాము. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త చాలా కఠినమైన సందేశాన్ని వారికి వినిపించారు. ఆ సందేశం ఏమిటంటే వారు వారి మార్గములను, క్రియలను మార్చుకొని దేవునికి విధేయులు కాకపోతే నాశనము చేయబడుదురు. వారి దేవాలయం నాశనము చేయబడుతుంది. పదే పదే ఆయన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త వారిని, మీరు మీ మార్గాలను, మీ పాపపు పనులను మీ గర్వాన్ని వదలిపెట్టి మారు మనసు పొంది దేవునికి విధేయతతో జీవిస్తే మిమ్మి అయన రక్షిస్తాడు, మీ శిక్షను తొలగిస్తాడు అని బోధిస్తున్నాడు. ఈ సంగతులెల్ల మీకు తెలియజేయుటకు ప్రభువు నన్ను పంపాడు అని చెబుతున్నాడు. ఇది విని నాయకులు, ప్రజలు తమ యొక్క నాయకులు ప్రవక్తలతో యిర్మీయాకు మరణ శిక్ష విధించుట తగదు. ఎందుకు అనగా అతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడేను అంటున్నారు.
సువిశేష పఠనంలో మనము స్నాపకుడగు యోహాను గారి శిరచ్చేదనము గురించి వింటున్నాం. యోహాను గారు దైవ సందేశాన్ని భయపడకుండా ధైర్యంతో భోదించినందుకు తన ప్రాణమును కోల్పోయాడు. హేరోదురాజు యేసు ప్రభువుని పేరు ప్రఖ్యాతులను విని ఖచ్చితముగా యోహానే మృతలనుండి లేచి, ఇన్ని అద్భుతశక్తులు కలిగిఉన్నాడు అని తన సేవకులతో చెబుతున్నాడు. యోహాను గారు రాజైన హేరోదుతో నీ సోదరుడగు ఫిలిప్పు భార్యను నీవు ఉంచుకొనుట ధర్మముకాదు అని అధర్మాన్ని ఖండించి, హెచ్చరించాడు. అందువలన హేరోదు యోహానును చంపుటకు నిర్ణయం తీసుకున్నాడు, కాని భయ పడ్డాడు ఎందుకంటే యోహాను నిజమైన దేవుని ప్రవక్త అని హేరోదు అర్ధం చేసుకున్నాడు. యోహానును చరసాలలో బంధించారు. హేరోదియ కూడా యోహాను పట్ల కోపం, ఈర్ష్య ద్వేషంతో యోహానును చంపాలని చూసింది. ఆమె కూతరు హేరోదు రాజును నాట్యంద్వారా మెప్పించి,సంతోష పెట్టినందుకు నీము ఏమి కావాలో కోరుకో అని ప్రమాణం చెయ్యగా తన తల్లి మాట మీదగా స్నాపకుడగు యోహాను తనను ఒక పళ్లెంలో ఇవ్వమని అడిగింది.
హేరోదు తన ప్రమాణము కారణంగా, అతిధుల ముందు మాటను ఇచ్చి ఉండటంవలన ఆమె కోర్కెను తీర్చాడు. దేవుని సత్య సువార్తను ధైర్యంగా బోధించి సత్యంకోసం తన రక్తాన్ని కార్చిన స్నాపకుడగు యోహాను వారి వలె, మనము అధర్మాన్ని ఎదిరించి తప్పును తప్పు అని చెప్పగలమా! ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం భయంతో ఉంటె సత్యానికి, సత్య సువార్తకు సాక్షులుగా ఉండలేం. కనుక యిర్మీయా ప్రవక్త వలె స్నాపకుడగు యోహాను వలె మనము కూడా దేవుని వాక్కుని విని, పాటించి ధైర్యంగా ఏ భయం , ఆందోళన లేకుండా నిజమైన సత్య సువార్తను బోధించుదాం. సత్యానికి సాక్షులుగా నిలబడదాం. సత్యం ధర్మం కొరకు మన ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఉందాం. దేవుడు తన సత్య సువార్తను మన హృదయాలలో నింపి మనలను నడిపించులాగున ప్రార్ధించుదాం.
ప్రార్ధన: సత్య స్వరూపుడైన తండ్రి, మమ్ము మీ సత్య వాక్కుతో నింపుము.మేము అన్ని వేళలలో సత్యానికి సాక్షులుగా జీవిస్తూ సత్య సువార్త బోధిస్తూ, ప్రజలను మీ సత్యపు వెలుగు లోనికి నడిపించడానికి మాకు శక్తిని, బలమును, ధైర్యమును దయచేయుము. తద్వారా ఎన్నో ఆత్మలను రక్షించుటలో మా వంతు బాధ్యతను నెరవేర్చుటకు మీ అనుగ్రహం దయ చేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
యిర్మీయా 26:1-9 మత్తయి 13: 54-58
31, జులై 2024, బుధవారం
మత్తయి 13: 47-53
మత్తయి 13: 47-53 (1.ఆగస్టు 2024)
"ఇంకను పరలోకరాజ్యము సముద్రములో వేయబడి, అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినపుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి, పనికి రాని వానిని పారవేయుదురు. అటులనే అంత్యకాలమందును జరుగును; దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతులనుండి వేరుపరచి అగ్ని గుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు, పండ్లు కోరుకుకొందురు." వీనినన్నింటిని మీరు గ్రహించితిరా?" అని యేసు అడిగెను. "అవును" అని వారు సమాధానమిచ్చిరి. అయన "పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన, పురాతనవస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు" అనెను.
ఈరోజు దేవుని వాక్యం మొదటి పఠనమును మనము చూస్తే, దేవుడు యిర్మీయా ప్రవక్తను ఓక కుమ్మరి వాని ఇంటికి తన యొక్క సందేశాన్ని వినిపించమని పంపిస్తున్నాడు, అయితే ఆ ప్రవక్త వెళ్లి ఆ కుమ్మని సారెమీద పని చెయ్యడం చూసాడు. దేవుడు ఎన్నో సార్లు తన ప్రవక్తలను, శిష్యులను కూడా మన దగ్గరకు పంపిస్తునాడు. మన గ్రామాలకు, కుటుంబాలకు, సంఘాలకు పంపించుచున్నాడు. ఎందుకు అనగా మనయొక్క జీవిత విధానాలను చూచి, మన వ్యాధి బాధలను చూచి మనలకు సువార్తను అంటే, దేవుని సందేశాన్ని అందించమని తన ప్రవక్తలను పంపుచున్నాడు.
ఆనాడు యిర్మీయా ప్రవక్త కుమ్మరివాని ఇంటి దగ్గర కుమ్మరి చేసే పనిని చూచి ఉన్నాడు. మనము ఈనాడు ఏ పనులు చేస్తున్నాము. దానిని బట్టి దేవుడు తన సందెశాన్ని మనకు అందిస్తాడు. కుమ్మరి, సరిగా తయారుకాని కుండను ఏ విధంగానైతే వేరొక పాత్రగా చేసాడో అదే విధంగా దేవుడు కూడా మన జీవిత విధానం బట్టి, మన జీవితాన్ని రూపుదిద్దుతాడు. పాడైపోయిన కుండా మరల ఏ విధంగా అందమైన పాత్రగా మార్చుబడుతుందో, దేవుడు పాడైపోయినా మన జీవితాలను కూడా అందమైన పాత్రగా మార్చగలడు. మన జీవితం ఏ విధంగా ఉన్న, మన బలహీనతలు ఏమైనా దేవుడు వాటిని తొలగించి మనలను మరల సుందరంగా అందంగా మార్చుతాడు, మార్చగలడు. ఓ! యిస్రాయేలు ప్రజలారా మీరు ఎలాంటి వారంటే కుమ్మరి చేతిలో మట్టివలె మీరును నా చేతిలో ఇమిడిపోయేదరు అంటున్నారు. కాబట్టి మనము అర్ధం చేసుకోవలసినది మనము దేవుని చేతిలో మట్టి వంటి వారము, మన జివితాలు దేవుని చేతిలో ఉంచితే మన జీవితాలను, కుటుంబాలను సంఘాలను దేవుడు ఎంతో అందంగా మార్చివేస్తారు.
మన జీవితాలు ఎవరి చేతులో ఉన్నాయి? మనము ఏ విధంగా ఉన్నాము? ఆలోచించాలి. ప్రస్తుత కాలంలో మనము మన జీవితాలను వేరే వారి చేతులలో పెడుతున్నాము. మన జీవితాలను నాశనము చేసుకుంటున్నాము. పదే పదే పాపములో పడిపోయి, పాపపు పనులు చేస్తున్నాము. కాబట్టి దేవుడు మనతో ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచెనో నేనును మిమ్మునట్లు మలవకూడదా? అంటున్నాడు. మరి మన సమాధానం ఏమిటి ఈ ప్రశ్నకు ? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము దేవునికి మనలను మార్చడానికి అవకాశం ఇస్తున్నామా? పునీత అగస్టిను వారు నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ అనుమతి లేకుండా నిన్ను రక్షించాడు అని అంటున్నాడు. మరి మనము దేవుని చిత్తమునకు అనుమతిస్తున్నామా?
సువిశేష పఠనంలో పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి అన్నివిధములైన చేపలను పట్టు వలను పోలియున్నది అని క్రీస్తు ప్రభువు బోధిస్తున్నారు. అపుడు మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వాటిని పారవేయుదురు. మనం ఇక్కడ గమనించవలసినది ఏమిటి అంటే దూతలు అంత్యకాలంలో మంచి చేపలు అంటే మంచి పనులు చేస్తూ, పరిశుద్ధంగా జీవించేవారు, బుట్ట అంటే పరలోకరాజ్యము. పనికిరాని చేపలు అంటే దుష్టులు చెడు పనులు చేయువారు. వీరు నరకంలో పారవేయబడి శిక్ష అనుభవిస్తారు. కాబట్టి పరలోకంలో చేరాలి అంటే మనము మన పాప క్రియలను విడిచి పశ్చాతాపంతో ప్రభువును ఆశ్రయించాలి, ప్రార్ధించాలి. అపుడు దేవుని రాజ్యంలో చేర్చబడుతాం.
ప్రార్ధన: ప్రభువైన దేవా మేము మమ్ము తగ్గించుకొని ప్రతినిత్యం మా జీవితం విధానాలను మార్చుకుంటూ మీ సందేశాన్ని, ప్రణాలికను అర్ధంచేసుకుంటూ మా జీవితాలను అందంగా, పరిశుద్ధంగా మార్చుకొని మంచి వారిగా ఉంటూ మంచి పనులను చేస్తూ పరలోక రాజ్యం పొందేబాగ్యం మాకు దయ చేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి
నిత్య జీవము ఎలా వస్తుంది
యోహాను 6: 22-29 మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...